Saturday 22 September 2018

పంచతంత్రం.



అంబాళం పార్థసారథి,
08-02-2019, శుక్రవారం,
#హరిః ఓమ్🙏
శుభోదయం.
#వందే సంస్కృతమాతరమ్'
801. శ్లోకం || ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్,*
*శ్రూయతాం ధర్మసర్వస్వం శ్రుత్వా చైవావధార్యతామ్.*
*--పంచతంత్రం. కా.కీ.3-106.*
ధర్మసారం తెలియజేస్తాను వినండి. విని, హృదయంలో పదిలం చేసుకోండి. 'ఎలాంటి పని మీకు అప్రియంగా అనిపిస్తుందో, ఆ పనిని ఇతరుల పట్ల చేయకూడదు'.
***
ఈ సంసారం నిస్సారమైంది. ప్రాణాలు క్షణికాలు. ప్రియులతోడి కలయిక స్వప్నంతో సమానం. కుటుంబ సంబంధం ఇంద్రజాలతుల్యం. అందువల్ల ధర్మం తప్ప వేరే దిక్కు లేదు. అందుకే మహాత్ములు ఇలా అన్నారు శరీరాలు అశాశ్వతాలు. మృత్యువు అతి దగ్గరలో ఉంది. కాబట్టి, ఉన్న కాస్త సమయాన్ని ధర్మానికి కట్టుబడి జీవించాలి.
*యస్య ధర్మవిహీనాని దినాన్యాయాంతి యాంతి చ, స లోహకారభస్త్రేవ శ్వసన్నపి న జీవతి. నాచ్ఛాదయతి కౌపీనం న దంశమశకాపహమ్, శునః పుచ్ఛమివ వ్యర్థం పాండిత్యం ధర్మవర్జితమ్.*,
ఎవడి రోజులు ధర్మానుష్ఠానశూన్యాలై వస్తూ పోతూ ఉంటాయో, వాడు కమ్మరివాడి కొలిమి తిత్తిలాగ ఊపిరి పీల్చుతున్నా మరణించిన వాడితో సమానం. ఎలాగైతే కుక్కతోక, పైకి వంకర తిరిగి వంగి ఉండడం వలన, మర్మాంగ రక్షణకు కానీ, ఈగలు దోమలు తోలుకోవడానికి కానీ ఉపయోగపడక వ్యర్థంగా ఉంటుందో! అలాగే, ధర్మానుష్ఠానం లేని సన్న్యాసి పాండిత్యం కూడా వ్యర్థమే.
*అన్యచ్చ- పులాకా ఇవ ధాన్యేషు పూతికా ఇవ పక్షిషు, మశకా ఇవ మర్త్యేషు యేషాం ధర్మో న కారణమ్. శ్రేయః పుష్పఫలం వృక్షాద్దధ్నః శ్రేయో ఘృతమ్ స్మృతమ్, శ్రేయస్తైలం చ హిణ్యకాచ్ఛ్రేయో ధర్మస్తు మానుషాత్.*,
అంతేకాదు, ధాన్యములోని తాలుగింజలు (పులకాః), పక్షులలోని పూతికలు (దుర్వాసన వచ్చే పక్షి జాతి), ప్రాణులలో దోమలు ఎలా వ్యర్థమైనవో, అలాగే ధర్మవర్తన లేనివారి జీవితాలు కూడా వ్యర్థమైనవే. అలాగే, చెట్టుకంటే దాని పుష్పాలు ఫలాలు, పెరుగుకంటే దాని నుండి లభించే నెయ్యి, గానుగపిండికంటే నూనె, మానవ శరీరంకంటే, ఆ శరీరంచేత సాధింపబడిన ధర్మం చాలా శ్రేష్ఠమైనవి.
*సృష్టా మూత్రపురీషార్థమాహారాయ చ కేవలమ్, ధర్మహీనాః పరార్థాయ పురుషాః పశవో యథా, స్థైర్యం సర్వేషు కృత్యేషు శంసంతి నయపండితాః, బహ్వంతరాయయుక్తస్య ధర్మస్య త్వరితా గతిః.*,
ధర్మాచరణలేని పురుషులు కేవలం మలమూత్రాలు వదలడానికి, తినడానికి, పశువులవలె ఇతర పనులు చేయడానికి జన్మిస్తారు. అన్ని పనులలో తొందరపాటు లేకపోవడాన్ని ప్రశంసిస్తారు నీతిశాస్త్రజ్ఞులు. అయితే, అనేక విఘ్నాలతో కూడిన ధర్మకార్యాలను మాత్రం త్వరగా చేయాలని అంటారు.
*సంక్షేపాత్ కథ్యతే ధర్మో జనా విస్తరణేవ కిమ్, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్, శ్రూయతాం ధర్మసర్వస్వం శ్రుత్వా చైవావధార్యతామ్.*,
'ఓ మానవులారా! సంగ్రహంగా మీకు ధర్మసూక్ష్మాలు తెలుపుతాను. విస్తరించి చెప్పడం వలన లాభం లేదు. సూక్ష్మంగా చెప్పాలంటే, *ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఇతరులను పీడీంచడం పాపం*. ఇదే అసలైన ధర్మం. ఇక ధర్మసారం తెలియజేస్తాను వినండి. విని, హృదయంలో పదిలం చేసుకోండి. *ఎలాంటి పని మీకు అప్రియంగా అనిపిస్తుందో, ఆ పనిని ఇతరుల పట్ల చేయకూడదు*.
"అథ తస్య తాం ధర్మోపదేశనాం శ్రుత్వా శశక ఆహ-'భోః, భోః కపింజల! ఏష నదీతీరే తపస్వీ ధర్మవాదీ తిష్ఠతి. తదేనం పృచ్ఛావః. కపింజల ఆహ-",
అడవిపిల్లి (తీక్ష్ణదంష్ట్రుడి) ధర్మోపదేశం వినిన కుందేలు ఇలా అంది- 'ఓ కపింజలా! ఇదిగో, నదీతీరంలో ధర్మోపదేశికుడైన తపస్వి ఉన్నాడు. కాబట్టి, ఇతడిని అడుగుదాం! అన్నాడు. అప్పుడు కపింజలుడు (పిచ్చుక) ఇలా అంది.
మరి పిచ్చుక ఏమన్నదో రేపటి శ్లోక వివరణలో తెలుసుకుందాం!
అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.
అంబాళం పార్థసారథి,
09-02-2019, శనివారం,
PBEL City, Hyderabad.
#హరిః ఓమ్🙏
శుభోదయం.
#వందే సంస్కృతమాతరమ్'
803. గద్యం|| అథ తస్య తద్వచనమాకర్ణ్య 'సాధ్వనేనాభిహిత'
మిత్యుక్త్వా భూయోపి పార్థివాత్యం సమేత్య
మంత్రయిష్యామహే' ఇతి బ్రువాణాః సర్వే పక్షిణో
యథాభిమతం జగ్ముః.
--పంచతంత్రం. కా.కీ.3-112.
ఇలా కాకి చెప్పిన దానిని విని- 'ఇతడు చక్కగా చెప్పాడు. మళ్లీ అందరం చేరి, ప్రభువు విషయాన్ని ఆలోచన చేద్దామని చెప్పుకుంటూ ఆ పక్షులన్నీ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయాయి.
***
అందుకని, మీరిద్దరూ నాకు దగ్గరకు రండి. నా ఎదుట మీ వివాదం తెలుపండి. అప్పుడు, చక్కగా గ్రహించి సరియైన తీర్పును ఇస్తాను. దీనివలన, నాకు పరలోకబాధ తప్పుతుంది. ఈ విషయంలో విజ్ఞులేమన్నారో తెలుసా?
*మానాద్వా యది వా లోభాత్ క్రోధాద్వా యది వా భయాత్, యో న్యాయమన్యథా బ్రూతే స యాతి నరకం నరః. పంచ పశ్వనృతే హంతి దశ హంతి గవానృతే, శతం కన్యానృతే హంతి సహస్రం పురుషానృతే.*,
ఎవరైతే గౌరవం ఆశించి గానీ, లోభం వలన గానీ, క్రోధంచేతగానీ, భయం చేతగానీ, న్యాయ నిర్ణయం సరిగా చేయడో అటువంటివాడు నరకాన్ని పొందుతాడు. పశువు విషయంలో అసత్యం పల్కినవాడికి, ఐదుగురు పురుషులను చంపిన పాపం, ఆవు విషయంలో అసత్యం పలికినవాడకి పది మంది పురుషులను చంపిన పాపం, కన్యక విషయంలో అసత్యం పలికినవాడికి నూరుగురు పురుషులను చంపిన పాపం, పురుషుని విషయంలో అసత్య పలికిన వాడికి వేయి మంది పురుషులను చంపిన పాపం కలుగుతుంది.
*ఉపవిష్టః సభామధ్యే యో న వక్తి స్ఫుటం వచః, తస్మాద్దూరేణ న త్యాజ్యో న్యాయో వా కీర్తయేదృతమ్. తస్మాద్విస్రబ్ధౌ మమ కర్ణోపాంతికే స్ఫుటం నివేదయతమ్' ఇతి. కిం బహునా తేన క్షుద్రేణ తథా తౌ పూర్ణం విశ్వాసితౌ యథా తస్యోత్సంగవర్తినౌ జాతౌ. తతశ్చ తేనాపి సమకాలమేనైకః పాదాంతేక్రాంతోన్యో దంష్ట్రాక్రకచేన చ. తతో గతప్రాణౌ భక్షితావితి. అతోహం బ్రవీమి- 'క్షుద్రమర్థపతిం ప్రాప్య. ఇతి.*,
ఎవరు సభామధ్యలో ధర్మపీఠంపై కూర్చొని సరిగా మాట్లాడడో అనగా సత్యం పలుకడో అటువంటి వాడిని దూరంగా వదిలివేయాలి. ఇక్కడ సత్యమే న్యాయంగా కీర్తింపబడింది. కాబట్టి, సందేహం విడిచిపెట్టి, నా చెవి దగ్గరకు వచ్చి స్ఫుటంగా చెప్పండని తీక్ష్ణదంష్ట్రుడు చెప్పాడని' కాకి చెప్పింది. ఆ తరువాత ఇక వేరే చెప్పేదేముంది? ఆ క్షుద్రుడిని అవి పూర్తిగా నమ్మాయి. తొడల దగ్గరకు పోయాయి. వెంటనే అది (తీక్ష్ణదంష్ట్రుడు-అడవిపిల్లి) ఒకేసారి ఒక దానిని కాలి గోళ్లతో, రెండవ దానిని ఱంపం వంటి వాడి కోరలతో పట్టుకుని, చంపి తినేసింది. అందుకే, 'క్షుద్రమర్థపతిం ప్రాప్య' నీచుడైన ప్రభువును పొందితే ఇలాంటివి జరుగుతాయని నేను చెప్తున్నాను.
*భవంతోప్యేనం దివాంధం క్షుద్రమర్థపతిమాసాద్య రాత్ర్యంధాః సంతః శశకపింగలమార్గేణ యాస్యంతి. ఏవం జ్ఞాత్వా యదుచితమ్ తద్విధేయమ్, ఇతి. అథ తస్య తద్వచనమాకర్ణ్య 'సాధ్వనేనాభిహిత' మిత్యుక్త్వా 'భూయోపి పార్థివాత్యం సమేత్య మంత్రయిష్యామహే' ఇతి బ్రువాణాః సర్వే పక్షిణో యథాభిమతం జగ్ముః.*,
తాము, ఈ దివాంధుడైన (పగలు చూపు లేనివాడు) నీచుడైన ప్రభువును పొంది, రాత్రి చూపులేనివారు కావడం వలన, శశకపింజములవలె (కుందేలు, కముజపిట్టలలాగ) చస్తారు. దీనిని గుర్తించి సముచితంగా నడవండి. ఇలా కాకి చెప్పిన దానిని విని- 'ఇతడు చక్కగా చెప్పాడు మళ్లీ అందరం చేరి, ప్రభువును నిర్ణయించే విషయాన్ని తరువాత ఆలోచన చేద్దామని చెప్పుకుంటూ ఆ పక్షులన్నీ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయాయి.
కథలో తరువాత జరిగే పరిణామాలను రేపటి శ్లోక వివరణలో తెలుసుకుందాం!
అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.
అంబాళం పార్థసారథి,
11-02-2019, సోమవారం,
PBEL City, Hyderabad.

'వందే సంస్కృతమాతరమ్'
*804. శ్లోకం|| ఆదేశకాలజ్ఞమనాయతక్షమం*
*యదప్రియం లాఘవకారిచాత్మనః*
*యోత్రాబ్రవీత్కారణవర్జితం వచో*
*న తద్వచః స్యాద్విసమేవ తద్భవేత్*
*--పంచతంత్రం. కా.కీ.3-114.*
ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా, ఏ కారణం లేకుండానే దేశకాలాలకు విరుద్ధమైనది, ఇతరులకు అప్రియమైనది, తనకు తక్కువతనాన్ని కలిగించే మాటలు మాట్లాడుతాడో, ఆ మాటలు మాటలు కాదు, అవి విషమే అవుతాయి.
***
ఇలా కాకి చెప్పిన దానిని విని- 'ఇతడు చక్కగా చెప్పాడు. మళ్లీ మనమందరం కలిసి, ప్రభువును నిర్ణయించే విషయాన్ని తరువాత ఆలోచన చేద్దామని చెప్పుకుంటూ ఆ పక్షులన్నీ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయాయి.
*కేవలమవశిష్టభద్రాసనోపవిష్టోభిషేకాభిముఖో దివాంధః కృకాలికయా సహాస్తే. ఆహ చ- 'కః కోత్ర భోః! కిమద్యాపి న క్రియతే మమాభిషేకః?' ఇతి. తచ్ఛ్రుత్వా కృకాలికయాభిహితమ్- 'భద్ర, కృతోయం విఘ్నస్తే కాకేన. గతాశ్చ సర్వేపి విహగా యథేప్సితాసు దిక్షు కేవలమేకోయం వాయసోవశిష్టస్తిష్ఠతి కేనాపి కారణేన. తత్త్వరితముత్తిష్ఠ, యేన త్వాం స్వాశ్రయం ప్రాపయామి.*,
అక్కడ కేవలం కృకాలికతో (గుడ్లగూబ) కలసి రాజ సింహాసనంపై కూర్చుని, తన అభిషేకానికి నిరీక్షిస్తూ, ఎవరూ లేకపోవడం గమనించి- 'ఎవరక్కడ? ఇప్పటికీ నా అభిషేకం ఎందుకు చేయరు?' అని అంది. అది విన్న కృకాలిక ఇలా చెప్పింది- శుభమూర్తీ! కాకి వచ్చి, నీ అభిషేకానికి విఘ్నం చేసింది. పక్షులన్నీ తమకు నచ్చిన దిక్కులకు వెళ్ళిపోయాయి. ఈ కాకి ఒకటే, ఏదో కారణంగా ఇక్కడే ఉంది. కాబట్టి, మీరు త్వరగా లేవండి. మనం వేరే చోటికి వెళదాం.
*తచ్ఛ్రుత్వా సవిషాదములూకో వాయసమాహ- 'భో భో! దురాత్మన్! కిం మయా తేపకృతమ్ యద్రాజ్యాభిషేకో మే విఘ్నతః? తదద్యప్రభృతి సాన్వయమావయోర్వైరం సంజాతమ్. ఉక్తంచ- రోహతే సాయకైర్విద్ధం ఛిన్నం రోహతి చాసినా, వచో దురుక్తం భీభత్సం న ప్రరోహతి వా క్షతమ్. ఇత్యేవమభిదాయ కృకాలికయా సహ స్వాశ్రయం గతః.*,
ఆ మాట విన్న ఉలూకం (గుడ్లగూబ) మిక్కిలి విషాదం పొంది, కాకితో ఇలా అంది- 'ఓరోరీ దుష్టుడా! నేను నీకు ఏమి కీడు చేశాను? నా రాజ్యాభిషేకం ఎందుకు చెడగొట్టావు. అందుచేత నేటి నుండి మన ఇద్దరికీ వంశపారంపర్యంగా వైరం జనించింది. అందుకే విజ్ఞులిలా అన్నారు- 'బాణాలచేత, ఖడ్గంచేత కలిగిన గాయాలు కొంత శ్రమతో మానిపోతాయి కానీ, చెడు మాటల ద్వారా హృదయానికి కలిగిన గాయం ఎప్పటికీ మారదు. ఈ విధంగా పలికి కృకాలికతో (ఆడ గుడ్లగూబతో) తన నివాసానికి వెళ్లిపోయింది.
*అథ భయవ్యాకులో వాయసో వ్యచింతయత్- 'అహో, అకారణం వైరమాసాదితం మయా. కిమిదం వ్యాహృతమ్? ఉక్తంచ- ఆదేశకాలజ్ఞమనాయతక్షమం యదప్రియం లాఘవకారిచాత్మనః యోత్రాబ్రవీత్కారణవర్జితం వచో న తద్వచః స్యాద్విసమేవ తద్భవేత్.*,
అప్పుడు కాకి భయంతో కలతచెందినదై ఇలా విచారించింది- 'అయ్యో! కారణం లేకుండానే నేను విరోధం పొందాను. ఎందుకిలా మాట్లాడాను? అందుకే విజ్ఞులిలా అన్నారు- ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా, ఏ కారణం లేకుండానే దేశకాలాలకు విరుద్ధమైనది, ఇతరులకు అప్రియమైనది, తనకు తక్కువతనాన్ని కలిగించే మాటలు మాట్లాడుతాడో, ఆ మాటలు, మాటలు కాదు, అవి విషమే అవుతాయి.
*బలోపపన్నోపి హి బుద్ధిమాన్నరః పరేనయేన్న స్వయమేవ వైరితామ్, 'భిషఙ్మమాస్తీ' తి విచింత్య భక్షయేదకారణాత్ కో హి విచక్షణో విషమ్. పరపరివాదః పరిషది న కథంచిత్ పండితేన వక్తవ్యః, సత్యమపి తన్నవాచ్యం యదుక్తమసుఖావహం భవతి.*,
బలవంతుడైనను, బుద్ధిమంతుడైన మానవుడు స్వయంగా పరులతో విరోధం కలిగించుకునే పని చేయరాదు. తెలివిగలవాడెవడూ 'నాకు వైద్యుడు ఉన్నాడని' నిష్కారణంగా విషాన్ని తినడు కదా! అలాగే, జ్ఞానియైనవాడు సభలో ఇతరుల ముందు పరనింద చేయరాదు. ఆ నింద సత్యమైనదైనా, ఒకవేళ దుఃఖదాయకమైతే అసలు చేయరాదు.
అలా, కాకి ఇంకా తనలో తాను ఏమని తలపోసిందో, రేపటి గద్య వివరణలో తెలుసుకుందాం!
అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.
అంబాళం పార్థసారథి, 


#వందే సంస్కృతమాతరమ్
805. గద్యం || అథ తేన తస్మై శాస్త్రోక్తః పీవరతనుః పశుః ప్రదత్తః.
సోపి తం సమర్థ మితస్తతశ్చ గచ్ఛంతం విజ్ఞాయ
స్కంధే కృత్వా సత్వరం స్వపురాభిముఖం ప్రతస్థే.
--పంచతంత్రం. కా.కీ.4-118.
శాస్త్రసమ్మతమైన బలసిన ఒక మేకపోతును బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆ మేకపోతు అటు ఇటు పోతుండడం వలన, ఆ బ్రాహ్మణుడు దానిని భుజాలపై ఉంచుకున్నాడు. త్వరత్వరగా తన నగరం వైపుకు వెళ్లసాగాడు.)
***
తెలివిగలవాడెవడూ 'నాకు వైద్యుడు ఉన్నాడని' అనుకొని నిష్కారణంగా విషాన్ని తినడు కదా! జ్ఞానియైనవాడు సభలో ఇతరుల ముందు పరనింద చేయరాదు. ఆ నింద సత్యమైనదైనా, ఒకవేళ దుఃఖదాయకమైతే అసలు చేయరాదు.
*సుహృద్భిరాప్తైరసకృద్విచారితం స్వయం చ బుద్ధ్యా ప్రవిచారితాశ్రయమ్, కరోతి కార్యం ఖలు యః సబుద్ధిమాన్ స ఏవ లక్ష్మ్యా యశసాంచ భాజనమ్. ఏవం విచింత్య కాకోపి ప్రయాతః. తదాప్రభృత్యస్మాభిః సహ కౌశికానామన్వయాగతం వైరమస్తి.*,
ఎవరు ఆప్తులైన మిత్రుల ద్వారా పలుమార్లు విచారించి, స్వబుద్ధిచేత చక్కగా విచారించి కార్యం చేస్తాడో! అతడే సంపదకు, కీర్తికి ఆశ్రయమవుతాడు. ఇలా ఆలోచించి కాకి కూడా వెళ్లి పోయింది. అది మొదలు గుడ్లగూబలకు మనకు వంశపారంపర్యంగా విరోధం వచ్చింది.
*మేఘవర్ణ ఆహ- 'తాత, ఏవంగతేస్మాభిః కిం క్రియేత? స ఆహ- 'వత్స, ఏవంగతేపి షాడ్గుణ్యాదపరః స్థూలోభిప్రాయోస్తి. తమంగీకృత్య స్వయమేవాహం తద్విజయాయ యాస్యామి. రిపూన్ వంచయిత్వా వధిష్యామి. ఉక్తంచ- బహుబుద్ధిసమాయుక్తాః సువిజ్ఞానా బలోత్కటాన్, శక్తా వంచయితుం ధూర్తా బ్రాహ్మణం ఛాగలాదివ. మేఘవర్ణ ఆహ- 'కథమేతత్?' సోబ్రవీత్-*,
దానికి, మేఘవర్ణుడు (వాయసరాజు) ఇలా అడిగాడు- 'తండ్రీ! ఇలాంటి స్థితిలో మనం ఏమి చేయాలి? అప్పుడు, స్థిరజీవి అనే కాకి ఇలా చెప్పాడు- 'బిడ్డా! ఇలాంటి స్థితిలో కూడ, సంధి, విగ్రహాదులైన ఆరు ఉపాయాలకంటే వేరైన సమర్థమైన ఉపాయం ఒకటుంది. దానిని ఆశ్రయించి స్వయంగా నేనే అతడిని జయించడానికి వెళతాను. శత్రువులను జయించి వస్తాను. అందుకే, విజ్ఞులిలా అన్నారు- 'ధూర్తులు (వంచకులు) బ్రాహ్మణుని వంచించి మేకపోతును దొంగిలించిన విధంగా బహువిధమైన బుద్ధులతో కూడినవారు, లోకజ్ఞాననిపుణులు, కార్యసాధకులైన పురుషులు కూడా, బలవంతులైన శత్రువులను సైతం మోసగించగలరు. అప్పుడు, మేఘవర్ణుడిలా- 'అది ఎలా జరిగిందని?' అడిగాడు. దానికి స్థిరజీవి అనే కాకి ఈ క్రింది కథను చెప్పాడు-.
*ధూర్తబ్రాహ్మణఛాగకథా అనే 4వ కథ*
*కస్మింశ్చిదధిష్ఠానే మిత్రశర్మా నామ బ్రాహ్మణః కృతాగ్ని హోత్రపరిగ్రహః ప్రతివసతి స్మ. తేన కదాచిన్మాఘమాసే సౌమ్యానిలే ప్రవాతి, మేఘాచ్ఛాదితే గగనే, మందం మందం ప్రవర్షతి పర్జన్యే, పశుప్రార్థనార్థం కించిద్గ్రామానంతరం గత్వా కశ్చిద్యజమానో యాచితః.*,
ఒకానొక నగరంలో మిత్రశర్మ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడికి అగ్నిహోత్రం నిర్వహించే నియమం ఒకటుంది. ఒకసారి మాఘమాసం వచ్చింది. చల్లని గాలి వీస్తుంది. ఆకాశం మేఘాలచేత కప్పబడింది. కొద్దికొద్దిగా మంచువర్షం కురుస్తుంది. అప్పుడతడు బలిపశువును యాచించేందుకై వేరే ఒక గ్రామం వెళ్లాడు. ఒక పశువుల యజమానిని ఇలా అర్థించాడు- .
*భో యజమాన, ఆగామిన్యామమావాస్యాయామహం యక్ష్యామి యజ్ఞమ్, తద్దేహి మే పశుమేకమ్' అథ తేన తస్మై శాస్త్రోక్తః పీవరతనుః పశుః ప్రదత్తః. సోపి తం సమర్థ మితస్తతశ్చ గచ్ఛంతం విజ్ఞాయ స్కంధే కృత్వా సత్వరం స్వపురాభిముఖం ప్రతస్థే.*,
'ఓ పశుయజమానుడా! నాకు ఒక పశువును దానం చేయి. నేను వచ్చే అమావాస్య నాడు ఒక యజ్ఞం చేయాలని' అడిగాడు. అప్పుడాపశుయజమాని, శాస్త్రసమ్మతమైన బలసిన ఒక మేకపోతును బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆ మేకపోతు అటు ఇటు పోతుండడం వలన, ఆ బ్రాహ్మణుడు దానిని భుజాలపై ఉంచుకున్నాడు. త్వరత్వరగా తన నగరం వైపుకు వెళ్లసాగాడు.
కథలో తరువాత జరిగే పరిణామాలను రేపటి గద్య వివరణలో తెలుసుకుందాం!
అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.
అంబాళం పార్థసారథి,
13-2-2019, బుధవారం,
హరిః ఓమ్🙏

శుభోదయం.

*'వందే సంస్కృతమాతరమ్'*
*806. గద్యం|| 'అహో! కిమందో భవాన్ యత్పశుం* 

*సారమేయత్యేన ప్రతిపాదయసి.*

*--పంచతంత్రం. కా.కీ.4-120.*
'అహో! నువ్వేమైనా గ్రుడ్డివాడివా? మేకపోతును కుక్క అంటున్నావు.

***

'నాకు ఒక పశువును దానం చేయి. నేను వచ్చే అమావాస్య నాడు ఒక యజ్ఞం చేయబోతున్నానని' పశు యజమానిని అడిగాడు మిత్రశర్మ. దానికి పశుయజమాని, శాస్త్రసమ్మతమైన బలసిన ఒక మేకపోతును బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆ మేకపోతు ఒక ప్రక్క ఉండకుండా, అటు ఇటు పోతుండడం వలన, ఆ బ్రాహ్మణుడు దానిని భుజాలపై మోస్తూ, త్వరత్వరగా తన నగరం వైపుకు వెళ్లసాగాడు.
*అథ తస్య గచ్ఛతో మార్గే త్రయో ధూర్తాః క్షుత్ క్షామకంఠాః సమ్ముఖా బభూవుః. తైశ్చ తాదృశం పీవరతనుం స్కంధమారూఢమవలోక్య మిథోభిహితమ్- 'అహో, అస్య పశోర్భక్షణాదద్యతనీయో హిమపాతో వ్యర్థతాం నీయతే. తదేనం వంచయిత్వా పశుమాదాయ శీతత్రాణం కుర్మః.*,
అతడలా వెళుతుండగా ఆకలితో సొమ్మసిల్లిన ముగ్గురు వంచకులు దారిలో ఆ బ్రాహ్మణుడికి ఎదురుపడ్డారు. అతడి భుజాలపై ఉండే బలిసిన మేకపోతును చూసారు. తమలో తాము ఇలా చెప్పుకున్నారు. 'అహో! ఈ మేకపోతును భక్షించి, కురిసే మంచును వ్యర్థం చేయాలి. (అనగా వెచ్చగా మాంసం భుజించి మంచు బాధను తొలగించుకోవాలి అని భావం) కనుక ఇతడిని మోసగించి మేకపోతును అపహరిద్దామని అనుకున్నారు వంచకులు.
*అథ తేషామేకతమో వేషపరివర్తనం విధాయ సమ్ముఖో భూత్వాపమార్గేణ తమాహితాగ్నిమూచే- 'భోః భోః బాలాగ్నిహోత్రిన్! కిమేవం జనవిరుద్ధం హాస్యకార్యమనుష్ఠీయతే. యదేష సారమేయోపవిత్రః స్కంధాధిరూఢో నీయతే. ఉక్తంచ యతః- శ్వాసకుక్కుటచాండాలాః సమస్పర్శాః ప్రకీర్తితాః, రాసభోష్ట్రా విశేషేణ తస్మాత్తాన్నైవ సంస్పృశేత్.*,
ఇలా అనుకున్న తరువాత ఆ వంచకులలో ఒకరు వేషం మార్చుకొని, ప్రక్క దారినుండి ఎదురుపడి, ఆ అగ్నిహోత్రితో (మిత్రశర్మతో) ఇలా అన్నాడు- 'ఓరీ! మూర్ఖుడా! అగ్నిహోత్రీ! ఎందుకిలా అపవిత్రమైన కుక్కను వీపుపై ఎక్కించుకొని పోతూ, లోకవిరుద్దం, నవ్వులపాలయ్యే పని చేస్తున్నావు? ఎందుకంటే - కుక్క, కోడి, చండాలుడు అనే ఈ ముగ్గురు సమస్పర్శులు అనగా అంటరానివి. అందుకని వీటిని ముట్టుకోరాదని' విజ్ఞులన్నారు.
*తతశ్చ తేన కోపాభిభూతేనాభిహితమ్- 'అహో! కిమంధో భగవాన్ యత్పశుం సారమేయత్వేన ప్రతిపాదయసి? సోబ్రవీత్- 'బ్రహ్మన్! కోప స్త్వయా న కార్యః, యథేచ్ఛం గమ్యతామ్. 'అథ యావత్ కించిదధ్వనోంతరం గచ్ఛతి, తావద్వితీయో ధూర్తః సమ్ముఖమభ్యుపేత్య తమువాచ-*,
అప్పుడు మిత్రశర్మ, కోపంతో ఇలా అన్నాడు- 'నీవు గ్రుడ్డివాడివా! మేకపోతును కుక్క అంటున్నావ్? అప్పుడా ధూర్తుడు- 'ఓ బాపనయ్యా! కోపం వద్దు. మీ ఇష్టం వచ్చినట్లు వెళ్లండి' అని అన్నాడు. అదే దారిలో మరికొంత దూరం వెళ్లగానే, వారిలో రెండవ మోసగాడు ఎదురుగా వచ్చి ఇలా చెప్పాడు--
*భోః, బ్రహ్మన్! కష్టం కష్టమ్, యద్యపి వల్లభోయం తే మృతవత్సస్తథాపి స్కంధమారోపయితు మయుక్తమ్. ఉక్తంచ యతః- తిర్యంకం మానుషం వాపి యో మృతం సంస్పృశేత్కుధీః, పంచగవ్యేన శుద్ధిః సాత్తస్య చాంద్రాయణేన వా.*,
ఓ! బ్రాహ్మణుడా! ఇది మిక్కిలి దుఃఖిందగిన విషయం. ఈ చచ్చిన దూడ మీకు ఎంతటి ప్రియమైనది అయినా అగునుగాక! ఇలా వీపుపై చేర్చుకోవడం మంచిది కాదు. ఎందుకంటే విజ్ఞులిలా అన్నారు- 'ఎవడు దుర్బుద్ధియై చచ్చిన పశువులను, పక్షులను, మొదలైన వాటిని గానీ, చచ్చిన మానవుడిని గానీ ముట్టుకుంటాడో! అతడికి పంచగవ్యం (పంచగవ్యం అంటే, గో సంబంధమైన ఐదు పదార్థాలను కలిపి చేసిన మిశ్రమం. దీనిని భారతీయ సాంప్రదాయ కార్యక్రమాల్లో శుద్ధికోసం వినియోగిస్తారు. అవి- ఆవుపేడ, పంచితము (గోమూత్రం), పాలు, పెరుగు, నేయి) చేత కానీ, చాంద్రాయణవ్రతం చేతగాని మాత్రమే శుద్ధి కలుగుతుంది.
మరి, ఆ రెండవ మోసగాడికి మిత్రశర్మ ఏమని సమాధానం ఇస్తాడో రేపటి శ్లోక వివరణలో తెలుసుకుందాం!
అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.
అంబాళం పార్థసారథి, 

14-02-2019, గురువారం,


807. శ్లో|| అభినవసేవకవినయైః ప్రాఘుణికోక్తైర్విభాసినీ రుదితైః
ధూర్తజనవచననికరైరిహ కశ్చిదవజ్ఞితో నాస్తి.



--పంచతంత్రం. కా.కీ.4-122.



క్రొత్తగా చేరిన సేవకుల కపట వినయాల చేత, అతిథిజనుల మోసపు మాటలుచేత, సుందరీమణుల, విలాసినీజనుల కన్నీటిచేత, దుష్టుల ధూర్తవాక్కులచేత మోసపోనివాడు ఈ ప్రపంచంలో లేడు.

***



ఎవడు దుర్బుద్ధియై చచ్చిన పశువులను, పక్షులను, మొదలైన వాటిని గానీ, చచ్చిన మానవుడిని గానీ ముట్టుకుంటాడో! అతడికి పంచగవ్యంచేత కానీ, చాంద్రాయణవ్రతంచేత మాత్రమే శుద్ధి కలుగుతుంది.



*అథాసౌ సకోపమిదమాహ- 'భోః, కిమంధో భవాన్ యత్పశుం మృతవత్సం వదతి?' సోబ్రవీత్- 'మా కోపం కురు, అజ్ఞానాన్మయాభి హితమ్, తత్త్వమాత్మరుచిం సమాచర' ఇతి. అథ యావత్ స్తోకం వనాంతరం గచ్ఛతి తావత్తృతీయోన్యవేషధారీ ధూర్తః సమ్ముఖః సముపేత్య తమువాచ-*,



అప్పుడా బ్రాహ్మణుడు (మిత్రశర్మ) కోపంతో ఇలా అన్నాడు- 'ఓయీ! నీకు కళ్లు కనపడవా? బ్రతికిన మేకపోతును, చచ్చిన దూడ అంటున్నావు. అందుకు రెండవ మోసగాడు,' భగవన్! కోపపడవద్దు. నేను అజ్ఞానం వల్ల అలా అన్నాను. కాబట్టి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి' యని అన్నాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు అడవిలో మరికొంత దూరం పోగానే, మూడవ వంచకుడు మరొక వేషం ధరించి, ఎదురుగా వచ్చి అతనితో ఇలా అన్నాడు.



*భోః! అయుక్తమేతత్, యద్రాసభం స్కంధాధిరూఢం నయసి. తత్త్యజ్యతా మేషః. ఉక్తంచ- యః స్పృశేద్రాసభం మర్త్యో జ్ఞానాదజ్ఞానతోపివా, సచేలం స్నానముద్దిష్టం తస్య పాపప్రశాంతయే. తత్త్యజైనం యావదస్యః కశ్చిన్న పరిపశ్యతి.*,



'అయ్యా! ఇది యుక్తం కాదు. గాడిదను వీపున ఎక్కించుకొని తీసుకపోతున్నావు. కాబట్టి, దీనిని విడిచిపెట్టండి. విజ్ఞులిలా అన్నారు- 'ఎవడైనా మానవుడు తెలిసిగాని, తెలియకగాని, గాడిదను తాకినచో, ఆ పాపం పోగొట్టుకోవడానికి సచేల (కట్టుకున్న గుడ్డలతో సహా) స్నానం చేయాలి. అందువల్ల, ఇతరులు చూడకముందే దీనిని విడిచిపెట్టండి.



*అథాసౌ తం పశుం రాసభం మన్యమానో భయాద్భూమౌ ప్రక్షిప్య స్వగృహముద్దిశ్య పలాయితుం ప్రారబ్ధః. తతస్తేపి త్రయో మిలిత్వా పశుమాదాయ యథేచ్ఛం భక్షితుమారబ్ధాః. అతోహం బ్రవీమి- 'బసుబుద్ధి సమాయుక్తాః' - ఇతి. అథవా సాధ్విదముచ్యతే - అభినవసేవకవిజయైః ప్రాఘుణికోక్తైర్విభాసినీ రుదితైః, ధూర్తజనవచననికరైరిహ కశ్చిదవజ్ఞితో నాస్తి.*,



అప్పుడా బ్రాహ్మణుడు, తన మేకపోతును నిజంగానే గాడిద అనుకొని, ఇతరులు చూస్తారేమో అనే భయంతో నేలపై వదిలేసి, తన ఇంటి వైపు పరుగెత్తసాగాడు. అందుచేత, స్థిరజీవి అనే నేను చెబుతున్నాను 'బహుబద్ధిసమాయుక్తాః' అనేక బుద్ధులతో తర్కింపబడినది అని. మరియు ఈ విషయంలో విజ్ఞులిలా చక్కగా చెప్పారు. క్రొత్తగా చేరిన సేవకుల కపట వినయములచేత, అతిథిజనుల మోసపు మాటలుచేత, సుందరీమణుల, విలాసినీజనుల కన్నీటిచేత, దుష్టుల ధూర్తవాక్కులచేత మోసపోనివాడు ఈ ప్రపంచంలో లేడు.



*కించ దుర్బలైరపి బహుభిః సహ విరోధో న యుక్తః. ఉక్తంచ- బహవో న విరోద్ధవ్యా దుర్జయా హి మహాజనాః, స్పురంతమపి నాగేంద్రం భక్షయంతి పిపీలికాః. మేఘవర్ణ ఆహ- 'కథమేతత్?' స్థిరజీవీ కథయతి.*,



మరియు దుర్బలులై ఉండినా, కలిసుండే ఇతరులతో విరోధం తెచ్చుకోరాదు. అందుకే విజ్ఞులిలా అన్నారు- 'కలిసిమెలిసి స్నేహంతో ఉండే అనేకులతో (వారు బలహీనులై ఉన్నా సరే) విరోధం తెచ్చుకోరాదు. ఎందుకనగా, బుసకొట్టే మహాసర్పాన్ని సైతం, ఐకమత్యంతో ఉండే చీమలు తినేస్తున్నాయి కదా! అప్పుడు మేఘవర్ణుడు 'అదెలా?' యని అడిగాడు. దానికి స్థిరజీవి ఇలా చెప్పుకొచ్చాడు-.



మరి స్థిరజీవి ఏమని చెప్పుకొచ్చాడో రేపటి *పిపీలికా భుజంగమకథా* అనే 5వ కథలోని గద్య వివరణ ద్వారా తెలుసుకుందాం!



అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం!



అంబాళం పార్థసారథి, 

  
'వందే సంస్కృతమాతరమ్'

813. గద్యం|| అథ ప్రాతర్యావదాగత్య పశ్యతి తావద్దీనారమేకం 
శరావే దృష్టవాన్. ఏవంచ ప్రతిదినమేకాకీ సమాగత్య 
తస్మై క్షీరం దదాతి.

--పంచతంత్రం. కా.కీ.6-135.

తరువాత ప్రాతఃకాలంలో వచ్చి చూడగా గిన్నెలో ఒక బంగారు నాణెం కనబడింది. ఇలా ప్రతిదినం ఒంటరిగా వచ్చి, దానికి క్షీరాన్ని సమర్పించేవాడు.
***

ఇలా ఒక కథ వింటున్నాము- 'ఓ బ్రాహ్మణా! మండుచుండే పుత్రుడి చితిని, గాయపడిన నా పడగను చూడు. మనసు విరిగిపోయి అతికించిన ప్రేమ- స్నేహం ప్రకటించినా వృద్ధిపొందదు'. అప్పుడు అరిమర్దనుడు, 'ఏమా కథ? అని అడిగాడు. దానికి రక్తాక్షుడు ఈ క్రింది విధంగా చెప్పసాగాడు.

*'బ్రాహ్మణసర్పకథా అనే 6వ కథ'*

*అస్తి కస్మింశ్చిదధిష్ఠానే హరిదత్తో నామ బ్రాహ్మణః. తస్య చ కృషిం కుర్వతః సదైవ నిష్పలః కాలోతివర్తతే. అథైకస్మిన్ దివసే స బ్రాహ్మణః ఉష్ణకాలావసానే ఘర్మార్తః స్వక్షేత్రమధ్యే వృక్షచ్ఛాయాయాం ప్రసుప్తోనతిదూరే వల్మీకోపరి ప్రసారితం బృహత్ఫటాయుక్తం భీషణం భుజంగం దృష్ట్వా చింతయామాస-*,

ఒకానొక గ్రామంలో హరిదత్తుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడి వృత్తి వ్యవసాయం. కానీ, అతడికి ఆ వృత్తి ఏమాత్రం ఉపయోగంగా ఉండేది కాదు. అంటే, కొంచెం కూడా లాభం ఉండేది కాదు. అలా కొంతకాలం గడిచిపోగా, వేసవికాలపు చివరిదినాల్లో, ఒకనాడు ఆ బ్రాహ్మణుడు ఎండలో అలసిపోయి తన పొలం నడుమ ఉండే చెట్టునీడకు పోయి పడుకున్నాడు. అక్కడికి కొంతదూరంలో ఒక పుట్ట ఉంది. ఆ పుట్ట పైన ఒక భయంకరమైన సర్పం తన విశాలమైన పడగను విప్పుకొని ఉండడం, ఆ బ్రాహ్మణుడు చూశాడు. మనసులో ఇలా అనుకున్నాడు-

*'నూనమేషా క్షేత్రదేవతా మయా కదాచిదపి న పూజితా. తేనేదం మే కృషికర్మ విఫలీభవతి. తదస్యా అహం పూజామధ్యే కరిష్యామి'. ఇత్యవధార్య కుతోపి క్షీరం యాచిత్వా శరావే నిక్షిప్య వల్మీకాంతికముపగత్యోవాచ- 'భోః క్షేత్రపాల! మయైతావస్తం కాలం న జ్ఞాతం యత్త్వమత్ర వససి. తేన పూజా న కృతా. తత్సాంప్రతం క్షమస్వ' ఇతి. ఏవముక్త్వా దుగ్ధం చ నివేద్య గృహాభిముఖం ప్రాయాత్.*,

ఈ సర్పం తప్పకుండా ఈ క్షేత్రదేవతనే. నేను ఏనాడూ పూజించలేదు. అందువల్లనే వ్యవసాయం నాకు లాభించలేదు. కాబట్టి, నేడు ఈ దేవతకు పూజ చేయాలని నిశ్చయించుకొని, ఎక్కడినుండో పాలను తీసుకొచ్చి, ఒక గిన్నెలో పాలు పోసి, పుట్ట దగ్గరకి పోయి- 'ఓ క్షేత్రపాలా! నువ్వు ఇక్కడ నివసించే విషయం ఇంతకాలం నాకు తెలియదు. దానికి నన్ను క్షమించమని' ప్రార్థించాడు. అలా ప్రార్థించి పాలను నైవేద్యం పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు.

*అథ ప్రాతర్యావదాగత్య పశ్యతి తావద్దీనారమేకం శరావే దృష్టవాన్. ఏవంచ ప్రతిదినమేకాకీ సమాగత్య తస్మై క్షీరం దదాతి. ఏకైకంచ దీనారం గృహ్ణాతి. అథైకస్మిన్ దివసే క్షీరనయనాయ పుత్రం నిరూప్య బ్రాహ్మణో గ్రామాంతరం జగామ. పుత్రోపి తత్ర క్షీరం నీత్వా సంస్థాప్య చ పునర్గృహం సమాయాతః.*,

తరువాత ప్రాతఃకాలంలో వచ్చి చూడగా గిన్నెలో ఒక దీనారం (బంగారునాణెం) కనబడింది. ఇలా ప్రతిదినం ఒంటరిగా వచ్చి, దానికి క్షీరం సమర్పించేవాడు, ఒక్కొక్క బంగారు దీనారం తీసుకునేవాడు. ఇలా ఉండగా, ఒకనాడు పుట్టవద్దకు పాలుతీసుకొని వెళ్ళడానికి తన పుత్రుడిని నియమించి, ఆ బ్రాహ్మణుడు పని నిమిత్తం వేరే గ్రామం వెళ్లిపోయాడు. పుత్రుడు కూడా పాలు తీసుకొనిపోయి పుట్ట దగ్గర ఉంచి ఇంటికి వచ్చాడు.

*దినాంతరే తత్ర గత్వా దీనారకం దృష్ట్వా గృహీత్వా చ చింతితవాన్- 'నూనం సౌవర్ణదీనారపూర్ణోయం వల్మీకః, తదేనం హత్వా సర్వమేకవారం గ్రహీష్యామి' ఇత్యేవం సంప్రధార్యాన్యేద్యుః క్షీరం దదతా బ్రాహ్మణపుత్రేణ సర్పో లగుడేన తాడితః.*,

మరుసటిరోజు అక్కడికి పోగా దీనారం అతనికి కనబడింది. అతడు దానిని తీసుకొని ఇలా అనుకున్నాడు- 'ఈ పుట్ట తప్పక బంగారు నాణాలతో నిండి ఉంది. కాబట్టి, ఈ పామును చంపి ధనరాశిని అంతా ఒకేసారి గ్రహించాలని నిశ్చయించుకొని పాలను పోశాడు. పాము పాలను త్రాగుతుండగా ఆ బ్రాహ్మణ పుత్రుడు పెద్ద కర్రతో పామును కొట్టాడు.

కథలో తరువాత జరిగే ఉత్కంఠ పరిణామాలను రేపటి గద్య వివరణలో తెలుసుకుందాం!

అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.

అంబాళం పార్థసారథి, 






1 comment: