Monday 24 May 2021

ప్రాంజలి ప్రభ పాత కధలు (41- 50)


image

  
1 ,,,, చందమామ కధలు 

సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవీ రామకృష్ణ 

వెర్రి వెంగళమ్మలు: (  )

అనగనగా ఒక ఊళ్ళో పశువుల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని భార్య వెంగమ్మ నిజంగానే ఒట్టి వెర్రి వెంగళమ్మ. ఒక రోజున వ్యాపారి ప్రక్క ఊరి సంతకు ప్రయాణం అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను భార్యతో చెప్పి వెళ్ళాడు- "నేను రెండు రోజుల వరకూ తిరిగి రాను వెంగమ్మా! అయితే రేపు మన దగ్గరున్న మూడు ఆవుల్నీ కొనేందుకు బేరగాళ్ళు వస్తారు. ఒక్కో ఆవూ వంద నాణాల లెక్కన, మూడు ఆవులనూ మూడు వందల నాణాలకి అమ్ము. సరేనా?! వాళ్ళు అంతకంటే తక్కువకి బేరం అడిగితే మటుకు ఏమాత్రం ఒప్పుకోకు. అర్థం అయిందా, నేను చెప్పేది?!” అని.

“మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా వెళ్ళి రండి. అదంతా నేను చూసుకుంటాగా!" అంది వెంగమ్మ. “ఏంటోనే, నువ్వు ఎప్పుడూ అలాగే చెప్తావు; కానీ ఏదో రకంగా పిచ్చి పనులు చేసి మోసపోతావు! ఈ విషయంలో ఏమీ తప్పులు జరగకుండా ఉండాలనే ఇంత చెప్తున్నాను- మూడు వందలు ఇస్తేనే ఆవుల్ని ఇవ్వు. అర్థమైందా, ఏమి?! నేను చెప్పేది వింటున్నావా?!” అన్నాడు. “ఆఁ విన్నా, విన్నా!" అన్నదామె, తల ఊపుతూ.

వ్యాపారి ప్రయాణమై వెళ్ళిపోయాడు.

తర్వాతి రోజున అనుకున్నట్లుగానే బేరగాడు వచ్చాడు. ఆవులను చూసి, ఆమెతో బేరం మొదలు పెట్టాడు. మాట్లాడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికే వెంగమ్మ ఎంత అమాయకురాలో గ్రహించేశాడు ఆ బేరగాడు. బేరం ఇంకా పూర్తి కూడా కాకనే, వాడు పశువుల పాక దగ్గరికి వెళ్ళి "సరే అక్కా! ఇంక ఆవులను నేను కొనుక్కున్నాను!" అంటూ ఆవులకు కట్టిన పలుపుతాళ్ళు విప్పి వాటిని బయటకి తోలటం మొదలు పెట్టాడు గడుసుగా.

వెంగళమ్మ అమాయకురాలే అయినా, మరీ ఇంత గడుసుదనాన్ని గమనించకుండా ఉండలేకపోయింది. పోయి కొట్టం గడప దగ్గర నిలబడి "ఒక్క నాణెం తక్కువైనా ఆవులను ఇవ్వను- ముందు మొత్తం మూడు వందల నాణాలు ఇచ్చి, ఆ తర్వాతనే ఆవులను బయటకి తోలండి!" అంది మొండిగా.

"ఇబ్బంది వచ్చి పడిందే-" అనుకున్నాడు బేరగాడు. అయినా మరో బాణం వేసి చూద్దామని, "అయ్యో అక్కా! నా దగ్గరుండగా నీ డబ్బు ఎక్కడికి పోతుంది? అయినా ఇవాళ్ళ డబ్బుల మూటను తీసుకురావడం మర్చిపోయానే, ఏం చేయను? -సరే, ఒక పని చేద్దాం! ఈ మూడు ఆవుల్లోనూ ఒక దాన్ని నీ దగ్గరే హామీగా వదిలి వెళతాను. ఇంటికి వెళ్ళి, మూడు వందల నాణాలు తెచ్చి ఇచ్చాక గానీ ఈ ఆవును విడిపించుకు పోను!" అన్నాడు, ఆ మూడు ఆవుల్లో‌నే ఒకదాన్ని గాటానికి తిరిగి కట్టేస్తూ. వెంగమ్మ ముఖం వెలిగింది. “ఆఁ అదీ మరి! ఏమీ హామీ లేకపోతే ఎలా?! అలా చెయ్యి. ఆ మూడో ఆవుని ఇక్కడే ఉంచి వెళ్ళు. డబ్బు నా చేతిలో పడ్డాకే, ఈ ఆవుని వదిలేది!" అంది గట్టిగా.

బేరగాడి పంట పండింది. ఉత్సాహంతో మురిసిపోయి, అతి మర్యాద నటిస్తూ, తాను ఆసరికే కట్టేసిన ఆవును అక్కడే వదిలి, మిగిలిన రెండు ఆవులనీ తోలుకుని చక్కా పోయాడు వాడు. 

మూడో రోజున భర్త రాగానే తాను చేసిన ఘనకార్యాన్ని భర్తతో సంతోషంగా చెప్పింది వెంగమ్మ. వ్యాపారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు- కోపం ముంచుకుని వచ్చింది. 

“ఛీ! ఛీ! నీ కంటే తెలివి తక్కువ మనిషి ఈ లోకంలో లేరు. వాడు మళ్ళీ‌ వస్తాడుటే, నీ వెర్రి గానీ?!" అని అరిచాడు ఆవేశంగా.

“అబ్బో! తెలివి నీ ఒక్కడిదేగా?" అంది వెంగమ్మ వెటకారంగా. "నేను అందరి కంటే తెలివి తక్కువ దాన్నా?! ఆ సంగతి నీకెలా తెలుసు? అసలు ఈ లోకంలో ఎట్లాంటి వాళ్ళుంటారో తెలీనిది నీకే. వెళ్ళి ఓసారి దేశం అంతా తిరిగి, చూసిరా!” అంది ఈసడిస్తున్నట్లు.

ఆమె అమాయకపు మాటలకి వ్యాపారికి బలే కోపం వచ్చింది. అయినా తమాయించుకుని "ఆ బేరగాడి ఆచూకీ తెలుసుకొని వస్తాను ఆగు!" అని హడావుడిగా సంత వైపు బయలుదేరి పోయాడు.

సంతలో‌ మోసగాడి ఆచూకీ కొంత సులభంగానే దొరికింది. వాడి ఊరు మరీ ఏమంత దూరం కాదు. వ్యాపారి ఆ మోసగాడి ఆనవాలు పట్టుకుని ఆ ఊరికి బయలుదేరాడు.

నడుస్తూ నడుస్తూ వెనుదిరిగి చూసిన వ్యాపారికి ఓ వింత దృశ్యం కనబడింది. అతని వెనకగా ఎద్దుల బండి ఒకటి వస్తున్నది. ఆ బండి ఇరుసుపైన ఒక కాలు నిటారుగా మోపి, క్రిందికి పడిపోకుండా సర్దుకుంటూ నిలబడి బండిని తోలుతున్నది ఒకామె. బండిలో నిండుగా గడ్డి ఉంది- కావాలనుకుంటే ఆమె గడ్డి మీదైనా కూర్చోవచ్చు; లేదా దిగి నడుచుకుంటూ అయినా రావొచ్చు. రెండూ కాకుండా ఇరుసు మీద ఎందుకు, అలా ఒంటికాలి మీద నిలబడటం? 'ఈమె ఎవరో గొప్ప అమాయకురాలిలాగానే ఉంది' అనుకుని నవ్వుకున్నాడు వ్యాపారి. 

వెంటనే అతనికి వెంగమ్మ మాటలు గుర్తొచ్చాయి. "పాపం, వెంగమ్మ మాటలు నిజమే కావొచ్చు- లోకం ఏమంత తెలివిగా లేదు- ఈమె ఎంత వెర్రివెంగళమ్మో కనుక్కుందాం!" అనుకున్నాడు. 

కొంచెంసేపు ఆగి, బండి తన దగ్గరికి రాగానే ఆమెని పలకరిస్తూ "ఏమమ్మా, ఎందుకట్లా ఒంటి కాలిమీద నిలబడటం? పడితే ప్రమాదం కదా? గడ్డి మీద కూర్చొని రావొచ్చు; లేకపోతే అసలు పూర్తిగా దిగి నడిచి రావొచ్చు" అన్నాడు అతను.

“మా అబ్బాయి అట్లా చెప్పలేదు- బండి మీదే రమ్మన్నాడు" అన్నదామె పడిపోకుండా మళ్ళీ సర్దుకొని నిలబడుతూ- "ఇంతకీ నువ్వెవరు? నిన్ను మా ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు- ఏదో ఆకాశంలో నుండి ఊడి పడ్డట్లున్నావు!" అన్నది ఆమె.

వ్యాపారికి ఆమెను కొంచెం ఆటపట్టించాలనిపించింది. "అవునవును- బలే కనుక్కున్నావే?! నిజంగానే నేను ఆకాశం నుండి ఊడిపడ్డాను- మీ ఊరు చూసి పోదామని!" అన్నాడు ఎగతాళిగా.

ఆమె నిజంగానే అమాయకురాలు. వ్యాపారి మాటలు నిజమనుకున్నది. "అవునా, అయితే నిన్నొకటి అడుగుతా చెప్తావా? మా ఇంటాయన పైకి వెళ్ళి మూడేళ్ళవుతున్నది. నీకు ఆయన అక్కడ కనిపించే ఉండాలి కదా, ఎట్టా ఉన్నాడు, కులాసానేనా?!” అని అడిగింది సూటిగా.

'వార్నాయనో, ఈమెవరో మా వెంగమ్మ కంటే వెంగళమ్మ. దేశంలో నిజంగానే చాలామంది అమాయకులు ఉన్నట్లున్నది" అనుకున్నాడు వ్యాపారి- "ఓఁ, చూడకేమి?! రోజూ చూస్తూనే ఉన్నాను మీ ఇంటాయన్ని. పాపం ఆయనకి అక్కడ గొర్రెలు కాచే పని ఇచ్చారు. మరి అవేమో, ఒక్క చోట నిలవకుండా కొండా-కోనా; గుట్టలూ-మిట్టలూ తిరుగుతున్నాయి. వాటి వెంబడి తిరగలేక మీ ఆయన నానా అవస్థలు పడుతున్నాడు. గుడ్డలు కూడా పీలికలై పోయాయి!" అన్నాడు పైకి.

“అయ్యో, మాకు ఎట్టా తెలుస్తుంది ఆ సంగతి?! మేం‌ ఇక్కడే ఉన్నామాయె. అయినా మొన్న సంక్రాంతి పండక్కి బట్టలు కూడా పెట్టుకున్నామే; అంత అవసరం ఉంటే వచ్చి తీసుకు పోకూడదా?” అని యాష్టపడిపోయిందామె. "ఇక్కడే ఉండండి, ఇంటికి పోయి గుడ్డలు తెచ్చిస్తాను. ఈసారి పైకి వెళ్ళగానే మా యింటాయనకు ఇద్దురు" అని వేడుకున్నది.

వ్యాపారికి నవ్వు ఆగలేదు. ఆమెని ఇంకా పరీక్షించటం కోసం అతను "అది వీలు పడదు తల్లీ, ఆకాశానికి ఒక పెద్ద ద్వారం ఉంటుంది. అక్కడ ఉండే ద్వారపాలకుడికి లంచం ఇస్తేగాని వేటినీ లోపలికి తీసుకోని పోనివ్వడు, ఏం చేయను?!" అన్నాడు. “అలాగేలే, ఎంతో కొంత ఇస్తే సరి! నిన్ననే మా అబ్బాయి ధాన్యం అమ్మిన డబ్బులు తెచ్చి ఇనప్పెట్టెలో పెట్టాడు. గుడ్డలు, డబ్బులు తెచ్చి ఇస్తాను- కాసేపు ఆగండి" అని బండిని తోలుకొని ఇంటికి వెళ్ళింది ఆమె. వ్యాపారి అక్కడే ఆగిపోయాడు.

కొద్దిసేపటికల్లా గుడ్డలు, పైకం తీసుకుని అక్కడకి వచ్చింది అమె! 

'ఈమె వెంగమ్మకు అక్క' అని గ్రహించిన వ్యాపారి కలవర పడిపోయి "ఒక్కసారి మీ అబ్బాయిని చూసి వెళతాను తల్లీ!" అని ఆమెతోపాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆమె కొడుకుకు జరిగినదంతా చెప్పి, ఆమె ఇచ్చిన డబ్బులు, గుడ్డలు అతనికి తిరిగి ఇచ్చేశాడు. 

ఆ యువకుడు వ్యాపారికి అనేక కృతజ్ఞతలు చెప్పుకుని "మీరెవరు? ఏం పని మీద వచ్చారు?' అని అడిగాడు. "నా భార్య వెంగమ్మ కూడా మీ అమ్మ మాదిరిదే- ఏమీ తెలీదు పాపం. మొన్న నేను ఊళ్ళో లేనప్పుడు మీ ఊరివాడు ఎవడో వచ్చాడట; మా వెంగమ్మని మోసం చేసి ఆవులని రెండింటిని తీసుకెళ్ళిపోయాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఇట్లా వచ్చాను" చెప్పాడు వ్యాపారి విచారంగా. 

ఆ కుర్రవాడికి ఊళ్ళో వాళ్ళంతా పరిచయమే- "ఓఁ, వాడు నాకు తెలుసు. వాడో పెద్ద మోసగాడు. నిన్ననే రెండు ఆవుల్ని తెచ్చాడు. అవి మీవే అయి ఉంటాయి- చూద్దాం పదండి" అని అతని ఇంటికి తీసుకు వెళ్ళాడు వ్యాపారిని.

తన ఆవుల్ని చూడగానే గుర్తుపట్టాడు వ్యాపారి. అవి కూడా వ్యాపారిని చూసి సంతోషంగా అరిచాయి. వెంటనే వ్యాపారి న్యాయాధికారికి ఫిర్యాదు చేయటం, న్యాయాధికారి విచారణ జరిపి మోసగాడిని శిక్షించటం, జరిమానాతో సహా ఆవుల్ని వ్యాపారికి ఒప్పచెప్పటం జరిగాయి.

వ్యాపారి ఇంటి కొచ్చి ఆవుల్ని కొట్టంలో కట్టేస్తుంటే "నేను చెప్పలేదూ, అతను చాలా మంచివాడేనని?! పాపం, మన ఆవుల్ని మనకు ఇచ్చేశాడు చూడు!" అన్నది వెంగమ్మ.

"నిజమేనే, లోకంలో నీలాంటివాళ్ళూ, నాలాంటివాళ్ళూ చాలా మందే ఉన్నారు. వాడిలాంటివాళ్ళూ ఉంటారు. అయితే అమాయకుల్ని మోసం చేస్తే ఎప్పటికైనా శిక్ష మటుకు తప్పదు"అన్నాడు వ్యాపారి.

కొత్తపల్లి సౌజన్యంతో.



42 .... 🥭🥭🥭తీపి జ్ఞాపకం🥭🥭🥭


వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన!


‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ.


ఎప్పుడు తెచ్చారు? ఎన్ని తెచ్చారు? ఒక్కొక్కరికీ ఎన్నేసొస్తాయి? వాటాలేసుకునేటప్పుడు ముందుగానే మంచివన్నీ చూసి తీసేసుకోవాలి. అసలే అయిదుగురం. పందార కలిశలనుకుంటా! భలే తియ్యటి వాసన గదంతా! గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన అవు దూడలా కనబడుతున్నాయి.


అప్పుడప్పుడు ఇంకా పండనివి తెచ్చేవారు. మునగపాక నుంచి వచ్చి రోజూ పాలుపోసే పైడమ్మని అడిగి ఎండుగడ్డి తెప్పించేవారు. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు. మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం.


వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.


అసలా మావిడిపళ్ల ఆకలి చాలా దారుణమైన ఆకలి. వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత!


‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే!


వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది. నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి బారామాసి కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసి కొనేవారు.


కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు. అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి. అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి.


‘బాబోయ్, పులుపు రొడ్డు!’ అనేది అమ్మ.


ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా! అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది.


శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతమప్పుడు.  ఇరవయ్యొక్క రకాల పిండివంటలు వండినా విస్తట్లో ఓమూలగా క్షేత్రపాలకుడి పాత్రలో ఆవకాయ వుండాల్సిందే!


ఇక భాద్రపదంలో వినాయక చవితికి ఉండ్రాళ్లలోకి కొబ్బరిపచ్చడీ, అల్లప్పచ్చడీ చేసినా సాయంత్రం మాత్రం పునఃపూజ తరవాత ఆవకాయ అద్దుకుంటూ ఉండ్రాళ్లు తినకపోతే వ్రతఫలం దక్కదుట!


🌹ఇక అసలు విషయానికొద్దాం.


వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ  తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా! వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది. ఆ టైములో అర్జెంట్ ఆపరేషనన్నా వెళ్లబుద్ధి కాదు!


అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి. ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు. నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.


అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు. ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి...‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!


అసలు వాణ్ణని ఏంలాభం? వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది. కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి!


వేసవి సెలవులప్పుడు తాడేపల్లిగూడెం వెళ్లేవాళ్లంకదా? అక్కడ ముగ్గురు మావయ్యలు, వాళ్లకి నలుగురేసి, అయిదుగురేసి పిల్లలు కదా!


తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గంగాళం లో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!


వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట!


అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే జోగిరాజు మావయ్యనడిగి ఏదో చూర్ణమో , భస్మమో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి. అంతేగానీ పళ్లు తినొద్దంటే ఎలా?


కానీ పిర్రలమీద సెగగడ్డ వస్తే మాత్రం చచ్చేచావే! నిక్కరేసుకోలేక పోయేవాళ్లం. అది పగిలేదాకా తువ్వాలు కట్టుకు తిరగాల్సొచ్చేది. ఆడపిల్లలు వెక్కిరిస్తారన్న బాధొకటి కురుపు కన్నా ఎక్కువ సలుపుతూ వుండేది.


దాసు మావయ్య హాస్పిటల్‌కి తీసుకెళ్లి పెన్సిలిన్ ఇంజక్షన్ చేయిస్తాననేవాడు. ఆ భయంతో తినడం తగ్గించేవాళ్లం. లేకపోతే మనల్ని ఎవరాపగలరు?


మన చిన్నతనాల్లో మావిడిపళ్లు డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా? ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.


ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవి అలా కాదు. మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి.


పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి లాగా తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు. అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు మాజా తాగడం బెటరు. లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి. అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేమిటటా ??


బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.


అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది...


‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’

అమ్మది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా! అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.


మావిడిపండంటే తీపే కాదు! తీపి జ్ఞాపకం కూడా!

ఆ రోజులే వేరు. ...

--(())--


43 ......మహాభారతంలో  కధలు   ఉపాఖ్యానాలు -1,2


ఒకరోజు అలసటతో ఉన్న జగత్కారుడు ఆమె ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్నాడు. అప్పుడే సంధ్యాసమయం అయింది. ఆ సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి కనుక భర్త నిద్రించడం ధర్మం కాదని భావించింది. ‘‘నా భర్త యొక్క స్వభావం చాలా కఠినమైనది. నిద్ర లేపితే ఆగ్రహిస్తాడు. లేపకపోతే అతనికి ఆగ్రహం కలుగుతుందేమో. ధర్మహాని కలుగును. కనుక అతనికి ఆగ్రహం వచ్చినాసరే ధర్మలోపం చేయకూడదు. కనుక లేపుతాను’’ అని నిశ్చయించుకొని ఆమె భర్తను లేపింది. నిద్ర నుండి లేచిన అతను కోపంతో ఇలా అన్నాడు ‘‘ఓ నాగకన్యా! నీవు నన్ను అవమానించావు. కనుక నేను నీ దగ్గర ఇక ఉండను. నిన్ను విడిచి వెళ్లిపోతాను. నేను నిద్రిస్తూ ఉంటే సూర్యుడు అస్తమించగలడా! అంత శక్తి అతనికి ఉందా? నాలాంటి ధర్మశీలునికి వేరే ప్రత్యేకంగా చెప్పాలా? ఈ అవమా నాన్ని నేను సహించను’’.


భర్త పలికిన ఈ కఠినమైన మాటలు విన్న జరత్కారువు ఇలా అంది. ‘‘స్వామీ! నేను మిమ్మల్ని అవమానించాలని అనలేదు. మీకు ధర్మలోపం జరుగరాదని తలచి నిద్రలేపాను.’’


భార్యను విడిచిపెట్టాలి అన్న నిశ్చయంతో ఉన్న జరత్కారుడు ఆమెతో ఇలా అన్నాడు ‘‘నాగకన్యా! నేను ఎప్పుడూ అసత్యమాడలేదు. అందుకని నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నాను. నీవు నీ సోదరునితో ఈ విషయం చెప్పు - దుఃఖించ వద్దు.


జరత్కారువు కన్నీళ్లతో భర్తను వేడుకొంది. ‘‘స్వామీ! మీరు ధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. అలాగే నేను కూడా ధర్మం తప్పకుండా మిమ్మల్ని సేవిస్తూ ఉన్నాను. నిరపరాధిని అయిన నన్ను త్యజించడం మీకు ధర్మం కాదు కదా! ఈ ఆశయంతోనే మా అన్న నన్ను మీకిచ్చి వివాహం చేశాడు. అతను నాతో పూర్వం ఇలా అన్నాడు ‘‘సోదరీ! మన వంశంలోని వారిని నాగమాత శపించింది. నీ సంతానం వలన మేము ఉద్ధరింపబడతాము’’. కనుక దేవా! మీతో ఏర్పడిన సంబంధం వ్యర్థం కాకూడదు. పైగా నేను ఇప్పుడు గర్భవతిని. ఆ శిశువు ఇంకా జన్మించలేదు. ఇటువంటి క్లిష్టసమయంలో మీరు నన్ను విడిచి వెళ్లడం ధర్మమా?’’


జరత్కారుడు ఆమెతో ఇలా అన్నాడు -


‘‘నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్నితో, సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు. మహా తపస్వి. వేదవేదాంగ పారంగతుడు’’ ఇలా భార్యకు చెప్పి అతను తపస్సు చేసుకొందుకు వెళ్లిపోయాడు.


భర్త విడిచిపెట్టి వెళ్లిన తర్వాత జరత్కారువు ఎంతో దుఃఖంతో వాసుకికి ఈ విషయం అంతా వివరించింది. ఇది విని వాసుకి కూడా దుఃఖించాడు. ఆమెతో ఇలా అన్నాడు ‘‘సోదరీ! సర్పాలకు ఒక గొప్ప కార్యం జరుగబోతున్నది. దాని సాధనకై ఆ మునితో నీకు వివాహం చేశాము. అతని ద్వారా జన్మించే కుమారుని వల్ల సర్పజాతికి మహోపకారం జరుగుతుంది. తేజస్సంపన్నుడైన నీ పుత్రుడు భవిష్యత్తులో జనమేజయుడు చేసే సర్పయాగాన్ని నివారిస్తాడు. కనుక నీ వివాహం నిష్ఫలం కాకూడదు. తపస్వి అయిన నీ భర్తను ఆపలేమని నాకు తెలుసు. అందుకే అతన్ని నేను ఆపలేదు. అలా ఆపితే అతను నన్ను శపించవచ్చు. నీ భర్త గురించి నాకు చెప్పు’’.


వాసుకి సోదరి తన భర్త గురించి ఇలా చెప్పింది. ‘‘నా సంతానాన్ని గురించి నా భర్తను అడిగాను. ఆయన ‘అస్తి’ అని మాత్రం చెప్పి వెళ్లిపోయాడు. అతను మహానుభావుడు. సదా సత్యవాక్పాలన చేసేవాడు. పరిహాసానికైనా అబద్ధం చెప్పలేడు. నిష్ఠాగరిష్ఠుడు. అతను వెళ్తూ నాతో ఇలా అన్నాడు.


‘నాగకన్యా! నీ కార్యం తప్పక సిద్ధిస్తుంది. నీవు చింతించవలదు. నీ గర్భంలో అగ్నితో సమానమైన తేజస్సు కలవాడు ఉన్నాడు’ అని ఈ మాటమాత్రం చెప్పి వెళ్లిపోయాడు’’.


కొంతకాలానికి ఆమెకు తల్లిపక్షాన తండ్రి పక్షాన ఉన్న భయాన్ని తొలగించేవాడు జన్మించాడు. అతడు చ్యవనుని వద్ద వేద వేదాంగాలను అధ్యయనం చేశాడు. అతడు ఆస్తీకుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. తల్లి గర్భంలో ఉండగా తండ్రి ‘అస్తి’ అని చెప్పాడు కనుక అతనికి ఆస్తీకుడు అని ప్రసిద్ధనామం వచ్చింది.


ఆస్తీకుడు పుట్టుటకు కారణముంది. నాగమాత అయిన కద్రువ తన పుత్రులైన సర్పాలను ‘‘మీరు జనమేజయుడు చేసే యాగంలో అగ్నిలో పడి భస్మమగుదురు’’ అని శాపం ఇచ్చింది. ఆ శాపాన్ని నివారించడానికే వాసుకి తన చెల్లెలిని జరత్కారునికి వచ్చి వివాహం చేశాడు. ఆ విధంగానే తర్వాత కాలంలో జనమేజయుడు సర్పయాగాన్ని తలపెట్టాడు. ఆ యాగంలో సర్పాలు గుంపులు గుంపులుగా అగ్నిలోపడి నశిస్తూ ఉంటే, అది తెలిసిన వాసుకి కుమిలిపోతున్నాడు.


జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టాడు అని తెలియగానే తక్షకుడు ఇంద్రుని వద్దకు వెళ్లి అతన్ని శరణుకోరాడు. ఇంద్రుడు అతనికి భయం చెందవలసిన అవసరం లేదని అభయమిచ్చాడు. సంతోషంతో తక్షకుడు ఇంద్రుని భవనంలోనే ఉండిపోయాడు. చాలా సర్పాలు అగ్నిలో ఆహుతి అయిపోయారు. కొద్దిమంది మాత్రమే మిగిలారు. అప్పుడు వాసుకి తన సోదరితో ఇలా అన్నాడు ‘‘సోదరీ! ఈ సర్పాల ఆహుతి చూడలేకపోతున్నాను. ఈ ఆపద నుండి రక్షించడానికే నిన్ను జరత్కారునికి ఇచ్చి వివాహం చేశాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీవు నీ బంధువులను రక్షించు. పూర్వం బ్రహ్మయే స్వయంగా ‘‘ఈ సర్పయాగాన్ని ఆస్తీకుడు ఒక్కడే నివారించగలడు’’ అని చెప్పాడు. కనుక నీవు నీ పుత్రునితో మా కష్టాలను తొలగించుమని చెప్పు’’.


అప్పుడు జరత్కారువు ఆస్తీకుని పిలిచి ఇలా పలికింది ‘‘కుమారా! ఏ కార్యం కోసం నా అన్న నీ తండ్రికి నన్ను ఇచ్చి వివాహం చేశాడో, ఆ కార్య సమయం ఇప్పుడు వచ్చింది. కనుక నీవు ఆ పని నెరవేర్చు’’. ఆస్తీకుడు ఆ కారణమేమిటని అడిగాడు.


ఆ తల్లి నాగమాత కద్రువ సర్పాలకు ఇచ్చిన శాపం గురించి తెలిపింది. వారిని కాపాడుమని ఆదేశించింది. (ఇంకావుంది)


ఉపాఖ్యానాలు -3


ఆస్తీకుడు అలాగే చేస్తానని తల్లికి చెప్పి వాసుకితో ఇలా అన్నాడు. ‘‘నాగరాజా! మీరు నిశ్చింతగా ఉండండి. భయం వలదు. జనమేజయుని దగ్గరకు వెళ్ళి మంచి మాటలతో అతన్ని సంతోషపె ట్టి యజ్ఞాన్ని నివారిస్తాను’’. ఈ విధంగా అతను వాసుకి మొదలైన నాగశ్రేష్ఠుల భయాన్ని పోగొట్టి జనమేజయుని యజ్ఞశాలకు వెళ్లాడు.


అక్కడ అతను అనేకవిధాలుగా జనమేజయుని స్తుతించాడు.


అతని వాక్కులు విన్న రాజు యాగశాలలోని తక్కినవారితో ఇలా అన్నాడు. ‘‘ఓ విప్రులారా! ఇతను బాలకుడు అయినా పెద్దవారి లాగా మాట్లాడుతున్నాడు. కనుక ఇతడు వృద్ధుడే అని భావిస్తున్నాను. ఇతనికి వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు మీ అంగీకారాన్ని తెలుపండి’’. దానికి వారంతా ఇతడు బాలుడైనప్పటికీ జ్ఞానంలో పెద్దవాడే. కనుక మీ చేత సత్కరింపబడవచ్చు’’ అని ఏకకంఠంతో పలికారు.


అప్పుడు జనమేజయుడు ఆస్తీకుని వరం కోరుకొమ్మనగా అతడు అడిగేలోపల యజ్ఞం చేస్తున్న హోత ఇలా అన్నాడు ‘‘ఈ క్రతువులో మంత్రాలతో తక్షకుని పిలిచాము కాని అతను ఇంతవరకు ఇక్కడికి రాలేదు’’.


అప్పుడు జనమేజయుడు ఇలా ఆదేశించాడు.


‘‘ముందు తక్షకుని అగ్నిలో ఆహుతి చేయండి. అప్పుడే ఈ యాగం సమాప్తవౌతుంది. తక్షకుడే నాకు అసలు శత్రువు. అతని కోసమే ఈ యాగం చేస్తున్నది’’.


అప్పుడు ఋత్వికులు ఇలా అన్నాడు ‘‘ఈ మంత్రాలకు భయపడి తక్షకుడు ఇంద్రుని భవనంలో దాక్కున్నాడు’’.


సూతపుత్రుడు పురాణవేత్త అయిన లోహితాక్షుడు ‘‘ఈ యజ్ఞం సమాప్తి కాదు’’ అని అన్నాడు.


రాజు లోహితాక్షుని ఈ విషయం గురించి అడిగితే అతను బ్రాహ్మణులతో తాను చెప్పినది సత్యమేనని, ఇంద్రుడు తక్షకునికి రక్షణ కల్పించాడని’ తెలిపాడు.


ఇది విన్న రాజు కలవరపడ్డాడు. ఇంద్రునితో సహా తక్షకుడు అక్కడికి రప్పించడానికి మంత్రాలను చదువమని ఆజ్ఞాపించాడు. వారు ఆవిధంగా చేసి ఇంద్రునితో ఉన్న తక్షకుని సహేంద్రతక్షకాయ స్వాహా అని ఆహ్వానించారు. వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. అతని వెనుక తక్షకుడు కూడా వస్తూ ఉన్నాడు. అతను భయంతో ఇంద్రుని ఉత్తరీయంలో దాగుకొని వచ్చాడు. రాజు బ్రాహ్మణులతో ఇలా పలికాడు.


‘‘విప్రోత్తములారా! ఒకవేళ ఇంద్రుడు తక్షకునికి రక్షణ కల్పిస్తే, ఇంద్రునితో సహా తక్షకుని అగ్నిలో ఆహుతి ఇవ్వండి’’.


ఇది విన్న ఇంద్రుడు కలతచెంది తక్షకుని అక్కడే విడిచిపెట్టి వెనక్కి వెళ్లిపోయాడు. మంత్రాధీనుడైన తక్షకుడు వణికిపోతూ అక్కడికి వచ్చాడు. అప్పుడు రాజు యజ్ఞం ఫలించిందన్న ఆనందంతో వారికి దక్షిణ ఇవ్వదలచి ముందుగా ఆస్తీకుని పిలిచి ‘‘ఓ విప్రకుమారుడా! నీ పాండిత్యం అమోఘం. నీ మనస్సులోని కోరిక కోరుకో. అది ఏమైనా సరే తీరుస్తాను’’ అని అన్నాడు.


దానికి ఆస్తీకుడు ‘‘మహారాజా! నాకు మీరు వరం ఇవ్వదలచుకుంటే ఈ సర్పయాగాన్ని వెంటనే ఆపివేయండి. ఇక సర్పాలు అగ్నిలో పడకూడదు’’.


ఈ కోరిక విన్న రాజు విచారంతో ఆస్తీకునితో ఇలా అన్నాడు ‘‘విప్రుడా! ఈ వరం కాక ఇంకేదైనా కోరుకో. ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఇష్టపడను’’.


దానికి ఆస్తీకుడు ‘‘నాకు బంగారంతో, ధనంతో పనిలేదు. ఈ సర్పయాగాన్ని ఆపివేయి. నీవు అలా చేస్తే నా మాతృవంశానికి శుభం కలుగును.’’


జనమేజయుడు ఆస్తీకునికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అతను ఒప్పుకోలేదు. తనకు ఆ వరమే కావాలని కోరాడు. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ రాజుతో ఆ విప్రబాలకుడు కోరిన వరాన్ని ఇవ్వమని ప్రార్థించాడు.


జనమేజయుడు వారి మాటలు విని ఆస్తీకునికి ఇచ్చిన వరం ప్రకారం సర్పయాగాన్ని నిలిపి వేశాడు. సర్పముల ప్రాణరక్షణ పొందారు. రాజు ఆస్తీకుని తాను చేయబోయే అశ్వమేద యాగానికి సదస్యునిగా ఆహ్వానించాడు. ఆస్తీకుడు సంతోషంతో యజ్ఞంలో పాల్గొనడానికి వస్తానని మాట ఇచ్చి ఇంటికి వెళ్ళి తల్లితో, మేనమామతో యజ్ఞసభలో జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు.


యాగంలో రక్షింపబడిన నాగులందరు అతన్ని కలిసి ఇలా అన్నారు ‘‘నాయనా! నీవు గొప్ప విద్వాంపుడవు. మమ్మల్ని కష్టాల నుండి గట్టెంకించినావు. నీ కోరిక ఏదైనా తప్పక తీరుస్తాము’’.


ఇలా వారు పలుమార్లు కోరగా అతను వారితో ‘‘ఈ లోకంలో ఎవరైనా సరే నా ఈ కద చదువుతారో వారికి మీ వలన ఎలాంటి భయము ఉండకూడదు. ఇదే నేను కోరేది’’.


దానికి వారు సంతోషంతో ‘‘నీ కోరిక తప్పక తీరుస్తాము. ఎవరైనా, ఏ సమయంలో నైనా జరత్కార ఋషివలన జరత్కారువు అనే నాగకన్యకు జన్మించిన ఆస్తికుని నేను స్మరిస్తున్నాను. ఓ నాగులారా! నన్ను హింసించకండి’’ అని అంటే ఏ సర్పం అయినా తొలగకపోతే దాని శిరస్సు నూరు ముక్కలు అవుతుంది’’ అని పలికారు.


ఈ విధంగా సర్పయాగంలో పన్నగాలను రక్షించి (సర్పయాగాన్ని ఆపించి) తన తల్లివైపు వారిని కాపాడాడు. అదేవిధంగా జరత్కారునికి పుత్రునిగా జన్మించి తండ్రివైపు పితరులకు ఉత్తమ లోకాలను కల్గించాడు. ఇలా మాతృపితృ వంశాలని ఉద్ధరించి తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అతని కద ఆస్తీకోపాఖ్యానంగా ప్రసిద్ధి చెందినది.


ఆమెతో నివసించసాడు. జరత్కారువు కూడా భర్త వివాహానికి పూర్వం పెట్టిన షరతులను గుర్తుంచుకొని దానికి అనుగుణంగా పతిసేవ చేస్తున్నది. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. అగ్నితో సమానమైన తేజస్సు కల శిశువు ఆమె గర్భంలో పెరుగుతున్నాడు. (ఇంకావుంది)


--(())--


44 ... అద్దంతో సాధనలు - నా అనుభవాలు


             --- 2 ---


    అద్దంతో  సాధనలు ప్రారంభించి, అప్పటికే ఆరు నెలలు అయింది 1998 లో మిర్రర్ ముందు కూర్చుని చూడగానే, మిర్రర్ కనిపించేది కాదు. ఆ మిర్రర్ ఉన్న ప్లేస్ లో  ఓ పెద్ద నీలి రంగు కలిగిన కాంతి గోళం కనిపించేది. దాన్ని చూస్తూ గురువు గారు ఇచ్చిన మంత్రం జపించే వాడిని. తర్వాత కాసేపట్లో ఆ నీలి  రంగు గోళం నుంచి ఎన్నో రకాల అద్భుతమైన ప్రకృతి సౌందర్యం,  etc., etc.,  చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండేది, వాటిని చూస్తూ ఉంటే ఆయా ప్రాంతాల్లో మనం ఉన్నట్లు ఉంటుంది ఆ అనుభూతి. నా ఆరా, నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది . హాలో చూడగలిగాను. ఎదుటి వారి ఆరోగ్యం, మనసులో ఉన్న భావాలను, చిత్ర రూపంలో చూడగలిగాను. మా మామయ్య డాక్టర్ వినయ్ కుమార్ ఈ విషయం పై చాలా సంవత్సరాల క్రితం పుస్తకాలు రాశారు!!  పూర్వజన్మలు - పరలోకాలు,  మీడియం షిప్, శ్రీబైద్యనాథోపనిషత్, పంచ యజ్ఞాలు, లార్డ్ రివీల్స్ - ట్రూత్ స్ర్టేంజర్ దాన్ ఫిక్షన్, మొదలైన చాలా పుస్తకాలు రాశారు, ఈ మిర్రర్ సాధన గురించి మొదట పరిచయం చేసింది మామయ్య గారే,  ఈ సాధనకు సంబంధిత మంత్రం తో ఎన్నో వేలు జపం చేసేవాడిని. మిర్రర్ ముందు కూర్చుని. రాత్రి వేళల్లో మిర్రర్ ముందు కూర్చుని జపం చేస్తూ నిద్ర వస్తే అలాగే నిద్రించేవాడిని. దీని వల్ల సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన కొందరు మహానుభావులు పరిచయం అయ్యారు!!   సూక్ష్మ శరీరము తో పూర్తి ఎరుకతో చేయగలమని అర్థం అయింది. మా కసిన్ బ్రదర్ ఉమేష్, లండన్ లో పారాసైకాలజీ లో  PhD  చేశారు చాలా బిజీగా ఉండే మా అన్నయ్య లండన్ నుంచి చాలా పుస్తకాలు  occult science and metaphysics మరియు తాంత్ర సంబంధిత పుస్తకాలు, డాక్యుమెంట్లు పంపేవాడు. ఆ పుస్తకాలు నా సాధనకు, అధ్యయనానికి, గురువు గారి వద్ద సందేహ నివృత్తి కి మంచి అవకాశం లభించడం జరిగింది. 

 ఈ సాధన వల్ల థియోసఫికల్ సొసైటీలో, కీలక పాత్ర వహించిన తల్లాప్రగడ. సుబ్బారావు గారిని నా కళ్లారా చూడటం జరిగింది.


సశేషం


45 ... ఒక నాటి కధ 304


🌷🦋🌳💰😌ఒకసారి చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు. అతను అడిగాడు:

'నేను ఎ౦దుకు పేదవాడను?😟


బుద్ధుడు సమాధానం చెప్పాడు: మీరు ఎ౦దుకు పేదవారు  అంటే మీరు  ఎటువంటి ఔదార్యము  కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు.


నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది? అని ఆ పేదవాడు అడిగాడు.

అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు


మీరు ఇతరులతో ప0చుకోగల ఐదు నిధులను💰 కలిగివున్నారు.


 మొదట మీ ముఖం👩🏼 ఉంది. మీరు ఇతరులతో మీ  ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ... ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ..


రెండవది మీ కళ్ళు👀 మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు .. నిజం.. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు .. వాటిని మంచి అనుభూతిగా చేయండి ..

 మూడవది  మీ నోరు👄 మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించండి .. వాటిని విలువైనదిగా భావించండి .. ఆనందం మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ..


 నాలుగవది మీకు గుండె ఉంది. మీ ప్రేమగల హృదయంతో❤ మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు .. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు..


 మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం .. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు👍 చేయగలరు ..అవసరమైనవారికి సహాయం చేయగలరు .. సహాయం  చెయ్యడానికి  డబ్బు అవసరం లేదు ..


ఒక చిన్న శ్రద్ధ ,సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు.

భగవంతుడు మనకిచ్చిన జీవితం..

కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !

ప్రతిక్షణం ఆనందంగా🌈 ఉంటూ, పదిమందికి సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుందాం.🌳

--(())--

46 .... అతిరథ మహారధులు అంటే ? - 294

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. ఇందులో 5 స్థాయిలున్నాయి అవి..

రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.

1️⃣ రథి – ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96మంది, శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు వీరంతా రథులు.

2️⃣ అతి రథి – (రథికి 12రెట్లు) 60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు అతిరథులు.

3️⃣ మహారథి – (అతిరథికి 12రెట్లు) 7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధులు మహారథులు.

4️⃣ అతి మహారథి – (మహారథికి 12రెట్లు) 86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు – వీరు అతి మహారథులు.

➖ రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు. అటు ఇంద్రజిత్తు, ఇటు ఆంజనేయుడు. రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే. ➖

5️⃣ మహామహారథి – (అతిమహారథికి 24రెట్లు) ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దుర్గా దేవి, గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి, వీరు మహామహారథులు.

➖ మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.

పదాలకు అర్ధం తెలుసుకొని వాడగలరు.

తప్పులు ఉంటే క్షమించగలరు...

👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽...

 47 ....  భక్తి  -  భగవంతుడు.. 294

పూర్వం ఒక ఊరిలో అయోద్యుడు అనే బద్దకస్తుడు ఉండేవాడు. ఏపని చేసేవాడు కాదు. తినడం తిరగడం.. ఇంతకుమించి ఏపని రాదు. పైగా అమాయకుడు. ఇంట్లో వారు భరించలేక ఏదన్నా ఆశ్రమం చూసుకొని వెళ్ళమన్నారు.

సరేనని ఏదన్నా  ఆశ్రమంలో చేరడానికి బయలుదేరి చాలా ఆశ్రమాలు చూశాడు. ఎక్కడా నచ్చలేదు. చివరకు ఓ ఆశ్రమానికి వచ్చాడు. ఆ  ఆశ్రమంలో గురువుగారు కొద్దిగా లావుగా ఉన్నారు.

ఆహా ఇక్కడ భోజనం బాగాదొరుకుతుందనుకుంటా ..

గురువుగారు బాగా లావుగా ఉన్నారుఅనుకున్నాడు.

ఇంతలో శిష్యులు వచ్చారు. వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు. అయితే సందేహం లేదు ఇక్కడ చేరితే మూడుపూటల భోజనం దొరుకుతుంది అనుకోని గురువుగారి పాదాల మీద పడి ఇక్కడే ఉండిపోతానన్నాడు. సరే అన్నాడు గురువుగారు.

అయితే నాకు మూడుపూటల భోజనం కావాలి అన్నాడు అయోద్యుడు.  నాయనా! చక్కగా సేవ చేస్తూ రెండుసార్లు మాత్రమె ఇక్కడ భోజనం తీసుకోవాలి అన్నారు. కాదు గురువుగారు నేను ఆకలికి ఉండలేను అన్నాడు. సరే ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువ తిను అంటే సరేనన్నాడు.

ఏదో తెలిసిన సేవ చేస్తూ చాలీచాలని ఆహారం తింటూ ఉండగా  ఒక రోజు ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఉపవాసం ఉండాలి అన్నారు గురువుగారు.  అమ్మో ఉపవాసం నావల్ల కాదు గురువుగారు... ఉండలేను అన్నాడు  ఈ శిష్యుడు. సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్న చెరువు వద్దకి వెళ్లి వండుకుతిను. కావాలంటే సరంజామా నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు గురువుగారు.

సరేనని సరంజామా తీసుకున్నాడు శిష్యుడు. నాయనా వండిన ఆహారం స్వామికి నైవేద్యం పెట్టి ఆ తరువాతే నువ్వు తినాలి సరేనా. అని గురువుగారు అనగా అలాగే గురువుగారు అని వెళ్లి చెరువు దగ్గర చెట్టు క్రింద వంట చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి..ఇలా పిలిచాడు

రాజా రామ్ ఆయియే, రఘురామ్ ఆయియే.. ముఝే భూక్ లాగాయియే అంటూ పాడడం మొదలు పెట్టాడు. ఎంతకీ స్వామి రాడే.. (ఇతని ఉద్దేశ్యం లో స్వామివారే స్వయంగా వచ్చి తింటారని అనుకుని ఎదురుచూస్తూ ఉన్నాడు. అంతటి అమాయకుడు అయోద్యుడు.. కపటం, కంఫ్యూషన్ లేదు మనస్సులో)  ఎంతకీ రాకపోయేసరికి బాగా ఆలోచించి ఇలా అన్నాడు .

"దేవాలయంలో అయితే ప్రసాదాలు, నైవేద్యాలు పెడతారు...ఇక్కడ ఏముంది.. కుదిరి కుదరని వంట తప్ప"  అక్కడైతే బాగా పెడతారని అనుకుంటున్నావేమో స్వామీ.. ఈరోజు ఏకాదశి అక్కడ ఏమి ఉండదు. ఏమి పెట్టరు. ఇక్కడికి కూడా రాలేదనుకో ఇది కూడా ఉండదు..అని మళ్ళీ పాడడం మొదలు పెట్టాడు. ఇది కూడా అయిపోతుందని.. శ్రీరాముడు నవ్వుకుని ఉండబట్టలేక సీతాసమేతంగా వచ్చాడు.

శ్రీరాముడిని చూశాడు సంతోషించాడు. కానీ పక్కనే సీత ఉంది. సీత వంక ప్రసాదం వంక పదేపదే చూస్తూ ఉండగా..  శ్రీరాముడు మేము వచ్చాము సంతోషమేగా అంటే...అయోద్యుడు  సీత వంక చూస్తూ ఆ ఆ సంతోషమే.. నాచేత ఇవాళ  ఏకాదశి ఉపవాసం చేయించాలనుకున్నట్లు ఉన్నారు. రండి కూర్చోండి అని ఇద్దరికి వండిన ఆహారం పెట్టాడు. చక్కగా భోజనం చేసి సీతారాములు వెళ్లిపోయారు. అయోద్యుడు ఆ రోజు ఉపవాసం తోనే ఉండిపోయాడు.

కొన్ని రోజులు గడిచాక మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు అయోద్యుడికి   మొన్న ఇచ్చినట్లే ఈసారి కూడా కిలో బియ్యం పప్పులు దినుసులు ఇచ్చారు. అప్పుడు.. గురువుగారు ఇవి సరిపోవడం లేదండి... ఇద్దరొచ్చారు ఇంకాస్త కావాలి అంటే.. వీడికి సరిపోతున్నట్లు లేదు ఇంకో కేజీ ఇచ్చి పంపండి అని శిష్యులతో  గురువుగారు చెప్పారు.   యధావిధిగా  అయోద్యుడు అక్కడకు  వెళ్లి వంట చేసి.. నైవేద్యం పెట్టి,.. మొన్న ఇద్దరు వచ్చారు కదా.. అందుకని ఇలా పిలిచాడు.

రాజారామ్ అయియే, సీతారాం ఆయియే మేరా భోజన్ కో భోగ్ ధరాయియే అంటూ పాడాడు. ఈసారి సీతారాముల తో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఈసారి లక్ష్మణుడు వంక ..భోజనం వంక.. చూస్తూ ఉండగా.. శ్రీరాముడు.. మేము వచ్చాము నీకు సంతోషమేగా అంటే లక్ష్మణుడి వంక.. భోజనం వంక..చూస్తూ ఆ సంతోషమే స్వామి అంటూ ఈ వారం కూడా నాకు ఉపవాసమే  అనుకుంటూ... రండి కూర్చోండి అన్నాడు. భోజనం పెట్టాడు .వారు ముగ్గురు తిన్నారు వెళ్లారు.

మళ్ళీ ఏకాదశి వచ్చింది. అయోద్యుడు  గురువుగారితో ఇది కూడా సరిపోదండి ముగ్గురు వచ్చారు అన్నాడు. వీడు రాత్రికి  కూడా తింటున్నాడేమో అనుకోని మరో కేజీ   అదనంగా  ఇచ్చి పంపారు. మళ్ళీ వండాడు. ఈ సారి పాట మార్చి పాడాడు.. రాజారామ్ ఆయిఏ, సీతారాం అయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ..అంటూ పిలిచాడు

ఈ సారి సీతారాములు, లక్ష్మణుడు వచ్చారు. వీళ్ళతోపాటుగా హనుమాన్ వచ్చాడు. మేము వచ్చాము. నీకు ఆనందమేగా అని అడిగారు. ఆ..ఆ.. ఆనందమే కానీ అంటూ హనుమాన్ వంక..భోజనం వంక ..చూసిఈఏకాదశికి కూడా నాకు ఉపవాసమే...

అనుకుంటూ  రండి కూర్చోండి అని వడ్డించాడు.

అందరూ కూర్చొని తృప్తిగా తినేసి వెళ్లిపోతూ ఉండగా స్వామి ఏమనుకోనంటే ఒకమాట అడగవచ్చా? ఈసారి ఎంతమంది వస్తారు? నేను వంట చేయటానికి అని అనగా శ్రీరాముడు నవ్వి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు..

మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు..ఈసారి రవ్వ 10కిలో, బియ్యం పదికిలో, పచారి పదికిలో కావాలి అన్నాడు అయోద్యుడు. గురువుగారికి వీడేమైనా అమ్ముకుంటున్నాడా అనే సందేహం వచ్చినా..వాడు అడిగింది ఇచ్చి తరువాత చుద్దాం ఏమి చేస్తున్నాడో అని శిష్యులతో వాడు ఆడిగినవి ఇచ్చి పంపండి  అన్నాడు.

అలాగే గురువుగారి ఆజ్ఞప్రకారం  అన్నీ  పది కిలోల చొప్పున ఇచ్చి పంపి ..గురువుగారి దగ్గరికి వచ్చారు శిష్యులు. వీడు అమ్ముకుంటున్నట్లు ఉన్నాడు.. ఎక్కడ అమ్ముతున్నాడు? ఏదుకాణంలో అమ్ముతున్నాడు...?చుద్దాం పదండి అని గురువుగారి తో  సహా

శిష్యులు అయోద్యుడికి   వెనుక బయలుదేరారు.

ఎప్పటిలానే అయోద్యుడు చెరువు దగ్గరకు వెళ్లి సామాను అంత అక్కడ పడేసి చెట్టుక్రింద కూర్చొని రాజారామ్ అయిఏ, సీతారాం ఆయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ, హనుమాన్ సాత్ ఆయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ.. అని పాట పాడాడు.

ఈసారి సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్,భరత శత్రుఘ్నులు, కౌశల్య సుమిత్ర కైకేయి సపరివారమంతా వచ్చేశారు. అయోధ్యా మేమొచ్చేశాం సంతోషమేగా.. ప్రసాదం ఏది ఎక్కడుంది? అని అడిగాడు శ్రీరాముడు.

అప్పుడు అయోద్యుడు.. ఎప్పుడూ నేను వండితే మీరు తినేసి వెళ్లిపోతున్నారు. కొద్దిగా కూడా ఉంచడం లేదు. నాచేత నాలుగు ఏకాదశి ఉపవాసాలు చేయించారు. ఈసారి మీరే వండండి.. సామానంత అక్కడే ఉంది అన్నాడు... శ్రీరాముడు నవ్వి సరేనని.. శ్రీరాముడు కూరగాయలు కొస్తూ ఉన్నాడు. సీతమ్మ పొయ్యి దగ్గరకి వెళ్ళింది. లక్ష్మణుడు హనుమంతుడు కట్టెలు తెచ్చారు. ఇలా అందరూ తలా ఓపని చేస్తూ ఉండగా.. సీతమ్మ వంట వండుతుందని తెలుసుకొని దేవతలు, ఋషులు, గంధర్వులు వరసగా వస్తూ ఉంటారు. కోలాహలంగా తయారయింది ఆ ప్రదేశం అంతా..

ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి. అక్కడి సన్నివేశం చూస్తే సామాను పక్కన పడేసి అయోద్యుడు చెట్టుకింద పడుకొని కనబడతాడు. వెంటనే గురువుగారు వచ్చి " అయోధ్యా! ఏంటి సామానంత అక్కడ పడేసి చెట్టుక్రింద పడుకున్నావ్" అనగానే.. అదేంటి గురువుగారు సీతారాములు, లక్ష్మణుడు హనుమంతుడు కౌశల్య సుమిత్ర కైకేయి అందరూ కలిసి వంట చేస్తున్నారుగా అంటే ఆశ్చర్యంతో ఎక్కడ ..నాకేం కనబడడం లేదు అన్నారు గురువుగారు.

అయోద్యుడు శ్రీరాముడిని చూసి మీరు మాగురువుగారికి కనబడడం లేదట కనిపించండి. లేదంటే నామీద సందేహం వస్తుంది అనగా శ్రీరాముడు అలానే అని సపరివారసమేతంగా గురువుగారి కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు. గురువుగారు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉండగా అయోద్యుడ్ని కౌగలించుకొని ఎన్నో ఏళ్లుగా పూజలు చేస్తున్న నాకు దర్శన భాగ్యం కలుగలేదు.

 నీవు  అమాయకంగా, నీ మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండబట్టి ఆ భగవంతుడు సాక్షాత్కరించాడు. నీవల్ల మేము ధన్యులమయ్యాం అన్నాడు..

భగవంతుడు రాడేమో అని, పూజలు ఎలా చేయాలి ?ఎన్ని వత్తులు వేయాలి? అంటూ, కొన్నాళ్ళు.. విపరీత భక్తితో, కొన్నాళ్ళు విరక్తితో, మరొకొన్నాళ్లు చిరాకుతో ఏదో ఇష్టం వచ్చినట్లు కంఫ్యూషన్ మైండ్ తో, గందరగోళంగా పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. చేయాలా వద్దా! ఎలా చేయాలి.. ఈరోజు పనులున్నాయి. ఈరోజు మనసు బాగోలేదు. ఇలా ఏదో వంకతో సాకుతో పూజలు ఎగ్గొట్టేస్తూ ఉంటారు కొందరు.

ఇలాంటివారికి జీవితాంతం గందరగోళం తప్ప భగవంతుడి సాక్షాత్కారం కలుగదు. పూజ గాని, జపం గాని, తపస్సు గాని, ధ్యానం యాగాదులు ఏదైనా సరే నిలకడ లేకుండా జీవితకాలం చేసినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సుతో చేస్తే తక్షణం పరమాత్ముడు దర్శనం ఇస్తాడు. ఏ మాత్రం సందేహం లేదు

అయోద్యుడు, భక్తకన్నప్ప, భక్తతుకారాం ఈ కోవకి చెందినవారే. ఏమి పెట్టినా, ఎలా పెట్టినా మారుమాట్లాడకుండా స్వచ్ఛమైన నిర్మలమైన భక్తికి వశమైపోయాడు.


--(())--

 అంతర్జాల పత్రిక కధలు (102)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ

నా చిన్నప్పుడు నాకు చెప్పిన కథ..

-

48 .... 🟣గురు శిష్యులు🟣

పూర్వ కాలంలో గురు శిష్యులు ఉండేవారు. కొన్ని సంవత్సరాల పాటు గురువు దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకొని శిష్యుడు జ్ఞానం సంపాదించాడు. తన దగ్గరి నుండి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి సమయం ఆసన్నమైంది అని  గురువు శిష్యుడిని పిలిచి ఆశ్రమం నుండి వెళ్లడానికి అనుమతి ఇస్తాడు.

                     శిష్యుడు గురువు పై ఉన్న గౌరవంతో "గురువుగారూ..! ఇన్నాళ్ళుగా మీ బోధనల వలన నేను అపారమైన జ్ఞానం సంపాదించాను. మీరు నాకందిచిన ఈ జ్ఞానానికి గురు దక్షిణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కానీ స్థాయికి సరిపడేంత విలువైనది ఏదీ నాకు కనిపించడం లేదు.. కనుక మీరు ఏం కావాలో కోరుకోండి.. దాన్ని మీ గురు దక్షిణ గా సమర్పించుకుంటాను." అని గురువుతో పలికాడు.

               ఆ మాటలు విన్న గురువు చిన్నగా నవ్వుతూ "నాపై నీకున్న గౌరవానికి సంతోషిస్తున్నాను. నాకు ఏమీ అవసరం లేదు. నువ్వు బాధ్యతగా, ధర్మ బద్ధంగా జీవితం కొనసాగించు.. అదే గురుదక్షిణ" అని హితవు పలికాడు.

         శిష్యుడు గురువు మాట వినకుండా " మీరు నన్ను అడిగి తీరాల్సిందే.. మీరు అడిగింది ఎంత కష్టమైనా, ప్రపంచం అంతా గాలించి అయినా సరే తెచ్చి ఇస్తాను. దయచేసి మీకు ఏం కావాలో విన్నవించండి" అని వేడుకున్నాడు. 

            గురువు ఎంత చెప్పినా అతడు వినాకపోయే సరికి గురువు గారు ఇలా అడిగారు. "చూడు నాయనా..! ఈ సృష్టిలో ఎవరికీ, దేనికీ పనికిరానిది ఏదైనా ఉంటే అది నాకోసం తీసుకురా.. నీకు ఎంత సమయం కావాలన్నా తీసుకో.. ఎప్పుడు నీకు నేను అడిగింది దొరుకుతుందో అప్పుడు దాన్ని నాకు గురు దక్షిణగా  సమర్పించు. " అని చెప్పాడు గురువు.

           గురువు మాటలు విన్న శిష్యుడు "ఏమిటి గురువు గారూ... ! పనికిరాని వస్తువా .. !  నేను ఎంతో కష్టతరమైన కోరిక కోరుతారు అనుకుంటే ఇంత సులభంగా అడిగారేమిటి..? క్షణాల్లో తీసుకొస్తాను" అని శిష్యుడు అక్కడి నుండి సెలవు తీసుకుని వెళ్ళాడు..

   శిష్యుడు వెళ్తూ వెళ్తూ దారిలో ఎండిపోయి రాలిన ఆకుల్ని చూసాడు. ఇవి పనికి రానివే కదా అని గురువుకు ఇద్దాం అని తీసి సంచిలో వేశాడు. కాస్త దూరం నడిచి ఆలోచించాడు.. ఎండిపోయిన ఆకుల వలన లాభం లేకపోలేదు.. వీటిని కాల్చి ఆ మంటతో చలి కాచుకోవచ్చు. లేదా వంట కోసం పొయ్యిలో వేసి మంట వెలిగించ వచ్చు. కనుక ఇవి గురువు గారికి ఇవ్వడం కుదరదు అని సంచిలో నుండి తీసి పారేశాడు. మళ్లీ ఆలోచించి వీటిని కాల్చడం వలన బూడిద వస్తుంది. ఆ బూడిద గురువు గారికి ఇస్తాను అనుకుని వాటిని తగళబెడతాడు. బూడిదను తీసుకెళుతు, దీనితో పాత్రలు శుభ్రం చేయవచ్చు. కనుక ఇది కూడా గురువు గారికి ఇవ్వలేను అని బూడిద విడిచి పెట్టి ముందుకు సాగుతాడు.

     ఈసారి అతడికి ఒక బావి కనపడుతుంది. ఆ బావి దగ్గర పాడుబడిన ఒక చేంతాడు కనపడుతుంది. ఈ తాడు తెగిపోయి ఉంది. కనుక నీళ్ళు తెండడానికి ఇది పనికి రాదు. కనుక అది ఇవ్వాలి అనుకుంటాడు. కానీ ఆలోచించి కనీసం కట్టెలు కట్టడానికైన తెగిన తాడు ఉపయోగపడుతుందని దాన్ని విడిచి పెడతాడు.

  ఇంకాస్త ముందుకు పోతాడు. చిన్న రాళ్ళ గుట్ట కనపడుతుంది. రాయిని తీసికెళ్ళి ఇద్దాం అని తీసుకుంటాడు. ఇంతలో ఒక పిల్లవాడు వచ్చి అక్కడ ఉన్న రాయిని తీసుకుని ఆ రాళ్ళ గుట్టకు ఎదురుగా ఉన్న చింత చెట్టు చూసి చింత కాయల్ని కొడతాడు. అది పనికి వచ్చేదే అని విడిచి పెడతాడు..

  కొంత దూరం పోయాక విరిగా కుండని దారిలో చూస్తాడు.. పగిలిన కుండ అసలు దేనికీ పనికిరాదు అని సంతోషంగా ఆ పెంకులు గురువుగారికి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇంతలో ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఆ పెంకు ముక్కల్ని తీసుకుని వెళ్తుంటే వాళ్ళని పిలిచి అవెందుకు మీకు అని అడుగుతాడు. మేము ఈ పెంకుముక్కళ్తో తొక్కుడు బిళ్ళ ఆట ఆదుకుంటాం అని జవాబు చెప్తారు. దానితో అది కూడా పనికి వచ్చేదే అని నిరాశగా విడిచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు అంతా వెతికి ఎక్కడా ఏమీ దొరకక నిరాశగా గురువు దగ్గరకు వెళ్లి క్షమించమని అడుగుతాడు.

 "గురువుగారూ మీ బోధనల ద్వారా నేను పూర్తి జ్ఞానం సంపాదించా అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది.. ఈ సృష్టిలో పనికిరాని వస్తువు ఏదీ ఉండదు.  ప్రతి ఒక్కటీ ఏదో ఒక విధంగా ప్రతి జీవికీ అవసరమైనది. ఒకరికి అనవసరమైన వస్తువు మరొకరికి అవసరమైన వస్తువు అవుతుంది. ఈ విషయాన్ని నేను గ్రహించలేక అంతా తెల్సు అని గార్వపడ్డాను. నన్ను క్షమించండి అని గురువు పాదాలపై పడ్డాడు.


  బదులుగా గురువుగారు " చూడు నాయనా ఇప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడివి అయావు. నేను జ్ఞాన బోధన మాత్రమే చేశాను. దాని ద్వారా మీరు జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలి.. ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడేలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి. సమాజంలో నీకంటూ ప్రత్యేక స్థానం నువ్వు కలిగి ఉంటే అదే నాకు గురుదక్షిణ అని చెప్పి శిష్యుడిని పంపిస్తాడు.

గురువు మన నుండి ఏమీ ఆశించడు. మన విజయాన్ని తన విజయంలా భావించి మనకంటే ఎక్కువ సంతోష పడతాడు. అటువంటి గురువులకు మనం ఇవ్వగలిగే నిజమైన గురు దక్షిణ వాళ్ళు మనకు నేర్పిన విలువల్ని పాటించి సమాజంలో నిలబడటమే.  అటువంటి గురువు మనం ఏం ఇవ్వాలని అనుకున్నా అది తక్కువే.. కనుక మనకు విద్య నేర్పిన గురు వులు ఎప్పుడు ఎక్కడ  కనపడినా రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం.

(())

49 ......  . భోగమే ప్రధానముగా జీవించుట జంతు లక్షణము. ప్రజ్ఞ ఆధారముగా జీవించే వాడు మానవుడు కనుకనే మోక్షార్హుడు 🌹

ఇల్లు తగలబడు పోవుచుండిన, ఇంటిలో నున్న వాడు  తనను తాను కాపాడుకొనుటకు బయటకు  ఎలా బయటకు పరుగెత్తునో అలా ఇంద్రియ విషయాలు అనే అగ్ని అంటుకొనినటువంటి వాడు , ఆ ఇంద్రియ విషయాలనే అగ్నినుండి బయట పడుటకు ఈశ్వరుని పాదముల చెంతకు పరుగెత్త వలెను. అటువంటివానికి మాత్రమే  వైరాగ్యము అబ్బును.

భోగమే ప్రధానముగా జీవించుట జంతు లక్షణము. ప్రజ్ఞ ఆధారముగా జీవించే వాడు మానవుడు. కనుకనే అతనికి మోక్షార్హత ఉన్నది. ఇంద్రియ విషయములు కాల సర్పము వంటివి. అవి భగవంతుడు ఇచ్చిన కాలమును హరించి వేస్తాయి. 

ఆ విషయము పూర్తగు సమయమునకు నీవు ఆత్మ స్వరూపుడవు అన్న భావనను మరపింప జేసి     జీవ భావనలోనికి తీసికొనివస్తాయి. విషము ప్రాణాన్ని హరించి వేసినట్లు విషయము జ్ఞానాన్ని హరించి వేస్తుంది. కనుక విషయములు తోచిన వాటిని విషముగా, కాల సర్పముగా చూడండి.

ఇంద్రియ విషయములు తోచినప్పుడల్లా నేను మనో, బుద్ధి, చిత్త, అహంకారములను కాదు నేను చిదానంద రూపుడగు శివుడను అన్న భానవనను గుర్తుకు తెచ్చుకోండి. ఇటువంటి వాక్యములను మీ రోజువారి జీవితములో ఉపయోగించండి.

పంచ ప్రాణములు నేను కాదు. ప్రాణ సంజ్ఞ నేను కాదు. పంచ కోశములు నేను కాదు. కర్మేంద్రియములు నేను కాదు.

ఏ శక్తి చేత నీలో ఉచ్చ్వాస , నిశ్వాసలు పని చేస్తున్నాయో  ఆ శక్తి పేరు ప్రాణ సంజ్ఞ. అది తల్లి గర్భములో నీ శరీరము ఏర్పడక ముందు నుండి కొట్టుకొంటున్నది. ఆ ప్రాణ సంజ్ఞనే హంస లేక చైతన్యము లేక ప్రజ్ఞ అంటారు. దాని వలననే ఈ శరీరము ఏర్పడినది.

 ఇలా ప్రతిది నీవు కాదు అని తెలియజేసి నీవు వీటన్నింటిని నిరసించగా చివరకు మిగిలినది ఏదో ఆ చిదానంద స్వరుపుడవు నీవు అని తెలియజేసేదే నిర్వాణ షట్కము

🌹 🌹 🌹 🌹 🌹

50....చక్రార్థ నిరూపణ

( చక్ర విజ్ఞానం)

...... మూలాధార చక్రం

మూలాధారాన్ని సృష్టికి మూల స్థానంగా వ్యవహరిస్తారు. మనిషి జననానికి ఈ స్థానం ఒక పునాది లాంటిది. దీనిని భూలోకం అంటారు. 3 1/2 చుట్లు తిరిగి ఉన్న  "చుట్టుకున్న సర్పం" (coiled serpent) ...ఈ మూలాధార స్థానంలో ఉంటుంది. ఇది ఈ ప్రదేశంలో నిద్రాణమై ఉన్న శక్తికి రూపకల్పనగా చెప్పబడింది. ఈ నిద్రాణమై ఉన్న శక్తి సుషుమ్న ద్వారా awakening చెందాలి. 3  1/2 చుట్లు అని చెప్పడంలో ఒక విశేషం ఉంది. మనస్సు యొక్క స్వప్న, సుషుప్తి, స్వల్పమైన చేతనా స్థితులకు సూచిక గానూ...ఈ స్థితులలో ఉన్న మనస్సును తురీయావస్థకు తీసుకురావడాన్ని symbolic గా చెప్పబడింది. ఈ 3 1/2  చుట్లు తిరిగిన సర్పం ...మూలాధార చక్రం లో కలదు. మగవాళ్ళలో ఈ స్థానం "scrotam", మలద్వారాల (anus) ల మధ్య ఉంటుంది. స్త్రీలలో ఇది "సెర్విక్స్" కి వెనుక భాగంలో ఉంటుంది.

    మూలాధార చక్ర స్థానంలో 4 దళాలున్న పద్మం ఉంటుంది. ఇది భూమి యొక్క నాలుగు దిక్కులకు సంకేతం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడే స్థితులకు కూడా ఈ 4 దళాలు సంకేతం. పద్మ దళాలపై... వం, శం, షం, సం ... అనే బీజాక్షరాలుంటాయి. లోపల పసుపు పచ్చగా ఉండే ఒక మూపురం ఉంటుంది. ఇది భూమికి సూచనగా చెప్పబడింది. ఇక్కడ పృథ్వీ తత్వం ఉంటుంది. ఈ చక్రం రంగు చిక్కటి ఎరుపు. మూలాధార చక్ర బీజ మంత్రం "లం". ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత అనుకూల శక్తికి సూచికగా చెప్పబడిన "గణేశుడు". ఈ చక్రం ఘ్రాణేంద్రియంతో సంబంధం కలిగి ఉన్నది. అన్నమయ కోశానికి మూలస్థానం మూలాధారం. మూలాధారానికి సంబంధించిన కర్మేంద్రియం మలద్వారం. ఈ చక్రానికి సంబంధించిన ధాతువు ఎముక.


 పృథ్వీ తత్వానికి చెందిన మూలాధార చక్రానికి యంత్రం చతురస్రం. దీనిలో 7 తొండాలున్న ఏనుగు ఉంటుంది. ఏనుగు లో ఎంత శక్తి ఉంటుందో అలాగే ఈ మూలాధార స్థానం లోని భూతత్వం అంత శక్తి కలిగి యుంటుందని సూచనగా చెప్పబడింది. మనలో దాగి ఉన్న శక్తికి ఇది ఒక సూచిక. ఏనుగుకి ఉన్న ఏడు తొండాలు మనిషి యొక్క సప్త ధాతువులకి సూచనగా చెప్పబడ్డాయి. ఏనుగు వీపు మీద ఎరుపు రంగులో తిరగ వేసిన త్రికోణం ఉంటుంది. ఇది సృజనాత్మక శక్తికి సంబంధించినది. ఇక్కడ పొగ లాంటి బూడిద రంగులో లింగం ఉంటుంది. ఇది astral body ని సూచిస్తుంది. మూలాధార స్థితిలో ఉండడమంటే ఒక రకంగా un conscious స్థితిలో ఉండడమే మరి.

     ఈ చక్రం ...తనను తాను రక్షించుకొనే స్వార్థం, భయం, క్రూరమైన ఆక్రమణ తత్వం, మృగ మనస్తత్వం...అనే లక్షణాలను కలిగి యుంటుంది.

     ఈ చక్రం ఆరోగ్య స్థితిలో ఉన్నవారు బలమూ, అతి శ్రద్ధ, నిర్భయత్వము, దేనినైనా సాధించే వారుగా ఉంటారు. ఈ చక్రం బలహీనమయ్యేకొద్దీ పైన వివరించిన శక్తులు కోల్పోతూ అనారోగ్యం ప్రారంభం అవుతుంది.

     మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది.  ఈ మూలాధార చక్రములో ‘సాకిని’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్భస్త శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె అస్తి సంస్థిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేశ్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.

    ఈ మూలాధార చక్రాన్ని శ్రీ విద్యోపాసనలో త్రైలోక్య మోహన చక్రము అంటారు.

 ఇది నాల్గు దళములు గల పద్మము.  ఈ చక్రమునకు ఆధి దేవత విఘ్నేశ్వరుడు.  బీజాక్షరము "లం". మూలాధారము, స్వాధిష్టానములను కలిపి ఉంచే గ్రంథి "బ్రహ్మ గ్రంథి". సాధకుడనేవాడు చక్రాలనే కాక ఈ గ్రంథులు లనే 3 ముడులను కూడా ఛేదించాలి.  దీనిని పాశ్చాత్య తాత్వికులు “sacral plexus " అంటారు. మూలాధారమునందు ధ్యానము చేసినచో కుండలిని జాగృతమగుట సులభమగును. హఠ యోగం నందు, శ్రీ విద్యోపాసన యందు,లయ యోగమందు, కుండలినీ యోగమందు , ఈ చక్రమును జాగరణ చేసి జయించు క్రియలు చెప్పబడినవి. మూలాధారము కుండలిని శక్తికి switch స్థానము. యోగ శాస్త్రము ప్రకారము "గణపతి " మూలాధారస్థితుడు. షట్చక్రములలో అన్నిటికన్నా క్రింద ఉండి అన్నిటికి ఆధారమైనదే మూలాధారం (త్వం మూలాధార స్థితోసి నిత్యమ్ ! అని "గణపతి అధర్వ శీర్షం " లోని వాక్యము).

లలిత సహస్ర నామములో  "మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేధిని"  అని వస్తుంది. అమ్మవారు ఈ మూలాధారం లో కాల సర్పం గా కుండలినిలో నిండుగా చుట్టుకొని ఉంటుంది .లౌకిక అలౌకిక సుఖాల అనుమానం తొలగిపోయినప్పుడు ఈ కుండలిని నిద్ర తొలగి పోతుంది .ఒక సారి కుండలిని మేలుకొంటే సాధకుడి కల చెదిరిపోతుంది .అప్పుడు తన నిజ స్వరూపాన్ని   గుర్తిస్తాడు .దీన్ని యోగ శాస్త్రం లో ‘’ముడి విడిపోవటం" అంటారు .సాధకుడి ధ్యానం మరియూ ధారణ మూలాధారం నుండి పైకి లేచినప్పుడు ఈ ముడి అంటే గ్రంథి విడిపోతుంది .సాధనా మార్గం లో అనేక గ్రంథులున్నాయి .మూలాధారానికి పైన ఉన్న గ్రంథులలో  మొదటిది "బ్రహ్మ గ్రంథి" .బ్రహ్మ సమస్త ప్రపంచాన్ని సృష్టి చేస్తాడు. మూలాధారం చేసే పని కూడా ఇదే. దీని రహస్యం తెలుసుకొన్న సాధకుడు తనకు తెలిసినదంతా ఒక స్వప్నం గా తెలుసుకొంటాడు .దీనితో కల చెదిరి పోతుంది .మరొకటి మొదలవుతుంది .ఇక్కడి నుండి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది .దూర ప్రయానికి ఇది మొదటి మజిలీ మాత్రమే .ఈ గ్రంథి విప్పించే మాత ‘బ్రహ్మ గ్రంథి విభేదిని‘ అయింది. మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది.

మన శరీరములోని మూలాధార చక్రము, శ్రీచక్రము లోని త్రైలోక్య మోహన చక్రానికి ప్రతీక. దీంట్లో మూడు భూపురాలు ఉంటాయి. అవి మూడు లోకాలకు ప్రతీక. అవియే గాయత్రి వ్యాహృతులు అయిన "భూః, భుః, సువః".  సౌందర్య లహరి లో శ్రీ శంకర భగవత్పాదులు ఈ మూలాధార చక్రము గురించి "సౌందర్య లహరి"లో ఇలా చెప్పారు.(సశేషం)

భట్టాచార్య



No comments:

Post a Comment