Monday 9 May 2022







108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు

97) స ఏవ జగదన్త ర్యామీ, సఏవ సర్మాత్మకః||

(కృష్ణోపనిషత్)

- ఆ శ్రీకృష్ణ పరమాత్మయే జగత్తులో అంతర్యామిగా భాసించు చున్నాడు. ఆ శ్రీకృష్ణుడే సర్వాత్మకుడు.

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 10.

హృదయానికి, మెదడుకు సంఘర్షణ కలిగినప్పుడు, హృదయాన్నే అనుసరించు.

జాగృతి: స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

ప్రాపంచిక సుఖాలకు బానిసలం, ఇంద్రియాలకు దాసులం, సుఖలాలసత్వాన్ని మించిన స్థితి మరొకటి ఉంది. అందుకు మనల్ని మనమే ప్రేరేపించుకోవాలి.

నిష్ఠ 

శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి జన్మదినము 

గురు సాన్నిధ్యంలో ఉండడం అంటే భౌతికంగా ఆయన వద్ద ఉండడమే కాదు .( ఒక్కొక్కసారి ఇది అసాధ్యం) ; ముఖ్యంగా దాని అర్ధం ఆయనను మన మనస్సులలో నిలుపుకొని సైధ్ధాంతికంగా ఆయనతో ఏకత్వం పొంది, ఆయనతో అనుసంధానం ఏర్పరచుకోవడం.

శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర గిరి / The Holy Science

ॐ卐సుభాషితమ్ॐ

గురు అష్టకము/అర్థ తాత్పర్య సహితం

1) శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ |

మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||

అర్ధము:-  చక్కని శరీర రూపం, ఎంతో అందమైన భార్య, గొప్ప కీర్తిప్రతిష్ఠలు, మేరుపర్వతమంత ధనం వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

అందం, చందం, భార్య, సంసారం, ధనం, కీర్తి వుండటం నిజంగా అదృష్టమే, మన పూర్వ జన్మల సుకృతమే, కానీ ఇవన్నీ ఎదో ఒక రోజు మన నుండి దూరమైపోతాయి! అన్నింటినీ వదులుకుని మనకు తెలియని చోటుకి వెళ్లిపోక తప్పదు!

వెళ్ళేలోపు మన రాకకు కారణమేంటో, మన గమ్యమేంటో, అసలు ఈ జననమరణ మాయ ఏంటో, జీవాత్మ ఏంటో, పరమాత్మ ఏంటో ఇత్యాది సంశయాలపై కాస్త అవగాహన వుంటే, వున్నన్నాళ్లు శాంతిగా బ్రతకొచ్చు, ఆనందంగా జీవించవచ్చును.

ఈ మహత్తర తత్వాన్ని అవగాహన చేసుకోవడం సులభం కాదు. అందుకు ఒక మార్గదర్శి అవసరము. ఆ మార్గదర్శియే మన అర్హతను బట్టీ గురురూపంలో దర్శనమిస్తుంటాడు.

అతడు మాత్రమే, ఈ చిక్కుముడిని విప్పి మనకు అసలు సత్యాన్ని చూపగలడు. అటువంటి మార్గదర్శిని పొందలేని జీవితము నిజంగా వ్యర్ధమే!

***


సీస పద్య మాలిక


సర్వుల ఆత్మలు... సర్వాన్ని ఒకటిగా

దాహము శోకము... ధరణి నందు

వ్యక్తుము పలుకు అ వ్యక్తము గా కదులుతుంటే

చైతన్య కదలికే... పైక మగుటె

ఆత్మ తత్వము తెల్పు...ఆశయ సాధనే

నీకు అనుభవమే... నిన్ను మార్చు

నామరూపక్రియ.. నడమంత్రపుసిరిగా

పురుష తత్వమే .. పురుడు పోసె


స్వచ్ఛత అనునది..స్వతంత్ర భావమే

స్వరము యే కధలుగా..సరిగమలులె

స్వేచ్ఛ యే జీవితం.. సేవల మయముగా

ఎగిరేటి పక్షిలా....ఏది అనకు

స్వాగతము పనులే... సాక్షి గా నిలుచునే

బలికాకు ఆశకు... బుద్ధి జూపు

తప్పొప్పులు మనవి..తప్పుకు తిరుగకు

నీడలా నీవెంటె..... నిన్ను తట్టు


కలయిక ఆత్మగా...కళలన్ని కలియుటే

ద్విపక్షముగనులే...నింగి నేల

పుట్టుట గిట్టుటే...పుడమిన సహజమే

స్వచ్ఛ మైనదియైన..సంద్రమగుటె

బ్రహ్మ స్వరూపమై...బ్రహ్మాండమందునే

పరిపూర్ణ మగుటయే.. పలుకు లన్ని

నీకు నువ్వు గనుకే.. నీకు ఎదురు లేదు

ఎక్కడ ఉన్ననూ.. ఏమి ఫలము


ఆటవెలది

ఏది పుణ్య మేది ఏర్పాటు వాదమే

మాట తప్పి బ్రతుకు మనసు చెరచు

ఎవరి కధలు విన్న యదలోన మంటలే

గుణ ర హితము విద్య గొప్ప యేల

____((())))___


చంపకమాల.

ప్రకృతి కి లోబడే మనిషి పేరుయు తృప్తి యుజెందు జీవితమ్

పకృతి కి చిక్కియే మనసు ప్రేమను పంచియె నిత్య జీవితమ్

ప్రకృతి కి కారణమ్ముగను ప్రేయసి సేవలు పొందు జీవితమ్

ప్రకృతి కి శాంతి దాహముగను ప్రార్ధన చేయుట యందు జీవితమ్


*ఉత్పలమాల 

*దత్తపది..ప్రాంతంలోని ప్రభ.. పూరించండి.. ఉత్పలమాల లో

చెంచాలు కంచాలు లంచాలు  మంచాలు 


లీలలు జర్గుటే కలలు లాస్యము లాడకు సాహసమ్ము చెం

చాలుయె సామరస్యమగు జాతర భావము నిత్యకృత్య కం

చాలుగ సాధనమ్ముకళ జాడ్జము కాదులె కానిదంటు లం

చాలుగ ప్రాభవమ్ముయగు కాలము సట్టియు తోడ్పడే ది మం

చాలుయె మానసమ్ముగను చాయలు ఏలును జీవితమ్మునన్


*మానవ జన్మయే మహిలొ మానస లక్ష్యము ఇష్టరాజ్యమున్

మౌనము జ్ణాణసంపదయు మౌక్తిక మార్గము మోక్షమవ్వుటన్

మానము ‌‌ధర్మరక్షణయె మార్పుకు నేర్పుకు ఓర్పు చూపుటన్

ప్రాణము ఆత్మ గౌరవము పాద్యము ఆద్యము నిగ్రహమ్ముగన్


*సాధన ఏవిధమ్మునను శాంతికి తోడ్పడు లక్ష్యముంచితిన్     

శోధన నిత్యసత్యముగను శోత్రియ పద్దతి సాధ్యసాధ్యముగన్    

మేధను సత్యమార్గముగ మేలుకు సేవలు చేయుచుండుటన్ 

బాధలుఎన్నివచ్చినను బాధ్యత వల్లనె  దేహ ప్రక్రియల్


***

తేటగీతి పద్యములు  


*నువ్వు దేహానికి సుఖము నుండి గలవు

నువ్వు పరిమళించే నవ్వు ఉడత భక్తి

నువ్వు తలపు స్పష్టత వల్లె నులకవైతి 

నువ్వు పువ్వుగా దర్శనం నూతనముయె


*ఘటన లెన్నిఉన్నాఏల ఘటము బ్రతుకు

పాఠమన్నది ప్రజలకు పాశ మగుటె

ఏకమనునది లేకయే ఏడ్పు లీల

రాజకీయము ధనమిచ్చి  రాటు తేలె


*ఊగు వ్యాకులత మనసు ఊయలగుటె

వింత పోకడ బ్రతుకున విద్య యగుటె

వేదనామృత జీవితం వీణ యగుటె

భాను కిరణ రవ్వ మెరుపు భాగ్య మగుటె


*కల కవిత కవిత్వము గాను గాలి వలెనె

నది నదీమతల్లి యు సాగు నర్తన వలె

విధి తలుపుల తో విరిజల్లు వింత యాట

మదివిహరిస్తుంటె మనుగడ మాయ యగుటె


*కాల మనునది కదులుతూ కావ్య మగుట

కలము కదలిక మనసేను కధలు యగుట

హేళనా దూషన లు నున్న తేట తెలుగు

తెలప దలచిన ప్రభలుగా తెల్పె శర్మ

.....


శ్రీ అన్నమాచార్య సంకీర్తన

రేకు: 132- 3  - సంపుటము: 2-129 - రేకు రాగము: శంకరాభరణం.


నీవు సర్వసముడఁవు నీవు దేవదేవుఁడవు

ఈవల నా గుణదోషాలెంచ ఇంకనేలా!!


పూవులపైఁ గాసీఁ పొరి ముండ్లపైఁ గాసీని

ఆవల వెన్నెలకేమి హానివచ్చీనా

పావనుల నటు గాచి పాపపుంజమైన నన్నుఁ

కావఁగా నీకృపకునుఁ కడమయ్యీనా!!


గోవు మీఁద విసరీఁ కుక్క మీఁద విసరీని

పావనపు గాలికిని పాపమంటీనా

దేవతల రక్షించి దీనుఁడనైన నాకుఁ

దోవచూపి రక్షించితే దోసమయ్యీనా!!


కులజుని యింటనుండీ కులహీనుని యింటనుండీ

యిలలోన ఎండకు ఏమి హీనమయ్యీనా

వలసి శ్రీవేంకటాద్రి వరములు యిచ్చి నాలో

నిలిచి వరములిచ్చి నేఁడు గావవే!!

భగవద్గీతా శ్లోకం:-

సమోఽహం సర్వ భూతేషు

నమే ద్వేష్యోఽస్తి న ప్రియః 

యే భజంతి తు మాం భక్త్యా 

మయి తే తేషు చాప్యహమ్ |

(గీ. 09-29)

పెదతిరుమలయ్య వ్రాసిన శ్లోక భావం :

     సర్వభూతాలందున్నూ సముడను. నాకు పగవారున్నూ లేరు. ప్రియులూన్ను లేరు. యెవ్వరైన నేమి భక్తిచాతను నన్ను భజియింతురు. వారు యే జాతివారైనాను నాయందే భక్తి గలవారు; వారందున్నూ నేను దయగలిగి వుండుదును.

    'స్వామీ! వేంకటేశ్వరా! నువ్వు అందరిని సమానంగా చూసేవాడివి. నువ్వు దేవతలకే దేవుడివి. అటువంటి వాడివి - ఇవతల (=ఈవల) ఉంటున్న నా తప్పు, ఒప్పులను లెక్కించటమెందుకయ్యా! (నా తప్పొప్పులను పట్టించుకోక రక్షించమని భావం).

1. వెన్నెల పూవులమీద కాస్తుంది. క్రమంగా (పొరి) ముండ్లమీద కాస్తుంది. పూవుల మీద కాయాల్సిన వెన్నెల అవతల (అవల) ఉన్న ముండ్ల మీద కాసినంత మాత్రాన ఆ వెన్నెలకేమైనా గొప్పతనం తగ్గిందా? దయామయుడవైన నీ చల్లని చూపుల వెన్నెల పవిత్రుల మీద ప్రసరించి కాపాడుతుంది. అలాగే పుణ్యానికి అవతల తీరంలో ఉన్న ఈ పాపాల భైరవుడిమీద ప్రసరించినంత మాత్రాన నీ చల్లని చూపుల వెన్నెలకు లోటు రాదులేవయ్యా!

2. పవిత్రమైన గాలి - ఆవు మీద, కుక్కమీద ఒకేరకంగా వీస్తుంది. అంతమాత్రాన పవిత్రమైన గాలికి పాపమంటుతుందా!? అలాగే దేవతలను కాపాడే నీ దయా మారుతం - దీనుడిని హీనుడిని అయిన నామీద కూడ తాకించి ఈ జీవితానికి ఒక చక్కని మోక్ష మార్గం చూపించవయ్యా! అలా చేసినంత మాత్రాన నీకేమి దోషం రాదులేవయ్యా!

3. ఈ లోకంలో (=యిల) మంచి కులంలో పుట్టిన వాడి యింటిలోను, తక్కువ కులములో పుట్టిన వాడి యింటిలోను ఎండ - భేదభావం లేకుండా ఒకే రకంగా కాస్తుంది. అంతమాత్రాన ఎండకు గొప్పతనం ఏమన్నా పోతోందా!? ఎక్కడో వైకుంఠంలో ఉండవలసిన వాడివి - మా మీద - దయతో ఈ వెంకటాద్రి మీద కలిసిపోయి (అవలసి) వెలుగులు కురిపించే వరాలు ఇస్తున్నావు. వరాలివ్వటంకోసం అంత ఎత్తునుంచి కిందికి దిగి వచ్చావు. అందువల్ల కింది స్థాయిలో ఉన్న నాకు కూడ వరాలు ఇచ్చి రక్షించటం నీ ధర్మం.

     సమం సర్వేషు(13-27), సమం పశ్యన్ (13-28) ఇటువంటి అనేక గీతాశ్లోకాల్లో స్వామిని సర్వ సముడిగా భగవద్గీత నిరూపించింది. ఆ సర్వసముడిని అన్నమయ్య వెన్నెలగా, గాలిగా, వెలుగుగా అన్నమయ్య ఈ గీతంలో పోల్చాడు. వెన్నెల, గాలి, వెలుగు రూపాలలో ఉన్న నువ్వు సర్వసమానత్వం చూపిస్తున్నావు. నన్ను మాత్రం అందరితో సమానంగా చూస్తూ రక్షించటంలేదని స్వామివారిని చనువుతో ప్రశ్నిస్తున్నాడు కవి.

     అందం, విద్య, కులం ఇలాంటివాటితో సంబంధం లేకుండా తనను భక్తితో శరణు వేడినవారిని స్వామి సమంగా ఆదరిస్తాడని రామానుజాచార్యులవారు ఈ శ్లోకానికి భాష్యం రాస్తూ వివరించారు. దీనిని మనం పెద తిరుమలయ్య అనువాదంలో గమనించాం. ఈ కులమతాలకు అతీతమైన స్వామి కరుణను అన్నమయ్య ఈ గీతంలోని మూడో చరణంలో ప్రస్తావించాడు.

     'అవతల వైపు ఉండి ఎన్ని కబుర్లు అయినా చెప్పచ్చు. ఒక్కసారి ఇవతలికి రా! నీకు తెలుస్తుంది.' అని మనం నిత్య సంభాషణల్లో అప్పుడప్పుడు వాడుతుంటాం. జాతీయాన్ని అన్నమయ్య ఇక్కడ ప్రయోగించాడు. 'నువ్వేమో దోషాలంటని నిర్వికార నిశ్చల స్థితిలో చక్కగా ఉన్నావు. అవతల మా మానవులం ప్రతి నిత్యం కర్మ పాశ బద్ధులమై, తప్పనిసరిగా గుణ దోషాలంటుకొనే దశలో ఉన్నాం. శుభ్రతని, బురదని ఒకేలా చూసే సమబుద్ధి ఉన్న దేవా! మా దోషాలు పట్టించుకోకుండా కాపాడవయ్యా!!' - అనే అర్ధం రావటం కోసం - 'ఈవల' పదాన్ని అన్నమయ్య వాడాడు.

     పువ్వు మీద, ముల్లు మీద వెన్నెల సమానంగానే కాస్తుంది. వెన్నెల చల్లదనాన్ని నింపుకొంటూ పువ్వు ఇంకా రమ్యంగా ప్రకాశిస్తుంది. కాని ముల్లు - చల్లదనం - తనమీదకు వచ్చి వాలుతున్నా తన కఠినత్వాన్ని మానుకోదు. స్వామి దయ మనందరిమీద సమానంగా ప్రకాశిస్తున్నా స్వభావాన్ని అనుసరించి ఆ దయను స్వీకరిస్తాం. స్వభావో హి దురతి క్రమః (అనేక జన్మల కర్మ ఫలితంగా వస్తున్న ఈ స్వభావాన్ని మార్చుకోవటం చాల కష్టం.) ఇది నిజమేకాని స్వామిని శరణుకోరితే మన హృదయం అందరియందు సమాన బుద్ధి ఉన్న స్వామి దయకు అనుగుణంగా. మారుతుంది. 'వరములిచ్చి గావవే' అంటూ అన్నమయ్య మనకు దైవాన్ని శరణు వేడమని ప్రబోధం చేసాడు.

     'సముద్రం పై గాలి అంతటా వీచుచున్ననూ ఎవరు తెరచాప ఎత్తుదురో వారి పడవయే కదులునుకదా! కావున భగవత్కరుణ అను గాలి సర్వత్ర వీచుచున్ననూ వారివారి హృదయములను, తెరచాపలను విప్పి భగవదున్ముఖముగా ఉంచినచో మోక్షమను గమ్య స్థానమును శీఘ్రంగా చేరగలమని సమోహం శ్లోక వివరణ లో శ్రీవిద్యాప్రకాశానంద గిరి స్వామి చెప్పారు. (గీతామకరందం - 695 పే.) అన్నమయ్య గీతంలోని ఆంతర్యం కూడా అదే!

((()))

 శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)

620) శ్లోకము :-


మాంగల్య గౌరీ పదదర్శ నస్య 

కర్తా తు భూత్వా సుకృతస్య భర్తా!

 

ఆచారపూతై  రధిగమ్య మగ్రం

స్థానం ప్రపద్యేత యతో న పాతః!! 620    


పదవిభజన:-


మాంగల్య గౌరీ పదదర్శ నస్య 

కర్తా తు భూత్వా సుకృతస్య భర్తా!

ఆచారపూతైః అధిగమ్యం అగ్రం

స్థానం ప్రపద్యేత యతః న పాతః!! 620  

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి! 

బీహారు గయా క్షేత్రమున మాంగళ్య గౌరి

పాద దర్శనము చేసిన వాడు 

అధిక పుణ్యములు చేసిన వాడై,

సదాచార పవిత్రుల చేత 

అత్యున్నత స్థానమున గౌరవింపబడును.

ఆ స్థానము నుండి మరల పతనమవడు.

621) శ్లోకము :-


వారణాసి శుభ్రగిరే రనూనం 

క్షేత్రం పవిత్రం భువనత్రయే పి!

అర్ధే ప్రజానాం విధృతాన్నపాత్రా 

గౌరీ స్వయం యత్ర విశాల నేత్రా!!  621 


పదవిభజన:-


వారణాసి శుభ్రగిరేః అనూనం 

క్షేత్రం పవిత్రం భువనత్రయే అపి!


అర్ధే ప్రజానాం విధృత అన్నపాత్రా 

గౌరీ స్వయం యత్ర విశాల నేత్రా!! 621 


భావము:-


తల్లీ ! ఓ ఉమాదేవి! 

వారణసీ  క్షేత్రము ముల్లోకాలలో పవిత్రమైనది.

శుభ్రగిరి అగు కైలాసము కంటె తక్కువది కాదు.


విశాలక్షి అను పేరు కల ఆ గౌరీ దేవి 

ప్రజలను పోషించుటకై 

స్వయముగా అన్నపాత్రను ధరించి 

అన్నపూర్ణగా విరాజిల్లుచున్నది.

***


‘నువ్వే నా ప్రాణం

మా ఫ్రెండ్స్ వస్తున్నారు....మందు పార్టీ ఉంది....చికెన్ చేయమంటే...పందిలా పడుకుంటావా?' కోపంగా కాలితో ఒక్క తన్ను  తన్నగానే జ్వరంతో టాబ్లెట్ వేసుకుని పడుకున్న వసుధ ఉలిక్కిపడి లేచింది. నిద్రలో నుండి హఠాత్తుగా భయపడి లేచేసరికి ఒక్క క్షణం 

* నువ్వే నా ప్రాణం

అయోమయంగా అనిపించింది. ఎదురుగా భీకరంగా కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ భర్త... కృష్ణమూర్తి .

‘ఎప్పుడూ ఆ దేభ్యం మొహం వేసుకుని ఉంటావు.....ఇల్లు అంటే రావాలి, రావాలి; అనిపించేలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా ...నీ మొండితనం నీదే....ఏదీ వండావా? ’ రంకెలేస్తూ అంటున్నాడు.


‘జ్వరం వచ్చిందండీ...చేతకావట్లేదు :...నీరసంగా అంది.


‘ఛీ ...ఎప్పుడూ రోగాలు రొష్టులే...ఎప్పుడు చక్కగున్నావ్ కనుక ...దరిద్రపు కొంప ..దరిద్రపు కొంపాని' ..కాలితో ముందున్న పిండి గిన్నెను విసిరి తంతూ విసురుగా వెళ్ళిపోయాడు. ఇల్లంతా ఎగజల్లినట్లు పిండి అంతా పరుచుకు పోయింది. బాగు చేసే ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది వసుధ.


అలా వెళ్ళినవాడు పేకాడుతూ క్లబ్బులో ఆ రాత్రంతా ఉండి పోయాడు. తర్వాత అక్కడే అలాగే నిద్రపోయాడు. తెల్లవారి పొద్దెక్కిన తర్వాత ఇంటికి బయల్దేరాడు.


‘అంటీ మీకీ తాళం చెవి ఇమ్మంది...’ అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది. గుడికో , ఏదైనా పేరంటానికో వెళ్ళినప్పుడల్లా అలా ఇచ్చి పోవడం పరి పాటే. లోనికి వెళ్ళగానే రాత్రి హాంగోవర్ తగ్గడానికి బాత్రూం కెళ్ళి స్నానం చేసి వచ్చాడు. తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికి ఎదో తగలడంతో , టవల్ పక్కకు తీసేస్తూ కిందకి చూసాడు. కింద నిన్న తను తన్ని వెళ్ళిన పిండి. ఏదో అనుమానంతో చుట్టూ పరికించి చూసాడు. ఎప్పటిలా ఇల్లు కడిగిన ముత్యంలా అద్దంలా మెరిసిపోవటం లేదు. ఇల్లంతా అస్తవ్యస్తంగా దుమ్ము దుమ్ముగా ఉంది. అతని భ్రు ముడి పడింది. పెళ్ళయి ముప్పై వసంతాలు దాటుతున్నా ఎన్ని సార్లు ఎంత పెద్ద గొడవలైనా ఇల్లిలా ఉన్న దాఖలాలు లేవు. ఏమయ్యింది....నిజంగానే ఆరోగ్యం బాలేక హాస్పిటల్ కి వెళ్ళిందా...కనీసం తనకి ఫోన్ చేస్తుందే....తను తాగిన మత్తులో ఏమైనా ఎత్తలేదా... సెల్ తీసి చూసాడు. ఏ కాల్ లేదు.సరే తనే ఫోన్ చేద్దామనుకుని చేసాడు. ఊహు.... స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎంత చేతకాక పోయినా ఇల్లిలా ఎన్నాడూ పెట్టలేదు. ఆ పరిసరాలు, ఆ నిశ్శబ్దం చికాకు కలిగిస్తున్నాయి. అసహనంగా అతి భారంగా పావుగంట గడిచింది.... సమయం గడుస్తున్నకొద్దీ కోపం పెరుగుతోంది.. ఆకలి 

వల్లనేమో అది రెట్టింపవుతుంది. సరే టీవీ పెడదామనుకుని రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు. అది బరువుగా పెట్టిన దాని కింది కాగితం ఫాన్ గాలికి ఎగిరి కింద పడింది. తీస్తూ ఆశ్చర్య పోయాడు. అది ఉత్తరం.

అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు తీసాయి.

‘నేను చాలా విసిగిపోయాను. అలసిపోయాను. ఇక నా మనస్సుతో, మీతో ఘర్షణ పడే ఓపిక నాకు లేదు. పెళ్ళయిన దగ్గరనుండి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా , భావోద్రేకాలు లేని మరమనిషిగానే భావించారు. అందమైన మీ రూపం వెనుక అందమైన మనస్సుంటుందను కున్నానే కానీ అందం వెనక ఇంత వికృతమైన మనస్సుంటుందనుకోలేదు. మీకు కావాల్సిన సుఖం, సదుపాయాలను అందించే రోబోలాగానే తప్ప నాకూ మనస్సుంటుందని , దానికేన్నో ఆశలున్నాయని మీరనుకోలేదు. పెళ్ళయి ముప్పై వసంతాలు దాటినా మీరు మారలేదు. కనీసం పిల్లలూ నా మనస్సు అర్ధం చేసుకోలేదు. అందుకే ఈ మిగిలిన జీవితం అయినా నా కిష్టమైనట్లుగా గడపడానికి గడప దాటుతున్నాను. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమమైన మనిషి జన్మ వస్తుందంటారు. ఆ జన్మ సార్ధకత చేసుకునేలా నాకు నేనుగా బతుకుతాను. మా అమ్మావాళ్ళు బతికి ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి. పిల్లలకి నా ఆశీస్సులు..నన్ను వెదకడానికి ప్రయత్నించవద్దు... నా పిచ్చిగానీ మీరెందుకు వెతుకుతారు ? ఒక పనిమనిషిని పెట్టుకుంటారు.....’

సెలవ్.... వసుధ.

ఉత్తరం చదివి హతాశుడయ్యాడు. అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఇంత కాలం కనీసం తనన్న మాటకు ఎదురుకూడా చెప్పలేనిది ఇప్పుడు ఏకంగా ఎగిరేపోతుందా ....ఇది కలా .... నిజమా .....చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబిల్ పై నున్న కృష్ణుని పాదాల చెంత పడింది.

కాస్సేపటికి తేరుకుని కర్తవ్యమ్ గుర్తొచ్చిన వాడిలా కొడుక్కి ఫోన్ చేసాడు, ‘అమ్మ వచ్చిందా’ అంటూ, ‘లేదు ఎందుకు ఇంట్లో లేదా?' కొడుకు అడుగుతుంటే పెట్టేసాడు. కూతురుకు చేసాడు.అక్కడా లేదనే సమాధానం వచ్చింది.మైండ్ అంతా బ్లాంక్ అయిపొయింది. షుగర్ పేషంట్ కావడం వల్లనేమో శరీరం వణకడం మొదలయ్యింది.

కొడుకు హరగోపాల్ మళ్ళీ ఫోన్ చేసాడు. తరచి తరచి అడగ్గా విషయం చెప్పాడు.చెల్లి దగ్గరకెల్లిందేమో కంగారు పడవద్దన్నాడు . అక్కడా లేదన్నాక కంగారు పడి బయల్దేరుతా నన్నాడు. కూతురు వినీల ఫోన్ చేసింది. విషయం తెలిసి తానూ అల్లుడితో చెప్పి బయల్దేరుతానంది. మృదుమధురంగా రవలించే కాలి పట్టాలతో ఇంట్లో నడయాడే ఇల్లాలు లేక ఇంట్లో స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఇంటి ముందు శుద్ది చేసి ముగ్గేసిన ఆనవాళ్ళు లేవు. పూజ గదినుండి వచ్చే సాంబ్రాణి , అగర్బత్తి సువాసనలు లేవు. భయం భయంగా బ్రష్ అందిస్తూ, కాళ్ళకు మడుగు లొత్తుతూ , ఇష్టమైనవి కష్టమైనా చేసిపెట్టే ప్రేమదేవత లేదు. బీపీ, షుగర్ మందులు వేళకు ఇచ్చే ఆత్మీయత లేదు. ఏం చేసినా ఎందుకు చేసావని గాని, ఎందుకు చేయలేదని గాని అడిగే దిక్కులేదు. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి తెలిసిందతనికి. నిగ్రహించుకున్న నిబ్బరం నీరుగారిపోతుంటే అతనికి తెలియకుండానే రెండు కళ్ళల్లోనుండి కన్నీళ్ళు వరదలయ్యాయి. అలాగే నెమ్మదిగా అచేతనావస్థలో స్పృహ తప్పిందతనికి.

కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో బెడ్ మీదున్నాడు. ఆసుపత్రిలో చిన్న రూమ్. పక్కన మరో బెంచీ మీద కూతురు , కొడుకు కూర్చుని ఉన్నట్లున్నారు. వారి మాటలు వినబడుతుంటే మళ్ళీ భారంగా కళ్ళు మూసాడు.

‘ ఏమో అన్నయ్యా....అసలు అమ్మ ఇలా ఎందుకు చేసింది. ఎం తక్కువయ్యింది.... నాన్న తాగడం ...కోప్పడ్డం అంతా మామూలేగా... కొత్తేం కాదుగా.... ఏదో మనస్సు ఆపుకోలేక వచ్చాను. ఆయన అప్పటికే కోప్పడుతున్నాడు, పిల్లలకి ఆయనకు కష్టం అవుతుందని . త్వరగా వచ్చేస్తానన్నాను. అయినా నాన్న షుగర్ పేషంట్ అని తెలిసీ ఎలా వెళ్ళింది.... నాన్న ఫ్రెండ్స్ సమయానికి రాబట్టి సరి పోయింది గాని , లేదంటే.....ఏదేమైనా నేను ఈ వేళ వెళ్ళిపోతాను...’ వినీల అంటోంది.

‘ నువ్వెళ్తే ఎలా?..మీ వదిన అయితే ఈ చాకిరీ ఏం చేయదు. తనకీ చిన్న పిల్ల ఉంది. అర్ధం చేసుకో... నాన్నను మా ఇంటికి తీసుకెళితే కూడా ఊర్కోదు.... నాకూ ఆఫీస్ ఉంది. ఈయనతో ఏ టైం కి ఏమవుతుందో....ఈ టెన్షన్ నేను భరించలేను.’

‘ఆయనకసలే ముక్కు మీద కోపం...నేను తీసుకువెళ్ళలేను. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే...ఇంతకీ అమ్మ ఎక్కడికి, ఎందుకు వెళ్ళినట్లు....అమ్మే ఉంటే ఈ తలనొప్పి ఉండేదే కాదు కదా!'

‘నేను అందుకే తెలిసిన వాళ్ళనందరినీ వాకబు చేశా....ఉత్తరం ప్రకారం చూస్తే, ఏదైనా ఆశ్రమంకో , హరే రామ హరే కృష్ణ లాంటి మఠం కో వెళ్లి ఉంటుంది’.

‘అవున్రా...నువ్వలా అంటే నాకు గుర్తొస్తోంది. ఒకసారి అమ్మ ‘అమ్మ అనాధాశ్రమం’ గురించి ఏదో పేపర్ లో చదివి దాని వివరాలు ఎవరికో కావాలి అని నెట్ లో చూసి చెప్పమంది...’ ఉత్సాహంగా అంది వినీల.

‘అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను....నెట్ లో సర్చ్ కొట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా అని తెలుసుకుంటాను... ఒకవేళ దొరికితే మనం అదృష్టవంతులమే....’

‘హలో....’అమ్మ 

వృద్ధాశ్రమమానండీ .. డొనేషన్ ఇవ్వడానికి మాకు కొన్ని వివరాలు కావాలండీ... ఓహో... వంద మంది ఉంటారా.......ఈ రెండు రోజుల్లో మీ దగ్గర ఎవరైనా కొత్తవాళ్ళు చేరారా... ఆమె పేరు ఏమిటండీ ?...ఆ..అవునండీ...వసుధ నే...ఉన్నారండీ.... మేము ఫోన్ చేసినట్లు 

చెప్పకండి... మేము వస్తాము...విరాళం తెస్తాము’

‘ఆ... ఏంట్రా అన్నయ్యా !అమ్మ అక్కడికే వెళ్ళిందా?అబ్బా.. ఎంత అదృష్టం !దేవుడు మన మొర ఆలకించాడు...’

అన్నీ వింటున్న క్రిష్ణమూర్తి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తనను ఒక్క రోజు చూసుకోవడం కష్టమయ్యింది పిల్లలకి. భరించే అమ్మ దొరికిందని సంబర పడుతున్నారు. నిజంగా వసుధ దేవత. ఎన్ని రకాలుగా కష్ట పెట్టాడు.అయినా ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. మాటకు ఎదురు చెప్పలేదు. ఈ కొన్ని గంటలలోనే ఆమె లేకుండా తను ఉండలేదన్నది అర్ధమయ్యింది. బుద్ది వచ్చింది. తనకు వసుధ కావాలి. తను లేకుండా ఆమె బ్రతుకగలదేమోగాని ఆమె లేనిది తను బ్రతకలేడు. డాక్టర్ లోనికి రాగానే హరగోపాల్, వినీల ఆయనతో కల్సి బెడ్ దగ్గర కొచ్చారు.

‘నాన్నా...నాన్నా....అదిగో డాక్టర్ వచ్చారు.లే నాన్నా...’ పిల్లలు పిలుస్తున్నారు. నెమ్మదిగా అప్పుడే మెలకువ వచ్చినట్లు కళ్ళు విప్పాడు.

‘ఎలా ఉంది...కొంచెం నీరసంగా ఉంటుంది... మరేం భయం లేదు...మీరు డిశ్చార్జ్ కావొచ్చు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ‘ డాక్టర్ వెళ్ళిపోయాడు.

‘నాన్నా....అమ్మ ఆచూకీ తెలిసింది నాన్నా... ఈ రోజే వెళదాం...’ పిల్లలు డిశ్చార్జ్ కి సన్నాహాలు చేస్తూ అన్నారు.

*********************

‘అమ్మ అనాధాశ్రమం ‘ అన్న బోర్డ్ దగ్గర సరాసరి వెహికిల్ ని ఆపి దిగారు, కృష్ణమూర్తి, వినీల, హరగోపాల్.

‘నవమాసాలు మోసి, కనీ, పెంచి,లాలించి, పాలించి,అనారోగ్యం లో సేవ చేసి, రక్షనిచ్చి, ఆసరా అయి, శక్తి ఉడిగి పండుటాకై నీ చేతిలోనే నేలరాలుతుంది...’ ఎదురుగా బిడ్డకు పాలిస్తున్న అమ్మ బొమ్మ దగ్గర రాసి ఉంది.

WOMAN-------W -- Wonderful Mother

O--- Outstanding friend

M--- Marvelous Daughter

A—Adorable sister

N—Nicest gift to Men from God

వినీల ఇలా అక్కడున్న కొటేషన్లు చదువుతుంటే , హరగోపాల్ తొందర పెట్టి తీసుకెళ్ళాడు.

ఆఫీస్ రూమ్ లో పెద్దావిడ కూర్చుని ఉంది . ఆవిడ పైన ‘జీవితం ఒక అద్దం లాంటిది. అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది. దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి ఏడుస్తుంది.. తేడా అద్దంలో లేదు. మనలో ఉంది. జీవితం లోని సమస్యలు కూడా అంతే . అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి’ అన్న కొటేషన్ రాసి ఉంది. ఆవిడ తో వివరాలు చెప్పి వసుధ ను ఒక్కసారి పిలిపించమని చెప్పారు. ఆవిడ పక్కనే ఉన్న ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి, పిలిపిస్తాను అంది. ముగ్గురు ఆ గది లోకి నడిచారు. ఆ గది గోడల పైనన్నీ అందంగా రాసిన ఆణిముత్యాల్లాంటి కోటేషన్లే. టెన్షన్ తో ఉన్న మనస్సు మళ్ళించడానికన్నట్లు మౌనంగా అంతా ఆ కొటేషన్లు చదవడంలో మునిగిపోయారు.

‘ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడువక తప్పదు.

ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు.

ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు.

ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాకతప్పదు.

ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గూటికి చేరక తప్పదు.

ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు.

ఇదే జీవితం’

‘జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే!

ఎన్ని సార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది.

గమ్యం అనంతం...గమనం అనేకం...

ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం!! ‘

ముసలితనం ‘నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు

నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు

నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు

నీ పనులకు ఒకరి మీద ఆధార పడిన రోజు

నీ భావాన్ని నీ నోటితో పలుకలేని రోజు’

నీ నిస్సహాయస్థితి కి నీకే జాలికలిగే రోజు

నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది.

కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది.తప్పులు దిద్దుకునే అవకాశం కూడా ఉండదు’

చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తొచ్చి కళ్ళల్లో నీరు ఉబికింది. తలుపు శబ్దం కావడంతో గుమ్మం వైపు చూసారంతా.

పసుపు పచ్చని చీరలో, నుదుట ఎర్రటి బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతుంటే మృదు మధుర అందెల సవ్వడి ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంటే గంభీరంగా అడుగుపెట్టింది.

‘అమ్మా...అమ్మా...’ అంటూ చిన్నపిల్లల్లా రెండు వైపులా ఏడుస్తూ హత్తుకు పోయారిద్దరు పిల్లలు. భుజం పై తల ఆన్చిన ఇద్దరినీ ఆర్తిగా భుజాలపై అలాగే రెండు చేతులతో తలనిమురుతూ ఉండి పోయింది వసుధ .

‘అమ్మా...నీకేం తక్కువయ్యిందని వచ్చావ్?' ముందు హరగోపాల్ అన్నాడు విడివడుతూ...

‘అన్నీ ఎక్కువే అయ్యాయి..భరించలేక వచ్చా....’ స్పష్టంగా అంది వసుధ .

‘ నీకేదవసరమైనా అన్నీ క్షణాల్లో నాన్న తెచ్చిపెడుతున్నాడు గా..ప్రేమ లేకుంటేనే అలా చేస్తాడా? .’వినీల ఆరా..

‘మొన్ననే గోపాల్ పెళ్ళిలో బంగారం కూడా కొనిచ్చాను .ప్రేమలేకుంటేనే చేస్తానా? ఏం లేదని ఇలా వచ్చావ్? ’భర్త అసహనం.

‘ మనశ్శాంతి ... అది దొరకకనే వచ్చా...మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా...’ఏయ్ మనిషీ...ఇగో... ఓ దేభ్యం మొహం..’ఇవీ నా బిరుదులు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవాళ్ళని శాశ్వతంగా వదిలి పెళ్లి కాగానే చిరకాలం కష్టసుఖాల్లో తోడూ నీడై కలిసి ఉంటాడని గుడ్డి నమ్మకంతో వస్తాం. కానీ ఎన్నాడూ నా మనస్సు ఏమిటో కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ..... ఏంటీ ..బంగారం కొనిచ్చానన్నారు కదూ...నేను అడిగానా...అది కేవలం సమాజంలో మీ స్టేటస్ సింబల్ గా కనబడడానికే . మీకు అన్నీ ఎప్పటికీ అమర్చి పెట్టే భార్య ఈ రోజు మీరు చెప్పింది వండలేదంటే ... ఏ బాధ ఉందో అని ఆలోచించక , చేయిచేసుకునే మనిషికి ఎం ప్రేమ ఉందనుకోవాలి?ఏ అనురాగ బంధమూ లేని మీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుందనిపించింది.

చిన్నప్పటి నుండి నా మనస్సులో ఎన్నో కోరికలు ఉండేవి. ఎంతో చదువుకోవాలని ...ఏవేవో చదవాలని, పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు. కాని ఒక్కటీ నెరవేరలేదు. కారణం. ఆయనకిష్టం లేదు కాబట్టి. ఇప్పుడు చదివి ఎవర్ని ఉద్ధరించాలని అంటూ ప్రతీ దానికి ఆంక్షలే. అందుకే ఈ చరమాంకం లోనైనా ఇప్పుడైనా ఓపెన్ యునివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటాను. గుడిలో అందరూ నేను పాడే పాటలు కీర్తనలు చాలా ఇష్టపడతారు. ఎంతో మంది రాసియ్యమని అడిగేవారు. అలా అవన్నీ గ్రంధస్తం చేస్తాను. అలనాటి మన సంప్రదాయ సంస్కృతులలో భాగంగా ఉన్న ఎన్నో పాటలు, కొంగుచాపే పాట, తలుపుల దగ్గర పాడేపాట, అప్పగింతల పాట, బతుకమ్మ పాటలు, మన సంస్కృతీ సంప్రదాయాలు తెలిపే మంగళ హారతి పాటలు, జోల పాటలు ....ఇలా ఎన్నో పాటలు కనుమరుగవుతున్న సంప్రదాయాలన్నింటిని గ్రంధస్తం చేయాలనుకుంటున్నా. ఆయన మారతాడని ఇంతకాలం ఎన్నో భరించా... కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే  అని తెలుసుకున్నా.... అందుకే నా కిష్టమైనట్లు కనీసం ఈ జీవిత చరమాంకం లోనైనా బతకాలనుకుంటున్నా ’

‘అమ్మా...అమ్మ భువిపై దేవుడి అపురూపమైన సృష్టి అంటారు . తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమఉంటుంది కదా...అందులో ఆడపిల్లని...నా కోసమైనా ఒక్కసారి ఆలోచించలేవా అమ్మా?' వినీల అంది.

‘బిడ్డలకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత నేరవేర్చాను. ఇప్పుడు నీకు అన్నీ ఆలోచించే విచక్షణా జ్ఞానం ఉంది. ఎప్పుడూ...'అమ్మా! పిల్లలతో నాకు ఇంత కష్టం అవుతుంది'అని అంటావు. పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి ఇస్తాను. నీ ఇంటి కొచ్చి ఏదో రెండు మూడు నెలలకో నాలుగు రోజులు చేయగలను. కాని మళ్ళీ నాలుగు రోజులకే 'వచ్చి హెల్ప్ చేయవచ్చుగా' అంటావ్.... నాకూ వయసై పోతుంది... ఇదివరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు. పైగా నీకు చంటిపిల్ల ఉన్నప్పుడు నాన్న కేరళ లో ఉన్న ఏదో ఫంక్షన్ కి నన్ను తీసుకుని వెళితే , ఈ వయస్సులో హనీమూన్లా తిరుగుతున్నారని అల్లుడు తప్పుపట్టాడని చెప్పావే కాని ,’ మరి ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు...వారి డబ్బులతో వారు వెళ్ళారు... కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడినప్పుడే వెళ్ళాలి కదా' అని మీ ఆయనకీ సర్ది చెప్పుకోలేక పోయావు. ఎప్పుడూ అయ్యో బిడ్డ కష్టపడుతుందని అవో, ఇవో చేసి పంపే నా ఆరాటమే కాని, ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగావా... ఎందుకంటే అమ్మ అది ఆశించదు .... నిజమే... కానీ మళ్ళీ నీ కడుపున పుట్టినవాళ్ళు కూడా నీలాగే తయారవుతారు. అప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు. అది నేను భరించలేను. కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువత లోకి చొచ్చుకుపోయేలా చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. నాలా, నా బిడ్డ గాని , మరో అమ్మ మనసు గానీ బాధ పడొద్దని నా ఆశ ‘ వినీల కళ్ళనిండా నీళ్ళు నిండాయి.

‘అమ్మా...మరి నేనేం తప్పు చేసాను. కనీసం నువ్వు నా దగ్గరికైనా రాకుండాఎందుకు వెళ్ళిపోయావు?’ కినుక చూపాడు కొడుకు.

‘మానవ శరీరం గరిష్టంగా 45 డే(యూనిట్ల) బాధను భరించగలదట. కానీ బిడ్డకు జన్మ నిచ్చేప్పుడు తల్లియాభై ఏడు డే (యూనిట్ల) నొప్పి భరిస్తుందట. అది 20 ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమట. కాని అంత బాధ భరించి తన కడుపును చీల్చి జన్మ నిచ్చిన తల్లి, బిడ్డను చూసి అంత బాధ మర్చి పోతుందట. కోడలు ‘మీ అమ్మ కి ఎప్పటికీ కూతురంటేనే ఇష్టం... నేను చదువుకుంటూ పాపని చూసుకోవడం ఎంత కష్టం...వచ్చి సహాయం చేయొచ్చుగా... ఆమె కన్నీచేసి పెడుతుంది. అదే కొడుకంటే ప్రేమే లేదు.... ‘ అంటూ ఎన్నో అందని చెప్పావు. అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులున్నాను. నేనున్నన్ని రోజులు వంట గదిలో గాని , ఏపనిలో గాని నేను చేసింది తనకు నచ్చదు. ఏదో అని చీదరించుకుంటుంది. భయం భయం గా బతికాను. ఆమె నన్ను అలా అన్ని మాటలంటున్నప్పుడు నీ మనసుకి తెలీదా నా మనసు.... ఆమెకు నేను రెండేళ్లుగానే తెలుసు కావచ్చు. కాని నీకు నేను నువ్వు పుట్టినప్పటి నుండి తెలుసు...ఒక్క సారి నేనలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు... అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కాని రేపు నీ కొడుకు తో మీరలా బాధపడొద్దని . నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ ముగిసేలోగా చేయాలని మాత్రమే వచ్చేసాను. నన్ను క్షమించండి.....’

‘వసుధా !' జీవితం లో తొలిసారి మార్దవంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి.

‘నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే. కాని నీ మనస్సింతగా గాయపడుతుందనుకోలేదు. నువ్వు లేని క్షణమొక యుగమైంది. .. నువ్వు లేక నేను బతక లేను....రా వసుధ..నా అవసరం కోసం నిన్ను పిలవడం లేదు.. అక్కడే ఉండి నీకిష్టమైనవన్నీ చేసుకో.... ఇక నుండి నీ ప్రతీ కష్టం పంచుకుంటాను. పేకాట, తాగుడు వదిలేసాను. ఇకముందు కూడా వాటి జోలికి పోను. నువ్వేన్నోసార్లు అవి మానేయడానికి డాక్టర్ దగ్గరకు కౌన్సిలింగ్ కి రమ్మన్నావు. కదా వస్తాను. నిన్న డాక్టర్ చెప్పాడు. నీకు తరచూ అనారోగ్యం ఎందుకొస్తుందో...బాబు కు కిడ్నీ చెడిపోతే ఎవరికీ తెలవద్దంటూ నీ కిడ్నీ ఇచ్చావు కదా... దానివల్లనేనట. నిజంగా ‘అమ్మ ‘ అనే పదానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం. ఇక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా మీద ఒట్టు..... నన్ను నమ్ము వసుధా.ప్లీజ్ .’కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు కృష్ణమూర్తి.

‘అమ్మా....నా ప్రాణం నిలబెట్టిన నిన్ను బాధ పెట్టాను ... నన్ను క్షమించమ్మా.... ‘

‘అమ్మా...నీ తల్లి మనస్సు అర్ధం చేసుకోలేక పోయాను. ఇంకా నేను బాధ పడకూడదనే తపన పడుతున్న నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తోందమ్మా...నన్ను క్షమించమ్మా...’ పిల్లలిద్దరూ కన్నీళ్ళతో తల్లి పాదాలు అభిషేకం చేస్తున్నారు.

‘మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటి వారి లోని లోపాలు , తప్పులూ మరింత చిన్నవిగా కనిపిస్తాయి. ఓర్పు క్షమా గుణం పెరుగుతాయి. ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచం లో దాదాపు అన్ని సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి.... ‘ ‘ ఐశ్వర్యారాయ్ కావాలంటే అందం ఉండాలి..కాని మదర్ తెరిస్సా కావాలంటే మనస్సుంటే చాలు..’ ఎదుట ఉన్న కొటేషన్లు ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నట్లున్నాయి.

ఆ ప్రాంగణం లోని గుడి లోని జేగంటలు తధాస్తు అన్నట్లు మంగళకరంగా మోగాయి.

ప్రతి ఒక్కరు చదివి అందరి చేత చదించాల్సిన వ్యాసo.

లోకంలోని సంఘటనలు...మారేదెప్పుడు

తరగతిగదిలో ముద్దుపెట్టుకుంటున్న విద్యార్థులు!

పెళ్ళిపీటలపై ముద్దులాడుకుంటున్న వధూవరులు !!

వివాహవేదికపై నాట్యం చేస్తున్న వధువు  !

కల్యాణమండపంలో వధువును కొడుతున్న వరుడు!!

పబ్బులో పోట్లాడుకుంటున్న యువతీయువకులు !

నడివీధిలో నవ్వులపాలవుతున్న మద్యపాన ప్రియులు !!

పట్టపగలు ప్రాణం తీస్తుంటే పట్టించుకోని పౌరులు!

ఫోను నొక్కుకుంటూ నాకెందుకనుకుంటున్న ప్రజలు!!

ప్రియురాలిని పొడిచి చంపుతున్న ప్రియుడు !

ప్రియుడి గొంతుకోస్తున్న ప్రియురాలు!!

భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త !

ప్రియుడితో భర్తను చంపిస్తున్న భార్య!!

నెలలపిల్లను నేలకేసి కొడుతున్న తండ్రి!

ఆడపిల్లని చెత్తకుప్పలో వేస్తున్న తల్లి !!

తల్లితండ్రులను తరిమికొడుతున్న తనయులు!

ఆస్తిలేదని వెళ్లగొడుతున్న వారసులు !!

వేరేకులంవాడిని వివాహమాడిందని

సోదరిని సంహరిస్తున్న సహోదరులు!

మరోమతంవారిని మనువాడాడని

మట్టుబెడుతున్న బంధువులు !!

వెల్లువవుతున్న విడాకులు!

వీచేనా విలువల వీచికలు !!

పేట్రేగిపోతున్న పదవీకాంక్ష!

ఫలించేనా ప్రజల ఆకాంక్ష!!


ఆధునికత అవధులు దాటిపోతుంది!

అనుభవం  పరిధులు మించిపోతుంది!!

వ్యక్తిగత స్వేచ్ఛ విశృంఖలమయ్యింది!

విశృంఖలత వెర్రి తలలు వేస్తుంది !!


అన్యాయం న్యాయం చెబుతోంది!

అక్రమాలు అంబరమంటాయి!!

నేరాలు నింగిని తాకాయి!

ఘోరాలు గొప్పలుపోతున్నాయి !!


అలుముకుంటున్న అరాచక రీతులు !

ఆందోళనకలిగిస్తున్న ఆటవికతాగమన సూచికలు!!

విశృంఖలత  సోపానాలపై జీవనగతులు !

వికారం కలిగిస్తున్న వ్యవహార తీరులు!!


స్వేచ్చాజీవనమని సంబరపడుతున్నాం!

సరదాగా ఉంటున్నామని సంతోషపడుతున్నాం!!

ఆటవికత ఆవరిస్తోందని

అరాచకత్వం అలుముకుంటోందని

అవగతంకాని అయోమయంలో ఉన్నాం!!

*ఓర్పు వుంటే మనిషిలో మార్పు

సృష్టిలో ప్రతీదీ కాలానుగుణంగా మార్పు చెందుతుంది. మార్పు అనివార్యం. మార్పు చైతన్య సూచిక. మార్పనేది కంటికి కనిపించనూ వచ్చు, కనిపించకపోనూ వచ్చు. చూడలేకపోయినంత మాత్రాన మార్పు చెందలేదని కాదు. నిత్యం ఒక వ్యక్తిని చూడటం కన్నా, కొంతకాలం తరువాత చూస్తే ఆ వ్యక్తిలోని మార్పు స్పష్ట మవుతుంది. 

చీకటి వెలుగులు, మానవ, పశుపక్ష్యాదుల జీవితం, రుతువులు ఒక స్థితి నుంచి మరో స్థితికి చేరడానికి క్షణక్షణం మార్పు సంభవిస్తూనే ఉంటుంది. ఆ మార్పు లోని దశలు కొంతవరకు అవగాహనకు వస్తాయి. వాటికీ ఆయా దశ సూచక పేర్లు పెట్టుకుంటాం. 

ప్రకృతి పరంగా మార్పులు సహజసిద్ధంగా జరుగుతాయి. అవి మార్చలేనివి. సృష్టిలో కోరుకున్నట్టుగా మార్పు చెందే అవకాశం ఒక్క మనిషికే ఉంది. మానసికంగా, శారీరకంగా ఎలా కావాలంటే అలా మారవచ్చు. అది మానవ జన్మ అదృష్టం, వరం. 

 శరీరం మీద దృష్టి నిలిపి అందచందాలను మెరుగుపరచు కునే వారికన్నా, మనసును తీర్చిదిద్దు కుని సేవాభావ దృక్పథంతో మెలగే వారు మాననీయులు.

అందం ఎప్పటికీ ఒక్కలా ఉండేది కాదు. అది వయసుతోపాటు రకరకాల మార్పులకు లోనవుతుంది. రుతువుల ప్రభావానికి గురవుతుంది. మనసు అలాకాదు. అది కనిపించదు కాబట్టి మనం ఎలా మలచుకుంటే అలా స్థిర మవుతుంది. వృద్ధాప్యంలో కుర్రతనం ఉరకలెత్తడానికి, యౌవనకాలంలో లక్ష్య లేక చతికిలబడటానికి మనసుకు మనిషి ఇచ్చే తర్ఫీదే కారణం. మనసు మనిషికి వన్నె తెస్తుంది. 

మనసును మేళవించాడు.

సాధారణంగా మనిషి ప్రవర్తనతో అతడి మనసును అంచనా వేస్తారు. తెల్లనివన్నీ పాలు కాదు. నల్లనివన్నీ నీళ్లనీ అనుకోకూడదు. మెరిసేదంతా బంగారం కానేకాదు. నటన- సృష్టిలో మనిషికి మాత్రమే అబ్బిన కళ. మంచితనం, మానవత్వ భావాలతో క్రమంగా మనసును మార్చుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకోవలసిన మనిషి, అవసరాలకు అనుగుణంగా నటిస్తుంటాడు. చెడ్డతనాన్ని దాచి పెట్టి మంచితనాన్ని ప్రదర్శిస్తాడు. ప్రపంచానికి అది సహజమా, నటనా అన్న తేడా తెలియనంతగా ప్రవర్తిస్తాడు.

నీతి, న్యాయం, నిజం, నిజాయతీలను నిర్వచించిన మనిషి అవినీతి, అన్యాయం, అబద్ధం, మోసం, దగా, కుట్రలకు కేంద్రం అవుతున్నాడు. 

పాలలో నీళ్లను కలుపు కొంటూ పోతే చివరికి క్షీరం అస్తిత్వం కోల్పోయి నీరవుతుంది. ధర్మం నాలుగు పాదాలపై నిలబడినప్పుడే సమాజం పచ్చగా పది కాలాలు పరిఢవిల్లుతుంది. రాబోయే తరాలకు నిష్కల్మషమైన, నిష్కపటమైన ఆహ్వానం పలుకుతుంది. మనిషి జన్మకు శాశ్వతత్వాన్నిచ్చే ధర్మాన్ని విడిచి తాత్కాలిక సుఖాల కోసం కాసుకు లొంగి అధర్మం బాట పట్టడం, అది కలి ప్రభావం అని సమర్థించుకోవడం ఆత్మవంచన. మనసును ఏమార్చుకుంటూ కాకుండా ఉత్తమంగా మార్చుకుంటూ ఇలలో దైవత్వాన్ని సాధించడమే మానవజన్మకు పరిపూర్ణత. లేదంటే జీవితమే వ్యర్థం!

****

* ఉపనిషత్తులు..... వాటి సారాంశం..... క్లుప్తంగా


 1) ఈశావాస్యోపనిషత్:--

సర్వం ఆత్మగా దర్శించినప్పుడు ,సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు,శోకం మటుమాయమవుతుందని ఈ ఉపనిషత్ చెప్తుంది.

------------------------------

2) కేనోపనిషత్:--

ప్రతి కదలిక చైతన్యం నుండే ఉద్భవిస్తుంది,చైతన్యం వ్యక్తం కాదు,అవ్యక్తం కాదు,రెండింటికి భిన్నమైనది, ప్రతి ఆలోచన ఈ చైతన్యం నుండే ఉద్భవిస్తుందని ఈ ఉపనిషత్ చెప్తుంది

-----------------------

3) కఠోపనిషత్:--

ఆత్మ తత్వాన్ని దర్శించినవారే నీకు అనుభవాన్ని ప్రసాదించగలరు.

-----------------------

4) ప్రశ్న ఉపనిషత్:--

నామ ,రూప,క్రియలతో నిండిన ఈ సృష్టి స్వచ్ఛమైన పురుషతత్వం నుండి వచ్చింది.గంగా యమునా నదులన్నీ నామరూపాలతో ఉంటాయి.సముద్రంలో కలిసాక నామరూపాలను వదిలేస్తాయి.అలాగే పురుష చైతన్యంతో లీనమయ్యాక ఆ కలయిక ఆత్మగానే,మనకు ఏకంగా సాక్షాత్కరిస్తుంది.

---------------------------

5) ముండకోపనిషత్:--

నీవు చూసే ఈ ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపమే,అది పరిపూర్ణంగా నీ చైతన్యమే,ఎక్కడ చూచినా,ఏమి చూచినా,నీకు నువ్వే దర్శనమిస్తుంటావని చెప్తుంది.

-------------------------------

6) మాండూక్య ఉపనిషత్:--

జాగృద్,స్వప్న,సుషుప్తావస్థ అనే 3 అవస్థలు మానవునికి ఉంటాయి,3 అవస్థలు లేవు,అంతా కలిసి తురియావస్థ లొనే ఉందని తెలుస్తుంది, చూసేవాడు,చూడబడేది,ఇలా రెండు లేవు,రెండూ ఒక్కటే అని చెప్తుంది.

---------------------------

7) తైత్తరేయ ఉపనిషత్:--

మనలో ఉన్న పంచకోశాలు,ఒక్కొక్క పొరలాగా,విప్పుకుంటూ పోయి ఆనందమయ కోశం కూడా దాటి చివరికి కోశాలన్నీ నాకు వేరుగా లేవు,అవన్నీ నా స్వరూపాలే అని చెప్తుంది.

-------------------------------

8) ఐతరేయ ఉపనిషత్:--

ఆత్మను అనేకత్వంగా కాక,ఏకత్వం గా చూడటం నేర్చుకోవాలి,దృష్టి ని ఏకత్వం వైపు మళ్లించాలి,జీవ జగత్ రూపమైన సృష్టి అంతా ఒక సంకేతం అని శాస్త్రం వర్ణిస్తుంది,ఇదే శాస్త్ర రహస్యం అంటుంది ఐతరేయం.

----–---------------------

9) చాంధోగ్య ఉపనిషత్:--

అంతా ఏకత్వమే అని గ్రహించాక,నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యం అని,ఏకాత్మ రూపమైన ఆ పరమాత్మే నువ్వేనాని చెప్తుంది,తత్వమసి అని చెప్తుంది చాందోగ్యం.

------------------------

10) బృహదారణ్యక ఉపనిషత్:--

మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు,సాధన అంతరంలో చేయాలని అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతం ఈ ఉపనిషత్ చెప్తుంది.

56-కర్మ - జన్మ

 7 వ ఆధ్యాయం - "కర్మ క్షయం"

 కలల్లో కర్మ ఫలం 

 కర్మ ఫలితాన్ని భౌతిక శరీరంతో మెలకువగా ఉండగానే కాక, కలలో కూడా అనుభవించచ్చని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చెప్తోంది. 

 స్వప్నంలో కొన్ని ఘడియల్లో అనుభవించే మానసిక బాధ వల్ల కూడా కర్మ నివారణ అవుతుంది. 

 ఓసారి శ్రీపాద శ్రీవల్లభుల దగ్గరకి ఓ క్షయవ్యాధి పీడితుడు వచ్చాడు. “నువ్వు పూర్వ జన్మలో గజ దొంగవి. ఓ తండ్రి తన కూతురు పెళ్ళి కోసం దాచిన సొమ్ముని దోచావు. కట్నం ఇవ్వలేని ఆమెని చేసుకోడానికి ముసలి పెళ్ళికొడుకులే ముందుకు రాసాగారు. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అందుకు కారణం అయిన నీకు క్షయ వ్యాధి వచ్చింది.”

 అతనిని శ్రీ చరణులు పంచదేవపహాడ్ లోని గోశాలలో ఓ రాత్రి నిద్రచేయమన్నారు. తాగడానికి ఎవరూ అతనికి మంచినీళ్ళు ఇవ్వద్దని చెప్పారు. రాత్రంతా దోమలు బాగా కుట్టాయి.

ఆ రాత్రి కలలో ఓ రాక్షసుడు తన కంఠాన్ని నొక్కి చంపుతున్నట్లు, మరో కలలో ఓ పహిల్వాన్ తన ఛాతీ మీద పెద్ద బండరాయిని ఉంచినట్లు రెండు కలలు వచ్చాయి. ఆ రెండు కలలతో అతని పాపం పరిపక్వమై అతని క్షయ వ్యాధి నయం అయింది. ఐతే దీనికి గురువు అనుగ్రహం తప్పనిసరి అవుతుంది. ఆయనే అలాంటి కర్మ ఫలాలని ఇచ్చే కలలని ఏర్పాటు చేయగలడు.

        కర్మ-జంతువులు 

‌ ఏదో జన్మలోని ఋణానుబంధం వల్ల జంతువులు ఏదో పొరబాటు వల్ల మన చేతిలో మరణిస్తాయి. అప్పుడు దాన్ని శ్రద్ధగా దహనం చేసి అన్నార్తులకి భోజనం పెడితే, అందువల్ల కర్మ శేషం నశించి, వాటికి సద్గతి కలుగుతుంది, అని శ్రీపాద శ్రీవల్లభులు చెప్పారు. 

 ఋణానుబంధం లేకుండా ఏ జంతువూ మన ఏ దగ్గరకి రాదు. అలా వచ్చిన జంతువుకి ఆహారం పెట్టి పంపడం శ్రేయస్కరం. మనిషికయితే తగిన సహాయం చేయాలి. చేయలేకపోతే శాంతంగా మన ఆసమర్ధతని తెలియచేయాలి తప్ప నిర్దాక్షిణ్యంగా మాత్రం ప్రవర్తించకూడదు.

 సుకర్మతో దుష్కర్మ రద్దు 

 కురువపురానికి వెళ్ళే పడవలో శ్రీపాద శ్రీవల్లభులకి వేద శాస్త్రాలు అభ్యసించిన ఓ పండితుడు తారస పడ్డాడు. అతనితో ఆయన ఇలా చెప్పారు, “నువ్వు ఓ రజకుని భార్యని ఆకర్షించి ఆమెని నీ ఉంపుడుగత్తెగా చేసుకుని, నీ ఆమెని, నీ భార్యని, ఆ రజకుడ్నీ క్షోభ పెడుతున్నావు. ఈ రోజు నువ్వు మరణించాల్సి ఉంది. కాని నేను నీకు మూడేళ్ళ ఆయుషుని ఇస్తున్నాను. వచ్చే జన్మలో ఆ రజక దంపతులు మహారాజ భోగాలని అనుభవిస్తారు.

అప్పుడు నువ్వు నపుంసక జన్మని పొంది ఆ రజక వనితకి సేవలు చేస్తూ కర్మ ఫలాన్ని అనుభవిస్తావు. ఈ మూడేళ్ళు మంచి కర్మలు చేస్తే అప్పుడు ఆ జన్మలో నీకు అన్నవస్త్రాలకి లోటు లేకుండా ఆ రజక వనిత సేవ చేసుకుంటావు. లేదా శ్రమకి తగ్గ ఫలితం లేకుండా నానా యాతనలు పడతావు.”

 దీన్ని బట్టి పుణ్య కర్మలతో గతంలో చేసిన పాప కర్మలు నశిస్తాయి అని అర్ధం అవుతుంది.

 ఏ పాపం ఎలా నశిస్తుంది? 

 భగవత్ ధ్యానం వల్ల, జపం వల్ల మానసిక పాపం నశిస్తుంది. భజన, సంకీర్తనలతో వాచిక పాపం, ఉపవాస, అర్చన, యజ్ఞాదుల వల్ల శారీరకంగా చేసిన పాపం నశిస్తుంది. ధనం కోసం చేసిన పాపాలు దానాల వల్ల పోతాయి.

---


No comments:

Post a Comment