Saturday 30 October 2021

ఈ రోజు (7) కధలు (1-07)





ముచ్చటగా మూడు కధలు చదవండి చదవమని చెప్పండి 


1. *అహం బ్రహ్మాస్మి’ 2. * మహాభారతం లో ధర్మబోధ ! , 3 . * పిత్రార్జితం - మంచితనం,
4. శ్రీ మద్రామాయణ కల్పవృక్షం పద్యాలు, 05. ఐశ్వర్య దీపం అంటే ఏంటి ? ఎలా పెట్టాలి? 06.సప్త జ్ఞాన భూమికలు...... 07. కృషిఫలం 08. *ఒక గడిలో ఒక గింజ

*అహం బ్రహ్మాస్మి’ 

ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం...

– వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.

– అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు...

– జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు...

– భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

– జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. 
నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

– అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

– వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. 
వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

– ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు?
 అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను,
 అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. 
అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు.
 నిన్ను నీలోనే దర్శించుకుంటావు. 

అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే!

--(())--

2. మహాభారతం లో ధర్మబోధ ! 
"పూర్వం జాబలి అనే ముని వుండేవాడు. అతడు నిష్ఠగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తిమీద పిచికలు గూడు కట్టుకుని,గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి. జాబలి దయార్ద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమెయ్యకుండా తన నెత్తిమీద అలాగే ఉంచుకున్నాడు. 

'ఆహా! నాకున్న ధర్మనిష్ఠ ఇంకెవరికైనా వుందా!' అనుకుంటూ తననితానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ 'నీకెంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు. అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు' అంది. 

"జాబలికి అసూయ కలిగింది. ఆ తులాధారుడెవరో చూడాలనుకుని విసవిస బయలుదేరాడు. వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు. 
'అయ్యా వచ్చావా! రా! పిచికలు నెత్తిమీద గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా తిరుగుతున్నా చిత్తవికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగరా! ఎంత గొప్పవాడివి నువ్వు!!" అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు. 
జాబలి ఆశ్చర్యపోయాడు. 
'ఈ సంగతి నీకెలా తెలిసింది?' అని అడిగాడు. 

'మహర్షీ! నాకు దేనిమీదా, ఎవరిమీదా మమకారం లేదు. ధర్మమార్గంలో సంచరించడ మొక్కటే నాకు తెలుసు. ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందుచేత నా మనస్సు దేనికీ ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా వుంటుంది. అందువల్లే నీ గొప్పతనం తెలుసుకోగలిగాను' అన్నాడు తులాధారుడు. 
'అయితే నేను ధర్మమార్గాన నడవడం లేదంటావా? నా తపస్సూ, యజ్ఞాలు ధర్మాలూ కావంటావా?' అన్నాడు జాబలి కొంచెం కోపంగా. 

'అహంకారంతో చేసే తపస్సునీ, ఫలం కోరి చేసే యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దానివల్ల దేవతలూ, మనమూ కూడా తృప్తి పొందుతాము' అన్నాడు తులాధారుడు. 
'మరైతే నువ్వీ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు? ధనాశ కాదా ఇది?' అని అడిగాడు జాబలి. 
'అయ్యా! కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు. అయినా మనిద్దరికీ వాదం ఎందుకు! నేను చెప్పినదంతా సత్యమో కాదో అడుగుదాం - ఇన్నాళ్ళూ నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచికలను పిలు' అన్నాడు తులాధారుడు. 
పిలిచాడు జాబలి. 

"అవి ముని కేశపాశంలో నుంచి రివ్వున ఎగిరి ఆకాశమార్గాన నిలబడి 'మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞవల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది. అందుచేత స్పర్ధ మాని శ్రద్ధగా అవలంబించాలి. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞాలూ వ్యర్థం. శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయిన ఫరవాలేదు. శ్రద్ధ లేకూండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం. శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది. అందువల్ల మేలు కలుగుతుంది. సర్వ సుఖాలూ చేకూరుతాయి ' అని వివరించి మాయమయ్యాయి. 
'అయ్యా! మునుల నుంచి తత్త్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకీ అసూయ కలిగింది. ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చెయ్యటం మంచిదని నీ నుంచి గ్రహించాను. కాని వాటివల్ల ప్రయోజనం ఆశించకూడదు. అదీ నీ నుంచే తెలుసుకున్నాను. వెళ్ళొస్తాను' అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. 

"ధర్మరాజా! ఆచార ధర్మాలు అలాంటివి. సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఈ శరీరం యావత్తు మహాపట్టణం. దానికి బుద్ధి రాణి. సర్వ విషయాలూ చర్చించే మనస్సు మంత్రి. విషయాలు అయుదూ పురోహితులు. చెవి, ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం, తమోగుణం అనే మోసగాళ్ళున్నారు. మనస్సు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారినపడి చెడిపోతుంది. మనస్సు, బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది. శాశ్వత సౌఖ్యం లభిస్తుంది" అని చెప్పాడు వేదవ్యాసుడు. 

"మహర్షీ! కార్యసమీక్ష త్వరగా చెయ్యడం మంచిదా? నిదానంగా చెయ్యడం మంచిదా?" అని అడిగాడు ధర్మరాజు. 
"కార్యవిచారం చెయ్యడంలో తొందర ఎప్పుడూ పనికిరాదు" అని చెబుతూ ఒక కథ చెప్పాడు వ్యాసుడు. 
"మేధాతిథి అనే మునికి చిరకారి అనే కొడుకుండేవాడు. అతడు ప్రతి పనీ బాగా ఆలోచించి చేసేవాడు. యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది. ఆమెను చంపెయ్యమని చిరకారిని ఆదేశించి వెళ్ళిపోయాడాయన. 


'నవమాసాలు మోసే కన్నతల్లి కంటే ఈ భూమి మీద ఎక్కువ ఏదీ లేదు. తల్లి దైవమంటారు. ఆమెను చంపటం కంటే పాపం వుందా! కాని తండ్రి ఆజ్ఞ మీరకూడదంటారు. ఏంచెయ్యను? ఇద్దరిమీదా గౌరవం వున్నవాడనే నేను!' అనుకుంటూ చిరకారి చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది. ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకుని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడోనని విచారపడుతూ, తన కొడుకు అలా చెయ్యడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాతిథి. తండ్రిని చూస్తూనే చిరికారి చేతిలో వున్న కత్తి కిందపడేసి అతని కాళ్ళమీద పడ్డాడు. భార్య వచ్చి నమస్కరించింది. కన్నీటితో ముని భార్యాతనయుల్ని గుండెకు హత్తుకున్నాడు. కొడుకును మెచ్చుకుని దీవించాడు. 

"ధర్మరాజా!కార్యవిచారం చాలా ధైర్యంగా, జాగ్రత్తగా చెయ్యాలి. తొందరపడి ఏ పని చేసినా చివరకు పశ్చాతాప పడవలసి వస్తుంది" అని ముగించాడు వ్యాసమహర్షి

--(())--

3. పిత్రార్జితం - మంచితనం🌹

💥 గుండెను కదిలించే ఒక కథ💥

‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’

వినోద్‌ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది. అయితే తన ప్రార్థన ఫలించలేదు. భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.

‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్‌.

విజయ్‌ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది. ‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.

విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్‌ తీశాడు. తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు. బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.

భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది. ‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా... ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.

తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.
‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్‌ తల్లితో.

‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.

‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా? 

మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్‌.

‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.

‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్‌ విసుగ్గా.

‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్‌ అడిగాడు.

‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.

‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.

‘‘మీ చదువుల కోసం’’.

‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్‌ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.

‘‘కావచ్చు. ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు. మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్‌ చదివించారు. మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు? మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం. కానీ మీకా ఆలోచన లేకపోయింది. మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు. 

ఆ అప్పు అలాగే నిలిచిపోయింది. 

అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.

‘‘ఇంకా ఎంత కట్టాలట?’’ 

విజయ్‌ అడిగాడు.

‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్‌.

‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్‌.

పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.

‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.

‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్‌’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్‌. సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.

ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది. ‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.

*   *   *

ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది. ఏడు గంటలు చూపిస్తూంది. ‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది. ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.

‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.

తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్‌ అవసరంలేదనీ పాలవాడితో విజయ్‌ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది. ‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.

షాపు నుంచి పాలప్యాకెట్‌ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది. ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు. తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది. ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది. ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది. కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి. ఆమెకు ప్రాణం లేచివచ్చింది.

‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు. ‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది. కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది. తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు. అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.

అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.

సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.

‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్‌. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్‌ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్‌ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్‌ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్‌. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్‌ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు. సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.

‘‘అమ్మా, మీ పెన్షన్‌ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు. ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.

రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే. మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే. వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు? ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?

ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు. మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు. ఆయన వాటిని పాటించి చూపించారు కూడా. తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు. తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు. అవన్నీ పిల్లలు గమనించారు కూడా. మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.

వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు. 

‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు. సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు. దుబారా ఖర్చులు చేసేవారు కారు. రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు. తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి. వీటిలో చాలా వస్తువులు స్టేటస్‌ సింబల్‌గా మారిపొయ్యాయి. అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు. పైగా ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్‌ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు. కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు. వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి. ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు. ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.

*     *     *

వారంరోజులు గడచిపోయాయి. సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్‌ లేవు. ఫోన్‌ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది. 

ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.

‘‘నా పేరు శ్రావణ్‌. బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.

‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.

‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్‌ లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.

‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్‌ మొన్న శాంక్షన్‌ అయింది. ఈనెల పెన్షన్‌ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.

‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్‌ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్‌ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.

*   *   *

సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది. కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు. ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది. త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.

సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.

‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.

‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.

సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది. ‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.

‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.

*   *   *

ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు. ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి. మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.

ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్‌.

అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.

తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు. 
ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.

ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్‌ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది. ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు. కానీ ఆయన తీరే వేరు. ‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు. కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.

ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. మా నాన్న గెజిటెడ్‌ ఆఫీసరు. లంచాలు బాగా తినేవాడు. ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. మాకు చదువు తలకెక్కేది కాదు. ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి. వాళ్ళింకా జీవితంలో స్థిరపడలేదు. నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి వాళ్ళను నేను పోషించాలంటారు. ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు.

మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది. అందుకే మీ ఇల్లు కొని ఇందులో చేరితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ. చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్‌ హౌస్‌’. ‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి. కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను’’ అన్నాడు రామారావు.

*    *   *

రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు. రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి. తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది. పశ్చాత్తాపం మొదలైంది.

రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెళ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. రామయ్య, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది. అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.

వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్‌ ‘గుడ్‌నెస్‌ ఈజ్‌ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ విచ్‌ నెవర్‌ ఫెయిల్స్‌ టు ఎర్న్‌ డివిడెండ్స్‌’ గుర్తొచ్చింది.

‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

విజయ్‌ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్‌. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.

*****

* రెండేళ్ళ నాడు, సంచిక పత్రిక కోసం శ్రీ మద్రామాయణ కల్పవృక్షం పద్యాలు కొన్నిటిని చింతన చేసే ప్రయత్నం.   వాటిలోంచి కొంత. 
***
పురాతనపు పాము  పానుపు గా, వందారే మౌనుల నడుమ   మైమరచి పవ్వళించేవాడు
వేదాలకు చిట్ట చివరన   రాక్షసులను పారద్రోలే కటారి. (ఎత్తుకుపోకుండా సరిహద్దుల ని కాపు కాస్తాడన్నమాట. )
ప్రాచీనమైన మఱ్ఱి చెట్టు కింద వృద్ధులైన మునులచేత పాఠాలు చదివించే కుఱ్ఱవాడు   
పాలకడలి అలల పైన వెల్లకిలా తేలుతూ తన కాలి బొటనవేలును  చీకే శిశువు
పచ్చనై పండి గాలికి రాలిపడిన నలుసు – నీవారపు ముల్లు అంత వెలుగు.
స్థూలమై సమీపించి సూక్ష్మమైపోయి రాజు చేతి పాయసం లో ప్రవేశించాడు.
విష్ణు మూర్తిని విధ విధాల వయస్సు లలో వర్ణించటం చమత్కారం.  అందులో ఒక వరుస పాటించకపోవటం మరొకటి. 
సీ.
ముది పృదాకువు సెజ్జ మునులు జోదిళ్ళీయ హాళి మై కూర్కు సుమాళి ఒకడు
ప్రామిన్కు చిట్ట చివళ్ళలో అసురుల దోరించునట్టి కటారి ఒకడు
ప్రామఱ్ఱి క్రీనీడ పాఠమ్ము ముసలులౌ మునులచే చదివించు పోరడొకడు
పాలవెల్లి కరళ్ళపై వెలికింతలై కాలి వ్రేల్చీకేడు కందొకండు.
గీ.
పసిమియై గాలికి రాలిపడిన ఒక్క
నలుసు నివ్వరి ముల్లైన వెలుగొకండు
స్థూలమై వచ్చి వచ్చి సూక్ష్మమగుచు
జనపతి కరస్థమగు పాయసమున చొచ్చె.

[పృదాకువు: పాము జోదిళ్ళు: నమస్కారాలు హాళి: ఆనందము, ఉత్సాహము సుమాళము: పారవశ్యము , సుమాళి : పరవశించినవాడు ప్రామిన్కు: వేదము నివ్వరి ముల్లు: పరమాత్మను నీవార ధాన్యపు ముల్లు [నీవార శూకము] అంత సూక్ష్మమైనవాడుగా చెబుతారు.]
***
క్షీరసాగరతరంగాలో, మహాలక్ష్మీ వక్షస్థలమో, ఆదిశేషుడి దేహమో  – తూగే శయ్య …
చల్లని వెన్నెలల జాలో, వ్యాపించే ఎండల వాలో, భగ్గుమనే మంటల డాలో – చూపుల కాంతి..
వేదాల చివరలో, విస్తృత మైన సృష్టికి  మొదళ్ళో, అచ్చమైన జ్ఞానలహరులో – నిజ స్వరూపం..
దేవతల మీది మక్కువా,  దైత్యులకు  గారడీ నా , పూనుకొన్న లీలాహేలా –  రాక కు కారణం  …
వైకుంఠం లోనా, మౌనీంద్ర హృదయాలా  దహరాకాశమా , నివాసం ? 
( ' తన ' దహరాకాశం అనటం  అవసరమా అనిపిస్తుంది గాని చాలా నిర్దిష్టంగా  చెప్పటం అయి ఉండాలి, అద్వైతి కనుక.   ) 
 చిత్ ను, ఆనందాన్ని మించిన సత్ – అతడు ( సత్త్వగుణరూపుడు ) - రాజు చేతి పాయసం లో ప్రవేశించాడు. 
సీ.
క్షీరాబ్ధి తరగలో శ్రీ పయోధరములో తొలిపాము పొలసులో, తూగు శయ్య
చలువ వెన్నెల చాలో మలయు ఎండలవాలొ అగ్గి మంటల డాలొ నిగ్గు చూపు
ప్రామింకుల చివళ్ళొ బహుళ సృష్టి మొదళ్ళొ అచ్చతెలివి కరళ్ళొ, అసలు మూర్తి
తెఱగంట్ల హాళికో దితిజాళి మోళికో పట్టిన కేళికో, వచ్చునటన.
గీ.
ఇల్లు వైకుంఠమందొ మౌనీంద్ర హృదయ
మందొ తన దహరాకాశమందొ ఐన
చిత్తును ఆ నందమును మించు సత్తొకండు
జనపతి కరస్థమగు పాయసమున చొచ్చె.
[తెఱగంట్లు: దేవతలు
హాళి(2) : ఆసక్తి
మోళి : గారడి
వచ్చునటన : వచ్చును + అటన,
వచ్చు నటన. 
 దహరాకాశము: హృదయ కమలంలో ఉన్న చిదాకాశం]
{బాల కాండము – ఇష్టి, అవతార ఖండాల నుంచి}

--(())--

‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్‌. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.

సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది. ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు. ‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.

      💥 సర్వేజనాసుఖినోభవంతు💥   

((()))
.. ఐశ్వర్య దీపం అంటే ఏంటి ? ఎలా పెట్టాలి? 

. ఐశ్వర్యా దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం.. ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకుందాము..


సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది, అప్పులు తీరకుండా వడ్డీ పెరిగి పోతూ ఉంటుంది, వ్యాపారం లో లాభాలు లేకుండా ఇబంధులు ఉన్నవారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టివళ్ళ సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కోత్తగా ఎదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి అభివృద్ధి కి, అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం " ఉప్పు దీపం " మంచి పరిహారం...


. ఎలా పెట్టాలి ? 


. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని పసుపుకుంకుమా రాసి నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమ తో ముగ్గు వేసి దానిపైన ప్రమిధలు ఒకదాని పైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైనపసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిధలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపుకుంకుమా పూలు పెట్టి ప్రమిధలో నూనె కానీ నైయి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి..దీపం శ్లోకం చదువుకోవాలి...


పళ్ళు కానీ, పాలు పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి , లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి. 


. కనకధార స్త్రోత్రం కూడా చదివితే మంచిది. 


శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధలు లో ని ఉప్పు మటుకు తీసి నీటిలో కలిపి ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి అవకారం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు, ప్రమిధలు మార్చాల్సిన పని లేదు ప్రతి వారం అవి వాడుకోవచ్చు ,


ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి...అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకోని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది..41 శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి.. 


కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం...(ఈ తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న షిన్క్ లో కూడా నీటిలో కలిపి పోయవచ్చు సౌకర్యం లేని వారికి).. ఇది ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు..  

(((*)))

సప్త జ్ఞాన భూమికలు.....

సూర్యుడి నుండి వచ్చే ఏడు కిరణాలు ను సప్త జ్ఞాన భూమికలు అంటారు...

జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటిని సప్త జ్ఞాన భూమికలు అంటాం...


1) శుభేచ్ఛ, 2) విచారణ,  3) తనుమానసం, 4) సత్త్వాపత్తి , 5) అసంసక్తి

6) పదార్ధభావని, 7) తురీయం ..అన్నవే సప్త జ్ఞాన భూమికలు.


1) శుభేచ్ఛ... నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.

2) విచారణ...  బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి.. అన్న మీమాంస "బ్రహ్మజ్ఞాన" ప్రాప్తి విధానమే.. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం.

3) తనుమానసం... ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే "తనుమానసం"

4) సత్త్వాపత్తి... శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే...

      "తమోగుణం" అంటే సోమరితనం,   "రజోగుణం" అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం.

ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి.

5) అసంసక్తి... దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం, రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.

6) పదార్ధభావని... అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.

7) తురీయం... ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే "బుద్ధుడు" అంటాం. ఇదే "సహస్రదళకమలం".

ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా "సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది". ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.

 "తురీయం" అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం. అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి.

(((*)))

 కృషిఫలం

ప్రతి వ్యక్తికీ ఓ జీవితం ఉంటుంది. ఆ జీవితానికి ఓ చరిత్ర ఉంటుంది. గొప్పవారి చరితలు దిగ్‌ దిగంతాలకు విస్తరిస్తాయి. సామాన్యుల జీవిత కథలు వారి మనోఫలకం పైనే సమాధి అవుతాయి. ‘స్వయం కృషి’తో నొసటి రాతను సైతం మార్చుకోవచ్చు అన్న బృహత్‌ సందేశం మహాత్ముల చరితలు చదివినపుడు మనకు అందివస్తుంది. ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే అతడి బాహ్యస్వరూపం సరిపోదు. అతడి జీవితాన్ని కూలంకషంగా పరిశీలించినపుడే అతడు నిజంగా ‘ఏమిటో’ మనకు తెలుస్తుంది.

‘కృషి’ అనే పదానికి మరో అర్థం ‘వ్యవసాయం’. రైతు విత్తనాన్ని విత్తే ముందు భూమిని వ్యవసాయయోగ్యం చేస్తాడు. ఆపైన భూమికి నీరు కావాలి. కృషితో నీటిని సమీకరించుకున్నాక భూమిలో విత్తనాన్ని వెద పెట్టి మొలక కోసం నిరీక్షిస్తాడు. ఆపైన అనుకూల వాతావరణం ఏర్పడినపుడు విత్తు మొలకై అంకురిస్తుంది. కృషి ఉంటే సాధించలేనిది లేదన్న మాట సత్యమే అయినా భూతలం సస్యశ్యామలం కావడానికి భగవత్‌ కృప సైతం తోడవ్వాలి. అప్పుడే గొప్ప ఫలితాలు అంది వస్తాయి.

07. కృషిఫలం 08. *ఒక గడిలో ఒక గింజ

జీవితంలో విజయాన్ని చవిచూసిన వ్యక్తులు ఊరకే ఆ విజయాన్ని పొంది ఉండరు. వారి విజయం వెనక కష్టపడి సాధించడం అనే బృహత్‌ ప్రయత్నం గుప్తంగా దాగి ఉంటుంది. కొన్నిసార్లు గొప్పవారి అనుభవాలు మన విజయానికి తోడ్పడతాయి. చాల సందర్భాల్లో మనకు సైతం మనోవికాసానికి తోడ్పడే కొన్ని అనుభవాలు కలుగుతాయి. ‘నీవు దేనికోసం కష్టపడతావో నీకు అదే లభిస్తుంది’ అన్నది ఆర్యోక్తి. కష్టపడకుండా ఓ కార్యాన్ని సాధించాలనుకోవడం అత్యాశే అవుతుంది తప్ప ఫలితం ఏ మాత్రం ఆశాజనకంగా ఉండదు. పని చేసేటప్పుడు కొందరు ఎంతో శ్రమపడతారు. విజయం సాధించాకనే వారి పరిశ్రమ గణనకు వస్తుంది.

కొందరు అజేయులను సమాజం అదృష్టవంతులంటుంది. వారి అదృష్టం వెనక అపరిమితమైన కఠిన శ్రమ దాగి ఉండవచ్చు. అదృష్టం వల్ల ఓ వ్యక్తి డబ్బు సంపాదించవచ్చునేమో గానీ అజేయుడు కాలేడు.

కొన్ని మూఢనమ్మకాలతో మనిషి జీవిస్తాడు. అవే మానవ జీవితాలను శాసిస్తాయి. వాటి ప్రభావంలో పడి మనిషి శక్తిహీనుడవుతాడు. ఏనుగు శైశవ దశలో ఉన్నప్పుడు దాని ముందుకాలును ఓ సన్నని తాడుతో బంధిస్తారు. పెద్దయ్యాక ఏనుగు ఆ చిన్న బంధనాన్ని తెంచుకొని విముక్తురాలు కాలేదా?  నిజమేమంటే బాల్యదశలో బంధించిన తాడునే ఏనుగు తనను ఎల్లప్పుడూ కట్టి ఉంచగల బంధనంగా భావిస్తుంది. ఎదిగాక సైతం దాని దృక్పథంలో మార్పురాదు. అందుకే జీవితాంతం మావటివాడికి లొంగి ఉంటుంది.

గొప్పవారు చాలామంది చిరుప్రాయంలో సాధారణ వ్యక్తులే! వారి అచంచల కృషి వారిని అంతటి వారిని చేసింది. అనుభవశూన్యులైనా చిరుప్రాయంలోనే మహత్తర విజయాలు సాధించిన వారికి దైవకృప తోడై ఉంటుందని గ్రహించాలి. మనిషి తమ శక్తిని తాను నమ్ముకోవడంలో సకల ప్రయోజనం ఇమిడి ఉందని గ్రహించి అడుగులు ముందుకు వెయ్యాలి.

(((*)))

*ఒక గడిలో ఒక గింజ 

చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.

ఆ పండితుడు రాజుకు  ఒక ఘనపనస చదివి ఆశీర్వదించాడు.

అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు! చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు!     అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.

రాజు గారు “ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం!” అన్నాడు.     కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగాచెప్పుకోవచ్చు"  

అంటూ సున్నితంగా తిరస్కరించాడు.

"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేరుస్తాను. చెప్పు!" అన్నాడు రాజుగారు.

“మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!

ఒక గడిలో ఒక గింజ -

రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -

మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -

నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -

.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు “సరే !” అని ఆ పని మంత్రికి పురమాయించాడు.

ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో    రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..

‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..”

“అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. “

“ఎందుచేత..?” అన్నాడు రాజుగారు.

“లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!”

“ఎందుకు..?” ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు.

“ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా !  అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.”

“అలాగా.. ఏమిటా పద్యం..?”

“ఇదుగో.. వినండి మహారాజా !”

“శర శశి షట్క చంద్ర శర   సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

ధర గగనాబ్ధి వేద గిరి     తర్క పయోనిధి పద్మజాస్య కుం     

జర తుహినాంశు సంఖ్యకు ని  జంబగు తచ్చతురంగ గేహ వి      

స్తర మగు రెట్టికగు   సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్”

పద్యం విన్న మహారాజు “దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..”

“అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..”

“సరే… సరే.. విప్పి చెప్పు..”

 “ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..”

ఈ పద్యంలో

శర, సాయక, -  అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి. 

గగన, వియత్ - 0

(ఆకాశం గగనం శూన్యం)

శశి, చంద్ర, తుహినాంశు -1 

(చంద్రుడొకడే భూమికి )

షట్కము - 6 

రంధ్ర - 9  

(నవరంధ్రాలు)

నగ, గిరి, భూధర - 7 

అగ్ని - 3 

(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని,ఆహవనీయాగ్ని)

అబ్ధి, పయోనిధి - 4 

వేద -4

(చతుర్వేదములు)

తర్క - 6

( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)

పద్మజాస్య - 4 

(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)

కుంజర - 8

(అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’

శర శశి షట్క చంద్ర శర

5     1     6         1    5

            సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

                  5       9       0         7  3

ధర గగనాబ్ధి వేద గిరి

  7     0  4      4    7

            తర్క పయోనిధి పద్మజాస్య కుం

               6         4           4     

జర తుహినాంశు సంఖ్యకు ని

8       1

            జంబగు తచ్చతురంగ గేహ వి

స్తర మగు రెట్టికగు   సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

అంకెలు లెక్కించేటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -

కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.

1,84,46,74,40,73,70,95,51,615

ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615.

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం. ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,

ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,

4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..

పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.

పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే

సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సంవత్సరాలు..

అదీ సంగతి…!

వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…

నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు, ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ గణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు. 

ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవాలో ఆ పండితున్నే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు.

ఆ పండితుడు "రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా ఆవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.✍️


                      🌷🙏🌷


Friday 29 October 2021

***-జీవన రసాయనం***



*🧘‍♂️1-జీవన రసాయనం🧘‍♀️*

*1. ఇదే జన్మలో మోక్షం సాధించాలనుకొనే వ్యక్తి ఈ జన్మలోనే వేల సంవత్సరాల పని చేయాలి. ఈ యుగ వేగాన్ని దాటి ఎంతో ముందుకు వెళ్ళాలి. కలలో కనిపించిన మానావమానాలు, మంచీ-చెడులు, నీదీ-నాదీ అనే భావాలు నిద్ర నుండి మేల్కొన్న తరువాత ఎలా అసత్యమవుతాయో, ఈ ప్రాపంచిక జగత్తు కూడా అంతే ! ఇలా భావించుకొంటే చాలు, వేల సంవత్సరాల పని పూర్తయినట్లే. ఈ మాటను మన హృదయంలో దృఢంగా నాటుకునేలా చెప్పగల మహాపురుషుడు ఎవరయినా తారసపడితే వేల సంవత్సరాల సంస్కారాలు, నీదీ-నాదీ అనే భ్రమలు రెండు క్షణాల్లో పటా పంచలైపోతాయి.*

*2. నిజస్వరూపానికి భక్తుడిగా మారితే ఆజన్మాంతం ఉండే జీవనోపాధి; స్త్రీ చర్చలు, శతృస్మరణ వంటి కష్టాలన్నీ తొలగిపోతాయి.*

*ఉదరచింతా ప్రియచర్చా విరహి కో జేసే ఖలే ౹*

*నిజ స్వరూప్‌ మే నిష్ఠా హో తో యే సభీ సహజ్‌ మే టలే ౹౹*

*ఉదర చింత, ప్రియురాలి చర్చ ఇవన్నీ బాధాకరం. నీ నిజస్వరూపం తెలుసుకొన్నావంటే చాలు, ఇక ఈ జగత్తు మొత్తం సుఖమయం.*

*3. నిన్ను నువ్వు ఇతరుల దృష్టితో చూసుకొని బాధపడటమే సకల దుఃఖాలకు మూలకారణం. ఇతరుల దృష్టిలో బాగా కనిపించాలని కోరుకోవడమే మనం సాంఘికంగా చేసేటటువంటి తప్పు.*

*4. జనులు ఎందుకు దుఃఖిస్తున్నారు? ఎందుకంటే అజ్ఞానం కారణంగా వారు తమ సత్య స్వరూపమును మరిచిపోయారు, ఇతరులు తమను గురించి ఎలా భావిస్తారో అలానే తాము అని భావించుకొంటున్నారు. ఆత్మ సాక్షాత్కారం అవ్వనంత వరకు ఈ దుఃఖం దూరం కాదు.*

*5. శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక పరమైన బాధలు అన్నీ వేదాంత అనుభవం వల్ల వెంటనే దూరమైపోతాయి. ఎవరైన బ్రహ్మనిష్ఠుడైన మహాపురుషుని సాన్నిధ్యం లభించినట్లయితే  ఆ అనుభవం జ్ఞానం కష్టమేమీ కాదు.*

*6. మీ అంతర్యామి అయిన భగవంతుడిని సంతోష పెట్టేందుకు ప్రయత్నం చెయ్యండి. ప్రజలను-వాళ్ల అభిప్రాయాలను మీరు సంతృప్తి పరచలేరు. మీ ఆత్మదేవుడు మీపై ప్రసన్నమైతే చాలు, జనమంతా మీ వల్ల సంతుష్టులవుతారు.*

*7. సకల ప్రాణులలో బ్రహ్మను చూడలేకపోతే అందరికంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో, కనీసం ఆ ఒక్క వ్యక్తిలో పరమాత్మను దర్శించేందుకైనా ప్రయత్నం చెయ్యండి. బ్రహ్మానందం తొణికిసలాడుతున్న తత్త్వజ్ఞాని అగు మహాపురుషుని శరణు వేడండి. ఆయన దృష్టి పడగానే మీలో బ్రహ్మానంద అనుభూతి చిగురిస్తుంది. ఎక్స్‌రే మిషను బట్టలను, చర్మ-మాంసాలను చీల్చి ఎముకలను ఎలా ఫోటో తీయగలుగుతుందో, అలాగే జ్ఞాని యొక్క దృష్టి మీ చిత్తములోని దేహధ్యాస పొరలను చీల్చి మీలోని పరమాత్మను దర్శించగలుగుతుంది. ఆయన ద్వారా చెదిరిన ఆ అజ్ఞాన పొరలను ఛేదించడం మీకు కూడా తేలిక అవుతుంది. మీరు కూడా మీలోని భగవంతుడిని దర్శించుకోగలుగుతారు. అందుకే మీ హృదయంపై జ్ఞాని అయిన మహాపురుషుని దృష్టి పడనివ్వండి. రెప్పవాల్చకుండా శాంత ఆహాభావాలతో ఆయన ఎదుట కూర్చుని ఉంటే మీ చిత్తంపై ఆయన దృష్టి పడుతుంది.*

*8. సముద్రంలో చేపలు ఉన్నట్లుగా, ఆకాశంలో పక్షులు ఉన్నట్లుగా మీరు జ్ఞానరూప ప్రకాశ పుంజంలోనే ఉండండి. ప్రకాశంలో సంచరిస్తూ, నడుస్తూ ప్రకాశంలోనే నివాసం ఉండండి. ఇక అప్పుడు చూడండి! జీవితం ఎంత ఆనందమయమో!*

*9. ఓ తుఫానూ! లే. భయంకరమైన గాలి-వాన సాగించు. ఓ ఆనంద మహాసాగరమా! భూమి ఆకాశాలను చీలదీసి ఏకం చెయ్యి. ఓ మానవా! నీలోని ఆలోచనలు, చింతలు చిన్నాభిన్నం అయిపోయేట్లుగా ఆ మహా సాగరంలో లోతైన మునక వెయ్యి. నీ హృదయంలోని ద్వైతభావాన్ని బయటకు త్రోసివెయ్యి. నీలోని సంకీర్ణపు గోడలను సమూలంగా నేలమట్టం చెయ్యి. అప్పుడే ఆనందసాగరం నీ ఎదుట సాక్షాత్కారిస్తుంది. ఓ ప్రేమ మాధుర్యమా! ఆత్మధ్యాన మధూజలమా! నీవు మాపై ప్రసరించి, నీలో మమ్మల్ని ముంచి వెయ్యి. ఆలస్యం చెయ్యడం వలన లాభమేమి? నా మనస్సు ఇక ఒక్క క్షణం కూడా ఈ ప్రాపంచిక విషయాలలో నిమగ్నం కాలేదు. అందుకే నీ మనస్సును ఆ పరమాత్మలో లీనం చెయ్యి. స్వపరభేదాలకు నిప్పు పెట్టు. ఆశలు, ఆకాంక్షలను అవతల పారవేయుము. ద్వైత భావాన్ని సమూలంగా పెకలించు. నుసి నుసి చేసి గాలిలో కలిపి వేసేయి. ఆహారం దొరకదా? ఫరవాలేదు. ఆశ్రయం లభించదా? నష్టంలేదు. ఆ దివ్య ప్రేమ లభించితే చాలు. దానికై పడే తపన చాలు.*

*వేదము, పురాణాలు, కాదు, సత్యభోద చెయ్యండి ఎవరైనా!*

  *ప్రేమ భిక్ష పెట్టండి ఎవరైనా సరే !*

  *ఉచ్ఛ,నీచ (తక్కువ ఎక్కువ తారతమ్యాలు) భేదములు,*

  *జాతీయత విద్వేషాలు,*

  *గుడి, మసీదుల పోరాటాలు*

  *పూజలలో భేదాలు*

  *ఇవేమీ లేని చోటికి పదండి.*

 *సత్యసారమే జీవితము.*

 *ప్రేమసారమే మూలము. ఆ చోటికి నావను నడిపించుకు పొండి.*

*10. స్వప్నావస్థలో కలగనేవాడు, ఒంటరిగానే వుంటాడు. కానీ తన కల్పనతో పులులను, సింహాలను, గొర్రెలను, మేకలను, నదులను, నగరాలను, తోటలను, ఇలా సమస్త సృష్టినీ నిర్మించుకొంటాడు. ఆ లోకంలో తనే వాటిని చూసి భయపడతాడు. కల అని తెలియక పోవడం వల్ల దుఃఖిస్తాడు. కానీ, కలలోంచి మేల్కొన్న తర్వాత నిజానికి తాను తప్ప ఎవరూ లేరని గ్రహిస్తాడు. ఇదంతా తన కల్పనే అని గ్రహిస్తాడు. ఇదే విధంగా ఈ ప్రాపంచిక జగత్తు కూడా పరమాత్మ సృష్టి మాత్రమే, వాస్తవం కాదు. జీవుడు తన ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తే అతనిలోని సమస్త దుఃఖ దారిద్య్రము క్షణంలో నశించి పోతుంది.*

((()))

*🧘‍♂️2-జీవన రసాయనం🧘‍♀️*

*11. స్వర్గ సామ్రాజ్యం మీలోనే ఉంది. పుస్తకాల్లో, గుళ్ళూ, పర్వతాలు, అరణ్యాలు, తీర్థస్థానాల్లో ఆనందం కోసం వెతకడం వ్యర్థం. వెతకాలని ఉంటే మీలోని ఆత్మానంద ఖజానాన్ని తెరవగలిగే మహాపురుషుడిని వెతకండి.*

*12. నీ అంతర్గత అంధకారాన్ని మీ అంతట మీరే తొలగించుకోనంత వరకు ముప్పై మూడు కోట్లమంది దేవతలు అవతరించినా మీకు ఎటువంటి ప్రయోజనమూ లభించదు.*

*13. శరీరము ఆత్మ యొక్క వస్త్రం మాత్రమే. తొడుక్కునే వాణ్ణి వదలి వస్త్రాన్ని ప్రేమించకండి.*

*14. ప్రాపంచిక వస్తువులలో సుఖాన్ని వెతకవద్దు. స్వాధీనులు కండి. వాస్తవాన్ని తెలుసుకోండి. ఆ క్షణం నుంచి మీరు భగవంతుడి వద్దకు వెళ్ళనవసరం లేదు. భగవంతుడే మీ దగ్గరికి వస్తాడు. ఇది దైవ విధానము.*

*15. క్రోధ స్వభావం గలవారు మిమ్మల్ని శపించినా సరే, మీ సంయమనం కోల్పోవద్దు. ఏమీ మాట్లాడవద్దు. అప్పుడు వాళ్లు ఇచ్చిన శాపం ఆశీర్వచనంగా మారిపోతుంది.*

*16. మనం ఈశ్వర విముఖులమైతే మనకెవరూ దారి చూపించరు. ఘోరమైన కష్టాలు పడాలి. దైవంతో లీనమైయుంటే మంచి ప్రవృత్తి, మంచి ఆలోచనలు వాటంతట అవే మీ మనస్సులో కలుగుతాయి.*

*17. మనిషి భౌతిక చింతలలో నిమగ్నమై వాంఛా భూతానికి దాసుడిగా ఉన్నంతకాలం, బుద్ధి తన అద్భుతాన్ని చూపించలేదు. సంకెళ్ళల్లో బంధింపబడిన బుద్ధి అటూ ఇటూ కదలలేదు. వాంఛలు, కోరికలు, చింతలు నశించిన అనంతరమే బుద్ధికి వికసించేందుకు స్వేచ్ఛ లభిస్తుంది. పాంచభౌతిక బంధనాలు తెగినప్పుడే ఆత్మ తన పూర్ణకాంతితో ప్రకాశిస్తుంది.*

*18. శిక్ష పడుతుందనే భయంతో తల్లడిల్లే ఓ అపరాధీ! న్యాయమూర్తి నీ శిక్ష కోసం తీర్పు రాయడానికి పెన్ను పట్టుకున్న ఆ ఒక్క క్షణమైనా సరే ఆ పరమాత్మను తలుచుకుంటే చాలు. న్యాయమూర్తి తన తీర్పు మార్చుకుని పరమాత్మ నీకు అనుకూలమయ్యే విధంగా మార్చి రాస్తాడు.*

*19. పవిత్రత, నిజాయితీ, విశ్వాసం, మంచితనం గల వ్యక్తి ప్రగతి జెండా చేత పట్టి ముందు పరిగెత్తితే ఎదురు రాగల సాహసం ఎవరి కుంటుంది? మీలో విశ్వాసం, మంచితనం, పవిత్రత, నిజాయితీ ఉన్నట్లయితే మీ చూపు లోహపు తెరను సైతం చీల్చగలుగుతుంది. మీ ఆలోచనా ఘాతాలు పర్వతాలను కూడా పొడిపొడి చేస్తుంది. ఓ జగజ్జేతలారా! పక్కకు తొలగండి, హృదయ విజేత వస్తున్నాడిదిగో.*

*20. ప్రాపంచిక ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా ఉంటే ప్రపంచమే మీకు లొంగుతుంది. ఇందులో సందేహించేవాడు మూర్ఖుడు, మందమతీ మాత్రమే!*

((())))

*🧘‍♂️3-జీవన రసాయనం🧘‍♀️*

*21. వేదాంత సిద్ధాంతమేమిటంటే మనము అసలు బంధితులము కాము. నిత్య స్వతంత్రులము. బంధింపబడ్డామనే ఆలోచన ఒక భ్రమ. ‘‘నేను అశక్తుడను... దుర్బలుడిని... బందీని’’ అని మీరు ఏనాడు అను కుంటారో, ఆనాడే మీ దౌర్భాగ్యం మొదలు, గుర్తుంచుకోండి! మీ కాలికి మీరే సంకెళ్ళు వేసారన్నమాట. అందుకే సదా స్వేచ్ఛా యుతంగా ఉండేందుకై ఆలోచన చెయ్యండి.*

*22. దారివెంట వెళుతూ కనిపించిన గొప్ప వ్యక్తి అమెరికా ప్రెసిడెంటుగా నివ్వండి, ఇంగ్లండు చక్రవర్తిగానివ్వండి, రష్యా అధినేత లేదా చైనా నియంత ఎవరైనా సరే మీలో ఎటువంటి ఈర్ష్య లేదా భయం పొక్కనీయవద్దు. వారి రాజదృష్టి  మీదేనని భావించి ‘‘వాడిని నేనే’’ అని అనుకోండి. అప్పుడు అంతా ఒక్కటే అనే భావన మీ లోనే కలుగుతుంది.*

*23. మనస్సు ఈర్ష్యా ద్వేష రహితంగా, శుద్ధంగా ఉంటే జగతిలో ఏ వస్తువు మనకు హాని చెయ్యలేదు. ఆనంద-శాంతి స్వరూపుల వంటి మహనీయుల ముందు క్రోధ స్వరూపులు సైతం కరిగిపోతారు. అట్టివారిపై మృగరాజులు, తోడేళ్ళు సైతం ప్రేమ చూపుతాయి. సర్పాలు-తేళ్ళు కూడా తమ దుష్ట స్వభావాన్ని మరిచిపోతాయి.*

*24. ‘‘ఈ విశ్వమంతా నా దేహమే’’ అనగలిగినవాడు జన్మమృత్యు చక్ర విముక్తుడి కిందనే లెక్క! అంతా వాడిదే అయినప్పుడు రావడం- పోవడం ఏమిటి? బ్రహ్మాండమంతా వాడిదే.*

*25. మోసం- అవిశ్వాసాలతో నిండిన ఈ కుటిల జగత్తు నిజానికి సదాచారీ-సత్య నిష్ఠాపరుడైన సాధకుడిని ఏమీ చేయలేదు.*

*26. ఎట్టి సందర్భంలోనూ హర్ష-శోకాదులకు వశం కావద్దు. ‘‘నేను అజరామరుడను. నాకు జన్మ- మృత్యువులు లేవు. నేను నిర్లిప్త ఆత్మను’’ అని దృఢంగా విశ్వసించి జీవించండి. ఇదే భావంతో లీనమై ఉండండి.*

*27. బాహ్య విషయాల వలన మీ మానసిక శాంతికి భంగం వాటిల్ల రాదు.*

*28. ఇంద్రియాలు విషయ సుఖాల వైపు వెళ్ళేందుకు మారాం చేస్తే కళ్లెర్ర జేసి ఆపండి. ఆత్మానందం పొందుతూ ఆత్మ చింతన సాధించిన వాడే నిజమైన ధీరుడు.*

*29. ఏ వస్తువునూ భగవంతుని కంటే విలువైనదని భావించకండి.*

*30. దేహాభిమానం త్యజించి సాక్షాత్తు భగవంతుడినే ఈ శరీరానికి కర్తగా చేసినప్పుడు బుద్ధుడు లేదా దేవునిగా మారడం అనేది ఎంత తేలికో... అంత తేలికగా మారుతుంది.*

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️4-జీవన రసాయనం🧘‍♀️*

*31. మనస్సును సేవకునిగా మిమ్మల్ని యజమానిగా భావించడమే మనస్సును వశపరచుకునేందుకు మార్గం. మన నౌకరైన మనస్సును కొన్నాళ్లు పట్టించుకోకుండా వదిలేస్తే అదే మన దారికి వస్తుంది. మనస్సులోని చంచల భావాలను మరిచి ఆ శాంత స్వభావిని ధ్యానిస్తే కొద్ది రోజుల్లోనే సాధకుడు ఆనంద స్వరూపములో నిమగ్నుడు కాగలుగుతాడు.*

*32. సమస్త ప్రపంచంలోని విజ్ఞానం, గణితం, కావ్య-కళలు, తత్త్వజ్ఞానం ఇలా అన్నీ మన ఆత్మ నుండి పుట్టినవే.*

*33. ఓ పరమాత్మ అన్వేషకుడా! నీ అన్వేషణలో ఆ పరమాత్మనే మరిచినావయ్యా! ప్రయత్న తరంగాలలో సామర్థ్య సముద్రాన్నే దాచేశావయ్యా !*

*34. పరమాత్మ శాంతికి భంగం కలిగించే సామర్థ్యం ఎవరికుంది? విూరు ఆ పరమాత్మ శాంతిలో స్థిరంగా ఉంటే ప్రపంచం మొత్తం తలక్రిందులైనా సరే విూకు అశాంతి కలిగించలేదు.*

*35. మనస్సును కల్లోల పరిచే సందర్భాలలో సైతం చిత్తాన్ని వశంలో ఉంచుకొని క్రోధ-శోకాలను అదుపు చేసుకున్నవాడే మహనీయుడు.*

*36. ఆత్మ స్వరూపంలో లీనమైన మీ స్వభావాన్ని సత్సంగ, స్వాధ్యాయం వంటి ఏ పనికైనా ఇక బయటికి తీసుకు రాకూడదు.*

*37. సుదృఢ అచంచల సంకల్పశక్తి ఎదుట కష్టాలు గాలివానలో మబ్బుల వలె ఎగిరిపోతాయి.*

*38. ‘‘బయటి ప్రపంచం ఎంత అందంగా, ముద్దుగా ఉన్నా దాన్ని మరిచిపోతే తప్ప శాంతి కలుగదు’’. అనే విషయం సుషుప్తావస్థ (గాఢనిద్ర) విూకు అనుభవంలోకి తెస్తుంది. గాఢనిద్రలో అంతా మరిచిపోతేనే ఆరుగంటలు సుషుప్తిలోకి జారుకుంటాము. జాగ్రదావస్థలో కూడా ఈ జగత్తును మరిచి పోగలిగితే ప్రాజ్ఞుల మవ్వగలము.‘ఈ భౌతిక జగత్తు మిమ్మల్ని భ్రమింపజేస్తుంది. నిజానికి ఇది క్షణక్షణం కరిగిపోయేదే’ అంటూ ఆ గాఢనిద్ర విూకు రోజూ అన్యాపదేశంగా బోధిస్తోంది. భయం వద్దు-చింతలేదు, ఈ జగతి సత్యమనే భావం పోగొట్టుకోండి.*

*39. కఠోర జ్ఞాన మార్గంపై నడిచే సమయంలో ఎదురయ్యే కష్టాలను, దుఃఖాలను సుఖాలుగానే భావించండి. ఎందుకంటే ఈ మార్గంలో కష్టాలు, దుఃఖాలు మాత్రమే నిత్యానందం అందించగలవు. ఆ సమస్యలను చూసి సాహసహీనులై నిరాశపడవద్దు. సదా ముందుకే సాగండి. విూ సత్య స్వరూపాన్ని యదార్థంగా చూసేటంత వరకు ఆగవద్దు.*

*40. కలలో సింహాన్ని చూసి అది మిమ్మల్ని మింగేస్తుందని భయపడతారు. కానీ విూకు కనిపించేది సింహం కాదు, మీ రే! సింహం మీ ఊహకాక వేరేమీ కాదు. మేలుకొన్నప్పుడు సైతం విూకు శతృవు మీరే, వేరెవరూ కాదు. భేదభావాలను మనస్సు నుండి తొలగించండి. వేరెవరో మిత్రులు, శత్రువులు ఉన్నారనుకోవడం భ్రమ మాత్రమే!*

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️5-జీవన రసాయనం🧘‍♀️*

*41. అశుభాలను ఎదుర్కోకండి. శాంతంగా ఉండండి. మీకు ఎదురైన పరిణామాలు ఎటువంటివైనా సరే అవి మీకు వ్యతిరేకంగా ఉన్నా సరే వాటిని స్వాగతించండి. అప్పుడు ఆ చెడు మంచిగా మారిపోవడాన్ని మీరే చూస్తారు.*

*42. రాత్రి నిద్రించక ముందు పక్కపై సుఖంగా, నిటారుగా కూర్చొని కనులు మూసి ముక్కుతో గాలి పీల్చి ఊపిరితిత్తులు నిండుగా నింపండి. అప్పుడు ఉచ్ఛ స్వరంతో ఓం... అనే దీర్ఘ ఉచ్ఛారణ చేయండి. పది నిముషాలు ఇలా చెయ్యండి. కొద్ది రోజులు క్రమబద్ధంగా ఇలా చేయడం వల్ల దీని మహిమ విూకు తెలుస్తుంది. రాత్రి నిద్ర సాధనగా మారుతుంది. హృదయంలో శాంతి-ఆనందాలు వర్షిస్తాయి. విూ లౌకిక నిద్ర యోగ నిద్రగా మారుతుంది.*

*43. ఓ ఇచ్ఛా, సంకల్ప, కాంక్షలారా! తొలగిపొండి, విూరు ప్రాపంచిక క్షణభంగుర సంపదలతో సంబంధం గలవారు. శరీరం ఏ స్థితిలో ఉన్నా, దానితో నాకు సంబంధం లేదు. అన్ని దేహాలు నావే.*

*44. ఎలాగో పొద్దు గడిపేందుకై శ్రామికుడిలాగా పని చేయకండి. ఆనందం కోసం అవసరమైన కసరత్తులాగానో, సుఖ-వినోదాన్నిచ్చే ఆటలాగానో రాజాలాగా పని చెయ్యండి. నీరసంగా నిస్తబ్దమైన హృదయంతో ఏ పనినీ చేపట్ట వద్దు.*

*45. సమస్త ప్రపంచాన్ని తన శరీరంగా ప్రతి మనిషినీ తన ఆత్మ స్వరూపంగా భావించే జ్ఞాని ఎవరితో విభేదిస్తాడు? వారికి దుఃఖం ఎక్కడుంటుంది?*

*46. ప్రపంచంలోని వస్తువులు సుఖాన్నిచ్చేవి గానీ, భయంకరమైనవి గానీ కావు. వాస్తవానికి నీ ఆనందం కోసమే ప్రకృతి వాటిని తయారు చేసింది. వాటిని చూసి భయపడితే లాభం ఏమిటి? విూ అమాయకత్వం మిమ్మల్ని గోతిలోకి తోసివేస్తుంది. లేదంటే మిమ్మల్ని మించగల వాడెవడు? ఈ ప్రపంచాన్ని మీ శతృవు ఎవరూ నిర్మించలేదని అంతా ఆత్మదేవుని విలాసమనీ గ్రహించండి.*

*47. సకల పాపులకు, దీన- దుఃఖితులకూ ప్రేమతో, తల్లివంటి హృదయంతో విశాల సానుభూతితో తమ ఒడిలో స్థానం కల్పించేవారు మహాత్ములు మాత్రమే.*

*48. భయపడిన ప్రాణి మాత్రమే మరొకరిని భయపెడుతుంది. భయరాహిత్యం లేకుండా అభేదభావం రాదు. అభేదభావం రాకుండా వాంఛలు అంతం కావు. వాంఛలు పోతేనే గానీ సమదృష్టి, నిర్వైరిభావం (శత్రుభావం లేకుండుటం) వంటి దివ్యగుణాలు రావు. ఇతరుల బలహీనతలను దూరం చేయజాలనిది బలమే కాదు.*

*49. ధ్యానంలో కూర్చొనే ముందుగా మీ సమస్త మానసిక చింతనను, సకల భౌతిక సంపదలను పరమాత్మ లేదా గురువు పరం చేసి శాంతించండి. దీనివల్ల ఎలాంటి హానీ జరుగదు. పరమాత్మ మీ సంపదలను, మనస్సును, దేహం- ప్రాణాలను రక్షిస్తాడు. ఈశ్వరార్పణ వల్ల నష్టం లేదు సరిగదా, దేహప్రాణులలో నవజీవన సంచారం జరుగుతుంది. దీనివల్ల మీరు అశాంతి- ఆనందాలకు నిలయమై జీవితాన్ని సార్థకపరచుకోగలరు. మీకు మీతోపాటు సకల విశ్వానికీ వాస్తవిక ఔన్నత్యం సిద్ధిస్తుంది.*

*50. ప్రకృతి ప్రసన్నచిత్తుడై పరిశ్రమించే వ్యక్తికి అన్ని రకాలుగా సాయం చేస్తుంది.*

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️6-జీవన రసాయనం🧘‍♀️*

*51. ప్రసన్నంగా ఉండడం, ముత్యాల ఖజానా కలిగి ఉండడం కంటే గొప్ప విషయం.*

*52. కోట్లాది సూర్యులు నశించనీ, అసంఖ్యాక చంద్రులు కరిగిపోనీ జ్ఞానులగు మహాపురుషులు అచంచలంగా ఉండగలరు.*

*53. భౌతిక పదార్థాలను సత్యమని భ్రమించి వాటి పట్ల ఆసక్తి ప్రదర్శించడం దుఃఖ- చింతలను ఆహ్వానించడమే. భౌతిక వస్తువులకై మీ శక్తినీ, సమయాన్ని నశింప జేసుకోవడం పాపం.*

*54. మీ వ్యక్తిత్వ సంబంధ ఆలోచనలను త్యజించినప్పుడు అంతటి శ్రేష్టమైన దశ మరొకటి ఉండబోదు.*

*55. మీకు గొప్ప హాని తలపెట్టిన వారిని దయతో చూసి, ప్రేమతో వ్యవహరించండి. వారు కూడా మీ ఆత్మస్వరూపులే.*

*56. ప్రపంచంలో ఒకటే రోగం ఉన్నది. ‘బ్రహ్మ సత్యం- జగన్మిథ్యా’ ఈ వేదాంత సత్యాన్ని భంగపరుచటయే దానికి మూల కారణం. అది ఒకసారి ఒక దుఃఖరూపం ధరిస్తే మరోసారి మరొక రూపం ధరిస్తుంది. వీటన్నింటికీ ఒక్కటే మందు. మీ వాస్తవ స్వరూపమైన బ్రహ్మత్త్వాన్ని మేల్కొల్పడమే.*

*57. ఒకసారి బుద్ధుడు ధ్యానంలో కూర్చున్నాడు. పై నుండి పర్వత శిఖరంపై నుండి, ఒక శిలాఖండం దొర్లుకుంటూ ఢీకొని పడిపోయింది. రెండు ముక్కలుగా పెద్ద శబ్దంతో చీలిపోయింది. వెంటనే ఆ రెండు భాగాలు, బుద్ధునికి రెండు వైపులుగా పడిపోయాయి. బుద్ధుడు రక్షింపబడ్డాడు. కాని ఒక చిన్న కంకరరాయి ఆయన కాలికి గుచ్చుకున్నది. కాలి నుండి కొద్దిగా నెత్తురు కారింది. అప్పుడాయన లేచి శిష్యులతో ‘‘భిక్షులారా! సంపూర్ణ సమాధి స్థితికి ఇది గొప్ప తార్కాణం. ఒకవేళ నేను పూర్తి ధ్యాన సమాధిలో ఉండకపోతే, ఆ శిలాఖండం నన్ను నుగ్గు నుగ్గు చేసేది. కానీ అలాగాక దానిలోని చిన్న పలుకురాయి మాత్రమే గుచ్చుకుంది. ఇలా అయిన ఈ చిన్నగాయం బహుశా నా ధ్యానంలో జరిగిన లోటుకు ఫలితం. సంపూర్ణంగా ధ్యానం జరిగితే, ఇది కూడా అయ్యేది కాదు’’ అని పలికాడు.*

*58. నన్ను చంపగల ఖడ్గమేది? నన్ను గాయపరచగల ఆయుధమేది? నా ప్రసన్న చిత్తాన్ని కదల్చగల ఆపద ఏది? నా సుఖాన్ని పోగొట్టే దుఃఖమేది? నా భయాలు- సంశయాలు అన్నీ నశించి విజయ సాధనారోజు దగ్గర పడింది. ఎట్టి ప్రాపంచిక తరంగమూ నా నిశ్చల చిత్తాన్ని కల్లోల పరచజాలదు. దీనివల్ల నాకు లాభమూ లేదు, నష్టమూ లేదు. శతృవుతో ద్వేషమూ లేదు. మిత్రునితో రాగమూ లేదు. మృత్యు భయమూ లేదు, నాశనమయ్యే బెరుకు లేదు, జీవితేచ్ఛ లేదు, దుఃఖ ద్వేషము లేదు. ఎందుకంటే ఇదంతా మనస్సు కల్పించేదే. మనస్సు మిథ్యా కల్పన మాత్రమే.*

*59. సంపూర్ణారోగ్యానికి యుక్తమైన చిట్కా : రోజూ ఉదయం పూట అయిదు తులసి ఆకులను నమిలి ఒక గ్లాసు నీరు త్రాగండి. కాస్త తిరిగి రండి, పరుగులెత్తండి, లేదా చేతులపై గెంతండి. స్నానాలు చేసి శాంతంగా ఆరోగ్యంగా ఏకాంతంలో కూర్చోండి. పది-పన్నెండు సార్లు గాఢశ్వాస పీల్చుకోండి. అన్ని పనులు విడిచి నిశ్చింతంగా కూర్చోండి. ఆరోగ్యాన్ని, ఆనంద-సుఖశాంతులను మీకు అందించే ఆ పవిత్ర ఆలోచనా ప్రవాహాన్ని చిత్తంలో ప్రవహించనీయండి. బలహీనతా భావాన్ని తీసివేసి మనస్సును దృఢంగా ఇలా కేంద్రీకరించండి : ‘నాలో ఆరోగ్యం, ఆనందాల అనంత ప్రవాహం పారుతోంది. నా అంతరంగంలో దివ్యామృత మహాసాగరం ప్రవహిస్తోంది. సమస్త సుఖ-సంపదలు, శక్తి, ఆరోగ్యం నాలో నెలకొని ఉన్నాయి. నేను ఆరోగ్యవంతుడిని, పూర్తి ప్రసన్నుడను. నా లోపల-బయట సర్వత్రా పరమాత్మ ప్రకాశం విస్తరించి ఉన్నది. నేను బాధారహితుడను. సకల ద్వంద్వాల నుండి విముక్తుడను. స్వర్గ సుఖాలు నాలోనే ఉన్నాయి. నా హృదయం పరమాత్మకు నివాసం. అక్కడే పరమాత్మ నివాసం. ఇక శోక-రోగాలు అక్కడ ఎలా నివాసం ఉంటాయి? నేను దేవీ-తేజో మండలంలో ప్రవేశించి ఉన్నాను. ఇది నా ఆరోగ్య క్షేత్రం. నేనే తేజోపుంజాన్ని, ఆరోగ్య అవతారాన్ని’ అని.*

*గుర్తుంచుకోండి : మీ అంతరంగంలో ఆరోగ్యం, సుఖం, ఆనందం, శాంతి పరమాత్మ పరంగా మీకు లభించి ఉన్నాయి. సంశయరహిత జీవితాన్ని గడపండి. మనస్సులోని వ్యాధికారక ఆలోచనల నుండి బయట పడండి. ప్రతి ఆలోచనా భావం, శబ్ద-కార్యాలను పరమాత్మ శక్తితో పరిపూర్ణం చేసుకోండి. ‘ఓంకారాన్ని’ ధ్యానించండి. ఉదయం-సాయంకాలాలు దీనినే స్మరించుకుంటే విశేష లాభం కలుగుతుంది. ఓం ఆనందం... ఓం శాంతి... ఓం పూర్ణ ఆరోగ్యం... ఓం... ఓం... ఓం...*

*60. భయం కేవలం అజ్ఞానానికి నీడవంటిది. దోషాలకు దేహం వంటిది. మనిషిని ధర్మమార్గం నుండి కూలద్రోసే రాక్షస మాయ వంటిది.*

((()))

*🧘‍♂️7-జీవన రసాయనం🧘‍♀️*

🔥ఓంశ్రీమాత్రే

*61. గుర్తుంచుకోండి : సమస్త ప్రపంచంలోని విలేఖరులు, విమర్శకులు ఒకటై మిమ్మల్ని నిందించినా మిమ్మల్నెవరూ ఏమీ చేయలేరు. ఓ అమర ఆత్మ స్వరూపా ! ఆరోగ్యంగా ఉండు.

*62. నిర్ధనులను, పేదవారిని, సకల ప్రపంచం ద్వేషించే వారినీ సాక్షాత్తు భగవంతునిగా ఎంచి వారికి సేవ చేయడం అనన్య భక్తికీ, ఆత్మ జ్ఞానానికీ ప్రతీక.*

*63. రోజూ ఉదయమే ఓం కారాన్ని ధ్యానించండి. ‘‘నేను ఈ శరీరం కాదు. ఈ ప్రాణులు, మిడతలు, కీటకాలు, గంధర్వులు ఇలా అందరిలోనూ నా ఆత్మయే విలసిల్లుతూ ఉన్నది. వాటి రూపంలో నేనే సంచరిస్తున్నాను’’ అనే భావం మనస్సులో ఉంచుకోండి. ప్రతిరోజూ ఇలాగే అభ్యసించండి.*

*64. ప్రేమికుడు ముందు-వెనుకలు ఆలోచించడు. అతడు ఆపదలకు భయపడడు, వర్తమాన స్థితిలో తన ప్రేమికుడి పట్ల ప్రేమను విడిచి మరోచోట విశ్రమించడు కూడాను.*

*65. బాలుడు ప్రతిబింబానికి ఆధారమైన దర్పణాన్ని విడిచి ప్రతిబింబంతోనే ఆడుకుంటాడు. పామరులు సమగ్ర స్థూల ప్రపంచానికి ఆశ్రయమిచ్చే ఆకాశాన్ని పట్టించుకోక స్థూల ప్రపంచాన్ని మాత్రమే పట్టించుకుంటారు. ఇదే విధంగా నామ రూపాలకు, స్థూల దృష్టి చేత భక్తులైన వారు తమ దౌర్భాగ్యవశాత్తు సమస్త విశ్వాధీశుడైన ఆ సచ్చిదానంద పరమాత్మను ధ్యానించకుండా ప్రపంచం వెంటే పిచ్చివాళ్ళయి తిరుగుతారు.*

*66. ఈ సంపూర్ణ ప్రపంచాన్నంతటినీ నీటి బుడగల వలె క్షణభంగురం అని గ్రహించి మీ ఆత్మలో స్థిరంగా ఉండండి. అద్వైత భావం గల వారికి శోక- మోహాలెక్కడివి ?*

*67. ఒకడు మిమ్మల్ని ‘దుర్జనుడని’ హానిని కలిగిస్తే మరొకడు సజ్జనుడు అని హానినే చేస్తాడు. ఒకడు ప్రశంసలతో మిమ్మల్ని ఉబ్బగొడితే, మరొకడు నిందించి కుచించుకు పోయేటట్లు చేస్తాడు. కానీ వాటన్నింటికీ అతీతంగా ఉండి, సకల బంధనాలను వీడి, తన పరమాత్మ తత్త్వమును ప్రకటించే వాళ్ళు తమ ఆత్మ స్వరూపమును తెలుసుకోగలుగుతారు. భగవంతునితో తన ఏకత్వాన్ని గుర్తించి సకల ప్రపంచానికి తన ఈశ్వరత్వమును అన్వయించు కొనేవాడిని జగతి భగవంతునిగా ఆమోదిస్తుంది. సకల సృష్టి అతడిని పరమాత్మగా గుర్తిస్తుంది.*

*68. ఈ భౌతిక విషయ వస్తువులన్నీ, ఇంద్రియాల భ్రాంతి తప్ప వేరుగాదు. నామ-రూపాల భౌతిక తత్త్వమును నమ్ముకొనేవాడికి సాఫల్యం సిద్ధించదు. సూక్ష్మ సిద్ధాంతం లేదా సత్యమైన ఆత్మతత్త్వమును నమ్ముకోవడమే సాఫల్యానికి సూత్రం. ఆ ఆత్మజ్ఞానం సాధిస్తే నామ- రూపాలు మననే వెతుక్కుంటూ వస్తాయి.*

*69. పదార్థాలను వెతుకుతూ, పొందుతున్న కొద్దీ వాటిని పోగొట్టుకోవడం అధికమవుతుంది. మీ కోర్కెలను, అవసరాలను తగ్గించుకున్న కొద్దీ ఆకర్షణలు మిమ్మల్ని వదిలిపెడతాయి.*

*70. ఆనందమునందే సకల జనుల సృష్టి-స్థితి-లయలు జరుగుతాయి. దీనితో ఆనంద పూర్ణత్వమును తెలుసుకోవచ్చును.*

🕉🌞🌏🌙🌟🚩

71. మనం మాట్లాడాలనుకుంటేనే గానీ మాట బయటికి రాదు. మనం చూడాలనుకుంటే తప్ప కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమీ కనబడదు. మనం తెలుసుకోవాలనుకుంటే తప్ప ఎటువంటి జ్ఞానమూ మనకు తెలియదు.  శబ్ద, దృష్టి, జ్ఞానములకు అతీతమైన ఆ బుద్ధి తత్త్వమును తెలుసుకునేవాడే నిజమైన జ్ఞాత. అతడే నిత్య సచ్చిదానంద బ్రహ్మ స్వరూపము.

72. సర్వాంగ శోభితమైన జీవితానందం కావాలంటే రేపటిని గురించి చింతించడం మానుకోండి. మీ నలుదిక్కులా జీవిత బీజాలను చల్లండి. భవిష్యత్తులో సుందర స్వప్నాలు చూసే అలవాటును పెంపొందించుకోండి. రాబోయే రోజు గొప్ప కాంతివంతంగా, మధురంగా, ఆనందమయంగా ఉంటుందనే ఆశించండి. మీరు ఈనాటి కంటే రేపు ఎక్కువ అదృష్టవంతులుగా, సృజనశీలురుగా ఉంటారనీ, జీవితం ఐశ్వర్య భరితంగా ఉంటుందనీ, విఘ్నాలు మిమ్మల్ని చూసి భయపడి పోయేంత శక్తి మీలో ఉందనీ భావించుకోండి. అప్పుడు తప్పక మీకు మేలు జరిగి, మీ సంశయాలన్నీ నశించిపోతాయి.

73. ఓ మానవా! నీ చైతన్యం చేత సకల వస్తువులను ఆకర్షణంగా చేయగలవు. నీ ప్రేమ పూర్వక దృష్టిని వాటిపై ప్రసరింపజేస్తావు. అప్పుడు నీ యొక్క ప్రకాశం వాటికి అలుముకుంటుంది. మరి... నీవే వాటి ఆకర్షణలో పడి చిక్కుకుపోతావు.

74. పరమాత్మను చేరుకోగల అనేక విచిత్ర మార్గాలను నేను అన్వేషించాను. కానీ ఆయా మార్గాలన్నీ పరమాత్మకు దూరమే అని తెలుసుకున్నాను. తరువాత బుద్ధిశక్తి, విద్యల ద్వారా పరమాత్మను అన్వేషించాను. అయినా ఆయనను కలవలేకపోయాను. పుస్తకాలు, గ్రంథాలు నా ఆలోచనల్లో గందరగోళం సృష్టించాయి. చివరికి అలసిపోయి కూర్చుండిపోయాను. ఎందుకో నాలో నేనే తొంగి చూసుకొని ధ్యానించాను. ఆ తత్త్వం నాలోనే లభించింది. నా ఆత్మ స్వరూపం విస్తారమై కనిపించింది.

75. సామాన్య మానవులకు ఆవులు, గేదెలు, రాళ్ళు సహజంగా ఎలా కనిపిస్తాయో జ్ఞానికి సైతం నిజ ఆనంద దర్శనం అంతే సహజంగా జరుగుతుంది.

🕉🌞🌏🌙🌟🚩

🧘‍♂️9-జీవన రసాయనం🧘‍♀️

76. వేదాంత అనుభవం ప్రకారం నరాధములు, శతృవులు వేరే ఎక్కడో లేరు. ఆ పవిత్ర స్వరూపమే సకల రూపాలలో శోభాయమానంగా ఉన్నది. తనకు తాను ఏ హానీ ఎవ్వరూ చేసుకోరు ! నేను గాక మరేమీ లేనప్పుడు, ఉన్నదంతా నేనే అయినప్పుడు నాకు హాని తలపెట్టేదెవరు? నాకు నేనంటే భయం కుంటుంది?

77. మనస్సు శాంతించగానే సకల భేదాలకూ కారణమైన ద్వైతభావం దూరమవుతుంది.

78. ఒకే దారంలో ఉత్తమ, మధ్యమ, కనిష్ఠ పుష్పాలు గుచ్చబడి ఉన్నట్లుగానే నా ఆత్మస్వరూపంలో కూడా ఉత్తమ, మధ్యమ, కనిష్ఠ దేహాలు ఉన్నాయి. పూలగుణం దారానికి పట్టనట్లుగానే శరీర గుణ-దోషాల ప్రభావం ఈ ఆత్మకు అంటదు. సకల పుష్పాలు నాశనమైనా దారం చక్కగా ఉన్నట్లే. ఈ దేహాలన్నీ నశించినప్పటికీ నా సర్వగతాత్మకు ఎట్టి హానీ జరుగదు.

79. ‘‘నేను నిర్మలుడను, అనంత, శుద్ధ జనన, మరణాలు లేని వాడను. నేను అసత్యమైన దేహరూపుడను కాను’’ అనే భావననే సిద్ధపురుషులు '‘జ్ఞానం'’ అంటారు.

80. ‘'నేను లేను, నాకు వేరుగా మరొకటి లేనే లేదు. సాక్షాత్తు ఆనందపూర్ణుడైన బ్రహ్మము ఒక్కటే.’' ఉద్వేగాలను విడిచిపెట్టి సతతం ఇదే ధ్యానం చెయ్యండి.

🕉🌞🌏🌙🌟🚩

🧘‍♂️10-జీవన రసాయనం🧘‍♀️

81. ‘ఇతరులకు మేలు చేయడం అంటే మనకు మనమే చేసుకొనే మేలు’ అని తెలుసుకున్న వాడికి ధర్మ స్వరూపం సాక్షాత్కరించినట్లే. అలాగే ఇతరులకు తలపెట్టే కీడు మనకు మనం చేసుకొనే కీడు మాత్రమే.

82. ఆత్మ ప్రతిష్ఠ, ఈర్ష్యాభావాలను వదిలిపెట్టండి. భూమాత వలె సహనాన్ని ప్రదర్శించండి. ప్రపంచమే మీ పాదాల చెంత అంకితమయ్యేందుకు నిరీక్షిస్తున్నది.

83. ఇతరుల సహాయాన్ని అర్థించేవాడు సత్య స్వరూపుడైన భగవంతుని సేవ చేయలేడు.

84. సత్య స్వరూపుని సేవ సుఖ-దుఃఖాలలో సమానంగా ఉంటుంది. అన్ని దశలలోనూ మనకు అనుకూలంగా ఉంటుంది. హృదయంలోని ఏకైక విశ్రాంతి స్థలం ఆ ప్రేమయే. వృద్ధాప్యం ఆ ఆత్మ రసాన్ని ఎండగట్టలేదు. కాలంతోపాటు అది మారదు. ఎవడో అరుదైన భాగ్యశాలి మాత్రమే అట్టి దివ్య ప్రేమను పొందగలడు.

85. శోక-మోహాలకు కారణం ప్రాణులలో విభిన్న భావాలను ఆరోపించుకోవడమే. మనిషి ఒకరిని విభిన్న భావాలకు ఆరోపించుకోవడమే. మనిషి ఒకరిని సహృదయునిగా భావించి ప్రేమిస్తే, మరొకడిని దుఃఖమిచ్చే శతృవుగా భావించి ద్వేషిస్తాడు. ఆయా సందర్భాలలో శోక-మోహాలు జనించడం స్వాభావికమే. కానీ సకల ప్రాణులలోనూ ఒకే అఖండశక్తిని ఆరాధిస్తూ, ప్రాణి కోటిలో భగవంతుని అంశను చూసి ఆత్మ భావంతో ప్రేమించిన వేళ ఈ శోక- మోహాలు ఉండవు. అతడు సదా ఆనందంగా ఉంటాడు. ప్రపంచంలో అతడికంటూ శతృవులు ఉండరు, మిత్రులు ఉండరు. అతడికి ఎవ్వరూ బాధను కలిగించలేరు. అతడి ఎదుట విషసర్పమే తన స్వభావాన్ని మరిచిపోగలుగుతుంది.

86. తన ప్రాణాలను సైతం పట్టించుకోకుండా, మృత్యువు పేరు విని చలించకుండా దానికి ఎదురేగి స్వాగతం చెప్పే స్థితప్రజ్ఞుడికి ప్రపంచంలో ఏ పనీ అసాధ్యం కాబోదు. భౌతిక శాస్త్రాలు అతడికి అవసరం లేదు. సాహసమే అతడి శాస్త్రం. ఆ ఆయుధంతో అతడు అన్యాయమార్గం పట్టేవారిని పరాజితులను చేస్తాడు.

88.  ఆనందోల్లాసాలను విధ్వంసం చేసేది చింత మాత్రమే.

89. అప్పుడప్పుడూ అర్థరాత్రి నిద్ర లేవండి. ఆ సమయంలో ఇంద్రియ చాంచల్యం ఉండదు. బహిర్ముఖ స్పృహ మందగిస్తుంది. ఈ సమయంలో ఇంద్రియాతీతమైన మీ ఆత్మస్వరూపాన్ని అనుభూతి చెందండి ! జగతి, శరీరం, ఇంద్రియాల అభావంలో మీ అఖండ అస్తిత్వాన్ని ఊహించుకోండి.

90. దృశ్యము నందు ప్రీతి లేకపోవడమే నిజమైన వైరాగ్యం.

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️12-జీవన రసాయనం🧘‍♀️*

*101. నడుస్తూ, నడుస్తూ పాదాలలో ముళ్ళు గ్రుచ్చుకున్నా సరే, ఆకలి మండుతున్నా సరే, బుద్ధి శిథిలమైనా సరే, జీవితము దుర్బరమైనా సరే, మృత్యువు దగ్గర పడినా సరే, అంతరంగంలో సోఽహం-సోఽహం అనే మంత్రము నిర్భయంగా ధ్వనించాలి. నాకు ఆకలిదప్పులు, మృత్యు భయము లేవు. ప్రకృతిలోని ఏ బాధలూ నన్నేమీ చేయలేవు. ‘‘నేనే అతడు, అతడే నేను’’ అనే భావం రావాలి.*

*102. సుఖ దుఃఖాలు, నిష్ఠ అనిష్ఠాలు, అనుకూలాలు, ప్రతికూలాలు, భూత భవిష్యత్తులు సమదృష్టితో చూసే ఆత్మవేత్త నిజమైన ధనవంతుడు.*

*103. దుఃఖాలకు దుఃఖించి, సుఖాలకు సంతసించే వారు ఇనుము లాంటివారు. దుఃఖాలలో కూడా సుఖంగా ఉండేవారు బంగారం లాంటివారు. సుఖదుఃఖాలు రెండింటిలో ఒకేరకంగా ఉండేవారు రత్నం లాంటివారు. కానీ సుఖదుఃఖాది భావాలకు అతీతంగా ఉండేవాళ్ళు నిజమైన సామ్రాట్టులు.*

*104. కల నుండి మేల్కొని, కలను మరిచిపోయినట్లుగా, రోజూ కొంతసేవు ఈ జాగ్రదావస్థను మరిచిపోండి. రోజూ ఉదయం 15 నిముషాలు ఈ విధంగా ప్రపంచాన్ని మరిచిపోయే అలవాటు చేసుకుంటే ఆత్మానుసంధానం జరుగుతుంది. దీనివల్ల సహజావస్థ సిద్ధిస్తుంది.*

*105. త్యాగము, ప్రేమ చేత యధార్థ జ్ఞానం లభిస్తుంది. దుఃఖితులకు ఆలోచన ద్వారా త్యాగ-ప్రేమలు జనిస్తాయి. సుఖ ప్రాణులలో సేవ ద్వారా త్యాగం-ప్రేమ వస్తాయి. కారణం స్వయంగా దుఃఖించేవాడు ఇతరుల సేవ చేయలేడు. కాని ఆలోచించగలుగుతాడు. సుఖంగా ఉండేవాడికి సుఖంలోని ఆసక్తి వలన అతడిలో ఆలోచన మొలకెత్తదు. కాని అతడు పరుల సేవ చేయగలుగుతాడు.*

*106. ప్రజల పూజ, ప్రణామాది గౌరవాల వలన ఎంత సంతోషం కలుగుతుందో దెబ్బలు తినేటప్పుడు సైతం అదే సంతోషం కలిగితేనే మనిషికి మోక్షం పొందే అర్హత వచ్చినట్లు.*

*107. ప్రతి సాధకుడూ పూర్తిగా కొత్త అనుభవం దిశగా ముందడుగు వెయ్యాలి. దీనికి బ్రహ్మజ్ఞాని అయిన మహాత్ముల అవసరం ఉంది. నిజమైన జిజ్ఞాసువులు అటువంటి వారిని తేలికగానే పొందగలరు. దృఢ జిజ్ఞాస వలననే శిష్యునికి గురువు వద్దకు వెళ్ళాలనే కోరిక కలుగుతుంది. యోగ్యుడైన అట్టి జిజ్ఞాసువుకు సమర్థవంతమైన సద్గురు స్వయంగానే దర్శనమిస్తాడు.*

*108. జరిగిన దానిని గురించి ఆలోచించక, భవిష్యత్తును గురించి చింతించక ప్రస్తుతం కలిగే సుఖ- దుఃఖాల పట్ల సమదృష్టి గలవాడే జీవన్ముక్తుడగు పురుషుడు.*

*109. బుద్ధి-హృదయం ఏకమైనప్పుడు సమస్త జీవితమూ సాధనగా మారుతుంది.*

*110. బుద్ధిమంతులు సాంసారిక చింతన చేయక తమ ముక్తి గురించే ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనే త్యాగ, దాన, సేవా భావాలను కలిగిస్తుంది. మోక్ష చింతన ద్వారా సకల సద్గుణాలు ప్రాప్తిస్తాయి. ప్రాపంచిక చింతన ద్వారా సకల దుర్గుణాలు కలుగుతాయి.*

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️16-జీవన రసాయనం🧘‍♀️*

*141. భగవంతుడు మన అపరాధాలన్నింటినీ క్షమించాలని మనం నిజంగా భావిస్తున్నట్లయితే మనం సైతం ఇతరుల అపరాధాలను క్షమించాలి. ఎప్పుడూ ఇతరుల దోషాలను, అపరాధాలను నిందించకండి. ఎందుకంటే అందరి రూపాలలోను మన ఇష్టదైవమే ఉన్నాడని భావించాలి.*

*142. భౌతిక ప్రభావాలకు లోనుగాక పోవడమే పూర్ణ పవిత్రతకు అర్థం. ప్రాపంచిక ద్వేషం, అందాలకు అతీతంగా, కోపాలకు అతీతంగా, ఆత్మానుభవం సాధించి ఆకర్షణలకు, త్యాగాలకు దూరంగా ఉండాలి. ఇదే వేదాంత-ఉపనిషత్తుల రహస్యం.*

*143. ప్రాపంచిక జగతిలోని శతృవులను సైతం క్షమించగలిగే స్వభావం అలవడినప్పుడే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది.*

*144. నిత్య వ్యవహారం నుండి రెండు క్షణాలు విశ్రాంతి తీసుకోండి. ‘‘నేనెవరిని? ఈ వేడి-చలి అనేవి శరీరానికే. ఆకలి-దప్పులు ప్రాణాలకే. అనుకూలాలు- ప్రతికూలాలు మనస్సుకే. శుభాశుభ, పాపపుణ్యాలు బుద్ధి నిర్ణయాలే. కానీ నేను శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి ఇవేమీ కాను. నేను వీటన్నింటికీ అతీతమైన నిర్లిప్తమైన ఆత్మ స్వరూపమును’’ అని భావించండి.*

*145. ‘నేను స్వతంత్రుడను’ అనే భావన గలవాడు నిజంగానే ముక్తిని సాధిస్తాడు. ‘బందీ’ని అనే భావన గలవాడు నిజంగానే బందీగా ఉంటాడు.*

*146. మీరు నిర్భయులు, నిర్భయులు, నిర్భయులు. భయమే మృత్యువు, భయమే పాపం, భయమే అధర్మం, భయమే వ్యభిచారం. సకల అసత్య- మిథ్యా భావాలు ఈ భయమనే భూతం వల్ల కలిగినవే.*

*147. పరుల మేలు కొరకు చేసే కొద్దిపాటి పనైనా అంతర్గత శక్తులను మేల్కొలుపుతుంది. పరుల మేలు కొరకు సాగించే ఆలోచన వలన సింహంతో సమానమైన బలం హృదయంలో సమకూరుతుంది.*

*148. నిర్భయులమైతే సింహాన్ని అయినా సరే జయించి పెంచుకోగలము. భయపడితే కుక్కలయినా సరే పీక్కుని తినేస్తాయి.*

*149. ప్రతి క్రియ, ప్రతి వ్యవహారం, ప్రతి ప్రాణి బ్రహ్మ స్వరూపంగా కనిపించడమే సహజ సమాధి లక్షణం.*

*150. కష్టాలు- సమస్యలు వచ్చినప్పుడు నాలోని సహనం పెంచడానికే భగవంతుడు ఈ ఏర్పాటు చేశాడని భావించండి. కఠిన పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడితే క్రమంగా పరిస్థితులు మారతాయి. విషయ వాంఛల పట్ల రాగద్వేషాలు ఉంటే అవే పరీక్షలుగా మారతాయి.*

🕉🌞🌏🌙🌟🚩


*🧘‍♂️17-జీవన రసాయనం🧘‍♀️*

*151. ‘తత్త్వ దృష్టితో చూస్తే మీరు జన్మించలేదు, అసలు జన్మించరు కూడానూ. మీరు అనంతులు, సర్వవ్యాపకులు, నిత్య విముక్తులు, వినాశం లేని అజరామరులు. జన్మ-మరణాల ప్రశ్నయే మహా మూర్ఖత్వం. అసలు జన్మే లేనపుడు మృత్యువు ఎక్కడిది?’*

*152. మీరే ఈ జగతికి పరమేశ్వరులు. మిమ్మల్ని ఎవరు బలహీనులుగా చేయగలరు ? ప్రపంచంలో మీరొక్కరే శక్తిమంతులు. మీకు ఎవరి భయం? నిలబడండి. విముక్తులు కండి. మిమ్మల్ని దుర్బలులుగా మార్చే ప్రతి ఆలోచనా, మాట పాపం; అశుభం.*

*153. మీరు ఎటువంటి చింత, ఎటువంటి కోరికా లేకుండా  మీకార్యాన్ని, కర్తవ్యాన్ని నెరవేర్చండి.  మీ కార్యాలలో ఆనందం పొందండి.  మీ కర్తవ్యం మొదట ఆత్మానుభవానికే. రెండవ పని మీ పనిలో నిమగ్నులు కండి. కర్తవ్యమే మీకు ఆత్మానుభవం నేర్పిస్తుంది. మరింకొక కారణం ఏదో పెట్టుకొని పని చేయకండి. స్వతంత్రులై పని చేయండి. మీరు ఎవరికీ బందీ కారు, సర్వ స్వతంత్రులు.*

*154. మీరు సత్యమార్గం నుండి తప్పుకోకపోతే శక్తి ప్రవాహం, సమయం, అన్నీ  మీ వెంట ఉన్నట్లే. భవిష్యత్తు అంతా మీ చేతిలోనే ఉంది.*

*155. మీరు దివ్య ప్రేమతో చంఢాలునిలో, దొంగలో, పాపులలో, అతిథి-అభ్యాగతులలో ఆ పరమాత్మ దర్శనం చేసుకోగలిగితే మీరు పరమేశ్వరునికి ప్రేమపాత్రులు కాగలరు.*

*156. ఆచార్య గౌఢపాదులవారు ఇలా చెప్పారు : ‘‘మీరు మీలో మీరే కొట్టుకోగలరేమో కానీ నాతో పోరాడలేరు. ఎందుకంటే మీరంతా ఉన్నది నా పొట్టలోనే ! నేనే ఆత్మస్వరూపంగా అంతా వ్యాపించి ఉన్నాను’’.*

*157. మనిషి సర్వ ప్రాణులలో, సర్వ దేవతలలో శ్రేష్ఠుడు. దేవతలు సైతం భూమిపైకి వచ్చి మానవ శరీరం ధరించి ముక్తి సాధించాలి.*

*158. అవసరమైన పనిని చేయండి. అవసరం లేనిదాన్ని మరిచిపోండి. ఇదే నిశ్చింత తత్త్వానికి మూల సూత్రం.*

*159. సేవ-ప్రేమ- త్యాగం ఇవే మనిషి ప్రగతికి మూలాలు. ఈ మంత్రం మీకు నచ్చితే అందరి పట్ల సద్భావం చూపిస్తూ, ప్రతి మనిషికీ యథాశక్తి సాయం చేస్తూ ఉండండి. ‘నా మాట వింటేనే సాయం చేస్తాను. లేకపోతే లేదు’ అనుకుంటే మీరు సేవ చేయలేరు. మీ అహాన్ని శాంతింప చేసుకొంటేనే మీ మాట వినేటట్లు చేసుకోగలరు. అంతే!*

*160. కల వంటిదే ఈ జగత్తు కూడా ! ప్రతి ఒక్కరూ ఈ కల నుండి మేలుకోవాలి. సద్గురువు మళ్ళీ-మళ్ళీ మేల్కొలుపుతున్నా మళ్ళీ నిద్రించకుండా మేల్కొవడం మన చేతిలోని పనే.*

🕉🌞🌏🌙🌟🚩

🧘‍♂️18-జీవన రసాయనం🧘‍♀️

🕉🌞🌏🌙🌟🚩

161. నిత్యం ఆనందంగా ఉండండి. ముఖాన్ని మలినపరుచుకోవద్దు.మీ కోసం అసలు శోకమే ఈ ప్రపంచంలో పుట్టలేదని నిశ్చయించుకోండి. ఆనంద స్వరూపంలో ఇక చింతకు స్థానమెక్కడిది?

162. సమస్త బ్రహ్మాండమూ ఒకటే శరీరం. సమస్త ప్రపంచం ఒక శరీరం. ప్రతి ఒక్క వ్యక్తిని మీవాడిగా భావించిన ఎడల అన్ని పరిస్థితులూ, పంచభూతాలు సైతం మీకే అనుకూలిస్తాయి.

163. శరీరాన్ని, బుద్ధిని, ఆత్మను బలహీనపరిచేది ఏదైనా సరే విషంగా భావించి త్యజించండి. అది ఎన్నిటికీ సత్యం కాదు. సత్యం పవిత్రమైనది, బలప్రదమైనది; జ్ఞాన స్వరూపమునూ, శక్తిని ఇచ్చేదే సత్యం.

164. సాధనలో మనకు అభిరుచి ఉండాలి. సాధన కొరకు తీవ్ర ఆకాంక్ష ఉండాలి.

165. ఇతరుల దోషాలను గురించి, అవి ఎంత పెద్దవైనా సరే, చర్చించకండి. వారి దోషాలను గురించి మాట్లాడటం వల్ల వారికి మేలు జరగకపోగా నష్టం కలిగి తీరుతుంది. మీకు హాని జరుగుతుంది.

166. ఈ ప్రపంచాన్ని సత్యంగా భావించడమే మృత్యువు. మీ అసలైన స్వరూపం ఆనంద స్వరూపమైన ఆత్మయే. ఆత్మ కాక ప్రపంచమనేదేదీ లేదు. కల కంటున్న మనిషి తనను తాను అనేక రూపాలుగా భావించినట్లే. ఆనంద స్వరూపమైన ఆత్మ జాగ్రదావస్థ, స్వప్న, సుషుప్తి ఈ మూడు స్వరూపాలను చూస్తూ కూడా పరమాత్మ తాను ఒకటనే విషయాన్ని గ్రహించలేదు.

167. అభ్యాసం, వైరాగ్యం మానసిక విజయానికి కారణం. అభ్యాసం అంటే ప్రయత్న పూర్వకంగా మనస్సును పరమాత్మ చింతనలో పెట్టడం, వైరాగ్యం అంటే ప్రాపంచిక పదార్థాల నుండి మనస్సును వెనుకకు లాగడం.

168. ఎవరినీ ఏమీ కోరవద్దు. మీకు గౌరవాభిమానాలు ఎదురుగా వస్తే తిరస్కరించండి. స్వర్గదూతలు మీ కోసం విమానం తీసుకుని వస్తే దానిని సైతం తిరస్కరించండి. అప్పుడు ఆ భగవంతుడే మిమ్మల్ని తన హృదయంలో దాచుకుంటాడు.

169. అప్పుడప్పుడూ సూర్యుడి ఉదయ- అస్తమానాలకు ఎదురుగా నడవండి. నదులు, సరోవర, సముద్ర తీరాలలో ఒంటరిగా తిరగండి. మందపవనాలు చల్లగా వీచే ప్రదేశాలకు వెళ్ళండి. అక్కడ పరమాత్మతో ఏకత్వం పొందే ద్వారాలు తెరుచుకుంటాయి.

170. మీరు కోర్కెలను ఎంతగా వదిలించుకుంటే అంతగా మీకు కావలసినవి మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తాయి. మీరు యాచకుడిగా, బిచ్చగానిగా మారే కొద్దీ మీరు తిరస్కరింపబడతారు.

🕉🌞🌏🌙🌟🚩

🧘‍♂️19-జీవన రసాయనం🧘‍♀️

171. ప్రపంచంలో ఏ వస్తువును చూడాలన్నా సరే కాంతి అవసరం. అదే విధంగా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు తమ తమ పనులు చేసుకోవడానికి ఆత్మ కాంతి అవసరం. ఎందుకంటే భౌతికమైన కాంతి ఏదీ దీనికి ఉపయోగపడలేదు.

172. కలలో నుండి మేల్కొన్న వాడిని కలలోని సుఖ- దుఃఖాలు, జనన-మరణాలు, పాపపుణ్యాలు, ధర్మాధర్మాలు మొదలగునవి బాధించవు. ఎందుకంటే అవన్నీ స్వయంగా కల్పించుకున్నవే. కలలో స్వయం కల్పితం గాక వేరే ఏమీ ఉండదు. అదే విధంగా జ్ఞాని అయినవాడికి సుఖ-దుఃఖాలు, జనన-మరణాలు, పాప పుణ్యాలు, ధర్మాధర్మాలు మొదలైన వాటి చింత ఉండదు. ఎందుకంటే అతని దృష్టిలో అవన్నీ ఆత్మ స్వరూపములే.

173. ఒకే రకమైన ఆత్మజ్యోతి కుక్కల్లో ఉండి మొరుగుతున్నది. పందులలో, గాడిదలలో అన్ని జంతువులలో,పక్షులలో ఉండి ధ్వనులు చేస్తున్నది. అయితే అజ్ఞానంలో ఉన్న వారు శరీరంపై ధ్యాస పెడతారు గానీ చైతన్య తత్త్వాన్ని పట్టించుకోరు.

174. ఏ క్షణంలోనైతే మనిషి భూత-భవిష్యత్‌ చింతనను విడిచి, ఈ దేహాన్ని క్షణభంగురమని గ్రహించి దేహాభిమానాన్ని విడిచి పెడతాడో, అదే క్షణంలో అతడు ఒక ఉన్నతమైన దశకు చేరుకోగలుగుతాడు. పంజరాన్ని వీడి గగన విహారం చేసే పక్షి వలె విముక్తి వాయువులు పీల్చగలడు.

175. సమస్త భయ-చింతలు మీ కోర్కెల పరిణామాలే. మీకు భయమెందుకేస్తుంది? ఎందుకంటే ఫలానాది దొరకదేమోనని అనుమానం. జనం అవహేళన చేస్తారని మీ భయం. ఎందుకంటే మీకు కీర్తి అంటే ఆసక్తి. ఈ కోర్కెలకు నీళ్ళు వదిలి చూడండి. ఎలాంటి భయమూ, బాధ్యతలూ ఉండవు.

176. చూడడానికి చాలా అందవికారంగా, నల్లగా, పొట్టిగా, గూనిగా ఉండే మనిషి సైతం మీ స్వరూపమే. ఇక వాడిపై మీకు జుగుప్స ఎందుకు? అత్యంత లావణ్యవతి అయిన సుందరి, సృష్టిలో శోభాయ మానమైన అప్సరస కూడా మీ స్వరూపమే. ఇక దానిపై మీకు మోహం దేనికి ? మీ జ్ఞానేంద్రియాలు మిమ్మల్ని వాళ్ళతో వేరు చేసి చూపిస్తున్నాయి. ఈ ఇంద్రియములు అబద్ధాలు చెబుతున్నాయి. వాటిని విశ్వసించకండి. అన్ని శరీరాలకు ఆత్మ మీరే. అందుచే అంతా మీరే.

177. మానవుడిగా పుట్టిన కారణం చేత మనం సాధకులం. సాధకులమైన కారణంగా సత్యాన్ని స్వీకరించడం మన ధర్మం. సత్యం ఒక్కటే. మన బలం ఇతరుల కోసం, జ్ఞానం మన కోసం, విశ్వాసం పరమాత్మతో సంబంధం పెట్టుకోవడం కోసం.

178. మీరు అంతర్ముఖము అయి మీలోపలికి మీ ఆత్మచైతన్యంలో మునిగిపోవడమే అన్నింటి కంటే గొప్ప పరోపకారం.

179. మీరు స్వతంత్రులు అనే విశ్వాసం దృఢంగా ఉంటే మీరు ప్రపంచానికే ఉద్ధారకులు కాగలరు. వేదాంతంతో గొంతు కలిపి ‘నేను శరీరాన్ని కాను, నిత్య-శుద్ధ-బుద్ధ ఆత్మను’ అని పలికితే మీరే మోక్షదాతలు కాగలరు.

180. దయచేసి స్వార్థపూరిత ఆలోచనలు, ఉపాయాలను దూరంగా పారవేయండి. అన్ని వాంఛలు రాగపూరితాలే. వ్యక్తిగత, శారీరక ప్రేమలు అంతే ! వాటినన్నింటినీ పారవేసి పవిత్రులుగా మారండి. అప్పుడే మీ దేహం, మనస్సు... ఆరోగ్యంగా, బుద్ధి పూర్ణ స్వరూపంగా తయారవుతాయి.

🕉🌞🌏🌙🌟🚩

🧘‍♂️20-జీవన రసాయనం🧘‍♀️

181. ప్రపంచంలోని భోగాలు తటస్థించినపుడు ‘‘ఓ భూతమా! నా ఎదుట నుండి పో! నాకేమి నీ అవసరం లేదు’’ అనండి. అప్పుడెంత సుఖమో చూడండి. పరమాత్మను లేదా పరమాత్మ స్వరూపమైన మహాపురుషుని ఎవరినైనా విశ్వసించి, నిస్సంశయంగా మీ జీవితపు కళ్ళాన్ని వారి చేతిలో పెట్టండి. నిర్భయత్వం మీ చరణదాసి అవుతుంది.

182. ఈ జగత్తు మిథ్య. ఇందులోని ప్రీతి అంతా భ్రాంతి అని గ్రహించిన వాడికి ఎటువంటి దుఃఖమూ ఉండదు. జగత్తులో ఎటువంటి మోహమూ ఉండదు. జగన్మిథ్యా భావమే జగతికి నాశనం.

183. మీ ఆత్మ స్వరూపంలో లీనమైతే చాలు. ఈ ప్రపంచానికే మీరు సామ్రాట్టులు కాగలరు. అయితే ఆ పదవి కేవలం ఈ లోకానికే గాక సమస్త లోకాలకు, పరలోకానికి సైతం వర్తిస్తుంది.

184. ‘‘ఓ జనకరాజా! దేవాధి దేవుడైన పరమేశ్వరుడు, విష్ణు భగవానుడు లేదా బ్రహ్మ వచ్చి ఉపదేశం ఇచ్చినా సరే మీకు సుఖం లభించదు. విషయవాంఛలను త్యాగం చేస్తేనే నిజమైన శాంతి, ఆనందమూ ప్రాప్తిస్తాయి.

185. మనకు ఈ మానవ జన్మను ప్రసాదించి మనకు ఇష్టం వచ్చినట్లు ధార్మికులుగా, భక్తులుగా, జీవన్ముక్తులుగా, కృతకృత్యులుగా అయ్యే అవకాశమిచ్చిన ఆ పరమాత్మ మహిమను కీర్తించండి. గానం చేయకపోతే కనీసం వినండి. వినలేకపోతే, కీర్తించ లేకపోతే కనీసం అంగీకరించండి.

186. సముద్ర గర్భంలోకి పోవలసి వచ్చినా సరే, సాక్షాత్తు మృత్యువుతో తలపడాల్సి వచ్చినా సరే, మీ ఆత్మ ప్రాప్తి యొక్క లక్ష్య పూర్తి కోసం అచంచలంగా ఉండండి. లేవండి ! సాహసికులుగా, శక్తివంతులుగా తయారుకండి. మీకు కావలసిన శక్తి, సహాయాలు మీలోనే ఉన్నాయి.

187. జీవితంలో శోక-చింతలు ముసిరినప్పుడు ఆనంద స్వరూపమును గానం చేస్తూ మోహ-మాయలను పారద్రోలండి.

188. శరీరానికి గాయం తగిలి బాధ కలిగినప్పుడు నేను ‘ఆకాశప్రాయుడైన నిరాకార చైతన్యాన్ని’ అని నిశ్చయించుకుని, బాధను మరిచిపోండి.

189. ప్రాపంచిక బంధాల్లో ఇరుక్కున్నప్పుడు ‘నేను నిర్లిప్త నిత్య విముక్తుడను’ అనుకుని బయట పడండి.

190. గృహ సమస్యలు పీడించినప్పుడు దానిని ఒక ఆటగా భావించి భారాన్ని తగ్గించుకోండి.



*🧘‍♂️22-జీవన రసాయనం🧘‍♀️*

*201. సాధకుడు తన లక్ష్యమును దృష్టిలో ఉంచుకొని సాధనా మార్గంలో బాణంలాగా నేరుగా దూసుకుపోవాలి. ఇక అటూ-ఇటూ చూడకూడదు. దృష్టి అటూ-ఇటూ పోతే నిష్ఠ స్థిరంగా లేదని గ్రహించండి.*

*202. జీవితంలో మీరు వేల స్వప్నాలు చూసి ఉంటారు. కానీ అవి విూ జీవితంలో భాగం కాలేవు. ఇదే విధంగా ఈ జగతిలోని ఆడంబరాలు సైతం మీ ఆత్మ ఎదుట అప్రముఖమైనవి.*

*203. ఆత్మను ఒక్కదానినే తెలుసుకోండి. మిగిలిన విషయాలను వదిలివేయండి. ధీరుడైన సాధకుడు జాగ్రత్తగా ఆత్మనిష్ఠ పెంచుకుంటూ మితభాషిగా ఉండాలి. ఎందుకంటే అతడు కేవలం మనోవాణితోనే సాధన చేయాలి. మామూలు మాటలతో కాదు.*

*204. సర్పానికి భయపడినట్లుగా ప్రజా సమూహానికి భయపడండి. నరకానికి భయపడినట్లుగా గౌరవాలకు దూరంగా ఉండండి.కామ కోరికలకు దూరంగా ఉండండి. అప్పుడే దేవతలు మిమ్మల్ని నిజమయిన బ్రహ్మవేత్తలుగా భావిస్తారు.*

*205. మన శరీర భాగాలపై మనకు కోపం రాదు. అదే విధంగా శతృవులు-మిత్రులు అందరినీ తన దేహంలోని భాగాలే అనుకునే వివేకశాలికి ఎప్పుడూ, ఎవ్వరి మీదా కోపం రాదు.*

*206. ‘‘నేను శరీరాన్ని భగవంతునికి అర్పణం చేశాను. దీని ఆకలి-దప్పులు, సుఖ-దుఃఖాలతో నాకేమి పని ? ఒకరికి సమర్పించిన వస్తువుపై మోహాన్ని కలిగి ఉండడం పాపం’’.*

*207. దివ్య దృష్టి సాధించాలనుకుంటే ముందు ఇంద్రియ సుఖాలను త్యాగం చెయ్యాలి.*

*208. ప్రళయకాల మేఘం గర్జించినా, సముద్రాలు ఉప్పొంగినా, ద్వాదశ సూర్యులు మండిపోయినా, పర్వతాలు ఢీకొని శబ్దాలు చేసినా జ్ఞాని యొక్క నిశ్చయంలో ద్వైతభావం భాసించదు. ఎందుకంటే ద్వైత భావం అజ్ఞాని లక్షణం.*

*209. సత్యాన్ని స్వీకరిస్తేనే శాంతి లభిస్తుంది. కొంతమంది శాంతిని కొనుగోలు చేయాలనుకుంటారు. నిజానికి అర్హత వలన శాంతి రాదు. ఆ యోగ్యతను, సద్వినియోగం చేసుకుంటేనే శాంతి లభిస్తుంది. చాలామంది సంపదను చూసుకుని శాంతిని కాపాడుకోవాలని అనుకుంటారు. నిజానికి సంపద వల్ల కాక, సంపద సద్వినియోగం చేతనే శాంతి లభిస్తుంది. అదే విధంగా ఆపదను సద్వినియోగం చేసుకున్నా కూడా శాంతి లభిస్తుంది.*

*210. తుచ్ఛమైన లాభ-నష్టాలపై ఉండే మీ ఏకాగ్రత అనంత ఆనంద స్వరూపమైన ఆత్మపై ఎందుకు ఉండదు ?*

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️23-జీవన రసాయనం🧘‍♀️*

*211. మీలోనే ఆనందాన్ని సాధించడం కష్టమే. కానీ భౌతిక విషయాల ద్వారా ఆనందం పొందడం అసంభవం.*

*212. ‘‘నేనే ప్రపంచానికి వెలుగును. ఆ కాంతి రూపంగా నేనే సకల వస్తువులలోను నిండి ఉన్నాను’’ అనుకుంటూ నిత్యం జీవించండి. ఈ పవిత్ర చింతన మిమ్మల్ని పరమ పవిత్రులుగా చేస్తుంది.*

*213. కర్మ ద్వారా లభించిన వస్తువుకు ఈ జగత్తు యొక్క సాయం మరియు భవిష్యత్తుపై ఆశ అవసరం అవుతుంది. కానీ త్యాగం ద్వారా వచ్చిన వస్తువుకు ప్రపంచంతోను, భవిష్యత్తుతోను పని లేదు.*

*214. బయట ప్రపంచంలో మీకు దొంగలు కనిపిస్తున్నంత కాలం మీలో కూడా దొంగ ఉన్నట్లే లెక్క. ఇతరులు అయోగ్యులుగా, చెడ్డగా, సంస్కరింపదగిన వాళ్ళుగా కనిపిస్తుంటే ఓ సంఘ సంస్కర్తా ! ముందు నిన్ను నీవు సంస్కరించుకో.*

*215. సదా వినయంతో ప్రసన్నంగా ఉండేవారే విజయులు కాగలరు. చింతా-శోకాయుక్తులయిన ప్రజలకు ఔన్నత్యం కలుగదు. ప్రతి పనినీ ధైర్యంగా, శాంతంగా చెయ్యండి. ‘‘ఈ పని శరీరం, మనస్సు, బుద్ధి ద్వారా జరిగింది. నేను మాత్రం వాటికి శక్తి నిచ్చే చైతన్య స్వరూపాన్ని’’ అని భావించుకుంటూ ఓంకారాన్ని స్మరించండి.*

*216. ఎటువంటి పరిస్థితులలోను మనోవ్యథకు గురి కావద్దు. ఆత్మపై విశ్వాసముంచి ఆత్మనిష్ఠులు కండి.*

*217. సత్‌సంగం వలన మనిషికి సాధన లభిస్తుంది. అది శాంతి రూపంలో కావచ్చు, మోక్షంగా కావచ్చు, సేవ లేదా ప్రేమ రూపంలో లభించవచ్చును.*

*218. తనలో గుణ-దోషాలు ఉన్న వాడికే భౌతికంగా గుణ-దోషాలు కనిపిస్తాయి. తనను తాను శరీర మాత్రునిగా భావించినవాడే ఇతరుల శరీరాలను పట్టించుకుంటాడు.*

*219. జాగ్రత్త! శరీరేచ్ఛల పట్ల, ఇంద్రియ సుఖాలు, భోగవిలాసాల పట్ల సమయం వృథా చేసుకుంటే అది మీకు క్షేమం కాదు. సరిగ్గా పని చెయ్యండి. సాఫల్యానికి తొలి సిద్థాంతం అవిశ్రాంత కర్తవ్యం. సాక్షీ భావంతో కర్తవ్యం. ఇది తెలుసుకుంటే జీవితంలో ఎక్కువ- తక్కువలు చాలా సహజం అని అర్థమవుతుంది.*

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️24-జీవన రసాయనం🧘‍♀️*

*220. భూత- భవిష్యత్తుల గురించి ఆలోచన లేకుండా ప్రస్తుత కర్తవ్యం నెరవేర్చండి. ఈ భావం ప్రతి దశలోను మీకు సుఖాన్ని కలిగిస్తుంది. మనకు లభించిన దానిని సద్వినియోగం చేసుకోవడమే అధికశక్తిని సాధించడానికి ఉపాయం.*

*221. సాఫల్యాన్ని గురించి పట్టించుకోకుండా, పరిణామాలను గురించి పట్టించుకోకుండా మీ శక్తులన్నీ కర్తవ్య నిర్వహణపై కేంద్రీకరిస్తే సాఫల్యం మీ వెన్నంటే వస్తుంది. అందుకే కేవలం సాఫల్యాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకండి. అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.*

*222. మానసిక వృత్తి ఏకాగ్రం కానంత వరకు మనస్సులో ఆశలు దోబూచులాడుతూ ఉంటాయి. కర్తవ్యం- అవసరం ఈ చింత పెట్టుకోని వాడే శాంతంగా ఉండగలడు. అందుకే పరమశాంతి సాధించడం కోసం జీవితంపై ఆశను సైతం త్యజించి మనస్సును బ్రహ్మానందంలో విహరించనీయండి. ఈనాటి నుండి అసలు ఈ శరీరమే లేదు అని భావించండి. కేవలం బ్రహ్మనంద సాగరమే ఉన్నదని అనుకోండి.*

*223. ‘నేను ఆత్మను’ అనే విశ్వాసం దృఢంగా ఉన్నవాడిని ఏ శక్తీ ఎదిరించలేదు.*

*224. ‘‘నాకు రాసి లేదు. దేవుని దయ లేదు, గురువులు సరిగా లేరు, మంచి సత్‌సంగం లేదు. ఈ లోకమే చెడిపోయింది’’ ఇటువంటి మాటలు పిరికితనానికి, అంతరంగ మాలిన్యానికి చిహ్నములు. అందుకే ఇతరులపై దోషాలు వేయడం, నకారాత్మక ధోరణులను విడిచి పెట్టండి.*

*225. మీలోని ఆత్మపై మీకు కోపం వస్తే ప్రపంచం కూడా మిమ్మల్ని కోపగించుకుంటుంది. మీలో ఎటువంటి ఆందోళన లేకపోతే ఇక భౌతిక జగతితోనూ ఏ పేచీ ఉండదు.*

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️25-జీవన రసాయనం🧘‍♀️*

*226. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి నడుం బిగించిన క్షణమే మనం జగత్తుకు ద్రోహులుగా మారిపోతాము. అశుద్ధ పరమాత్మను దర్శించకుండా చెడును మాత్రమే దర్శించే ధోరణి పెరిగిపోతుంది. సంస్కర్తలంతా ‘ఈ జగత్తును ఉద్ధరిస్తున్నాము’ అనుకుంటారు. ఆహా! సంస్కర్తలారా! మొదట మీ మనసులు సరి చేసుకుని ఆ పరమాత్మను దర్శించండి. ఆయన ఉనికి చేతనే, దృష్టి మాత్రం చేతనే, ఆయనపై నుండి వీచే గాలి చేతనే అనంత జీవులకు శాంతి లభించి గొప్ప సంస్కరణలు జరుగుతాయి. కబీరు, మహావీరుడు, నానక్‌, బుద్ధుడు, లీలాషాహ్‌జీ మహరాజ్‌ వంటి మహాత్ములెందరో ఇదే పద్ధతిని పాటించారు.*

***
🧘‍♂️26-జీవన రసాయనం🧘‍♀️
*227. వేదాంతంలో ‘కర్మకు’ అర్థమేమంటే వాస్తవిక ఆత్మ స్వరూపంలో ఏకాకారమై, అఖిల విశ్వంతో ఏకరూపుడై ఉండడం, ఆ అద్వితీయ పరమాత్మ తత్త్వంతో సంయోగం చెందడమే నిజమైన కర్మ. మిగిలినవన్నీ భారపు మూటలే.*

*228. మీ వర్తమాన స్థితి ఎలా ఉన్నా సరే దానిని సర్వోన్నతంగా భావిస్తే చాలు మీ హృదయంలో ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం సునాయాసంగా ఉదయిస్తాయి. ఆత్మ సాక్షాత్కారం ఎక్కడో మైళ్ళ దూరాన కలదని భావించి దాని వెంటబడి, చింతించే పనిలేదు. మీరు నిశ్చింతగా మునక వేస్తే చాలు. అదే క్షణం మీ ఆత్మస్వరూపం ప్రత్యక్ష మవుతుంది. అయ్యా! ప్రత్యక్షమవడమేమి? మీరే సాక్షాత్తు ఆత్మస్వరూపులు.*

*229. సదా ఓంకార గానం చేయండి. భయ- చింతాదులు ముసిరినప్పుడు ఏ మహాత్ముడినైనా స్మరించుకోండి. నింద-ప్రశంసల సందర్భాలు వచ్చినప్పుడు మహాపురుషుల తేజోమయ జీవితాలను అవలోకించండి.*

*230. వేటినైతే భయంకర సంఘటనలుగా, భయంకర సమస్యలుగా భావిస్తున్నారో అవి నిజానికి మీ ఆత్మదేవుడు పంపగా వచ్చినవే. సకల భయావహ సంఘటనల నామరూపాదులు విషప్రాయమే. కానీ అవి అమృతంతో తయారు చేయబడినాయి.*

231. మనస్సులో భయం లేకపోతే భౌతికంగా భయావహ పరిస్థితులు ఎన్ని ఉన్నా మిమ్మల్ని ఏవిూ చేయలేవు. మనస్సులో భయం ఉన్నట్లయితే బయట భయావహ పరిస్థితులు లేకపోయినా సరే భయం వేస్తుంది, చెట్ల మొదట్లో భూతాలు కనిపిస్తాయి.

232. ఎటువంటి పరిస్థితిలోనూ ఎదుట ఉన్న భయానక సమస్యను చూసి భయపడవద్దు. కష్టాలనే కారుమబ్బుల వెనుకే సంపూర్ణ ప్రకాశవంతమైన, ఏకరసుడైన పరమాత్మ సత్తా ఆ సూర్యుని వలె సదా విరాజిల్లుతూ ఉన్నాడు.

233. మీరు మీపై విశ్వాసాన్ని కోల్పోకండి. ఈ ప్రపంచంలో ఏ పని చేయడానికైనా మీరు సమర్థులు. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించుకోవద్దు. మీలో అపారశక్తులు ఇమిడి ఉన్నాయి.

234. ఎవరైనా మీ వస్తువును దొంగిలిస్తే దానికి ఎందుకు భయం ? ఆ మనిషీ మీరు ఒక్కటే. అతడు దొంగిలించిన వస్తువు మీదీ-వాడిదీ ఇద్దరిదీను.

235. తనను గాక మరొక దానిని చూడని, వినని, తెలియనివాడు అనంతుడు. మరొక వస్తువు కనిపిస్తోందంటే మీ పరిధి చాలా స్వల్పమని భావం. మీరు అనంత స్వభావం గలవారు కారు.

236. ఈ ప్రపంచం నాకేమి ఆనందం ఇవ్వగలదు ? సకల ఆనందమూ నాలోనిదే. నేనే సంపూర్ణ ఆనంద స్వరూపాన్ని.

237. జీవితంలో అనేక అవసరాలు ఉన్నాయి. నిజమే, కానీ జీవితాన్ని పూర్తిగా భౌతిక పరిస్థితులకే అంకితం చేశామంటే జీవితం యొక్క వాస్తవ రూపం మనం తెలుసుకోలేము.

238. విమర్శకుల నిందవల్ల నేనెందుకు కుచించుకుపోవాలి ? ప్రశంసకుల పొగడ్తలకు నేనేల పొంగిపోవాలి ? నిందలకు తగ్గను, పొగడ్తల వల్ల పెరగను. నేను ఇలాగే ఉంటాను. ఇంకా నిందాస్తుతుల వల్ల ప్రయోజనమేమి ?

239. ప్రాపంచిక సమస్యలలోను, ప్రపంచంలోను పూర్తిగా మునిగిపోయిన వారికే వేదాంతం నిజంగా అవసరం.

240. ప్రపంచంలోని పాపాలు- దుర్మార్గాలు చూసి కాదు, అవన్నీ మీకు కనిపిస్తున్నందుకు బాధపడండి.

🕉🌞🌏🌙🌟🚩
****
🧘‍♂️27-జీవన రసాయనం🧘‍♀️
🕉🌞🌏🌙🌟🚩

241. ఈ ప్రపంచంలో ఆత్మగాక వేరేదీ లేదు. ఉన్నదంతా స్వప్నం మాత్రమే అని తెలుసుకున్నప్పుడు ఈ లోకంలోని దుఃఖ దారిద్య్రాలు, పాప-పుణ్యాలు ఏవీ మనల్ని అశాంతులను చేయలేవు.

242. విద్వాంసుల, వేదాంతుల, ఆచార్యుల బెదిరింపులు, అనుగ్రహం లేదా విమర్శలు బ్రహ్మజ్ఞానిపై ఎట్టి ప్రభావాన్నీ చూపలేవు.

243. ఓ వ్యక్తి రూపంలోని అనంతుడా ! మీ కాళ్ళపై మీరు నిలబడే ప్రయత్నం చెయ్యండి. ఇక సమస్త జగత్తు భారాన్ని మీరే ఆట బొమ్మలాగా తేలిగ్గా మోయగలుగుతారు.

244. సింహం యొక్క గర్జన, కత్తిలోని పదును, పాము బుస, తాపసి క్రోధం, న్యాయమూర్తి విదిలింపు వీటన్నింటిలోను మీ ప్రకాశమే మెరుస్తూ ఉంది. మరి, వీటికి భయపడతారెందుకు? ‘నా పిల్లి నా మీదే మ్యావుమంటుంది’ అన్నట్లుగా అనవసరంగా భీతి ఎందుకు ?

245. ఈ ప్రపంచం ఒక ఆట వస్తువు మాత్రమే. వేరేమీ కాదు. అమాయక బాలుడు మాత్రమే ఆట బొమ్మలకు భయపడడం లేదా వాటిపై ప్రీతి పెంచుకోవడం చేస్తాడు. వివేకవంతుడు కాదు.

246. అజ్ఞానం దూరం కానంత వరకు దొంగతనం, జూదం, సారాయి- వ్యభిచారం వంటివి దూరం కావు. లక్ష ప్రయత్నాలు చేసినా సరే.

247. మీరు నిరంతరం అంతరంగాన్ని దృష్టిలో పెట్టుకోండి. మొదట జరిగేది అంతరంగ పతనమే. భౌతిక పతనం కేవలం దాని పరిణామ స్వరూపం మాత్రమే.

248. త్యాగం వల్ల ఎప్పుడూ ఆనందమే లభిస్తుంది. ఒక్క వస్తువు మీవద్ద ఉన్నా సరే దాని బంధంలో మీరు చిక్కుకుపోతారు.

249. నిశ్చింతతే ఆరోగ్యానికి మంచి మందు.

250. సుఖం తన శిరస్సుకు దుఃఖమనే కిరీటం ధరించి వస్తుంది. సుఖాన్ని స్వీకరించిన వాళ్ళు దుఃఖాన్ని సైతం అధిగమించాలి.

🕉🌞🌏🌙🌟🚩

28-జీవన రసాయనం🧘‍♀️

251. నేనే (ఆత్మ) అందరినీ దర్శించగలను.

252. వేలల్లో ఒక్కడు మాత్రమే శాంతంగా ఉండి ప్రాపంచిక వ్యవహారాలు నిర్వహించగలడు.

253. సత్యం కోసం శరీరాన్ని త్యాగం చేయాల్సి వచ్చినా సరే చెయ్యండి. మనం వదులుకోవలసిన చిట్టచివరి మోహం ఇదే.

254. భయం, చింత, కలతలను వీడండి. అప్పుడే జ్ఞానం అనుభవంలోకి వస్తుంది.

255. మీకు ఎవ్వరూ ఎప్పుడు ఎలాంటి నష్టము కలిగించలేరు. కేవలం మీ ఆలోచనలే మిమ్మల్ని వెంబడిస్తున్నాయి అంతే!

256. ప్రేమకు అర్థం పొరుగువారిలోను, ఇతరులలోను, తనలోనూ అభేదాన్ని చూడగలగడమే.

257. ఓ ప్రియతమ సాధకుల్లారా ! మీలో పోగొట్టుకున్న ఆత్మను మళ్ళీ ఒక్కసారి వెతుక్కోండి. ఈ భూమ్యాకాశాలను శాసించేది మీరే.

258. సదా ప్రసన్నంగా సమదృష్టితో ఉండడమే అన్నింటి కన్నా గొప్ప దైవభక్తి.

259. ‘శాస్త్ర నియమాలను పాటించకపోయినా హృదయంలోని భక్తి భావానికి లోటేమీ రాదు.’ అని గట్టి నమ్మకం కలిగేంత దాకా శాస్త్ర నియమాలను పాటించండి.

🕉🌞🌏🌙🌟🚩






🕉🌞🌏🌙🌟🚩
🧘‍♂️30-జీవన రసాయనం🧘‍♀️

267) భౌతిక ప్రపంచంలోని ఆవిరి శక్తి, ఎలక్ట్రానిక్‌ శక్తి, విద్యుచ్ఛక్తి, గురుత్వాకర్షణ శక్తి చాలా గొప్పగా భావించబడతాయి. కానీ ఆత్మబలం వీటన్నింటికీ సంచాలకమైనది.

268) ఆత్మబల శక్తి వలన దైన్యుడు సైతం సుఖిస్తాడు, ప్రారబ్దం మారిపోతుంది. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి. ఆత్మబలం సర్వవృద్ధి సిద్ధులకు తండ్రి వంటిది.

269) ఆత్మబలాన్ని మేల్కొల్పడం ఎలా ?ప్రతిరోజు ప్రాతఃకాలంలో త్వరగా నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే స్నానాదులు కావించుకోండి. స్వచ్ఛమైన పవిత్ర స్థానంలో తూర్పు దిక్కుగా కూర్చొని పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చోండి. శాంతంగా, ప్రసన్నంగా ఉండండి.

270) ‘ప్రకృతి నిర్మించిన ఈ శరీరంలోని దోషాలన్నింటినీ అధిగమించి అన్ని మాలిన్యాలను, దౌర్బల్యాలను విడిచి ఆత్మ మహిమను తెలుసుకుని తీరుతాను’ అని దృఢంగా సంకల్పించుకోండి.

271) కళ్ళను సగం మూసి, సగం తెరుచుకోండి. ఊపిరితిత్తుల్లో పూర్తిగా శ్వాస పీల్చుకుని ‘సూర్యుని దివ్య తేజస్సు నాలోపలకి వెళుతుంది’ అని భావించుకోండి. శ్వాసను యథాశక్తి లోపలే ఉంచుకోండి. తరువాత "ఓం" కారమును దీర్ఘంగా ఉచ్ఛరించి శ్వాసను నెమ్మది-నెమ్మదిగా విడిచిపెట్టండి. శ్వాస పూర్తిగా అయిన పిదప వెంటనే శ్వాస తీసుకోకూడదు. యథాశక్తి శ్వాస తీసుకోకుండా ‘హరిః ఓం... హరిః ఓం.... హరిః ఓం...’ అనుకుంటూ మానసికంగా జపం చేసుకోండి. మళ్ళీ ఊపిరితిత్తులలోకి గాలి తీసుకోండి. ఇప్పుడు చేసిన విధంగానే చేస్తూ ఓంకారాన్ని జపించుతూ ఉండండి.

🕉🌞🌏🌙🌟🚩

🧘‍♂️31-జీవన రసాయనం🧘‍♀️

272) పది-పదిహేను నిముషాలు ఇలాగే ప్రాణాయామ సహితంగా ఓంకార జపం చేస్తూ కూర్చోండి. మీలోని వృత్తులను, ధ్యాసలను ఆకాశంలోకి వదిలెయ్యండి.

273) ఆకాశంలోనే ఈ భూమి ఉన్నది. భూమిపై అనేక మంది జీవులు, దేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటిగా ఉన్నటువంటి మీ శరీరం ఆసనంలో కూర్చుని ఉంది. ఈ పూర్తి దృశ్యాన్ని మానసికంగా కల్పనాశక్తితో ఊహించుకొని చూడండి.

274) మీరు శరీరం కాదు, అనేక దేశాలు, సాగరాలు,  పృథ్వీ, గ్రహ, నక్షత్ర సూర్య-చంద్రాది మిళితమైన మహా బ్రహ్మాండానికి ‘ద్రష్ట’ అని ఊహించుకోండి.

275) కొద్దిసేపు ఆగి మళ్ళీ ప్రాణాయామ సహిత ఓం కార జపం చేసి శాంతంగా ఆలోచనలను పరిశీలించుకోండి.

276) ఈ దశలో ‘‘నేను ఎలా కావాలో అలాగే అయి తీరుతాను’’ అని నిశ్చయించుకోండి. విషయవాంఛలు, సత్తా, ధన- సంపదలు వంటి వాటిని కోరుకోకూడదు. ఎందుకంటే ఆత్మబలం లేదా నిశ్చయబలం అనే ఏనుగు పదచిహ్నాలలో మిగిలిన పదచిహ్నాలన్నీ కలిసిపోక తప్పదు.

277) ఆత్మానందమనే సూర్యోదయం జరిగిన తర్వాత నూనె దీపపు క్షుద్ర కాంతికి ఎవరు బానిస కాగలరు?

278) ఎటువంటి ఆలోచననైనా సాకారం కావాలంటే హృదయాన్ని కుళ్ళగించే బలిష్టమైన నిశ్చయం కావాలి. అంతరంగంలోని లోతైన ప్రదేశంలో దెబ్బ కొట్టగల నిశ్చయ బలాన్ని ఆవాహన చేసుకోండి. గుండె విరుచుకుని మనస్సులోని దీన-హీన దుఃఖపు ఆలోచనలన్నింటినీ పెకలించి వెయ్యండి.

279) అటూ-ఇటూ పరుగులు పెట్టే మీ ధ్యాసలతో పాటు మీ శక్తి సైతం చెల్లాచెదురై పోతుందని గ్రహించండి. అందుచేత ఆ ధ్యాసలను చెల్లాచెదురు కానివ్వకండి. అన్ని వృత్తులను ఏకం చేసి సాధనా కాలంలో ఆత్మ చింతనలో పెట్టుకోండి. వ్యవహార కాలంలో జరిగే పనుల్లోను కేంద్రీకరించండి.

280) ప్రతి పనినీ పూర్ణచిత్తులై చెయ్యండి. మీ స్వభావం నుండి ఆవేశాన్ని తొలగుకోండి. ఆవేశంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోకండి. తొందరపడి ఏ పనీ చెయ్యకండి. సదా శాంత స్వభావాన్ని అభ్యసించండి.

281) నిత్యం ప్రసన్నంగా ఉండండి. మీరు అచంచలంగా ఉంటూ సాగరంలా సకల భావ తరంగాలను మీలో దాచుకోండి. జీవులెల్లరిని మీ స్వరూపంగానే భావించండి. అందరితో స్నేహంగా ఉంటూ హృదయ వైశాల్యం సాధించండి. సంకుచితత్త్వాన్ని నివారించండి. ఖండన వృత్తిని త్యజించండి.

 282) ఆత్మనిష్ఠ గల మహాపురుషుల సత్‌సంగ, సాహిత్యాల ద్వారా మీ జీవితాలను భక్తి-వేదాంతాలలో పరిపుష్టం చేసుకోండి. కొన్ని రోజుల సాధనానంతరం మీకు ఈ అనుభవం కలుగుతుంది.

283) జరిగిపోయిన కాలంలో సంశయాత్మక హానికారక కల్పనలు జీవితాన్ని బాధ పెట్టాయి. విషపూరితం చేశాయి.

 284) ఇప్పుడు నిశ్చయబలం యొక్క శక్తి అర్థమయ్యింది. అంతరంగంలోని దివ్య ఖజానా ఇప్పుడు లభించింది. ప్రారబ్దపు సంకెళ్ళు ఇప్పుడు తెగిపోతున్నాయి.

285) బ్రహ్మజ్ఞానులైన మహాపురుషుల సత్‌సంగం, ఆధ్యాత్మిక విద్య లభించిన వారికి జీవితంలో దుఃఖమే ఉండదు.
(సమాప్తం)

🕉🌞🌏🌙🌟🚩