Tuesday 5 June 2018

Pranjali prabha (7- 0 6 - 2 0 1 8)



శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు
దివ్వెనూదగ వద్దు బువ్వనెట్టద్దు
తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు
తొలిసంజె మలిసంజె నిదుర పోవద్దు
మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు..
మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు..

ఇల్లాలు కంటతడి పెట్టనీ ఇంట
కల్లలాడని ఇంట గోమాత వెంట
ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో..
పూలల్లో పాలల్లో.. పూలల్లొ పాలల్లొ ధాన్య రాశుల్లో..
మా తల్లి మహలక్ష్మి స్థిరముగానుండు..
మా తల్లి మహలక్ష్మి స్థిరముగానుండు.

చిత్రం : లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం : చిల్లర భవన్నారాయణ
గానం : జానకి

https://www.youtube.com/watch?v=ca2WjB9ZfIU




నమస్కార విధానం

నమః – అనగా త్యాగమని వాచ్యార్థం. నేను నీకంటే తక్కువవాడను. నీవు నాకంటే గొప్పవాడవు అనే “దాస్యభావం” (దైవానికి దైవవిషయాలకు) స్ఫురిస్తుంది.

“నాకు నేను ఉపయుక్తుడను కాను”, కాబట్టి, నీవే నన్ను ఉద్దరించగలవాడవు అని ‘ఆత్మార్పణము చేసుకోవటం’ అనునిక అపూర్వయోగాన్ని “నమః" అను పదం సూచిస్తోంది. తన నికృష్ణతను, పూజ్యడగువాని ఉత్కృష్ణతను చూపటానికి నమస్కారంలో ఓ రహస్యం ఉంది. నమస్కారం వంటి తారక మంత్రం ఇంకొకటి లేదు. శత్రువు యొక్క శత్రుభావాన్ని సమూలంగా పోగొట్టగల శక్తి ఈ నమస్కారానికి ఉంది. నమస్కారంతో సకలార్థసిద్ధిని పొందవచ్చు.
శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్కసారి నమస్కరించితే పది ఆశ్వమేథయాగాల అనంతరం చేయబడు అవభృథస్నానంతో సమానమని, భారతంలో చెప్పబడింది.

నమస్కారం వలన దైన్యభావం అలవడతాయి. దీనిచే మనలోని అహంకారం తగ్గుతుంది. దైన్యమనగా (నిరాడంబరత) సేవాభావమని అర్థం. సేవాభావం వలన, భగవద్భక్తి పెంపొంది, భగవంతునిపట్ల ఆరాధనాభావం కలుగుతుంది. అట్టి ప్రేమారాధానమే ‘భక్తి’. అట్టి భక్తితో సాధింపరాని సిద్ధులు లేవు. భక్తియే ఆత్మా సాక్షాత్కార జ్ఞానానికి మూలం. పరమభాక్తియే మోక్షప్రాప్తికి ఉత్తమ సాధనం. నమస్కారము – కాయకము, వాచికము, మాసికము అని మూడు విధాలు.

1. కాయకము: ఇది శారీరకమైనది, రెండు అరచేతులు కలిపి చేసే నమస్కారం. పడుకుని అష్టాంగాల్ని నేలపైమోపి చేయబడు సాష్టాంగ నమస్కారం, మరియు ధ్యాన ముద్ర నమస్కారము. (ఎడమబోటనివేలిపై కుడి బొటనవేలు ఉంచి, పరస్పరం పట్టుకుని, ఇతర వ్రేళ్ళను సాచి ఉంచితే మహాముద్ర అవుతుంది) ఈ ధ్యానముద్ర నమస్కారంతో, భావంతుని దానించితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.

2. వాచికము: నోటితో ఉచ్ఛరించునది. “నమః”, “నమస్కారము” మొదలగు శబ్దములతో మనమనోభావాన్ని తెలుపటం.

3. మాసికము: దైవంపట్ల, మనఃపూర్వకమైన ‘నమస్కార’ భావమును మనస్సునందే ఏకాగ్రతతో తలచుట.
ఏవిధమైన నమస్కారమైనప్పటికీ ఆత్మార్పణ చేసుకొనుటయే అవుతుంది. కాయక నమస్కారంతో (శారీరక నమస్కారాలు) అష్టాంగము, పంచాంగము, త్రయ్యంగము, ఏకంగము అని నాలుగు విధానాలున్నాయి.
అష్టాంగ నమస్కారము: అష్టాంగ నమస్కారం ఉత్తమమైనది, ముఖ్యమైనది, తప్పని సరిగా ఆచరించవలసినది.

“శిరోహస్తౌచ కర్ణౌచ చుబుకమ్ బాహు యుగ్మం అష్టాంగ చ నమస్కారమ్” అనగా శిరస్సు, రెండుచేతులు, రెండుచెవులు, గడ్డం, రెండు భుజాలు వీనిని నేలపై ఆనించి చేయబడు నమస్కారం ‘అష్టాంగము’ అని చెప్పబడుతోంది. దేవతలకు, గురువులకు, పెద్దలకు ఈ విధమైన నమస్కారం చేయాలి. (స్త్రీలు ఈవిధమైన నమస్కారాన్ని చేయరాదు).
పంచాంగ నమస్కారము: “శిరోహస్తౌచ బాహుచ కృత్యా జానునీ, సంస్థితా ఇదం పంచాంగ మేవోక్తమ్”
అనగా శిరస్సు, రెండుచేతులు, రెండు భుజాలు, మోకాళ్ళు నేలపై ఆన్చి (మోకాళ్ళపై వంగి) చేయబడు నమస్కారం పంచాంగ నమస్కారమని పిలువబడుతోంది. ఈ విధమైన నమస్కారం స్త్రీలకు ఉత్తమమైనది.

త్రయ్యంగ నమస్కారము: “హస్తౌ బద్ధ్వాతు ముకళ వమ్మార్నిదేశేనియోజయేత్”
రెండుచేతులు ముకుళించి (జోడించి) తలపై ఉంచి చేయబడుతున్న నమస్కారం త్రయ్యంగ నమస్కారం.
ఏకంగా నమస్కారము: “ఏకాంగంతు నమస్కారం శిరసైనా కృతాభవేత్”
తలను మాత్రం వంచి చేయబడు నమస్కారం “ఏకాంగ” నమస్కారమని పిలువబడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే (చేతులను జోడించి నమస్కరించ లేని పరిస్థితులలోనే) ఈ పద్ధతిలో నమస్కరించాలి.

‘గురువు’కు ఈ క్రింది విధంగా నమస్కరించటం శ్రేయస్కరం.
“వ్యత్యప్త పాణినా కార్యమున సంగ్రహణం గురోః |
సవ్యేన సవ్యః స్పృష్టవ్యో దక్షిణేవ చ దక్షణ: ||”
అనగా రెండు చేతులులను మార్చి పట్టుకుని (అనగా కుడిచేతిలో గురువు యొక్క కుడిపాదాన్ని, ఎడమచేతిలో గురువుయొక్క ఎడమపాదాన్ని) పట్టుకుని నమస్కరించాలి. మీ పాదపద్మాలే నాకు శరణ్యమనే భక్తి భావనతో గురువుకు నమస్కరించాలి.

“ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాం గముచ్యతే”

వక్షఃస్థలాన్ని, శిరస్సును భూమికితాకించి, దృష్టితో దైవాన్ని చూస్తూ, మనస్సులో దైవమును ప్రార్థన చేస్తూ, ‘నమః’ అని పలుకుతూ, రెండు పాదాగ్రాలను కలుపుతూ, రెండు చేతులతో నమస్కరిస్తూ, రెండు చెవులను నేలకు తాకిస్తూ బోర్లపడి నమస్కరించటం “సాష్టాంగ నమస్కారం” అనబడుతుంది. ఈ విధమైన నమస్కారంలో కాయికము, వాచికము, మానసికము అనబడు త్రివిధాలైన నమస్కారాలు అంతర్గర్భితాలై ఉన్నాయి. అనగా మనస్సు చేత చింతించుట, వాక్కుచే ‘నమః’ అని అనటం, బోర్లగిలి అష్టాంగనమస్కారం చేయుట కలిసున్నాయి. ఇంకా రెండుచేతులు, రెండుకాళ్ళు, వక్షస్థలం, నొసలు, రెండు భుజాలు మొత్తం ఎనిమిది అంగాలను నేలకు తాకుతున్నట్లు బోర్లగిలి నమస్కరిస్తున్నందువల్ల “సాష్టాంగ నమస్కారం” అని పిలువబడుతోంది. ఈవిధమైన “సాష్టాంగ నమస్కారం” శ్రేష్టమైనది. స్త్రీలు సాష్టాంగ నమస్కారాలు చేయరాదు.

నమస్కారాలు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మొక్కుబడిగా, హడావుడిగా కాక మనస్ఫూర్తిగా నమస్కరించాలి. రెండు చేతులను పూర్తిగా కలిపి హృదయస్థానాన్నిగాని, నుదుటనుగాని స్పర్శిస్తూ నమస్కరించాలి. నమ్రతభావనతో నమస్కరించాలి. ఇవన్నీ పూర్తిగా పాటించి నమస్కరిస్తేనే ‘నమస్కారం’ యొక్క నమ్రతాక్రియకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. 3,5,7,9,12 సంఖ్యలలో నమస్కారాలు చేయడం శ్రేయస్కరం.




ఒకదినమున భోజరాజు సాయంసమయములో మారువేషమున నగరము లో తిరుగు చుండెను ..నగరమంతయు తిరుగుచు ఒక విప్ర గృహము వద్ద కాకులన్నీ గుంపుగా చేరి అరుచుచు తమపిల్లలకు
ఆహారము పెట్టుచుండుట చూచి అక్కడ ఆగెను.ఆ బ్రాహ్మణుడు అతని భార్య బయట నిలిచి కాకులను చూచుచుండిరి.ఆ యింటి ఇల్లాలు భయపడునటుల నటించుచు భర్తను కౌగలించుకొని ఈ కాకి కూతలకు నా
గుండె అదురు చున్నది నాథా!అనెను.ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆమెను అనేక విధముల లాలించి భయపడకుమని లోపలి గొనిపోయెను.
అది చూచిన భోజరాజుకు ఆమె మాటలు సహజముగా తోచలేదు.ఆమె నటించు చున్నదని అనిపించింది.ఏమి
జరుగునో చూడవలెనని అచటనే దాగియుండెను.చీకటి పడిన తరువాత ఆ ఇల్లాలు భర్తకు భోజనం పెట్టి,తానూ తిని రాత్రి మొదటి ఝాము వరకు భర్త తో గడిపి ఆయనను నిద్ర పుచ్చి అందముగా అలంకరించుకొని ఒక బుట్టలో ఏమో పెట్టుకొని బయట గొళ్ళెము వేసి బయల్దేరేను.రాజు ఆమెను చాటుగా
.వెంబ డించుచు వెళ్ల సాగెను.ఆ యువతి ఊరిబయట నున్ననర్మదా నది వద్దకు వచ్చి అక్కడనే మాంసపు ముక్కలతో కాచుకొని యున్న తన దాసి దగ్గర అవి తీసుకొని బుట్టలో పెట్టుకొని తెప్పలో ఆవలి ఒడ్డుకు బయల్దేరి పోతూ ఆ నదిలో నున్న మొసళ్ళు తనకు అడ్డం రాకుండా ఆ మాంసపు ముక్కలు వాటికీ వేస్తూ
తప్పించుకొని ఆవలి ఒడ్డుకు చేరి అక్కడ కాచుకొని యున్న తన ప్రియుని తో సుఖించి తెలవారక ముందే ఇల్లు జేరెను.ఈ విషయమును రాజు ఆ దాసీ దానిని బెదరించి ఇది రోజూ జరుగుచున్నదని తెలుసుకొనెను.
మరునాడు సభలో భోజరాజు ఈ సమస్య నిచ్చి పూరింపు డనెను.
"దివా కాకరుతా ద్భీత " ఎవరూ పూరింప లేక పోయిన కాళిదాసు వెంటనే రెండో పాదాన్ని
రాత్రాత రతి నర్మదాం అన్నాడు.భోజుడు మూడో పాదం లో యిలా అడిగాడు.
తత్ర సంతి జలే గ్రాహాః
మర్మ జ్ఞానైన సుందరీ
పగలు కాకి కూతకు భయపడు సుందరి రాత్రి నర్మదానదిని దాటు చుండెను.ఆ నర్మదానది యందు మొసళ్ళు
కలవు కదా!ఆమె అందుకు ఏమి చెయ్య వలెనో ఆ మర్మము నెరిగి యుండెను.
పగలు కాకికూతకు భయపడు వనిత
రాత్రి వేళనునిర్భీతి నర్మదను దాటు
నందు సంచార మొనరించు నక్రగములు
మర్మ మెరుగును రాజ యమ్మగువ తాను.
భోజరాజు ఆ బ్రాహ్మణుడిని పిలిపించి విషయ మంతయు చెప్పి ఆ యువతిని శిక్షిం చెను.




 

మాటకందని పాటగా....మనమిద్దరమూ కలిశాముగా...

చిత్రం : మల్లెలతీరం
సాహిత్యం : ఉమామహేశ్వరరావు
సంగీతం : పవన్ కుమార్
గానం : నిత్యసంతోషిణి

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

తూరుపు వెలుగుల పడమటి జిలుగుల
పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుసున ఇద్దరమే
చీకటి నలుపున మనమే
చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు అలసట ఎరుగని
నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!

ఆఅ... మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

స్వఛ్చపు తొలకరి వెచ్చని జల్లుల
పచ్చని కాంతులలో మనమే..
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటల మనమే
నింగి నేల చిన్నబోయే రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతము ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియకథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా


పుష్కరుడు ఒక బ్రాహ్మణుడు.శివుడి గురించి తపస్సు చేసి 'జలమమత్వ' సిద్ధి పొందినందున అతనికి అన్ని తీర్థాలనూపవిత్రం చేసే శక్తి వచ్చింది.దానిపై బ్రహ్మ అతడిని జల రూపం లో తన కమండలం లో వున్చేసుకున్నాడు.అప్పుడు బృహస్పతి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తానూ ఒక రాశి నుండి వేరొక రాశి కి మారే సమయం లో ఏడాది ముందు 12 రోజులు,ఏడాదికి చివర 12 రోజులు పుష్కరుడు తనతో పాటు నదీ
జలాల్లో వుండే టట్టు వరం పొందాడు.పుష్కర కాలం లో బృహస్పతి,పుష్కరుడు మాత్రమె గాక సకల దేవతలు,
సతీ సమేతంగా త్రిమూర్తులు ఆ నదీ జలాల్లో వుంటారు.సహజ పావన మైన ఆ నదీ జలమా సమయం లో పరమ పావనంగా శోభిల్లు తూ వుంటుంది.ఒకసారి పుష్కర సమయం లో గోదావరి స్నానం చేస్తే 60 ఎండ్లపాటు గంగా స్నానం చేసిన ఫలం లభిస్తుంది.ఆ సమయం లో దానాలు,పితృ తర్పణాలు,శ్రాద్ధాదులు అనంత ఫలాన్నిస్తాయి.
గరుత్మంతుడు తన తల్లి దాస్య విముక్తి కై తన సోదరులైన సర్పాలకు స్వర్గం నుంచి అమృతం తెచ్చే టప్పుడు దేవతలు తరుముతూ వుంటేత్రయంబకం దగ్గర గోదావరి లో దాక్కున్నాడనీ,అప్పుడు కొన్ని అమృతపు చుక్కలు నది లో పడ్డాయనీ .అందువల్ల గోదావరిలో స్నానం చేస్తే సర్వ రోగాలు నశిస్తా యనీ
కొన్ని పురాణాలు చెప్తున్నాయి.
-యన్మయా దూషితం తోయం
శరీర మల సంభవం
తస్య పాప నివృ త్యర్థం
అక్షోభ్యః తర్పయా మ్యహం
అని చెప్తూ పుష్కరాల్లో నదికి తర్పణం మివ్వాలి.పిండ ప్రదానం,మీకు చేత నైన అన్నదానం,వస్త్ర దానం,సువర్ణ
దానం,రజత దానం,భూదానం,గోదానం ఏదైనా సరే దాన మివ్వాలి.ముతైదువులు చేటల వాయనం యిస్తారు.
నది ఒడ్డునేకొందరు ముతైదువులు చేటలూ,దానికి కావలిసిన వస్తువులూ పెట్టుకొని కొంత డబ్బు తీసుకొని వాళ్ళే ఆ వాయనం తీసుకుంటారు.
వృద్ధులు,అంతదూరం పోవడానికి అశక్తు లైన వారు యింట్లో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటే
సరిపోతుందట.
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు.
అర్థము:--గంగ,యమున,గోదావరి ,సరస్వతి,నర్మదా,సింధు,కావేరి ఈ అన్ని నదుల లోని నీళ్ళు నా సన్నిధిలోకి వచ్చేట్టు చెయ్యి.అని నమస్కారము చేసుకొని స్నానం చెయ్యాలట ప్రతిరోజూ ఈ శ్లోకం చెప్పుకొని
అందరూకూడా స్నానం చేస్తే మంచిదట. .
శరీర మల సంభవం
తస్య పాప నివృ త్యర్థం
అక్షోభ్యః తర్పయా మ్యహం
అని చెప్తూ పుష్కరాల్లో నదికి తర్పణం మివ్వాలి.పిండ ప్రదానం,మీకు చేత నైన అన్నదానం,వస్త్ర దానం,సువర్ణ
దానం,రజత దానం,భూదానం,గోదానం ఏదైనా సరే దాన మివ్వాలి.ముతైదువులు చేటల వాయనం యిస్తారు.
నది ఒడ్డునేకొందరు ముతైదువులు చేటలూ,దానికి కావలిసిన వస్తువులూ పెట్టుకొని కొంత డబ్బు తీసుకొని వాళ్ళే ఆ వాయనం తీసుకుంటారు.
.-------------------------------------
వృద్ధులు,అంతదూరం పోవడానికి అశక్తు లైన వారు యింట్లో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటే
సరిపోతుందట.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు.

అర్థము:--గంగ,యమున,గోదావరి ,సరస్వతి,నర్మదా,సింధు,కావేరి ఈ అన్ని నదుల లోని నీళ్ళు నా సన్నిధిలోకి వచ్చేట్టు చెయ్యి.అని నమస్కారము చేసుకొని స్నానం చెయ్యాలట ప్రతిరోజూ ఈ శ్లోకం చెప్పుకొని అందరూకూడా స్నానం చేస్తే మంచిదట. .
పితరుల విందు వైదికపు విప్రుల విత్తపు పంట చేను దే వతలయు సర్వతీర్థముల వాసము,భిక్షుక ధర్మసత్రమున్ వితరణ లీవులారు పది విత్తెడు కార్తె యలన్కరించే న
ద్భుత మహిమన్ స గౌతమిని బుష్కర పర్వము రాణ్మహేం ద్రమున్ దేవతలు,సర్వతీర్థములు నివాసముండే పుష్కరాలకు వెళ్ళండి. వితరణ గా దానాలు చేయండి.దీనిలో అద్భుత మహిమ వున్నది.
నరులా ముప్పదిమూడుకోట్ల సురలున్ సార్థ త్రికోటులుమహ త్తర తీర్థంబులు దీర్థరాజు,నిట సిద్ధ శ్రేణి తో నిల్చి యుం దురు పండ్రెండు దినాలు పుణ్యమ నిత్తుర్ దూరమందుండి పు
ష్కర పర్వాన నఖండ గౌతమిని దోగన్ రాణ్మహేంద్ర మునకున్ ముప్పదిమూడు కోట్ల దేవతలు,మూడుకోట్ల తీర్థ రాజములు,దీర్థ రాజు,దీనిలో సిద్దులతో కలిసి నిలిచి వుంటారట ఈ పండ్రెండు దినాలు పుణ్యాన్ని యిస్తారట.ఈ అఖండ పర్వ దినాలలోగోదావరిలో పుష్కర స్నానము చేసి పునీతులు కండి. 
కవి. వడ్డాది సుబ్బరాయుడు.



రామరాజభూషణుడు రచించిన 'వసుచరిత్ర' లో చాలా పద్యాల్లో శబ్దాలంకారాలు,శబ్ద చిత్రాలు కనిపిస్తాయి.
వసు రాజు గిరిక అను నామె చిత్ర పటమును చూసి ఆమెను మోహించి ఆమె ఎటులుండునో చూచి నా ప్రేమను
తెలిపి రమ్మని తన నర్మ సచివుడిని పంపెను.అతడు తిరిగి వచ్చిన అతనిని చూసి ఆత్రముగా ఆమెకి నాప్రేమను తెలిపినావా?అని ఆతృతగా అడిగిన వసురాజుకు ఈ పద్యమును చెప్పెను
.
స్వైర విహార ధీరలగు సారసలోచన లున్నచోటికిన్
బోరున లాతివారు చొరబూనిన చో రసభంగ మంచు నే
జేరక పువ్వు దీవియల చెంతనె నిల్చి లతాంగి రూపు క
న్నారగ గాంచి వచ్చితి నవాంబు రుహాంబక!నీకు దెల్పగన్

తామరపువ్వుల వంటి కన్నులుగల యవ్వనవతులతో గిరిక ఎవరూ లేరని స్వేచ్చగా మాట్లాడుకుంటూ వున్నది. .
అక్కడికి నేను వెళితే 'రసభంగ'మవుతుంది.అంటే ఒక అర్థ మేమో వారి మాటలకు భంగము కలుగుతుంది.యని
యింకొక అర్థము 'సారసలోచన ' లో 'రస' మనే పదం లోపిస్తే వారు సాలోచన లవుతారు.అంటే వీడెవడు
పానకం లో పుడక లాగ వచ్చాడు అని 'సాలోచనలు' అంటే ఆశ్చర్యము తో కన్నులు తెరిచినవారు.అని అర్థం.అందుకని వారికి ఎదురుగా పోక పూతీవల మధ్య లోనుంచే వారిని కనులారా గాంచి నీకు చెప్పాలని తిరిగి వచ్చేశాను.అని చెప్తాడు నర్మ సచివుడు.
నవాంబు రుహాంబక అంటే అప్పుడేవిచ్చిన తామరరేకుల వంటి కన్నులు గలవాడా! అని సంభోధన.
యింకా యిలా చెప్పాడు.ఆమె ఎలా వుందంటే

నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే లా నన్నొల దటంచు గంధఫలి బల్కాకన్ దపం బంది యో 

షా నాసాకృతి బూని సర్వ సుమనసౌరభ్య సంవాసి యై
బూనేన్ బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్

అన్ని పూవుల మీద వ్రాలి మకరందాన్ని గ్రోలే తుమ్మెద, నా మీద వాలి మకరందాన్ని గ్రోలదు.అనిదుఖం తో సంపెంగ దేవుని గూర్చి ఘోర తపస్సు చేసి అందమైన యువతుల ముక్కుగా మారిందట ముక్కుకు ఇరువైపులా తుమ్మెదరెక్కలు విచ్చుకున్నట్టు కన్నులు ఉండేట్టు వరము పొందిందట. యిక్కడ గిరిక ముక్కు సంపెంగ లా అందంగా వుందని,ఆమె కళ్ళు తుమ్మెద బారుల్లా గ వున్నాయని వర్ణన
(కవులు అందమైన యువతుల ముక్కును సంపెంగ అనీ కళ్ళు తుమ్మెదలనీ వర్ణించడం ఆనవాయితీ)

'వసుచరిత్ర'గ్రంథం లో ఇలాంటి వర్ణనలు చాలా వుంటాయి.
గిరిక ఏడుపును భట్టుమూర్తి (రామరాజభూషణుడు)చాలా బాగా వర్ణించాడు
.

---------------------------------------గ్లాసుడు నీళ్ళు (అనుశ్రుత గాథ)--------------------------
ఒక సన్యాసి అదృష్ట వశాత్తూ భగవంతుడిని కలుసుకున్నాడు.భగవంతుడి చిరునవ్వు నవ్వి నీకేం కావాలి
నాయనా అని అడిగాడు.ఆ సన్న్యాసి నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది.సత్యాన్ని బోధించండి.
అన్నాడు.దానికి భగవంతుడు చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు.నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు. అక్కడికి దగ్గరగా గ్రామం కానీ,ఇళ్ళు కానీ లేవు.చాలా దూరం నడిచి వెళ్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు.లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.
సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు ,చంద్రబింబం లాంటి ముఖం.అతను అంత అందమైన అమ్మాయిని యింతవరకూ చూడలేదు.అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది.అలా నవ్వుతూ వుంటే యింకా అందంగా కనిపించింది.అంతే తానూ వచ్చిన పని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటావా?అని అడిగాడు.ఆ కన్య అంగీకారంగా తల వూచింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు.రోజులు గడిచిపోతున్నాయి చాలా మంది పిల్లలు కలిగారు.ఎంతకాలం గడిచి పోయిందో వాళ్లకి తెలియనేలేదు.
ఇలా వుండగా ఒకరోజు పెద్ద గాలీ వాన ఒకటే ధారా.ఊరూ వాడ ఏకమై పోయాయి.(హుదూద్ తుఫాన్ లాగ)చెట్లు పడిపోయాయి,ఇళ్ళు కూలిపోయాయి.భార్యా పిల్లలతో అతడు ప్రవాహములో నడుచుకుంటూ పోతున్నాడు.ప్రవాహం వేగంగా వుంది.ఎక్కడా గట్టు దొరకడం లేదు.అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు.'భగవంతుడా రక్షించు'అని మొరపెట్టుకున్నాడు.భగవంతుడు అతడి మొర విని నేను అడిగిన గ్లాసుడు నీళ్లేవీ?అని అడిగాడు.
ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు.కాలం లో చిక్కుకొని
నివసించడం అలవాటయి పోయింది.కాలం రెండు విధాలు,1.గడియారం సూచించే కాలమానం 2.మనస్సు కల్పించే మానసిక కాలం.నిన్న,ఈ రోజు,రేపు అనేవి మనస్సు నిర్మించినవి.నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు."నిన్న''గతించినట్లే అవి గతించాయి.కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు.రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా
జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మండే వున్నారు.నిజానికి నిన్నా లేదు,రేపూ లేదు,వర్తమానమే ఎప్పుడూ వుండేది.మానసిక కాలమే మిధ్య.



నీరు నారు నోరు
*********************
నీరు జీవులకు ప్రాణాధారం , చక్కని నారువేసిన నారుమడి పండించిన ధాన్యం ఆహారాధారం - ఇవి రెండు బ్రతుకుటకాధారమైతే - నోరు రసవంతమై మధురమంజులమైన భాషణలకు , నారి ( గృహిణి ) చక్కని చీరకట్టు , బొట్టులతో సాంప్రదాయబద్దంగా వుంటే జీవనమనుగడ స్వర్గతుల్యంగా వుంటుంది. చీరకట్టులో వున్న శృంగారం తెలుగుదనానికి వెలుగుదనం ఇస్తుంది.
ఈ భావాన్నే సుమతీ శతక కర్త తన పద్యంలోని నాలుగు పాదాలలో వివరించాడు.

నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
నారే నరులకు రత్నము
చీరే శౄంగారమండ్రు , సిద్దము సుమతీ!

1 comment: