Thursday 7 June 2018

Pranjali Prabha (14-06-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
రచయత/ సేకరణ కర్త : మల్లాప్రగడ రామకృష్ణ 

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
మల్లాప్రగడ రామకృష్ణ  

మృత్యువంటే భయము నాకు లేదు 
నా దగ్గరకు రావాలన్నా నేను చేసిన 
పాప మేదో తెలిపి తీసు కెళ్ల మంటా

కాలంతో పాటు నడిచేవాణ్ణి
రహస్యాలను తెల్పి మేలుకొల్పేవాణ్ణి  
పాపప్రక్షాళన చేయుటకు ప్రయత్నిస్తూ ఉంటా 

ఎన్నో సూర్యోదయాలను చూసిన వాణ్ణి
ఏ నిముషమున ఏ రంగు మారునో తెలిసిన వాణ్ణి   
ఎండకు ఎండిన మీకోసం నావంతు సహాయం చేస్తూ ఉంటా

ఋతువుల్లా నా రక్తంలో మార్పు లొస్తున్నా
వయసు కోరికలు పెరిగి అనగారి పోతున్నా 
తుది రక్తపు బిందువు వరకు దేశ సేవకోసం బ్రతికే ఉంటా 

పోయిన కాలాన్ని తిరిగి తేలేము 
మృదంగంలా వర్తమానంలో జీవిస్తాము 
ఆశయాల సాధనతో భవిషత్తులో బ్రతుకుతూ ఉంటా 

గుమ్మానికి కట్టిన మామిడి తోరణాన్ని
పరుల దృష్టి దోషం రాకుండా ఆపేవాణ్ణి 
ఎండు ఆకులలో పచ్చదనాన్ని నింపుతూ ఉంటా 

ఊహలకన్నా వాస్తవాన్ని గ్రహించే వాణ్ణి 
సంతానం సంసారాన్ని నమ్మిన వాణ్ణి 
వయసు మీదపడ్డ, వాస్తవ జ్ఞానాన్ని తెలుపుతూ ఉంటా    

సమయాన్ని వ్యర్ధ పరచక గీతా భోధకుణ్ణి
మనస్సు తృప్తి పరిచే మార్గాన్ని తెలిపే వాణ్ణి
దయ,ధర్మం,దానం నిత్యకృత్యంగా భావిస్తూ ఉంటా  

తెల్లవారుజామున లేచి పుస్తకపఠనం చేసిన వాణ్ణి 
బ్రతుకు వేటలో అనేక బాణాలు గ్రుచ్చుకున్నా బ్రతికినవాణ్ణి 
తల్లితండ్రుల సేవకన్నా మించినది లేదని వాదిస్తూ ఉంటా 
నా గమ్యం సత్యం,ధర్మ, న్యాయంగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటా  
    --((*))--


ఏవో. ఏవేవో,ఏవేవో 
ఘోషలు వినబడుతున్నాయ్! 
గుండెలు విడిపోతున్నాయ్! 
ఎవరో, 
ఏవరెవరో, ఏవరెవరో 
తల విరబోసుకు 
నగ్నంగా నర్తిస్తున్నారు!భయొ 
ద్విగ్నంగా వర్తిస్తున్నారు! 
అవిగో! అవి గవిగో! అవి గవిగో! 
ఇంకిన ,తెగిపోయిన, మరణించిన 
క్రొన్నెత్తురు! విపంచికలు! యువయొధులు! 
నేడే ఈనాడే, ఈనాడే- 
జగమంతా బలివితర్ది! 
నరజాతికి పరివర్తన! 
నవజీవన శుభసమయం! 
అభ్యుదయం!
వసంతునితో వెన్నెలఱేడు పోటీ!

సాహితీమిత్రులారా!
చం. క్షితిపయి వట్టి మ్రాకులు జిగిర్ప వసంతుడు దా రసోపగుం
భిత పద వాసనల్ నెఱప, మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస
న్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె;

ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా మధుమాసం వచ్చింది. వసంత ఋతువుని వసంతునిగా సంభావించడం కవిసమయం. అతను మన్మథుని చెలికాడు కదా. వసంతుడు వస్తూనే చక్కగా భూమిపై మోడువారిన చెట్లనన్నింటినీ చిగురింపజేశాడు. మామూలుగా చిగురించాయా అవి! రస ఉపగుంభిత పద వాసనల్ నెఱప – చిగురించాయి. రసవంతమైన (ఫలపుష్పాల వంటి) సామగ్రితో, వాటినుండి వచ్చే సుగంధాలు నలువైపులా వ్యాపించేట్టుగా చిగురించాయి. అలా చిగురింపజేశాడు వసంతుడు. వసంతుడు అంతటి ఘనకార్యాన్ని చేసినా పైనుండి చూస్తున్న చంద్రుడు మెచ్చుకోలేదు. సరికదా, అతనితో స్పర్థ బూనాడు. అతని కంటే ఘనుడనని నిరూపించుకోడానికి ప్రసన్నమైన, సుకుమారమైన తన వెన్నెలజల్లు కురిపించి రాళ్ళను సైతం కరగింపజేశాడు! శరత్తులాగే వసంతంలో కూడా వెన్నెల విరగకాస్తుంది, ఆకాశం నిర్మలంగా ఉంటుంది కాబట్టి. పైగా వేడెక్కే పొద్దులనుండి చల్లని ఉపశమనాన్ని కూడా యిస్తుంది. అంచేత మధుమాసం కూడా వెన్నెల మాసమే. ఈ రెండంశాలనూ కలపోస్తూ, వసంతునికీ చంద్రునికీ మధ్య స్పర్థనొక దాన్ని కల్పించాడు కవి. కవి చమత్కారానికి హద్దేముంది! పైగా ‘ప్రతి పద్యమునందు జమత్కృతి గలుగన్ జెప్పనేర్తు’నని ప్రతినబూనిన కవి కూడాను.

ఈపాటికే ప్రాజ్ఞులయిన పాఠకులకి ఈ కవి ఎవరో ఎరుకలోకి వచ్చే ఉంటుంది. ఇది చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసములోని పద్యం. నేను పైన యివ్వడం మానేసిన చివరి పాదం కూడా ఈపాటికే చాలామంది గుర్తించి ఉంటారు.

ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!

పద్యం తెలియని చాలామందికి కూడా తెలిసే వాక్యం ఇది. తెలుగు సాహిత్యంలో అంతగా ప్రసిద్ధికెక్కింది. వసంత వర్ణనలో విశేషమైన కల్పన చేయడమే కాకుండా దానిని ఉదాహరణగా తీసుకొని, సామాన్యంగా మనుషులలో ప్రత్యేకించి కవులు కళాకారులలో, కనిపించే ఒకానొక లక్షణాన్ని ఎత్తిచూపిస్తున్నాడు చేమకూర కవి. ఈ కవి ప్రతి పద్యం లోనే కాదు ప్రతి పదంలో కూడా చమత్కారం గుప్పించగల దిట్ట. చివరి పాదం చదివిన తర్వాత మళ్ళీ పద్యమంతా తిరిగి చదివితే, చివరి పాదం హఠాత్తుగా ఊడిపడింది కాదని, పద్యం మొదటినుంచీ కవి ఆ విషయాన్ని తాను ప్రయోగించిన పదాల ద్వారా స్ఫురింపజేశాడనీ అర్థమవుతుంది. ‘రసోపగుంభిత పదవాసనలు’ అంటే నవరసాలతో శోభిల్లే పదభావాలు. అలాంటి శబ్దార్థాలు కూడిన కవిత్వాన్ని రచించి, ఒక కవి మోడువారిన హృదయాలను చిగురింపజేశాడు. మరొక కవి దానిని మెచ్చకుండా పంతంతో తను కూడా కావ్యరచన చేశాడు. ప్రసాదము, సౌకుమార్యము అనే గుణాలతో ప్రకాశిస్తూ, రాతి గుండెలను సైతం కరిగించే కావ్యం అది. ప్రసాదము, సౌకుమార్యము అనేవి కావ్యగుణాలు. ఆలంకారికులు మొత్తం పది కావ్యగుణాలను చెప్పారు – శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సౌకుమార్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజస్సు, సమాధి. ప్రసాదము అంటే అందరికీ అర్థమయ్యే పదాలతో సులువుగా సాగిపోయే గుణం. సౌకుమార్యం అంటే అక్షరరమ్యతతో చెవికి ఇంపుగా ఉండే లక్షణం. ఇలా ఒకవైపు వసంతాన్ని వర్ణిస్తూనే మరొకవైపు ఒకానొక లోకస్వభావాన్ని స్ఫురింపజేయడం కవి ప్రతిభ. రసోపగుంభిత పదవాసనలు, ప్రసన్నత, సౌకుమార్యము మొదలైన పదాలలో శ్లేష ద్వారా దీన్ని సాధించాడు వేంకటకవి. అయితే పద్యం మొత్తం మీద ఉన్న అలంకారం శ్లేష కాదు. ఎందుకంటే ఈ పద్యంలో ఉన్నది వసంతుడూ చంద్రుడే కాని కవులు కాదు. కవుల మధ్యనున్న స్పర్థ కేవలం పాఠకులకు స్ఫురించే అంశమే తప్ప నేరుగా కవి చెప్పింది కాదు. ఇటువంటి అలంకారాన్ని సమాసోక్తి అంటారు. శ్లేష ఎక్కువగా శబ్దప్రధానమైనది. సమాసోక్తి అర్థప్రధానమైనది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, భావప్రధానమైనది. అది మనసుని మరింతగా హత్తుకుంటుంది.

ఏదయితేనేమి, ఆ యిరువురి స్పర్థ, వారి రచనలను అనుభవించేవారికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది! అది కవుల విషయమైనా సరే, చంద్రవసంతుల విషయమైనా సరే. స్పర్థయా వర్ధతే విద్య అని అన్నారు కదా. అయినా ఒక కవిగా, ఎంత గొప్ప కవిత్వాన్ని రచించినా సమకాలము వారలు మెచ్చకపోవడాన్ని గూర్చి వాపోయాడు వేంకటకవి. మెచ్చకపోవడమే కాదు, ఏ రకంగా తక్కువ చేసి చిన్నబుచ్చుతారో కూడా మనకీ పద్యంలో చూచాయగా తెలియజెప్పాడు. పద్యాన్ని మరొకసారి జాగ్రత్తగా చదివితే, చంద్రుడు వసంతుడిని తక్కువ చేయడం మనకి కనిపిస్తుంది. ‘వట్టి మ్రాకులు చిగిర్ప’ అన్న పదబంధంలో ‘వట్టి’ అనే పదం మోడువారిన అనే అర్థంతో పాటు, విడిగా చదివితే ‘కేవలం’ అనే హేళన భావం కూడా ధ్వనిస్తుంది. కేవలం చెట్లని మాత్రం చిగురింపజేయడమే వసంతుడు చేసే పని అని, తాను మాత్రం రాళ్ళను సైతం కరిగించగలడనీ- చంద్రుని పరంగా అన్వయించుకోవచ్చును. అలాగే వసంతుడు తన కార్యాన్ని సాధించడానికి ‘క్షితిపయి’కి వెళ్ళవలసి వచ్చింది. మరి తానో, ఆకాశంలో ఉండే తన కార్యాన్ని సాధిస్తాడు. ఇలా ప్రతి పదాన్ని సార్థకంగా ప్రయోగించడం చేమకూర ప్రత్యేకత. తాపీ ధర్మారావుగారు విజయవిలాసానికి చేసిన హృదయోల్లాస వ్యాఖ్యలో ఈ ప్రత్యేకతను అద్భుతంగా పట్టి మనకందించారు. వేంకటకవి పద్యాలలో అధికాధికం శబ్దచమత్కార బంధురమైనవి. అర్థచమత్కారంతో సున్నిత భావాన్ని స్ఫురింపజేయడం ఈ పద్యంలో నన్ను ఆకట్టుకొన్న అంశం. సాధారణంగా కవుల కావ్యాలలో ఋతువర్ణనలు విస్తారంగా సాగుతాయి. అయితే వేంకటకవి విడిగా ఋతువర్ణన చేయలేదు. సాయంకాల వర్ణనతో కలిపి వసంతాన్ని వర్ణించడం ఇక్కడున్న విశేషం. పై పద్యంలో చంద్రుని ప్రసన్నతకూ సౌకుమార్యానికీ కారణం వసంతకాలం ఒక్కటే కాదు. అది పున్నమిరేయి కూడానూ. దీని ముందరి పద్యాలను చదివితే ఆ విషయం బోధపడుతుంది. అది కూడా కవి నేరుగా చెప్పడు, సాయంకాల దృశ్యాన్ని చిత్రించడం ద్వారా మనకి ప్రత్యక్షం చేస్తాడు. ఆ పద్యాన్ని కూడా ఆస్వాదించి వసంతుని ఆగమనాన్ని స్వాగతిద్దాం.

అంగజరాజు పాంథ నిచయంబులపై విజయం బొనర్ప నే
గంగ దలంచునంత మునుగల్గగ దాసులు పట్టు జాళువా
బంగరు టాలవట్టముల భంగి గనంబడె బూర్వ పశ్చిమో
త్తుంగ మహీధరాగ్రముల దోయజశాత్రవమిత్ర బింబముల్

వసంతుడు మన్మథుని చెలికాడే కాదు, సేనాపతి కూడా. అందువల్ల వసంతమాసం అంటే మన్మథుడు జైత్రయాత్ర చేసే సమయం అన్నమాట. మన్మథరాజు జైత్రయాత్రకి సన్నద్ధమైన సమయాన్ని వర్ణిస్తున్న పద్యమిది.

ఇక్కడొక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. ఒకసారి భవభూతి, దండి, కాళిదాసులతో కలిసి భోజరాజు సముద్రపుటొడ్డుకు విహారానికి వెళ్ళాడట. అక్కడ అస్తమిస్తున్న సూర్యుడిని చూసి ‘పరిపతతి పయోనిధౌ పతంగః’ అన్నాడట. అంటే సూర్యుడు సముద్రంలో పడిపోతున్నాడు అని. మిగిలినవారు ఒకొక్క పాదంతో ఆ పద్యాన్ని పూరించాలి. వెంటనే దండి ‘సరసిరుహా ముదరేషు మత్తభృంగః’ అన్నాడట. అంటే పద్మాల కడుపుల్లో మత్తిల్లిన తేనెటీగలున్నాయి అని. తేనె తాగేందుకు వాలిన భ్రమరాలు పద్మ మరందాన్ని త్రాగి మత్తెక్కి ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. పద్మాలు ముడుచుకుపోయాయి. అలా ముడుచుకుపోయిన పద్మాల కడుపుల్లో మత్తిల్లిన భృంగాలు ఉండిపోయాయి! ఆ తర్వాత భవభూతి ‘ఉపవనతరుకోటరే విహంగః’ అన్నాడు. ప్రక్కనే ఉద్యానవనాలున్నాయి. ఆ తోటల్లో చెట్లున్నాయి. ఆ చెట్ల తొర్రలలోకి పక్షులు చేరుకున్నాయి అని అర్థం. ఇక చివరగా కాళిదాసు వంతు. అతను ‘యువతి జనేషు శనై శ్శనై రనంగః’ అని పూరించాడు. అంటే యౌవనవతులైన స్త్రీలలోకి మెల్లమెల్లగా మన్మథుడు ప్రవేశిస్తున్నాడు అని.

అంచేత మన్మథుని దండయాత్రకు అనువైన సమయం సాయంత్రమే. ఇక్కడ జైత్రయాత్ర ఎవరిపైన అంటే, పాంథనిచయంబులపైన. అంటే ప్రయాణంలో ఉన్నవాళ్ళపైన. తమ ప్రియతములకు దూరమై విరహంతో వేగుతూ ఉండే వాళ్ళపైనన్న మాట! రాజు ఎక్కడికైనా బయలుదేరాడనగానే పెద్ద సన్నాహమే కదా. అతని ఠీవికి తగ్గట్టుగా ముందు కొంతమంది రాజోచిత లాంఛనాలను పట్టుకొని నడుస్తారు. అలాంటి రాజచిహ్నాలలో సూర్యచంద్రుల బొమ్మలున్న పలకలు అమర్చిన పొడుగాటి కర్రలను సూర్యపాను చంద్రపాను అంటారు. వాటినే ఆలావర్తములని (ఆలవట్టములు) కూడా అంటారు. ఇక్కడ యాత్రకి సన్నద్ధమయినది మామూలు రాజు కాదు కదా! జగజ్జేత అయిన మన్మథుడు. అతనికి బొమ్మలతో పని లేదు. అచ్చంగా చంద్రసూర్య బింబాలే మేలిమి (జాళువా) బంగారు ఆలవట్టములయ్యాయి అన్నట్టుగా అటూ యిటూ, తూర్పుపడమటి కొండలపై (పూర్వ పశ్చిమ ఉత్తుంగ మహీధరాగ్రముల) ప్రకాశించాయి. తోయజశాత్రవుడు అంటే పద్మాలకు శత్రువు – చంద్రుడు. తోయజమిత్రుడు సూర్యుడు. చంద్రబింబం తూర్పుకొండపైన, సూర్యబింబం పడమటికొండపైన వెలుగుతోంది. అందుకే అది సాయంసమయం. సూర్యాస్తమయమూ చంద్రోదయమూ ఒకేసారి అవుతున్నాయంటే అది పున్నమి అన్నమాట. అది మధుమాసమనీ పున్నమినాటి సాయంసంధ్యా సమయమనీ ఎక్కడా నేరుగా చెప్పకుండా కేవలం దృశ్యచిత్రీకరణ ద్వారా తెలియజేయడం కవి రచనలోని చమత్కారం! అంగజరాజు అనే పదానికి కూడా గొప్ప సార్థకత ఉందని వివరించారు తాపీవారు. దీనికి అంగదేశంలో పుట్టిన రాజు అనే అర్థం కూడా వస్తుంది. అంగదేశం భరతఖండంలో ఉత్తరాన ఉంది. అందువల్ల అంగజరాజు ఉత్తరదిక్కు నుండి బయలుదేరుతున్నాడని ఊహించవచ్చు. అప్పుడు సరిగ్గా అతని కుడిపక్క (అంటే పడమట) సూర్యపాను, ఎడమపక్క (అంటే తూర్పున) చంద్రపానూ ఉన్న దృశ్యం మనకి చక్కగా సాక్షాత్కరిస్తుంది.
-----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో
----------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు
ప్రాంజలి ప్రభ (త్రీ)


21.   10000+1000+100+10      = 
22.   123456789  x  72                = 
23.   2014 x 1986                          = 
24.   200 x200 +100 x 100 + 2 x 200 x 100  =
25.   200 x 200 + 100 x 100 – 2 x 200 x 100 =
26.   (475 +425)2 – 4 x 475 x 425                   =
27.   3000 + 2000 – a100 = 4000
28. Find the decimal value i.e. 1/2 = ?
29. Express 7/16,2/3 and 10/7 in decimal form  ?
30. Express 3.28 in the form of P/Q
--((*))--

ప్రాంజలి ప్రభ  
OBJECTIVE TYYPE QUESTINS   (Paper -1) ( NUMBERS)

 21.  10000+1000+100+10    =11110                                                                                           
 22.  123456789  x  72                =                                        
        123456789(100-28) = 12345678900 – (123456789 x 28)
        12345678900 –(123456789 x (30-2),
                                                            
        12345678900-370370370 + 24691358 = 
             888888888        
23     2014 x 1986                         = (2000+14) x  (2000-14), 
         (2000)2 – (14)2  = 4000000-196 
         =3999804
24     200 x200 +100 x 100 + 2 x 200 x 100  =                                  
           200 + 100)2 = (300)2  = 90000
25     200 x 200 + 100 x 100 – 2 x 200 x 100 =                              
          (200 - 100)2 = (100)2  =10000
26     (475 +425)2 – 4 x 475 x 425                   =                              
         (a-b)2  = (a+b)2 -4ab 
         (475 – 425 )2  = (50)2    =2500
27     3000 + 2000 – a100 = 4000                                                     
          -a100 = 4000 –(3000+2000),  -a100 = -1000    ..      a = 10 
28. Find the decimal value i.e. 1/2 = ?
      Ans. 0.5
 29. Express 7/16,2/3 and 10/7 in decimal form  ?
       Ans.  7/16= 0.4375, 10/7 = 1.428571, 2/3=0.666
30. Express 3.28 in the form of P/Q
       328/100 = 2(164)/2(50) = 82/25 = (NUMERATOR AND 
        DENOMINATOR ARE CO-PRIMES)
                           --((*))--

ॐॐॐ

తరువులన్ని చిగురులతో
నిండివుంటె మేలుకదా ||
ప్రకృతిలో అందాలను
చెరపకుంటె మేలుకదా ||
.
గుచ్చుతున్న నేలతల్లి
గుండెఘోష వినలేరా
ధరణిపైన భారాలను
మోపకుంటె మేలుకదా ||
.
మమకారపు తోటలన్ని
వడలిపోయి చూస్తుంటే
ఊతమిచ్చి అనురాగం
పంచుకుంటె మేలుకదా ||
.
కలుషితమై ప్రకృతేమో
ఆహ్లాదం మరచిందీ
మనచుట్టూ పచ్చదనం
పెంచుకుంటె మేలుకదా ||
.
మనుష్యుల్లో స్వార్థాలు
సాంకేతిక భోగాలే
మరుగవకనె జీవజాతి
నిలుపుకుంటె మేలుకదా ||

చెట్టుపుట్ట నరికేసిరి
మన్నంతా కప్పేసిరి
మొక్కే అపురూపమంటు
నాటుతుంటె మేలుకదా ||
.
అడుగడుగున కంటకాలు
కన్నీళ్లే ఒంపుతుంటె
అలజడులే అధిగమించి
సాగుతుంటె మేలుకదా ||
.
.......వాణి,


నేటి పద్యం
ప్రాంజలి ప్రభ
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ

శా: "గోవిందా" తనువే శ్రమించు సమయం సామిప్య సారుధ్యమే
     "గోవిందా" పిలుపే క్షమించు తరుణం దుష్కర్మ ప్రారబ్ధముగా
     "గోవిందా" వయసే తరించు తలపే నీమార్గ నిత్యాలయం
     "గోవిందా" మనసే మధించి జరిపే నీపూజ ప్రేమాలయం


నేటి కవిత
ప్రాంజలి ప్రభ

గగన సీమలో పగటి నక్షత్రం
మనసు తోటలో పరుగు ప్రభావం
ఒకరి మాయలో కలత ముభావం

పడచు వేటలో షరతు పతంగం
గడప దాటుటే పరువు ప్రయాణం
మోగలి రేకులే కుదిపె మృదంగం

తడిక మాటునే వయసు కళాపం
పలక భావమే పదును ప్రలాపం
చిటిక వేటులో చినికు చామరం

తెలుపు సున్నమే మమత ప్రభోధం
కడలి పొంగులే పిలుపు ప్రమోదం

|| ఙ్ఞాపకం ||

మనసు మీదపడ్డ కన్నీటి సంతకం
కవిత్వమై మొలిచింది
ముగిసిపోతుందనుకున్న జీవితమే
అక్షరమై ఊపిరిపోసుకుంది

బరువుగా వున్న కాలంమంతా
కవన ప్రపంచంలో నిక్షిప్తమయ్యింది

గాయమారితే కవిత్వమాగుతుందా.....?

ఙ్ఞాపకం నిరంతరమే
మౌనమై హత్తుకుంటూ
భావమై తట్టి లేపుతూ
కవితై అల్లుకుంటూ
ఊపిరాగి పోయినా
కావ్యమై నిలిచిపోతూ....!!

......వాణి,
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ

ఉలిచేత ఆకృతి - ఊహ ఫలితం
నగిషీ నైపుణ్యం  - బ్రతుకు జీవనం
చరిత్ర పదిలం - జీవన మాధుర్యం
నిత్య నిర్ణయం - మనో తరుణం

శిల్పం సజీవం - రాయి నిర్జీవం
చెక్కు పదిలం - మనసు వికలం
కళ కమనీయం - ఆచరణం దుర్లభం 
మోసం సులభం - అధికారం కష్టం

సైన్య బలం - దేశ రక్షణ
వృత్తి బలం - జీవిత రక్షణ
మొండి బలం - బానిస రక్షణ
యు బలం - స్త్రీ రక్షణ

నేటి పద్యం

శా..స్పర్సతో అనురాగ మోంది పరమా నందంగ సంతృప్తి చెం
దేదీ అమ్మ నవాభ్యు మార్గము ననే పోషించి ప్రేమింప చే
సేదీ అమ్మ తలవంపులే,మనసుకే చేర్చక సౌక్యంబు పం
చేదీ అమ్మ సుఖాను పంచి వెతలే మార్చేది మాతానులే



బానిస యుద్ధహ్మ్ - తిరుగుబాటు మకుటం
స్త్రీ యుద్ధం - గెలుపు మకుటం
పురుష యుద్ధం - కుటుంబ మకుటం
ఏలిక యుద్ధం - నమ్మక మకుటం
--((*))--

కంచి పరమాచార్య వైభవం :- 

నాస్తికుడు ఆస్తికుడైన వేళ !! 

చిత్రనిర్మాత సాండొ చిన్నప్ప దేవార్ మరియు ప్రఖ్యాత తమిళ కవి కన్నదాసన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం కార్లో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దేవార్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు కాని కన్నదాసన్ మాత్రం తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోవడంతో మాద్రాసులోని ఆసుపత్రిలో చేర్పించారు. 

దేవార్ కు పరమాచార్య స్వామి అంటే అమితమైన భక్తి. వెంటనే తేనంబాక్కం శివస్థానంలోని బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో మకాం చేస్తున్న మహాస్వామి వారిని దర్సించుకోవడానికి వెళ్ళాడు. 

“ఒక ప్రమాదం జరిగింది” అని స్వామితో చెప్పాడు దేవార్. వెంటనే స్వామివారు “కన్నదాసన్ ఎలా ఉన్నాడు?” అని అడిగారు. 

తను ఏమి చెప్పకనే మహాస్వామివారు కన్నదాసన్ ఎలా ఉన్నాడు అని అడగటంతో దేవార్ ఆశ్చర్యపోయారు. ప్రమాదం నుండి తను ఎలా బయటపడ్డాడు, కన్నదాసన్ ఎలా తీవ్రంగా దెబ్బతిని అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరాడు అన్న విషయమంతా స్వామివారికి విన్నవించాడు. 

దేవార్ ఆత్రుతని గమనించి మహాస్వామి వారు “దిగులు పడకు ఏమి పరవాలేదు” అని అతణ్ణి సముదాయించారు. ఆస్పత్రిలో ఉన్న కన్నదాసన్ నుదుటిపైన విభూతి పెట్టి, కొద్దిగా నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద ఉంచమని స్వామివారే స్వయంగా విభూతిని పొట్లం కట్టి ఇచ్చారు. దేవార్ సంకోచిస్తూ విభూతిని అందుకున్నాడు. 

ఎందుకంటే కన్నదాసన్ పరమ నాస్తికుడు. దైవాన్ని నమ్మేవాడు కాదు. అప్పటికే కన్నదాసన్ ద్రావిడ పార్టీల నాస్థిక కార్యకలాపాల్లో, వాటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రాహ్మణుల గురించి, సనాతన ధర్మం గురించి చాలా చెడుగా మాట్లాడేవాడు. నిజానికి ప్రమాదం జరగడాని వారం రోజులముందు కూడా కంచిలోని శంకర మఠం ఎదురుగుండా జరిగిన ఒక సభలో శంకరాచార్యుల (కంచి పీఠాధిపతుల) చిత్తరువును అవమానపరిచాడు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ విభూతి ఎలా ఇచ్చేది అని ఆలోచిస్తున్నాడు దేవార్. 

ఆ త్రికాలజ్ఞాని దేవార్ పరిస్థితిని అర్థం చేసుకుని దేవార్ తో ఇలా అన్నారు. 

”ఏమి అనుమానపడకుండా వెళ్ళి కన్నదాసన్ నుదుటన ఈ విభూతి పెట్టు. చిన్న మేఘం కాసేపు సూర్యుణ్ణి అడ్డుకున్నట్టు, ఈ నాస్తికత్వం అతణ్ణి అడ్డుకుంది. ఇప్పటి నుండి అతను సూర్యునివలె ప్రకాశిస్తాడు. వారి పూర్వీకులు ఎంతటి మహాత్ములో నీకు తెలుసా? వారి ముత్తాత కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి తాత కంచి ఏకాంమ్రేశ్వర దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారి తండ్రి కంచి కామాక్షి అమ్మవారి దేవస్తానాన్ని పునరుద్ధరించారు. అతను దేవాలయలాను సంరక్షించే మాహానుభావుల వంశంలో జన్మించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా?” 

దేవార్ ఆస్పత్రికి వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చేసాడు. స్వామివారు ఇచ్చిన విభూతిని కన్నదాసన్ నుదుటన పెట్టి కొంచం నోట్లో వేసి, మిగిలినదాన్ని దిండు కింద పెట్టాడు. అప్పుడు సాయం సంధ్యా సమయం. తమిళ సాహిత్యానికి రాజైన కవి అరసు(కవి రాజు) కన్నదాసన్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దేవార్ విశ్రాంతి కొరకై రాత్రికి ఇంటికి వెళ్ళి తన స్నేహితుణ్ణి చూడాలని ఉదయాన్నే మరలా వచ్చాడు. స్పృహలోకొచ్చిన కన్నదాసన్ కు ఏమి చెప్పాలా అని అలోచిస్తూ రాత్రి అంతా గడిపాడు. 

మరుసటి రోజు ఆసుపత్రికి రాగానే కన్నదాసన్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి అలాగే మంచంపై పడుకుని ఉండడం చూసి ఆనందపడ్డాడు. “నేను ఎన్ని రోజులనుండి ఈ ఆసుపత్రిలో ఉన్నాను? నా మొహం చూసుకోవాలి అద్దాన్ని తీసుకుని రా” అని చెప్పాడు. దేవార్ ఆద్దం తెచ్చిచ్చాడు. అద్దంలో తన మొహాన్ని, నుదుటిపై ఉన్న విభూతిని చూసి అతను కోప్పడలేదు. బదులుగా ఎవరు పెట్టారు అని అడిగాడు. దేవార్ కొంచం ధైర్యం తెచ్చుకుని తను పరమాచార్య స్వామిని కలవడమూ, వారి అతణ్ణి అనిగ్రహించడమూ మొదలగు అన్ని విషయాలు కన్నదాసన్ కు చెప్పాడు. 

అంతా వినగానే కన్నదాసన్ కన్నీళ్ళపర్యంతం అయ్యాడు. “నన్ను కరుణించారా? నా పైన ఇంతటి దయ చూపించారా? కేవలం వారం రోజుల ముందు నా చేష్టలతో, మాటలతో వారిని అవమానపరిచాను. ఎంతటి పాపిని నేను?” అని భోరున విలపించాడు. “పూర్తి స్వస్థత పొందిన తరువాత నేను మొదట నా ఇంటికి వెళ్ళను. ఇంతటి పాపిని అనుగ్రహించిన ఆ మహాత్ముని వద్దకు ముందు నన్ను తీసుకుని వెళ్ళు” అని దేవార్ ను అర్థించాడు. 

అతని కోరిక ప్రకారం మహాస్వామివారిని దర్శించుకుని తనని క్షమించవలసిందిగా పలువిధాల ప్రార్థించాడు. అప్పటి నుండి నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు. మనసులో భక్తిభావం పొంగగా మహాస్వామి వారిపై కవిత రాసాడు. మరలా స్వామిని దర్శించినప్పుడు దాన్ని వారికి సమర్పించాడు. 

”ఎవరి కనుచూపుచేతనే అన్ని పాపాలు నశించిపోతాయో 
ఎవరు తిరువాచకానికి సాకార స్వరూపమై నిలచినారో 
ఎవరు తన మేధస్సు చేత సత్యా జ్ఞానానికి అర్థం చెప్పగలరో 
ఎవరు ఈ విశ్వాన్ని రక్షించాడానికి వచ్చిన విశ్వనాథుడో 
ఎవరు అన్ని మతాల చేత తమ దేవుడని ఒప్పబడినాడో 
అటువంటివారి చరణారవిందములకు మనల్ని సమర్పించుకుందాము 
రండి! అందరూ తరలిరండి!!” 

మహాస్వామివారు పద్యాన్ని చదివి కన్నదాసన్ తో “నువ్వు చెప్పినది కేవలం శేషాద్రి స్వామివారికి మాత్రమే సరిపోతుంది. ఆయనే తురువణ్ణామలై అర్ధనారీశ్వరుడు. ఆయనే సత్పురుషుడు, మహామనీషి” అని అన్నారు. 

”సనాత ధర్మ వైభవాన్ని గురించి మనస్పూర్తిగా రాయి” అని ఆశీర్వదించి పంపారు. 

అప్పుడే కన్నదాసన్ మనసులో బీజం పడింది. అది చిగురించి, చిన్న మొక్కై, మహావృక్షమై మహత్తరమైన “అర్థముల్లా హిందు మతం; అర్థవంతమైన హిందూ మతం” అనే పుస్తకమై వర్ధిల్లింది. 

[ పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మరి వింతపోకడలతో స్వధర్మాన్ని ఆచార వ్యవహారాలని మంటగలిపి పాశ్చాత్య సంస్కృతికి బానిసలవుతున్న వ్యక్తుల వంశాలని, ముందు తరాలని కాపాడేది ఎవరు? ఏ పుణ్యం చూపించి భగవంతుడు నిన్ను కాపాడుతాడు. అందుకే ‘కురు పుణ్య మహోరాత్రం’ అన్నారు శంకరులు ] 


ఏనాడు విడిపోని ముడి వేసెనే...నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు...

చిత్రం: శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి

ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని

ఏ జన్మ స్వప్నాల అనురాగమో
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
పూసినది నేడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ సుధల ఆమనిని

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

సా...గామ గమ గామ గమరీ..
సారి నిరి సారి నిసనీ..
సాదాదరీ.. రీగాగపా..

మోహాన పారాడు వేలి కొనలో
నీ మేను కాదా చైత్ర వీణ
వేవేల స్వప్నాల వేడుకలలో
నీ చూపు కాదా పూల వాన
రాగసుధ పారే అలల శ్రుతిలో
స్వాగతము పాడే ప్రణయము
కలకాలమూ కలగానమై
నిలవాలి మన కోసము... ఈ మమత

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

నీ మోవి మౌనాన మదన రాగం
మోహాన సాగే మధుప గానం
నీ మోవి పూసింది చైత్ర మోదం
చిగురాకు తీసే వేణు నాదం
పాపలుగ వెలిసే పసిడి కలకు
ఊయలను వేసే క్షణమిదే
రేపన్నదీ ఈ పూటనే
చేరింది మన జంటకు... ముచ్చటగ

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

https://www.youtube.com/watch?v=4yoSrSnfyOM
Sri Kanaka Mahalaxmi Recording Dance Troop Movie Songs - Yenaadu Vidiponi Song - Naresh - Madhuri
Sri Kanaka Mahalaxmi Recording Dance Troop Movie Songs, Yenaadu Vidiponi Song, Yenaadu Vidiponi Vide...


ధూర్తాఖ్యానం – ప్రాచీన కథామాలిక. !
.


ఓ ఐదుగురు మిత్రులు ఒక చోట చేరి కథలు చెప్పుకున్నారు. ఆ కథల్లో ఎవరి కథ బావుందో చర్చించుకున్నారు. ఇలా ఐదు కథలూ కలిసి మరొక కథగా మారింది. రాం గోపాల్ వర్మ అన్న దర్శకుడు తీసిన హిందీ సినిమా “డర్నా మనా హై” అన్న సినిమా కథకు ఆధారం ఈ ఆలోచన. మణిరత్నం “యువ” సినిమాలో అలాంటి ధోరణి ఛాయామాత్రంగా కనిపిస్తుంది. యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన దుప్పట్లో మిన్నాగు అన్న నవల కాన్సెప్ట్ కూడా ఇదే. యండమూరి కథామాలిక (నవల) కు ప్రేరణ – రోవాల్డ్ డాల్ (Roald Dahl) అన్న బ్రిటీష్ రచయిత అని ఆ పుస్తకంలో వ్రాశారు. మరి రోవాల్డ్ డాల్ కు ముందు ఇలా ఎవరూ వ్రాయలేదా? వ్రాశారు. ఆ రచన, దాని కథాంశ వివరణే ఈ వ్యాసం.
విస్తారమైన కథాసాహిత్యం భారతదేశంలో ప్రాచీనకాలం నుండీ ఉంది. భారతదేశ వాఙ్మయ చరిత్రలో తరచి చూస్తే విభిన్నమైన శైలి శిల్పాదులు ఎన్నో కనిపిస్తాయి. కథ, కథలో ఉపకథ, ఉపకథలో మరొక కథా – ఈ ప్రక్రియ భారతీయులకు పంచతంత్రం, బృహత్కథ కాలం నాటికే తెలుసు. పదిమంది రాజకుమారులు కలిసి సాహసయాత్రలు చేసి వారి అనుభవాలు చెప్పుకోవడం దండి దశకుమారచరితమ్ అనే అపూర్వమైన కావ్యంలో మనకు కనిపిస్తుంది. అంతకు ముందే వచ్చిన బాణభట్టుని కాదంబరి ఒక అద్భుతాల కుప్ప. నిజానికి ’గద్యం కవీనాం నికషం వదన్తి’ – వచనమే కవుల సామర్థ్యాన్ని వెల్లడిస్తుందని ఒక మాట. నవ్యరచనాచమత్కృతి లేని కావ్యం ఎలా శోభిస్తుందంటాడు బాణభట్టు.
భారతదేశ కథాసాహిత్యంలో ప్రాకృతభాషల పాత్ర విస్మరించలేనిది. గుణాఢ్యుడు తన బృహత్కథను పైశాచీప్రాకృతంలోనే రచించాడని ఐతిహ్యం. బౌద్ధుల జాతక కథలూ, అట్టకథలూ ప్రాకృతసౌరభశకలాలే. ఈ పరంపరలో ఐదుకథల కథామాలికాప్రయోగం భారతదేశంలో ఏనాడో జరిగింది. ఈ రచనకు కర్త భారతదేశీయుడైన హరిభద్రసూరి.
హరిభద్రసూరి అర్ధమాగధి ప్రాకృతరచయిత. సితంబర జైనమతావలంబి. జన్మస్థానం చిత్రకూటాచలం. (రాజస్థాన్ మేవార్ దగ్గరి చితోర్).ప్రాకృత భాషకు విశిష్టమైన సేవ చేసిన వారిలో జైనులు ముఖ్యులు. హరిభద్రసూరి అనేక ప్రాకృత కావ్యాలు రచించాడు. మొదట హిందూ బ్రాహ్మణుడై, ఆ పిమ్మట జైనమతం స్వీకరించిన ఈతని కాలం జర్మన్ ఇండాలజిస్టు హెర్మన్ జాకోబీ పరిశోధన ప్రకారం – ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల మధ్య. ఈతని రచన ధూర్తాఖ్యానం (ధుత్తక్ఖాణం) బహుశా చరిత్రలో మొట్టమొదటి సారి ఐదు కథలను గుదిగుచ్చిన కథామాలిక అయి ఉండవచ్చు.
ధూర్తాఖ్యానం – ఇది హిందూ పురాణాలలోనూ, రామాయణ మహాభారతాలలో కనబడే కొన్ని అభూతకల్పనల మీద ఒక satire. ఈ satire ను కొన్ని చోట్ల శృతిమించి అసభ్యంగా మార్చటమూ ఈ రచనలో కనిపిస్తుంది. ఆఖ్యానం అంటే Self narration. సాధారణమైన కథలు కాకుండా కల్పితమైన, తెచ్చిపెట్టుకున్న కథలు చెప్పుకోవడం కాబట్టి “ధూర్తాఖ్యానం” అయింది. ఈ కథలను సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఈ కథలకు సమాధానాలు వివరణలు పురాణదూష్యాలు, మతప్రసక్తి కలిగినవి కనుకా, వాటిని పూర్తిగా ప్రస్తావిస్తే విస్తారమైన వ్యాసం అవుతుంది కనుక సమాధానాలలో ఏదేని ఒక్క దాన్ని మాత్రం స్పృశించి ముందుకు సాగడం ఈ వ్యాసకర్త అభిమతం.
***********************************************************************************
కథ:
మాళవరాజ్య రాజధాని ఉజ్జయినీనగర సరిహద్దుల్లోని ఒకానొక ఉద్యానవనంలో ఓ మారు రెండువేలా ఐదువందలమంది ధూర్తులు పోగయ్యారు. వాళ్ళందరూ పచ్చిమోసగాళ్ళు. కామరూప, కామగమనాది విద్యలలో ఆరితేరిన వారు. వారిలో ఐదుగురు ప్రముఖులు. ఈ ఐదుగురులో ఒక్కొక్కరికి ఐదువందలమంది చొప్పున శిష్యులు. ఈ ఐదుగురిలో ఒక స్త్రీ కూడా ఉంది. సరిగ్గా వారు కలుసుకున్నప్పుడు బయట తీవ్రమైన వర్షం మొదలై, వచ్చిన పనికి ఆటంకం ఏర్పడింది. నగరంలోనికి వెళ్ళి భోజనం లేదా భోజనానికి వెచ్చాలు సంపాదించుకుని రావాలి. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఐదుగురూ తమ తమ వ్యక్తిగత అనుభవాల రూపంలో కథలను చెప్పుకుంటారు. ఎవరైతే అద్భుతమైన అబద్ధం చెప్పగలుగుతారో వారు ధూర్తులకు నాయకుడవుతారు. అబద్ధానికి నిదర్శనం చూపలేకపోతే వాళ్ళు ధూర్తులందరికీ అన్నపానాదులను సమకూర్చవలసి ఉంటుంది. ఒకవేళ కథ నమ్మశక్యమైనదే అయితే ఎలా నమ్మశక్యమైనదో, ఆ నమ్మటానికి గల కారణాలను పురాణ, రామాయణ, మహాభారత గ్రంథాల నుండీ ఉదహరిస్తూ నిరూపించగలగాలి.
ఇదీ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం మొదట మూలదేవుడు కథ చెప్పాడు. ఈ కథలన్నీ ఉత్తమపురుషలో సాగుతాయి.

మూలదేవుని కథ:
మంచి పరువంలో ఉన్న రోజుల్లో నాకు ఇష్టమైన ప్రతి వస్తువునూ సొంతం చేసుకోవాలనిపించేది. ఈ రోజులాగే వర్షంపడుతున్న ఒకానొక దినం నా గురువును ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక చేత్తో గొడుగూ, మరో చేత కమండలం మొదలైన అవసర వస్తువులు తీసుకుని నేను బయటకు అడుగుపెట్టాను. కొంతదూరం వెళ్ళగానే కొండలాంటి యేనుగొకటి నా వైపుకు రావడం గమనించాను. నాకు భయంతో కాళ్ళు, చేతులాడలేదు. యేనుగు దగ్గరికి వచ్చేసింది. ఏం చేయాలో తోచక, నేను నా కమండలం క్రింద పెట్టి అందులోనికి దిగిపోయాను. నన్ను వీడకుండా ఆ యేనుగు కూడా కమండలంలోనికి దూకింది. నేనా ఏనుగుకు దొరక్కుండా ఆరునెలలపాటూ అందులోనే తిరిగాను. చివరికొకరోజు కమండలం తాలూకు గొట్టం ద్వారా వెలుపలికి వచ్చేశాను. ఏనుగూ ఆ గొట్టం గుండానే బయటికి రాసాగింది. దాని శరీరం అంతా బయటికి వచ్చిన తర్వాత తోక తాలూకు ఒక్క రోమం మాత్రం గొట్టంలో చిక్కుకుపోయింది. అంతటితో ఏనుగుపీడ నాకు వదిలింది. బయట పడి కాస్త దూరం నడవగానే గంగానది ఉధృతంగా పరుగులు పెడుతూ కనిపించింది. నేను ఆ నదిలో దిగి చేతులతో నీటిని అవతలికి నెడుతూ అవతలి గట్టుకు చేరుకున్నాను. ఆపైన ఆరునెలలు వర్షాన్ని, ఆకలిని దాహాన్నీ సహిస్తూ మా గురువుకు శుశ్రూష చేశాను. ఆపై అట్నుంచి ఇటు వచ్చి మిమ్మల్ని కలుసుకున్నాను.
ఈ నా అనుభవం సత్యమని భావిస్తేఇలాంటి ఘట్టాలు మరెక్కడున్నాయో దృష్టాంతాలు చూపండి. అసత్యమని నిరూపణ అయితే, నన్ను నాయకుడిగా అంగీకరించదమే కాక ధూర్తులకు భోజనం ఏర్పాటు చేయండి.
ఈ కథకు కండరీకుడు సమాధానం చెబుతూ, కథలో సందేహాస్పదమైనదేదీ లేదని పురాణాలలో ఉదాహరణలు చూపెడుతూ సమర్థించాడు.ఆ పైన కండరీకుడు కథ చెప్పాడు.

కండరీకుని కథ:
బాల్యంలో నేను చాలా తుంటరివాణ్ణి. నన్ను భరించలేక మా అమ్మా, నాన్న నన్ను ఇంటినుండీ వెళ్ళగొట్టారు. ఆపై నేను ఎక్కడెక్కడో తిరిగి ఒకానొక ఊరికి చేరుకున్నాను. ఆ ఊళ్ళో ఎన్నో ఆవులూ,గేదెలూ, ఎనుములూ, ఇతర పశువులూ, గుర్రాలూ, ఏనుగులూ, పూలతోటలూ, ధనధాన్యాలూ ఇలా సమృద్ధిగా ఉంది. ఆ ఊరి నడిబొడ్డున ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టుక్రింద కమలదళుడనే ఒక యక్షుడున్నాడు. ఓ మారు నేనతణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాను. గ్రామం అంతా ఆ యక్షుణ్ణి సత్కరించడానికి అక్కడ చేరుకుంది. సరిగ్గా అప్పుడు అక్కడికి అస్త్రశస్త్రధారులైన దొంగల గుంపు వచ్చింది. ప్రజలందరూ కకావికలై పరుగులు పెట్టారు. అప్పుడు నేనక్కుడున్న ఒక దోసకాయ లోకి చొరబడ్డాను. నన్ను చూసి అందరూ నాతో బాటూ ఆ దోసకాయ లోనికి ప్రవేశించారు. ప్రజలెవ్వరూ కనబడక దొంగలగుంపు నిరాశగా వెనుదిరిగింది. ఇంతలో ఒక మేక ఆ దోసకాయ ను మింగివేసింది. ఆ మేకను ఒక పాము మింగివేసింది. ఆ పామును ఒక గద్ద మింగింది.
అప్పుడు అక్కడికి ఆ దేశపు రాజు తన సైనికులతోబాటు వచ్చాడు. రాజు తాలూకు భద్రగజం అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వదిలారు. చెట్టుకొమ్మగా భ్రమించి మావటీడు ఏనుగును తాలూకు త్రాడును గద్దకాలుకు కట్టివేశాడు. గద్ద పైకెగరగానే ఏనుగు కూడా దానితోబాటూ ఎగురసాగింది. మావటీడు బెదరి రాజు వద్దకు పరిగెత్తుకు వచ్చి మొరపెట్టుకున్నాడు. రాజు కొందరు యోధులను ఆ గద్దపైకి పంపితే వాళ్ళు వచ్చి బాణాలను ప్రయోగించి ఆ పక్షి రెక్కలను తెగనరికారు. అంతేకాక, దాని కడుపు చీల్చారు. అందులోనుండి పాము,పాముకడుపులోనుండి మేక, మేకకడుపులోనుండి దోసకాయ, అందులోనుంచి గ్రామస్తులు అలా బయటపడ్డారు. వారితో బాటు బయటపడిన నేనూ ఇప్పుడు మిమ్మల్నిలా కలుసుకున్నాను.
ఈ కథంతా ప్రత్యక్షరసత్యమని ఐలాషాఢుడు విష్ణుపురాణం, మహాభారత వనపర్వం, జటాయువృత్తాంతం, ద్రౌపదీస్వయంవరం ఇత్యాది ఘట్టాలను ఉటంకిస్తూ కుండరీకుని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు.

ఐలాషాఢుని కథ:
యవ్వనంలో నాకు డబ్బుపిచ్చి బాగా పట్టుకుంది. పర్వతాలలో, గుహలలో రససిద్ధితో బంగారం సంపాదించవచ్చని తిరుగుతూ ఉండేవాణ్ణి. అనేక మంత్రతంత్రాలను అభ్యసిస్తూ ఉండేవాణ్ణి. నేనున్నచోటికి నూరు యోజనాల దూరంలో ఒక పెద్దపర్వతం, దాని సమీపంలో ఒక యోజనం విస్తీర్ణం ఉన్న సహస్రవేధీ రసకుండమూ ఉన్నాయని ఓ మారు నాకు తెలిసింది. ఇదివినగానే నేను పూర్వదిశగా వెళ్ళడం ఆరంభించాను. ఆ సరస్సును సమీపించి ఆ నీటిని, ఆ కొండపై శిలలను నాకు కావలసింతగా తెచ్చుకుని ఇంటికి వచ్చాను. ఇప్పుడు నాకేం తక్కువ? ఈ రెంటి సంయోగంతో నేను బంగారం చేయడం మొదలెట్టి కొన్ని రోజుల్లో కుబేరసమానుణ్ణి అయిపోయాను.
ఓ మారు ఐదువందలమందితో కూడిన ఓ దొంగలగుంపు మా ఇంటిపైకి వచ్చింది. నేను బ్రతికి ఉండగానే నా డబ్బు దోచుకెళ్ళడం సహించలేని నేను ఒక్కొక్క బాణంతో పదిమంది దొంగలను పడగొడుతూ తలపడ్డాను. ఈ హడావుడి విని మా ఇంటి సభ్యులు, నౌకర్లూ దొంగలపైకి ఎదురుదాడికి దిగారు. ఇంతలో ఒక దొంగ నా తల నరికాడు. ఆ తలను రేగుపళ్ళచెట్టుకు వేలాడగట్టాడు. మిగిలిన వాళ్ళు మొండాన్ని వేరుచేసి దాన్నిఖండఖండాలుగా నరికారు. ఆపై వాళ్ళు ఇంటినంతా దోచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు నా తల పరిస్థితి ఏమని చెప్పను? ఆకలి సహించలేక తలతో నేను పక్కనున్న చెట్టు పళ్ళను తినడం మొదలెట్టాను. ఇంతలో పొద్దు పొడిచింది. లోకులు నా తల పళ్ళను తినడం చూసి నేను బ్రతికే ఉన్నానని కనుక్కుని నా శరీరావయవాలన్నిటినీ ఒకచోటికి చేర్చారు. అంతటితో నా శరీరం నాకు వచ్చేసింది. ఇది నా ప్రత్యక్షానుభవం. ఇందులో మీకు సత్యాలు కనబడితే ప్రమాణం చూపించండి.
శసుడు దేవీభాగవత, మహాభారత, రామాయణాది కథల్లో అనుగుణమైన ప్రమాణాలు చూపాడు.

శసుని నాలుగవ కథ:
అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామానికి వెలుపల పొలాలు, దూరాన కనిపిస్తున్న కొండల వరకూ వ్యాపించి ఉన్నాయి. ఒక శరత్కాలపు పొద్దున నేను సరదాగా మా ఊరి పొలాల వైపుకు వెళ్ళాను. అంతలో దూరంగా ఉన్న కొండపై నుండి దిగి ఒక మదపుటేనుగు నా వైపుకు పరిగెత్తుకు రాసాగింది. నేను ఆ ఏనుగు నుండి ఎలా తప్పించుకోవడమా అని తత్తరపడుతూ దగ్గరగా ఉన్న ఒక నువ్వుచెట్టుపైకెక్కాను. ఆ ఏనుగూ చెట్టుదగ్గరికి వచ్చింది. చెట్టును బలంగా తొండంతో ఊపసాగింది. నేను క్రిందపడలేదు కానీ నువ్వుచెట్టు గింజలు అసంఖ్యాకంగా రాలిపడ్డాయి. ఆ నువ్వులు ఏనుగు అటూ ఇటూ తిరుగుతూ ఉండగా, దాని పాదాల క్రింద పడి నలిగాయి. వాటినుంచీ నూనె రావడం మొదలయింది.
కాసేపటికి అక్కడ నూనెతో ఒక ఊబి ఏర్పడింది. ఆ ఊబిలోనికి పాపం ఆ యేనుగు కూరుకుపోయి ఆకలి దప్పులకు అలమటిస్తూ చచ్చిపోయింది.
ఆపైన నేను క్రిందికి దిగి ఏనుగు చర్మం ఒలుచుకున్నాను. ఆ చర్మంతో ఒక సంచీ తయారు చేసుకుని, పదిమణుగుల నూనెను త్రాగి, పక్కనున్న రేగుపళ్ళు ఒక్క మణుగు తిని, మిగిలిన నూనెనంతా చర్మపు సంచీలో వేసుకుని ఇంటిదారిపట్టాను. బరువు ఎక్కువవడంతో గ్రామం మొదట్లో మర్రిచెట్టుకు ఆ సంచీ వేలాడగట్టి ఇంటికి వచ్చాను. ఇంటి దగ్గర ఆడుకుంటున్న పిల్లలకు “ఊరి మొదట్లో ఉన్న చెట్టుకు సంచీ ఒకటి వేలాడుతుంది, పట్టుకు రండర్రా” అని చెప్పాను. వాళ్ళక్కడికి వెళితే సంచీ కనిపించలేదు. వాళ్ళు సరేనని ఆ చెట్టును వేర్లతో సహా పీక్కుని ఇంటికి తీసుకు వచ్చారు. ఈ ఘటన జరిగి ఎంతో కాలం కూడా కాలేదు. ఆపైన ఇదుగో మీకోసం ఇక్కడికి వచ్చాను.
చివరి ధూర్తురాలు ఖండపాన ఆ కథను సత్యమేనని, అందులో కల్పనాదూరమైన విషయాలున్నవన్న విషయాన్ని ఖండించింది.
భారతంలో – మత్తగజం తాలూకు మదజలంతో బురద ఏర్పడ్డం అన్న విషయం ఉంది. మదజలంతో బురద ఏర్పడినప్పుడు మదపుటేనుగు తొక్కిడికి నువ్వులనూనె బురద ఏర్పడ్డంలో ఆశ్చర్యం లేదు. భీమునిచేతిలో మరణించిన ఒక రాక్షసుడు ఒక ఎనుము, పదహారు బండ్ల అన్నం, వేయి పీపాల సారాయం త్రాగడం భారతంలో సాధ్యమైనప్పుడు నువ్వు ఒక్క మణుగు రేగుపళ్ళు ఎందుకు తినరాదు? రామాయణంలో కుంభకర్ణుడు తినే తిండి ముందు నీ తిండి యే పాటి? శాస్త్రాలలోనిఒకానొక ఋషి (అగస్త్యుడు) అన్ని సముద్రాలనూ త్రాగాడు. (మహాభారతం అరణ్యపర్వం) మరొక ఋషి (జహ్నుమహర్షి) గంగపై కోపించి దాన్నితాగేశాడు. (రామాయణం బాలకాండ) ఆపై వెయ్యి సంవత్సరాలు దాన్ని అక్కడే బంధించాడు. (ఈ విషయం రామాయణంలో లేదు) ఆ మహర్షి పేరుమీదే గంగ జాహ్నవి అయింది. శాస్త్రాలలోని ఈ విషయాలముందు నీవు త్రాగిన పదిమణుగుల నూనె లెక్కకే రాదు.
శసుడు: మరి అంతపెద్ద నూనెసంచీని నేను గ్రామానికి మోసుకురావడం నీకు ఆశ్చర్యంగా అనిపించలేదా?
ఖండపాన అందుకు గరుడపురాణకథను చెప్పింది. గరుడపురాణంలో గరుడుడు ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి తీసుకువచ్చి మరొకచోట నాటుతాడు. ఆ నాటిన స్థలమే లంక. ఒక పక్షే ఒక చెట్టును మోసుకు వచ్చినప్పుడు నీవు చేసినపని సాధ్యమేనంది. ఇంకా రామాయణ, భాగవతాలలోనూ దృష్టాంతాలు చూపింది.

ఖండపాన చెప్పిన ఆఖరు కథ:
యవ్వనంలో నేనొక అపూర్వలావణ్యవతిని. ఓ మారు నేను చతుర్థస్నానం చేసి శయనాగారంలో నిద్రిస్తూంటే గాలి నాపై మోహంతో నన్ను చేరుకుని రతిక్రీడ సలిపింది. ఫలితంగా నేను గర్భం ధరించాను. నెలలు నిండిన నాకు ఒక పుత్రుడుదయించినాడు. అయితే వాడు పుడుతూనే ఏదో గొణుగుతూ నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది ఆ స్వానుభవం. నమ్మితీరాలి. నమ్మకపోతే గాలి వలన ఎలా పుత్రుడు జన్మిస్తాడో చెప్పాలి.
మూలదేవుడు భారతం ద్వారా ఖండపాన కథ తాలూకు సంబద్ధాన్ని నిరూపించాడు. అయినప్పటికీ ఆగక ఖండపాన అనుబంధ ప్రశ్నలు వేయడం కొనసాగించింది. ఆయా ప్రశ్నలకు ఐలాషాఢుడు, మూలదేవుడు సమాధానాలు చెప్పారు.
అప్పుడు ఖండపాన కుపితురాలై ప్రశ్నించింది. మీకు నేనెవరో తెలుసా? మూలదేవుడు అన్నాడూ – “నీవు పాటలీపుత్రంలో గౌతమగోత్రజుడైన నాగశర్మ సోమశ్రీ అనే దంపతుల కుమార్తెవి. నీ పేరు జగత్ప్రసిద్ధం”.
అప్పుడామె అంది. – “నా రూపలావణ్యాలు చూసి అలా భ్రమపడుతున్నారు. నేను అక్కడి రాజు తాలూకు చాకలివాళ్ల అమ్మాయిని. నా పేరు దగ్ధికా. నేను వేయిమంది అనుచరులతో కూడి అంతఃపురానికి చెందిన బట్టలు ఉతికేదాన్ని. ఓ మారు బట్టలు ఉతకటానికి గంగానదికి వెళ్ళాను. బట్టలు ఉతికి నా అనుచరులు ఒడ్డున ఎండబెడుతుంటే ఒక పెద్ద సుడిగాలి బయలుదేరి ఆరవేసిన వస్త్రాలు గాలికి కొట్టుకుపోయాయి. ఆ వస్త్రాల వెంత అందరూ పరిగెట్టారు కానీ అవి దొరకలేదు. అందరూ భయపడుతూంటే నేను ధైర్యం చెప్పాను. కానీ రాజు సమక్షానికి వెళ్ళడానికి ధైర్యం చాలక, కాసేపు ఆవుగా, కాసేపు అశోకచెట్టుకు అల్లుకున్న తీవెగా రూపాలు మార్చుకుని కాలక్షేపం చేశాను. రాజుకు బట్టల విషయం తెలియనే తెలిసింది. రజకులకు భయపడిన వస్త్రాలు తిరిగి వస్తే తను ఆ వస్త్రాలను దండించనని రాజు అభయమిచ్చాడు.”
శసుడు కామరూప వృత్తాంతానికి సమాధానం చెప్పాడు. ఖండపాన చివరి అస్త్రం ప్రయోగించింది.
“ఇందాక వస్త్రాలు ఎగిరిపోయాయన్న కథ చెప్పాను కదా, ఆ సమయంలో నా అనుచరుల్లో నలుగురు ఆ బట్టల వెనక పడి పరిగెత్తుతూ ఇంతవరకు రానేలేదు. ఆ నలుగురూ మీరేనని నాకు తెలుసు.ఈ వృత్తాంతం ఒప్పుకుంతే మీరు నాకు దాసులు కండి. ఒప్పుకోకపోతే నా భోజనం సంగతి చూడండి.”
నలుగురు ధూర్తులు సిగ్గు పడ్డారు. వాళ్ళు తమ ఓటమిని ఒప్పుకుని ఆమెను ప్రశంసించారు. బయట జోరుగా వర్షం కురుస్తోంది. భోజనం సంపాదించడానికి ఉపాయం చెప్పమని ఆమెనే అడిగారు.
ఆమె సమీపంలో ఉన్న శ్మశానానికి వెళ్ళింది అక్కడొక బాలుని మృతదేహం ఉంది. దాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి ఒక శ్రేష్టి దగ్గరకు వెళ్ళింది. శ్రేష్టి ఆమెను గెంటివేయమని నౌకర్లకు చెబితే ఆ నౌకర్లను ఆమె మంత్రశక్తితో స్పృహపోగొట్టి శ్రేష్టిని తనే బాలుణ్ణి హత్యచేశాడని రాజుకు చెబుతానని బెదిరించింది. శ్రేష్టి కాళ్లబేరానికి వచ్చి ఒక ముద్రికను ఆమెకు ఇచ్చాడు. ఆ ముద్రికతో ఆమె తన వాసం చేరుకుని, మిగిలిన ధూర్తులకిచ్చి ఆ ముద్రికతో వెచ్చాలు కొని వంట చేయమని ఆజ్ఞాపించింది.
***********************************************************************************
ప్రతి రచనలోనూ స్వీకార్యమైన అంశాలు, స్వీకార్యం కానివి రెండూ ఉంటాయి. రచన తాలూకు సమగ్రమైన సారాంశం ఏదైతే ఉందో అది ఆక్షేపణీయం అయినప్పుడు ఆ ఆక్షేపణీయమైన అంశాన్ని గుర్తించి వ్యాఖ్యానించటమో, విమర్శించటమో చేయటం ఒక ఉన్నతస్థాయికి సంబంధించిన లక్ష్యం. మతగ్రంథాల విషయంలో ఈ పని మరింత నిశితంగా జరుగవలసి ఉంటుంది. ఎందుకంటే భారతీయ మతసారస్వతానికి మౌఖిక సాహిత్యాం మూలాధారం. తరం నుంచి తరానికి మౌఖికంగా విషయసంగ్రహం జరుగుతున్నప్పుడు అలౌకిక లషణాలు, అభూతకల్పనలు జొరబడడం అనివార్యం. వీటిని మాత్రమే సారాంశంగా గ్రహించి ధూర్తవ్యా(ఆ)ఖ్యానం చేయడం అంత మంచిది కాదని అనిపిస్తుంది. మతప్రచారం తాలూకు మత్తు వీడడం మహాపండితులకూ అసాధ్యమేమో!
ఇదే మాట ధూర్తాఖ్యానికీ వర్తిస్తుంది. ఇందులోని పౌరాణిక అపహాస్యాలను స్వీకరించకపోయినా ఈ విలక్షణ కథాసంవిధానం మాత్రం ఆస్వాదనీయం. satire ను హాస్యంతో మేళవించడం ఈ రచనలోని విశిష్టత. నాట్యశాస్త్రంలో ప్రహసనం అన్న రూపకభేదం హాస్యం కోసమే ప్రత్యేకించినప్పటికీ, ఒక కథగా బహుశా ఈ ప్రక్రియతో ఒక సమగ్రమైన రచన రూపొందడం ధూర్తాఖ్యానంతోనే మొదలై ఉండవచ్చు. ఇలాంటి కథ, వినూత్నమైన ప్రక్రియ ఒకటి ఆ రోజుల్లో సృష్టించాలంటే ఎంతో ధైర్యం కావాలి. మతప్రచారం సాగించటానికి అన్యమతగ్రంథాలపైన ఇటువంటి ప్రయోగాలు చేయటం – సమర్థనీయమా కాదా అన్న సందేహం వచ్చినప్పటికీ, చరిత్ర తిరిగి వ్రాయలేం కనుక ఈ విలక్షణమైన ప్రయోగం ఒకటుందని తెలుసుకోవడం కొన్ని విషయాల అవగాహనకు తోడ్పడుతుంది. ఇలాంటి ఒక పుస్తకం వ్రాయాలంటే అప్పటికాలంలో బహుశా ప్రాకృతంలో మాత్రమే సాధ్యమయ్యే పని యేమో. ఈ అర్ధమాగధి రచనను సంస్కృతం లో సంఘమిత్రుడు అనువదించాడు. గుజరాతీ, హిందీ భాషల్లోనూ ఈ రచనను అనువాదం చేశారు. కథాశిల్పం, అక్కడక్కడా సునిశితమైన హాస్యం చెప్పేవిధానంలో కొత్తదనం, లక్ష్యం ధూర్తమైనా, పరిశీలనలో సూక్ష్మత, ఇటువంటి అంశాలను మెచ్చుకోదగ్గ
ఈ పుస్తకానికి ప్రచారం పెద్దగా లేదు.కారణాలు అనేకం.

1 comment: