Friday 25 September 2015

ప్రాంజలి ప్రభ -శ్రీ కృష్ణ భక్తి.!


ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -శ్రీ కృష్ణ భక్తి.! 



శ్రీకృష్ణుని జననము - 2 (కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా)

ప్రేమ కృష్ణుణ్ణి చూచీ - పూతకి - ప్రియముతో బుజ్జగించి

నాయన్న ఊరుకోర - నాతండ్రి - పాలు ఇచ్చెదను రార

మూడు గుక్కలు పీల్చగా - పూతకి - భూమిపైకొరిగి పడగా

గోపెమ్మ చూచి అపుడూ - బంగారు - గిన్నెలో బువ్వపెట్టి

ప్రొదున్న ఉగ్గుపోసి - కృష్ణుణ్ణి - యొడలోను పందవేస

అంతలో కంసహితుడూ - బండిరూ - పై యెదురుగవచ్చెనూ

పాదములు రెండు పిడుగు - లావలే - దడదడా విసిరెనపుడూ

వృషభమై వచ్చినిలువ - ఒక్కలఘు - వున చంపివేసెనపుడూ

చల్లమ్ము వారలెల్లా - ఈకబురు - చల్లగా చెప్పిరపుడు

రేపల్లె వాడలోను - ఉన్నట్టి - గోపికల గుంపుగూడి

"మాయిళ్ళ కొచ్చునమ్మా - కృష్ణూడు - మమురవ్వ చేసునమ్మా

తాళలేమమ్మ మేము - మీ సుతుడు - తాలిమితొ ఉండడమ్మా

మగనివలె పనులుసేయా - నీ సుతుడు - మా యిండ్లలోకి వచ్చూ

ఇనైకన బుద్ధిచెప్పీ - ఇంతిరో - పదిలమ్ము సేయుమమ్మా"

అనుచును గట్టిగానూ - మనమంత - గోపెమ్మ కడకుబోయి

చెప్పుదామనుచు వారు - గోపెమ్మ - చెంతకేగగ నప్పుడు

గోపాలకృష్ణు డపుడూ - అచటనే - పాలుత్రాగుచు నుండెనూ

ఇదియేమి యాశ్చర్యమే - ఓ చెలియ - ఇదియేమి చోద్యమమ్మ

కనుపాపలను దీసునే - కృష్ణుడు - దొంగతనములు చేసునే

ఇకనేమి చేసునోను - మన ముబులు - పాటమున వస్తిమమ్మా

అమ్మనే నెరుగనమ్మా - నాత్రోవ - నేబోవు చుండగాను

ననురవ్వ చేసిరమ్మ - నేనంత - భయపడీ వస్తినమ్మా

కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గొబ్బున పిలువబోవ

కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గుబ్బలను చూపినారు

పొరుణమి రోజులందు - జలజాక్షు - లందరూ కూడకోనీ

చీరలటు తీసివేసి - గోపికలు - జలకమాడుచు నుండగా

తీసివుంచిన చీరలు - కృష్ణుండు - వేసె ఆ పొన్నమీద

వేసియూ వేణునాదం - వూదుచూ - వుండె నా మాధవుండూ

జలమమ్ము చాలించియూ - గోపికలు - మన చీర లేమాయెనే

నమ్మరాదమ్మ కృష్ణుని - ఇకను ఈ - చినగొల్లవాని నెపుడూ

ఎంతపని చేసెనమ్మా - ఓ చెలియ - ఏమి యాశ్చర్యమమ్మా

వెదకుచూ కొందరుండీ - నీళ్ళలో - మునిగియుండిరి కొందరూ

అప్పుడూ గోపికలో - ఒకయింతి - తాజూచి శ్రీకృష్ణునీ

ఇవ్వరా మా చీరెలూ - ఓ కృష్ణ - ఇవ్వరా మా రవికలూ

దండంబు పెట్టెదార - కృష్ణయ్య - దయయుంచి దయచేయరా

అందరూ ఒకచేతితో - దండంబు - పెట్టగా చూచితాను

పొందుగా మీరందరూ - దండంబు - రెండుచేతుల బెట్టరే

ఎంతపని వచ్చెననుచూ - గోపికలు - మానభంగము నొందిరీ

వసుదేవ తనయునకునూ - దండంబు - రెండుచేతుల బెట్టిరీ

పొందుగా వలువలన్నీ - కృష్ణుండు - పేరుపేరున ఇచ్చెను

నాయత్త తిట్టునేమో - యనుచు నొక - రొకరితో వగచిరపుడూ

మాయాడు బిడ్డ యిపుడూ - కొట్టునో - నా బావ దండించునో

నా మగడు నన్ను బ్రతుక - నివ్వడూ - నేనేమి చేతునమ్మా

కస్తూరి రంగరంగా - నా యన్న - కావేటిరంగ రంగా

శ్రీరంగ రంగరంగ - నిను బాసి - యెట్లు నేమరుచుందురా
సర్వేజనాసుఖోనోభవంతు 


పోతన గారి శ్రీ కృష్ణ భక్తి.!
(శ్రీ పద్మ విభూషణ నారయణ రెడ్డి గారి పరిశిలన.) 


నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది. 


రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ల గల రక్తికీ, భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. కుచేలు డున్నాడు, అర్జును డున్నాడు. వీళ్ళది ప్రధానంగా సఖ్యభక్తి. అనుషంగికంగా ఆ సఖ్యం చుట్టూ స్మరణవందన పాదసేవనాదులు పరివేషించక పోలేదు. 


మరి మధుర భక్తికి మూలమేది? జీవాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మనుండి ఖండశః అంశతః విడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనమే భగవద్రతిభావనకు ప్రాతిపదిక. త్రేతాయుగంలో మునులు, ద్వాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపిక లున్నారు. వాళ్ళకు ఇళ్ళూ, వాకిళ్ళూ ఉన్నాయి. కొందరికి పతులూ, సుతులూ ఉన్నారు. అయినా శారదయామినిలో యమునా తీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదేపదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు - 


"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"

మధ్యమధ్య ఆ మాధవుడు, ఆ గోపికా మనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సంభ్రమిస్తాయి -
"అదె నందనందనుం డంతర్హితుండయ్యెఁ - బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితివని - యైలేయలతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా - చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి - మాధవీలతలార! మనుపరమ్మ!
జాతిసతులఁ బాయ నీతియె హరి కని
జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!"

సమస్త చరాచర జీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ మాధవుడే తమధవుడని భ్రమించినారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్ధప్రవృత్తే మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్ణనంలో హృదయంగమంగా చిత్రించినాడు పోతన్న.


No comments:



2 comments: