Saturday 14 May 2022





 శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం

మార్కండేయ ఉవాచ

నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం

ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ

సహస్ర శీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు

ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతుమే హరిః

ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావతు

దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః

పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు

య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః

సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః

ఇతి మార్కండేయకృత 

వేంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం

--(())-


ఉపదిశతి లోకవృత్తం వితరతి  విత్తం వినోదయతి మహత్వం 

     ఉత్తంభయతి మహత్వం విద్యా హృద్యా సురాజసేవేవ౹౹

         విద్య లోకం తీరు ఏమిటని తెలుపుతుంది.డబ్బు సంపాదనకు సహాయం చేస్తుంది.మనస్సుకు సంతోషాన్ని ,గౌరవాన్ని ఇస్తుంది.పవిత్రమైన విద్య మంచి చక్రవర్తిలా సేవలు చేసి ఇవన్నీ తెచ్చి ఇస్తుంది.

---

*న్యస్తాక్షరి...అ. ధ్య. క్షు. లు

అన్ని వేళలా సుఖముగా ఆటలతొ మ

ధ్యమము మవ్వుటే సహజమే ధ్యానమధ్య

క్షులగ జీవితంలో ననే క్షమ గుణమగు

లుప్త బుధ్ధితో ప్రేమగా లుండ గలుగు

ఆటవెలది


అదియ ఇదియు ఏదియు అనటయేలను మ

ధ్యమము నవ్వు లగుట ధ్యాస మధ్య

క్షులుగ దుఃఖ మయము క్షణముయే సుఖమగు

లుప్త బుద్ధి తోను లుండ గలుగు 

నేటి కవితలు (3)

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ   


మాటలాడవచ్చు మనసు మచ్చ పోదు 

తెలుపవచ్చు దన్ను తెలివి తప్పు కాదు  

సురియ బట్టవచ్చు నిజము సూర్యకాదు   

బ్రతికి బ్రతకవచ్చు ఇపుడు బాధ కాదు 


దానమున నన్నదానము దొడ్డ కాదు 

గుణము లోనుసామగుణము గోప్య మవదు 

ధ్యానములలోను నిష్టతో ధ్యానమవదు   

స్వార్ధ చింతన వీడిన సౌమ్య మవదు 


బలిమిగలవానితో ప్రేమ బాధ కాదు 

చేత కాని వాడనిపించు చింత కాదు 

మదనుడైయాశ పెట్టిన మత్తు కాదు    

కాల మాయకు మృత్యువు కధలు కాదు 


చేష్ట లుడికినా మనిషిలో ఆశ కలదు 

లేని దంటూ ఏదియు ఇందు లేనె లేదు   

ఉన్నదంతయు ఉడుకుయె ఊపు కాదు  

ఉట్టి నెక్కక తప్పునే ఉతమవదు 

---

నేటి కవిత 


వానవోలెఁ   

మౌనమ్ము లేకుండ వుంటివే 

వైనమ్ము తెల్పక అంటివే  

గానంగ రాకుండ నుంటివే  

నేనిందు బీడుగా నుంటిరా


మానసమ్ము 

ప్రాణమ్ము లేకుండు పులుఁగురా 

స్వానమ్ము లేకుండు నెలుఁగురా

ధ్యానమ్ము చేయించి నిలువురా 

మౌనమ్ము చూపక బ్రతుకురా     


నీనగవుల 

నానంద లోకాలఁ జూతురా 

గానాబ్ధి రత్నాలఁ దీతురా 

లోనంత చూడాలి నువ్వురా 

కాలంతొ రావాలి  నవ్వురా 


తేనె లేని 

తేనెతెట్టగద యీదేహమ్ము 

దోనె యుండని తెడ్డు జీవమ్ము

దానమిచ్చియు పొందు దేహమ్ము 

మాన మెట్టియు తప్పు దాహమ్ము  


దారి పదులు

దూరమ్ము తెలియదా గమ్యమ్ము 

చేరంగఁ నడచుటే రమ్యమ్ము 

వైరమ్ము తెలియుటే ధర్మమ్ము 

బేరమ్ము బ్రతికించు నిత్యమ్ము 


తీర మెదియొ 

నీరానఁ బయనమ్ము కష్టమ్ము

దూరాన దృశ్యమ్ము లిష్టమ్ము

మారాము చేయుట నష్టమ్ము 

కారాలు నూరుట స్వార్ధమ్ము 


గారమలర 

నీరేయి నాతోడ నెవ్వరో 

యీరేయి నాతోడ నెవ్వరో

నీరాక ఈ రేయి నవ్వురో 

నా రాక నీకేమి ఏడ్పురో 


చెందస్సు 

సూ/సూ // ఇం/ఇం/ఇం // ఇం/ఇం/ఇం (ప్రాస మాత్రమే)

---(((())))---


ఉత్పలమాల 

అందరి  మధ్యనా  బ్రతుకు అర్ధము సంతస భాగ్యదాయకమ్

మంధర బుధ్ధి గా తలుపు మాధ్యమ ఆటలు వేటలవ్వుటన్

తొందర ఆశయమ్మయిన తోడ్పడు వారును వేరుగుండుటన్

అందరి బంధమే కలిసి ఆశలు తీర్చుయు ఆత్మతృప్తిగన్

....

కమ్మని వ్రాత గా ఇదియు కమ్మిన సంతస సాహిత్య మున్

అమ్మకు పద్యసంపదయు ఆశ్రిత మవ్వుట ఆత్మతృప్తగన్

నమ్మిన బంటు గా తెలిపె నచ్చిన పద్యము సంతసమ్ముగన్

సొమ్ములు కోరికాదునులె స్తోమత శక్తి గ ముద్రవేయుటన్

......

నవ్వకు తన్మయమ్ముగను నాట్యము చేసిన తప్పు లెంచకున్

సవ్వడి ఏది యైనను ప్రశాంతిని పొందుట దేహలక్ష్యమున్

నవ్విన నాపచేనుకళ నిండుగ ఉండిన రోగ దేహమగున్

నవ్వుతు దేహమంచినను నమ్మక మేనులె జీవితమ్ముగన్

శార్దూలము

రోజూవారి కళే  మనోహరముగా రమ్యత్వ ముంచేను లే

రోజా లై ఫలితాలు గాను శుభమై రంజిల్లె సౌభాగ్య మున్

రాజ్యాలే కదిలే సుఖాల మడిలో రోషమ్ము దాహమ్ముగన్

వాజ్యాలై బ్రతుకే భయాన్ని తెలిపే వాదాల జీవమ్ముగన్

* అమృతస్య పుత్రాః శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు - 6

“భక్తిలాభ కొరతే హోలె నిర్జన్ హోవాచాఇ నిర్జనే ఈశ్వరచింతా కొరలె భక్తిలాభ హోయ్. “

భగవద్ధక్తిని పొందడానికి నిర్జనవాసం చేయాలి. ఏకాంతంలో భగవంతుణ్ణి ధ్యానిస్తే మనస్సులో భక్తి జనిస్తుంది.

శ్రీరామకృష్ణ ఉవాచ:-

 వెన్న పొందాలంటే పాలను ఏకాంత ప్రదేశంలో తోడెయ్యాలి. పాత్రను కదిపినా, పాలను కెలికినా పాలు తోడుకోవు. పెరుగు సిద్దమైన పిదప చిలకాలి. అప్పుడే వెన్నపైకి తేలుతుంది.

సంసారం నీరు, మనస్సు పాల వంటివి. నీటిలో పాలు కలిపితే, రెండూ కలసిపోయి, ఏది నీరో, ఏవి పాలో తెలియదు. పాలను తోడువేసి, పెరుగు చిలికితే వెన్నపైకి తేలుతుంది. 

ఆ విధంగానే, నిర్జన ప్రదేశంలో సాధనల ద్వారా జ్ఞానం, భక్తి అనే వెన్న ఏర్పడుతుంది. ఆ వెన్నను సంసారమనే నీటిలో వేసినా అది తేలుతునే ఉంటుంది.

అడపాదడపా కుటుంబం నుండి దూరంగా వెళ్ళి, నిర్జన ప్రదేశంలో భగవచ్చింతన చేస్తే భక్తి జనించును. ఎంతకాలం దూరంగా ఉండాలి అని అడుగుతారా? 

ఒక్కదిన మైనా మంచిదే, మూడు దినాలైతే మరీ మంచిది, వారం, ఒక నెల, మూణెల్లు, ఒక సంవత్సరం - ఎవరి వీలును బట్టి వారు.

వ్యాఖ్య:-

 భక్తిని పొందడానికి ముఖ్య ఉపాయం, నిర్జనవాసం. ఏకాంతంలో కొన్ని నిమిషాలు గడపినా చాలు, మన మనస్సు అట్టడుగున ఉన్న భావాలు పైకి వస్తాయి. ఫలితంగా, జీవితంలో చేసిన తప్పులు, పొరపాట్లు గుర్తుకు వస్తాయి, వాటిని సరిదిద్దుకొనే అవకాశం దొరకుతుంది. 

ఏకాంతంలోనే భగవంతునికి ఆత్మసమర్పణం చేసికొని, భగవచ్చింతన చేయగలం. ఈ విధంగా ఆయన పట్ల అనురాగం జనిస్తుంది. ఆయన అపార కరుణ పదేపదే గుర్తుకు వస్తుంది. జీవితంలో ఎన్ని తప్పులు, ఎంత అనౌచిత్యం చేశామో కదా. కానీ, భగవంతుడు వాటిని క్షమించి, తన చేయి అందించి తన వైపు లాగుకొన్నది గుర్తుకు వస్తుంది. 

ఈ ఆలోచన కలుగగానే భక్తి జనిస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించాలనే కాంక్ష కలుగుతుంది. ప్రాపంచిక వస్తువులతో కలిగే సుఖం క్షణికమనీ, భగవద్దర్శనంతో కలిగే ఆనందం చిరస్థాయి అనీ తెలిసివస్తుంది. 

"ప్రథమే స్త్రీర్ జేమన్ స్వామితే నిషా, శేషరూప్ నిషా జది ఈశ్వరేతే హోయ్ తబెఇ భక్తి హోయ్".

భార్య మొదట్లో తన భర్త పట్ల ఎటువంటి శ్రద్ద చూపుతుందో, అదే విధమైన నిష్ఠ భగవంతుని పట్ల కలిగితే, అప్పుడే భక్తి కలుగును. 

వ్యాఖ్య:-

 పనిలో ఎన్ని ఆటంకాలు, కష్టాలు వచ్చినా, వాటిని లెక్క చేయక నిర్దిష్ట సమయంలో దానిని పూర్తి చేయడమే నిష్ఠ అదే విధంగా, ఏదైనా వస్తువు లేదా వ్యక్తి పట్ల కలిగే ఆకర్షణ కూడా నిష్ఠనే శ్రీరామకృష్ణులు ఒక చక్కని ఉదాహరణతో దీనిని వివరించారు.

నూతన వధువు తన ప్రేమను పూర్తిగా తన భర్త పట్ల చూపుతుంది. ఆయనపైన పూర్తి నమ్మకం ఉంచుతుంది. ఆయన పట్ల ఏ సేవాతత్పరత, ఆకర్షణ కలిగి ఉంటుందో, అది ఎంతో గాఢమైనది. ఆయన ఆమెకు అత్యంత ప్రీతి పాత్రుడు, సాక్షాత్తు దైవంగా భావిస్తుంది. పూర్తిగా ఆత్మ సమర్పణం చేసికొని, నిశ్చింతగా ఉంటుంది. 

ఆయన అవసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఏది కావాలో అది వెంటనే అందించి, ఆయనను ఎల్లప్పుడు సంతుష్టి పరచాలని కోరుకుంటుంది. ఆయన భోజనం చేయనిదే ఆమె తినదు, ఆయన నిద్రించని పూర్వం ఆమె నిద్రకు ఉపక్రమించదు. ఈ విధంగా తన సుఖాన్ని లెక్క చేయక, భర్తకు సకాలంలో అన్ని సేవలు చేస్తుంది. దీనినే నిష్ఠ అంటారు.

సాధకునికి భగవంతుని పట్ల ఈ విధమైన ఆత్మీయత, సేవాతత్పరత ఉంటే, దానినే భక్తి అంటారు. 'భగవద్విషయాలు తప్పించి మరే మాటలూ వినడానికి ఇచ్చగించరు. ఆయన సేవే చేయ తలుస్తారు' అని శ్రీరామకృష్ణ నిష్ఠను గురించి చెప్పారు.

***

***

102-ఉపనిషత్ సూక్తి 

102. విషం బ్రహ్మాతిరిక్తంస్యాదమృతం బ్రహ్మ మాత్రకం||

(గరుడోపనిషత్)

- బ్రహ్మము కంటే వేరుగా నున్నది విషము. బ్రహ్మము అమృత స్వరూపము.

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 15.

భగవంతుడి మీద విశ్వాసం కన్నా ముందు నీ మీద నీకు విశ్వాసాన్ని కలిగి ఉండు. కానీ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది రోజురోజుకీ మన మీద మనమే విశ్వాసాన్ని కోల్పోతున్నాం.

మకృష్ణ బోధామృతము 

మాయ

రాజహంస మీరు కలసి ఉన్న పాల నుండి నీటిని వేరు చేసి పాలను మాత్రమే గ్రహిస్తుంది. ఇతర పక్షులు ఇలా చేయలేవు. భగవంతుడు మాయతో  సమ్మిశ్రిత్రుడైనాడు. సామాన్యులు మాయను వేరుపరచి భగవంతుణ్ణి  చూడలేరు. పరమ హంసలు మాత్రం మాయను విసర్జించి శుద్ధ బ్రహ్మాన్ని గ్రహించగలుగుతారు.

విచక్షణ 

సాధారణంగా పరిచిత పరిస్థితుల్లో మీ మంచి అలవాట్లు సహాయపడతాయి, కాని కొత్త సమస్య ఎదురైనప్పుడు అవి పరిష్కారాన్ని సూచించలేకపోవచ్చు. అప్పుడు విచక్షణ అవసరమవుతుంది.

     మానవుడు మరమనిషి కాడు. అందుచేత నిర్ణీత నియమాలు, కఠిన నైతిక సిధ్ధాంతాలు మాత్రమే పాటించటం వల్ల వివేకవంతమైన జీవితం ఎల్లప్పుడూ గడపలేకపోవచ్చు. వివిధ దైనందిన సమస్యలు, సంఘటనలు ఎదురుకోవడంలో మన విచక్షణ అభివృధ్ధి చేసుకునే అవకాశం ఉంది. 

శ్రీ పరమహంస యోగానంద / Sayings Of Paramahamsa Yogananda

ॐ卐సుభాషితమ్ॐ

గురు అష్టకము/అర్థ తాత్పర్య సహితం

ॐॐॐॐॐॐॐॐॐ

6) యశో  మే గతం దిక్షు దానప్రతాపాత్ | జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |

మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||

అర్ధము:-  మహాదానగుణ సంపన్నుడవన్న కీర్తి దశదిశలా వ్యాపించినప్పటికీ, ఈ ప్రపంచం మొత్తం నీ పక్షాన వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై నిలపలేని మనస్సు వుంటే వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

ప్రపంచమంతా మూడు గుణములతో నిండివుంటుంది. అవి సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ త్రిగుణముల మాయచే ఆవరింపబడిన జీవుడు, గుణాలకు అతీతుడైన పరమాత్మ స్వరూపమును గ్రహించలేకున్నాడు.

వీటి ప్రభావము చేత జీవుడు, అశాశ్వతమైన తన శరీరమునే తానుగా భావించి క్షణికమైన దృశ్యవస్తువుల వెంట పరిగెట్టి వాటిని పరమప్రీతితో అనుభవిస్తున్నాడు. మంచి మనస్సు, దయా మఱియు దానగుణం పుష్కలంగా వున్నప్పటికీ ఈ మాయనుండి బయటపడలేక పోతున్నాడు. అహంకారంతో వున్న పరమాత్మను లేడని వాదించి, లేని జగత్తును వున్నదిగా భావిస్తూ కాలప్రవాహములో కొట్టుకొని పోవుచు జననమరణములను పొందుతున్నాడు.

అనేక జన్మల సాధనాఫలితంగా, ఎదో ఒక జన్మలో జ్ఞానము ఉదయిస్తుంది. అప్పుడు జీవుడు ఈ జగత్తంతయూ బ్రహ్మమే (సర్వం ఖల్విదం బ్రహ్మ), జీవుడు కూడా బ్రహ్మమే (జీవో బ్రహ్యైవ నాపరః) అనే పరమసత్యాన్ని గ్రహిస్తాడు. అదే జీవుని ఆఖరి జన్మ అవుతుంది. ఈ స్థితిని సాధించిన మహాత్ములు చాల అరుదు.

ఇట్టి మహత్తరమైన శక్తిని పొందియుండి కూడా జీవుడు, మాయలోపడి, సత్యమును మఱచి, రాగద్వేషములకు వశుడై, మోహలాలసుడై, సుఖదుఃఖములను అనుభవిస్తూ, కలుషిత మనస్కుడై, సంసారచట్రములో ఇరుక్కుపోతున్నాడు.

ఈ మాయనుండి బయటపడే మార్గాన్ని “గురువు” మాత్రమే చూపగలడు! అతడు మాత్రమే జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!

అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!

***

62-కర్మ - జన్మ

 7 వ ఆధ్యాయం - "కర్మ క్షయం"

 కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 4

4. పశ్చాత్తాపం: 

 మనం పాపం అని భావించకుండా చేసిన దానిని ఇప్పుడు పాపంగా గుర్తించి, దాన్ని మరెన్నడూ చేయకపోవడం పశ్చాత్తాపం, సరయిన పశ్చాత్తాపంతో గతంలో చేసిన దుష్కర్మలన్నీ క్షయం అవుతాయి.

మనసు పొరల్లోంచి దానంతట అదే ఉద్భవించి, గుండెలో స్పందన కలిగి తిరిగి ఆ తప్పు చేయకపోవడమే నిజమైన పశ్చాత్తాపం.

 జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా ఆ తప్పు తిరిగి చేస్తే పశ్చాత్తాపం వల్ల రద్దయిన ఆ దుష్కర్మల ఫలితాలు మనకి బంధాలుగానే మిగిలిపోతాయి. పశ్చాత్తాపం గురించి మనుస్మృతిలో ఇలా చెప్పారు. 

అజ్ఞానాత్ యదివ్యామోహాత్ కృత్వా కర్మ విగర్హితం

తస్మాద్విముక్తి మన్విచ్చన్ ద్వితీయం న సమాచరేత్

భావం:- 

 తెలియక, మోహం వల్ల ఒకసారి చేసిన పాపం యొక్క ఫలం నించి విముక్తులం కావాలనుకుంటే, మరల ఆ పాప కృత్యాన్ని చేయకుండా ఉండాలి.

 భార్యాభర్తల మధ్య పోట్లాటలు సర్వసాధారణం. 'అయ్యో! అనవసరంగా తిట్టానే' అని తర్వాత పశ్చాత్తాప పడ్డా, తిరిగి పోట్లాటలు మామూలే.

దాంతో ఆ పశ్చాత్తాపం రద్దయిపోతుంది. అది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు. అందుకు సరయిన చోట, సరైన పాళ్ళలో మనసులో దెబ్బ తగలాలి. రక్తపుటేరులు చూస్తే కాని అశోకుడికి అలాంటి పశ్చాత్తాపం రాలేదు.

 ఉత్తర భారత దేశంలో ఇది నిజంగా జరిగింది. ఓ గజదొంగ అనేక దోపిడీలు, హత్యలు చేస్తూ పోలీసులకి, తన గ్రామస్థులకి దొరక్కుండా జీవనం సాగించేవాడు.

 కరడు కట్టిన స్వార్థానికి ప్రతిరూపమైన అతను ఓసారి తనని తరిమే పోలీసుల నుంచి దాక్కోడానికి గుళ్ళోకి వెళ్ళి, ఓ పండితుడు చెప్పే పురాణ కాలక్షేపం విన్నాడు.

 'ఇతరులని హింసించడం పాపం' అన్న హితోపదేశం అతని మనసులోకి ఇంకింది. అంతా వెళ్ళాక ఆ పండితుడికి తన వృత్తాంతం మొత్తం చెప్పి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.

 ఆయన సానుభూతితో అర్థం చేసుకుని మరెన్నడూ ఆ దుష్కృత్యాలు చేయవద్దని, నీటి ఎద్దడి బాగా ఉన్న అతని గ్రామంలో చెట్లు నాటి వాటిని పెంచమని సలహా ఇచ్చాడు. అతను. చెట్లు నాటి దూరంగా ఉన్న నది నుంచి నీరు తెచ్చి వాటిని పెంచి పెద్ద చేశాడు.

 ఫలితంగా ఆ గ్రామంలో వానలు కురిసి సుభిక్షం అయింది. తనని కోరలు తీసిన పాముగా గుర్తించాక గ్రామస్థులు ఏం చేసినా అహం చంపుకుని సహించి, ప్రపంచం నుంచి ప్రతిఫలాపేక్ష లేని సేవ చేస్తూ తిరిగి ఆ పాపాలు చేయని ఆ గజదొంగకి ఆ దుష్కర్మల బంధాలంటవు.

***

356) యోగవాసిష్ఠ రత్నాకరము* 

2-20

పరిస్ఫురతి యస్యాన్తర్నిత్యం సత్త్వచమత్కృతిః బ్రహ్మమణ్డమివాఖణ్డం లోకేశాః పాలయన్తి తమ్‌.  

ఎవరి హృదయమున ఆత్మజ్ఞానము నిత్యము ప్రకాశించుచుండునో, అతనిని లోకపాలురగు దేవతలందఱున్ను తమ కాధారభూతమగు విశాల బ్రహ్మాండమునువలె రక్షిచుచుందురు. 

2-21

అప్యాపది దురన్తాయాం నైవ గన్తవ్యమక్రమే రాహురప్యక్రమేణైవం పిబన్నప్యమృతం మృతః. 

కావున, మహాఘ‌ోర ఆపత్తునందునుగూడ అసన్మార్గమున పోరాదు. అసన్మార్గమున జనుటచే రాహువు అమృతపానము చేయుచున్నప్పటికిని మరణమునకు బాల్పడెను గదా! 

2-22

సచ్ఛాస్త్రసాధుసంపర్కం అర్కముగ్రప్రకాశదమ్‌ 

యే శ్రయన్తే న తే యాన్తి మోహాన్ధ్యస్య పునర్వశమ్‌. 

సూర్యునివలె మహా (జ్ఞాన) ప్రకాశమును గలుగజేయునట్టి సచ్చాస్త్ర, సాధుజన సాంగత్యముల నెవరాశ్రయించుదురో అట్టివారు మరల ఆజ్ఞానాంధకారమునకు ఎన్నడును వశులు కానేరరు. 

2-23

యేషాం గణేష్వసంతోషో రాగో యేషాం శ్రుతం ప్రతి సత్యవ్యసనినో యే చ 

తే నరాః పశవో౽పరే. 

ఎవరికి వైరాగ్య శమదమాది గుణములందు “ఇంతమాత్రము చాలును” అను బుద్ధి లేకుండునో, ఎవరికి అధ్యాత్మశాస్త్రముల ద్వారా, గురువుల ద్వారా విన్న దానియందు ప్రీతి, శ్రద్ధ యుండునో, ఎవరు సత్యమగు ఆత్మయెడల అత్యాసక్తి గలిగియుందురో, వారే మనుష్యులనఁదగినవారు; తక్కినవారు పశువులవంటివారు.

___

జిహ్వయా యగ్రే  మధు: మే జిహ్వా మూలే మధూలకం

మ మేద  హక్రతావసో మమ చిత్త ముపాయసి

అర్థము:-- నాలుక పై భాగం లో తేనె వుండాలి.మనం మాట్లాడే మాటలు అవతలి వారికి మధురంగా వినిపించాలి.నాలుక చివర ఆ తేనేలూరుతూ వుండాలి.మాధుర్యం నాలుక మీదే గాక మనసులో,చేతల లో కదలికల  లో కూడావుండాలి.ఆలోచనలు మోసపూరితంగా వుండ కూడదు.అని కవి చెప్పుచున్నాడు.

 

అమృతం చైవ  మృత్యుశ్చ  ద్వయం దేహే ప్రతిష్ఠితం 

మృత్యు రాపద్యతే మోహాత్  సత్యే నాపద్యతే మృతం 


తా:-- అమృతము, మృత్యువు; ఈరెండూ దేహమునందే వుంచబడి వున్నాయి. మోహము లేక కోరిక వలన మృత్యువును, సత్యదర్శనము వలన అమృతత్వమును 

మానవులు పొందగలరు.


భక్తానా మనురక్తానాం ఆశ్రితానం చ రక్షితా

దయావాన్ సర్వభూతేషు పరత్ర సుఖ మేధతే 

తా:-- భక్తులను, అనురక్తులను, ఆశ్రితులను రక్షించువాడు, సర్వభూతములందు దయగలవాడు పరలోకసుఖములను తప్పక పొందుచున్నాడు.

__

భాస్కర శతకము నుండి 
అదను దలంచి కూర్చిప్రజ నాదర మొప్పవిభుండు కోరినన్
గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టితెండనన్
మొదటికి మోసమౌబొదుగు మూలము గోసిన బాలు గల్గునే
పిదికినఁగాక భూమిఁబశు బృందము నెవ్వరికైన భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! పాలకొరకు  పశువుల పొదుగు మూలమున పిదికినచో పాలు లభించును. పొదుగును కోసినచో పశు ప్రాణమునకే ముప్పు వచ్చును. అట్లే రాజు అవసరార్థము కనిపెట్టి ప్రజలను ఆహ్వానించి వినయముతో ధనమడిగిన వెంటనే తెచ్చి నిత్తురు. వానిని భయకంపితులను చేసి ధనమడిగినచో ముప్పు వచ్చును. రాజు పల్కిన ప్రల్లదనములను సహించక తిరుగుబాటు చేయుదురు ప్రజలు.


*పావకుండర్చుల, భానుండు దీప్తుల; నెబ్భంగి నిగిడింతు, రెట్ల డంతు రాక్రియ నాత్మకరావళిచేత బ్ర; హ్మాదుల, వేల్పుల, నఖిలజంతుగణముల, జగముల, ఘన నామ రూప భే;
దములతో మెఱయించి తగ నడంచు, నెవ్వఁడు మనము బుద్ధీంద్రియంబులుఁ దాన; యై,గుణ సంప్రవాహంబు నెఱపు,స్త్రీనపుంసక పురుష మూర్తియునుఁ గాక,తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక,కర్మ గుణ భేద సదసత్ప్రకాశిఁ గాక,వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.

భావము:- అగ్ని మంటలను, సూర్యుడు వెలుగుని ప్రసరింజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మదేవుడు మొదలైన దేవత లను, సకల జీవరాసులను, సమస్త లోకాలను నానా విధాలైన నామ రూప భేదాలతో సృష్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయ్యి గుణాలను ప్రవర్తింప జేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరులు మొదలగు వారిలో వేటి ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణ భేదాలకి సత్తు అసత్తులకి అతీతుడు. అంతే కాకుండా అవన్ని కూడ తానే అయ్యి ఉంటాడు. అటువంటి ఆ ప్రభువును నేను స్మరిస్తాను.

*వరథర్మకామార్థ వర్జితకాములై; విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి క;వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు? ;
రానందవార్ధి మగ్నాంతరంగు లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక;భద్రచరిత్రంబుఁ బాడుచుందు? రామహేశు, నాద్యు, నవ్యక్తు, నధ్యాత్మ యోగగమ్యుఁ, బూర్ణు,నున్నతాత్ము,బ్రహ్మమయిన వానిఁ, బరుని, నతీంద్రియు,నీశు, స్థూలు, సూక్ష్ము నేభజింతు.

.భావము:- ఇంతేకాకుండా, దేవదేవుడు ధర్మం కామం ధనం అన్నిటి మీద ఆశలు విడిచేసిన పండితుల పూజ లందుకొని వారు కోరుకొన్న ఉత్తమ వరాలు ప్రసాదిస్తాడు. భక్తితో దరిజేరి కోరిన వారికి దయతో నాశనంలేని శరీరాన్ని ఇస్తాడు. ఆనంద సాగరంలో మునిగిన మనస్సులు కల ఏకాంతిక ముక్తులు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధిస్తారు. వారు దేవదేవుని పవిత్ర మైన చరిత్రను కోరికలేమి లేకుండ కీర్తిస్తుంటారు. ఆ మహా దేవుడు సృష్టికన్న ఆద్యుడు. ఇంద్రియ ఙ్ఞానానికి అందనివాడు, అధ్యాత్మ యోగం వలన చేరదగినవాడు. పరిపూర్ణుడు. మహాత్ముడు. బ్రహ్మస్వరూపుడు. సర్వానికి పరమైనవాడు. ఇంద్రియములకు అతీతమైనవాడు. స్థూలస్వరూపుడు, సూక్ష్మ రూపుడు. అట్టువంటి ఆ పరాత్పరుని నేను సేవిస్తాను.
---
*శార్దూల విక్రీడితము

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;

నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;

రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

తాత్పర్యము

"దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!"

అని గజేంద్రుడు ఎలుగెత్తి ఆర్తితో ప్రార్థింపగా, ఆ ప్రార్థన  వైకుంఠంలో లక్ష్మీదేవితో వినోదించు శ్రీమన్నారాయణుని చెవులకు వినబడింది. వెంటనే ఆ భగవంతుడు, గజేంద్రుని రక్షించడానికి ఎలా బయలుదేరాడో పోతనగారు ఎలాచెప్పారో చూద్దాం.

మత్తేభ విక్రీడితము

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే

పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం

తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో

పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

తాత్పర్యం

గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

---


మహారాజా! ఈ తొమ్మిది ద్వారములలో ఐదు తూర్పుదిశయందును, ఒకటి దక్షిణమునను, ఒకటి ఉత్తరమునను,రెండు పశ్చిమదిక్కునను గలవు. వాటి పేర్లను తెలిపెదను వినుము.

పూర్వదిశయందు ఖద్యోత, ఆవిర్ముఖి అను రెండు ద్వారములును ఒకేచోట నిర్మితములైనవి. పురంజనుడు వాటిద్వారా తన మిత్రుడైన ద్యుమంతునితోగూడి విభ్రాజితమను ప్రదేశమునకు వెళ్ళుచుండెను.

ఇదే ప్రకారము ఆ ప్రాగ్దిశయందే నళినీ, నాళినీ అనురెండు ద్వారములు ఒకేచోట నిర్మింపబడినవి. వాటి ద్వారా అతడు అవధూత యను సఖునితో సౌరభదేశమునకు వెళ్ళుచుండును.

ఆ తూర్పుదిక్కుననే ముఖ్య అను ఐదవ ద్వారము గలదు. దానిద్వారా అతడు రసజ్ఞుడు, విపణుడు అను మిత్రులతో గూడి క్రమముగా బహూదన, ఆపణ అను దేశములకు వెళ్ళుచుండును.

మహారాజా! ఆ ఫురమునకు దక్షిణదిక్కునందు పితృహువు అను ద్వారము గలదు. పురంజనుడు తన మిత్రుడైన శ్రుతధరునితో గూడి ఆ ద్వారముగుండా దక్షిణ పాంచాల దేశమునకు వెళ్ళుచుండెను. అట్లే అతడు ఉత్తరదిశయందుగల దేవహూవు అను ద్వారముగుండా శ్రుతధరునితోడనేగూడి ఉత్తరపాంచాల దేశమునకు వెళ్ళుచుండును.

పశ్చిమదిశయందు ఆసురి అను ద్వారముగలదు. పురంజనుడు దానిద్వారా దుర్మదుడు అను వానితోగూడి గ్రామక అను దేశమునకు వెళ్ళుచుండును.

అట్లే పశ్చిమదిశయందే నిరృతి అను ద్వారము గలదు. పురంజనుడు లుబ్ధకుడు అనువానితోగూడి వైశన అను దేశమునకు వెళ్ళుచుండును.

ఈ నగరముసందు నివసించువారిలో నిర్వాక్, పేశస్ కృత్ అను ఇద్దరు గలరు. వారు అంధులు. పురంజనమహారాజు నేత్రములు గలవారికి అధిపతియేయైనను ఈ అంధుల సహాయముతోనే ఎచటికైనను వెళ్ళుచుండును, ఏ పనినైనను చేయుచుండును.

పురంజనుడు తన ప్రధానసేవకుడైన విషూచీనునితోగూడి అంతఃపురమున ప్రవేశించినప్పుడు భార్యాపుత్రుల కారణముగా కలుగు మోహమును, మానసోల్లాసము, హర్షము మొదలగు వికారములను అనుభవించుచుండును.

ఇట్లు అతని చిత్తము ఆయా సమయములయందు వేర్వేరు కర్మలయందు ఆసక్తమై యుండును. కామపరవశుడై ఆ మూఢుడు స్త్రీ వ్యామోహములో వంచింపబడెను. అతడు తన భార్య కోరికలను అనుసరించి నడచుకొనుచుండెను.

క్రమముగా అతడు ఆమెకు దాసుడే అయ్యెను. ఆమె మద్యపానమొనర్చినప్పుడు అతడును మద్యపానము చేసి ఉన్మత్తుడగును. ఆమె భుజించునప్పుడు తానును భుజించును. ఆమె ఏదైనను ఒక వస్తువును భక్షించునప్పుడు తానును ఆ వస్తువునే భక్షించును.

ఆమె పాటను పాడినప్పుడు తానును పాడును. ఏడ్చునప్పుడు ఏడ్చును. నవ్వినప్పుడు నవ్వును. మాట్లాడునప్పుడు మాట్లాడును.

ఆమె పరుగెత్తునప్పుడు తానును పరుగెత్తును. నిలబడినప్పుడు నిలబడును. ఆమె పరుండినప్పుడు తానును పరుండును. కూర్చొనినప్పుడు కూర్చుండును.

ఆమె దేనినైనను వినుచున్నప్పుడు తానును వినును. ఆమె చూచుచున్న దానినే తానును చూచును. ఆమె ఆఘ్రాణించిన వస్తువును తానును ఆఘ్రాణించును. ఆమె స్పృశించు వస్తువును తానును స్పృశించును.

ఆమె దైన్యముతో దుఃఖించుచున్నప్పుడు తానును దైన్యమును వహించును. ఆమె ప్రసన్నురాలై యున్నప్పుడు తానును ప్రసన్నుడైయుండును. ఆమె సంతోషముగా ఉన్నప్పుడు, తానును సంతోషముగా ఉండును.

ఈ విధముగా పురంజనుడు సౌందర్యవతియైన తన భార్యకు వశుడాయెను. ప్రాకృతిక విషయములకు అతడు పూర్తిగా లోనయ్యెను. తనకు ఇష్టము లేకున్నను (తన ఇష్టానిష్టములను ప్రక్కనబెట్టి) ఆటబొమ్మవలె ఆమెను అనుసరింపసాగెను. ఇంతయేల, పూర్తిగా అతడు ఆమె చేతిలో కీలుబొమ్మ యయ్యెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే పంచవింశోఽధ్యాయః (25)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు ఇరువది అయిదవ అధ్యాయము (25)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


నారదుడు వచించెను- రాజా! ఒకనాడు ఆ పురంజనుడు ఒక మహాధనుస్సును, బంగారుకవచమును, అక్షయతూణీరములను ధరించి రథమును అధిరోహించి, పదకొండుగురు సేనానాయకులు వెంటరాగా పంచప్రస్థము అను వనమునకు వెళ్ళెను. ఆ రథమునకు వేగముగా వెళ్ళగల ఐదు గుర్రములు పూన్చబడియుండెను. ఆ రథమునకు రెండు ఈషాదండములు, రెండుచక్రములు, ఒక ఇరుసు, మూడు ధ్వజదండములు, ఐదు పగ్గములు, ఒక కళ్ళెము కలవు. ఒక సారథి గలడు. రథికుడు కూర్చుండుటకు ఒక ఆసనము గలదు. రెండు కూబరములు, ఐదు ఆయుధములు, ఏడు ఆవరణములు గలవు. అతడు ఐదు  విధములగు గమనములతో వెళ్ళుచుండెను. అతడు బంగారు ఆభరణములు ధరించియుండెను.

పురంజనమహారాజు ఒక్కక్షణము గూడ తన ప్రియపత్నిని విడిచిపెట్టి వెళ్ళలేకుండెను. ఐనను, ఆ దినము  అతనికి వేటయందు ఎక్కువ మక్కువ యుండుటవలన ఆమెను పట్టించుకొనకయే వేటకు వెళ్ళెను. ధనుర్బాణములను చేబూని దర్పముతో వేటాడసాగెను.

ఆ సమయమున అసురీప్రవృత్తి (తామసిక స్వభావము) మిక్కుటముగా ఉండుటచే అతని చిత్తము కఠోరముగా నుండెను. అందువలన అతడు దయాశూన్యుడై, కనబడిన జంతువులను అన్నింటిని విచక్షణా రహితముగా చంపివేసెను.

మాంసభక్షణమునందు ఎంతగా ఆసక్తియున్నను రాజు కేవలము శాస్త్రవిహితములైన యజ్ఞయాగాది కర్మలకొరకు అవసరము ఉన్నంతవరకు మాత్రమే వనమునందు శాస్త్రనిషద్ధములుగాని పశువులను మాత్రమే వేటాడవలెను. వ్యర్థముగా పశుహింసకు పాల్పడరాదు ఈ విధముగా హింసావృత్తిని నియంత్రించుటయే శాస్త్రముల ప్రధాన ఉద్దేశ్యముగా నున్నది. అంతేగాక, జన్మ - జన్మాంతరములనుండి జీవునకు యేర్పడియున్న తామసికవృత్తిని శాస్త్రములు తమ నియమములద్వారా నియంత్రించుచున్నవి.

రాజా! విద్వాంసుడు శాస్త్రవిహిత కర్మలను ఈ విధముగా ఆచరించును. ఆ కర్మానుష్ఠాన ప్రభావమున అతనికి జ్ఞానము ప్రాప్తించును. అట్టి జ్ఞానమువలన అతడు ఆచరించే కర్మలు బంధహేతువులు గాకుండును.

శాస్త్రవిహిత కర్మలను ఆచరింపక ఇష్టము వచ్చినట్లు నడచుకొనువాడు దురభిమానమునకు లోనై కర్మబద్ధుడగును. అతడు గుణప్రవాహరూప సంసారచక్రములో చిక్కుకొని వివేకమునకు కోల్పోవును. ఫలితముగా అతడు నీచయోనులలో జన్మించును.

పురంజనునియొక్క చిత్రవిచిత్రములైన రెక్కలుగల వాడియైన బాణములధాటికి పలువిధములగు ప్రాణుల శరీరములు మిక్కిలి గాయపడుటచే అవి ఎంతయు విలవిలలాడెను. కరుణాళువులు వాటి విలవిలపాటును జూచి మిక్కిలి దుఃఖించిరి. అతని జీవహింసావృత్తికి వారు తట్టుకొనలేకపోయిరి.

ఈ విధమగా అతడు కుందేళ్ళను, అడవి పందులను, అడవి దున్నలను, అడవి యెద్దులను, మచ్చల జింకలను, ముళ్ళపందులను ఇంకను పలు విధములగు అమాయకములైన మూగజీవులను విచక్షణారహితముగ వేటాడుచు అలసిపోయెను.

అందువలన అతడు ఆకలిదప్పులకు లోనై నకనకలాడెను. అంతట పురంజనుడు వేటాడుట మాని, తిరిగి తన భవనమునకు చేరెను. క్రమముగా స్నానభోజనాదులను ముగించుకొనెను. విశ్రాంతిని పొందుటవలన అతని అలసట దూరమాయెను.

ధూపము,చందనము, ఇతరలేపనములు, పుష్పమాలలు మొదలగువాటితో అతడు అలంకృతు డాయెను. సర్వాంగములయందును సువర్ణాభరణములను ధరించెను. అప్పుడు ఆయన మనస్సు అతని భార్యపై నిలిచెను.

అతడు భోజనాదులచేత తృప్తుడాయెను. హృదయము ఆనందముతో నిండిపోయెను. మానసికముగా పారవశ్యమును పొందుచుండెను. ప్రణయ సుఖాసక్తుడయ్యెను. సర్వాంగసుందరియు, ప్రియురాలు ఐన ఇల్లాలికొరకు అటునిటు చూచెను. కాని ఆమె ఎచ్చటను కనబడలేదు.

(చతుర్థ స్కంధము లోని ఇరువది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment