Thursday 26 November 2015

శిష్టత - మార్గ శిర మాసం



శిష్టత - మార్గ శిర మాసం వినేటి నుండి మార్గశిర మాసం ప్రారంభం
వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది.
హేమంత ఋతువు లో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయం గా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసం లో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు. చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలం గా లేక పొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గం లో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు.ప్రాతః కాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది.
సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరోదాని లోనికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడం తో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం లో పసుపు, ఆవాలు, మెంతులు , మిరియాలు, చింతపండు పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, మనం తీసుకొనే ఆహార పదార్దాల లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు.
మార్గశిర శుద్ద పంచమి రోజున నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది.
మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ని శక్తికొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి.
మార్గశిర శుద్ద సప్తమి ని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి.
మార్గశిర అష్టమి ని కాళభైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.
మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వారా దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ మాసం లో వచ్చే ద్వాదశి ని అఖండ ద్వాదశి అంటారు.
మార్గశిర శుద్ద త్రయోదశి నాడు హనుమత్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు.
మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామీ ని నోరార పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.
కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు.మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకం గా ఈ దినం యమధర్మ రాజుని ఆరాదిస్తారు. ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.




ధ్యానము

మానవుడు నిత్యమూ తన మనసులో స్మరించవలసింది - ధ్యానించవలసింది ఏమిటని ప్రశ్న. కళ్లు మూసినా తెరచినా కనిపించేది మనకీ ప్రపంచమే. కాబట్టి అందులో విషయాలే మనసుకు వస్తుంటాయి. వీటిని గుర్చే ఆలోచిస్తుంటాము. అందులోనూ మనకు కొన్ని ఇష్టమైనవైతే కొన్ని ఇష్టం లేనివి. ఇష్టం లేని వాటిని పరిహరిస్తూ ఇష్టమున్న వాటిని గురించే ధ్యానిస్తుంటాము. ఇదే సహజంగా ప్రతి మానవుడు చేస్తున్న పని. పగలంతా మెలుకువగా ఉన్నంత వరకూ ఇదే. రాత్రి స్వప్నంలోనే మనమేదీ ఆలోచించనిది. ఆలోచించకున్నా ఈ ఆలోచనల సంస్కారాలే అక్కడా పనిచేస్తూ మనలను వెంటాడుతుంటాయి. మొత్తంమీద ప్రాపంచిక విషయాలతోనే నిండి నిత్యమూ సతమతవుతూంటాయి మానవుడి మనోవ్యాపారలన్నీ.

అయితే ఈ ఆలోచనల వల్ల ఏమైనా సుఖమా శాంతా అని చూస్తే ఏదీ లేదు. లేదని పెద్దలు చెప్పటమే గాదు. ఆబాలగోపాలమూ అందరికీ అనుభవసిధ్ధమే. శాంతి సౌఖ్యాలకు నోచుకోనప్పుడీ ఆలోచనలెన్నిపెట్టుకొని ఏమి ప్రయోజనం. మానవుడెప్పుడూ కోరుకొనేది అవి రెండే గదా. మరి ఎలా సిధ్ధిస్తాయవి. దేనివల్ల సిధ్ధిస్తాయి. ప్రాపంచికం వల్ల కాదని ఎప్పుడన్నామో ఇక పారమార్ధికం వల్లనే కావాలది. ఇది ఈ ప్రాపంచక పదార్ధాలన్నింటినీ వ్యాపించిన ఒక మహాచైతన్యం. నిరాకారమైన దానివల్లనే ఈ ఆకారలన్నీ ఏర్పడుతున్నాయి. నిశ్చలమైన దాని వల్లనే ఇవన్నీ ఇలా చలిస్తున్నాయి. సర్వవ్యాపకమైన దాని భంగిమలే ఈ పరిమితమైన విశేషాలన్నీ. కాబట్టి దాన్ని గురించే ఎప్పుడూ మనం ధ్యానించవలసింది. ఆత్మ చైతన్యంతో సంబంధమే నిజమైన జీవితం మానవుడికి. అనాత్మ ప్రపంచ సాంగత్యమే మరణం. ఆత్మ ధ్యానంలో ఉన్న మానవుడు మిగతా మానవుల మధ్య మృతకళేబరాల మధ్య ఒక కాటి కాపరిలాగా జీవుస్తుంటాడని వాక్రుచ్చారు పెద్దలు.

అయితే ఏమిటీ ఆత్మ ధ్యానము. అది ఎలా చేయాలని ప్రశ్న. నాలుగు భూమికలున్నా యిందులో. మొదటిది నోటితో ఏదో జపిస్తూ కీర్తిస్తూ కూచోటం. ఇది నోటి వరకే. మనసు మీద పని చేయదు దాని ప్రభావం. మనసు ఏ భావమూ లేక స్తబ్ధంగానే ఉండిపోతుంది. అయితే ఎంతవరకంటే పిచ్చి పిచ్చి ప్రసంగాలతో కాలం వృధా పుచ్చక దైవప్రార్ధన చేస్తూ పోవటం కొంచెం మేలు. పోతే రెండవది నోటితో అనే దాని భావం మనసులో ప్రవేశించటం. అంటే శబ్దాన్ని దాటి అర్ధం దగ్గరికి వచ్చామన్నమాట. కాని అంతవరకే అది. మనసులో ప్రవేశించినా నిలకడగా ఉండదది. మెరుపులాగా వస్తూపోతూ ఉంటుంది. పోతే మూడవది పరమాత్మ రూపం బాగా మనసులో నాటుకొని కదలకుండా నిలచి ఉండటం. ఎంతగా నిలుస్తుందంటే మిగతా ప్రాపంచిక విషయాల మీదికి మరలా దాన్ని త్రిప్పాలంటే బలవంతంగానే త్రిప్పాల్సివస్తుంది. రెండవదానికిది కేవలం ప్రతి ద్వంద్వి అయిన భూమిక.

పోతే ఇక నాలుగవది ఆఖరిది ఏమంటే మనసులో భగవద్రూపాన్ని గూర్చిన ఆలోచన గాదు. భగవత్తత్వమే నిలచి ఉండాలి. ప్రపంచమూ - భగవంతుడూ - దాన్ని గూర్చిన ఆలోచనా - అన్నీ కలసి భగవత్స్వరూపంగానే అనుభవానికి రావాలి సాధకుడికి. అది కూడా తనకు భిన్నంగా కాక తన ఆత్మ స్వరూపంగానే సాక్షాత్కరించాలి. నేనొక ధ్యాతను - నాకొక ధ్యేయమైన పదార్ధముంది - దాన్ని గూర్చే ధ్యానిస్తున్నాననే భావమే ఉండదప్పుడు. ధ్యాతా నారాయణః ధ్యానం నారాయణః -- అన్నట్టు అంతా ఆత్మ స్వరూపమే. ఇదే ధ్యానానికి పరాకాష్ఠ.

   


ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు.
మనకు నవ్వుల కొరకు ఆమె ఈ విధంగా ముద్దు పేర్లతో
పిలిచిది.
అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన,
రెండవ అమ్మాయి పేరు చిరిగిన,
మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన,
నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన...
ఇలా ఈ విధంగా ఆ తల్లి తన కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది.
ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు.
అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’
అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’
తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’!
అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే కూర్చుంటాను’’
తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’
అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే కూర్చుంటాను’’
అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు. కొద్దిసేపు తరువాత....
తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా.. పాలు తీసుకుంటారా?’’
అతిథి : ‘‘టీ’’
తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’
అతిథి : ‘‘వద్దు వద్దులెండి.. నేను పాలు తీసుకుంటాను’’
తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని రామ్మా’’
ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి పారిపోతాడు


బ్రాహ్మి ముహూర్తం లో ఎందుకు లేవాలి?

పెద్దలు అందరు చెప్తూ ఉంటారు-----బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి అని. అలా ఎందుకు. అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? సుర్యొదయమునకు 48 నిముషముల ముందు ఉన్న సమయమును బ్రాహ్మి ముహూర్తం అంటారు. అంటే రాత్రిభాగము లోని ఆఖరి 48 నిముషములు అన్నమాట. ఈ సమయము పూజలకు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెప్తారు.

ముఖ్యంగా విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచి చదువుకుంటే చదువు బాగా వస్తుంది అని అంటారు. దేనికి వెనుక ఏదైనా రహస్యం ఉందా? అంటే విశ్లేషిస్తే పెద్దగా ఏమి లేదు. మన శరీరం లో ఒక జివ గడియారం ఉంటుంది. (virtual clock ) దీనిని అనుసరించే మన జీవక్రియలు అన్ని జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయములో చదువుకుంటే పిల్లలకు మంచిది. చదివిన పాఠాలన్నీ చక్కగా గుర్తు ఉంటాయి. అంతకు ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాము కాబట్టి మెదడు ఉత్తేజం తో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దం గా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.

మరి పెద్దవాళ్ళు ఎందుకు లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయం ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు. ఎందుకంటే ఉదయాన్నే ప్రక్రుతి ఎంతో అందంగా ఉంటుంది. చెట్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని మనందరకూ తెలుసు.రాత్రంతా చెట్లు విడిచిన ఆక్సిజన్ వేకువన కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాల ఉపయోగ పడుతుంది.

మరి గృహిణులు ఎందుకు లేవాలి? ఇది అందరకు తెలిసినదే. గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు. పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంటపనులు, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు వారు రోజంతా. అటువంటి వారికీ ఒత్తిడి లేని జీవన విధానం, మానసిక , శారీరిక ఆరోగ్యం చాల అవసరం. బ్రాహ్మి ముహూర్తం లో లేవటం వలన మానసిక ఒత్తిడులు తగ్గుతాయి, శారీరిక ఆరోగ్యం కూడా సమకూరుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఏంటంటే, వేకువనే లేవడం వలన ఇంటి పనులు అన్ని ఒక పద్దతిగా ఆందోళన లేకుండా చేసుకోవడానికి వీలు అవుతుంది. గందరగోళం లేకుండా ఉంటుంది. పనులు ఒక క్రమశిక్షణతో జరుగుతాయి. ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి హృదయం, మెదడు, ప్రశాంతంగా ఉంటాయి.

బ్రాహ్మి ముహూర్తం లో లేవడం వలన ఇంకొక మేలు ఏమిటంటే, సూర్యుని లేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మి లో డి విటమిన్ ఉంటుంది అని అందరికి తెలుసు, ఎముకల పటుత్వానికి ఇది ఎంతో అవసరం. ఇదివరకు మాములు ఇల్లు ఉన్నపుడు ఏదో ఒకవేపు నుంచి ఎండ ఇంట్లోకి వచ్చేది. ఈనాడు అంతా apartment culture కదా. కొన్ని ఇళ్ళల్లో సూర్యోదయం కనిపించదు. అటువంటివారికి డి విటమిన్ లోపం వచ్చే అవకాసం ఉంది. కొన్ని చర్మ వ్యాదులకు కూడా సూర్యరశ్మి మేలు చేస్తుంది. అటువంటి వారు ఉదయం , సాయంత్రం కొన్ని నిముషాలు సూర్య కిరణాలు తమకు సోకేటట్టుగా లేత ఎండలో నుంచోవడం ఎంతో మంచిది.

మనం తొందరగా లేస్తే, పిల్లలు కూడా మనలను చూసి లేవడం అలవాటు చేసుకుంటారు. వారికీ కూడా క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మన పూర్వులు ఏమి చెప్పినా, మన మంచికే చెప్పారు. వారు చెప్పిన సూత్రాల వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మనకు ఎప్పుడూ మేలే జరుగుతుంది.

No comments:

Post a Comment