Monday 24 May 2021

మదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు :-
96...
పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం .

ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు .

1.పాగేలమ్మ
2.ముత్యాలమ్మ
3 .గంగమ్మ
4.గంగానమ్మ
5.బంగారమ్మ
6.గొంతెమ్మ
7.సత్తెమ్మ
8.తాళమ్మ
9.చింతాలమ్మ
10.చిత్తారమ్మ
11.పోలేరమ్మ
12.మావుళ్లమ్మ
13.మారెమ్మ
14.బంగారు బాపనమ్మ
15.పుట్టానమ్మ
16.దాక్షాయణమ్మ
17.పేరంటాలమ్మ
18.రావులమ్మ
19.గండిపోచమ్మ
20.మేగదారమ్మ
21.ఈరినమ్మ
22.దుర్గమ్మ
23.మొదుగులమ్మ
24.నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )
25.మరిడమ్మ
26.నేరెళ్లమ్మ
27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )
28.మాచరమ్మోరు
29.మద్ది ఆనాపా అమ్మోరు
30.సొమాలమ్మ
31.పెద్దయింట్లమ్మ
32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )
33 .అంబికాలమ్మ
34.ధనమ్మ
35.మాలక్షమ్మ
36.ఇటకాలమ్మ
37.దానాలమ్మ
38.రాట్నాలమ్మ
39.తలుపులమ్మ
40.పెన్నేరమ్మ
41.వెంకాయమ్మ
42.గుణాళమ్మ
43.ఎల్లమ్మ (విశాఖపట్నం )
44.పెద్దమ్మ
45.మాంటాలమ్మ
46.గంటాలమ్మ
47.సుంకులమ్మ
48.జంబులమ్మ
49.పెరంటాలమ్మ
50.కంటికలమ్మ
51.వణువులమ్మ
52.సుబ్బాలమ్మ
53.అక్కమ్మ
54.గనిగమ్మ
55.ధారాలమ్మ
56.మహాలక్షమ్మ
57.లంకాలమ్మ
58.దోసాలమ్మ
59.పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )
60.అంకాళమ్మ .
61.జోగులమ్మ
62.పైడితల్లమ్మ
63.చెంగాళమ్మ
64.రావులమ్మ
65.బూరుగులమ్మ
66.కనకమహాలక్ష్మి (విశాఖపట్నం )
67.పోలమ్మ
68.కొండాలమ్మ
69.వెర్నిమ్మ
70.దే శిమ్మ
71.గరవాలమ్మా
72.గరగలమ్మ
73.దానెమ్మ
74.మహాంకాళమ్మ
75.వేరులమ్మ
76.మరిడమ్మ
77.ముళ్ళ మాంబిక
78.యలారమ్మ
79.వల్లూరమ్మ
80.నాగులమ్మ
81.వేగులమ్మ
82.ముడియలమ్మ
83.రేణుకమ్మ
84.నంగాలమ్మ
85.చాగాలమ్మ
86.నాంచారమ్మ
87.సమ్మక్క
88.సారలమ్మ
89.మజ్జిగౌరమ్మ
90.కన్నమ్మ -పేరంటాలమ్మ
91.రంగమ్మ -పేరంటాలమ్మ
92.వెంగమ్మ -పేరంటాలమ్మ
93.తిరుపతమ్మ
94.రెడ్డమ్మ
95.పగడాలమ్మ
96.మురుగులమ్మ (బండారులంక ,తూర్పుగోదావరిజిల్లా )
97.కుంచమ్మ విశాఖపట్నంలో
98.ఎరకమ్మ
99.ఊర్లమ్మతల్లి
100.మరిడమ్మ
101.సుంకాలమ్మవ్వ ఉన్నారు .

🕉️నుసకపల్లి ,పామర్రమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు .

1.నుసకపల్లమ్మ
2.వెలగలమ్మ
3 .ఊర్లమ్మతల్లి (గణపవరం ,కర్లపాలెం మండలం ,గుంటూరుజిల్లా )
4.పైళ్లమ్మతల్లి
5.బల్లమ్మతల్లి
6.లొల్లాలమ్మతల్లి
7.ఊడలమ్మ తల్లి
8.కట్వాలాంబిక
9.నాగాలమ్మ నాంచారమ్మతల్లి
10.సింగమ్మతల్లి
11.ఘట్టమ్మతల్లి
12.అంజారమ్మతల్లి .
13. మంత్రాలమ్మ తల్లి
14.పాతపాటేశ్వరి తల్లి
15.కుంకుళమ్మ ద్వారకా తిరుమల
16.చౌడమ్మ నందవరం కర్నూల్ జిల్లా

అలాగే ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది .

💐అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు వందనాలు,💐

🕉️మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ?,🕉️

మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

🕉️గ్రామదేవతా వ్యవస్థ:

గ్రామాలలో వెలిసే దేవత...దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు.

సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.

ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు,
ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే
కుదరకపోవచ్చు.

ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము
సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో
అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు
ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే
తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.

ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త,
ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.

ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు
అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో
అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా
నియమించారు పూర్వీకులు.

అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.

దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది
కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము
సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి
గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-

భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.

అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన
ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారాఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.

🕉️గ్రామదేవతల ఆవిర్భావము:

పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.

అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు
గ్రామదేవతలను ఏర్పాటు చేసారు
తొలి దశలో.

🕉️పృధ్వీ దేవత:
మొదటిది పృధ్వీ అంటే నేల,ఇది పంటకి ఆధారము,
కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన
పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.

గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము
కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.

జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.

మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా
మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.

పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని
చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి
కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.

ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో
జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.

🕉️జల దేవత:
రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది.గుడి ఎత్తుగా కట్టినా
తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.

🕉️అగ్ని దేవత:
మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ,రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. ( చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబల్లు వాయిస్తారు అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తోంది, ఎప్పుడూ అదే కొనసాగుతోందా తెలియదు).

సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.

ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).

🕉️వాయు దేవత:
నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి.
కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.

🕉️ఆకాశ దేవత:
ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను
ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,గాలివాన. ఇలాంటి వాటి నుండి
రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.

🕉️గ్రామదేవతా నామ విశేషాలు:

మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత
పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది

సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల
రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో
వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.

ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.

ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి
'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.
ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు
రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.

ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే
ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల
(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=
కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.

స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో (స్వచ్ఛమని)సు+అచ్చ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.

సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.
'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో
ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే
క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది.

ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా 'తలుపులమ్మ'గా మారింది.ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి
లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.

శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో
అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా
అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.

పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ.
ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.
తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత
పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా
వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.

పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.
అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో
పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ'
అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=
సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.

గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా
ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ.

అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ.
ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది
కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.

ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే
చోటవున్న తల్లి అర్పణ+అమ్మ =అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.

బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు
బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ=అప్పలమ్మ అన్నారు.

అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది
బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ
అయినది పెంటి (బాల)+అమ్మ=పెంటమ్మ.

భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో
బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ=
బోనాలమ్మ.

అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి
ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల
పిలుస్తారు.

లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది
కాబట్టి గుర్రాల+అమ్మ=గుర్రాలమ్మ అయినది.

ఊరు పేరుని బట్టి పీల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోల+అంబ='సోమపోలమాంబ'
అన్నారు.సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట..!!

పేర్లు ఏవైతేనేమి,
ఆ తల్లి ఎప్పుడూ
మనకు తోడుగా,
అండగా నిలిచి
మనందరినీ
కంటికి రెప్పలా
కాపాడుతుంది...


శ్రీ మాత్రే నమః


*హృదయ పరివర్తనం.*
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు అందుకోసాగాడు. కొన్నాళ్లకు ధర్మరాజు తీర్థయాత్ర చేయాలని భావించాడు.
సోదరులను, సామంత రాజులకు తన మనోభీష్టాన్ని తెలిపాడు. వారిలో కొందరు ధర్మరాజుతో కలిసి యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి..
‘కృష్ణా! నేను, మరికొంత మంది తీర్థయాత్రలకు వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో వస్తే అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు’ అన్నాడు. యాత్రలు చేసే సమయం తనకు లేదన్నాడు కృష్ణుడు. ధర్మరాజు పట్టు వీడలేదు. అప్పుడు కృష్ణుడు.. ధర్మజుడికి ఒక సొరకాయను ఇచ్చి..
‘ధర్మరాజా! పనుల ఒత్తిడి వల్ల నీతో పాటు యాత్రలకు రాలేకపోతున్నాను. నా ప్రతినిధిగా ఈ సొరకాయను నీ వెంబడి తీసుకుని వెళ్లు’ అని చెప్పాడు.
కృష్ణుడి ఆదేశం ప్రకారం ధర్మరాజు.. సొరకాయను నెత్తిన పెట్టుకుని యాత్రలకు వెళ్లాడు.
మూడు నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకుని తిరిగి హస్తినకు చేరుకున్నాడు. మర్నాడు అన్న సమారాధన చేయాలని భావించాడు. శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి.. ‘కృష్ణా! మా యాత్ర విజయవంతంగా పూర్తయింది. నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్థాల్లో ముంచాను. రేపు అన్న సమారాధన ఉంది. నీవు తప్పకుండా రావాల’ని కోరాడు.
అప్పుడు కృష్ణుడు.. ‘ధర్మరాజా! అన్న సమారాధనలో ఈ సొరకాయను వండి అందరికీ ప్రసాదంగా పంచండి’ అన్నాడు. అలాగే చేశాడు ధర్మరాజు. సొరకాయతో వండిన పదార్థం తిన్నవారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు.
‘రాజా! చేదుగా ఉన్న సొరకాయతో ఎందుకు వంట చేయించారు’ అని ప్రశ్నించారు. కలత చెందిన ధర్మరాజు సమారాధనకు వచ్చిన కృష్ణుడితో... ‘స్వామీ! మీరిచ్చిన సొరకాయ చేదుగా ఉన్నది’ అన్నాడు. కృష్ణుడు నవ్వి..
‘ధర్మరాజా! ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు. నీతో పాటు ఎన్నో తీర్థాల్లో మునక వేసింది కదా..! దాని చేదుదనం పోయిందేమో అనుకున్నాను. ఇంకా అలాగే ఉన్నట్లుందే?’ అన్నాడు. ధర్మరాజుకు విషయం అర్థమై.. కృష్ణుడికి దండప్రణామాలు చేశాడు.
*వేలమంది నిత్యం తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. జపతపాలు చేస్తున్నారు. కానీ, మనసులో గూడు కట్టుకుని ఉన్న అసుర గుణాలు, పాప సంస్కారాల గురించి చింతించడం లేదు.*
🌷_హృదయ పరివర్తనం లేని యాత్రలు ఎన్ని చేసినా, తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా ఫలితం ఉండదు._🌷
🙏🌸🙏🌸🙏🌸🙏🌸
నేటి పుణ్యక్షేత్రం

97..... * హాటకేశ్వరం
శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార.

ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది.

చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది.

శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.
పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది.

ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.

అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు.

చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.

శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు.

ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది. అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు.

ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం.

ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు.

మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈవిధంగా నరసింహ స్వామీ దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ.

అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి.

ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.
శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

--(())--

98.... మోపిదేవి

మోపిదేవి లోని... వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం దక్షిణ భారతదేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వరక్షేత్రంగా విరాజిల్లుతోంది.

స్థల పురాణం

స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.

అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలోకి చొచ్చుకొనిపోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపోయాయి.ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షికి , విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలుపడదని తెలిసి కూడ లోకశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమరకార్యానికి అంగీకరించాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.

పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.

“వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్” 

అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది,.

ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి, ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తి కే సుబ్రమణ్యమనెడి పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు. కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరించారు అగస్య్తమహర్షి. “సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు. వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయంలో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.

“ కుమారా! ఏల నవ్వుచున్నావు ? వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగవలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ” అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, “ .... అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.

కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామికలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమై పోగా మిగిలిన నంది,గుర్రము ఈనాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.

ఆలయప్రత్యేకత.:----- 

స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగు తుంది. ఆలయప్రదక్షిణమార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.

ఇక్కడ స్వామివారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవ గా భక్తులు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.

స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు.

దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి . దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలనే మా ప్రయత్నం.

--(())--


 99..* శ్రీకాళహస్తి*'

* త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం


* కోనసీమ_రుద్రులగురించి

పుణ్య క్షేత్రాలు --- శ్రీకాళహస్తి*'.... 1


*‘ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి*' 

ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ 
అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. 

కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఇటీవల ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. 
ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. 

*ఆ విశేషాలివీ…* 

శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువంతటి గొప్పక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి. అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది. అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు. ఇక్కడ ఆలయ శిఖరం దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్లే. భక్తుడికి అగ్రతాంబులం వేసిన క్షేత్రం కూడా ఇదే. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్తకన్నప్పకు మొదటి పూజ చేస్తారు. దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్యదిశలో ప్రదక్షిణం చేసి స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు. 

శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహు-కేతువులు శాంతిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి… మొదట పాతాళ వినాయకస్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది. నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి శివుని దర్శించుకున్నాక శిఖరదర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసింది. అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్ఠువ్యాధి నయమైంది. పాతాళ గణపతి ఆలయం వద్ద నాలుగు పర్యాయాలు విఘ్నేశ్వరస్వామిని తలచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది. 

శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వ రుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. ఇలా ధరించడంతో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శ్రీకాళహస్తిలో కొలువైఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి తల ఓ వైపువాల్చి ఉంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. మృత్యువును జయించిన గురుదక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాది ముఖాన ఉన్నాడు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఒక క్షణం కళ్లు మూసుకుని ఆయనను స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్నారులకు గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం. ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం. శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్లే.

-(())--

100....త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం –త్రిపురాంతకం

ప్రాచీన మంత్రం ,చైతన్య విద్యలకు  ప్రతీక,ఓషధీ మూలికల స్తావరం , భ్రమరాంబా మల్లికార్జుల  నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది .శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాదాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణం లో శ్రీశైలఖండం  లో ‘’త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం ‘’  అని చెప్ప బడిన అతి ప్రాచీన క్షేత్రం .మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరం లో ,గుంటూరు –కర్నూలు మార్గం లో రహదారికి  రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్నది .

త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు ,సిద్ధులు తాన్త్రికులకు ఆవాస భూమి .అనేక దివ్యమైన ఔషధాలు నిలయం .రస రత్నాకర ,నాగార్జున సిద్ధ తంత్రం మొదలైన గ్రంధాలు దీని ప్రాభవాన్ని తెలియ జేశాయి .స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయి . ఈ దైవ  దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం ..త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం  అని పార్వతీదేవికి స్వయం గా ఆ పరమ శివుడే చెప్పాడు .త్రిపురాంతక లింగాన్ని ‘’తత్పురుష లింగం ‘’అంటారు

స్థల పురాణం –త్రిపురాసుర సంహారం

తారాకాసురుడు పూర్వం దేవ, ఋషులను బాధిస్తుంటే శివ కుమారుడైన కుమారస్వామి తారాసురుని మెడలోని ప్రాణ లింగాన్ని చేదించి వాడిని సంహరించాడు .ఈ యుద్ధం లో అలసిన శరవణ భవుడు ‘’ఆదిశైలం’’ అనే పేరున్న ఈ పర్వతం పై విహరించటం వలన’’ కుమార గిరి ‘’ అనే పేరొచ్చింది .తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు ,విద్యున్మాలి ,కమలాక్షుడు .వీరినే త్రిపురాసురులు అంటారు .తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు  శుక్రాచార్య అనుజ్న తోబ్రహ్మ కోసం  ఘోర తపస్సు చేశారు .ఆయన ప్రత్యక్షం కాలేదు .పంతం పెరిగి  ఒంటికాలి  మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి .బ్రహ్మ ప్రత్యశమై వరం కోరుకోమన్నాదు .ఎవరి చేతిలోనూ చావు కలాగ కూడదని వరం కోరుకొన్నారు .పుట్టిన వాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకోన్నారో చెప్పండి అని అడిగాడు .తాము ఆకాశం లోమూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణం తో ఆ త్రిపురాలను చేదించిన వాని చేతిలో నే తమకు  మృత్యువు రావాలనికోరుకొన్నాడు .సరే నన్నాడు బ్రహ్మ .

తారాక్షుడు బంగారం ,విద్యున్మాలి వెండితో ,కమలాక్షుడు ఇనుముతో  చేయబడిన పురాలను  కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు .వారు పరమేశ్వరుని ప్రార్ధించారు .అప్పుడాయన త్రిపురాసురలను చంపాలంటే అపూర్వమైన రధం ,అపూర్వ బాణాలు అవసరమనీ చెప్పాడు .వీరు శ్రీహరిని ప్రార్ధిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింప జేశాడు .విశ్వకర్మ జగత్తు తత్త్వం తో రధాన్ని ,వేదం తత్త్వం తో గుర్రాలను ,నాగ తత్త్వం తో పగ్గాలను ,మేరు శఖర తత్త్వం తోధనుస్సును ,వాసుకి తత్త్వం తో వింటి నారిని ,సోమ ,విష్ణు ,వాయు తత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మ రధ సారధి అయ్యాడు ..అ దివ్య రధాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి  బయల్దేరాడు .

త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం

ఇంత చేసినా త్రిపురాసురుల తపో బలం వలన ,మయుడి నిశ్చల తత్త్వం వలన ఆ దివ్య రధం  భూమి లోకి  కుంగి పోయింది .గుర్రాలు నిలవ లేకపోయాయి ధనుస్సు పని చేయలేదు .రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్ధమైన రధం నిర్మించ లేక పోయి నందుకు కోప పడ్డాడు .ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు .పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు .పర దేవతను ఆత్మలో ధ్యానించాడు .లీలా వినోదిని బాలా త్రిపురాసుందరి గా ఆమె ఆవిర్భవించింది .శివుని ధనుసులో ప్రవేశించింది .దీనికి ఋగ్వేదం లో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది .

‘’అహం రుద్రాయ ధనురా తనోమి  బ్రహ్మ ద్విషే శరవే హంత వా ఉ –అహం జనాయ సమదం క్రుణోమ్య హం ద్యావా ప్రుధివీ ఆవివేశ ‘’.అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు  బాణం యెక్కు పెట్టాడు .దేవతలు అప్పుడు ‘’నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః ‘’అని స్తుతించారు .త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్ర బాణం తో అవి ఒకే సారి ద్వంసమైనాయి ..దేవమునులు సంతసిం చారు.  బాలా త్రిపుర సుందరి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది .శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు .ఆమె  కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటె తానూ ఆక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది .రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి  వెళ్ళాడు.ఆయన పాదాల దగ్గర  ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది .పెద్ద గుట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది  ఆ  గుంటలోనే ఆయన ‘’వైడూర్య లింగం ‘’గా ఆవిర్భవించాడు .దీనికి సాక్ష్యం గా వేదమంత్రం ఉంది –‘’స్తుతి శ్రుతం గర్త సదం యువానం –మృగన్నభీమ ముప హత్తు ముగ్రం –మ్రుడా జరిత్రే రుద్రస్తవానో –అన్యంతో అస్మిన్ని వపంతు సేనా’’  . వైడూర్య లింగానికి పై భాగాన బ్రహ్మ దివ్య జల లింగాన్ని ప్రతిస్టించాడు .ఇక్కడ జలలిన్గానికి  చేసిన అభిషేక ద్రవ్యం లోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగం లోనే లయమై లోపల ఉన్న త్రిపురాన్తకేశ్వరుని చేరుతుంది .

త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భ విం చిన ఈ దివ్య ప్రదేశమే కుమార గిరి .ఆదిశైలం ,అరుణాచలం ,కుమారాచలం లేబ్రాయపు కొండ అని పేర్లున్నాయి .తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశం లో తపస్సు చేస్తున్నాడు .ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ దేవి ,ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కు మారుడైన కుమారస్వామిని చూసి పోతూఉంటారని శివ పురాణం లోని శ్లోకం తెలియ జేస్తోంది –‘’

అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తరహ –పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం ‘’

పిలిస్తే పలికే దైవం

పూర్వం త్రిపురాన్తకేశ్వరుడు పిలిస్తే పలికే వాడట .పాల్కురికి సోమ నాధుడు బసవ పురాణం లో చెప్పిన కిన్నెర బ్రహ్మయ కద తార్కాణం .ఈ ఆలయానికి నలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి  మెట్ల మార్గాలున్నాయి .ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరచిఉన్ది. దక్షిణ సోపాన మార్గానికి దగ్గర మూల స్థానేశ్వర స్వామి దేవాలయం ఉంది .ఈయన మహా మహిమ కల దైవం .అనేకమంది రాజులు ఈయనకు భూరి దానాలు సమర్పించారు .దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీ చెన్న కేశవా లయం ఉన్నది .పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు .మూల స్తానేశ్వరునికి ఆగ్నేయం గా పంచ బ్రాహ్మల చే ప్రతిస్టింప బడిన ‘’పంచ లింగ దేవాలయం ‘’ఉన్నది .ఈశాన్యం లో ఆవు పొదుగు ఆకారం తో లింగాలు దర్శన మిస్తాయి .పూజిస్తే ఆయురారోగ్యాలనిస్తాయి .దక్షిణ సోపానాల దగ్గర వీర భద్రాలయం ఉంది .ఇంకొంచెం పైకి ఎక్కితే ఇస్టకామేశ్వారీ దేవాలయం ఉన్నది దీనికి దక్షిణం గా అద్భుత మహిమలున్న ‘’అగస్త్య లింగం ‘’ఉన్నది దీనినే ‘’  విన్ధ్యేశ్వర లింగం అనీ అంటారు .ముఖ్యదేవాలయం దగ్గరే ‘’అపరాజితెశ్వరుడు ‘’ఉన్నాడు మన్యు సూక్తం తో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది .ఆగ్నేయం లో సూక్ష్మ  తేజోమయ ‘’యజ్ఞేశ్వర లింగం ‘’వాయవ్యం లో హనుమంతుడు నెలకొల్పిన ‘’మారుతి లింగం ‘’, ఉన్నాయి వీటిని పూజిస్తే ఆయుస్సు బలం యశస్సులు కలుగుతాయి. వీటి  ప్రక్కనే  మార్కండేయ ప్రతిష్టిత దివ్య లింగం ఉంది. ఉత్తరం లో చండీశ్వరుడు ,పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిస్తితమైన ‘’ఉగ్రేశ లింగం ‘’ఉన్నాయి .ఉత్తరాన ‘’భేక  సోమేశ్వరుడు’’దర్శన మిస్తాడు ఈయన ఆరాధనను చాలా జాగ్రత్తగాచేయాలి. ఆలయం లోని బలిహణలను భక్షిస్తాడు ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకలాశోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేది . ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియం లో ఉంది .గర్భాలయానికి నైరుతి దిశలో ‘’చీకటి మిద్దె ‘’అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడి నుంచి కాశీ ,శ్రీశైలాలకు  సొరంగ మార్గం ఉంది .వృశ్చిక మల్లెశ్వరాలయానికి దగ్గర ‘’లో మఠం ‘’ఉంది .శ్రీ బాలా త్రిపుర సుందరిని అర్చిన్చాటానికి  సిద్ధ సాధ్యులు ఈ మార్గం ద్వారా వస్తారని చెబుతారు .ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింత చెట్టు ఉండేది .దాని మూలం లో భైరవుడు ఉంటాడు .దాని ముందు మనిషి లోతు త్రవ్వితే ఒక గుండం కనబడుతుంది .అప్పుడు చింత చెట్టు  ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ  గుండం లో వేస్తె రాళ్ళు  చేపలుగా మారుతాయట .ఆ చేపలను వండి తలను  తోకను  తీసేసి తింటే మూర్చ వచ్చి కొంత సేపటికి లేస్తాడు .ఆ మనిషి వేల సంవత్సరాలు జీవిస్తాడని ‘’నిత్య నాద సిద్ధుడు ‘’అనే యోగి ‘’రస రత్నారం ‘’అనే గ్రంధం లో రాశాడు .చీకటి  మిద్దె ప్రకనే ‘’మహా గణపతి మండపం ‘’ఉంది .విగ్రహం శిదిలమైతే ప్రక్కన  కింద పెట్టారు.

ప్రధానాలయం శ్రీ చక్రాకారం లో నిర్మించ బడింది శివాలయం ఈ ఆకారం లో నిర్మించటం చాలా అరుదు అలాటి అరుడైన దేవాలయం ఇది .’’శ్రీ చక్రం శివ యొర్వపుః’’అంటే శివ పార్వతుల శరీరమే శ్రీ చక్రం .స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడి పోయాయట .అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు .పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి .లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయం గా ఉంటాడు .జల లింగాన్ని దుండగులు పీకేస్తే కొండడ కిందఉన్న శ్రీరామ ప్రతిష్టిత లింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు .పునః ప్రతిస్టలో మూల విరాట్ ను కదిలించకుండా మూల విరాట్ కు  కింద మరొక నర్మదా బాణ లింగాన్ని ప్రతిష్టించారు  త్రిపురాన్తకేశ్వరునికి ఉత్తరాన పార్వతీ దేవి అంటే స్కంద మాత ఆలయమున్నది. పై రెండు చేత్రులలో శాక్తేయ  చిహ్నాలైన త్రిశూలం ,డమరుం  కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది .అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది .

స్వామి అభిషేకాలకు  భక్తజనం త్రాగటానికి గంధవతి తీర్ధం ఉంది ఇందులో స్నానిస్తే పుణ్యం మోక్షం .త్రిపుర సుందరి ఆలయం వెనక పుష్పవతీ తీర్ధం ఉండేది .చెరువులో కలిసిపోయింది .మహా నందిలో లాగానే ఇక్కడ కూడా స్వచ్చమైన జలం తో ఉండే కోనేరుండేది .దీనికి ‘’పాప నాశనం ‘’అనిపేరు .నాలుగు కొండల  మధ్య ఉన్న సోమ తీర్ధం పాప నాశిని .కుమార గిరికి పడమర దూర్వా నది లేక దువ్వలేరు ఉన్నది .ఇక్కడ దూర్వాసుడు తపస్సుచేశాడు .దీనికి దక్షిణం లో ‘’ముక్త గుండం ‘లో స్నానం చేస్తే మోక్షమే .

తీర్దాలు-మిగిలిన గుడులు

త్రిపురాంతకం అష్ట భైరవ పరి వేష్టితం .కుమార గిరికి దక్షణాన భైరవ గిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం .పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు పడమరలో శ్రీ రామ నాదేశ్వరుడు మిక్కిలి పూజ నీయుడు .ఉత్తరాన ఉన్న  కొండడను పూల పూల కొండ అంటారు ఇక్కడే తారకాసురుడు పూజించిన శివ లింగం ఉంది .ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట .దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది .దీనికి దిగువన ఓషధీ సమన్విత సోమ తీర్ధం ఉంది .ఇది సర్వ రోగ నివారిణి .తూర్పున పంచ బ్రాహ్మలు ప్రతిష్టించిన పంచ లింగాలున్నాయి .వాయవ్యం లో లింగాల కొండ ఉంది .ఇక్కడ వెయ్యి నూట ఒక్క లింగాలు ఉన్నాయట .ఇక్కడ అజ్ఞాతం గా మునులు తపస్సు చేస్తూ ఉంటారట .ఇకడే దివ్యౌ షది’’సంజీవిని ‘’ఉన్నాడని జ్ఞానులు చెబుతారు .

శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం

చిదగ్ని కుండ సంభూత

కుమార గిరికి దగ్గరలోఒకప్పటి  చెరువు లో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది .ఈ ఆలయం లో ప్రతిదీ విశేషమైనదే .ఆలయ గోపుర గర్భ గుడిపై నిర్మాణ శైలి వైవిధ్యం తో ఉంటుంది .గర్భ గుడిమీద రాజ గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత .’’త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ’’అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా  గుర్తింపు పొందలేదు . కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే . అమ్మవారు నిర్గుణ శిలా కారం గా ఆవిర్భవిం చింది .ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసున్దరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం .దీన్ని స్థానికులు ‘’నడబావి ‘’అంటారు అమ్మవారు ఉత్తరాభి ముఖం  గా దర్శన మిస్తుంది .చిదగ్నిగుండం లోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి .ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ .అదే నవావరణం లో బాలాత్రిపురసుందరి ఉంటుందన్న మాట

ఈ మెట్లకు అధిదేవతా ప్రత్యది దేవతలుంటారు .తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండం లో నిర్గుణ శిలకార రూపం లో అమ్మవారు కనిపిస్తుంది .దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు   మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలా వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది .సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు అలంకారాలన్నీ ఈ విగ్రహానికి .ఈ విగ్రహానికి  వెనక  ఉన్న శిలమధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్టితమై ఉంది .విగ్రహానికి వేనక రాతి కిరీటం  ఉండటం చేత యంత్రం కనిపించదు .అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవ శాస్త్రి గారు –

‘’నూటోక్క శక్తు లెప్పుడు –నాటక మటు లాడు చుండ,నాయక మణియై

కూటంబు నేర్పు త్రిపురక –వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’అని పద్యం చెప్పారు .

సిద్ధి మండపాలు

చిదగ్ని కుండం  నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి .వాటినే ‘’సిద్ధి మండపాలు ‘’అంటారు .ఈ మండపాలలో కూర్చుని  తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు  శ్రీ వావిలాల మహాదేవయ్య గారు ,శ్రీ గోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుస్టానం చేసేవారట .

శ్రీ చక్ర పాదుకలు

మెట్లు దాటి బయటికి వస్తే శ్రీ చక్ర మండపం కనిపిస్తుంది .ఇక్కడే శ్రీ చక్ర పాదుకలున్నాయి .అర్చనలన్నీ వీటీకే  చేస్తారు .అందరూ వీటిని పూజించ వచ్చు. ఈ చక్ర పాదుకలకు  ,చిదగ్ని కుండ దేవికి తంత్ర సంబంధ అను సంధానం ఉంది .ధనం కా వాలంటే ఎరుపు రంగు విద్య కావాలంటే తెలుపు ,శత్రు జయం కలగాలంటే నల్లని స్వరూపం తో అమ్మవారిని ధ్యానించాలి .ఈ పాదుకల వెనుక సిద్దేశ్వర పాదుకలుంటాయి .వీటిని ‘’గురుపాదాలు ‘’అంటారు .శ్రీ విద్యా సాంప్రదాయం లో వీటి ప్రాధాన్యం ఎక్కువ .గురుపాదుకలకు ప్రక్కనే బ్రాహ్మీ లిపి లో ‘’గురుపాదకా మంత్రం ఉంది’’.చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణా మూర్తి లింగం ఉంది .స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు .

ఛిన్నమస్తా దేవి

చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ‘’చిన్న మస్తా దేవి’’చిన్న మండపం లో కనిపిస్తుంది . ఈమెనే ప్రచండ చండిక అని ,వజ్ర వైరోచని అని అంటారు ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు .ఈమె దశ మహా విద్యలలో ఆరవ మహా విద్య .ఈమెను ఉపాశిస్తే కలిగే ఫలితం ‘’యామళం’’అనే గ్రంధం వివరించింది .ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు .ఇవి ఇప్పుడు నిజంగా చిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్ట బడి ఉన్నాయి .

రక్త పాత్రలు

సాధారణం గా  శక్తి ఆలయాలలో సింహ వాహనం ధ్వజస్తంభం ఉండాలి ఈ రెండు ఇక్కడ లేవు .కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని , స్వయంభు అని భావిస్తారు .వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత .’’సవ్యాప సవ్య మార్గస్థా’’.ఒక్కప్పుడు ఈ ఆలయం లో ‘’పంచ మకారార్చన’’జరిగేది .అందుకే  గర్భాలయం లో రాతి తో చేయబడిన ‘’రక్త పాత్ర ‘’ఉంది దీనికి ‘’ఉగ్రపాత్ర ‘’అనే పేరుకూడా ఉంది .ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు  ,రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది .ఎన్ని దున్నల్ని బలిచ్చినా ,ఒక్కో పొతూరక్తానికి  కడివెడు నీళ్ళు  పోసినా ఆ రక్త పాత్ర నిండదు .ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే  ఈశాన్యం లో మామూలు భక్తులు వేరొక రక్త పాత్ర ఉన్నది దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే ‘’యూప స్థంభం ‘’కూడా ఉంది  .దీనిపై సంస్కృత శాసనం ఉంది .శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు .దీన్ని ఒక కవి పద్యం లో

‘’మదపు టేనుగు నైన ,కొదమ సింగం బైన –యూప శిలకు దా,సమీప మంద –

మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న –లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’

వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని ‘’దేవతాగ్రణీ’’ అని స్తుతించారు  స్కాంద పురాణం శ్రీశైల ఖండం  లో-

‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్  త్రిపురా దేవతాగ్రణీ

దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’

కదంబ వనవాసిని

త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబ వనం .ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి .అతి సున్నితంగా రక్త వర్ణం తో ఉండే  కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి.అందుకే ‘’కదంబ కుసుమ ప్రియాయై నమః ‘’అని లలితా సహస్రం లో చెప్పారు .కదంబ  వృక్షాలే కల్ప  వృక్షాలే  శ్రీ  శంకర భగవద్పాదులు తెలియ జేశారు .’’కదంబ కాననావాసా ‘’-కదంబ నామా కల్ప వృక్ష యుక్తం యత్కాననం వనం తత్ర గృహం యస్యాః సా తదా ‘’అని భాష్యం చెప్పారు .

వీర శిలలు

అమ్మవారి ఉత్తర ద్వారం కు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీర శిలలే .ఇవి భక్తుల వీర కృత్యాలకుప్రతి బింబాలు .ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది .ఇందులో అధికభాగం స్త్రీ శిల్పాలే .వివిధ ఆలం కారాలతో  కేశ పాశాలతో వీరులు బల్లాలను తలలో ,గుండెలో ,గొంతులో ,తొడలలో పోడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు .వీరు ఎందుకు వీరక్రుత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి .’’స్వస్తిశ్రీ సోమతుశివ దేవా గురు అల్లడ్డ వీర మల్లునికి మేలుగావలేన్ అని తల త్రిపురా దేవి కిన్ ఇచ్చే ‘’ అని ఒక శాసనం .ఇంకోదానిపై ‘’దేవికి తల ఇస్తున్నాను తెలుంగు నాయని బావ మరది చావుండయ్య వీర’’అని అసంపూర్తి శాసనం కనిపిస్తాయి .ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం .

అపరాదేశ్వరీ ఆలయం –గుహలు

అమ్మవారి ఆలయానికి దగ్గరలో బయట రోడ్డుమీద ‘’అపరాదేశ్వరీ ‘’లేక బాలమ్మ ఆలయం ఉంది .ఇది శిధిల రూపం లోనే ఉంది.దీనికి దగ్గరలో చింతామణి గుహ ,ఉన్నది ఇది అమ్మవారి ఆలయమే నని భావన ఆధారం  ‘’చింతామణి గుహాంతస్త ‘’ అనే నామం .ఇక్కడే పూర్వం లక్ష్మీ గణపతి ఆలయం ఉండేదట అమ్మవారికి వెనక  ‘’వైడూర్య శిఖరం .అనే కొండ మీద ధ్యానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట .ఇకడే తమాషా అయిన తెల్లని రాతి వరుస ఉందట .దీని రహస్యం సిద్ధులకు మాత్రమె ఎరుక .

మహా సర్పం –మరికొన్ని విశేషాలు

బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంది .అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది .సంతానార్ధులు ,నాగ దోషమున్నవారు ,ఈ పుట్టకు పొంగళ్ళు సమర్పిస్తారు ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్ని గుండం  చేరి సేవ చేసి తిరిగి వస్తుందట  .

అమ్మవారి గుడికి దగ్గరే ఉండే తెల్లని గుండ్రాయి ని ‘’ఈశ్వరుని తల గుడ్డ ‘’అంటారు .ఇది మహత్వం కల శిల అని ఇప్పుడు చెరువులో కూరుకు పోయి కనిపించటం లేదు .త్రిపురాంతక శివునికి  పడమర గా పదమూడు కిలో మీటర్ల దూరం లో ఒక కొండ ,దానికి పశ్చిమంగా ఒక ద్వారం ఉన్నాయి  అక్కడ నలభై అడుగుల దూరం లో ‘’మండే కాంతులు ‘’అనిపిస్తాయి .అక్కడి  మామిడి పండు ఆకారం లో ఉన్న రాళ్ళను గుడ్డలో వేసి మూట కట్టాలి .అది ఎర్రగా మారుతుంది .ఆ గుడ్డను పాలల్లో వేయాలి .పాలు ఎర్రగా మారుతాయి .ఆ పాలను సాధకుడు వారం రోజులు అదే విధం గా తాగితే వజ్ర సమాన శరీరుడు అవుతాడు ,ఆయుస్సు పెరుగుతుంది అని ‘’రస రత్నాకరం ‘’లో నిత్య నాద సిద్ధుడు రాశాడు .

బిలాలు

శివాలయానికి ఉత్తరాన ‘’కోకిలా బిలం ‘’ఉంది .సాధకుడు శుచిగా అందులో ప్రవేశించాలి .నలభై అడుగులు లొపలీ వెడితే కోకిల ఆకారపు రాళ్ళు కనిపిస్తాయి .ఆ రాళ్ళను తీసుకొని వాటి వెనక నువ్వులు పెడితే అవిపగిలిపోతాయి .అప్పుడు ఆ రాళ్ళను పాలలో వేస్తె పాలు నల్లగా మారుతాయి .ఈ పాలను గొంతు నిండే దాకా తాగాలి .అప్పుడు దివ్య శరీరం పొంది తెల్లజుట్టు ముడుతలు పోయి ,రోగాలు లేనివాడై మూడు బ్రహ్మ దినాలు జీవిస్తాడు .మహా బలవంతుడై వాయువేగం కలుగుతుంది .

గుండ్ల కమ్మ నదికి తూర్పు కొండపై చంద్ర మౌళీశ్వరాలయం ఉంది .దాని దగ్గరేకాశి కేశుడు ,ఒక కోనేరు ,నృసింహ బిలం ఉన్నాయి బిలం లో ప్రవేశిస్తే యోగసిద్ధి కలుగుతుంది .దానిలో  నుంచి కాశీ వెళ్ళచ్చు

ఇస్ట కామేశ్వరీ దేవి ఆలయం .

శ్రీశైలానికి తూర్పున శిఖరేశ్వరానికి దూరం గా కారడవిలో శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవి విగ్రహాన్ని అందరు తప్పక దర్శించాలి .ఈమె పేరు తెలుగు సాహిత్యం లో ఎక్కడా చోటు చేసుకోక పోవటం ఆశ్చర్యం గా ఉంది. ధ్యాన మగ్నయై పద్మాసనం లో శిలా పీఠం పై దర్శన మిస్తుంది .నాలుగు భుజాలు ఉన్నాయి .పై రెండు చేతులతో కలువ మొగ్గలను  కింది కుడి  చేతితో రుద్రాక్ష మాల ,ఎడమ చేతిలో శివలింగాన్ని కలిగి ఉంటుంది .పూర్వపు ఆలయం శిధిలమైంది .ఆలయానికి ఎదురుగా ఒక సిద్ధుని విగ్రహం ఉంటుంది . కాపాలికల దేవత అయి ఉండచ్చు .ఉత్తరాన ఒక వాగు నిరంతరం ప్రవహిస్తుంది ..సుమారు ఎనిమిదవ శతాబ్దపు ఆలయం అనుకో వచ్చు జీపులలో అడవిలో ప్రయాణించి ఇష్ట  కామేశ్వరిని దర్శించాలి .దీనిని కంచి పరమాచార్యులవారుశ్రీ శ్రీ  చంద్ర శేఖర యతీంద్రుల వారుమొదటి సారి దర్శించి లోకానికి తెలియ జేశారు .అప్పటిదాకా ఎవరికీ తెలియదు .తర్వాత ఇటీవలికాలం లో శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు వెళ్లి దర్శించి ,అమ్మవారి ప్రాభవాన్ని ప్రవచనాలలో తెలియ జేస్తున్నారు .ఇప్పుడే ప్రభుత్వం పక్కారోడ్డ్డు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు

వీరశైవం –మఠాలు

త్రిపురాంతకం  శైవమత వ్యాప్తికి దోహద పడింది .ఇక్కడి ‘’గోళకీ మఠం’’ప్రసిద్ధి చెందింది .14వ శతాబ్దం లో వీర శైవం విజ్రుమ్భించింది  .1312నాటికి పూజారులు 72నియోగాల వారు స్తానాదిపతుశ్రీ అసంఖ్యాత మహా మహేశ్వరులకు లోబడి ఉండాలన్న నిబంధన ఏర్పడింది .ఇక్కడి  ‘’విశుద్ధ శైవ మఠం’’ఉచిత అన్న వస్త్రాలిచ్చి వేదం వేదాంగాలు శాస్త్రాలు సాహిత్యం బోధించింది .పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య ‘’కాపాలిక మతం ‘’అభి వృద్ధి చెందింది అప్పుడే ‘’పంచ మకారార్చన ‘’జరిగేది (మద్యం మాంసం మగువ ).

ఉత్సవాలు

ప్రతి సోమ ,శుక్రవారాలలో విశేష ఉత్స్సవాలు  మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం జరిగేదని వసంత నవరాత్రులు ,శరన్నవ రాత్రులు శ్రావణ మాసం లోప్రత్యెక ఉత్సవాలు కార్తీకం లో అభషెకాలు సంతర్పణలు జరిగేవని శాసనాల వలన తెలుస్తోంది .తర్వాత ఆలయం శిధిలా వస్తకు చేరింది .శ్రీశైలం దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తతకు తీసుకోని పునరుద్ధ రించి మళ్ళీ నిత్య ధూప దీప నైవేద్యాలు ఉత్సవాలు నిర్వహింప జేస్తోంది .దాతలు  ముందుకు  వచ్చి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు .2006 లో కరివేన వారి బ్రాహ్మణ అన్నదాన సత్రం అమ్మవారి ఆలయానికి దగ్గరలో ప్రారంభ మైంది .శివరాత్రి నాడు జరిగే రధోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది . ఇంతటి మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంత కేశ్వరుని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి

--(())--

101....కోనసీమ_అంటేనే_అందం.అది వేదసీమా అని పెద్దల ఉవాచ.

శ్రీశైల పర్వతసానువుల తరువాత తొందరగా మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవ క్షేత్రాలు.

#ఇక_కోనసీమ_రుద్రులగురించి

కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగుతున్న “#జగ్గన్నతోట” ప్రభల తీర్థం వైభవాన్ని ఇంతింతా అని చెప్పరానిది.మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్య కాలం లో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని “మొసలిపల్లి శివారు జగ్గన్నతోట” లో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన,చారిత్రాత్మకమైన,అతిపురాతనమైన,పవిత్రమైన సమాగమము.ప్రాచీన కాలంలో మొట్టమొదటి గా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి.ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ వుండవు.ఇది పూర్తిగా కొబ్బరి తోట.ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడం తో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది ఏకాదశ రుద్రుల కొలువు.హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా,ఈ భూమండలం మొత్తానికీ ఒక్క చోటే అదీ వేదసీమ అయినటువంటి కోనసీమలోనే.

లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి.సుమారు 400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి.అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచొట చేర్చుతారు ఈ గ్రామస్తులు.సంస్థానదీశులైన #శ్రీ_రాజా_వత్సవాయి_జగన్నాధ_మహారాజు కు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.

ఈ ఏకాదశ  కొలువైన గ్రామాలు ఆ రుద్రుల పేర్లు వరుస గా

1-వ్యాఘ్రేశ్వరం-శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలాత్రిపురసుందరీ)
2-పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలా త్రిపుర సుందరి)
3-మొసలపల్లి-మధుమానంత భోగేశ్వర స్వామి
-#గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు
5-గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు
6-పెదపూడి-మేనకేశ్వరుడు
 7-ఇరుసుమండ-ఆనంద రామేశ్వరుడు
8-వక్కలంక-విశ్వేశ్వరుడు
9-నేదునూరు–చెన్న మల్లేశ్వరుడు
10-ముక్కామల-రాఘవేశ్వరుడు
11-పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడు.

ఇవీ గ్రామాలు ఆ గ్రామాల రుద్రుల నామాలు.ఈ స్వామి వారలను “ప్రభలపై” అలంకరించి మేళ తాళాలతో,మంగళ వాయిద్యాలతో,భాజా బజంత్రీలతో “శరభా శరభా” హర హర మహాదేవ” అంటూ ఆయా గ్రామాల నుంచి వీరిని మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు.

ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లి కి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ.ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు

“శ్రీ వ్యాఘ్రేశ్వరుడు”.ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.

ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి.ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా “హరా హరా” అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది.ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేను ని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏక కాలం లో ఏకాదశ రుద్రుల(11)దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి.

#నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవా త్రయంబకాయ 

త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః’
అంటూ రుద్రంలో ఏకాదశ రుద్రుల గురించి ప్రస్తావన ఉంటుంది.

ఆ ఏకాదశ రుద్రులు ఏకకాలం లో సమాగం అయ్యే సన్నివేశం చూస్తే మనసు పులకిస్తుంది.ఈ తీర్థము ను దర్శించడానికి ప్రపంచవ్యాప్తం గా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక,దేశ విదేశీయిలు వచ్చి దర్శించి తరిస్తారు.
ఈ సారి మీరూ కూడా దర్శించి తరించ ప్రార్ధన.
--9900--- 

No comments:

Post a Comment