Saturday 21 March 2020

. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 238 /

*🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  238  / Yoga Vasishta - 238 🌹*

*🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 35 🌴*
*🌻. అభ్యాసము, ప్రభావము - 1 🌻*

ఆ విద్యాధరి ఇట్లు పల్కెను. నేను మీ శిష్యురాలను, అబలను అయినప్పటికి, అభ్యాసముచే, నేను శిలాంతర్గతమగు జగత్తును గాంచుచున్నాను.

తాము సర్వజ్ఞులగు గురువులైనప్పటికి, అభ్యాసలేమిచే, అద్దానిని గ్రహించుటలేదు. కావున అభ్యాసముయొక్క ప్రభావమును తిలకింపుడు. అభ్యాసముచే అజ్ఞానియు, జ్ఞానియగుచున్నాడు.

పర్వతమును మెల్లమెల్లగ పిండిచేయబడుచున్నవి. అచేతనమైన బాణము సూక్ష్మమై లక్ష్యమును ఛేదించుచున్నది. అభ్యాసమువలన కొందరికి కారపు వస్తువు ఇష్టముగుచున్నది,కొందరికి చేదు,కొందరికి తీపి రుచించుచున్నది.

సమీపమున నివసించు అభ్యాసముచే, బంధువుకానివాడు బంధువగుచున్నాడు. అభ్యాసముచే స్థూలశరీరము, కారణ అభ్యాసముచే పక్షివలె ఆకాశమున ఎగురుచున్నది. గొప్ప పుణ్యము నిష్పలముగా వచ్చును గాని, అభ్యాసము నిష్పలముకాదు.

దుస్సాధ్యకార్యములు అభ్యాసముచే సాధించబడుచున్నవి. శత్రువులు మిత్రులుగను, విషము, అమృతముగను అగుచున్నది. సంసారము అసారమైనదని వివేకము గల్గినవారు, ఆత్మవిచారమను అభ్యాసముచే మనుజులు మాయానదిని దాటుచున్నారు.

 పదునాల్గులోకుములందు ప్రాణసమూహ మధ్యమందే, దానియొక్క అభిమత వస్తువును సహజమగు అభ్యాసములేక సిద్ధింపదు. మరల మరల ఆత్మ విచారము గావించుటయే, అభ్యాసమనబడును. దానిని పురుషప్రయత్న మందురు. అది తప్ప ముక్తికి వేరు గతిలేదు.

ఓ మునీంద్రా| అభ్యాసమను సూర్యుడు ప్రకాశింప, జితేంద్రియుడగు వీరునకు భూమిపైగాని, వనమందుగాని, జలమందుగాని, ఆకాశమందుగాని సిద్ధింపని అభిషిత పదార్ధమెయ్యుదియు నుండదు.
స్థూలదేహమును గూర్చిన భ్రాంతిని నశింపజేయు సమాధిచే సత్యమగు, సూక్ష్మశరీరము యొక్క స్థితి ఇచట సమర్థింప బడుచున్నది.

సత్యమగు పదార్థమందు సర్వజ్ఞత్వము కలుగజేయు, సమాధిరూప ధారణచేయుటచే, ఈ శిలయందలి జగత్తు ప్రకటితముకాగలదు. అపుడు వసిష్ఠుడు సమాధిస్థితుడయ్యెను. స్థూలదేహభావనలు వదలి, తత్‌ సంస్కార మలము వదలి, చిన్మాత్రనే భావించును.

తదుపరి దివ్యదృష్టిని పొందితిని. నా ఆత్మయే ఆ శిలారూపమున భాసించుచున్నది. వాస్తవముగ అక్షయమగు బ్రహ్మతత్వము తప్ప, జగత్‌ స్వప్నములం దన్యమగునదిలేదు.

కాన నేను శిలయందు నిర్మలమైన చిదాకాశమునే గాంచితిని. అనాదియై శాశ్వతమైనట్టి, బ్రహ్మరూపమే ఈ సమస్త ప్రాణలయొక్క, యదార్ధరూపమగుటచే అజ్ఞానులకు మనోరాజ్యమును సంకల్పమనియు జగత్తనియు చెప్పబడుచున్నది.

ప్రధమమున చైతన్యమున స్ఫురించుటనుబట్టి సూక్ష్మశరీరమే ప్రత్యక్షమైనదగును, దానినే నీవు సత్యమని, సర్వవ్యాపకమని ఎఱుగుము.
భౌతికమగు స్థూలశరీరము మిధ్యయైనది. తత్వవిచారముచే, ఈ స్థూలశరీరము లభించదు.

సూక్ష్మశరీరము మోక్షపర్యంతము ఇహ పరలోకములందు అక్షయమగును. సూక్ష్మశరీరముతో కూడిన, స్థూలశరీరము ప్రకటితమైన, అది మృగతృష్ణయందలి జలమువలె మిధ్యయైయున్నది.

సూక్ష్మశరీర రహితమైన చైతన్యమునందు, స్థూలశరీరమునుగూర్చిన దృఢసంస్కారముచే, స్థూలబుద్ధి దృఢత్వము పొందినది. అవివేకముచే, జీవుని మోహముయొక్క అసత్తును సత్తుగను, సత్తును అసత్తుగను గాంచును. క్షణకాలములో నశించు విషయ సుఖము దుఃఖమనియు, ఆత్మజ్ఞాన జనిత సుఖము వాస్తవమని జ్ఞానులునమ్ముదురు.

ముల్లోకముల అనుభవమునొసంగునట్టి, సూక్ష్మశరీర ప్రత్యక్షమును వదలి, ఐహిక మాయాస్వరూపమైన, స్థూలశరీరాదులను, ప్రత్యక్షముగ గ్రహించువాడు మూఢుడు.

వాస్తవమునకు, జీవులకు సూక్ష్మశరీరమే గలదు అందు స్థూలశరీరమును గూర్చిన వ్యాప్తి అసత్యము. శిలాభావనతోగూడిన వానికి శిలారూపము కన్పించినప్పటికి అది వాస్తవముగ చిద్రూపమైయున్నది.

మద్యము త్రాగినవానికి, వృక్ష పర్వతాదుల నృత్యము సత్యముగనే నున్నట్లు, అజ్ఞానికి జగత్తు భ్రాంతి సత్యత్వము పొందినది.
శిలయందలి బ్రహ్మాండమున ప్రవేశించి, అచట బ్రహ్మదేవుని దర్శించి సంభాషించుట.

సశేషం
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  239  / Yoga Vasishta - 239 🌹*

*🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 36 🌴*
*🌻. అభ్యాసము, ప్రభావము - 2 🌻*

సమాధిద్వారా బ్రహ్మమును దర్శించి అందు పర్వత, నది, లోక, లోకాంతర రూపభ్రమలను గాంచును. విద్యాధరియు, వసిష్ఠుడు సంకల్పముతో ఆ శిలయందు ప్రవేశించెను.

తదుపరి వారు శిలయందలి బ్రహ్మలోకమును చేరి అచట బ్రహ్మదేవుని యెదుట కూర్చుండి, నాతో విద్యాధరి ఇట్లు చెప్పెను.

ఓ మునీంద్రా| యీతడే నాభర్త. వివాహనిమిత్తము నన్ను సృష్టించి, వృద్ధాప్యమును పొందెను. ఇంకను వివాహమాడలేదు. కావున నాకు వైరాగ్యము జనించినది. యీతడు కూడ విరాగియై ముక్తి కొరకు సాధన చేయుచుండెను.

కావున మునీంద్రా నన్ను, నా పతిని తత్వోపదేశముచే ప్రబోధమొనర్చి, బ్రహ్మమార్గమున నియోగింపుము, అని పలికి తన పతిని సమాధినుండి లేపుటకై అతనితో నిట్లు చెప్పెను.

నాధా| మునిశ్రేష్టులగు వసిష్ఠుడు నేడు మనగృహమునకు విచ్చేసిరి.యీతడు మరొక బ్రహ్మాండమునకు ప్రభువైన బ్రహ్మదేవుని కుమారుడు. వారిని పూజించవలసి యుండును. అని పల్కగ అతడు మెల్లగ కండ్లు తెరచి జాగ్రత్‌ స్థితికి వచ్చెను. అంతట నన్ను, ఆ విలాసినిని గాంచి మధురస్వరముతో నిట్లు పలికెను.

ఓ మునీంద్రా| తాము ప్రయాణ బడలికచే అలసియున్నారు, ఇచట విశ్రమింపుడు అని పలికి, మణిమయ ఆసనమున కూర్చుండేసి తదుపరి నన్ను పూజింపగ నేనిట్లంటిని.

ఓ మహాత్మ| ఈ విద్యాధరి తమ ఇరువురకు ప్రబోధమొనర్చుటకునన్నిచ్చటికి గొనితెచ్చినది. అది యుక్తమా| ఏలన తమరు సకల జ్ఞానపారంగతులు, సర్వభూతలములకు ప్రభువులు. ఈమె కామాంధయై యున్నది.

కాబట్టి ఈమె యొక్క ఉపదేశప్రార్ధన ఉచితముకాదు. కావున ఈమె ఇట్లెందుకు వచించుచున్నదో కారణము తెలియజేయకోరెదను. మహాత్మా| భార్యకొరకీమెను జనింపజేసితిరి.
అపుడు ఆ బ్రహ్మ ఇట్లనిరి.

సజ్జనులకు వృత్తాంతమంతయు యధార్ధముగనే వచింపవలయును. నేను కేవలము చిద్రూపాకాశము నుండి ప్రకటితమైన స్వయంభువమను పేరుగలవాడను. యధార్ధముగ నేనుత్పన్నము కాలేదు. ఆవరణరహితుడను, చిదాకాశరూపుడను.

నీవు నేను వారు, ఈ సంభాషణంతయు, సముద్రమందలి తరంగములవంటిది. నా అంతరంగమున నేను నాది యను వాసన, ఈ కుమారికి, మీకు, ఇతరులకు చైతన్యము కంటే భిన్నముగ భాసించుచున్నది.

కాని నాదృష్టియందు భిన్నముగనే యున్నది. నేను కేవలము ఆత్మరూపుడనై ఆత్మయందే నెలకొనిఉన్నాను. ఈమె నాసంకల్పముచే దేహరూపిణియై వెలయుచున్నది. ఈమె నాగృహిణికాదు.

కాని ఈమె బ్రహ్మదేవుని గృహిణియను భావము కల్గియున్నది. ఆమెయే అంతరంగమున సర్వజగత్తు వాసనయగుటచే వ్యర్ధముగ దుఃఖమును పొందుచున్నది.

వాసనాదేవియొక్క వైరాగ్యకారణమున, జగత్తు ప్రళయము, మిద్యా భ్రమత్వము ఏర్పడుచున్నది.

ఓ మునీంద్రా| నాయొక్క సంకల్పముచే నా ఆయువు పూర్తియగుచున్నది. నేను కైవల్యస్థితిని పొందదలచితిని. కాని నా వాసనాకల్పితమగు ఈ జగత్తునకు ప్రళయము సంభవించనున్నది. ఈ చిత్తకాశము వీడి బ్రహ్మకాశము పొందిన పిదప, మహా ప్రళయము, వాసనాక్షయము నగుచున్నది.

అందువలన ఈమె నన్ననుసరించుచు ఈ ప్రళయమున న శింపనున్నది. కమలమలు సరస్సునుండి విడిపోవ, వాటి వాసన లేనట్లే గదా| ఈమె ధారణాభ్యాస యోగముచే మా బ్రహ్మాండమును గాంచగల్గినది.

ఏ పర్వత గృహమందు జగత్తు గలదో ఈ పర్వతములందు, బెక్కు జగత్తులు గలవు. యోగదృష్టిచే వాటిని గాంచగలము. స్వప్న నగరమువలె ఈ జగత్తు, మిద్యయై, భ్రాంతిరూపమైయున్నది.

ఏవరీ జగత్తునెరుగుదురో వారికది చిదాకాశమే. తక్కినవారు భ్రమభాసులే. ఆధ్యంత రహితమైనను ఈ చైతన్యము శివాదుల రూపమున దోచుచున్నది. నిరాకారమైనను సాకారముగ కన్పట్టుచున్నది. స్వప్నమునందువలె, జాగ్రత్తునందు చిదాకాశమే తన స్వరూపమును పర్వతశిలలుగ గాంచుచున్నది.

కావున ఓ వసిష్ఠ మునీద్రా, మీరిపుడు మీబ్రహ్మాండమునకు బొండు. అచట సమాధిద్వారా ఆత్మ సుఖమును పొందుడు. నా చే కల్పించబడిన ఈ జగత్తు ఇపుడు ప్రళయముచే అవ్యక్తమగును. మేము కైవల్యము పొందబోవుచున్నాము.

ఓ రామచంద్రా| భగవంతుడగు బ్రహ్మదేవుడిట్లు వచించి సమాధియందు స్థితుడయ్యెను. విద్యాధరియు నట్లే ఆకాశరూపిణియైయుండెను. నేనును సమాధియందు స్థితుడనై, చిదాకాశరూపుడనై, యారహస్యమంతయు గాంచితిని.

ఆక్షణమున అతని సంకల్పము క్షీణింప, దాని ప్రభావమైన పర్వత, సముద్రాది సహిత పృధివి మెల్లగ క్షీణింపసాగెను. బ్రహ్మదేవుడు సమాధియందు నిశ్చలుడైయుండ, పృధివి నీరసమయ్యెను.

ఇట్లు బ్రహ్మదేవుని విరాట్‌రూపమందలి చైతన్య ముపసంహరింప బడుటచే, ప్రళయమేతెంచి, పృధివి రసహీనమయ్యెను.

 సర్వజంతుజాలము, చైతన్యము కోల్పోయి క్షయమొందెను. సముద్రములు ఉప్పొంగెను. అందు జీవజాలము నశించినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment