Friday 18 March 2022

సంకటహర చతుర్థి ‬పూజ వ్రత విధానం



*నేడు సంకటహర చతుర్థి ‬పూజ వ్రత విధానం మరియు సమగ్ర వివరణ*

🙏

గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. *మొదటిది వరదచతుర్థి ,*  

*రెండవది సంకష్టహర చతుర్థి*  

*అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతమును "వరదచతుర్థి" అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను "సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం"  అంటారు.*

ఇందులో వరదచతుర్థి ని వినాయకవ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి *మంగళవారం  వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం  ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

 *సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం* 🌈

సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.

ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.

వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి , తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని

పసుపు,  కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు

ఖర్జూరాలు , రెండు వక్కలు , దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.


 *సంకటనాశన గణేశ స్తోత్రం , సంకట హర చతుర్థి వ్రత కథ* ను చదవవలెను.

ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.

తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.

శక్త్యానుసారము గరిక పూజను కాని , గణపతి హోమమును కాని చేయించుకొనవచ్చును.

సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు.

సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.

నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

🌈 *సంకట హర చతుర్ధి వ్రత కథ:* 🌈

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో , అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా ! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా ! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా !

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి , నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో , వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా ? అని !!   కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత , *‘నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’* అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. 

గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని , అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత , ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. 

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

🙏 *గణపతి ప్రార్ధన* 🙏

*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !*

*ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!*

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

🙏 *గణనాయకాష్టకం* 🙏

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్

లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్

బాలేందుశకలం మౌళీ , వందేహం గణ నాయకమ్

చిత్రరత్నవిచిత్రాంగం , చిత్రమాలా విభూషితమ్

కామరూపధరం దేవం , వందేహం గణనాయకమ్

గజవక్త్రం సురశ్రేష్ఠం , కర్ణచామర భూషితమ్

పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్

మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే

యోద్ధుకామం మహావీరం వందేహం గణ నాయకమ్

యక్షకిన్నెర గంధర్వ , సిద్ధ విద్యాధరైస్సదా

స్తూయమానం మహాబాహుం వందేహం గణ నాయకమ్

అంబికాహృదయానందం , మాతృభి: పరివేష్టితమ్

భక్తిప్రియం మదోన్మత్తం , వందేహం గణ నాయకమ్

సర్వవిఘ్నహరం దేవం , సర్వవిఘ్నవివర్జితమ్

సర్వసిద్ధి ప్రదాతారం , వందేహం గణ నాయకమ్

గణాష్టకమిదం పుణ్యం , యః పఠేత్ సతతం నరః

సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్

*ఇతి శ్రీ గణనాయకాష్టకం*

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

🙏 *సంకటహర గణపతి స్తోత్రం* 🙏

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం

లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం

ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్

ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం

నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో

విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం

పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్

జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్

సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

🙏 *విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం* 🙏

జయ విఘ్నేశ్వర ! నమో నమో , జగద్రక్షకా ! నమో నమో

జయకర ! శుభకర ! సర్వపరాత్పర ! జగదుద్ధారా ! నమో నమో

మూషిక వాహన ! నమోనమో , మునిజనవందిత ! నమో నమో

మాయా రాక్షస మదాపహరణా ! మన్మధారిసుత ! నమో నమో

విద్యాదాయక ! నమో నమో , విఘ్నవిదారక , నమో నమో

విశ్వసృష్టి లయ కారణ శంభో ! విమల చరిత్రా ! నమో నమో !

గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో

అధర్వాద్భుతగానవినోదా ! గణపతిదేవా ! నమోనమో !

నిత్యానంద ! నమో నమో , నిజఫలదాయక ! నమో నమో

నిర్మలపురవర ! నిత్యమహోత్సవ ! రామనాథ సుత నమో నమో

***

 పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు.

ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. అన్నవరం దేవస్థానంలో అధికారులు బుకింగ్‌లు ప్రారంభించారు. ఈ మండపంలో ఒకేసారి 12 జంటలకు వివాహం జరిపించేందుకు వీలుగా ఉంటుందని దేవస్థానం అధికారులు వివరించారు. పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు ఇలా అన్నీ దాత శ్రీనివాస్ సమకూరుస్తారు.

పెళ్లి పేదలకు తలకుమించిన భారమే. అయితే వారు కూడా సాదాసీదాగా కాకుండా ఉన్నతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ కళ్యాణ వేదికను ఈ నెల 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించగా.. వివాహాలు చేసుకునే వారి కోసం దేవస్థానం అధికారులు ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించారు. సంబంధిత పత్రాలు తీసుకువస్తే ఆయా తేదీలలో మండపాలను బుక్ చేస్తారు.

ఏసీ కళ్యాన మండపంలో వివాహం చేసుకోదల్చిన వారు లగ్న పత్రిక, వధూవరుల ఆధార్ జిరాక్స్, వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్‌లను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలోఅందజేయాలి. వారికి ఉచిత కళ్యా వేదిక నెంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ను ఉచిత కళ్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామాగ్రిని పొందాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదని ఆలయ అధికారులు వెల్లడించారు.

  ఓం శ్రీ సత్య దేవాయ నమః                    

🌿🌸🌿

: తిరుమల జోలికి వెళ్లొద్దు

*********************

దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగిన సంఘటన. 

పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి తి.తి.దే ఎప్పుడూ ఏవో ప్రణాలికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యులు కలిసి ఒక పథకం ఆలోచించారు.

మామూలుగా జయవిజయు లను దాటి స్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారి లోనే బయటకు రావడం ఆనవాయితీ. అలా కాకుండా అర్ధమండపం యొక్క ప్రక్క గోడలు తొలగించి అక్కడ ద్వారములు తెరిస్తే, వాటి నుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడిఎడమలకు వెళ్ళవచ్చు. దీని వల్ల భక్తుల రద్దీని భరించవచ్చు. 

ఇది అమలు చెయ్యాలనుకున్న ప్రతిపాదన.

దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయం తో అమెరికా నుండి కటింగ్ మెషిన్ ను కొనుగోలు చెయ్యాలని నిర్ధారించారు. ఇదంతా విని అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనస్సు కలతపడింది. మనస్సు లోని బాధ మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించారు. స్వయంగా స్థపతి గారినే, “ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు ? ఈ నిర్ణయం మీకు సమ్మతమే కదా ?” అని అడిగారు.

“నా అభిప్రాయాల్ని నేను చెప్పవచ్చునా ?” అని అడగగా, సరే అన్నట్టు తలూపారు మంత్రి గారు. దేవాలయ ఆగమ పద్ధతులను అనుసరించి వేల ఏళ్ళ క్రితం ఆగమ శాస్త్రం లో ఉద్ధండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయం. గర్భాలయం ముందర ఉన్న అర్థ మండపం పరమ పవిత్రమైనది. దారి కోసమని ఆ మండపం గోడలను కూల్చడం సరైన పని కాదు. అలా జరిగిన పక్షం లో వేంకటేశ్వర స్వామి వారి పవిత్రత కు, శక్తి కి ఆటంకం ఏర్పడవచ్చు.

ఈ పడగొట్టే ప్రణాలికను ఆపేయడం మంచిది అని ధైర్యం గా చెప్పారు.

సభ్యులందరూ ఈ కొత్త ఆలోచనను అప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించడంతో, స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు. దీన్ని కార్యరూపం లోకి తీసుకురావడానికి పనులన్నీ అక్కడే జరిగిపోయాయి. ఇక చేసేది లేక అందరి బలవంతం పైన స్థపతి కూడా సంతకం పెట్టవలసి వచ్చింది.

అప్పటి నుండి స్థపతి గారి మనస్సు ప్రశాంతతను కోల్పోయింది. గుండె బరువెక్కగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. దీన్ని ఎలాగైనా ఆపాలని పరి పరి విధాల ఆలోచిస్తున్నారు. ఈ సమయం లో సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైన పరమాచార్య స్వామి వారు తప్ప ఎవరూ సహాయం చెయ్యలేరని నిర్ణయించుకున్నాడు. వెంటనే మహాస్వామి వారి వద్దకు పరుగులు తీసాడు.

కార్వేటి నగరం చేరేటప్పటికి ఉదయం అయ్యింది. బాధపడిన మనస్సుతో పరమాచార్య స్వామి వారిని దర్శించగానే కళ్ళ వెంట అదేపనిగా నీరు వస్తోంది. మహాస్వామి వారు వేళ్ళను నుదుటిపై మూడు నామాల వలె చూపిస్తూ, “అక్కడి (తిరుమల) నుండే వస్తున్నావా ?” అని అడగడంతో కాస్త కుదుటపడ్డాడు.

“అవును” అని మహాస్వామి వారితో తన బాధనంతా చెప్పుకుందామని నోరుతెరవగానే, చేతి సైగ ద్వారా ఆగమన్నారు స్వామివారు. “ఇప్పుడు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.

ముందు వెళ్లి ఏమైనా తిను”. తల్లి ప్రేమ కంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామి వారి కరుణ మాత్రమే. ఎందుకంటే ఆ తల్లి ప్రేమకు మాత్రమే తెలుసు స్థపతి రెండు రోజులుగా ఏమీ తినకుండా మదనపడుతున్నాడని.

మఠ సేవకుణ్ణి పిలిచి, “ఏదైనా హోటలుకు తీసుకుని వెళ్లి కడుపు నిండా ఆహారం పెట్టించు” అని స్థపతి తో పాటు పంపారు. ఆ సమయం లో కేవలం ఒక్క హోటల్ మాత్రమే తెరచి ఉంది. హోటల్ ఓనరుతో స్థపతి గారికి పెట్టిన ఆహారానికి పరమాచార్య స్వామి వారు డబ్బు కడతారు అని చెప్పగా, “పరమాచార్య స్వామి వారు పంపిన వారికి ఆహారం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం” అని సిద్ధంగా ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలను వడ్డించారు.

తిన్న తరువాత వెళ్లి పరమాచార్య స్వామి వారి ఎదుట నిలబడ్డారు. “ఇప్పుడు చెప్పు” అని స్థపతి చెప్పిన విషయాలను మొత్తం విని, అలా గోడలను తొలగిస్తే ఏమవుతుంది?  అని అడిగారు.

తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామి వారికి చెప్పిన తరువాతనే అమలుపరుస్తారు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు. అర్థ మండపాన్ని కదిలిస్తే మునుపటి లాగా వేంకటాచలపతి యొక్క దివ్యశక్తి జనులకు ప్రసరించదు. బహుశా వారి నిర్ణయాన్ని మీకు తెలపడానికి వారు ఇక్కడకు రావచ్చు. అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వవలదు అని పరమాచార్య స్వామి వారిని ప్రార్థించాడు.

మానవ జాతినే ఉద్ధరించడానికి ఈ భువి పై అవతరించిన మహాస్వామి వారు తమ చల్లని చిరునవ్వుతో, “అంతా నీవు అనుకున్నట్టుగానే జరుగుతుంది. చింత వలదు” అని అభయమిచ్చారు. కొద్దిగా మనోవేదన తగ్గడంతో స్థపతి అక్కడి నుండి వచ్చేశారు. బాగా అలసిపోవడం వల్ల ఆ రాత్రి బాగా నిద్రపట్టింది. ఎవరో తనని నిద్ర లేపుతునట్టు అనిపించడంతో హఠాత్తుగా భయం తో లేచి చూస్తె అక్కడ ఎవరూ లేరు. కాని తన అలసట బాధ అంతా తీరిపోయి, చాలా ఉల్లాసంగా అనిపించింది. వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంటికి పరుగెత్తాడు. గేటు దగ్గర ఉన్న సెక్యురిటీ గార్డు స్థపతి గారిని గుర్తుపట్టి ఆశ్చర్యం తో ఇంత ఉదయం రావాల్సిన పనేమిటని అడిగాడు. వెంటనే తాను ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పారు.

ముందస్తు సమాచారం లేనందున అతను అందుకు ఒప్పుకోలేదు. కాని, తిరుపతి గణపతి స్థపతి అంతే ఎవరో అందరికి తెలిసినదే కాబట్టి వారి కోరికను మన్నించడానికి ఒక అధికారి సమాయత్త మయ్యాడు. “అయ్యా, ఒక పని చేద్దాం. సరిగ్గా నాలుగున్నర కు కాఫీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకు వస్తారు. కిందకు వచ్చి హాలు లోకి వెళ్ళేటప్పుడు వారు మిమ్మల్ని చూస్తే సమస్య లేదు. లేదంటే మీరు ఉదయం దాకా ఆగవలసిందే” అని చెప్పాడు.

పరమాచార్య స్వామి వారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనే నమంకంతో స్థపతి గారు అక్కడ నిలబడ్డారు. ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లో నిలబడ్డ స్థపతిని చూశారు. “ఏంటి గణపతి ఇంత ఉదయాన్నే ?” అని అడిగి, లోపలి కి రమ్మన్నారు..

“తిరుమల దేవాలయానికి ప్రమాదం” అంటూ మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాన్నంతా చెప్పారు. స్థపతి చెప్పినదంతా విన్న ముఖ్యమంత్రి ముఖం లో కోపం కనపడింది. వెంటనే దేవాలయ వ్యవహారాలు చూసే మంత్రిని సంప్రదించారు. “మొన్న తిరుమల లో ఏం జరిగింది?” అని అడిగారు. “ఓహ్ అదా! మీతో ఆ విషయం మాట్లాడుదామనే మొత్తం వివరాలతో సిద్ధం అవుతున్నాను” అని బదులిచ్చారు మంత్రిగారు.

ముఖ్యమంత్రి గారు కోపంతో “నేను అడిగింది ఏమి జరిగింది అని మాత్రమే?”, ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చింది. మొత్తం తమ ప్రణాలికను వివరించారు మంత్రిగారు. ఇంకా ఏదో చెప్పబోయేంతలో,

“ముందు నేను చెప్పేది విను,

వెంకన్న జోలికి పోకండి” అని నిక్కచ్చిగా చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి అని చెప్పి సంభాషణ అక్కడితో ముగించారు.

స్థపతిని పంపుతూ, “తిరుమలకు ఏమీ జరగదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు” అని భరోసా ఇచ్చారు. పెద్ద బరువు దింపుకుని చాలా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు స్థపతి.

 తనను నిద్ర నుండి లేపి, ఈ సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి, ఇంత పెద్ద సమస్య కు పరిష్కారాన్ని చూపించింది ఏదో ఒక అదృశ్య శక్తి అని గ్రహించాడు.

వెంటనే పరమాచార్య స్వామి వారి పలుకులు చెవిలో వినబడ్డాయి. “అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది” అన్న మాటలు గుర్తుకు రావడంతో ఒక్కసారిగా ఒణుకు ప్రారంభమై ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. 

వరుసగా జరిగిన ఈ సంఘటనలన్నీ కేవలం మహాస్వామి వారు ఆశీస్సుల వలన మాత్రమే అని తలచి ఆ ఉషోదయ సమయంలో స్వామివారిని తలచుకుని పులకించిపోయాడు.

--- “కంచి మహానిన్ కరుణై నిళగల్” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

*******

కాలక్షేపం కాదు -- జ్ఞాన సంపద 

వ్యాపారి:- ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఒక్క మాటలో చెప్పగలరా?

గురువు:- నిశ్శబ్దం 

వ్యాపారి:- మరి ఆ నిశ్శబ్దాన్ని ఎలా అందుకుంటాం?

గురువు:- ధ్యానం ద్వారా 

వ్యాపారి:- అయితే ధ్యానం ఎలా చేస్తారు?

 గురువు:- నిశ్శబ్దంగా ఉండటం ద్వారా 

వ్యాపారి:- నిశ్శబ్దంగా నిష్క్రమించాడు 

****

వ్యాపారి:- ఆధ్యాత్మిక జ్ఞానం తో సంపాదన గూర్చి  చెప్పగలరా?

గురువు:- నిశ్శబ్దం 

వ్యాపారి:- మరి సంపాదన ఎలా అందుకుంటాం?

గురువు:- నీతి,  నిజాయితి, ధర్మ ధ్యానం ద్వారా 

వ్యాపారి:- అయితే ధ్యానం ఎలా చేస్తారు?

 గురువు:- ధనం లెక్కించక దానం చేయుట ద్వారా 

వ్యాపారి:- నిశ్శబ్దంగా నిష్క్రమించాడు 

****

వ్యాపారి:- ఆధ్యాత్మిక జ్ఞానం తో బంధాన్ని వదులుటకు ఒక్క మాటలో చెప్పగలరా?

గురువు:- నిశ్శబ్దం 

వ్యాపారి:- మరి ఆ నిశ్శబ్ద ప్రేమను ఎలా అందుకుంటాం?

గురువు:- తృప్తి పరచి, సంతృప్తి పడుట ద్వారా 

వ్యాపారి:- అయితే ఆడదానికి లొంగి పోవాలా ఎలా చేస్తారో ?

 గురువు:- నిశ్శబ్దంగా మూగవానిలా ఉండటం ద్వారా 

వ్యాపారి:- నిశ్శబ్దంగా నిష్క్రమించాడు 

****

వ్యాపారి:- ఆధ్యాత్మిక జ్ఞానం గా మనసు కోతి లాంటిది కదా ఒక్క మాటలో చెప్పగలరా?

గురువు:- నిశ్శబ్దం 

వ్యాపారి:- మరి ఆ నిశ్శబ్ద హృదయంలో చంచలం ఎలా అందుకుంటాం?

గురువు:- ఆశ, పాశం , వదిలే , ధ్యానం ద్వారా 

వ్యాపారి:- అయితే ధ్యానం ఎలా చేస్తారు?

 గురువు:- నిశ్శబ్దంగా ప్రశ్నించకుండా, కోర్కల్కు లొంగకుండా ఉండటం ద్వారా 

వ్యాపారి:- నిశ్శబ్దంగా నిష్క్రమించాడు 

****

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 


****


గీతము -1

పాట సందర్భం.

*******

 పల్లెలు  దేశప్రగతికి ప్రతీకలు అటువంటి పల్లె లు  నేడు వ్యవసాయం  గిట్టుబాటు కాక  భూములన్ని  ఎండిపోయి  పిచ్చిమొక్కల నివాసాలుగా మారాయి..

 చదువుకున్న ఓ యువకుడు మా వూరికి వ్యవసాయమే జీవనాధారం ఇలా మా పల్లే వుండకూడదని ఉద్యోగం మానేసి గ్రామము   ప్రపంచం దృష్టి ని ఆకర్షిఃచేలా చేసి   ఆ పల్లె కళ్ళలో కాంతులు నింపుతాడు. అలా ఆ యువకుడిపైన మనసు పడ్డ  పల్లె ప్రజలు తన మదిలోని ప్రేమను 

తన పల్లె గూటికి పండుగ తెచ్చిన  ఆ యువకుడి పై కురిపించిన    ప్రశంసల ప్రేమే ఈ పాట...

 ***************

పల్లవి:-

****

మబ్బులు కమ్మిన వేళా, 

మాయను దాచిన వేళా  

మమతలు కరువైన వేళా 

మనసు చేయును గోళా 

అదే అదే మన గ్రామం బాగు పడాలి ఎలా ఎలా 


చరణం : 


చేత చీపురు పట్టి చిమ్మే ఆడదిలా 

చేయి చేయి కలిపే ప్రేమికులులా  

మంచిని తెల్పి అనుకరించేవానిలా 

కదలాలి మనమందరం బాగు చేయాలి 


అలా అలా కదిల్తే మేటి గ్రామమవుతుందిలే 

అలా అలా కదిల్తే మేటి గ్రామమవుతుందిలే 

 

చరణం : 


రోడ్లను సరిచేసి, గుమ్మాలు సరిచేసి, చెట్లను సరిచేసి 

మార్ఖులను వేరుచేసి, దుర్మార్గులను తరిమివేసి, ఆధునిక 

వెలుగులను నింపేసి, బద్దకస్తులకు, జూదగాళ్ళకు, 

భోలాశంకారులకు, పనులు పురమాయించి, పంట పంటకు 

సహకారం అందించి బ్రతుకుతెరువు అందిస్తే ఆగ్రామం 


అలా అలా కదిల్తే మేటి గ్రామమవుతుందిలే 

అలా అలా కదిల్తే మేటి గ్రామమవుతుందిలే 


పల్లవి:-

మబ్బులు కమ్మిన వేళా, 

మాయను దాచిన వేళా  

మమతలు కరువైన వేళా 

మనసు చేయును గోళా 

అదే అదే మన గ్రామం బాగు పడాలి ఎలా ఎలా 

****

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ        


వెన్నెల ఛాయ వృత్తము -26 అక్షరాలు

...................................

ర స జ జ భ ర ర స లగ - గణములు

11, 19 అక్షరములు - యతి స్థానములు

ప్రాస కలదు.

............................

UIU IIU IUI I - UI UII UIU - UIU IIU IU


ప్రేమపొందుట సామరస్యము -ప్రేమతత్వము శోధనే - ప్రేమ పంచుట కార్యమే 

ప్రేమగాలులు వచ్చి ఏడ్చిన -ప్రేమ తొందర చెందకా - ప్రేమ సౌఖ్యము చందమే  

ప్రేమ ఆటలు పాట పొందిక - ప్రేమభావం వల్లనే  - ప్రేమ లక్ష్యము తీరుటే 

ప్రేమ అర్ధము ప్రేమదేశము - ప్రేమ సఖ్యత కల్గుటే - ప్రేమ యే మన సంపదే  


చిత్త భ్రాంతియు పొంది క్రోధము - చిత్తకాంక్షకు మొహమై - చిత్తమే కళ జీవులై 

చిత్త మందున ఆశ పాశము - చిత్త ధైర్యము దాహమై - చిత్త గించెను జీవుడై 

చిత్త మంతయు తామసమ్ముయు - చిత్తమే గతి వైనము - చిత్తమందున దేవుడై 

చిత్త కాంతులు కామితార్దము - చిత్త వేగము రౌద్రము - చిత్త గించెను ప్రేమకై 

      

కాలమన్నది తెల్పలేరును - కాల గమ్యము ప్రశ్నయే - కాల నిర్ణయ జీవమై 

కాల వాంఛలు కల్పనవ్వుట - కాల యాపన జెయకే - కాల మన్నది ప్రాణమే 

కాల సత్యము న్యాయ పాలన - కాల ధర్మము చూపుటే - కాల ప్రేమల శాంతియే    

కాల జ్ఞానము మార్గ మవ్వుట - కాల తండ్రియు తల్లియే - కాల బిడ్డల ప్రేమయే 

    

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 


 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*లక్ష్మీ కళ్యాణం - చదివితే కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం నశించబడుతుంది. ఆడవారు కానీ, మగవారు కానీ లక్ష్మీ ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం చదువుకుంటే చాలా మంచిది.*


*శ్రీ ముదివర్తి కొండమాచార్యులవారు రచించిన ఈ శ్రీలక్ష్మీ కళ్యాణం ద్విపద*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భావం, శ్రీ లక్ష్మీ కళ్యాణం*


*పాలమున్నీటిలో పడవంపులతగా*

*పసివెన్నముద్దగా ప్రభవంబునొంది*


*కలుములు వెదజల్లు కలికి చూపులకు*

*మరులొంది మధువుకై మచ్చికలట్లు*


*ముక్కోటి వేల్పులూ ముసురుకొనంగా*

*తలపులో చర్చించి తగ నిరసించి*


*అఖిలలోకాధారు నిగమసంచారు*

*నతజన మందారు నందకుమారు*


*వలచి వరించిన వరలక్ష్మి గాధ*

*సకల పాపహరంబు సంపత్కరంబు*


*ఘన మందరాద్రినీ కవ్వంబుగాను*

*వాసుకి త్రాడుగా వరలంగ చేసి*


*అమృతంబు కాంక్షించి అసురులు సురలు*

*చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము*


*పరమ పావనమైన బారసి నాడు*

*మెరుగారు తొలకరి మెరుగుల తిప్ప*

*ఒయ్యరములలప్ప ఒప్పులకుప్ప*


*చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి*

*అష్ట దళాబ్జమందావిర్భవించె*


*నింగిని తాకెడు నిద్దంపుటలలు*

*తూగుటుయ్యాలలై తుంపెసలార*


*బాల తానటుతూగ పద్మమ్ము ఛాయ*

*కన్నె తానిటుతూగ కలువపూఛాయ*


*అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద*

*వీక్షించుచుండగా వెదురు మోసట్లు*


*కల్పధ్రువంబున కలికలంబోలి*

*పెరిగి పెండిలి ఈడు పిల్లయ్యెనంత*


*తనువున పులకలు దట్టమై నిగుడ*

*బారసాచి ప్రమోద భాష్పముల్ రాల*


*రావమ్మ భాగ్యాల రాశి రావమ్మ*

*రావమ్మ ఇందిరా రమణి రావమ్మ*


*లోకశోకము బాపు లోలాక్షివీవు*

*నాకు కూతురువవుట నా పుణ్యమమ్మా*


*అంచు మురిసిపోయి అంబుధి స్వామి*

*ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటె*


*సఖియను మంగళ స్నానమాడింప*

*వాసవుండర్పించె వజ్రపీటమ్ము*


*పూత నదీజలా పూర్ణ పుణ్యాహా*

*కళశాలతోడ దిగ్గజములవ్వేళ*


*జలజాతగంధికి జలకమ్ములార్చె*

*బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము*


*కట్టంగ సుతకిచ్చె కళశవారాసి*

*వెలలేని నగలిచ్చె విశ్వకర్ముండు*


*రాజీవ ముఖులైన రంభదులంతా*

*కురులు నున్నగ దువ్వికుప్పెలు వెట్టి*


*కీల్జెడ సవరించి కింజెల్కధూలి*

*చెదరనీక విరుల్ చిక్కగ ముడిచి*


*కళలు పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు*

*కమ్మని కవ్రంపు కాటుక దిద్ది*


*వెన్నెల తెటయౌ వెడద మోమునకు*

*గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి*


*ఆత్తరు జవ్వాజి అగరు చందనము*

*హత్తించి తనువల్లె ఆమె ముంగిటను*


*నిలువుటద్దంపును నిలిపెరంతటను*


*తనరూపు శ్రీలక్ష్మి దర్పణంబందు*

*కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి*


*సింహసనము దిగి చెంగళ్వదండ*

*చెదార్చి అచ్చెరల్ చేరి కొల్వంగా*


*కుచ్చెళ్ళు మీగాల్ల గునిసియాడంగా*


*గరుడ గంధర్వ యక్ష రాక్షస దివిజ*

*సంఘముల మద్యకు సరుగున వచ్చె*


*చెప్పచోద్యంబయిన శ్రుంగారవల్లి*

*మొలకనవ్వుల ముద్దు మోమును చూచి*


*సోగ కన్నుల వాలు చూపులు చూచి*

*ముదురు సంపెంగ మొగ్గ ముక్కును చూచి*


*అమృతంబు తొలకెడు అధరంబు చూచి*

*సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి*


*ముత్యాల మెచ్చని మునిపండ్ల చూచి*

*పాలిండ్లపైజారు పయ్యెద చూచి*


*జవజవమను కౌసు సౌరుని చూచి*

*గుండ్రని పిరుదుల కుదిరిక చూచి*


*కమనీయ కలహంస గమనంబు చూచి*

*మొగమునకందమౌ మొటిమను చూచి*


*మధుసూధనుడు తక్క మగవారలెల్ల*

*వలపు నిక్కాకకు వశవర్తులైరి*


*కన్నులకెగదన్ను కైపున తన్ను*

*తిలకించుచున్నట్టి దిక్పాలకాది*


*సురవర్గమును చూచి సుదతి భావించె*


*ఒకడంటరానివాడొకడు జారుండు*

*ఒకడురక్తపిపాసొక్కడు జడది*


*ఒక్కడు తిరిపెగాడొకడు చంచలుడు*

*కాయకంఠి ఒకండు కటికవాడొకడు*


*ఒక్కటి తరకైన ఒక్కటి తాలు*

*ఈ మొగమ్ములకటే ఇంతింత నునుపు*


*శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు*

*పుండరీకాక్షుండు భువనమోహనుడు*


*శంఖచక్రధరుండు శారంగహస్తుండు*

*తప్తచామీకరా ధగధగద్ధగిథ*

*పీతాంబరధరుండు ప్రియదర్శనుండు*


*మణిపుంజరంజిత మంజులమకుట*

*మకరకుండలహార మంజీరకటక*


*కాంచికాకేయూర కమ్రభూషణుడు*

*అనుపమ ఙ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య*


*గాంభీర్య మార్థవౌదార్య శౌర్య స్థైర్య చాతుర్య*

*ముఖ్య కళ్యాణ గుణగణ మహార్ణవుండు*


*తనకు నీడగువాడు తననించు వాడు*

*విశ్వమంతయును తానైనవాడు*


*శేశాద్రినిలయుండు శ్రీనివాసుండు*

*పతియైన సుఖములు పడయంగ వచ్చు*


*తులలేని భోగాల తులతూగ వచ్చు*

*ఎడేడు లొకాలనేలంగవచ్చు*


*అంచు శౌరికి వేసె అలవేలు మంగ*

*చెంగళ్వ విరిదండ చిత్తమొప్పంగా*


*సకల జగంబులు జయ వెట్టుచుండ*

*శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు*


*తలయంటి పన్నీట తానమాడించి*

*తడియొత్తి వేణుపత్రములంత జేసి*


*నామంబులను దిద్ది నవభూషణముల*

*గైసేయ దివిజవర్గంబులు గొలువ*


*కదలనై రావణ గజముపై స్వామి*


*కేశవాయంచును కీరముల్ పలుక*

*నారాయణాయంచు నమలులు పలుక*


*మధవాయంచును మధుపముల్ పలుక*

*గోవిందయంచును కోయిలల్ పలుక*


*తైతక్కధిమితక్క తద్దిమ్మితకిట*

*జనుతతకజనుత జనుత యటంచు*

*అచ్చర విరిబోణి ఆడిపాడంగా*


*ముత్తైదువులు శెస ముత్యాలు జల్ల*

*చల్లగా వేంచేయు జలదవర్ణునకు*


*అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష*

*వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే*


*అదె వచ్చె ఇదె వచ్చె అల్లుడటంచు*

*మామగారెదురేగి మధుపర్కమిచ్చె*


*పందిటిలోనికి పట్టి తొడ్తెచ్చి*

*పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు*


*మంగళశాసన మంగళమ్మిడగా*

*కమలచేతికి చక్రి కట్టె కంకణము*


*దివ్యశంకంబులు తిరుచిన్నములును*

*వేణుమర్దల రుద్రవీణలు మొరయ*


*తలవంచి కూర్చున్న తన్వి కంఠమున*

*మధువైరి గీలించె మాంగళ్యమపుడు*


*చేతుల తలంబ్రాలు చేకొనికూడా*

*పొయగా వెనుకాడు పువుబోణి ముందు*


*శిరమువంచినయట్టి శ్రీధరు జూచి*

*పకపకా నవ్విరి పల్లవాధరులు*


*పదునాల్గు భువనముల్ పాలించునట్టి*

*చల్లనివిభునకు జయమంగళంబు*


*పదము మోపిన చోట పసిడి పండించు*

*చూడికుత్తుకకు శుభమంగళంబు*


*అంచు హారతులెత్త అంగనామణులు*

*సాగె బువ్వము బంతి సంతోషముగను*


*కళిత కంకణ జనాత్కారమ్ము లెసగా*

*కటక గళంగళాత్కారముల్ పొసగా*


*మొగమున తిలకంబు ముక్కున జార*

*చిరు చెమ్మటలదోగి చెదరు గంధమ్ము*


*గమగమ వాసనల్ క్రుమ్మరింపంగా*

*చురుకు చూపులకోపు చూపరగుండె*


*పలువ చిచ్చు రగల్పు వగలాడియొకతె*

*కోడిగమ్మాడెను కొమరితె ఒకతె*


*మన పెండ్లి కొడుకెంత మహనీయుడమ్మా*

*మహిళలను వలపించు మంత్రగాడమ్మ*


*మచ్చు మందులు జల్లి మది దోచకున్నా*

*కరివానినెవ్వరు కామింతురమ్మ*


*సుకియలు పోలీలు సొగియవు గాని*

*పురపుర మట్టిని బ్రొక్కెడునంట*


*పట్టె మంచము వేసి పానుపమరింప*

*పాముపై తాపోయి పవళించునంట*


*అంబారి యేనుగు అవతలకంపి*

*గద్ద మీద వయాలి కదలెడునంట*


*వింత వెషములెన్నో వేసెడునంట*


*రాసిఖ్యమటులుంచి రంగటులుంచి*

*ఆకార సౌందర్యమరయిదుమన్నా*


*కనులు చేతులు మోము కాల్లు మొత్తమ్ము*

*తామర కలికికి స్థానమ్ము సుమ్ము*


*ఈయంటు మన బాలకెపుడంటకుండా*

*తామర సిరికల ధన్యాత్మునకును*


*నలిచి నల్లేరుతో నలుగిడవలెను*

*కందనీటను ఒడల్ కడగంగవలెను*


*గంధకలేపమ్ము కడుబూయవలెను*

*వాడవాడల తిప్పి వదలంగవలెను*


*ఆ మాటలాలించి హరు పట్టమహిశి*

*మాధవ చెల్లియ ఆ మడతుకిట్లాడె*


*అతి విస్తరంబేల అందాల చిలుక*

*నీవు నేర్చిన తెలుగు నెర్తురే యురులు*


*వెన్నుని నలుపంచు వెక్కిరించితివి*

*నెలతుక ఎరుపంచు నిక్కుచూపితివి*


*కలువ పూవూ నలుపు కస్తూరి నలుపు*

*కందిరీగ యెరుపు కాకినోరెరుపు*


*ఈ రెండు రంగులందేరంగు మెరుగో*

*సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు*


*వరుని చూచిన కంట వధువుని చూడు*

*మాయ మర్మము వీడి మరి పదులాడు*


*కళికి కాల్సేతులు కన్నులు మోము*

*తామర విరిసిన తావులు కావో*


*కొమ్మ మేనికి దూలగొండి రాచెదవో*

*కంద నీటికిగిచ్చగారవించెదవో*


*ఇంతింత కన్నుల ఎగదిగ చూచి*

*సిగ్గుతో నెమ్మోము చేత కప్పుకొని*


*అనలు కొనలు వేయు అనురక్తి తోడ*

*రసికత లేని మా రంగని మెడను*


*పూలమాలను వేసి పొలుపుగా అతని*

*గుండెలపై చేరి కులుకంగ తలచు*


*రంగనాయకి ఎంత రసికురాలమ్మ*

*చపరలోచన ఎంత చపలురాలమ్మా*


*ఆనవ్వు లీనవ్వులరవిరిమల్లె*

*అందాలు చిందుచు అలరింప మదులు*


*సకల వైభవములా జరిగెను పెండ్లి*

*అంపకమ్ముల వేల అరుదెంచినంత*


*పసుపు కుంకుమ పూలు పండుటెంకాయ*

*తాంబూలమొడి దాల్చి తరళాక్షి లక్ష్మి*


*తలపు లోపల క్రుంగు తండ్రిని చేరి*

*నాయనా యని పిల్చి నవదుఖ: భాష్ప*


*కణములు జల జల కన్నుల రాల*

*గుండెపై తల వాల్చి కుములుచుండంగా*


*కడివెడు బడబాగ్ని కడుపులోననిచి*

*శిరమున మూర్కొని చెక్కిళ్ళు నిమిరి*


*పాలపూసల తల్లి భాగ్యాల వెల్లి*

*వేడ్క అత్తింటికి వెళ్ళి రావమ్మా*


*ఆడ పిల్లలకు తండ్రి అయ్యెడు కంటే*

*మతి గతి లేనట్టి మానౌట మేలు*


*వీనుల నీ పాట వినిపించుచుండ*

*కన్నుల నీ ఆట కనిపించుచుండ*


*ఊరటతో యెట్టులుండెదనోయమ్మా*

*గడియలొ నిను వచ్చి కనుకుందునమ్మా*


*అనిసాగరుడు పుత్రిననునయింపంగా*

*బుద్దులు గరపిరి పుణ్య కామినులు*


*ఏమి నోము ఫలంబొ ఏమి భాగ్యమ్మో*

*వేదంతవేద్యుడు విభుడాయె నీకు*


*ఆముదాలన్నియూ ఆణిముత్యములే*

*చిగురుబోండ్లందరూ సింధు కన్యకలే*


*తల్లినీవెరుగనీ ధర్మంబుగలదే*

*నెలతనీవెరుగనీ నీతులున్నవియే*


*పదుగురు నడిచిన బాటయే బాట*

*మందికి నచ్చిన మాటయే మాట*


*మంచిని విత్తిన మంచి ఫలించు*

*జొన్నలు విత్తిన చోళ్ళేల పండు*


*పోయిరాగదమ్మ పుత్తడిబొమ్మ*

*నీదుపుట్టింటిపై నెనరుంపరమ్మ*


*కనిపెంచకున్ననూ కళ్యాణి నిన్ను*

*కన్నుల చూడక పొద్దు గడచునే మాకు*


*చిలుకలు పలికిన చిగురుమావిళ్ళ*

*కోయిలల్ కూసిన గుండెలెట్లాడు*


*పొగడ చెట్లకు వ్రేలు పూదొట్ల గన్నా*

*నిమ్మలంబుగ యెట్లు నిలుతుమే కన్నా*


*కాటుకాయను కాంతనేనిత్తు*

*కుంకుమ భరణిని కొమ్మనేనిత్తు*


*జోడు సొమ్మెలు నీకు జోటినేనిత్తు*

*పట్టినదంతయు బంగారు కాగా*


*ముట్టినదెల్లయూ ముత్యంబు కాగా*

*కడుపు సారెకు వేగ కదిలిరావమ్మ*


*మదిలోన మమ్ముల మరిచిపోకమ్మ*

*అంత మహాలక్ష్మి అనుగు నెచ్చెలుల*


*చెక్కిళ్ళు ముద్దాడి చుబుకంబునంటి*

*కంఠంబు నిండిన కన్నీళ్ళనాపి*


*బంగారు చెలులారా ప్రాణంబులారా*

*నేనయిమీరెల్ల నెగడిమాయింట*


*అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ*

*పట్టు కుచ్చులు నావి పరికిణీల్ నావి*


*పందిట తూగాడు పవిటల్ నావి*

*కాళ్ళ గజ్జెలు నావి కడియాలు నావి*


*పొలుపైన బచ్చెన బొమ్మలు నావి*

*బొమ్మలకునువెట్టు భూషణముల్ నావి*


*స్వేచ్చగా మీరెల్ల చేకోరమ్మా*

*అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మా*


*అని బుజ్జగములాడి అందలంబెక్కి*

*కమళాక్షునింటికి కదిలె శ్రీలక్ష్మి*


*కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు*

*కండచక్కెర పాలు కలిసియున్నట్లు*


*అంజనాచలవాసుడలమేలుమంగ*

*జంట వాయక సుఖ సంతోషలీల*


*సాధురక్షణమును సలుపుచున్నారు*

*సాధురక్షణమును సలుపుచున్నారు*


*అఱుగని మంగళసూత్రము చెరగనికుంకుమ,పసుపు,చెదరని సిరులున్,తఱుగని సుఖము లొసంగును,హరిసతి యీ పాట విన్న అబలల కెపుడున్.* 🙏🙏🙏

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*గజల్ -- అంచయాన - (012) *శ్రీ శివ మానసపూజ స్తోత్రమ్ *విహంగ , భ్రమర, మీన , తాబేలు న్యాయాలు *అత్తగారిమాటలకు ఏ చీర కొన్నది కోడలు ? *తల్లికి కపిలుడు బోధ, *భాగవతం


సుభాషితం


* సాహిత్య సంగీత కళా విహినః సాక్షాత్పశు: పుచ్ఛవిశాణహీనః౹

     తృణం న ఖాదన్నస్పి జీవమానస్తద్భాగ  ధేయం పరమం పశూనామ్౹౹


సాహిత్యం,సంగీతం,కళలను నేర్చుకొననివాడు సాక్షాత్తు కొమ్ములు,తోకలేని పశువులాంటివాడే.గడ్డి తినకుండా అతను జీవిస్తున్నది పశువుల పరమభాగ్యమే.

🌺✍🏽

           2-5-2022.

ఉపనిషత్ సూక్తి 


* ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి||

(గణపత్యుపనిషత్)


-ఓం లం గణపతి కొరకు నమస్కారము. నీవు ప్రత్యక్షమైన తత్త్వము నీవే అయియున్నావు. 


***

నిజమైన విద్య అంటే సమాచార సేకరణ కాదు. ప్రజ్ఞను పెంపొందించేదే విద్య.సంకల్ప శక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా, వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య.

****

జాగృతి, స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు


గడచిన కాలమే గతాన్ని తొలగించుగాక. అనంతమైన భవిష్యత్తు మీ ముందుంది.

***

*నిష్ఠ 


మీరు ఈ దైవ గృహంలో ఉంటున్నారు. ఇది మీ ఇల్లు. మీ పని ఎడల గర్వము, నిష్ఠ కలిగి ఉండాలి. అప్పుడు దేవుని ఆశీస్సు మీ ద్వారా ప్రవహిస్తుంది. తన సంస్థ పట్ల, దేవుడు తనకిచ్చిన పని పట్ల నిష్ఠ లేనివాడు , దేవునియందు నిష్ఠ లేని వాడే. నేను విశాల భావాలు కలిగిన వాడినైనా, నా గురు పరంపర --- బాబాజీ , లాహిరీ మహాశయ , శ్రీ యుక్తేశ్వరులను మాత్రమే పేర్కొనడం మీరు గమనిస్తారు.


*శ్రీ పరమహంస యోగానంద ప్రవచనం*


శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం


No comments:

Post a Comment