Saturday 24 December 2022

నేటి మంచిమాట. మ ని షి వి లు వ !!*


ప్రాంజలి ప్రభ....
ఒక అడవిలో ఒక కోతి వుండేది.ఆ కోతికి ఒక రోజు పాయసం తినాలని బుద్ధి పుట్టింది.
.కానీ పాయసం తయారుచెయ్యడానికి ముందు ఒక కుండ, పాలు, చక్కర యివన్నీ  కావాలి.ఎలా?అనుకొని చెట్టుక్రింద కూచుని ఏడుస్తూ వుంది. ఆ దారే వెడుతున్న ఒక 
కుండలు అమ్ముకునే వాడు,కోతీ కోతీ ఎందుకేడుస్తున్నావు?అని అడిగాడు.
అప్పుడు కోతి వెక్కుతూ నాకు పాయసం చేసుకోడానికి ఒక కుండ కావాలి అంది.
సరే ఏడవకు నేనిస్తాలే తీసుకో అని ఒక కుండ యిచ్చాడు.
కుండ దొరికింది మరి పాలు కావాలి కదా మరీ ఏడుస్తూ కూచుంది.ఆ దారిలో ఒక 
పాలవాడు పోతూ ఎందుకేడుస్తున్నావు కోతీ అని అడిగాడు నాకు పాయసానికి పాలు 
కావాలి అంది.వాడికి జాలి వేసి  సరే అని ఆ కుండలో సేరు పాలు పోశాడు.యింకా 
పంచదార ,జీడిపప్పు,సేమియా,ఏలకులపొడి  కావాలికదా?మరీ ఏడుస్తూ 
కూచుంది.ఆ దారి  వెంట సరుకులు అమ్ముకుందుకు ఒక శెట్టి వెళుతున్నాడు.వాడు 
కోతి ఏడుపు చూసి జాలిపడి సేమియా,చక్కర.ఏలకుల పొడి యిచ్చాడు.సరుకు 
లన్నీ దొరికాయి యింక పాయసం చెయ్యడమే తరువాయి.కోతి మూడు రాళ్ళు 
ఒకచోట పెట్టి పొయ్యి తయారు చేసింది.చితుకులు యేరుకొని వచ్చి మంట చేసింది దాని మీద కుండను పెట్టి పాలల్లో సేమియా పంచదార ,,ఏలకుల పొడి వేసింది.
పాయసం కుత కుత వుడుకుతూ వుంది.  ఆ వాసనకు అది లొట్టలు వేస్తూ వుంది.దాన్ని కలపాలనుకుంది. ఒక కర్ర ముక్క తెచ్చుకోవచ్చు కదా అబ్బ మరీ కర్రముక్క కోసం వెళ్ళాలి కదా అని బద్దకించి కలపడానికి తన తోకని కుండలో పెట్టింది ఆ తెలివి తక్కువ కోతి. ఇంకేముంది ఆ వేడికి దాని తోక కాలింది.వెంటనే బయటికి తీసి వెధవ  పాయసం నా తోక మాడి పోయింది అని ఆ కుండెడు పాయసాన్ని  అక్కడే వుండే  నీళ్ళ తొట్టి లో 
పోసేసింది.ఆ నీళ్ళలోనే తన తోక ముంచి నాకింది. పాయసం నోటికి తియ్యగా 
తగిలింది.అబ్బ పాయసం యెంత రుచిగా వుంది.అనవసరంగా నీటిపాలు చేశాను.
అని ఆ తొట్టి లోని  నీళ్ళను ఆబగా తాగ సాగింది.నీళ్ళు కొంచెమే వుండడం తో 
కొంచెం చప్పగా వున్నా కోతికి బాగానే వుంది అని పించింది. 
దురాశతో ఆ నీళ్లన్నీ తాగి తాగి దాని పొట్ట పట్టి అరచి అరచి అడవిలో తిరిగింది.
నేటిస్థితి డబ్బుకు ఆశబడి ఓట్లు వేసి గెల్పించాక నోరేత్తలేక కోతిలా చేతులు (తోకలు ) కాలాక ఆకులు పట్టినట్లు వుంది ప్రజలు నాయకలను చేప్ప లేక కక్కలేక ఏడవటం తప్పా మనుషులు వీడ్ని ఓడించి వేరొకడిని గెలిపించాలని తిరుగుతారు ఆశావాదులుగా
...

*నేటి మంచిమాట. మ ని షి వి లు వ !!*

ఒక కోటీశ్వరుడు నడుచు కుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే  తన కాలి చెప్పులు తెగిపోయాయి !

ఆ ఇంటిలోని యజమానిని పిలిచి నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి పారేయొచ్చు కానీ కొత్తవి ! అందుకే మనసు రావట్లేదు రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు !

అందుకు ఆ ఇంటి యజమాని అయ్యా మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటె మాకే గౌరవం అని చెప్పాడు !

ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు !!

ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు !

అయన శవం ఊరేగింపు జరుగుతున్నది భారీ వర్షం మొదలయింది !

ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి !

అయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు !!

వర్షం ఎక్కువగా ఉందండి !

 వర్షం ఆగే వరకు శవాన్ని మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు ! 

అందుకు ఆ ఇంటి యజమాని కోపం కట్టలుతెంచుకున్నాయి !!

మొదట శవాన్ని తీయండి ! ఎవరి ఇంటి శవాన్ని ఎవరింటి ముందు ఉంచేది మీరు అని కసురుకున్నాడు !!

అంతే అండి ప్రాణం ఉన్నంత వరకు చెప్పుల కున్న విలువకూడా 

ప్రాణం పోయాక ఉండదు !

 నీ వెనుక ఎంత డబ్బు ఉన్నా ......!!అంతే..

డబ్బుకు విలువ ఎక్కువ  అనుకుంటారు కానీ నిజానికి ప్రాణంకే విలువ ఎక్కువ !

ప్రాణం పోయాక కోట్లుఉన్నా వృధానే !తెగిన చెప్పుకున్నవిలువ           మనిషికిలేదా !!

 అందుకే *మనిషికే ... విలువిద్దాం !* *మానవత్వం నిలబెడదాం*.🙏

****

*ఇట్లు*  *ఓసి సంఘం* 

అమ్మ మనసు..

ఆడతనానికి మాత్రమే తెలుసు..

అమ్మ ఉన్నా లేకున్న .. శక్తితో ..తనదైన శక్తితో సహవాసం ..తనకు కావాలనిపించినపుడు..., ఎలా ఈ మనో వైకల్యం పూరించేదీ...అని లోలోపల వాపోతూన్నపుడు...ఆలి గుర్తుకు రాదు..కన్న కూతురు కాస్తైనా కదలి సరిచేయగ లేదు...!!ఇదొక అక్కా చెల్లెళ్ళ సామరస్య రహస్య గర్భ వాస వాసం..!!! ఇది ఒక లోటెరుగని చోటు..సోదర హృదయపు ఆరాటపు గేటు. ఆర్భాటాలేవీ అక్కరలేని...

శుష్క వేదాంతాలేవీ వచించలేని ...ఆశీర్వాదాల జల్లు కురిపించే ...అన్నా తమ్ముళ్ళ కొరకు ...కంటి కొసతెగి చెవిలోకి ఉరికే వరకూ ...అక్క చెల్లెళ్ళు చేసే..నిరంతర ప్రార్ధనల ..లోలోతు పరిష్వంగాలు.

తీయగా లేని ...తీయనైన ...నిజ గర్భ వాసాల రక్షా క్షేత్రాలు ....ఆడ పడుచులు..!! మనఇంట పుడతారు...నాన్న కేదో లక్ష్మి ...కలిపి తెస్తారు...తను పెరుగుతూ సీతలా ...కలిమి పెంచేస్తారు..

ఎరిగిన వారు పాద మహిమంటారు....!!!ఎరుగని వారు  మేమే కష్టపడి కలిమి తోడి తెచ్చామంటారు...!!!

కానీ పదారు వెళ్ళాక ...వారివీ వీరివీ కాళ్ళూ వేళ్ళూ పట్టి ...తన గారాల ముద్దు పట్టిని ..మా దానవే కాదు ఆడ పిల్లవు నీవంటు తరలి పంపిస్తారు..!!హన్నా గుండె మండే నిప్పు ..అమ్మ నాన్నల ఎడబాటు ..అన్న దమ్ముల అక్కచెల్లెళ్ళ ..ఆటపాటలన్నిటికి సెలవు...!!! అత్తింట కష్టమైన ను గాని కదలి వినరు. ఇష్టము గ చేసుకొని జీవించుమచట..వెనుదిరిగి చూడ రాదనుచు వాగ్దానమడిగి...వదలి వడలెదరింక మరలిరారు.

గర్భ ధారణ లో ...పురుళ్ళో ...మనుమల కార్యములైన ...దూరాల బంధురీతిగ మార్చి చూచెదరిచట....!! ఎటువంటి స్త్రీ జాతి మనది మగువలార...!! ఎన్ని క్షమతల నుర్వి నేర్చితిమి గాదు...నిజము గాను...!!తనవారినే వదలి ...

వేరైన వారి జత చేరి వెలితి దీర్చి...ఎన్నియో మంత్రిణీ..తంత్రిణీ ...తంత్రములు జేసి...మానినిలమై ...అవమానమిసుమంతైనా కలుగకుండ...జీవితాంతము నడచి వెళ్ళెదము సుమ్మ...్బిచ్చగాడైన పతిని అనుసరించిన గౌరి పగిది...!!!


ఆస్తులు లేకనేమో న నగ లేక కాదు...!!!సోదరీ ప్రేమ రాజము ...జన్మ జన్మల కలిమి కలిపి వర్షించు కనక సిరులు.

తీర్చలేమని యెరిగి పెద్దలిచట..పసిడి రత్నములు రాశి చేసి పోసెదరు..అమ్మాయి లకు ఆడపడచనుచు..సిరి మా యింట జనియించె న నుచు. విష్ణు పదములనుచు ..ఆమె భర్తగువాని కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొందురు గద..!!!శివ పదమనుచు శైవులు తీర్ధమందురు బావ పాద జలము..!!!

చేతుల వెంట పంచగ లేని సి రి ..మాటల ప్రేమల మూటలు పంచెడి మగువ మాట తోడు లేక..మానసిక నిపుణుల వెంట పడి తిరుగుతున్నారు జనులు..!!ఆ సహ ఉదర జనిత ప్రేమ లేని చోటుకై వెతకి వేసారు బాటసారులై అన్నలును ...తమ్ములును..అక్క చెల్లెళ్ళును గాదె..!!

అన్న ఇల్లు కట్టిన చాలు తాను పాలు పొంగించి వచ్చు ...పాల పాయసము వలె మా యన్న పరవశించు న నుచు ఆ చోట. మేన కోడలు పెళ్ళి రావమ్మ యనగ ..శివసతి గా తా వచ్చు తరలి ..ఇంతిని తన సహోదరియనుచు నెంచి...కల్మశము లేని దీవనలన్ని గూర్చు.

మేనల్లునీ పెండ్ల రావమ్మ యనగ...మా యన్న సుకుమారుడై ..ఈ భువిని భద్రమగు గాక యటంచు దివించు నిండుగాను..!! కల్ప వనాంతర సంకల్పరాశి గాదె యతివ..!!

కామ మెరుగని చోట కదిలి దీవించు ప్రేమ తోని.తల్లి దండ్రుల చూచు ..సౌఖ్యమలర..

ప్రేమాతిశయంబున ..తన చేయి వదలిన వారి చేరి చేబూను సేవ సేయ. ఇంతి ...ఆడ కూతురు..ఎప్పటికి ఆడకూతురే గదా అచట నిచట..!! నామ మందున చిరు నామ మింతైన లేని జగదేక మాత..!!అయిన నూ ప్రేమించు దీవించు కల్ప వృక్షము భంగి..సమ్మోహనముగ..!!!!

OooooO

మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము. ఇదే *బయో-గడియారం*. చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 

50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో గాఢంగా నమ్మబల్కోని  చాలామంది తమ సొంత బయోక్లాక్‌ ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  *మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌* ను మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము. 

చైనాలో చాలా మంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి అలా మానసికంగా సంసిద్దులై వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.

*కాబట్టి మిత్రులారా..!*

1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *ధ్యానం* చేస్తే తద్వారా మనం *కనీసం* 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.

2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.

3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి, యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. *ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ  యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు*.

4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ నెగటివ్ థాట్స్ తో తీసుకోవద్దు. *ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.* లేదంటే ఋణాత్మక ఆలోచనల వల్ల మన శరీరంలో నెగటివ్ ఎంజైములు విడుదలై మన జీర్ణ వ్యవస్థను, మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.

5. ఎప్పుడూ చురుకుగా ఉండండి. నడవడానికి బదులుగా వీలైతే జాగింగ్ చేయండి. 

5. *వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి*. (ఇది నిజం కూడ).

6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి. *(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).

7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ నాకు Old age వస్తుంది అనే మాటను అనకండి. 

*ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం జరిగింది కూడా 105 సంవత్సరాల వయసులోనే అని గ్రహించండి.*

కాబట్టి మీ మానసిక బయో క్లాక్ ని మీ తక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోమాకండి. ఇకనైనా మీ ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోండి.

***"""**"


 *మాటే మంత్రం.మాటే అనుబంధం,ఆత్మీయం!*

నీళ్ళు ఇంటికి రాగానే మొట్టమొదట చేసే పని ఫిల్టర్ చేయడం. తరువాత ప్రస్తుత పరిస్తితులను బట్టి కాచి తాగాలి..  అలానే పాలు రాగానే మరగ కాచి , ఉపయో గిస్తాము.. లేకపోతే బాక్టీరియా ప్రభావం వలన పాలు విరిగి పోతాయి.. అలానే అసహ్యం , అసూయ , కోపం , బాధ , అభద్రతా భావ ప్రదేశాలలోంచి వచ్చే మాటలు పెదవి దాటక ముందే మూల్యాంకనం చేయాలి, వడబోయాలి.. ఇంకా చెప్పాలంటే ఇలాంటి సందర్భాలలో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎంతో మంచిది . ఎందుకంటే మాటలకు మనసులను విరిచే శక్తి ఉంటుంది.. పాలు విరిగితే నష్టమేమీ  లేదు.. ఇంకొక పేకెట్ కొనుక్కోవచ్చు.. మనసు విరిగితే తిరిగి అతుక్కోదు , పైగా బంధం దూరమైపోతుంది.. మనం మాట్లాడే మాటలు నడి వేసవిలో చిరుజల్లులు కురిసినట్లు ఉండాలి.. కొందరు మాట్లాడితే కొట్టినట్లుంటుంది .. మరి కొంత మంది మాట్లాడితే ఎదుటివారి మనసును తట్టినట్లుంటుంది..  కొందరి మాటలు తేనెలొలికిస్తాయి.. మరి కొందరి మాటలు మనసులో ములుకులు దించుతాయి..*

 *ప్రియమైన మాటలు ఎదుటివారి మనసులో సరిగమలు పలికిస్తాయి.. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి.. మన నోటి నుండి వచ్చే మాట మన ఆధీనంలో ఉంటే , ప్రపంచమంతా మన ఆధీనంలో ఉంటుంది.  ఏమంటారు ?*

ఒక రాజు గారికి  భీముడు అనే అంగ రక్షకుడు వుండేవాడు.వాడు నిజాయితీగా పనిచేసేవాడు.అందుకని రాజుగారికి అతడంటే చాల యిష్టం.అతనెప్పుడు తేది జరిగినా అది అంతా మన మంచికే   అని అన్తూందే వాడు.

ఒకసారి రాజుగారి పాదానికి గాయమైకాలి  బొటనవేలు తీసేయాల్సి వచ్చింది. రాజు బాధపడుతూంటే భీముడు 

దిగులెందుకు మహారాజా! ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అన్నాడు. రాజుకి చాలా కోపం వచ్చింది 

నా వేలు పోయి నేను బాధ పడుతుంటే నీకు ఎగతాళిగా వుందా?అంటే భీముడు మరీ అదేమాట అన్నాడు ఏది జరిగినా మన మంచికే అని. రాజుకు కోపం వచ్చి అతన్ని చెరసాలలో పెట్టమని ఆజ్ఞాపించాడు.అతన్ని చెరసాలలో పెట్టేటప్పుడు కూడా అతను యిదీ మన మంచికే అంటూ లోపలి వెళ్ళాడు.కొన్నాళ్ళ తర్వాత రాజు వేటకి వెళ్ళాడు..అక్కడ దారి తప్పి అడవిలో చాల దూరం వెళ్ళిపోయాడు.అతని సైనికులూ,అంగ రక్షకుడూ 

యేవరూలేరు.అక్కడికి కొంత మంది ఆటవికులు వచ్చి అతన్ని బంధించి తీసుకొని వెళ్ళారు.వారి నాయకుడి ముందు నిలబెట్టారు.అతడు ఇతన్ని మన దేవతకు బలి యిచ్చేద్దాం అని అన్నాడు. సరే అతనికి స్నానం అదే చేయించి దేవత దగ్గరికి తీసుకని  రండి అని ఆజ్ఞాపించాడు.వారు అతనికి స్నానం చేయించేటప్పుడు అతని కాలికి బొటనవేలు లేక పోవడం గమనించారు.నాయకుడి దగ్గరకు వెళ్లి యితనికి అంగ వైకల్యం వుంది ఇతను బలి యివ్వటానికి పనికి రాడు. అన్నారు. సరే అయితే అతన్ని వదిలి వేయండి అని ఆజ్ఞాపించాడు. రాజు బ్రతికి జీవుడా నాయి తన గుర్రం యెక్కితిరిగి తిరిగి ఎలాగో ఒకలాగా తన రాజ్యానికి 

చేరుకున్నాడు.అప్పుడు అతనికి తన కాలికి బొటనవేలు లేకుండా వుండడం వల్ల తను బ్రతికి బయట పడ్డాడు  కదా! మరి భీముడు చెప్పింది నిజమే కదా!తనకు వేలు లేక పోవడ వల్ల తనకు  మంచే జరిగింది  అని అతన్ని చేరసాలనుంచి విడిపించి అతన్ని క్షమాపణ కోరాడు.భీముడు క్షమాపణ యెందుకు మహారాజా యిది కూడా నామంచికే గదా జరిగింది.అన్నాడు.అదెలా? అని రాజు అడిగాడు.నేను చెరసాల లో వుండకుడా వుంటే నేను మీ వెంట వేట కు వచ్చేవాడిని. 

. అడవిలో  మీ  అంగ రక్షకుడిగా నా ధర్మం నిర్వర్తించేందుకు మీ వెంటే వుండేవాడిని.

అప్పుడు ఆ ఆటవికులు మిమ్మల్ని వదిలేసి బాగున్న నన్ను బలి యిచ్చేవారు కదా!  మీరు నన్ను చెరసాలలో పెట్టి నందున నాకు మేలే జరిగింది.మీరు నా ప్రాణం కాపాడినట్టే కదా! నాకు మేలే జరిగింది. 

మీరేమీ బాధపడకండి. ఏది జరిగినా మన మంచికే అని నేనందుకే చెప్తూ వుంటాను.అన్నాడు.రాజు అతనికి 

మంచి బహుమానం యిచ్చి జీతం ఎక్కువచేసి గౌరవించాడు.దీని వల్ల నీతి యేమంటే. మనం అందరం ఏది జరిగినా దేవుడి ప్రసాదమని స్వీకరించగలిగే ప్రవర్తన కలిగి వుండాలి

***"""**

***

అమృతం

ఒరేయ్ నాయనా, నీకు సమయం ఆసన్నమైంది, ఇంకో కొద్ది క్షణాల్లో తిరిగి రాని లోకాలకు ప్రయాణం కావాలి, సిద్ధంకా! అంటూ సమవర్తి భటులు, నా పక్కకొచ్చి ప్రేష అంటే పిలుపునిచ్చారు.

మరీ ఇంత హఠాత్తుగా గానా? విస్తుపోయి అన్నాను.

తప్పదురా! వెళ్ళాలి. సెకనులో వెయ్యోవంతు కూడా లేటు కాకూడదు. క్రమశిక్షణలో మాకు మేమే సాటి. మమ్మల్ని నిలువరించే శక్తి ఎవరికీ లేదు.‌ కాబట్టి వృధాగా మాట్లాడకుండా సిద్ధం కా  అన్నారు.

సమయం చాలా కొద్ది గా ఉంది. ఏం చేయను? అప్పటివరకూ నాలో ఉన్న తాపత్రయాలు, బెంగలు, బాధలు పటాపంచలై పోయాయి. 

నేనే శాశ్వతం కాదనుకున్నప్పుడు, ఏం బంధం నన్ను నిలువరించ లేదనుకున్నప్పుడు చివరి మజిలీలో ఏంచేస్తే బావుంటుందా అని ఆలోచించా. ఎంత ఆలోచించినా ఆలోచనలు ఒక కొలిక్కి రావటం లేదు.

ఆయన లేకపోతే నాజీవితం ఎట్లా వెడుతుందొదినా, పసుపు కుంకాలు లేని బ్రతుకెందుకు? అని భార్య రోదిస్తోంది. పసుపు కుంకాల రూపంలో నిత్యం ననుమోసే నా భార్య ఏడుపులో నా ఉనికి ఆవిడకెంత అవసరమో తెలుస్తోంది.

అప్పటివరకూ చాకిరీ చేసి అలసిన కొడుకు, డాక్టర్ ఆశ లేదనే విషయం చెప్పాక, నేను లేని జీవితం ఎలా గడపాలో ఆలోచిస్తున్నాడు. వాడికి నామీద ఉన్నప్రేమతో పాటు, రేపు అనేదానిమీద వాడికి కలుగుతున్న స్పృహ నాకు ఆనందాన్నిచ్చింది.

చివరి చూపుకొచ్చిన అల్లుడు, మిగతా కార్యక్రమం తొందరగా అయిపోతే తన దైనందిన జీవితంలో పడిపోవచ్చు, అసలే లీవు తక్కువ శాంక్షనయ్యిందని బాధపడుతున్నాడు. 

అతని బాధలో వాస్తవం నాకు అర్థం అవుతోంది. అందుకే బాధ కలగటం లేదు. 

ఇంకా బతుకుతాడనే  నమ్మకం ఉంటే నిరీక్షించడం సబబుగా తోస్తుంది, రేపో,మాపో పోతాడని  రూఢిగా తెలిస్తే రేపే కరెక్ట్ కదా. 

ఇది ఎలాంటిదంటే బాగా ఇష్టమైన వ్యక్తి వేరే చోటుకు వెడుతూంటే బాధ కలుగుతుంది. వెళ్ళటం తప్పదని తెలిసినపుడు బస్టాండు వరకు వెళ్ళి బస్సు ఎక్కిస్తాం. బస్సు ఎక్కి సీటులో కూర్చున్నాక బస్సు ఎప్పుడు కదులుతుందా అని  నిరీక్షిస్తాం. ఆ సమయంలో మాట్లాడేది, అక్కడే ఉండి కబుర్లు చెప్పుకునేది పెద్దగా ఉండదు. అందుకే బస్సు ముందు ఏవ్యాపకం లేకుండా అలా ఊరికే నిలబడే కన్నా బస్సు బయలుదేరితేనే మంచిదనిపించదూ‌!

అంటే దానర్థం వాళ్ళు వెళ్ళిపోవాలని కాదు, ఉండి ఏమీ చేయలేనప్పుడు, వెళ్ళటం మంచిదే కదా అని అనుకోవటం లాంటిది. ఇదీ అంతే అందుకే అల్లుడి ఆలోచనలో సబబుగా ఉందనిపించింది‌

ఈ గొడవలో పడి పిల్లల ఆలనా పాలనా మర్చిపోయానని తనను తాను నిందించుకుంటూ నా మనవలకు తిండి పెట్టే స్తోంది కోడలు. 

ఆలస్యం చేస్తే పెద్దాయన గుటుక్కుమంటాడు, అపుడు హడావిడి మొదలవుతుంది. ఆ గొడవలో పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ఆ తల్లి మనసు ఆరాటపడుతోంది. నాకు తప్పనిపించలేదు. పోయేవాళ్ళతో ఉన్నవాళ్ళు పోలేరు కదా కోడలూ కరెక్టే అనిపించింది.

అమ్మా! తాతకు ఏమయ్యిందీ? తల్లిపెట్టే గోరుముద్దలు తింటూ ఆలోచనగా అడిగాడు‌, నాపేరు పెట్టిన నా మనవడు. 

తాతగారు ఇంకాసేపట్లో దేవుడి దగ్గరకు వెళతారు నాన్నా అంటోంది కోడలు. 

మళ్ళీ ఎప్పుడు వస్తారు? అడుగుతున్నాడు‌.

ఇంక రారు.

మరి సెలవల్లో మనం తాతయ్యా వాళ్ళూరు రామా!

లేదు, మామ్మనే మన ఊరు తీసుకుని వెళ్ళిపోతాం.

వద్దమ్మా, తాతను మనతోనే ఉండమను, ప్రతీ సంవత్సరం మనం ఇక్కడికే వద్దాం.

ఈ మాట విన్న నా కూతురు పొగిలి, పొగిలి ఏడుస్తూ, ఇంక ఆ అదృష్టం మనకు లేదంటూ... బాధ పడుతోంది.

బయట గొలుసు వేసి కట్టేసిన నేను పెంచిన కుక్క ఎవరు ఏది పెట్టినా  తినకుండా నా కోసం ఎదురు చూస్తోంది. నేను పెడితేనే తినటం దాని కలవాటు. గొలుసు తెంపుకుని నా దగ్గరకు రావాలని దాని ప్రయత్నం. ఏడుస్తూ గొలుసు విప్పమని గొడవచేసేస్తోంది.

ఒక మనిషి అస్థిత్వం చుట్టూ ఎన్ని అనుబంధాలు, అనుభూతులు ఉంటాయో కదా అనిపిస్తోంది.

నా ప్రాణం ఇంకా పోలేదు. మెల్లగా నన్ను కిందకు దించి, నేనెప్పుడూ సేదతీరే మా ఇంటి పెరటిలో ఉన్న వేపచెట్టుకింద పడుకో బెట్టారు. 

ధనిష్టా పంచకం వస్తోంది. బయటకు తెండని ఎవరో అంటే, నన్ను చాపవేసి పడుకోబెడుతున్నారు. ముచ్చటపడి కట్టుకున్న ఇంటినుంచి చివరిసారిగా బయటకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇంక దీనికి నాకు ఋణం తీరిందని తెలుస్తోంది.

చెట్టుకింద పుట్టల్లో ఉన్న చీమలు నామీద పాకుతున్నాయి. ప్రాణం ఇంకా పోలేదు కదా, అవి కుట్టినప్పుడు దేహం విలవిల లాడుతోంది. ఎవరైనా గుక్కెడు నీళ్ళు పోస్తే బావుండు ననిపిస్తోంది. మాట పెగలటం లేదు‌ ఎవరి గొడవలో వాళ్ళున్నారు. 

అపరకర్మలు చేసే ఆయనకోసం ఒకరు బయలుదేరారు. ఆయన కాస్ట్లీ రా, వేరొకరిని వెతకండి ఎవరో అంటున్నారు. 

పోయాక ఏది జరిగినా తెలియదు, ఉన్నవాడికి రేపనేది ఉంటుంది కదా. వాడు బతకాలంటే డబ్బు కావాలి. ఆ సలహా మంచిదే అనిపించింది.

నా శరీరం సాగనంపడానికి చివరి సారిగా బేరసారాలు జరుగుతున్నాయి. 

ఎవరో తులసి తీర్థం పోయమంటున్నారు. నేను రోజూ సంధ్యావార్చి, ఏ తులసిలో నీరు పోసేవాడినో ఆ తులసిచెట్టు ఆకులే చివరిసారిగా నా దాహార్తి తీర్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.

రెండు గుక్కలు మింగాక, నా మనవడు ఒక్కసారి నా దగ్గరికొచ్చి ఆవకాయ తిన్న చిట్టి చేతులతో నా నోట్లో తనూ నీళ్ళు పోస్తానని పట్టు బట్టాడు. 

వాడిని వద్దని సముదాయించడానికి అందరూ నానా తిప్పలు పడ్డాక, విధిలేక వాడితో తులసినీళ్ళు నా నోట్లో  పోయించారు. వాడి చేతినీటితో ఆవకాయ రుచి నా నాలికకు తగిలి ప్రాణం లేచి వచ్చింది. 

పోతుందనుకున్న ప్రాణం నాలో చేరేసరికి శరీరంలో చిన్న కదలిక మొదలయ్యింది. 

నాకొడుకు వెంటనే స్పృహలోకి వచ్చి, నాన్న కదులుతున్నాడు అని ఆనందంతో అరిచాడు.

ఒక్కసారి అందరిలో ఆశ్చర్యం. పరుగున వచ్చి నాభార్య నా మనవడిని ముద్దు పెట్టుకుని, డాక్టర్ కి కబురు చేయమంది. 

డాక్టర్ వచ్చాడు.  చివరిసారిగా ప్రయత్నించాడు. 

అప్పటివరకూ గొలుసుతెంపుకునేందుకు తాపత్రయపడ్డ నా కుక్కకి ఎవరో గొలుసు విప్పారు. అది పరుగున వచ్చి నా వంటిపై పాకుతున్న చీమలని కోపంగా చూసి,  నాలుకతో  నాకి నాకు ఉపశమనం కలిగించేందుకు సహకరిస్తోంది. 

నాన్నని లోపలికి తీసుకొని వెడదామంటోంది నా కూతురు.

డాక్టర్ మందులిచ్చాడు. కాసేపటికి కళ్ళు తెరిచాను. సిలైన్ ఎక్కించాడు. కొద్దిగంటల్లో తిరిగి స్పృహలోకొచ్చా.

మృత్యుంజయుడురా మీ నాన్న అంటున్నారు. నా కొడుకు ఆనందానికి హద్దులు లేవు. కొద్దిరోజుల్లో మళ్ళీ మామూలు మనిషినయ్యా. మళ్ళీ బ్రతుకుతానన్న నమ్మకం కలిగాక అల్లుడితో సహా అందరూ మరికొన్ని రోజులు నాతో ఉన్నారు.

నాకోసం వచ్చిన యమభటులు ఎవో లెక్కలు సరిచూసుకుని, వీడు అమృతం తాగాడు, శాస్త్ర రీత్యా అది తాగిన వాడికి మృత్యువు రాకూడదు. అది శాస్త్ర విరుద్ధం అంటూ వెనుతిరిగారు.

చూస్తూండగానే తిరిగి వసంతం వచ్చింది. నా ఇల్లు పిల్లాపాపలతో కలకలలాడుతోంది‌. 

నాకు పునర్జన్మనిచ్చిన అమృతాన్ని తిరిగి తయారుచేయటం మొదలు పెట్టాను. మామిడికాయలు ముక్కలు కొట్టి, వాటికి ఆవపిండి, గుంటూరు మిర్చి కి, బరంపురం మిర్చి కలిపి ఆడిన కారం, రాతి ఉప్పు, గానుగనూనె కలిపి ఒకజాడీలో ఆ అమృతాన్ని భద్రపరుస్తున్నా. 

నిజం చెప్పొద్దూ బ్రతికి ఏం సాధిస్తాం అంటాం కానీ, బ్రతికినప్పుడే కదా ఆనందాన్ని ఆస్వాదించగలిగేది. వేతకాలేకానీ ఆనందం ప్రతీ దాంట్లో ఉంటుంది.

పెంపుడు జంతువుల సాంగత్యంలో, పెంచే మొక్కల సాన్నిహిత్యం లో, సంతానంతో కలిసి గడపటంలో, రుచికరమైన వంటలో, సుందరమైన ప్రకృతిలో, ఆవకాయ అన్నంలో, 

దోరగా కాలిన దొసెలో, కరకరలాడే గారెలో.......

మక్కువగా ఆస్వాదిస్తే, అన్నింటిలోనూ ఆనందమే!

ఆనందంమైన అనుభవం, ఎన్నటికీ మృతంలేనిదే!

జీవితం అంచులకు చేరిన వాళ్ళకే  తెలుస్తుంది, జీవితం విలువ. ఎందుకంటే జీవించడం అంటె తెలిసేది అప్పుడే.

అరవైలుదాటిన జీవితం, బోనస్ లాంటిది. 

ఏభైల్లో ఉన్నజీవితం, అనుభవించడానికి ఇంకా సమయం ఉందని చెప్పేది. 

నలభైల్లో జీవితం, ఆనందం గురించి అవగాహన కలిగించేది. 

ముప్ఫైల్లో జీవితం, దొరికిన దానిలో ఆనందం వెతుక్కునేది, 

ఇరవైల్లో జీవితం, మన జీవన విధానమే ఆనందం, అనే భ్రమకలిగించేది, 

ఇరవై లోపు జీవితం ఏది జరిగినా, అదే ఆనందం అని మురిసిపోయేది. 

ఆనందం కోసమే జీవితం, దాన్ని మిస్సవ్వకండి. ఆనందంగా గడిపిన ప్రతీక్షణం అమృతమే అన్న సత్యాన్ని గుర్తించండి.

నాన్న ఎవరు??

బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.

“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.

“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.

దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.

“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా.

“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.

మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.

అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.

బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.

“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.

“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.

“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.

ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.

ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.

ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.

 మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.

కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.

నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.

నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.

“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.

నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.

ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.

“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.

“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.

“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.

“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.

ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.

ఈ పోస్ట్ చాల ముఖ్యమైనది దయచేసి అందరూ చదివి తప్పకుండా పిల్లలకు అలవాటు చేయండి.


                    --((**))--


No comments:

Post a Comment