Friday 1 March 2019

మహాశివరాత్రి:



మహాశివరాత్రి: ( 04 - 03 -2019 , సోమవారం, మాఘ బహుళ చతుర్దశి )
మాఘ మాసంలో పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజున వచ్చే శివరాత్రి ఇది. ఈ రాత్రి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ప్రత్యేక సాధనలు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఎందుకంటే అది అన్ని శివరాత్రులలో కెల్లా మహత్తరమైనది, శక్తివంతమైనది. మనలోని శక్తులు ఉప్పొంగే రాత్రి మహాశివరాత్రి!

ఒకనాడు పార్వతీదేవి శివుడితో "ప్రాణేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ధ కర్మలతో చాలా బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞ యాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి ముక్తిని కలుగేటట్లు చేయండి" అని పార్వతి అన్నది. అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రి వ్రతము అనే వ్రతము ఒకటి ఉంది. ఆ ప్రతము సర్వ యఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను విను...

పూర్వము ఒక పర్వత ప్రాంతమున వ్యాధుడనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది. ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క మృగము కనపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్పక, చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడు సరస్సు వైపు చూస్తూ, అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ సరస్సు వైపు చూస్తూ కూర్చున్నాడు.

మొదటి జామునకు ఒక లేడి నీరు త్రాగటానికి ఆ సరస్సు దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము విడువబోయాడు. "వ్యాధుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా అన్నది. "నేను గర్భిణిని. నా వలన నీ కుటుంబానికి సరిపడే భోజనము లభించదు. కాబట్టి నన్ను వదులు. కాసేపట్లో ఇంకో జింక ఇక్కడకు వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి అప్పగించి వస్తాను " అన్నది.



సరే నన్నాడు వేటగాడు. రెండవ జామునకు ఇంకో జింక కనిపించింది. మొదటి జింకే అనుకున్న వేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో "ఓ వ్యాధుడా! నా మాట విను. తరువాత నన్ను చంపవచ్చు.నేను విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మాంసములు లేవు. నన్ను చంపినా నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగా బలిసిన మగజింక ఇక్కడకు వస్తుంది. దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు వ్యాధుడు మూడవజాము అయింది. వేటగాడు ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు. బలిసిన మగజింక రానే వచ్చింది. వేటగాడు దాన్ని చూసిన వెంటనే బాణము విడవబోయేంతలో మృగము వేటగాడిని చూసి, తన ప్రియురాలిని కూడా వాడే చంపి ఉంటాడని తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ వేటగాడా! రెండు జింకలు ఇక్కడకు వచ్చాయా? అవి ఎటు పోయాయి? వాటిని నువ్వు చంపావా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని మాటలకు మునుపటి లానే ఆశ్చర్యపడి రెండు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాయి. నిన్ను నాకు ఆహారంగా పంపాయి అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది. ఇంతలో ఇంకొక జింక తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర వుంచి త్వరగా వస్తాను అంది. ఈ విధంగా నాలుగు జాములు గదిచిపోయాయి. సూర్యోదయం అయింది. వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూస్తూ దిక్కులు వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాధుని ఎదుట మోకరిల్లాయి. జింకల సత్యసంధతకు వ్యాధుడు ఆశ్చర్యపడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు.



వ్యాధుడికి తన హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. ఈ విధంగా మృగాలను వేటాడి బంధించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమ నికృష్టంగా తోస్తోంది. చేసిన పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దయ చూపడం కూడా సత్యఫలమే" అన్నాడు. వ్యాధుని మాటలకు ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు చక్కని విమానంలో వచ్చి "ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున వలన నీ పాపము  నశించింది. నీవెక్కి కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే జాము జామునకు బిల్వదళాలను త్రుంచి క్రింద ఉన్న స్వయంభూలింగాన్ని పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళారు.




ఈ కథను పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పి "దేవి! ఆ మృగకుటుంబమే ఆకాశంలో కనిపించే మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో


ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము లేదు’ అని తెలిపాడు భోళాశంకరుడు.భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. పల్లవులకాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన... సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా


దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి.

ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూ పంగా అనిపిస్తుంటుంది.ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.

కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఉన్నదే ఆంధ్రప్రదేశ్ లో వీటి జాబితా చాలానే ఉంది.గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశంజిల్లాలోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగాచెక్కబడ్డాయి. -వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూస్తంభాలూఅన్నీఆకొండరాయితోనే మలచ గలగడం 

విశేషం.శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. 

అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి. శివలింగాలన్నీ ఒక్కచోటే.. ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్లోని అమరనాథ్లో కన్పించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుదల్రింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వ రిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం)

రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామే శ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు. ఒకేచోట త్రిమూర్తులు... -ఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.





పల్లవ గుహాలయాలు... -ఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం...వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని అంచనా ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్నగుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు; పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి. కోనకు ఇలా వెళ్ళాలి... భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబ వరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం  నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంద     అందరూ దయచేసి ఇది మీ కంప్యూటర్‌లో సేవ్ చేసుకోండి, షేర్ చెయ్యండి. అమూల్యమైన లింక్ మీకు అందిస్తున్నాను.


శివరాత్రి .."శివ'' అంటే "శివుడు;; - "రాత్రి'' అంటే "పార్వతి''
వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి''. వీరికి పూర్వం వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు.

అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు'' అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే "శివరాత్రి'' విశ్వానికంతటికీ పర్వదినం అయింది.
అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞానోపదేశం చేసినది ఈ "శివరాత్రి'' నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని "లింగోద్భవ'' కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది.
ఈ శివరాత్రి పర్వదినంనాడే "శివపార్వతులకు'' కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.అభిషేకం ఎందుకు చేయాలి ?"అభిషేక ప్రియం శివః'' అన్నారు. శివుడు అభిషేకప్రియుడు.నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్టం.
ఇందులో అంతరార్థం ఏమిటంటే -"నీరము'' అంటే "నీరు'' నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును "నారాయణుడు'' అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు "నీరు'' అంటే చాలా యిష్టం.
అందుకే శివునికి జలాభిషేకంచేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో
"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః''
శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ ... చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ అభిషేకాలన్నింటికన్న "జలాభిషేకం'' అంటేనే శివునకు ప్రీతికరం.

అందులోనూ "గంగాజలాభిషేకం'' అంటే మహా యిష్టం. ఎందుకంటే "గంగ'' "విష్ణుపాదోద్భవ'' విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అందుకే శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.
ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం "చితాభాస్మాభిషేకం'' ఎందుకంటే ఆయన "చితాభస్మాంగదేవుడు'' కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో "మహాకాలేశ్వరునికి'' ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది.
ఏది ఏమయినా, శివాభిషేకం ... సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం ...ఎందుకంటే"జలధార శివః ప్రియః'' అన్నారు కదా! ఈ అభిషేకాన్ని "రుద్రైకాదశిని'' అనబడే నమక, చమకాలతో చేయాలి. అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి.
నమకంలోని "నమశ్శివాయ'' అను పంచాక్షరీ మంత్రంలో"శివ'' అనే రెండు అక్షరాలు "జీవాత్మ'' అనే హంసకు రెండు రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి"శివాభిషేకం'' అత్యంత ఉత్తమైన సులభమార్గమని, "వాయుపురాణం'' చెబుతుంది.
"వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః'' అనునది సూక్తి. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది. నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.
అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.
"శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||
శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క "శివరాత్రి'' అర్చనవలన లభిస్తుందని'' "శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి. మరునాడు "మాఘబహుళ చతుర్దశి'' శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. లింగోద్భవకాలంలోఅభిషేకం తప్పనిసరిగా చేయాలి.
తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి. నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు, 
"ఓం నమశ్శివాయ'' అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.

బిల్వపత్రాల విశిష్టత.
శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం.
మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.
సాలగ్రామ దానఫలం,శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం,
వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం, ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని"బిల్వాష్టకం''లో చెప్పబడింది.
"ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి.బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వాదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి.
ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
జాగరణ ఎందుకు చేయాలి..
క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు ... మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో ... అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ, శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట. ఆ జాగరణే "శివరాత్రి''నాడు భక్తులు ఆచారమైంది.
"జాగరణ'' అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ, గడపడం కాదు. జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం.శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు. శుద్ధ స్ఫటిక మనస్కుడు. అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రాక్షమాలలూ ధరిస్తాడు.
మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది. శరీర వ్యామోహం లేని వాడు కనుకే, తైల సంస్కారంలేని జటాజూటంతో, చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు.
ఆయన జీవనవృత్తి భిక్షాటనం. అందుకనే ఆయనను "ఆదిభిక్షువు'' అన్నారు. ఆయన భుజించే భోజనపాత్ర కపాలము. ఆయన నివాసస్థానము శ్మశానం. ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడాకనిపించడు.
ఈ "నిర్జనుడు'' మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత.ఈశ్వర భక్తుడైన "రావణుడు'' ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే.
బ్రాహ్మణ వంశంలో జన్మించి, వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి, శివపూజ చేసి, శివప్రసాదం తిన్న "గుణనిధి'' మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు.
అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేెరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. అదే"శివరాత్రి'' మహత్యం.
రావణసంహారం చేసిన శ్రీరాముడు, బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరతీరంలో "సైకతలింగ'' ప్రతిష్ఠచేసి పాపవిముక్తుడు అయ్యాడు. ఆ క్షేత్రమే "రామేశ్వరం''.
శివుని శరణుకోరి, మార్కండేయ, యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు. శివునికి తన నేత్రాలతో అర్చించిన "తిన్నడు'' భక్తకన్నప్పగా వాసికెక్కాడు.
ఇలా చెబుతూ పొతే ఎందరోమహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి. అట్టి నిరాకార, నిర్గుణ, నిరాడంబర, నిగర్వి అయిన ఆ "నిటలేక్షుని; ప్రేమానురాగాలు అనంతం. ఎల్లలులేనిది ఆయన మమకారం. "శివా''అని ఆర్తిగా పిలిస్తే, చెంతనుండే ఆశ్రిత వత్సలుడాయన.
దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యే వేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.
దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర... "నీకు నేనున్నారురా దిక్కు'' అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు "శివుడు'' ఒక్కడే. పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి ... ఆ పరమేశ్వరుడు ఒక్కడే..
ఇది చాలదా మన జన్మకు? ఏమిస్తే ఆ సదాశివుని ఋణం తీరుతుంది.?- భక్తిగా ఓ గుక్కెడు నీళ్ళతో అభిషేకించడం తప్ప.- ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప. తృప్తిగా "నమశ్శివాయ'' అంటూ నమస్కరించడం తప్ప.
అందుకే "మహాశివరాత్రి''నాడైనా మహాదేవుని స్మరిద్దాం. మోక్షసామ్రాజ్యాన్ని అందుకుందాం
"ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వర స్సర్వభూతానాం - బ్రహ్మాధిపతిర్ |బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు.

ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర..

1 comment: