Wednesday 3 November 2021

ఈ వారం (7) కధలు (28---35)

 




28...ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ ..
       తప్పకుండా ఆలోచించాల్సిన
       అంశాలు ... 

       ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో..  ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా బలిపశువులు చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది...

       కొంత హిస్టరీలో కి వెళ్దాం... 

       30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు. 

       డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే.. 

       అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి.. 

       దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి. 

       అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు. 

       ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు లు ఉండేవి కాదు.  

       కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు. 

       తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది  ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ  ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు. 

       మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో  విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు. 

       అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనుకోలేదు. 

       మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనుకునేవారు. 

       వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు. 

       తర్వాత వాస్తవం లోకి  వెళ్దాం ...

       కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది. 

       కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో  జాయిన్ చేయడానికి  అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు  కొందరు. 

       దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా? 

       ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి. 

       మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ?   ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?

       అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి. 

       ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది. 

       కానీ  ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు. 

       కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది. 

       కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు. వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు. 

       ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం  వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది. 

       అపార్ట్ మెంట్ లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా.. ప్రభుత్వం తన మీద భారం లేదు కదా అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది.

       మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..? 

       వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది?

       దానికి సమాధానమే ఇంగ్లీష్ మీడియం...

       ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి...  

       ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు. 

       ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని  రూల్ ఏమి పెట్టలేదు. 

       అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది.

       కానీ ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు. 

       ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు.  

       ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..! ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!!

       అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు.  అది సమాజంలో లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది.  

       ‌ప్రభుత్వ పాఠశాల క్రమేపీ పేదల పాఠశాల గా మారిపోయింది. 

       కష్టం చేసుకునే ప్రజల పిల్లలు..  

       ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు.. 

       ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు. 

       వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి  తీసుకెళ్లిపోయారు.

       ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది.  

       ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు.. 

       ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి. 

       పెట్టినా.. అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది. 
‌ 
       ‌ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది.  

       1. సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం

       2. విద్యార్థులకు ఫర్నిచర్ తరగతి గదులు సరిపడా  లేకపోవడం.

       3. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి,  సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం

       4. ప్రైవేటు విద్యార్థులు సొంతంగా సిలబస్లో రూపొందించుకున్న వారిని అదుపు చేయలేక పోవడం.

       5. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం.. 

       ఉదాహరణకు 5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే ఏవిధంగా సిలబస్ లేకపోవడం. 

       ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి  లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా?  ‌రాదు...  

       ఎందుకంటే ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన... 

       అంటే ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది? 

       అంటే గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు.. అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది... 

       ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..  ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.

       నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...? 

       ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..?!

       ఇక్కడ నేను చెప్ప వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే ... 

       ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. 

       నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..

       ఎడారిలో పండించండి ...

       మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు. 

       వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.

       నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు. 

       నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు. 

       వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు. 

       ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం  కేటాయించగల గలవారై ఉంటారు. 

       ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. 

       మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు ..

       నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు... 

       అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి.. 

       ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి... 

       పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి.. 

       ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి..  

       పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు.. 

       ★ నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.

       మేము చేర్చుకుంటాం...

       ★ మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..

       మేము రానిస్తాం...

       ★ మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..

       మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..

       ★ మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.

       మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..

       ★ మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.

       మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం.

       ★ మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.

       ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల పరువు తక్కువ కాబట్టి.

       మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.

       ★ మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.

       మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే...

       ★ మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు.  ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.

       ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..

       మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...

       ★ మీరు కొన్ని వందల పాఠశాలల  బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...

       మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...

       ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి... 

       అవన్నీ మీకు కూడా తెలుసు... 

       వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని  మాట్లాడుతున్న గా.. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.

       అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు కాలేదు.. 

       లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు వస్తున్నాయి... 

       మరి మిగతా వాళ్ల సంగతేంటి..?


       మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే నువ్వు ఒక పక్కకు కూడా రావు.. అది నీ లాంటి సౌకర్యాలు లేకుండా.. 

       ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది.

       ప్రైవేట్ పాఠశాలలు గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు ఉంది.. 

       అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం సరికాదు.

       దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి.

       నిజమే.. అనిపిస్తే ఈ నిజాలను ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే
అంత మంచి చేసినవారు అవుతారు.

       ఆలస్యమెందుకు... చదివిన వెంటనే ఆ పని మొదలు పెట్టండి.
((()))

29...ఓ మనిషి! నేటి క్తెనా మేలుకో *
ఈ భూమండలం మీద తానే మహా బలవంతుడనని, క్రూర మృగాలను జయించి ప్రక‌ృతిని గెలిచానని.. 
మహా సాగరాలను ఈది, మహా పర్వతాలను అధిరోహించిన మహా మేధావినని విర్రవీగిన *మనిషి.. చివరకు కంటికి కనిపించని సూక్ష్మ జీవికి లొంగిపోయి దానికి దొరక్కుండా గూట్లోకి దూరి దాక్కున్న వైచిత్రికి* ఈ పరిస్థితి అద్దం పడుతోంది కదా.. 
అందుకే.. మహాబలాఢ్యుడిని అనుకున్న మనిషిని ఇప్పుడు ప్రకృతి పరికించి చూస్తోంది.. పరిహాసం చేస్తోంది.  
_*ఆధిపత్యం ప్రదర్శించిన మనిషి తిరిగి తన మూలాల్లోకి.. గుహల్లోకి.. గ‌ృహాల్లోకి వెళ్లిపోవడంతో వన్య ప్రాణులు తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరుకుంటున్నాయి.*_ 
★ థాయ్‌లాండ్ వీధుల్లోకి అడవి కోతులు ప్రవేశించి యథేచ్ఛగా తిరుగుతున్నాయి.. 
★ జపాన్ రోడ్ల మీద సికా జింకలు షికారు చేస్తున్నాయి..! 
★ కాలిఫోర్నియా వీధుల్లో టర్కీ కోళ్లు సామూహికంగా విహరిస్తున్నాయి..
★ మన కోయంబత్తూరు రోడ్ల మీదకు అడవి జింకలు వచ్చి దర్జాగా తమ పూర్వ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నాయి.. 
★ కొజికోడ్ వీధుల్లో పట్టపగలే అడవిపిల్లులు రాజ్యమేలుతున్నాయి. 
★ నోయిడా రాచవీధిలో నీల్గాయ్‌లు తిరుగుతున్నాయి.. 
★ బెంగళూరు బస్ స్టాండు ఇప్పుడు పావురాల ప్రపంచమైపోయింది.. 
★ తిరుమల ఘాట్‌రోడ్లు.. మాడవీధులు జింకలకు ఆవాసమయ్యాయి. 
ఇక్కడా అక్కడా అనిలేదు.. 
★ *లండన్ నుంచి లాస్ ఎంజెల్స్ వరకు.. న్యూయార్క్ నుంచి న్యూ సౌత్ వేల్స్ వరకు.. టోక్యో నుంచి టోరోంటో వరకు..* ఎటు చూసినా.. మనిషి అహంభావానికి, స్వార్థానికి ప్రతీకలుగా నిలిచిన కాంక్రీట్ జంగిల్స్‌లో తిరిగి తమ మూలాలను వెతుక్కుంటూ.. తాము కోల్పోయిన వనాలను గుర్తుచేసుకుంటూ వన్య ప్రాణులు వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాయి.
అర్ధనగ్న, పూర్తి నగ్న దృశ్యాలతో చెలరేగి.. బీరు సీసాలు, వైన్ గ్లాసుల చప్పుళ్లతో, అర్థంలేని వీరంగాల రణగొణ ధ్వనులతో నిన్నటిదాకా మారుమోగిన సాగర తీరాలు, ప్రేమికుల దినోత్సవాలతో, ఫ్లైయింగ్ కిస్సులతో, హాట్ హగ్గులతో బిత్తరపోయిన ఐఫిల్ టవర్లు, ఉద్యమాలతో దద్దరిల్లిన తియనాన్మెన్ స్వ్కేర్‌లు, కార్నివాల్స్‌తో చిత్తయిపోయిన సాల్వడార్లు ఇప్పుడు నిర్మానుష్యమైపోయాయి. ఇప్పుడక్కడ అడవితల్లి ముద్దుబిడ్డలు.. కపట మెరుగని మూగజీవాలు ఆటలాడుకుంటున్నాయి! 
ఓ మనిషీ.. భూమి, ఆకాశం, గాలి, నీరు.. అన్నీ.. ఈ జగత్తు మొత్తం నీ ఒక్కడి సొత్తే అన్నట్టు ఆక్రమించావు. అడవుల్లోని జంతువుల నుంచి.. ఆకాశమార్గాన సాగిపోయే స్వేచ్ఛా విహంగాల నుంచి మహా సాగరాల్లోని తిమింగలాల వరకు అన్నింటినీ జయించావు.. ఇష్టారాజ్యంగా వధించావు.. ప్రకృతిని  దోచావు . 
*ఇప్పుడు కంటికి కనిపించని అతి సూక్ష్మజీవికి భయపడి దుప్పటి తన్నేశావు.. ముక్కుకు ముసుగేశావు.. నిజంగానే*  నీ మూలాల్లోకి వెళ్లిపోయి గుహల్లో దాక్కున్నావు. 
నీ అసలు ముసుగు తొలగిందిలే.. *ప్రక‌ృతి ముందు నువ్వు ఎప్పటికీ అంగుష్ఠమాత్రమేనని అర్థమైందిలే!!*
ఇప్పటికైనా మేలుకో...  
ఈ సమస్త భూమండలం మీదా నీతోపాటే తమకూ సమాన హక్కులున్నాయని గుర్తుచేస్తున్నాయి ఈ వన్య ప్రాణులు. 
తాము కేవలం ఆకలి తీరడానికి.. కడుపు నింపుకోడానికి మాత్రమే వేటాడతామని.. అదీ కేవలం ఆగర్భ శత్రువుతోనే తలపడతామని.. నీలా సర్వభక్షకులం కాదని కాకూడదని హెచ్చరిస్తున్నాయి ఈ మూగ జీవాలు. 
*ఇప్పటికైనా మేలుకొని సంధికొస్తే సరి.. కాదూ, కూడదూ.. సూది మొన మోపినంత భూమి కూడా లేదు అనే అనేశావంటే.. ప్రక‌ృతి చేసే కురుక్షేత్రంలో బలైపోతావు సుమా!!*అందుకే గత 30 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఏ రక్షణ లేని పశుపక్ష్యాదులు స్వేచ్ఛ కొరకు ఉద్యమిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. జ్తై శాఖాహార జగత్. 
--(())--
30...ఆత్మలు గురించి భగవంతుని వివరణ
     ఆత్మలో ఏ భేదాలు లేవు.  అది ఒక్కటే. దేహం కదలటానికి కారణమైనది ఆత్మయే. ఇంద్రియాలు వాటి వాటి ధర్మాలు నిర్వర్తించటానికి కారణమైనది ఆత్మయే. మనస్సు అనుభవాలు పొందటానికి కారణమైనది ఆత్మయే. బుద్ధిలో ఆలోచనలు కదలటానికి ఆధారమైనది ఆత్మయే. ఆత్మవల్లనే మనం అన్నింటిని తెలుసుకోగలుగుతున్నాం. అన్నింటికీ ఆధారమైన ఆత్మ ఏకం-అద్వయం-ఎట్టి గుణాలు, విశేషణాలు లేనిది.
లైటు వెలగటానికి, ఫ్యాన్ తిరగరటానికి, ఫ్రిజ్, టీవీ, హీటర్, రేడియో, ఏ.సి. అన్నింటికీ కారణం కరెంటే.  ఆ కరెంటులో ఏ భేదములు లేవు.  అదొక్కటే రకం.  కరెంటుకు వెలిగే గుణం, తిరిగే గుణం, వేడినిచ్చే గుణం, చల్లదనాన్నిచ్చే గుణం ఇవేవీ లేవు.  అది అన్నింటిలోనికి వెళ్ళినప్పుడు దాని శక్తి వల్ల అన్నీ వాటి ధర్మాలు అవి నిర్వర్తిస్తున్నాయి. అట్లాగే ఆత్మ అందరిలో భాసిస్తుంది. అదే జాగ్రదావస్ధలో జరిగే సమస్తాన్ని తెలుసుకుంటున్నది. స్వప్నావస్ధలోని సమస్తాన్ని తెలుసుకుంటున్నది. సుషుప్తిలో ఏమీ తెలియకపోవటాన్ని కూడా తెలుసుకుంటున్నది.  శరీరాల్లో భేదమే గాని ఆత్మలో భేదంలేదు.
హిందూ ఆత్మ, ముసల్మాన్ ఆత్మ, క్రిస్టియన్ ఆత్మ, భారత ఆత్మ, ఆస్ట్రేలియా ఆత్మ , వైశ్య ఆత్మ, బ్రాహ్మణ ఆత్మ, శూద్ర ఆత్మ, పేద ఆత్మ, ధనికి ఆత్మ, తెలివిగల ఆత్మ, పిచ్చి ఆత్మ, అమాయక ఆత్మ, ముసలి ఆత్మ,కుర్ర ఆత్మ, మగ ఆత్మ, ఆడ ఆత్మ, కుక్క ఆత్మ, నక్క ఆత్మ అని..... వేరువేరుగా ఆత్మలు లేవు. ఉన్నది ఒక్కటే ఆత్మ. బయట ఉపాధులను బట్టి ఆత్మలు అనేకం అనుకొనేవాడు ఆధ్యాత్మిక రంగంలో పరమ మూర్ఖుడు.  జాతి, వర్ణ, వర్గ, లింగ, భేదాలన్నీ ఆత్మకు చెందినవి కావు. అవి ఉపాధులకు చెందినవి; దేహాలకు చెందినవి. అలాగే పుణ్యం, పాపం కూడా ఉపాధులకు (మనస్సుకు) చెందినవే కనుక పుణ్యాత్మ, పాపాత్మ అంటూ లేవు. ఆత్మ అన్నింటికి కేవల సాక్షిగా ఉంటుంది. అంతే.
స్వచ్చమైన నీటికి రంగులేదు, రుచిలేదు, వాసనలేదు. స్వచ్చమైన వర్షపు నీరు భూమి మీదకు పడేటప్పుడు స్పటికంలాగా రంగు ఉండదు. రుచి ఉండదు. వాసన ఉండదు. కాని భూమి మీద పడటంతో అది భూసారంతో కలిసి రంగు రుచి ఏర్పడుతుంది. అందుకే వాన వెలిసిన తర్వాత చూస్తే ఆ నీరు ఒకచోట నల్లగాను, ఒకచోట ఎర్రగాను, ఒకచోట పచ్చగాను ఉంటుంది. అలాగే నీరు తీయగా ఉంటుంది. కొన్ని చోట్ల ఉప్పగా ఉంటుంది. కొన్ని చోట్ల చవ్వగా ఉంటుంది. ఇదంతా భూమిలోని లవణాల యొక్క కలయిక చేతనే.
అలాగే ఆత్మ అంతటా - అందరిలో ఒక్కటే. దానికి ఏ గుణాలు లేవు, ఏ భేదాలు లేవు. అయితే దేహమనే ఉపాధితో తాదాత్మ్యం వల్ల దేహలక్షణాలు ఆత్మపై ఆరోపించబడుతున్నాయి. దేహం భారత దేశంలో పుట్టింది గనుక భారతీయుడని, బ్రాహ్మణకులంలో జన్మిస్తే బ్రాహ్మణుడని, వైశ్య కులంతో జన్మిస్తే వైశ్యుడనని, ఈ దేహం బాల్యంలో ఉంటే బాలుడని, వివాహం చేసుకొని ఉంటే గృహస్తుడని, గృహాన్ని వదలివెళితే వానప్రస్ధుడని, సర్వసంగ పరిత్యాగంచేస్తే సన్యాసియని - ఇలాగ వేరువేరు విధాలుగా పిలవబడుతున్నాడు. అంతేతప్ప ఆత్మకు జాతి భేదంగాని, లింగభేదంగాని, వయో భేదంగాని, కులభేదంగాని, ఆశ్రమభేదంగాని ఏవీ లేవు.  ఆత్మజ్ఞానం లేకపోవటంవల్ల ఉపాధులకు పరిమితులమై ఉపాధి లక్షణాలను ఆత్మపై ఆరోపించుకుంటున్నాము. దు:ఖాలు పొందుతున్నాం. ఆత్మ యొక్క సచ్చిదానంద లక్షణం అనుభవరీత్యా బోధపడితే ఇక మనం ఏ భేదాలు లేని ఆత్మగా కేవలంగా ఉండిపోతాం.

--(())---

31..ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
తాతా తాతా  విభజన అంటే ఏమిటి, నే చెపుతా విను  ఈ పండును రెండుగా చేశాను చూసావుగా ఈ రెండు భాగాలను విభజన అంటారు  అది నాకు  తెలుసు భాగాలు ఎక్కువ తక్కువగా ఉన్నాయి గా ఏది ఏమైనా నేను  ఒకటిని రెండుగా  మార్చా ను ఈ భాగము నాకు తప్పదా తాతయ్య,  తప్పదు మిగిలినది నాకే కదా .
పూర్వము paala samuddraamlo ఉన్న మంధర పర్వతాన్ని చిలకాలనుకున్నారు, వాసుకి సర్పాన్ని తాడుగా వాడారు, తలవద్ద రాక్షలు తొకవద్ద దేవతలు చిలకటం  మొదలు పెట్టారు చివరికి అమృతం పుట్టింది, అమృతం దేవతల కందింది, వేరొకరికి మోసం జరిగింది.
తాత   విభజనకు ఈ కధకు ఏమిటి పోలిక.
ఒకరి వల్ల మరొకరు మోసపోతారు, ఒకరి లాభము మరొకరికి నష్టము ఇది అనాదిగా జరుగుతున్న విషయమే కదా అవునుతాత ,  మనవుడా నీకొక కధ చూపుతా విను. 

అది ఒక మహానగరం మూడువైపుల నీరు, నాల్గొవ వైపున మంచు పర్వతాలు ఉన్న సస్య శ్యామలమైన ప్రాంతము, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితముగా రాజ్యాంగము వ్రాసు కొని ప్రజలకు ఏదైనా సహాయము చేయాలని రాజరికమును విలువ తగ్గిన దని తలచి  రాజ నీతిజ్ఞలను గెలిపించుకొని రాజ్యమేలుతున్న సమయంలో, అధికారము కొడుకు కట్టబెట్టాలని ఆశతో కీలు బొమ్మ లాంటి మంత్రికి పూర్తి అధికారాములు ఇచ్చినట్లు ఇచ్చి స్వతంత్ర భావముతో రాజ్యమేలుతున్నది.   నగరము పేరు చెప్పలేదు తాత, ఆ  చెపుతా విను దానిపేరు "సత్య దేశం ".

 ఎందరో తెలివైనవారు హితము పలికిన తాను చేయాలనుకున్నది చేయుటే తప్ప దానివల్ల వచ్చే కష్ట నష్టాలు పట్టించుకొనేవారు కాదు, అనుకోని విధముగా చిన్న చిన్న సంఘటనలకు ఆలోచించక మేధావులను సంప్రదించక తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని భావించేది.
 సలహాతో రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించాలని దానివల్ల ప్రయోజనం ఉంటుందని అవకాశ వాదుల మాటాలు నమ్మి విభజనకు నాంది పలికింది, కాల చక్రం ఆగదుగా తన దగ్గర ఉన్నవారే వేరొకరితో చేతులు కలిపారు, రాజ్యాంగ నాయకులను ప్రజల ముందుకు తీసుకోని వెళ్లారు, గత  వారు చేసిన తప్పిదములను, కొత్తవారు చేయ బోయే పనులు చెప్పుటము వల్ల అధికారులు మారినారు కొత్త ప్రభుత్వము వచ్చినది, విభజన చేసినవారిని ప్రజలు తిరస్కరించారు కొత్తవారిని ఆహ్వా ణించారు.

ఏది ఏమైనా ప్రభుత్వాలు మారిన నష్టము విభజన జరిగిన ప్రాంతాలవారికే తాత అప్పుడు ప్రజలు ఎదురు తిరగలేదా
ఎందుకు తిరగలేదు సత్యగ్రహాలు, సహాయ నిరాకరణ ఉద్యమాలు, ఓకే భాగము ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు, మరో భాగమువారు ఇది నా ప్రతిభ అని ప్రజల్లోకి వెళ్లి చెప్పుకున్నారు. ఏది ఏమైనా రాజ్యాంగ నేతలు విభజన శ్రీకారం చుట్టి, స్వతంత్ర ప్రాంతాభి వృద్ధికి ఇతో ధికంగా ప్రజల ద్వారా ఎన్నుకొనబడి ఇరుప్రాంతాలకు రాజ్యాంగ నేతలు ఏర్పడ్డారు.

వచ్చిన నష్టము పూరించుటకు కేంద్ర అధికారులు, శుష్క వాగ్దానాలతో కాలయాపన చేస్తున్నారు. ఒక ప్రాంతమువారు తనకు వ్యతిరేకముగా ఉన్నవారిని ఆశలు చూపించి తనవైపు తిప్పు కున్నారు, వ్యతిరేకులు లేకుండా జాగర్త పడుటే రాజ్యాంగ నేత తెలివి, దానితో ఇది మాసొత్తు  మా ప్రాంతములో అధికారులుగా వేరొకరాష్ట్రము వారు ఉండకూడదు అనే ద్రోహ భావముతో కొందరు ప్రవర్తిస్తున్నారు,  భాద పడ్డవారికి సహాయమే పదవి వదలి బయటకు రావటము తప్ప వేరొక మార్గము లేని పరిస్థితి తెస్తున్నారు. రాజ్యాంగములో ప్రజలు ఎక్కడైనా నివసించవచ్చు, ఉద్యోగమూ చేయవచ్చు అన్న ఆచరణ పట్టించు కోవటంలేదు ఒక ప్రభుత్వము వారు.

ఇష్టా రాజ్యముగా కరెంటు చార్జిలు, నిరుద్యోగులకు ఉద్యోగము కల్పించ లేక పోయారు, అసలే అసలే ఖర్చులలో ఉన్న ప్రభుత్వము ప్రజలకు దగ్గరవ్వాలని, కాంట్రాక్టులద్వారా పార్టీ  బలము పెరుగుతున్నది ఉన్న నగరాన్ని ఉన్న జిల్లాలను మరికొన్ని జిల్లాలుగా మారుస్తూ కొత్తజిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు, ఈ విధముగా చేయుట ఎవరికీ ఉపయోగమో ప్రజలు గుర్తిస్తున్నారు. 

మరో భాగము ఒక్కసారి ఆలోచిస్తే ఆర్ధికంగా తక్కువ వనరులతో ఏర్పడిన భాగము, రాజధానిని వదలి కొత్త  రాజధానిగా ఏర్పాటు చేసుకుంటూ ప్రతిపక్ష వారిని ఎదుర్కొంటూ, సొంత బలముతో, కేంద్ర బలముతో రాజ్యాగమును తెలియబరుస్తూ ప్రజల అండ దండల కోసం అనేక పధకాలతో రాజ్యము  ఏలుతున్నారు. 

ఏది ఏమైనా అసంపూర్తి  ప్రభుత్వాలను భరించక తప్పదు ప్రజలకు తాత తర్వాత ఏం జరిగింది      చెపుతానురా నాన్న వచ్చే టైం అయ్యింది మిగతా కధ రేపు చెపుతానులే 
నిజంగా రేపే చెపుతావుగా - చెపుతాను కావాలంటే గోడమీద వ్రాసుకో  అట్లాగే ......
              
--(())--  

32... నీడ వెనుక నిజం
రచన.... జలంధర
#సుధాకర్ కి చిన్నప్పట్నుంచీ కెమేరా అంటే పిచ్చి! కనిపించే అందాలన్నీ కెమేరాలో బంధించాలనీ, ఫోటోగ్రఫీలో మంచి పేరు తెచ్చుకోవాలనీ కోరిక. అయితే పరిస్థితులు అనుకూలించక అతను కెమేరాయే కొనుక్కోలేక పోయాడు. ఇప్పుడు పాతికేళ్ల వాడయ్యాడు. బొంబాయిలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఈమధ్యే మంచి ఖరీదైన కెమేరా ఒకటి కొన్నాడు.
నాలుగు రోజులు సెలవు చూసుకుని బొంబాయి మహానగరం నుంచి తమ ఊరైన సిరిపురం చేరాడు.
ఆరడుగుల అందమైన విగ్రహం, మంచి వర్చస్సు, ఉంగరాల జుట్టుతో ఉన్న సుధాకర్భుజాన కెమేరా తగిలించుకుని సిరిపురంలో దర్జాగా నడుస్తూ అక్కయ్య ఇంటికి నడుస్తున్నాడు. నగర జీవితంతో విసిగిపోయిన అతనికి ఆకుపచ్చ చీరకట్టుకున్న అందగత్తెలాంటి ఆ ఊరిలో పాదం మోపగానే ఏదో తెలియని ఆనందం లోలో ఉరకలు వేసింది. 
తను ఇచ్చిన చిక్కటి కాఫీ తాగుతూండగా , "ఇన్ని వేలు పోసి ఇప్పుడిది కొనకపోతే ఏమిటిరా?" అని మెల్లిగా మందలించింది అక్కయ్య. సుధాకర్ నవ్వుతూ, తనకి చిన్నప్పటినుంచీ ఉన్న కెమేరా, ఫోటోగ్రఫీ పిచ్చి గురించి మరోసారి చెప్పేడు. స్వతంత్రుడు, సంపాదనాపరుడూ అయిన తమ్ముడ్ని మరేమీ అనలేకపోయిందామె. కాసేపయ్యాకా , "సరే…మా ఫోటోలు తీయరా! నాదీ బావగారిదీ కలిపి ఒక్క ఫోటో కూడా లేదు" అంది అక్కయ్య. "తప్పకుండా అక్కయ్యా!" అని అక్కకీ, అలా అడిగిన చాలామందికి ప్రామిస్ లు చేశాడు సుధాకర్. ఇంతలో అతని మామయ్య కూతురు అనూరాధ వచ్చింది. “నీ ఫోటోలు తీద్దామనే తెచ్చాను కెమేరా!” అన్నాడామెతో సుధాకర్... అనూరాధ ఏమీ మాట్లాడకుండా హాయిగా నవ్వేసింది.

నీరెండలో తళుక్కున మెరిసిన ఆ నవ్వు, ఆమె ఎర్రరాయి ముక్కుపుడక అతణ్ణి ముగ్ధుణ్ణి చేశాయి. ‘ ఎలాగైనా ఈ అందం వేరు!’ అనుకున్నాడతను– బొంబాయిలో నీతా మెహతా గుర్తుకొచ్చి. జడలో కనకాంబరాలు, ఏ మాత్రం మాచింగ్ లేకుండా కట్టుకున్న ఆకుపచ్చ పరికిణీ, నీలం రంగు ఓణీ, ఎర్రరంగు జాకెట్టు వేసుకుని నూతి దగ్గర్నుంచి నీళ్లు తీసుకువస్తున్న అనూను అలాగే ఫోటో తీశాడు సుధాకర్. అలా అందంగా కనిపించిన ప్రతి మనిషినీ, దృశ్యాన్నీ ఫోటో తీస్తూ, 'తను ప్రతి ఏడూ చూసే ఈ ఊరిలో ఇన్ని అందాలున్నాయని కెమేరా పట్టుకుంటే కానీ అర్థం కాలేదే!' అనుకున్నాడు. పాలు తీసే పల్లెపడుచులు, రంగవల్లుల మధ్య బంతిపూల గొబ్బెమ్మలు, తాటాకులతో చేసిన దేముడి రథం అన్నీ అందంగానే కనిపించాయి సుధాకర్ కి!

సుధాకర్ ఊరంతా తిరుగుతూ రకరకాల ఫోటోలు తీస్తున్నాడు. కొబ్బరిచెట్ల చాటున సూర్యాస్తమయం దగ్గరనుంచీ, చిన్నారిపాపల బోసినవ్వుల వరకూ ఎన్నో ఫోటోలు తీశాడు. ‘ఫోటోగ్రఫీలో ప్రైజు వచ్చే దృశ్యాలు ఇక్కడెన్నో ఉన్నాయి’ అనుకుంటూ ఇల్లు జేరేసరికి, సగం నెరిసిన జుట్టుతో అడ్డదిడ్డంగా అలంకరించుకు వచ్చిన మునసబుగారి భార్య “నా ఫోటోలు తీయవూ బాబూ!” అని వయ్యారంగా అడిగేసరికి మతిపోయి చూశాడతను. “తప్పదు… మునసబుగారి భార్య!” అన్నట్టు సౌంజ్ఞ చేసిన అక్కయ్యని చూసి , “హతవిధీ” అనుకున్నాడు సుధాకర్.
ఊళ్ళో చాలామంది ఆడపిల్లలు సుధాకర్ ని అడిగి ఫోటోలు తీయించుకున్నారు. కానీ అతన్ని అడక్కుండా అతనిచేత ఫోటో తీయించుకోవాలని, సుధాకర్ కెమేరాతో మేడ మీదకు వచ్చినప్పుడల్లా అలంకరించుకుని, అవతల మేడమీద బట్టలారేసే నెపంతోనో, ఒడియాలు తీసే నెపంతోనో వచ్చి, చూపుల బాణాలు విసిరే కరణంగారి కొత్తకోడల్ని చూస్తే నవ్వొచ్చేది సుధాకర్ కి. “అబ్బ! ఏమిటో ఈ ఆడవాళ్ళు... ” అనుకునేవాడు.
ఆరోజు సాయంత్రం సుధాకర్ ఏదో పనిలో ఉండగా వాకిలికి కట్టిన తెర సందులోంచి తొంగిచూస్తూ , “ఏమండీ?” అంటూ ఓ బొంగురు గొంతు వినపడింది.” ఎవరదీ?” అన్నాడు సుధాకర్ గుమ్మంవైపు చూస్తూ. “నేనేనండి ! శ్యామలని , నా ఫొటో తీస్తారేమో అని అడుగుదామని వచ్చాను…..” అంటూ ఎదురుగా వచ్చి నిలబడింది ఆ వ్యక్తి. ఆ ఆకారాన్ని, ఆ గొంతుకను విని ఉలిక్కిపడ్డాడు సుధాకర్. నల్లటి చాయ, బక్కచిక్కిన శరీరం, లోతు బుగ్గలు, మెల్లకన్ను, బిగించి కట్టిన ఉంగరాల జుట్టు…. కరణంగారి అమ్మాయి శ్యామల. “ఖర్మరా బాబూ!” అనుకున్నాడు సుధాకర్. ఇలాంటి పిల్ల కూడా ఫోటో తీయించుకుంటుందని అతని ఊహకి తట్టలేదు. “మాట్టాడరేమండీ….? నేను ఫోటోకి బావుండననేగా! అందరూ అందంగా ఉంటారా ఎంటీ? నాకెన్నాళ్ళబట్టో ఫోటో తీయించుకోవాలని ఉంది. ‘నీ ముఖానికి అదొకటే తక్కువ’ అంటుంది మా అమ్మ. ఏమండీ నేను బావుండనా?” అంది. వెలిసిపోయిన వాయిలు ఓణీ వేలుకు ముడిపెడుతూ, మెల్లకన్నుతోనూ, భయంకరమైన గొంతుతోనూ మాట్లాడే శ్యామలని చూసి దడుసుకున్నంత పనైంది సుధాకర్ కి. “అబ్బెబ్బే... అదేంలేదు... తప్పకుండా తీస్తాను” అన్నాడతను తడబడుతూ. “ఎప్పుడు తీస్తారూ?” అంది సాగదీస్తూ. “ఎప్పుడేమిటి? ఎప్పుడైనా తీద్దాం…రేపు…లేకపోతే…” ఎవరైనా తనను చూస్తారేమో, నవ్వుతారేమో అనిపించి తత్తరపడ్డాడు సుధాకర్. “అయితే ఎల్లుండి తీయండి. సాయంత్రం వస్తానేం…ఎల్లుండి మంచిరోజు. ఏం?” అని అంటూన్న శ్యామలని చూసి నవ్వాలో ఏడవాలో అర్థంకాక, “అలాగే… అలాగే…” అంటూండగా అతని అక్క లోపలికి వచ్చింది. ‘హమ్మయ్య’ అనుకున్నాడు. “ఏమిటే శ్యామలా ఇలా వచ్చావు?” అంది సుధాకర్ అక్క నవ్వుతూ. ఆ పిల్లని చూడగానే ఎవరికైనా నవ్వూ, వేళాకోళం అన్నీ అనిపిస్తాయి. “ఏంలేదు పిన్నిగారూ! మీ సుధాకర్ ఫొటో తీస్తాడేమోనని..” అంటూ ఆపకుండా ఏదేదో శ్యామల మాట్లాడుతుంటే అక్కడినుంచి సుధాకర్ మెల్లగా దాటుకున్నాడు. 
ఆ రాత్రి భోజనాల దగ్గర మెల్లగా , ” ఏమిటక్కయ్యా ! ఆ అమ్మాయి..?” అన్నాడు సుధాకర్. ఎంత మర్చిపోదామన్నా ఆ అమ్మాయే గుర్తుకొస్తోందతనికి. “అది ముదివయసులో పుట్టిన పిల్లరా! ఎదుగూ బొదుగూ లేదు. పైగా అనాకారి. పోనీ కాస్త శుభ్రంగా ఉంటుందా అంటే…. ఆ తల్లికే లేదు శ్రద్ధ! వచ్చిన కొత్త కోడల్ని చూసి మురిసిపోవడమే సరిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి అందరూ శుభ్రంగా తయారవుతారు కానీ ఈ పిల్లకి తలైనా దువ్వరు. పోనీ ఏ టానిక్కన్నా ఇవ్వరాదా వదినా అని చాలాసార్లు చెప్పేను. వినిపించుకోరు. ఆస్తి ఉందిగా చాలు అనుకుంటున్నారు. పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టుంటుంది. ఏం రాత రాసుందో ఆ పిల్లకి..” అంటూ అక్కయ్య చెప్పిన మాటలకి జాలేసింది సుధాకర్ కి. ఇక శ్యామల ఫోటో కోసం మావయ్య దగ్గరకొచ్చిందని తెలిసికొని అక్కయ్య పిల్లలు ఫకాల్న నవ్వేరు. “ఆ! దాని మొహానికి ఫొటో ఒకటే తక్కువ!” అంది అక్కయ్య కంచాలెత్తుతూ. 
మర్నాడు మామిడితోటలో సుధాకర్ని కలిసిన అనూ , “అయితే బావా! శ్యామల నిన్ను ఫోటో తియ్యమని అడిగిందా?” అంది నవ్వాపుకుంటూ. ఆమె వెనకాలున్న స్నేహ బృందం ఆశ్చర్యం ప్రకటించారు. అంతమంది ఆడపిల్లలు తనని అలా చూసేసరికి సుధాకర్ రెచ్చిపోయి, ఆ సంఘటనని వివరిస్తూ వాళ్ళని తెగ నవ్వించాడు. ఇంక అనూరాధ ఆ మర్నాడు శ్యామలని ప్రత్యేకంగా పిలిచి కూచోబెట్టి, “మా బావ నిన్ను ఫోటో తీస్తానన్నాడటగా…” అంటూ మొదలుపెట్టి, శ్యామలని వాగించి, వాగించి స్నేహితురాళ్ళతో కలిసి ఆనందించింది. ఆ తర్వాత తోటలో సుధాకర్ని కలిసి, “బావోయ్..! నీకో విషయం తెలుసా? నీకొక ఆరాధకురాలుంది ఈ ఊళ్ళో….” అంటూ ఫక్కుమని నవ్వింది. “ఎవరబ్బా..!” అని ఆలోచిస్తూ మెల్లగా ” నువ్వా?” అన్నాడు కొంటెగా సుధాకర్. “ఆశ..! నిన్నెవరు నమ్మార్లే? నవ్వులాట కాదు… నిజం! ఎవరో తెలుసా? ఊర్వశి శ్యామల!” అంది అనూ. ఉలిక్కిపడ్డాడు సుధాకర్. “అవును బావా! మేము నిన్ను గురించి ఉన్నవీ లేనివీ కల్పించి బాగా నమ్మేట్టు చెప్పేశాం. పిచ్చిది కదా..! నిజం అనుకుంది. ఇంక చూడు… నువ్వు రోజూ తననే చూస్తున్నావట! అసలు నువ్వే ఫోటో తీస్తాను శ్యామలా అని అడిగావట. తెగ చెప్పింది. నిజమా బావా?” అంది అనూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. “ఛా.. నోర్ముయ్. అసలు ఆ అమ్మాయితో నేను..” అని అతను అంటుండగా, “నాకు తెలుసులే బావా..నిన్ను ఆట పట్టిద్దామని అన్నాను. జరిగింది మాకు తెలుసుగా…దాని మాటలు వినివిని ఒళ్ళు మండి, పూజారిగారి రాధ– శ్యామల నిన్ను ఫోటో తీయమని అడిగిన ఫార్సంతా నువ్వు నిన్న వర్ణించిన భాషలోనే దానికి చెప్పాం. ఇంక చూడు….దాని నల్లటి మొహం మరీ మాడిపోయింది! అక్కడినుంచీ పారిపోయిందనుకో!” అంది అనూ.

విషయం విన్న సుధాకర్ మనస్సు ఎందుకో కలుక్కుమంది. ‘పాపం ఏమనుకుందో..? పిచ్చిపిల్ల! తన గొప్ప ఉందని తృప్తి పరచుకోడానికి ఊహించుకున్న ఊహాలన్నీ అమాయకంగా బయటికి చెప్పేసింది కాబోలు ‘ అనుకున్నాడు. “అసలా పిల్లకి ఎన్నెళ్లుంటాయి అనూ…? నాలుగడుగులు కూడా ఉండదు” అన్నాడు సుధాకర్. “నా వయసే బావా…పద్దెనిమిది సంవత్సరాలు” అంది అనూ.

తరువాత రోజు మధ్యాహ్నం భోజనం చేసి, ముందురోజు సగం చదివిన నవల తెచ్చుకుందామని సుధాకర్ మేడ మీదకు వెళ్ళేడు. అవతలి మేడమీద ఎర్రటి ఎండలో, గోడకానుకుని కూర్చుని మోకాళ్ళలో తల దాచుకుని ఏడుస్తోంది శ్యామల. ఆశ్చర్యపోయి , “శ్యామలా!” అని పిలిచాడతను. తలెత్తి చూసి, “మీరా..? పొండి! నాతో మాట్లాడకండి” అంది బెక్కుతూ. “ఏం.. ఎందుకని? ఏమైందీ?” మెల్లిగా అడిగాడు. అతనికి తెలియకుండానే అతని గొంతు మృదువుగా మారిపోయింది. కాసేపు బ్రతిమాలించుకుని అసలు విషయం చెప్పింది శ్యామల. “నిన్న అనూ, దాని స్నేహితురాళ్ళు నన్ను గుళ్ళో ఎలా ఏడిపించారో తెలుసా? మీరు నాగురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేరట కదా! నేను ఫొటో తీయించుకుంటానని దానికెందుకు చెప్పేరు? ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పాల్సింది. మా అమ్మ ‘ సిగ్గులేనిదానా….నీ మొహానికి ఫొటో ఒకటే తక్కువ. సిగ్గూ ఎగ్గూ లేకుండా పరాయి మొగాడ్ని అడుగుతావా?’ అని కొట్టింది. నేను ఫోటోకి అంత పనికిరాని దాన్నా?” అంటూ దుఃఖంతో అడుగుతున్న ఆ పిల్లని చూడగానే అతనికి ఆ అమ్మాయి అందవికారం కానీ, బొంగురుగొంతు కానీ కనపడలేదు. గుండె తరుక్కుపోయింది. వెంటనే” ఛీ! ఛీ.. అదేంలేదు శ్యామలా! అలా ఎవరన్నారు? ఇంకా ఇవాళ నువ్వు ఫోటో తీయించుకోడానికి రెడీ అవుతావనుకుంటున్నాను. వాళ్ల మొహం… వాళ్ల మాటలు పట్టించుకోకు. రేపు నీ ఫోటో చూడు…ఎంత బాగుంటుందో” అన్నాడు. శ్యామల నమ్మనట్టుగా తలెత్తి చూసింది. ” నిజం! సాయంత్రం మరి రెడీగా ఉంటావా? పోయి మొహం కడుక్కుని అన్నం తిను.. వెళ్లు” సుధాకర్ మళ్ళీ అన్నాడు అనునయంగా. మెల్లగా లేచి, పరికిణీతో ముఖం తుడుచుకుని వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయింది శ్యామల. ఆమె వెళ్ళిపోయాకా సుధాకర్ మేడదిగి వెళ్తూ , ” అక్కరలేని జంజాటం కానీ పెట్టుకోలేదు కదా” అనుకున్నాడు.
ఆ సాయంత్రం ” ఏవండోయ్..” అంటూ వచ్చింది శ్యామల. ఉలిక్కిపడి లేచాడు సుధాకర్. ” నేనేనండీ! మా ఇంట్లో అందరూ పనుల్లో ఉన్నారు. ఇక్కడ మీ అక్కా వాళ్ళూ మామయ్యగారింటికి వెళ్ళేరు. మరి నేను తయారవ్వనా? నా ఫోటో తీస్తారా?” అంది. ఆ గొంతులో ఆశ, ఆ వికృతమైన ఆకారం చూసి ఏమీ అనలేక “ఊ..” అని ‘ఖర్మరా బాబూ’ అనుకుంటూ కెమేరా తీసుకునిమేడెక్కాడు సుధాకర్. అంత ఖరీదైన కలర్ ఫిల్మ్ శ్యామల మీద దండగ చెయ్యడం అతనికి ఏమాత్రమూ ఇష్టం లేదు. ‘ ఊరికే క్లిక్ మనిపిస్తే సరి! నమ్మేస్తుంది…. పిచ్చిది’ అనుకున్నాడు. ఆ ఫోటో తీసేదాకా అనూ బృందం రాకుండా చూడమని దేముడ్ని ప్రార్థించాడు.
శ్యామల వచ్చింది. ఆమె అలంకరణని చూసి సుధాకర్ అవాక్కయ్యాడు.

ముదురు ఎరుపు రంగు పరికిణీ, కనకాంబరం రంగు ఓణీ, లూజుగా ఉన్న పట్టు జాకెట్టు…. వాళ్ళమ్మది కాబోలు! మెళ్ళో పిచ్చి నగలు, చేతికి నానా రంగుల గాజులు, ముఖానికి అరంగుళం ఎత్తున పౌడరు, కళ్ళు మూసుకుపోయేలా కాటుక. ఎర్రటి అమ్మవారి బొట్టు!” బావున్నానా అండీ?” అంటూ నవ్వేసరికి, సుధాకర్ కి కెమేరా కింద కొట్టి పారిపోవాలనిపించింది. “ఏం… మాట్లాడరేం?… బాగాలేనాండీ…ఫోటో తీయరా?” అంది జాలిగా, సుధాకర్ కి మధ్యాహ్నం ఏడుస్తున్న శ్యామల గుర్తుకొచ్చింది. సుధాకర్ అటూ ఇటూ చూశాడు. “నేనెవరికీ చెప్పను లెండి…ఒట్టు” ఆశగా అంటూన్న శ్యామల గొంతు వినగానే… ” ఛా..ఛా.. అదేంలేదు. అదిగో ఆ పిట్టగోడనానుకుని నించో..” అని తనకి తోచిన ఐడియా చెప్పి ఫోటో తీశాడు సుధాకర్. ఆ తర్వాత కెమేరాలో రీలు తిప్పుతున్న అతన్ని చూస్తూ…”ఏదండీ ఫొటో!” అంది ఆశగా.”ఇప్పుడే రాదు. మా ఊరు వెళ్ళేకా కడిగించి తరవాత పంపుతాలే. సరే.. నువ్వెళ్లు ఇంక..” అన్నాడు వెనక్కి తిరుగుతూ. అంతలో ” ఏమండీ…” అంది శ్యామల. అతను ఏమిటన్నట్టు వెనక్కి చూశాడు. ” అందర్నీ ఫొటో తీస్తారు…మీరు తీయించుకోరా? మీరు ఆ ఫోటోలో ఎంత అందంగా ఉంటారో తెలుసా!” ఆ మాటలకు అదిరిపోయాడు సుధాకర్. ఇంతవరకూ కెమేరా కొన్న తర్వాత ఫోటోలు తీయించుకునే వాళ్ళే కానీ, తన గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. ఏదో చెప్పాలనుకున్నాడు. ఇంతలో “శ్యామలా!” అని ఆమె తల్లి పిలవడంతో ఒక్కసారిగా పరుగెత్తింది. ఆమె పట్టీల చప్పుడు వింటూకాసేపు అలాగే నిలబడి, మెల్లగా కిందకు వచ్చేశాడు సుధాకర్. ఆ తరువాత రెండు రోజులు పోయాకా అక్కయ్య వాళ్ళతోటీ, అనూ వాళ్ళతోటీ కలిసి వనభోజనాలూ వగైరా చేస్తూ సరదాగా గడిపేకా, మూడో రోజు బండెక్కి స్టేషనుకి వెడుతున్న సుధాకర్ కి, కరణంగారి వాకిట్లో తారాడుతున్న శ్యామల నీడ స్పష్టంగా కనిపించింది!

సుధాకర్ బొంబాయి వెళ్ళి నెల రోజులు గడిచాయి. ఆరోజే ఫోటోలు ప్రింటయి వచ్చాయి. కవరు తీసి చూద్దామనుకుంటూ, ఆ రోజు వచ్చిన పోస్టు ముందు చూశాడు. అనూ దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది..విప్పి చదువుతున్నాడు. ” బావా! నీకీ సంగతి తెలిసిందా..?కరణంగారి శ్యామల చచ్చిపోయింది! ఏదో డిఫ్టీరియాట పాపం! ఇరవై నాలుగు గంటల్లో ప్రాణం పోయింది. అది పోయినందుకు వాళ్ళింట్లో ఎవరికీ విచారం లేదనుకో… అన్నట్టు పోయేముందు నన్ను పిలిచి, ” మీ బావను నా ఫొటో అడుగు” అని రాసి చూపించింది. 
దానికి నువ్వు ఫోటో తీశావా? మాకెవరికీ చెప్పలేదేం బావా? పాపం అమాయకురాలు…” ఇలా సాగిపోయింది ఆ ఉత్తరం. 
ఆ ఉత్తరం చూడగానే అతనికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఫొటోల కవరు విప్పి ఒక్కొక్కటీ చూడసాగాడు. చూస్తూ, శ్యామల ఫోటో దగ్గర ఆగిపోయాడు. చాలా క్లియర్ గా వచ్చింది ఆ ఫోటో. “ఏమండీ..నా ఫొటో బాగుందా?” అని ఎవరో అడిగినట్టు అనిపించిందతనికి. 
అలా ఆ ఫోటో చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు.

కొన్నాళ్ళు గడిచాయి. అది ఒక ఫోటో ఎగ్జిబిషన్! 

అక్కడ కొద్ది దూరంలో ఒక స్తంభానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి, అక్కడివాళ్ళ మాటలు వింటున్నాడు సుధాకర్. 
“ఇంత అందవికారమైన అమ్మాయి ఫోటోకి ప్రైజ్ ఎలా వచ్చిందా అని చూస్తున్నావా? 
ఆ ఫోటో పరిశీలించి చూడు. అందులో ఏం కనబడుతోంది?– లైఫ్…. జీవితం! 
జీవితం మీద ఆశ! 
ఆ అలంకరణ, ఆ శ్రద్ధ చూడు….అదొక విచిత్రమైన అనుభూతి. 
ఆ కళ్ళు…..ముఖ్యంగా ఆ కళ్ళు చూడు. ఎంత స్త్రీత్వం? 
వాటి నిండా ఎంత కోరిక? 
ఎంతో ఇష్టమైన వ్యక్తినెవర్నో ఎంత ఆరాధనతో చూస్తోందో చూడు ఆ పిల్ల! అందుకే అన్నారు ‘ కెమేరా ఐ’ అని”. అన్నాడు ఒకాయన. 
”అవును..జీవితంలో మామూలుగా ఉండే వాటిని కెమేరా అద్భుతంగా కనిపెడుతుంది. 
ఏం ఫోటో అండీ! ఊరికే ఇచ్చారుటండీ... బహుమతి?!” అంటూ రెండో అతను వ్యాఖ్యానించాడు, ఆ మాటలు వింటూ, తదేకంగా ఆ శ్యామల ఫోటో వంకే చూస్తూ ఉండిపోయాడు సుధాకర్.

-------------------------------------------------------

33. *అహంకారం*

 ‘అహంకారం పతనానికి మొదటి సోపానమని, చికిత్సకు లొంగని జబ్బని’  పెద్దలు చెప్పిన  మాటలు అమృత తుల్యమైనా  నిరహంకారులై చరిస్తున్న వారు  అత్యల్పం.
    అహంకారం మనిషి పతనానికి కారణ భూతమని పురాణాలు, ఇతిహాసాలు వివరించినట్టే  ప్రవర్తించిన వారున్నారు.  అహంకారులకు  ఈర్ష్య, అసూయ వంటి అదనపు దుర్లక్షణాలు తోడవుతాయి.  అలాంటి వ్యక్తిత్వం కలిగిన  దుర్యోధనుడు   పాండవులను మించిన సంపద, అధికారం పొందాలన్న  వాంఛలతో   అనైతికంగా ప్రవర్తించి  వినాశనం పొందినట్టు భారతం తెలిపింది. 

రావణుడికి తనంతటి శక్తిశాలి, శివభక్తుడు  లేరన్న గర్వం అధికం. తక్షణమే శివ దర్శనమివ్వలేదన్న ఆగ్రహంతో  కైలాసాన్ని కదిలించబోగా, ఒక వ్రేలుతో  కైలాసాన్ని పరమశివుడు తొక్కిపట్టేసరికి ముచ్చెమటలు పోసి,  ముల్లోకాలు దద్ధరిల్లేలా అరచి గర్వభంగం పొందిన రావణుడి చరితను  పురాణాలు వర్ణించాయి. 
అధికార, ఐశ్వర్యాలున్నాయన్న అహంకారంతో ఒకసారి సభ లోపలకు ప్రవేశిస్తున్న దేవగురువును ఎదురేగి ఆహ్వానించక, సింహాసనం నుండి లేవక అలక్ష్యం చేసాడు ఇంద్రుడు. స్వర్గాధిపతి ప్రవర్తనకు ఖిన్నుడైన  బృహస్పతి సభ నుండి  వెనుదిరిగాడు. ఇదే సరైన  తరుణమని దేవతలపై దండెత్తి దేవలోకాన్ని దానవులు  జయించినట్టు  భాగవతం తెలిపింది.  

భక్తులు అహంకారులైనప్పుడు దేవుడే కనువిప్పు కలిగించిన సంఘటనలు ఉన్నాయి. ఆకాశరాజు సోదరుడైన తొండమానుడికి తనంతటి విష్ణుభక్తుడు లేడన్న గర్వం ఆవహించగా కుమ్మరి భీముడి వద్దకు పంపి కనువిప్పు కలిగించిన  వేంకటేశ్వరుని కథను భవిష్యోత్తర పురాణం తెలిపింది.

 తపోశక్తిచే కొంగను నేలకూల్చిన  కౌశికుడిని ఆవరించిన అహంకారాన్ని పోగొట్టి,  ధర్మవ్యాధుడి వద్దకు శిష్యరికానికి  సాగనంపిన గృహిణి కథను, శత సహస్ర వర్షములు తపమాచరించి స్వర్గాన్ని చేరిన యయాతి అహంకారియై మహర్షుల తపస్సును కించపరచిన ఫలితంగా తపశ్శక్తి కోల్పోయిన ఘటనను మహాభారతం తెలిపింది.

        ​అహంకారం వలన  ప్రయోజనం పొందినట్టు విశ్వామిత్రుడి  చరిత్ర తెలుపుతుంది.   వశిష్ఠుడిని జయించాలన్న లక్ష్యంతో  తపస్వియై  బ్రహ్మర్షిగా ఎదిగి  సృష్టికి ప్రతిసృష్టి చేసినట్టు  పురాణాలు  తెలిపాయి. 

‘మనిషిని సర్వనాశనం చేసేది అహంకారమనీ,  దాన్ని వీడినప్పుడే  సద్బుద్ధిగలవారై   దైవకృపకు పాత్రులు కాగలరని”  కబీరుదాసు చెప్పినట్టు  మెలిగినప్పుడు  చుట్టూ ఉన్న ఆనందం  దర్శనమిస్తుంది. జీవితం  సుందరమయమై  అనుబంధాలతో అల్లుకుపోతుంది.  

 “నేను, నా అనే భావన సర్వజనులను, దేవుడిని దూరం చేస్తుందన్న” అబ్దుల్ కలాం మాటల్లోని సారాంశం గ్రహించి  వినయంతో ప్రవర్తించడం అలవరచుకోవాలి. నేటి తరంలో సర్దుకుపోయే  తత్త్వం  కొరవడుతోంది.  ఆవేశంతో కూడిన పరుష వాక్కుల ప్రభావంతో  ప్రశాంతతను కోల్పోతున్నారు. పరుల హృదయాలను కరిగించే మాటతీరుతో ఆకట్టుకుని జీవించడం అలవరచు కున్నప్పుడు జీవితం పూలబాటగా మారుతుంది.
[01/04, 11:49] Mallapragada Sridevi: బుద్ధుడు అనగానే శుద్ధోదనుడి కుమారుడైన సిద్ధార్థుడే మదిలో మెదులుతాడు. అయితే పురాణాల్లో దశావతారాల్లో ఒకటని చెప్పే బుద్ధుడి కథ ఉంది. శ్రీమహావిష్ణువు ఈ అవతారాన్ని ఎందుకు ధరించాడనే విషయానికి ఆసక్తికరమైన వివరణ ఉంది.
కుమారస్వామి చేతిలో తారకాసురుడు అంతమయ్యాక అతని కుమారులైన విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు దేవతలపై ప్రతీకారం పెంచుకున్నారు. ఘోర తపస్సు చేసి బ్రహ్మ వరం పొందారు. ఎవరూ ప్రవేశించలేని, దుర్బేధ్యమైన మూడు పట్టణాలు సొంతం చేసుకుని త్రిపురాసురులయ్యారు. బంగారు, వెండి, ఇనుము లోహాలతో నిర్మించిన ఆ పట్టణాల్లో నివసిస్తూ, కోరిన చోటికి సంచరిస్తూ లోకాలన్నింటినీ కకలావికలం చేశారు. దేవతలను చిత్రహింసలు పెట్టారు. నిరంతర యజ్ఞయాగాదులకు నిలయమైన ఆ పట్టణాల్లో ఉండగా త్రిపురాసులను సంహరించడం అసాధ్యమని భావించిన దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. అప్పుడు శ్రీమహావిష్ణువు యతీశ్వరుడి అవతారంలో త్రిపురాసురుల దగ్గరకు వెళ్లాడు. . ఆ రాక్షస సోదరులు ధర్మబ్రష్టులయ్యేలా బోధలు చేశాడు. వారి దృష్టిని ఏమార్చి, పట్టణాల నుంచి బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత శివుడు త్రిపురాసురులను సంహరించాడు
లోకాలకు అపకారం చేసే రాక్షస సంహారానికి శ్రీమన్నారాయణుడు ధర్మబౌద్ధగా వచ్చాడు కాబట్టి బుద్ధుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడంటారు. ఇదే విషయాన్ని ‘చపల చిత్తులూ, దైవం, ధర్మాలపై విశ్వాసం లేకుండా అనుచిత మార్గంలో ఉండేవాళ్లు, లోకుల ప్రాణాలు తీసేవాళ్లను దానవులంటారు. వీళ్ల కారణంగా లోకమంతా ఆధర్మమయంగా ఉంటుంది. ఆ దురాచారాలు అన్నింటినీ తుడిచిపెట్టి, బుద్ధావతారంలో విష్ణువు ఆ రాక్షుసులను తుదముట్టిస్తాడు’ అని శ్రీమద్భాగవతంలో పరీక్షిత్తుకు శుకమహర్షి వివరిస్తాడు.

((()))
34. . మద్రాసులో డాక్టరు గాలి బాల సుందరరావు గారని– ప్రముఖ నటులు, రంగస్థల పోషకులు, రచయిత ఒకాయన ఉండేవారు.

వైద్యులుగా కన్నా నాటక రంగంలో ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు. అదిగో….వారి కుమార్తె ఈ *లక్ష్మీ కామేశ్వరీ ‘జలంధర‘*. 

ప్రసిద్ధ నటులు చంద్రమోహన్ ఈమె భర్త. అలాగే తన సాహితీ సృజనతో ‘లత సాహిత్యం‘ అని ముద్ర వేయించుకున్న ప్రఖ్యాత రచయిత్రి తెన్నేటి హేమలత ఈమెకు అత్తయ్య అవుతుంది.

నిజజీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలను కథలుగా మలచి, తారసపడే వ్యక్తులను పాత్రలుగా చేసి ఈమె కథలు రాశారు. శ్రీమతి జలంధర తన రచనలకి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె నవల ” పున్నాగ పూలు“ మంచి గుర్తింపు పొందింది. ఇక కథల విషయానికి వస్తే , ‘ అగ్నిపుష్పం‘ , ‘ఉత్తరవాహిని‘ , ‘గడ్డిపూలు‘, ‘ ఎర్ర మందారాలు‘, ‘దీప కళిక‘ , ‘ నర్తకి‘ , ‘ మిథ్యాబింబాలు‘, ‘ నల్ల బట్టలు‘ మొదలైన అనేక కథలు రాశారు.

35.... తృప్తి లేని జీవితం కథ.                                                       


                   ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు. ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది. అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది. అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు.
కిందపడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది.

                         ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు. అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు. ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు. ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు. అక్కడి హుండీలో ఓ పదిరూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు. సంతోషంతో ఇంటికి చేరాడు. పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి. ఆ దార్లో కాస్సేపటికి ఒకడు వచ్చాడు. అతను ఆ నోట్లకట్ట తీసుకున్నాడు. వెంటనే లెక్కపెట్టాడు. వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ లెక్కించాడు. ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి.

                       బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు. కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు. చాలాసేపు వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. అయినా వెతుకులాట మానలేదు.

ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమనగా... 
ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్‌ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు. కాఫీ తాగాడు. కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలుపెట్డాడు. మనలో చాలా మంది ఈ తరహానే. లభించిన దానినో ఉన్నదానినో అనుభవించరు. దాంతో తృప్తిపడరు. లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటారు. ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు. దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు.

--((***))--

No comments:

Post a Comment