Sunday 3 June 2018

Pranjali Prabha





గంగాస్తోత్రం

-----------------------సుప్రభాతం -----------------------------------
దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే |
శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || ౧ ||
భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ || ౨ ||
హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే|
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ || ౩ ||
తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ |
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః || ౪ ||
పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే|
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే || ౫ ||
కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే || ౬ ||
తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః |
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే || ౭ ||
పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే |
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే || ౮ ||
రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ |
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే || ౯ ||
అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే |
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః || ౧౦ ||
వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః |
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః || ౧౧ ||
భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే |
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ || ౧౨ ||
యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః |
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః || ౧౩ ||
గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ |
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః || ౧౪ ||




శ్రీ కాళహస్తి చారిత్మాక ప్రాశస్త్యం
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయనారులను శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి నెలకోల్పినారు.పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు
శ్రీకాళహస్తిశ్వరస్వామి మహత్యం
శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కాళ అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యం పొంది శివునిలో గలసిపోయినవి.అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చెను
సాలె పురుగు- శివ సాయుజ్యం
కృతయుగంలో సాలె పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుని పూజించుచుండెను.ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న దేపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగులబడిపొవుచున్నట్లు చేసిను. ఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను.అపుడు సాలీడును మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనెను.అందుకు శివుడు సమ్మతించి సాలీడుని తనలో ఐక్యమై పోవునట్లు చేసెను.ఈ విధముగా సాలీడు శివసాయుజ్జ్యము పొంది తరించింది
నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది.ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి,ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమునకు పూజచేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమును సేవింపజొచ్చెను.అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు,పుష్పములు,బిల్వదళములు తెచ్చి,పాము సమర్పించిన మణులను త్రోసివేసి,తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను.
మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వానికి బదులు బిల్వములు,పుష్పములు పెట్టియుండుట గాంచెను.అప్పడు పాము మనస్సున చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పువ్వులను త్రోసివేసి,తాను ఇట్లు కొంత కాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు ,ఏనుగు ఉంచిన పుష్పాదులను పాము శుభ్రపరచి తమ తమ ఇష్టనుసారముగా పూజచేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి..ఒక రోజు పాము విసుగెత్తి తన మణుల త్రోయబడి ఉండుటకు కోపం చెంది.ఈ విషయమునకు కారణము తెలుసుకొన గోరి ప్రక్కనే యున్న పొదలో దాగి పొంచి యుండెను.అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు తొండములో దూరి కుంభస్థలమున నిలిచి దానికి ఉపిరి ఆడకుండా చేసిను.ఈ భాధకు ఏనుగు తాళజాలక ఈశ్వర ధ్యానంతో తొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాతికిమోది తుదకు మరణించెను.ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్థలమున నుండిన పాము గూడా చచ్చి బయటబడినది.ఇట్లు ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మారి స్వామిలో ఐక్య మొందిరి.
ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ ఫణాకారముగా శిరోపరిభాగమునకు ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ,తన లింగాకృతిలో నైక్యమొనరించుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇచ్చట దర్శనం ఇచ్చుచున్నాడు.ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంకు `శ్రీ -కాళ-హస్తి అని పేరు వచ్చింది
శ్రీ కాళహస్తిలొ శ్రీ జ్ఞాన ప్రసునాoభికాదేవి
పార్వతిదేవికి పరమశివుడు పంచాక్షరీ మంత్రములను భోధించి నిశ్చల చిత్తంతో జపింపవలయుననెను. జపము సేయునప్పుడు ఆమెకు మందబుద్ది ఆవరించి నియమం విస్మరించెను.అపుడు శివుడు కోపించి ఆమెను భూమిఫై మానవ స్త్రీగా అవతరిస్తావని శపించెను.అపుడామే శాపవిమోచనకై శివుని ప్రార్ధింపగా భూలోకమున కైలాసగిరి ప్రాంతమున ఈశ్వరుని లింగమును పుజించమని ఆనతిచ్చెను.పార్వతి దేవి నారదుని సాయంతో భూమికివచ్చి ఘోర తపంబాచరించెను.శివుడు ప్రతక్ష్యమయ్యేను.ఆమెను తన అర్ధాంగమున అర్ధనారిశ్వరత్వమున నిలుపుకొనెను.అప్పటి నుండి ఆమె జ్ఞానప్రసూనాంబిక అను పేరుతో శ్రీ కాళహస్తిశ్వరస్వామి వారి సాన్నిధ్యమున వెలసినది.ప్రణవ పంచాక్షరి జపసిద్ధిని పొంది జ్ఞానప్రదీిప్తిని భక్త జన లోకమునకు ప్రసాదించుటచే ఆమెకు జ్ఞాన ప్రసూనంబయను పేరు సార్ధక నామమై విరాజిల్లుతుంది.
వాయులింగం
పంచభూత లింగములో శ్రీకాళహస్తిశ్వర లింగం వాయులింగంగా ప్రఖ్యాతి గాంచినది.కంచిలో ఏకాంబరేశ్వరుడు,ప్రుద్విలింగంగా,తిరుచ్చిరిపల్లి మధ్య తిరువానైక్కావాల్ లేక శ్రీరంగంకు దగ్గరలోని జంబుకేశ్వరమున జల లింగం,అరుణాచలంలో తేజో లింగం,శ్రీకాళహస్తి లో వాయు లింగంగా,చిదంబరంలో ఆకాశలింగంగా వెలసినవని ప్రతీతి. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలోనే యుండి మహాయోగులకు స్పర్శా మాత్రముననే గ్రహింపదగి యుండిడివాడట.త్రేతాయుగంలో స్వర్ణరూపం,ద్వాపర యుగంలో రజత రుపంను,ప్రస్తుత కలియుగంలో శ్వేత శిలా రూపమును పొంది తన సహజ వాయుతత్వ నిదర్శనముగా గర్భాలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపముల రెండిటిని ఎల్లప్పుడూ చలింప చేయుచుండుట గమనింపదగినవి.
గోపురములు
ఈ అలయంకు నాలుగు దిక్కులలోను గోపురములు కలవు.ఇవిగాక రాజగోపురము సుమారు 120 అడుగుల ఎత్తుగలది ఒకటి కలదు.దీనిని శ్రీ కృష్ణదేవరాయలు 1516 లో కట్టించినట్లు శాసన ప్రమాణం కలదు.స్వామివారి గ్రామోత్సవమునకు పోవునప్పుడు ఈ గోపురం నుండే వచ్చును.ఆలయం జేరుకోనుటకు ముందు తేరు వీధి కెదురుగా నుండు భిక్షాల గోపురం నుండియే వచ్చును.జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిక్షాలు దీనిని కట్టించినట్లు చెప్పబడింది.ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగినట్లు చెప్పబడుతుంది.ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహ రాయల కాలంలో జరిగి నట్లు చెప్పుదురు.
తుర్ఫువైపున ఆలయప్రవేశద్వారముగా బాలజ్ఞానాంబ గోపురం కలదు. ఉత్తరం వైపునున్న గోపురంను సూర్య పుష్కరిణి,కుడివైపున చంద్ర పుష్కరిణి యున్నవి.స్వామి వారి అభిషేకమునకు,వంటకు నీళ్ళుఈ సూర్య పుష్కరిణి నుండియే తీసుకోని పోబడును.ఈ గోపురము నుండి సువర్ణ ముఖినదికి పోవచ్చును.దక్షిణ వైపునున్న గోపురం ద్వారా కన్నప్ప గుడికి,బ్రహ్మ గుడికి పోవచ్చును.
ఈ దేవాలయ పూజా విధానము-ఉత్సవములు
ఈ దేవాలయమును వైదిక- అగమ విధానములో పంచకాల పూజలు జరుగును.ఉదయం నుండి మధ్యాహం వరకు మూడు సార్లు అభిషేకములు సాయంత్రం సమయ ప్రదోషకాలమును ఒక అభిషేకము స్వామి అమ్మవార్లకు జరుగును. ఇచ్చటి గురుకులు(పూజారులు) భరద్వాజముని వంశీియులైన భరద్వాజ గోత్రికులు,స్టానం వారు,ఇచ్చట శివరాత్రికి పదిరోజులు బ్రహ్మోత్సవము ముఖ్యమైనవి.మరియు దసరా రోజులలో అమ్మవారి ఉత్సవం విశేషం గడించింది.ఇవిగాక ఏటేట రెండుసార్లు గిరి ప్రదక్షణము,జనవరి నేలలో కనుమ పండుగ రోజున మరియు శివరాత్రి అయిన నాలుగోవ రోజున జరుగును.

నన్నయ కవితలో తరుగని పరువము !
.
నన్నయ నిత్యసత్యవచనుడూ, విజ్ఞాననిరతుడూ, అవదాతచరితుడునూ. ఆయన త్రికరణశుద్ధి నిండుగా పండిన మనీషి, అంచేత ఆయన్ని ఋషి అనడానికి సందేహం వుండదు.
నన్నయ భారతం రచించి దాదాపు వెయ్యేండ్లు కావస్తున్నా, ఈనాటికీ అది కొత్తదనం కోలుపోలేదు. భారతకథా వస్తువే అలాంటిది అనే సమాధానం ఒకటి ఉండనే ఉంది. కానీ నన్నయ కవిత్వంలో అలాంటి ఒకానొక నిత్యనూతనత్వం పొందుకొని ఉండడం గమనింపవలసిన విశేషం.
విశేషమేమిటంటే శబ్దార్థ సౌందర్యాలు రెండూ అవినాభావంతో ఆయన రచనలో కానవస్తాయి. అందుకే ఆయన భారతం అందరి ఆదరాన్ని అందుకున్నది; అందుకుంటున్నది. ఆ అంశాన్ని ఇక్కడ కొద్దిగా పరిశీలిద్దాం.
.
మ|| కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో
ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర
ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్"
.
తాత్పర్యం: వృద్ధులైన కురువంశీయులు, ద్రోణాచార్యాది గురువులు, పెద్దలనేకులు చూస్తుండగా మదముచే నిరంకుశుడై ద్రౌపది నీ విధంగా చేసిన క్రూరదుశ్శాసనుని లోకమునకు భయం కల్గించే విధంగా యుద్ధమున చంపి రాజైన దుర్యోధనుడు చూస్తుండగా వాని వెడల్పైన రొమ్మనెడి పర్వతం నుంచి సెలయేరు వలె ప్రవహించు రక్తాన్ని భయంకరాకారంతో రుచి చూస్తాను.
.
ఉ|| "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి, రం
భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు
ర్వార మదీయబాహుపరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్"
.
తాత్పర్యం: భూమి మీద తన రాచరికం చెల్లుతున్నదనే గర్వంతో దుర్యోధనుడు ద్రౌపదిని చూచి తన తొడల మీద కూర్చొన రమ్మని పిల్చినాడు. ఆ దుర్మార్గున్ని యుద్ధంలో నా చేతులతో గదను తిప్పుతూ దాంతో వాడి తొడలు నుగ్గు చేస్తాను.
.
ఈ పద్యాలు రెండూ ఆంధ్రమహాభారత ద్రౌపదీవస్త్రాపహరణఘట్టం లోనివి.
ఇవి నన్నయ గారు రంగస్థలానికని ఉద్దేశించి రాసినవి కావు.
ఆ సందర్భంలో భీమసేనుడి కోపతీవ్రతనూ, అతని ప్రతిజ్ఞలోని భయంకరత్వాన్నీ పాఠకుల మనస్సుకు అందించడానికని రాసినవి.
కాని, నాటి నుంచి నేటిదాకా ఈ పద్యాలు రంగస్థలం మీద, సినిమాల్లోనూ వినవస్తున్నాయి.
అప్పటి భీమసేనుడి కోపావేశం ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే వారి హృదయాల్లో కూడా అలాంటి పరిస్పందన వుంటుంది.
కనుక దాన్ని భీముడెట్లా వెల్లడిస్తాడో చూడాలనేదే ప్రేక్షకుల ప్రతీక్ష.
ఆ సందర్భంలో భీముడు "కురువృద్ధుల్" అన్న పద్యంతో తన కోపోద్రేకాన్ని ప్రకటిస్తాడు.
ఆ తర్వాత దుర్యోధనుడు ద్రౌపదిని జూచి తొడమీద కూర్చుందువు రమ్మని సైగ చేస్తాడు. అది చూచిన భీముడు, అగ్గిమీద గుగ్గిలంలా మండిపడతాడు. వెంటనే తన మనసులోని ఉడుకునంతా వెళ్లగక్కుతాడు.
.
ఈ పద్యాలు చెవిలో పడగానే ప్రేక్షకులు ఇంతకుముందు తమకు అందీ అందకుండా వుండిన ఏదో అనుభూతి హృదయమంతా పరుచుకున్నట్లు భావించి తన్మయత్వం చెందుతారు. అంటే భీముని నోటి నుండి వెలువడిన ఆ మాటలు, అందులోని విన్యాసాలు అంత సందర్భోచితంగా ఉన్నాయన్నమాట!
ఈ పద్యాలు చదువుతున్నప్పుడు వీటిలోని మాటలకన్నింటికీ అర్థాలు తెలియకున్నా అందులోని భావం హృదయాన్ని తాకుతున్నట్లు తోచడం, శబ్దాలు చెవిలో పడుతున్నప్పుడు ఏదో మాధుర్యం హృదయానికి ఆప్యాయంగా వుండడం, అందులోని ధ్వనుల విన్యాసం ఆ సన్నివేశానికి సముచితంగా ఉన్నట్లు అనిపించడం, ఇవన్నీ ప్రేక్షకులు తమకు తెలియకుండానే అనుభవిస్తారు. అందులోనే లీనమౌతున్నారు.
నన్నయగారి పద్యాలు చదువురాని వాళ్లని సైతం ఆకర్షించడానికి మరొక కారణం కూడా ఉంది. .
నన్నయ గారి రచన ఇలా ఉంటుంది. కవిత్వంలో ఇదోరకమైన విద్య.
అందులో నన్నయ విశారదుడు. అందుకే తిక్కన ఆయనను గురించి "ఆంధ్రకవిత్వవిశారదుడు" అన్నాడు.
నన్నయ కవిత్వం పండితులనే ఉద్దేశించి వ్రాసింది కాదు.
సామాన్యులు, పామరులు కూడా విని ఆనందించడానికి వ్రాసింది.
------------------సుప్రభాతం ---------------------------------------
లోకులు కాకులు లెమ్మని
వా కొనుటయె పెద్ద తప్పు వాస్తవమున కా
కాకుల సంఘీ భావము
లోకుల కిసుమంత గలదె లోకములోనన్ (మల్లెమాల)
(ఒక్క కాకి దెబ్బ తగిలితే లేక చనిపోతే వంద కాకులు చుట్టూ మూగి అల్లరి చేస్తాయి.)-
ఇప్పటి మనుషులు తమ వాహనంతో ఎదుటివాళ్ళనో,లేక వారి వాహనమునో కొట్టేసి వాళ్ళు పడిపోయినా అలాగేపట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు.లోకులను కాకులతో పోల్చ వద్దు.వాటికున్న సంఘీభావం లోకులకు లేవుకదా!
అంటున్నారు కవి
----------------------------శుభోదయం --------------------------------
అబ్జముఖీ మనోజ నరసాధిప నందన నీ యశం
బబ్జ కరాబ్జ జాబ్జ నయనాబ్జ విలాసము నీ వితీర్ణిమం
బబ్జ కరాబ్జ జాబ్జ నయనాబ్జ విలాసము నీ పరాక్రమం
బబ్జ కరాబ్జ జాబ్జ నయనాబ్జ విలాసము చిత్రమిద్ధరన్
ఈ పద్యములో ఒక్కొక్క పాదములో ఒకే పదములున్నా కూడా వేర్వేరు అర్థములు వచ్చేట్టు రచించాడు కవి.
ఈ పద్యము పంచ పాషాణాలు అని ప్రసిద్ధి చెందినఅయిదు పద్యములలో నొకటి. ఈ పద్యము రామరాజభూషణ కవిదని కొందరు,తెనాలి రామకృష్ణుడి దని కొందరు అలాంటి వాదోపవాదాలు వున్నాయి
మనకు పద్యము ముఖ్యము కదా!ఎవరు వ్రాస్తే నేమి?.
తా:--పద్మముఖులగు సుందరీ మణులకు మన్మథుడా,నరసరాజకుమారా!కృష్ణ రాయా!
1. నీ కీర్తి అబ్జ+కర+అబ్జ జాబ్జ నయనా=అబ్జ విలాసము=అమృతము,బ్రహ్మ ,సరస్వతి,శంఖము, వీటి యొక్క విలాసము వంటి కాంతి కలది.
2.నీ దాతృత్వము అబ్జకర+అబ్జజ+అబ్జనయన+అబ్జ+వి+ల+అసము =పాలసముద్రమును, కర్ణుడిని,
నిధులను పొందిన కుబేరుని, చంద్రుని విశేషముగా గ్రహించుటకు స్థాన మైనది.
3.నీ పరాక్రమము అబ్జకర+అబ్జజ+అబ్జనయన+అబ్జ విలాసము -- శివుడు,కుమారస్వామి,కమలాక్షుడైన
శ్రీపతి,అర్జునుడు, వీరి యొక్క విలాసము వంటి కాంతి కలది గా ఈ ధరణి లో చిత్రంగా ప్రకాశిస్తున్నాయి.
తా:- నీ కీర్తి అమృతము,కమలమునందు పుట్టిన బ్రహ్మ,కమలముల వంటి కన్నులుగల సరస్వతి ,శంఖము,
వీటి అన్నింటి యొక్కవిలాసము వంటి కాంతి కలది.నీ దానగుణము పాలసముద్రమును,కర్ణు డినీ,నిధులుగల కుబేరుని,చంద్రుని,విశేషముగా గ్రహించుటకు స్థానమైనది.నీ పరాక్రమము శివుడు,కుమారస్వామి,శ్రీపతి,అర్జునుడు వీరి యొక్క విలాసము వంటి కాంతి కలదిగా ఈ ధరణి లోచిత్రముగా ప్రకాశిస్తున్నాయి.

------------------------శుభోదయం --------------------------------------------

No comments:

Post a Comment