Saturday 13 May 2023

 


122-----------నీకు నువ్వే దీపం-----------------

ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. ఒకతని దగ్గర లాంతరు ఉంది. ఇంకొకతని దగ్గరలేదు. కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది. దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతరు లేని వ్యక్తి కూడా అంతే సులభంగా సాగుతున్నాడు. 

కారణం దీపమున్న వ్యక్తితో బాటు దీపం లేని వ్యక్తి నడవడమే. లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని దిగులు పడలేదు. కారణం దాని అవసరం అతనికి అక్కడ లేదు. ఆలా యిద్దరూ చాలాదూరం నడిచాక ఒక నాలుగురోడ్ల కూడలికి చేరారు. అప్పటి దాకా ప్రయాణం సాఫీగా సాగింది. అక్కడినించీ దార్లు వేరయ్యాయి. . లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపుకి, లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి వెళ్ళాలి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపు తిరిగి వెళ్ళిపోయాడు. కాంతి అతనితో బాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది.
లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి తిరిగి పది అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదల్లేదు. కారణం చీకటి. అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలచుకున్నాడు. అతని దగ్గరగా తను నడుస్తున్నంత సేపూ ప్రయాణం సునాయాసంగా జరిగింది. అతను వెళ్ళిపోయాక తన మార్గం అంధకారబంధురమయింది. తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమయినా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధ పడ్డాడు. మనకు ఇతరులు కొంతవరకే మార్గం చూపిస్తారు. తరువాత మనదారి మనం వెతుక్కోవాలి. చివరిదాకా ఎవరూ ఎవరికీ దారి చూపరు. గురువు చేసే పనయినా అదే.
గురువు దగ్గరున్న కాంతి(జ్ఞానదీపము) కొంతవరకే దారి చూపుతుంది. శిష్యుడు తనలోని దీపాన్ని(జ్ఞానదీపము) వెలిగించుకున్నపుడు ప్రయాణం చివరిదాకా చేయగలడు.
నీకు నువ్వే దీపం అని బుద్ధుడనడం వెనక అర్థమదే.

ఒక వూళ్ళో చాలా కోతులుండేవి.ఒక రోజు ఒక వ్యాపారి ఆ వూరికొచ్చాడు.అతను కోతులను ఒక్కక్కటి 
వంద రూపాలకు కొంటానని ప్రకటించాడు.కొంతమంది ఆ మాటలు నమ్మలేదు.కొంతమంది మాత్రం వస్తే వంద లేకుంటే పోయేదేమీ లేదు కదా అని ఆశతో తిరిగి తిరిగి కోతులను పట్టి ఆయనకు యిచ్చి డబ్బు పుచ్చుకునేవారు.కొన్నాళ్ళకి మిగతావాళ్ళు కూడా కోతుల వేటలో పడ్డారు.కొన్నాళ్ళయిన తర్వాత ఆ 
వ్యాపారి కోతికి రెండు వందలు యిస్తానని ప్రకటించాడు.అందరూ అటూ యిటూ పరిగెత్తి కోతుల్ని పట్టి అమ్మారు.
వూళ్ళో కోతులన్నీ దాదాపు అయిపోవచ్చాయి.అప్పుడు వ్యాపారి కోతి 500 లిస్తానని ప్రకటించాడు.అంతే వూరివాళ్ళు నిద్రాహారాలు మర్చిపోయి కోతులకోసం గాలించడం మొదులు పెట్టారు..యింక వూళ్ళో గానీ బయటగానీ కోతులేలేవు.
ఆ సమయం లో వ్యాపారి ఒక్కో కోతికి 1000 రూపాయలిస్తానని ప్రకటించాడు.కానీ తనబదులుఒకగుమాస్తాను నియమించి తను వేరే వూరికి వెళ్ళిపోయాడు.యింక వూరివాళ్ళు మంచి నీళ్ళు 
త్రాగటం కూడా మర్చిపోయారు.అసలు ఊర్లో కోతులే లేవు. ఒక్కో కోతికి వెయ్యి రూపాయలంటే మాటలా 
మంచి అవకాశము చేయిజారిపోతుందేమో బెంగ పట్టుకుంది.అది పసిగట్టిన గుమాస్తా యిక్కడున్నకోతుల్ని 700 ఒకటి చొప్పున యిస్తాను.మా షావుకారికి వెయ్యి చొప్పున అమ్మేయండి.మీకు ఒక్కో కోతికి 300 లాభము వస్తుంది అని లోపాయకారీ ఉపాయం చెప్పాడు.
ఆ వార్తా ఊరంతా పొక్కింది.ఇంకేముంది గుమాస్తా దగ్గర క్యూ కట్టారు.డబ్బున్న వాళ్ళు కోతుల మందల్ని కొనేశారుఅలా గుమాస్తా తనదగ్గరవున్న కోతులన్నింటినీ అమ్మేశాడు.ఆ వ్యాపారి ఎప్పుడొస్తాడో తెలీదు.కొన్ని రోజులకి వస్తానన్న వాడు నెలరోజులైనా రాలేదు.ఏడు వందలు పెట్టి కొన్న కోతుల్ని వదల్లేక వాటిని కాపలా కాయలేక వాటిని మేపలేక సతమత మవుతూ బ్రతికేస్తున్నారు.ఇదే వ్యాపార మంటే.
దీన్నే యిప్పుడు ష్టాక్ మార్కెట్ అంటున్నాం.ఈ వ్యాపారం ఎంతమందినో అప్పుల పాలు చేసింది.కొద్దిమందిని మాత్రమె కోటీశ్వరులను చేసింది.
సేకరణ :--
--((***))--

123 🫖 వంటపనా!🏺

వంటింటి పని అంటే కేవలం ఉడికించడమే కాదు...

కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అల్లం లాంటివి చెడిపోకుండా చూస్తుండాలి. 

ఏ ఏ కూరగాయలు దినాలు ఫ్రెష్ గా ఉంటవి ఏవి త్వరగా చెడిపోతాయి   అనేది తెలిసుండాలి. 

తెలిసుంటే చాలదు.... రోజు ఒకే విధమైన వంట కాకుండా రకరకాలైన వంటలు చేస్తూ వంటిల్లి నిర్వహించాలి.

తినేవారి అభిరుచులను బట్టి ఇష్టా ఇష్టాలు, తినే సామర్థ్యం తెలిసుండాలి.

దానికి తగినట్లు సరుకుల కొలత తెలుసుకొని సరిపడ పాత్రలు కూడా సమకూర్చుకోవాలి.

రుబ్బాలి...., 

వేయించాలి....., 

ఉడికించాలి.....,

పొడి చేయాలి. 

ఫాలో 

...........ఫ్రై. 

................డీప్ ఫ్రై చేయాలి. 

మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ఫ్రై చేయాలి.

అంట్లను కడగాలి. 

.............తుడవాలి. 

సర్దాలి.

శుభ్రతను పాటిస్తూ..... 

ఓ యుద్దమే చేయాలి.  నిన్నటి పాలు. ఈ రోజు పాలు పాత డికాక్షన్ 

కొత్త డికాక్షన్ కాఫీ పొడి టీ పొడి తేడా తెలిసుండాలి.

తెచ్చిన సామానులు సర్ది పెట్టే

స్టోర్స్ మెనేజ్మెంట్ కూడా తెలిసుండాలి. 

రెండు మూడు బర్న ర్ల పై ఒకేసారి వేరు వేరు వంటలు చేయగలిగే టైం మేనేజ్మెంట్  తెలిసుండాలి. 

వడ్డించడం తెలిసుండాలి, మిగిలిన దానిని ఖాళీ చేసీ వేరే పాత్రలోకీ సర్దుబాటు చేసే "స్పేస్ మేనేజ్మెంట్ " తెలుసుండాలి.

అమ్మా..... అంటూ పిలిచే వేరు వేరు వ్యక్తుల పిలుపులకు స్పందిస్తూ సమయానికి అన్నీ పనులు పూర్తి చేయగలిగే మల్టి టాస్కింగ్ సామర్థ్యము ఉండాలి.

ఒక దోస హాట్ కంటైనర్ లోకి దూర్చి మరొకటి ప్లేట్లోకి  వేసి  వేరోకటి పెనం పైన వేసే చేతి వాటం కలిగుండాలి. 

నిత్య మేనేజ్మెంట్ చిన్నచిన్న గాయాలు, చురుకులకు చలించక కామన్ సెన్సు, 

సమయస్పూర్తి ఉండాలి.

ఇవ్వన్ని ఏ కోచింగ్ సెంటర్ కు వెళ్ళకుండా తరతరాలుగా నేర్చుకుంటూ వస్తున్న ఆ శ్రమజీవులందరికీ గౌరవాన్నిచ్చే  పెద్ద మనస్సుండాలి..

వంటపనా....., 

అదేం మహా! అని వెటకారించే ముందు ఇన్ని సామర్ధ్యాలు, సుగుణాలు మనకున్నాయా అని ఆలోచించాలి."వంటపని" అందం. 

                  అవసరం అది అందరి జీవనాధారం.

"వంటపని" ఒక ధ్యానం. భక్తి , దినచర్య , కళ , విజ్ఞానం , ప్రేమ..., అనుభూతి..., 

సేవ..., గౌరవం..., విలువ... ఈ విషయాల్లో వెటకారం తగదు. వంటింటి 

కళాకారులకీ ఓ పెద్ద "నమస్కారం".

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

124*.రూపాయి.. రెండు వేల రూపాయలు సంభాషణలు ..

జీవితం చాలా చిత్రమైనది, దేనికో ఆశపడతాం, తీరా మన దగ్గరకు అవి నెర వేరే టప్పటికి,  దేనికోసమా అనిపిస్తుంది. జీవితం ఎంత సింపుల్ గా ఉంటే, జీవితం అంత సుఖంగా ఉంటుంది, చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక బుద్దుడు, ఒక క్రీస్తు, ఒక రమణ  మహర్షి ఇలా ఎంతోమంది మహానుభావులు చూస్తే అర్ధం అవుతుంది.

ఇక చదవండి 💐💐💐💐

*రెండువేల రూపాయల నోటు*,

*ఒక్కరూపాయి నాణెం ఒకే పర్సులోకి చేరాయి*.

ఈ రెండిటి సంభాషణ.                                        

*రూపాయి నాణెం*...

రెండువేల నోటుతో కలిసిన తన్మయత్వంతో కూడిన ఆనందంలో

అలాగే చూస్తూ ఉండి పోయింది.

దాంతో రెండువేల నోట్....

రూపాయినాణెంతో ఇలా అంది *ఏంటి మిత్రమా నన్ను అంతలా తదేకంగా చూస్తున్నావ్*? అని.....

అప్పుడు రూపాయి నాణెం అంది 

ఏమీలేదు మిత్రమా!

*నీవిలువ నాకంటే రెండువేలరెట్లు ఎక్కువ కదా*!

నీవు నీ జీవితకాలంలో ఎంతో మంది కష్టాలు తీర్చి కన్నీళ్లు తుడ్చి ఉంటావు. ఎంతో మంది ఆకలి తీర్చి ఆదుకొని ఉంటావు అని అందుకే అలా చూస్తున్నా......

దానికి రెండువేల నోటు బాధపడుతూ.... 

లేదు మిత్రమా *నాకు ఎవ్వరి కన్నీళ్లు తుడిచి*....

*కడుపునిండా అన్నం పెట్టే అవకాశం రాలేదు*.

ఎందుకంటే నేను *పెద్ద ఉద్యోగి ఇంట్లో ఉంటిని* వాడు నన్ను

*తన లాకర్లో దాచాడు*. *టాక్స్ ఎగ్గొట్టాడనే కారణం చేత*

ఈమధ్య జరిగిన ఐటీ దాడులలో నేను బయటకు వచ్చాను.

జైల్లో నుండి బయటపడిన ఆనందం కాస్తా కొన్ని రోజులు కూడా లేదు.ఐటీ దాడులలో పట్టుబడిన సొమ్ములో నుండి లంచం రూపంలో ఐటీ అధికారికి ఇచ్చారు.

*లంచం తీసుకున్న అధికారి మళ్ళీ నన్ను బ్యాంక్ లాకర్ లో పడేస్తే* కొన్ని రోజుల తరువాత బయట కొచ్చినా నా జీవితం మొత్తం జైళ్లోనే(లాకర్లో)నే గడిచి పోయింది.

కానీ నీసంగతి చెప్పు మిత్రమా... అంటూ *రూపాయి వంక చూస్తుంది.*

అప్పుడు రూపాయినాణెం ఇలా అంది. మిత్రమా నాజీవితంలో

ఎక్కడెక్కడ తిరిగానో చెప్పలేను.

*భిక్షగాడి పళ్ళెంలోపడివాడి ఆకలి తీర్చాను*.

*ఏడుస్తున్న పిల్లాడికి చాక్లెట్ ఇప్పించి వాడి మొహంలో చిరునవ్వులు చూసాను*. 

*పూజారి హారతి పళ్ళెంలో*...

*దేవుడి హుండీలో* అక్కడి నుండి *భగవంతుని చరణాలు తాకి* అలా ఒక్క చోట ఏంటి?*నేను తిరగని చోటేలేదు మిత్రమా*!

*భగవంతుని పాదాల నుండి* మొదలుకొని *పేదోని అంతిమయాత్రల* వరకు నేను *ప్రతిచోట ఉన్నా అంటూ ధీమాగా చెప్పింది*.

అపుడు రెండువేల నోటు ఇలా అంది

ఎంత *విలువైనది* అన్నది కాదు మిత్రమా! 

*ఎంతమందికి చేరువై* వారి *ఆకలి తీర్చామన్నదే ముఖ్యం* అంటుంది.

ఎంత *ఉన్నతంగా బ్రతికామన్నది* కాదు,

ఎంత మందిని *అక్కున చేర్చుకున్నామన్నదే ముఖ్యం*

నిజమేకదా? 

🙏🙏

 

.126  బుద్ధిమంతుడు 

కలగనుచున్న వానికి కలలోని విషయములపై అధికారము లేదు.  కలలో జరుగుచున్న కథ ప్రకారము తాను నడచుకొనునే గాని,  తన ఇష్టము ప్రకారము కలను మార్చుకొనలేడు గదా!

అట్లే మూఢుడును తన అభిప్రాయములను మార్చుకొనలేడు.

దీనిని గమనించి , తెలిసినవాడు జీవితములోని సన్నివేశములను, వస్తువుల సాధన సంపత్తిని,  తనకు కావలసినంత  వరకును గ్రహించి , మిగిలిన వానిని పట్టించుకొనడు.  

ప్రవహించుచున్న నదియందు తనకు కావలసిన నీటిని గ్రహించి ,  మిగిలిన వానిలో దూకి, మునుగక వర్తించునట్లు బుద్ధిమంతుడు విజ్ఞానము నందు మెలగునని భగవద్గీతలో కృష్ణుడు చెప్పెను.

--(())--

127. కర్మయోగులు

భూమిపైన కోటానుకోట్ల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం ఒక వరం. 

కర్మ చేయటమే కాదు, అది ఆరంభించటానికి ముందు ఆలోచించి, తెలివిగా చేసే అవకాశం మనిషికి మాత్రమే సాధ్యం. మిగతా జీవరాశులు తమతమ ప్రకృతి ధర్మాలనుబట్టి పని చేసుకు పోతూ ఉంటాయి.

ఆహారం, నిద్ర, మైధునం, భయం- ఈ నాలుగూ అన్ని జీవరాశులకు సమానం. ఆలోచించి అడుగు ముందుకు వేయగల జీవి మనిషి ఒక్కడే. పూర్వాపరాలు బేరీజు వేసుకుని ప్రతి మనిషీ తన పని తాను సక్రమంగా చేయగలిగితే, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. వృక్ష, జంతు, మానవ సమాజాలను రక్షించవలసిన బాధ్యతను సృష్టి ఈ మనిషి ద్వారానే నిర్వహిస్తోంది. కర్మ అంటే పని చేయటం.

అందుకోసం అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు- ఈ పదింటినీ అదుపు చేసి ముందుకు సాగటానికి మనసును ప్రకృతి ప్రసాదించింది. చెవులతో వినగలడు, చర్మం ద్వారా స్పర్శ తెలుసుకోగలడు, కళ్ల ద్వారా చూడగలడు, నాలుక ఉపయోగించి రుచి తెలుసుకోగలడు, ముక్కుతో వాసన గ్రహించగలడు. మంచి చెడ్డలు విశ్లేషించుకుని, కర్మేంద్రియాల సహాయంతో పనులు చక్కబెట్టుకోవచ్చు. 

నోరు మంచిదైతే ఊరు మంచిది; ఇచ్చిపుచ్చుకోవటానికి చేతులున్నాయి. ముందు వెనకలు చూసుకొని కదలటానికి కాళ్లున్నాయి. ఇన్ని హంగులు కలిగి ఉండటంవల్ల కర్మ చేయటానికి మనిషికి మూడు మార్గాలున్నాయి. శరీరంతో, మనసుతో, నోటితో ఏ పనైనా చక్కబెట్టగలడు.

కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. జీవన యాత్ర కొనసాగించటానికి తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలి. ఈ విహితకర్మను అవసరాల మేరకే చేపట్టాలి. దురాశకు పాల్పడి ఇతర జీవులకు హాని కలిగించకపోతే చాలు.

రెండోది అకర్మ. మొదటిది ప్రవృత్తి ధర్మం, ఈ రెండోది నివృత్తిధర్మం. జనన మరణచక్రంనుంచి శాశ్వతంగా బయటపడటానికి చేయదగ్గ పనుల్ని అకర్మ అంటారు. దానధర్మాలు, లాంటివి చేపట్టడంవల్ల లోకకల్యాణం జరుగుతుందంటారు. అందుకే అందరూ ఒకే కుటుంబంగా ఐకమత్యంతో సుఖంగా జీవించాలంటున్నది శాస్త్రం. లోకాస్సమస్తా సుఖినోభవంతు.

మూడోది వికర్మ- ఏది చేయకూడదో అది. అదేమిటో శాస్త్రమే చెబుతున్నది. ఒక్కముక్కలో చెప్పాలంటే- ఏ పని చేయటంవల్ల మనకు దుఃఖం కలుగుతుందో, అలాంటిది ఎదుటివాళ్లకు చేయకూడదు.

అలా చేస్తే, దానివల్ల రాబోయే ఫలితం ఏమిటో చివరకు మనమే అనుభవిస్తాం. చేసే ప్రతి పనికీ ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచిపని చేస్తే మంచి ఫలితం, చేయకూడనిది చేస్తే చెడు ఫలితం దక్కుతాయి. మంచి పనులు ఫలించి మనల్ని ముందుకు నడిపిస్తాయి. చెడుపనులు వికటించి మనల్ని అగాధంలో పడదోస్తాయి.

ఉదయమే మేత కోసం ఆలమందను అడవికి తోలుతారు. దినమంతా ఆవులు ఒకచోట, లేగలు మరొక చోట మేస్తాయి. చీకటి పడగానే మంద ఊరివైపు బయలుదేరుతుంది. గోధూళి.

ఆ మసక వెలుతురులో, దూరంగా మేస్తున్న లేగ పరుగెత్తుకువచ్చి తన తల్లి వెనకాలే తరలి వస్తుంది. ఆ మందలో తల్లిని ఎంత బాగా గుర్తుపట్టి వెన్నాడుతుందో అలాగే కర్మఫలం కూడా వెతికి పట్టుకోగలదన్నది పెద్దల మాట. కర్మజీవిగా పుట్టిన మనిషి కర్మచక్రంనుంచి బయట పడటానికి వీలైన పద్ధతిని ఆ పరమాత్మ తానే చెప్పాడు.

'ఫలితం గురించి ఆలోచించకుండా చిత్తశుద్ధితో కర్మ చెయ్యాలి. దాని ఫలితం నాకు వదిలేసెయ్'. ఎవరైతే తమవంతు పనులు అలా అలా చేసుకుని వెళ్తారో వాళ్లూ- అసలైన మనుషులు. కర్మయోగులంటే వారే!


******



No comments:

Post a Comment