Sunday 28 June 2020




: సర్వ — సమస్తమైన; కర్మాణి — కర్మలు; మనసా — మనస్సు చే; సన్న్యస్య — త్యజించి; అస్తే — ఉండును; సుఖం — సుఖముగా; వశీ — ఆత్మ నిగ్రహం కలవారు; నవ-ద్వారే — తొమ్మిది మనసా 
ద్వారములు కల; పురే — నగరములో; దేహీ — దేహములొఉన్న జీవాత్మ; న — కాదు; ఏవ — నిజముగా; కుర్వన్ — చేయునది; న — కాదు; కారయన్ — కారణము కాదు.

ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదని, దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు.

భావం:
నవ రంధ్రాలు గల శరీరమును, తొమ్మిది ద్వారాలు గల పట్టణంతో పోల్చుతున్నాడు శ్రీ కృష్ణుడు. జీవాత్మ ఆ పట్టణానికి రాజు, దాని పరిపాలన అంతా అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు మరియు జీవ-శక్తి అనే మంత్రిత్వ శాఖల ద్వారా నడిపింపబడుతాయి. కాలము, మృత్యు రూపంలో, శరీరాన్ని తీసివేసే వరకే, ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ, పాలన కొనసాగుతున్నప్పుడు కూడా, జ్ఞానోదయమయిన యోగులు తమను తాము శరీరంగా భావించరు, అంతేకాక, తమను తాము ఈ శరీరానికి అధిపతులము అనుకోరు. సరికదా, శరీరమును, దానిచే చేయబడిన అన్ని క్రియలను భగవంతునికే చెందినవని భావిస్తారు. అన్ని కర్మలను మానసికంగా త్యజించి, ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు సంతోషంగా ఈ శరీరంలో స్థితులై ఉంటారు. దీనినే, 'సాక్షీ భావము' అంటారు, అంటే, తన చుట్టూ జరిగే అన్ని విషయములకు ఆసక్తిరహిత పరిశీలకుడిగా (సాక్షిగా) నిలిచిపోవటం. ఈ శ్లోకంలో ఉన్న ఉపమానము, శ్వేతాశ్వతర ఉపనిషత్తు లో కూడా పేర్కొనబడినది:

నవద్వారే పురే దేహీ హంసో లీలాయతే బహి:
వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ (3.18)

"శరీరము తొమ్మిది ద్వారాలను కలిగి ఉంటుంది - రెండు చెవులు, ఒక నోరు, రెండు నాసికారంధ్రాలు, రెండు కళ్ళు, అపానము, జననేంద్రియము. భౌతిక దృక్పథంలో, ఈ దేహంలో ఉండే జీవాత్మ తనను తాను ఈ నవ ద్వార పట్టణం తో అనుసంధానం చేసుకుంటుంది. (తను శరీరమే అనుకుంటుంది). లోకంలోని సమస్త భూతములను నియంత్రించే పరమేశ్వరుడు కూడా, ఈ దేహములో స్థితమై ఉంటాడు. ఎప్పుడైతే జీవాత్మ, భగవంతునితో అనుసంధానం అవుతుందో, ఈ శరీరంలో వసిస్తున్నా, అది ఆయన లాగే స్వేచ్చను పొందుతుంది."

ఈ క్రితం శ్లోకంలో జీవాత్మ దేనికీ కూడా కర్త కాదు, కారణం కాదు అని ప్రకటించాడు, శ్రీ కృష్ణుడు. మరైతే, ఈ లోకంలో అన్ని కర్మలకు భగవంతుడే కారణమా?
కాదు ఇదంతా ప్రకృతి నియమం ప్రకారం జరుగుతుంది. ఎవరైతే ప్రకృతి మాయలో ఉంటారో వారు భద్దులు అవుతారు.

🕉🌞🌎🌙🌟🚩

ఇతరులు ఏమి తలచినా, ఏమి చేసినా సరే నీవు మాత్రం నీ పావనత్వాన్ని, నైతిక వర్తనను భగవద్భక్తి స్థాయిని దిగజార్చకు.

ప్రజలు మనల్ని మంచి వారంటారు. చెడ్డవారంటారు. కాని ఆదర్శాన్ని ముందుంచుకొని సింహాలలాగా మనం పనిచెయ్యాలి.

*  శ్రీరమణీయం -(571)
🕉🌞🌎🌙🌟🚩

"గుణాలు లేని మనసు ఎలా ఉంటుంది ?"

మనం ఏదైనా పదార్ధాన్ని రుచిచూసి అందులో ఏది ఎక్కువ అయ్యిందో, ఏది తక్కువ అయ్యిందో చెప్పాలంటే దాని అసలు రుచిఏదో ముందు మనకి తెలిసివుండాలి. మన మనసు విషయంలో కూడా మనం ఆశక్తిని సంపాదించాలి. మనసుకు వచ్చే అనేక గుణాలు తెలుస్తుంటాయి. కానీ దాని అసలు రూపం మనకు తెలియడంలేదు. మనసు స్వరూపాన్ని కనుక్కోవటం కోసమే 'నేను ఎవరు ?' అనే విషయాన్ని తెలిపే ఆత్మసాధన. ఇప్పుడు కూడా మన ఉనికి మనకి తెలుస్తుంది. ప్రపంచంలోని అనేక విషయాలలో మమేకమైన ఉనికి మాత్రమే తెలుస్తుంది. విషయాలతో ఉన్నప్పుడు కోపం, భయం, దుఃఖం, సంతోషం వంటి అనేక గుణాలతో ఉంటాం. మన మనసును మనం గమనించటం అలవాటైతే ప్రతి క్రియలోనూ మనసును ఆవరించే గుణాలు తెలుస్తాయి. అప్పుడు గుణాలులేని నేను ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
అంతరంగం గమనించటమే అంతర్వీక్షణం !'- (అధ్యాయం -70)
)
🕉🌞🌎🌙🌟🚩

2వ అధ్యాయము

ఆశ్రితాలైనవి ఏవీ సత్యం కాదు !

నేనేదో జ్ఞానాన్ని పొందానన్న భావనకూడా మిథ్యే. వీటన్నింటికీ అతీతుడూ, కర్మత్వం లేనివాడూ కనుకనే ఆయన పరమశివుడయ్యాడు. ఆయన మాత్రమే ఈ విషయాలను చెప్పగలిగాడు. మనం ఏది చెప్పాలన్నా, ఏది చేయాలన్నా ఈ మనోదేహాల ఉపాధితోనే చెప్పాలి, చేయాలి. నిద్ర, ధ్యానం, మాటలు, ఆలోచనలు అన్నీ ఈ ఉపాధిని ఆశ్రయించుకునే ఉన్నాయి. ఆశ్రితాలైనవి ఏవీ సత్యం కాదు. మన జీవనమే కాదు, సాధన, యోగ, ధ్యానం, చివరికి నిద్రా స్థితి కూడా మన ఉపాధిపైనే ఆధారపడ్డాయి. క్షణకాలం మనసు ఖాళీ అయితే ఇది అర్ధమవుతుంది !


🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment