Tuesday 16 May 2023

192 .. 198

192*_విశ్వాసమే బలం_*

*మొదట శరీరదార్డ్యాన్ని వృద్ధిపరచుకోండి. అప్పుడే మీకు మనోనిగ్రహం లభిస్తుంది.*

*శ్రద్ధ అనే ఆదర్శాన్ని మరల మనలో తీసుకురావాలి. ఆత్మవిశ్వాసం పునః జాగృతం కావాలి. అప్పుడు మాత్రమే మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ క్రమంగా మనమే పరిష్కరించుకోగలం.*

*చివరి వరకు ఎవరు పట్టుదలతో ఉంటారో వారే జయిస్తారు.*

*_విశ్వాసమే బలం_*

*అపార విశ్వాసం, అనంతశక్తి - ఇవే విజయసాధనకు మార్గాలు.*

*ఉత్తర ద్వార దర్శనం'లో ప్రత్యేకత*

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు.

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే 'హరివాసరమ'ని, 'హరిదినమ'ని, 'వైకుంఠ దినమ'ని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకాదశి వ్రతం" ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు 'ఏకాదశి' అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ఉదయం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం.

 దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును.

 ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరో జన్మంటూ ఉండదని అంటారు.

--(())--

193  *వయస్సు దాటుతున్న వేళ*

 *1. ఈ సమయం  ఇన్నాళ్ళూ  సంపాదించినదీ,  దాచుకున్నదీ  తీసి  ఖర్చు  పెట్టె  వయసు.తీసి  ఖర్చు  పెట్టి  జీవితాన్ని  ఎంజాయ్  చెయ్యండి.*  

 *దాన్ని  ఇంకా  దాచి  అలా  దాచడానికి  మీరు  పడిన  కష్టాన్ని,  కోల్పోయిన ఆనందాలనూ*  *మెచ్చుకునేవారు  ఎవరూ  ఉండరు  అనేది  గుర్తు పెట్టుకోండి* 

 *2. మీ  కొడుకులూ,  కోడళ్ళూ  మీరు  దాచిన  సొమ్ముకోసం  ఎటువంటి  ఆలోచనలు చేస్తున్నారో? ఈ  వయసులో  ఇంకా  సంపాదించి*  *సమస్యలనూ,  ఆందోళనలూ  కొని తెచ్చుకోవడం  అవుసరమా?* 

 *ప్రశాంతంగా  ఉన్నది  అనుభవిస్తూ జీవితం  గడిపితే  చాలదా?* 

 *3. మీ  పిల్లల  సంపాదనలూ,  వాళ్ళ  పిల్లల  సంపాదనల  గురించిన  చింత  మీకు  ఏల?*  *వాళ్ళ  గురించి  మీరు  ఎంత  వరకూ  చెయ్యాలో  అంతా  చేశారుగా?*  *వాళ్లకి  చదువు,  ఆహారం, నీడ మీకు  తోచిన  సహాయం  ఇచ్చారు.  ఇపుడు  వాళ్ళు  వాళ్ళ  కాళ్ళమీద  నిలబడ్డారు.ఇంకా  వాళ్ళకోసం  మీ  ఆలోచనలు  మానుకోండి. వాళ్ళ  గొడవలు  వాళ్ళను  పడనివ్వండి.* 

  *4. ఆరోగ్యవంతమైన  జీవితం  గడపండి.   అందుకోసం  అధిక  శ్రమ  పడకండి. తగిన  మోతాదులో  వ్యాయామం  చెయ్యండి. (నడక, యోగా   వంటివి  ఎంచుకోండి) తృప్తిగా  తినండి.  హాయిగా  నిద్రపోండి.*   *అనారోగ్య  పాలుకావడం  ఈ వయసులో  చాలా  సులభం,  ఆరోగ్యం  నిలబెట్టుకోవడం  కష్టం.  అందుకే  మీ  ఆరోగ్య  పరిస్థితిని  గమనించుకుంటూ  ఉండండి. మీ వైద్య  అవుసరాలూ,  ఆరోగ్య  అవుసరాలూ   చూసుకుంటూ  ఉండండి.  మీ డాక్టర్  తో  టచ్  లో  ఉండండి.  అవుసరం  అయిన  పరీక్షలు  చేయించుకుంటూ  ఉండండి.*  *(ఆరోగ్యం  బాగుంది  అని  టెస్ట్ లు  మానేయకండి)* 

 *5. మీ  భాగస్వామికోసం  ఖరీదైన  వస్తువులు  కొంటూ  ఉండండి.  మీ  సొమ్ము  మీ  భాగస్వామితో  కాక  ఇంకెవరితో  అనుభవిస్తారు?* *గుర్తుంచుకోండి ఒకరోజు  మీలో  ఎవరో  ఒకరు  రెండో  వారిని  వదిలిపెట్టవలసి  వస్తుంది.  మీ డబ్బు  అప్పుడు  మీకు  ఎటువంటి  ఆనందాన్నీ  ఇవ్వదు.  ఇద్దరూ  కలిసి  అనుభవించండి.* 

 *6. చిన్న  చిన్న  విషయాలకు  ఆందోళన  పడకండి. ఇప్పటివరకూ  జీవితం  లో  ఎన్నో  ఒత్తిడులను  ఎదుర్కొన్నారు.   ఎన్నో  ఆనందాలూ,  ఎన్నో  విషాదాలూ  చవి  చూశారు.  అవి  అన్నీ  గతం.* 

 *మీ  గత  అనుభవాలు మిమ్మల్ని  వెనక్కులాగేలా  తలచుకుంటూ  ఉండకండి,  మీ భవిష్యత్తును భయంకరంగా  ఊహిచుకోకండి.  ఆ  రెండిటివలన  మీ  ప్రస్తుత  స్థితిని   నరకప్రాయం  చేసుకోకండి. ఈరోజు  నేను  ఆనందంగా  ఉంటాను అనే  అభిప్రాయంతో  గడపండి.   చిన్నసమస్యలు  వాటంతట  అవే  తొలగిపోతాయి .* 

 *7. మీ  వయసు*  *అయిపొయింది  అనుకోకండి.  మీ  జీవిత  భాగస్వామిని  ఈ  వయసులో  ప్రేమిస్తూనే  ఉండండి. జీవితాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. కుటుంబాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. మీ  పొరుగువారిని  ప్రేమిస్తూ  ఉండండి.* 

  *"జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ  ఉన్నన్ని నాళ్ళూ   మీరు  ముసలివారు  అనుకోకండి.* *నేను  ఏమిచెయ్యగలనూ  అని  ఆలోచించండి.  నేను  ఏమీ  చెయ్యలేను  అనుకోకండి"* 

 *8. ఆత్మాభిమానం  తో  ఉండండి  (మనసులోనూ బయటా  కూడా) హెయిర్  కట్టింగ్  ఎందుకులే*  *అనుకోకండి.  గోళ్ళు  పెరగనియ్యిలే అనుకోకండి.  చర్మసౌందర్యం  మీద  శ్రద్ధ   పెట్టండి.  పళ్ళు  కట్టించుకోండి. ఇంట్లో  పెర్ఫ్యూమ్ లూ,  సెంట్లూ ఉంచుకోండి. బాహ్య  సౌందర్యం  మీలో అంతః సౌందర్యం  పెంచుతుంది అనే  విషయం  మరువకండి.  మీరు  శక్తివంతులే!* 

 *9. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయిన ఒక  స్టైల్స్ ఏర్పరచుకోండి.  వయసుకు  తగ్గ  దుస్తులు  చక్కటివి  ఎంచుకోండి. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయినట్టుగా  మీ  అలంకరణ ఉండాలి.  మీరు  ప్రత్యేకంగా  హుందాగా ఉండాలి.* 

 *10. ఎప్పటికప్పుడు  అప్ డేట్  గా  ఉండండి. న్యూస్ పేపర్లు  చదవండి. న్యూస్ చూడండి.  పేస్  బుక్ , వాట్సాప్ లలో  ఉండండి. మీ  పాత  స్నేహాలు  మీకు  దొరకవచ్చు.*  

 *11. యువతరం ఆలోచనలను  గౌరవించండి.* 

 *మీ  ఆదర్శాలూ  వారి  ఆదర్శాలూ  వేరు  వేరు  కావచ్చు. అంతమాత్రాన  వారిని  విమర్శించకండి* .

 *సలహాలు  ఇవ్వండి,* *అడ్డుకోకండి. మీ  అనుభవాలు  వారికి  ఉపయోగించేలా  మీ  సూచనలు  ఇస్తే  చాలు. వారు  వారికి  నచ్చితే  తీసుకుంటారు.  దేశాన్ని  నడిపించేది వారే!* 

 *12. మా  రోజుల్లో ...  అంటూ   అనకండి.  మీరోజులు  ఇవ్వే!* 

 *మీరు  బ్రతికి  ఉన్నన్ని  రోజులూ   " ఈరోజు నాదే"  అనుకోండి* 

 *అప్పటికాలం  స్వర్ణమయం  అంటూ  ఆరోజుల్లో   బ్రతకకండి.*  

 *తోటివారితో కఠినంగా  ఉండకండి.* 

 *జీవితకాలం  చాలా  తక్కువ.  పక్కవారితో కఠినంగా   ఉండి* *మీరు  సాధించేది  ఏమిటి?*  *పాజిటివ్  దృక్పధం,*  *సంతోషాన్ని  పంచే  స్నేహితులతో  ఉండండి.*  *దానివలన  మీ  జీవితం  సంతోషదాయకం  అవుతుంది.*  *కఠిన  మనస్కులతో  ఉంటె   మీరూ  కఠినాత్ములుగా  మారిపోతారు.*  *అది  మీకు  ఆనందాన్ని  ఇవ్వదు.  మీరు  త్వరగా  ముసలివారు  అవుతారు.* 

 *13. మీకు  ఆర్ధికశక్తి  ఉంటె,  ఆరోగ్యం  ఉంటె   మీ  పిల్లలతో  మనుమలతో  కలిసి ఉండకండి. కుటుంబ సభ్యులతో  కలిసి  ఉండడం  మంచిది  అని  అనిపించవచ్చు.  కానీ  అది  వారి  ప్రైవసీకి  మీ  ప్రైవసీకి కూడా  అవరోధం  అవుతుంది.వారి  జీవితాలు  వారివి.*  

 *మీ  జీవితం  మీది. వారికి  అవుసరం  అయినా,  మీకు  అవుసరం  అయినా  తప్పక  పిల్లలతో  కలిసి  ఉండండి.* 

 *14. మీ  హాబీలను  వదులుకోకండి.*  *ఉద్యోగజీవితం  లో  అంత  ఖాళీ  లేదు  అనుకుంటే  ఇప్పుడు  చేసుకోండి.* 

 *తీర్థ  యాత్రలు  చెయ్యడం,  పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో, కుక్కనో  పెంచడం,  తోట పెంపకం, పెయింటింగ్ ...  రచనా  వ్యాసంగం   ...  ఏదో  ఒకటి  ఎంచుకోండి.* 

 *15. ఇంటిబయటకు  వెళ్ళడం  అలవాటు  చేసుకోండి.  కొత్త  పరిచయాలు  పెంచుకోండి.* *పార్కుకి  వెళ్లండి, గుడికి  వెళ్ళండి,  ఏదైనా  సభలకు  వెళ్ళండి.  ఇంటిబయట  గడపడం  కూడా  మీ  ఆరోగ్యానికి  మేలు  చేస్తుంది.* 

 *16. మర్యాదగా   మాట్లాడడం  అలవాటు  చేసుకోండి.  నోరు  మంచిది  అయితే  ఊరు  మంచిది  అవుతుంది.*  *పిర్యాదులు  చెయ్యకండి. లోపాలను  ఎత్తిచూపడం  అలవాటు  చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను  అర్ధం  చేసుకుని  ప్రవర్తించండి. సున్నితంగా  సమస్యలను  చెప్పడం  అలవాటు  చేసుకోండి.* 

 *17. వృద్ధాప్యం  లో  బాధలూ,  సంతోషాలూ  కలిసి  మెలసి  ఉంటాయి.  బాధలను  తవ్వి  తీసుకుంటూ ఉండకండి.* *అన్నీ  జీవితంలో  భాగాలే* 

 *18. మిమ్మల్ని  బాధపెట్టిన  వారిని  క్షమించండి* 

 *మీరు  బాధపెట్టిన  వారిని  క్షమాపణ  కోరండి* 

 *మీ తోపాటు  అసంతృప్తిని  వెంటబెట్టుకోకండి.* 

 *అది మిమ్మల్ని విచారకరం  గానూ,* 

 *కఠినం గానూ   మారుస్తుంది* 

 *ఎవరు  రైటు అన్నది  ఆలోచించకండి.* 

 *19. ఒకరిపై పగ  పెట్టుకోవద్దు* 

 *క్షమించు,  మర్చిపో,  జీవితం  సాగించు.* 

 *20. నవ్వండి నవ్వించండి. బాధలపై  నవ్వండి* 

 *ఎందరికన్నానో  మీరు  అదృష్టవంతులు.* 

 *దీర్ఘకాలం  హాయిగా  జీవించండి.* 

 *ఈ వయసు వరకు  కొందరు  రాలేరు  అని  గుర్తించండి.* 

 *మీరు  పూర్ణ  ఆయుర్దాయం  పొందినందుకు   ఆనందించండి.

🌷🌷🌷🌷🌷🌷🌷


  *194-కర్మ - జన్మ -*మయూరధ్వజుడు- *దుష్కర్మఫలితం -*కాలం అంటే *ఒకసారి దేవేంద్రునికి

*50-కర్మ - జన్మ

 *"కర్మ ఫలం"* లో - ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం.

 *స్వర్గ నరకాలు ఉన్నాయా?* 

 కర్మ సిద్ధాంతం ప్రకారం ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనకలు, ఇతర అప్సరసలు గల, మనం పురాణాల్లో చదివే సుఖాన్నిచ్చే స్వర్గం నిజంగా ఉందా?

 దీనికి ముందుగా సుఖం అంటే ఏమిటో తెలుసుకోవాలి.

 *సచ్చిదానందానుభవ స్వరూపం జ్ఞాత్వా ఆనందరూపావస్థితిః ఏవ సుఖమ్.* 

                   -- నిరాలంబోపనిషత్ 26 

 అంటే,  సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణాల స్వతస్సిద్ధమైన సంపూర్ణ అనుభవ స్వరూపాన్ని తెలిసికొని, జ్ఞాపకంలో నిలుపుకుని ఆనంద రూపంలో స్థిరత్వాన్ని పొందడమే సుఖం అంటే. దీన్నే బ్రహ్మానందం అంటారు.

 ఇప్పుడు నిరాలంబోపనిషత్ ఇచ్చిన స్వర్గం నిర్వచనం చూద్దాం.

 *సత్సంసర్గ స్వర్గః* (నిరాలంబోపనిషత్ -28) అంటే సత్ లక్షణాన్ని సృజించుకోవమే స్వర్గం. అంటే తను సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ అనే విషయం తన ఉనికిలో చూడగలగడం స్వర్గం. ఇందువల్ల బ్రహ్మానంద సుఖం కలుగుతుంది. దీన్నిబట్టి సుఖం, స్వర్గం అనే రెండిటి నిర్వచనాలు దాదాపు ఒక్కటే అని తెలుస్తోంది. అంటే ముక్తిని పొందడమే స్వర్గం అని వేదాంతం చెప్తుంది.

 మరో స్వర్గం కూడా ఉంది. ఇది లౌకికమైనది. *సృజ్యత ఇతి స్వర్గః* సృజింపబడేదే స్వర్గం. *స్వప్రయత్నేన గచ్ఛతీతి స్వర్గః* తన ప్రయత్నం చేత చేరేది స్వర్గం.

అంటే తన ప్రయత్నంతో మనసుతో భోగ స్వర్గాన్ని ఊహించుకోవడమే స్వర్గం. అలసిన బాటసారి కడుపు నిండా భోజనం చేసి చక్కటి మంచం మీద నిద్రిస్తే, అది అతను సృజించుకున్న స్వర్గం. అసలు స్వర్గం తను పరమాత్మ అనే ఎరుకని కలిగి ఉండటమే. 

 *నరకం సంగతి చూద్దాం.*

 195*నరకం* 

 నరకం అంటే దుఃఖమే కాబట్టి ముందుగా దుఃఖం అంటే ఏమిటో చూద్దాం. నిరాలంబోపనిషత్ ప్రకారం - *అతన్ సంసారవిషయసంకల్ప ఏవ దుఃఖం* (నిరాలంబోపనిషత్-27) అంటే,  సుఖానికి వ్యతిరేకంగా ఉండే అన్ని సంసార విషయాల సంకల్పమే దుఖం.

 సంసారం అంటే ఏమిటి? - భార్యా భర్తలు కలిసి జీవించడం అని లౌకిక ప్రపంచంలో అర్థం. కాని వేదాంతపరంగా దాని అర్ధం వేరు.

 *సంసరతి అనేన ఇతి సంసారః సృ గతౌ.* అంటే స్వతస్సిద్ధమైన బ్రహ్మ రూపమైన సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణాల జ్ఞాపకం నించి జారిపడుట సంసారం అని అర్ధం.

 తాను పరమాత్మ అనే స్మృతి పోవడాన్ని సూక్ష్మంగా 'అజ్ఞానం' అని అంటారు. (సత్వ, రజో, తమో గుణాలు అజ్ఞానానికి ప్రతీకలు) తిరిగి ఆ స్మృతి కలిగేదాకా, అంటే ముక్తిని పొందేదాకా అంటే, తను సచ్చిదానంద స్వరూపం అన్న ఎరుకని, ఉనికిని తిరిగి పొందే దాకా మనం జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటాం.ఇదే సంసారం. కర్మ-జన్మ అన్నదే సంసారం. దీనివల్ల బంధం కలుగుతుంది. సంసారానికి సంబంధించింది ఏదైనా దుఃఖకరమైందే కాబట్టి బంధం కూడా అంతే. 

 *బంధం అంటే ఏమిటో తెలుసుకుందాం.*

 *అనాద్యవిద్యావాసనయా జాతోహమిత్యాది నంకల్పో బన్ధః* (నిరాలంబోపనిషత్ - 30) 

అంటే,  'అనాదిగా పీడిస్తున్న అవిద్య యొక్క వాసనచేత పుట్టినవాడిని నేను' మొదలైన ఆలోచనలే బంధం.

ఈ ఆలోచనకి ఆలంబనంగా అనేక బంధాలు ఉంటాయని శాస్త్రం చెప్తోంది. అవి అనేకం. తల్లి, తండ్రి, సోదరుడు, కొడుకు, ఇల్లు, తోట, భార్య మొదలైనవి నావి అనే సంసార ఆవరణపరమైన సంకల్పం బంధం. కర్తృత్వం (నేను, నాది) మొదలైన అహంకార సంకల్పం బంధం. అషైశ్వర్యాల మీద ఉండే ఆశ బంధం. ఉపాసన, యజ్ఞ, వ్రత, తప, దాన, విధి, విధానాల సంకల్పం బంధం.

యోగం చేయాలనుకోవడం, యమ నియామాల సంకల్పం బంధం. వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలనే సంకల్పం బంధం. భయం, సంశయం లాంటి గుణ సంబంధమైన సంకల్పం బంధం. మోక్షం మాత్రమే కావాలనే సంకల్పం బంధం. *సంకల్ప మాత్ర సంభవః* అంటే, ఏ సంకల్పమైనా బంధం. సంసారం వల్ల బంధం, బంధం వల్ల దుఃఖం కలుగుతాయని తెలుస్తోంది. 

 *ఇక నరకం అంటే ఏమిటో చూద్దాం.* 

 నరకాన్ని నిరాలంబోపనిషత్ ఇలా నిర్వచించింది. *అసత్ సంసార విషయ జనన సంసర్గ ఏవ నరకః* అంటే, సంసార విషయంలో జనింపచేసే, సత్యం కాని వాటి చేరికయే నరకం.

 అంటే చావు పుట్టుకలు, వాటి మధ్య జరిగేదంతా నరకం. అదంతా అజ్ఞానం వల్లనే జరుగుతుంది కాబట్టి అజ్ఞానమే నరకం అంటే, మనమంతా అజ్ఞానులం కాబట్టి ఈ ప్రపంచంలోనే నరకాన్ని అనుభవిస్తున్నాం.

 వేదాంతపరంగా నరకం అంటే,  తాను పరమాత్మనన్న మరుపు, నేను నాది అనే బంధం, చావు పుట్టుకల చక్రం, భౌతిక దేహం అని అర్ధం. *కో వాస్తి ఘోరో నరకః స్వదేహః* ఘోరమైన నరకం ఏది? ఈ శరీరమే. ( ప్రశ్నోత్తరి మణిమాల)

 మతపరమైన నరకం గురించిన వర్ణన గరుడ పురాణంలో, దేవి భాగవతంలో ఉంది. మనం చేసే పాపాలు, వాటికి నరకంలో అనుభవించే శిక్షలు, నరకంలోని రకాలు గురించి ఇంకా అనేక పురాణాల్లో వివరంగా వర్ణించబడింది.

కర్మ సిద్ధాంతం ప్రకారం యముడు, యమ భటులు, కాగే నూనె బాణలిలో మరిగే పాపులు గల నరకం నిజంగా ఉందా? లేక ఇది కల్పనా? యముడు, చిత్రగుప్తుడు, స్వర్గ నరకాలు పురాణాల్లో కొన్ని కథలకి సూచించడానికి సంకేతంగా చేసిన పాత్రల కల్పన మాత్రమే. పాపాలకి శిక్ష అనుభవించాక జీవికి ఇక మళ్ళీ జన్మకి రావాల్సిన అవసరం ఏముంది?

వచ్చినా పాపరహితులైన అంతా సమానులుగా రావాలి కాని ఇలా హెచ్చు తగ్గులతో ఎందుకు పుడతారు? అవి కేవలం మనిషికి పాపం చేయడానికి భయం కలిగించేందుకు ఋషులు చేసిన హెచ్చరికలై ఉండాలి.

 ఏ దుశ్చర్యకి ఏ రోగమో నిర్ణయింపబడ్డాక అది భౌతిక దేహంతోనేగా అనుభవించాల్సి ఉంటుంది. పరస్త్రీలతో అక్రమ సంబంధం గలవాడు క్షయ వ్యాధికి గురయి ఆ నరకాన్ని ఇక్కడే అనుభవిస్తాడు.

వ్యభిచార వ్యాపారం చేసినవాడు హిజ్రాగా జన్మించి నరకాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తాడు. ఇలా ప్రతీ దుష్కర్మకి ఓ ఫలితం ఉంది కాబట్టి ప్రత్యేకంగా నరకం అనే ఇంకో లోకం ఉండకపోవచ్చు. మనస్సే నరకాన్ని ఈ లోకంలో అనుభవిస్తోంది తప్ప పురాణాల్లో చెప్పినట్లుగా ప్రత్యేకంగా నరకం అనేది ఉండదు.

 ఎందుకంటే పాపం అధికంగా చేస్తే ఆ పాపానుభవానికి జంతు జన్మ వస్తుందని చెప్పుకున్నాం. చెడు కర్మలు చేసినవాడు చెడు యోనుల్లో పుట్డి కష్టాలు అనుభవిస్తాడు. ఇక నరకం అవసరం ఎక్కడుంది!? ఇది వేదాంతపరమైన విశ్లేషణ.

.....

196.పృథుమహారాజుకు యజ్ఞశాలయందు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమగుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

రాజునకు శ్రేయస్సు న్యాయబద్ధమైన ప్రజాపరిపాలన వలననే సిద్ధించును. అట్టి పాలకునకు పరలోకమున ప్రజల సుకృతఫలములో ఆరవభాగము లభించును. ఇందులకు భిన్నముగా ప్రజారక్షణ భారమును వీడి, కేవలము వారినుండి పన్నులను స్వీకరించు అధర్మప్రభువుయొక్క పుణ్యఫలమంతయును ప్రజలకే చెందును. అంతేగాక, ప్రజలు చేసిన పాపఫలములకు గూడ అతడు భాగస్వామియగును.

ఈ విషయములను అన్నింటిని అవగాహన జేసికొని, బ్రాహ్మణోత్తముల సమ్మతిని, పూర్వులనుండి పరంపరగా వచ్చిన ధర్మములను స్వీకరించుచు, ఎన్నడును లౌకికవిషయముల యందు ఆసక్తుడవుగాక, ఈ పృథ్విని న్యాయముగా పరిపాలింపుము. అప్పుడు సమస్తజనులు నీయందు ప్రేమానురాగములను, భక్తివిశ్వాసములను కలిగియుందురు. కొలది దినములలోనే సనకాది మునులు స్వయముగా నీయొద్దకు విచ్చేసి నీకు దర్శనమిత్తురు.

రాజా! నేను నీ శమదమాది గుణములకును, మాత్సర్యరహితమైన నీ స్వభావమునకు వశుడనైతిని. కావున నీవు ఏదేని ఒక వరమును కోరుకొనుము. సకల ప్రాణులయందు సమత్వబుద్ధి గలవారి హృదయములయందే నేను వసింతును. గుణశీలములు, సమత్వభావము లేనివారు ఎన్ని యజ్ఞములు చేసినను, ఎంతటి తపస్సొనర్చినను, యోగసాధనలు ఎన్ని చేసినను, వారికి నేను సులభముగా వశుడనుగాను.

మైత్రేయ ఉవాచ

మైత్రేయుడు నుడివెను- విదురా! శ్రీమన్నారాయణుడు సకలలోకములకును గురువు అగు శ్రీహరి విశ్వవిజేతయైన పృథుమహారాజును ఇట్లు ఆదేశింపగా, అతడు ఆ సర్వేశ్వరుని ఆజ్ఞను శిరసావహించెను.

దేవేంద్రుడు తాను చేసిన అకృత్యమునకు (అపరాధమునకు) మిగుల సిగ్గుపడి అతడు పృదుమహారాజు పాదములపై పడబోవునంతలో ఆ మహారాజు ఇంద్రుని అక్కున జేర్చుకొనెను. అంతట పరస్పరద్వేషభావము సమసిపోయెను.

విశ్వాత్ముడు, భక్తవత్సలుడు అయిన శ్రీహరిని పృథుచక్రవర్తి విధ్యుక్తముగా పూజించెను. పిమ్మట అతడు అనుక్షణము తన హృదయమందు పొంగిపొరలుచున్న భక్తిభావముతో ఆ పరమపురుషుని విడువలేక ఆ ప్రభువు పాదములను ప్రేమతో పట్టుకొనెను.

పురుషోత్తముడైన శ్రీహరి అచటినుండి వైకుంఠధామమునకు వెళ్ళు సంకల్పముతో ఉన్నను పృదుమహారాజు పైనగల వాత్సల్యము ఆయనను నిలిపివేసెను. అంతట ఆ కమలపత్రాక్షుడు ఆ మహారాజువైపు తదేకదృష్టితో జూచుచు అచటినుండి కదలలేకపోయెను. భగవంతుడు సత్పురుషులకు అత్యంత ఆత్మీయమిత్రుడు కదా!

సుహృత్సతామ్ అను శబ్ద ప్రయోగమునందు పూర్తిభావము బోధపడుటకుగాను, గీతాప్రెస్సు సంస్థాపకులగు శ్రీజయదయాళ్ గోయంకగారిచే రచింపబడిన గీతాతత్త్వవివేచనీ వ్యాఖ్యానము నందలి అధ్యాయము 5లో 29వ శ్లోకము యొక్క వ్యాఖ్యానము చదువమని మనవి.

ఆదిరాజైన ఆ పృథువు శ్రీహరిచెంత బద్ధాంజలియై నిలిచెను. భక్తిపారవశ్యమున అతని నేత్రములు అశ్రుపూర్ణములగుటచే భగవంతుని దర్శించుటకు అశక్తుడయ్యెను. కంఠము గద్గదమగుటవలన ప్రస్తుతించుటకు గొంతు పెగలదయ్యెను. ఐనను, అతడు ఆ స్వామి దివ్యమంగళ విగ్రహమును తన హృదయమునందే గాఢాలింగనముతో నిలుపుకొనెను. అట్లే చేతులు జోడించి నిలబడిపోయెను.

అప్పుడు శ్రీమహావిష్ణువుయొక్క పాదములు భూమిని తాకుచుండెను. ఆ స్వామి హస్తాగ్రములు గరుడుని ఉన్నతమైన భుజములపై అలరారుచుండెను. అప్పుడు పృథుమహారాజు అశ్రువులను తుడుచుకొని, ఆపరమపురుషుని ఎంతగా వీక్షించుచున్నను అతనికి తనివి తీరకుండెను. ఎట్టకేలకు అతడు ఆ పురుషోత్తముని ఇట్లు స్తుతింపసాగెను-

పృథురువాచ

పృథుమహారాజు పలికెను- ప్రభూ! నీవు మోక్షప్రదాతవు. సకలలోలోకవాసులకును బ్రహ్మాదిదేవతలు వరములను ఇచ్చుచుందురు. కాని, అట్టి బ్రహ్మాదిదేవతలకు కూడ నీవు వరములను ప్రసాదించుచుండెడి వరదుడవు. మహామహిమాన్వితుడవు. అట్టి నీ నుండి త్రిగుణముల పరిణామరూపమైన దేహమునందు అభిమానము కలిగినవారు విషయభోగములను వరములుగా కోరుచుందురు. కాని, భోగములను వరముగా పొందవలెనని వివేకవంతుడైనవాడు ఎవడు కోరుకొనును? అనగా, బుద్ధిమంతుడు, జ్ఞానియగు వ్యక్తి ఎన్నడును కోరుకొనడు. అట్టి విషయభోగములు నరకలోకజీవులకు కూడా లభించును. కనుక, నేను ఆ విధమైన కోరికలు కోరను.

జగన్నాథా! నీ దివ్యపాదారవిందములయందలి మకరందమాధుర్యములను మహాత్ములు నిత్యము ఆస్వాదించుచుందురు. ఆ మాధుర్యవైభవములు వారి ముఖములనుండి జాలువారుచుండును. అట్లు వారు కీర్తించుచుండెడి నీ గుణవైభవములను వినెడి అవకాశము లేనిచో, మోక్షమును గూడ నేను కోరుకొనను. నీ కళ్యాణగుణములు అనంతములు. వాటిని వినుటకు నా రెండు చెవులు చాలవు. కావున, ఆ శ్రవణభాగ్యమును నోచుకొనుటకు నాకు వేలకొలది చెవులను అనుగ్రహింపుము. ఇదియే నా కోరిక.

పరమేశ్వరా! నీకీర్తి జగత్ప్రసిద్ధము. నీ పాదారవిందమకరంద అమృతకిరణముల పరిమళ వాయువులు మహాపురుషుల ముఖములనుండి గుబాళించుచుండును. అవి నీ తత్త్వజ్ఞానమును విస్మరించి, ప్రవర్తించుచున్న మావంటి కుయోగులకు గూడ మరల నీ స్మరణము గలిగించుటద్వారా ఆనందింపజేయును. కనుక, వాటిని అనుభవించు భాగ్యమును కల్గించిన చాలును. ఇతర వరములతో పనియేలేదు.

మహాకీర్తినిధీ! ఎవ్వడైనను సత్పురుషుల సత్సంగము నందు శుభప్రదమైన నీ యశోవైభవమును గూర్చి దైవికముగా ఒక్కసారియైనను విన్నచో, మహానందమున ఓలలాడును. అట్లు ఆనందింపగలవాడు గుణగ్రాహి యగును. ఆనందింప లేనివాడు పశుతుల్యుడు అనిపించుకొనును. నీ కల్యాణ గుణములను పుణికిపుచ్చుకొనబడే లక్ష్మీదేవిని మిక్కుటమగు మక్కువతో నిన్ను వరించెను. 

(చతుర్థ స్కంధము లోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

197 *పృథుమహారాజుకు యజ్ఞశాలయందు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమగుట*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీహరీ! నీవు సకలదివ్యగుణములకు నిధివి, పురుషోత్తముడవు. పద్మహస్తయైన లక్ష్మీదేవివలె నేనును నిన్ను భజించుటయందు లాలనగలవాడను. మా ఉభయుల మనస్సులు నీ పాదపద్మములను సేవించుటయందే నిరతి గలిగియున్నవి. ఒకేపతిని సేవించుటయందు పోటీపడుచుండు ఇద్దరి మధ్య  స్పర్ధ ఏర్పడుచుండుట సహజము (సాధారణముగా ఆ పోటీ కలహమునకు దారితీయుచుండును). కానీ, మా ఇద్దరిమధ్య ఎట్టికలహమూ సంభవింపకుండునట్లు అనుగ్రహింపుము.

జగదీశ్వరా! జగజ్జననియగు లక్ష్మీదేవి నిరంతరము నిన్ను సేవించుటయందే నిరతురాలై యుండును. నేనును నిన్ను సేవించుటకే తహతహలాడుచుందును. ఈ కారణముగా ఆ దేవికి నాయెడ విరోధభావము కలుగవచ్చును. అందులో వింతలేదు. నీవు దీనవత్సలుడవు. నీకు భక్తులొనర్చెడి సేవ స్వల్పమేయైనను దానిని నీవు గొప్పగా భావింతువు. కావున, మా ఇద్దరి కలహమునందు నీవు నా పక్షమునే వహింతువని నేను నమ్ముచున్నాను. స్వస్వరూపమునందే నిరతుడవై యుండు నీకు (ఆనందఘనస్వరూపుడవై యుండు  నీకు) లక్ష్మీదేవితో పనియేమి?

పరమాత్మా! నీవు మాయ (ప్రకృతి) యొక్క గుణములైన త్రిగుణములకు అతీతుడవు. కనుక, మాయాకార్యములైస అహంకారాదులు నిన్ను తాకజాలవు నిష్కాములైన (ఎట్టి ఫలాపేక్షయులేని) మహాత్ములు తమకు జ్ఞానోదయమైన పిమ్మట గూడ భక్తినిరతితో నిన్ను సేవించుచునే యుందురు. అట్టి ఉత్తమపురుషులకు నీ పాదారవిందములను స్మరించుటయనెడి మహాఫలమును దప్ప మరి ఏ ఇతర ఫలములను ఆశించుట నేను ఎరుగును. నేను గూడ నీ పాపపద్మములను సేవించుటను తప్ప అన్యమును కోరను.

దేవా! ఏమాత్రమూ ప్రతిఫలాపేక్ష లేకుండా నిన్ను సేవించుచున్నవాడను. అట్టి నన్ను *వరమును కోరుకొనుము* అని నీవు పలికిన వచనము సాంసారిక మోహములో పడవేయునట్టిదని నేను భావించెదను. వేదరూపమైన నీ వాణిగూడ జగత్తును ఫలాపేక్షతో గూడిన యజ్ఞయాగాదులను చేయుటకు ప్రోత్సహించుచు, ఆ జగత్తును (లోకులను) మోహవశము గావించుచున్నది. అట్లుకానియెడల, మోహగ్రహస్తుడైన మానవుడు మరల మరల కామ్యకర్మలనే ఏల చేయుచుందును? కాని, నేను మాత్రము తొంబది తొమ్మిది యజ్ఞములను ఆచరించినను, అవి ప్రతిఫలాపేక్షరహితముగా చేసినట్టివే. నీ దివ్యపాదారవింద సేవాఫలమును మాత్రమే నేను త్రికరణ శుద్ధిగా కోరుకొనుచుంటిని.

సర్వేశ్వరా! నీమాయా ప్రభావమున అజ్ఞానవశుడైన మానవుడు ఆత్మస్వరూపుడవైన నీకు విముఖుడై (నిన్నుగోరక) స్త్రీపుత్రాదులను వాంఛించును. కాని, తండ్రి తనను పుత్రుడు అడగకున్నను, వాని హితమునకై పాటుపడుచుండును.అట్లే జగత్పితవైన నీవు మాకు శ్రేయస్కరమైన దానిని నిర్ణయించి, మమ్ము అనుగ్రహింపుము.

*మైత్రేయ ఉవాచ*

*మైత్రేయుడు వచించెను*- విదురా! సర్వసాక్షియైన శ్రీమన్నారాయణుని పృథుమహారాజు ఇట్లు ప్రస్తుతింపగా, ఆ ప్రభువు అతనితో ఇట్లు నుడివెను- పృథుమహారాజా! నీకు నాయందు అనన్యభక్తి  కుదురుకొనుగాక! దైవానుగ్రముచే నీకు ఈ సంకల్పము కలిగినది. నిజమునకు మాయనుండి తప్పించుకొనుట ఎంతయో కష్టమైనపని. ఐనను, ఇట్టి భక్తిభావముచేత మానవుడు దుర్జయమైన నా మాయనుండి తరించును (విముక్తుడగును). నృపతీ! నీవు అప్రమత్తుడవై నా ఆజ్ఞను పాలింపుము. నా ఆశయమును పాటించినవారు సర్వత్ర శుభములనే పొందుదురు.

*మైత్రేయ ఉవాచ*

*మైత్రేయుడు వచించెను*-విదురా! శ్రీహరి రాజర్షియైన పృథుమహారాజును అర్థవంతములైన పలుకు *(శ్రోతలకు పురుషార్థసాధనములైన వచనము)* లతో ఆదరించెను. అంతట ఆమహారాజు ఆ ప్రభువును (శ్రీహరిని)  భక్తిశ్రద్ధలతో పూజించెను. పిదప పురుషోత్తముడు అతనిని అనుగ్రహించి, వైకుంఠమునకు చేరుటకు సంకల్పించెను.

పృథుమహారాజు తన యజ్ఞమునకు విచ్చేసిన దేవతలు, ఋషులు,పితృదేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, నాగులు, 
కిన్నరులు, .కింపురుషులు, అప్సరసలు, మానవోత్తములు, పక్షులు మొదలగు పలువిధములగు ప్రాణులను ఇంకను శ్రీహరియొక్క పార్షదులను, భగవద్బుద్ధితో భక్థిపూర్వకముగా కృతజ్ఞతతో ప్రాంజలియై పూజించెను. మధురవచనములతో మన్నన చేసెను. కానుకలతో గౌరవించెను. వేయేల, సకల సత్కారములతో ఆదరించెను. పిమ్మట వారు అందరును స్వస్థానములకు వెళ్ళిఫోయిరి.

సర్వేశ్వరుడైన శ్రీహరి పృథుమహారాజునకు, ఆయన పురోహితులకు ఆహ్లాదముసు గూర్చుచు వారి మనస్సులను దోచుకొని తన పరంధామమునకు చేరుకొనెను.

శ్రీమహావిష్ణువు స్వయముగా ఇంద్రియములకు గోచరించెడివాడు కాదు. ఐననూ ఆ ప్రభువు తన స్వరూపమును సాక్షాత్కరింపజేసి, అంతర్ధానమునొందెను. పిదప పృథువు కూడా ఆ పురుషోత్తమున.కు నమస్కరించి, తన రాజధానికి మరలెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే వింశోఽధ్యాయః (20)*

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు ఇరువదియవ అధ్యాయము (20)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
198 *🧘‍♂️నిష్కామకర్మ🧘‍♀️*🔥ఓంశ్రీమాత్రే నమః🔥

*ఏమిటీ నిష్కామకర్మ:- సముద్రములోని అలలకు, బ్రహ్మముకు సంబంధం ఇదే!*

ఎప్పుడైతే నిష్కామ కర్మకి అవకాశం లేదో, అప్పుడు తనలోపలికి తాను ముడుచుకుంటాడన్నమాట! తన యందు తాను రమిస్తూ వుంటాడు. తన యందే తాను స్థిరమై ఉంటాడన్నమాట! అలా లోపలికి ముడుచుకోవడం చేతనైనటువంటి వాడు అన్నమాట. దీనిని ఏమన్నారు అంటే? ఇంద్రియ నిగ్రహం అన్నారు. ఈ బుద్ధి గుహయందు సర్వేంద్రియములను నిక్షిప్తం చేయడం ఏదైతే ఉన్నదో, దానికి ఇంద్రియ నిగ్రహం అని పేరు. అంతేకానీ, బహిర్ వ్యాపారంలో ఒకచోట చేయుట, ఒక చోట చేయకుండుట కర్మ వ్యాపారంతో ఇంద్రియ నిగ్రహం బోధించబడుట లేదు.

ఇంద్రియములు వ్యవహరించినను, వ్యవహరించకున్ననూ, తాను వ్యవహరించుట లేదు. తాను సదా ఈ ఆంతరిక యజ్ఞమునందు నిమగ్నుడై, ఆత్మానందమగ్నుడై ఉన్నాడు. కాబట్టి సామాన్య వ్యవహారం ఏదైతే ఉన్నదో, అట్టి సామాన్య వ్యవహారమునకు సుఖ దుఃఖ ఆసక్తిని పొందక, శీతోష్ణాది ద్వంద్వముల చేత కుంగక, శరీరాది జరామరణాది వార్థక్యరూప జరా మృత్యు వార్థక్యరూపమైనటువంటి వాటి చేత కుంగక, పొంగక, యవ్వనాది విశేషముల చేత లాభింపక, శరీర ఇంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యల యందు నిమగ్నము కాక, సంగత్వమును పొందక ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు జ్ఞాని అని పిలువబడుతున్నాడు.

జ్ఞాని అంటే అర్థం ఏమిటంటే?

‘జ్ఞాని' అంటే అర్థం ఏమిటంటే "ఎవరైతే ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేసి, ఈ ఆత్మానంద భావమునందుకున్నారో, వాళ్ళందరూ జ్ఞానులు" కాబట్టి, వీళ్ళు మాత్రమే ఇలా ఈ క్రమంలో వెళ్ళేటటువంటి అంతర్ముఖులైనటువంటి, వారు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు. అంతేకాని, విషయవ్యావృత్తి కలిగినటువంటి, విషయావృత్తం అయినటువంటి, విషయముల యందు రమించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మను తెలియలేరు. ఎప్పటికీ తెలియలేరు. వారు ఆత్మను తెలుసుకోలేరు

జిలేబీ బాగుందా? పులిహోరా బాగుందా? దద్దోజనం బాగుందా? పచ్చిమిరపాకాయ బజ్జీ బాగుందా? ఆవకాయ బాగుందా? మాగాయి బాగుందా? అని పదార్థముల వెంటపడి వెళ్ళేవారు ఇంద్రియార్థములైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల యందు మనస్సు లగ్నం చేసేవారు కానీ, కర్మల యందు ఫలాపేక్ష చేత, రమించేటటువంటి వారు కానీ, ఈ ఆత్మను తెలుసుకొన లేరు.

 అనగా ప్రవృత్తి మార్గంలో వున్నటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేరు. జనన మరణ మృత్యురూప భయమును పొందేటటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేరు. శబ్ద గ్రాహ్యత యందు కానీ, స్పర్శ గ్రాహ్యత యందు కానీ, రూప గ్రాహ్యత యందు కానీ, రస గ్రాహ్యత యందు గానీ, గంథ గ్రాహ్యత యందు గానీ బుద్ధిని రమింప చేసేటటువంటి వారు, బుద్ధిని బహిర్ముఖముగా వ్యవహరింప చేసేటటువంటి వారు, ఈ ఆత్మను తెలియజాలరు. కాబట్టి బుద్ధిని ఒకదానిని బుద్ధి ఇంద్రియములకు రాజు వంటిది. దానిని వేరు చేయాలి.

అలాంటి వారు ఆత్మానందస్థితిలో ఉంటారు

ఇంద్రియముల నుంచీ వేరుచేయాలి. ఇంద్రియముల యందు రమించి తాను పొందే సుఖము నుంచీ వేరు చేయాలి. ఇంద్రియములు ఇచ్చే సంవేదనల ద్వారా తాను పొందే దుఃఖము నుంచీ బుద్ధిని వేరుచేయాలి. వేరు చేసి, తాను తానుగా ఉండగలిగేటటువంటి, వ్యవహరించ గలిగేటటువంటి స్థితిని బుద్ధికి కల్పించాలి.

 అటువంటి విరమణ అనేటటువంటి యజ్ఞాన్ని, విరమణ అనేటటువంటి క్రతువును, విరమణ అనేటటువంటి అంతర్ముఖత్వాన్ని ఎవరైతే చేస్తాడో, ఈ నిరసించేటటువంటి విధానంలో ఎవరైతే తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేస్తాడో, తానైనటువంటి స్థితిలో తాను నిలబడి ఉంటాడో, తానైనటువంటి స్థితిలో తాను నిలకడ చెంది ఉంటాడో, ఆచలుడై ఉంటాడో, అంతర్ముఖుడై ఉంటాడో, సర్వవ్యాపియై ఉంటాడో, ఫలాపేక్ష రహితముగా వుంటాడో, సంగత్వ రహితంగా ఉంటాడో, అటువంటి వారు మాత్రమే ఆత్మానంద స్థితిలో ఉంటారని స్పష్టముగా చెపుతున్నారు.

ఆత్మకు శరీరం లేదు

ఈ ఆత్మ శరీరము లేనివాడు కనుక అశరీరయనబడును శరీరములు అనిత్యంలు జీర్ణించి పోవునవి. ఆత్మ నిత్యుడు, సర్వవ్యాపకుడును అచలుడునై అంతటా ఎల్లప్పుడూ ఉండును. అందుచేత అనిత్యములైన శరీరములందు నిత్యుడై యుండును. అట్టి గొప్పవాడును, సర్వ వ్యాప్తియునగు ఆత్మను ధ్యానాదులు మూలమున తెలిసికొనిన జ్ఞాని శోకింపడు.

ఇంకా ఆత్మ యొక్క లక్షణాలను విశేషంగా చెప్తున్నారు. ఈ విశేషం గా చెప్పేటటువంటి అంశాలలో ఆత్మకు శరీరం లేనివాడు. అసలు ఆత్మకు శరీరమే లేదు. కుండకు లోపల బయటా ఆకాశం ఎలా సర్వవ్యాపకముగా ఉన్నదో, ఆత్మ ఈ శరీరమునకు లోపల, బయటా అంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి, ఆత్మకు శరీరము లేదు. ఏ రకమైన శరీరమూ లేదు. అష్టవిధ శరీరములు లేవు. అష్టతనువులు లేవు. కనుక ఆత్మ అశరీరి. శరీరములు అనిత్యములు. శరీరము అంటే అసలు అర్థమేమిటి? ‘శీర్యతే ఇతి శరీరః' - అంటే, తనకు తానుగా నశించిపోవునది ఏదో, అదే శరీరము. తనకు తా పుట్టినది, తనకు తాను నశించిపోవునది.

అనగా అర్థమేమిటంటే, సముద్రపు అలల మీద నురుగు వస్తుంది, ఆ నురుగులో బుడగలు వస్తాయి. ఆ బుడగల మధ్యలో గాలి ఉంటుంది. బుడగల బయట కూడా గాలి వుంటుంది. బుడగలు గాలిలో తేలుతూ ఉంటాయి. ఆ బుడగ ఎంత సేపు ఉంటుంది? ఎంత సేపటికి పోతుంది? అంటే ఎవరైనా చెప్పగలరా? గాలి లోపలా ఉన్నది, గాలి బయటా ఉన్నది. కానీ సముద్రము లేదా ఆ బుడగలో..? ఆ నీళ్ళు లేవా? వీటి అన్నిటి యొక్క సంయోజనీయత ఉన్నట్లుగా తోచుచున్నది. ఆ గాలి బుడగ బ్రద్దలైంది. బ్రద్దలైతే ఏమైంది? ఆ గాలి గాలిలో కలిసిపోయింది, నీరు నీటిలో కలిసిపోయింది. ఇంక ఎక్కడా ఏమీ లేవు. దానికి రూపమే లేదు, ఆకారమే లేదు. అప్పటివరకూ ఉన్న బుడగ ఎక్కడికి పోయిందయ్యా? ఏ గాలిలో పుట్టిందో, ఆ గాలిలోకే పోయింది. ఏ నీటితో పుట్టిందో, ఆ నీటిలోకే పోయింది. ఏ పంచభూతాలతో పుట్టిందో, ఆ పంచభూతాలలోకే పోయింది.

ఈ జీవితం గాలిబుడగతో సమానం

ఇట్లా క్షణ భంగురమైనటువంటి శరీరము అనంతముగా వ్యాపించి యున్న విశ్వము అనేటటువంటి బ్రహ్మము ఆ బ్రహ్మము యొక్క కాలమానం దృష్ట్యా చూసినప్పుడు, ఒక మానవుడు పుట్టి, జీవించి, పోవడం అనేటటువంటిది ఒక గాలి బుడగతో సమానమైనటువంటిది. దానికి ఎంత విలువ వుందో, దీనికి అంతే విలువ ఉంది.

కాబట్టి, ఆత్మకు శరీరము లేదు. ఎందుకని? ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది. అనంత విశ్వ వ్యాపకమైనటువంటిది. బృహద్వ్యాపకమైనటువంటిది. కాబట్టి అది అశరీరి. శరీరములు అనిత్యములు. జీర్ణించి పోవునవి. పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ నిత్యుడు. ఎప్పుడైతే ఆ నిత్యత్వం అంటే సర్వకాల సర్వావస్థల యందును ‘ఉండుట' అనేటటువంటి లక్షణం కలిగియున్నదో ఆ ఆత్మ నిత్యత్వమును కలిగియున్నది. సర్వ వ్యాపకుడు. ఎంతగా సర్వవ్యాపకుడు అంటే, దీనికి కంటే అవతల ఎల్లలు లేవు ఇక. ఎంతమేరకు చెబితే అంతమేరకు వ్యాపించి ఉన్నది. సర్వము గురించి చెబితే అంత మేరకు వ్యాపకధర్మమును కలిగి వున్నది. అచలుడు - అంతగా వ్యాపించి ఉండటం చేత, కదలడానికే అవకాశం లేనంత స్థితి వరకూ వ్యాపించడం చేత అది (ఆత్మ) కదలికే లేకుండా ఉంది. ఇది అచలము. అంతటా ఎల్లప్పుడూ ఉన్నది. ‘ఉండుట' అన్నది మాత్రమే కలిగియున్నది. అందుచేత అనిత్యములైనటువంటి శరీరములందు నిత్యుడై ఉన్నది. శరీరము అనిత్యమే కానీ, ఆత్మ నిత్యము. ఆత్మ అనే ఆధారమే లేకుండా శరీరము అనేటటువంటిది ఉండే అవకాశమే లేదు. శరీరము - అనునది ఉన్నట్లుగా తోచినప్పటికి, అది ఆత్మ అనే దానియందు అంశీభూతమై యున్నది.

****



No comments:

Post a Comment