Monday 2 July 2018

PRANJALI PRABHA


🌹🌹🌹🌹 *శుభమస్తు*🌹🌹🌹🌹

--((**))--
భార్య : ఏవండోయ్.. ఇవాళ సాయంకాలం తొందరగా ఇంటికి రండి సినిమాకు వెళ్దాం....

భర్త : నా దగ్గర TRS 🚙గుర్తేమైనా ఉందా, ఉండేది TDP🚲 గుర్తు... ఆలస్యం అవుతుందేమో!

భార్య : సకాలానికి వస్తే BJP🌹 గుర్తు, ఆలస్యమైతే కాంగ్రెస్✋ గుర్తు, మరీ ఆలస్యమైతే AAP🏒 గుర్తు మీకు స్వాగతం పలుకుతాయి. ఆ తర్వాత మీ ఇష్టం....
.
.
.
.
.
ఇంకా నయం ఈ మహాతల్లికి CPI గుర్తు గుర్తురాలేదు...
--((**))--





నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల )
ప్రాంజలి ప్రభ (లోకం తీరు)




రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఎవరి కెవరు ఈ లోకంలో అనుకోకు
 - అంతా నా వారని అనుకో

ఏ నిముషాన ఏమి జరుగునో అనుకోకు
 - జరిగిన దంతా మన మంచికే అనుకో

ఏ మతం, ఏ కులం, ఏ జాతి అనుకోకు
 - మానవాభ్యదాయానికి తోడ్పడే మనుష్యులనుకో

ఏ మార్గం, ఏ దీపం, ఏ దైవం అనుకోకు
 - మనుష్యుల్లో ఉన్న దైవాన్ని గుర్తించి మసలుకో

చీకటి వెలుగులు తప్పవు - మంచి చెడు చేయక తప్పదు
సుఖసంతోషాలతో సముద్ర కెరటాలను దాటుకుంటూ
పోవటమే నిజమైన జీవితం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా     


--((**))--


58. ఆనాటి విషయం మరిచిపో
- అది ఆవేశముతోనే, అనాలోచనతోనే చేసినది

జరగబోయే విషయం గుర్తు తెచ్చుకో
- బంగారు భవిషత్తుకు వేయాలి పునాది

చెడును మరచి మంచి చేసి శోభా తెచ్చుకో
- కాలంతో పాటు నడక అనేది అనాది

ప్రాణుల కోసమైన ప్రాణం నిల్పుకో
- బ్రతికి బ్రతికించట మానవత్వానికి ఉగాది


ఏనాటికి మారదు, ఏనాటికి తెలియదు, ఏబుర్రకీ ఎక్కదు

ఆనుకోవటాం పొరపాటు, కాలు జారితే కడుక్కోవాలి

శీలం జారినా మృగాలను ఎదిరించి బ్రతకాలి

ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--


తల్లో పూలు గొనిస్త! సేతులకు బందర్గాజు లేయిస్త! యీ ఊల్లో గాని యెవుత్తికట్ట నసుమంటుప్పాడ చెమ్కీ బుటా మల్లీ మొగ్గల తెల్లకోక యిగ యీమారెల్లి పట్కొత్తనే సల్లా ఎంకట లచ్మీ బతుకేలా నీవు లేకుండినన్ తల్లోకి పూలు కొనిస్తా,బందరు గాజులేయిస్తాయీ వూళ్ళో ఏ స్త్రీ కట్టనటువంటి చెమ్కీలు,బుటాలు వున్న మల్లెమొగ్గ లాంటి తెల్లచీరెను ఉప్పాడ వెళ్లి కొనుక్కొస్తా అందుకని సుబ్బలక్ష్మీ దయచూపవే నువ్వు లేకపోతే యీ బతుకు నాకెందుకే అంటూ సాగుతుందీ పద్యం సుబ్బలక్ష్మిని ఉద్దేశించి సత్యనారాయణ శాస్త్రి గారు ఆ శతకాన్ని వ్రాస్తే దానికి సుబ్బలక్ష్మి ప్రతిస్పందిస్తే యెలా వుంటుంది?అన్న కోణం లో గాడేపల్లి వారు యీ పద్యం వ్రాశారు.చిన్నతనం లో ఆడా మొగా తేడాల్లేకుండాకలిసిమెలిసి ఆడుకోవటాలు,కొట్టుకోవడాలు,సహజం.కొంచెం ఉడికిస్తే చాలు లంగాను గోచీ లా బిగగట్టి మగపిల్లలతో దెబ్బలాటకు దిగడం అప్పుడప్పుడు అబ్బాయిని బాదడము అంతే సహజం.శాస్త్రి గారు దుబ్బు మీసాలు పెంచుతారు.యీ పద్యం ఆ మీసాలని ఎగతాళి చేస్తుంది
గోలీలాట మొగోల్ల ఆట!నువు కూకోమాకు యెల్లెల్లు, ల చ్చీ!లచ్చీ అని ఆడు పుట్టువునె అచ్చేపిస్తే కూసోని,నీ గోలీల్నీ,సహవాసగాళ్ళని సహా గొర్గింది గుర్తుంద! మీ సాలింకెందుకు సత్తిబాబు!యికిలిస్తా వేంది పిల్లాటలా
సత్తిబాబు ఆడ పుట్టుకను ఆక్షేపిస్తే సుబ్బలక్ష్మి కి కోపం వచ్చి సత్తిబాబుతో గోలీ లాడి సత్తిబాబుకు శాస్తి చేసింది.ఎగతాళి చేస్తున్న సుబ్బలక్ష్మిని ఏడవలేక నవ్వుతూ బిక్కమొగం వేసుకున్న సత్తిబాబును మీరే ఊహించుకోండి. నైపుణ్యం గల శిల్పి చేతిలోని ఉలి బండ రాయిని సౌందర్యమూర్తిగా యెలా మలచగలదో ప్రతిభా వంతుడైన కవి కలమూ అంతే దానికి ప్రక్రియ,భాష అడ్డురావు.అంత ప్రతిభ గల కవులు కాబట్టే భాష మాండలికమైనా యతిభంగం జరిగినా కవన ప్రపంచం వారి ముందు మోకరిల్లింది.


--((**))--

పాత సంప్రదాయంలో కొత్త చూపు 

సాహితీమిత్రులారా 

అంతటి జగన్నాథుడే హామీ పత్రం వ్రాయించాల్సి వచ్చిందీ కలియుగంలో ఈ కథా కమామీషు వెంగమాంబ వేంకటాచల మాహత్మ్యం లోని విషయాన్ని ఇందులో ఆస్వాదించండి...... 

సీ. 
శుక్లపక్షము నాటి సోము డాలోచించి 
తలచె నిమ్మెయి రమాతరుణి కిచట 
నలక దీరిచి వక్షమం దుంచుకొనియుండ 
కాకాశ రాజేంద్రు నాత్మసుతను 
దా బెండ్లియాడుట దలచె గదా హరి 
దయలేని వాడయ్యె ధాత గూడ 
నిపుడైన నురమునం దిందిర నిడుకొని 
యేలంగ మేలు మరేల పెండ్లి 
తే. 
యనుచు మునులైన జెప్పక యలరువారు 
కాని వీరికి వనముల బూని పోవు 
నపుడు చీకటి చేయింతు ననగ బశ్చి 
మాబ్ధి కేగుదు నని చంద్రు డరుగుచుండె 

ప్రకృతి వర్ణనలు కథతో అనుసంధానం చేసి చెప్పడం ఆ వర్ణనలకు ఒక ఔచిత్యాన్ని సార్థకతని అందిస్తుంది. ప్రాచీన ప్రబంధాలలో విస్తారంగా సాగే వర్ణనల్లో అలాంటి సార్థకమైన పద్యాలు అతి కొద్దిగా ఉంటాయి. చేసిన వర్ణనలు కొద్దిగానే అయినా వాటిని కథతో సమన్వయించి చేయడం శ్రీవేంకటాచల మాహాత్మ్యం అనే ప్రబంధంలో కనిపించే ఒక విశేషం. 18వ శతాబ్దానికి చెందిన భక్తురాలు, యోగిని, కవయిత్రి అయిన తరిగొండ వెంగమాంబ రచించిన పద్యకావ్యం శ్రీవేంకటాచల మాహాత్మ్యం. అందులో చంద్రుని వర్ణించే పద్యమిది. అతడు శుక్లపక్షము నాటి చంద్రుడు. శుక్లపక్షంలో చంద్రుడు తొందరగా ఉదయించి తొందరగా అస్తమిస్తాడు. అలా తొందరగా అస్తమించడానికి గల కారణాన్ని కవయిత్రి ఉత్ప్రేక్షించి, అనగా ఊహించి చెప్పిన పద్యం యిది. ఈ పద్యం వెనుకనున్న కథ తెలిస్తేనే యిందులోని సారస్యం అర్థమవుతుంది! 

శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో అసలు కథ తెలుగువాళ్ళకు బాగా పరిచితమే. అది వేంకటేశ్వరుని అవతార, కళ్యాణ గాథ. కథ తెలుసున్నదే అయినా, కథనంలో, పాత్ర చిత్రణలో, సంభాషణల్లో ప్రత్యేకత తొణికిసలాడే విశిష్ట ప్రబంధం యిది. పరమ భక్తురాలైన వెంగమాంబ తన పాండిత్యం గురించీ, కవిత్వ పటిమ గురించీ చాలా తక్కువ చేసుకొని యిలా చెప్పుకుంది. 

భక్ష్యములు మెక్కి యావల బచ్చడియును 
నంజుకొనిన విధంబున నా ప్రబంధ 
మాలకింతు రటంచు బేరాస చేత 
నేను రచియింతు దీని మన్నించి గనుడు 

అలాంటి పోలిక చెప్పడంలోనే నిజానికి ఆవిడ కవిత్వ శక్తి వెల్లడవుతోంది! మొదటి మూడు ఆశ్వాసాలూ ప్రధానంగా వెంగమాంబ యోగ విద్యాజ్ఞానాన్ని ప్రకటిస్తే, తర్వాతి మూడు ఆశ్వాసాలూ ఆవిడకున్న ప్రబంధ రచనాచాతుర్యాన్ని ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా, శ్రీదేవి-శ్రీహరుల మధ్య సాగే సున్నిత కలహాన్ని అంతే నాజూకుగా నిర్వహించిన తీరు ఈ ప్రబంధంలో నన్ను బాగా ఆకట్టుకొన్న అంశం. వేంకటేశ్వర కల్యాణం మాట అటుంచి, లక్ష్మీ నారాయణుల మధ్యనున్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కథని తరచి చూస్తే, అది చాలా చిత్రంగా తోస్తుంది. శ్రీ నివాసస్థానమైన హృదయాన్ని భృగు మహర్షి కాలితో తంతే ఆయన పాదాలు పట్టుకొంటాడు శ్రీహరి. దానితో లక్ష్మీదేవి మనసు కష్టపడి అతన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేస్తుంది. అయ్యవారు కూడా ఆమెను వెతుక్కొంటూ భూలోకానికి దిగి వస్తాడు. ఆ వచ్చినాయన తన పేరు శ్రీనివాసుడు అని చెప్పుకొంటాడు. కనీసం పేరులోనైనా సిరిని తనలో నిలుపుకోవాలని కాబోలు! దిక్కు తోచక తిరుగుతున్న అతనికి వకుళమాత ఆశ్రయం ఇస్తుంది. 

ఇంతవరకూ బాగానే సాగిన కథ, ఆ తర్వాత ఒక కీలకమైన మలుపు తిరుగుతుంది. వచ్చినవాడు వచ్చినట్టు ఉండకుండా ఆ దేశపు రాజైన ఆకాశరాజు కూతురు పద్మావతిని చూస్తాడు శ్రీనివాసుడు. చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇతనిపై మరులుగొంటుంది. ఇక ఆ తర్వాత సోదెమ్మ వేషం వేసుకొని అతడు అంతఃపురానికి వెళ్లి రాణిగారితో ప్రేమ విషయం ప్రస్తావించడం, వకుళను పంపించి పెళ్లి కుదుర్చుకొని రప్పించడం, పెళ్లికి దేవపరివారమంతా తరలి రావడం చకచకా జరిగిపోతాయి. లక్ష్మీదేవి ఊసు పూర్తిగా మరుగున పడిపోతుంది. స్వామివారు మంగళస్నానానికి కూర్చున్నప్పుడు, అప్పుడు గుర్తొస్తుంది అమ్మవారు! ‘ఇదేమిటి, లక్ష్మి లేకుండా నేను పెళ్లి చేసుకోవడమేమిటి, నేను పరాకుపడితే పడ్డాను, మీలో ఏవొక్కరూ ఇది సమంజసం కాదని చెప్పలేదేమిటి?’ అంటూ దేవతలపై కోపం ప్రదర్శిస్తాడా జగన్నాథుడు. బ్రహ్మ కంగారుపడి నీళ్లు నములుతూ, ‘మేము చెపుదామనే అనుకున్నాం కానీ… మీరు ఏమనుకుంటారో అని తటపటాయించాం. హమ్మయ్య, మీరే అన్నారు కాబట్టి వెంటనే అమ్మని పిలవాలి,’ అంటాడు. అప్పుడు శ్రీదేవిని పిలుచుకు రమ్మని సూర్యుడికి ఆనతిస్తాడు శ్రీహరి. ఏమని చెప్పమంటారంటే, అయ్యవారు నీకు దూరమై చాలా నీరసించి నిన్ను కనులారా జూడాలని వేంకటాచలంపై తపించిపోతున్నాడని చెప్పమంటాడు! సూర్యుడు వెళ్లి అలాగే చెపితే లక్ష్మి పాపం కంగారుగా హుటాహుటిని వస్తుంది. వచ్చిన ఆ దేవదేవికి దేవతలందరూ మంగళతూర్యాలతో స్వాగతం పలుకుతారు. లక్ష్మీదేవికి పరిస్థితి అంతా అర్థమవుతుంది. అప్పుడామెను పక్కకు తీసుకువెళ్లి విషయం విన్నవిస్తాడు శ్రీహరి. అతనెంతటి కపట నటకుడో లోకానికి స్పష్టంగా తెలిసేట్టు ఉంటాయా మాటలు! అలా అతన్ని లోకానికి బట్టబయలు చేయడమే కవయిత్రి ఉద్దేశమేమో! 

విష్ణువు అంటాడు కదా, ‘నువ్వు నన్ను వదిలిపోయినప్పటి నుంచి, ఇదిగో ఈ పుట్టలో నిన్నే తలుచుకుంటూ కూర్చున్నాను. పశులకాపరి నా తల పగలగొట్టినప్పుడు ఆ బాధకు ఓర్చి నేనిలా ఉన్నానంటే అది నీ మహిమే. నీ పాతివ్రత్య నిష్ఠ చేతనే నేనింకా బతికున్నాను. అదలా ఉంటే, ఈ ఆకాశరాజ కన్య నన్ను మోహించి నా వెంటపడింది. అందుకామెను పెళ్లిచేసుకోవలసి వచ్చింది. అది కూడా నువ్వు ఒప్పుకొంటేనే సుమా! నువ్వు కాదంటే నాకీ పెళ్లి వద్దు.’ ఇవీ ఆయనగారి మాటలు! అయినా అమ్మవారి దగ్గరా ఆయన మాయలు? ‘ఆమె నీ మోహంలో పడిందో, నువ్వే ఆమెని వరించి ఈ ప్రయత్నమంతా చేస్తున్నావో నాకు తెలుసు. మంగళకరంగా శుభలేఖ పంపించి నన్ను పిలిచి ఉంటే బాగుండేది. మాయమాటలతో రప్పించావు. నేను ముందే వస్తే పెళ్ళికి ఒప్పుకోనని భయపడి, ఇంతా అయ్యాక ఇప్పుడు పిలిపించావు. సరే మంచిది. నీ వివాహం కారణంగానైనా నేనిక్కడికి వచ్చి నీ ముఖాన్ని చూసే అదృష్టం దక్కింది. అంతే చాలు. నేను ఉండి కూడా నీకు లేని దాన్నయిపోయాను. అందుకే నీ బుద్ధి మరో పెళ్లి మీదకి మళ్లింది. సరే, అలాగే కానీ. నువ్వు పెళ్లిచేసుకొని సుఖంగా ఉండు,’ అని సూటిగా ఘాటుగా జవాబిస్తుంది లక్ష్మీదేవి. దానితో శ్రీహరి కళ్లల్లో నీళ్లు నింపుకొని నీకన్నా నాకు ఆప్తులెవరూ లేరని వేడుకొంటాడు. ఇక అక్కడినుండీ అయ్యవారు అమ్మవారిని ప్రసన్నం చేసుకోడానికి చేసే ప్రయత్నాలు కావ్యం చివరకూ సాగుతాయి. అదంతా స్వయంగా చదివి ఆస్వాదించ వలసిందే! 

ఇదీ ఈ పద్యానికి ఉన్న నేపథ్యం. తెల్లవారితే శ్రీనివాస కల్యాణం. పెళ్ళికి వచ్చిన శివ, బ్రహ్మ, ఇంద్రాది బంధుగణమంతా ఎవరి విడిదిలో వారు తమ తమ భార్యలతో నిద్రకు ఉపక్రమించి ఉంటారు. విష్ణువు మాత్రం వివాహవ్రత దీక్షలో పుట్టలో ఉంటాడు. లక్ష్మీదేవి వకుళమాత దగ్గర పడుకొని ఉంటుంది. అది చూసిన చంద్రునికి దుఃఖం కోపం ముంచుకొస్తాయి. ఎంతయినా తోడబుట్టినది కదా! హరి వక్షస్థలంపై హాయిగా మహావైభవంతో శయనించాల్సిన సిరి కొండరాతి మీద అలా పడుకోవలసి వచ్చిందని బాధపడతాడు. ‘కొల్లాపురంలో ఉన్న లక్ష్మిని మాయమాటలతో మోసంతో పిలిపించాడు. పోనీ ఇప్పుడైనా ప్రేమతో తన ఉరముపై నిలుపుకుంటాడేమో చూద్దామని పరుగున వస్తే, యిది చూడాల్సి వచ్చింది,’ అని కోపంతో పద్మాక్షుడైన విష్ణువు కన్నులు మూతలు పడేట్టు చేసాడట చంద్రుడు. ఆ తర్వాత యింకా యిలా ఆలోచిస్తున్నాడు ఆ శుక్లపక్ష సోముడు: 

ఇక్కడకి వచ్చిన రమను అలకదీర్చి గుండెల్లో పొదువుకోకుండా, ఆకాశరాజు కూతురును పెళ్లాడేందుకు సిద్ధపడ్డాడు హరి. కొడుకైన బ్రహ్మ కూడా దయలేనివాడయ్యాడు. ఇప్పుడైనా, నీకింకా వేరే పెళ్లెందుకయ్యా, ఇందిరను తిరిగి వక్షస్థలంపై కూర్చోబెట్టుకొని ఏలుకోరాదా అని మునులైనా చెప్పకుండా వినోదం చూస్తున్నారు (అలరువారు). అలాగే కానీ! వీళ్ళందరూ అడవులుపట్టి పోతున్నప్పుడు వీళ్లకు దారి కనపడకుండా చీకటి చేసేస్తాను. 

అలా ఆలోచించి పడమటి సముద్రం వైపుకు తొందరగా వెళ్ళిపోయాడట చంద్రుడు! 

కథలో యిమిడిపోవడంతో పాటుగా, ఇలాంటి వర్ణనలు కవుల అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తాయి. ఈ పద్యం చదివినప్పుడు నాకు ఠక్కున మనుచరిత్రలో పెద్దన కూర్చిన ‘తరుణి ననన్యకాంత…’ అనే పద్యం గుర్తుకు వచ్చింది. అక్కడ ఆయన చేసినది సూర్యోదయ వర్ణన. సూర్యుడు ఎఱ్ఱని కాంతులతో రాజిల్లుతున్నాడు, బహుశా రోజూ కన్నా ఎఱ్ఱగా కనిపించాడు కవికి. అదేమిటంటే విపరీతమైన కోపమట. ఎందుకంటే – వయసులో ఉన్నది, వేరే ఎవరినీ వరించనిది, మన్మథ తాపంతో తపిస్తున్న శరీరం కలిగినది అయిన వరూధిని, కోరి చేరితే పరిగ్రహించక, క్రూరుడై, మన్మథుని బారికి ఆమెను వదిలేసిపోయాడని సూర్యునికి ప్రవరునిపై కోపం వచ్చిందట. అంతటి నిష్ఠాగరిష్ఠుడైన ప్రవరుణ్ణి పట్టుకొని, బ్రాహ్మణాధముడు! అని తిడతాడు సూర్యుడు. ఈ కోపం సూర్యునిదనుకోవాలా కవిదా? దానికి సమాధానం ఊహ తెలియంగల పాఠకులే నిర్ణయించుకోవచ్చు. 

అలాగే, చంద్రుని వంకతో కవయిత్రి తన కోపాన్ని ఇక్కడ ప్రకటించిందని నాకు అనిపించింది. అయితే, ఇక్కడ చంద్రునికి కోపం రావడం వెనుక బంధుత్వమనే బలమైన కారణం కూడా ఉంది. పెద్దనగారి విషయంలో సూర్యుడికి ప్రవరునిపై అంత కోపం రావడానికి అలాంటి కారణం ఏదీ కనిపించదు. 

కావ్యం చివరి వరకూ సిరికీ శ్రీహరికీ మధ్య పొత్తు కుదరదు! పెళ్లయిన తర్వాత మళ్ళీ తన దారిన తాను కొల్లాపురం వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. వరాహ భవిష్యోత్తర పురాణాలలో ఉన్న వేంకటాద్రి మాహాత్మ్య కథ ఇంచుమించు శ్రీనివాస కల్యాణంతో ముగుస్తుంది. కానీ అలా ముగించేయడం వెంగమాంబకు సంతృప్తినివ్వలేదు. అది ఆమె స్వయంగా కావ్యంలో చెప్పుకొంది. అందువల్ల పద్మపురాణంలో కనిపించిన ఒక కథని తీసుకొని, దానికి తన కల్పనలు కొన్ని జోడించి, ఒక పూర్తి ఆశ్వాసాన్ని రచించిందావిడ. దానికి ప్రత్యేకంగా వీరలక్ష్మీవిలాసం అని పేరుకూడా పెట్టింది. అదీ వెంగమాంబకు లక్ష్మి మీదున్న అభిమానం! 

పద్మావతితో పెళ్ళయిన కొన్నేళ్లకు విష్ణుమూర్తికి తిరిగి లక్ష్మీదేవిపై మనసు మళ్ళుతుంది. ఆమె కోసం పరిగెత్తుకుని కొల్లాపురం వెళతాడు. అప్పటికి లక్ష్మీదేవి అక్కడ నుంచి పాతాళానికి వెళ్లిపోతుంది. దానితో లక్ష్మీదేవి కోసం తపస్సు ప్రారంభిస్తాడు విష్ణువు. ఒక సరస్సు ఒడ్డున కూర్చొని, సరస్సులో ఒక పద్మాన్ని సృష్టించి, ఆ పద్మాన్నే తదేకంగా చూస్తూ, అమ్మవారి కోసం ఇరవై రెండేళ్లు తపస్సు చేస్తాడు. అప్పటికి ఆమె మనసు కాస్త కరుగుతుంది. బయలుదేరి వస్తుంది. సరసున ఉన్న పద్మంలో ప్రత్యక్షమవుతుంది. వారిరువురి మధ్యనా జరిగే ఆ సన్నివేశాన్ని చాలా హృద్యంగా చిత్రించింది వెంగమాంబ. 

సిరి తను జూచుచున్నపుడు శీర్షము నేలకు వంచి లజ్జతో 
నరమర జేయుచున్న పతి నంబుధికన్యక చూచి సిగ్గునన్ 
మఱల శిరంబు వంచి యనుమానమునన్ దను జూడకుండగా 
హరి కమలాలయాననము నప్పుడు మోహము మీర జూడగన్ 

సిరి తనని చూసినప్పుడు శ్రీహరి సిగ్గుతో తలవంచుకున్నాడు. భర్త అలా తల వంచుకోడం చూసి, తాను కూడా సిగ్గుతో తలదించుకొన్నది సిరి. ఆమె తలవంచుకోడం చూసి ఆమెని మోహంతో చూసాడు హరి! ఇక్కడ కమలాలయ అన్నది సార్థక ప్రయోగం. లక్ష్మీదేవి అనే రూఢి అయిన అర్థమే కాకుండా, అప్పుడామె ఉన్న స్థితిని కూడా (పద్మంలోనే ఉంది కదా అప్పుడు) సూచించే పదమది. ఒక వైపు బింకం మరొక వైపు పొంకంతో ఇద్దరికిద్దరూ అలాగే చూసుకుంటూ ఉండిపోతారే తప్ప ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడారే! గోవిందుడు అళికియు ఆళుకక (అంటే జంకీ జంకక), శ్రీరమాదేవి తొలుత తను జూచి మాటాడినను దాను మాటాడవలెనంచు శిరము వాంచి యుండె. హరి పిలిచినప్పుడు మాటాడె దంచును లక్ష్మి కమలంబుపై నిల్చి కదలకుండె. అదీ వరస! ఆఖరికి బ్రహ్మరుద్రాదులు దిగి రావలసి వచ్చింది వారిద్దరినీ కలపడానికి. వాళ్ళందరూ వచ్చి వీరిద్దరినీ స్తోత్రం చేసి ప్రార్థిస్తే కాని అమ్మవారు ముందుకు కదలలేదు, అయ్యవారు అమ్మవారిని దగ్గరకు తీసుకోలేదు! ఆఖరికి భృగు మహర్షి లక్ష్మీదేవి పాదాలపై పడి, తను చేసిన తప్పును తల్లిలా క్షమించమని వేడుకొంటాడు. అప్పుడామె యిది నీ తప్పూ కాదు, నా తప్పూ కాదు, ఇదంతా కపటనాటక సూత్రధారి అయిన చక్రి పని అంటుంది. మొత్తమ్మీద చివరికి సిరి హరి మెడను వరమాలతో అలంకరిస్తే, హరి సిరిని తన ఉరముపై తిరిగి నిలుపుకొంటాడు. అంత తతంగం జరుగుతుంది వారిద్దరూ తిరిగి కలవడానికి. 

ఇక్కడితోనైనా నిజానికి కావ్యం అయిపోయి ఉండాలి. కానీ అప్పటికీ వెంగమాంబకు తృప్తి కలగలేదు. ఇద్దరూ ఒకటైన కొన్నాళ్ళకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గర తాను కుబేరుని దగ్గర చేసిన అప్పును ప్రస్తావించి, అది తీర్చడానికి లక్ష్మి సహాయం కోరుతాడు. తన అప్పు తీర్చడం కోసమే హరి లక్ష్మిని తిరిగి పొందాడన్న భావం కవయిత్రి మనసులో ఉన్నదేమో అనిపించింది, అది చదివితే! అప్పుడు లక్ష్మీదేవి శ్రీహరిని మరొక ఉతుకు ఉతుకుతుంది! 

అనఘా! పెండ్లికి నేను వచ్చినపు డిం దర్థంబు లేదంచు జె 
ప్పిన దప్పే మటు చెప్పినన్ ధనము నే బ్రేమారగా నియ్యనే! 
నను నీ వప్పుడు తేరజేసి ధనదు న్నా పెండ్లి కీ వర్థ మి 
మ్మని యాచించి ఋణంబు సేయు పని కేమందున్ జగన్నాయకా! 

మాటల్లో ఉండే కాకువు అంతా పోతపోసి నిర్మించిన మరొక మంచి పద్యమిది. ఆ కాకువులోని ఎత్తిపొడుపంతా మొదట చివర వేసిన- అనఘా, జగన్నాయకా అనే సంబోధనల్లో ఉంది! పెళ్ళికి ఎలాగో నన్ను రప్పించావు. నేను వచ్చినపుడు, ధనం లేదని నాతో చెప్పడానికి నీకు నామోషీ అయ్యిందా? అలా చెపితే నేను ప్రేమతో నీకా ధనం ఇవ్వకపోతానా? నన్ను నువ్వప్పుడు వేరే దానిగా భావించి, చులకనగా చూసి (తేరజేసి), వెళ్లి ఆ కుబేరుడిని యాచించి, అతడి దగ్గర అప్పు చేసావు. ఇలాంటి పనిని ఏమనాలి చెప్పు! 

అక్కడికి కవయిత్రి మనసు తృప్తి పడింది! అలా ఘాటుగా అడిగిన అమ్మవారికి అయ్యవారు ఏమని సమాధానం చెప్పగలరు? అసలే నన్ను వీడిన చింతలో ఉన్న నిన్ను నేనేం మొహం పెట్టుకొని నా పెళ్ళి కోసమని ధనం అడగగలను అంటూ సంజాయిషీ ఇచ్చుకుంటాడు! అప్పుడు అప్పు తీర్చడానికి ఒప్పుకుంటుంది రమ. అక్కడితో వారి కథ సుఖాంతం అవుతుంది! ఇలా పాత్రల నిర్వహణలో సున్నితమైన సమతౌల్యాన్ని ప్రదర్శిస్తూనే తన అంతరంగాన్ని నిష్కర్షగా ఆవిష్కరించడంలో గొప్ప నేర్పు చూపిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ. 

ఈ ప్రబంధంలో కనిపించే మరొక విశేషం ఇందులోని పత్రికల, పత్రాల ప్రస్తావన. ఆకాశరాజు శ్రీనివాసునికి వ్రాయించి పంపే పెళ్లిపత్రిక, శ్రీనివాసుడు బ్రహ్మాది దేవతలను ఆహ్వానిస్తూ పంపే శుభలేఖ, సీస పద్యాల రూపంలో వివరంగా ఉంటాయి. లక్ష్మీదేవి తనకు శ్రీనివాసుడు పసుపుజాబు పంపించలేదని ఆక్షేపిస్తుంది. ఈ పెళ్ళి శుభలేఖల ప్రస్తావనలు ఆ కాలంలో వాటికున్న ప్రాధాన్యాన్ని సూచిస్తాయి. అంతే కాదు, శ్రీనివాసుడు కుబేరునికి స్వయంగా వ్రాసి యిచ్చిన అప్పుపత్రాన్ని కూడా మనమీ ప్రబంధంలో చదవ వచ్చు! ఇది కూడా సీస పద్యమే. 

శ్రీకరలీల స్వస్తిశ్రీ జయాభ్యుదయాష్టాదశ ద్వాపరాంతమందు గల కలి, నాది వేంకటనాయకుడు ధనపతి కొసంగిన వడ్డిపత్ర మెట్ల యనిన, నా వైవాహమునకు నీచే నప్పు గొనిన టెంకీలును గోటి సంఖ్య లలిని జతుర్దశలక్షలందుకు వడ్డి ప్రతి వత్సరంబును బరగ నిత్తు. కలియుగాంతమునందున గాసువీసముంచ కొగి దీర్చివేయుదు. మొనసి దీని కజుడు శంభుడు మరియు హిమాంశు డినుడు సాక్షులు, నిజంబు వృక్షరాజంబు సాక్షి. 
ప్రతి ఆశ్వాసాంత పద్యాలలో అంత్యప్రాసను పాటించడం, గద్యలో అప్పటివరకూ జరిగిన కథ మొత్తాన్ని సింహావలోకనం చేయడం వంటివి యీ ప్రబంధంలో కనిపించే మరికొన్ని విశేషాలు. పాత ప్రబంధ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఎన్నో విశేషాలతో, ఒక కొత్తదనం, ప్రత్యేకత సంతరించుకున్న రచన శ్రీవేంకటాచల మాహాత్మ్యం. దీన్ని కేవలం ఒక స్థల మాహాత్మ్య కావ్యంగా కాక, అనేక కోణాలలో చదివి విశ్లేషించవలసిన అవసరం ఉంది. 
---------------------------------------------------------- 
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో 
----------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

--((**))--


ద్వాదశ జ్యోతిర్లింగాల పట్టిక 

LIST OF 12 (DWAADASHA) JYOTIRLINGA-s 

Place of Worship Name of the Deity 

Srisailam (Andhra Pradesh) Mallikaarjuna 

Somanath - Saurashtra (Gujarat) Somanaatha 

Amaleshwar (Madhya Pradesh) Omkaareshwara 

Ujjain (Madhya Pradesh) Mahaa-Kaala 

# Parli (Mahaarashtra)/Vaidyanath-dham (Bihar) Vaidyanaatha 

Daarukaa-vana (Gujarat) Nageshwara 

Rameswaram (Tamilnadu) Setu-bandheshwara 
(Raamalingeshwara) 

Bhima-Shankar) (Mahaarashtra) Bhima-Shankara 

Kedarnath (Uttarakhand) Kedareshwara 

Nasik (Mahaarashtra) Tryambakeshwara 

Varanasi (Kaashee) (Uttar Pradesh) Vishweshwaraa 

Deva-sarovar (Mahaarashtra) Ghrishneshwara 

# (గమనిక: పర్లీ వైద్యనాథ్-ను జ్యోతిర్లింగంగా కొందరు పరిగణిస్తారు గానీ, జార్ఖండ్-లో ఉన్నదే జ్యోతిర్లింగమని శంకరాచార్యులవారి "ద్వాదశ-లింగ-స్తోత్రం"-లో ఉన్న "పూర్వోత్తరే పారలికాభిధానే.." అనే శ్లోకం కారణంగా అనుకోవలసివస్తోంది! "పూర్వోత్తరం" అంటే ఈశాన్యం కదా! బైద్యనాథ్ ధామ్ మన దేశంలో ఈశాన్యంలో ఉంది, పర్లీ పడమరన ఉంది! 

--((**))--




 ఏనాటి పూజలో .... 

---------------------------- 

అ ఆలతో నప్పుడారంభమాయె 
పద్యాలతో నేఁడు పరుగెత్తుటాయె 

ద్విపద 

ఏరోజుకేమౌనొ యెఱుఁగుదెవ్వారు 
లేరొక్కరీధాత్రిఁ బ్రియముగాఁ దెల్ప 

భారతీ కృపతోడ వ్రాయుదీ దినము 
నేరుగాఁ బలుకాడు నెమ్మితో ముదము 

మారిపోయెను దీరు మంచిగా మహిని 
వేరు భావన లేక విద్యనే కొలువ 

వారిజాక్షిని మించు బంధువెవ్వారు 
పారఁజేయకయున్న పద్యమేనాఁడు 

జ్ఞానమిచ్చెడి తల్లి సత్యస్వరూప 
లోననిల్చిన వెళ్లు లోనికే చూపు 

పారమార్థికమైన భావమే మదిని 
చేరరాదొకటైనఁ జేటుఁ గూర్చెడిది 

రక్షించునాతల్లి రాజీవనయన 
వీక్షించి బిడ్డగాఁ బ్రేమతో నెపుడు 

ధర్మమార్గము వీడు తలఁపు రానీదు 
వర్మమై ననుఁజుట్టి పగలు రాత్రుళ్ళు 

నిశ్చింతయే తాను నిలువ నా జతగఁ 
నాశ్చర్యమిడుగాని యందించు హితము 

ఏనాటి పూజలో యేనాటి తపమొ 
యీనాడు నేనంద నిట్టిదీ కృపను

--((**))-

విద్వాన్ విశ్వం ఆధునికస్వరం


సాహితీమిత్రులారా!

కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు – ఒక సరికొత్త పాటను వినిపించిన కవి విద్వాన్ విశ్వం. పద్యానికి ఆధునికస్వరాన్ని యివ్వడంతో పాటుగా, పాటని కావ్యంగా మలిచిన చాలా కొద్దిమంది కవులలో ఆయనొకరు. పాటనీ పద్యాన్నీ జమిలిగా నేత నేసి, అటు పల్లెపాటలోని అమాయకత్వమూ యిటు మార్గకవిత్వంలోని ప్రౌఢత్వమూ సరిపాళ్ళలో జత చేసి, రాయలసీమ కన్నీటిపాటను పెన్నేటిపాటగా ఆయన మలిచిన తీరు అపూర్వం. మనిషి ఆశపోతుతనానికి నాశనమవుతున్న ప్రకృతిదృశ్యాన్నీ, అస్తవ్యస్తమవుతున్న సాంఘికజీవనాన్నీ, నిర్మలమైన ప్రేమతో పెనవేసుకొన్న ఒక నిరుపేదజంట జీవితనేపథ్యంగా చిత్రించిన కావ్యం పెన్నేటిపాట. ఈ కవే పేర్కొన్నట్టు, యీ పాట మొదలుండునే కాని తుదిలేని బాట.

విశ్వంగారి కవితలో నన్ను బాగా ఆకట్టుకొన్న అంశం అందులోని ధ్వని. సంస్కృత ప్రాకృత సాహిత్యాలలో ఆయనకున్న విశేష పరిజ్ఞానం దీనికి కారణం కావచ్చు. ఎంతటి వాస్తవికవర్ణన చేసినా అందులో ఒకానొక ధ్వని చటుక్కున పాఠకుడి మనసును మెలిపెట్టి ఆ వర్ణించే విషయాన్ని బలంగా హత్తుకునేట్టు చేస్తుంది. పేదల దయనీయస్థితి అయినా, ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరయినా, ఉన్నవాళ్ళ దాష్టీకమయినా, స్వచ్ఛమైన దాంపత్యంలోని అనురాగమైనా – ఆ చిత్రణ ధ్వనిమార్గంలో సాగుతుంది. ఊరిలోనున్న ఒకే ఒక సంపన్న భవనాన్ని వర్ణిస్తూ అది ఊరెల్ల మ్రింగి ఉబ్బినట్లున్నది అంటారు. అది కొందరి దృష్టిలో ఎడారిలోని ఒయాసిస్సు కావచ్చు కానీ పేదలకు వట్టి ఎండమావి. పెన్నేటిపాటలో విశ్వంగారి కవితావిశ్వరూపాన్ని చూడాలంటే ఆ కావ్యాన్నంతటినీ పరిశీలించాలి. ప్రస్తుతానికి, రెండు పూర్తిగా భిన్నమైన అంశాలని ఆయన చిత్రించిన తీరుని మాత్రం పరిచయం చేస్తాను.


ఉ. ఎద్దులబండినెక్కి పయనించుచు నుండగ ధూళి రేగి, ఆ
పొద్దును మూసివేయగనె పో! సురవైరులు లేచివచ్చి, రా
దద్దయు ప్రొద్దుదోచె పిశితాశనులంతట పారిపోవరే!
యెద్దుల తోకలం గలుగు నింతటి మారుతమంత వీచినన్
పూర్వకావ్యాలలో కనిపించే వర్ణనలకి అనుకరణగా అనిపించే యీ పద్యం నిజానికి ఒక పేరడీ! ఈ కావ్యంలోని నిరుపేద జంట రంగన్న – గంగమ్మ. రంగన్న తండ్రి నారపరెడ్డి ఒకప్పుడు ఊరిలో పెద్ద మోతుబరి, పట్టాదారు. అయితే అతని చేతికి ఎముక లేదు! సన్నకారు రైతులకీ, పేదసాదలకీ, ఊరి దేవాలయానికే కాకుండా, తన చుట్టూ చేరే భజనపరులకి కూడా అడిగినది లేదనక దానాలు చేస్తూ, ఉన్న ఆస్తినంతా హారతికర్పూరం చేసేస్తాడు. అలాంటి అపరదానకర్ణుడైన నారపరెడ్డిని కీర్తించే వాళ్ళకి కొదవేముంటుంది! పూర్వం రాజులనూ జమీందారులనూ ధనవంతులనూ కీర్తిస్తూ కవులు చెప్పే పద్యాలను, వాటి సంఖ్యను బట్టి, పంచరత్నాలనో నవరత్నాలనో అనేవారు. బట్ట లచ్చుమయ్య, బండారు బసవయ్య అనే యిద్దరు, నారపరెడ్డిని కీర్తిస్తూ పంచరత్నాలను బట్టీ పట్టి (అంటే అవి వాళ్ళ స్వంతం కావన్నమాట!) అతని ముందు చదువుతారు. అలా చదివిన పంచతర్నాలలో ఇది ఒక పద్యం. పూర్వకాల వర్ణనల్లో ఎక్కువగా కనిపించే ఉత్ప్రేక్ష, అతిశయోక్తి అలంకారాలతో నిండిన చమత్కారభరితమైన పద్యం.

నారపరెడ్డి ఎడ్లబండిని ఎంత వేగంగా తోలగలడో ఈ పద్యంలో కవి ధ్వనింపజేశాడు. నారపరెడ్డి ఎడ్లబండిని తోలుతూ ఉంటే ఉవ్వెత్తుగా దుమ్ము రేగుతోంది. ఆ ధూళి ఎంతగా రేగుతోంది అంటే, అది ఏకంగా సూర్యుడినే (పొద్దు అంటే సూర్యుడు) మూసేసిందట! అలా ఎప్పుడయితే సూర్యుణ్ణి దుమ్ము కమ్మేసిందో, లోకమంతా చీకట్లు కమ్ముకున్నాయి. రాత్రయిపోయిందనుకొని సురవైరులు (అంటే రాక్షసులు – రాక్షసులు నిశాచరులు కదా!) లేచి వచ్చారు. అయితే అంతలోనే ఆ ఎద్దుల తోకలు ఊగే వేగానికి, చిన్నగా వీచే గాలి సైతం ఝంఝామారుతంగా మారి ధూళిమేఘాలను చెల్లాచెదరు చేస్తోంది. సూర్యుడు మళ్ళీ ప్రకాశించగానే ఆ పిశితాశనులు (పిశిత + అశనులు – మాంసభక్షకులు) పారిపోతున్నారు!
చాలా తమాషా అయిన ఊహ కదా! యుద్ధసైన్యాన్ని వర్ణించే సందర్భంలో దాని ఆర్భాటాన్ని చిత్రించేందుకూ, ముఖ్యంగా దౌడు తీసే గుఱ్ఱాల వేగాన్ని స్ఫురింపజేసేందుకూ, అక్కడ రేగే పెంధూళిని చిత్రచిత్రాలుగా వర్ణించడం పూర్వకవి సంప్రదాయం. గోగణాన్ని అపహరించుకుపోయే కౌరవసైన్యాన్ని వర్ణిస్తూ, ఆ సమయంలో రేగిన ధూళిని అభినవ జలధర శ్యామంబు లగునెడ లాకు జొంపంబుల ననుకరింప అంటూ అద్భుతమైన సీసంలో వర్ణిస్తారు తిక్కనగారు. రకరకాలుగా రేగిన ధూళి ఒక పెద్ద ఉద్యానవనం భువినుండి దివికి ఎగురుతున్నట్లుందని ఆ పద్యం వర్ణిస్తుంది. అలాగే పోతన, యుద్ధరంగంలో భీష్ముని పైకి ఉరికి వచ్చే శ్రీకృష్ణుని ముఖం హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై ఉన్నదని వర్ణిస్తారు. అంటే గుఱ్ఱపుడెక్కలకి రేగిన ధూళి కృష్ణుని ముంగురులపై అట్టకట్టిందని! ప్రబంధ కాలానికి వచ్చేసరికి కృతిభర్తల శౌర్యపరాక్రమాలను వర్ణించే క్రమంలో యిలాంటి వర్ణన చేయడం ఆనవాయితీ అయ్యింది. పెద్దనగారు రాయల పరాక్రమాన్ని వర్ణిస్తూ, రాయల సైన్యాల ధాటికి రేగిన ఎఱ్ఱని దుమారాలవల్ల చీకట్లు కమ్మితే, వాటిని చూసి శత్రురాజుల స్త్రీజనం ఎఱ్ఱని చీకట్లేమిటని ఆశ్చర్యపోయారని వర్ణిస్తారు. అలాగే ముక్కు తిమ్మన షష్ఠ్యంతాలలో రాయలను త్వరితాధరితానిలవాజి నటత్ఖురజోరురజోభర గూఢ రవిస్ఫురణా! అని సంబోధిస్తాడు. అంటే – వాయువేగాన్ని మించి పరుగులుపెట్టే గుఱ్ఱపు డెక్కలనుండి రేగి కమ్ముకొనే ధూళిచేత కప్పివేయబడిన సూర్యుడు కలవాడా! అని!

సరిగ్గా ఇలాంటి సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, వాటిల్లో ఉండే అతిశయాన్ని ఒక్కింత వెక్కిరిస్తూ రచించిన మంచి పేరడీ పద్యం ఇది. ప్రబంధాలలో గుఱ్ఱాలిక్కడ ఎడ్లుగా మారాయి. రాజు రెడ్డయ్యాడు. ఈ పద్యంలో ఉన్న వెటకారమంతా ‘ఇంతటి మారుతమంత వీచినన్’ అనడంలో ఉంది. ‘మూసివేయగనె పో!’ అనడంలో ఉంది. పేరడీకి యిలాంటి వ్యంగ్యమే ఆయువుపట్టు. ఇది భాషలోని కాకువు తెలిసిన కవి మాత్రమే చేయగల రచన. చాలా ఉద్వేగభరితంగా సాగే కావ్యంలో తళుక్కున మెరిసే యిలాంటి సున్నితమైన పరిహాసం కావ్యాన్ని మనోహరం చేస్తుంది.
విశ్వంగారి కవిత్వంలో ఇదొక చిన్న పార్శ్వం మాత్రమే! అలతి అలతి పదాలలో గాఢమైన అనుభూతిని ధ్వనింపజేయడం అతని కవిత్వంలో మరొక గొప్ప అంశం. రంగన్న- గంగమ్మల మధ్యనున్న అనురాగాన్ని వర్ణించే యీ పద్యాలు దీనికి చక్కని మచ్చుతునకలు: ఇన్ని యిడుములు నీకోసమే భరించు చుంటినని ఆతడనడు; నీ సుఖము కొఱకె బ్రదుకుచుంటి నటం చామె పలుక దెపుడు; మాటలేటికి మనసులో మరులు పొరల? అతని యడుగుల చప్పుడే ఆమె మొగము నింత విప్పార్చు, మాట రవంత విన్న జాలు కన్నులలో వసంతాలు విరియు,
ఈ పద్యాలకు వ్యాఖ్యానం అవరసం లేదు. పద్యాన్ని యింత సునాయాసంగా పలికించిన కొద్దిమంది ఆధునిక కవులలో విశ్వంగారు ఒకరు. విద్వాన్ విశ్వంగారి సాహిత్యకృషి చాలా విస్తృతమైనది. పత్రికాసంపాదకత్వము, వాటిలో శీర్షికల నిర్వహణ, కావ్య కథా నాటక రచన, సంస్కృత ప్రాకృత కావ్యాల అనువాదము, వైదికసారస్వత అనువాదము – ఇలా బహుముఖీనమైన సాహిత్యసేవ చేశారు. సంస్కృత, ప్రాకృత, ద్రవిడ సాహిత్యాలలోంచి ఆణిముత్యాలని ఎంచి, తెనిగించి, సంకలించిన భారతీయ కవితాకల్పకం తెలుగువాళ్ళకి ఆయన అందించిన అపూర్వ అపురూపకానుక!
చూచెనా యిక నిలువెల్ల చొక్కిపోవు పెన్నేటిపాటలో రంగన్న పాటని వర్ణిస్తూ చెప్పిన యీ పద్యం, విశ్వంగారి కవిత్వానికి కూడా చక్కగా అన్వయిస్తుంది! వాని తియ్యని గొంతుక లోనలోన తీవ సాగుచునున్న దుద్వేగ రవము వాని చిక్కని గుండియ లోనలోన పూవు పూయుచునున్న దుద్బుద్ధ రసము! --------------------------------------------------------- రచన: భైరవభట్ల కామేశ్వరరావు, ఈమాట సౌజన్యంతో
---------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు



Image may contain: one or more people and indoor చలువరాతి మేడ లోన చల్లని చిరు గాలి వీచ, కుందనపు బొమ్మ అంద౦ కురిసె నులె వెన్నెల చంద౦! తీగ మీట రాగము పలుక తేనె లొలుకు వలపే చిలుక తియ తీయని భావాలన్నీ తొలి ప్రేమకు కానుక కాగ! చిరు నవ్వులు మోము పైన చిందు లేసి సిగ్గులు చూప చిగు రించె మనసున ఆశ చిలిపి ఊహ మదిలో మెదల! సుందరాంగి చూపుల బంధం సుతి మెత్తని పూవుల గంధ౦ సొగసు చూప సుందర వదనం వయసు చేరె వలపుల సదనం! శ్రీనివాసమూర్తి గంజాం

No comments:

Post a Comment