Sunday 14 June 2020

17-06-2020

ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రే నమ:

* వేదము నేర్చి
* కరోనా వ్రతకధ.
* సీస పద్యము 
*ఆనయారును ఆదరముతో కైలాసమునకు
* ఎక్కడ లేని వాఁడనెద ..
* అన్నమయ్య సంకీర్తన



గణములు-స,భ,ర త,త,గ యతి - 10    
IIU  UII  UIU  UUI  UUI  U -౧7  -౦౬-2020  
నేటి కవిత్వం - చిరునవ్వే 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చిరునవ్వే చిరుకోపమే చూపే మనస్సులో  
తిరునాళ్లే మన మధ్యపంతాలేలు తగ్గించులే  
చిరునామా మది తెల్పొచ్చే కాని సంతోషమే 
మరుమల్లే మనమధ్య కామ్యంమేను కల్పించులే 
  
కలకాలం దరహాస మేకాంతం మనోమందిరం 
చలిమాటే మనసంతసం చాతుర్య సామ్యమ్ములే 
అలుపే రాకయు రాగమే రమ్యమ్ముగా సాగెనే 
తలపేతన్మయ మాయగా తాపత్రియమ్మేనులే       

కరుణాపూరితదృష్టితో గమ్యార్ధి సంధాత్రివై 
చరితార్ధమ్మును తెల్పి యాగాలన్ని చేసెనులే   
పరిశీలమ్ముగ పాలనే పాపాల్ని తొల్గించులే  
యరవిందాసన సుందరీ యాత్మీయతా చూపెనే  
........

గురురూపమ్మున వెల్గుదో గోప్త్రీ విధానమ్మునో ! 
యరవిందాసన సుందరీ యాత్మీయ వాగీశ్వరీ 
యెఱుఁగం జాలను గాని నా హృత్పద్మ పీఠమ్ములో 
నిరతంబెంచెద భక్తితో నీదైన వాత్సల్యమున్ 
-- 
కరుణాపూరిత దృష్టితోఁ గామ్యార్థసంధాత్రివై 
మురిపెంబీయఁగ సర్వదా పొంగించి పద్యమ్ములున్ 
విరచింపంగను సన్నుతుల్ ప్రేమానురాగాలతో 
మఱి శంకేమిటికుండునే మాతా కృపాసాగరీ 
-- 
పరిపూర్ణంబగు భక్తితోఁ బ్రార్థించి నీ రూపమే 
త్వరలోఁ గూర్చెద నట్టులే ధాత్రీప్రమోదమ్ముగా 
మరువంజాలని రీతినే మాన్యంబునౌ పల్కుతోఁ 
గరముప్పొంగఁగ నీవునున్ గావించు స్తోత్రాలతో 
-- 
చిరకాలంబుగ నున్నదీ చిత్తంబులో వాంఛయున్ 
వరవీణాధరి కోసమై వ్రాయంగ నో కావ్యమే! 
గురుదత్తుండును దీవనల్ గుర్పించుచో సత్కృపన్ 
నెఱవేరంగను గష్టమే! నీ,నా మనోభీష్టముల్ ! 
-- 
మఱి యెన్నండతఁ డెంచునో మన్నించి దీవించఁగా 
నెఱుఁగంజాలను వాస్తవంబెట్లున్నదో భాగ్యమున్ 
కరముల్ మోడ్చుచు మ్రొక్కుటే గారమ్ముతో, భక్తితో 
దరిజేర్చంగను వేడుచున్ దత్తావధూతన్ సదా 





* 🔴 శ్రీమాత్రేనమః 🔴

వేదము నేర్చి దానినిక వీడక నధ్యయనంబు జేయుచున్
కాదనకుండ చట్టులకు కామ్యము కోరక నేర్ప యా
వేదమె జేయు నాతనిని విప్రునిగానిల పూజ్యుడాతడే
సాదర బుద్ధిజూప భవ సాగర తారణ నౌకయాతడే.

వేదాధ్యాయన, అధ్యాపన తత్పరులను విప్రులందరు. వీరికి వేదము జీవన మార్గము కాదు. నిత్య వేదాధ్యాయన శక్తి వలన వారికి వలసిన వన్నీ కోరకనే లభించడం జరుగుతుంది. ఇట్టి వారిని సేవించడం వలన మోక్ష ప్రాప్తి కూడ కలుగుతుంది. 


పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే, పురోగమించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడే ఆత్మ అతులిత శక్తిసంభరితమై వెలువడుతుంది.

🕉🌞🌎🌙🌟🚩


స్వామివివేకానంద-ధీరయువతకు...
మూఢవిశ్వాసాలను త్యజించండి

అనంత శక్తే మతం. అదే దైవం.

🕉🌞🌎🌙🌟🚩


కరోనా వ్రతకధ. 

   వాకిట్లో నుంచి "ఆంటీ !ఆంటీ "అన్న పిలుపుకి వాకిట్లోకి తొంగిచూసాను. మావీధిలో మూడోయింట్లో ఉండే సీతా వాళ్ళ అమ్మాయనుకుంటా ...రెండుజెళ్ళూ ,పచ్చని పట్టులంగా ,కళ్ళకు సేఫ్టీ గ్లాసులూ ,డ్రెస్ కు మాచయ్యే మాస్కూ పెట్టుకుని వచ్చింది. 

కరోనా పుణ్యమాని జనాలకి బాగా జాగ్రత్తలూ,సామాజిక దూరం అదే సోషల్ డిస్టెన్సింగూ బాగా అబ్బేయి. ఇంట్లోకి కూడా రమ్మనకుండా "ఏంటీ ?ఏంకావాలీ "అని వాకబ్ చేసాను. 

"అమ్మ ఈరోజు కళ్యాణ కరోనా గౌరి నోము నోచుకుంటోంది ఆంటీ మిమ్మల్ని తప్పకుండా వచ్చి వాయినం తీస్కోమంది. మీ టైము 11.10 ఆటైం కల్ల తప్పకుండా రమ్మంది." అంది కుంకుమ భరిణ తీస్తూ.

ఏమాత్రం సంకోచించకుండా .."ఆ గడపకు పెట్టివెళ్ళు "అన్నాను. అలాగే అంటూ గడపకు బొట్టుపెట్టి వెళ్ళిందా అమ్మాయి. వెంఠనే డిసిన్ఫెక్టెంట్ స్ప్రే తెచ్చి కొట్టాను దానిమీద. కరోనా పుణ్యమాని ప్రజల్లో మొహమాటాలూ ,అనవసర మర్యాదలూ పోయాయి. 

ఇంక ఇంట్లోకి పిలిచి  కూచోమని మర్యాదలు చేయటం ,కాఫీలు గట్రా ఇవ్వటం జనాలు మానుకుని చాలా రోజులైంది. 

ఇళ్ళల్లో కూడా పనిమనుషులని పెట్టుకోటం ఎప్పుడో మానేసారు. ఎవరి కంచాలు వాళ్ళు కడుక్కోటం ,ఎవరిబట్టలు వాళ్ళు ఉతుక్కోవటానికి  అలవాటు పడిపోయారు. 

పెళ్ళిళ్ళూ ప్రస్థానాలకు కూడా ఎవరూ వెళ్ళటం లేదు. నెట్లోనే పెళ్ళిళ్ళు  చూస్తూ తమ ఇళ్ళల్లోంచే ఆశీర్వాదాలూ ,కానుకలుగా నెట్ బాంకింగ్ ద్వారా డబ్బులూ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పెళ్ళివారూ ఆన్లైన్లో ఉప్పూ ,పప్పూ కూరగాయలూ పంపిస్తూ ఎవరిళ్ళల్లో వాళ్ళు వండుకుతినమంటున్నారు. 

ఈవిధంగా సమాజంలో గృహనిర్బంధమూ ,అంటరాని తనమూ ,సామజిక మడీ మైంటెయిన్ చేస్తూ ..జనం బతికి బట్టకడుతున్నారు. 

అందుకే పేరంటానికీ ఒక టైమింగ్ ..నా టైంకి నే వెళ్ళి వాయినం తెచ్చుకోవాలి. కాక పోతే ....ఈ నోము ఇంతవరకూ నేను చూడలేదు అందుకే సీతకు ఫోన్ చేసాను. నోము జరిగేటప్పుడే వచ్చేస్తానని. 

"సరే !మీ ముందు  స్లాటు రోహిణి గారిది. ఆవిడను మీటైం కు రమ్మంటాను. మీరు ముందు వచ్చెయ్యండి." అని చెప్పింది. అక్కడా నలుగురికంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు మరి. 

పదిన్నరకల్లా  పింక్ చీరా ,పింక్ గ్లౌసూ ,పింక్ మాస్కూ ,పింక్ గ్లాసెస్ తో రడీ అయిపోయి ,ఒక డిస్ఇంఫెక్టెంట్ స్ప్రే ,ఒక హాండ్ సానిటైజరూ ,కొన్నివెట్  , కొన్ని డ్రై టిష్యూలూ సర్దుకొని పేరంటానికి వెళ్ళాను.  

వాకిలి బైటే చెప్పులు విడిచేసి అక్కడేఉన్న సోప్ వాటర్ తో కాళ్ళు కడుక్కుని  టిష్యూ తో  తుడుచుకుని ఇంట్లోకి అడుగుపెట్టాను. దేవుడి గది కనడేలా కొంచెం దూరంగా  వేసిన కుర్చీని చూపించింది సీతకూతురు. 

మాస్కులో నవ్వినా కనపడదు గనుక తలూపి ,బాగ్ లోనించి డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే తీసి కుర్చీ అంతా జాగ్రత్తగా చల్లుకుని కూర్చున్నాను. సీత అప్పటికే పూజ మొదలెట్టేసినట్లుంది. 

నాకాళ్ళు కాస్త ముందుకు పెట్టమని ,చేతితో తాకకుండా డెట్టాల్ కలిపిన పసుపునీళ్ళు పాదాలకు స్ప్రే చేసిందా అమ్మాయి. మూరెడు  పొడుగున్న గుండ్రటి  పుల్ల ,సేవలాన్లో కలిపిన తిలకం లాంటి కుంకుమలో ముంచి లాఘవంగా దూరం నుంచే బొట్టు పెట్టింది. 

అష్టోత్తరం నడుస్తోంది ఇలా ....

ఓం కరోనా దేవ్యై నమః 
ఓం కరవ్యాపిన్యై నమః
ఓం విశ్వ వ్యాపితాయై నమః
ఓం నాసికాగ్ర ప్రవేశితాయై నమః
ఓం మనుష జాతి నిర్మూలనా దీక్షా దక్షాయై నమః
ఓం చీనీ దేశ జన్మస్థాయై నమః
ఓం ఇటలీ దేశ ప్రబలాయై నమః
ఓం సర్వాంతర్యామినే నమః
ఓం ప్రాణ హరణాయై నమః
ఓం శ్వాస కోశ భంజనాయై నమః
ఓం శీత జ్వరాయై నమః
ఓం ఔషధీ రహితాయై నమః
ఓం ప్రాణికోటి గృహబంధనాసక్తాయై నమః
ఓం సంఘ దూర కృతాయై నమః
ఓం అపరి శుభ్ర జన సంహారిణే నమః
ఓం పరిశుభ్ర జన రక్షాకర్త్యై నమః
ఓం ఉరఃపంజర భంజకాయై నమః
ఓం జన హృదయ భయవిహ్వల కర్త్యై నమః....

ఈ విధంగా నామాలు సాగాక ...అవసర నైవేద్యం పెట్టి అందరి అక్షతలూ తనచేతిలోనే పట్టుకొని ఈవిధం గా కధ చదవసాగింది. 

"పూర్వం..నైమిశారణ్యం లో సూతమహాముని శౌనకాదిమునులకు ఈ విధంగా  చెప్పదొడగెను.......

ఒకప్పుడు చీనీ దేశమున నొక మహమ్మారి పుట్టెను.అది మిక్కిలి భయానకంబై అదృశ్యరూపమున జనులను చంపసాగెను. అంతట 'లీ 'యనునొక మహా మేధావి యగు వైద్యశిఖామణి ఇది యొక కంటికి కనబడని సూక్ష్మ జీవియని గుర్తించి ,దాని నిర్మూలము చేయకున్నా జగత్తు నశించునని చెప్పగా జనులు నమ్మకుండిరి. 

కొందరికి  వైద్యము చేయుచూ అతడూ దానిపాలబడి మరణించిన పిమ్మట అందరూ గుర్తించి తగు జాగ్రత్తలో నుండిరి. కోవిడను క్రిమియే జన్మాంతరమున కరోనాగా అవతరించెనని తెలిసికొనిరి. ఈలోగా వేలకొలదీ జనులు అశువులు బాశిరి. 

ఆతరువాత సబ్బులూ ,అనేక క్రిమి సంహారక మందులు వాడుచూ ,సంఘ దూరులై విపరీతమైన పరిశుభ్రతను పాటించుచూ ..కరములను పదేపదే కడుగుకొనుచూ ,నమస్కారాది నియమనిష్ఠలు పాటించుచూ కొంత తేరుకొని జనులు ప్రాణభయవిహ్వలులై జీవించుచుండిరి. 

ప్రజల ప్రాయశ్చిత్త మింకనూ తీరకున్న కారణమున దీని వినాశనమింకయూ జరుగలేదు. దీని దృష్టి తమ గృహముపై పడరాదనుకున్నవారు శ్రద్ధగా ఈ వ్రతమాచరించి ,పదకొండుమంది ముత్తైదులకు పదకొండు వాయినములు ఇవ్వవలెను. 

వాయినములో తప్పనిసరిగా 
చేతి శుభ్రోదకము 
శుభ్రతౌషధము 
శుభ్ర కాగితములు 
స్వేత చూర్ణము 
ప్రక్షాళనా సబ్బు (ఎంతట్రై చేసినా దీనికి సంస్కృత పదం దొరకలేదబ్బా )

ఇవి తప్పనిసరిగా వాయనం ఈయ వలెను. ఈవ్రతము చేసి వాయనము ఇచ్చిన వారింటనూ తీసుకున్న వారింటనూ కరోనా మహమ్మారి అడుగు పెట్టదనిన్నీ ,వారిల్లు ఇదివరకు మాదిరే బందుమిత్రులతో నిత్య కల్యాణమూ పచ్చతోరణముగా నుండునని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పెను. "

ఇలా వ్రతకధ కధ చెప్పి ,మా పేర్లు కూడా చెప్పి కరోనా పటానికి అక్షింతలేసి నైవేద్యం పెట్టి హారతిచ్చింది. 

"కరోనాదేవీ ..కరుణించవమ్మా 
కటాక్షముంచీ ...కదలీరాకమ్మా 
కరములూ పలుమార్లు ...కడిగేము తల్లీ 
కన్నబిడ్డలనూ ..కాపాడవమ్మా "

ఇలాంటి హారతి పాట శ్రద్ధగాపాడింది 

తరువాత పళ్ళెంలో పండూ తాంబూలమూ ,పసుపూ కుంకుమా ,జాకెట్టు ముక్కా ,బెల్లం ,పచ్చిశనగపప్పూ ,ఇంకా హాండ్  వాషూ ,శానిటైజరూ ,కొన్ని టిష్యూ పేపర్లూ ,సోపూ ,బ్లీచింగ్ పౌడరు పాకెట్టూ అన్నీ పెట్టి పైనించి శీల్ చేసి ఇచ్చింది. 

చెరో పక్క టిష్యూ పేపర్ తో పట్టుకుని ...
కరోనావై ...ప్రతిగృణ్‌హాతు 
కరోనావై ...దదానిచ అనీ ,

"ఇస్తినమ్మవాయినం ..."అని తనంటే 
"పుచ్చుకొంటినమ్మ వాయినం ..".అని నేనన్నాను. ఇలా మూడుసార్లు అన్నాక ...
"ముమ్మాటికిస్తి  మూసివాయినం నా వాయినం అందుకొన్నదెవరు ????"అని సీత అంటే 
"నేనే కరోనా గౌరిని ..."అనినేనన్నాను. 
"కోరితిని ఫలము అనితనంటే "..."ఇస్తిని ఫలము "అన్నాను ...తను కంగారుగా ..."అలా అనకూడదక్కా ....మీయింటికి రాను అని చెప్పాలి "అంది. "అలాగే మీయింటికి రాను ... "
అని వాయినం పుచ్చుకొని ఇంటికొచ్చాను. 

వాకిట్లోకి రాగానే వాయినం మ్మీద మళ్ళీ డిస్ఇంఫెక్టెంట్ స్ప్రేచేసి అమ్మా !కరోనాతల్లీ !చల్లగా కాపాడమ్మా !అంటూ ఇంట్లో కొచ్చా.

ఇంకొకావిడ పాడిన పాట నాకు భలే నచ్చింది. అదే కూనిరాగం తీసుకుంటున్నా ...

"మాయింటికి రాకు ,మా బజారుకి రాకు ,మావూరికి రాకు ,మాదేశానికేరాకు ...రాకూ ....రాకూ ...రాకూ ....రాకూ ..."

"మిట్టమధ్యాహ్నం తిని పడుకోని ఏమిటా కలవరింతలూ ..."అని శ్రీవారు తట్టి లేపగానే ...అయోమయంగా లేచి కూచున్నాక కాసేపటికి గానీ అర్ధం కాలేదు ఇది కల అనీ ....

వెంఠనే మిత్రులతో పంచుకోవాలని ఇలా రాసేసా ...సరదాగా నవ్వుకోండేం. 😆😆😆😆😆😆😆
పద్మజ కుందుర్తి.

--(())--
                                  
సీస పద్యము 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

మాయ మాటలను చెప్పకమనో  వేదము
తెల్పిన విశ్వాన్కి నేత   కృష్ణ 
ప్రేమమ్ము పంచియు రసలీల చూపియు 
తన్మాయ పంచేటి యుక్తి దేవ
కాలమ్ము స్వాధీన పరిచియు ధర్మాన్ని 
తెలిపే టి సత్య వాది
ఆనంద ముప్పొంగ సౌఖ్యమ్ము కల్పించు 
ఆరాధ్య దైవమ్ము నీవె కృష్ణ 

మనసు మారక ముందునె నేను నిన్ను 
తలచి గోపాల గోకుల నంద మారు
పలకు చెప్పక మోహన కృష్ణ మేలు 
కొలుపు గాపూజ చేసితి మహా-నిష్ఠా 
--(()) - -

ఆనయ నాయనారు
తమిళనాడులో తిరుచినాపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రములలో తిరుమంగళము ఒకటి. ఇక్కడ ఆలయంలో కొలువైయున్న ఈశ్వరుని పేరు - సామవేదేశ్వరుడు, ఆమ్మవారి పేరు - లోకనాయకి. ఈశ్వరుడు పరుశురాముడిని మాతృహత్యా పాతకము నుండి విముక్తి కలిగించినది ఈ ప్రదేశములోనే. అంతేగాక, ఆ భార్గవ-రాముడికి పరశువును (గండ్ర గొడ్డలిని) ప్రసాదించి, పరుశు-రాముడిగా జేసినదికూడా ఈ సామవేదేశ్వరుడే.
అట్టి మహిమాన్వితమైన గ్రామములో ఆనయారు అని పిలవబడే ఒక పశువుల కాపరి ఉండేవాడు. "ఆనయారు" అంటే "గోసంరక్షకుడు" అని అర్ధం. ఆయన శివభక్తాగ్రేశ్వరుడు. ఎలప్పుడూ విభూతిని ధరించేవాడు. శివభక్తుల కులము, మతము మున్నగునవేమీ పట్టించుకొనక, వారిని బహుప్రీతిగా సేవించేవాడు. వేణుగానంలో పంచాక్షరీ మంత్రమును మిళితం చేసి వాయిస్తూ, పరమశివుని మీద తనకుగల భక్తిని వ్యక్తపరుచుకునేవాడు. ఈ విధమైన పంచాక్షరీ మంత్రధ్యాన సాధనద్వారా పరమేశ్వరుని పొందాలన్నది అతని ధ్యేయము.
ఒక రోజున ఆనయారు ఒక తంగేడు వృక్షము క్రింద కూర్చుని, పరవశముతో పంచాక్షరీ మంత్రాన్ని వేణువు మీద పాడుతున్నాడు. ఆ గానము వీనులవిందుగా సాగింది. ఆవులు, దూడలు చెవులు నిక్కరించుకొని వినడానికి మూగాయి. చెట్లమీద పక్షులు ఆ నాదంలో మునిగిపోయి, ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి. నెమళ్లు పురివిప్పి గమకంగా నృత్యము చేసాయి. లేళ్లు, సర్పములు, సింహములు, ఏనుగులు, పులులు ఆ పంచాక్షరీ గానమునకు మంత్రముగ్ధులై ఆ వేణుగానాన్ని ఆలకిస్తూ నిలిచిపోయాయి. తక్కిన జంతువులన్నీకూడా అవి ఉన్నచోటనే అలానే తన్మయత్వంతో నిలిచిపోయాయి. నదుల ప్రవాహములుకూడా కదలకుండా ఉండిపోయాయి. సముద్ర తరంగాలు ఆ గానమును వినడానికై మంద గమనమును పొందాయి. ఆ గానామృతాన్ని గ్రోలడానికి దివ్యలోకములనుండి విద్యాధరులు, కిన్నెరలు, దేవతలు మొదలగు వారందరు తమ తమ వాహనములలో భూమిపైకి దిగివచ్చారు.
సమస్త ప్రకృతిని తన్మయత్వంలో ముచెత్తిన ఆనయారు భక్తిరస గాన ప్రవాహము - సామవేదేశ్వరుడయిన పరమశివుని కూడా పరమానందంలో ఓలలాడించింది. ఈశ్వరుని హృదయం ఆనయారు భక్తి తత్పరతలో కరిగిపోయింది. అంతట పార్వతీ పరమేశ్వరులు ఇరువురు ఆనయారు ఎదుట ప్రత్యక్షమయి, ఆశీర్వదించి, ఆనయారును ఆదరముతో కైలాసమునకు తీసుకొని వెళ్లారు.
****
​(సేకరణ నయనార్ల పరమ పావన గాధలు నుండి )



* ఎక్కడ లేని వాఁడనెద ..
=======================

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

రేకు: 21-6
సంపుటము: 1-130.


పరమాత్ముని నోరఁబాడుచును యిరు-
దరులు గూడఁగఁ దోసి దంచీ మాయ !!


కొలఁది బ్రహ్మాండపు కుందెనలోన
కులికి జీవులను కొలుచు నించి
కలికి దుర్మోహపు రోఁకలివేసి
తలంచి తనువులను దంచీ మాయ !!


తొంగలి రెప్పలు రాత్రులుఁ బగలును
సంగడి కనుఁగవ సరిఁ దిప్పుచు
చెంగలించి వెసఁ జేతులు విసరుచు
దంగుడు బియ్యముగా దంచీ మాయ !!


అనయముఁ దిరు వేంకటాధీశ్వరుని
పనుపడి తనలోఁ బాడుచును
వొనరి విన్నాణి జీవులనెడి బియ్యము
తనర నాతనికియ్య దంచీ మాయ!!


🕉🌞🌎🌙🌟🚩


శ్రీగురుభ్యోనమః 🙏

జీవుడు దైవస్మరణతో లోకజీవితము నిర్వహించుచునే తరింపవచ్చును. కర్మబంధములు తొలగిపోవును. కర్మబంధమనగా మనము చేసిన కర్మ యొక్క ప్రభావము మనసుపై, ఇంద్రియములపై ఉండి, బాధపడుతూ తరువాత చేయు కర్మలకు కారణమగుట. 

దైవస్మరణ చేసుకుంటూ, మనము మంచి వాళ్ళమే అంటూ వెడుతూ ఉన్నా కష్టాలు వస్తుంటాయి. మన పాతకధ తెలియక పోవడంవలన మనము మంచివాళ్ళమని అనుకుంటూ ఉంటాము. 

దైవస్మరణ చేసేవాళ్ళు అనుభవించేస్తూ ముందుకి వెళ్లిపోదాము అనుకుంటారు. దాటేయడానికి కుదరదు. కర్మపలము అనుభవించడం  అనేది తేలికగా జరిగిపోతుంది. ఆ time లో దైవము మనకేమిచేశాడు అని ఎదురు తిరిగితే బరువు ఎక్కుతుంది.


🌻. భాగవతము🌻

.......  

No comments:

Post a Comment