Thursday 20 April 2023



శ్రీ వేంకటేశ్వర లీలలు (1 )

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


నేను వెనువెంట నున్నాను నిన్నుప్రార్ధిస్తూ 

వేకువనే గమనించలేని మనిషి నైతిని రమణా

సంస్కరించే శక్తి నీకే ఉంది మాపైనే ఎప్పుడూ  

విక్సష్ సేనలో మేము ఉన్నాము నమ్మాలి రమణా


షోడ షోపచారాలు నేను చేయ లేను ఎప్పుడూ 

చేతులు జోడించి నమస్కారమీ దిక్కు రమణా

కలశాభిషేకం చేయించే శక్తి లేని వాన్ని ఎప్పుడూ 

కేవలం కర్పూరం వెలిగించి వేడుకుంటన్నా రమణా


ఏడుకొండల పైన వెలుగుతున్నావు ఎప్పుడూ 

మా ఏడు జన్మల పాపాన్ని తొలగించే రమణా

కోరుకున్న విధంగా మాకు వరాలు ఇవ్వు ఎప్పుడూ 

నీవే సకల ప్రాణులను రక్షించే వేంకట రమణా


మా పరిమితులు మాకు తెలుసుకోగలిగాను ఎప్పుడూ       

నా అపరిమితులు నాకు తెలియదు ఎలా రమణా 

ఇక్కడ (పరిమితులు) తెలియడం జ్ఞానం ఎప్పుడూ 

అక్కడ (అపరిమితం) తెలియకపోవడం జ్ఞానం రమణా


అల్లంత దూరాన ఉన్నావు ఆశలు తీరుస్తావు ఎప్పుడూ 

అయినా మాహృదయంలో నిత్యమూ ఉన్నావు రమణా

అంతర్మధనం నుండి మా కష్టాలను కాపాడావు ఎప్పుడూ 

అప్పాలు నైవేద్యం పెడ్తున్నా తప్పులు క్షమించు  వేంకట రమణా

 

--(())--


నేను జూన్  నెలలో తెరపతికి వెళదామని నిర్నయిన్చుకున్నాను, నేను 2018  లో వ్రాసినవి మరలా పోస్టు చేస్తున్నాను, మీ విధేయులు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


Wednesday 5 April 2023

హనుమాజ్జయంతి 06/2023

 


ఆదర్శ హనుమ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

'ఆంజనేయస్వామి' అనగానే రామభక్తి, వీరత్వం, జ్ఞానం....  మూర్తీభవించిన దైవంగా స్ఫురణ కలుగుతుంది. వాల్మీకి రామాయణంతో పాటు ఇతర పురాణ రామయణాల్లో, మంత్రశాస్త్రాల్లో, కావ్యాల్లో కూడా హనుమంతుని ప్రశస్తి బహుముఖాలుగా వ్యాప్తి చెందింది.
           సాక్షాత్ రుద్రతేజఃస్వరూపం, జగద్రక్షణకై అవతరించిన మూర్తి - ఆంజనేయుడు. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా శివాంశ అంజనాదేవి గర్భంలో ప్రవేశించి ప్రాదుర్భవించింది. వైశాఖ బహుళ దశమీ మంద(శని)వారం, పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామి ఆవిర్భవించినట్లు కొన్ని సంహితా గ్రంథాల ప్రమాణం. బాల్యంలోనే సూర్య మండలానికి ఎగిసిన వేగవంతుడు, ఇంద్రుని వజ్రాయుధం తగిలినప్పటికీ తట్టుకోగలిగిన బలమైన 'హనువు'(దవడ) కలిగి ఉన్న కారణంగా 'హనుమాన్'నామాన్ని పొందినట్లు రామాయణం చెబుతోంది. అటుపై బ్రహ్మాది దేవతల వరాలతో సర్వదేవతా శక్తి మయుడయ్యాడు. నిజానికి 'హనుమాన్' నామానికి 'వాక్ స్వరూపుడు' అని అర్థం చెప్పాలి. దీనికి కొన్ని వేదశాస్త్ర వాక్యాలే ప్రమాణం.
            'హనుమాన్ వాక్య కోవిదః' అని వాల్మీకి పేర్కొన్నాడు. 'వాక్కు' - అంటే కేవలం 'మాట' అని అర్థం చెబితే సరిపోదు. బుద్ధి, శక్తి, విశిష్టజ్ఞానం.... వీటి కలయికే వాక్శక్తి. ఈ శక్తి కలిగిన సర్వశాస్త్రవేత్త హనుమ. సారంశంగా హనుమాన్ అంటే 'జ్ఞానవాన్' అని అర్థం.
          జ్ఞానంతో పాటు మానుషాతీతమైన ఈశ్వరత్వాన్ని పలుమార్లు ప్రకటించాడు. ఒకవైపు అద్భుత ప్రతాపం, మరొకవైపు ఉదాత్తమైన ప్రసన్నత కల గలిపి - బలానికీ, త్యాగానికీ, యోగానికీ, జ్ఞానానికీ, ధర్మానికీ, వినయానికీ ప్రతీకగా నిలిచి... అనంత సుగుణాల రాశిగా గోచరిస్తాడు హనుమ.
            హనుమ ప్రవేశంతో రామకథలోనే ఒక ఉత్సాహం ప్రవేశిస్తుంది. అది రామాయణాంతం వరకు ప్రసరించింది.
           సంజీవ పర్వతోద్ధారకునిగా 'ప్రాణప్రదాత, ఆరోగ్యదాత' - అని ఋజువు చేసుకున్నాడు.
           రామాయణంలో తనకోసం కాకుండా, కేవలం పరహితం కోసం, లోకరక్షణ కోసం ప్రవర్తించిన రామకార్య దురంధరుడైన త్యాగమూర్తిగా సాక్షాత్కరించాడు.
           'హనుమ ఉపకారానికి నేనేమి ఇవ్వగలను?'అని రామచంద్ర ప్రభువే పలికి, తన సర్వస్వ భావసంకేతంగా గాఢాలింగనం చేసుకున్నాడంటే - హనుమలోని ఉపకార స్వభావం ఎంతటి మహోన్నతమైనదో అవగతమవుతుంది.
            బుద్ధిబలం, దేహబలం - కలగలిసిన ఈ తేజోమూర్తిని ఆదర్శంగా గ్రహించి, ఆరాధనగా ఎదిగినవారు గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలరన్నది స్పష్టం.
              పట్టాభిషేకానంతరం శ్రీరాముని మనసు మేరకు, సీతమ్మ దివ్యమైన కాంచన రత్నమాలను హనుమ కంఠంలో వేసి అభినందించింది. అంటే రామపట్టాభిషేకం హనుమత్సన్మానంతో స్వస్తి పలికిందని తాత్పర్యం.
         రామయణంలో సీతారాములు, హనుమంతుడు ఈ ముగ్గురూ దేవతా మూర్తు లు

పరిపూర్ణుడు హనుమ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

          మన దేశంలో ఆంజనేయోపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలు ఆ స్వామికే ఉన్నాయి. శ్రీమద్రామాయణం మంత్రగర్భిత కావ్యం.
           అందులో పరమేశ్వర చైతన్యం విష్ణు, రుద్ర, శక్తి రూపాలతో నిక్షిప్తమై ఉంది. విష్ణుతేజం శ్రీరామునిగా, శక్తిస్వరూపం సీతమ్మగా, రుద్రమూర్తి హనుమంతునిగా వ్యక్తమయ్యారు. ముగ్గురూ సమప్రాధాన్యం కలవారిగా రామాయణంలో మన్ననలందారు.
            శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం అంజనీదేవిలో ప్రవేశించింది. ఆమె కారణజన్మురాలైన అప్సరః కాంత. ఆ తల్లి తనయునిగా జన్మించాడు హనుమ. అతడు బాల్యంలోనే అలవోకగా సూర్యమండలం వరకు ఎగిరిన బలశాలి. వేదమూర్తి అయిన సూర్యునికి శిష్యుడు. సూర్యోని నుంచి ఆయనకు వరంగా లభించిన దివ్యతేజశ్శక్తే సువర్చస్సు. ఈ శక్తినే స్త్రీ దేవతగా - ఉపాసనా సంప్రదాయంలో 'సువర్చల' అన్నారు.
          వైశాఖ బహుళ దశమి శనివారం హనుమజననం.
          రామాయణంలో తనకోసం కాక, పరుల కోసం తన ప్రతాపాన్ని ప్రదర్శించినవాడు ఆంజనేయుడే. రావణుని తాను సంహరించ గలిగినప్పటికీ, అది శ్రీరాముని అవతార కార్యమని, అందుకు తగిన సహకారం అందించాడు. "రాముని బాణంలా లంకంలోకి వెళతాను" అనడంలోనే తన వినయాన్నీ, భక్తిభావాన్నీ ప్రకటించాడు.
           జ్ఞానం, వినయం, యోగం, బలం, ధైర్యం, చాతుర్యం, వాగ్వైభవం.... ఇన్నింటి కలబోత హనుమ.
          అభయం, ఆనందం.... ఈ రెండూ హనుమ అందించే వరాలు. భయపడిన సుగ్రీవుడికి అభయమిచ్చి శ్రీరామమైత్రిని అందించాడు. శోకంలో ఉన్న సీతకు శ్రీరామ సందేశాన్ని వినిపించి ప్రాణాలను నిలబెట్టి, సంతోషపరచాడు. సీత జాడను తెలిపి, లక్ష్మణుని ప్రాణాలను నిలిపి శ్రీరాముని ఆనందపరచాడు. ఇలా అభయాంజనేయునిగా, ఆనందాంజనేయునిగా భాసించాడు.
           నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరాహస్వామి, ఆంజనేయుడు - ఈ అయిదూ ఒకే తత్త్వం తాలుకూ విభిన్న వ్యక్తీకరణలు. ఇది మంత్రపరమైన ఔచితీదర్శనం. మృగ వదనం, నరశరీరం కలిగిన దేవతలు 'క్షిప్రప్రసాద' (వెంటనే అనుగ్రహించే) లక్షణం కలవారు.
             రాక్షస సంహారంలో ప్రతాపాన్ని చూపిన నారసింహ లక్షణం, జ్ఞానస్వరూపినిగా హయగ్రీవ స్వభావం, గరుత్మంతునిగా మహావేగం, వరాహ స్వామిగా సంసార సాగరం నుంచి, శోకపంకం నుంచి ఉద్ధరించే తత్త్వం, తనకు సహజమైన వానరాకారం - ఇవన్నీ కలబోసిన లీలలను రామాయణంలో ప్రదర్శించాడు హనుమ. అందుకే పంచముఖాంజనేయునిగా దర్శనమిచ్చాడు.
           అంతేకాక - గజవదనుడైన గణపతత్త్వం, హనుమతత్త్వమూ కూడా ఒకటేనని విజ్ఞుల విశదీకరణ.
           "అవ్యక్త అప్రమేయ పరతత్త్వమితడు" అని వాల్మీకి సుందరకాండలో పేర్కొన్నాడు.
            "సుతరాం ఆద్రియతే ఇతి సుందరః" - అందరి ఆదరణా పొందే గుణమహిమ రూపాలు కలవాడు హనుమయే సుందరుడు. మంత్రశాస్త్రంలో హనుమ నామం సుందరుడు. అందుకే హనుమ కథ 'సుందర కాండ'గా రామాయణ రత్నమాలలో కొలికిపూసలా ప్రకాశిస్తున్నవాడు.
          ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, ఆరాధించదగిన దైవత్వం - కలబోసిన పరమేశ్వర స్వరూపమే శ్రీ ఆంజనేయస్వామి.

[సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, ప్రవచన విరించి, శివతత్త్వసుధానిధి, ధార్మిక తపస్వి, ధార్మిక వరేణ్య పూజ్య గురువుగారు - ''బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు" రచించిన వ్యాసం.]

శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-17

అశోకవన విధ్వంసము, రాక్షస వధ
కార్యే కర్మణి నిర్దిష్టో యో బహూన్య౭పి సాధయేత్
పూర్వ కార్య విరోధేన స కార్యం కర్తుమ్ అర్హతి    5.41.5

న హ్యేకః సాధకో హేతుః స్వల్ప స్యా౭పీ హ కర్మణః
యో హ్యర్థం బహుధా వేద స సమర్థోఽర్థ సాధనే     5.41.6 

చేయవలసిన పని పూర్తియైన తర్వాత ఆ పనికి విరోధము కలుగకుండా దానికి సంబంధించిన అనేక కార్యములు చేయగలవాడే నిజమైన కార్యకర్త, సేవకుడు, దూత.  హనుమ చేయవలసిన ప్రధమ కార్యము సీతా దర్శనము. ఈ సందర్శన కార్యము రావణాసురుని శక్తి సామర్థ్యములు తెలుసుకొన్నప్పుడే ఆమెను రక్షించుట ద్వారా పూర్ణత చెందును. కావున సీతను చూచుట యను ప్రధమ కార్యమునకు హాని కలుగకుండా రావణ బలాదులను తెలుసుకొనుట వంటి ఇతర కార్యములను చేయుట అవసరమని హనుమ భావన. ఈ ప్రపంచమున పని స్వల్పమైనను ఒకే ఒక్క మార్గము ద్వారా దానిని సాధించుట కష్టము. కాబట్టి కార్యమును సాధించుటకు అనేక ఉపాయములను చూడగలిగిన వాడే సమర్ధుడైన సాధకుడు.

ఈ విధముగా హనుమ శత్రు బలము తెలుసుకొనగోరి, యుద్ధము జరిగినచో వారి బలములు తెలియగలవు అని  నిశ్చయించుకొనెను. అందుకు రావణునికి ప్రీతిపాత్రమైన ఈ అశోక వనము యొక్క ధ్వంసమే మేలు అని ఆలోచించి ఆ వనమును ధ్వంసము చేసెను. అక్కడ కాపలా యున్న రాక్షస స్త్రీలు పరుగు పరుగున సీతమ్మ దగ్గరకు వచ్చి ఆ మహాబలుడైన కోతి ఎవరని అడిగిరి. అందుకు సీత "అహి రెవ హ్యహేః పాదాన్ విజానాతి న సంశయః" (పాము జాడ పామే ఎరుగును. కామ రూపముతో వచ్చిన రాక్షసుడే అనుకొంటిని). ఇచ్చట సీత అసత్యము ఆడ వచ్చునా? హనుమ సీతకు ప్రాణ రక్షకుడు. సత్యము పలికినందువలన అతనికి అపాయము కలుగును కావున అట్లు చెప్పినది. ఇట్లే రాముడు కూడా అయోధ్య నుండి బయల్వెడలునప్పుడు దశరథుడు సుమంత్రుని రథము ఆపుమని అనెను. కానీ రాముడు సందడిలో వినపడలేదని మరునాడు రాజుకు చెప్పమని సుమంత్రునికి చెప్పెను. ఈ విధముగా రాముడు కూడా అసత్యము ఆడినాడు కదా. ఇది దోషము కాదా అను సందేహము వచ్చును. ఇచ్చట గమనించితే తండ్రి ఇచ్చిన సత్యవాక్యమును నిలుప వలెను. దశరథుడు ఆ దేశమునకు రాజు. అట్టి రాజు అసత్య వచనుడు కారాదు. అతని సత్యమును నిలుపుటకై కుమారుడైనను, మంత్రియైనను అసత్యమాడుటలో దోషము లేదు.  ఒక గొప్ప సత్యమును నిలబెట్టుటకు అవసరార్థము ఒక అసత్యము చెప్పుటలో దోషము లేదు. కానీ సీత మాత్రము హనుమను కాపాడవలెననే ఆదుర్దాతో, అతని శక్తి సామర్థ్యముల మీద పూర్తిగా నమ్మిక లేక అసత్యము ఆడి తన స్త్రీ సహజమైన బేలత్వమును చాటుకొన్నది. అంతియే గాక అరణ్య కాండలో మారీచుని మాయా అక్రనాదము విన్న తర్వాత రాముని శక్తి సామర్థ్యములపై రవ్వంత అపనమ్మకంతో, సంశయముతో రామునికి సహాయము చేయవలసినదిగా సీత, లక్ష్మణుని ఆదేశించి పరుష పదజాలంతో దూషించి కష్టములను కొనితెచ్చుకొన్నది. అట్టి సంశయమును రావణుడు తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. ప్రస్తుత కాలములో ఎదుటివాని శక్తిని తగిన అంచనా వేయకుండా  స్త్రీ స్వతంత్రముగా వ్యవహరించినచో ఇట్టి కష్టములే తనకు తన కుటుంబమునకు కలుగును. దేశ కాల పరిస్థితులను బట్టి స్త్రీ స్వభావము మారుతుండునని, మెరుపు లోని చాంచల్యము స్త్రీకి సహజము కానీ సీతకు అట్టి దోషములు లేవని అగస్త్య మహర్షి అరణ్య కాండలో శ్రీరామునికి చెప్పి యున్నాడు.  కానీ మాయా ప్రభావము వలన సీత కూడా అందుకు అతీతురాలు కాదని తెలియు చున్నది. తరువాత రాక్షస స్త్రీలు రావణుని వద్దకు యేగి ఒక మహావానరము అశోక వనమును ధ్వంసము చేసినదని, అది సీతతో మాట్లాడినదియని చెప్పిరి. ఆ మాటలు విన్న రావణుడు "దీప్తాభ్యా మివ దీపాభ్యాం సార్చిషస్నేహ బిందవః" కోపము కలిగిన అతని నేత్రములు నుండి కన్నీటి బిందువులు మండుచున్న దీపముల నుండి మంటతో నూనె బొట్లు పడినట్లు పడెను. వెంటనే రావణుడు హనుమను నిగ్రహించుటకు ఎనుబదివేల కింకరులను నియమించెను. వారిని చూచి తన మహాకాయమును పర్వతములాగా పెంచి తోరణముపై నుండి ఈ విధముగా జయధ్వానము చేసెను. (ఇది జయమంత్రము. నిత్యము చదువుకొన్నచో శత్రుబాధలు లేక విజయము చేకూరును).

జయ త్య౭తి బలో రామో లక్ష్మణ శ్చ మహా బలః
రాజా జయతి సుగ్రీవో రాఘవే ణా౭భిపాలితః    5.42.33

దాసోఽహం కోసలేన్ద్రస్య  రామ స్యా౭క్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతా౭౭త్మజః 5.42.34

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతి బలం భవేత్
శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః        5.42.35

అర్దయిత్వా పురీం ల౦కా మ౭భివాద్య చ మైథిలీమ్
సమృద్ధా౭ర్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్ 5.42.36

మహాబల సంపన్నులైన రామలక్ష్మణులకు జయము. రాముని రక్షణలో యున్న సుగ్రీవునకు జయము. అట్టి రామునకు నేను దాసుడను. శత్రుసైన్యములను దునుమాడ సమర్థత గల వాయుపుత్రుడనైన నేను హనుమంతుడను. వేయిమంది రావణులు వచ్చినను నన్ను యుద్ధములో ఎదిరింపలేరు. వారిని శిలలతో, వృక్షములతో సకల రాక్షసులను నాశనము చేసి లంకాపురిని మర్దించి, మైథిలికి నమస్కరించి కార్యమును సాధించి అందరూ చూచుచుండగా వెళ్లెదను.  ఈ విధముగా ఘోషణము చేసి గరుత్మంతుని వేగమున వారి నందరిని హతమార్చెను. శత్రువులను చంపుట అను కార్యము చేయువాడను తాను కాదనియు, ఆ కర్మ తనది కాదనియు, దాని వలన కలుగు కష్టనష్టములు తనివి కాదనియు భావించుతూ, అహంకారమును వీడి హనుమ కర్మ చేయుచుండెను. భగవద్గీత లో కూడ శ్రీక్రుష్ణుడు నిష్కామ కర్మ చేయమని చెప్తాడు. భగవాన్ రమణులు చెపుతూ .. "నేను" అనే అహంకారము ను వదలి మౌనము, శాంతి (limitless contentment) అనే సాధనాలతో అత్మస్వరూపమును ఎరిగి, ఆత్మసాక్షాత్కారము పొంద వలసి ఉన్నది. దీనినే భగవత్ స్వరూపము, భగవత్ సాక్షాత్కారము అనవచ్చు. జీవుని యొక్క సహజ ప్రశాంత స్థితియే"శివము" గా గుర్తించవచ్చు. ధాన్యము యొక్క పొట్టును వేరు చేస్తే, దానినే బియ్యము గా గుర్తించవచ్చు. Similarly, so long as one is bound by karma one remain as "jiva". When the bond of ignorance is broken, one shines as "SIVA", కావున జీవునికి, శివునికి బేధము లేదు. దీనిని సూచించుటకు హనుమ తోరణముపై కూర్చుండెను. మానవునికి విరోధులు ముఖ్యముగా మువ్వురు. అవి నేను స్వతంత్రుడను అనుకొనుట, తనను తాను రక్షించుకోగలను అనుకొనుట, తాను చేయు కర్మలు తనకొరకు అనుకొనుట. ఈ మూడింటిని జయించుటయే విరోధి విజయము. గుమ్మమునకు గల నాలుగు కమ్ములలో హనుమ పై కమ్ముపై నిలిచి యుండును. అదియే తోరణమునకు చిహ్నము. ఆ తర్వాత యుద్ధమునకు వచ్చిన ప్రహస్తుని కుమారుడైన జంబుమాలినిని, మంత్రి సుతులైన ఏడుగురిని, విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘసు, భాసకర్ని మొదలగు సేనాగ్ర నాయకులను వారి వారి సైన్యముతో సహా సంహరించెను. అప్పుడు రావణుని ఆజ్ఞ మేరకు అక్షకుమారుడు యుద్ధమునకు బయలుదేరెను. అక్షకుమారునికి హనుమను చూడగానే అతనిపై గౌరవమేర్పడెను. అప్పుడు అతను హనుమ వేగమును, బలమును, పరాక్రమమును నిర్ధారించుకొని హనుమతో యుద్ధమునకు పూనుకొనెను. మహాపరాక్రమముతో పోరాడుతున్న బాలుడైన ఆ అక్షకుమారుడిపై జాలిగల్గినా, శత్రువుపై జాలి గూడదని తలచి, హనుమ అతని పాదములు పట్టుకొని గరుత్మంతుడు పామును కొట్టినట్లు, ఆ అక్షకుమారుడిని పలుమార్లు నేలకేసి కొట్టి చంపెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Tuesday 4 April 2023

ప్రాంజలి ప్రభ 04/04

 




"మిత్రులకు, శ్రేయోభిలాషులకు  శుభాకాంక్షలు"
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-15

సీత కోరికపై హనుమ శ్రీరాముని రూపమును  వివరించుట
శ్రీరాముని ఆత్మ గుణ గుణములను వర్ణించిన తరవాత, హనుమ, శ్రీరాముని రూపమును ఈ విధముగా వర్ణించు చున్నాడు.
 
విపులా౭౦సో మహా బాహుః కమ్బు గ్రీవః శుభా౭౭ననః
గూఢ జత్రుః సుతామ్రా౭క్షో రామో దేవి జనై శ్శృతః  5.35.15
 
దున్దుభి స్వన నిర్ఘోషః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్
సమ స్సమ విభక్తా౭౦గో వర్ణం శ్యామం సమాశ్రితః  5.35.16
 
త్రిస్థిర స్త్రిప్రలమ్బ శ్చ త్రిసమ స్త్రిషు చోన్నతః
త్రి తామ్ర స్త్రిషు చ స్నిగ్దో గంభీర స్త్రిషు నిత్యశః   5.35.17
 
త్రి వలీవాం స్త్ర్యవణత శ్చతు ర్వ్య౭౦గ స్త్రి శీర్షవాన్
చతుష్కల శ్చతు ర్లేఖ శ్చతు ష్కిష్కు శ్చతు స్సమః  5.35.18
 
చతుర్దశ సమ ద్వన్ద్వ శ్చతుర్ద౦ ష్ట్ర శ్చతుర్గతిః
మహౌ ష్ఠ హను నాస శ్చ ప౦చ స్నిగ్ధో౭ష్ట వంశవాన్  5.35.19
దశ పద్మో దశ బృహ త్త్రిభి ర్వ్యాప్తో ద్వి శుక్లవాన్
షడు న్నతో నవ తను స్త్రిభి ర్వ్యాప్నోతి రాఘవః   5.35.20

సీతా మాతా! శ్రీరాముడు విశాలమైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము, సుందరమగు ముఖము, దుందుభి దానిని పోలిన కంఠస్వరం, మెఱయుచున్న దేహచ్చాయతో అన్ని అవయవములు సమముగా కలవాడు, నీలమేఘశ్యాముడు.
 
1. త్రిస్థర; వక్షం, మనిబంధము, పిడికిలి స్థిరముగా యున్నవాడు. ఇవి రాజ లక్షణములు,
2. త్రిప్రలంబ: కనుబొమలు, బాహువులు, వృషణములు పొడవుగా యున్నవాడు. ఇవి సంపన్నుల లక్షణములు,
3. త్రిసమః: కేశాగ్రములు, వృషణములు, జానువులు సమముగా యున్నవాడు. ఇవి రాజ లక్షణములు,
4. త్రిషుచోన్నత: ఉదరము, నాభి చుట్టుభాగము, హృదయము ఎత్తుగా గలవాడు. ఇవి రాజ లక్షణములు,
5. త్రితామ్రః: నేత్రాంతములు, గోళ్లు, అరచేతులు ఎర్రగా నున్నవాడు. ఇవి సుఖపురుషుని లక్షణములు,
6. త్రిషుస్నిగ్ధః: పాదరేఖలు, శిరోరుహములు, లింగము ఈ మూడును నునుపుగా నున్నవాడు. ఇవి భాగ్యవంతుని లక్షణములు,
7. త్రిషు గంభీరః: స్వరము, నడక, నాభి ఈ మూడును గంభీరంగా నున్నవాడు. ఇవి ప్రసంశాపాత్రుని లక్షణములు,
8. త్రివలీవాన్: కడుపుపై మూడు మడతలు కలవాడు,
9. త్రవ్వనతః: స్థనములు. చూచుకములు, పాదరేఖలు లోతుగా యున్నవాడు,
10. చతుర్వ్యంగః: నరములు తేలని పాదములు, ఒక్కొక్క వెంట్రుక కల రోమ కూపము, దీర్ఘముగా లేని లింగము, మాంసము కాని పొత్తికడుపు కలవాడు, 
11. త్రిశీర్షవాన్: మూడు సుడులు గల్గిన శిరస్సు కలవాడు,
12. చతుష్కలః: బొటన వ్రేలి మొదట నాలుగు రేఖలు కలవాడు. ఇవి ఎన్ని రేఖలు ఉండునో అన్ని వేదముల యందు ప్రావీణ్యము యుండును,
13. చతుర్లేఖః: నుదిటి యందు నాలుగు రేఖలు, పాదము నందు చేతి యందు నాలుగు రేఖలు కలవాడు. లలాటముపై నాలుగు రేఖలు యున్నచో 200 యేండ్లు ఆ పైన, మూడు రేఖలు యున్నచో 100 యేండ్లు, రెండు రేఖలు యున్నచో 60 యేండ్లు, ఒక రేఖ యున్నచో 20 యేండ్ల లోపు ఆయుర్దాయము యుండును,
14. చతుష్కిష్కుః: తొంబదియారు అంగుళముల ఎత్తు కలవాడు,
15. చతుస్సమః: బాహువులు, జానువులు, ఊరువులు, గండ స్థలములు సమముగా యున్నవాడు,
16. చతుర్దశసమద్వన్ద్వః: కనుబొమలు, ముక్కుపుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్థనాగ్రములు, ముంజేతులు, మణికట్లు, మోకాళ్ళు, వృషణములు, పిరుదులు, చేతులు, పాదములు మడమలు. ఈ పదునాలుగు సమముగా యున్నవాడు,
17. చతుర్దంష్ట్రః: దంతములు మెరియుచు గట్టివై, వాడివై, సమములై ఉండువాడు. రెండు పలువరసలలో మధ్యగల నాలుగు దంతములకును పక్కనున్న నాలుగు పండ్లకును 'దంష్ట్రలు' అని పేరు. కాంతి గలవి, నునుపైనవి, పెద్దవి, మొనదేలినవి, సమములు ఐన దంష్ట్రములు మంగళకరములు,
18. చతుర్గతిః: సింహము, శార్ధూలము, గజము, వృషభము అను నాలుగు జంతువుల నడక వంటి నడక గలవాడు,
19. మహౌష్ఠహనునాసః: పెదవి, దౌడ, ముక్కు, ఎత్తుగా బొద్దుగా యున్నవాడు. ఇవి రాజ లక్షణములు,
20. ప౦చస్నిగ్ధః: చూపులో, దంతములో, చర్మములో, కేశములలో, పాదములలో స్నిగ్ధత కలవాడు,
21. అష్టవంశవాన్: వెన్నెముక, చేతివ్రేళ్ళు, కాలివ్రేళ్లు, చేతులు, ముక్కు, కన్నులు, చెవులు, లింగము. పొడవైన ఈ ఎనిమిది అవయవములు గలవాడు,
22. దశపద్మ: ముఖము, నేత్రములు, పెదవి, అంగుడు, స్థానములు, గోళ్లు, చెవులు, పాదములు. పద్మాకారములగు అవయవములు ఈ పది గలవాడు,
23. దశబృహత్: శిరస్సు, లలాటము, చెవులు, మెడ, గుండెలు,  ఉదరము, చేతులు, పాదములు, వీపు, హృదయము అను పది అవయవములు పెద్దవిగా యున్నవాడు,
24. త్రిభిఃవ్యాప్తః: తేజస్సు, యశస్సు, కాంతి అను ఈ మూడిటిచే అంతటా వ్యాపించినవాడు,
25. ద్విశుక్లవాన్: దంతములు, నేత్రములు తెల్లగా యున్నవాడు,
26. షడున్నతః: కక్షము లేదా చంక, కక్షి, వక్షస్థలం, ముక్కు, మూపు, నుదురు అను ఈ ఆరు అవయవములు ఎత్తుగా యున్నవాడు,
27. నవతమః: కేశములు, గోళ్లు, చర్మము, లింగము, వ్రేళ్ళు, గుంపులు, బుద్ధి, గడ్డము, వెంట్రుకలు అను ఈ తొమ్మిది సూక్ష్మముగా యున్నవాడు,
28. త్రిభిః వ్యాప్నోతి: ధర్మార్థకామములను మూడింటిని పూర్వాహ్న, మధ్యాహ్న, అపరాహ్ణవముల యందు అచ్చరించు వాడు.
ఇట్లు సాముద్రిక శాస్త్రములో చెప్పబడిన సర్వ లక్షణములు గలవాడు శ్రీరాముడు. ఇట్టి లక్షణములు గల రామునకు అన్ని విధముల సమానముగా యుండు వాడు లక్ష్మణుడు.
అమ్మా! రామలక్ష్మణులు ఇద్దరు నిన్ను చూడవలెనని చాలా కుతూహలంతో యున్నారు. వారు వానర రాజైన సుగ్రీవునితో మైత్రి చేసుకొని యున్నారు. అమ్మా! హనుమ అను పేరుగల నన్ను ఇచ్చటికి దూతగా పంపినారు. రాత్రివేళ లంకలో ప్రవేశించి రావణుని చూచితిని. శోకముతో బాధపడుచున్న నిన్ను చూచితిని. దేవి! నేను రామదూతను. సుగ్రీవ సచివును. కార్యార్థినై వచ్చిన నాతో మాట్లాడుము. అమ్మా! నీవు దిగులు వీడుము. నీకెట్లు ఇష్టమైన అట్లు చేయుము. ఈ విధముగా చెప్పి సీతమ్మకు నమ్మకము కలుగుటకై వినయముతో ఇట్లు పలికెను.
 
వానరో౭హం మహాభాగే దూతో రామ స్య ధీమతః
రామ నామా౭౦కితం చేదం పశ్య దేవ్య౭౦గుళీయకమ్  5.36.2
 
ప్రత్యయా౭ర్థం తవా౭౭నీతం తేన దత్తం మహాత్మనా
సమా౭౭శ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖ ఫలా హ్య౭సి      5.36.3
 
అమ్మా! నేను వానరుడను. రామ దూతను. రామనామాంకితమగు ఈ అంగుళీయకమును చూడుము. నీకు విశ్వాసము కలుగుటకై శ్రీరాముడు ఒసగిన దీనిని తెచ్చినాను. అశ్వాసము నందుము. నీ దుఃఖము పోవుచున్నది. నీకు మంగళము అగుగాక. అని హనుమ సీతతో విన్నవించి ఊరకుండెను. సీతమ్మ ఆ ఉంగరమును గ్రహించి రామదర్శనము అయినట్లు మిక్కిలి ఆనందించింది.
శ్రీరామ జయరామ జయజయ రామ
--(())--

Saturday 1 April 2023

ప్రాంజలి ప్రభ..

 





] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-13
 

సీతాదేవికి వినబడునట్లు హనుమ రామకథను వినిపించుట
ఏవం బహువిధాం చిన్తాం చిన్తయిత్వా మహా కపిః   5.31.1
 

సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ
తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠ స్తారా౭ధిప నిభా౭౭ననః
 

రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వ ధనుష్మతామ్       5.31.6
రక్షితా స్వస్య వృత్తస్య స్వజన స్యా౭పి రక్షితా
 

రక్షితా జీవ లోకస్య ధర్మస్య చ పరంతపః               5.31.7
తస్య సత్యా౭భిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః
 

తస్య సత్యా౭భిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః
సభార్యః సహ చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్      5.31.8
 

జనస్థాన వధం శ్రుత్వా హతౌ చ ఖర దూషణౌ
తత స్త్వ౭మర్షా౭పహృతా జానకీ రావణేన తు           5.31.10
 

వంచయిత్వా వనే రామం మృగ రూపేణ మాయయా
స మార్గమాణ స్తాం దేవీం రామ స్సీతాం అనిన్దితాం  5.31.11
 

ఆససాద వనే మిత్రం సుగ్రీవం నామ వానరం
తత స్స వాలినం హత్వా రామ: పర పురంజయః     5.31.12
 

ప్రాయచ్ఛ త్కపి రాజ్యం త త్సుగ్రీవాయ మహా బలః                         
సుగ్రీవేణా౭పి సందిష్టా హరయ: కామ రూపిణః        5.31.13
 

దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వంతి సహస్రశః
అహం సంపాతి వచనా చ్ఛత యోజన మా౭౭యతం    5.31.14
 

హనుమ పలువిధములుగా ఆలోచన చేసి సీతాదేవి మాత్రమే శ్రద్ధగా వినునట్లుగా మధుర వచనములు పలికెను. ఇక్ష్వాకు వంశజులలో కీర్తిమంతుడు, శౌర్య పరాక్రములు కలవాడు అయిన దశరథుడు కలడు. అట్టి దశరథుని జ్యేష్ఠ కుమారుడు అయిన రాముడు సర్వధర్మములలో శ్రేష్టుడు. తన ధర్మములను తాను రక్షించుకొనుచు, తన వారిని, జీవలోకము నంతను రక్షించువాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి సీతాలక్ష్మణులతో కలసి అరణ్యములకు వెడలెను. అక్కడ పెక్కు రాక్షసులను సంహరించెను. రాముని చేతిలో ఖర, దూషణ, త్రిశురులు హతమైరి. అప్పుడు రావణుడు మాయలేడి సహాయముతో జానకిని అపహరించెను. రాముడు సీతాన్వేషణ చేయుచు సుగ్రీవునితో మైత్రి చేసి వానర రాజైన వాలిని సంహరించి సుగ్రీవుని రాజును చేసెను. సుగ్రీవుని ఆదేశము మేరకు నేను సీతను వెతుకుచు నూరు యోజనములు సముద్రమును దాటి రాముని వలన విన్న శుభలక్షణ సంపన్నురాలైన సీతను చూచితిని. ఈ విధముగా పలికి హనుమ మిన్నకుండెను. అప్పుడు కేశములచే కప్పబడియున్న సీత  చెట్టుపై బాలభానుని వలె వెలుగొందుచున్న మారుతిని గాంచెను. సీతాదేవి తేజోమూర్తియైన ఆ మారుతిని చూడగానే ఒకింత స్పృహ కోల్పోయి ఇది స్వప్నము కాదుకదా అని ఆలోచన చేసెను. అయినను నిద్రలేని నాకు స్వప్నము ఎట్లు వచ్చును? ఇట్లా ఆలోచించి సీత దేవతా సమూహమునకు ఇట్లు ప్రార్థించెను.
 

నమో౭స్తు వాచస్పతయే సవజ్రిణే
స్వయమ్భువే చైవ హుతా౭శనాయ చ
అనేన చోక్తం య దిదం మమా౭గ్రతో
వనౌకసా త చ్చ తథా౭స్తు నా౭న్యథా    5.32.14
 

బృహస్పతికి, ఇంద్రునకు, బ్రహ్మకు, అగ్నిదేవునకు నమస్సులు. ఈ వానరుడు మాటలు తథ్యములు అవుగాక! అప్పుడు నెమ్మదిగా హనుమ చెట్టు దిగి సీతకు నమస్కరించెను (అప్పుడు రాక్షస స్త్రీలు నిద్రలో యుండిరి) సీతాదేవితో హనుమ సాద్వీ నీవెవరవు? రామపత్నివియే అని నా విశ్వాశము. అప్పుడు ఆమె తన్ను సీతగా చెప్పుకొని, దుష్ట రాక్షసుడైన రావణుడు నన్ను అపహరించి తెచ్చినాడు. ఇంకా నాకు రెండు మాసములు మాత్రమే గడువు యున్నది అనెను. అంత హనుమ రామలక్ష్మణుల కుశల వార్తలు చెప్పెను. అందుకు సీత ఎంతయో సంతోషించి ..

కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా
ఏతి జీవన్తమ్ ఆన౦దో నరం వర్ష శతా ద౭పి      5.34.6
 

లోకములో వాడుకలో నున్న సామెత నా కెంతయో శుభకరముగా కనబడుచున్నది. జీవించియున్న మానవునికి నూరేండ్లకైనను ఆనందము కల్గును అను మాట నా విషయములో సత్యమైనది. (ఈ వాక్యము చాలా ముఖ్యమైనది. పెద్దవారు పిల్లలకు చెప్పవలసినది). అయినను సీతమ్మ మదిలో యున్న చిన్న సంశయమును గూడ తీర్చుటకై రాముని గుణగణములను, పరాక్రమమును, రూప లావణ్యములను అదే విధముగా లక్ష్మణునివి చెప్పగా సీత మారుతిని విశ్వసించెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

 [14:56, 05/12/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (731)

🕉🌞🌎🌙🌟🚩


"ప్రశ్న : తలపులన్నీ పోద్రోచిన పిదప మనసు నిశ్చలమౌతుంది, లేక  శూన్యస్థితి ప్రాప్తిస్తుంది. అప్పుడు ధ్యేయసాక్ష్యాత్కారానికి ధ్యాత మరే సాధన చేయవలె !?"

శ్రీరమణమహర్షి : శూన్యాన్ని చేసేదెవరు ? సాక్ష్యాత్కారమేమి ? మామిడిని మామిడిగా చూడటం ప్రత్యక్షమంటావా ? వీటన్నింటికీ కారణ, కార్య, కర్తల త్రిపుటి అవసరం. కాబట్టి అది సాపేక్షమేగానీ నిరాపేక్షంకాదు. ఒక విషయాన్ని నీవుచూసి తర్వాత అది కనిపించకపోతే అటుపై అది లేనేలేదంటావు. రెండూ మనోవృత్తులే. ఉందన్నా, కాదన్నా రెండింటికీ ఆధారం ప్రత్యక్షమే. ప్రత్యక్షాలు పలురకాలు - ఇంద్రియ, మానసిక, సాక్ష్యాత్. ఈ చివరిది బ్రహ్మస్థితిలో ఉండటం. అదే సత్యం. మొదటివి రెండూ సాపేక్షకాలు, మిధ్యలు !


ఋభు నిధాఘ సంవాదము"

15వ అధ్యాయము 


అనుభవైకవేద్యమైనది ఏదైనా బోధనకు దుర్లభమే !!

ప్రకృతిలోని చరాచర జీవరాశులన్నీ "నేను” అనే భావం లేకుండానే జీవనం సాగిస్తున్నాయి. మనిషి తానేమిటో, తానెలా భగవత్ స్వరూపమో తెలుసుకునేందుకే ఈ "నేను” భావన ఏర్పడుతుంది. ఆ భావాన్ని ఆదిశగా ఉపయోగించుకుంటే అది ఆనందమయమైన జీవనాన్ని ప్రసాదిస్తుంది. ఇది దుర్లభమైన బోధనగా ఋభు మహర్షి సెలవిచ్చారు. అనుభవైకవేద్యమైనది ఏదైనా బోధనకు దుర్లభమే. పెద్దల మాటలను ఆచరిస్తూ, అనుసరిస్తూ వెళ్ళడం ద్వారానే ఇది సంభవం అవుతుంది. అవగాహనతో ఆచరణాత్మకమైన బోధ మాత్రమే ముక్తి హేతువు అవుతుంది. సత్యం ఎడల దృఢవిశ్వాసంచేత బోధన విన్న మాత్రముననే ఎటువంటి సంశయాలకు తావులేని అవగాహననిస్తుంది. అది ఫలవంతమై మనలోనే ఉన్న ఆనందస్థితిని మనకు అందిస్తుంది !


 🌷90-మంద్రగీత🌷

అధ్యాయము-7

🥀 శాస్త్రవిజ్ఞానము🥀


21. ఎవడెవడు ఏ యే దేవతయందు శ్రద్ధ కలిగి వర్తించునో వానికి ఆ శ్రద్ధకు తగిన ఫలము, నేనే ఆ దేవతల రూపమున ఇచ్చుచున్నాను.

22. ఆ సాధకుడు తన ప్రకృతి నుండి పుట్టు శ్రద్ధచే ఆయా ఆరాధన చేయును. తగిన కోరికలకు మాత్రము సిద్ధిని నేను నిర్ణయించి తద్రూపమున ఇచ్చుచున్నాను.

23. ఇట్లే దేవతను ఆరాధించు వాడయినను పరిమిత బుద్ధియే! వానికి కలుగు ఫలము గూడ పరిమితము. కారణమేమనగా వాడు కోరగలిగినదియు పరిమితమే! దేవతల యజ్ఞము చేయువారు దేవతలనే పొందుదురు. నా యజ్ఞార్థము పనిచేయు వారు నన్ను చేరుదురు.

24. నేను వ్యక్తము కాకుండియు వ్యక్తమవుచున్నాను. నా అవ్యక్త తత్వము వ్యక్తులు గ్రహింపలేరు. కనుక సృష్టిగ వ్యక్తమగుచున్నాను. అప్పుడు సృష్టియని తెలియుచున్నారు గాని నేనని తెలియుటలేదు. మనుష్య దేహమున వర్తించు నన్ను మనుష్యుడు అనుకొనుచున్నారు. వ్యక్తమైన నన్ను చూచి కూడా అవ్యక్త మూర్తిగా గుర్తించుకొని దైవ భావన నిలుప లేకున్నారు.  వ్యక్త తత్వమును ఎరిగిన జ్ఞానము వ్యక్త జ్ఞానము కాని నా జ్ఞానము కాదు. తెలిసికొనుట అగును కాని తెలివి అగుట కాదు.

***

  103) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


సంసారః పరమార్థోఽ యం సఁల్లగ్నః స్వాత్మావస్తుని ౹

ఇతి భ్రాన్తి రవిద్యా స్యా ద్విద్యయైషా నివర్తతే ౹౹10౹౹


10. ఈ సంసారము పరమ సత్యము,పరమాత్మకు చెందినది అనే భ్రాంతియే అవిద్య.విద్యచే ఇది నివారింపబడుచున్నది.

ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునః ౹ ఇతి బోధో భవేద్విద్యా లభ్యతేఽ సౌ విచారణాత్ ౹౹11౹౹

11. "ఆత్మభాసయగు జీవునిదే సంసారము.పరమాత్మది కాదు" అనే జ్ఞానమే విద్య.విచారణ వలన ఈ జ్ఞానము కలుగును.

సదా విచారయేత్తస్మా జ్జగజ్జీవ పరాత్మనః ౹ జీవ భావ జగద్భావ బాధే స్వాత్వైవ శిష్యతే ౹౹12౹౹

12. కనుక సర్వదా జీవుడు జగత్తు పరమాత్మలను గూర్చి విచారింప వలెను.జీవుడనే భావము జగత్తు అనే భావము బాధ చెందినపుడు ప్రత్యగాత్మ స్వరూపమగు పరమాత్మయే మిగులును.బాధ అనగా అవి సత్యమనే భావము నశించుట.

***

 శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

మోహనరాగః - ఆదితాళమ్‌..

భజరే - రఘువీరమ్‌.

భజరే రఘువీరం - మానస

భజరే రఘువీరమ్‌ (బహుధీరమ్‌).


1. అమ్బుదడిమ్భ విడమ్బనగాత్రం

అమ్బుదవాహస నన్దనగాత్రమ్‌ || భజ||

2. కుశిక సుతాపిత కార్ముకవేదం

వశిహృదయామ్బుజ భాస్కరపాదమ్‌|| భజ||

3. కుణ్డల మణ్డన మణ్డిత కర్ణం

కుణ్డలి మఞ్చక మద్భుత వర్ణమ్‌ || భజ||

4. దణ్డిత సున్ద సుతాదికవీరం

మణ్డిత మనుకుల మాశ్రయశౌరిమ్‌ || భజ||

5. పరమహంస మఖిలాగమ వేద్యం

పరమవేద మకుటీ ప్రతిపాద్యమ్‌|| భజ||

తాత్పర్యము:-

1. మనమా! శ్రీరఘువీరుని శ్రీరాముని సేవింపవే! పిల్ల మబ్బులను వెక్కిరించు నల్లని మేనుగల ఘునందనుని - ఇంద్రుని బిడ్డయైన జయంతుని బాలించిన ప్రభువును ఆరాధింపవే!

(రామవనవాసవేళ అమ్మరొమ్ములమధ్య నెత్తురోడునట్లు ముక్కుతో బొడిచిన కాకాసురుడు జయంతుడే. వానిపై బ్రహ్మాస్త్రమును బ్రయోగించియు శరణొందగా స్వామి కరుణించినాడు.)

2. కుశికాత్మజుడైన విశ్వామిత్రునినుండి ధనుర్వేదము నెల్ల గ్రహించిన రామచంద్రుని -

రవికిరణములు తామరలను వికసింపజేసినట్లు జితేంద్రియులైన మునుల హృదయములకు వికాసముగూర్చు శ్రీరామచంద్రుని సేవింపవే!

3. ఆదిశేషుని శయ్యగా గొని - కుండలాలంకృత కర్ణుడైన ఆస్వామి శరీరచ్ఛాయ అద్భుతమైనదే! ఆ స్వామి నోచిత్తమా సంస్మరింపవే!

4. సుందుని కొడుకులైన మారీచసుబాహులను - ఇల్లా లైన తాటకను దండించిన వీరుని -

తానవతరించి మనువంశమునకు గొప్పఖ్యాతిని గూర్చిన శౌరిని రఘునాథుని ఆశ్రయింపవే! ఆశ్రయించి సేవింపవే!

పరమహంసస్వరూపియై - (పరమశివేంద్రుల రూపమున నున్న) వేదవేద్యుడైన ఆ స్వామిని వేదములకు కిరీటములు అనదగిన ఉపనిషత్తులు పరబ్రహ్మమని ప్రతిపాదించుచున్నదే! మానసమా! నీ వారఘుకులతిలకు నాశ్రయించి మేలొందవే!

***

 *||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-2-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩


తస్యాత్మజాస్త్వయుతమీశ! పునస్సహస్రం

శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః

నైకత్ర వాసమృషయే స ముమోచ శాపం

భక్తోత్తమస్త్వృషిరనుగ్రహమేవ మేనే।।

భావము:-

ఈ దక్షునికి ప్రప్రథమంగా పదివేల మంది పుత్రులు కలిగిరి. పిదప మరియెుక వేయి మంది పుత్రులు జన్మించిరి. వారికి నారదమహర్షి నీ (నారాయణుని) మార్గమును ఉపాసించమని ఉపదేశించెను. అది (తనపుత్రులు ప్రజాసృష్టిని విడిచి పుచ్చుట) మెచ్చని దక్షుడు - “స్థిరనివాసములేక సదా సంచరించు” మని నారదమహర్షిని శపించెను. నీ భక్తులలో ఉత్తముడగు నారదమహర్షి - ఆ దక్షుని శాపమునకు వెరువక, ఆశాపమును అనుగ్రహముగా స్వీకరించెను.

వ్యాఖ్య:-

ఈరోజు శ్లోకం లో వచ్చిన నారదుడికి దక్షుడు ఇచ్చిన శాపం గురించి నిన్ననే చదివేసుకున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు లోకోపకారి నారదుడికి ఎవరికి వరు ఏ ఏ శాపాలిచ్చారో చూద్దాం.

ఇక్కడివక్కడ అక్కడివిక్కడ చెప్పి తగాదారేపి తమాషా చూసేవాణ్ని నారదుడని అంటూ ఉంటాం. నారదుణ్ని తలచుకోగానే "కలహభోజనుడు" బిరుదూ తగిలిస్తాం. కలహాలు కడుపు నింపుతాయా అంటే - కలహాల వల్ల చివరకు లోక కళ్యాణమే జరుగుతుంది. కాబట్టి కలహం కూడా కమనీయమే!

"నారద" అంటే జలాన్నిచ్చేవాడు అని అర్థం. వామనావతారం ధరించిన విష్ణువు ఒక అడుగు భూమి మీద, మరో అడుగు ఆకాశంలోకి వేసినపుడు - ఆ భగవంతుని పాదాలు కడగడానికి బ్రహ్మ "నారద" అన్నాడు. అలా జలాలను తెచ్చి తండ్రికి ఇచ్చాడు నారదుడు. బ్రహ్మ తొడనుండి పుట్టినవాడుగా చెపుతారు. కంఠం నుండి పుట్టిన వాడిగా చెపుతారు. బ్రహ్మ మానసపుత్రుడుగా నారదుణ్ని అందరూ గుర్తిస్తారు.

గౌరవిస్తారు. మనిషికి కావలసిన జ్ఞానాన్ని అందించేవాడని కూడా అర్థం ఉంది. నారదుడు త్రిలోక సంచారి. సంసారమూ లేదు. సంతానమూ లేదు. ఉన్నదల్లా హరిభక్తి. అదే అతని శక్తి! పుట్టిన వెంటనే తల్లి సరస్వతి దగ్గరకు పోయి సంగీత విద్యని నేర్చుకున్నాడు. వాయుదేవుని వల్ల "మహతి" అనే వీణను పొందాడు. కొడుకు గానామృతాన్ని విన్న బ్రహ్మ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. 

"నారాయణ.. నారాయణ" అని సమస్యవున్న చోటల్లా ప్రత్యక్షమయ్యేవాడు. లేని సమస్యను సృష్టించేవాడు. ఉన్న సమస్యని తీర్చేవాడు. నిందలు అతనికి విందులు! ఇంతకీ నారదునికి సమస్యలు లేవా? కష్టాలు లేవా? ఉన్నాయి.

ఒకరోజు బ్రహ్మ కుమారులను పిలిచి, మీకు తగ్గ అందాల అతివల్ని సృష్టిస్తాను, పెళ్ళి చేసుకొని ప్రజా సంతతి పెంచమని కోరాడు. హరి మీద తప్ప మరొకరి మీద మనసులేదని నారదుడు చెప్పాడు. బ్రహ్మకు కోపం వచ్చింది. స్త్రీ లోలుడవవుతావని శపించాడు. బ్రహ్మకు పూజాధికాలు లేకుండా ప్రతిశాపమిచ్చాడు నారదుడు. అలా ఓ గంధర్వుని ఇంట ఉప బర్హనుడై పుట్టి లాలావతినీ ఆమె చెల్లెళ్ళను పెళ్ళాడాడు. 

బ్రహ్మలోకాన దేవసత్రయాగానికి భార్యలతో వెళ్ళి - రంభను చూసి కన్ను గీటి సభా మర్యాదను పాటించక శాపానికి లోనయ్యాడు. లీలావతి ప్రతిశాపంతో ఉపశమనమూ పొందాడు నారదుడు. తిరిగి బ్రహ్మలోకంలో పుట్టాడు. మళ్ళీ అదే కోరిక కోరాడు బ్రహ్మ. 

పెళ్ళి చేసుకొని పిల్లల్ని కంటే పున్నామ నరకం నుండి తప్పిస్తానని చెప్పడంతో నారదుడు అంగీకరించాడు. కాని పెళ్ళివేపు మనసు పోలేదు. హరి మీదికే మళ్ళింది. తపస్సుకు దిగాడు. ఇంద్రుడు భయపడ్డాడు. అప్సరసల్ని పంపాడు. గురికాకుండా కామాన్ని జయించాడు నారదుడు. శివశక్తి తప్ప నీ శక్తికాదని విష్ణువు చెప్పినా గర్వంతో నారదుడు నమ్మలేదు. ఫలితంగా అంబరీషుని పుత్రికను పెళ్ళాడడానికి స్నేహితుడైన పర్వతునితో పోటీపడ్డాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు విష్ణువుని కలిసి - ఒకరిది కోతి ముఖం అవ్వాలని మరొకరు - ఇద్దరూ ఒకే కోరిక కోరాడు. అలా ఇద్దరూ కోతి ముఖాలతో కనబడి అవమానం పాలయ్యారు. 

తమకు దక్కవలసిన అమ్మాయిని విష్ణువు పెళ్ళి చేసుకోవడం చూసి భార్యవియోగం పొందుతావని శపించి, వానరు(కోతు)ల మూలానే నీ భార్యని కలుసుకుంటావని ఉపశమనమిచ్చాడు. ప్రభావంగా రాముడై పుట్టినప్పుడు సీతకు దూరమయ్యాడు. నారదుని అహం అణిగింది. తండ్రికోరికమేరకు సృంజయుని కూతురు సుకుమారిని పెళ్ళాడాడు. వానర ముఖమున్నా భర్తతో భక్తిగా మెలిగింది సుకుమారి. అటువంటి కూతుర్ని ఇచ్చిన సృంజయునికి కొడుకు పుడతాడనీ - వాడి మల మూత్రాలు బంగారమవుతాయని వరం ఇచ్చాడు. 

హరి భక్తిలో నన్నుమించిన వారు లేరనుకొని విష్ణుమాయకు తలవంచాడు. తుంబురుని గానాన్ని లక్ష్మి మెచ్చుకోవడం తనని అవమానించడంగా భావించి రాక్షస గర్భంలో పుట్టమని శపించాడు. దక్ష ప్రజాపతి - కొడుకులను సంసార మార్గం వదిలి మోక్ష మార్గం పట్టించినందుకు - నీకు నిలకడలేకపోవుగాక! అని శాపానికీ గురయ్యాడు. కలహ భోజుడయ్యాడు. జలం ధరుణ్ని పార్వతి మీదికి ఉసిగొల్పి సంహారానికి సాయపడ్డాడు. ఇదే ఈ శ్లోకంలో ప్రస్తావించబడింది. 

***

-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩


అవతారిక - కర్మఫలములను త్యజించువాడే త్యాగియని వచించుచున్నారు – 


న హి దేహభృతా శక్యం 

త్యక్తుం  కర్మాణ్యశేషతః | 

యస్తు కర్మఫలత్యాగీ 

స త్యాగీత్యభిధీయతే || 


తాత్పర్యము : - కర్మములను పూర్తిగా విడుచుటకు దేహధారియగు జీవునకు సాధ్యము కాదు. ఎవడు కర్మలయొక్క ఫలమును విడుచుచున్నాడో అట్టివాడే త్యాగియని పిలువబడుచున్నాడు.



వ్యాఖ్య:- దేహధారియగు జీవుడు దేహసంరక్షణాదులకై కర్మను చేయవలసియే యున్నాడు. కావున కర్మలను సంపూర్తిగా విడచుట కాతనికి సాధ్యపడదు. ఇక్కారణమున ఆ యా కర్మలను చేయుచు వానిఫలములను విడచుటయే సర్వోత్తమమగు పద్ధతి. అట్టివాడిక ఆ కర్మలచే బద్ధుడు కానేరడు. మఱియు అట్టివాడే త్యాగియని చెప్పబడును.



త్యాగి యనగా బాహ్యవస్తువులను త్యాగముచేయువాడు కాదనియు, కర్మలను చేయుచు వాని ఫలములను వదులు వాడే త్యాగియనియు, అభిమానమును, సంగమును త్యజించువాడే త్యాగియనియు ఈ శ్లోకముద్వారా వెల్లడియగుచున్నది. కేవలము కర్మలను వదలివేసినంత మాత్రమున మనుజుడు త్యాగికానేరడు, త్యాగఫలమును బొందనేరడు. కర్మలను గావించుచు వాని ఫలములను వదలువాడే త్యాగి యగును. మఱియు త్యాగఫలమును బొందగలుగును.



 దీనిని బట్టి అంతరంగమునగల త్యాగిత్వము ఫలాపేక్షారూప (దేహాభిమానరూప) అంతరంగమనోవృత్తియొక్క త్యాగముపైననే ఆధారపడియున్నదిగాని బాహ్యవస్తువులయొక్క పరిత్యాగముపై గాదని స్పష్టపడుచున్నది. కావున కర్మలను జేయవలెననియు, కాని ఫలాభిసంధిరహితముగ చేయవలెననియు భగవంతుని ఆశయమై యున్నట్లు  తెలియుచున్నది.



ప్రశ్న:- కర్మలను పూర్తిగ విడచుట సాధ్యపడునా?


ఉత్తరము:- దేహధారియగు జీవున కది సాధ్యపడదు.



ప్రశ్న:- త్యాగి అనగా ఎవడు?


ఉత్త6: - ఎవడు కర్మలజేయుచు వాని ఫలములను వదలివేయునో ఆతడే త్యాగి యనబడును (అంతియే కాని కర్మలను వదలినవాడుకాదు).


🕉🌞🌎🌙🌟🚩

. గీతోపనిషత్తు  - 91 🌹

🍀 26 - 4. ప్రాణాయామ యజ్ఞము  -       ప్రాణాయామ హోమము జరుగు చుండగ ఏర్పడిన విరామముల యందు హృదయమున ప్రజ్ఞకు గోచరించునది స్పందనాత్మక చైతన్యము. ఈ చైతన్యమున ప్రవేశించినపుడు మనసు శ్వాస యొక దాని యందొకటి కరిగి రెండునూ లేని స్థితి యుండును.  సాధకుడు తాను స్పందనాత్మక చైతన్యుడనని తెలియును. 🍀


📚. 4. జ్ఞానయోగము  - 29, 30   📚

Part 4


పై విధముగ మూడు శ్వాసలు యొక విభాగముగ నిర్వర్తించు చున్నప్పుడు, కొంత తడవు పీల్చ నవసర మనిపించదు. అట్లే కొంత తడవు పీల్చిన శ్వాసను వదలవలె ననిపించదు. ఇట్లు సహజముగ జరుగును. ఇట్లు చేయుట హఠయోగము. ఇట్లు జరుగుట రాజయోగము. ఇట్లు జరుగుటకు చాలాకాలము పట్ట వచ్చును. త్వరితగతిని జరుగవచ్చును. అది సాధకుని పూర్వ సంస్కారమును బట్టి, శ్రద్ధనుబట్టి జరుగును.

ఇట్లు ప్రాణము పీల్చబడి- వదలబడకుండుట, వదలబడి- పీల్చబడకుండుట ప్రాణాయామ పరాయణులకు జరుగును. శ్వాస పీల్చబడి వదల బడకుండుటను 'పూరకము' అందురు. శ్వాస వదలబడి పీల్చబడ కుండుట 'రేచకము' అందురు. 

రెండు స్థితుల యందు కలిగిన విరామమును 'కుంభకము' అందురు. ప్రాణాయామ పరాయణులకు ఈ కుంభకము సిద్ధించును. పీల్చబడిన ప్రాణము అపానమై మలుపు తిరుగు సమయమున ఏర్పడిన విరామము అపానమున ప్రాణము హోమము చేయబడినదిగ చెప్పబడు చున్నది. 

అదే విధముగ వదలబడిన అపాన వాయువు ప్రాణవాయువుగ మలుపు తిరుగు సందర్భమున ఏర్పడిన విరామము, అపానము ప్రాణము నందు హోమము చేయబడు చున్నట్లుగ చెప్పబడినది. “ప్రాణాయామ తత్పరులగు వారు అపాన వాయువు నందు ప్రాణవాయువును, ప్రాణవాయువు నందు అపాన వాయువును హోమము చేయుచున్నారు. తత్కారణముగ ప్రాణాపానగతి నిరోధింపబడు చున్నది." అని భగవద్గీత శ్లోక అర్థము. (4-29)

అట్లే పై తెలిపిన ప్రాణాయామ పరాయణులు ఆహార వ్యవహారములను కూడ పై తెలిపిన హోమము ద్వారా నియమించుకొనుచు పవిత్రులై, పాపము నశించినవారై వెలుగొందు చున్నారు. అనునది రెండవ శ్లోక అర్థము. (4-30) 

పై తెలిపిన విధముగ ప్రాణాయామ హోమము జరుగు చుండగ ఏర్పడిన విరామముల సమయము పెరుగును. విరామముల యందు హృదయమున ప్రజ్ఞకు గోచరించునది స్పందనాత్మక చైతన్యము. ఈ చైతన్యమున ప్రవేశించినపుడు మనసు శ్వాస యొక దాని యందొకటి కరిగి రెండునూ లేని స్థితి యుండును. 

సాధకుడు తాను స్పందనాత్మక చైతన్యుడనని తెలియును. ఆ సమయమున బాహ్యస్మృతి యుండదు. అంతఃస్మృతి యుండును. ఆ స్మృతి కారణముగనే, తాను స్పందనాత్మ కుడ నని తెలియును. స్పందనము చేయు శబ్దము తనకు సూక్ష్మముగ వినపడుచుండును. స్పందనము ద్వంద్వ చేష్ట.

అందువలన ద్వంద్వ శబ్దము వినబడును. అంతర్ముఖుడైన సాధకుడు ద్వంద్వ శబ్దమును వినుచు ద్వంద్వ చేష్టయందు లగ్నమై యుండును. ఈ ద్వంద్వ శబ్దమే 'సోలి హం'. దాని ద్వంద్వ చేష్టయే ప్రజ్ఞ స్పందనముగ విచ్చుకొనుట, ముడుచుకొనుట. 

దీనిని పెద్దలు హంసతో పోల్చిరి. గరుడ పక్షితో పోల్చిరి. పావురముతో కూడ పోల్చిరి. విచ్చు కొనుట, ముడుచుకొనుట యనునది ఆధారముగ తానున్నాడని సాధకునకు తెలియును.

***

. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 176 🌹

🌻. మార్కండేయ మహర్షి  - 2 🌻

10. చిన్నవాడే అయినా, మార్కండేయుడు, మృత్యుదేవతతో పోరాడి రుద్రుడి రక్షణతో చిరంజీవి అయ్యాడు. అంటే తరువాత మృత్యువులేదు. కాకపోతే శరీరాన్ని వదిలిపెట్టి ఉండవచ్చు. దానిని మృత్యువు అని అనకూడదు. ఆ అర్థంలో అతడు చిరంజీవి. 

11. యోగబలంతో శరీరాన్ని వదిలి పెట్టటమే ఆర్యులయొక్క అత్యుత్తమమైంటువంటి achievement. చాలా గొప్ప సాధనచేసారు వాళ్ళు. మృత్యువాత పడటం వారెవరికి ఇష్టం లేదు. 

12. ఆత్మబలం, ఆత్మగౌరవం, మనోబలం, యోగబలం ఉన్నవాడు ‘నేను చావను’ అని తీర్మానించుకుంటాడు. తన ఇష్టం వచ్చినప్పుడు, తను కావాలనుకున్నప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి తానే వెళ్ళిపోయాడు. అదీ ఆర్యధర్మం.

13. మహాభారతకాలంలో పాండవులు అర్ణ్యవాసం చేస్తున్నప్పుడు, మార్కండేయుడికి ఉపచారంచేసి, ఆయనకు పాదపూజచేసి తనకు తత్త్వబోధ చెయ్యమని అడిగాడు యుధిష్టరుడు, అప్పుడు మార్కండేయుడు ఆయనతో, “యుధిష్ఠరా! ప్రథమకల్పంలో బ్రహ్మ పరమపవిత్ర్ములైనవి, ధర్మపరతంత్రములైనవి, ధర్మబద్ధములైనటువంటి మనోబుద్ధిచిత్తములు కలిగినటువంటి మానవశరీరాలను మాత్రమే సృష్టించాడు. 

14. తరువాత ధర్మ స్వరూపులయిన జీవులను సృష్టించాడు ఆ కల్పంలో వాళ్ళందరూ మహాసత్వ సంపన్నులు, సత్యవాదులు, సత్యసంకల్పులు, బ్రహ్మభూతాత్ములు, స్వఛ్ఛంద జీవులు, మృత్యుంజయులు, ధర్మాజ్ఞులు, సర్వము తెలిసినవాళ్ళు. మాత్సర్యం మొదలయిన అవలక్షణాలు ఏవీ వారికి లేవు. అనేకశాస్త్రములు తెలిసిన వాళ్ళు. 

15. ఒక్కొక్కళ్ళు సంతానము కలిగి బహుసంవత్సరముల ఆయుర్దాయము కలిగినవాళ్ళు. రానురాను కల్పంతరువాత కల్పం వచ్చినప్పుడు, అల్పాయుష్కులైన మనుష్యులు పుట్టారు.

16. మన సైన్సు చెప్పే సృష్టిక్రమం-ఎందుకూ పనికిరాని అజ్ఞానం లోంచీ, పశుప్రాయులైన కోతులనుంచీ మొదట మానవులు జన్మించి క్రమంగా వృద్ధికి వచ్చారని చెపుతూ తరువాత జీవులు ఇంత గొప్పవాళ్ళయారనీ, ఇదంతా Progressive గా చెపుతున్నది. ఇది మనవారి బోధకు, మన ఆర్యుల మూలానికి opposite గా ఉంది. 

17. ఈ బేధాన్ని అర్థంచేసుకోవడానికి ఋషులచరిత్ర చదువుతున్నాము. దీనివలన మన పూర్వులు గొప్ప జ్ఞాన సంపన్నులని, మన పురాణాలు చెప్పిందే సత్యమని, అదే మన మూలమని మనకు తెలుస్తుంది.

18. ప్రస్తుతం మానవులు అల్పాయుష్కులు, మాయాప్రవర్తనులుగా మారి క్షుద్రమయినవి, ఎందుకూ ఉవంటి ధనాదులను ఆశించి అధర్మం జోలికి వెళతారు. అధర్మాన్ని ఆశ్రయించి వీళ్ళు పొందబోయే వస్తువులేమిటంటే ఎందుకూ పనికి రానివి, క్షుద్రమయినవి. అల్పమయినవి. 

19. పోనీ సంపాదించినవాటిని అనుభవించే ఆయుర్ధాయం వీళ్ళకు ఉన్నదా అంటే అదీ లేదు. వీళ్ళు ఎప్పుడూ ఆశలో ఉండటంచేత దరిద్రులు వీళ్ళు. అల్ప బలశరీరులు. నిష్ఫలారంభులు. ఏఫలమూ ఇవ్వనటువంటి కార్యములను ఆరంభంచేస్తారు. బహురోగపీడితులు. నాస్తికులు.

***

. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 115 🌹

🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 20 🌻

482. ముల్లోకములు -- అయదార్ధమైనవి

ఆభాసమైనవి, కల్పితమైనవి, స్వప్నముల వంటివి.

483. దేనికైనను ఆది యున్నప్పుడే ; అంత్యము కూడా . జ్ఞానము X అజ్ఞానము

🌻. నిర్వాణము 🌻

నిర్మాణము - మనోనాశనము

484. చైతన్యము సంస్కారముల నుండి పూర్తిగా విడుదలై స్వేచ్ఛను పొందినప్పుడు, ముక్తి లేక' నిర్వాణము' అందురు.

***

. శ్రీ విష్ణు సహస్ర నామములు - 79  / Sri Vishnu Sahasra Namavali - 79 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ 


🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

పూర్వాషాడ నక్షత్ర తృతీయ పాద శ్లోకం

*🍀 79. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ|

వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః|| 🍀*

🍀 737. సువర్ణవర్ణః - 

బంగారు వర్ణము గలవాడు.

🍀 738. హేమాంగః - 

బంగారువన్నెగల అవయువములు గలవాడు.

🍀 739. వరంగః - 

అమోఘమైన అవయువములు గలవాడు.

🍀 740. చందనాంగదీ - 

చందనముతో అలంకృతమైనవాడు.

🍀 741. వీరహా - 

వీరులను వధించినవాడు.

🍀 742. విషమః - 

సాటిలేని వాడు.

🍀 743. శూన్యః - 

శూన్యము తానైనవాడు.

🍀 744. ఘృతాశీః - 

సమస్త కోరికలు నుండి విడువడినవాడు.

🍀 745. అచలః - 

కదలిక లేనివాడు.

🍀 746. చలః - 

కదులువాడు.

***

 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  పదమూడవ అధ్యాయము

బ్రహ్మదేవుడు గోపాలురను, గోవత్సములను అంతర్ధానము చేయుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

13.1 (ప్రథమ శ్లోకము)

సాధు పృష్టం మహాభాగ త్వయా భాగవతోత్తమ|

యన్నూతనయసీశస్య శృణ్వన్నపి కథాం ముహుః॥8765॥

శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! నీవు భగవద్భక్తులలో మేలుబంతివి. ఎంతయు అదృష్టవంతుడవు. అందువలననే  నీవు సముచితమైన  ప్రశ్న వేసితివి. శ్రీహరి కథలను పదేపదే వినుచున్నను నీకు తనివితీరుటలేదు. వాటిని ఎన్నిమార్లు విన్నను అవి క్రొంగొత్తగనే కనిపించుచుండును.  

13.2 (రెండవ శ్లోకము)

సతామయం సారభృతాం నిసర్గో  యదర్థవాణీశ్రుతిచేతసామపి|^

ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్స్త్రియా విటానామివ సాధువార్తా॥8766॥

కాముకులు స్త్రీలను గురించి మిగుల ఆసక్తితో మాటిమాటికి మాటలాడెదరు. మైమరచి వినుచుండెదరు. అట్లే సత్ఫురుషులు శ్రీహరికి సంబంధించిన కథలను వింటూ, కీర్తించుచూ, మనసులో ధ్యానించుచు నిరంతరము నిత్యనూతనముగా అనుభవించుచూ మహదానందమును పొందెదరు. సారమును గ్రహించెడు సాదుజనుల  సహజస్వభావములు ఇట్లే ఉండునుకదా!


13.3 (మూడవ శ్లోకము)


శృణుష్వావహితో రాజన్నపి గుహ్యం వదామి తే|


బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత॥8767॥


పరీక్షిన్మహారాజా! నీవు అడిగిన ఈ భగవల్లీలా విషయము పరమగోప్యమైనది. ఐనను తెల్పెదను, సావధానుడవై వినుము. సద్గురువులు భక్తి శ్రద్ధలుగల తమ ప్రియశిష్యులకు ఆయా విద్యలలోగల గుప్తవిషయములను గూడ సాకల్యముగా బోధించుచుందురు.


13.4 (నాలుగవ శ్లోకము)


తథాఘవదనాన్మృత్యో రక్షిత్వా వత్సపాలకాన్|


సరిత్పులినమానీయ భగవానిదమబ్రవీత్॥8768॥


ఆ విధముగా మృత్యురూపములో వచ్చిన అఘాసురుని వదనమునుండి గోపాలురను రక్షించిన పిదప, కృష్ణభగవానుడు వారిని యమునా నదీ తీరమున గల ఇసుకతిన్నె మీదికి తీసికొనిపోయి ఇట్లు వచించెను.


13.4 (ఐదవ శ్లోకము)


అహోఽతిరమ్యం పులినం వయస్యాః స్వకేలిసంపన్మృదులాచ్ఛవాలుకమ్|


స్ఫుటత్సరోగంధహృతాలిపత్రికధ్వనిప్రతిధ్వానలసద్ద్రుమాకులమ్॥8769॥


ప్రియమిత్రులారా! మిగుల రమ్యముగానున్న ఈ ఇసుకతిన్నె చూడముచ్చట గొలుపుచున్నది. ఇందలి ఇసుక స్వచ్ఛమై (నిర్మలమై)  మెత్తగా నుండుటవలన ఇది మన ఆటపాటలకు అనువైనది. ఈ సరస్సునందలి పద్మములు బాగుగా వికసించి, చక్కని పరిమళములను వెదజల్లుచున్నవి. ఆ సువాసనలకు ఆకర్షితములై వాటిపై జేరిన తుమ్మెదల యొక్క ఝంకారములు, జలములలో విహరించుచున్న పక్షులయొక్క కలకలారావములు తీరమునగల వృక్షములయందు ప్రతిధ్వనించుచున్నవి.


13.6 (ఆరవ శ్లోకము)


అత్ర భోక్తవ్యమస్మాభిర్దివా రూఢం క్షుధార్దితాః|

వత్సాః సమీపేఽపః పీత్వా చరంతు శనకైస్తృణమ్॥8770॥

మధ్యాహ్న సమయమైనది. మనము మిక్కిలి ఆకలిగొనియున్నాము. కనుక మనము భుజించెదము. ఆవులదూడలు ఈ మధుర జలములను కడుపునిండా త్రాగి, మృదువుగా నున్న ఇచటి పచ్చికలను మేయుచు ఈ సమీపముననే హాయిగా తిరుగుచుండగలవు.

13.7 (ఏడవ శ్లోకము)

తథేతి పాయయిత్వార్భా వత్సానారుధ్య శాద్వలే|

ముక్త్వా శిక్యాని బుభుజుః సమం భగవతా ముదా॥8771॥


అంతట గోపబాలురు 'అట్లే' అని ఉత్సాహముతో ఆవుదూడలచే నిర్మలజలములను త్రాగించిరి. ఒత్తుగా (గుబురుగా) నున్న మెత్తని పచ్చికలుగల పల్లపు ప్రదేశములలో వాటిని నిలిపిరి. పిదప వారు అందఱును కృష్ణప్రభువుతోగూడి సంతోషముగా చల్దుల మూటలను విప్పి, ఆరగింపసాగిరి.


13.8 (ఎనిమిదవ శ్లోకము)


కృష్ణస్య విష్వక్పురురాజిమండలైరభ్యాననాః ఫుల్లదృశో వ్రజార్భకాః|


సహోపవిష్టా విపినే విరేజుశ్ఛదా యథాంభోరుహకర్ణికాయాః॥8772॥


పద్మములయొక్క కర్ణికకు (తామరదుద్దునకు) చుట్టును పత్రములు దట్టముగా శోభిల్లుచుండునట్లు, వ్రజబాలురు శ్రీకృష్ణుని చుట్టునుజేరి, పెక్కు వరుసలలో మండలాకారమున దగ్గర దగ్గరగా కూర్చుండిరి. వారి ముఖములన్నియును ఆ ప్రభువు వైపునకే తిరిగియుండెను. వారి కన్నులు ఆ స్వామినే దర్శించుచు ఆనందముతో వికసించుచుండెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి   పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


 శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


745వ నామ మంత్రము


ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః


ముసలితనపు అగచాట్లనే చీకట్లను పోగొట్టడానికి తానొక రవికిరణమై విరాజిల్లు జగజ్జననికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి జరాధ్వాంతరవిప్రభా యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు, వయసు మీదపడి ముసలితనము వచ్చినా, జగన్మాత ఆరాధనకు అవరోధమయే ముసలితనపు అగచాట్లు లేకుండా కాపాడును. సుఖశాంతులు ప్రసాదించి, ఆత్మానందానుభూతితో తరింపజేయును.


జరా అనగా ముసలితనము (అనే) ధ్వాంత అనగా చీకటి (కి) రవిప్రభా అనగా సూర్యకిరణముల (వంటిది).


జీవితంలో చివరియవస్థ వృద్ధాప్యము. వృద్ధాప్యం చాలా భారమైనది. పరమాత్మ తనను తీసుకుపోతే చాలు అనుకునే అవస్థ వృద్ధాప్యము. కాటికి కాళ్ళు, కూటికి నోరు చాపుకుని ఉన్న పరిస్థితి. కళ్ళు సరిగా కనబడవు, చెవులు సరిగా వినిపించవు, ఇష్టంగా ఏదైనా   తినాలంటే అరగని పరిస్థితి, నాలుగడుగులు వేసి నడవాలంటే కర్ర చేతికి ఉండాలి. ఇదే జరాధ్వాంతము (ముసలితనపు చీకటి) అంటే.  తనభక్తులకు ముసలితనం అనే చీకట్లు పోగొట్టడానికి తానొక రవికిరణమై జగన్మాత విరాజిల్లుచున్నది గనుకనే  ఆ తల్లి జరాధ్వాంతరవిప్రభా యను నామము కలిగియున్నది. ఈ సందర్భంలోనే ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు:

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

సేకరణ


పూర్తిగా చదివితే ఆదిశంకరులు ఏమి చెప్పారో అర్థమవుతుంది


 

నరం వర్షీయాంసం -  నయనవిరసం నర్మసు జడం


తవాపాంగాలోకే - పతితమనుధావంతి శతశః |


గలద్వేణీబంధాః - కుచకలశ విస్త్రిస్త సిచయా


హటాత్ త్రుట్యత్కాంచ్యో -  విగలిత దుకూలా యువతయః॥


దేవి కటాక్షమహిమా వైభవం వలన ఎంతటి వికారరూపుడైన ముదుసలి కూడా సుందరాంగులను మోహింపజేయగలడు.


భావము:

అమ్మా..నీ కృపాకటాక్ష వీక్షణం అపూర్వము కదా తల్లీ..ఏ పురుషునిపై నీ కరుణ దృష్టి ప్రసరిస్తుందో అతను వయసుడిగిన ముసలివాడైననూ, కనుచూపు మందగించి కన్నులకు పుసులు కట్టి అందవిహీనముగా ఉన్నా, కామ కళా చతుర పరిహాస నర్మభాషణములందు మూఢుడే అయినా వాడు నీ కడగంటి చూపుల కారుణ్యమునకు పాత్రుడగుటచే అతనిలో మన్మథుని దర్శించి మధవతులైన జవ్వనపు నవ యవ్వనవతులు వందలాదిగా అతని చుట్టూ గుమిగూడి, తమ జడముడులు కురులు విడిపోతున్నా పయోధరములపై పయ్యెదలు తొలగిపోవుచున్నా, తమ నడుముకి ఉన్న రతనాల మొలనూల్లు క్రిందకి జారిపోతున్నా తాము కట్టుకున్న వలువలు విడివడి ఊడిపోవుచున్నా వడివడిగా బిరబిర పరుగులిడి వచ్చి, బిడియము వీడి తమను స్వీకరించమని నీ దయాభిషిక్తుని వెనుక వెంటబడుచుందురు.


అమ్మవారి కడగంటి చూపు ఎంత మహత్తరమైన ప్రభావం కలదో శ్రీశంకరులు చమత్కారంగా చెబుతున్నారు.


నరం వర్షీయాంసం అంటే బాగా వయసు మీదబడ్డ ముసలివా డయిన మనిషి.


నరం నయనవిరసం అంటే కళ్ళకు ఏమాత్రం ఇంపుగా లేని ఆకారం కలవాడైన మనిషి.


నరం నర్మసు జడం అంటే వఠ్ఠి మందబుధ్ధి, ఓ సరసం చట్టుబండలూ తెలియని మానవుడు. ఇలాంటి వాడిని ఎవరైనా మెచ్చుకుంటారా?


ఇలాంటి మగవాడిని ఏయువతి ఐనా కన్నెత్తి చూస్తుందా?


ఒక్కనాటికీ అలా ఏ యువతీ కూడా చేయదు.


అపాంగం అంటే క్రీగంటి చూపు అని అర్థం. ఆలోకనం అంటే చూడటం. తవ + అపాంగే + ఆలోకే -> తవాపాంగేలోకే అంటె అమ్మా నీ యొక్క కడగంటి చూపు అని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ.


తవాపాంగేలోకే పతితమ్‌ అంటే ఏ పురుషుడి మీద ఐతే అమ్మా నీ‌ యొక్క కడగంటి చూపు పడిందో వాడు అని, వాడికి పట్టే అదృష్టాన్ని వర్ణిస్తున్నారు.


ఏమిటట వాడికి పట్టే అదృష్టం?  వాడు ఎంతగా పనికిమాలిన వాడైనా సరే,  అంటే చీకు ముసలాడైనా, కురూపి ఐనా, మందబుధ్ధి ఐనా సరే, వాడిని శతశః యువతయః అనుధావంతి అని అంటున్నారు. అంటే వందలకొద్దీ అమ్మాయిలు వెంటబడి పరుగులు పెడతారట వాడి కోసం. ఎందుకు?   వాడికి అమ్మ కడగంటి చూపుల దయ దొరికిన కారణంగా.


ఆ వెంటబడటం కూడా ఏలాగనుకున్నారు?


గలద్వేణీ బంధః అనగా  జుట్టుముడి జారిపోతున్న వాళ్ళూగానూ,


కుచకలశ విస్రస్త సిచయా అనగా గుండెలనుండి పైటలు జారిపోతున్న వాళ్ళు గానూ,


హఠాత్ తృట్యత్ కాంచ్యః అనగా  హఠాత్తుగా మొలనూలు జరిపోతున్నవాళ్ళు గానూ


విగళిత దుకూలాః అనగా కట్టుబట్టలు ఊడిపోతున్నవాళ్ళుగానూ


ఆ మహానుభావుడి వెంట శతశః అంటే వందలమంది అమ్మాయిలు పరుగులు తీస్తూ వెంబడిస్తారట.


అదీ అమ్మవారి కడగంటి చూపు ఒక్కటి దక్కితే ఎంత ఘనమైన జగన్మోహనత్వం కలుగుతుందో ఎలాంటివాడికైనా అని శ్రీశంకరులు అనటం.


ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం‌ ప్రస్తావించాలి.  ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణగారు అందరికీ అక్షరాలు వచ్చాయి కాని అందరూ చదువరులు కారు అన్నట్లుగా వ్యాఖ్యానించారు ఏదో సందర్భంలో.  ఇక్కడ ఈ‌ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే రకరకాలుగా అర్థాలు తీసే ప్రమాదం ఉంది చదువరుల్లో కొందరు.  ఇలా ఒకే శ్లోకం లేదా ఒకే మాట జనంలో రకరకాలు అర్థం కావటానికి కారణం అధికార బేధం. ఈ‌ అధికార బేధం అనేది జన్మజన్మాంతరాలుగా సంపాదించుకొన్నదీ, ఈ‌ జన్మలో మనం మెఱుగు దిద్దుకుంటున్నదీ ఐన సంస్కారపు తీరుతెన్నులను బట్టి వస్తుంది. అదెలాగూ అంటే చూడండి.


అనధికారులుగా ఉన్నవాళ్ళు ఈ‌ శ్లోకం చదివి, చూసారా మీరేమో ఆ శంకరాచార్యులను ఇంతవారూ‌ అంతవారూ అంటారు, గొప్ప విజ్ఞానీ, వేదాంతీ అంటారు. అలాంటి వాడు ఇంత పచ్చి శృంగారవర్ణనతో వ్రాయటం ఏమిటీ అదీ‌ అమ్మవారి మిష పెట్టి? ఇదంతా చూస్తే ఈ వేదంతమూ వగైరా అంతా డొల్ల - పైపై మాటలే.  తలలు బోడులైన తలపులు బోడులా అన్నట్లు ఈయన తలలో చాలా పైత్యం ఉందీ‌ అని హేళన చేస్తారు.  దానికి కారణం? వాళ్ళకు శ్లోకంలో ముక్కస్య ముక్కార్థః అన్నట్లుగా అన్వయం చూసుకొని అదే దానికి నిజమైన అర్థం అనుకుని అక్కడే ఆగిపోవటం.  అంతే కాదు. వాళ్ళలో చాలా మంది విమర్శించటానికి నోరు చేసుకుందుకు ఎక్కడ సందు దొరుకుతుందా అని రంధ్రాన్వేషణ చేయటం కోసమే చదవటం మరొక ముఖ్యకారణం. వీళ్ళకి శ్లోకంలో మరేదన్నా అంతరార్థం ఉందా అన్నది పట్టదు. ఒక వేళ ఎవరన్నా సూచించినా బుధ్ధికి ఎక్కదు.  వీళ్ళతో‌ సమయం వృధా చేసుకోకూడదు.


అల్పాధికారులు కొందరుంటారు.  వాళ్ళూ శ్లోకంలో ప్రతిపదార్థం మాత్రమే గ్రహిస్తారు. విస్మయం చెందుతారు. ఓహో ఈ‌ శ్లోకం వలన స్త్రీవశ్యం లాంటి ప్రయోజనాలున్నాయన్న మాట అనుకుంటారు. వాళ్ళలో కొందరికి ఇలాంటీ అవసరాలు తోచవచ్చును.  వాళ్ళు ఇంక అటువంటి కోరికలతో శ్లోకాన్ని పారాయణం చేస్తారు. గీతలో భగవంతుడు చెప్పిన అర్థార్థులు వీరు. వీళ్ళకి లభించే ఫలితం స్వల్పమే. ఎందుకంటే వీళ్ళు చిత్తశుధ్ధితో శ్లోకాన్ని అవగతం చేసుకోలేదు కాబట్టి.


మధ్యమాధికారుల సంగతి. వీళ్ళకు శ్లోకంలో ఏదో‌ సంకేతికార్థం ఉండవచ్చును అనిపిస్తుంది. శంకరులు వెఱ్ఱివారా కేవలం‌ శృంగారదృష్టితో వ్రాయటానికి? అందుచేత సరైన అర్థం కోసం ఆరాటపడతారు. వారి సహజమైన భక్తిప్రపత్తుల కారణంగా సరిగా అర్థం చేసుకొనటానికి మరింత శ్రమిస్తారు. ఎవరైనా ఉత్తమాధికారులు అటువంటి సాంకేతికమైన సమధానంతో శ్లోకాన్ని అన్వయం చేస్తే ఆనందిస్తారు. 


ఉత్తమాధికారులు కొందరు. వారి సంఖ్య స్వల్పంగా ఉంటుంది. వారు పూర్వజన్మ సుకృతం కారణంగా ఈ శ్లోకంలో ఉన్న విషయాన్ని సరైన దృక్పధంతో అర్థంచేసుకో గలరు. వారు అమ్మవారిని గురించి శ్రీశంకరులు ఇలా ఎందుకు చెప్పారు అని విస్మయపడరు. మనలా పైపై అర్థం వారిని భ్రమపెట్టలేదు కాబట్టి. వీరు ఇతరులకు దిశానిర్దేశం చేయగలరు. ఇలాంటి వారి గురించే స్వయం తీర్ణః పరాం స్తారయతి అని చెప్పారు.


ఇప్పుడు ఈ‌ శ్లోకాన్ని మరింత నిశితంగా పరిశీలిద్దాం. మూడు రకాలైనా అసమర్థులను గురించి ప్రస్తావిస్తూ శ్లోకారంభం చేసారు.  వయస్సుచేత సామాజికంగా వెనుకబాటు తనానికి గురౌతున్నవాళ్ళనీ,  లోకం కంటికి ఆనని వాళ్ళనీ, మాటకారి తనం లేక ఈ లోకంలో నెగ్గుకుని రాలేకపోతున్న వాళ్ళనీ‌ ప్రస్తావించారు.


వయసులో ఎంత వెలుగు వెలిగినా, వయసుడిగి, ఆర్జన కరువై, ఇతరుల సహాయం మీద ఆధారపడ్డవారిని ఈ లోకం ఇప్పుడే కాదు ఆ శ్రీశంకరుల రోజుల్లోనూ‌ లోకువగానే చూసేది మరి.  భజగోవింద శ్లోకాల్లో, యావద్విత్తో పార్జనసక్త: తావన్నిజ పరివారో రక్త:। పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపీ న పృఛ్ఛతి గేహే అని చెప్పారు కదా? ఇంట్లో పడి ఉన్న ముసలాణ్ణి ఎవరు పట్టించుకుంటారూ అని!  వీళ్ళకి దేవుడే దిక్కు.


లోకం కంటికి ఆనకపోవటం అనేది ముఖ్యంగా ఆ వ్యక్తి వయస్సూ, వర్చస్సూ, సామాజికస్థితిగతులూ వగైరా సంతతుల మీద ఆధారపడి ఉంటుంది అని అందరూ ఒప్పుకుంటారు. సామాజికగౌరవం అనేది కేవలం ప్రతిభమీదనే లభించే అవకాశం తక్కువే. అలాంటి గౌరవం నోచుకోని వారికి భగవంతుడే సహాయం చేయాలి.


కొందరికి వయస్సూ ఉంటుంది. సామాజికంగా అన్ని ఆనుకూలతలూ ఉంటాయి. కాని ఏమీ మాటకారి తనం ఉండదు. పెళుసుమాటలో, నంగిమాటలో, సభాపిరికితనమో వీరిని జనామోదం పొందకుండా అడ్డుపడతాయి. ఇందులో చాలామందికి ఆ సమస్యను అధిగమించే దారి కనబడదు. వారికి కూడా భగవత్సహాయం అవసరమే.


శ్రీశంకరులు ఇలా ఏ కారణంగా జనామోదానికి దూరం అవుతున్నా సరే, అమ్మని వేడుకోండయ్యా అని సలహా ఇస్తున్నారు. ఆవిడ వాడి కేసి తిరిగి ఏమీ చేయనక్కర లేదు.  కేవలం ఒక్క సారి కడగంటితో చూస్తే చాలు వాడి వెంట సమాజం అంతా సమ్మోహితులై వెంటబడి మరీ గౌరవాదరాలలో ముంచెత్తుతారు అని నొక్కి చెబుతున్నారు. ఇలా లోకసమ్మోహనశక్తిని అమ్మ కడగంటి చూపు అనుగ్రహించటం అన్న దాంట్లొ సమ్మోహనం అన్న మాటమీద శృంగారపరమైన విస్తృతి కల్పిస్తూ, ఒక అసమర్థుడైన వాడి వెంట అమ్మ అనుగ్రహం స్త్రీజనాన్ని పరుగులు పెట్టించటం అనే ఉదాహరణగా చెప్పారు అంతే


అమ్మ కడగంటి చూపు అంత శక్తిమంతమైనదా అని ఎవరికైన సంశయం ఉంటే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి నోట అక్షరమ్ముక్క లేని ఒక కుర్రవాణ్ణి అమ్మ క్రీగంటి చూపు మహాకవి కాళిదాసు అనే కవికుల గురువును చేసిన సంగతిని.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ముసలితనం ఎవరికీ శాపం కాదు. అది జీవితమనే పుస్తకాన్ని చదివి, జీవితమంటే ఏమిటో సవివరంగా అందరికీ తెలియజేయడానికి మాత్రమే.


ముసలితనం అనేది బాధ్యతలు తీరిపోయిన అవస్థ. ఏమైనా చేద్దామన్నా వద్దనేవారే ఉంటారు. అంతవరకూ జీవితంలో పరమాత్మను స్మరించడం  జరగకపోతే కనీసం ఈ అవస్థలోనైనా పరమాత్మని మనసారా స్మరించుకునే అవకాశం.


తనకు సద్గతులు కలగాలన్నా, తెలిసిగాని, తెలియక గాని చేసిన పాపకర్మల ఫలముల దోషప్రభావంతగ్గాలన్నా, రోగములావహించకుండా, అనాయాస మరణం సంభవించాలంటే జగన్మాత నామస్మరణ ఒక్కటే శరణ్యం.  గనుక జగన్మాతకు నమస్కరించునపుడు ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః అని అనవలెను.

: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


171వ నామ మంత్రము


ఓం లోభ నాశిన్యై నమః


స్వపరభేదములు, దురాశ, పిసినారితనము మొదలైన అసురభావములను రేకెత్తించు లోభగుణము తన భక్తులకు లేకుండా నశింపజేసి, త్యాగ గుణవర్తనులుగా జేయు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి లోభనాశినీ యను ఐదక్షరముల నామ మంత్రమును ఓం లోభనాశిన్యై నమః  అని ఉచ్చరించుచు, అత్యంత భక్తిశ్రద్ధలతో జగన్మాతను అర్చించు భక్తులకు లోభగుణము లేకుండా, త్యాగగుణసంపన్నతను ప్రసాదించి తరింపజేయును.


అరిషడ్వర్గములలో ఒకటైన లోభగుణము మనిషిలోని మంచిగుణములను అన్నింటినీ నాశనంచేస్తుంది. ఆశారహితుడు, సంశయము లేనివాడు, సందేహములను పోగొట్టువాడు అని తంత్ర తంత్రరాజములో గురువుయొక్క లక్షణము చెప్పబడినది.


ఇంతకు ముందు 171వ నామ మంత్రములో  జగన్మాతను నిర్లోభా అని అన్నాము. అనగా లోభత్వం అనేది అరిషడ్వర్గములో ఒకటి. ఇది కేవలం మనసుకు సంబంధించినది. ఆత్మకు సంబంధించదు. జగన్మాత పరమాత్మ స్వరూపిణి. ఆ తల్లి తన భక్తులకు కోరిన కోరికలకు అనుగుణంగా, అత్యంత ఉదారతతో,  వారి ధర్మబద్ధమైన  కోరికలు తీరుస్తుంది. గనుకనే ఆ తల్లి నిర్లోభా యను నామ మంత్రముతో ఆరాధింప బడుచున్నది. తను ఏవిధంగా  నిర్లోభా యని అనబడినదో, తన భక్తులు కూడా లోభత్వం లేకుండా, వారు త్యాగబుద్ధితో తమకున్న కలిమిని తాము అనుభవిస్తూ, తమ వారిని సంతసింపజేస్తూ, త్యాగనిరతితో ఒరులకు కూడా సహాయపడేలాజేసి సద్గతులను అనుగ్రహిస్తుంది.


పుట్టినపుడు మనం తెచ్చేది ఏదీ ఉండదు. అలాగే గిట్టునపుడు తీసుకుపోయేది అసలే ఉండదు.  ఉన్నంత కాలం సంపాదించు కోవడం, తినడం, ఒరులకు ఇంత ఇవ్వడం. పూర్వ జన్మ సుకృతం వలన ఇబ్బడి ముబ్బడిగా సంపాదించే అవకాశం రావచ్చు. కాని ఆ సంపాదన ధర్మబద్ధమై ఉండాలి. అలాంటి సంపాదనలో తన భవిష్యత్తుకి, తనవారికి జాగ్రత్తచేసుకుంటూ ధర్మకార్యములకు కూడా వినియోగించడం త్యాగ లక్షణం. తనకున్నది తాను అనుభవించక, కనీసం సరైన తిండైనా తినక, మంచి బట్టకూడా కట్టక, తనవారిని కూడా అలాగే కట్టడి చేస్తూ,  ఒరులకు కూడా పెట్టక, భగవంతుని సేవకు కూడా అసలే వినియోగించక ఒక మహా లోభిగా ప్రవర్తించే వాడు ఆ పరమాత్మచే క్షమింపబడడు. పైగా పదిమందిలో అటువంటి లోభికి గౌరవంకూడా ఉండదు. ఇటువంటి లోభత్వాన్ని తన భక్తులకు నశింపజేసి, ధర్మగుణవర్తనులై నిలుపుతుంది. గనుకనే జగన్మాత లోభనాశినీ యని స్తుతింపబడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం లోభనాశిన్యై నమః అని అనవలెను.

 ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  పదమూడవ అధ్యాయము


బ్రహ్మదేవుడు గోపాలురను, గోవత్సములను అంతర్ధానము చేయుట


ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


13.9 (తొమ్మిదవ శ్లోకము)


కేచిత్పుష్పైర్దలైః కేచిత్పల్లవైరంకురైః ఫలైః|


శిగ్భిస్త్వగ్భిర్దృషద్భిశ్చ బుభుజుః కృతభాజనాః॥8773॥


అంతటవారు అందఱును తమకు వచ్చినరీతిగా పూలరేకులను, చిగురుటాకులను. అంకురములను (పఱచుకొనియున్న గడ్డి పఱకలను), పండ్లను, చిక్కములను , చెట్ల పట్టలను, చదునుగానున్న బండలను కంచములుగా జేసికొని, వేడుకపడుచు చల్దులను ఆరగించిరి.


13.10  (పదియవ శ్లోకము)


సర్వే మిథో దర్శయంతః స్వస్వభోజ్యరుచిం పృథక్|


హసంతో హాసయంతశ్చాభ్యవజహ్రుః సహేశ్వరాః॥


వారు ఎల్లరును కృష్ణయ్యతో గూడి, తాము తెచ్చుకొనిన ఆహారపదార్థములను తినుచు, లొట్టలు వేయుచు, వాటి రుచులణు పరస్పరము ప్రదర్శించుకొనుచుండిరి. కొందఱు తాము నవ్వుచు హాస్యోక్తులతో, చిలిపి చేష్టలతో ఇతరులను నవ్వంచుచు, మురిసిపోవుచుండిరి. ఈ విధముగా వారు చల్లులను ఆరగింపసాగిరి. 


13.11 (పదకొండవ శ్లోకము)


బిభ్రద్వేణుం జఠరపటయోః శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ మసృణకవలం తత్ఫలాన్యంగులీషు|


తిష్ఠన్మధ్యే స్వపరిసుహృదో హాసయన్ నర్మభిః స్వైః స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుగ్బాలకేలిః॥8775॥


యజ్ఞభోక్తయైన ఆ కృష్ణప్రభువు తన  చుట్టును చేరియున్న గోపబాలురమధ్య గూర్చుండి, తన చతురోక్తులతో (హాస్యోక్తులతో) వారిని నవ్వించుచు చల్దులను ఆరగించెను. అప్ఫుడు ఆ స్వామి నడుమునకు గట్టిగా చుట్టుకొనిన దట్టీలో తన వేణువును జొనిపెను. కక్షయందు కొమ్ముబూరను వేత్రమును (బెత్తమును) ధరించెను. ఎడమ అఱచేతియందు మీగడ పెఱుగుతో, నేతితో కలిపిన చల్దిముద్దను, వ్రేళ్ళమధ్యలో ఊరగాయ ముక్కలను పెట్టుకొనెను. ఈ విధముగా కొనసాగుచున్న ఆయన బాల్యక్రీడలను స్వర్గలోకమునందలి దేవతలు ఆశ్చర్యానందములతో తిలకించిరి. 


13.12  (పండ్రెండవ శ్లోకము)


భారతైవం వత్సపేషు భుంజానేష్వచ్యుతాత్మసు|


వత్సాస్త్వంతర్వనే దూరం వివిశుస్తృణలోభితాః॥8776॥


పరీక్షిన్మహారాజా! అచ్యుతుడే ఆత్మగా గలిగిన గోపబాలురు అందఱును చల్దులను ఆరగించుచు, ఆనంద దాయకములైన శ్రీకృష్ణలీలలయందే తన్మయులై యుండిరి. ఇంతలో ఆవుదూడలు పచ్చని (మెత్తని) పచ్చికలను మేయుటకై ఆశపడుచు  దూరముననున్న వనమునందు ప్రవేశించెను. అనగా దూరముగా వెళ్ళిపోయెను.


13.13  (పదమూడవ శ్లోకము)


తాన్ దృష్ట్వా భయసంత్రస్తానూచే కృష్ణోఽస్య భీభయమ్|


మిత్రాణ్యాశాన్మా విరమతేహానేష్యే వత్సకానహమ్॥8777॥


గోపబాలురు తమ గోవత్సములు కనపడకుండా దూరప్రదేశమునకు వెళ్ళిపోవుటను గమనించి, మిగుల భయగ్రస్తులైరి. భక్తులకు అభయప్రదాతయైన (భయములను తొలగించునట్టి) కృష్ణస్వామి 'మిత్రులారా! భయపడవలదు. మీరు చల్దులను హాయిగా ఆరగించుచుండుడు. ఇప్పుడే వెళ్ళి, నేను ఆ దూడలను తీసికొని వచ్చెదను' అని పలికెను.


13.14 (పదునాలుగవ శ్లోకము)


ఇత్యుక్త్వాద్రిదరీకుంజగహ్వరేష్వాత్మవత్సకాన్|


విచిన్వన్ భగవాన్ కృష్ణః సపాణికవలో యయౌ॥8778॥


అనంతరము ఆ కృష్ణయ్య చల్దిముద్దను తన చేతిలో ఉంచుకొనియే, కొండ సానువులయందును, పొదరిండ్లలోను, గుహప్రదేశముల యందును తమ ఆవుదూడలకొరకు వెదకసాగెను.


13.15 (పదునైదవ శ్లోకము)


అంభోజన్మజనిస్తదంతరగతో మాయార్భకస్యేశితుః|


ద్రష్టుం మంజు మహిత్వమన్యదపి తద్వత్సానితో వత్సపాన్|


నీత్వాన్యత్ర కురూద్వహాంతరదధాత్ఖేఽవస్థితో యః పురా|


దృష్ట్వాఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తః పరం విస్మయమ్॥8779॥


ఇంతకుముందే బ్రహ్మదేవుడు ఆకాశముననుండి కొండల వరుసవలె గొప్ప ఎత్తుగా, పొడవుగా వ్యాపించియున్న అఘాసురునకు మోక్షము ప్రసాదించిన శ్రీకృష్ణ మహిమను గాంచి, ఆశ్చర్యమునకు లోనై యుండెనుగదా! అంతట అతడు లీలామానుష విగ్రహుండైన కృష్ణప్రభువు యొక్క మఱియొక దివ్యమైన అద్భుత మహిమను చూడదలచెను. వెంటనే బ్రహ్మదేవుడు ఆ దృష్టితో మొదట గోవత్సములను, పిదప (శ్రీకృష్ణుడు దూడలను వెదకుటకై వెళ్ళిన పిమ్మట)  గోపబాలురను సైతము తీసికొనివెళ్ళి, వేఱొకచోట దాచియుంచి, తాను అంతర్హితుడయ్యెను. 


13.16  (పదహారవ శ్లోకము)


తతో వత్సానదృష్ట్వైత్య పులినేఽపి చ వత్సపాన్|


ఉభావపి వనే కృష్ణో విచికాయ సమంతతః॥8780॥


ఎంతగా వెదకినను ఆవుదూడలు కనబడకపోవుటతో శ్రీకృష్ణుడు తిరిగి నదీతీరమునగల ఇసుక తిన్నెకడకు చేరెను. కాని అంతవఱకును చల్దులను ఆరగించుచున్న గోపబాలురుగూడ అచట కనబడకుండిరి. అంతట ఆ స్వామి గోవత్సముల కొఱకును, గోపాలుర కొఱకును అన్వేషించుచు అంతటను తిరుగసాగెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి   పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


. శ్రీమద్భగవద్గీత - 570  / Bhagavad-Gita - 570 🌹

🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 14 🌴


14. దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |

బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ||


🌷. తాత్పర్యం : 

దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మికగురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగువారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస యనునవి శారీరిక తపస్సని చెప్పబడును.


🌷. భాష్యము  :

శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివిధ తపస్సులను, నిష్ఠలను వివరింపనెంచి తొలుత దేహసంబంధమైన తపోనిష్ఠలను వివరించుచున్నాడు. ప్రతియొక్కరు దేవదేవునకు లేదా దేవతలకు, పూర్ణులును యోగ్యులును అగు బ్రాహ్మణులకు, గురువునకు, తల్లిదండ్రుల వంటి పెద్దలకు, వేదజ్ఞానపారంగతుడైనవానికి గౌరవమొసగవలెను లేదా గౌరవమొసగుటను నేర్వవలెను. 


వీరందరును నిక్కముగా సరియైన గౌరవమందవలసినవారు. అంతియేగాక మనుజుడు అంతర్బాహ్యముల శుచిత్వమును పాటించుచు,వ్యవహారమున సరళత్వమును నేర్వవలెను.


 శాస్త్రమునందు తెలుపబడనటువంటి దానినెన్నడును అతడు ఆచరించరాదు. శాస్త్రమందు మైథునమన్నది వైవాహిక జీవనమునందు తప్ప అన్యముగా అంగీకరింపబడనందున అతడు అవివాహిక సంబంధమును కలిగియుండరాదు. ఇదియే బ్రహ్మచర్యమనబడును.ఇవియే దేహపరమైన తపోనిష్ఠలు. 

🌹 🌹 🌹 🌹 🌹


. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 150, 151 / Vishnu Sahasranama Contemplation - 150, 151 🌹

📚. ప్రసాద్ భరద్వాజ 


🌻150. పునర్వసుః, पुनर्वसुः, Punarvasuḥ🌻


ఓం పునర్వసవే నమః | ॐ पुनर्वसवे नमः | OM Punarvasave namaḥ


పునర్వసుః, पुनर्वसुः, Punarvasuḥ

పునః పునః వసతి శరీరేషు క్షేత్రజ్ఞరూపేణ ప్రాణుల శరీరములయందు క్షేత్రజ్ఞ (జీవ) రూపమున జన్మ పరంపరలో మరల మరల విష్ణువు తాను వసించుచుండును.


:: భగవద్గీత - సాఙ్ఖ్య యోగము ::

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ॥ 22 ॥


చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములగు క్రొత్త బట్టలనెట్లు ధరించుచున్నాడో, అట్లే దేహియగు ఆత్మయు శిథిలములైన పాతశరీరములను వదిలి ఇతరములగు క్రొత్త శరీరములను ధరించుచున్నది.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 151/ Vishnu Sahasranama Contemplation - 151🌹

📚. ప్రసాద్ భరద్వాజ 


🌻151. ఉపేంద్రః, उपेन्द्रः, Upendraḥ🌻


ఓం ఉపేంద్రాయ నమః | ॐ उपेन्द्राय नमः | OM Upendrāya namaḥ


ఉపేంద్రః, उपेन्द्रः, Upendraḥ

య ఉపగతవానింద్రమనుజత్వేన కేశవః ।

స్వీకృతవామనరూపస్స ఉపేంద్ర ఇతీర్యతే ॥


అనుజుని అనగా తమ్ముని రూపమున ఇంద్రుని సమీపమున చేరియున్నవాడు. లేదా ప్రసిద్ధుడగు ఇంద్రుని కంటెను పై గానున్న ఇంద్రుడు.


:: హరివంశము - ద్వితీయ ఖండము, ఎకోనవింశోఽధ్యాయము ::

మమోపరి యథేంద్ర స్త్వం స్థాపితో గోభిరీశ్వరః ।

ఉపేంద్ర ఇతి కృష్ణ త్వాం గాస్యంతి భువి దేవతాః ॥ 46 ॥


నేను ఎట్లు ఇంద్రుడనో అట్లే నీవు నాకు పైగా ఇంద్రుడుగా ఈశ్వరుడుగా (స్వామిగా) గోవులచే నిలుపబడితివి. అందుచేత కృష్ణా! నిన్ను భూమియందూ, దేవతలును ఉపేంద్రుడు అని గానము చేయుదురు.


:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::

క. అదితియుఁ గశ్యపుఁడును నన, విదితుల రగు మీకుఁ గురుచచేషంబున నే

    నుదయించితి వామనుఁ డన్ఁ, ద్రిదశేంద్రానుజుఁడనై ద్వితీయభవనమున్‍.


రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు.


(శ్రీకృష్ణుడు జన్మించినపుడు దేవకీ వసుదేవుల పూర్వజన్మల వృత్తాంతాలను ఈశ్వరుడైన మహా విష్ణువు తెలియజేస్తూ దేవకీదేవి పూర్వం స్వాయంభువ మన్వంతరంలో 'పృశ్ని' అనే మహాపతివ్రతయని, వసుదేవుడు 'సుతపుడు' అనే ప్రజాపతియని తెలియజేస్తారు. 


వారు తీవ్రమైన తపస్సు చేసి శ్రీమహావిష్ణువు సాక్షాత్కారము పొంది, బిడ్డలు లేనందున విష్ణువుతో సమానమైన పుత్రుడిని అర్థిస్తారు. వారి మొరాలకించి తన సాటివాడు మరొకడు లేనందున, తానే ఆ మన్వంతరములో "పృశ్నిగర్భుడుగా", వారి రెండవ జన్మలైన అదితీ కశ్యపులకు వామనుడిగా, మూడవజన్మలో దేవకీ వసుదేవులకు కృష్ణుడిగా జన్మించిన వృత్తాంతం తెలియజేస్తారు.)


 కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 123 🌹

🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 53 🌻


ఇది సాక్షాత్తు యమధర్మరాజు చేత ఉపదేశింప బడినటువంటిది. వైదికమైనటువంటిది. సనాతనమైనటువంటిది. గురుశిష్య సంవాదరూపమైనటువంటిది. యోగ్యులైన, అధికారులైనటువంటి వారికి, శిష్యులకి తెలియజేసినట్లైతే, వాళ్ళు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటిది. 


చెప్పినటువంటి వారు కూడా, ఆత్మనిష్ఠులై, బ్రహ్మనిష్ఠులై, బ్రహ్మలోకమున పూజించబడేటటుంవంటి, ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి వ్యాఖ్యానము. ఈ కఠోపనిషత్తు అంతర్గతమైనటువంటిదని, నచికేతోపాఖ్యానము అనే పేరున కూడా పిలుస్తారు.


ఎవరీ శ్రేష్ఠము, రహస్యమునైన నాచికేతోపాఖ్యానమును శుచియై, బ్రహ్మజ్ఞానుల సభయందు గాని, శ్రాద్ధకాలమందుగాని, వినిపించుట అనంత ఫలకారి అగును.

   

      ఇది ఫలశృతి అన్నమాట. రహస్యమైనటువంటిది, శ్రేష్ఠమైనటువంటిది, అధికారులకు మాత్రమే సాధ్యమైనటువంటిది, సరియైనటువంటి సద్గురువు కృప చేత మాత్రమే సాధింపగలినటువంటిది అయినటువంటి ఈ ఆత్మోపదేశము, ఈ నాచికేతోపాఖ్యానము అనేటటువంటి దాని ద్వారా అందివ్వబడుతున్నటువంటిది. 


ఇది సర్వకాల సర్వావస్థలలోను కూడా మానవులు ఆశ్రయించ దగినటువంటిది. బ్రహ్మజ్ఞానులు ఉన్నటువంటి సభలో ఈ కఠోపనిషత్తు తప్పక ఆశ్రయించ వలసినటువంటి ఉపనిషత్తు. అందువలననే,  చాలా సాంప్రదాయములలో గురుపూర్ణిమ కాలములలో, ఈ కఠోపనిషత్తుని చదువుతారు.


ఇది చాలా విశేషఫలవంతమైనటువంటిది కాబట్టి, ఆత్మోపదేశమునకు అర్హమైన కాలము శ్రాద్ధకాలము. శ్రద్ధతో నిర్వహించబడి, జీవుని యొక్క జనన మరణ చక్రమంతా బోధించబడేటటువంటి, శ్రాద్ధకాలమందు కూడా ఈ ఆత్మోపదేశమునకు అర్హమైనటువంటి, నాచికేతోపాఖ్యానమును మానవులు తప్పక అధ్యయనం చేయాలి. అలా చేసినట్లయితే, అనంతమైనటువంటి ఫలం లభిస్తుంది. .- విద్యా సాగర్ గారు 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

 . శ్రీ శివ మహా పురాణము - 288 🌹 


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

69. అధ్యాయము - 24


🌻. శ్రీరామునకు పరీక్ష  - 4 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -


శివుని యాజ్ఞచే ఈశ్వరి యగు సతి అచటకు వెళ్లి ఇట్లు తలపోసెను. వనములో సంచరించే రాముని ఏవిధముగా పరీక్షించవలెను? (45). నేను సీతారూపమును ధరించి రాముని వద్దకు వెళ్ళెదను. రాముడు విష్ణువు అయినచో, ఆయనకు అంతయూ తెలియగలదు. కానిచో తెలియదు (46). 


ఇట్లు తలంచి ఆమె సీతారూపమును దాల్చి రాముని వద్దకు వెళ్లెను. మోహపరాయణయైన సతి ఈ తీరున రాముని పరీక్షించుటకు పూనుకొనెను (47). రఘురాముడు సీతా రూపములో నున్న సతిని చూచి శివానామమును జపించుచూ నవ్వి ఆ సత్యమునెరింగి నమస్కరించి ఇట్లు పలికెను (48).


రాముడిట్లు పలికెను -


సతీ! నీవు అను రాగముతో చెప్పుము. నీకు నమస్కారము. శివుడు ఎచటకు వెళ్లినాడు? నీవు భర్త తోడు లేకుండా ఒంటరిగా ఈ అడవిలోనికి ఏల వచ్చితివి?(49). ఓ సతీ! నీవు నీ రూపమును వీడి ఈ రూపము నేల ధరించితివి? ఓ దేవీ! నీవు నాయందు దయను చేసి ఇట్లు చేయుటకు గల కారణమును చెప్పుము (50).


బ్రహ్మ ఇట్లు పలికెను -


అపుడు సతీదేవి రాముని ఈ మాటలను విని విస్మితురాలాయెను. శివుని వచనము అమోఘమని ఆమెకు తలపునకు వచ్చి, చాల సిగ్గుపడెను (51). రాముడు విష్ణువేయని ఎరింగి, తన రూపమును మరల పొంది, మనస్సులో శివుని పాదములను స్మరించి, ప్రసన్నమైన బుద్ధిగలదై సతీదేవి ఇట్లు పలికెను (52). 


స్వతంత్రుడు, పరమేశ్వరుడునగు శివ ప్రభుడు నాతో, మరియు గణములతో గూడి భూమిని పర్యటిస్తూ, ఈ అడవికి కూడా వచ్చినాడు (53). ఆయన ఇచట లక్ష్మణునితో గూడి సీతను వెదుకుటలో తత్పరుడై ఉన్నట్టియు, సీతా విరహముచే దుఃఖితమగు మనస్సు గల్గిన నిన్ను చూచినాడు (54).


ఆయన నీకు నమస్కరించి, విష్ణువు యొక్క గొప్ప మహిమను ఆనందముతో ప్రశంసించి, ఆ మర్రిచెట్టు క్రింద నిలబడి యున్నాడు (55). ఆయన ఇప్పుడు చతుర్భుజుడగు విష్ణువును చూడక పోయిననూ చూచినట్లే సంతసించెను. నీ ఈ పవిత్రమగు రూపమును చూచి, ఆయన ఆనందమును పొందినాడు (56). 


శంభుని ఆ మాటలను విన్న పిదప, నాకు మనస్సులో భ్రాంతి కలిగినది . ఓ రామా! ఆయన ఆజ్ఞచే నేను నిన్ను పరీక్షించితిని (57). రామా! నీవు విష్ణువే యని నాకు తెలిసినది. నీ ప్రభుశక్తిని పూర్ణముగా నేను చూచితిని. నా సందేహము తొలగినది. ఓ మహా బుద్ధిశాలీ! అయినను, నా మాటను నీవు వినుము (58).


నీవు శివునకు నమస్కరింపదగినవాడవు ఎట్లు అగుదువు? నా ఎదుట సత్యమును పలుకుము. నా ఈ సంశయమును నివారింపుము. నాకు వెంటనే మనశ్శాంతిని కలిగించుము (59).


బ్రహ్మ ఇట్లు పలికెను -


వికసించిన పద్మముల వంటి నేత్రములు గల శ్రీరాముడు ఆమె ఈ మాటను విని, తన ప్రభువగు శంభు విస్మరించెను. ఆయనకు హృదయములో ప్రేమ ఉప్పొంగెను (60). ఓ మహర్షీ! రాముడు సతి అనుజ్ఞ లేకుండుటచే, శివుని వద్దకు వెళ్లలేదు. ఆయన మహిమను మనస్సులో భావన చేసి రాఘవుడు సతీదేవితో నిట్లనెను (61).


శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు సతీ ఖండలో రామ పరీక్షా వర్ణన మనే ఇరుది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

 శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 131, 132 / Sri Lalitha Chaitanya Vijnanam  - 131, 132 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |

శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖


🌻 131. 'శాంతిమతీ 🌻


శాంతమగు మనసు కలది శ్రీలలిత అని అర్థము.


శాంతమనగా ఇంద్రియ నిగ్రహస్థితి. సన్నివేశములతో సంబంధములేక అన్ని సమయములయందు శాంతము ప్రకటించు మనసు. 


శ్రీదుర్గ, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు యుద్ధమునందు కూడ ప్రశాంతమగు మనసు కలిగియున్నట్లు మన వాజ్ఞయము తెలుపును. దీనివలన తెలియునదే మనగా, వీరి స్థిర శాంత చిత్తమునకు కారణము అంతరంగమును వారు పరతత్త్వముతో ఏర్పరచుకొనిన నిశ్చలమగు బంధమే. 


అట్టివారికి బాహ్య ప్రపంచమంతయూ ఒక నాటకరంగముగ గోచరించును. అందు జరుగు మార్పులన్నియు, జగన్నాటక సూత్రధారియగు దైవము చేతియందుండునని తెలిసి, దైవముతో ముడిపడి కార్యములను నిర్వర్తింతురు. 


కర్తృత్వము దైవమునదే అని తెలిసి యుందురు. తమవంతు కర్తవ్యమును నిమిత్తమాత్రముగ నిర్వర్తించుచుందురు. నిజమునకు యిట్టివారియందు దైవమే తన కర్తృత్వమును నిర్వర్తించును. వారు దైవమునందు ఉండుటచే వారి చిత్తము శాంతముగ నుండును. 


శ్రీలలిత సృష్టి యున్నప్పుడు, లేనప్పుడు, సృష్టించుచున్నప్పుడు కూడ పరమ శివుని తోనే యుండుటచే ఆమెను మించిన  శాంతిమతులు లేరు. 


సశేషం...

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 132  / Sri Lalitha Chaitanya Vijnanam  - 132 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |

శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖


🌻 132. 'నిరాధారా' 🌻


వేరొక ఆధారము లేనిది శ్రీలలిత అని అర్థము.


సకల చరాచర జగత్తునకును శ్రీలలితయే ఆధారము. ఆమెయే సమస్తమును కాలక్రమమున నిర్వర్తించును. సర్వసృష్టి ప్రణాళిక ఆమెదే. శక్తి ఆమెదే. త్రిగుణములు కూడ ఆమెనుండి పుట్టినవే. త్రిమూర్తులు కూడ ఆమె సంతానమే. 


ఇక యితరుల గూర్చి చెప్పనేల? ఆమెకామెయే ఆధారము. మరియొక ఆధారము లేదు. పరతత్వము ఆమెయందున్నప్పటికీ, స్వభావపరముగ ఆమె పనియే చేయును. చేత అంత శ్రీలలితయే. 


సృష్టి సమస్యలను కూడ ఆమెయే పరిష్కరించును. భక్తులకు, జ్ఞానులకు, యోగులకు, దేవతలకు, అసురులకు అందరికిని ఆమె ఆధారము. ఆమె వారిపై ఆధారపడదు. తమపై ఆధారపడు వారిపై ఆధారపడుట బలహీనత. విపత్కర సమయములలో ఆమే దుర్గగను,

కాళిగను, మహిషాసుర మర్దినిగను అవతరించి దుష్ట సంహారము చేయును. 


సశేషం...