Monday 4 June 2018

Pranjali prabha

ఆనాటి నుండి ఈనాటి వరకు నీమీద నాకు కన్నయ్యో

చిత్రం : రాజా విక్రమార్క
సంగీతం : రాజ్ - కోటి
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,P.సుశీల

పల్లవి :

ఆనాటి నుండి ఈనాటి వరకు
నీమీద నాకు కన్నయ్యో
కడవెత్తి పోసుకున్నా నీ పేరు చెప్పి
పడుచేటి కొత్త నీరు నీ తస్సదియ్యా...
నడుమెత్తు కట్టుకున్నా
నాగుట్టుఇప్పిపరువాల పట్టుచీర నీ జిమ్మదీయా
చలిగాలి తాకుతుంటే తబ్బిబ్బో తబ్బిబ్బో
ఓ పట్టు పట్టకుంటే ఓయబ్బో ఏందబ్బో
కందిపోయే కన్నేబుగ్గ పుచ్చుకోరా పూలమొగ్గ

మోచేతి నుండి మోకాలి వరకు
నీ మొహనాలు మోతమ్మో
గొడుగెత్తి పట్టుకుంటే నీ గుమ్మసోకు
గురి మీద బొమ్మలాడే ఓ యమ్మలక్క
గొడవేదో చేసుకుంటే నీ లేతఈడు
గుడిలోన చెమ్మలాడే దిన్ తస్సాచక్క
వాటేసుకుంటే ఒళ్ళు ఓయబ్బో హాయబ్బో
కాటేసుకున్న ముద్దు ఎందబ్బో ఎందేబ్బో
పచ్చినమ్మ పచ్చగుంట పంచుకుంటా పక్కనిండా

చరణం : 1

హత్తుకుంటే నాకళ్ళే నీచేత నీచేత
ఒత్తుకుంటే నీ ఒళ్ళే హైలెస్సో హైలెస్సా
కన్నె అందాలే కావాలా
ఎన్ని అందాలో ఈవేళా
సందేళ ఎన్నెట్లో చాపేసి కూసుంటా
సరదాల విందేసి నీతోనే తొంగుంటా
అద్దరేతిరి అత్తకొడకా ముట్టుకుంటే ముక్కుపుడకా
మురిసి మెరిసి పోయే

చరణం : 2

చెప్పరాని మాటేదో చెప్పేశా చేసేశా
తప్పుగాని తప్పేదో దాటేశా దాటేశా
ఏమి దాచావో చెప్పాలా
ఎన్ని దోచావో ఈవేళా
పసివన్నె పందిట్లో నా ముసినవ్వు ముత్తైదా
సిసలైనా చీకట్లో నీకసిబొట్టు నాదేగా
రంభలూరీ రామచిలకా రాతిరింత పాడిగిలక
పలికె వద్దకు రావే

https://www.youtube.com/watch?v=r4HQte_-zQo

లయహారి - 1

సంస్కృతములో పాదములో 26 అక్షరములకంటె ఎక్కువగా ఉండే వృత్తములను దండకము అని పిలుస్తారు. తెలుగులో అట్టి వాటిని ఉద్ధురమాల అంటారు. లయహారి అట్టి ఉద్ధురమాలా వృత్తమే. దీనికి 11 న-గణములు, ఒక స-గణము, ఒక గురువు ఉంటాయి. దీనిని పంచమాత్రలుగ విఱిచి రెండేసి పంచమాత్రలకు ప్రాసయతిని ఉంచి వ్రాయుట పరిపాటి. కాని పాదములో 35 లఘువులు, రెండు గురువులు ఉన్నందువలన ఇతర గతులలో కూడ దీనిని వ్రాయ వీలగును. క్రింద త్ర్యశ్ర, చతురస్ర, ఖండ గతులలో లయహారికి ఉదాహరణములు -

లయహారి - 11 నగణములు/స/గ లేక 35 లఘువులు + 2 గురువులు

త్ర్యశ్రగతిలో -

హరిని పిలిచె మనసు - స్వరపు రవళి నెపుడు -
మఱియు మఱియు వినఁగ - మురిసి తరిసి ముదమందన్
త్వరగ త్వరగ వలపు - వరము లొసఁగు నతఁడు -
విరుల కరణి నగవు - సరము లలర వనమందున్
చెరువు నగపు శిరముఁ - జిఱుత పదము లునిచి -
గరువ మణచి జనుల - కరుస మిడిన బుడుతండే
సరసములను జిలుకుఁ - దరుణిమలను నొలుకు -
తరుల గిరుల నడచు - వరదుఁ డనఁగ నిల వాఁడే

చతురస్ర గతిలో -

వనమది సుమముల - వనమది చెలువపు -
వనమది మదనుని - వనమది ఘనముగ - దినము పిల్చెన్
మనమది సుమముల - మనమది చెలువపు -
మనమది మదనుని - మనమది ఘనముగ - దినము పిల్చెన్
తనువిది సుమముల - తనువిది చెలువపు -
తనువిది మదనుని - తనువిది ఘనముగ - దినము పిల్చెన్
కనగను వదనము - వినగను కథనము -
మనగను నిరతము - ప్రణయపు రవముల - దినము రారా

ఖండగతిలో -

మధురమగు తలఁపులకు - సదనముగ వఱలితివి -
వ్యధల సుడి తొలగఁగను - ముదముల నొసంగన్
హృదయమునఁ బ్రతిమగను - పదిలముగ నిలిచితివి -
వదలకను దలఁచితిని - నిదుర కలలోనన్
ఉదయమయె నమల శశి - చెదిరినవి తిమిరములు -
మృదుహృదయ చిఱునగవు - బ్రదుకు విరి భూమిన్
సదయ నిను భువి నెపుడు - వెదకుటయె పనిగ నయె -
నిది బ్రదుకు నిజమయెను - గద కమల నేత్రా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
ఒకసారి శ్రీనాథుడు ఒక వూరికి వెళ్ళాడట.వూరిలో ప్రవేశించి వెళుతుంటే అక్కడ రచ్చబండ వద్ద కొందరు పండితులు కూర్చొని యిష్టాగోష్టి మాట్లాడుకుంటూ వున్నారట.ఈయన పండిత వేషం చూసి ఓ పట్టుపడదామని
రండి రండి అని ఆహ్వానించి ఒక సమస్య ఇచ్చారట (వారికి ఆయన శ్రీనాథు డని తెలియదు)
'నందరు నందరే మరియు నందరు నందరే యందరందరే' అది సమస్య.
శ్రీనాథుడికి ఒళ్ళు మండింది.తనను యెగతాళి చేస్తున్నట్టు అనిపించింది.యిలా పూరించాడు కోపంగా

కొందరు భైరవాశ్వములు,కొందరు పార్థుని తేరి టెక్కెముల్
కొందరు ప్రాక్కిటీ శ్వరులు కొందరు కాలుని యెక్కిరింతలున్
కొందరు కృష్ణ జన్మమున గూసిన వారలు నీ సదస్సులో
నందరు నందరే మరియు నందరు నందరే యందరందరే

తా:--యిక్కడ కూర్చున్నవారు కొందరు భైరవుని వాహనాలు అంటే కుక్కలు,కొందరు అర్జునుని రథం మీదనున్న జండాలు (అర్జునుని జండా మీద హనుమంతుడు వుంటాడు)అంటే కోతులు.కొందరు పందులు,
కొందరు యముని వాహనములు (దున్నపోతులు)కొందరు గాడిదలు (కృష్ణుడిని వసుదేవుడు బుట్టలో పెట్టి గోకులానికి తీసుకొని పోతుండగా గాడిద అరిచిందనీ వసుదేవుడు అరవవద్దని దాని కాళ్ళు పట్టుకున్నాడనీ
చెప్తారు )ఈ సభ లో అందరూ అందరే. 


శ్రీమదధ్యాత్మ రామాయణము, అయోధ్యకాండ (పండిత నేమాని రామజోగి సన్యాసిరావు) :

కైక కోరిన వరములను విని దశరథుడు దురపిల్లుట:

వరములు రెండు పంక్తిరథు స్వాంతమునందు శరమ్ములట్లు భీ
కరముగఁ దాకె, వజ్రహతి క్ష్మాధరరాజము కూలినట్లు పం
క్తిరథుండు కూలె నేలపయి తేజము బాసి విషణ్ణచిత్తుడై,
పరిపరిరీతులం గరము బాధలనొందుచు లేచి భీతితో.

అర్థములు: పంక్తిరథుడు = దశరథుడు; స్వాంతము = మనస్సు; శరమ్ములట్లు = బాణముల వలె; భీకరముగ = భయంకరముగా; వజ్రహతి = వజ్రాయుధపుదెబ్బకు; క్ష్మాధరరాజము = మహాపర్వతము; విషణ్ణచిత్తుడై = ఖిన్నుడై; కరము = మిక్కి;ఇ; భీతితో = భయముతో.

భావము: కైకేయి అడిగిన రెండు వరములు, భయంకరములైన బాణముల వలె దశరథుని హృదయమును తాకినవి. ఇంద్రుని వజ్రాయుధపు వేటునకు మహాపర్వతరాజము నేలకూలిన విధముగా, ఆ మహీపతి నేలపై పడిపోయినాడు. తేజస్సును కోల్పోయి, విషణ్ణచిత్తముతో అతి కష్టముగా పైకి లేచినాడు.

అతి కఠినాత్మ, కట్టెదుట నాడుపులింబలె తీవ్ర భీకరా
కృతిఁ జెలరేగుచున్న జ్వలనేక్షణ కైకను గాంచి, ధారుణీ
పతి కడు దీనుడై పలికె "భామిని! ప్రాణముదీయు మాట లీ
గతి నిపు డేల పల్కెదవు? కాస్త దయం గనరాదటే ప్రియా!"

అర్థములు: కఠినాత్మ = కఠినమైన మనస్సు కలది; కెట్టెదుట = ఎదురుగా; ఆడుపులింబలె = ఆడపులి వలె; తీవ్ర భీకరాకృతిన్ = చాలా భయంకరమైన రూపముతో; జ్వలనేక్షణ = నిప్పులు గ్రక్కుతున్న కళ్ళు కలది; ధారుణీపతి = భూపతి, రాజు; కడు = మిక్కిలి; ఈ గతి = ఈ విధముగా.

భావము: తన ఎదురుగా, ఒక ఆడపులి వలె భయంగొలిపే రూపముతో, నిప్పులుమిసే కనులతో ఉన్న కఠినాత్మురాలైన కైకను చూసి, దశరథుడు ఎంతో దీనముగా ఇలా అంటున్నాడు. "ఓ ప్రియా! ఎందుకు ఈవిధముగా ప్రాణాలుతీసే పలుకులు పలుకుతున్నావు? కొద్దిగా నాపై దయ చూపించు".

"వరమును గోరినట్లుగనె పట్టము గట్టెద నీ కుమారుడౌ
భరతుని కెల్లి, పొందుమిక భాగ్యములెల్లను రాజమాతవై;
పురమును వీడి కానలకు పొమ్మని చెప్పకు రామభద్రు, నీ
ధర బ్రతుకంగజాలను కదా శుభధాముడు లేని వీటిలో".

అర్థములు: ఎల్లి = రేపు; పురమును = నగరమును; కానలకు = అడవులకు; ఈ ధర = ఈ భూమిపై; శుభధాముడు = కళ్యాణగుణములకు నిలయుడైన రాముడు; వీటిలో = గృహములో.

భావము: "కైకా! నీవు కోరినట్లుగనే, రేపే నీ పుత్రుడైన భరతునికి రాజ్యపట్టాభిషేకం చేస్తాను. నీవు రాజమాతవై సకల సౌఖ్యములను అనుభవించుము. ఐతే, రాముడిని మాత్రం అరణ్యములకు వెళ్ళమని చెప్పకు. వాడు లేనిదే నేను జీవించివుండలేనని నీకు తెలుసు కదా!" అని ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు దశరథమహారాజు.

అని బ్రతిమాలుచున్న విభు నా విషమానస లెక్కచేయకే
కనుగవ నుండి నిప్పుకలు గ్రన్నన రాలగ పట్టుపట్టగా,
గునపపుపోటు మాటలకు గుండె కలంగి మహీధవుండు కూ
లెను ధరపైని, మేన స్పృహలేని పరిస్థితిలో దటాలునన్.

అర్థములు: విభుడు = భర్త; విషమానస = విషపూరితమైన మనస్సు కల కైక; కనుగవ నుండి = రెండు కనులనుండి; గుండె కలంగి = గుండె చెదరి; మహీధవుండు = భూపతి; మేన = శరీరములో.

భావము: విషభావనలతో నిండిన మనస్సు గల కైక, ఎన్నోరీతుల బ్రతిమాలుతున్న తన నాథుడిని గణింపక, నిప్పులుగ్రక్కే కనులతో తన మాట సాగవలసినదేనని పట్టు పట్టినది. గునపపు పోటుల వంటి ఆమె పలుకులకు గుండె చెదరిన భూజాని, స్పృహ కోలుపోయి వసుధపై పడిపోయినాడు.

సనాతన -

శ్రీకృష్ణుని అష్టోత్తర శతనామావళిలోని మొదటి పంక్తులు - శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవో సనాతనః. శ్రీకృష్ణుడు సనాతనుడు. గోకులాష్టమి సందర్భముగా సార్థకనామ గణాక్షర సనాతన వృత్తమును అందజేస్తున్నాను. ఇది అందమైన తాళ వృత్తము. ఇందులోని గణములు - స/న/న/త/న లేక IIUI IIIII - UUI III. ఇది ఒక పంచమాత్రల ద్విపద అని చెప్పవచ్చును. క్రింద నా ఉదాహరణములు -

సనాతన - స/న/న/త/న IIUI IIIII - UUI III
15 అతిశక్వరి 31228

తరుణేందు వదనమును - దర్శించ నగునొ
కరుణార్ద్ర హృదయమును - గవ్వించ నగునొ
సరసీజ పదములను - స్పర్శించ నగునొ
హరినామములఁ బలికి - హర్షించ నగును

చిన నోరు తెఱువఁగను - చిత్రంపు జగతిఁ
గనె తల్లి బ్రమసి తన - కాయమ్ము మఱచి
చిన నోరు తెఱువగను - చెల్వంపు నగవుఁ
గని తల్లి మెయి మఱచి - కౌగిళ్ల నొసఁగె

వసివెల్గు కిరణముల - వక్త్రమ్ము రుచిర
హ"సనా తన"రె జగము - హ్లాదమ్ము నెఱయ
రసరాస కళిక కడు - రమ్యమ్ము నుడువ
మిసిమించు రజని యిది - మృష్టమ్ము హృదియు

కమలమ్ము నయనములు - కాయమ్ము మణియు
కమలమ్ము వదన మది - గాత్రమ్ము మధువు
కమలమ్ము పదము లవి - కస్తూరి పలుకు
కమలేశుఁ డతఁడు మది - కవ్వించి చిలుకు

చిఱునవ్వు సిరులఁ బలు - చిందించు మొగము
గిరి నెత్తి హరుసమునఁ - గ్రీడించు కరము
నరనారులకు నడుమ - నర్తించు పదము
వర మెల్లరకు నొసఁగు - వాత్సల్య గుణము
హరి నిన్ను దలువ హృది - యానందమయము
శరదిందు ముఖున కగు - సర్వమ్ము జయము
దరి రమ్ము ప్రణయమున - ధాత్రీశ రయము
మరుగేల మురహరుఁడ - మన్నించు నయము

ఇది యంత్య దినము గద - యీ కష్టములకు
హృదయమ్ము మురియుఁ గద - యీ యష్టమికిని
మధురేశు జననమున - మాధుర్య మొదవు
ముద మింక విరియుఁ గద - పుష్పమ్మొ యనఁగ

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
మా మావయ్య గారి గురించి మీకు చెప్పాలి. నా చిన్నతనంలో నన్ను అత్యంత ప్రేమాస్పదంగా చూసిన వ్యక్తి ఆయన .ఉమ్మడి కుటుంబంలో మా అమ్మ పనుల్లో ములిగి ఉంటే నన్ను ఆడించేవాడు. ఎత్తుకొని ముద్దు చేసేవాడు. నేనేమి కోరినా వెంటనే తెచ్చి ఇచ్చేవాడు, నాకూ, మా తమ్ముళ్ళకూ మా మావయ్య అంటే ప్రాణం. నా చిన్నతనంలో ఐర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యొగం దొరికితే నన్ను విడిచి వెళ్లనన్నాడు. చివరకు స్టేటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పూరీలో హెడ్ క్యాషియర్ గా చాలా ఏళ్ళు అక్కడే ఉన్నాడు. 
పూరీ శ్రీ జగన్నాధుడి క్షేత్రం. ప్రతీ ఏడాదీ మా తాతగారు, మా అమ్మమ్మ ఆషాడ మాసంలో జరిగే రధాయాత్రకు పూరీ వెళ్ళి శ్రీ జగన్నాధుడిని దర్శించుకుంటూ చాలా దినాలు అక్కడే గడిపేవారు. వారితో పాటు వేసవి సెలవల మూలాన నన్ను కూడా తమ వెంట తీసుకుపొయేవారు. పూరీలో అందమైన సముద్ర తీరం ఉండేది ప్రతీరోజూ ఉదయం ఫలహారం ముగించి నేనూ మా మావయ్య వెంట బయలుదేరేవాణ్ణి. ఆయన ఆఫీసుకు వెళ్ళిపొయేవాడు. నేను ఏదొ సినిమా మార్నింగ్ షోకి వెళ్ళేవాణ్ణి. సినిమా హాలు దగ్గర నాకు టికట్టు కొనిపెట్టి కొంత డబ్బు నా జోబులో పెట్టి , జాగ్రర్తలు చెప్పి తను ఆఫీసుకు వెళ్ళేవాడు. ఒకోసారి నేను ఇంట్లో ఉన్న ట్రాన్సిస్టర్ రేడియో తీసుకొని సముద్ర తీరానికి పోయేవాడిని. అక్కడా అలా కొన్ని గంటలు వివిధ భారతిలో పాటలు వింటూ ఆ ఇసుక తిన్నెల మీద గడిపేవాడిని. ఆ రోజుల్లో రేడియోవే మానవుడి నేస్తంగా ఉండేది. తిరిగి వచ్చేటప్పుడు సముద్ర తీరంలో అప్పుడే పట్టిన చేపలు బెస్తవాళ్ళు అమ్మేవాళ్ళు. 
వారి దగ్గర ఒక ఒంజరమో, ములివాడో, చందువావో కొని ఇంటికి తెచ్చేవాణ్ణి. ఇంటిలో ఆ రాత్రి అదే చేపల కూర వండేవారు.. 
అక్కడా నా వేసవి సెలవలు చాలా ఆనంద దాయకంగా గడిచేవి. మా తాతగారూ, అమ్ముమ్మతో కలిసి తరచూ పూరి దేవాలయానికి వెళ్లేవాడిని. మందిరంలోని మూల విగ్రహాలు శ్రీ జగన్నాధుడు, శ్రీ భలబద్రుడు, చెల్లి సుభద్రను స్నాన మండపంలో స్నానం చేయించేవారు. ఆ సమయంలో దేముళ్లను వేలాది ప్రజలు వచ్చి దర్శించేవారు. దేవతా దారు విగ్రహాలను ముట్టుకోనిచ్చేవారు. అది నా చిన్నతనంలో గొప్ప అనుభవం. ఇటీవల అలాంటి అవకాశాన్ని ప్రభుత్వం నిషేదించింది. 
పూరీలో జాలర్లు అందరూ తెలుగువారు. వారు నివశించే ప్రాంతాన్ని నొళియా సాహి అనేవారు. ఒరియా భాషలో నొళియా అంటే చేపలు పట్టేవాడు అని అర్ధం ఈ మత్సకారులందరూ మన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలనుంచి ఇక్కడికి వచ్చినవారే. అందరూ తెలుగే మాటలాడేవారు. స్థానిక భాష ఓడ్రం సరిగ్గా పలకలేక పోయేవారు. చేపలవేట సంవత్సరంలో కొన్నాళ్ళు ఉండేది కాదు. ఆ నెలల్లో భార్యా పిల్లల్ని తీసుకొని తమ స్వగ్రామాలకు వెళ్లేవారు. నేను నా ఉద్యొగ యానంలో పారాదీపులో కొన్నాళ్ళు పనిచేసాను. అక్కడా ఇదే పరిస్థితి..వారి కిచ్చిన అప్పుల వసూలు కోసం ప్రతీ నెల తెలుగు వాడిని కావటం వల్ల నన్నే బ్యాంకు పంపించేది. తెలుగులో భాషించే నన్ను చూసి వారు నన్నెంతో గౌరవించేవారు..ప్రతీ లక్ష్మివారం చేపల వేట ఉండేది కాదు. ఆ రోజునే రికవరీకి వెళ్ళేవాడిని..చేపలవాళ్ళ వినోదం కోసం పారాదీపులో ఉన్న ఒకే ఒక సినిమా హాలులో ప్రతి లక్ష్మివారం ఒక తెలుగు సినిమా వేసేవాడు. నేను నా కుటుంబ సమేతంగా ప్రతీ లక్ష్మివారం విధిగా తెలుగు సినిమా చూసేవాడిని. సినిమా హాలు మా బ్యాంకు ఫైనాన్సు కావడం మూలాన హాలు వాళ్ళు మా కోసం సీట్లు రిజర్వు చేసి ఉంచేవారు. . 
నాకు చిన్నతనంలో మా నాన్నగారు మా తమ్ముళ్లతో పాటు పండగలకు నిక్కర్లే కుట్టించేవారు. నాకు మాత్రం ఫుల్ఫాంటు వేసుకొని పెద్దవాడిలా కనిపించాలని గొప్ప ఉబలాటం. ఆ కోరిక మా మా మావయ్య పెళ్లిలో తీరింది. మా మావయ్య ప్యాంటు ఒకటి సైజు చేసుకొని కొత్త చొక్కాతో మా మావయ్య పెళ్ళినాడు వేసుకున్నాను. ఆ ఆనందం వర్ణించలేనిది. మా మావయ్య పెళ్ళి నౌపడాలో జరిగింది. అప్పుడు నేను 6వ క్లాసు చదువుతున్నాను. మా అత్త మెట్రిక్యులేటు. కొత్త పెళ్లి కూతురుగా వచ్చిన మా అత్త దగ్గర కూర్చొని కధలు, కబుర్లు చెప్పమనేవాణ్ణి. మా అత్త లందరూ మరో ఇద్దరు మావయ్యల భార్యలు నన్నెంతో ప్రేమతో చూసేవారు.మా మావయ్యలు నన్ను ప్రతి ఉదయం తమతో పాటు మా బరంపురంలో ఉన్న మలబారు హొటేలుకు తీసుకు పోయేవారు.. అక్కడ రెండి ఇడ్లీలు, ఒక పూరీ, మా మావయ్య తాగే కాఫీలో సగం నాకు ఇచ్చేవారు. హొటేలునుంచి బయటకు వచ్చి అక్కడున్న ఖిల్లీ దుఖాణంలో తమతో పాటు నాకూ ఒక చిన్న తాంబూలం ఇప్పించేవారు ఈ తాంబూలం అలవాటుతో నా దంతాలు చాలాసార్లు పుచ్చిపోయి చిన్నతనంలో గొప్ప బాధ అనుభవించాను..ఆ రోజుల్లో పిప్పి పపన్నుకు వైద్యం పురుగులు తీయడం, నన్నొక వైద్యురాల దగ్గరకు తీసుకుపోయేవారు. ఒక చిన్న కాడతో ఆమే నా పుచ్చిన పన్నును గొలికి ఒక చిన్న వేరు పురుగు తీసినట్టు చూపించేది. పెద్దయ్యక ఆ సమయస్పూర్థి అర్ధమైంది అదొక సైకలాజికల్ చికిత్స మాత్రమే నొప్పి మందువల్ల తగ్గేది. కానీ మనస్సులో పన్ను నుంచి పురుగు తీసేసారని ఒక స్వాంతన కలిగి నిబ్బరంగా ఉండేది. మా బరంపురం చంద్రమణి పేటలో ఇలాంటి వైద్యులు ఉండేవారు. 
మా బరంపురంలో ఒక పెద్ద సొండు ( వ్రుషభం ) ఉండేది. అది పెద్ద నందిలాంటి ఆకారంతో గొప్ప భయంకరంగా ఉండేది. రోడ్డు మీద కొన్నిసార్లు ఇతర వ్రుషభాలతో ఢీ కొనేది. నగర ట్రాఫిక్ స్థంబించిపోయేది. . సొండ్లు తమ వాడైన కొమ్ములతో రక్తాలు కారినట్టు కొట్లాడుకొనేవి. .ఇందాక నేను పేర్కొన్న మలబారు హొటేలువాడు దానికి తిండి, గంజి పెట్టి పోషించడం వల్ల దానికి మలబారు షొండు అని ప్రజలు పిలిచేవారు. 
మా మావయ్య తదనంతర కాలంలో జైపుర్, ఒరఖిల్, రాయగడా , బరంపురం భాపుర్ బజార్ ఈవినింగు బ్రాంచ్ లాంటి శాఖల్లో మెనేజరుగా పనిచేసి రెటైర్ అయ్యాడు. స్టేటు బ్యాంకులో కె. కె. రావు అంటే గొప్ప పేరు.. గొప్ప నిజాయతీపరుడు. ఒకసారి ఒక హొటలు కు ఆర్ధిక సాహాయం కొన్ని లక్షల్లో చేసినందుకు క్రుతగ్యతతో ఆ హొటెల్ యజమాని 5 లక్షలు ఒక సంచిలో పెట్టి తీసుకొచ్చి ఇవ్వబొతే నిరాకరించిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. తనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు ఉన్నా చిన్నతనంలో నన్ను, మా తమ్ముళ్ళను ప్రేమించినట్టు ఆయన తన స్వంత పిల్లల్ని కూడా అంత ఆపేక్షతో చూడలేదు.మామా, మేనళ్ళుల్ల అనుబంధం మా అన్నదమ్ముల జీవితాల్లో మరుపురానిది.. మా నానా గారు పోయి నప్పుడు కష్టాలో ఉన్నాని, కుటుంబ భారం కష్టమని ప్రతీ నెలా నాకు 40 రూపాయలు మనియార్డరు చేసేవాడు. ఈ సహాయం నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చేదాకా సాగింది. పలసాలో ఉన్న మరో మావయ్య ఆయన పేరు మాతా వెంకటరమణ ప్రతీ నెలా మాకు 20 రూపాయలు ఇచ్చేవాడు. ఆ డబ్బుకోసం ప్రతీ నెలా నేను బరంపురం నుంచి పలాసా వెళ్లి వచ్చేవాడిని. ఆర్ధిక బాధల వల్ల మా కుటుంబమంతా ఒక ఆరు నెలల కాలం కంట్రోలు దుఖాణంలో ఇచ్చే గోధుమలతో కెవలం రొట్టెలు మాత్రమే చేసుకొని అవే మూడు పూటలా తింటూ బ్రతికాము. మూత్రం ఎర్రగా రక్త చారికల్తో రావటం నాకు బాగా గ్యాపకం.. 
శ్రీ శ్రీ రాసిన కవితా పంక్తులు " మనదీ ఒక బ్రతుకేనా కుక్కలవలె నక్కలవలె, మనదీ ఒక బ్రతుకేనా సందుల్లో పందులవలే " అని మనస్సులో వాపోయేవాడిని. లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, బ్రతుకు వ్రుధా, చదువు వ్రుదా, మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం, అనుకొని దుఃఖించిన ఆ రోజులు నేను ఖుర్దా రోడ్దు ఉద్యొగంతో ఒక విరామానికి వచ్చాయి. ఆ దినాల్లో మా వికాసం సభ్యులు, మిత్రులు నన్నెంతో ఆదరంగా చూసేవారు. నా కష్టాల కడగళ్లపై సానుభూతితో నా ఎం.కాం కాలేజీ అడ్మిషన్ కోసం వారే ఆర్ధిక సహాయం చేసారు. ఒక మిత్రుడిచ్చిన పాత సైకిలుతో ఉదయం 7 నుంచి 9 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు ట్యూషన్సు చెప్పి నెలకు 200 రూపాయలు ఆ రోజుల్లో సంపాదించేవాడిని. 
ఆ ఆదాయంతోనే మా జీవితాలు గడిచేవి. మా వికాసంలో కీర్తి శేషురాలు శ్రీమతి దేవి , మరో రచయత్రి ఉమాదేవి గారు నా మీద అవాజ్యమైన ప్రేమను చూపించేవారు. నా కవితలపై విమర్శను సవిమర్శగా రాసేవారు. నన్నెంతో ప్రొత్సహించేవారు. వారి నుంచి ఒక్క నాడు కూడా నేను ఖండనను ఎరగను. ఆ దినాలో నేను గోర్కీ జీవిత చరిత్ర చదువుతూ ఉండేవాడిని. అత్యంత క్లేశభూరితమైన నిక్రుష్ట జీవితం అనుభవించిన ఆ మహా రచయత జీవితం, నాకు ప్రేరణగా ఉండేది. మా భాపూరు బజారులో బేకరీల దుఖాణాల ముందు నడుస్తున్నప్పుడు ఆ బెకరీల్లో రొట్టె ముద్దను పిసికిన గొర్కీ కా కళ్లల్లో మెదిలేవాడు. కన్నీళ్ళొచ్చినా ఆపుకొనేవాడిని. జీవితం మీద, నా కష్టాల మీద ఎలాగైనా గెలవాలనుకొనే వాడిని.. నా కవిత్వాన్ని కూడా నేను నా పేదరికం మీద యుద్ధం గానే మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆ యుద్ధమే చేస్తున్నాను. 
మా నాన్నగారు పోయిన తరువాత నేను ఉద్యోగ అన్వేషణలో ఉన్నప్పుడు మా గురువుగారైన ధర్మపురి క్రిష్ణమూర్తి మాస్టారు నన్ను ఈనాడులో సబ్ ఎడిటర్ పోస్టు కోసం అప్లై చేయమన్నారు. తన మిత్రుడు ఏ. బీ. కే ప్రసాద్ పత్రికలో సంపాదకుడిగా ఉన్నడని , ఆయనతో చెప్పి నాకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగె ఒక రెజ్యూం రాసి ఈనాడు వారికి పంపించి ఉద్యోగానికై ఎదురు చూసా, కానీ ఎందుకో నాకా ఉద్యొగం రాలేదు, బ్యాంకులో నా ఎం.కాం వైవా పరీక్ష ఒక నెల రోజుల్లో ఉందనగా నియుక్తి పత్రం వచ్చింది. జర్నలిస్టుగా ఉండివుంటే నా జీవితం మరోలా ఉండేది, కానీ జీవితం నాకా అవకాశం ఇవ్వలేదు. బ్యాంకులో క్లర్కుగా చేరి సీనియర్ మెనేజరుగా పదవీ విరమణ చేసాను. 
ఈ ఉద్యోగం రావడానికి కూడా ఒక చిన్న కధవుంది. నా రాత పరీక్ష మా వూళ్ళో చిన్న బజారులో ఉన్న యునైటెడ్ బ్యాంకు ప్రాంగణంలో జరిగింది. ఇంటర్వ్యూ కూడా కొన్నాళ్ళ తరువార రాత పరీక్షలో ఉతీర్ణులైనవారికి ఆ బ్యాంకు లోనే అక్కడి అధికారులు నిర్వహించారు.. ఆ అధికారుల్లో ఒకాయన ఒక తమిళియన్ మా మిలటరీ లైనులో ఉండేవాడు. ఆయన ఇంటి పక్కనే ఉన్న మా వికాసం సభ్యురాలు కోకా సావిత్రిగారి కుటుంబంతో నాకు గొప్ప సాన్నిహిత్యం ఉండేది. ఆమే, ఆమె అక్కచెల్లెళ్ళందరూ నా గురించి ఆ తమిళ ఆఫీసరుగారికి ముందుగా చెప్పి నాకు ఎలాగైనా ఉద్యొగం వచ్చేలా సహాయం చేయమని కోరారు..ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకూ సమాధానం నేను చక్కగానే చెప్పాను. చివరిలో ఆయన ఆ అమ్మయలతో నీకెలా పరిచయం అని అడిగాడు. నే అన్నా వారితో నాకు ఫామిలీ ఫ్రెండ్షిప్ అని. కొద్ది రోజుల తరువాత నాకుద్యొగం వచ్చింది. ఉద్యోగంలో చేరే టప్పుడు ఇద్దరి వ్యక్తుల రెఫరన్సు ఇవ్వాలి., ఒకటి మా వికాసం అధ్యక్షులు డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు, ఎం.ఏ.పీహెచ్దీ, ఫార్మర్ ట్రాన్స్లేటర్, ప్రొగ్రసివ్ పబ్లికేషన్స్, మాస్కో అని గర్వంగా రాసి ఇచ్చాను. మరో రిఫరెన్సు నా కత్యంత ప్రియ మిత్రుడు, ఆత్మీయుడు , మా వికాసం సభ్యుడు, అయిన శ్రీ తాతిరాజు వెంకటేశ్వర్లు గారి పేరు ఇచ్చాను. ఇద్దరూ చక్కటి వివరణలు నా తరపున ఇవ్వటం వల్ల నాకా ఉద్యోగం దొరికింది. 

మళ్లీ మధూళిక!

స్తవమాలను చదువుతుంటే అందులో ఇందిరాచ్ఛందము అని ఒకటి కనబడినది. దానికి గణములు న/ర/ర/లగ. దీనిని రాజహంసీ అని పిలుస్తారు. ర-గణమును అలాగే ఉంచి త్రిమాత్రను న-గణము, గలముగా చేస్తే మనకు నాలుగు విధములైన వృత్తములు లభిస్తాయి. అందులో రంజితా, రాజహంసీ, పంక్తికా ఛందోగ్రంథములలో ఉన్నాయి. నాలుగవ దానికి గణములు న/ర/న/ర. దీనికి నేను మధూళికా అని పేరు పెట్టి ఇంతకు ముందే తెలిపినాను. ఈ రోజు మధూళికకు మఱి కొన్ని ఉదాహరణములను ఇస్తున్నాను. ఈ నాలుగు వృత్తములు రథోద్ధత (UIUIII - UIUIU) వర్గమునకు చెందినది. పాదపు రెండు భాగములలో రెండు చతుర్మాత్రలు కాని అష్టమాత్ర ఈ వర్గపు ప్రత్యేకత.

న/ర/న/ర మధూళికా
ర/జ/స/లగ రంజితా, ఉపదారికా
న/ర/ర/లగ రాజహంసీ, కనకమంజరి, విభూషణా
ర/య/జ/గ పంక్తికా, మౌక్తిక, కర్ణపాలికా, హరహర
ర/న/ర/లగ రథోద్ధతా, వరాంతికా

మధూళికా - న/ర/న/ర IIIUIU - IIIUIU
12 జగతి 1496

తలఁపు లెన్నియో - తలుపు లేదుగా
వలపు చేప నే - వలకుఁ జిక్కితిన్
కలలు వచ్చునా - కలఁత తెచ్చునా
అలరుఁబోడి న-న్నలరఁ జేయునా

సరసఁ జేరఁగా - సరస మాడునా
వరదుఁ డైననున్ - వరము లిచ్చునా
కరము ప్రీతితోఁ - గర మొసంగునా
తరుణమందు నా - తరుణుఁ డెక్కడో

హరిని దల్చఁగా - హరుఁడు వచ్చునా
హరుని దల్చఁగా - హరియు వచ్చునా
హరిహరుల్ సదా - హరహరుల్ గదా
చరణ మంటఁగా - శరణ మిత్తురే

పడితిఁ బ్రేమలోఁ - బడితి మెల్లఁగాఁ
బడితి నెందుకో - ఫలిత మేమిటో
యిడుము లెన్నియో - యెడము లెన్నియో
కడకు యోగమో - కథ వియోగమో

మనసు నీదె యీ - మమత నీకెరా
తనువు నీదె యీ - ధరణిపై సదా
దినము రాత్రి సు-స్థిరము డెందమం
దనఘ నీవె యీ - యబలఁ గావరా

తెలుఁగు పద్యముల్ - దినము హృద్యముల్
తెలుఁగు పాటలో - తియని తేనియల్
తెలుఁగు పల్కు ము-త్తియము సత్యమై
తెలుఁగు నేర్చి నీ - తెలివి పెంచుకో

ఇందులో మొదటి మూడు ఉదాహరణములకు యతి, ప్రాసయతి రెండు ఉన్నాయి. న/ర గణములతో ఉండే వృత్తమును నరమనోరమా అంటారు. పై మూడు ఉదాహరణములను ఒక్కొక్క దానిని రెండు నరమనోరమ వృత్తములుగా వ్రాయ వీలగును. క్రింద ఒక ఉదాహరణము -

నరమనోరమా - న/ర
6 గాయత్రి 24

హరిని దల్చఁగా
హరుఁడు వచ్చునా
హరుని దల్చఁగా
హరియు వచ్చునా

హరిహరుల్ సదా
హరహరుల్ గదా
చరణ మంటఁగా
శరణ మిత్తురే

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

No comments:

Post a Comment