Tuesday, 4 June 2024

07-06-2024

 


*సండే స్టోరీ* 


మార్చి 20, అంతర్జాతీయ కథల దినోత్సవం రోజు.. బంగారమంటి బామ్మ కథ.. "బంగారు మురుగు"


శ్రీరమణ గారు రచించిన మిథునం కథా సంకలనం లోనిది.



*బంగారు మురుగు*

📿


నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్లు.


మా అమ్మానాన్న ఎప్పుడూ పూజలూ పునస్కారాలూ, మళ్ళూ దేవుళ్ళూ గొడవల్లో వుండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులూ ఎత్తే పల్లకీ, దింపే పల్లకీలతో మా ఇల్లు మరంలా వుండేది. అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ నే దగ్గరకు వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది.


బామ్మకి యీ గొడవలేం పట్టేవి కావు. అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే. ఓకంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం.


పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ వేధింపులూ బామ్మ దగ్గర లేవు. ఎవరేనా “ఈ ముసలమ్మకి భయమూ భక్తీ రెండూ లేవు…” అంటే – “దయకంటే పుణ్యంలేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టడం – నాకు తెలిసిందివే “ అనేది.


బామ్మకి పుట్టింటి వాళ్ళిచ్చిన భూమి నాలుగైదెకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది. మా ఊరికి పది కోసుల దూరం. ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించటానికి రైతులు వచ్చేవాళ్ళు. వచ్చీ రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది. పుట్టిన ఊరు విశేషాలన్నీ గుక్క తిప్పుకో కుండా అడిగేది. వాళ్ళు బదులు చెప్పకుండానే మళ్ళీ ప్రశ్న – ప్రశ్న మీద ప్రశ్న వర్షం కురిపించేది. రైతులేమొ పంట తెగుళ్ళగురించి, అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలో బేడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకు వచ్చేవాళ్ళు. ఆ మాట ఎత్తడానికి బామ్మ అవకాశం యిస్తేనా ?


“ఎండన పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండరా” అనేసి వడ్డన ఏర్పాట్లలో పడిపోయేది. విస్తరి వేసిందగ్గర్నించి పెరుగు అన్నంలోకి వచ్చేదాకా వాళ్ళతో ఊరివాళ్ళ కబుర్లన్నీ వాగించేది.


తీరా పెరుగన్నం చివర్లో “ఏరా అబ్బీ, యీ ఏడాది పంటలెలా వున్నాయిరా ” అని అడిగేది.


వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయేది. కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని, పైగా తిన్న విస్తరి ముందు కూచుని “పంటలు పోయాయి” అని చెప్పడానికి నోరాడక “ఫర్వాదేదమ్మా దేవుడి దయవల్ల” అనేవాళ్ళు. ఇంకేం చేస్తారు పాపం అణా పైసలతో శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్లు. వెళ్లేప్పుడు “ఇదిగో బుల్లి పంతులూ! మీ అవ్వ గట్టి పిండమే !” అని ఎగతాళి చేసి వెళ్ళే వాళ్ళు.


బడికి వెళ్ళనని మారాం చేసినపుడల్లా బామ్మ నాకు అండగా వుండేది. “పసి వెధవ, గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు- అయినా ఒక్కగానొక్కడు బతకలేక పోతాడా…” అంటూ నన్ను చంకన వేసుకు బయటకు నడిచేది.


మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు వుండేది. అది మా స్థావరం. రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం. బాదంచెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు వుండేది. రాలిన పండు ఆకులు విస్తరి కుట్టుకుని బామ్మ భోజనం చేసేది. దాని చుట్టూ చిన్న మట్టిఅరుగు వుండేది. “దీన్ని కాపరానికొచ్చేప్పుడు మా పుట్టించినించి తెచ్చా… అప్పుడు జానాబెత్తెడుండేది… నువ్ నమ్మవ్… పిచ్చి ముండకి మూడే ఆకులు బుల్లి బుల్లివి వుండేవి…” రోజు ఒకసారైనా ఈ మాట నాకు చెప్పేది. నే కాపరానికొచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చి మొద్దుకి అన్నేళ్లు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా.


ఇప్పటికీ బామ్మ చెంబెడు నీళ్ళు దానికి పోస్తూనే వుంటుంది. మానుకి రెండు తొర్రలుండేవి. పై తొర్రలో రెండు రామచిలకలు కిలకిలలాడుతూ కాపరం చేస్తుండేవి. ఇంకో తొర్రలో బామ్మ నాకోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాల వుండేది. నీడన ఆవుదూడ కట్టేసి వుండేది. దానికి బామ్మ పచ్చి పరకలు వేస్తూ వుండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నాచేత బాదం పప్పులు తినిపించేది. – ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడూ నీడా – ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకు పడుకుని కునుకు తీస్తుండేవాణ్ణి. “అసలే నడుంవంగిపోయె… పైగా ఆ మూట కూడా దేనికి” – అని మా అమ్మ అంటే “వాడు బరువేంటే. వాడు వీపున లేపోతే ముగ్గు పడదే తల్లీ – చూపు ఆనదే అమ్మా” అనేది బామ్మ.


సమస్త దేవుళ్ళకీ మేలుకొలుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్నీ ముగ్గుతో కలిపేది. అప్పుడు మా మండువా లోగిలి నిండుగా పమిటకప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువులా వుండేది. “పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్లు లేవరా” అని అడిగితే “పిచ్చి సన్నాసీ దేవుళ్ళు నిద్దరోతారా! దేవుడు నిద్దరోతే యింకేమైనా వుందీ-! మేలుకొలుపులూ మనకోసమే చక్రపొంగలీ మనకోసమే” అనేది బామ్మ.


తెల్లారగానే నూనె రాసి, నలుగు పెట్టి కాకరపందిరికింద ముక్కాలిపీట మీద కూచోపెట్టి వేడినీళ్ళు పోసేది. 


“చిక్కిపోయాడమ్మా పిల్లాడు… పొడుగు సాగుతున్నాడో ఏమో” అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులుపడేది. ఒంటి మీద చిన్న గాటో, దెబ్బో, పొక్కో కనిపిస్తే “అఘాయిత్యం వెధవ్వి ఎక్కడ తగిలించు కున్నావ్” అని గారాబంగా కేకలేసి తెగ దిగులుపడిపోయేది. నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది.


నెలకోసారి భజంత్రీవాడు వచ్చేవాడు బాదం చెట్టుకింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం. ముందు నావంతు.


“ఒరేవ్ జాగ్రత్తగా చెయ్ – పిల్లాడి క్రాపు తెల్లదొర క్రాపింగ్ లా వుండాలి” అని హెచ్చరికలూ, సలహాలూ ఇస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ. అయినా వాడి పద్ధతిలో వాడు తిరపతి మెట్లతో డిప్ప కొట్టుడు కొట్టేసేవాడు. తనవంతు వచ్చినపుడు చేతిన వున్న బంగారు మురుగు తీసి నా చేతికి తొడిగేది. స్నానం చేశాక కుంకుడురసంతో ఆ బంగారు మురుగుకి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది. మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది.


బజారు చిరుతిళ్లు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష వుండేది. ఆరోగ్యం కంటె కుటుంబమర్యాద దెబ్బ తింటుందని- నాకవేం తెలిసేవి కావు. బెల్లపు జీళ్లు, పీచుమిఠాయి, జంతికలు, తేగలూ కొనుక్కుతినాలని నాలిక పీకేది. బామ్మని అడిగితే “ఓస్ అంతే కదా పద” అనేసి కోరినన్ని కొనిపెట్టేది. మరికొన్ని బాదంచెట్టు భోషాణంలో దాచిపెట్టేది.


బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత!


మనవడికి అడ్డమైన గడ్డీ కొనిపెడ్తోందని తెలిసిబామ్మకి డబ్బు దొరక్కుండా ఇంట్లో కట్టడి చేశారు దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి.


బామ్మ మీద నిఘా వేసినా నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తోంది. బియ్యం ఒళ్లో పోసుకొచ్చి జీళ్లు తేగలూ నైవేద్యం పెట్టేది నాకు. అదీ తెలిసిపోయింది. బియ్యం డబ్బాకి తాళం పడింది. దాంతో నా నోటికి కూడా, అత్తగారి ఆటకట్టిందని అమ్మ సంతోషించింది.


” ఇంటి దీపానివి, చక్రవర్తివి , నీకీ కరువేంటి నాయనా” అని బామ్మ బాధపడింది.


ఆరోజు పీచుమిఠాయి వాడు ఊళ్లోకి వచ్చాడు. వాడు రోజూ రాడు. సంతరోజు మాత్రమే వస్తాడు. మూడువైపులా రేకు, ఓవైపు సరుకు కనిపించేలా అద్దం వున్న డబ్బా -విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయి పొత్తులు – వాడు డబ్బా చప్పుడు చేస్తూ “పిచ్మిఠా” అని చిత్రంగా అరుస్తూ వీధిన వెళ్తుంటే నా నోరెంత వూరిందో బళ్లో వున్న నాకు తెలుసు, ఇంట్లో ఉన్న మా బామ్మకి తెలుసు. 


“పిచ్మిఠా” అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ ఎక్కువవుతోంది. ఆ క్షణంలో బామ్మ బడిగుమ్మంలో ప్రత్యక్షమైంది.


పంతులుగారు ప్రభవ విభవలు చెప్పిస్తున్నారు. బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర ఠక్కున వల్లింపు ఆగి తరగతి నిశ్శబ్దం అయింది. నరసింహం పంతులు గారంటే గండభేరుండం! పిల్లలూ పెద్దలూ హడిలి చచ్చేవారు. ఆయనకి బుర్ర మీసాలు, కళ్లద్దాలు, గుండూ పిలక, చేతిలో బెత్తం, నాలుగువైపులా చూడగల మిడిగుడ్లూ వుండేవి. మా బామ్మ బడి గుమ్మంలోకి వస్తూనే “ఒరే నరసింహా, నా మనవణ్ణి పంపరా” అంది. ఆయన నా వైపు చూసి పోరా అనే లోగానే పలకా పుస్తకంతో నిలబడి వున్నాను. “పో…” అనడమేమిటి తొర్రలో రామచిలకలా తుర్రున దాటుకున్నాను.


అవతల వీధి చివర పీచ్మిఠ వాడు నా కోసమే నిలబడి వున్నాడు. అప్పటికే వాడితో బేరసారాలు పూర్తిచేసింది బామ్మ. రెండు మిఠాయి పొత్తులూ, నాలుగు పుంజీల జీళ్లు ఇప్పించింది. జీళ్లు జేబులో పోసుకుని, బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు రెండూ మింగేశాను. ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతిలా అయిపోయింది.


“ఈ మొహంతో ఇంటికెళ్తే ఏవన్నా వుందీ..” అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి, బడిగంట కొట్టాక బావి దగ్గర మూతి కడిగి, కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది.


తెల్లారి పొద్దున దేవతార్చనలో వుండే బుల్లి కంచుగంట కనిపించలేదని అమ్మ కంగారుగా వెదికేస్తోంది.


“ఎక్కడికి పోతుంది… ఎలికముండలు లాక్కెళ్ళి వుంటాయి…” అని బామ్మ పట్టీ పట్టనట్టు సద్దేస్తూ మాట్లాడుతోంది.


“అయినా ఎలికలు గంటనేం చేసుకుంటాయి బామ్మా” అంటే “పిల్లికి కడతాయ్… వెధవాయ్…” అని అరిచి నా నోరు నొక్కి బయటకులాక్కెళ్ళింది.


తొర్రలో దాచుకున్న నాలుగు పుంజీల జీళ్లు రెండ్రోజుల్లో పూర్తయినాయి.


మళ్లీ సంతరోజు వచ్చింది. ఇంట్లో పెద్ద గాలిదుమారం లేచింది. నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలా నిలబడి వుంది. వాకిట్లో పీచుమిఠాయి వాడు నిలబడి వున్నాడు. క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట ఇచ్చిందట. ఆ లెక్కల్లో వాడు మనకి నాలుగు మిఠాయిలు, ఆరు పుంజీల జీళ్ళు ఇంకా బాకీ వున్నాట్ట! అవి యిచ్చేసి వెళ్తామని సరాసరి వాడు ఇంటికి వచ్చాడు. అదీ గొడవ. సడీచప్పుడు చెయ్యదనుకున్న గంట గణగణా బామ్మ గుండెల్లో మోగింది.


“దేవుడి గంటనే పాపభీతి కూడా లేకపోయె…” అంది అమ్మ నిష్ఠూరంగా.


“అంత పాపభీతి పడాల్సిందేముందీ… అయినా ఘంటలో వుంటాడా దేవుడు…. పసివాళ్ళ బొజ్జలో వుంటాడుగాని…” బామ్మ సాయకారం తీసింది.


“ఈ మెట్ట వేదాంతాలకేం లెండి… ఇట్లాగే వదిలేస్తే అవ్వా మనవడూ కలిసి ఆ చేతి మురుగు కూడా కరిగించేసుకు తింటారు.” అంది అమ్మ , నాన్నకి బోధపడాలని. నాన్న కలిగించుకు మాట్లాడేలోగా బామ్మ, కోపంగా గొణుక్కుంటూ చరచరా వెళ్లి బాదం చెట్టుకింద కూచుంది. నేను వెనకే భయం భయంగా వెళ్ళా… కొంచెం దూరంగా నిలబడ్డా.


…” నువ్వు కాదుగాని……. నీతో నా చావుకొచ్చిందిరా. ఇన్నేళ్ళోచ్చి ఆఖరికి నా బతుకు దొంగ బతుకైపోయింది… ఫో అసలు నా చాయలకి రావద్దు… మీ అమ్మా నాన్నా వున్నారుగా… వాళ్ళతోనే వూరేగు… నాది అనుకుంటే దుఃఖం… కాదు అనుకుంటే సుఖం…” అంటూ బామ్మ బావురుమని ఏడ్చింది.


కంటి ధార ఎండిన బాదం ఆకుల మీద టపటపా రాలాయి. పిడుగులు రాలున్నంత చప్పుడు నా చెవికి… దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది… దిక్కులేని వాళ్ళకి?


ఒక్కసారి బేర్ మని పెద్దగా ఏడ్చాను.


బామ్మ తటాలున చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది. అక్కడే చెట్టుకింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకు పడుకుంది. నేను బామ్మ పక్కనే వొదిగి దిగాలుగా కూచున్నా, బామ్మ గుర్రుపెట్టి నిద్రపోయింది. బామ్మ మీద గండుచీమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ –


వెన్ను మీద చెయ్యివేసి నా పక్కలో కూచునే బామ్మలా కూచున్నాను. కాకి రాల్చిన రెండు బాదంకాయలు గుండుమీద పడితే బామ్మ ఉలిక్కిపడి లేచింది. నాకు నవ్వొచ్చింది. సంగతి అర్ధంకాగానే బామ్మ కూడా పక్కున నవ్వింది. ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్ను వరించింది.


రాలిన బాదంకాయల్ని పప్పులు వొలిచే పనిలో పడింది. 


“ఒరే, మీ అమ్మకి ఈ మురుగు చెరిపించి ఒక జత ఒంటిమిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పట్నించో ఆశ… చూశావా అటు తిప్పి ఇటు తిప్పి బోడిగుండుకీ బొటనవేలుకీ ముడిపెట్టి నట్టు…ధోరణి నా నగమీదికి లాగింది…” బాదంపప్పులు పెడుతూ బామ్మ మాటలు.


నాకు అర్ధం కాకపోయినా “ఔనౌను…’ అన్నాను ఆరిందాలాగా ఆమెని సంతోషపెట్టడానికి.


దసరా రోజులు వచ్చాయి.


ఒక పెద్ద పీఠం మందీ మార్బలంతో మా ఇంట్లో దిగింది. స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలక్కలు, గున్న ఏనుగు, నాలుగు ఆవులూ వాటి దూడలూ, జింకపిల్ల, రెండుపల్లకీలు, ఇవిగాక బోలెడు సాధన సామాగ్రి నాలుగు గూడు బళ్ళ నిండా దిగాయి.


ఇల్లంతా ఆక్రమించుకుని సిపాయిల్లాగా వాళ్ళే ఎక్కడెక్కడ ఏమేమిటి ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు. నేను, బామ్మ పరాయివాళ్లలా చోద్యం చూస్తున్నాం.


” ఇవాల్టినించి మన కొంప సర్కస్ డేరా అనుకో” అంది బామ్మ.


వాళ్లు మాట్లాడే భాష కూడా చిత్రంగా వుంది. మా నాన్నని ‘గృహస్థు’ అని పిలిచే వాళ్ళు. సామాజికులు, పూర్ణదీక్షాపరులు, శిష్యపరమాణువులు, పాదరేణువులు… ఏమిటో నాకు అర్ధంకాని మాటలు చాలా వినిపించేవి.


అంటే ఏవిటని బామ్మని అడిగితే ‘అంతా మనుషులేరా అబ్బీ- వుత్తినే… అదో ఆడంబరం” అన్నది బామ్మ.


గున్న ఏనుగుకి రోజు బెల్లం బుట్ట. అరటిపళ్ళ గెల అందించేవారు. దాని సేవకి ఇద్దరు మావటీలు, శ్రీ మావటీ గారిని మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఏనుగు ఎక్కించాలని బామ్మ తంటాలు పడ్డది కాని వారు సాధ్యపడదన్నారు. పల్లకీలపైన వుండే శాటిన్ వస్త్రం చుట్టేసి, పల్లకీలని దేవిడీలో జాగ్రత్త చేశారు.


పల్లకి ఎక్కించమని హటం చేస్తే “ఆ సన్నాసి పల్లకీ మనకెందుకురా- నీ పెళ్ళికి దీని జేజెమ్మ లాంటి పూసల పల్లకీ పెట్టించి ఊరూ, పేటా ఊరేగిస్తా…” అని బామ్మ సముదాయించింది. అందరూ నిద్దర్లు పోయాక సాములారి జింకచర్మం మీద నన్ను కాసేపు పడుకోపెట్టింది బామ్మ. బలె మెత్తగా నూ, తమాషాగానూ వుంది. జింక పిల్లతో ఆడుకోవాలనిపించేది కాని బామ్మ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా వుంచేది.


మా ఇంట్లో అర్చనలూ, దీక్షలూ,హోమాలూ ఘోటకంగా సాగుతున్నాయి. వచ్చే పోయే భక్తులు, బంధువులు అంతా కోలాహలంగా వుంది.


స్వామివారు వెండి రేకులు తాపడం చేసిన సిహాసనం మీద కూచుని తావళం తిప్పుతూ వుండేవారు. ఎప్పుడూ గంభీరంగా వుండేవారు. ఎప్పుడేనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులికి. అలౌకిక విషయాల్లోనూ, లౌకిక వ్యవహారాల్లో కూడాతలదూర్చేవారు. వంటలూ – పిండివంటలూ, కూరలూ, పులుసులూ అన్నీ ఏమేం ఎట్లా చెయ్యాలో ఆయనే చెప్పేవారు.


చెప్పడం అనకూడదుట ఆదేశించారు అనాలిట! చుట్టానికి వచ్చారనకూడదు దర్శనానికి వచ్చారనాలిట.


“పాదాలివ్వండి స్వామీ” అని ప్రాధేయపడే వాళ్ళు. వాళ్ళకి ప్రాప్తం వుంటే పాదాలిచ్చే వారు. లేనివాళ్ళు పాంకోళ్ళకి మొక్కి వెళ్ళిపోతుండేవారు.


సాములారు భోజనం చేశాక (అపచారం, భిక్ష స్వీకరించాక)వెండి గొలుసుల ఉయ్యాలబల్ల మీద పట్టు బాలీసుల మీద వాలి అరమోడ్పు కన్ను లతో భుక్తాయాసం తీర్చుకునేవారు.


వింజామరలు విసరడానికి మేవంటే మేమని వంతులకోసం పోట్లాడుకునే వాళ్ళు భక్తులు.


“జార్జి చక్రవర్తిదే భోగం – మళ్లీ మీ స్వామి వారిదే భోగం” అనేది శిష్యుల దగ్గర మా బామ్మ. వాళ్ళు దానికెంతో గర్వపడేవాళ్ళు.


సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు. అర్ధం ఐనా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవాళ్ళు. అయ్యవారికి శాలువలు, అమ్మవారికి పట్టువస్త్రాలు, పళ్లు, రొక్కం కానుకలుగా సమర్పించుకునే వాళ్ళు.


ఒకరోజు శిల్కులాల్చీ, నాలుగు వేళ్ళకీ ఉంగరాలు, మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబ్బండి దిగాడొక భక్తుడు. వస్తూనే స్వామి వారి పాదాలమీద వాలాడు స్వామివారు వాత్సల్యంతో వందనం స్వీకరించారు.


జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని “ఎట్లా వుందిరా వ్యాపారం” అని అడిగారు.


“అంతా తమ దయ”అన్నాడా భక్తుడు.


“రాహువు ఇల్లు మారుతున్నాడు. ఇక నీకు తిరుగులేదురా పట్టిందంతా బంగారమే” అన్నారు స్వామి భక్తుడి చేతులు వదిలి పెడుతూ – భక్తుడి నడిమివేలునున్న ఎర్రరాయి వుంగరం స్వామి చేతిలోకి వచ్చింది.


పక్కనే వున్న శిష్యుడి దోసిట్లో వేసి “అమ్మవారికి ముక్కెర చేయించండి” అని చిరునవ్వుతో ఆదేశించారు. ఆ భక్తుడికి వేలు వూడినంత బాధ కలిగింది. పెదాలు తడారిపోయినాయి. బిక్కచచ్చి “తమ చిత్తం” అన్నాడు ఎప్పటికో తేరుకుని.


“కాదు తల్లి ఆజ్ఞ” అన్నారు స్వామి గంభీరంగా.


మనోవాక్కాయ కర్మలమీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు. బామ్మ నవ్వాపుకోలేక సభలోంచి జారుకుంది. శిష్యుడు ఎదురైతే “మీ దేవుడికి పట్టిందంతా బంగారమే” అని ఎగతాళి చేసింది.


లోగడ విడిది చేసినపుడు ఆయన చూపు బామ్మ బంగారుమురుగు మీదపడిందిట. “తల్లి చిట్టికాసులపేరు కావాలని గోల చేస్తోంది- నువ్వు చెయ్యివిదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా…” అన్నారుట స్వామి బామ్మతో- “అయ్యో… ఆ తల్లికి నేనిచ్చే పాటిదాన్నా సాక్షాత్తూ మహాలక్ష్మి ఆమెకేం తక్కువస్వామీ” అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందట.


“ఒరేవ్ హనుమంతుడి ముందా కుప్పిగంతులు? ఇచ్చేదాన్నయితే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకొచ్చి సొరాజ్జెమ్ కోసం జోలెపట్టిన రోజే యిద్దును కదా… మహా మహా ఆయనకే ఇవ్వలేదు… ఈ సర్కస్ కంపెనీకి యిస్తానా…” అంది బామ్మ.


అది తీర్ధప్రసాదాల సమయం.


భక్తులంతా కాళ్ళకి మొక్కి, తీర్ధం పుచ్చుకుని మళ్ళీ మొక్కి వెళ్తున్నారు. నేనూ వెళ్ళి చెయ్యి జాపా. స్వాములారు హూగ్రంగా గుడ్లురిమి “పో అవతలికి ” అని గసిరారు. చొక్కా తొడుక్కుని మొక్కడం, తీర్ధాలు తీసుకోడం మహాపచారంట! ఇంకేముంది కొంపలు మునిగిపోయినట్టు అందరూ హాహాకారాలు చేయడం మొదలెట్టారు. ఆ సందట్లో నా లాగూ చొక్కా విప్పేసి ఒంటిమీద నూలుపోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు. అయినా ఆయన కటాక్షించలేదు. నన్ను బయటకి పంపెయ్యమని తీర్ధపు శంఖుతో సైగచేశారు. తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే – మరీ రెచ్చిపోయి “ఇవ్వాళ అమృతం ఎవరికీ ప్రాప్తంలేదు… అపచారానికి ప్రాయశ్చిత్తం…” అన్నారు కఠినంగా – శంఖుకింద పెట్టేసి తావళం అందుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు.


భక్తులు, శిష్యులు అంతా నన్ను దోషిని చూసినట్టు చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న మానాన్నలో సహనం చచ్చిపోయింది. నన్ను బయటికి బరబరా లాక్కెళ్ళి, పూనకం వచ్చిన మనిషిలా చావకొట్టారు. ఒంటిమీద అచ్చాదన కూడా లేదేమో వొళ్ళంతా వాతలు తేలాయి. గుక్కపెట్టి పరుగెత్తాను. బామ్మ పరుగు పరుగున ఎదురొచ్చి రెండు చేతులా నన్నెత్తుకుని గుండెలకు పొదువుకుంది. భయం, బాధ, ఉక్రోషం, ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ వెయ్యి చేతులు నాకోసం జాపిన అమ్మవారిలా కన్పించింది- గబగబా బాదంచెట్టు కిందకి తీసుకెళ్లింది వాతలు చూసింది. వలవలా ఏడ్చింది. ఒళ్ళంతా నిమిరింది. పై కొంగు కప్పింది. “ఆ బడుద్ధాయికి నిన్ను కొట్టేందుకు చేతులెలా వచ్చాయిరా దూర్వాసపు పుటకా వాడూనూ…” అంటూ నాన్నని తిట్టింది. నా ఏడుపు ఎక్కిళ్ళ స్థాయికి తగ్గింది.


బామ్మ మాత్రం బుసలు కొడుతోంది. ఇంతలో స్వాములారి అంతరంగిక శిష్యుడు ముడిధోవతులు ఆరెయ్యడానికి పెరడువైపు వచ్చాడు.


“దీక్షితులు ఇట్రా” అని గద్దింపుగా పిలిచింది. ఆ పిలుపుకి ఆయన వులిక్కిపడ్డాడు. ఆ సంబోధన… ఆ ధాటీ – దీక్షితులు గారంటే స్వాములోరి తర్వాత స్వాములారంతటివాడు. పెద్దాయన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వేళావేళలు, కళాకళలూ అన్నీ తెలిసినవాడు. స్వామి వారికి జలుబు చేస్తే దీక్షితులు గారికి తుమ్ములు వస్తాయి. అలాంటిది వారి సంబంధం దీక్షితులు సంకోచిస్తూనే నాలుగడుగులు బామ్మ వైపు వేశాడు.


“ఏం స్వాములారయ్యా బోడిసాములారు… పసివెధవకి ఎలా వాతలు తేలాయో చూడు… పైన చొక్కా వుంటేనే అంట్ల వెధవ అయిపోయాడా అభం శుభం తెలీని పసిబిడ్డ….? ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పుండాకోర్లు చాలామందున్నారు మీ గుంపులో… చేతనైతే వాళ్ళ చర్మాలు వొలిపించి తీర్థాలు పోయమను. వూరిఖే బృహదారణ్యాలు భగవద్గీతలూ వల్లిస్తే లాభం లేదు… మానికతో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా? దంచాలి వండాలి తినాలి హరాయించుకోవాలి- అప్పుడొస్తుంది బలం… ఔనా? మీ పీరాయ్ కి చెప్పు… నాకేం భయం లేదు… వాడి బోడి శాపం నన్నేం చేయదు…” – బుసలు కొట్టే బామ్మ మాటలకి దీక్షితులు బుర్ర తిరిగిపోయింది. పిలక తడుముకుంటూ పిల్లిలా జారుకున్నాడు. అయినా బామ్మ ఆగలేదు.


“ధిక్కారము సైతునా అని వేమూరి గగ్గయ్యలా, గుడ్లూ వీడూనూ…పిచికమీద బ్రహ్మాస్త్రం అనీ… ఒక పక్క నించి ఎకరాలు హరించిపోతున్నా తెలీడం లేదు… అరిశెల్ని అప్పాల్ని వదల్లేనివాడు అరిషడ్వర్గాల్నేం వదుల్తాడు…” స్వాములారిని, మా నాన్న ని కలగలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంట దాకా బామ్మ తిడుతూనే వుంది.


రాత్రి అమ్మ నన్ను గట్టిగా కరుచుకుని కంటినిండా ఏడ్చింది. నూనె రాసింది. నాన్న రోజంతా అన్నం తినలేదు.


“ముందే వుండాలి నిగ్రహం… ఉపోషం వుంటే పిల్లాడి వాతలు పోతాయా… అంత తామసం కూడదు” అని బామ్మ మందలించింది. తలదించుకున్నారు గాని నాన్న మారు మాట్లాడలేదు.


స్వాములారి మీద కాదు యావత్తు పీఠం మీద బామ్మ కత్తి కట్టింది. పాకశాలలో వంటవాడి మీద దాష్టీకం చేసి నాలుగు చిట్టిగారెలు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా నాచేతతినిపించింది. దీక్షితుల్ని పనిమాలా పిలిచి “ఇదిగో మహా నివేదన కాకుండానే చిట్టిగారెలు పిల్లాడికి పెట్టా….చెప్పుకో దిక్కున్నచోట.. మొక్కకి చెంబుడు నీళ్ళు పొయ్యడం… పక్షికి గుప్పెడు గింజలు జల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్న వాడికి పట్టెడన్నం పెట్టడం ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం-” సవాలు చేసింది బామ్మ, పాపం దీక్షితులకి బామ్మంటే సింహస్వప్నం అయింది – ఎప్పుడు పిలిపిస్తుందో తెలీదు – ఏం తిడుతుందో తెలీదు.


రెండోరోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూచోపెట్టుకున్నారు స్వామి వారు.


జామపండు యిచ్చి “మొత్తం తినాల్రా” అని తినిపించారు. నాకు పులి మీద కూచున్నట్టుంది. రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి. అయినా ఎటూ కదలడానికి లేదు. తర్వాత మరికాస్త ముద్దుచేసి వారి పాంకోళ్ళు తొడిగించి నడవమన్నారు. నేను రక రకా చప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే “ఏవమ్మో, నీ మనవడు బాలకృష్ణుడు…” అన్నారు స్వాములారు పెద్దగా నవ్వుతూ, శిష్యులంతా ఆమోదిస్తున్నట్టు ముఖాలు వికసింపచేశారు.


“అంతా తమరి వాత్సల్యం. పసివాడి అదృష్టం” అంది బామ్మ. ఈ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నాడు.


ఆ పీఠం మరోచోటికి తరలింది.


బామ్మ మేలుకొలుపులు పాడుతూనే వుంది. ముగ్గులు వేస్తూనే వుంది. కాని నా చిన్నతనం బామ్మ వీపు మీంచి జారిపోయింది. నా కంచం నాదే – నా మంచం నాదే. హైస్కూలు చదువులో పడ్డాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందనీ, నాకు వడకపోగు వెయ్యాలనీ నిర్ణయించారు.


వారం ముందుగానే సందడి ప్రారంభమైంది. గురుపరంపరతో బాటు బంధువులతో ఇల్లు నిండింది. మా అత్తయ్య, మామయ్య వాళ్ళమ్మాయి కల్యాణి వచ్చారు. కల్యాణికి పదేళ్ళుంటాయి. ప్రతి ఇంట్లోలాగే మేనత్త కూతురు కాబట్టి “నీ పెళ్లాం వచ్చిందిరోయ్” అని పాత సరసం ఆడారందరూ.


అత్తయ్య వస్తూనే బామ్మని చూసి “ఏమిటే అమ్మా అంతగా చిక్కిపోయావ్…” అని బాధ నటించింది.


“నేను చిక్కేదాన్ని కాదు లేవే ఎవరికీ – నువ్వు బాధపడకు” అంది వ్యంగ్యంగా బామ్మ.


“చూడు… ఆ చేతులు పుల్లల్లాగా అయి పోయాయ్… బావిలో చేద వేసినపుడు ఆ మురుగు జారి నూతిలో పడ్తుందేమో చూసుకో…” – సలహాగా అత్తయ్య అంటే.


“నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు… చచ్చినా నా చేతి మురుగు నీకివ్వను…” తెగేసినట్టు అన్నది బామ్మ.


అత్తయ్య కస్సున లేచింది ఆ మాటకి. “అంటే నీ ముష్టి మురుగు కోసం పడి చస్తున్నానా” 


“ముష్ఠిది కాదది బంగారపుది – సువీ అంటే రోకలి పోటని తెలుసులేవే…” అందిబామ్మ.


“ఒక్కగానొక్క ఆడపిల్లని… కన్న కూతుర్ని … దయాపేక్షలు లేవు. మీ పెట్టుపోతలకి మేం ఎప్పుడైనా ఏడ్చామా….” అని గద్గద స్వరంతో అత్తయ్య విజృంభించింది.


తల్లీ కూతుళ్ళ వాదులాట విని అమ్మ లోపల్లోపల ఆనందపడ్డది. మాటా మాటా మరీ పెరక్కుండా నాన్న సర్దుబాటు చేశారు.


నా చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు.


మెడలో జందెపు పోగు, చెవులకి బంగారు పోగులు నాకు కొత్త అలంకారాలైనాయి.


బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతోంది. తొర్రలో పాత చిలకలు ఎగిరిపోయి కొత్త చిలకలు వచ్చి వాలున్నాయి. బామ్మకి అరణంగా ఇచ్చిన ఆవుదూడకి అయిదో కారు దూడ పుట్టింది.


కంటిచూపు తగ్గినా బాగా చెయ్యి తిరిగిన బామ్మ ముగ్గులు గడితప్పకుండా వేస్తూనేవుంది…


పీఠాధిపతుల తాకిడి తగ్గింది. తాతలనాటి క్షేత్రాలు తరిగిపోయాయి. అంటుమామిడి తోట గృహస్థు పేరు మీద లేదిప్పుడు. దేవిడీకి గోడలు తప్ప పైపెంకులు లేవు. ఒంట్లో ఓపిక తగ్గినా బామ్మ మాట చురుకు తగ్గలేదు.


“మా ఉయ్యాల వెండి గొలుసుల్ని గున్న ఏనుగు మింగేసింది” అని చాలా సరసంగా చెప్పి నవ్వేది.


అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది. తడి చీరెల శిక్ష తప్పింది. నాన్న నిర్లిప్తంగా వుంటున్నారు. అప్పటి వైభవం లేదు, అట్లాగని దరిద్రమూ లేదు. నాకు తెలిసిన వైభవం బామ్మ – బాదంచెట్టూ అని ఇప్పుడూ వున్నాయి. “నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం” బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అన్పించింది.


నా ఎఫ్.ఎ.పూర్తయింది. బందర్ లో సర్కారు ఉద్యోగం వచ్చింది.


అయినవీ కానివీ పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది. మేనత్త కూతురు కల్యాణి ప్రస్తావన వచ్చింది. కాని బామ్మ ససేమిరా వద్దంది.


“ఆ పిల్ల పేరుకి కళ్యాణేగాని వుత్త నత్తగవ్వ – దాని తల్లి గడుసు దయ్యం – దాంతో నువ్వా సుఖపడలేవ్- పరాయి సంబంధమే చేసుకుందాం” అని బామ్మ స్పష్టంగా చెప్పింది. అత్తయ్యా వాళ్ళు కూడా నా కాళ్ళు కడిగి పిల్లనివ్వడానికి, పుట్టింటి బంధం నిలిచిపోవాలనీ ఏ మాత్రం ఆరాటపడలేదు. వాళ్లకి ఒక్కతే పిల్ల. పైపెచ్చు కావలసినంత వున్న వాళ్ళు. మాకిప్పుడు ఈనాములూ లేవు, నేను బారిస్టర్ నీ కాదు.


చూసిన రెండు మూడు సంబంధాల్లో – చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులుగారి ద్వారా వచ్చిన సంబంధం నచ్చింది.


బామ్మకి మరీ నచ్చింది. తాంబూలాల దాకా వచ్చాక నాలుగు కాసుల బంగారం దగ్గర తేడా వచ్చింది. అటూ యిటూ నరసింహం గారు మాటలు నడిపారు గాని చివరికది చినికి చినికి గాలివాన అయింది. పెద్దవాళ్ళ మధ్య సొమ్ము కంటె పంతాలు అడొచ్చాయి.


“పిల్ల పొందిగ్గా వుందిరా…పచ్చగా దొరసానిలా వుంది… కళ్ళు కజ్జికాయల్లా వున్నాయి… నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు…” అంటూ బామ్మ తెగ వూరించడం మొదలుపెట్టింది.


లోపల పంతం పెట్టుకుని పైకి మాత్రం ‘వాడిష్టం’ అని నాలిక చివర మాట అంటున్నారు అమ్మా, నాన్న.


నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాను. బాదం చెట్టుకింద ఒంటరిగా కూచోబెట్టి బామ్మ హితోపదేశం మొదలుపెట్టింది. – 


“పిల్ల పేరు గాయత్రి….”


“అయితే…”


“రోజు పదిసార్లు పిలిచినా చాలు పుణ్యం పురుషార్ధం… పది మందిలో పుట్టి పెరిగినపిల్ల…”


“అయితే…”


“ఒరే కోర్నాసీ దూటకూరకీ, ముగ్గులకి బోలెడు ఓర్పూ, ఓపికా కావాలా పనితనమూ ఉండాలి… పిల్లకి రుక్మిణీ కళ్యాణం కంఠతా వచ్చుట- టీకా తాత్పర్యంతో సహా“.


“అయితే…”


“అయితేనా? ఇష్టమైన వాడి కోసం ఏదైనా చేసే జాణతనం వుందని…నువ్విట్టాగే మీనమేషాలు లెక్కేస్తూ కూచుంటే చివరికి ఆ పిల్లే నిన్ను లేవదీసుకుపోతుంది…. సరేనా..” అంది నాకు రోషం తెప్పించాలని.


అయినా నేనేమీ చలించలేదు. మర్నాడు ప్రయాణం రోజు వెళ్ళబోతూ నాన్న ముందు మౌనంగా నిలబడి మాట్లాడ్డానికి తటపటాయిస్తుంటే ఆయనే అందుకుని “నీ ఇష్టంరా… నేనేం నిధి నిక్షేపాలిచ్చానని నీ మీద పెత్తనం చెలాయిస్తాను. నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి… నీకు యిష్టమైతే మాదేముంది… వచ్చి పీటల మీద కూచుంటాం…” అన్నారు.


విషయం తేలిపోయింది.


రకరకాల ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టలేదు. బామ్మ ఒక రాత్రి వేళ చీకట్లో తడుముకుంటూ నాగదిలోకి వచ్చింది. నా మంచం మీద కూచుంది. మెల్లగా లేపాలని తడుముతోంది – “లేచే వున్నాలే చెప్పు…” అన్నాను.


“నువ్వు నిద్రపోవని తెలిసే వచ్చా, చూడబ్బాయ్ మీ నాన్న కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ… మీ అమ్మకి మొగుడు చెప్పింది వేదం – ఈ కోపతాపాలు 

నాల్రోజులుంటాయ్, ఆనక పోతాయ్…. మిగిలేది నిక్షేపంలాంటి పిల్ల… అంచేత నిష్కర్షగా గాయత్రినే చేసుకుంటానని తేల్చి మరీ వెళ్ళు….”


నేను ఏమీ చెప్పకుండా అటు తిరిగి పడుకున్నాను.


“ఒరేవ్ అధిక మాసాలతో ఎనభై దాటేశా… నీ పెళ్ళి చూడాలని ప్రాణం ఉగ్గపట్టు క్కూచున్నా… ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి. – నువ్వు ఆకు వక్క వేసుకుంటే అమ్మడు నోరు పండాలి – అదీ ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి. నేను మళ్లీ నీ ఇంటికి రావద్దూ…” బామ్మ గొంతు జీరపోయింది. కన్నీటి చుక్క నాగుండె మీద వెచ్చగా రాలింది.


ఉద్యోగం ఊరు చేరగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్నకి మూడు ముక్కల ఉత్తరం రాశా- పోస్టు చేయకుండానే “ముహూర్తం నిశ్చయమైంది… వున్న పళంగా పదిహేను రూజుల సెలవుపెట్టి రమ్మని” టెలిగ్రాం వచ్చింది.


ఇంట్లో అడుగు పెడుతుండగానే బామ్మ ఎదురొచ్చి “దిగివచ్చార్రోయ్… నీలాంటి అల్లుణ్ణి వదులుకుంటారా…. ఏదో కాస్త బెట్టు చేశారు..పాపం వాళ్ళదీ పెద్ద కుటుంబం – నాలుక్కాసులు ఒక్క ముద్దుకి చెల్లురా అంటే నువ్వూ విన్నావు కాదు… చివరకి మన నరసింహం సానుకూలం చేశాడు…” అని తెగ సంబరపడిపోతూ చెప్పింది.


నాన్న, అమ్మ దిగిరాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయగర్వంతో వున్నారు. ఎవరినీ నొప్పించకుడా కోరిన పిల్ల దొరికినందుకు “థాంక్ గాడ్” అనుకున్నాను. అది మా దొరివారి ఊతపదం.


కలతలూ కలహాలూ లేకుండా పెళ్ళి అయిపోయింది. ఒళ్లంతా కళ్ళు చేసుకుని బామ్మ మా పెళ్లి చూసి ఆనందించింది. “ఒరేయ్ ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వాములారి పల్లకి ఎక్కించమని హటం చేశావ్ జ్ఞాపకం వుందీ? ఇహ ఊరేగు బతుకంతా సుఖంగా అందరి కళ్ళూ మీ మీదే వుండేట్టు ఊరేగండి” అని బామ్మ మా జంటని దీవించింది.


అక్కర తీరింది.


మర్నాడు “నామనవడు నచ్చాడా పిల్లా” అని బామ్మ కొంటెగా అడిగితే – ఔను కాదు అనకుండా, “మీ మనవడు నాకిప్పుడు మూడొందల అరవై కాసులు బాకీ -ఎట్లా తీరుస్తాడో ఏమో…” అందట బుంగమూతి పెట్టి – పెళ్ళికూతురు.


ఆ మాటకి అదిరిపడి “హారి పిడుగా” అని బామ్మ గాయత్రిని ముద్దుపెట్టుకుంది.


బందరులో కాపరం పెట్టాం – బామ్మ మాటలో చెప్పాలంటే ముగ్గులోకి దిగాం. ఒంటి గది – కొత్త కాపరం – బామ్మ దీవెనలా పూసల పల్లకిలో ఊరేగుతున్నట్టుంది.


ఆవిడ కాళ్ల గోరింటాకు అతడి కాళ్ళకి ఎట్లా పండుతుందో అనుభవమైంది,


నేను తాంబూలం నమిలే గాయత్రి నోరు ఎందుకెరుపెక్కునో ఎరుకైంది. బామ్మని బందరు వచ్చి నా దగ్గర వుండమన్నాను.


“నా వూరు నా నేల… ఇక్కడే మట్టయిపోవాలిరా… మీ అమ్మ దొడ్డ ఇల్లాలు… నాకేం తక్కువ జరగదులే-” అది దర్జాగా.


బామ్మ చివరి క్షణాల్లో చూడ్డానికి వెళ్లాం. మాట స్పష్టత లేదు. “కొత్త కాపరం బావుందా” అని అడిగింది. ఇద్దరం తల వూపాం.


“కాపరం, కత్తిపీట కొత్తల్లో కంటే కొంచెం పదును పడ్డాకే బావుంటాయిరా…” అంది మాట పెగుల్చుకుని – మేం నవ్వితే బామ్మ పెదవి కదిలింది. ముఖం వెలిగింది. మా ఇద్దరి చేతులూ చేతిలోకి తీసుకుంది- “ఒక మొక్కకి చెంబెడు నీళ్ళు… గింజలు.. అన్నం పెట్టా… ఆ ఫలం నాకు దక్కింది. నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది… నేను ఇపుడో… కాసేపో…” – బామ్మ మాటలకి నాకు దుఃఖం పొర్లుకొచ్చింది.


“నిన్ను వదలి ఎక్కడికి పోతావ్రా వెర్రి నాగన్నా… అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా…” అంటూ ధైర్యం చెప్పి బామ్మ వెళ్ళిపోయింది.


భరించలేనంత శూన్యం నాలోనిండుకుంది. అమ్మ నాన్న చుట్టం పక్కం దయ దేవుడూ అన్నీ, అంతా, అందరూ ఒక్కసారి వదలి వెళ్ళిపోయి నట్టయింది.


వెళ్ళి పిచ్చిగా బాదంచెట్టు చుట్టూ తిరిగాను. డెబ్బై ఏళ్ళ ఆ పిచ్చి మొద్దుకి బామ్మ పోయిందని తెలియదు. రేపట్నించి చెంబెడు నీళ్ళెవరు పోస్తారు? పై తొర్రలో కిలకిలలాడే చిలకలకి తెలియదు బామ్మ పోయిందని – రేపట్నించి గుప్పెడు గింజలు ఎవరు జల్లుతారు? చిన్నప్పుడు మేము చిరుతిళ్ళు దాచుకున్న తొర్రలో చెయ్యి పెట్టి వెదికాను. దాన్నిండా బాదంకాయలు దాచి వున్నాయి. రేపట్నించి రాలిన బాదం కాయలు ఎవరు ఏరతారు?


బాదం చెట్టుని చుట్టుకున్న బామ్మ జ్ఞాపకాలు ఎన్నేళ్ళయినా మర్చి పోలేను. ఆ చెట్టు నీడలో నా చిన్నతనం చెక్కుచెదరకుండా వుంది.


కర్మ కాండ ముగిసింది. బామ్మ ఆరో ప్రాణంగా చూసుకున్న బంగారు మురుగు తూకానికి పెడితే అది గిట్టు నగ అని తేలింది. అమ్మ, నాన్న, అత్తయ్య అంతా మొహమొహాలు చూసుకున్నారు.


మనవడికి మంచి పెళ్ళాం రావాలని బంగారు మురుగు కరిగించిందని వాళ్ళకి తెలియదు. పెళ్ళి పెద్దగా కథ నడిపిన నరసింహంపంతులుగారు చెప్పేదాకా నాకూ తెలియదు.


బామ్మ మా ఇంటికి వస్తుంది – అన్న మాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడకే… గాయత్రి సాక్షిగా....

🧓🏾

*సమాప్తం*                    

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*కథల ప్రపంచం* 


https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe


*తెలుగు భాషా రక్షతి రక్షితః* 


*1 YEAR SUBSCRIPTION 120/-

phone pe & Gpay to 9849656434*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

055🙏🏻*ప్రదోషం *🙏🏻

------------------------------

🙏🏻**ప్రదోష వ్రతం**🙏🏻

******************

ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం. ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల  (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు. మహా ప్రదోషం రోజున శివ భక్తులు  ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 

**************************

రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు. 

-------------+++++----------------

ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి లో చెప్పబడింది. ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు. ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు. 

**************************

ప్రదోష  సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు. నందీశ్వరుడు నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ, వినయంతో వుండి,  శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు. అందువల్ల  నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి.  ----------------------------------------     *త్రయోదశి మహా ప్రదోషం,*

*************************

ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని,

సోమవారం రోజు వస్తే దానిని సోమ ప్రదోషమనీ, 

మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని, 

బుధవారం రోజు వస్తే దానిని బుధ ప్రదోషమని, 

గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని, 

శుక్రవారం రోజు వస్తే దానిని శుక్ర ప్రదోషమని, 

శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. 

**************************

వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే  శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు. 

----------------------------------------

🙏🏻*ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి? *🙏🏻

**************************

ప్రదోషం రోజు ఉదయమే స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించాలి. శరీరంపై విభూతిని, రుద్రాక్షమాలను కూడా ధరించటం మంచిది. ఆ రోజులో వీలైనప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని  (ఓ నమ:శివాయ) జపం చేయాలి. ప్రదోషం రోజున నిశ్శబ్దంగా ఆరాధించటాన్ని శివుడు ఇష్టపడతాడని చెబుతారు. కఠిన ఉపవాసం చేయలేనివారు పండ్లు, పాలు లాంటివి తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థాలను తీసుకోకూడదు. 

**************************

సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు మరియు శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి.

----------------------------------------

స్కంద పురాణంలో ప్రదోష మహత్య కథ కూడా వివరింపబడింది.

------------++++++---------------

*మహా మృత్యుంజయ మంత్రము*

**************************

ఓం త్రయంబకం యజామహే 

సుగంధిం పుష్టి వర్ధనం 

ఊర్వారుకమివ బంధనాత్ 

మృత్యోర్ముక్షీయ మామృతాత్

----------------------------------------        *శని ప్రదోషం *

*************************

దేవ దానవులు క్షీర సాగరాన్ని మధించినప్పుడు వెలువడిన హాలాహలం నుండి శివుడు ప్రపంచాన్ని రక్షించిన రోజుగా శనిప్రదోషం రోజును చెబుతారు. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమంగా పరిగణిస్తారు.

**************************

శని ప్రదోష వ్రతం ఆచరించటం వలన కర్మ దోషాలు, జాతక దోషాల నుండి విముక్తి పొందవచ్చునని చెబుతారు. వివాహ దోషాలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజున ప్రదోష కాలంలో శివారాధన చేయాలి. గత జన్మల పాపాలు కూడా తొలగి సకలసంపదలు చేకూరుతాయి. శని ప్రదోషానికి సంబంధించి ఉజ్జయిని మహాకాళేశ్వరునికి సంబంధించిన కథ ఒకటి చెప్పబడినది. 

-------------+++++++------------       *సోమ ప్రదోషం*

*************************

సోమవారము శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజున వచ్చే  సోమ ప్రదోషమును ప్రశస్తమైనదిగా భావిస్తారు. ఈ రోజున ప్రదోష వ్రతము ఆచరించటం వలన మనసులోని మలినాలన్నీ తొలగిపోతాయి . 

**************************

🙏🏻 గురు ప్రదోషం 🙏🏻

**************************

త్రయోదశీ ప్రదోషము గురువారము వస్తే ఆ రోజును గురు త్రయోదశిగా భావిస్తారు.  గురు ప్రదోష పూజ వలన విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయని చెబుతారు. జాతకములో ఉండే గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా భావిస్తారు. 

 ************************

సేకరణ.. ప్రాంజలి ప్రభ

***-

*056.._జీవిత రహస్యం....._*


*_మానవుడు తాను ఖర్చు చేసే ధనములో తృణమో పణమో ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ శరీర నిర్మాణంలో దానం చేసే సుగుణముంది. భగవంతుడు ఒకరికిచే దాన పద్ధతిలోనే చేతిని నిర్మించాడు._*


*_చేతులు కిందికి వాలి ఉన్నప్పుడు వాటి తీరు గమనిస్తే ఈ సత్యం బోధపడుతుంది. ఇమ్ము శ్రద్ధతో ఇమ్ము నిశ్చయముగా ఇమ్ము -ఇదే జీవిత రహస్యం అని నీతిశాస్త్ర కోవిదులను అంటున్నారు._*


*_మనిషి దాన గుణంతోనే ధర్మాత్ముడు అవుతాడు ఇతరులకు ఆదర్శంగా జీవించగలుగుతాడు మంచి వారసత్వానికి వారసుడు అవుతాడు సమాజ క్షేమాన్ని కాంక్షించి గలుగుతాడు._*


*_మన చేతికి అలంకారం దానం చేయడం అది ఒక గొప్ప సౌశీల్యం దానధర్మాల విశేషంగా చేయాలి తన కోసం తన ధనాన్ని ఎంత తక్కువ ఖర్చు చేసుకుంటే అంత గొప్పవాడు అవుతాడు మానవుడు. మనిషి జీవితం దానధర్మాల తోనే ముడిపడి ఉంది అదే అతడు దాచుకున్న సంపద అదే సద్గతిని కలిగిస్తుంది అనుకున్నప్పుడే వెంటనే దానం చేయాలని మహర్షులు చెబుతారు జీవితం ఏ క్షణములో ఏమి జరుగుతుందో తెలియదు, అది గుర్తించిన వారు ఈ జీవన రహస్యాన్ని మర్చిపోరు._*


*_పిసినిగొట్టుతనము మహా ప్రమాదకరమైన అవలక్షణం కొందర్ని మనం అంటూ ఉంటాం పిల్లికి కూడా బిచ్చం వేయడు... కామక్రోధ, లోభాలు నరకానికి ద్వారాలని అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు._*


*_అవి ఆత్మ వినాశనానికి దారులన్నీ వాటిని త్యాగం చేయలని మహాత్ములు అన్నారు. మనిషి త్యాగశీలి జీవించాలి దానం అనేది మన కర్తవ్యంగా భావించాలి లోకంలో ఎందరో దరిద్రులను చూస్తున్నాము కూటికి గుడ్డకు విద్యకు నోచుకోని నానా బాధలు పడుతూ వీధుల్లో తిరుగుతున్నారు . ఈ దీన స్థితి నుంచి వీరిని ఉద్ధరించాలి._*


*_మన సంపాదనలో, కనీసం 5 శాతం నుండి 10 శాతం వరకు, ధనాన్ని ఇతరులకు దానం చేద్దాము . అది తిరిగి రెట్టింపు అయ్యి10 రెట్లు మనకు తిరిగి వస్తుంది. ఒక కేజీ ధాన్యం మనము పొలములో చల్లితే, దాదాపు రెండు మూడు బస్తాల ధాన్యం వస్తుంది, అసలు ఏమి చల్లకపోతే ఏమీ రాదు._*


*_అదే విధముగా మనము ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకుంటే, మనకు అది తిరిగి ఏదో విధముగా  చేరుతుంది. ఇది అక్షర సత్యం... మన చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉంటే, మనం ఆనందంగా ఉండగలుగుతాము ఇది పకృతి రహస్యం. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మన వారే ఎవరు పరాయి వారు కాదు ఎవరితోనూ విరోధం వద్దు. 🙏

******

057..సీ..అమ్మను తలచియు సహనమ్ము నుంచియు 

కనుల కవిత్వను కావ్య మలుపు 

అయ్యను కొలిచియు ఆశయము తెలిపి 

ఆరాధ్యమనసగు ఆశ మెరుపు 

చల్లని గాలిగా చరితము చదివియు 

హృదయము పిలుపగు కృపగ తలపు 

విశ్వనాధుని లీల విశ్వమున్ గాచును 

కమ్మని కథలుగా కాల పిలుపు 


తే..చిద్వి లేసుని కళలవి చేరువగునె 

విఘ్న నాయక నిలయము విజయ మివ్వ

వారణాసినందును గంగ వరము లిచ్చు 

కాల భైరవ వీక్షణ కాల మార్పు


మల్లాప్రగడ రామకృష్ణ


కాశీపురి వర్ణన 🙏



 సీ. కాశీపురమ్మును కాంచిన చాలును

                  తొలగిపోవును కదా ! దురిత రాశి

      విశ్వేశ్వరస్వామి విశ్వమున్ గాచును

                 కనినంత పాపముల్ కరిగిపోవు

      అన్నపూర్ణమ్మయు న్నాహార మిడునిల

                 సకల జనాళికి సాకుచుండి

      గలగలపారెడు గంగానదీమాత

                 పాపాళి నెల్లను పరిహరించు

 తే.  కాలభైరవుడు మనల కనికరించ

       డుంఠి విఘ్నేశు డెప్పుడు నండ గుండ

    కరుణతోవిశాలాక్షియు కాచు మనల

       వరములకు నిలయము గదా వారణాసి 🙏🙏


జయలక్ష్మి


గెలుపు. ఓటమి.. సిలక.. తేటగీతి మాలిక 


గెల్చి నట్టి శక్తిపలుకు తెల్పు గీత 

సంస్కరించవలయు నిత్య సంఘగతిని

ఓడి నట్టి బలిమి కళలు యోర్పుతోనె 

చెడును పట్టవలయు సేవ చింత సిలక 


మాగిన ఫలము దగ్గర మనసు చిలక 

కుళ్ళిన ఫలము వైపు పురుగు మొలక 

మంచి మనుగడ నాయక మానసమ్ము 

చెడును మరచి స్వభావాన్ని చెప్పు సిలక 


ఎంత ఘనత యీ దేశంది యేల చెప్ప 

తెలివినెంత పెంపు చదువు తిష్టవేయు 

కులము కాదు కాలము పోటు కూడికయగు 

నరులు నమ్మి ఓటునువేయ నమ్ము సిలక 


పదిలపరచ జ్ఞానమ్ముయె పలుకు తీరు 

ఎంతచెప్పినా తక్కువే యేల యనకు 

అధిక బలము యున్నను కష్ట మేను సిలక 


కాలమే మురిపించును కామ్య రీతి 

గాయమే మరిపించును కావ్య రీతి 

ధ్యేయమే ఫలమవ్వును ధ్యాన రీతి 

ధర్మమే సత్య భావము ధరణి సిలక 


మంచి పెంచుము దేవరా మనుషులందు 

కొంచె మైనను మార్చుము మంచి వైపు 

మంచి చెడు మనుషులు చూడు మహిని యందు 

రాజనీతి నిలుపు మంచి రాజ్య సిలక 


ధనము దర్పాన్ని చూపకు ధరణి యందు 

మనసులోని ప్రేమ పలుకు మనని పెంచు 

అంద రందురు మా బలం యనియు గొనుగు 

చెప్పిన పలుకు చేయూత చింత సిలక 


మీ 

మల్లాప్రగడ రామకృష్ణ

******

*058..పిల్లలకు….ప్రేమను పంచినట్టే…*  *మీ కష్టాన్ని తెలుపండి, వారికి  కూడా పంచండి, వాళ్ళు జీవితంలో ఎదిగిన తరువాత, మీ పట్ల వారికున్న బాధ్యతను, ప్రేమను తెలుపండి. ఈ కాలం జనరేషన్  మాకేంటి తప్ప, మనకేంటి అనేది లేదు. వారికున్న పరిస్తితులవళ్ళ, ఆ ఏముందిలే చూద్దాం, చేద్దాం,  వాళ్లకు అవి అలవాటే, మా బాధలు  వాళ్లకు ఏమి తెలుసు, ఇలా ఎన్నెన్నో. వాళ్ళ పిల్లల కోసం లక్షలు తగలేస్తారు, తల్లిదండ్రుల కోసం, కొంచెం సర్దుబాటుకు కూడా అలోచించేవాళ్ళు ఎంతో మంది. పిల్లలను ప్రేమించాలి, వారి ఉన్నతికి తోడ్పడాలి, కానీ మీకో ముసలితనం వుందని మర్చిపోకండి. అప్పుడు ఆరోగ్యం, ఆహారం, కొన్ని సంతోషాలు వుంటాయని గుర్తుంచుకోండి. దానికోసం వయస్సులో వున్నప్పుడే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకూడదు. ప్రపంచాన్ని చూడండి, కాస్త తెలివిగా మసులుకోండి, లూఇకపోతే తీరిగ్గా బాధ పడాల్సి వస్తుంది. సర్వేజనా (ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్) సుఖీనో భవంతు. ఇక చదవండి* 😔😔     

*🔹నిజజీవితం అంటే… రెండున్నరగంటల  సినిమా కాదు... అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి!*

*ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది….                           "మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను.    మా అమ్మాయిని ఎటువంటి  కష్టం    తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి  అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసంచేసి ఎత్తుకుపోయారేమో".... అని చెప్పింది.*

*జడ్జిగారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది.    బోనులో ఎదురెదురుగా తల్లి కూతుర్లు.                                   ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు.*

*ఆ అమ్మాయి... "నన్ను ఎవరూ మోసం చేయలేదు. నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు. నేను మేజర్ ని.   నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను." అనిచెప్పింది.*

*ఇంట్లో వాళ్లకు ఒక్కమాటైనా చెప్పాలి కదా!.... అని అడగాలని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక ఒక గంటసేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జిగారు తీర్పు ఇచ్చారు.*

*జడ్జిగారి ఆశ ఏంటంటే... ఒకవేళ    ఆ తల్లీకూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే, ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని.*
*ఆయనకూ మనసు ఉంది కదా! అందుకే  ఆలోచించి అలా చెప్పారు.*

*ఒక గంట తరువాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ,  ఎటువంటి మేజిక్కూ జరగలేదు.*

*అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, "ఇక అమ్మాయి ఇష్టం అండీ... తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్కమాట... వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం" అని తల్లి చెప్పింది.*

*"వాళ్ళ నాన్న ఎక్కడ?" అని అడగగా... అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు (physically handicapped.) అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు.*

*అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి "ఇక నేను వెళ్లొచ్చా"... అని అడిగి బయట తన భర్త వేచిచూస్తున్న కార్ ఎక్కి వెళ్లిపోయింది.*

*ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. 'ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి' అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు.*

*జడ్జిగారు ఆ అమ్మను ఉద్దేశించి... "ఇప్పుడెలా వెళతారు?" అని అడిగితే... "బస్టాండ్ లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరువెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం." అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్లు.*

*కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వగా, అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు.*

*సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు.*
*తప్పు చేశామేమో అనే పశ్చాతాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే.*

*మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు.*

*ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడైనా కాస్తంత మానవత్వంతో మనుషులుగా మిగిలిఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి తమదారిన తాము వెళ్ళిపోతారు.*
         
*ఇదీ నేటి జనరేషన్ 💗హృదయం*

ప్రాంజలి ప్రభ కథలు
******
*059..నమ్మకానికి మరో రూపమే దేవుడు*
🙏
             
ఒకప్పుడు ఒక ప్రాంతంలో కర్ఫ్యూ విధించబడింది, 
అలా నిర్వహిస్తున్నప్పుడు, ఆ కర్ఫ్యూ వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితులు,

అదే ప్రాంతంలో ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది! ఈ కర్ఫ్యూ వల్ల ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొర పెట్టు కోవడానికి మోకాళ్ళ మీద మొకరిల్లి ప్రార్థన చేస్తోంది…
           
ప్రార్థనలో భాగంగా ఆవిడ దేవునితో…" భగవంతుడా ..! ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు పక్షితో ఆహారాన్ని సమకూర్చావని విన్నాను, అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను" అన్నది.

ఆ మాట విన్న తన మనవడు భగవంతుడు పంపే పక్షి తనకు ఆహారాన్ని తెస్తుందని నమ్మి , పక్షి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి ఉండాలని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు.

అయితే… ఆ కిటికీ పక్కనే కాపలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి      తొంగి చూశాడు. లోపల ఓ పసి పిల్లవాడు బిక్క మోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే ..

ఆ పోలీసు  "ఏరా? తలుపెందుకు తీశావ్ ..!?" అన్నాడు.

ఆ పిల్లవాడు "మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు పక్షితో ఆహారం పంపుతాడని అంటుంది" అన్నాడు. అందుకే కిటికీ తలుపు తీసాను అన్నాడు.

అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ఓ ముసలావిడని చూసి ఆ పిల్ల వాడితో "ఆకలి వేస్తుందా? " అని అడిగి  "మీ బామ్మ చెప్పిన పక్షిని నేనే ..! నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తియ్యి" అని చెప్పాడు.

ఆ పోలీసు ఒక మూసి ఉన్న పచారి కొట్టు తీయించి పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపుకొట్టి అందించాడు.

ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ పోలీసు ద్వారా ఆకలి తీర్చాడు.

ఒకరిది ప్రార్థన ..!
ఇంకొకరిది విశ్వాసం ..!
మరొకరిది ప్రేమ పూరిత సహాయం ..!

దిక్కు లేని వారికి దేవుడే దిక్కు!

ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన ..!

’నమ్మకం’ ఆచిన్న పిల్ల వాడు తన మామ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెతకడం ..!

నమ్మకానికి మరో రూపమే..  ఆ పిల్లవాడికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు ‘సహాయం’ చేయడం ..!

పాలలో పెరుగు, వెన్న, నెయ్యి దాగి ఉన్నట్లు నీ నమ్మకం లో ఎన్నో మహా అద్భుతాలు దాగి ఉన్నాయి!     
          అవి చూడాలంటే… కాస్తంత ఓపిక, మనోధైర్యం కష్టపడే తత్వం ఉంటే చాలు!
****

060..*దైవీ సంపదలు*

*ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు మరుజన్మలో దైవీ సంపదలతో పుడతారు. వారికి ఈ క్రింద చెప్పబడిన దైవీ సంబంధమైన 26 గుణాలు ఉంటాయి.* *శ్రీ మాత్రేనమః*

*1) భయం లేకపోవడం.*

*2) సత్వగుణం కలిగి వుండటం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం.*

*3) జ్ఞానాన్ని సంపాదించడం.*

*4) విద్యాదానం, జ్ఞానదానం, భూదానం, అన్నదానం మొదలైన దానాలు శక్తి కొద్దీ చేయడం.*

*5) ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం.*

*6) జ్ఞాన యజ్ఞం చేయడం.*

*7) పురాణాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం.*

*8) ప్రతి పనీ ఒక తపస్సులాగా చేయడం.*

*9) మంచి ప్రవర్తన కలిగి వుండటం.*

*10) అహింస వ్రతాన్ని పాటించడం.*

*11) సత్యం పలకడం.*

*12) కోపం విడిచిపెట్టడం.*

*13) దుర్గుణాలను త్యాగం చేయడం.*

*14) ప్రశాంతంగా ఉండటం.*

*15) ఇతరులను విమర్శించకుండా ఉండటం.*

*16) భూత దయ కలిగి ఉండటం.*

*17) ఇంద్రియ లోలత్వం, స్త్రీ లోలత్వం లేకుండా ఉండటం.*

*18) మృదువుగా మాట్లాడటం.*

*19) చెడ్డ పనులు చేసినపుడు సిగ్గుపడటం.*

*20) చిత్త చాంచల్యం వదిలిపెట్టడం.*

*21) ముఖంలో, మనస్సులో తేజస్సు కలిగి ఉండటం.*

*22) ఓర్పు కలిగి ఉండటం.*

*23) అన్నివేళలా ధైర్యంగా ఉండటం.*

*24) శరీరంతో పాటు మనస్సును కూడా శుచిగా ఉంచుకోవడం.*

*25) ద్రోహబుద్ధి లేకుండా ఉండటం.*

*26) స్వాభిమానం వదిలి పెట్టడం.*

*ఈ గుణాలను దైవీసంపదగా పెద్దలు పరిగణించారు.*

ప్రాంజలి ప్రభ కథలు
*****
       
*061.._"సహనంతో చాలా వివాదాలు, ప్రమాదాలు తగ్గుతాయి. సమర్దులకే సహనం ఉంటుంది. మంచికోసం తగ్గేవాడు ఎప్పుడు నా దృష్టిలో గొప్పోడే. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు ముమ్మాటికీ సమర్థుడే ."_*

*_సహనం ఉండాలి కానీ, అ సహనం అన్నివేళలా  పనికిరాదు. దేనికైనా ఒక హద్దు, అదుపు ఉండాలి. ఎక్కడ ప్రదర్శించాలి. ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది తెలిసి ఉండాలి..._*

*_ఎవరికైనా సరే ఒకసారి చెప్పండి లేదా, రెండుసార్లు చెప్పండి. ఇకపోతే పదిసార్లు కూడా చెప్పండి. అయినా వినకపోతే వారి కర్మకే వదిలేయండి. ఎందుకంటే, ముందు మీరు ప్రశాంతంగా ఉంటారు._*

*_"మేఘం బరువు మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటకు వస్తుంది." పర్వాలేదు కన్నీరు ఆపకండి. ఎందుకంటే, గుండె బరువు తగ్గుతుంది._*

*_అంతమాత్రాన కన్నీరు కారుస్తూ కూర్చోకండి. అ కన్నీటికి కారణమైనదాన్ని కాసేపు వదిలేయండి. ప్రశాంతంగా మారండి. తప్పకుండా అన్ని సర్దుకుంటాయి._*

*_బాధలో నిర్ణయాలు, ఆవేశంలో వాగ్దానాలు, నిన్ను మరింత బాధకు గురిచేస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. నీ జీవిత గమనాన్ని మార్చేస్తాయి._*

*_"నీ మేలు" కోరేవారు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు, నిరంతరం నిన్ను పొగుడుతుంటే నీ కీడు కోరుతున్నట్టే. భజన చేసేవారు కాదు ప్రశ్నించే వారే నీ శ్రేయోభిలాషులు.☝️_*

         *_మీ శ్రేయోభిలాషి..
ప్రాంజలి ప్రభ..
        *****
062..★ *టీడీపీ కూటమి ఇచ్చిన టాప్ 25 హామీలు* ★
------------------------------------

1. మెగా డీఎస్సీ పై మొదటి సంతకం


2. *వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు*


3. దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు.


4. *18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు, నెలకి రూ.1500*


5.ఆర్టీసీ బస్సులో ప్రతి
     మహిళలకు ఉచిత ప్రయాణం

6. *యువతకు 20 లక్షల ఉద్యోగాలు*


7. నిరుద్యోగులకు నెలకి రూ.3000 నిరుద్యోగ భృతి


8. *తల్లికి వందనం కింద,  ఎంత మంది బిడ్డలు ఉన్నా, ఏడాదికి ఒకో బిడ్డకు రూ.15,000*


9. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా


10. "ప్రతి రైతుకు ఏడాదికి


   రూ 20000 వేల పెట్టుబడి"

11. *వాలంటర్లకు  గౌరవ వేతనం నెలకు రూ.10 వేలు*


12. ఉచిత ఇసుక


13. *పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు*


14. భూహక్కు చట్టం రద్దు


15. *ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనక్షన్ ఇచ్చి, స్వచమైన నీరు*


16. బీసీ రక్షణ చట్టం


17. *పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేద వాడిని సంపన్నులని చేయడం*


18. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్


19. *కరెంటు చార్జీలు పెరగవు*


20.బీసీలకు 50 ఏళ్ళకే  
పెన్షన్ వస్తుంది

21. *ప్రతి పేద వాడికి, రెండు సెంట్ల ఇళ్ళ స్థలం*


22. ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో మంచి ఇళ్ల నిర్మాణం


23. *పెళ్లి కానుక కింద రూ.లక్ష*


24.విదేశీ విద్య మళ్ళీ వస్తుంది

25. *పండుగ కానుకలు వస్తాయి*


ఎటువంటి కండిషన్స్  లేకుండా...
******

063..ఓటు ఆయుధపు పదునెంతో
ఓర్పు మలుపుకు సుఖమంతే

విసిగిన ప్రజల గుండె మంటెంతో
కల్ముషాన్ని తుడిచే మనసంతే

నిరంకుశత్వం మితిమీరిన నాశనానికను నీతెంతో
అర్ధ పోరాటంలో అవకాశం కొంతే

అధికారమదం తలకెక్కిన
అథ:పాతాళానికేనని తెలుసుకో
తనచెప్పుతో తనే కొట్టుకొనే కాల గమన మంతే

అహంభావం కడకు పతనానికేనని తెలుసుకో
పుంజులతో కత్తుల ఆట కొంత సంతోష మంతే

ఎదురులేదని విర్రవీగితే
వినాశమేనని తెలుసుకో
తేనతుట్టే సక్రమముగా తీయకపోతే  తేనె టీగలతో యంతే

పచ్చని చెట్లు పగబట్టిన పోకాలమేనని తెలుసుకో
చెప్పినవి చేయకపోతే గతాన్ని గుర్తుగా యంతే

గ్రహణం వీడిన 'చంద్రుడు'
తిరిగి వెలుగునని తెలుసుకో
కష్టానికి ప్రతిఫలము పొంది జనం తిరస్కరించే స్థితి యైతే యంతే

తెలుగు దేశంలో తెలుగు భాషకు గౌరవం
పరిశ్రమలకు అవకాశమే గౌరవం
ఉద్యోగాలు కల్పిస్తే దేశానికే గౌరవం
జలాలు సక్రమంగా ఉపయోగం గౌరవం
ఎన్నో మరెన్నో ప్రభుత్వానికి గౌరవం
ప్రజలతీర్పని తెలుసుకో
తెలుసుకో తెలుసుకో
***


No comments:

Post a Comment