Sunday 2 September 2018

pranjali prabha (కధలు )




విక్రమార్కుడి కథలు............2


సరే ఇంక కథలోకి వెళ్దామా?

సభలో చర్చల తరువాత బ్రాహ్మణ యువకుడు అన్య కుల స్త్రీని పెళ్ళి చేసుకోవాలంటే పరిహారంగా నాలుగు వర్ణాల యువతులను పెళ్ళి చేసుకోవాలని, అట్లా చేస్తే ఏ దోషమూ ఉండదని పెద్దలు తేల్చి చెప్పాక, ఒక శుభముహుర్తాన

రాజపురోహితుని కుమార్తె కళ్యాణి,
వైశ్యుడైన మంత్రి సోమశేఖరుడి కూతురు కోమలాంగి,
రాజుగారి కూతురు చిత్రరేఖ,
చివరగా నర్తకి అలంకారవల్లిలతో
చంద్రవర్ణుడి వివాహం మహా అట్టహాసంగా జరుగుతుంది.

ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. అతడికి నలుగురు భార్యల వలన నలుగురు కొడుకులు కలుగుతారు.

బ్రాహ్మణ యువతి కళ్యాణి కన్న కుమారుడికి వరరుచి అనీ,
క్షత్రియ యువతి చిత్రరేఖ కుమారుడికి విక్రమాదిత్యుడనీ,
వైశ్య యువతి కుమారుడికి భట్టి అనీ,
నర్తకి అలంకార వల్లి కుమారుడికి భర్తృహరి అనీ,
చంద్రవర్ణుడు నామ కరణం చేస్తారు.

పిల్లలందరికీ విద్యాభ్యాసం చేయవలసిన వయస్సు రాగానే అక్షరాభ్యాసం చేయిస్తారు.

నలుగురు చక్కగా విద్యల నభ్యసిస్తున్నారు.
అట్లా కాలం గడుస్తూ ఉండగా రాజుగారు మరణించి, ఆయన ఒక్కగానొక్క కూతురు భర్త అయిన చంద్రవర్ణుడు కన్యాపురానికి రాజు అవుతాడు.

చంద్రవర్ణుడు ఒక ప్రక్క రాజ్యభారం వహిస్తూ, మరో ప్రక్క నలుగురు కొడుకుల విద్యాబుద్దుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటాడు. తానే స్వయంగా విద్యలు నేర్పుకున్నాడు. చంద్రవర్ణుడు, శాపవశాత్తు బ్రహ్మరాక్షసుడైన దివ్య పురుషుడి వద్ద విద్యలనభ్యసించినా, స్వయంగా తండ్రి వద్దే విద్యలనభ్యసించిన భట్టి విక్రమాదిత్యులు మరింత ఘనకార్యాలు సాధిస్తారు.

చంద్రవర్ణుడు వృద్దుడైనాడు. మరణకాలం సమీపించింది. మరణశయ్యపై ఉన్న చంద్రవర్ణుడు, తన చుట్టూ దిగులుతూ నిలిచి ఉన్న కొడుకులను చూస్తాడు.

అతడి దృష్టి భర్తృహరి మీద నిలిచింది. అతడి వైపే చూస్తూ కన్నీరు పెట్టుకుంటాడు. భర్తృహరి కూడా తండ్రివైపే చూస్తాడు. తండ్రి మనస్సులో పట్టుకున్న దిగులు భర్తృహరికి అర్ధమౌతుంది.

అతడు మెల్లిగా తండ్రిదగ్గరకు వెళ్ళి, "తండ్రీ! మీరు ఒక సద్భాహ్మణ కుటుంబంలో జన్మించిన వారు. నేను మీ కొడుకుగా జన్మించినందువల్ల మీకు ఉత్తమగతులు లభించవేమో అని బాధపడుతున్నట్టు అనిపిస్తున్నది. నేను మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. మీకు ఉత్తమ లోకాలు లభించాలి అంటే నా వల్ల వంశాభివృద్ధి కలగకూడదు.

అందుచేత నేను వివాహం చేసుకోను. ఒకవేళ చేసుకున్నా, సంతానాన్ని పొందను. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు ముక్తి కలుగుతుంది" అని ధైర్యవచనాలు పలుకుతాడు.

ఆ మాటలు విన్న చంద్రవర్ణుడికి మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మిగిలిన ముగ్గురు కొడుకులను దగ్గరగా రమ్మని పిలిచి,

"నాయనలారా! నేను మీ తల్లులను వివాహమాడటానికీ, ఈ రాజ్యానికి రాజుని కావటానికీ, భర్తృహరి తల్లియైన అలంకారవల్లే కారణం. ఆమె లేకపోతే నేను ఎప్పుడో మరణించే వాడిని. ఆమెకు కృతఙ్ఞతగా నా తర్వాత భర్తృహరిని రాజుగా పట్టాభిషేకం చేసి, మీరంతా యువరాజులై అతణ్ణి సేవిస్తూ సహకరించాలి" అని తన చివరి కోరిక వెల్లడిస్తాడు.
భట్టి విక్రమాదిత్యులు వినయంగా తండ్రి ఆజ్ఞను శిరసా వహిస్తారు.

కాని వరరుచి "నన్ను మన్నించండి. నాకీ రాజ్య సంపద మీద గానీ, ఇహలోక సౌఖ్యం గురించి గానీ ఆసక్తి లేదు. కాబట్టి సన్యాసాశ్రమం స్వీకరించి, అడవులకు బోయి తపస్సు చేసుకో దలిచాను. నాకు అనుమతి ఇవ్వండి" అని ప్రార్దిస్తాడు.

వరరుచికి ఉన్న భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తి గురించి బాగా తెలుసు. అందుచేత అర్ధం చేసుకొని, కొడుకును దీవించి, అడవులకు పోయి తపస్సు చేసుకునేందుకు అనుమతిస్తాడు.

చంద్రవర్ణుడు మంత్రులను పురోహితులను పిలిపించి, భర్తృహరిని రాజు గానూ, భట్టి విక్రమాదిత్యులను యువరాజులు గానూ పట్టాభిషేకం చేసేటందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అత్యంత వైభవంగా పట్టాభిషేక మహోత్సవం నిర్వహించబడుతుంది.
**********************************************

భట్టి విక్రమాదిత్యులిద్దరూ అన్ని విషయాలనూ సక్రమంగా పర్యవేక్షణ చేస్తూ ఉండగా భర్తృహరి రాజుగా సుఖంగా రాజ్యమేలుతూ ఉంటాడు. అతడు చాలా మంది అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటాడు.


కాని తండ్రికిచ్చిన మాట ప్రకారం సంతానం కలగకుండా జాగ్రత్తపడతాడు.

ఇలా ఉండగా ఒకనాడు చాంద్యోగ ఋషి అనే గొప్ప తపస్సంపన్నుడు దేవలోకం నుండి భూలోకానికి వస్తూండగా ఆయనకు ఒక దివ్యఫలం లభిస్తుంది.

ఆయన భూలోకంలోకి వచ్చి భర్తృహరి ఆస్థానానికి వెళ్తాడు. భర్తృహరి తన సింహాసనం మీద మహర్షిని కూర్చోబెట్టి సేవకుడి మాదిరిగా భక్తి శ్రద్దలతో పరిచర్యలు చేస్తాడు.

అతడి ప్రవర్తనకు సంతోషించిన మహర్షి "రాజా భర్తృహరీ, నేను స్వర్గలోకములో ఉండగా, ఇంద్రుని నందనోద్యాన వనంలో నాకీ పండు దొరికింది. ఈ ఫలము తిన్నవారు నిత్య యవ్వనులుగా వృద్ధాప్యం అనేది లేకుండా ఉంటారు. ఈ పండు నేను తిన్నా లోకానికి ఏ ఉపయోగమూ ఉండదు. నువ్వు ఈ ఫలమును భుజించి కలకాలం ధర్మపాలన చేయవలసింది." అని భర్తృహరిని ఆశీర్వదించాడు.
భర్తృహరి భక్తి శ్రద్దలతో పండుని స్వీకరించి, చాంద్యోగ మహర్షికి కృతజ్ఞతలు తెల్పుకుంటాడు.

భర్తృహరికి పట్టపు రాణి మోహనాంగి అంటే ఎంతో మక్కువ. ఆ పండు ఆమెకు ఇచ్చి, "నేను నిత్య యవ్వనుడిగా ఉండి నువ్వు ముసలిదానివి అయిపోవడం నాకు సుతరామూ ఇష్టం లేదు. కాబట్టి ఈ పండు నువ్వు తిని నా ఎదురుగా కలకాలం యవ్వనంతో ఉండు." అంటాడు.
----------------------------------------------------------------------------
అట్లా భర్తృహరి దివ్యఫలాన్ని తన భార్యకు ఇచ్చాక ఏమి జరుగుతుంది?

సుభాషితాలు చెప్పుకొనే భర్తృహరి రాజవడం ఏమిటి?
మహారాజుగా ఉండవలసిన విక్రమార్కుడు యువరాజు అవడం ఏమిటి అన్న సందేహాలు మీకందరికీ కలుగుతూ ఉండవచ్చు.
అయితే రేపటిదాకా ఆగితే ఆ సందేహాల నివృత్తి జరుగుతుంది. సరేనా?




విక్రమార్కుడి కథలు..........1


అందరూ భోజనాలు ముగించారా? ఇంక కథలు కొనసాగిద్దామా?
నిన్న మొన్న భేతాళుడి పుట్టుక విక్రమార్కుడు వాని కోసం చెట్టెక్కడం తెలుసుకున్నాము కదా!

అసలు భేతాళ కథల్లోకి వెళ్ళే ముందు విక్రమార్కుడు ఎవరు? ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? తల్లితండ్రులు ఎవరు? సోదరులు ఎవరు అని తెలుసుకుందామా?

ఒకానొకప్పుడు చంద్రవర్ణుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను చాలా సౌందర్యవంతుడు. అన్ని విద్యలు శాస్త్రాలలోనూ ఆరితేరినవాడే కాని ఇంకా ఎంతో నేర్చుకోవాలని ఆరాటంతో సద్గురువు కోసం వెతుకుతూ బయలు దేరుతాడు.

అట్లా పోతూపోతూ ఒక అడవికి చేరుతాడు. అప్పటికే బాగా అలిసిపోయి ఉన్న అతడికి ఎదురుగా చిన్న కొండ ఆ ప్రక్కనే ఓ నది ఒడ్డున చాలా పెద్ద రావి చెట్టొకటి కనిపిస్తుంది. చంద్రవర్ణుడు నదిలోకి దిగి దాహం తీర్చుకొని రావి చెట్టు క్రింద విశ్రమిస్తాడు. చల్లని గాలిలో ఆ చెట్టు నీడలో నిద్రపోతాడు.

ఆ రావి చెట్టు మీద, చాలా కాలం నుండీ ఓ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. రాక్షసులలో సత్వగుణం గల రాక్షసులని బ్రహ్మరాక్షసులంటారు. వీరు మహర్షుల వంటి సాధు పురుషులన్న మాట.

అతడు రావి చెట్టు కొమ్మలపై ఉంటూ, ప్రతీరోజూ తపమాచరిస్తూ ఉంటాడు. సంధ్యా వందనం చేసుకోవటానికి చెట్టు దిగి వచ్చిన బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుణ్ణి చూస్తాడు. అతనిలో కనిపిస్తున్న వర్చస్సు చూసి అతని పట్ల బ్రహ్మరాక్షసుడికి ఎంతో వాత్సల్యం కలుగుతుంది. నదిలో స్నానం చేసి, చంద్రవర్ణుడి దగ్గరికి వచ్చి, అతణ్ణి తట్టి లేపుతాడు.

నిద్రలేచిన చంద్రవర్ణుడు, ఎదురుగా ఉన్న బ్రాహ్మ రాక్షసుడిని చూసి, నమస్కరించి నిలబడతాడు. బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడిని, "ఎవరు నీవు? ఈ నిర్జనారణ్యానికి ఎందుకు వచ్చావు?" అని అడుగుతాడు.

చంద్రవర్ణుడు "నా పేరు చంద్రవర్ణుడు. సద్గురువును అన్వేషిస్తూ తిరుగుతున్నాను. మీరెవ్వరో పండితుల వలె కనబడుతున్నారు. దయ చేసి, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి" అంటాడు.

బ్రహ్మరాక్షసుడికి, చంద్రవర్ణుడిపై కలిగిన వాత్సల్యం, అతడి మాటలు వినేసరికి రెట్టింపయ్యింది. ఎంతో దయగా "నాయనా! తప్పకుండా. నాకు తెలిసిన విద్యలన్నిటినీ నీకు ఆరునెలల్లో నేర్పుతాను. అయితే ఒక నియమం ఉన్నది" అంటాడు.

"ఆరునెలలు పాటు నువ్వు ఆకలిదప్పులు, అలసటా మరిచిపోవాలి. అన్నపానాదులు, నిద్రా విశ్రాంతులు మానేసి, అనుశృతంగా నేర్చినట్లయితేనే నీకు నేను విద్యలు నేర్పగలను" అంటాడు.

"నేను నీకో మంత్రం ఉపదేశిస్తాను. ఆ ప్రభావంతో నీకు ఆరునెలలుపాటు అలసట, నిద్ర, ఆకలి, దప్పికలు ఉండవు. నేను రావిచెట్టు పై నుండి, రావి ఆకుల మీద శ్లోకాలను వ్రాసి క్రింద పడవేస్తాను. నీవా ఆకులని గ్రహించి, వాటిపై శ్లోకములను పఠించవచ్చు" అంటాడు.

అట్లా విద్యాభ్యాసం మొదలయింది. బ్రహ్మరాక్షసుడు రావి ఆకుల మీద శ్లోకాలు రాసి కింద పడవేయడం, చంద్రవర్ణుడు అవి చదువుకొని నేర్చుకోవడం, ఈ విధంగా ఆరునెలల కాలం గడిచింది.

ఒకనాడు.......................
ఆకాశం నుండి దేవరధం దిగి వస్తుంది. బ్రహ్మ రాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోతాడు. చంద్రవర్ణుడు ఆశ్చర్యంగా చూస్తూఉండగా ఆ దివ్యపురుషుడు చంద్రవర్ణుడు వైపు తిరిగి "చంద్రవర్ణా! నేనొక యక్షుడను. సకల శాస్త్రాలూ నేర్చిన వాణ్ణి. అయితే దురదృష్టవ శాత్తూ ఆ పాండిత్యం నాలో అహంకారం వల్ల మహర్షులని అగౌరవించాను. వారు రాక్షసుడవు కమ్మని నన్ను శపించారు. క్షమించమని వారి పాదాల బడి ప్రార్దించగా, యోగ్యుడైన శిష్యుడికి విద్యాదానం చేస్తే శాప విమోచనం కలుగుతుందని చెప్పారు.

అప్పటి నుండి ఈ రావి చెట్టుపై ఉంటూ, తగిన శిష్యుని కోసం ఎదురు చూస్తూ, కాలం గడుపుతున్నాను. నీ కారణంగా ఇన్నాళ్ళకు శాప విముక్తుడ నైనాను." అంటూ, అప్పటి వరకూ బ్రహ్మరాక్షసుడులా ఉన్న యక్షుడు, చంద్రవర్ణుడి తలపై చేయి ఉంచి దీవించి అంతర్ధానమై పోతాడు.

చంద్రవర్ణుడు గురువు చెప్పిన శ్లోకాలు వ్రాసి ఉన్న రావి ఆకులని మూటగట్టుకొని తిరుగు ప్రయాణమైతాడు. యక్షుడు చెప్పిన మంత్ర ప్రభావం పూర్తి కావస్తుండటంతో, అతణ్ణి ఆకలి, దప్పిక, నిద్ర ముంచుకొస్తాయి. ఒక ధనికుల ఇంటి ముందరికి చేరి ఇంటి అరుగు మీద జారగిలబడతాడు.

ఆ భవంతి అలంకారవల్లి అనే రాజనర్తకి వేశ్యది. అప్పటికి రాత్రి అయింది. దేవాలయములో నాట్యం ముగించుకొని, అలంకార వల్లి ఇల్లు చేరుతుంది. ఇంటి అరుగు మీద ఎవరో ఉండటాన్ని గమనించింది. "ఎవరూ?" అని అడుగుతూ ఇంటిలోనికి బోయి పెద్ద దీపము తెచ్చి బ్రహ్మరాక్షసుడు శ్లోకాలు రాసి ఇచ్చిన రావి ఆకుల మూట తలక్రింద పెట్టుకొని ఆదమరిచి పడి ఉన్న చంద్రవర్ణుడిని చూస్తుంది.

అతడి వివరాలు తెలుసుకుందామని రావి ఆకుల మూట విప్పి చూసిన ఆమెకు అతడిపై ఆకర్షణ కలుగుతుంది. అతడెవ్వరో గొప్ప పండితుడై ఉంటాడని వైద్యులని రప్పిస్తుంది.
వాళ్ళు పరీక్షించి "ఆరునెలలు నుండి నిద్రాహారాలు లేక పోబట్టి స్పృహ కోల్పోయినాడు."

"ప్రతి రోజూ ఒక పడి బియ్యమును వండి, ఒక పడి ఆవు నేతితో కలిపి, మెత్తని
లేహ్యము వలె చేసి తల నుండి కాలి వేళ్ళ వరకూ మర్ధనా చేయాలి. రోజుకు రెండు సార్లు చేయాలి. ఆ విధంగా అతడి ప్రాణాలు కాపాడవచ్చును." అంటారు.
అలంకార వల్లి స్వయంగా తానే దగ్గరుండి సేవలు చేస్తుంది.

తొమ్మిదో రోజున చంద్రవర్ణుడికి స్పృహ వస్తుంది. చుట్టూ పరికించి చూస్తాడు. ఆ ఇల్లు బ్రాహ్మణులది కాదనీ, వేశ్యాంగన ఇల్లనీ అర్ధమయి రావి ఆకుల మూటను తీసుకుని, చప్పుడు చెయ్యకుండా వెళ్ళిపోవడానికి బయలు దేర్తాడు.

గమనించిన అలంకార వల్లి అతడి చేయి పట్టుకుని ఆపి. "స్పృహ లేని నీకు వైద్యం చేయించాను. నీ ప్రాణాలు కాపాడాను. ఆ విధంగా చెప్పాలంటే నేను నీ ప్రాణదాతను. కనీసం ఒక్కమాట కృతజ్ఞత అయినా చెప్పకుండా నా ఇల్లు విడిచి పోతున్నావు. వెళ్ళ నివ్వను" అంటూ అడ్డం పడుతుంది.

"నన్ను కాపాడినందుకు ఎంతగానో కృతజ్ఞుణ్ణి. నన్ను వెళ్ళనీయక ఎందుకు అభ్యంతర పెడుతున్నావు?" అంటాడు.
"నేను నిన్ను పెండ్లియాడ గోరుతున్నాను."అంటుంది.

చంద్రవర్ణుడు "నేను బ్రాహ్మణుడను. మనకు వివాహము కుదరదు. దయ యుంచి నన్ను వెళ్ళనివ్వు" అంటూ ఆమెని దాటుకుని వీధిలోకి వస్తాడు.
అలంకార వల్లి విడిచి పెట్టదు. వీధిలో జరిగే ఈ గొడవ చూడటానికి జనం మూగుతారు. ఈ వార్త రాజుకు చేరుతుంది.

రాజు శుద్దవర్మ రాజ భటులని పంపించి వాళ్ళని సభకి పిలిపిస్తాడు. భటులు అలంకార వల్లినీ, చంద్రవర్ణుడినీ రాజసభకు తీసుకువెళ్తారు.
రాజు చంద్రవర్ణుని చూడగానే అతని వర్చస్సుకు ముచ్చట పడతాడు. "ఎందుకు మీరు వీధినబడి పోట్లాడుకుంటున్నారు?" అని అడుగుతాడు.
చంద్రవర్ణుడు "మహారాజా! నేను బ్రాహ్మణుడను. కొన్ని దినముల క్రిందట నేను అనారోగ్యంతో బ్రాహ్మణుల ఇల్లు అనుకొని ఈ యువతి ఇంటి ఆరుగుపైన పడుకున్నాను. ఇప్పుడీమె, నాకు వైద్యము చేయించి నా ప్రాణములు నిలిపినందుకు ఆమెను వివాహ మాడమని నన్ను బలవంత పెడుతోంది" అంటాడు.

అతడి దంతా చెబుతున్నంత సేపూ, రాజు శుద్దవర్మ సుగుణ శీలియైన ఇతడికి నా కుమార్తె చిత్రరేఖ నిచ్చి వివాహము చేస్తే బాగుంటుంది కదా?’ అని ఆలోచిస్తున్నాడు.

సభలో మంత్రి, రాజ పురోహితుడూ కూడా సరిగ్గా ఇలాగే ఆలోచిస్తారు.

రాజు శుద్దవర్మ సభలోని శాస్త్రపురోహితులని, పెద్దలని... అలంకార వల్లి, చంద్రవర్ణుల తగువుని తీర్చమని అడుగుతాడు.

పండితులు "మహారాజా! అలంకార వల్లి సమయానికి ఆదుకోకపోయి ఉంటే, చంద్రవర్ణుడు మరణించే వాడు. కాని చంద్రవర్ణుడు బ్రాహ్మణుడు అయినందు వలన, వేశ్యాంగన అయిన అలంకార వల్లిని నిరాకరిస్తున్నాడు.

ఇందుకొక తరుణోపాయముంది. ఒక బ్రాహ్మణుడు ఇతర వర్గమునకు చెందిన స్త్రీని వివాహమాడదలిస్తే, అదే ముహుర్తములో నాలుగు కులాల వధువులను వివాహ మాడితే దోషముండదు." అని తేల్చి చెప్తారు.

రాజు శుద్దవర్మ "చంద్రవర్ణుని చూస్తే నాకు ముచ్చట కలుగుతోంది. నా కూతురు చిత్రరేఖను, ఇతడికిచ్చి వివాహము చేద్దామనుకుంటున్నాను" అంటాడు,

వెంటనే మంత్రి సోమశేఖరుడు లేచి "మహారాజా! నేనూ కూడా అదే ఆలోచనలో ఉన్నాను. నేను వైశ్యుడను. నా కూతురు కోమాలాంగిని ఇతడి కిచ్చి పెళ్ళి చేస్తాను" అంటాడు.

రాజపురోహితుడు లేచి "ప్రభూ! నేనూ నా కుమార్తె కళ్యాణిని ఇతడి కిచ్చి వివాహము చేస్తాను" అంటాడు. చంద్రవర్ణుడిందుకు ఒప్పుకుంటాడు.

ఒక శుభముహుర్తాన నాలుగు కులాల వధువులతో చంద్రవర్ణుడి వివాహం మహా వైభవంగా జరుగుతుంది.

సరే......ఇంతకూ విక్రమార్కుడి గురించిచెప్తానంటూ ఎవరో కోన్ కిస్కా చంద్రవర్ణుడి పెళ్ళి కథ చెప్తున్నావు ఏంటీ అని అందరూ గుర్రుమంటూన్నారని తెలుసు. దానికి సమాధానం కోసం కాస్త రేపటిదాకా వేచి ఉండగలుగుతారా????????

No comments:

Post a Comment