Monday 8 August 2016

* చండి మాత కధ

ఓం శ్రీ రామ్      ఓం శ్రీ రామ్            ఓం శ్రీ రామ్  
ప్రాంజలి ప్రభ - భక్తి ప్రభ


సర్వేజనా సుఖినోభవంతు



-------------------------------శుభోదయం -------------------------------------
పద్యమ్ము నెవడురా పాతి పెట్టెద నంచు వున్మాదియై ప్రేలుచున్నవాడు
పద్యమ్ము నెవడురా పార వేయుదు నంచు వెఱ్రివాడై విర్ర వీగు వాడు
పద్యమ్ము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్లు వేవేల నొసగు
పద్యమ్ము నెన్నడో పాతి పెట్టితిమేము లోకుల హృదయాల లోతు లందు.
పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట
పద్యమన్నది తెలుగింటి పాడి పంట
పద్యమ్ము యింటింట పండు నంట
కవిత పద్యమ్మె మీకేల కడుపు మంట

---------------------------మాతెలుగు నుడి తేనియ ---------------------
చక్కని పల్కులు జక్కని కుల్కులు జాణత సోకులు సంపదగా
చుక్కల సొంపులు సుందర చూపులు జూపుల కన్నియ సుందరిగా
అక్కజమందుచు నందరి మెప్పుల నద్భుత భాషగ అలతిగా
మక్కువ మీరగ మానుడి తెల్గును మా గుడి గొల్తుము మాతగ మేం



భోజరాజు ఒక రోజు ఈ సమస్య యిచ్చాడు."భారతం చేక్షుఖండం చ సముద్ర మపి వర్ణయః"
భారతము,చెరుకుగడ,సముద్రము ఈ మూడిటికీ సంబంధించిన ఒకే పాదం తో వర్ణించ మని అడిగాడు.కాళిదాసు
యిలా పూరించాడు. "పాదేనై కేన పక్ష్యామి ప్రతి పర్వ రసోదయం"
అర్థము:--భారత భాగములను పర్వములని(పక్షములని ) అంటారు.అందు ప్రతి పర్వము నందు రసము చిమ్ముచుండును.(రసోదయము)చెరుకుగడ గెణుపులను కూడా పర్వములంటారు.ఒక్కొక్క గెణుపుదగ్గర అది కూడా రసము గ్రక్కు చుండును.అమావాస్య,పూర్ణిమ రెండు పర్వములు.ఆ రెండు దినము లందును సముద్రము పొంగును కానసముద్రమున కూడా ప్రతి పర్వ రసోదయమే యగుచున్నది.



చలికంఠము!
( బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి చలికంఠము .)

చలి చలి చలి చందాయమ్మ,
గొంగళి గప్పుకో గోనాయమ్మ,
వడ వడ వడ వడ వణికేనమ్మ,
చలిమంటకు చితుకులు తేవమ్మ..,

(చలికాలము పసిపిల్లలు కంఠముచుట్టు చిక్కనిబట్ట మడతపెట్టి రెండుమూడు చుట్లు కాళ్లదాకా వచ్చేటట్లు చుట్టించుకొని మెడపక్కను ముడివేయించుకుంటారు. దానిపేరు చలికంఠము. చిదుకులతో చిన్ని మంటవేసి దానికికొంచెం దూరంగా కూర్చుంటారు. దానిపేరు చలిమంట. చలికి వణుకుతూ ఈ పదము పాడుతారు.)

*కోకిలానాం స్వరో రూపం
పాతివ్రత్యంతు యోషితాం
విద్యారూపం విరూపాణాం
క్షమా రూపం తపస్వినాం


అర్థము: కోకిలకు స్వరమే అందము.మహిళలకు పా తివ్రత్యమే అందము.
కురూపులకు విద్యయే అందము.యతులకు(మునులకు) క్షమ,శాంతము లే అందము.


--((**))--

విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి: పరేషాం పర పీడనాయ
ఖలస్య సాధో ర్విపరీత మేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయః


అర్థము: దుర్మార్గునికి విద్య వితండ వాదము చేయుటకును, ధనము గర్వ పడుట కును, శక్తి పరులను బాధించుటకును,ఉపయోగ పడును. అదే సజ్జనులకు విద్య జ్ఞానమునకు, ధనము దానము చేయుటకును, శక్తీ పరులను రక్షించుటకును ఉపయోగపడును

--((**))--


ఆలస్యం అమృతం విషం” అన్న వాక్యం కూడ తరచూ వాడుతుంటాం. దాని వివరణ--
“సిద్ధమన్నం- ఫలం పక్వం – నారీ ప్రథమ యౌవనం/
కాలక్షేపం న కర్తవ్యం “ఆలస్యా దమృతం విషం”//


“వండిన అన్నాన్ని, పండిన పండుని, యవ్వనంలో ఉన్న
స్త్రీని కాలక్షేపం అంటే ఆలస్యం చేయకుండా అనుభవించాలి.
ఆలస్యం చేస్తే అన్నం పాడైపోతుంది, పండు కుళ్ళిపోతుంది, స్త్రీకి యవ్వనంపోయి వృద్దాప్యం వచ్చేస్తుంది.” అన్న సందర్భంలో
‘ఆలస్యం అయితే అమృతం కూడా విషంగా మారిపోతుంది’ అన్న వాక్యం వాడబడింది.

--((**))--

దశావతారములు వర్ణన !
.
“ సలిల విహారులిద్దరును – సంతత కాననచారు లిద్దరున్-
 

వెలయగ విప్రులిద్దరును – వీర పరాక్రమశాలు రిద్దరున్
 

పొలతుల డాయువాడొకడు- భూమిన పుట్టెడువాడు నొక్కడున్
 

చెలువుగ మీ కభీష్ట ఫలసిద్ది ఘటింతు రానంత కాలమున్!”
.
పై పద్యంలో దశావతారములు వర్ణన ఉంది.
,
భావం చూడండి----
“ సలిల = నీటిలో విహరించేవారు యిద్దరు.
‘ మత్స్యావతారం,కూర్మావతారం’.
.
కానన = అడవిలో తిరిగేవారు యిద్దరు.‘
వరాహం, నారసింహం’
.
విప్రులు=బ్రాహ్మణులు గా పుట్టిన వారు యిద్దరు. ‘
వామన,పరశురామ’
.
పరాక్రమ వంతులు యిద్దరు.
‘రామ, బలరామ’
.
పొలతులు=స్త్రీలతో ( గోపికలతో) తిరిగినవాడు ఒక్కడు.
శ్రీకృష్ణుడు.
.
భూమిపై జన్మించిన వాడు ఒక్కడు.
‘ కల్కి’ అవతారం.
.
ఇలా దశావతారాలు ఎత్తిన ఆ “ శ్రీమన్నారాయణుడు”
మీ కోరికలను తీర్చి సదా మిమ్ము కాపాడు గాక.
శుభం.
“ఓం శాంతి శాంతి శాంతి:”




1 comment: