Wednesday 15 July 2020




 1 " మంత్ర ద్రష్ట " రెండవ తరంగము
రెండవ తరంగం.... 

     కౌశిక మహారాజు ,  ఆశ్రమములో బ్రహ్మర్షి చేత సన్మానించబడి  , సంతోషము , ఆశ్చర్యమూ , సంభ్రమము నిండిపోగా ,  తన శిబిరము లో కూర్చున్నాడు. 

     తాను పొందిన సత్కారము , తన ఊహ కందనంత గొప్పగా ఉంది. అటువంటి సత్కారము చేయడం  తనవంటి మహా రాజుకైనా సాధ్యమా అన్నట్లుంది. రాజు మొదలుకొని , సేవకుని  వరకు , ఏనుగు మొదలు ఎలుక వరకూ , అందరికీ , అన్నిటికీ సత్కారము లభించినది. నిజముగా ఇది సత్కారము అనడం కన్నా , సమారాధన అనుట సరైంది.  

     కౌశికుడు ఈ విధమైన ఆలోచనలోపడెను , " ఇతడు కులపతి అనునది నిజము , అయినా , ధర్మ పరాయణుడైన ఇతని వద్ద ఒక సంవత్సర కాలానికి సరిపడినన్ని సంభారములు , దినుసులు , సరకులు ఉండ వచ్చును. ఈ ఒక్క దినపు సత్కారాలకు ఖర్చు  అయిన ద్రవ్య సంభారాలను చూడగా , అవి యీ ఆశ్రమానికి కనీసము అయిదు సంవత్సరాలకు సరిపోవు లాగున్నాయి. నేను సపరివార సమేతముగా వచ్చి ఇతనికి అదేమి అసౌకర్యము కలిగించానో  ?  నావల్ల ఇబ్బంది కలిగిందో ఏమో ? ఈ వస్తు సామగ్రి అంతా ఇప్పటికిప్పుడు ఎలా వచ్చెనో , ఘటికుడే . లేక , ఈ బ్రహ్మర్షి దేవలోకము నుండీ యేదయిననూ తెప్పించుకొన్నాడా ? .... ఉన్నారులే  , యీతనికి శిష్యులగు రాజులు చాలా మందే ఉన్నారు. , ఇతని కోసము తమ సర్వస్వమునూ అర్పించు వారు అనేకులున్నారు , అయినా , ఇంత వేగముగా ఇన్ని సంభారములను సంపాదించుట ఎలా  ?  " యని దీర్ఘముగా ఆలోచనలో పడెను. 

     ’ ఇదంతా ఏదయినా మాయా సృష్టి కావచ్చు , నేను చూచినదంతా ఒక స్వప్నము కావచ్చు.." అని కూడా అనిపిస్తున్నది. తాను నిలచిన ఈ పర్ణ కుటీరము నిజముగా రాజ యోగ్యమైనది. తాను సేవించిన అమృతాన్నము ఇంకా కడుపు లో  బరువుగా ఉన్నది. మరి ఇది కల ఎలా అవుతుంది ?  

     కౌశికుడు పంపిన  దూత సమాచారముతో వచ్చాడని పరిచారకుడు వచ్చి తెలిపాడు. దూతని రమ్మని సైగ చేసి , రాజు వినసాగెను , దూత ఇట్లు చెప్పెను , " మహా రాజా , ఆశ్రమములో ’ నందిని ’ ధేనువు  ఉంది. అది కామధేనువు ’ సురభి’  కూతురు.  ఆ ఆవుకు , తన తల్లికున్నట్టే  , గొప్ప మహిమలున్నాయి . గురుదేవుల హోమధేనువు అదే . ఈ రోజు అతిథిపూజ అంతా దాని మహిమవల్లనే నడచింది. ఇటువంటి సమారాధనలు అప్పుడప్పుడు యీ ఆశ్రమములో నడచుట మామూలే ! . కానీ ఈసారి జరిగినంత వైభవముగా ముందెప్పుడూ జరగలేదు..." 

     రాజు ఈ మాటలు ఒళ్ళంతా చెవులు చేసుకొని వినెను. " ఒక్క గోవు. ఆ గోవు ప్రభావము ఇంత గొప్పదా... ఆ గోవు , కామధేనువు కూతురు... మహిమలున్న ఆమె వలన యింత అతిథిపూజ సాధ్యము...వశిష్ఠుని రహస్యము ఇదా ..! ఎవరెన్ని కానుకలు తెచ్చి ఇచ్చినా , వశిష్ఠుడు వాటిపై ఆశ పడక వద్దనుటకు ఇదా కారణము..? " 

     మంచిది  , సామ్రాట్టులకు కూడా సాధ్యము కాని కార్యము చేయగల సమర్థుడితడు. ఈ ధేనువును ఇక్కడ ఉంచుకొని ఈ మహర్షి చేయగలిగినదేముంది ? ఇటువంటి రత్నము సామ్రాజ్య అధిపతుల దగ్గర ఉండవలసినదే కానీ ,  దొరికిన దానితో పొట్ట పోసుకుని తృప్తిచెందు వారితో నిండిన ఈ ఆశ్రమములో ఉండుటేమిటి ? కానీ అలాగని చెప్పి దీనిని నేను తీసుకొనుట బాగుండదు కదా ...దీనిని తీసుకొనడము ఎలా ? 

     ధర్మ నిరతుడైన  తపస్వి యొక్క ఆశ్రమము లోనిదంతా దేవతల కోసము. . రాజుకు దేవతల సొమ్ము  పై అధికారము ఉందా ? మరి , రాజ్యమంతా రాజుదే కదా  , అప్పుడు  రాజ్యము లోనిదంతా రాజుదే అన్నప్పుడు , ఆ రాజ్యములోదే కొంత ఇవతలికి  తీసి , ఇది దేవతల సొమ్ము అంటే  ఏమైనా బాగుందా ? రాజు తనకు తానుగా దానిని వద్దనుకుంటేనే కదా , అది ఆశ్రమమునకు చెందునది ?  వద్దన్నవాడు , అవసరమైనపుడు కావాలనుకుంటే తప్పేమున్నది ?  "
     " ఈ ధేనువు ఎప్పటికీ రాజు వద్ద ఉండవలసినదే. . ఇది కానుకగా గానీ , ధనము ఇచ్చి గానీ , లేదా , బలవంతానైన గానీ రాజ భవనమునకు రావలసినదే. ...."

     " అట్లని , దేవతల సొమ్మును లాక్కొన వచ్చునా ? అదీ , వశిష్ఠుల వంటి బ్రహ్మర్షి అధీనములో ఉన్నదానిని ?  ఇది ఎంతమాత్రమూ తగని పని. దేవతల సొమ్మును తీసుకుంటే , అగ్నిని తీసుకొని ఒడిలో కట్టుకున్నట్లే... జీర్ణమవడము  అసాధ్యము. ఇది పథ్యమైనది కూడా కాదు...ఎంతమాత్రమూ వద్దు. "

     " కానీ , అలా కాదు , దీనిలో లాక్కొనుట  యేముంది ? లోకమంతా దైవాధీనములో యున్నది. ఆ దేవతలదరూ రాజులోనే ఉన్నారు. రాజ దండనము వల్లనే కదా అంతా సరిగ్గా నడచునది. సమాజములో పెద్ద చేప , చిన్న చేపను  మింగకుండా కాపాడు రాజుకు అందరూ ఋణగ్రస్తులే . బ్రాహ్మణుడైనా , బ్రహ్మజ్ఞుడైనా తన తపస్సులో ఒక భాగమును రాజుకు కప్పము కట్టువాడే కదా ? మరి , ఆ శుల్కానికి  బదులుగా యీ ధేనువు వచ్చిన తప్పేమి ? అలా కాదన్న , తనకు ఇష్టము వచ్చిన మరి దేనినైననూ తీసుకొని , యీ ధేనువు ఇవ్వవలెను. అదీ కాదంటే , రాజు దైవాంశ సంభూతుడు కాబట్టి , యీ దేవ ధేనువు రాజుకు చెందాలి. ఏవిధముగా చూచినా ఇది లాగుకొనుట కాబోదు. " 

     " నిజము , రాజైనవాడు భౌతిక సుఖమునిచ్చు దేనినీ  వదల రాదు. రాజు యొక్క లక్ష్యము సమృద్ధి ,అంతే కానీ  త్యాగము కాదు. తనకున్న సర్వ సామర్థ్యమునూ ఉపయోగించి సమృద్ధిని గడించాలి . పారుతున్న నీటికి ఆనకట్ట కట్టి ఉపయోగించు కొన్నట్లే , పెరిగి నిలుచున్న అడవిని వంట చెరకు , సమిధలకై  ఉపయోగించుకొన్నట్లే , లోకములో ఉన్న పనికి వచ్చు అన్ని వస్తువులను సమృద్ధి కోసము ఉపయోగించుకొనుట రాజ ధర్మము. దొరికిన దానిని ఏవో కుంటి సాకులు చెప్పి వదలిన , అది దుర్బలత్వమే. " 
" అవును , ఇదే నిజము. సంగ్రహించ వలసిన వస్తువును సంగ్రహించ కుండా వదలితే , లోకమును పాలించుట ఎలాగ ? కాబట్టి , ఇది నా కర్తవ్యము. " 

     రాజర్షికి తన సిద్ధాంతము సరైనదేనా అని ఇంకా  అనుమానము. అయినా, రాజ సహజమైన పౌరుషముతో , సిద్దాంతము సరియైనదే అని తీర్మానించుకున్నాడు. మనస్సు  ఒక పని చేసి తీరాలన్నపుడు  , బుద్ధి ఎక్కడైనా మంచి చెడు విశ్లేషణ చేస్తుందా ?  వివేకముతో ఆలోచించే అవకాశము ఎక్కడుంది ? లేడికి లేచిందే పరుగు కదా ! 
రాజదూతకు ఆజ్ఞ అయినది , " భగవానుల కెపుడు అనుకూలమో , తెలుసుకొని రా ! "

     రాజదూత వాయువేగముతో పరుగెత్తి వెళ్ళి , సమాధానము తెచ్చాడు. " గురు దేవుల అనుజ్ఞ అయినది , ఇప్పుడు  సంధ్యాకాలము సమీపిస్తున్నది. తమోగుణ వేళ. సంధ్య ముగిసిన తర్వాత అయితే మంచిది. కానీ , ఈ క్షణమే రావలసినదిగా రాజు అభిప్రాయమైతే , వారి ఆజ్ఞ నేను ఎప్పుడూ గౌరవిస్తాను. . " 

     రాజు తల ఊపెను. " ఔను , పాలించు రాజు లేకుంటే , అందరూ పాలకులే.  అందరూ రాజుకు తల వంచవలసిన వారే.. అన్ని తేజస్సులూ రాజు తేజస్సు ముందు యొక ఘడియ యైనా కళ తప్పవలసినదే. తమోగుణ వేళ అన్నారు కదా , చూద్దాము ,  అది మమ్మల్ని  ఏమి చేయగలదు ?  ఆయనేమో  ,  బ్రహ్మర్షియై , తపస్వులలో శ్రేష్ఠుడై , బ్రహ్మ విద్య తెలిసిన వాడై గుణాతీతుడైన బ్రాహ్మణుడు. అంతటి వాడైననూ రాజును తిరస్కరించు వాడు కాదు. ఇంతటి ఆతిథ్యము ఇచ్చి మమ్మల్ని గౌరవించినవాడు . ఇక  మేమా ,  అన్ని విధాలా , అతనిలో ఉన్న ఆశ్రమోచితమైన వినయమును వదలక ఎప్పుడూ ఇలాగే నడచుకోవలెనన్న కోరిక గలవారము. ఒకరు సర్వతేజో మయుడైన రాజు , ఇంకొకరు సర్వ దేవతా మయుడైన బ్రాహ్మణుడు. ఈ ఇద్దరి మధ్య కాలమునకు పనియేమి ? అని నిర్ణయించుకుని ,

      " మేము ఇప్పుడే వచ్చెదమని బ్రహ్మర్షి సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేయి " . అని దూతను పంపించి , తాను ఆతని వెనకే కొద్ది పరివారముతో పాద చారియై , వశిష్ఠుల పర్ణశాలవైపు బయలుదేరెను. 

     రాజు కొంత దూరము పోవునంతలోనే , సమారాధనము లోని విశేష భోజనానికై వచ్చిన గ్రద్ద ఒకటి , తన విశాలమైన రెక్కలు విప్పి ,  పైకి లేచి  ఎగిరి పోయి , ఫల భారముతో వంగిన ఒక చెట్టుకొమ్మ పై కూర్చుంది.. దాని బరువు తాళలేకో , మరి యెందుకో , ఆ కొమ్మ విరిగి పడిపోయింది. . ఇదేమిటి ? నేను బయలుదేరడము , అప్పుడే  గ్రద్ధ ఇలా వాలడము , కొమ్మ విరిగిపోవడము మంచిదేనా , శుభ సూచకమేనా అని ఒక్క క్షణము ఆలోచించెను. కానీ వెంటనే ,కార్య సాధకులగు క్షత్రియులు ఇటువంటి వాటిని లెక్క చేయరాదు అని ముందుకు సాగెను. 

సశేషము
విభాతమిత్ర


2. అశ్వత్థామతో నా అనుభవాలు  .... 9 

---పైలట్ బాబా

ఉన్నత హిమ శిఖరాలలో ఈనాటికీ, వేలాది సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్న మహాత్ములున్నారు. నా సంచారంలో ఇలాంటి వారిని  , చాలా మందిని కలిసాను. వారితో కొంత కాలం ఉండి, వారి జ్ఞానం ద్వారా ప్రయోజనం పొందాను.....అలా "అశ్వత్థామ దర్శనం" ....అందులో భాగమే.


   ఒక సారి నేను "పహాడీ బాబాతో" కలసి, నర్మదా తీరంలో నడుస్తున్నాను. మేమిద్దరం అలా, వెళ్ళి వెళ్ళి ఒక అడవిలో ప్రవేశించాం. ఆ అడవిలో "భిల్లులనే" ఆటవిక జాతి నివాసముంటోంది. దారి దోపిడీలు చేయడం వారికి కూసు విద్య. అడవి గుండా వెళ్ళే యాత్రికులను దోచుకోవడం, వారికి ఆనవాయితీ.


     బంజారా జాతి వారిని మాత్రం వారు బాధించరు. మేము, కేవలం లంగోటాలు మాత్రమే ధరించి, అడవి గుండా పోతుంటే....ఆ ఆటవికులు, మమ్మల్ని చూసి వింత ధ్వనులు చేయసాగారు. కొద్ది సేపటి తరువాత, ఆ భిల్లులు మమ్ములను చుట్టు ముట్టారు. మా వద్ద ఉన్న మూటల్లో....వేపాకులు, విభూతి తప్ప, మరేమీ లేవు. ఆ భిల్లులు ఆ మూటలను లాక్కుని తెరచి చూసి నిర్ఘాంతపోయారు. వారిలో వారు ఏవో సైగలు చేసుకొని, మమ్మల్ని వెంట రమ్మన్నారు. కొంచెం సేపట్లో, మమ్మల్ని వారి ప్రధాన గుడిసె లోకి తీసుకొని వెళ్ళి, చాపల మీద కూర్చోమని చెప్పి, అగ్నిహోత్రం వెలిగించారు. రొట్టెలు చేసి తేనెతో వడ్డించారు. గడ్డితో చేసిన ఆ రొట్టెలు, తేనెతో మేమునూ తిని, వారికి కొన్ని పెట్టాం. మాకోసం వారు ఒక ప్రత్యేక కుటీరాన్ని కేటాయించారు. పండ్లు, దుంపలు కూడా సేకరించి మాకిచ్చారు. అలా వారు మమ్మల్ని భక్తితో సేవించారు. 

ఆ ఆటవికులకు, తమదైన క్రమ శిక్షణ కలదు. జాతి నాయకుడి మాట వారికి శిరోధార్యం. అతనికి ఎప్పుడూ ఎదురుతిరగరు.  శివుడు వారి కుల దేవత. ప్రొద్దున్న, సాయంత్రం...మా వద్దకు వచ్చి కూర్చొనే వారు.


    ఒక్కోసారి రాత్రంతా, సంగీత-నాట్యాలతో గడిపే వారు. వారిలో కొందరు దొంగిలించిన దుస్తులు వేసుకొనేవారు. కొంత మంది చెట్ల పట్టాలు ధరించేవారు. ఈ భిల్లులనే ఆటవికులతో, ఒక మనిషి వస్తూండే వాడు, మేమున్న కుటీరానికి. ఆ వచ్చే మనిషి ప్రత్యేకించి కాషాయ దుస్తులు ధరించి, వారి కంటే భిన్నంగా, హుందాగా ఉండేవాడు. అతనితో మేము మాట కలపడానికి ప్రయత్నించినపుడల్లా, మాటలాడకుండా వెళిపోయేవాడు.


     ఒకనాడు, మేము ఆ ప్రాంతంలోని మహాదేవుని మందిరంలో విశ్రాంతి తీసుకొనుచుండగా,  ఆ అసాధారణ వ్యక్తితో మనస్సు,చూపు కలిసాయి. అతను ఆజానుబాహుడు. యువకుడులా ఉన్నాడు. అతనికి చక్కని మీసకట్టు ఉన్నది. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. శాంతం,సౌమ్యం, ధీర-గంభీర వ్యక్తిత్వం అతని స్వంతం. అతను నొసటికి పసుపు రంగు గుడ్డను కట్టుకొని ఉన్నాడు. నేను పహాడీ బాబాతో అతని గురించి, అతని ఆహార్యాన్ని గురించి, అతని వ్యక్తిత్వాన్ని గురించి మాటలాడుతుంటే, అతను మా వైపు అర్థవంతంగా చూసి, చిరునవ్వు నవ్వి అక్కడ నుండి వెళిపోయాడు.

   కుతూహలం ఆపుకోలేక మేము అతనిని వెంబడించాను. అతను, నన్ను వెంబడించవద్దని వేడుకొన్నాడు. అయిననూ మేము మా పట్టుదల విడిచి పెట్టకుండా, అతనికి పాద నమస్కారం చేసి ఇలా ప్రార్థించాను. " మీరెవరైనా కానీ, మీ పూర్తి పరిచయ భాగ్యం మాకు కావాలి, మీ మార్గదర్శకత్వం మాకు కావాలి, మీ ఉన్నత-గహన-గంభీర రూపం చూస్తుంటే, మీరు ఈనాటి పురుషులు కాదనిపిస్తోంది. దయచేసి మీ పరిచయ భాగ్యాన్ని మాకు ప్రసాదించండి.

   నేనిలా ప్రవర్తించడం, ఈ ఆటవికులకు నచ్చలేదు. ఆ రహస్య వ్యక్తి వాళ్ళకు అత్యంత పూజనీయుడు. మహా శివరాత్రి నాడు శివునితో పాటు, ఆ విచిత్ర వ్యక్తిని కూడా పూజిస్తారు.


    ఆ మహావ్యక్తి భిల్లులను శాంతించమని చెప్పి, నన్ను ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు. "కపిల్ ! నేను ద్రోణాచార్యుని పుత్రుడైన "అశ్వత్థామను". మహాభారత కాలంలో సేనాపతిని. అయితే, అదంతా గతం.  అయినా నన్ను గత జ్ఞాపకాలు విడవడం లేదు. భిల్లుల నివాస ప్రాంతంలోని, ఈ దేవాలయమే నా నివాసం. ఈ భిల్లులు నా సహచరులు. నేను ఎప్పుడో ఒకసారి, హిమాలయాలకు వెళ్ళి కృపాచార్యుడిని, విధురుడిని కలుస్తూంటాను. ఎక్కువ భాగం ఇక్కడే ఈ ఆదిమ వాసుల జీవితంలో పాలు పంచుకుంటాను. కపిల్, మాకైతే కాలం నిలిచిపోయింది. కృపాచార్యుల వారు, విధురుల వారు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూంటారు. అప్పుడిది ఒక హిమాలయమే అవుతుంది.


  ... గోరఖ్ నాథ్ జీ ఎప్పుడన్నా కలుస్తూ ఉంటారు. ఆయన దర్శనం , ఆశీర్వాదంతో సమానం. ఆయనతో కలసినపుడు, ప్రాచీన బ్రహ్మాండాన్ని తలచుకొని, జీవులెలా జనన-మరణ చక్రంలో తిరుగుతుండేది, గమనిస్తాం. మాకు భూత, భవిష్య, వర్తమానాలు తెలుసు. అయినా ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మేము ఇదివరకటిలా ఇప్పుడు లేము.

      అశ్వత్థామ, తన తలకట్టు తీసివేయగా...వంకులు తిరిగిన ఆయన జుట్టు, ఆయన నొసటి పైకి జారింది. ఆయన విశాల ఫాల భాగం మధ్యలో , లోతైన గాయపు గుర్తు ఉన్నది. ఆ గాయపు రంధ్రంలోంచి వింత కాంతి వస్తోంది. "నా నొసటి పై గల ఈ మణి, పోవడం వలనే...నా యుద్ధపు టెత్తుగడలు, దైవీ శక్తి అంతమొందాయి. అన్ని శక్తులు నన్ను వదలివేశాయి. అందుచే, ప్రతిఫలంగా...."చిరంజీవత్వం" అనే వరం లభించింది. ఆనాటి నుండి కూడా నేను ఈ భూమి మీద జీవిస్తున్నాను. నా సమకాలికులు జంతువులుగా, పక్షులుగా, పాములుగా....జన్మ ఎత్తడం చూసి, మానవుని నిస్సహాయతను గుర్తించి బాధ పడుతున్నాను. నేనైతే ఈ జనన-మరణ చక్రంలో బంధితుడిని కావడం ఇష్టం లేదు. నేను పూర్తిగా శివారాధనలో మునిగిపోయాను.

     ఇలా అశ్వత్థామ సాహచర్యంలో, ఆరు మాసాలు గడిపాము. వేల సంవత్సరాల వయస్సున్న మనిషి, ప్రస్తుతం తానున్న సమాజ విధానాల వలన ప్రభావితుడు కాకుండా ఉండగలడో, ఎలా జీవించగలడో అర్థం చేసుకున్నాను........


పైలట్ బాబా అనుభవాలు

3. ఓం నమః శివాయ:   ---- 8
“జగద్గురు బోధలు”
శ్రీ కంచి పరమాచార్య వైభవం

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం|
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం||


వేదవిహితధర్మమే శ్రేయఃప్రాప్తిహేతువు

ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మ ద్వైతవాసనా,
దుర్లభం త్రయ మేవైతత్ దైవాను గ్రహహేతుకమ్ ||
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః,
స్వవర్ణా శ్రమధర్మేణ తపసా హరితోషణాత్ ||
జ్ఞానముత్పద్యతే పుంసాంవైరాగ్యాది చతుష్టయం,
తథాప్యనుగ్రహాదేవ తరుణేందు శిఖామణేః |
అద్వైతవాసనా పుంసా మావిర్భవతి నాన్యథా||


మనుష్యత్వమూ, ముముక్షుత్వమూ, మహాపురుషుల సంశ్రయమూ యీ మూడూ దుర్లభములు, దైవానుగ్రహమే వీటికి హేతువు పరుషుల స్వవర్ణాశ్రమధర్మాల నాచరించడం వల్లా, తపోనిష్ఠచేతా, పరమేశ్వరుని ప్రీతుని చేయడంవల్లనూ, ఇహాముత్రఫలభోగ విరాగరూపమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు.


''తరుణేందు శేఖరుడైన స్వామి అనుగ్రహం లేకుంటే అద్వైతవాసన పట్టుబడుదు.''
ఈశ్వరానుగ్రహంవల్లనే పురుషునకు పరమశ్రేయం దొరుకుతుందనియీవిధంగా ఆచార్యపురుషుల ఉపదేశములు, ఆప్తవాక్యములు భోధిస్తున్నవి. కనుక మనమందరం ఆ ఈశ్వరానుగ్రహంకోసం తీవ్రమైన యత్నం చేయవలసివుంది. సకల శ్రేయఃప్రాప్తికి ఆ యనుగ్రహమే కారణం. ఈశ్వరుడు మనకిచ్చిన ఆయుస్సంతటిని తదనుగ్రహ సంపాదనకోసమేవ్యయిస్తే సార్ధకమవుతుంది. ఇతర విధాల గడపిన ఆయువంతా వ్యర్థమే అవుతుంది.


కాబట్టి, నీబ్రతుకు ఫలవంతం కావాలంటే స్వామిఅనుగ్రహంమీదనే దృష్టిని నిలిపివుంచు. ఈశ్వరానుగ్రహ సంపాదనాన్ని ఏమరి ఒక్కక్షణం గడపినా నీ బ్రతుకంతా నిరర్ధకమైవూరుకుంటుంది. మావనులందరు ఈశ్వరభక్తియం దోలలాడ వలెననీ, ఈశ్వరానుగ్రహం అందరిమీదా ప్రసరింపచేయవలెననీ సర్వదా స్వామి చరణకమల సన్నిధిని చేరి వేడుకో. ప్రతి మానవునియందు ఈశ్వరపదార్థం ఉండనేవుంది. కనుక భక్తులైనవారు సకలమానవులను ఒక్కరీతిగానే భావించవలసివుంటుంది.


శ్రీ కామకోటిపీఠాన్ని ఏబదేండ్లుగా మేము సేవించితిమి. ఈ ఏబదేండ్లలో మేము చేసిన కార్యములను సింహావలోకనం చేయడంవల్ల అంతగా ప్రయోజనంలేదు. ఇకముందు కూడా పరమేశ్వరుడు మాకు ఏ కొంచెమో ఆయువు అనుగ్రహిస్తే దాని నెలా వినియోగించాలి? మాకు కర్తవ్యమేమిటి? అని విచారించుకోగా, నైష్కర్మ్య సంపాదనమే కర్తవ్యమని తేలుతున్నది. మరి భగవంతుడు గీతాశాస్త్రంలో నైష్కర్మ్యమంటే చేతులు ముడుచుకొని కూరుచుండటం కాదని పదేపదే సెలవిస్తూవచ్చారు. మీదుమక్కిలి కర్మాచరణంవల్లనే నైష్కర్మ్యం సిద్ధిస్తుందన్నారు. ఆకర్మ ఎంత తీవ్రమైనదో! ఏకర్మను ఆచరించడంవల్ల నైష్కర్మ్యసిద్ధి కలుగుతుందో? అని విచారించగా భగవత్పాదుల ఆజ్ఞయే గుర్తుకువస్తుంది. అందరికీ ఉపదేశిస్తున్న ఆయాజ్ఞనే మేమూ స్మరిస్తున్నాము. ''కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్యవిధియతా మపచితిః'' 'నీవంతుకు వచ్చిన కర్మను లెస్సగా ఆచరించు. అదే ఈశ్వరునకుతుష్టికూరుస్తుంది, అనేదే ఆ యాజ్ఞ.


కాబట్టి ఎవరివంతుకు వచ్చినపని వారువారు లెస్సగా ఆచరించాలి. స్వస్వకర్మాను ష్ఠానమును మించిన ఈశ్వరపూజా, ఈశ్వరారాధనమూ లేదు. భగవదనుగ్రహ సంపాదన కదే మార్గము. ఎవరివంతునకువచ్చిన కర్మలనువారువారు అనుష్ఠించుతూ తద్వారా ఈశ్వరార్చనపరులమై శ్రేయమును సంపాదించు కొందాము.


ఇతరులకు, మనకుకూడా శ్రేయంగూర్చే కర్మలనాచరించుట వల్లనే జన్మము చరితార్ధమగును. కడచిన ఏబదేండ్లలో మేము చేసిన పనులను అందలి లోపములను ఒకతూరి వెనుకకు పారజూచుకొన్నచో అది భావిజీవితానికి మార్గదర్శకం కాగలదు. కడచిపోయినదానిని గూర్చి వ్యర్ధముగా చింతించుచు గూర్చుండుటకంటె పాపపుణ్య వివేచనం చేసుకోగలిగితే అది దోషములనుండి కాపాడుతుంది.


ఏపనియైనా ఇతరులను కూడగట్టుకొని చేస్తే ఫలప్రదమవుతుంది. అలా యితరుల సహాయముతో మే మీ చరమ జీవితమున ఏమి చేయవలసిఉంటుందో ఆలోచించుకోవాలి. లోకంలో ఎవ్వరికీ దుఃఖము, లోపము లేకుండా అందరూ సుఖం పొందవలెననే విషయం సకల దేశాలవారు, సమస్త మతములవారు అంగీకరించి, అందుకై ఎంతో కృషిచేస్తున్నారు. బహుజనులకు అత్యధికసుఖం చేకూర్చడమే మాకు ధ్యేయమని అన్ని పార్టీలవారూ చెబుతున్నారు.


వేదవిహితమైన ధర్మాచరణంవల్లనే బహుజనులకు సుఖం లభిస్తుందని కనిపిస్తున్నది. శ్రేయఃప్రాప్తికి వేదవిహిత ధర్మమొక్కటే మార్గము.


ఎందరో మహనీయులు శ్రేయఃప్రాప్తికి మార్గములు చెప్పియున్నారుకదా! అట్టి వారిని కాదని, ఒక్క వైదికధర్మమునే ఎందుకు ఆశ్రయించాలి అని కొందరు ఆక్షేపించవచ్చును. ఇందుల కొక్కటే సమాధానము. ఇతర మత కర్తలు చెప్పిన ధర్మాలన్నీ వేదములందే పరిశీలించిచూస్తేకనిపించుతవి. ఇతర ధర్మగ్రంధములన్నీ వేదములకు పిమ్మటనేపుట్టినట్లు చరిత్రవల్ల ఏర్పడుతున్నది. వేదములు చెప్పని ధర్మమూసత్యమూ అంటూలేదు. వేదము లెప్పుడు పుట్టినవో మనము నిర్ణయింపలేము. వేదకాల నిర్ణయము చేయబూనడం నష్టజాతకాన్ని గణించడంవంటిది.


ఉదారము, నిర్మలమునైన మన వైదికధర్మమును అనుసరించకపోవడంవల్లనే మన మతము దుర్బలమై మనము కష్టనష్టముల పాలగుట తటస్థించినది. వైదిక ధర్మము తదనుయాయులను పరిశుద్ధులనుచేసి, ఈశ్వరానుగ్రహపాత్రులను గావింపగలదనీ, ఇతరమతములు పుట్టకమున్నే వైదికధర్మం లోకమంతటికీ మేలుగూర్చే మార్గం ఉపదేశించిందనీ మనం గ్రహించి ఇతరులకు తెలియచెప్పవలసివుంది.



 వేదములయం దేమాత్రమోభక్తిగల మన కందరకు ఇది విహితమైన పని. సమస్తమునకు మూలకందమైన వేదముల నాశ్రయించినచో శాఖలయందు వినవచ్చే భేదమర్మములన్నీ సమసిపోగలవు. వైదిక ధర్మావలంబులు ఇతరమతస్థులను రండని చేరబిలుచుట మన పనికాదు. అనాదియైన వేదమే సకల శ్రేయములకు మూలమని మనము గ్రహించినచో చాలును. ఇంతకంటే మనకిపుడు పరమధర్మము లేదు.


లోకమున భిన్న మతయలకు విరోధములు కొరగావని వేదము చెపుతూవుంది. ఎవరేమార్గ మనుసరించినను అందరు ఏకగమ్యమునేచేరుదురని వేదమొక్కటే చెప్పుచున్నది. ఇతర మతములు తమమార్గమేసత్యమని, తక్కినవినరకహేతువులనీ చెప్పుచున్నవి. ఒక గమ్యమునకే పెక్కుమార్గములున్నవని వేదముతప్ప ఇతరమతము లంగీకరింపవు. ఈ పరమార్ధమును గ్రహించు భారముమనపై నున్నది. కాని వేదవిహితానుష్ఠానముపై శ్రధ్ధలేక ధర్మాచరణమున ఇతర మతస్థులకంటె వెనుక బడియున్నచో యీ పరమార్ధమునుపదేశించే అర్హత మనకు కలుగదు.


సకల జగద్ధాత్రియైన పరమేశ్వరి, ఆపరాసక్తిని మనసారా భజించినచో లోకాని కేకొంచెమోక్షేమం చేకూర్చటంవల్ల మనం విశ్వాన్ని జయిచగలుగుతాం. జయించుట అంటే ఇతరుల కపజయం కూరుస్తామని కాదు. వారు, మనం ఎల్లరం శ్రేయస్సౌఖ్యములం దోలలాడగలుగుతాము. ఈ సత్యాన్ని గ్రహించి మాకు మిగిలియున్న జీవితమందు దీనిని సమస్త లోకానికి చాటిచెప్పి తోడిమానవులను సేవించుకునే శక్తిని పరమేశ్వరుడు మా కనుగ్రహించుకాక!

!!నమః పార్వతీపతయే!!

!!హరహర మహాదేవ!!


🕉🌞🌏🌙🌟🚩

4. బై లొకేషన్:  (7) 

ఒకే వ్యక్తి రెండు ప్రదేశాలలో ఏక సమయంలో ఉంటే...అలాంటి స్థితిని "బై లొకేషన్" (Bi- Location) అంటారు. అయితే ఈ "బై-లొకేషన్"...అన్న సిద్ధి, సామాన్య మానవులకి సాధ్యం కాదు. జన్మతః వాడు సిద్ధుడైతే వాడికి సాధ్యం కావచ్చు. లేదా గొప్ప సిద్ధ పురుషులకు ఈ "బై-లొకేషన్" అనే ఈ సిద్ధి సాధ్యం అవుతుంది. కొన్ని సార్లు గొప్ప సిద్ధ పురుషులు,జ్ఞానులు....ఒకేసారి అనేక ప్రదేశాలలో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇది ఒక గొప్ప సిద్ధి. ఇది కలి యుగం కాబట్టి...సామాన్య మానవులు కలి ప్రభావంలో ఉన్నారు కాబట్టి, ఈ సిద్ధి అందరిలోనూ...ప్రకటన కాదు. కేవలం గొప్ప సిద్ధ పురుషులలోనూ....మాత్రమే మనకు కనబడుతుంది.
      

     సాధారణంగా, ఒకే వ్యక్తి రెండు ప్రదేశాలలో ఉండడం సాధ్యం కాదు.
కానీ, మార్మికులైన కొందరు మహానుభావులు(వారు సిద్ధ పురుషులు కూడా), కొన్ని సార్లు ప్రకృతి నియమాలను అతిక్రమించి ఈ సిద్ధిని ప్రయోగించారు.

   "ఒక యోగి ఆత్మ కథ" లో  స్వామి ప్రణవానంద (కాశీ నివాసి అయిన యోగి) రెండు శరీరాలతో కన్పడడం, మనం ఆ కథలో చదువుతాము. అలాగే శ్రీ భాగవతంలోని అనేక ఘట్టాలలోనూ, శ్రీకృష్ణుడు అనేక చోట్ల ఒకే సారి కనిపించే విధానాన్ని మనం గాంచవచ్చును. అలాగే హిందూ దేశంలోని అనేక మంది యోగులు,అవధూతలు....సందర్భాన్ని బట్టి,అవసరాన్ని బట్టి ఈ సిద్ధిని ప్రదర్శించారు.
అలాగే ఆధునిక కాలంలో కూడా శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ , తన గ్రంథమైన "హిమాలయ యోగులతో-క్రియా యోగి అనుభవాలు" లో...."ఒకే సారి పది శరీరాలుగా తయారయ్యే యోగి" కథను మనం చదువగలం.
 అయితే ఈ సిద్ధి కంటే ఉన్నతమైన సిద్ధులు చాలా ఉన్నాయి.


భట్టాచార్య

బాబాజీనుండి క్రియాయోగదీక్ష (6)
పురాణపురుషయోగిరాజశ్రీశ్యామాచరణలాహిరీజీవితఘట్టాలు - మహావతార్ బాబాజీనుండి క్రియాయోగదీక్ష స్వీకారం

 (హిమాలయ క్రియాయోగ పరమగురువు 'మహావతార బాబాజీ' వారిచే శ్యామాచరణ లాహిరీమహాశయుల ద్వారా ఆధునికయుగంలో 'క్రియాయోగదీక్ష పునఃస్థాపన')...

ఏ నిర్దిష్టకార్యం కోసం విధాత ఏ వ్యక్తిని నిర్ధారణ చేసి పంపుతాడో అతడు దాన్ని నిర్వహించక తప్పదు. ఈ భౌతికవాద యుగములో ప్రపంచంలోని నిత్య శుద్ధ సత్యాన్వేషకులకు జిజ్ఞాసువులకు అసంఖ్యాకులైన ప్రజలకు మోక్షమార్గమును తెరిచి 'ముక్తిని, అత్మసాక్షాత్కారమును, విశ్వశాంతిని' ప్రసాదించగల 'క్రియాయోగ మార్గాన్ని (లేదా) సాధనను' స్వీకరించుటకు 'విధాత' శ్యామాచరణులను చెయ్యిపట్టుకొని హిమాలయపర్వత సానువులకు లాక్కెళ్ళాడు.

క్రీ.శ. 1868 నవంబరు 23 వ తేదీన శ్యామాచరణులను, రాణీఖేత్ కు బదిలీచేస్తూ ఉత్తరువు వచ్చింది. భరతవర్షంలో ఉత్తరదిక్కున హిమాలయాల ఒడిలో 5980 అడుగుల ఎత్తున ఉంది 'రాణీఖేత్'. రాణీఖేత్ అల్మోరా జిల్లాలో నందాదేవి పర్వతపాదసీమలో ద్రోణగిరిపర్వతం దగ్గరలో ఉంది. 'కాఠ్ గోదామ్' నుంచి 50 మైళ్ళదూరంలో ఉన్న రాణీఖేత్ ఇప్పటి మాదిరిగా జనావాసం గల ప్రదేశం కాదు. నాలుగువేపులా అడవి, జనశూన్యం. ఉత్తరదిక్కున హిమ పర్వతపంక్తి సగర్వంగా ఆకాశాన్ని చీల్చేటంత ఎత్తున నిలిచి ఉంది. అపూర్వ ప్రకృతి సౌందర్యంతోనూ విశిష్టకాంతులతోనూ విరాజిల్లే రాణీఖేత్ ను చూస్తే 'యోగిరాజు, యోగ యోగీశ్వరుడు ధ్యానమగ్న దేవాధి దేవుడయిన శివుడి మూర్తి ప్రతిబింబం' కళ్ళకు కడుతుంది. 'శివస్వరూప తపస్వుల విహారభూమి' అయిన ఆ చోట, అక్కడక్కడ సాధువుల కుటీరాలున్నాయి. ఈ నిర్జన పరివేషంలో వారు 'పరమాత్మ ధ్యానంలో' నిత్య ఆత్మ యోగ సమాధి స్థితిలో నిమగ్నులయి ఉంటారు. 'దేవాత్మహిమాలయం' ప్రాచీన కాలంనుంచీ విశ్వఖ్యాతి గల్గి 'భారతవాసుల అంతరాత్మ' ద్వారా సమాదృతమూ పూజితమూ అవుతూ ఉంది. ఇక్కడ 'దేవాధిదేవుడయిన మహాదేవుడి (శివుడి) నివాసముందని' భక్తుల విశ్వాసం. భారతీయ దేవతల మహర్షుల ప్రాచీన నివాసమీ హిమవత్పర్వతము. ఈ స్ధానం 'ధ్యాననిమగ్నుడయిన బుషి' మాదిరిగా భాసిస్తూ ఉంటుంది.

అకస్మాత్తు బదిలీ ఉత్తర్వుద్వారా కాశీని విడిచి రాణీఖేత్ డివిజన్ హెడ్ గుమాస్తా (పి.డబ్ల్యూ.డి, మిలటరీ ఇంజనీరింగ్ వర్క్స్) గా నియమితులయ్యారు శ్యామాచరణులు. ఆ రోజుల్లో రైలుబళ్ళు లేకపోవడంతో 'గుర్రబ్బండి' మీద చాలారోజులు ప్రయాణంచేసి రాణీఖేత్ కు చేరి తమ పనులు ప్రారంభించారు. ఒకరోజు శ్యామాచరణులు సాయుధులైన సిపాయిల్నీ, నౌకర్లనీ వెంటబెట్టుకుని ఆఫీసు డబ్బు తీసుకొని జనసంచారం లేని కొండదారిలో వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఎవరో తమరు పేరుపెట్టి పిలుస్తున్నట్లు గమనించారు. సుందరమైన పుష్టి గల శరీరం, పొడుగ్గా ఉన్న చేతులు మోకాళ్ళూ గల శాంతస్నిగ్ధమైన చూపుతో విచిత్రమైన ఆకర్షణ గల ఒక హిమాలయసాధువు పైనకొండలు దిగివచ్చి శ్యామాచరణుల ఎదురుగా నిలబడ్డారు. సందిగ్ధావస్థలో గల ఆయన వైపు చూసి "భయపడకు శ్యామాచరణ్! నువ్వు ఇదే దారిలో వస్తావని నాకు తెలుసు. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా. తొందరగా ఆఫీసుపనులు పూర్తిచేసుకుని నా కుటీరానికి రా, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను" అని చెప్పి దూరంగా ఒక కొండమీద ఉన్న కుటీరంవైపు చూపిస్తూ వెళ్ళిపోయారు. హిమాలయాల్లోని ఈ అరణ్యం 'దేవమానవుల నివాసభూమి' అనిపిస్తుంది. ఇది సిధ్ధులు, సాధు మహాత్ముల 'తపోభూమి'. చుట్టూ జాజి, దేవదారు వృక్షాలతో కూడిన కొండల మధ్య సెలయేటి ధార గగాస్ నది ఒళ్ళోకి ఎగిసి పడుతుంది. అలౌకిక సౌందర్యమయమైన ఈ హిమాలయ నిర్జన ప్రదేశాలలో, ధ్యానాసీనుడయిన ధూర్జటి (శివుడి) తపోవనంలో యుగయుగాలుగా అనేకమంది మహాయోగులు, సాధుసన్యాసులూ ధ్యాననిమగ్నులయి ఉంటారనీ, వారందరీ దర్శనం పొందాలనీ ఎప్పటినుండో అభిలాష గల శ్యామాచరణులు సహజంగానే 'ఆ సన్యాసి దర్శనం' కోసమని కఠినమైన దారుల్లో ఒంటరిగా బయలుదేరారు.

సూర్యాస్తమయం అయ్యే సమయానికి శ్యామాచరణులు చాలా దూరం పయనించి అలసిపోయి, ఎక్కడా మనిషిలేని కీకారణ్యంలో చివరికి ఒక రాతిమీద కూర్చుని ఏదో ఆలోచించడం మెుదలుపెట్టారు. ఇంతలో అకస్మాత్తుగా పరిచితమైన కంఠస్వరం మళ్ళీ వినిపించింది. "శ్యామాచరణ్, ఇలా రా!" తనను పిలుస్తున్న ఆ సన్యాసే పర్వత శిఖరంమీద నిలబడి ఉన్నారు. చిరునవ్వుతో ఉన్నారాయన. ఆయనకు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకు చాలాకాలం తరువాత తిరిగివచ్చి తండ్రి స్నేహస్తిక వాత్సల్యభరితమైన కన్నుల నీడలోకి వచ్చి నిలబడినట్లుగా ఉంది. రెప్పవాల్చకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు శ్యామాచరణులు. ఆ సన్యాసికి దండప్రణామం చేశారు. "శ్యామాచరణ్, నన్ను నువ్వు గుర్తు పట్టలేదా?" అని అడిగారు ఆ సన్యాసి. "వెనుకకాలంలో ఇక్కడికి వచ్చినట్టుగా కూడా గుర్తురావడం లేదా? గుహలో ఉంచిన పులిచర్మమూ కమండలమూ వంటివి చూపించి, వీటిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా" అని అడిగారు. "ఇంతకు ముందెన్నడూ నేనిక్కడికి రాలేదండి. వీటిని నేను గుర్తుపట్టలేదు. ఇవెవరివో నాకు తెలియదు" అన్నారు శ్యామాచరణులు.

తరువాత ఆ సన్యాసి శ్యామాచరణులను మెల్లగా స్ప్రుశించారు. ఆయన శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది. వారికి తమ పూర్వజన్మలోని 'హిమాలయ గుహ్యసాధనామయ దివ్యతపోజీవనం' గుర్తుకురావడం మెుదలయింది. ఆ మహాముని, సన్యాసి ఎవరోకాదు స్వయానా తమ గురుదేవులు, దృశ్యాదృశ్య సదృశులు మరణంలేని మహాగురువు బాబాజీ అని అర్ధమయింది. శ్యామాచరణుల హృదయంలోంచి ప్రేమ, కళ్ళలోంచి అశ్రుధారలు ఒక్కసారిగా పొంగాయి. "మీరు నా ప్రియగురుదేవులు బాబాజీ. ఎప్పటికీ నావారే" అంటూ, ఒక్కసారిగా తమ దివ్య గురుదేవుల పాదాలను చుట్టేసుకుని కన్నీళ్ళపర్యంతమయ్యారు. ఆ సన్యాసి ఇలా అన్నారు. "వెనకటి జన్మలో నువ్వు ఇక్కడే ఉండి సాధన చేస్తూండేవాడివి. నీపేరు 'గంగాధరుడు'. ఈ పులిచర్మం, ఈ కమండలం అన్నీ నీవే. వీటిని నీకోసమే జాగ్గత్తగా దాచిపెట్టాను. ఇక్కడే సాధనచేస్తూండగా నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆ తరువాత 'గర్ణీ' గ్రామంలో గౌర్ మోహన్ లాహిరీ గారి కొడుకుగా పుట్టావు. అప్పటినుంచే అన్ని విషయాల్లోనూ నీమీద నా దృష్టి ఉంది. నీ చిన్నతనంలో అక్కడ శివుడి మాదిరి పద్మాసనంలో యోగముద్రలో ఉన్నప్పుడూ నేను నీతోనే ఉన్నాను. తల్లి తన పక్షి పిల్లలను కాపాడుకుంటూ ఉన్నట్లుగా నిన్ను నీ చిన్నతనంనుండీ రక్షించుకుంటూ, నీ కోసం నేను నలభై ఏళ్ళుగా ఎదురుచూస్తున్నాను. నీకు యోగదీక్ష ఇవ్వడానికి ఈ కొండప్రాంతానికి నేనే నిన్ను బదిలీ చేయించాను" అన్నారు బాబాజీ. "గురుదేవా, ఏం చెప్పగలను నేను" అంటూ తడబడుతూ మెల్లగా "ఇటువంటి పుత్రవాత్సల్యం, గురుశిష్య సంబంధం, అమరప్రేమ గురించి ఎక్కడైనా, ఎవ్వరైనా విన్నారా నా శాశ్వత నిధిని జీవితంలోనూ మరణంలోనూ కూడా నావారైన గురుదేవులైన మీతో ఇక్కడే ఉండిపోతాను" అన్నారు ఆనందాతిశయంతో. "లాహిరీ!, నీకు పరిశుధ్ధి అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి, ఏటి ఒడ్డున పడుకో, విశ్రమించిన తరువాత యోగదీక్ష ప్రదానం ఉంటుంది" అన్నారు మరణంలేని మహాగురువులు బాబాజీ.

ఆ తరువాత, పరమగురువు 'మహావతార బాబాజీ'  మునివరులు వారికి ,యోగదీక్షాప్రదానం చేసారు. శ్యామాచరణులు నిస్నంద సమాధిస్థితులయ్యారు. "జయ శివ శంభో, హర హర మహాదేవ!" అక్కడున్న సన్యాసులందరి కంఠాల్లోంచి ఒక్కుమ్మడిగా వెలువడ్డ ఈ నినాదం నలువైపుల కొండలనుంచీ మారుమ్రోగుతూ ఉండగా, ఈ ధ్వని 'నవదీక్ష' పొందిన కొత్తసాధకుడి మనస్సులో లోలోపలికి చొరబడి ఆనందమయ ప్రతిధ్వనిని సృష్టిస్తోంది. 'మహావతార్ బాబాజీచే' లాహిరీ మహాశయులకు క్రియాయోగదీక్ష, అఖండ ధ్యానం పూర్తయింది. శ్యామాచరణులు దీక్షపొందిన చోటు రాణీఖేత్ నుంచి 15 మైళ్ళదూరంలోని "ద్వారాహాట్" పర్వత శ్రేణిలో ఉన్న ద్రోణగిరి (లేదా) దునాగిరి అనే కొండమీద జరిగింది. నేటికీ ఈ మహత్తర సంఘ్ఘటనకు అది ప్రతీకగా ఉంది. మహావతార్ బాబాజీ వారిచే శ్యామాచరణులకు ఈ క్రియాయోగదీక్షా ప్రక్రియ ద్వారా, మహాయోగికి యోగంవల్ల కలిగిన సంస్కారంవల్ల, జాగరణవల్ల భారతదేశ ఆధ్యాత్మిక సాధనలో మరో అధ్యాయం ఆరంభమైనది. యోగసంబంధమైన ఈ శక్తి సంపద పునఃప్రాప్తివల్ల కేవలం వారి 'జీవాత్మ పరమాత్మల అభిన్నతా మార్గం' ప్రశస్తం కావడం మట్టుకే జరిగిందని అనుకోకూడదు. శ్యామాచరణులవారితో బాటూ లక్షలాది మందికి 'ముక్తిమార్గం' వెల్లడయింది. వారి 'యోగదీక్షాప్రాప్తితో' భారతావనిలో భావికాలం వారికి భాగ్యోదయమయినది. హిమాలయ శ్రేష్టులైన బుషుల ద్వారా ప్రదర్శితమయిన దుర్లభ ప్రాచీన యోగాభ్యాసమార్గం తిరిగి హిమ దుర్గమారణ్యాలనుండి స్వర్గ గంగ లాగా దిగివచ్చి తిరిగి జనసమాజంలో మరల 'బాబాజీ అనుగ్రహం' చేత శ్యామాచరణ లాహిరీ మహాశయులచే ఈ యుగంలో 'మానవజాతి మోక్షప్రాప్తికై' పునరుధ్ధరించబడినది (అనంతాత్మలను జననమరణచక్రంనుండి విడిపించి పరమేశ్వరుని దివ్యసన్నిధికి, జ్యోతిపథం లోనికి మరలా చేర్చడానికి........

మూలం: (1) 'పురాణపురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ' (శ్రీ శ్రీ యోగాచార్య, వాచస్పతి డా| అశోక్ కుమార్ ఛటోపాధ్యాయ

 (2)  ఒక యోగి ఆత్మకథ' (పరమహంస యోగానంద)

--(())--

5. మనకు తెలియని #భీమసేనుడు !!//// 5

అతినిద్రా లోలుడు చదువు లేని మూర్ఖుడు, తిండిపోతు, స్థూలకాయుడు, కోపిష్టి వంటి విశేషణాలతో సినీకవులు భీముణ్ణి చిత్రీకరించారు. “నిదురవోతుంటివో లేక బెదరి పల్కుచుంటివో కాక తొల్లింటి భీమసేనుడవే కావో…” అనే కృష్ణావతారంలోని పద్యాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి.
కానీ భీముడు మన సినీ కవులకు అందని ఒక మహత్తర శక్తి.
భీముడు ఆకారం కుడా అర్జునుడి లాగానే ఉంటది భీముడు కి బుజ బలం సామర్థ్యం  ఎక్కువ 
పంచ ప్రాణాలు అనే మాట తరచూ వింటాం మనం ఆ పంచ ప్రాణాలలో ముఖ్యమైనది ప్రాణ వాయువు దీని అధిష్టానం ముఖ్య ప్రాణుడు. ఈయనే 99 వ ఋజువు వాయువు (ఋజు గణం గురించి కింది సందేశం చూడండి). ఈ ముఖ్య ప్రాణుడి అవతారమే భీముడు. త్రేతాయుగంలో హనుమగా, ద్వాపర యుగంలో భీముడుగా, కలియుగంలో మధ్వాచార్యగా అవతరించే ముఖ్య ప్రాణుడు జీవులలో శ్వాసరూపంలో ఉంటూ విష్ణు జీవులకు తత్వాన్ని ఉపదేశిస్తూనే ఉన్నాడు.
అలాగే సమస్త దేవతలలో ముఖ్య ప్రాణుడు ఉంటాడు, శివుని తో సహా పంచ పాండవులలో భీముడు జ్ఞానానికి ప్రతీక. కృష్ణుని తరువాత మహాభారతం లో భీముడే ముఖ్యుడు.

ఈ చరా చర సృష్టిలో రెండే రెండు యుద్ధ వింతలు 
ఒకటి హనుమా ఇంద్రజిత్ యుద్ధం 
రెండు భీముడు కురుక్షేత్రం యుద్ధం వీటిని చూడాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో 
త్రిగుణాతీతుడు కనుకనే బాల్యంలో కుంతి ఒడి నుంచి జారి శతశృంగ పర్వతంపై పడి పోగా అది వ్రక్కలౌతుంది. భీముడు ఎప్పుడూ కృష్ణుని మాట జవదాటలేదు (జీవోత్తముడు సర్వోత్తముని మాట జవదాటడు). ఉద్యోగపర్వంలో తనని గూర్చి చెప్పమనగా భీముడు తన బలాన్ని వివరించిన పిదప శ్రీ కృష్ణుడు వెంటనే “భీముని బలం అతను చెప్పిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ” అని చెబుతాడు.
మహాభారత యుద్ధం ప్రారంభం లో చేసిన బీముడి సింహనాదానికి గుర్రాలు, ఏనుగులు దిక్కులు పట్టి పరుగులు తీసాయి. భారత యుద్ధంలో తొలుత, చివర యుద్ధం చేసింది భీముడే. లక్క ఇంటికి నిప్పు పెట్టడం 6 నెలలు అయినా కుదరలేదు ఎందుకంటే భీముడు ఆ 6 నెలలలో రేయింబవళ్ళు కాపలా కాసాడు కనుక. ఇది అతని శక్తికి ఒక మచ్చు తునక.
మహాభారత యుద్ధం లో 11 అక్షౌహిణుల సైన్యంలో 6 అక్షౌహిణులు భీముడే చంపేసాడు(అంటే కౌరవ పక్ష సైన్యంలో సగానికి పైన సైన్యాన్ని ఒక్క భీమసేనుల వారే సంహరించారు) . యుద్ధానంతరం ధర్మజుని వైరాగ్యాన్ని కాదని రాజ్య పాలన వైపు మరల్చింది భీముడే. మనకు మరి ద్రౌపది స్వయంవరానికి ఎందుకు భీముడు వెళ్ళలేదు అనే సందేహం వస్తుంది. దానికి పురాణాలను సమన్వయము చేసి మధ్వులు వారి మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఇలా వివరించారు: భీముడు సంహరించిన విష్ణు భక్తుడు బాహ్లికుడే. అదీ బాహ్లికుడి అభ్యర్ధన మేరకే. భీముడు సంహరించిన ప్రతీ యోధుడూ దుర్యోధనుని రూపంలో ఉన్న కలి అనుచరులనే. అలాగే కృష్ణుని (విష్ణు వైరులైన) శత్రువులైన జరాసంధుని, కీచకుణ్ణి, కిమీరుణ్ణి, హిడింబాసురుని, బకుని, మణిమంతుని, దుశ్శాసనుణ్ణి భీముడే సంహరించాడు.
పాండవులలో రెండవ వాడైనా మొదట వివాహం జరిగింది భీమునికే హిడింబితో. రెండవ వానిగా పుట్టడానికి కారణం కృష్ణుడు కూడా బలరాముని తమ్మునిగా పుట్టాడుగా. సర్వోత్తముని అనుసరించే వాడే జీవోత్తముడు! భీముడే కౌరవ సోదరులన్దరినీ మట్టుపెట్టాడు.
దుశ్శాసనుని రొమ్ము చీల్చి నెత్తురు తన దోసిలిలో ఉంచుకొని మన్యు సూక్తం చదివి మరీ నారసింహునికి నివేదన చెస్తాడు.
యుద్ధంలో భగదత్తుని సుప్రతీకం ఏనుగును భీముడు సంహరించినప్పుడు 
కర్ణార్జున మొఖాలు తెల్లబోయాయి ఆ రోజు సైన్యం అంత దిక్కులు పట్టి పారిపోయారు  మొత్తం నూరు మంది కౌరవులను భీముడే సంహరిస్తాడు 
పరమశివుడు అంబ కు ఒక మహిమాన్విత మాలను ఇచ్చి ఇది ధరించిన వీరుడు భీష్ముని చంపగలదు అని వరమిస్తాడు. భూమికి నలు చెరగులా ఉన్న రాజులను అర్ధిస్తుంది ఈ మాల స్వీకరించి భీష్ముని వధించమని అందుకు ఎవరూ సాహసం చేయకపోగా చివరికి ద్రుపద రాజ మందిర ద్వారానికి దానిని తగిలించి తన జీవితాన్ని చాలిస్తుంది. ఇతః పూర్వం శిఖండి ఒకసారి ధరించి విడచినది ఈ మాల. ద్రుపదుడు ఈ మాలను భద్రపరచి తన కూతురైన ద్రౌపదికి స్వయంవరం సమయంలో ఇచ్చి మత్స్య యంత్రచ్చేదన చేసిన వీరుని మెడలో వేసి వరించమని చెబుతాడు. విష్ణు భక్తుడైన భీష్ముని జీవోత్తముడైన భీముడు భాగవత ధర్మం ప్రకారం వధించ లేడు, కనుక ఘటనాఘటన సమర్ధుడైన శ్రీ కృష్ణుడు అర్జునునిచే ఈ పని చేయించాడు తద్వారా పరమశివుని వరాన్నీ గౌరవించాడు – యద్యదాచరతి శ్రేష్ఠ: మహాభారతం లో ద్రౌపది చెబుతుంది భీమసేనుడు అర్జునిని కంటే చెప్పలేనంత బలవంతుడు అని, పైగా గాండీవానికి నారి సంధించ గలవారు కేవలం ముగ్గురే అని వారు కృష్ణుడు, భీముడు, అర్జునుడు అని. ఇది భీముని ఎనలేని జీవోత్తమం.


సేకరణ


6 సిల్వర్ కార్డ్ :  .....  4

(Silver Cord)


✒️ భట్టాచార్య


అధి భౌతిక శాస్త్ర అధ్యయనాలలో, మార్మిక శాస్త్ర అధ్యయనాలలో....ఈ "Silver Cord" ను "సూత్రాత్మ" అంటారు. భౌతిక శరీరానికి -  "Higher Self" లేదా "ఆత్మ/పరమాత్మ" కు అనుసంధానం చేసేదే ఈ "సూత్రాత్మ లేదా Silver Cord. ఈ సూత్రాత్మ ఇంకోరకంగా కూడా చెప్పబడింది. ఈ "చైతన్య సూత్రము లేదా సూత్రాత్మ" ఆత్మ నుండి భౌతిక శరీరానికి కలుపబడింది, చైతన్య ప్రవాహ రూపంలో.....ఈ సూత్రాత్మ భౌతిక శరీరాన్నే కాక, ఎథిరిక్, యాష్ట్రల్ శరీరాలను, చివరగా మనోమయ కోశంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది.

యోగుల ప్రకారం, ఈ సూత్రాత్మ లేదా Silver Cord , గాఢమైన వెండి రంగులో, సాగదీతకు అనువుగా ఉండే రబ్బరు త్రాడు మాదిరి....ఒక వ్యక్తి యొక్క భౌతిక శరీరం నుండి అతని యాష్ట్రల్ శరీరం వరకు (ashtral body)....అలా మిగతా శరీరాల వరకు విస్తరించబడియుంటుంది.

ఈ "సిల్వర్ కార్డ్", సున్నితంగా, ఊహించని పొడవుతో, జాజ్వల్యమాన ప్రకాశంతో, కాంతితో చేయబడిన - సాగదీయబడే త్రాడుగా, దాదాపు ఒక అంగుళం దళసరి తనంతో....ఇటు భౌతిక శరీరానికి, ఆత్మకు కలుపబడియుంటుంది.
 అప్పుడే జన్మించిన శిశువు, తల్లితో గల "బొడ్డు పోగు" (umbilical cord) తో కలసి ఉన్నట్లు గానే, మనం మన పరమాత్మ నుండి మనవరకు....ఈ సూత్రాత్మను కలిగి యుంటాం. 

ఆ పరమాత్ముడి నుండి వచ్చే స్పూర్తులు, సంకేతాలు....ఇవన్నీ ఈ సూత్రాత్మ ద్వారానే మనకు చేరతాయి. ఈ సూత్రాత్మ లేదా "రజత పాశం", మనకు , ధ్యానావస్తలో వెండి రంగులో కనబడినా, పరమ యోగులకు, దివ్య దృష్టి కల సిద్ధులకు "నీలి-తెలుపు-మేఘ" చారలా కనిపిస్తుంది. ఈ సూత్రాత్మ ఎంథ దూరమైనా సాగుతుంది.


    ఒక సాధకుడు తన సాధనలో"యాష్ట్రల్ ప్రయాణం", చేస్తున్నపుడు...అతని "సూక్ష్మ శరీరం" భౌతిక దేహం నుండి వచ్చి....(అలా భౌతిక శరీరం నుండి బయటికి వచ్చినప్పటికీ....సూత్రాత్మతో అనుసంధానం ఉంటుంది. ఇది మాకు అనుభవమే)...అనంత సుదూర తీరాలకు సాగిపోతుంది, తన సంకల్పం మేరకు. మరల సంకల్పం మేరకు, మనో వేగంతో, వెనుకకు వచ్చి....తిరిగి తన మూల దేహాలలో కలిసిపోతుంది.

 మనకు మృత్యువు ఆసన్నమైనపుడు, ఈ సూత్రాత్మ లేదా silver Cord పలుచబడిపోతూ, శిథిలం అయిపోతూ తెగిపోతుంది. బిడ్డ జన్మించిన తరువాత "బొడ్డు పోగు" ను కోసి ముడి వేసిన వెంటనే, ఆ శిశువు తల్లి నుండి వేరయిపోతూ ఉన్నట్లే, మృత్యు సమయంలో కూడా, ఈ సూత్రాత్మ లేదా సిల్వర్ కార్డ్  తెగిపోయి....మృత్యువు ఆసన్న మౌతుంది. భౌతిక శరీరానికున్న అన్ని బంధాలూ తెగిపోతాయి. పరమాత్మకు, మానవుడికి మధ్య ఉన్న "సిల్వర్ కార్డ్" ద్వారా, మానవుడు "తల్లి నుండి విడిపోని బిడ్డ" లా ఉంటాడు. తల్లికి, బిడ్డకి మధ్య , తెగిపోని ప్రేగు....బొడ్డు దగ్గర కలసి ఉన్నట్లే.... పరమాత్ముడికి-జీవుడికి మధ్య , వెండి వన్నె తీగ ప్రోగు.....తెగిపోని బంధంలాగా ఉంటుంది. తల్లి-బిడ్డలను కలిపే ఈ బొడ్డు తాడు, సృష్టిలో చాలా గొప్పది. ఈ వెండి తీగలోని అణువులు, దూరం దూరంగా ఉండి....విలక్షణమైన వేగంతో ప్రకంపనాలను కలిగి ఉంటాయి. మనం చేసే ప్రతి పని ఆ పరమాత్ముడికి తెలుస్తుంది. కాబట్టి బుద్ధిమంతులు ఋజువర్తనం కలిగి ఉంటారు.

    కొంతమంది ప్రజలు గానీ, యోగులు గానీ...తాము ఈ భౌతిక శరీరం నుండి వెళ్ళిన అనుభవం లభించింది...అంటూ ఉంటారు. ఆ సమయంలో వారు ఈ "వెండి తీగ పోగు" చూస్తారు. ఆ పోగు వీళ్ళ ఎథిరిక్ లేదా ఆష్ట్రల్ శరీరాల నుండి భౌతిక శరీరానికి , అనుసంధానించి ఉండడం కూడా చూస్తారు. (Out of body experiences)


 అలాగే, మన హిందూ పురాణాది సాహిత్యంలో చెప్పబడ్డ "యమ పాశం" ....ఈ సిల్వర్ కార్డేనని ప్రతీకాత్మక,  పౌరాణిక, ఐతిహాసిక....భావనయే కదా! యముడు, పాశం వేసి ప్రాణం తీసేసాడంటే, అర్థం? ఆ సిల్వర్ కార్డ్ తెగిపోయిందనే కదా!

07 🌹శ్రీకృష్ణుడి అంత్యక్రియలు : (4)

 రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి.  కోవిడ్ వచ్చింది కదా, లాక్డౌన్ ఉంది కదా అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా. ... ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ "ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?" అని. చాలామంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోతూ ఉండవచ్చు ప్రస్తుతం. సహజం.  అంతేకాదు..కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. లాక్డౌన్లో  ఎవ్వరూ రాలేని పరిస్థితి.  వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం క్లుప్తంగా .

 ఎక్కడో ద్వారక.  దానికి చాలా దూరంలో తపోవనం.  ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.  అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు.  ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు.  మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు...కానీ ప్రాణం లేకుండా..! 

అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు.  అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు.  అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి  ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక   (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా. అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు.  శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు. అంతటి ఇతహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ.  మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవారూ చెప్పలేరు.  


ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదించుగాక. 🙏

No comments:

Post a Comment