Tuesday 30 June 2020

*జ్ఞాన ప్రాంజలి ప్రభ (1 )


☀ SHRI KRISHNA ☀ Artist: Mahendra Dubey “O Krishna, always remembering the nectarous, low, soft sounds of Your flute, as well as Your eyes, doubly expanded with mercy, I pray that wherever my sight shall wander, You will always manifest Your beauty,...

ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (12 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  
సేకరణ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌞 మనం చేసే సాధన – ఏమిటో, ఎందుకు చేస్తున్నామో, చేస్తే ఫలితం ఏమిటో, గమ్యస్థానం ఏమిటో తెలుసుకోకుండా కొనసాగిస్తే ?

 వ్యాఖ్యానం : 

(i) శ్రేయోహి జ్ఞాన మభ్యాసాత్ :- జ్ఞానం అంటే ఇక్కడ శాస్త్రజ్ఞానం అని. ప్రతిరోజూ ఒకగంట జపం చేయండి; అలాగే పూజచేయండి; ఎంతో మంచిది; బాగా కలిసివస్తుంది - అంటే అలా చేస్తాం అనుకోండి. ఆ ఆశతో అలా ఎప్పటికీ చేస్తూ ఉంటే అదొక అలవాటుగా మారిపోతుంది. ఏదన్నా ఒకరోజు చేయలేకపోతే ఏదో అపచారం జరిగినట్లుగా భావిస్తాం. దానికి తగినట్లుగానే ఆరోజు ఏదన్నా కష్టం రావటమో, నష్టం జరగటమో, దుర్వార్త వినటమో జరిగితే ఇక మూఢనమ్మకం ఇంకా బాగా పెరిగిపోతుంది. రోజూ పూజచేస్తేనే మనకు కలిసివస్తుంది. ఈరోజు చేయకపోయినందునే ఇలా జరిగింది అని తీర్మానించుకుంటాం. ఇలా పూజలు, జపాలు చేస్తే నిజంగా ఏఫలితం వస్తుందో తెలియక, తెలిసిన ఫలితం రాక తికమక పరిస్థితి ఏర్పడుతుంది. కనుక శాస్త్రజ్ఞానం కావాలి. ఏ కర్మలు ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? చేస్తే వచ్చే ఫలితం ఏమిటి? చెయ్యకపోతే నష్టం ఏమిటి? అందరూ చేస్తున్నారు గనుక నేనూ చెయ్యాలి అనే గొర్రెదాటు పద్దతి కాకుండా అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకొని చేయాలి. తెలుసుకోక ఎంత గొప్పసాధనలు చేసినా, ఉపయోగం ఉండదు. అది మూఢాచారంగా అయిపోతుంది? ఒక్కొక్కసారి నలుగురిలో నగుబాటు అవుతుంది కూడా. 

అనగనగా ఒక రాజు. ఆయనకొక రాణి. ఆ రాణీగారి బట్టలు ఉతకటానికి ఒక చాకలి ఉన్నది. ఆమె అందంగా ఉంటుంది. మంచి మాటకారి. అందువల్ల రాణీగారికి ఎంతో ఆంతరంగికురాలైంది. ఒకరోజున చాకలి - రాణీగారి బట్టలు మడుచుకుంటూ ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తున్నావు? అని రాణీ అడిగింది. 'మా మల్లన్న చచ్చిపోయెనే' అన్నది చాకలి. పాపం ఆ మల్లన్న చాకలికి ఎంత ఆప్తుడో అనుకుని రాణీ కూడా కంట తడిపెట్టింది. రాణీగారు కంటతడిపెట్టేటప్పటికి ఆమె పరిచారికలు, దాసీలు ఊరుకుంటారా? వారూ గగ్గోలుపెట్టి ఏడ్చారు. ఇది చూచి రాజుగారు అక్కడికి వచ్చి రాణీ, అంతఃపుర దాసీలు ఏడుస్తుంటే ఆయనా ఏడ్చాడు. రాణీగారి ఆప్తులెవరైనా పోయారేమోననుకున్నాడు రాజు. రాజుగారు ఏడుస్తుండేటప్పటికి మంత్రులు, పరివారము ఏడవటం ప్రారంభించారు. దానితో రాజభవనం చుట్టుప్రక్కల ఉన్న జనం - దానితో నగరంలోని అందరూ భోరున ఏడుస్తున్నారు. 

ఇంతలో ఒక సాధువు ఆ నగరంలో ప్రవేశించి దారిలో అందరూ ఏడుస్తూ ఉండటం చూచాడు. 'ఎందుకయ్యా ఏడుస్తున్నావ్?' అంటే వాడు ప్రక్కనున్న వాణ్ణి చూపించాడు. అతణ్ణి అడిగితే వాడూ ప్రక్కవాణ్ణి చూపాడు. అలా కూపీతీసుకుంటూ రాజభవనానికి వచ్చి, మంత్రిని అడిగితే రాజుగారు ఏడుస్తున్నారు. అందుకే నేనూ ఏడుస్తున్నాను అన్నాడు. రాజుగారిని అడిగితే రాణీగారు ఏడుస్తున్నారు అందుకే అన్నాడు. రాణిగారిని అడిగాడు సాధువు. మా చాకలి ఏడుస్తున్నది. అదంటే నాకు ఎంతో ఇష్టం అన్నది. చాకలిని అడిగితే మా మల్లన్న చచ్చిపోయెనే - అందుకు అన్నది. ఎవరా మల్లన్న? అని అడిగితే '3 రోజుల క్రిందట పుట్టిన మా గాడిదపిల్ల' అంది చాకలి. కనుక ఏపనీ మూఢంగా, ఏమీ తెలుసుకోకుండా చేయకూడదు. 

అలాగే అభ్యాసంకూడా ఏమీ తెలియకుండా మూఢంగా చేయకూడదు. మనం చేసే సాధన ఏమిటో; ఎందుకు చేస్తున్నామో, చేస్తే ఫలితం ఏమిటో, గమ్యస్థానం ఏమిటో అన్నీ తెలుసుకోవాలి. 

మనం విజయవాడ వెళ్ళాలి. బస్టాండ్ కు వెళ్ళి ఏదో ఒక బస్సు వెంటనే కదిలిపోతున్నది గదా! అని ఎక్కితే నెల్లూరుపోతామో, మద్రాసు పోతామో తెలియదు. అలాగే ఒక పూజ చేస్తున్నాం; జపం చేస్తున్నాం. ఆపూజ లేదా జపం మన మనస్సును శుద్ధం చేసుకొనుటకు లేదా ఏకాగ్రం చేసుకొనుటకు ఉపయోగిస్తుంది అని తెలియకుండా చేస్తే ఏంప్రయోజనం? కనుకనే భగవానుడు అభ్యాసం కన్నా జ్ఞానం (తెలుసుకొనుట) ముఖ్యం అన్నాడు. 

:
####

సేకరణ : : శ్రీమద్భగవద్గీత :12 వ అధ్యాయం : భక్తియోగం


Anyahh
ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (11 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  
సేకరణ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


🌞 ఎవరి సేవయే జపం - తపం – ధ్యానం ? దానితో అంతఃకరణం శుద్ధమై, అహంకారం నశించి, అంతరంగం ప్రశాంతమౌతుంది?

 వ్యాఖ్యానం : పనిమీదనే దృష్టి నుంచి ఫలితంపై ఆసక్తి చూపకుండా ఉండటం ఎలా సాధ్యం? అని చాలామందికి సందేహం. దీనికి మహాభక్తుడైన పుండరీకుని కథయే మనకు మార్గదర్శకం. 

లోహదండపురంలో మహాభక్తులైన బ్రాహ్మణదంపతులకు పుండరీకుడనే కుమారుడున్నాడు. అతడు యవ్వనంలో అనేక దురలవాట్లకు లోనై తల్లి దండ్రులను కష్టపెట్టాడు. అతడికి చక్కని కన్యను చూచి పెళ్ళిచేశారు. భార్యా వ్యామోహంలోపడి తల్లిదండ్రులను ఇంకాఇంకా బాధలుపెట్టాడు కుమారుడు. 

ఒకనాడు భార్యతో కలసి కాశీక్షేత్రం బయలుదేరాడు. మార్గమధ్యంలో కుక్కుట మహామునిఆశ్రమం ఉంది. అక్కడ ముగ్గురు స్త్రీలు ఆ ఆశ్రమ  ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తుండగా చూచి 'మీరెవరు?' అని అడిగాడు పుండరీకుడు. 

"నాయనా మేము గంగ, యమున, సరస్వతులం. పవిత్రులమైన మాలో పాపాత్ములు స్నానం చెయ్యటంవల్ల వారి పాపాలు మాకు చుట్టుకుంటున్నాయి. ఆ పాపపరిహారం కోసం ఈ మహాత్ముని ఆశ్రమాన్ని ఇలా ప్రతిరోజూ శుభ్రం చేసి పరిశుద్ధులమౌతున్నాం అన్నారు వారు. (ఇదే స్థాన శుశ్రూష) 

కుక్కుట మహాముని యొక్క శక్తికి ఆశ్చర్యపోయిన పుండరీకుడు సతీసమేతంగా ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ ఆ మహాముని తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తున్నాడు. పుండరీకుడు ఆయనకు నమస్కరించి, మహాత్మా! గంగ, యమున, సరస్వతుల పాపాలను కూడా కడిగి వేయగల అద్భుతశక్తిని మీరెలా సాధించగలిగారు? అని అడిగాడు. 

దానికా ముని "నాయనా! నాకు ఏ సాధనలు తెలియవు. తల్లిదండ్రుల పాదసేవయే పరమాత్మసేవగా భావించాను. నాకు దీనియందే మనస్సు నిలిచింది; బుద్ధి ప్రశాంతతను పొందింది. ఇంతకన్న నాకు కావాల్సిందేమీ లేదు. తల్లిదండ్రుల పాదసేవ చేసుకొనే అదృష్టం పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే కలుగుతుంది" అన్నాడు. దానితో పుండరీకునికి జ్ఞానోదయమయ్యింది. "తానింత వరకు తల్లిదండ్రుల పట్ల చేసిన అపరాధానికి తనను క్షమించ" మని ఆ ముని పాదాలపై బడ్డాడు పుండరీకుడు. ముని ఆశీర్వాదాన్ని పొంది, కాశీ ప్రయాణం మానుకొని, లోహదండపురం వచ్చి తల్లిదండ్రుల పాదాలను పట్టుకొని తనను మన్నించమని కంటికి మింటికి ఏకధారగా విలపించాడు. తల్లిదండ్రులు కుమారునిలో కలిగిన పరివర్తనకు ఎంతో ఆనందించారు. 

అది మొదలు చంద్రభాగా నదీ తీరంలో ఒక కుటీరాన్ని ఏర్పాటుచేసి తల్లిదండ్రులను అక్కడే ఉంచి, నిత్యం వారి సేవనే చేస్తూ తన జన్మను చరితార్థం చేసుకుంటున్నాడు పుండరీకుడు. అతడి భార్య కూడా అతడికి ఎంతగానో సహకరిస్తున్నది. తల్లిదండ్రుల సేవయే అతడికి జపం - తపం - ధ్యానం. దానితో అతడి అంతఃకరణం శుద్ధమైంది. అహంకారం నశించింది. రాగద్వేషాలు తొలగిపోయాయి. అజ్ఞానం నశించింది. అంతరంగం ప్రశాంతమైంది. 
****
సేకరణ : : శ్రీమద్భగవద్గీత :12 వ అధ్యాయం : భక్తియోగం

  అభ్యాస యోగ మన నేమి ?

ఐతే మన మనోబుద్ధులు ఇన్నాళ్ళు బాహ్యప్రపంచంలో, ప్రాపంచిక వ్యవహారాలలో, భోగాలలో తిరిగి తిరిగి అలవాటుపడి ఉన్నాయి. ఈ జన్మలోనే కాదు, ఇంతకుముందు అనేక జన్మల నుంచి ఇదే అలవాటు. శరీరాలు మారిపోతున్నాయే గాని, మనోబుద్ధులు అవే గదా! ఎన్నికోట్ల సంవత్సరాల నుండి ఈ మనోబుద్ధులు ఆనందం పొందాలని, దుఃఖాన్ని పోగొట్టుకోవాలని, ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. డబ్బు సంపాదించుకోవటం, వస్తువులను సమకూర్చుకోవటం, భోగాలను అనుభవించటం - ఇలా అలవాటు పడ్డ ఈ మనోబుద్ధులు అంత తేలికగా భగవంతుని వైపుకు తిరగవు. అలా తిరగలేదని మనం నిరాశ చెందకూడదు, బాధ పడకూడదు. వెంటనే బలవంతంగానైనా భగవంతుని వైపుకు త్రిప్పాలని ఆత్ర పడిపోకూడదు, శరీరాన్ని హింసించకూడదు. దీనిని భగవానుడే నిర్దేశించాడు . 

ఇల్లు వదిలి ఎక్కడకో వెళ్ళి, తిండి తిప్పలు మానేసి, ఘోరమైన తపస్సు పేరుతో చలికాలంలో చన్నీటి మధ్య, వేసవికాలంలో పంచాగ్ని మధ్యంలో నిలిచి, గడ్డాలు మీసాలు పెంచుకొని తపస్సుల పేరుతో పిచ్చిపనులు చేయరాదు. ముళ్ళ మీద పడుకోవటం, తలక్రిందులుగా చెట్టుకొమ్మకు వ్రేలాడటం - ఇవన్నీ మందబుద్ధుల పనులు. ఇట్టివారిని మూఢులని భగవానుడే తెలియజేశాడు. వీరికి ఏఫలితం దక్కదు. మరేం చేయాలి?

తెలివితో మనస్సును స్వాధీనంలోనికి తెచ్చుకొనే ఉపాయాలను భగవానుడు గృహస్థులైన మోక్షార్థులకు తెలియజేస్తున్నాడు. అదే అభ్యాస యోగం. మనస్సును నీవు ముందుగా మచ్చిక చేసుకోవాలి. నీ దారికి తెచ్చుకోవాలి. 

క్రొత్తగా వచ్చిన గుర్రం నిన్ను దగ్గరకు రానివ్వదు. ఒక పట్టాన ఎక్కనివ్వదు. పరుగులు తీస్తుంది. నీవు కూడా దానితో పాటు పరుగులు తియ్యాలి. అదను కనిపెట్టి ఎక్కి కూర్చోవాలి. కళ్ళెం చేత పట్టుకోవాలి. అప్పుడిక నీకేం ఫరవాలేదు. అది చచ్చినట్టు నీ చెప్పుచేతల్లో ఉంటుంది. అంతేగాని దానిని చచ్చేటట్లు కొట్టటమో, తిండి పెట్టకుండా మాడ్చటమో, చేస్తే ఆ తర్వాత నీవు ఆ గుర్రం మీద ఎక్కినా ఒకటే, గోడమీద ఎక్కి కూర్చున్నా ఒకటే. కనుక ముందు మచ్చిక చేసుకొని దారికి తెచ్చుకోవాలి. ఇదే అభ్యాసయోగం. 

రామకృష్ణపరమహంసగారి వద్ద ఒక శిష్యుడుండేవాడు. వాడికి నల్లమందు పిచ్చి. ప్రతిరోజూ నల్లమందు తినేవాడు. సన్యాసుల్లో చాలమందికి గంజాయి, నల్లమందు అలవాటు ఉంటుంది. వీరంతా భగవంతుని కోసం సన్యసించిన వాళ్ళు కాదు. భుక్తి కోసం, పొట్టకూటి కోసం. ఒకసారి ఈ పిచ్చి పట్టిం తర్వాత అది వదలదు. రామకృష్ణపరమహంసగారు ఆ శిష్యుణ్ణి అనేకసార్లు హెచ్చరించారు. అయినా అతడు మానలేక పోతున్నాడు. ఆ టైం అయ్యేసరికి కాళ్ళు అక్కడికి లాక్కొని పోయేవి. అనుకోకుండానే తినేవాడు. ఎందరు తోటి శిష్యులు చెప్పినా మానలేదు. 

ఒకనాడు పరమహంసగారు ఆ శిష్యుణ్ణి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, "నాయనా! రోజూ నీవు ఎంత నల్లమందు తింటావు? అని అడిగాడు. 'బేడ ఎత్తు' అన్నాడు అతడు. వెంటనే పరమహంస గారు ఒక బలపం ముక్కను తెప్పించి బేడ ఎత్తు ముక్కను తుంపి, నాయనా! ఇక ముందు ప్రతిరోజూ ఈ బలపం ముక్క ఎత్తు నల్లమందును తూచుకొని తిను. దీన్ని పారవేయవద్దు. ఇది గురువు ఆజ్ఞ. జాగ్రత్తగా దాచుకో! అయితే ప్రతిరోజూ దీని ఎత్తు నల్లమందు తిన్న తరువాత దీనిని దాచుకోబోయే ముందు మరచిపోకుండా దీనితో ఒక పలక మీద 'ఓం' అని వ్రాసి దాచుకో. ప్రతిరోజూ ఇలా 'ఓం' అని వ్రాయటం మరచిపోవద్దు - అని హెచ్చరించాడు. శిష్యుడు అలాగే చేశాడు. ప్రతిరోజూ 'ఓం' అని వ్రాస్తుంటే బలపం కొద్దికొద్దిగా అరిగి, వాడు తినే నల్లమందు మోతాదు తగ్గిపోతున్నది. చివరకు ఆ పిచ్చి పూర్తిగా పోయింది. ఇదే యుక్తి. శక్తితో కానిది యుక్తితో సాధించాలి. అభ్యాసం క్రమంగా చేస్తుంటే ఏదైనా సాధ్యమే. 

కనుక మనోబుద్ధులను భగవంతుని యందు నిలుపుటకు శక్తి చాలకపోతే అభ్యాసయోగం ద్వారా సాధించాలి. అభ్యాసయోగం అంటే మరేం కాదు. విడిచి పెట్టకుండా నిరంతరం సాధన చెయ్యటమే. దైవచింతన, జపం, ధ్యానం, మానసిక పూజ - వీటితో పాటు నిత్యము శ్రవణం, మననం, స్వాధ్యాయం, నిధిధ్యాసన - వీటిని నిరంతరం కొనసాగిస్తూ ఉండటమే. మన మనస్సు అన్యవిషయాలలోనికి, ప్రాపంచిక విషయాలలోనికి వెళుతూ ఉన్నప్పటికీ, వాటితో సంయోగం చెందుతున్నప్పటికీ సమయం కనిపెట్టి మనస్సును మెల్లమెల్లగా భగవంతుని వైపుకు త్రిప్పాలి. ఇదే అభ్యాసయోగం. 

సేకరణ : : శ్రీమద్భగవద్గీత :12 వ అధ్యాయం : భక్తియోగం
--(())--



ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (9 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  
సేకరణ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సృష్టి నుండి త్రిమూర్తులను విడగొట్టలేము !!

జీవుడు ఎప్పటికీ ఉంటాడు. అందుకే జీవత్వం అఖండ సారమైంది. మంత్రం, దానిఫలం, అది చేసేవాడు... అంతా అఖండసారమే. మనసు, మంత్రం రెండూ శక్తివంతమే. క్రతువు అంటే క్రియాత్మకమైనది. సృష్టి ఉన్నంతకాలం క్రియ అనేది నిరంతర ప్రక్రియ. మనిషి జీవించినంతకాలం శ్వాస ఎలా అఖండంగా ఉంటుందో సృష్టి ఉన్నంతకాలం క్రియాకలాపం అలా అఖండంగానే ఉంటుంది. సృష్టి కార్యనిర్వాహకులైన త్రిమూర్తులూ అఖండసారమే. నిమ్మకాయలో పులుపు ఎక్కడ ఉంటుందని అడిగితే... అంతటా ఉంటుందని అంటాం. ఆ పులుపును నిమ్మకాయ నుండి విడగొట్టలేము. అలాగే సృష్టి నుండి త్రిమూర్తులను విడగొట్టలేము. సృష్టి, స్థితి, లయలు మూడూ సృష్టిలో నిరంతర కార్యాలుగా ఉన్నాయి. దాన్ని గుర్తించడమే సృష్టిజ్ఞానం !

పంచీకరణము అనగా పంచతన్మాత్రలు లేక సూక్ష్మ పంచమహా భూతములు వివిధ పాళ్ళలో కలియుట ద్వారా స్థూలసృష్టికి దారితీయుట. 

 అపంచీకరణము అనగా వేటితోను కలవని, కలపని, సూక్ష్మ పంచమహాభూతములు. దీనినే సూక్ష్మసృష్టి అందురు. 

దేవతలంటే సృష్టి పాలనలోని వివిధాంశాలు. అవన్నీ సృష్టితో పాటే అఖండం. విషయ సమన్వయం చాలా గొప్పది. అది వాస్తవాన్ని మనకు బోధపడేలా చేస్తుంది. మనకు సాధారణ జీవనంలో ఈ సమన్వయ ధోరణి అలవడితే అత్యున్నతమైన దైవిక విషయాల్లో కూడా ఆ స్వాంతన లభిస్తుంది. జీవనంలోనే సమన్వయ దృష్టి లోపిస్తే అది వేదాంతం విషయంలో ఎలా వస్తుంది ! ఎందుకంటే మనకు లౌకిక, ఆధ్యాత్మిక విషయాలకు ఉన్నది ఒకే మనసు కాబట్టి. కాబట్టే మనసు అఖండసారమే అవుతుంది !

--(())--

ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (8 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  
సేకరణ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
🌸 ఓం నమః శివాయ🌸

 దైవ బలం జాతకాన్ని కూడా తారుమారు చేయగలదు.

యుగ ధర్మం ప్రకారం "కలియుగంలో మనం పాప చింతన చేస్తే పాపం అంటదు, పాప కర్మలు ఆచరిస్తేనే పాపం అంటుతుంది".

కానీ "పుణ్య కర్మ మాత్రం చేస్తామని సంకల్పించుకుంటే చాలు, చేయ (లే) కపోయినా, దాని ఫలితం మనకు లభిస్తుంది".

దీనికి సంబంధించి మన పెద్దలు అనూచానంగా చెప్పే ఒక కథ ఉంది.

         ఒక ఊరిలో వాక్సుద్ది కలిగిన ఒక మంచి జ్యోతిష్కుడున్నాడు, ఒకరోజు  అతని వద్దకు పక్క ఊరి నుండి ఒక రైతు తన జాతకం తెచ్చి తన జాతక ఫలం చెప్పమన్నాడు

జ్యోతిష్కుడు ఆ రైతు జాతకం చూసి ఆశ్చర్యానికి గురౌతాడు, ఎందుకంటే ఇంకా కొన్ని గంటలలో అతని జీవితం ముగిసిపోనుంది, అతనికి రెండు గండాలున్నాయి, వాటిలో ఒకటి తప్పినా రెండోదాని నుండి తప్పించుకోలేడు.

అయితే ఆ జ్యోతిష్కుడు మాత్రం రైతుకు ఆ విషయాలేమీ చెప్పకుండా రేపురా..... అని చెప్పి పంపాడు.

ఆ రైతు సరే అని చెప్పి తన ఊరికి బయలుదేరాడు, ఇంతలో వర్షం ప్రారంభం కాగా, దారి పక్కనే ఉన్న ఒక పాడుపడిన శివాలయంలోకి వెళ్ళాడు.   

అక్కడ పూజ పునస్కారాలు లేకుండా ఉన్న ఒక పెద్ద శివలింగం కానరాగా, అది చూసి అయ్యో ఈ శివయ్య నిత్య ధూప, దీప, నైవేద్యాది పూజాదికాలు లేకుండా ఉన్నాడే అని మనసులో కలత చెందుతున్న సమయంలో....

ఆ రైతుకు అంతకు ముందు తన ఊరిలోని ఆలయానికి జరిగిన కుంభాభిషేకం దృశ్యాలు జ్ఞప్తికి వచ్చి, ఎలాగైనా తాను ఆ శివాలయాన్ని పునరుద్ధరించి కుంభాభిషేకం చేయించాలని సంకల్పించుకున్నాడు.

ఇంతలో ఏదో అలికిడవగా అటు చూసి అక్కడ పడగ విప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న పామును చూసి ఒక్క ఉదుటున గుడి నుండి బయటికి పరుగెత్తాడు.  

అంతలోనే ఆకాశంలో మెరుపు మెరిసి పిడుగుపాటుకు గుడి నేలమట్టమవడం, క్షణాల్లో జరిగిపోయాయి.

ఆ రైతు భయంతో పరుగులాంటి నడకతో ఇంటికి వెళ్ళి మర్నాడు మళ్ళీ తన జాతకాన్ని పట్టుకుని ఆ జ్యోతిష్కుని వద్దకు వెళ్ళాడు.  

అప్పుడా జ్యోతిష్కుడు అత్యంతాశ్చర్యానికి గురై, రెండు గండాలను తప్పించుకుని ఇతను ప్రాణాలతో ఎలా ఉన్నాడు, తానేమైనా పొరబడ్డానా అని అతని జాతకాన్ని మళ్ళీ పరిశీలించి, తాను సరిగ్గానే చూశానని నిర్ధారించుకుని, నిన్న తన వద్ద నుండి వెళ్ళాక ఏమేమి జరిగిందో వివరంగా చెప్పమన్నాడు.

అప్పుడా రైతు తాను క్రితం రోజు జ్యోతిష్కుని ఇంటి నుండి బయలుదేరక మార్గమధ్యంలో వర్షం కురవడం, పాడుపడిన శివాలయంలో ప్రవేశించడం, అక్కడి దృశ్యాన్ని చూసి ఆ ఆలయాన్ని పురరుద్ధరించి కుంభాభిషేకం చేయించాలని సంకల్పించడం, పాము రావడం, భయంతో బయటకి పరిగెత్తగానే, పిడుగుపాటుకు శిధిలావస్థలో నున్న శివాలయం నేలమట్టమవడం అన్నీ పూసగుచ్చినట్టు వివరించి చెప్పాడు.

అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఓహో, రైతుకు పాడుపడిన శివాలయాన్ని పునరుద్ధరించి కుంభాభిషేకం చేయాలనే సంకల్పబలంతో వచ్చిన పుణ్యఫలమే అతనికి ఆయుర్ వృద్ధి చేసి రెండు గండాల (పాము, ఆలయం కూలిపోవడం) నుండి కాపాడిందే, అదే నిజంగా కార్యరూపం దాలిస్తే ఇంకెంత పుణ్య ఫలమో కదా అనుకున్నాడు.

అందుకే మన పెద్దలేప్పుడూ మంచి ఆలోచనలు చేయమని చెబుతుంటారు.

--(())--


ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (7 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  
సేకరణ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
 వ్యాఖ్యానం : సూక్ష్మంగా 

"గురు వేదాంత వాక్యాదిషు విశ్వాసః శ్రద్ధ" - అన్నారు. గురువుపట్ల, శాస్త్రం పట్ల నిజమైన విశ్వాసమే శ్రద్ధ. దానివల్లనే జ్ఞానలాభం కలుగుతుంది. గురువు మీద నిజమైన విశ్వాసం ఉంటే శాస్త్రం మీద కూడా చెక్కుచెదరని విశ్వాసం కుదురుతుంది.

కనుక ఇక్కడ భక్తుడైనవాడు భగవంతునిపై అచంచల విశ్వాసం కలిగి ఉండాలి. తాను భగవంతునిపై భక్తిని కలిగి ఉంటే భగవంతుని అనుగ్రహం తనకు కలుగుతుందనే విశ్వాసం ఉండాలి. భగవంతుడున్నాడనే విశ్వాసం, ఆయన తన ప్రార్థనను ఆలకిస్తాడనే విశ్వాసం, తనపై ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడనే విశ్వాసం భక్తునికి ఉండాలి.

ఈ ప్రకారంగా సగుణోపాసన ఐనా, నిర్గుణోపాసన ఐనా ఈ 3 జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటివాడే శ్రేష్ఠభక్తుడు, యుక్తతముడు అని భగవంతుని అభిప్రాయం. అందుకే -

మే మతాః:- నా అభిప్రాయం అని స్వయంగా భగవానుడే చెబుతున్నాడు. కనుక భగవానుని అభిప్రాయమే ఎవరికైనా స్వీకరించదగినది గాని; వారి అభిప్రాయం - వీరి అభిప్రాయం కాదు. కనుక గృహస్థు - సన్యాసి అనిగాని, బ్రాహ్మణుడు - శూద్రుడు అనిగాని, సగుణోపాసకుడు - నిర్గుణోపాసకుడు అనిగాని - వీటితో ఏ సంబంధము లేకుండా యే = ఎవరైతే ఈ 3 జాగ్రత్తలు తీసుకొని ఉపాసన చేస్తే అతడే శ్రేష్ఠభక్తుడు. 

ఉపాసన అంటే ఉప + ఆసన = సమీపంలో కూర్చొనుట. ఎవరి సమీపంలో కూర్చోవాలి? భగవంతుని సమీపంలో. మన మనస్సు సంసారంలో కూర్చుంది. ఈ మనస్సును ఇక్కడి నుండి మకాం మార్చి భగవంతుని సమీపంలో కూర్చోబెట్టాలి. శిశువు గర్భంలో ఉన్నప్పుడు వాని చుట్టూ తల్లి శరీరమే ఉంటుంది. బయటకు వచ్చిన తరువాత ఆమె పాలు త్రాగి పెరుగుతుంది. ఆ తల్లిపాలను వేడి చేయనక్కరలేదు, పంచదార కలపనక్కర లేదు. ఆ తరువాత ఆటబొమ్మలను మరిగి తల్లికి దూరమవుతాడు. ఆకలి కాగానే ఆటబొమ్మలను ఆవలకు నెట్టి తల్లి చంకనెక్కుతాడు. ఇప్పుడు ఆ తల్లిపాలే కావాలి. ఆటబొమ్మలతో ఆకలి తీరదు. 

అలాగే తనస్థితికి, గతికి ఆధారమైన పరమాత్మను మరచి, మనం ప్రాపంచిక వస్తువులపై మోహం పెంచుకుంటాం. భార్య అని, భర్త అని, బిడ్డలని, ఇళ్ళూవాకిళ్ళని, ధనమని, సొమ్ములని - ఈ ఆటబొమ్మలను చూసి మురిసిముప్పందుమౌతాం. కాని ఇవన్నీ తోలుబొమ్మలు. ఎప్పుడో ఒకప్పుడు దూరమయ్యేవి, దుఃఖాన్నిచ్చేవి. వీటిలో నిత్యసుఖం లేదు. నిరతిశయానందం లేదు. తల తిరిగి నోటికి వచ్చినప్పుడు గాని 'నీవే తప్ప నితః పరం బెరుగ' నని భగవంతుని ఆశ్రయించం. కనుక ఇలా కష్టం వచ్చినప్పుడు గాక నిత్యము భగవంతుని ఉపాసించాలి. 

విషయాధీనమైన మనస్సు భగవదాధీనం కావటమే ఉపాసన. అట్టి భక్తుడే శ్రేష్ఠుడని భగవంతుని తీర్మానం.  
##################

సేకరణ : : శ్రీమద్భగవద్గీత :12 వ అధ్యాయం : భక్తియోగం




ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (6 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  
సేకరణ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

 ఈషణ త్రయాలతో మరిగిపోతున్న అంతఃకరణంతో భగవద్గీతను వింటే ఏం జరుగుతుంది ?

 వ్యాఖ్యానం : సూక్ష్మంగా 
నిర్గుణరూప పరమాత్మను ఆరాధిస్తూ ఆయనను చేరుకోవాలంటే ఉండవలసిన ముఖ్యమైన 3 లక్షణాలను తెలియజేయబోతూ ముందుగా నిర్గుణపరమాత్మ యొక్క స్వరూపస్వభావాలను తెలియజేస్తున్నారు. ఏమిటవి? -

1. అక్షరం 2. అనిర్దేశ్యం 3. అవ్యక్తం 4. సర్వగం 5. అచింత్యం 6. కూటస్థం 7. అచలం 8. ధ్రువం 

1. అక్షరం :- అక్షరం అంటే క్షరం లేనిది - నాశనం లేనిది. పరమాత్మ నాశనం లేనిది - దానికి పుట్టుక కూడా లేదు. పుట్టాలంటే నాశనం కావాలి. నాశనం కావాలంటే పుట్టాలి. పరమాత్మ 'అజం' పుట్టుకలేనిది; 'అక్షరం' నాశనం లేనిది. అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది. ప్రపంచం వస్తూపోతూ ఉంటుంది. అలాగే ప్రాణులన్నీ వస్తూపోతూ ఉంటాయి. అయితే పరమాత్మ శాశ్వతం. మట్టి నుండి కుండ తయారవుతుంది. కుండ పగిలిపోతే మట్టి రూపంలోకి వచ్చేస్తుంది. అంటే మట్టి మాత్రం ఎప్పుడూ ఉండేది. సినిమా తెర శాశ్వతంగా అలా ఉండేది.  దాని మీదకు బొమ్మలు మాత్రం వస్తూ పోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ కూడా ఎప్పుడూ ఉండేది - నాశనం లేనిది. అక్షరం. ఈ అక్షర పరబ్రహ్మను అర్థం చేసుకోవటానికే ఈ విశేషణాలన్నీ. ఇవన్నీ శాస్త్రీయ విషయాలు. ఈ శాస్త్రీయ విషయాలను వినాలన్నా, తెలుసుకోవాలన్నా అంతఃకరణానికి తగిన సంస్కారం ఉండాలి. మాసినబట్టకు రంగు పట్టదు. జ్వరం వచ్చిన వానికి రుచి తెలియదు. తుప్పుపట్టిన ఇనుమును అయస్కాంతం ఆకర్షించలేదు. కల్మషమైన మనస్సుకు వేదాంతబోధలు అర్థం కావు. కనుక వేదాంతాన్ని వినేముందు మనస్సులోని కల్మషాలను కడిగెయ్యాలి.

ఒకనికి అజీర్ణవ్యాధి. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు. చివరికొక సన్యాసి ఉపశాంతి కోసం "ఉప్పు రాళ్ళు జేబులో వేసుకొని ఒకదాని తరువాత ఒకటిగా నోటిలో వేసుకొని ఆ రసాన్ని త్రాగుతూ ఉండు ఉపశాంతి లభిస్తుంది" అన్నాడు. అలాగే చేస్తున్నాడు ఆ రోగి. ఒకనాడు అతడు మిఠాయి కొందామని స్వీటుషాపు కెళ్ళాడు. శాంపిల్ గా మిఠాయి నోట్లో వేసుకున్నాడు. తీపిలేదు. ఉప్పగా ఉంది. 4, 5 షాపులు తిరిగాడు. అన్ని షాపులలోను మిఠాయి అలా ఉప్పగానే ఉంది. చివరికొక షాపు వాణ్ణి అడిగాడు. "ఏమయ్యా! ఇప్పుడు మిఠాయిలన్నీ బెల్లంతో, పంచదారతో కాకుండా ఉప్పుతో చేస్తున్నారా ఏమిటి?" అని. దానికా షాపువాడు "అయ్యా! శుభ్రంగా నోరు కడుక్కొని రా! అప్పుడు మిఠాయి అసలు రుచి తెలుస్తుంది" అన్నాడు. 

నోట్లో ఉప్పుగల్లు పెట్టుకొని ఎంత తియ్యటి మిఠాయి తిన్నా ఉప్పగానే ఉంటుంది, రుచి తెలియదు. అలాగే వెనుకటి విషయవాసనలను అంతఃకరణంలో పెట్టుకొని ఎంత గొప్ప వేదాంతాన్ని విన్నా అర్థంకాదు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈషణ త్రయాలతో మరిగిపోతున్న అంతఃకరణంతో భగవద్గీతను సంజయుని ద్వారా విన్న ధృతరాష్ట్రుని గతి ఏమైంది? అంతే. వంటపట్టదు.

కనుక వేదాంత శ్రవణం చేసేటప్పుడు అంతఃకరణాన్ని శుద్ధిచేసుకొని; పూర్వవాసనలను క్షాళన చేసుకొని నిర్మలమైన అంతఃకరణంతో వినాలి. మనస్సులో ఏ అన్యవిషయాలకు తావివ్వకుండా చెప్పే విషయాలకు మాత్రమే చోటివ్వాలి. అప్పుడే పరమాత్మ యదార్థతత్త్వం తెలుస్తుంది. 

ఈ పాడుమనస్సుకు రెండే రెండు అవస్థలు. (1) శూన్యావస్థ. అదే నిద్ర. (2) విక్షేపావస్థ. అదే చంచలస్థితి. ఈ రెండూకాక 3వది ఐన ఏకాగ్రావస్థ ఏ కొద్దిమంది పుణ్యాత్ములకో లభిస్తుంది. చెప్పే విషయం మీదనే దృష్టి ఉంటే దుర్భేద్యమైన వేదాంతం అర్థమవుతుంది.

పరమాత్మను వర్ణించటం, ఇలా ఉంటుందని తెలియజెప్పటం ఎవ్వరికీ సాధ్యంకాదు. అలా సాధ్యంకాని విషయాన్ని ఎన్నో విధాలుగా నూరిపోయాలి. రకరకాల కూరలు, పిండివంటలతో విందుభోజనాన్ని ఆరగించినట్లుగ రకరకాల దృష్టాంతాలతో - యుక్తులతో - అనుమాన ప్రమాణాలతో - అనుభూతులతో పరమాత్మను ఆకళించుకోవాలి. అప్పుడే అక్షరపరమాత్మ అవగతమయ్యేది. 
#

సేకరణ : : శ్రీమద్భగవద్గీత :12 వ అధ్యాయం : భక్తియోగం





ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (5 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  
సేకరణ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సృష్టి అంతయు ఆ ఓంకారము నుండే పుట్టినది? 

త్రిగుణాత్మకమైన అవిద్య బ్రహ్మచైతన్యంతో సృజనాత్మకశక్తిని పొందినది. కనుక బ్రహ్మముతో చైతన్యవంతమైన అవిద్యనుండి వరుస క్రమములో ఆకాశం (శబ్దం), ఆకాశం నుండి వాయువు (స్పర్శ), వాయువు నుండి అగ్ని (రూపం), అగ్ని నుండి జలం (రసము), జలం నుండి భూమి (గంధం) పుట్టినవి.

ఈ పంచభూతములు స్వయంప్రకాశం లేనివి. అందువలన బ్రహ్మచైతన్యం క్రమశః ముందుగా ఆకాశం, తరువాత వాయువు, అగ్ని, జలం, భూమిలోనికి వ్యాపించుటవలన అయస్కాంతక్షేత్రములోని ఇనుప మేకులు ఐస్కాంతీకరణ చెందినట్లుగా ఈ పంచ భూతములు చైతన్యవంతమైనవి. అవిద్యనుండి ఉద్భవించిన ఈ సూక్ష్మభూతములు చైతన్యవంతమైనవి. 

అవిద్యనుండి ఉద్భవించిన ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను తన్మాత్రలు అందురు. అవిద్య లేక మూలప్రకృతి నుండి పుట్టిన మొదటి శబ్దమునే ఓంకారము అందురు. ఈ సృష్టి అంతయు ఆ ఓంకారము నుండే పుట్టినది. 

ఈ సూక్ష్మ పంచమహాభూతములు సత్వ, రజో, తమో గుణములు మూడునూ కలిగియుండును. ఈ త్రిగుణాత్మకమైన మూల అజ్ఞానమును లేదా అవిద్యను కారణసృష్టి అందురు. సూక్ష్మ పంచమహా భూతములు ఇందులోని భాగమే.
--(())--


ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (4 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  
సేకరణ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

"మన భావాలకు అనుగుణంగానే శాంతి రావటం పోవటం ఉంటుంది అనుకోవచ్చా ?"

ఒక కుటుంబంలో భార్యభర్తలు తిరుపతి వెళ్ళారు. భార్య భక్తురాలు. భర్త నాస్తికుడు. ఒకరు దైవదర్శనం కోసం, మరొకరు అక్కడి ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్ళారు. నాలుగు రోజులపాటు ఎవరి అభిరుచుల మేరకు వారు ఆనందంగా గడిపారు. తన ఆనందానికి దైవానుగ్రహం కారణమని భార్య, అక్కడి ప్రకృతి కారణమని భర్త భావించారు. అయితే చివరి రోజు వారికి ఇంటి గురించి ఫోన్ వచ్చింది. ఇంట్లో దొంగలు పడ్డారనే వార్త తెలిసింది. ఇద్దరూ చాలా అశాంతికి లోనయ్యారు. రోజువారీగా వారిని చికాకుపెట్టే వ్యాపకాలు ఏవీ లేకపోవటం వల్లనే వారు ఆ నాలుగు రోజులపాటు చాలా శాంతిగా ఉన్నారని అర్ధం అవుతుంది. వాస్తవాలను, భావాలకు మధ్యవున్న అంతరాలను అవగాహన చేసుకుంటే శాంతి అంటే ఏమిటో అర్థం అవుతుంది !

మెలకువకు మునుపు ఉండేది తానొక్కడే, నిద్రపోయిన తర్వాత ఉండేది తానొక్కడే.
మధ్యలో (మెలకువలో) ఉండేది కూడా తానొక్కడే... అన్నది అర్ధం అయ్యే వరకు ఈ 'ఘర్షణ' తప్పదు.

సాధన వల్ల దేవుడు కనబడడు.,కనబడేదంతా దేవుడే అని తెలుస్తుంది.
అనినా, వినినా, కనినా, తలుచుకున్నా... దైవనామం ఇచ్చే విశేష ఫలం ఆ స్థాయిలోనే ఉంటుంది. చేసే బాహ్య క్రియలకన్నా విషయంపై మనసులో ఇష్టం ప్రధానం. అదే ముఖ్య భూమిక పోషిస్తుంది. 

శాంతి రావటమా, పోవటమా అనేది ని ఆలోచన బట్టే ఉంటుంది . 
--(())--

🌹. సాధనలో శీఘ్ర ప్రగతికై  అష్టాంగ యోగ పద్ధతి - పతంజలి యోగము 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

అహంకారాదులను వదిలించుకోవడానికి పాతంజలి యోగ పద్ధతులలో అష్టాంగ యోగమని ఒక ఉపాయమున్నది.

అవి యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని ఎనిమిది అంగాలు.

మొదటి ఐదు విషయాసక్తిని నిగ్రహించడానికి, చివరి మూడు భగవంతునికి దగ్గరవడానికిని పనికి వస్తాయి.

1. యమం :
యమమనగా ఈ కనిపించే ప్రపంచాన్ని ఈశ్వరమయంగా చూస్తూ అన్ని వస్తువులు ఆయనవేననే భావం కలిగి ఉండి తనది అంటూ దేనిమీద హక్కు లేకుండడం, అవసరమైన వాటిని భగవంతునివిగా భావించి ఇవన్నీ ఆయనవే అని, ఆయనకు నివేదించి తిరిగి భక్తుడి అవసరానికి ప్రసాదించమని ఆయనను వేడుకొనడం చేయాలి. నైవేద్యం, ప్రసాదం అనే వాటి అర్థం అదే. అంతేగాని మన వస్తువులు భగవంతుని కివ్వడమనే భావన సరికాదు.

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌
తేన త్యక్త్యేన భుంజీథా, మాగృథః కస్యస్విద్ధనమ్‌ ||

దీని అర్థం అంతా ఈశ్వరమయమని భావిస్తూ మనకు అవసరమైన వాటిని, ఆయనను అర్థించి అనుభవించు అని.

ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మన తలపులలో, మాటలలో, చేతలలో మన వలన ఎవరికీ కీడు కలుగరాదు. ఇదే అహింస. అబద్ధమాడరాదు. ఇతరుల వస్తువులను, శ్రమను దోచుకొనరాదు. అవినీతి, అక్రమ చర్యలు మానాలి. పరస్త్రీని తల్లివలె భావించాలి. సకల జీవరాసుల యెడల దయ కలిగి ఉండాలి. ఎట్టి దాపరికం లేకుండా నిజాయితీగా ఉండాలి. ఎవరెంత రెచ్చగొట్టినా ఓర్పు నశించక, సత్వ గుణంలోనే ఉండాలి. భేద భావన, శత్రు భావన మనలో ప్రవేశించరాదు. అరిషడ్వర్గాన్ని జయించి స్థైర్యం, ధైర్యం, నిగ్రహం సాధించాలి. మితాహారం, హితాహారం భుజించడం.  జిహ్వ చాపల్యం పనికిరాదు. భక్తి సాధనలో ఏకాగ్రత కుదురుటకు మన లోపల, బయట శుచిగా ఉండాలి.

2. నియమం :
నియమమనగా నిరంతరం భగవచ్చింతన చేయడం, ప్రాపంచిక విషయాలను ఇష్టంగా చూడక, తప్పదు కదా అని పట్టించుకోవడం. అయ్యప్ప దీక్ష ఉద్దేశ్యం అదే. మనలోని కల్మషాలను తొలగించాలనే దీక్షను చేపట్టాలి. దాని కొరకు కొన్ని సత్కార్యాలు ఆచరించాలి. భాగవతోత్తములను, ఆచార్యులను చేరి సత్సంగం చేయాలి. వారి ఆజ్ఞలను, సూచనలను పాటించాలి. స్వార్థం, అహంకారం మనలో వ్యక్తం కాకుండా చూచుకోవాలి. అదే తపస్సు. ప్రాప్తించిన దానితో సంతోషపడి తృప్తిగా ఉండాలి. ఎంత కష్టపడినా లభించకపోతే, దుఃఖపడరాదు.

భక్తి కోసం, జ్ఞానం కోసం చేసే సాధనలలో భగవంతుడున్నాడని విశ్వాస ముండాలి. ఆయనతో ఐక్యమవడమే లక్ష్యంగా చేసుకోవాలి. చాలామంది భగవంతుడున్నాడని నమ్ముతారు గాని, దైవేచ్ఛ ప్రకారం నడచుకోరు. అందువలన దైవం గురించి వివరమైన దృఢమైన అవగాహన ఉండాలి.

ధన, శ్రమ, అవయవ దానాల వంటి త్యాగబుద్ధి ఉండాలి. ఇందులో ‘‘నేను చేశాను’’ అనే అహంకారం తలెత్తరాదు. అందరిలోనూ భగవంతుడున్నాడనే భావనతో ‘నారాయణసేవ’గా చేయాలి.

భగవంతుని పూజించడం, జప, తప ధ్యానాలన్నీ నియమబద్దంగా, క్రమ శిక్షణతో దీక్షగా చేయాలి. కర్మకాండయందు అంతరార్థ మెరిగి చిత్తశుద్ద్ధితో చేయాలి.

చేయకూడని పనులు చేయరాదు. అట్టి ఆలోచన వచ్చినంతనే సిగ్గుపడి, పశ్చాత్తాపపడి, నిగ్రహించుకోవాలి. సత్యవ్రతం, అహింసా వ్రతం, బ్రహ్మచర్య వ్రతం, అపరిగ్రహ వ్రతం, మౌనవ్రతం వంటివి, ఉపవాసాలు వీలునుబట్టి, వాటి యొక్క అర్థం తెలిసి చేయాలి. ఇవన్నీ మనలను మనం క్రమశిక్షణలో పెట్టు కోవడానికి అవసరమౌతాయి. అంతేగాని ఈ పనులు నేరుగా భగవంతుని వద్దకు చేర్చవు.

3. ఆసనం :
పూజాది కార్యక్రమాలకు ఒక స్థిరమైన చోటును ఏర్పరచుకొని భక్తి, ఏకాగ్రత కుదిరేటట్లు కదలకుండా కూర్చునే పద్ధతిని ఆసనమంటారు. పద్మాసనం, అర్థ పద్మాసనం, సుఖాసనం ఏది కుదిరితే అదే ఆసనం.

4. ప్రాణాయామం :
భాగవతులు, గురువులు ఉపదేశించిన మంత్రాన్ని శ్వాసతో అనుసంధానం చేస్తూ జపిస్తే ఏకాగ్రత లభిస్తుంది. దాని వలన మనలో ఉన్న భగవంతుని వద్దకు చేరగలం.

5. ప్రత్యాహారం :
భగవద్భావాన్ని మనయందు నింపుకొని, అహంకార మమకారాలకు కారణమైన ఇంద్రియ, మనోబుద్ధులను లోనికి ముడుచుకోవాలి. అనగా తాబేలు తన అవయవాలను ముడుచుకొన్నట్లు చేసి, బయటి విషయాలలోకి పోనీయకుండడం.

6. ధారణ :
భగవంతుని హృదయం నిండా నింపుకోవడమే ధారణ. ఈ ధారణ మధ్య మధ్యలో మనసు విషయాలమీదికి పోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మళ్ళీ ధారణ చేస్తూ ఉంటాం.

7. ధ్యానం :
ధారణ ఖండ ఖండాలుగా జరుగుతూ, చివరకు అఖండ ధారణ జరిగితే అంతవరకు చేసే ప్రయత్నాన్ని ధ్యానం అంటారు.

8. సమాధి :
ధ్యానం అఖండ ధారణగా మారినప్పుడు కలిగేది సమాధి. సమాధిలో దైవ సాక్షాత్కారమవుతుంది.

ఈ ఎనిమిదింటిలో యమ నియమాలు పునాది వంటివి. ఆసన, ప్రాణాయామాలు ఉపకరాణాలు. ప్రత్యాహార, ధారణ, ధ్యానాలు సాధనా మార్గాలు. పర్యవసానంగా కలిగే సమాధి ఫలరూపమైన పరాభక్తి అనబడుతుంది.

ఈ విధంగా జ్ఞాన, యోగ పద్ధతులలో కూడా భక్తుడు తనను తాను సంస్కరించుకొని సంసిద్ధుడవవచ్చును. అన్ని మార్గాలు ఉపయోగ పడేవే. ఏదో ఒక పద్ధతిలో యోగ్యత సంపాదించి, భగవదనుగ్రహం పొందే ప్రయత్నం భక్తులే చేసుకోవాలి. అంతేగాని, ఆయనను నిందించడం అవివేకం.
🌹 🌹 🌹 🌹 🌹



ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (3 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  
సేకరణ /రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

గురువుపై విశ్వాసం లేకపోతే ?


. . .  శ్రద్ధయా పరయా ఉపేతాః:- శ్రద్ధ అంటే విశ్వాసం. శాస్త్రాలు చెప్పిన విషయాలను శ్రద్ధగా విని విచారణ చేయాలి. అలా విచారణ చేసి నిశ్చయించుకొని అనుభవంలో నిలవాలి. 

అందుకు ఒక సద్గురువును ఆశ్రయించాలి. 


అతడు శాస్త్రబద్ధమైన విషయాలు చెబుతున్నాడా? లేదా? అని ముందు పరిశీలన చేయాలి. 

ఆ తరువాత గురువును పూర్తిగ నమ్మాలి. 

అలా గురువుపై విశ్వాసం లేకపోతే ఆచరణ చేయాలనిపించదు. 

కనుకనే శ్రద్ధ(విశ్వాసం) ముఖ్యం. 

అనుకూల పరిస్థితులలో నమ్మి, ప్రతికూల పరిస్థితులలో జారిపోయే శ్రద్ధ కాకుండా ఎట్టి పరిస్థితులలోను చెక్కుచెదరని శ్రద్ధ కావాలి. 

శ్రద్ధ(విశ్వాసం) లేకపోతే మనస్సు స్థిరంగా నిలవదు, జ్ఞానం తలకెక్కదు. 

అందుకే భగవద్గీతలో 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం' - శ్రద్ధ గలవానికే జ్ఞానం లభిస్తుంది అన్నారు. అందుకే శ్రద్ధ ఉంటేనే సిద్ధి అన్నారు. 

తత్త్వజ్ఞానాన్ని కోరుకొనే వారికి 9 లక్షణాలు ఉండాలి. వివేకం, వైరాగ్యం, శమం, దమం, 'తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఉపరమం, ముముక్షుత్వం. 

ఈ అన్నింటిలో శ్రద్ధయే మొదటిది. అయితే ఈ శ్రద్ధ వివేక శ్రద్ధ కావాలి; విచారశ్రద్ధ కావాలి. అంతేగాని అంధశ్రద్ధ కాకూడదు. అంధశ్రద్ధ - మూఢశ్రద్ధ - మూఢవిశ్వాసం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. 

ఒక గ్రామంలో గృహస్థు ఒకాయన ఉన్నాడు. ఆయనది పెద్దకుటుంబం. ఆయన ప్రతియేటా నవగ్రహ పూజ చేయిస్తాడు. పురోహితుణ్ణి పిలిచి కావలసిన వస్తువుల జాబితా ఇమ్మన్నాడు. ఆ పురోహితుడు తన ఇంట్లో కొరతగా ఉన్న వస్తువులతో కలిపి పెద్ద జాబితానే ఇచ్చాడు. గృహస్థు అన్నీ తెప్పించాడు. పూజ జరిగిపోతున్నది. ఇంతలో ఇంటిలో తిరుగుతున్న పిల్లి పూజ దగ్గర పెట్టిన కొబ్బరిచిప్పల మీదికి ఉరుకుతున్నది. అది సరుకులను పాడుచేస్తున్నది. అందువల్ల ఒక గంపను తెప్పించి పిల్లిని దాని క్రింద వేశారు. పూజ పూర్తి అయింది. ప్రతి సంవత్సరం ఇదే తంతు. ఆ గృహస్థుకు 5 ఏళ్ళ కొడుకున్నాడు. అతడు ప్రతి సంవత్సరం జరుగుతున్న పూజను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. కొన్నాళ్ళ తరువాత ఆ గృహస్థు మరణించాడు. అతని కుమారుడు 30 సం॥ల వయస్సుగల వాడయ్యాడు. తండ్రి చేయించినట్లుగా తాను కూడా నవగ్రహపూజను ప్రతి సంవత్సరము చేయించాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల తన పురోహితుని పిలిచాడు. ఈ పురోహితుడు ఎవరోకాదు. అంతకుముందు తండ్రిచేత నవగ్రహపూజ చేయించిన పురోహితుని కుమారుడే. సరే పూజ మొదలైంది. ఇంతలో ఆ పూజ చేయించే కుర్రవాడు పురోహితునితో "అయ్యా గంపక్రింద పిల్లిని వేసే విధానం మీకు తెలియదా?" అన్నాడు. పురోహితుడు అర్థం కానట్లు చూచాడు. ఈ మాత్రం పూజ తెలియని వాడివి మాకెందుకు? వేరొకరిని పిలుస్తాం, ఆపండి పూజ అన్నాడు. అంతలో కుశలుడైన పురోహితుడు ఆ కిటుకు కనిపెట్టి ఒక పిల్లిని ఎక్కడి నుండో తెప్పించి గంప క్రింద వేసి పూజ పూర్తిచేసి తన మూట, ముల్లె సర్దుకుపోయాడు. ఇది మూఢశ్రద్ధ. అంధశ్రద్ధ. గ్రుడ్డి విశ్వాసం ఇట్టి శ్రద్ధ వల్ల ఎట్టి ప్రయోజనమూ ఉండదు. నిజమైన శ్రద్ధ కావాలి. 


సేకరణ : : శ్రీమద్భగవద్గీత :12 వ అధ్యాయం : భక్తియోగం

Image may contain: 1 person
ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (2 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  

: . అహంకార నిర్మూలనం ? 

జీవుడిలో మొట్ట మొదట పుట్టేది అహంకారమే. దానిని ఎవరు కొన్ని జన్మల సాధన ద్వారా నిర్మూలనము చేసుకుంటారో అలాంటివారే దివ్య యజ్ఞము నందు భాగము  కలిగి శాశ్వతమైనటువంటి కథలో చేరి ఆనంద స్వరూప మైనటు వంటి దైవాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు.

అలా కాకపోతే సృష్టిలో జీవుడికి తపశ్శక్తి, ఉన్నతి చెందాలనేటటు వంటి భావము లేక కేవలము మనసు సహాయము చేత ఇంద్రియములతో పరితృప్తి చెందుతూ, భోగలాలసుడై నశించే పరిస్థితి ఏర్పడుతుంది.  అహం నిరంతరం మనిషిలో దాగి  ఉంటుంది దీనికి పరిష్కారం నిత్య ము దైవాన్ని ఆరాధించటమే. 

--(())--



ఆనంద ... ఆరోగ్య ... ఆధ్యాత్మిక .. జ్ఞాన ప్రభ (1 )
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  
🌞 నిత్యయుక్తులు అంటే ఉదాహరణ సహితంగా ?

వివరణ 

 నిత్యయుక్తా :- ఎప్పుడో రోజులో కొద్దిసేపో, వారానికి ఒకరోజో కాదు. నిత్యము, నిరంతరము భగవంతుని యందే ఉండాలి. రోజూ ఒక గంటో - రెండు గంటలో డ్యూటీ లాగా భగవంతుని స్మరిస్తే అది నిజమైన భక్తికాదు. నిజమైన ఉపాసన కాదు. 

పూజ చేసేటప్పుడో, భజన చేసేటప్పుడో, జపధ్యానాలు చేసేటప్పుడో, దేవాలయంలో కూర్చున్నప్పుడో, లేదా ఇలా సత్సంగాలలో పాల్గొన్నప్పుడో భగవంతుని యందు మనస్సు పెట్టి మిగిలిన సమయాలలో ఇక భగవంతుని స్మరణయే లేకుండా ఉంటే అది నిత్యభక్తి కాదు, అతడు నిత్యయుక్తుడు కాదు. సర్వకాల సర్వావస్థలలోను భగవత్ స్మరణను విడిచిపెట్టరాదు. నిజంగా భగవంతుడెప్పుడూ మనను విడిచి ఉండటం లేదు. మనం కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోయినా, బస్సులో ఉన్నా, విమానంలో ఉన్నా, ఏం చేస్తున్నా చివరకు చనిపోయినా సరే ఆయన మనలోనే స్థిరంగా ఉన్నాడు. కాని మనమే ఈ ప్రాపంచిక విషయాలకోసమో, భోగాల కోసమో ఆయనను విడిచిపెడుతున్నాం. అలా ఉండకూడదని భగవానుని ఉపదేశం. 

పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్నన్, అశ్నన్, గచ్ఛన్, స్వపన్, శ్వసన్ - కంటూ, వింటూ, తింటూ, తిరుగుతూ, తెస్తూ, ఇస్తూ, లేస్తూ, కూర్చుంటూ సర్వకాల సర్వావస్థలలోను చిత్తం భగవదాయత్తమై ఉండాలి. అంతటా ఆ భగవంతునే చూస్తూ, నిరంతరమూ ఆ భగవంతుని చింతించటమే నిత్యయుక్తః అంటే. అట్టి భక్తుడే శ్రేష్టతముడు అని భగవానుడు తన అభిప్రాయాన్ని తెలియ జేస్తున్నాడు. 

తేనెటీగ పుష్పాలలోని మకరందాన్ని పీల్చుకుంటుంది. ఈగ కొద్దిసేపు బెల్లం మీద వాలుతుంది. కొద్దిసేపు పెంటకుప్పల మీద వాలుతుంది. పేడపురుగు ఎప్పుడూ పెంటకుప్పలలోనే ఉంటుంది. ఒకవేళ దానిని తెచ్చి పుష్పాలలో వేస్తే చచ్చి ఊరుకుంటుంది. మనం తేనెటీగలాగా ఎల్లప్పుడూ భగవంతునిలోనే చరించాలి. ఈగలాగా కొద్దిసేపు భగవంతునిపైన, కొద్దిసేపు ప్రపంచవిషయాల మీద వ్రాలకూడదు. 

నిరంతరము శ్రీకృష్ణుని యందే మనస్సు నిల్పిన గోపికలు నిత్యయుక్తులు. శ్రేష్టభక్తులు. ఒక్క క్షణం కూడా శ్రీకృష్ణుని స్మరించకుండా ఉండలేరు. తమ తిండితిప్పలు మరచిపోతారే గాని శ్రీకృష్ణుని మాత్రం మరచిపోరు. రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా నిత్యము, నిరంతరము శ్రీకృష్ణ సందర్శనాభిలాషులై తపించిపోతూ ఉంటారు. ఆయన కనిపించకపోతే వారికి నిముషమొక యుగంలా ఉంటుంది. 

ఒక గోపికకు కృష్ణుని చూడాలనే తపన అధికమైంది. పెద్దల చాటున ఉండవలసిన ఆ గోపిక, స్వతంత్రించి కృష్ణ దర్శనానికి పోయే అవకాశం లేక తపనపడి పోతున్నది. ఎలాగో మనసు బిగబట్టుకొని సాయంకాలం వరకు వేచి ఉన్నది. సాయంత్రం గోధూళి వేళ అయింది. గోవులను తోలుకుంటూ కన్నయ్య వస్తున్నాడు. ఆ గోధూళిలో మసకమసకగా అప్పుడప్పుడు కనిపించి కనుమరుగై పోతున్నాడు కన్నయ్య. అతడిని దర్శించాలంటే నందుని ఇంటికి పోవాలి. ఇదే సరైన సమయం. ప్రమిద - వత్తి తీసుకొని ముట్టించుకొని వచ్చేందుకని నందుని ఇంటికి బయలుదేరింది. నందుని ఇంట ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ ఊరి వారంతా సంధ్యవేళ అక్కడికి వెళ్ళి దీపం ముట్టించుకొని వస్తుంటారు. ఆ గోపిక అలాగే నందుని ఇంట ప్రవేశించి దీపం గూటి వద్దకు వెళ్ళింది. దీప దర్శనంతో పాటు దివ్యమంగళ విగ్రహం ఆ శ్రీకృష్ణుని కన్నులారా దర్శించింది. నందుని ఇంటిలో ఆ సజీవ దీపాన్ని చూస్తూ ఈ నిర్జీవ దీపాన్ని మరచింది. దీపం వద్ద వత్తిని పెట్టి వెలిగించాలనుకున్నది. కాని ఆమె పరధ్యానంతో - శ్రీకృష్ణ ధ్యానంతో తనవ్రేలును పెట్టింది. అగ్నికి దయ ఎక్కడుంటుంది? వ్రేలు కాలిపోతున్నది. ఆ సమయంలో ఆమె దేహాన్నే కాదు, ప్రపంచాన్నే మరచింది. ఆమె మనస్సు మనస్సులో లేదు, ఆమెలో లేదు, ప్రపంచంలో కూడా లేదు. భక్తితో కరిగిపోయిన ఆమె మనస్సు భగవంతునిలో లీనమై పోయింది. ఇది చూస్తున్న యశోద ఒక్క పరుగున వచ్చి ఏమిటమ్మా! ఇది? నిద్రపోతున్నావా? రాత్రి నిద్రపోకుండా మేలుకొని ఉన్నావా? అని ఆమెను కదిపి మందలించింది. అప్పుడు కదిలింది ఆమె మనస్సు. ఆమెకు కాలం తెలియలేదు. వ్రేలు కాలటం తెలియలేదు. బాధ తెలియటం లేదు. తన కృష్ణ సందర్శన కుతూహలం నెరవేరింది. ఇలా గోపికలు నిరంతరం కృష్ణస్మరణలో తరించారు. 

సేకరణ : : శ్రీమద్భగవద్గీత :12 వ అధ్యాయం : భక్తియోగం
--(())--



* శ్రీ భక్త మందారము (తల్లి)
* జపము - జపమాల గురించి సంపూర్ణ వివరణ 
* మౌన యోగి
* హిపోక్రాట్స్ తెలుసా?
*  ఓం యమునా ద్వీప సంజాతాయ నమః 
* ఓం కృష్ణద్వైపాయనాయ నమః 

Saraswathi Tanjore Painting, A contemporary rendition (via StudioGanjan)


శ్రీ భక్త మందారము (తల్లి)
ఆటవెలది : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

విడమరచి వివరము తెల్పుచు ఉన్నాను   
కాల మాయ చెంద కుండ బతుకు 
వయసెరిగి పనులను తెల్పుచు ఉన్నాను  
హృదయ వెతలు తెల్సి నీవు బతుకు  

మమతెరిగిన  మనసు తెల్పుచు ఉన్నాను 
పంత మొంద కుండు నిజము తెలుపు  
మనసెరిగి తెలిపిన  మాతృశ్రీ మాటలు  
బాధపెట్టి ఉన్న ఆచరించు

బాబు యంతంబు లేనట్టి ఆశ వద్దు
ధీను లందర్కి దిక్కుగా నీవె ఉండు
స్థిర బుధ్ధిని వ్యక్త పరచగల శక్తి 
నీకు కలగాల నిపలుక తెల్పు చుంటి 

కొలువు అనుకరణకు ఆవేశ మెందుకు  
అహము వదలి నిముష ముందు ఆగు 
కధలు తెలిపి సమయ మంతయు వ్యర్ధము 
చేయ కుండ నిలకడ గమనించు 

కళల వినయము మది హాయిని గొల్పును 
బతుకు  బండి జరుగు సమయ మంత  
మమతల కనికరము గమనించి జీవిత  
నావ కదలి కలను తెల్సి సాగు

తేటగీతి 
భాద నాదని తెలుసుకో లేక ఉండి 
ప్రేమ నీదని మసలుకో లేక ఉండి 
ఆశ పాశము వదులుకో లేక ఉండి 
నిత్య భావపు పలుకులే తల్లి వల్లె 

మనసు లోతుల్లో మాటలు గుచ్చు కున్న
నిత్య భోదల్లా పల్కులు నొచ్చు కున్న
మగువ చేతుల్లో బొమ్మల బత్కు తున్న
మనసు కన్నుల్తో బిడ్డను మెచ్చె తల్లి 

ఉనికి గుర్తింపు కోసము వేచి ఉండి
కలసి ఉన్నతి ఓదార్పు ఓర్పు ఉండి
తెలివి తోపాటు ఐక్యత కలిగి ఉండి
మనసు అభివృద్ధి పనులకు సహకరించు



* జపము - జపమాల గురించి సంపూర్ణ వివరణ  - 

       ఒక మంత్రాన్ని జపించుటకు జపమాల ముఖ్యము . జపమాల ఉపయోగించటం వలన మనం చేయు జపసంఖ్య తెలియును . జపసంఖ్య తెలియకుండా చేయు జపము వ్యర్ధము . దాని ఫలితము రాక్షసులకు పోవును . జపమాలను హృదయమాల అని అంటారు. జపమాల రక్షణకు , సిద్ధికి ముఖ్యము . జపమాల లేకుండా ఎన్నికోట్ల సార్లు జపం చేసినను వ్యర్థము . 108 లెక్కకు వచ్చు మాల పూర్ణమాల , 54 లెక్కకు వచ్చునది అర్ధమాల , 27 లెక్కకు వచ్చునది అధమ మాల . 

                జపమాల  చేయు విధానం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను . మధ్యన ముల్లులేని దారంతో మూడు మడతలతో పేని యజ్ఞోపవీతమునకు పురివేసినట్లు మూడు పేటలలో వేసిన ధారమునకే పూసలు గుచ్చవలెను . దీనిని ముత్తైదువులు చేసి ఇచ్చిన మంచిది లేదా స్వయంగా చేసుకొనవచ్చును. మాలకు మణులను గుచ్చునప్పుడు తాను యే మంత్రము జపించవలెను అనుకొనుచున్నాడో దానినే పలుకుతూ ఆ మణులను బంధించవలెను . మేరువుకు సరిగ్గా రెండుకోనలను దూర్చి మద్యన గ్రుచ్చవలెను . దీనిని శ్రీచక్రం పైనగాని లేక గాయత్రి వద్ద ఉంచిగాని , ప్రాణప్రతిష్ట 108 సార్లు చేసి గురువుగారికి ఇచ్చి 108 సార్లు వారు జపం చేసి ఇచ్చిన తరువాత తాను వాడవలెను . దీనివలన సర్వసిద్ధి కలుగును. జపమాలను దేహము నందు ధరించక , క్రింద ఉంచక దేవత వద్దనే ఉంచవలెను . దీనిని జపము చేయునపుడు " గోముఖము " వంటి సంచిలో ఉంచుకుని చేతికి తగిలించుకొని హృదయమునకు ఆనించుకుని మాల లోపలికి చుట్టి వచ్చునట్లుగా జపించవలెను . జపించు సమయము నందు మాలను చూచువారికి జపఫలితము దక్కును. కనుక జపము చేయి సందర్భము నందు మాలపైన గోముఖము లేదా వస్త్రమును గాని కప్పవలెను . జపమల లొపల తిరిగినచో జపఫలితము తనకే వచ్చును. బయట తిరిగినచో ఆ మాలను చూసినవారికి ఫలితము దక్కును. 

                 ఇప్పుడు మీకు ఏ వస్తువులు కల మాలలతో జపము చేసిన ఎటువంటి ఫలితాన్ని ఇచ్చునో మీకు తెలియచేస్తాను . రుద్రాక్షమాల ధర్మార్ధ , కామ , మోక్షములను ఇచ్చును. పద్మమాలిక సర్వబీష్ట సిద్ది , పగడమాల విద్య , వశీకరణము . పద్మరాగ మాల సమ్మోహనము , పుత్రజీవి మాలతో ( దీనికి ఎరుపు దారం ఉండాలి ) సంతానం , ఉశిరిక గింజల మాల జ్వరశాంతి , పసుపుకొమ్ముల మాలతో " బగళా మంత్రము , నవదుర్గ " ఇత్యాది జపించిన స్తంభన అగును. ఔదుంబర మూలికామాల సర్వసిద్ది , తాని మాలతో దారిద్ర్యనివారణ శత్రువులు పారిపోవుటకు 10 వేలు జపం చేయవలెను . హృదయమాల శీఘ్ర మంత్రసిద్ది , మణులతో చేసిన మాల సామ్రాజ్యము , స్పటికమాల సర్వకోరికలు నెరవేరుట , పద్మబీజములు మాల లక్ష్మీకరం , కీర్తికరం , రక్తచందన మాలతో వశీకరణం , భోగము కలిగించును. 

                 జపము చేయనప్పుడు ఏ వ్రేళ్లకు ఏమి ఫలమో ఆ విధముగా చేయవలెను . ఉంగరపు వ్రేలు బొటనవ్రేలితో కలిపి మాలను పుచ్చుకొని జపించవలెను . మరి ఇతరవ్రేళ్ళకు సంబంధం ఉండరాదు. ఉత్తమకర్మ సిద్ది అగును. బ్రొటనవేలు , మధ్యవేలు మంత్రసిద్ది . చూపుడువేలు ఉచ్చారణ కొరకు , కనిష్ఠఅంగుష్ఠములు మరణము , చూపుడు వ్రేలు శత్రునాశనము , మధ్యవ్రేలు రోగహరి , ఉంగరపు వ్రేలు పుష్టి , కనిష్టము రక్షణ , అంగుష్ఠము మోక్షమును ఇచ్చును. 

       జపము చేయుటకు సూర్యోదయము నుంచి తిరిగి సూర్యోదయము అగు ఆహోరాత్రమును 6 భాగములు చేయవలెను . 24 గంటల సమయము నందు ఒక భాగము 4 గంటలు అగును. వీటిని ఋతువులు అందురు. ఏ కర్మ చేయాలనుకున్నచో ఆ కర్మకి సంబంధించిన ఋతువు నందే జపము చేయవలెను . మంచి విషయములకు సదా జపము చేయవచ్చును . 

              కొన్నిక్రియలకి సంబంధించిన జప సమయములు మరియు జప పద్దతి రహస్యముగానే ఉంచవలెను . అందుకే కొన్ని రహస్యాలు తెలియచేయలేకపోతున్నాను .

--(())--

* మౌన యోగి

శ్రీరామ.

శ్లో//యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ/
సవై రాఘవ శార్దూల! ధర్మః త్వామభిరక్షతు//

(ఓ రఘువంశ శార్దూలమా!  ఏ ధర్మాన్ని నీవు ధైర్యంగానూ, నియమముతోను పాటిస్తున్నావో ఆ ధర్మం నిన్ను కాపాడుగాక), అని వనవాసానికి వెళ్తున్న రాముని, తల్లి కౌసల్యాదేవి ఆశీర్వదించింది.

నా ఆలోచనా ఛందస్సు 
ధర్మ సద్భావ మాచరిస్తె సకల శుభ శోభలు 
ధైర్య మందేను సర్వము సమకూల తపదీక్షలు
నియమ నమ్మక ముంచుము నిజమంత తెల్పుకళలు 
వినయ వివరము తెల్పుము శ్రీరామ వినువాక్కులు 

     

ధర్మము భగవంతుడు వేరుకాదు. ధర్మమును రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడము.
ధర్మాచరణమే భగవంతుని సేవ.అయితే ఎంత ధర్మమార్గంలో వున్నా ఏమనిషీ రాముడిలాగా దీర్ఘకాలము కష్టాలు భరించలేడు. నిరాశా, నిసృహలు ఆవరిస్తాయి. భగవంతుడిమీదా, నియమ,నిష్ఠల మీదా, పూజలు, మొదలైన వాటిమీద నమ్మకం పోతుంది. పాపమని తెలిసినా ఆత్మహత్యకు కూడా వెనుకాడడు.

రావణుడి చేత అపహరింప బడిన సీతాదేవి,ఆ పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చింది.  రాముడితో వియోగం వల్ల దుఃఖంతో కృశించి పోయింది.  రావణాసురుని వివాహమాడవలసినదిగా పది నెలలనుండి ఆమెకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలు ప్రతిరోజూ ఆమెను వేధిస్తున్నారు.
రావణాసురుడు, " నన్ను వివాహమాడేటందుకు నీకు ఒక సంవత్సరము గడువు ఇచ్చాను. ఆ గడువులో ఇక రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గడువు ముగిసేలోపు నన్ను వివాహమాడకపోతే,నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ మాంసాన్ని నా ప్రాత:కాల భోజనంకోసం  వంటశాలలో వండుతారు), అని బెదిరించాడు.

నా అన్న వారెవరూ దగ్గరలేరు. ఒక ప్రక్క వియోగ దుఃఖము. వేరొకప్రక్క రాక్షసులు మాటి మాటికి భయపెట్టటం. సీతాదేవి ఇక ఏమాత్రమూ దుఃఖము భరించలేని స్థితికి వచ్చింది.

శ్లో// సా ని:శ్వసన్తీ దుఃఖార్తా శోకోప హత చేతనా/
ఆర్తా వ్యసృజ దశ్రూణి మైథిలీ విలలాప చ//

(భర్తృ వియోగము చేత ఆ సీత మనస్సు వ్యాకుల మయ్యెను. రావణుడు, రాక్షస స్త్రీలు భయపెట్టుటచే, ఆమె తీవ్రమైన దుఃఖమును పొందినదై కన్నీళ్లు కారుస్తూ విలపించెను)


శ్లో// కీ దృశంతు మహాపాపం మయా జన్మా న్తరేకృతం/
ఏ నే దం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణం//

(భయంకరమూ,దారుణమూ అయిన ఈ దుఃఖం, పూర్వ జన్మలో ఏ పాపం చేసినందువల్ల నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను.)

శ్లో// అనన్యదైవత్వమియం క్షమాచ/
భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే/
పతి వ్రతాత్వం విఫలం మమేదం/
కృతం కృతఘ్నేరివ మానుషాణం//

(భర్తనే దైవముగా భావిస్తూ, సహనము వహిస్తూ,  కటిక నేలమీదే శయనిస్తూ, అన్ని పాతివ్రత్య నియమాలు పాటిస్తూ,  ఏ ప్రలోభాలకు లొంగకుండా ధర్మమార్గం లోనేఉన్నాను.
ఆ పాతివ్రత్య నియమములు, ధర్మములు,అన్నీ  కృతఘ్నునకు చేసిన ఉపకారం లాగా వ్యర్ధమైపోయినవి).

శ్లో//  శోకాభి తప్తా బహుధా విచిన్త్య/
సీతాథ వేన్యు ద్గ్రథనం గృహీత్వా/
ఉద్బధ్య వెన్యు ద్గ్రథనేన శీఘ్ర/
మహం గమిష్యామి యమస్య మూలం//

(శోకంతో బాధపడుతున్న సీతాదేవి,ఇలా అనేకవిధాలుగా ఆలోచించి, తన జడను చేతిలోకి తీసుకుని దానితోఉరి వేసుకొని మరణించాలని నిర్ణయంచు కొంటుంది).

అయితే " ధర్మో రక్షతి రక్షిత: " అన్న సూక్తి అసత్యం కాదు.
పాతివ్రత్య నియమాలు, ధర్మపాలనా, మొదలైనవి ఎప్పుడూ నిష్ఫలం కావు.
ఆవిషయం సూచిస్తూ, శింశుపా వృక్షము క్రింద నిలబడి, తన జడతో  ఉరి వేసుకోబోతున్న సీతాదేవికి అప్పటికప్పుడు శుభ శకునాలు కనబడ్డాయి. నీటిలో చేప తోక తగిలి ఎఱ్ఱటి పద్మం కంపించినట్లు,అమ్మవారి ఎఱ్ఱటి ఎడమ కన్ను అదిరింది. ఎడమ భుజము, ఎడమ ఊరువు కొద్దిగా కంపించాయి. నిలుచుని ఉన్న ఆ సీతాదేవి యొక్క వస్త్రం కొద్దిగా జారింది. ఇటువంటి శకునములు,ఇంతకు ముందు అనేక పర్యాయములు సీతాదేవి కి సత్ఫలితముల నిచ్చినవి.
ఈ శుభ శకునములు చూడగానే సీతాదేవి దుఃఖం తొలిగి పోయింది.

శ్లో// సా వీత శోకా వ్యపనీతతన్ద్రీ/
శాంత జ్వరా హర్ష విబుద్ధ సత్త్వా/
అశోభతార్యా వదనేన శుక్లే /
శీతాంశునా రాత్రి రివోదితేన//

(సీతాదేవి దుఃఖం తొలిగి పోయింది. మనో మాంద్యము,మనస్తాపం నశించినై. సంతోషంతో మనస్సు వికసించింది. ముఖం తేజోవంతం అయింది. శుక్లపక్ష చంద్రునితో రాత్రి ప్రకాశించినట్లు సీతాదేవి ప్రకాశించింది).

మరు క్షణం ఆమెకు హనుమంతుడు మెల్లగా గానం చేసిన రామ కథ వినిపించింది.
తల పైకెత్తి చూచిన ఆమెకు ఆంజనేయస్వామి దర్శనం అయింది.

శ్లో// సా తిర్యగూర్ధ్వం చ తథాప్యధస్తా/
న్నిరీక్షమాణా తమచింత్య బుద్ధిమ్/
దదర్శ పింగాధిపతేరమాత్యం/
వాతాత్మజం సూర్య మివోదయస్థం//

(సీతాదేవి అన్నిదిక్కులూ పరికించింది.తల పైకెత్తి చూచిన ఆమెకు, ఊహించ శక్యము గాని బుద్ధిబలం కలవాడు, సుగ్రీవుని మంత్రి, వాయుపుత్రుడు, ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్నవాడు అయిన హనుమంతుడు కనిపించాడు)

ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉండటం కేవలము కాకతాళీయము కాదు.
సన్మార్గంలో ఉన్నవారిని భగవంతుడు వెయ్యికళ్లతో కనిపెడుతూనే ఉంటాడు.
వారి క్షేమం కోసం ముందే ఏర్పాట్లు చేసి ఉంచుతాడు.
హనుమంతుడు సీతాదేవితో సంభాషించాడు.

 శ్రీ రాముని క్షేమం తెలియజేశాడు.
శ్రీరాముని అంగుళీయకం సీతాదేవికి ఇచ్చాడు.
సీతాదేవి దుఃఖం తొలగించాడు.
ధర్మ మార్గములో వున్నవారు ,అప్పుడప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినా వారి సత్ప్రవర్తన అనే భగవదారాధన వారికి సత్ఫలితాలను ఇస్తుంది, వృధాగా పోదు, అని ఈ ఘట్టము మనకు తెలియజేస్తున్నది.

రామాయణం లోని ఇటువంటి సన్నివేశాలు పఠించినా, స్మరించినా, కష్టాలలో ఉన్న వారికి, ధైర్యమూ, శుభమూ లభిస్తాయి అని చెప్పడము వాల్మీకి మహర్షి ఆశయం.
శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.


* హిపోక్రాట్స్ తెలుసా?

         మీకు హిపోక్రాట్స్ తెలుసా? ఆయ‌న ఇప్ప‌టి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవ‌త్స‌రానికి చెందిన వాడు. అప్ప‌ట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయ‌న్ను ఫాద‌ర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇంతకీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ.. స‌ద‌రు హిపోక్రాట్స్ అనే ఆయ‌న వాకింగ్ గురించి ఓ కొటేష‌న్ చెప్పారు. అదేమిటంటే.. వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌.. అని ఆయ‌న అన్నారు. అవును, మీరు విన్న‌ది నిజమే. ఈ క్రమంలోనే ప్ర‌తి రోజూ క‌నీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1. వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

2. నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన ప‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌.

3. నిత్యం ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌.

4. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

5. డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. 6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

6. నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది.

7. నిత్యం 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌.

8. నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.

9. బ్యాక్ పెయిన్‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

10. నిత్యం వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. క‌నుక నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

🏃🏽‍♂️🏃🏽‍♀️🏃🏽‍♂️🏃🏽‍♀️🏃🏽‍♂️🏃🏽‍♀️🏃🏽‍♂️🏃🏽‍♀️🚶🏽‍♂️🚶🏽‍♀️🚶🏽‍♂️🚶🏽‍♀️🚶🏽‍♂️🚶🏽‍♀️🚶🏽‍♂️🚶🏽‍♀️👨🏼‍🦯👩🏾‍🦯👨🏼‍🦯👩🏾‍🦯👨🏼‍🦯👩🏾‍🦯

 🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏

10. ఓం యమునా ద్వీప సంజాతాయ నమః

    యమునా నది పరమ పావనమైనది. యమునను  సూర్య పుత్రిక అని కూడా అంటారు. మరియు యమధర్మరాజు సహోదరి. ఈ నది జన్మస్థానం కాళింది పర్వత  శ్రేణిలోని యమునోత్రి.  
    పరమాత్మ అవతారమునకు స్థానమై  పవిత్రతను చేకూర్చుకున్న పావన యమునా నది మన పురాణాలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినది. ముఖ్యంగా ద్వాపర యుగంలో కృష్ణుని బాల్యమంతా ఈ నదీ మాత ఒడిలోనే  గడపటం భాగవతంలో తెలుపబడింది ఈ కలియుగంలో కూడా మహామేళాలు, కుంభమేళాలు, దైవసంబంధమైన కార్యాలెన్నో యమునా తీరాలో జరుపుకుంటున్నాము.
           పరమాత్మ పాదస్పర్శతో పునీతమైన పరమపావని యమునా నది.  యమునా నది రెండు పాయులుగా చీలటంవలన మధ్యలో ఏర్పడిన ఇసుక తిన్నెను యమునా ద్వీపం అంటారు. ఆ ద్వీపం మధ్య, పరాశరమహర్షి అనుగ్రహం వలన, సత్యవతికి సద్యో గర్భాన వేదమయులు, అఖిల మునీంద్రాద్యులు,  విజ్ఞాన సంపన్నులు, సాక్షాత్‌ పరమాత్మ స్వరూపులు అగు వేదవ్యాసులువారు అవతరించారు.
        అజ్ఞానంలో మునిగి ఉన్న సమస్త మానవాళి మేలు కోసం జ్ఞాన దీపాన్ని వెలిగించి,  మనలోని దుఃఖం తొలగించదలచి, యమునా నది ద్వీపంలో అవతరించిన వ్యాస పరమాత్మకు భక్తిశ్రద్ధలతో   ‘ఓం శ్రీ యమునా ద్వీప సంజాతాయ నమః’ అని నమస్కరించుకుందాము🙏.

🙏జై గురుదేవ్🙏
5: 🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏

 12. ఓం కృష్ణాజిన విభూషితాయ నమః

    కృష్ణాజినము అనగా జింక చర్మము. కృష్ణాజిన విభూషితుడు అంటే కృష్ణాజినమే విశేష అలంకారంగా గలవాడు అని అర్ధం.
    వ్యాసులదేవులవారు సర్వ సంగ పరిత్యాగులు. జితేంద్రియుడు, స్థిత ప్రజ్ఞుడు.  అపారమైన బ్రహ్మచర్యానికీ, గొప్ప తపః శక్తికి కృష్ణాజినం చిహ్నం. మరే అలంకారబద్ధుడు కాని ఆ తండ్రికి కృష్ణాజినమే అలంకారమయ్యింది.
      కృష్ణ జింక ప్రస్తావన పురాణ, ఇతిహాసాలో పులుమార్లు కనిపిస్తుంది. చంద్రుని వాహనమై, సత్త్వగుణానికి ప్రతీక అయ్యింది. ఎందరో మునులు, మహర్షులు కృష్ణజింకలను  తమ తమ ఆశ్రమాలలో ఉంచుకునేవారు .  సాధు స్వభావి అయిన ఈ జింక సాంగత్యం సాధకుల సత్త్వ గుణం పెరుగుతుందన్న  విశ్వాసం.
 
    వాటి  సహజ  మరణానంతరం వాటి చర్మాన్ని పవిత్రంగా భావించి ఋష్యాదులు ఆధ్యాత్మిక చర్చ, తపస్సు, సాధనాదులకు గుర్తు అయిన కృష్ణాజినాన్ని ఉపయోగించే వారు.

    ధర్మరక్షణ కోసం మహత్తరమైన విజ్ఞాన సాగరాన్ని మధించి ప్రజలకు అందించే బృహత్తరమైన లక్ష్యంతో  పరమాత్మ స్వరూపమైన వ్యాసులవారికి కృతజ్ఞతతో   ‘ఓం  కృష్ణాజిన విభూషితాయ నమః’ అని స్మరించుకుంటూ వారి పాదపద్మముకు శిరస్సు వంచి నమస్కరించుకుందాము.🙏

🙏జై గురుదేవా🙏
 🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏

11. * ఓం కృష్ణద్వైపాయనాయ నమః     
 
    కృష్ణ శబ్దానికి నల్లని వర్ణము అని అర్థం. ద్వీపమునందు అవతరించారు కనుక  ‘ద్వైపాయనుడు’  అయ్యారు.         

    పరాశర మహర్షి యమునా నదిని దాటుతున్న సమయంలో, ఆ క్షణాలలో నవగ్రహాల నడక ఒక అసాధారణమైన దైవంశసంభూతుడైన చిరంజీవి జననానికి అనుకూలంగా ఉందని తన తపోదృష్టితో పరాశరమహర్షి గ్రహించారు. అప్పుడు నావను  నడుపుతున్న మత్స్యగంధిని చూసి తన తేజస్సుని ధరించి లోకకల్యాణ కారకులైన వ్యాసుని జన్మకు అర్హురాలని  తన తపశ్శక్తితో గ్రహించి తన అభీష్టాన్ని ఆమెకు తెలిపారు.
దాని వలన తాను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి ఆమె వ్యక్త పరచిన సందేహానికి సమాధానంగా చిరంజీవికి జన్మనిచ్చాక అమె కన్యత్వానికి దోషం లేకుండా అనుగ్రహించారు.

పరాశరమహర్షి గతంలో పరమాత్మ తన కుమారుడిగా జన్మించాలని తపస్సు చేసి కోరుకున్నారు.  వ్యాసాదేవులవారి రూపంలో నారాయణడు జన్మతీసుకున్నారు. పరాశర, సత్యవతులు  నిమిత్థమాత్రులైయ్యారు.
శ్రీ వ్యాసాదేవులవారు జన్నిస్తునే  లక్షలాది సూర్యులను మించిన కాంతితో ప్రకాశిస్తున్నారు. ఆయన ముఖవర్ఛస్సు జ్ఞాన కిరణముల కాంతితో శోభిస్తోంది.
 భగవంతుని స్వరూపమైన ఆ బిడ్డ  గర్భదారణ లేకుండా సద్యోగర్భంగా పుట్టారు.పుట్టిన వెంటనే అయిదు
సంవత్సరాలు వయసు కలిగి దండ కమండలము ధరించి తపస్సు చేసుకోవడనికి వెళ్లారు. వేదమయులై సమగ్ర జ్ఞాన సంపన్నులై మానవాళిని అజ్ఞానాంధకారం నుండి బయట పడవేయటానికి జ్ఞాన జ్యోతిని వెలిగింపచేసి గురువులకు గురువై ఆదిగురువు అయినవారు.
           యమునా ద్వీపమునందు కృష్ణ వర్ణంతో  అవతరించిన వ్యాసువారు కృష్ణ ద్వైపాయన నామంతో  పివబడ్డారు. ‘కృష్ణాయ క్లేశహారిణే’ అన్నారు. దుఃఖ స్పర్శ పోగొట్టి ఆనంద స్వరూపాన్ని పరిచయం చేయటానికే ఆయన అవతరించారు.
కాబట్టి కృష్ణద్వైపాయను నామంతో కేవలం మన కోసం అవతరించి బోధస్వరూపంగా ఉండి ముక్తి మార్గం వైపుకు అడుగు వేయిస్తున్న ఆ తండ్రిని హృదయ పూర్వకమైన భక్తితో, కృతజ్ఞతాభావంతో   ‘ఓం కృష్ణ ద్వైపాయనాయ నమః’ అని నమస్కరించుకుందాము.🙏

🙏జై గురుదేవ్🙏
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏

9. ఓం శ్రీ శుక మునీంద్ర జనకాయ నమః
వ్యాసభగవానులవారు  పుత్రుని కోసమై మేరుపర్వత శిఖరంపై మహాదేవుని గూర్చి తపస్సు చేశారు. మహేశ్వరుడు ప్రత్యక్షమై పంచభూతాలవలెనే  పరిశుద్ధుడు, మహానుభావుడు అయిన శుకుని పుత్రునిగా ప్రసాదించాడు. ఆయనపుట్టగానే ఆకాశగంగ  స్త్రీ రూపంలో సాకారంగా వచ్చి మంగళస్నానం చేయించింది. ఆకాశం నుండి కృష్ణాజినము  దండము ఇచ్చి దేవతలు పుష్పవర్షం కురిపించారు. పుట్టగానే శిశువుగా లేరు ఐదుసంవత్సారాల వయసు కలిగి ఉన్నారు. పరమేశ్వరుడు  స్వయంగా  ఉపనయనం చేశారు. దేవేంద్రుడు మహోజ్వలంగా ప్రకాశించే కమండలువును ఇచ్చారు. శుకుమహర్షి యొక్కజననం మానవులు, దేవతలే కాదు, పక్షులు మృగాలతో సహా ఆనందించాయి.

శుకమహర్షి బ్రహ్మచర్య వ్రతం స్వీకరించారు. తండ్రివ్యాసదేవులవారి అనుమతి తో దేవగురువు బృహస్పతులవారిని గురువుగా స్వీకరించి  ధర్మశాస్త్రములు, వేద వేదాంగములు, రాజనీతి విషయాలు అభ్యసించారు.  అప్పటికి ఆయన  వయస్సు ఏడు సవంత్సరాలు మాత్రమే.  శుకమహార్షి    వ్యాసులవారి దగ్గర సాంఖ్య, యోగ శాస్త్రాలను అధ్యయనం చేశారు.  వ్యాసాదేవులవారు బంధనహేతువులను గురించి ఉపదేశించారు. ఈ ప్రపంచంలో దుఃఖం ఎందుకు ఉన్నదో,  ప్రజలు ఎందుకు ఇలా కష్టపడుతున్నారో, వాళ్లకు చేసే మార్గోపదేశం ఏమిటో తెలియచేసారు.
తండ్రి మాట మేరకు జనకుని వద్ద సకల మోక్షాధర్మాలు తెలుసుకున్నారు.
శుక మహర్షి,  వ్యాసాదేవులవారి నుండి అధ్యయనం చేసిన భాగవతామృతమును  శాపగ్రస్థుడై, మరణాసన్నుడై ఉన్న పరీక్షిత్తు మహారాజుకు ఏడు రోజులలో వినిపించి అతనికి మోక్షప్రాప్తి కలిగించారు.

పరమవైరాగ్యమూర్తి, శ్రీ శుక మునీంద్రుల వారి తండ్రి, మన అందరి తండ్రి అయిన వ్యాస భగవానులవారికి
ఓం శ్రీ శుక మునీంద్ర జనకాయ నమః  🙏అని నమస్కరిస్తూ ఆ తండ్రి అనుగ్రహముతో ఈ మానవ జీవితాన్ని సార్ధకం చేసుకొందాము.

🙏జై గురుదేవ్🙏

No comments:

Post a Comment