Thursday 26 November 2015

ప్రాంజలి ప్రభ - పురాణ విశిష్ట ప్రభ-(భూకై లాస్)

ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - పురాణ విశిష్ట ప్రభ

పుణ్య క్షేత్రాలు 
* హోబిలం నరసింహస్వామి
* ఆత్మలింగ క్షేత్రం!  (భూకై లాస్)  


హోబిలం నరసింహస్వామి

ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరంలోను, నంద్యాల నుండి 65 కి.మీ, దూరంలోను నల్లమల అడవుల్లో ప్ర కృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.

ఎగువ అహోబిల రాజ గోపురం స్థలపురాణం:: ఇందుగల డందు లేడని సందేహము వలదని, హితవు పలికి – చక్రి సర్వోప గతుండని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానకి, స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది. ఇచ్చట హిరణ్యకశిపుని గోళ్ల తోచీల్చి సంహరించిన సమయం లో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు —-

“అహోవీర్య అహోశౌర్య అహోబహుపరాక్రమః !
నారసింహ పరః దైవం ఆహోబిలః ఆహోబిలః !!”

అని కీర్తించారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం” అహోబలం “అని పిలువబడుతోందని స్ధల పురాణం. ఎగువ అహోబిలం లోని గుహ లో స్వయం భువు గా వెలసిన ఉగ్ర నర సింహు ని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యాను భూతికి లో నైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో! బిలం , అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం. హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం ఇంకా చల్లారని ప్రతాపం తో నరసింహుడు అరణ్యం లో గర్జిస్తూ, క్ష్వేళిస్తూ,పలు ప్రదేశాల్లో సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయన లో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవ నారసింహ రూపాలని భావించబడుతోంది.

ఎగువ అహోబిలం స్వామి వారి కళ్యణ మండపం::

వీర రసావతారరూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మి గా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించ వలసి వచ్చింది. ఆ సమయం లో ఆ చెంచెతకు స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యం తో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పు కుంటుంటారు. జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు చెంచెతను మహాలక్ష్మి గా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.

రాజగోపుర దృశ్యం::

నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరం అరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు ను నరసింహ రూపుని గా దర్శన మీయ వేడుకున్నాడు. ఆనాడు గరుడునికి స్వామి సాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.

“జ్వాలాహోబిల మాలోల క్రోండ గరంజ్ భార్గవ !
యోగానంద చత్రవట పావన నవమూర్తయః !!”

జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నార సింహ అను తొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీద కొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లో లక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యై భక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు. నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం వలన వాని ఫలితాలు కూడ వేరు వేరు గా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది. అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చు నన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.

ఆలయప్రత్యేకత :

శ్రీ భార్గవ నరసింహ స్వామి : దిగువ అహోబిలానికి 2.5 కి మీ దూరం లో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే” అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థంలో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు. అందువలన ఈ అక్షయ తీర్థాన్నే”భార్గవ తీర్థమని” కూడ పిలుస్తారు.

శ్రీ యోగానంద నరసింహ స్వామి : వీరు దిగువ అహోబిలానికి తూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు. స్వామి ప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లను నేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నికగన్నది. కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తే స్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.

శ్రీ ఛత్రవట నరసింహస్వామి : ఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లో వట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలను అభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద గలుగుతారు .

శ్రీ అహోబిల నరసింహస్వామి : నవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలు మతిమాంద్యాలు, ఈ  స్వామిని సేవించడం వలన పటాపంచలౌతాయి.

శ్రీ వరాహ నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నే క్రోడ నరసింహ స్వామి అని కూడ పిలుస్తారు.

శ్రీ మాలోల నరసింహస్వామి : ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మి మా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము .ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.

శ్రీ జ్వాలా నరసింహస్వామి: ఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరం లో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని “ అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు. హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్ల తో చీల్చి, చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురు తాయి. కార్తీకమాసం లో నేతి దీపాన్ని స్వామి సన్నిథి లో వెలిగించి, ఆరాథిస్తే, సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమ తో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం “అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందులో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱగా ఉండిపోయింది.

శ్రీ పావన నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 6 కి. దూరం లో పావన నదీతీరాన ఈ స్వామి కొలువు తీరి ఉన్నాడు. నవ ఆల యాల్లో ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది. అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయన కే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను, పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి మిగతా సగం ప్రసాదంగా ఇచ్చివేస్తాడని ప్రతీతి.

శ్రీ కరంజ నరసింహస్వామి : ఎగువ అహోబిలానికి 1 కి మీ దూరం లో ఈస్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితం లో అభివృధ్ధి ని సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయని చెపుతారు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి: ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథి కూడ ఉపాలయాలు గా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకు గల సంబంధాన్ని కూడ భక్తులు విశ్లేషించుకుంటున్నారు.

చారిత్రకప్రాధాన్యం :

దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయం తో అలరారుతుంటుంది. ముఖ మండపం , రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతులతో నయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాలమీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి. పట్టాభి రాముడు, దశావతారాలు ,వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువుతీరి కనువిందు చేస్తాయి.

ఈ శిల్పాకృతు లను చూస్తుంటే అహోబలం ! అహోబిలం!! అనడమేకాదు అహోశిల్పం !!! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైట కూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నం గా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వం గా దర్శించవచ్చు . కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహు నకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలం లో స్వామి ఉగ్రరూపుడై ఉండటం తో దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తి గా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణం గా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.

ఉగ్ర స్థంభం : ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరం లో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీనిదర్శనం ,స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుక లో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు.

“ఉగ్ర వీరః మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖః !
నృసింహః భీషణఃభద్రంమృత్యుమృత్యః నమామ్యహః !!”

అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు

ప్రహ్లాదమెట్టు: ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికి మధ్య లోని ఒక గుహ లో ప్రహ్లాదుని రూపం దర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొని యాడబడు తున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.

అహోబిలమఠం: ఆథ్యాత్మిక వికాసం కోసం ,వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒకమఠం స్థాపించ బడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319 లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు.అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను ,దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యుని గా స్వీకరించాడు.

ఈ బాలుని కి సాక్షాత్తు స్వామియే యోగిరూపం లో వచ్చి,అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యుని గా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతి గా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యం లో వివిధ సేవా,అభివృద్ధి మత ప్రచార ,సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తం గా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

ప్రత్యేక ఉత్సవాలు: ప్రతిసంవత్సరం ఫాల్గుమ మాసం లో బ్రహ్మోత్సవాలు, ప్రతినెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తో తిరుమంజన సేవ,గ్రామోత్సవం జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై, స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇచ్చట జరుగు గొప్పఉత్సవం గా పేర్కోనవచ్చు.

ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచు గా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది


హోబిలం నరసింహస్వామి 
ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని ...


--((**))--


ఆత్మలింగ క్షేత్రం!

 (భూకై లాస్)  


మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది. 


పురాణ కథ 

ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ, మహాభారతాలలో చూడగలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం, రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. 


అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు, కాసేపు ఆత్మలీంగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్ధిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు, తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు, గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. 


రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు. 


ఇంకొక కథనం ప్రకారం, పాతాళలోకంలో తపస్సు చేసి, భూలోకానికి వస్తున్నప్పుడు, భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రనికి గో (ఆవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందట. 


పురాతన ప్రాశస్త్యం 

దక్షిణకాశి, భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్రచరిత్ర ఎంతో పురాతనమైనది. కాళిదాసు, తన 'రఘువంశం' కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు 'నాగానంద' కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు - కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు. క్రీ.శ. 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసాడట. 

కోటితీర్థం 


గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది. ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం ఇరవైనాలుగు గంటలూ తెరువబడే ఉంటుంది. 

మహాబలేశ్వరాలయం 


పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడనికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. ఈ శివపూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తూంటారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. ఇక, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడురోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి, భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. 


తామ్రగౌరీ ఆలయం 

మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది. 


మహాగణపతి ఆలయం 

రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చారుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహనం ఒకటిన్నరవరకు, సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదింపావు వరకు ఆలయం తెరిచి ఉంటుంది. 

ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి. 
గోకర్ణంలో బస చేసేందుకు హోటళ్ళ సౌకర్యం బాగానే ఉంది. గోకర్ణం బెంగుళూరు నుంచి సుమారు 450 కి.మీ దూరంలో ఉంది. హబ్లి, ఉడుపి, మంగళూరు, బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌక్యం ఉంది. కొంకణీరైలు మార్గంలో గోకర్ణరోడ్డు స్టేషన్‌కి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది. 
గోకర్ణానికి చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు 


ధారేశ్వర ఆలయం 

ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణదిక్కున సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయిసల శిల్పశైలిలో కనబడుతుంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిగంటల వరకు తెరచి ఉంటుంది. 


గుణవంతేశ్వర ఆలయం 

ఈ ఆలయం కూడ గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇది గోకర్ణం నూంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచిఉంటుంది. 


మురుడేశ్వర ఆలయం 

పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడ ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఆరు గంటల నుండి తెరచి ఉంటుంది. 


--((**))--





No comments:

Post a Comment