Friday 3 July 2020



(1)
ధైర్యశాలివై ముందుకు నడు. ఒక్క రోజులోనో, ఒక్క సంవత్సరంలోనో విజయాన్ని ఆశించకు. ఎల్లప్పుడూ ఉత్తమోత్తమమైన ఆదర్శాన్ని కలిగి ఉండు. స్ధిరత్వం కలిగి ఉండు. అసూయ, స్వార్ధాలను విడిచిపెట్టు.

(2)
మనము పరంజ్యోతి పుత్రులం. భగవంతుని బిడ్డలం. భగవంతునకు జయమగు గాక! మనం జయించి తీరుతాం. హృదయం లేని మేధావంతులను, ఏ ప్రతిస్పందన కలిగించని వారి పత్రికా వ్యాసాలనుగాని లెక్కచేయకండి.  విశ్వాసము... ఉజ్వల విశ్వాసము... భగవంతుడికి జయమగు గాక! ముందుకు సాగండి, ఆ దేవదేవుడే మన సేనా నాయకుడు. వెనుదిరుగకండి. ముందుకు, ముందుకు నడవండి! సోదరులారా! ఈ విధంగా మనం ముందుకు నడక సాగించాలి.

(3)
గురువు రకాలు :-

1. సూచక గురువు - చదువు చెప్పేవాడు.
2. వాచక గురువు - కుల ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు చెప్పేవాడు. 
3. బోధక గురువు -  మహామంత్రాలు ఉపదేశించేవాడు. 
4. నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాలు చెప్పేవాడు.
5. విహిత గురువు - విషయ భోగాల మీద విరక్తి కలిగించేవాడు. 
6. కారణ గురువు - జీవ బ్రహ్మైక్యము బోధించేవాడు.
7. పరమ గురువు - 'జీవాత్మ , పరమాత్మ ఒకటే' అనే ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు.

(4)
తలంపు లేకపోతే శ్వాస ఉండదు.శ్వాస లేకపోతే తలంపు ఉండదు.
శిష్యుడు:- వానప్రస్థుడు ఇంటివద్దనే ఉండవచ్చునా?
గురువు:- వానప్రస్థుడికి ప్రపంచమే తన ఇల్లు. కాబట్టి ఎక్కడైనా తాను ఉండవచ్చు.
కాలం అనంతం. కానీ మనకు కాదు.  అనంతుడికి.

భగవాన్, మహర్షి, స్వామి, అవధూత, జ్ఞాని, సద్గురు ... ఈ పదాలన్నీ బిరుదులు కాదు, అవి పరమేశ్వరునికి పర్యాయపదాలు.

నీవు 'రోగం' అని దేనినైతే అంటున్నావో,  నిజానికి అది కూడా "ఆత్మానుభవం"లో భాగమే.


(5)
కోశము అంటే కత్తిని కప్పివుంచే వర. కత్తిని వర ఏవిధముగా  కప్పి ఉంచుతుందో అదేవిధముగా నేను ఆత్మను అనే భావనను  పంచకోశములతో తధాత్మ్యత మరుగు పరుస్తున్నది. తిరిగి నీవు ఆత్మ స్వరూపుడవు, పంచకోశములకు విలక్షణుడవు అని నిరూపించుటకు, స్థిరపరచుటకు  పంచకోశ విచారణను  చెబుతారు.
 
అన్నమయకోశము,ప్రాణమయకోశము ,మనోమయకోశము  ,విజ్ఞానమయకోశము ,ఆనందమయకోశము  అను ఐదింటిని పంచకోశములు అంటారు.
 
నేను వ్యవహరించే సమయమున,  శరీర ,ప్రాణ మనో బుద్ధులతో తధాత్మ్యతను సూచించుటకు పెట్టిన పేర్లు పంచకోశములు. శరీర ,ప్రాణ మనో బుద్ధులతో తధాత్మ్యతను తొలగింప చేసి  సాక్షిగా నిలిపేది  పంచకోశ విచారణ.
 
బాహ్య నేత్రములకు కనిపించే ఈ శరీరమును అన్నమయకోశము అంటారు. అన్నము వలన పుట్టి ,అన్నము వలన  పెరిగి, అన్నము లేకపోయిన నశిస్తుంది కాబట్టి దీనికి అన్నమయకోశము అను పేరు వచ్చినది. దీనినే స్థుల శరీరము అని కూడా అంటారు.
 
 సర్వ కాల సర్వ అవస్థల యందు పరిణామము లేక ఏక రీతిగా ఉండునది ఆత్మ.

అన్నమయకోశము పుట్టుకకు పూర్వము లేదు, మరణము తరువాత ఉండదు. కనుక సర్వ కాలముల  యందు ఉండుట లేదు.
శరీరము  బాల్య , యవ్వన , కౌమార, వృద్దాప్యముల యందు  నిరంతరము మార్పు   చెందు చున్నది. కనుక  అన్నమయకోశము ఆత్మ కాదు.
 
కాని నేను  వ్యవహరించే సమయమున
నేను అందముగా లేక అంద విహీనముగా ఉన్నాను
నేను బలవంతుడను , బలహీనుడను
నేను  బాలుడను ,యవ్వనుడను  , వృద్దుడను, నేను గృహస్తుడను, సన్యాసిని. 
నేను ఆరోగ్యముగా లేక  అనారోగ్యముతో ఉన్నాను    అని
శరీరమునకు సంబందించిన వాటిని నేనుకు ఆపాదిస్తున్నాము.
 
నేను ఆత్మ స్వరూపుడను. నేను శరీరమును కాదు. పైనవన్నియు శరీరమునకు సంబందించినవి అని ఉదాసీనముగా , సాక్షిగా ఉండవలెను.

పంచ ప్రాణములు - కర్మేంద్రియములు ఐదింటిని  కలిపి   ప్రాణమయకోశము అంటారు.

ఆకలి దప్పికలు  ప్రాణమయకోశ ధర్మములు.
 
ఈ ప్రాణమయకోశము శరీరము, మనస్సులకు మధ్య వాహకముగా పనిచేస్తుంది.

 ప్రాణము లేని శరీరమును దహనము చేస్తున్నారు. ప్రాణము ఉన్నంత వరకే ఈ శరీరమునకు విలువ. కనుక ప్రాణమయకోశమే ఆత్మ అని పొరపడుటకు అవకాశమున్నది.
 
ప్రాణశక్తి  లోకిని , బయటకు సంచరిస్తూ నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. కనుక ప్రాణమయకోశము ఆత్మ కాదు.
 
కాని నేను వ్యవహరించే సమయమున
నేను ఆకలిగొన్నాను
నేను దప్పికగొన్నాను
నేను ఆరోగ్యముగా లేక అనారోగ్యముతో ఉన్నాను(  ప్రాణము బాగుండ లేదు)  
అని ప్రాణమునకు  సంబందించిన ధర్మములను  నేను(ఆత్మ)కు ఆపాదిస్తున్నాము.

ఇవన్నియూ  ప్రాణము ధర్మములు  అని భావించి వాటితో  తధాత్మ్యత  చెందక   నేను ఆత్మ స్వరూపుడను,   సాక్షిని అను భావంతో మెలగ వలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹. పంచకోశములు -మనోమయ కోశము 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ

మనస్సు + జ్ఞానేంద్రియములు ఐదింటిని కలిపి మనోమయ కోశము అంటారు.
 
ఒకే అంత:కరణను  వృత్తి బేధమును బట్టి
ఆలోచన నిశ్చయాత్మక వృత్తిని పొందిన బుద్ధి అని 
ఆలోచన సంశయ రూపములో ఉన్న మనస్సు అని అంటారు.

ఈ వృత్తిబేధమును బట్టి మనస్సు + జ్ఞానేంద్రియములు ఐదింటిని కలిపి మనోమయ కోశము అని
బుద్ధి+ జ్ఞానేంద్రియములు ఐదింటిని కలిపి విజ్ఞాన కోశము అని అంటారు.

విజ్ఞాన కోశము కత్రుత్వ భావనను , మనోమయ కోశము  భోక్తృత్వ  భావనను కలిగిస్తాయి.

మనస్సు జ్ఞానేంద్రియముల ద్వారా పంచ విషయములను గ్రహించుట , కర్మేంద్రియముల ద్వారా బుద్ధి నిర్ణయములను అమలు పరచుట చేస్తుంది

ఈ మనస్సు అవిద్య లేక మాయ క్రియారూపము ధరించుటకు వాహకముగా పనిచేస్తుంది.

ఇంద్రియాభిముకమైన మనస్సు వాసనలను ఏర్పరచి జనన మరణ చక్రములో బంధించ బదేటట్లు చేస్తే అదే మనస్సును అంతర్ముఖము ఆత్మ జ్ఞాన దిశగా వినియోగించిన మోక్షముపొందుటకు సహాయకారి అవుతుంది. కనుకనే పెద్దలు మనస్సు బంధ మోక్షములకు కారకముగా చెబుతారు .

మనస్సు , దేహ తధాత్మ్యతవలన పరిమితించబడి నేను, నాది అను బేధభావనను సృష్టిస్తుంది. నేను ఆత్మ స్వరూపుడను అన్న భావనను మరపు కలిగిస్తుంది. కనుకనే ఇది కోశము ఐనది.

మనస్సులోని ఆలోచనలు నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి. పరిణామము లేక ఏక రీతిగా ఉండునది ఆత్మ. కనుక మనోమయ కోశము ఆత్మ కాదు.

మనస్సులోని ఆలోచనలు నాకు తెలియబడుచున్నాయి. ఏదైతే నాకు తెలియబడుచున్నదో అది నేను కాదు. కనుక మనోమయ కోశము ఆత్మ కాదు.

మనస్సు జాగ్రత్, సుషుప్తి యందు పనిచేస్తూ నిద్రయందు వ్యవహారము  లేకుండా పోవుచున్నది.సర్వ కాల సర్వ అవస్థల యందు ఉండునది ఆత్మ. కనుక మనోమయ కోశము ఆత్మ కాదు.
 
కాని నేను వ్యవహరించే సమయమున
నేను కుంటివాడిని, గ్రుడ్డివాడిని అని ఇంద్రియ లోపములను నేనుకు అపదిస్తున్నాము .

సుఖము, దుఃఖము మనో ధర్మములు
కాని నేను సుఖిని, దు:ఖిని అని మనో ధర్మములను   నేనుకు అపదిస్తున్నాము .
 
ఇవన్నియు ఇంద్రియ, మనో ధర్మములు. నేను వీటన్నింటికి విలక్షణమైన, సాక్షి అయిన  ఆత్మ స్వరూపుడను అను నిశ్చయ జ్ఞానముతో జీవించవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌻 సాధన- సమిష్టి జీవనము - 2 🌻

పది మంది తోటి సాధకులతో కలసి పనిచేస్తున్నప్పుడు‌ పరస్పర సహకారముతో జీవించడం అలవాటవుతుంది. సమిష్టి జీవన మాధుర్యం ఆస్వాదనకు అందుతుంది. అయితే, ఈ సందర్భంలో సాధనకు‌ కొన్ని అవరోధాలు కూడా ఎదురవుతాయి. 

అతి పరిచయం వల్ల, అవజ్ఞాదృష్టి మనసులో చోటుచేసికొంటూ‌ ఉంటుంది. నాలుగుమార్లు‌ తోటివారికి మేలు చేయడంతో తాను అధికుడననే వికారం మొలకెత్తవచ్చు. దీని యెడల‌ జాగరూకత వహించాలి. 

అలాగే, తన మిత్రుల యెడల మొదట ఉన్న ఆప్యాయత, కాలం గడిచేకొద్దీ పరిమితమవవచ్చు. ఇతరుల యెడల వర్తించినట్లుగా‌ మిత్రుల యెడ కొందరు వర్తింపరు. ఉదాహరణకు, మనకు అవసరమైనప్పుడు ఋణమిచ్చి సాయం చేసిన, మన సహసాధకుడయిన మిత్రునికన్న ముందుగా, మనము ఇతరులు ఋణమిచ్చినవాళ్ళుంటే వాళ్ళకు ఋణము తీర్చుతూ ఉంటాము., 

ఇది నిజాయితీ కాదు. మనలను తిరిగి అడుగలేని మొగమాటము గల మిత్రులకు ముందు ఋణము తీర్చే మంచితనము‌ మనవద్ద ఉన్నప్పుడే, భగవంతుని దయ మనపై పనిచేస్తుంది. 

కొందరు సాధకులు తమకు మేలు చేసినవారు తమ తెలివిని, గొప్పను, అనుభవాన్ని గౌరవించి చేస్తున్నారని భ్రమించుతుంటారు. తమకు జరిగిన మేలుకు, గౌరవానికి ఎదుటివారి మంచియే కారణము. 

ఇంకో‌ సంగతి కొందరు  సాధకులు తాము గొప్ప త్యాగమూర్తులమని పదిమందిలో ప్రసిద్ధి పొందాలనే తపనలో, కుటుంబము ఎడల‌ బాధ్యతలు కొంత విస్మరిస్తూ ఉంటారు దీన్నీ సర్దుబాటు చేసికోవాలి. కుటుంబము ఎడల ప్రత్యేక వ్యామోహము పనికిరాదంటే అర్థం, వారిని నిర్లక్ష్యం చేయమని కాదు. 

కుటుంబసభ్యులను, ఇతరులను గూడ  అంతర్యామి స్వరూపులుగానే దర్శింపగలగాలి. ఎవరియెడలనయినా పరమప్రేమతో కర్తవ్యాలను‌ నెరవేర్చడం అభ్యాసం చేయాలి. 

అలాగే, సమిష్టి జీవనయాత్ర కొనసాగిస్తుండగా ఒక ‌ప్రదేశము నందు వసించు సాధకుల నడుమ అభిప్రాయ‌ భేదాలు వస్తుంటాయి. 

అభిప్రాయాలు మనోవికారాలు. ప్రేమ, హృదయ సంబంధి. తోటివారు మనతో విభేదించినంత మాత్రాన, వారితో మాట్లాడకపోవడం, అలుకపూనడం, ఇతరులతో వీరిని గూర్చి ఆరోపణ చేయడం సంకుచిత దౌర్భల్యం. ఇది సాధనకు అడ్డంకి అని గ్రహించాలి..

No comments:

Post a Comment