Friday 21 May 2021

ప్రాంజలి ప్రభ పాత కధలు (81- 90)


Mallapragada Sri devi ramakrishna 
81.  జీవితాలు రామాయణం లో పాత్రలే 

*అంతా రామమయం*
*మన బతుకంతా రామమయం*

ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి . మనకు అలాంటిది రామాయణం . ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు . మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు . మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు . ధర్మం పోత పోస్తే రాముడు . ఆదర్శాలు రూపుకడితే రాముడు . అందం పోగుపోస్తే రాముడు . ఆనందం నడిస్తే రాముడు . వేదోపనిషత్తులకు అర్థం రాముడు . మంత్రమూర్తి రాముడు . పరబ్రహ్మం రాముడు . లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు .

ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో , చేతల్లో , ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే!

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - శ్రీరామరక్ష సర్వజగద్రక్ష .

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - రమాలాలి - మేఘశ్యామా లాలి .

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష .

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా .

వినకూడని మాట వింటే అనాల్సిన మాట - రామ రామ .

భరించలేని కష్టానికి పర్యాయపదం - రాముడి కష్టం .

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు .

కష్టం గట్టెక్కే తారక మంత్రం - శ్రీరామ .

విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా !

వయసుడిగిన వేళ అనాల్సిన మాట - కృష్ణా రామా !

తిరుగులేని మాటకు - రామబాణం .
సకల సుఖశాంతులకు - రామరాజ్యం . ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన . ఆజానుబాహుడి పోలికకు - రాముడు . అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - రాముడు .

రాముడు ఎప్పుడు మంచి బాలుడే .
చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - రామా కిల్డ్ రావణ ;
రావణ వాజ్ కిల్డ్ బై రామా .

ఆదర్శ దాంపత్యానికి - సీతారాములు .
గొప్ప కొడుకు - రాముడు .
అన్నదమ్ముల అనుబంధానికి - రామలక్ష్మణులు .
గొప్ప విద్యార్ధి - రాముడు(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .
మంచి మిత్రుడు - రాముడు(గుహుడు చెప్పాడు ).
మంచి స్వామి రాముడు (హనుమ చెప్పారు ).
సంగీత సారం రాముడు (రామదాసు , త్యాగయ్య చెప్పారు ).
నాలుకమీదుగా తాగాల్సిన నామం రాముడు ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు ).
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు .
నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు .
చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు . చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు .
జన్మ తరించడానికి - రాముడు , రాముడు , రాముడు .
--------------------
*రామాయణం పలుకుబళ్లు*
మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ , ప్రతిబింబిస్తూ ఉంటుంది . తెలుగులో కూడా అంతే .

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది .

చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక రామాయణం .

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం .

కబళించే చేతులు , చేష్ఠలు కబంధ హస్తాలు .

వికారంగా ఉంటే - శూర్పణఖ .

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే - అంగదుడి అంగలు .

మెలకువలేని నిద్ర - కుంభకర్ణ నిద్ర .

పెద్ద ఇల్లు - లంకంత ఇల్లు .

ఎంగిలిచేసి పెడితే - శబరి .

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు .

అల్లరి మూకలకు నిలయం - కిష్కింధ కాండ .

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే .

పితూరీలు చెప్పేవారందరూ - మంథరలే .

యుద్ధమంటే - రామరావణ యుద్ధమే . ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - రావణ కాష్ఠాలే .)

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం ).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు .
బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు .

ఒంటిమిట్టది ఒక కథ .
భద్రాద్రిది ఒక కథ .
అసలు రామాయణమే మన కథ .
అది రాస్తే రామాయణం -
చెబితే మహా భారతం .

అందుకే  మన జీవితాలు రామాయణం లో పాత్రల వంటివి


82,,,, వంకాయలు

మనకు ఏదన్న విషయం నచ్చక పొతే వంకాయ్ అని తీసి పారేస్తాం
,..కాని వంకాయ వంటి కూర పంకజ ముఖి సీత వంటి భామ మణి అని శ్రీనాధుడు వంకాయ్ ని సీతమ్మ తల్లి తో సమానం అని తేల్చాడు. ఇంకా రావణుడు. శంకరుడు కూడా వంకాయ తో పోల్చా బడ్డ వారె . నవీన కాలం లో ప్రముఖ హాస్య రచయత శ్రీ ఎర్రమ్ శెట్టి సాయి బగారా బైగన్ ప్రధాన కధా వస్తు వుగా పొట్ట చెక్కలు అయ్యేలా కధలు రాసాడు. నీరాహార దీక్ష చేస్తున్న ఓ నాయకుడు మసాలా వంకాయ కూర ఘుమాయింపు కి ఒక్క ఉదుటున లేచి వచ్చి ఆబగా అన్నం కూర కలుపు కొని తిని నిరాహార దీక్షని - ఉద్యమాన్ని శంకర గిరి మాన్యాలకు నడిపిన్చాడు అనే విషయం తెలుగు సాహిత్య ప్రియులకు విదితమే చెప్పద్దు
. నాకు వంకాయ కూర చాల ఇష్టం .ఏమి చేస్తాం.దాని రుచి మా అమ్మ తోనే పోయింది.

.వండి నప్పుడల్లా మీ అమ్మ లాగ వండానా?
అ రుచి వచ్చిందా అని అని అడుగుతుంది.ఇల్లాలు
. ఉన్న కారణాలు చాలవా యుద్ధాలు రావటానికి అను కొని ,వూ అంటే వచ్చే సుఖము వూరు కొంటె ఉత్తమము అన్న జ్ఞానము కలవాడి ని కనుక అద్భుతం అని అనేస్తాను .కాని అమ్మ అమ్మే ఆవిడా వంట ఎవరికీ రాదు.  .లేతః వయసులో రసాన్కురాలకు అలవాటు
పడ్డ రుచి.మర్చి పోలేక పోతున్న.ఆవిడా గతించి 45 ఏళ్ళు గడచినా. ఇక ఎక్కువ చెపితే యుద్దానికి ఇదో కారణం కావచ్చు .కాబటి స్వస్తి ఈ విషయానికి. కొస మెరుపు నిన్న కూర బాగా ఉంది కాదు కాదు చాల చాలా బాగుంది . నాకు నచ్చిన వంకాయ్ రకాలు క్రింద ఇచ్ఛా
.కొనుక్కోండి వండుకోంది తినండి .ఆనందించండిజిహ్వకో రుచి
..ఎవరి అమ్మ చేతి వంట వారికి రుచి ఎందుకు అంటే ప్రధమముగా నోటికి రుచి నేర్పేది అమ్మ
.తినటం నేర్పేది అమ్మ. వండటం నేర్పేది అమ్మ  .ఇంకొరికి పెట్టటం నేర్పేది అమ్మ
. యుద్ధాలు వస్తే రానీ. .వంకాయ్ అంటారా? నేను చేయ గల విషయం ఏమి లేదు

--((***))--

83.... కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు... ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే!
1.నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు...ఎందుకంటే మీ అమ్మకు  20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం.
నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా!
తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో.తప్పకుండా తను కూడా మంచి గృహిణి గా,మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది.

2.నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో...
నీ తల్లికి నిన్ను  చూసుకోవడమే పని..నీవు మమ్మల్ని,నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని ప్రేమగా ఉండాలి.

3.నీతో సమానంగా తనని చూసుకో...నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో!నీ మంచిచెడులో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుంది.

4. పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి...కాస్త మోహమటంగా ఉండచ్చు...నువ్వే తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్లు చెయ్యి.

5.నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి...
ప్రేమించడానికి వయస్సుతో పనిలేదు.చిన్న,చిన్న సర్ప్రైజ్ లు,కానుకలు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకో..వారాంతంలో బయటికి తీసుకుని వెళ్లు. పుట్టింటికి తనతో కలసి వెళ్ళు.
నీ లాంటి భర్త, మా లాంటి అత్తమామలు లభించడం తన అదృష్టం అని చెప్పుకునేలా మనం అందరం ప్రవర్తిద్దాం...

ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర పొందాను...అనుభవిస్తున్నాను..నా అనుభవాలను నీతో చెపుతున్నాను...నువ్వు కూడా మీ నాన్నలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ,నువ్వు సంతోషంగా ఉంటూ...మమ్మల్ని సంతోషంగా ఉంచుతావని నమ్ముతున్నాను...నిండు నూరేళ్లు ఆనందంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను..
--(())

 84.....       *నీళ్లు తాగకపోతే...*

నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకుందాం.

ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ నీళ్లు తాగేవారకన్న ...బాటిల్ పిచ్చి మందు వేసేవారె ఎక్కువగా తయారవుతున్నారు. మీరు మంచి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు తాగుతారంటే...దాహం వేసినప్పుడు తాగుతా అంటారు. కాని నిజానికి రోజు ఏసీ గదుల్లో ఉంటూ ఎంత మంది నీళ్లు తాగుతున్నారు ? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు... నీళ్లు తాగాలంటే బద్దకంగా ఫీలయ్యేవారందరి సమస్య. ఈ శరీరానికి నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే.. మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి.

1.మీరు కుర్చుని లేవలేక పోతున్నారా... కీళ్లు, కండరాలు నొప్పులతో అవస్తపడుతున్నారా...అయితే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట. ఎందుకంటే.. కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ 80 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పుల వస్తాయి..

2. తలనొప్పి తరచుగా వస్తుందా... నీళ్లు తక్కువగా తాగినప్పుడు మీకు తలనొప్పి వేధిస్తుంటుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం, బ్రెయిన్ కి బ్లడ్ తక్కువ అందడం వంటివి డీహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది.

3. జీర్ణవ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా, ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది.

4. అలసట ,ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా లేకపోవటం అనేవి తక్కువ నీరుకు సంబంధించినదే... బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయి అంటే.. మీరు శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం.
5. యూరిన్ కలర్ మీ శరీరం డీహైడ్రేట్ అయిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా.. మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కివెళ్లాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు తాగడం లేదని గుర్తించాలి.

6. బ్రెయిన్ ఫంక్షన్ పైనా ఇది ప్రభావం చూపుతుంది. మీ మూడ్, మెమరీ, డెసిషన్, ఏకాగ్రత వంటివాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.

7. పెదాలు ఆరిపోవడం , చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవటం, పొడిబారిపోవటం.
అలాగే చెమట కూడా చాలా తక్కువగా పట్టడం. ఇవే మీరు సరిగ్గా నీళ్లు తాగటం లేదని చెప్పే సంకేతాలు...ఇకనైనా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి ఇకపై ఈ సిగ్నల్స్ కనిపించిన వెంటనే నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి.

--((***))--


85..*మనం చేస్తున్న ఘోరమైన  ఉప్పు తప్పు.*

దొడ్డు ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండి 
అయోజైజ్డ్ సన్నఉప్పును  20/- 
పెట్టి కోని రోగాలు తెచ్చుకోకండి

మనిషి తన ఆహారంలో  సముద్రపు ఉప్పు తగిలితే 
మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు.

అప్పట్లో బీపీలు లేవు !
ఒంట్లో ఎముకల నోప్పులు లేవు.!!
థైరాయిడ్ సమస్యల్లేవు.!!!
ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ దొడ్డు ఉప్పు 
బస్తాలు జస్ట్, అలా వదిలేస్తారు
ఎందుకంటే ఉప్పును ఎవరూ దోంగతనం చేయరు.

ఎవరైనా ఉప్పు ఉచితంగా అడిగితే నిరాకరించవద్దనే నియమం కూడా ఉండేది.

ఆ రోజులు పోయాయి… 
అంతా సన్న ఉప్పు, 
అదీ అయోడైజ్డు ఉప్పు మన కిచెన్లలోకి వేగంగా జొరబడింది !

దొడ్డు ఉప్పుతో పోలిస్తే ఇది సన్నగా, అంటుకోకుండా ఉండటంతో అందరూ 
దీన్నే ప్రిఫర్ చేయసాగారు… 

కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి విపరీతంగా హాని చేయడం మొదలుపెట్టింది.

ఏళ్లకేళ్లు మనకేమీ పట్టడం లేదు

అదెలా స్టార్టయిందంటే..?

1986 ప్రాంతంలో… 
కార్పొరేట్ కంపెనీలు రాజీవ్‌గాంధీ సర్కారును అప్రోచయ్యారు… 

ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు అయోడిన్ లోపంతో బాధపడుతున్నారు కాబట్టి, 
వారికి అయోడిన్ కలిపిన ఉప్పును అలవాటు చేస్తే ఆరోగ్యవంతులైపోతారు అని చెప్పారు !

అధ్యయనాలు లేవు !
ముందు జాగ్రత్తలు లేవు !!
మరి విదేశీ కంపెనీలు కదా… 
సర్కారు వోకే అనేసింది… 

అయోడైజ్డు ఉప్పు వాడాలి అంటూ సముద్రపు ఉప్పును నిషేధించి పారేసింది… 

ఈశాన్య రాష్ట్రాల్లో అయోడిన్ లోపం ఉంటే, మరి మిగతా దేశం మొత్తానికీ 
ఈ నిర్బంధ లవణం దేనికిరా 
అని అడిగినవాడు లేడు… 

రోగి చెప్పాల్సిన ప్రిక్షిప్షన్ దేశమంతా ఎందుకు వాడాలి
అని అడిగిన వాడు లేడు

మరి కార్పొరేటు లాబీయింగు అలాగే ఉంటుంది… 

కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున కెమికల్ ప్రాసెస్ ద్వారా ఈ ఉప్పు తయారీ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు… మామూలు ఉప్పుకి నాలుగైదు రెట్లు ధర ఎక్కువ… 

చివరకు ప్రజల కూడు నుంచి 
చౌక ఉప్పును కూడా కాజేసిన దొంగలు…

తరువాత 
అనేక  విదేశీ కంపెనీలు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు… 

ప్రజల్లో ఒక అభిప్రాయం ఎంత బలంగా ఏర్పడిందీ అంటే సముద్రపు ఉప్పు ప్రమాదకరం, అయోడైజ్డు ఉప్పు మాత్రమే ఆరోగ్యకరం అనే భావనలు జీర్ణించుకుపోయాయి… 

మెల్లిమెల్లిగా దీని దుష్ప్రభావాలు అర్థం కాసాగాయి… 
ఈ అయోడైజ్డు ఉప్పులో మూడు ముఖ్యమైన సైనైడ్ అంశాలుంటయ్… 

అవి 
1)  E535 – sodium ferrocyanide, 
2) E536 – potassium ferrocyanide, 
3) E538 – calcium ferrocyanide… 

మరికొన్నీ అనారోగ్య హేతువులుంటయ్… 

ఇవి బీపీలను పెంచినయ్… థైరాయిడ్, ఒబెసిటీ వంటి సమస్యల్ని పెంచినయ్… 
గుండె జబ్బుల్ని పెంచినయ్… 

డయాగ్నయిజ్ లేబరేటరీలు హేపీ, మందుల కంపెనీలు హేపీ, డాక్టర్లు హేపీ… విధి లేక ఆయుర్వేద డాక్టర్లు, హోమియో డాక్టర్లు సైంధవ లవణాన్ని సూచించసాగారు… 

కానీ ధర ఎక్కువ… ప్రజలకు దాని ఉపయోగాలపై అవగాహన తక్కువ… 

ఇప్పటికీ కిచెన్లలో సైంధవ లవణం లేదా సముద్రపు సహజలవణం మంచిది

నిజానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో అయోడిన్ లోపం లేదు… 

కానీ మనం ఈ అయోడైజ్డు ఉప్పు పేరిట మన దేహాల్లోకి అదనంగా అయోడిన్‌ను పంప్ చేయడం స్టార్ట్ చేశాం… 

దీంతో మనమే చేజేతులా అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టవుతున్నది

అమెరికా వంటి దేశాల్లోనూ ఈ తప్పు తెలుసుకుని, నివారణ చర్యల్లో పడ్డయ్

మన దేశంలోనూ ప్రభుత్వ ఆంక్షల్ని ధిక్కరిస్తూ మరీ సముద్రపు ఉప్పు అమ్మడం స్టార్టయింది… 
పాతకాలంతో పోలిస్తే ధరలు ఎక్కువ… మరేం చేస్తాం..? 
కానీ రూల్స్ అలాగే ఉన్నయ్… 

దీనిమీద గత ఏడాది కర్నాటక హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది

మరి జనం ఏం చేయాలి..? ఏముందీ..? ఆ దిక్కుమాలిన ఉప్పును తగ్గించేసి, వీలైనంతవరకూ దొడ్డు ఉప్పు అనగా సముద్రపు ఉప్పు, సహజలవణం వైపు మళ్లడం బెటర్… 

మార్కెట్‌లో బాగానే దొరుకుతున్నది ఇప్పుడు… 

అయితే నెట్‌లో వెబ్‌సైట్లలో ఇటీవల కొన్ని ఉచిత సలహాలు కనిపిస్తున్నయ్… ఏమనీ అంటే..? ఈ ఉప్పును నీటిలో కరగబెట్టి కాస్త కాస్త తాగితే బీపీ తగ్గుతుందీ, ఇంకేవో రోగాలు పోతాయ్ అని

తప్పు, అలాంటి వాటి జోలికి పోవద్దు… ఉప్పు వాడకమే తగ్గించడం చాలా మంచిది… సైంధవ లవణం అయితే మరీ మేలు

ఏ ఉప్పయినా సరే అందులో ఉండేది సోడియం… అది రక్తపోటుకు మంచిది కాదు… అందుకని ఆ వెబ్ డాక్టర్ల జోలికి పోకుండా, 

జస్ట్, వంటలకు తగినంత… వీలయితే కాస్త తగ్గించుకుని వాడితే మరీ మరీ బెటర్… 

ఉప్పు కేవలం రుచి కోసమే… ఆరోగ్యం కోసం కాదు… 
మనం రోజూ తీసుకునే రకరకాల ఆహారాల్లో ఎలాగూ కొంత సోడియం ఉంటుంది… 

అందుకని బీ కేర్ ఫుల్
ఈ ప్రభుత్వాలు మనల్ని ఏమీ ఉద్ధరించవు…
మరి పార్టీలకు, నాయకులకు కార్పొరేటు కంపెనీలు డబ్బులిస్తాయి తప్ప జనం ఇవ్వరు  కదా

వాటికి, వారికి ఈ దేశం ఉప్పు తింటున్నామనే విశ్వాసం కూడా ఉండదు కదా.
మీ
SHREE SWAMY

86. 🍁 అమ్మవారితోనే పాచికలాడి #శ్రీచక్రంలో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు.. ఈ కథ విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం  🍁


🍁🍁🍁🍁

86... #మధుర  #మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ #ఆదిశంకరులు   #శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం

 పంచశత శక్తిపీఠాల్లో  మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత.

 మధురనుపాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి.

 పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమతమ పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రికాగానే ఎవరిగృహాల్లోవారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, వారికి బైటకొచ్చేవీలులేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే!

 క్షేత్రపాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరియొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తనఅంశతో ఒక అవతారపురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనంవహించి తీరాల్సిందేతప్ప మరేమీ చేయటానికిలేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు.

 తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే , తననుతాను అవమాన పరచుకోడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో, ఏప్రాణికి, ఏశిక్ష, ఏ పరీక్ష, ఏదీక్ష, ఏసమీక్ష ప్రసాదించాలో ఒక్క మహా కాలుడికే ఎరుక. ఎవరివంతుకు ఏదివస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.  

 ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితలాఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతంపలికి తనఅంతఃపురంలో సకలసేవలుచేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారయిన ఆదిశంకరాచార్యులు "నేను మధురమీనాక్షి ఆలయంలో ఈరాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడు. ఆ మాటలువిన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపమొచ్చినంతగా కంపించిపోయాడు. 

 "వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో,  ఏ శాపఫలితమో చల్లనితల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షితల్లి రాత్రిసమయాల్లో తామస శక్తిగామారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగంరానివిధంగా సకలఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టద్దు .అసలు అంతఃపురంనుండి బయటకు ఎవరూవెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క"  అని పాండ్యరాజు వేడుకున్నాడు. 

 ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరచాడు. "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలికానీ తర్వాత వారు గృహస్తుల యింట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటేతప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డుచెప్పద్దు" అన్నారు.  పాండ్యరాజు హతాశుడైయ్యాడు.

  దైవీతేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని "ఇకచూడనేమో?!" అని  పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రి నిద్రలేదు. "ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆపాపం తన తరతరాలను పట్టిపీడిస్తుందేమో" అని నిద్రరాక అటుఇటూ పచార్లు చేయసాగాడు. 

 రాత్రయింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకతశ్యామ అయిన ఆతల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటిమధ్య నిలచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతివంటి వెలుగులతో సుధావర్షదార కురిపిస్తోంది.

 ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో  చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠమునుండి లేచి నిల్చుంది.  

 పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ,ధగ మెరుస్తుండగా, ఆమె ధరించిఉన్న ఎర్రనినిరంగు పట్టుచీర, బంగారు జరీఅంచులకుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా, కోటివెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారంవద్దకొచ్చి లిప్తకాలమాగింది.

  ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యువయోగి ఆమె విశాలనయన దృష్టిపథంలోకొచ్చాడు. "ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి?  నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాల శివుని"లా ఉన్న ఆయోగిని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి?" అని ఆశ్చర్యం కలిగింది.

 క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆతల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్వికరూపం అంతరించి తామసికరూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారుమబ్బు రంగులోకిమారి భయంకర దంష్ట్రాకరాళవదనంతో, దిక్కులనుసైతం మ్రింగివేసే భయంకరమైనచూపులతో అడుగుముందుకేస్తోంది మహాకాళీ స్వరూపంలా. 

  ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్క రించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధినుండి మేల్కొని "మహాలావణ్య శేవధి" ని కళ్లారాచూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వంరూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామసరూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞరూపంగానే కన్పిస్తోంది. కన్నతల్లి అందమైనదా? కాదా?అనుకోరుకదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !

 అప్రయత్నంగా ఆయన స్తోత్రంచేసాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలనివస్తున్న ఆ తామసమూర్తికి ఆస్తోత్రం అమృతపుజల్లులా చెవులకుసోకింది. దంష్ట్రాకరాళవదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తిపారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి  ఆశ్చర్యంగా చూచింది. నిజానికీసమయంలో తనవదనంలోకి శలభంలా వెళ్లిపోవాల్సినవాడు, మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? 

 అర్ధనిమీళితాలైన కన్నులతో భక్తిపారవశ్యంతో వజ్రాసనంవేసి కూర్చుని స్తోత్రంచేశాడా యువయోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలివస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమెహృదయంలో ఒకానొక సాత్త్వికతేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.

 ఆహా! తన శక్తిపీఠస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడీ యువకుడు? అవునుతాను "త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ". సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తిరూపిణిగా, పరాశక్తిగా ఉండే తనఉనికిని ఎంతచిన్న శ్లోకంలో ఎంత చక్కగావర్ణించి గుర్తుచేశాడు. మరితనలో ఈ తామస భావాలేమిటి? తనసృష్టినితానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలోపడింది అమ్మవారు. 

 ఆదిశంకరుల ముఖకమలంనుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణపుటలనుదాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. "ఏమిటిది?  ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరోరూపమా! ఏమి పదలాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరం! ఏమి భక్తితత్పరత! ఏమివర్ణన? శ్రీచక్ర రాజంలోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలా మలకము!"  ఆనుకుంది అమ్మవారు.

 "ఎవరు నాయనా నీవు ?  నాదారికడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్నుచూచి నీస్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలమాగానంతే. నీవుతొలగు. నిజానికి నీవీపాటికి నాకాహారం కావలసినవాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది"అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపుచూస్తూ.

 ఆదిశంకరులు సాష్టాంగ దండప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి..." గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. "నవవిద్రుమ బింబశ్రీ శ్రీన్యక్కారి రదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రనిరంగును గుర్తుకుతెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి "శుద్ధ విద్యామ్ కురాకార  ద్విజపంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. 

 "కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన "కచ్ఛపి"  మధురనాదాన్ని మించే సుస్వర, సుమధురనాదంతో జగన్మాత ఇలా అన్నది. "నీ స్తోత్రాలకు, నీ భక్తికీ మెచ్చాను. నీవు, నీకవిత్వం చిరస్తాయిఅయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీనుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయ గలిగినవారు శ్రీచక్రార్చన చేసినంతటిఫలం పొందుతారు". 

 " నీకు ఏవరం కావాలోకోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నాసంహార కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించకఅనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు" అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు. 

 "బాల్యంలో తెలిసీతెలియని వయసులోనే నేను సన్యసించానుతల్లీ, నాపేరు శంకరుడు. దేశాటనం తోనూ, వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇదిగూడా ఎంత కాలం తల్లీ!"

 "కానీ నా హృదయంలో నా బాల్యకోరికొకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడూ బాధిస్తుంటుంది" అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. "ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని, నేనుండగా  నీకేమికొరత నాయనా! అడుగు నీ కోరికతీర్చి, నేను నా సంహారకార్యక్రమానికి వెళ్లిపోతాను" అన్నది. ఇంకాఆమెలో తామసికవాసనాబలం తగ్గలేదు.

 పసితనపు  అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. "అమ్మా ! నాతో పాచికలాడతావా ?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు" 

  "మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా! నీకు తెలుసోతెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధనపెడతాను. నేనుఓడిపోతే ఆయన ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆప్రశ్నలు లౌకికమైనవికావు. ఎన్నో వేదాంతరహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకారధ్యేయంతో ప్రశ్నిస్తాను". 

 "అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవీ,దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా! అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసం?లోకకల్యాణం కోసం. మౌన ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగంనుండి ఒకానొక కాంతికిరణము మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు.  

ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికిలోనైంది. "శివా, పరమశివా! తల్లితో ఆడేఆటలో పందెంగా ఏమికోరాలో వాక్కుప్రసాదించు సుందరేశ్వరా!" అనుకున్నాడు లోలోపల. అది భావనారూపంగా పరమశివునినుండి అందింది. "పందెమేమిటి నాయనా?" అని మళ్ళీ అడిగింది అమ్మవారు. "ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తననైపుణ్యాన్ని సుందరీశ్వరునికికూడా తెలియచేయాలి" అనే  ఉబలాటము ఆమెలో వచ్చేసింది

  "తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒకవాగ్దానాన్ని పందెపుపణంగా నేనుపెడితే నీకు అభ్యంతరమా తల్లీ?" అన్నాడు శంకరాచార్య. "తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేసేయ్" అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులుమెచ్చి మహాత్కీర్తి రావాలనే కోర్కెకోరుతాడని ఉహించింది"  

  "తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామసశక్తివై  ఈ సంహారకార్యక్రమం చేయడం నాకు బాధగాఉంది. ఆటలోనీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమం ఆపేసి అందరినీకాపాడాలి. నేనుఓడితే మొదటగా నేనే నీకు ఆహారవుతాను". అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య.  

 జగన్మాత నవ్వింది. "నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాటప్రకారాం నేను ఈ సంహారకార్యక్రమం ఆపేస్తాను, సరేనా!" అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగాఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు, రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహ పరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి,  తన సంహారకార్యక్రమం కొనసాగించాలని  ఆలోచించింది. 

  ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. "తల్లీ! దివ్య మహిమలుగల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకుపడేలా ఆ పాచికలలో నీ మహత్యంనింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవునాతో పాటు ఈ విశాలమండపంలో కూర్చోనవసరంలేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనంమీద కూర్చోమ్మా!" అన్నాడు.

 "ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదటవేయి.  చిన్నవాడివి. నీవు మొదట ఆడడమే న్యాయం" అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినేనాడూ చూడలేదు. ఈబిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది.  మరి మీఇష్టము!" అన్నది.  సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. 

 ఆదిశంకరులు "తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు  ఈక్షణాన నాచేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టేకదా! ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా! జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది? మళ్లీ మళ్లీ ఈ అవకాశం రాదునాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది.

 నీ లలితాసహస్రనామంలోని  కొన్ని నామాలు, వాటిఅర్ధాలు ఆలోచిస్తూ  ఈక్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీనామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింపచేసే అర్ధాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది". అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.

 సంఖ్యాశాస్త్రప్రకారము  పావులు కదులుతూ ఉన్నాయి.  సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందముంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. "తాటంక యుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది. 

 ఆ తల్లి తాటంకాలకాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా 
కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు. తల్లి నవ్వింది. "విజయమంటే విజయం నాదేకదా నాయనా!" అన్నది. ఆటమధ్యలో ఆపి, కించిత్ గర్వంగా.. విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం 
కనిపించాయి. 

 "విజయం నాదయినా, నీదయినా రెండూఒకటే తల్లీ.! నీలోనుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒకనాణేనికి బొమ్మా బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపుఅంచుకు చేరుకున్నవ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయ లక్ష్మి  చివరిక్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగల్గిన వారికి విజయమైనా, పరాజయమైనా ఒకటేకదమ్మా.

 పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది.  ఆ పరాజయంద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవంయొక్క పాదాలను పట్టుకొనేలాచేస్తుంది. ఇది మాత్రం విజయంకాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. 

 "గెలుపోటములు, ద్వంద్వాలు. సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైతస్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్ధగురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో". లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికిరాగా పైకనేసింది. "నాయనా! నీ ప్రతిఅక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరునిసాక్షిగా నేను కపటం, మోసంచేయను" అన్నది అమ్మ.. "గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ!" అన్నాడు ఆదిశంకరాచార్యులు.

 ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపుపొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారిపాదాలవద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచిముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధముచేసాడు. జగన్మాత సంతోషించింది. దివ్యపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆటపూర్తయ్యేవరకు  "నీకోరిక మేరకు నేను నాస్థానములో కూర్చుంటాను", అంటూ గర్భగుడిలోకి వెనక్కివెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. "ఎంతచిన్న కోరిక కోరాడీడింభకుడు. ఓడించకూడదు" అనే జాలికూడా కలిగినది. 

 పీఠంమీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము  మాయమై నిర్మలత్వం వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటిమార్పుఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీదృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామసశక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధముచేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈఆట నడిపించు" అని మనసారా ప్రార్ధించాడు. 

వెంటనే అతని హృదయానికి చందనశీతలస్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వరకటాక్షమని అర్ధమయింది. "ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తేచాలు. "ఆ బ్రహ్మకీటజననీ!" ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవితనాలో శ్లోకరూపంలో పెల్లుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అదికవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది. అంటూనే నిర్వాణషట్కoలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం" రాచనగరులో తెల్లవారుఝాము అయింది. ఆ గుర్తుగా మేలుకొల్పు నగారా మోగింది. 

 అమ్మవారు తృళ్ళిపడింది. ఈ యువయోగి మధురవాక్కుల్లో కాలమాగిపోయి, త్వరగా ఝాము గడిచింది. "తల్లీ! ఇంకాకొద్దిగా ఆట ఉంది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. "విశ్వానికి సాక్షిణిని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా?!" అని అడిగింది. జగన్మాత అతని నోటివెంట ఆనామాలకు అర్ధాలు వినాలనే కుతూహలంతో. "తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలేగదమ్మా! సర్వవిశ్వానికి సాక్షిణివైన నీవు ప్రాణులకు కాలంతీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం  రెప్పపాటుసాకుతో మూసుకుని సాక్షివర్జితవవుతావు. అలాచేయకపోతే నీసృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ!"అన్నాడు.

  "ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈయువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలం వినోదమా!కాదు, కాదు. ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డా?" ఆట పూర్తి కాలేధీరోజు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామసశక్తి మరుగై సాత్వికశక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలమొస్తుంది. ఆలయ పూజారులొస్తారు. అభిషేకాలు, పూజావిధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని కచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడొస్తాడు. "భానుమండల మధ్యస్థా" తన స్థానం. ఎంతమార్పు ఒక్కరాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రమేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. 

 "తన ఆట కట్టేసాడా! తీరాతను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగినతాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహారశక్తి ఆపెయ్యాలి". అని మనసులో అనుకుంటూ ఇక ఆటమీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తి పూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి ("పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానంచేస్తూ పావులు చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదలపెరిగి త్వరత్వరగా పెద్దపెద్ద పందేలుపడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపనికి ఒక నిర్దిష్టసమయం, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తిపధానికి మొదటిమెట్టు. 

 "నాయనా! చివరి పందెంనాది. నాపావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోషతరంగాలలో తేలిపోతూ. "అవునుతల్లీ! భూపురత్రయం, 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేనుకూడా. 9వ ఆవరణ చేరాముతల్లీ, నీవు బిందువులో  యధాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సిన కైవల్యమేముందమ్మా! జగన్మాతచేతిలో ఓటమికూడా గెలుపేతల్లీ, ఇలాంటి ప్రత్యక్ష  ఆట ఎవరికి దక్కుతుంది?" అన్నాడు దివ్యపాచికలు అమ్మవారిముందు పెడుతూ.

 "నేను గెలిచాను. మరిమన ఒప్పందంప్రకారం నా సంహారకార్యక్రమం నేనుకొనసాగిస్తాను. జగన్మాతనైన నాతోపాచికలాడి నీ కోర్కెతీర్చుకొని, పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా!"అంది అమ్మవారు. "అవును తల్లీ! ఆటపరంగా విజయం నీది. కానీతల్లీ, ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నాడు దృఢస్వరముతో. అమ్మవారు "ఏమిటి? సంఖ్యాశాస్త్ర పరంగానా!" అన్నది, ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో.

 "నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రము నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి  నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వములోకి, తమస్సులోకి జారిపోదా!" అంటూ క్షణకాలమాగాడు ఆదిశంకరాచార్యులు. 

 దిగ్భ్రాంతిపొందిన అమ్మవారు మండపంలోకి దృష్టిసారించింది. కోటిసూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టికళలతో, షోడశకళలతో బిందుత్రికోణరూపిణిగా కొలువైవుంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు. గెలుపుతనదా! కాదు కాదు ఆ యువయోగిదే. ఆదిశంకరుడు "అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహమొస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివునిగూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆస్వామి చేస్తారు. 

 అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒకబిడ్డ చేతిలో ఓడిపోయింది. "ఒక్కసారి నీ పాదాలవద్దనుండి మండపంలో చిత్రించిన ఈఆట చిత్రంవరకు నీ  విశాలనయనాల చల్లనిదృష్టి సారించుతల్లీ!  తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ!  నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటికూడా తప్పుపోకుండా ఏకరువుపెడతాను తల్లీ, ఒక్కసంఖ్య, ఒక్కఅక్షరం పొల్లుపోదు. తప్పు, తడబాటు నాకురాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను  చూడుతల్లీ!"

 44కోణాలు, 9ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆటచిత్రంలో చూడమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపుసంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్వికబీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి, ఏపొరపాటు రానీకుండా న్యాయబద్దంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయంవరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. 

 "అకారాది క్షకారాంత" దేవతాశక్తి స్వరూపాలకు వారివారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైనవారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీస్వరూపాలను, యోగినీదేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చనగదా తల్లీ!నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాలసహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూవస్తున్నాను".

  "ఆకార్యక్రమంలో భాగంగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రముచేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ట చేసాను. అదే నీముందున్న "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:" "ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్తవైపు  కించిత్ లజ్జ, కించిత్ వేదనతో  బేలగా చూసింది. మధుర మీనాక్షి. ఈయువకుడు అద్భుతరీతిలో సంఖ్యల అక్షరాలనుసంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. 

 "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం?" అమ్మవారు ఆర్తిగాపిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయంలో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరునిరూపం తండ్రిగానూ, తనతప్పుకు క్షమాపణవేడుకుంటూ "శివ అపరాధ  క్షమాపణ స్తోత్రము" గంగాఝురిలా ఉరకలేసిందాక్షణంలో. అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. 

 ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వదేవీ, దేవ గణాలు ఆస్వామి తీర్పుకోసం ఎదురుచూస్తున్నాయి. శివుడు కళ్ళుతెరిచాడు. చిరునవ్వునవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తలవిదిలించి రంకెవేసాడు. మధురాపట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామివెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలివచ్చింది. ఆలయగంటలు అదేపనిగా మోగాయి. 
 భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రంచేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయమండపంలో సాక్షాత్కరించాడు. "దేవీ!" అన్నాడు పరమశివుడు.  
మధురమీనాక్షి వినమ్రంగా లేచినిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడామె "మందస్మితప్రభాపూర మజ్జత్ కామేశమానసా". తామసం మచ్చుకైనాలేని మమతాపూర్ణ. భర్తఆజ్ఞ, తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. 
 
 పరమశివుడు ఇలాఅన్నాడు. "దేవీ! నీఅహాన్ని, నీ తామసస్వభావాన్ని అదుపుచేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు.  ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నాఅర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్తసంగునిగా జన్మించి, ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి.

 అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నాఅంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి, అతడిని ఆసేతుహిమాచలం పర్యటన సలిపేలాచేసింది. అతినిరాడంబముగా సాగించిన అతని పర్యటనయొక్కఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైననాకు మాత్రమే తెల్సు. 

 కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధపూరిత ఆలోచనలతో  తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింతఉగ్రరూపము సంతరించు కునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసికశక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారుచేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయింది. వారు పతనమైపోయారు.  బ్రష్టులయ్యారు. కానీనీలో తామసికరూపం స్థిరపడిపోయింది. లోకకల్యాణంతప్ప మరోటికోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసికశక్తిని రూపు మాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలితప్ప, భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్వికకళలను ప్రతిష్టించాడు. నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్తులకు శ్రేయోదాయకమైంది". అని సుందరేశ్వరుడు అన్నాడు. 

 అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. "ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాలశంకరుడే. భర్త శంకరునివైపు, బిడ్డలాంటి బాలశంకరునివైపు మార్చి,మార్చి చూసింది. ఆఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆసమయంలోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరునిరంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆరాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య భలైఉంటాడని
 భయబ్రాంతుడయ్యాడు.

  రాజుతోపాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయంవైపు పరుగులుతీశారు. ఆ యువయోగి మరణిస్తే, తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికొచ్చి, కత్తిదూసి ఆత్మాహుతికిసిద్ధమై, ఆలయప్రవేశం చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్తదూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రముచేస్తూ తన్మయత్వంలో మునిగిఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్య రాజు "స్వామీ! నీవు జీవించేవున్నావా! నన్ను ఘోర నరకములో పడకుండాచేశావా!" అంటూ శంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. "తల్లీ! మరల నీసాత్వికరూపాన్ని కళ్లారా చూస్తున్నాను" అని వారి పాదాలను అభిషేకించాడు. 

 సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇకనీవు ఆవేదనపడద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాందిపలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడఉంటే అక్కడ అమ్మవారు కొలువైఉన్నట్టే. గృహాల్లో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతోఉంటే ఫలితం కలుగుతుంది సుమా!" అన్నారు స్వామి.. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది. 

 ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్రప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృస్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతంలో మోకరిల్లి, నమస్కరిస్తే వారిహృదయంలో ప్రకంపనలుకల్పించి ఆశీర్వదిస్తుంది ఈయంత్రం. పాండ్యరాజు తన జన్మసార్ధకమైందని ఆనందించాడు. "నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైంది, నీవు కారణజన్ముడవు. మరేదైనా వరముకోరుకో!" అన్నది అమ్మవారు. "ఏ వరమూ వద్దుతల్లీ! నా నోటివెంట నీవుపలికించే ప్రతిస్తోత్రం లోనూ, మీస్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగా, ఆశ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే  వారి జీవితాలు ధన్యమయేట్టుగా, నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి, నా శరీరపతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగాఉండాలి". 

 "నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు."అలాగే నాయనా! తథాస్తు" అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యధా స్థానాల్లో అర్చక మూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి.

మూలమ్: #శ్రీలలితాసహస్రనామ_సర్వస్వం 📙

🍁🍁🍁🍁

87...  స్నేహం 


విశ్వము నందు  విశేష  విశిష్ట  మైనది  మన  భారత  దేశం,  మన  భారతీయు లందరు  ప్రతి  ఒక్కరికి విజ్ఞానమును అందించే వారు, మరియు అందరికి  సహాయ  పడేవాళ్ళు , అన్ని  విదాల అందరికి  సహకరించే నిజమైన  స్నేహితులు. జీవిత మంత  ఆనంద శాంతి సుఖాలును పొందే దేశం.

"శైశవేభ్యస్త విద్యానాం, యోవనె విషయైషిణామ్ "
వార్ధకే ముని వృత్తినాం, యోగేనామ్తే తనుత్యుజామ్ "

బాల్యదశలో గురువుల వద్ద వేదాది, సత్య విద్యలు అభ్యసించాలి, గురువే మొదటి స్నేహితుడు, యోవనదశయందు విద్యనేర్చుకొని, చక్కని  ఉద్యోగము సంపాదించుకొని, గృహస్తునిగా మారి, ధర్మం తప్పక కౌమాది సుఖములు భోగించే, సత్ - సంతానం  బడయి వలెయును,  ఉద్యోగము, భార్య నిజమైన స్నేహితులు ఏది తక్కువైనా జీవితము నరకమగును.

కౌమార దశలొ సంతృప్తి పడి  పిల్లలకు వివాహాది శుభకార్యములు చేసి సుఖగా జీవించుటే (ఇందులో మనసే నిజమైన స్నేహితుడు) వృద్ధాప్యంలో మోక్షమార్గం కొరకు దేవుణ్ణి ప్రార్ధించ వలెను, ఇప్పుడే దేవుడే నిజమైన స్నేహితుడు.

స్నేహం అందించే ప్రేమ, అప్యాయతనురాగాలు, ఓదార్పు, ధైర్యం, మనుష్యులను సజీవంగా  ఉంచ గలుగు తుంది.
స్నేహం "అనేది ఉదయించు చున్న సూర్యుడిలా వెలుగును" , "చీకటిలొ వెన్నెలను" , మనస్సు శాంత పరిచే చల్లగాలిని అందించేది.
 
స్నేహానికి " కుల- మతాలూ, ధనికులు - పేదవారు, స్త్రీ - పురుషులు " అనే భెధము ఉండదు.
ఆపదలో ఆదుకున్నవాడు, మిత్రుడిలో తప్పును వేలు ఎత్తి చూపెవాడు  నిజమైన స్నేహితుడు.
 
ఏకాంతములో తప్పును సరిదిద్దుకోమని చెప్పి, పది మంది ముందు పొగడేవాడే స్నేహితుడు.
స్నేహితుల  యందు ప్రేమ ఉన్నంతకాలము  వారి మద్య అమృతము వుంటుంది, ప్రేమ చెడిన విష తుల్యముగా మారుతుంది
 
స్నేహితులమద్య కొన్ని శక్తులు విదదీయుటకు ప్రయత్నిం చెస్తాయి, అటువంటి పరిస్తితులలో నిజాలు తెలుసుకొని స్నేహాన్ని విడువకుండా ముందుకు సాగి పోవాలి.

రామాయణంలో సీతా దేవి కోరకు రామ లక్ష్మణులు  వెతుకుతూ రుష్యమూక పర్వతము వద్దకు చెరారు, అప్పుడు సుగ్రీవుని మంత్రి గాఉన్న హనుమంతుడు రామ లక్ష్మణులు వద్దకు వచ్చివివరములు అడుగగా "హనుమ"  అన్న పలుకులతో  పరవశించి పోయాడు
సకల వ్యాకరణములు  తెలిసిన వాడు హనుమంతుడు, అప్పుడే స్నేహధర్మాన్ని అనుకరించి రామలక్ష్మణులను తన భుజములపై కూర్చొపెట్టుకొని కొండపై ఉన్న సుగ్రీవుని వద్దకు తీసుకెల్లి, వారిద్దిమద్య అగ్ని సాక్షిగా స్నేహము కుదిర్చిన మహాను భావుడు, సుగ్రీవుడు తన స్నేహ హస్తము అందించి సీత జాడను కనుగొని, సీత రాముని వద్దకు చేరేదాక స్నేహధర్మాని చాటుకున్నాడు.

భాగవతంలో శ్రీ కృష్ణుని బాల్యమిత్రుదైన సుదాముడు (కుచేలుడు) వచ్చినట్లు వినగానే వేగముగా పోయి సాదరముగా ఆహ్ఫానించి, స్వయముగా భార్యలు నీరు పోయగా పాదములు కడిగాడు, నాకోసం ఏమి తెచ్చావు అని అడుగుతూ ఉత్తరీయము కొంగులో ఉన్న గుప్పెడు అటుకులను నోటిలో వేసుకొన్నాడు, కుచేలుడు వచ్చిన పని మరచి  ఇంటికి  వెళ్ళగా అక్కడ ఆనందంతో పెద్ద భవనములో ఉన్న భార్య పిల్లలను చూసి సంతోషించాడు కుచేలుడు, అందుకే " స్నేహితుని అవసరాలు తెలుసుకొని సహాయము చేసినవాడే నిజమైన స్నేహితుడు " 

భాగవతంలో బలి చక్రవర్తి వామనుడు అర్ధించి నట్లు మూడడుగులు   ఇచ్చుటకు నిర్ణయిమ్చాడు, బలిచక్రవర్తి గురువు వచ్చినవాడు  రాక్షస సంహారి హరి అని తలంచి ఒక స్నేహితుడిగా, గురువుగా అవసరమైనప్పుడు అభద్ధమాడవచ్చు అని తెలియ పరిచాడు, మూడ డుగులు దానము చేసి పాతాళానికి తొక్కబడిన ఇప్పడికి పూజ  లందు  కొంటున్నాడు, గురువుగారి అపకీర్తి అలాగే నిలబడి పోయినది.
 
స్నేహాన్ని  తెలియపరుస్తూ కొన్ని అంత్య   భావ  కవితలు ఇందు పొందు పరుస్తున్నాను, అవి కూడా చదివి మీ అభిప్రాయాలు నాకు తెలుపగలరు
 
--(())--

88... ఒక నాటి ఉల్లి కధ  

శ్రీమతిగారు ఈరోజు T .V. చూసావా   

బంగారం తగ్గింది కొందాం వస్తావా 

శ్రీవారు మరి మీరు ఈరోజు T .V  చూసారా 

ఉల్లి ధర పెరిగింది  ఇంకా పెరుగుందట తెలుసుకోవా 

బంగారం దాచుకోనేది - ఉల్లి కోసం దోచుకుంటారేమో బావా

 నేను వెళ్తున్న ఉల్లి కొనటానికి  అదార్ కార్డు కావలిటి బావా 

అది ఎవరన్న దోచికేల్తారని లాకర్లో పెట్ట, తెచ్చేదాకా కూడు లేదు బావా 

ఉల్లి రేటు పెరిగి నన్ను వంటవాడ్నిచేసింది  ఇదేమి లోకం ?

తెచ్చారా మీరు కూడా  నాతోరండి క్యులోనున్చోవాలి ... ఆ

 ఉల్లి కోసం 


ఉల్లి చేసిన మేలు చేయదు తల్లి

ఉల్లి కారం కలిపి తినిచూడు కిల్లి

ఉల్లి తినాలనిపిస్తుంది మల్లి మల్లి

ఉల్లి కోసం చేయకు ఇపుడు లొల్లి


ఉల్లి తరిగితే కారు తుంది కన్నీరు

ఉల్లి కొనాలంటే వస్తున్నాయి కన్నీరు

ఉల్లి లేని సాంబారు  ఉత్తుత్తి  న్నీరు

ఉల్లి తెస్తే పన్నీరు లేకపోతె  ఇక కన్నీరు  


ఉల్లి రేటుకు వాడని హోటళ్ళు

ఉల్లి ఎక్కువ కమ్మే  లోగిళ్ళు 

ఉల్లి కొనాలంటే సంసారికి కన్నీళ్ళు

ఉల్లి అమ్మేచోట అంతటా  కుళ్ళు


ఉల్లి కొంటున్నారు ఉన్నవారు రేటు ఎక్కువైన

ఉల్లి ముక్కలు లేని అట్టు తింటారు ఎక్కువైన

ఉల్లి ధరపెరిగితే ప్రభుత్వాలు పడును ఎప్పుడైన 

ఉల్లి ప్రభుత్వమా కళ్ళుతెరిచి అమ్మాలి తక్కువకైన  


ఉల్లి రక్షించు వేసవి వడ దెబ్బ

ఉల్లి కాంక్షించ వద్దు నీ  వబ్బ

ఉల్లి  వాడని తిండి తినా లబ్బ    

ఉల్లి కోసం పిల్లాడులా లొల్లి చేయకబ్బ 


ఉల్లి చేసిన మేలు  తల్లి కూడా చేయదు అనా\టి సామెత - 

ఉల్లి ధర పెరిగితే ప్రభుత్వాలు పడతాయి  ఇనాటి సామెత 


89.. శ్రీ సీతామరామాంజనేయ చరితం (2)

శ్రీరాముడు-యోగరహస్యము -అరణ్యకాండ.6

పంచవటి
పంచవటి ప్రస్తుతము నాసిక్ ప్రాంతమందు ఉన్నట్లుగా కొందరి నమ్మకము. ఇక్కడ ఐదు వటవృక్షాలు ఉండుట వలన ఇది పంచవటిగా ప్రసిద్ధి చెందినది. అయితే కొంత శోధన చేసిన తర్వాత తెలియునది ఏమనగా ...  శ్రీరాముడు దండకారణ్యములో ఉన్న సమయములో సీతాపహరణ తర్వాత కలత చెంది, దుఃఖించుతూ లక్ష్మణునితో కలసి ఘోర అరణ్యములు తిరుగుతూ కర్తవ్యము పాలుపోక ఉన్న స్థితిలో అగస్త్య మహాముని శ్రీరాముని సమీపించి మోహము వీడమని చెప్పి విరజా దీక్ష (పాశుపత. శివ దీక్ష) ఇచ్చెను. ఆ మహర్షి ఆనతిన శ్రీరాముడు రుద్రాక్షలు, త్రిపుండరములు ధరించి గోదావరి తీరమున రామగిరి యందు శివ లింగము ప్రతిష్టించి శివానుగ్రహము కొరకు చాతుర్మాస్య దీక్షలో తపస్సు చేసెను. అందుకు శివుడు సంతోషించి పార్వతి పరివార సమేతంగా దర్శనము ఇచ్చి గొప్ప ధనస్సును, అమ్ములపొదిని, పాశుపతాస్త్రమును అనుగ్రహించి ఆశీర్వదించెను. సంశయాత్మ కలిగిన శ్రీరాముడు పరిపరి ప్రశ్నలు వేయగా శివుడు అతని మోహము పోగొట్టుటకు సమాధానాలు చెప్పెను. 

ఈ శ్రీరామ పరమేశ్వర సంవాదమే "శివ గీత". ఇది వ్యాస మహర్షి చేత వ్రాయబడిన పద్మ పురాణాంతర్గత ఉత్తర ఖండములోగల ఈ శివ గీత లో 779   శ్లోకాలు ఉన్నవి.   శ్రీరాముడు శివుని కోసము తపస్సు చేసిన రామగిరి ప్రదేశము భద్రాచలమునకు 55  కి.మీ.దూరంలో కూనవరం దగ్గర రామగిరి కొండలలో గోదావరి నదీతీరంలో శివాలయము ప్రతిష్టించబడినది. ఇది భైరవ క్షేత్రంగా ఆరాధించబడుతున్నది.  భద్రాచలం దగ్గర ఉన్నటువంటి పర్ణశాలయే పంచవటిగా మన తెలుగు ప్రజల ప్రగాఢ విశ్వాసము. సీతాపహరణము తర్వాత శోకతప్తుడైన రామునికి ఈ ప్రదేశము నందే పరమ శివును గురించి చాతుర్మాస్య దీక్షను తీసుకొనెను. అక్కడ నుంచి సీతాన్వేషణతో జటాయు మరణించిన ప్రదేశమునకు వెళ్లెను అదియే ఆంధ్ర ప్రదేశ్ అనంతపూర్ జిల్లాలోని లేపాక్షి (లే పక్షి అదియే కాలాంతరమున లేపాక్షిగా నామాంతరం చెందింది). అక్కడ నుంచి ఋష్యమూక పర్వతము నకు వెళ్లెను. అది ప్రస్తుతము కర్ణాటక లోని హంపి దగ్గర ఉన్నది. ఆయా ప్రదేశములన్నియు లేఖకుడు (దుర్గా ప్రసాద్ చింతలపాటి) దర్శించియున్నాడు. ఇక్కడ ఇంకొక విషయము గమనించ వలసినది. సీతను అశోక వనములో పెట్టునప్పుడు, రావణుడు సీతకు పండ్రెడు మాసముల గడువు ఇచ్చినాడు (శృణు మైథిలి, మాద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని). అక్కడ నుంచి గమనించితే శ్రీరాముడు నాలుగు నెలలు పరమ శివుడుని గురించి తపస్సు చేయుచు చాతుర్మాస్య దీక్షలో యున్నాడు. తరువాత వర్ష ఋతువు కారణంగా (మూడు నెలలు) సీతాన్వేషణకై  సుగ్రీవాదులు  ప్రయత్నము చేయలేదు.  తరువాత సీతాన్వేషణకై ఒక నెల గడువు వానరులకు సుగ్రీవుడిచ్చెను. దక్షిణమునకు ఏగిన అంగదాదులు మరియొక మాసము అదనంగా తీసుకొనిరి. హనుమ సీతామాత దర్శనము చేసుకున్నప్పుడు, రావణుడు ఇచ్చిన గడువు రెండు నెలలే ఉంది అనును. ఇవి మొత్తము 11 నెలలు అయినది. కావున భద్రాచలం వద్ద ఉన్న పంచవటీయే నిజమైన పంచవటి అని మదీయ ప్రగాఢ విశ్వాసము. (శబరి నదీరూపమున ప్రవహించెనని కొందరి అభిప్రాయము. కానీ రామాయణకారుడు ఇట్టి విషయము చెప్పలేదు గావున గమనించవలసినది) ఏదైనా ఎవరి విశ్వాశములు వారివి.


శ్రీరామ జయరామ జయజయ రామ

90.. దేవుడున్నాడు (చిన్న కధ )

దేవుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మ జ్ఞానం కలిగేలా చేస్తాడు.

కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న పేరంపాలచ్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురూ పేదరికంలో ఉన్నవారే, పుట గడవడానికి కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడమే.దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు , మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని, వంట చేయడానికి వంట మనుషులు కావాలనీ వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు.

ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వొంగిపోయి, నిలబడడానికే శక్తిలేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా !!! అనుకున్నాడు ఎగతాళిగా నవ్వుతూ ఈ వయస్సులో మీరు వంట చేయటానికి వచ్చారే! ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో 1000 గుండిగల అన్నం , కూరలు , పప్పు, చారు అన్నిరకాలు చేయాలి , ఈ వయసులో మీరు అంత పని చేయగలరా! ఈ వయస్సులోకూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయటానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు.

కృష్ణుడి భక్తులైన ఆ నలుగురు వృద్దులు అతని మాటలకు బాధపడి, ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కాని దేముంటుంది చెప్పండి. మా ప్రయత్నం మేము చేస్తాము , అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్పారు. బానే ఉంది మీరు చెప్పేది, మీ భారం ఆ కృష్ణుడి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి ? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా ? ఇది మీ శక్తికి మించిన పని మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదు అన్నాడు. అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి , మేము ప్రయత్నిస్తాము, ఇది వరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకున్నది అన్నారు. సరే చూస్తాను, తేడా వచ్చిదంటే ముసలివాళ్ళు అని కూడా చూడను జాగ్రత్త అన్నాడు .

గురువాయిరుప్పా ! నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచలతో మదగజాలను కట్టేయచ్చు, దేనినైన సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించాగానే కలుగుతుంది ప్రభూ, నీ మీదే భారం వేసాము మమల్ని కాపాడు అని అనుకుంటూ వారు వారి స్థలానికి వెళ్లిపోయారు.

మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గం.లకు నిద్ర లేచి ప్రక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్లారు.అప్పుడు వాళ్లకి అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు మొఖం కడుకుంటూ కనిపించాడు. వాళ్ళు ఆశ్చర్యంతో నాగోరి! నువ్వు ఎప్పుడు వచ్చావ్ ఇక్కడికి అని అడిగారు, అప్పుడు ఆ బాలుడు నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారు అని తెలిసింది, వృద్దులైన మీకు సహాయం చేయటానికి నేను వచ్చాను అని అన్నాడు. ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు.

వంట పని మొదలు పెట్టారు. ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేసారు కానీ ఆ బాలుడే వంట మొత్తాన్నీ చక చక పూర్తి చేసాడు. ఉదయం 9 గంటల కల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసం పొంగల్, పులిహోర , అన్నిరకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు. అందరూ ఆశ్చర్యపోయారు.

వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి , చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాప పడి, క్షమాపణలు చెప్పి, నలుగురు కృష్ణ భక్తులకూ ఘనంగా సత్కారం చేసి, పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు.

వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరీ గురించి ఆ కార్యనిర్వహకునికి తెలియదు. వారికి సత్కారం జరుగుతుండగా " నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి, నాకోసం అక్కడ ఎంతో మంది వేచి ఉన్నారు " అన్ని చెప్పి నాగోరీ భోజనం కూడా చేయకుండానే అక్కడినుండి వెళిపోయాడు.

ఆ నలుగురు భక్తులూ భోజనం చేసి గురువాయూర్ వెళ్లారు. వాళ్ళు ఆ ఆనందంలో, ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. గురువాయూర్ లో దర్శనం చేసుకొని వాళ్ళ నలుగురు వాళ్ళ సొంత ఉరికి వెళ్లిపోయారు.

ఆ రోజు రాత్రి నలుగురికీ ఒకే కల వచ్చింది.ఆ కలలో " గురువాయూరప్పన్ కనిపించి భక్తులారా ! నాగోరి లాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలి ఇవ్వకుండా వచ్చేసారే, నా చేత పని చేపించుకొని కూలి ఇవ్వకపోవటం మీకు న్యాయమేనా " అని అడిగాడు.

ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు.ఆశ్చర్యం అందరికీ ఒకే కల వచ్చింది, అది కలా కాదు కాదు అందరికీ ఒకే దివ్య దర్శనం , సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనందబాష్పాలు రాలుస్తూ , గురువాయురప్పని కీర్తిస్తూ , జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూర్ చేరి స్వామి వారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు.

ఆ సంఘటన మూలంగా ఇప్పటికి కూడా 1000 గుండిగల నైవేద్యం చేసి గురువాయూరప్పన్ కి పూజలు చేస్తున్నారు.ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికీ వచ్చిన కూలిడబ్బులో ఒక వంతు దేవుడికి నేటికీ సమర్పిస్తున్నారు.
అందరికీ ఈ అద్భుతమైన శ్రీ కృష్ణుని లీలను షేర్ చేయండి
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే

మనవి 

గౌరవనీయులైన తెలుగు రాష్ట్రాల ప్రజలు, భారతదేశం మరియు ప్రపంచము తెలుగు భాష ను అదఃరించే ప్రతిఒక్కరిని పేరుపేరునా కృతజ్ఞతలు, నమస్కారములు, ఎందరో మహానుభావులు అందరికి వందనములు నేను అనగా "మల్లాప్రగడ రామకృష్ణ" విశ్రాంతి యకౌంట్స్ ఆఫీసర్ గా (స్కూల్ ఎడ్యు కేషన్ డిపార్ట్మెంట్)  పనిచేసి 30 -06 -2019  పదవి విరమణచేసితిని, ముఖ్యముగా నాభార్య శ్రీదేవి సహకారంతో " ప్రాంజలి ప్రభ " ఆన్లైన్ ల్లో 12  బ్యాగుల సహాయంతో, 2012 నవంబర్ ౦౩ నుండి తెలుగును బతికించాలని ఉద్దేశ్యంతో సొంతగా వ్రాయాలని ప్రారంభించాను  అప్పటి నుండి ఇప్పటివరకు 50 జి పి గూగుల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా సేకరించటం,(ఆయా సంస్తలలో పనిచేయు వారికీ శుభాకాంక్షలు)  మరియు నా సొంత రచనలు ఎప్పటికప్పుడు అందరికి అందిస్తూ వచ్చాను, ఇది ఎవరిని ఉద్దేశించి వ్రాసిన కధలు కావు, నాకు నచ్చి సేకరించిన కధలు ఎవరు వ్రాసారో నాకు తెలియదు  వారందరికి  నా నమస్కారములు                      

2012 వ్రాసినవి నాకు నచ్చినవి ఒక క్రమంలో ఉంచుతున్నను. (మాతాతగారు నిజాం ఆస్థానంలో పండితుడు జోశ్యులుగా ఉన్నారు మానాన్న, పెదనాన్నలు అందరూ పండితులే) వారి జ్ఞాపకార్ధం నేను తెలుగులో  వ్రాస్తున్నాను) తప్పులుంటే క్షమించగలరు.

ఐ విధేయుడు ... ప్రాంజలి ప్రభ ... మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ , ౯౮౪౯౧౬౪౨౫౦

       


1 comment: