Saturday 23 May 2020






మంత్రపుష్పం : 02 (FINAL)
సద్గురు శ్రీ చలపతిరావు
శరీరాన్ని నిలబెట్టే వైశ్వానర అగ్నిజ్వాలల్లో పరమాత్మ ఏ రూపంలో ఎలా ఉన్నాడు?
(8) తస్య మధ్యే వహ్ని శిఖా అణీ యోర్ధ్వా వ్యవస్థితః ।
నీలతో యద మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వరా ।
నీ వార శోక వత్తన్వీ పీతా భాస్వత్త్యణూపమా ॥
హృదయకుహరంలోని ప్రధాననాడి మధ్యలోని రంధ్రంలో ఉన్న అగ్నిజ్వాలల్లో - ఒక అగ్నిజ్వాల (వహ్నిశిఖ) సూక్ష్మాతి సూక్ష్మమైనది. (అణీయ), పైకి లేచి ఉన్నది (ఊర్థ్వా). అది ఎలా ఉంది ?
నీలమేఘం మధ్యన మెరిసే మెరుపు తీగలాగా (విద్యుల్లేఖ) ప్రకాశిస్తూ ఉన్నది - దాని రంగు పీతవర్ణ. అంటే పసుపు రంగు. అది వడ్లగింజ మొనలాగా (నీవార శూకవత్) సూక్ష్మంగా ఉన్నది. అది అగ్నిజ్వాల యొక్క రూపం - రంగు - సైజు - ఆకారం.
(9) తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః ।
భావం:- ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన పసుపురంగు గల వడ్లగింజ మొన వంటి అగ్నిజ్వాల మధ్యన పరమాత్మ ఉన్నాడు.
ఎవరు ఆయన -
(10) స బ్రహ్మ స శ్శివః స హరిః స ఇంద్రః స అక్షరః పరమ స్వరాట్ -
భావం:- అతడే బ్రహ్మ - శివుడు - విష్ణువు - ఇంద్రుడు. అక్షరుడు - జ్ఞాన స్వరూపుడు - స్వయం ప్రకాశుడు - నీవు ఏ పేరుతో పిలిచినా పలికే ఒకే ఒక్క పరమాత్మ - పరంజ్యోతి - పరంధాముడు.
అంటే -
(i) మన దేహంలోనే - హృదయ కుహరానికి దగ్గరగా - తామర మొగ్గలాంటి పద్మకోశం దిగువ ముఖంగా ఉన్నది.
(ii) ఈ కోశంలో నుండి అనేక నాడులు - నరములు దేహంలోని అన్ని భాగాలకు వ్యాపించి ఉన్నాయి.
(iii) అందులో ఒక ముఖ్యనాడి మధ్యన రంధ్రం - ఖాళీ ప్రదేశం ఉంది.
(iv) అందులో అనేక ముఖాలు గల అగ్నిజ్వాలలతో పైకీ - క్రిందికీ - అడ్డంగా వ్యాపించి ఉన్నది. ఇదే వైశ్వానరాగ్ని -
(v) ఈ జ్వాలల మధ్య ఒక్కటి మాత్రం సూక్ష్మాతి సూక్ష్మమై మేఘాల మధ్య మెరుపుతీగలా ఊర్ధ్వ ముఖంగా - (పైకి) ప్రజ్వరిల్లుతున్నది.
(vi) ఆ జ్వాల పసుపు రంగులో వడ్లగింజ మొనలా ఉంది.
(vii) ఆ జ్వాల మధ్యలో పరమాత్మ ఉన్నాడు. అతడే శివుడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు ...
అంటే -
ఈ జడమైన దేహంలోనే పరమాత్మ ఉన్నాడు అని స్పష్టం.
మరి నేను జడమైన దేహాన్నా? చైతన్యరూప పరమాత్మనా?
దేహం కొన్నాళ్ళుండి పోయేది. పరమాత్మ శాశ్వతం. కనుక నేను పరమాత్మనే గాని - దేహాన్ని కాదు. కాకపొతే - దేహాన్ని ధరించిన పరమాత్మను అని తెలుసుకో - భావించుకో - అలా ఉండిపో.
కనుక -
(i) పరమాత్మ హృదయంలోనే అతి సమీపంగా ఉన్నాడని,
(ii) ఆయనను దర్శించటానికి, పూజించటానికి గుళ్ళూ గోపురాలు తిరగనక్కరలేదని,
(iii) ఆయనను తెలుసుకొనేదాకా విగ్రహాలను పెట్టుకొని కొంతకాలం పూజ చేయాలని,
(iv) అది కూడా ఏ కోరికా, ఫలాసక్తి లేకుండా నిష్కామంగా చేయాలని,
(v) దానివల్ల కలిగే శక్తితో నీలోనే - నీ హృదయంలోనే ఉన్న పరమాత్మను ఉపాసన చేయాలని; చివరకు నాలో ఉండటం కాదు; అసలు నేనే పరమాత్మను అని గ్రహించాలి.
ఇలా చేస్తేనే మన దుఃఖాలు పూర్తిగా తొలగిపోయేది. శాశ్వతమైన ఆనందం కలిగేది.
అయితే ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా, భగవంతుణ్ణి గుళ్ళూ గోపురాలలోను, గంగా, గోదావరి, కావేరి తీర్దాలలోను, తిరుపతి, శ్రీశైలం, కాశీ, రామేశ్వరం, గయ, ప్రయాగ మొ॥న పుణ్యక్షేత్రాలలోను మాత్రమే ఉన్నాడనుకొని అక్కడ పూజలు, అర్చనలు, అభిషేకాలు, కళ్యాణాలు చేయిస్తేనే స్వర్గంలో సీటు ఖాయమనుకుంటూ ఏవో పూజలనే తతంగాలు జరుపుకుంటూ అక్కడ అమ్మే ప్రసాదాలు కొనుక్కుంటూ పుణ్యం వచ్చేసిందని పొంగిపోతామే గాని, ఒక్కసారి ఈ భగవంతుని వాక్యాలను పట్టించుకోం. వాటి అర్ధాలు తెలుసుకోం. ఎవరన్నా చెప్పినా వినం. విన్నా నమ్మం. మన పాత అలవాట్ల ప్రకారం పది మందినీ పిలిచి ఘనంగా సేవలనూ, పూజలనూ జరిపించి, చివరకు మంత్రపుష్పాన్ని చదివిస్తాం.
దీనితో మనకేం అర్ధమవుతుందంటే పూజలు ముగుస్తున్నాయి అనే సిగ్నల్ వచ్చింది అనుకుంటూ -
తీర్ధ ప్రసాదాలు ఇచ్చే సమయం దగ్గరకొచ్చింది గనుక నిద్ర పోతున్న పిల్లలను, గోడవారగా ఆనుకొని కునుకుతీస్తున్న అమ్మమ్మలను, తాతయ్యలను మేలుకొలిపి, ఇస్తరాకులు ఎక్కడ ఇస్తున్నారో, ప్రసాదాలు ఎక్కడ పెడుతున్నారో సమాచారాన్ని సేకరించి తొందరగా ఇంటికి పోవాలనేదే వీరికర్ధమైన అంతరార్ధం.
ఒకవేళ ఆలస్యం చేస్తే ప్రసాదాలు అయిపోవచ్చు -
చివరి వాళ్ళకు కొద్ది కొద్దిగా రాల్పి పంపించవచ్చు కనుక ఉన్న శక్తినంతా కూడగట్టుకొని ఎలాగో బయటపడదాం అనుకుంటారు. అంతే తప్ప మనం పూజలు చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నామో, అసలు పూజ ఎలాంటి పవిత్ర భావంతో చెయ్యాలో, ఆ పూజలో వచ్చే మంత్రాల అర్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తే ఉండదు. మంత్రాలు వల్లించటమే తప్ప వాటి అర్ధం తెలుసుకోరు. తెలిసినవారున్నా చెప్పరు. చెప్పినా వినరు. దానికి కావాల్సిన సమయం ఉండదు ఎవరికీ -
ఆ(! ఎవరిక్కావాలండీ ఈ అర్ధాలు, పర్ధాలు,
తీర్ధ ప్రసాదాలు తీసుకుంటున్నాం గదా !
పుణ్యం వచ్చి ఒళ్ళో పడిపోతుందాయె ।
స్వర్గ ద్వారాలు తెరుచుకొని సీట్లు రిజర్వు అయిపోతుండె ! కనుక అర్ధం చేసుకోవటాలు, ఆచరణలు - ఈ గోలంతా ఎందుకు? అనుకుంటారు.
ఇదే విషయాన్ని సంక్షిప్తంగా భగవద్గీత చెబుతున్నది.
శ్లో ॥ అహం వైశ్వానరో భూత్వా .................
భావం :- నేను వైశ్వానర అగ్ని రూపంలో సమస్త ప్రాణుల యొక్క దేహాలను ఆశ్రయించుకొని; ప్రాణ అపాన వాయువులతో కూడి జీవులు తినే ఆహారాన్ని పచనం చేసి అనవసరమైన పిప్పిని మల మూత్రాల ద్వారా బయటకు నేట్టేస్తున్నాను అని. అంటే భగవంతుడు మన దేహంలోనే ఉన్నాడని తెలుసుకొని - అసలు నేనే భగవంతుడినని తెలుసుకొని సమస్త దుఃఖాల నుండి నివృత్తి చెంది శాశ్వత ఆనందాన్ని పొందాలి. జన్మ సార్ధకం చేసుకోవాలి. మోక్షాన్ని పొందాలి. -
ఇదే మనకున్న ఏకైక బాధ్యత –
.............................సమాప్తం .......................................


Swami Vivekananda's Wisdom for Daily Inspiration - May 21.

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 21.

Worldliness and realization of God cannot go together.

మానవజీవితం లక్ష్యం ఇంద్రియభోగం కాదు. జ్ఞాన సాధనమే జీవిత గమ్యం.

🕉🌞🌎🌙🌟🚩

SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...
LOVE & PURITY

Is there a greater strength than that of Brahmacharya - purity, my boy?

స్వామివివేకానంద-ధీరయువతకు...
ప్రేమ - పవిత్రత

నాయనా! బ్రహ్మచర్యం, పవిత్రతల కన్నా ఉన్నతమైన బలం ఏముంది?


🕉🌞🌎🌙🌟🚩

Swami Vivekananda's Wisdom for Daily Inspiration - May 23.

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 23.

This is the hardest period, but hold fast; in the end the gain is sure if you have patience.

అసహనంతో ఒరిగే ప్రయోజనమేమీ లేదు. ఓర్పు వహించండి. విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది.

🕉🌞🌎🌙🌟🚩

SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...
LOVE & PURITY

Out of purity and silence comes the word of power.

స్వామివివేకానంద-ధీరయువతకు...
ప్రేమ - పవిత్రత

పవిత్రత, నిశ్శబ్దతల నుండే అమోఘవాక్కు వెలువడుతుంది.

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment