Saturday 27 February 2016

శూక్తి ముక్తావళి -4


ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం    ఓం  శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక ప్రభ 

సర్వేజనా సుఖినోభావతు 



శ్రీ హనుమను గురుదేవు చరణములు 

ఇహపర సాధక చరణములు 
బుద్ధిహీనతను కలిగిన తనువులు 
బుద్బుధములని తెలుపు సత్యములు |!





(రతీశ్వరుండు=మన్మథుఁడు; హరున్=శివుని; బిట్టు=శీఘ్రముగా; ఓడింప నుట్టాడుచున్=ఓడింప సంభ్రమించుచు; ఉమప్రాపు ఒంది= పార్వతి నాశ్రయించి; బొమ లెక్కించినన్= ఆమె కనుబొమలను పైకి ఎత్తగా, నిక్కించగా; విల్లువంచున్= తన చెఱకువింటిని వంచును; నునుఁజూపుల్= కటాక్షములను; చంచలాచంచలక్రమరేఖన్= మెఱుపు మెఱసినట్లు; నిగిడింపన్=వ్యాపింపఁజేయగా; శాతవిశిఖౌఘంబుల్=వాడిబాణముల మొత్తములను; మెయిన్ నించున్= శివుని దేహముపై పడునట్లు చేయును; నెయ్యమూలం బల్కగన్= ఆమె సరసపు పల్కులు పలుకగా; అల్కమీఱి=(తాను) శివునిపై కోపించి; చటులజ్యాఘోషమున్ చేయున్= చలించుచున్న అల్లెతాటిధ్వనిని చేయును. 








శ్రీకాళహస్తీశ్వరా! 

తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు. శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ! 

శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా 
రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ 
దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా 
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా! 

ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్. సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది. అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి యిలా కోరుకుంటున్నాడు కవి. "ఓ దేవా! నీ కరుణ అనే శరత్కాలాన్ని ప్రసాదించవయ్యా, అంతే చాలు. అప్పుడు వికసించిన నా మనస్సులో నిరంతరం నిన్నే భావన చేస్తూ, ఆ సేవలో తామరతంపరగా నా బతుకు వెళ్ళదీస్తాను"


ఓమ్ నమశ్శివాయః 

--------------------- 
శ్రీ వింజమూరి వెంకటప్పారావుగారు "మహా శివరాత్రి" సందర్భముగా నిర్వహించిన పద్యరచనల పోటీ లో తృతీయ బహుమతికి అర్హమైన నా పద్యాలు..... 
-------------------------------------------------


1. సీసము. 

కంఠీరవంబైన కర్వరమైననూ ... కుహరములను బట్టి గుంజులాడు ! 
పొన్నాడ వాహనం, పోడు విహారమే ... ఆ చిట్టి తల్లికీ అమిత ముదము !! 
బంతులామెకు జూడ బ్రహ్మాండమై యొప్పు ... పూజితులాటలో బొమ్మలగును ! 
గుజ్జన గూళ్లెట్టి కొండచూలి యెపుడు ... సృష్టి తనదె యంచు హృష్టి పొందు !! 
ఆ.వె. 
అక్షరంబు నేర్ప నామ్నాయమే జెప్పె 
ఆరి తేరె నామె యన్ని కళల ! 
వయసు సొగసులీన వాముని పటమునే 
మొగదలుంచి కొలిచి మురిసిపోవు !! 

{ అర్థాలు : కంఠీరవము ... సింహం, కర్వరము, పొన్నాడ ... పులి, కుహరము ... చెవి, పోడు ... వనము, పూజితులు ... దేవతలు, కొండ చూలి ... పర్వతరాజు పుత్రిక, హృష్టి ... ఆనందము, ఆమ్నాయము ... వేదము. వాముడు ... శివుడు, మొగదల ... ఎదురుగా. 
భావము : ఆమె మేనకా హిమవంతుల గారాబు పట్టి. వారి తపమునకు మెచ్చి మాతయే అలా కరుణించింది మరి. ఈ పట్టియే మన కథానాయిక పార్వతి. పుట్టుకతోనే తానెవరో తెలిసినట్లు బాల్యంలోనే పులులూ, సింహాల చెవులు గుంజి వాటి ఆక్రందనా భరితమైన అఱపులను వీనులవిందుగా భావిస్తూంటుంది. పులిపై ఎక్కి వన విహారం చేయడం, బంతులతో ఆడుకుంటూ బ్రహ్మాండాలను ఆడిస్తున్నాననడం, బొమ్మలతో ఆడుకుంటూ ముక్కోటి దేవతలను ఇలాగే ఆడిస్తాననడం, గుజ్జనగూళ్ళు కట్టుకుంటూ సృష్టి చేస్తున్నాననడం ఆమెకు నిత్య కృత్యాలైనాయి. అక్షరాభ్యాసం నుంచి వేదవేదాంగాలను ఔపోశన పట్టినట్లు భాష్యం చెప్పగలగడం ఆమె ప్రత్యేకత. బాల్యం, విద్యాభ్యాసం గడచి యవ్వనంలోకి ప్రవేశించిన తదాది పరమశివుని పటమే ముందుంచుకుని కొలుస్తూ, మురిసి పోతూ ఉంటుంది.)




2. కం. 
కలహాశి రాక కనుగొని 
చలికొండయె చెలియతోటి చక్కటి కేగెన్ 
"మలయమ్మకు మగడెవర"న 
అలికాక్షుని కీయమనియె ననిముష మునియే... ! 

{ అర్థాలు : కలహాశి ... కలహమే అశనముగా గలవాడు అనగా నారదమహర్షియే, చలికొండ ... హిమవంతుడు, చెలియతోటి ... తన భార్య అయిన మేనకతో, చక్కటి ... సమీపానికి, మలయమ్మ ... పార్వతి, అలికాక్షుడు ... శివుడు, అనిముషముని ... నారదుడు. 
భావము : ఈ వ్యవహారమిట్లు సాగుతుండగా ఒకనాడు నారదులవారు లోక సంచారం చేస్తూ ఇటు వచ్చారు. వెంటనే మేనకా హిమవంతులు మహర్షిని సమీపించి అర్చించి తమ కన్యకకు తగిన వరుడెవరో సూచించాలని కోరతారు. ఆయన నవ్వి ఆ పరమశివుడే తగినవాడు. ఈమె సాక్షాత్తూ అమ్మవారే. ఆయనకోసమే వచ్చింది. కాలగమనంలో ఆయనే రాయబారం పంపుతాడు. కాదనక ఇచ్చి చేయండి అని సలహా చెప్పివెళ్తాడు.)



3. ఆ.వె. 

తల్లి దండ్రు లంత తనయ చెంతను జేరి 
"మనసు బెట్ట గలవు మౌని వాక్కు 
తపము జేయ నీవె దక్షజాపతి మెచ్చు" 
ననుచు పలుక మురిసె నందయంతి... ! 
{ అర్థాలు : మౌని ... మునీశ్వరుడైన నారదుడు, దక్షజాపతి ... శివుడు, నందయంతి ... పార్వతి. 

భావము : నారదులవారు ఈ వివరం తెలుపగానే ఆనందంతో మురిసిన మేనకా హిమవంతులు పార్వతి వద్దకు వెళ్లి " అమ్మాయీ! ముని మాట విన్నావు కదా. ఇక నీ కోరిక ీడేరుతున్నట్లే. పరమ శివుని తపసు ద్వారా మెప్పించవలసినది" అని హితబోధ చేశారు. అది విని పార్వతి కూడా తను కోరుకుంటున్నట్లే జరుగుతున్నందుకు మరింత ఆనందించింది.)



4. తే.గీ. 

ఇచట హైమకు కామంబె యినుమడించ 
వామ దేవుని కామమూ వదలకుండె 
తపము జేసిరి వారల తలపులన్ని 
ఫలము పొందెను జగతియే ఫలము పొంద...! 

{ అర్థాలు :హైమ ... హిమవంతుని పుత్రిక, కామము ... కోరిక, వామదేవుడు ... శివుడు, కామము ... ఇచ్ఛ, ఫలము ... ప్రయోజనము. 
భావము : హిమవంతుని పుత్రిక అయిన హైమవతి అనగా పార్వతిది శివుని పరిమయమాడాలనే కోరిక. వామదేవుడైన పరమశివుడేమో సతీ వియోగంతో సంసారేచ్ఛ నశించి సన్న్యాసపై ఇచ్ఛతో విరాగియైనవాడు. ఆయన ఆ విధమైన ద్యానంలో మగ్నమై ఉన్నాడు. అయితే దేవతలందరూ కలగ జేసుకుని భోళా శంకరుని మనసు మార్చడంలో విజేతలైనారు. ఫలితంగా వీరుభయుల తపములూ ఫలించినట్లయినాయి. కడకు శివపార్వతుల సంయోగంతో రాక్షస సంహారమూ జరిగి జగతి కూడా తగిన ఫలము పొందింది. (భోళాశంకరుడు కావున తన ఇచ్ఛను కొంత సడలించుకుని పార్వతీ పరిణయానికి సిద్ధమై ముందుగా ఆమెను పరీక్షించడమూ జరిగిందంటే అది వేరు సంగతి.)} 







శ్రీ వింజమూరి వెంకటప్పారావుగారి మహా శివరాత్రి పద్యరచనల పోటీ నిమిత్తం" 

**************************************************************************** 

సీసపద్యం 
********** 

బ్రహ్మాండ పోటీలె బ్రహ్మ విష్ణువులకు 
పరికించ వలెనని పందె మాడె 
లింగాగ్ర భాగము లింగము చివరన 
బ్రహ్మ యతిశయంగ భ్రక్ష పడుతు 
చూడక పోయినా చూచెనని పలికె 
ఓటమి విష్ణువు వొప్పు కోగ 
కేతకి ధేనువు కీర్తించి బ్రహ్మ ను 
సాక్ష్యము చెప్పెను సంశయమున 

తేటగీతి 
******** 

సర్వ మెరుక సదాశివ శంభువునికి 
ఉద్భవించె వీర భద్రుడి వుగ్రపు రూపు 
నరికె బ్రహ్మైదవ తలను నగజధరుడు 
సాక్ష్య మిచ్చిన వారికి శాపమిచ్చె॥ (1) 

సందర్భం /రూపకం/ఘట్టం: 
*************************** 
బ్రహ్మ విష్ణువుతో పోరాటం చేయడం ఇద్దరు యుద్ధంలో మునిగియున్న సమయంలో కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగుతో, పెళపెళ శబ్దం చేసుకుంటూ విద్యుత్ స్థభం/మహాతేజో లింగం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ లింగం నుండి 'మీ ఇద్దరిలో ఈ లింగం యొక్క ఆదిని కాని, అంతమును కానీ, ఎవరు తెలుకుని, ముందు ఈ ప్రదేశానికి చేరుకుంటారో వారే గొప్పవారు' అని మాటలు వినిపించగా, అప్పుడు విష్ణువు బ్రహ్మతో బ్రహ్మ! నువ్వు హంస రూపంలో ఈ లింగం యొక్క పై భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయ్యి, నేను వరాహ రూపంలో ఈ లింగం యొక్క క్రింది భాగాన్ని, ఆరంభ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను' అన్నాడు. ఇద్దరూ వారివారి నిర్దేశిత రూపాల్లో అన్వేషణ ప్రారంభించారు. ఎంత క్రిందకు వెళ్ళినా, ఆ లింగం యొక్క మూలం ఇంకా దొరకడంలేదు. తనకు ఇది సాధ్య కాదని విష్ణువు తన ఓటమి నొప్పుకొనెను. బ్రహ్మ దేవుడు విష్ణువును ఎలాగైనా గెలవాలని కేతకిని కామధేనువును సాక్ష్యం చెప్పమని ఆజ్ఞాపిచ అవి సంశయపడుతూనే సాక్ష్యం చెప్పాయి 

అయినా అంతా తెలుసు ఆ పరమేశ్వరునికి. అబద్థం చెప్పినందుకు కోపోద్రితుడై నాడు. ఆయన నుండి వీరభద్రుడు ఉద్భవించి అబద్ధం చెప్పిన బ్రహ్మ ఐదవతలను నరికెను 
సాక్ష్య మిచ్చిన వారికి శాపమిచ్చాడు ఆ పరమేశ్వరుడు. 

కందము 
********* 

లింగము నుండి వెలువడిన 
జంగమ శివుని వుగ్రరూపు జడ్డన నరికే 
బెంగ పడిన బ్రహ్మ తలను 
పింగజటుడు శాపమిచ్చె పీచమడచకా॥ (2) 

సందర్భం/రూపకం/ఘట్టం 
************************ 

ఎప్పుడైతే బ్రహ్మ అబద్ధం చెప్పాడో కోపావేశుడై పరమేశ్వరుడు బ్రహ్మ ను చంపేద్దామనుకున్నాడు..కానీ బ్రహ్మ వేడుకొనగా బ్రహ్మ ఐదవతలను నరికి బ్రహ్మ కు పూజా మందిరాలు లేకుండా శాపమిచ్చెను చంపకుడా(పీచమడచక) 

తేటగీతి 
******* 

కామధేనువు శిరముతో కల్ల జెప్పె 
నిజము తోకతో కాదని నిక్క పరిచె 
పృష్ఠ భాగము పూజకు పేరు గాంచె 
పూజ కర్హత కోల్పోయె పువ్వు మొగలి ॥ (3) 

సందర్భం/ రూపకం/ఘట్టం 
************************* 

బ్రహ్మ దేవుడు అబద్ధం సాక్ష్యం చెప్పమనగా కామధేనువు తలతో అబద్ధం చెప్పి తోకతో నిజము చెప్పింది అందువలన ఆవు పృష్ఠ భాగము మాత్రమే పూజకు యోగ్యమని పరమేశ్వరుడు పలికే. అబద్ధం చెప్పిన మొగలి పువ్వు పూజకు యోగ్యత కోల్పోయ్యెను 

ఆటవెలది 
********** 

లింగ ముద్భవించె లింగడు కరుణించె 
దివ్యమైన రూపు దీప్త మయ్యె 
శివుని భక్తుల కిది శివరాత్రి పండుగ 
భక్త జనులు కొలిచె భావనుడిని ॥ (4) 

సందర్భం/రూపకం/ఘట్టం 
************************* 

మహా శివుని బ్రహ్మ దేవుని కరుణించెను. నిజాయితీ గా ఓటమి ఒప్పుకున్న విష్ణువు కు తనతో సమానంగా పూజలందుకొనేట్లు వరమిచ్చె..అటు పిమ్మట పరమేశ్వరుడు మహా లింగ రూపం గా అవతరించెను..దివ్యమైన లింగం అవతరించిన రోజే...మహా శివరాత్రి... 
భక్తజనులందరికి శివరాత్రి పండుగ.. భక్తులు ఉపవాస జాగారము పూజలు అభిషేకాలతో లింగ రూపుడైన పరమేశ్వరుడిని పూజిస్తారు. (భావనుడు=శివుడు) 

హంస గీతి  


 ప్రమద గణంబులు నిను సేవింపగ హే పార్వతీశా 

కైలాసంబున మోదము మీరగ నాట్యమాడు నటేశా 
భ్రుంగి శృంగి తాళము వేయగ తాండవ మాడే జగదీశా 
అఖిల జగమ్ములు గానము సేయగ సంతసమందే సర్వేశా 

శివ శివ హర హర యనుచు మ్రొక్కెదమో నగేశా 
శరణంబనుచు నీ పదములు వేడెదమో మహేశా 
ప్రణవ నాదము భువనమ్ములు మ్రోగగ నుతియించెదమో సురేశా 
పరమ దయాళు కరుణ చూపుమా హే పరమేశా




శర్వ లోకాధీశ చంద్రార్ధశేఖర పురుష పురాణ శంకర మహేశ 

యభవ యంతర్యామివై ప్రేరకత్వము చేపట్టి జనుల శాసింతు వీవు 
భవదీయ మాయాప్రభావంబు కతమున నెఱుఁగలేమైతిమి యేము నిన్ను 
మాకుఁ గర్తవు నీవు మాకు భర్తవు నీవు మాకు హర్తవు నీవు మాటలేల 

నీమాహత్మ్యంబు వర్ణింప నేర మేము 
నిన్నుఁ దెలియంగనేరము నిజముగాఁగ 
నభవ యాద్యుండ వాద్యుండ వగుదు గాన 
నట్టి నీకాచరింతు ముపాప్తి యెపుడు 

పశువులము మేము హర పశుపతివి నీవు 
పశువులకు నెక్కడిది బుద్ధి ఫాలనయన 
రాజశేఖర నేర్పు నేరములు చూడ 
కరసి రక్షింపు మమ్ము నత్యంతకరుణ 

శ్రీనాధ మహాకవి ప్రణీత "శివరాత్రి మాహాత్మ్యము" నుండి 
బ్రహ్మ విష్ణువులు చేసిన పరమేశ్వర ప్రార్ధన
 


భక్తి కూడా ఒక ఆవేశమే! దాన్ని భవ్యావేశమంటారు. అలాంటి ఆవేశంలో ఒక అజ్ఙాత శివ కవీంద్రుడు. అనుపమానమైన
ఒకపద్యరత్నంతో పరమేశ్వరార్చన గావించాడు. ఆపద్యమిప్పుడు మీకు కానుకగా వినండిమరి!



మ : నిను సేవించినఁ గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ
ఘనకోటీ శకటీ కటీ తటిపటీ గందేభ వాటీ పటీ
రనటీ హారి సువర్ణహార మకుటీ ప్రఛ్ఛోిటికా పేటికల్ ,
కన దామ్నాయ మహాతురంగ! శివలింగా! నీలకంఠేశ్వరా!
వీటీ వధూటీ గణము (వెలయాండ్రు ) అనేక కోట్లధనము , వాహన సముదాయము , నదీతీర వనాళి , మదగజ సముదాయము , కర్పూర వాటికలు , మనోహరమైన బంగరు హారములు , కిరీటములు ,సింహాసనములు ,బంగరు పేటికలు , మొన్నగునవి యెన్నియైనను నీయనుగ్రహ లబ్ధములేగదా! యనుచున్నాడు. 

నీలకంఠేశ్వర శతకం; అజ్ఙాత కర్తృకం; 


ముఖే ముఖే సరస్వతీ! అన్నారు పెద్దలు. ఆకవీంద్రుఁ డేమి చదివాడో తెలియదుగానీ , టకార యమకంతో పద్యాన్ని బంతులాడించాడు. అద్భుతమైన యాతని ప్రతిభకు చేతులు జోడిస్తూ ఓపినంత మేరకు దీని భావాన్ని వివరిస్తాను.

ఓ వేద తురంగా! పరమశివా! నీలకంఠేశ్వరా! నిన్ను భక్తితో సేవిస్తే పడయరాని దేమున్నది? సర్వము సముకూడునుగదా!

మానవులకు నీసేవ వలన సకల భోగ భాగ్యములు వశమగుట తథ్యము!

వీటీ వధూటీ గణము (వెలయాండ్రు ) అనేక కోట్లధనము , వాహన సముదాయము , నదీతీర వనాళి , మదగజ సముదాయము , కర్పూర వాటికలు , మనోహరమైన బంగరు హారములు , కిరీటములు ,సింహాసనములు ,బంగరు పేటికలు , మొన్నగునవి యెన్నియైనను నీయనుగ్రహ లబ్ధములేగదా! యనుచున్నాడు.

ఇందు బాహ్యములైన భాగ్యముల ప్రస్తావనము మాత్రమేగలదు. కారణము భక్తునిలో లౌకికమైన విషయ లోలుపత యధికమని తెలియు చున్నది. అయినను పద్యము చెప్పిన విధానము మాత్రము అపూర్వమనక తప్పదు!











ధరణిరధము, దానికి దిన 

కర శశి చక్రములు, మిన్కుగమితురంగంబు 
ల్థరణీధరమే ధనువును 
హరి నీశర మజుఁడు సూతుఁడట భీమేశా! 

దేవరకొండ అనంతరాయ విరచిత "భీమేశ శతకము" నుండి 



ప్రజలు యెల్లరు రాజుల పదవిగోరు 

ప్రభువు లెల్లరు దేవేంద్ర పదవిగోరు 
దేవతలుయెల్ల నీపాద సేవ్యులైరి 
ధాత్రి సత్కీర్తి కంతేటి దత్తమూర్తి 

పెనుమల్లి సూరారెడ్డి విరచిత "దత్తమూర్తి శతకము" నుండి




తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయెడి నాడు వెంటరాదు 

లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మ్రింగబోడు 
విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు 
పొందుగా మరుగైన భూమిలోపలబెట్టి దానధర్మములేక దాచి దాచి 

తుదకు దొంగలకిత్తురో దొరలకవునో 
తేనె జుంటీగలియ్యవా తెరువరులకు 
భూషణవికాస శ్రీధర్మపుర నివాస 
దుష్టసంహార నరసింహ దురితదూర 

శేషాచల దాసు "నరసింహ శతకము" నుండి




క. 'పుడమిఁ దనకన్నకొడుకున 

కడుగుకొనియెఁగాక కైక, యహహ! నినుం గా 
ఱడవులకుఁ బనుపు మనుచున్ 
నుడువఁగ నెప్పగిదిఁ దనకు నో రాడెనొకో! 

అడవులకు బయలుదేరిన శ్రీరామునితో తల్లి కౌసల్య ఆడినమాటలు 

కూచిమంచి తిమ్మకవి "అచ్చ తెనుఁగు రామాయణము" నుండి




కట్టినపుట్టముం దనువు గద్దియతమ్మియు నక్షమాలయుం 


బట్టినచిల్కయు న్నగవుఁ బాపటజల్లియు నొక్కవన్నెగాఁ 


బుట్టుచుఁ బుట్టువిద్యలకుఁ బుట్టినయి ల్లనఁజెల్లి బ్రహ్మవా 

కట్టొనరించి తన్ముఖవికాసినియౌ సతి మమ్ముఁ గావుతన్




కొరవి గోపరాజు "సింహాసన ద్వాత్రింశిక" నుండి



మాసరివాఁడవా మాపాపఁగొనిపోవ నేపాటి గలవాఁడ వేది వంశ 

మెందు జన్మించితి వెక్కడఁ బెరిఁగితి వెయ్యది నడవడి యెవ్వఁడెఱుఁగు 
మానహీనుఁడవీవు మర్యాదలెఱుఁగవు మాయఁగైకొనికాని మలయరావు 
నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు వసుధేశుఁడవు గావు వావిలేదు 


కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు 
విడువు విడువవేని విలయకాల 
శిఖిశిఖాసమానశితశిలీముఖముల 

గర్వమెల్లఁగొందుఁ గలహమందు 

  

భవ నుత! నా హృదయమున రమింపుము, బడలిక దీర! 

భవ తారక! నాతో బహు బల్కిన బడలిక దీర కమల సంభవనుత! 

శివునిచే నుతించబడిన ఓ రామా! నీ బడలిక తీర నా హృదయములో సేద తీరు. బ్రహ్మచే నుతించబడిన రామా! ఈ సంసార సాగరాన్ని దాటించేది నీవే. నాతో చాలా మాటలు మాట్లాడి అలసిపోయావు, నా హృదయములో సేద తీరుము! 

త్యాగరాజస్వామి ఆ రామభక్తి సుధారసామృతవర్షిణిలో ఎంత ఓలలాడాడో కదా?


ఆత్మీయము 

రచన : స్వర్గీయ భళ్ళముడిసీతారామమూర్తి 
(unprinted. Taken from the manuscript of the poet) 

కం:1 
శ్రీయుక్తి , నిత్య తుష్టిని, 
ఆయువుదీర్ఘమ్ము ,నిత్య మారోగ్యమ్మున్ 
స్థాయిగ బుద్ధి విసుద్ధిని, 
సాయమ్మైఅమ్మ!యిమ్ముసర్వ సుఖమ్ముల్ 

కం:2 
జగదుత్పత్తి స్థితిలయ 
లొగి జేసెడి యమ్మలయ్య లొప్పుగమాకున్ 
ప్రగతిన్ శుభ సుఖ తృప్తుల 
మిగులం గలిగింప నిత్యమేబ్రార్థింతున్|| 

మ:3 
స్తుతియింతున్ గణనాధు,సత్కృతులనెందున్విఘ్నముల్ లేక స 
మ్మత సాఫల్యముగూర్పగోరి,తత ధర్మార్దాప్త కామ్యమ్ములన్ 
హిత వృత్తిన్ సుఖదమ్ములై యసుభ రాహిత్యం మ్మునంగూర్పగా 
సతతమ్మున్ గరుణింప వేడుచునమస్కారమ్ములర్పించెదన్|| 

కం:4 
ఎందుందువొ?యెట్లుందువొ 
సందియమే కల్గు నెన్ని చదివిన విన్నన్ 
అందీ పొందని మాటలె 
యెందెట్టులజూడనగుదొ?యెఱుగను శివుడా|| 

ఆ:వె:5 
విసుగు పుట్టు నెంత వెతికిన గనరావు 
వుంటివను టె వింటి కంటబడవు 
అమ్మ చెప్ప నమ్మి యయ్యను పిలువరా 
శ్రుతిని నమ్మి నేను రూఢి పడితి|| 

కం:6 
ఆలోచించిన కొలదియు 
నాలోపమె మిగులు చుండెనందునిజమ్మున్ 
ఆలోకింపన్ లేదది 
ఆలోకము చూచి వచ్చు నార్యులు కలరే? 

కం:7 
ఏదో ఖేదము కనబడు 
మోదము కనరాదు కోర్కెముసిరిన కొలదిన్ 
ఆదర బాదర బ్రతుకే 
ఆదర మిసుమంత లేదు “హాయననేమో”? 

కం:8 
మో మంతయు నామములే 
స్వామీ !నీ యంద మాత్మసంపదయౌనో 
కామితములగూర్పగనీ 
కామితధన మీయనొప్పు గదె ?కామపితా


శ్రీ శివ ప్రార్ధన

శా:
ఓంకారాది నమః పరమ్మునయి నీ యోక్కొక్కనామమ్ము,స
త్సంకల్పమ్మున సాంబ-శంభు,శివ,ఈశాన త్రినేత్రాదులన్,
వంకల్లేక సముచ్చరించి,నియతిం బ్రార్ధించి,పూజింప,ని
శ్శంకన్ శంకర సర్వసంకటవినాశమ్మౌను నీ సత్కృపన్.

32:చం:
అఱయగలేదు నీమహిమ నందఱు .కొందఱికైన నేదియో
కొఱతయె నామరూపగుణగుప్త సమస్త విశేష విజ్ఞతన్
మొఱకును నే నెఱుంగుదునె? పుణ్య వశమ్మున నిన్ను గంటి నా
యఱగొఱలన్ క్షమించుము మదాశయ శిద్ధిని గూర్చుమీశ్వరా.

34:చం:
పొగడెను వేదముల్ మునులపూర్వముగా నిను సన్నుతించి నా
రగణిత సర్వ శక్తి పరి రక్షకుడీవనిరాది సత్కవుల్
సుగుణ గణమ్ము నెంచుటకు సూక్తులు గ్రొత్తవి చెప్పనేర నా
యొగులును దీర్చు వాడవనియొక్కటి కోరితినిన్ను నీశ్వరా.

35:శా:
ఆబద్ధోర్థ్వ జటాకలాప కలితాబ్జాభన్, స్వఫాలస్థ లీ
లా బార్హ్యక్షి ప్రభా విలాసితమహోల్లాసమ్మునన్ భూతి రే
ఖా బద్ధార్చిని,బాహుకంబుగ భుజంగవ్యాప్తి నుద్దీప్తముల్
నీ బహ్వాకృతు లెన్ని చెప్పగలనే? నీ శక్తి నీకేతగున్.

మత్తేభగర్భిత సీసము
(వి )రచితా స్వాద్య కవిత్వ సత్కృతి తతి భ్రాజద్య శోభూషితా జయోస్తు
(సు)రుచిరాస్పార రసోత్కరాంచిత కళా ప్రోద్భూత రోచిస్స్వభూ నమోస్తు
(స్వ)రచనా ధాన వివర్ధనాప్లవన కార్యావార్యశక్త్యుచ్చయా ప్రణామి
(ఉ )రుచిరార్ధాద్యనుయోగ యాగఫలసద్రూపస్వరుద్భూతరూపనమమి.

తే:
సర్వ రూప స్వరూప సత్స్వామిశరణు
విశ్వ విభ్రాజమాన,సర్వేశ,శరణు
వివిధ మత బోధితైకాత్మవేద్య శరణు
పాహిమాంపాహి పాహిమాంభవ శరణ్యు||

సీ:
సర్వ మంగళ శక్తి సతియయి వలచిన
నేశక్తికైన నీకేమిలోటు?
కొండంతమామ నీకుండిన ,పదకొండు
పేళ్ళును గల్గిన,పేదరికమె?
శేవదుల్ గలవాడు శివ! సత్సఖుండైన
నే సేవకైననునెట్టి లోటు?
భూతగణాదులుపూటకాపైయుండ
వాటిల్లు నెందునే లోటుపాటు?

తే:గీ:
కోరికలు దీర్ప నీ కుండె గొప్ప పేరు
కష్టబెట్టను గంగమ్మకరుణ బారె
ఎవరు భరియింప లేరు నాయేరు తీరు
నిత్య మభిషేకముంగోరు నీకు నీరు.




విలసిల్లన్ పదియాఱువేలసతులన్ వీక్షించి వారిండ్లలో
పల వర్తించుచు నుండి వీటఁ గలగోపస్త్రీలనెల్లన్ గడుం
బలిమిన్ బట్టి రమించినాఁడవు భళీ ప్రాజ్ఞుండ వీవౌదు భూ
స్థలి నీవేకద కొంటెదేవరవు కృష్ణా దేవకీనందనా



శక్తి చాలనివాఁడు సాధుత్వము వహించు, విత్తహీనుఁడు ధర్మవృత్తిఁదలచు 

వ్యాధి పీడితుఁడు దైవతాభక్తిఁ చొరలాడు, ముదిమి పాతివ్రత్యమునకు జొచ్చు 
ఆపద ప్రాప్తింప సన్యార్తికి గృశించు, భారంబు పైబడ్డ బరువెఱుంగు 
రమణి లేకున్న విరక్తి మంచిది యంచు, మనిపోవ మౌనివర్తనము దాల్చు 

ఈ యభావవిరక్తులకేమి ఫలము 
తినక చలి చొరకయె లోఁతు తెలియబడునె 
మదరిపువిఫాల మునిజన హృదయలోల 
వేణుగోపాల భక్త సంత్రాణశీల


 

భునక్తి యత్ర భస్మాంగో మూర్ఖో న పండితో పివా ! 
తత్ర భుంక్తే మహాదేవః సపత్నీకో వృషధ్వజః !! 

విభూతిని ధరించిన వాడు మూర్ఖుడా ! పండితుడా ! అన్న ప్రశ్న లేదు. అతడికి భోజనం పెట్టాలి. అతడు భుజిస్తే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు వచ్చి భుజించినట్లే. విభూతి ధారణ అంత గొప్పది.