Friday 8 November 2019

విష్ణు సహస్ర నామ మహిమ


విష్ణు సహస్ర నామ మహిమ : 

పూర్వం పూరీ నగరం లో జగన్నాధపురం లో ఒక మహాపండితుడు భార్య తో సహా ఒక పూరి గుడిసె లో నివాసముండెడివాడు . ఇతను శ్రీ మహావిష్ణువు నకు పరమ భక్తుడు . పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది , ప్రతి నిత్యమూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేసి ఈతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు , ఆ వచ్చినదానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు .భార్య మాత్రం పరమ గయ్యాళి , దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది . ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఈతడు హరి నామ స్మరణ ను  విడువలేదు . ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా విష్ణుసహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది .దానికి ఆ భర్త "విష్ణుసహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాన"న్నాడు .  అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమిచ్చేడు ఆ శ్రీ మహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప " అంది . అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు " అన్నది . అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణుసహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు . ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలక్కరలేదు , మొట్టమొదటిది చెప్పు చాలు " అన్నది . అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది .అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా " ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు , అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని  అనుభవిస్తూ  , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీమహావిష్ణువు ని గానంచేస్తున్నావే ? అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధంలేదయ్యా ! " అంది . భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ? కనుక " ఈ మంత్రంలో విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్క తో ఆ " విశ్వం" అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేది ట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లిపోయేడుట .

ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది . ప్రతినిత్యమూ పాల సముద్రంలో శ్రీమహావిష్ణువు ను శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లుగనే ఆరోజు కూడా స్వామి ని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట ! అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు " నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీలమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంతమాత్రంచేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా శ్రీమహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట . వెంటనే శ్రీమహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట . లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగు కు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి " దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడుట . లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమభక్తుడంటున్నారు ? అతడెందుకిలా చేస్తాడ" ని యడుగగా స్వామి తన భక్తుని జీవితదీన స్థితి ని వివరించగా లక్ష్మీదేవి " అంతటి పరమ భక్తుని దీనస్థితి  కి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " దేవీ ! గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రమనుభవించుట తప్పలేదు . అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఈతనికి కష్టములు తొలగించెదన" ని పలికి మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు . ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీమహావిష్ణువు ఆ ఇల్లాలి తో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పు గా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , సొమ్మును తీసికొనవలసినద"ని చెప్పగా ఆ ఇల్లాలు " నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము , నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు , ఎవరనుకుని మాఇంటికి వచ్చేరో , వెళ్లిపొ "మ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి " లేదమ్మా ! నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు , నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , నీ భర్త కు నేను తరువాత వివరిస్తాన" ని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనాలు , మణిమాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ కానుకలు గా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు " ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలికదా ! నువ్వు ఎలా ఉంటావో ? " అని పలుకగా స్వామి " అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను , నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూసేరమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధానమైనాడు . ఇంతలో ఊరిలో యాచన కు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది , అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం. ఇంతలో ఈతని భార్య లోపలినుండి వచ్చి " లోపలికి రమ్మని భర్త ని ఆహ్వానించగా , ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు , "అసలు ఆ సంపద ని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ? "అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటివెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు . అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా  " నేను అతడి ముఖాన్ని చూడ లేదు , అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారుట , ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు , అయినా అతడు వెళుతూ వెళుతూ నాగురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడ"న్నది . అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో " వచ్చినవాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువు ను స్తుతిస్తున్నా ఆ స్వామి ని నేను దర్శించలేకపోయాను ,  ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శనభాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో  మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన  నల్లరంగు ను తొలగించాడు
 . తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడ " నగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డు కు చేరుకున్నాడు . అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వదిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానంచేశాడు . అప్పుడు అశరీరవాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు , మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది .
విష్ణుసహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలితమిదియని అందరూ గ్రహించండి , ప్రతి నిత్యమూ పఠించండి , అవసరార్ధులకు సహాయం చెయ్యండి .

....................శుభోదయం🙏💐
చక్కని వివరణ
ऊँ!"ధన్యోऽస్మి!!!"