Thursday, 30 July 2026

 





*రుద్రవీణ -16*

"నీకు నిద్ర వస్తున్నట్టుంది. అదుగో అక్కడ పడుకో” అంటూ చూపించాడు.

అలాగే చెయ్యి అడ్డం పెట్టుకుని నిద్రలోకి జారి పోయాడు విజయ్. అదీ- పావుగంటే. ఆ తర్వాత మెలకువ వచ్చేసింది.

గిరిప్రసాద్ కూర్చుని ఏవో గీతలు గీస్తున్నాడు కాగితంమీద.

"ఏం చేస్తున్నారండీ" అని అడిగాడు విజయ్ 

ఆశ్చర్యంగా.

“ఏంలేదు… నేను అస్సాం నుంచి వచ్చాను. ఎందుకో  తెలుసా! తంత్రశాస్త్రాన్ని కూలంకషంగా తెలుసుకోవాలని” అంటూ అగి పరిశీలనగా అతని ముఖం లోకి చూశాడు.

అతను ఆశించిన ఎఫెక్టు రానేవచ్చింది. అతని ముఖంలో సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి. తన నేత్రాలను మరింత విశాలం చేస్తూ అతని వంకే చూశాడు విజయ్.

"ఏం అలా చూస్తున్నావు?" అని అడిగాడు గిరిప్రసాద్.

"ఏంలేదు. అస్సాంనుంచి ఇక్కడికి రావడం దేనికి! అస్సాంకే కామరూప దేశం అని పేరు వుంది కూడా. అదే తంత్ర శాస్త్రానికి ప్రసిద్ధికదా- అందులో గౌహతిలోని కామాఖ్య దేవాలయం సుప్రసిద్ధం కదా!" అన్నాడు విజయ్.

గిరిప్రసాద్ సన్నగా మందహాసం చేశాడు.

“ఫర్వాలేదు కుర్రాడు లైన్ లోనే వున్నాడు" అనుకున్నాడు.

“నేనూ అదే అనుకునే అక్కడికి అంటే గౌహతి వెళ్ళాను. అక్కడ ది బ్రూఫర్ లో తాంత్రికాచార్య పండిత లోకనాధశాస్త్రి గారిని కలుసుకున్నాను.

ఆయన అన్నదేమిటంటే “నాయనా! తంత్ర శాస్త్రానికి నిలయాలు ఒక్క అస్సాంలోనే గాదు- నేపాల్, సిక్కిం, టిబెట్, పశ్చిమబెంగాల్, బీహార్ లో కూడా తంత్రశాస్త్రంలో నిష్ణాతులైన వారెందరో వున్నారు. నీకొక్క సలహా ఇస్తాను. నువ్వు ఎలాగైనా నేపాల్ చేరుకుని భూటాన్ లో వున్న 

తాంత్రికాచార్య పండిట్ దేవదత్త శాస్త్రిని కలుసుకో, ఆయన కాళ్ళమీద పడి ఆయన శుశ్రూష చెయ్యి- నీ మనోభీష్టం నెరవేరగలదు అంటూ ఆశీర్వదించి పంపారు" అంటూ ఆగాడు గిరిప్రసాద్. 

"అందుకని మీరిక్కడికి వచ్చారన్నమాట" అన్నాడు కుతూహలంగా విజయ్.

"అవును నేను వచ్చిన దరిద్రపు వేళ ఎటువంటిదో కాని ఆయనేదో వూరుపోయాడు. రాత్రికి వస్తాడని ఇందాక చెప్పారు వెళ్ళి కనుక్కుంటే. నేను ఇక్కడికి వచ్చి వారం రోజులయింది. ఈ వారం నుంచీ ఇదే తిండి తింటూ ఇలాగే పడివుంటూ కాపలా కాస్తున్నాను" అన్నాడు గిరిప్రసాద్ విచారంగా.

"నేపాల్ రావడానికి వీసా కావాలిగా!” సందేహంగా అడిగాడు విజయ్.

“కావద్దామరి - డార్జిలింగ్ లో నేపాల్ హైకమిషనర్ ని పట్టుకుని నేపాల్ లో ఏడాది వుండటానికి వీసా సంపాదించాను” అన్నాడు గర్వంగా గిరిప్రసాద్.

“పశుపతినాథ దేవాలయం ఖాట్మండ్ లో వుంది. ఆ దేవాలయం ప్రక్క 20 వ నె.బరు గల్లీలో వుంటున్నాడు పండిట్ దేవదత్తశాస్త్రి. అతన్ని మనం కలుసుకోవాలి. నువ్వూ నాతో వస్తావా?” అని అడిగాడు గిరిప్రసాద్.

"అ! తప్పకుండా వస్తాను" అన్నాడు ఉత్సాహంగా

విజయ్.

ఆ బట్టలు జాడించి "నా లుంగీ ఇస్తాను- కట్టుకుని ఆరేసుకో!?" అంటూ లుంగీ ఇచ్చి తను బయటకు వెళ్ళాడు గిరిప్రసాద్.

ఆ పనిలో పడిపోయాడు విజయ్.

"గిరిప్రసాద్ అంటే వీసా సంపాదించాడు! మరి తనకెలా వస్తుంది!" అనుకున్నాడు సాలోచనగా. తననెవరన్నా వీసా చూపించమంటే అని హడిలిపోయాడు.

నిముషాలు, గంటలు, రోజులు లాగా మార్తుంటే గిరిప్రసాద్ చెప్పిన ఆ రేపు రానే వచ్చింది. తెల్లవారగానే అన్నీ సర్దేసి అతన్ని తీసుకుని బయలుదేరాడు గిరిప్రసాద్. మొత్తంమీద 30 వ నెంబరు గల్లి పశుపతినాధ దేవాలయం దగ్గర వెతికి పట్టుకున్నాడు. 'పండిత దేవదత్తశాస్త్రి తాంత్రిక్' అన్న బోర్డు కూడా వుంది.

అక్కడే నిలబడి "స్వామి" అని పిలిచాడు గిరిప్రసాద్.

నలభై అయిదేళ్ళ దేవదత్తశాస్త్రి లోపల కాళికాదేవి పూజలో నిమగ్నమయి వున్నాడు. అతనికి “స్వామి” అన్న పిలుపు లీలగా వినిపించింది. పూజ ముగించి బయటకు వచ్చాడు దేవదత్తశాస్త్రి. ఆయన్ని చూస్తూనే కాళ్ళ మీద పడిపోయాడు గిరిప్రసాద్.

అలా పడిపోయినవాడు అలాగే వుండిపోయాడు. కళ్ళంబడి నీళ్ళు జలజలా రాలి దేవదత్తశాస్త్రి పాదాలను అభిషేకిస్తున్నాయి. శంఠం రుద్ధమౌతోంది.

"ఎవరు నాయనా నువ్వు! ఏమిటి నీ కోరిక?" అని అడిగాడు దేవదత్తశాస్త్రి.

"స్వామీ! మీరు నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి. అలా చేర్చుకుంటాన నేదాకా మీ పాదాలను 

వదిలేది లేదు" అన్నాడు గిరిప్రసాద్. 

విజయ్ మాత్రం నిలబడి ఈ తతంగమంతా చూస్తున్నాదంతే!

“నువ్వు ఎక్కడినుంచి వచ్చావు నాయనా?” అని అడిగాడు శాస్త్రి.

“ఎక్కడో ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లా నుంచి వచ్చాను" అన్నాడు గిరిప్రసాద్.

"ఏమాశించి ఈ తాంత్రిక శాస్త్రం నేర్చుకోవాలను కుంటున్నావు!" అని అడిగాను శాస్త్రి.

"డబ్బు! కూచుంటే డబ్బు- నుంచుంటే డబ్బు-ధన కనక వస్తువాహనాలతో అందరి కళ్ళూ కుట్టి పోయేలా ఈర్ష్యతో చచ్చేలా నేను వైభవోపేతమైన జీవితం గడపాలి. నేను ధనహీనుడిని కావడం చేత లోకంలో అందరిచేతా హేళన చేయబడుతూ ఇంతకాలం రోజులు నెట్టుకొచ్చాను. ఇకపై అలా దూషణ తిరస్కారాలను భరించే శక్తి లేదు. నాకు ఎంత కష్టపడినా రోజుకు పదిరూపాయలు కనబడటం కష్టంగా వుంది. జీవితం దుర్భరమయి పోయింది. ఏదో మిరకిల్ జరగాలి… నేను ధనవంతుడిని కావాలి. అందుకు శీఘ్రంగా సిద్ధించే ఈ తంత్రశాస్త్రమే నాకు మహా బాగు అనిపించింది" అంటూ దాచకుండా అంతా చెప్పేశాడు గిరిప్రసాద్.

"నాయనా ఈ తంత్రవాదుల్లో వామాచారమని, దక్షిణాచారమని రెండు రకాలున్నాయి" అన్నాడు దేవదత్త శాస్త్రి.

"అంటే ఏమిటి?" కుతూహలంగా అడిగాడు విజయ్.

“వెనక పాలసముద్రం మధించినప్పుడు సురాకలశంతో-ఎర్రని చీర, పచ్చని రవిక తొడిగిన పచ్చని కుందనపు బొమ్మ ఒక త్రిలోక మోహిని ఉదయించింది. శుక్రాచార్యుల ప్రభావంతో ఈ దేవతలను జయించి అసురులు ఆ సురను త్రాగారు. ఎవరైతే ఆనాడు ఆ సురాపానం చేశారో వాళ్ళంతా వామాచారులయ్యారు…

సురాపాన మత్తులైనవారు మళ్ళీ దేవతలతో కలిసి అమృత మధనం చేయగా ఈసారి లభించిన అమృతం విష్ణు మాయ వల్ల దేవతలకు దక్కింది. ఇది త్రాగినవారంతా దక్షిణాచారులయ్యారు.

దక్షిణాచారం చేసేవారు వామాచారంలోకి 

దిగకూడదు. వామాచారం చేసేవారు దక్షిణాచారం లోకి మారకూడదు. దక్షిణాచారంలో సిద్ధికి సమయం పడుతుంది. ముందుగా ఎవరు ఏది ఎన్నుకుంటారో వారదే పరిపూర్ణంగా ఉపాసించాలి.

*సశేషం*

*రుద్రవీణ -17*

వేదమంత్రం పరమైంది దక్షిణాచారం. అది మనమే ఎందుకు చేయాలి అనుకుని శీఘ్రముగా ఫలితమిచ్చే వామాచారంలోకి మారి సురాపానం తో మంత్రజపం చేయదల్చుకుంటే మిగిలేది బూడిదే… ఉభయభ్రష్టుత్వం.

అలాగే వేదవిద్యను వామాచార పద్ధతిలో సాధిద్దాం అనుకోవడం కూడా బుద్ధిహీనతే దానివల్ల ఏమీ మిగలదు. మీరేది నిర్ణయించు కుంటారు?” అని అడిగాడు దేవదత్తశాస్త్రి.

"ఆలస్యం అవనీ, ఈ జన్మంతా పట్టనీ, నేను దక్షిణాచారమే ఎన్నుకుంటాను” అన్నాడు విజయ్.

“మళ్ళీ జన్మ వుందో చచ్చిందో. వున్నా మానవుడిగా పుడతామో, ఏం చస్తామా - ఈ క్షణంలో ఒక ఏడాదిలో నాకు ఫలితం ఇచ్చే తంత్రశాస్త్రం కావాలి- అది ఏదో ఏ విధంగానో మీరే చెప్పాలి" అన్నాడు గిరిప్రసాద్.

ఒక్క క్షణం ఆ యిద్దరివంకా చూశాడు దేవదత్త

శాస్త్రి.

"నిన్ను నా శిష్యుడిగా చేర్చుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నా దగ్గర పదిహేనుమంది దాకా వున్నారు ఈ తంత్రశాస్త్రం నేర్చుకుంటున్న వారు, ఇది ఒక విధంగా గురుకులం లాంటిది. ఇక్కడే వుండాలి, ఇక్కడే భోంచేసి పడుకుంటూ చెప్పింది చెప్పినట్టు చేస్తూ వుండాలి అప్పుడు గాని ఏటూ ఫలితంరాదు" అన్నాడు దేవదత్తశాస్త్రి

ఆ మాటలు అమృత మధురంగా- అప్పటికప్పుడే టాటా, బిర్లాల వారసుడిలా డబ్బుతో మూలుగుతున్న వాడిలా పరమానందంతో వూగిపోయాడు గిరిప్రసాద్.

"ధన్యుడినైపోయాను. ఇక నేను కోటీశ్వరుడిని అయిపోయిన" అన్నాడు మళ్ళీ దేవదత్తశాస్త్రి కాళ్ళమీద పడిపోతూ.

"ఈనాడు నా పదిహేనుమంది శిష్యులలో నువ్వూ ఒకడిగా చేరిపోయావు. నాకు తెల్సినవన్నీ నీకు నేర్పుతాను” అంటూ లేవదీశాడు దేవదత్తశాస్త్రి.

“మరి ఇతని మాటా?” అని అడిగాడు.

"అతనికి చెప్పడం నావల్ల కాదు… కాని పెట్టక పోయినా పెట్టే యిల్లు చూపించమని సామెత. అతనికి ఒక అడ్రసిస్తాను. వెళ్ళమను. అతని అదృష్టం ఎలా వుంటే అలా జరుగుతుంది” అన్నాడు దేవదత్తశాస్త్రి.

అందుకు చాలా సంతోషించాడు విజయ్.

📖

నేను దేవదత్తశాస్త్రిగారి దగ్గర వుంటాను. నా నివాసస్థలం నీదిగా చేసుకో. నువ్వు ఆ అడ్రసు ప్రకారం వెళ్ళి కలుసుకుని అన్నీ సెటిల్ చేసుకునే వరకు పెద్ద పెద్ద స్థలాల్లో నువ్వు వుండలేవు. నీ దగ్గర డబ్బేది” అని అడిగాడు గిరి ప్రసాద్.

ఆ మాటకు తల పంకించాడు విజయ్.

అంతకంటే తనకి దారిలేదు. “తనిక్కడ ఏదో సాధించాలి, సాధించేవరకూ కదలకూడదు" అనుకున్నాడు దృఢ నిశ్చయానికి వస్తూ.

గిరిప్రసాద్ దేవదత్తశర్మ ఇంటికి వెళ్ళాడు.

విజయ్ ని కూడా త్వరగా గురువుని కలుసుకుని ఒక దారి ఏర్పరచుకోమని గట్టిగా హెచ్చరించి మరీ వెళ్ళాడు. తన చేతిలో పైసలేదు. ఈ వాచీ అమ్మివేస్తేగాని తనకి ఏదీ జరుగుబాటవదు. తిండికి మొహం వాచిపోయాను ముందు అని అనుకున్నాడు విజయ్.

అందుకు గిరిప్రసాద్ తగినవాడు. అతనికి చెబితే ఎక్కడో అక్కడ అమ్ముకువచ్చేవాడు. తనకి ఏదన్నా వస్తువు కొనడమేగాని అమ్మడం అనేది లేదింతవరకు. పైగా ప్రస్తుతం తనున్న పరిస్థితిలో ఆ వాచీ తీసుకుపోయి అమ్ముతే ఎవడో దొంగ వెధవ క్రింద భావిస్తారేగాని తనని సానుభూతిగా చూడరు ఎవరు. గిరిప్రసాద్ వెళ్ళిపోయినందుకు చాలా చింతించాడు విజయ్. వెళ్ళిపోయినందుకు విచారించేకంటే అక్కడికే వెళ్ళి అడిగితే సరిపోతుంది అనుకుంటూ తనని సమాధాన పరుచుకున్నాడు.

అలాగే వెళ్ళాడు కూడా. ఆయన కూర్చోమని సంజ్ఞ చేశాడు విజయ్ ని చూసి. అందర్నీ కూర్చోపెట్టుకుని ఏదో బోధిస్తున్నాడు దేవదత్తశాస్త్రి.

"ఈ తంత్రం అనేక విధాలు. ఇందులో డెబ్బయి రెండు రకాలున్నాయని పెద్దలు అంటారు. జనార్ణ వం, కులార్ణవం మొదలైనవి ఎన్నో వున్నాయి. అన్ని తంత్రాలు నేర్చినవానికి, జల స్థంభన, అగ్నిస్థంభన, వాయుస్థంభన, రససిద్ధి, పాదుకా సిద్ధి, పరకాయ ప్రవేశం, భేచరీగమనం. ఇవన్నీ కరతలామలకమవుతాయి. అనేక మంత్రాలు పఠించి తంత్రశాస్త్రంలో ఎవరైనా నిష్ణాతులు కావచ్చు-

విజయ్ వింటున్నాడు.

సిద్ధి, ఇష్ట కామ్యసిద్ధి పొందడానికి జగద్గురు శంకరాచార్యులవారే సౌందర్యలహరిలో అనేక మంత్రాలు, యంత్ర పూర్వక సాధనాలు నిక్షిప్తం చేసి మనకి అందించారు. దానికి ఏ శ్లోకం పఠిస్తే, నియమనిష్టలతో ఏది జపిస్తే ఏ విధమైన ఫలితం వుంటుందో చెప్పారు.

కాళికను ప్రసన్నురాలిని చేసుకోదలచినవారు ఇతర దేవతలను కూడా ఉపాసించవచ్చు.

మంత్రతంత్రాలకు సంతుష్ఠలై సాక్షాత్కరించి అభీష్ఠసిద్ధి చేసే దేవతలు అనేకమంది వున్నారు.

ప్రతి దేవతకూ మంత్రం వుంది. ప్రతి మంత్రం బీజాక్షర సంకలితం– మంత్రం గురుముఖంగా 

పొంది నిర్దిష్ట దినాల్లో ఉపదేశం జపించి సిద్ధి పొందవచ్చు” అంటూ ఆగాడు దేవదత్తశాస్త్రి. 

ప్రతిమంత్రం "ఓం తో ప్రారంభమై నమః" తో ముగుస్తుంది.

"ఓంకారమే ప్రణవం. అదే జగత్తుకు మూలం. ఈ విశ్వమంతటిని పాలించేది ఆ ఓంకారమే” అంటూ చెబుతున్నాడు.

విజయ్ కళ్ళముందు గొప్ప వెలుగుతో ఓం ప్రత్యక్ష మయింది. అంతకంటే వేయినాదాలతో ఓంకారం ప్రతిధ్వనిస్తూ అతని చెవులకు సోకింది. ఆపాదమస్తకం పులకించిపోయాడు. వళ్ళంతా ఏదో విద్యుతరంగాలు ప్రసరించినట్లయింది. అతని తన్మయావస్త గ్రహించాడు దేవదత్తశాస్త్రి.

"చూడుబాబు… ఇదుగో అడ్రసు. ఈ అడ్రసు తీసు కుని నువ్వు టిబెట్ వెళ్ళి- ఇదుగో నేను ఇస్తున్న పరిచయ లేఖ" అంటూ అందించాడు కవర్లో పెట్టి విజయ్ కి దేవదత్తశాస్త్రి.

"నిన్న మీరు ఒక అడ్రసిచ్చారు గదూ!" సందేహం గా అడిగాడు విజయ్.

"అవును ఇచ్చాను- కాని అతను దేశాంతరం పోయాడట. నాలుగైదు నెలల వరకూ రాడట. 

అయినా ఇప్పుడు నేనిచ్చిన అడ్రసుకు వెడితే ఈయన నేర్పేవి, ఆయన నేర్పేవి కూడా ఆయనే చెప్పగలడు" అన్నాడు విజయ్ కేసి అభిమానంగా చూస్తూ దేవదత్తశాస్త్రి.

"ఒకసారి గిరిప్రసాద్ ని బయటకి పంపిస్తారా" అని అడిగాడు విజయ్.

"ఆ! వెళ్ళవచ్చు” అన్నాడు అతని కేసి తిరిగి.

గిరిప్రసాద్ బయటకి వచ్చాడు.

“చూడు ఫ్రెండ్! నాకు ఈ వాచీ అమ్మిపెట్టాలి. ఇది నీవల్ల తప్ప మరెవరివల్లా కాదు" అన్నాడు విజయ్ వాచీ తీసి అందిస్తూ.

“ఈ వాచీ అమ్మితే ఎంత వస్తుందని నీ అంచనా! ఇప్పటికిప్పుడు ఎవరు కొంటారు?” అడిగాడు గిరి ప్రసాద్.

ఆ సంభాషణంతా విన్న దేవదత్తశాస్త్రి "చూడు బాబు, దీనికి గిరిప్రసాద్ రానవసరంలేదు. అలా తూర్పుగా పోయి దక్షిణానికి తిరుగు చక్కని మెయిన్ రోడ్డు వస్తుంది, ఆ రోడ్డులో నాలుగవ మేడలో వాచీ షాపుంది అక్కడికి వెళ్ళి తాంత్రికా చార్య పండిత దేవదత్తశాస్త్రి ఈ వాచీకి తగిన విలువకట్టి డబ్బు ఇవ్వమన్నారని చెప్పు ఇస్తాడు. ఆ డబ్బుతో నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా టిబెట్ వైపుకి పో- నీ కోరిక ఫలిస్తుంది” అని చెప్పాడు దేవదత్తశాస్త్రి.

ఆయనకి నమస్కరించి వచ్చేశాడు విజయ్.

*సశేషం*

*రుద్రవీణ -18*

ఇప్పుడు విజయ్ మనసులో ఇతరుల నుదుటి వ్రాత ఎలా వున్నది పరిశీలించడంకంటే ముందు తన నుదుటి రాత ఎలా వున్నదీ చూసుకోవాలన్న తపన ఎక్కువయింది. ఆ చెంబుమీద, ఆ రాగి రేకులమీద వున్న భాష తను సంపూర్ణంగా నేర్చుకుని ఆ రాగి రేకుల మంత్రం తనే జపించి నారదుడు బ్రహ్మలోకం పోయి తండ్రిని నిలవేసి అడిగినట్టు తనా శంకరుడిని బొందితో కైలాసం చేరి నాలుగూ అడిగేస్తే సరి అనుకున్నాడు హుషారుగా.

దేవదత్తశాస్త్రి చెప్పినట్టే ఆ వాచీల షాపుని తేలిగ్గానే కనుక్కున్నాడు విజయ్. అక్కడికి వెళ్ళి నిర్భయంగా దేవదత్తశాస్త్రి చెప్పమన్నదే చెప్పాడు.

ఆ పేరు వింటూనే షాపువాడు కుర్చీలోంచి లేచి వాచీ అందుకుని అన్నీ సరిగానే వున్నాయని గ్రహించి డ్రాయరు సొరుగులాగి రెండువందలు చేతిలో పెట్టాడు. పైన ఒక రూపాయి అడిగి తీసుకున్నాడు విజయ్. అవి అందుకుని తిన్నగా టిబెట్ కి ప్రయాణమైనాడు.

వెడుతూ రెండు ఇన్ లాండ్ కవర్లుకొని ఒకటి పశ్యంతికి, మరొకటి విశ్వప్రసాద్ కి లెటర్సు రాద్దామని జేబులో పెట్టుకున్నాడు విజయ్.

అతను పోస్టాఫీసు నుంచి ఇన్లాండ్ కవర్లు కొనుక్కుని వస్తుంటే ఎదురుగా బార్ లో కూర్చుని డ్రింక్ సేవిస్తున్న విలియం స్పష్టంగా చూశాడు.

అప్పటికప్పుడు ఫోన్ అందుకున్నాడు. అబ్రహంకి డయల్ చేశాడు.

"డియర్ ఫ్రెడ్ అబ్రహం. పోస్టాఫీసులో లెటర్సు కొంటూ విజయ్ గాడు కనిపించాడు.”

"అతని సంగతి నేను చూసుకుంటాను- నువ్వు బెనారస్ వెళ్ళే ప్రయత్నం చెయ్యి.”

“చేయడానికి మనమీద పోలీసులు నిఘా వేశారుగా బెనారస్ లో- అంచేత అతి పకడ్బందీ గా చిన్న కారులో ఏ హోటల్లో ఎక్కడా దిగకుండా వుండేలా చూసుకుంటూ వెళ్ళాలి- అందుకే ఆగిపోయాను, కాస్త సద్దుమణిగాక వెడతానులే.”

“విజయ్ గాడు కనిపించాడంటే వాడు బతికే వున్నాడన్నమాట. ఏమయినా ఒక కన్ను అతనిమీద వేసివుంచు” అన్నాడు అవతల్నించి అబ్రహం.

"ఆ! అతన్నించి ఆ రాగి చెంబు విషయం దాకా అతన్ని వదలను” అంటూ తేల్చుకునే భరోసా ఇచ్చాడు విలియమ్.

అతన్ని గాని, అతను ఫోనుచేయడాన్ని గాని గమనించనేలేదు విజయ్. తనదారిన తను టిబెట్ వెళ్ళాలన్న ఉత్సుకతతో వున్నాడు.

"తన సూట్ కేస్ రాగి రేకులు- భద్రంగా ఇంటికి చేర్చి వుంటారు మిత్రులు” అని అతను అనుకున్నాడు. సరే చెంబు ఉజ్వల దగ్గర భద్రంగా వుంటుంది. ఉజ్వల హైద్రాబాద్ వెళ్ళిపోయినా తను బెనారస్ లో విశ్వప్రసాద్ ని కలుసుకుంటే ఆమె అడ్రసు తెలియకపోదు. ఆమె దగ్గర వున్నవి భద్రంగా వుంటాయని తనకి నమ్మకం వుంది.

తన దగ్గర ఏంలేవు. కట్టుగుడ్డలు తప్ప. ఇంక తనకి బెంగేముంది. దొంగచాటుగా లాగారుగాని, ఎదుటపడితే విలియమ్ అబ్రహులతో ముష్టి ఘాతానికి దిగేవాడే తను అనుకున్నాడు విజయ్ మంటగా.

📖

హిమాలయపర్వత కనుమలగుండా కంచర గాడిదనెక్కి కొంతదూరం, డోలీలో కొంతదూరం పయనించి టిబెట్ ప్రధాన నగరం లాసా కి చేరుకున్నాడు విజయ్.

సూర్యరశ్మికి ఆ ప్రాంతం – ప్రకృతి అంతా శోభాయమానమై తేజరిల్లుతోంది. సూర్యశాంతిలో పరిసర పర్వత ప్రాంతం మనోహరంగా కనిపించింది. మలయమారుతం వీచి పూలు రాలి పడుతున్నాయి. గగనవీధిలో పక్షుల కిలకిలా రవాలతో అతనికి స్వాగతం పలుకుతున్నట్టు వుంది.

లాసాలో బౌద్ధారామాలు, విహారాలు దూరానికే కనువిందు చేశాయి అతనికి. భౌగోళికంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈ టిబెట్'ని టాప్ ఆఫ్ ది వరల్డ్ గా చెప్పుకుంటారు.

అక్కడ తనకి కావలసిన వ్యక్తి కోసం ఎంక్వయిరీ చేశాడు… దోడ్యూంగ్ లామా నివాసానికి అతను చేరేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలు అయింది.

అక్కడ ఏటవాలుగా కట్టిన అందమైన చిన్న ఆశ్రమం లాంటిది ఏర్పరచుకుని కొండమీద నివసిస్తున్నాడు దోడ్యూంగ్ లామా.

లాసాలో అతి ముఖ్యమైంది పొటాలో- దూరానికే దర్శనమిచ్చే ఈ కొండమీది రాజభవనం దలైలామా నివాస స్థలం. (అవన్నీ కమ్యూనిష్టు చైనా ఆక్రమించేసిందనుకోండి)

ఆయన్ని చూసి నమస్కరించి దేవదత్తశాస్త్రి ఇచ్చిన లేఖ అందించాడు. అది పూర్తిగా ప్రాకృత భాషలో వుంది.

తను నేర్చిన భాషలు- తన విజ్ఞానం అంతా కలిపితే సముద్రంలో నీటిబిందువు లాంటివి. తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినవి అనంతమైనవి. ఎంత నేర్చినా ఇంకా నేర్వవల సింది ఎంతో వుంటుంది. తనకి ఇంగ్లీషు కాస్త హిందీ తప్ప వేరే ఏ భాషా రానందుకు సిగ్గుపడిపోయాడు.

తెలుగు మాతృభాష. కనీసం పొరుగు రాష్ట్రమైన తమిళం కూడా నేర్చుకోలేదు. ఇకనైనా ఈ ప్రాకృత భాష- పాళీ భాష నేర్చుకుంటేగాని ఇక్కడ బౌద్ధతంత్ర రహస్యాలు ఏం నేర్చుకోలేనని గ్రహించాడు.

ఆ ఉత్తరం చదివి అతను ఆదరంగా ఆహ్వానించాడు…

“ముందు స్నానం చేసి భోజనం చేసి కాసేపు విశ్రమించండి. తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం” అన్నాడు దోడ్యూంగ్ లామా.

ఆ మాటకు తల పంకించాడు విజయ్. అతను చెప్పినటే విశ్రాంతి తీసుకున్నాడు భోజనం చేసి..

📖

"అబ్రహం! విజయ్ హిమాలయాలు దాటి వెళ్ళాడు. నేను కూడా అతన్ని వెంబడించనా!" అని అడిగాడు ఫోనులో మరో నాలుగురోజుల తర్వాత విలియమ్.

"అతను హిమాలయాలు దాటి ఎక్కడికి 

పోయాడంటావు?”

"టిబెట్… తను టిబెట్ వెడుతున్నానని బెనారస్ హిందూ యూనివర్సిటీలో లీడర్ గా పనిచేస్తున్న విశ్వ ప్రసాద్ కి రాశాడు.

"ఆ లెటరు నేను పట్టుకున్నాను. విప్పి చదివాను. ఇంకో లెటరు వాళ్ళ భాషలో రాశాడు అది నేను చింపేశాను. మనకి ఆ భాష తెలియదుగా అందులో ఏం రాశాడో?”

"వండ్రఫుల్! వాడు టిబెట్ వెళ్ళాడంటే అది మామూలు విషయం కాదు, ఆ రాగి చెంబు విషయాలు తెలుసుకునే వెళ్ళివుంటాడు” అన్నాడు అబ్రహాం.

"చెంబు విషయం, రాగి రేకుల విషయం అందులో ఏంలేదు. కాకపోతే మనిద్దరి విషయం రాశాడు. సారనాథ్ లో కొట్టి తీసుకుపోయి ఖాట్మండు పొలిమేరల్లో పడేశామని.”

"బాగు బాగు ఎలా పట్టుకున్నావా లెటర్స్ ని?”

“పోస్టు తీసేవాడిలా నటించి ఆ రెండూ అందు కున్నాను.”

"అతడు నిన్ను గమనించలేదా?”

"గమనించకుండా వేషం మార్చాను.”

"వెరీగుడ్… నువ్వు చైనీస్ ఎంబసీతో మాట్లాడి లాసాలో అతన్ని పట్టుకునేందుకు ఏం అవకాశా లుంటే అవన్నీ ఉపయోగించుకో. అతన్ని బంధించి వుంచుతే మనం ఏదో రకంగా అతన్ని కలుసుకోవచ్చు,”

ఆ మాటకు తల పంకించాడు విలియమ్.

“నువ్వీలోగా విశ్వప్రసాద్ ఇంట్లో సోదా చేస్తే మంచిది- ఒకవేళ అక్కడ దాచి వుంచాడేమో...” అన్నాడు విలియమ్.

"నేను వెడతాను బెనారస్ రేపోమాపో..." అంటూ ఫోను పెట్టేశాడు అబ్రహాం.

విలియమ్ ఒక్క క్షణం ఆలోచనలోపడ్డాడు.

"విజయ్ కి టిబెట్ వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అవన్నీ చదివి తెలుసుకున్నాడా? సరే! ఏదయితే నేం.ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అతన్ని పట్టుకుని ఈసారి వదిలి పెట్టకూడదు. అవి ఎక్కడున్నా సంపాదిస్తే అతన్ని ఒక్క షాట్ తో పేల్చి పారేయచ్చు” అనుకుంటూ ఆ పని మీద లేచాడు.

📖

గిరిప్రసాద్ దేవదత్తశాస్త్రి దగ్గరే వుండిపోయాడు. “ఈరోజు రాత్రికి చక్రపూజ" అన్నారు శిష్యులు.

"ఆ చక్రపూజ ఎలా వుంటుందో!" అని అనుకున్నాడు గిరిప్రసాద్ కుతూహలంగా.

ఆ పూజ శాస్త్రి ఇంట్లో కాక ఖాట్మండ్ లో అష్టయి శ్వర్యవంతుడని పేరుపొందిన ప్రతాప్ తేజ్ రాణా మేడలో జరుగుతుందని, రమ్మని ఆహ్వానించారు మిగిలిన శిష్యులు.

గిరిప్రసాద్ వారి వెనుకే బయలుదేరాడు.

*సశేషం*

*రుద్రవీణ -19*

పూజామందిరం శుభ్రంగా అలకబడింది. ముగ్గుల తో చక్రం వేశారు. ముగ్గుల మధ్య వేదికను అమర్చారు.

సరిగ్గా తొమ్మిది గంటలకు కాళీ పూజ మొదలు  పెట్టాడు దేవదత్తశాస్త్రి. రాణా, అతని భార్య పీతాంబరాలు ధరించి వచ్చి కూర్చున్నారు. శాస్త్రి ప్రార్ధనా శ్లోకం చదివాడు. శిష్యులంతా పద్మాసనం వేసుకుని కూర్చుని —

ఓం కాళీ-ఓం బాల- ఓం భగవతి- ఓం భగళ అంటూ శాస్త్రి, ఏ మంత్రాలు చదువుతున్నాడో అవే వల్లించసాగారు.

పదిహేను సంవత్సరాల వయస్సుగల అందమైన కన్య వచ్చి వేదికనెక్కింది. శాస్త్రి మంత్రాలు చదువుతు పూలున్న పళ్ళెం అందుకుని వేదిక మీద నిలబడిన ఆ యువతిమీద వేయసాగాడు పూవులు. ఆ పూజ అవగానే ఆమె నృత్యం చేయడం ప్రారంభించింది. ఆమె నడుము చుట్టూ చిన్న గంటలు కట్టారు. ఆ యువతులందరికీ అదే అలంకరణ. అంతా నృత్యం చేస్తుంటే లయ బద్ధంగా మోగుతున్నాయి గంటలు.

"ఇదేం పూజ?" అని అడిగాను గిరిప్రసాద్ ఆశ్చర్యంగా.

"చక్రపూజలో ప్రాధాన్యత వహించే మర్మావయవాల పూజ" అంటూ రహస్యంగా చెప్పాడు ఆ శిష్యుడు.

ఆ వేడుకంతా చూస్తునే వున్నాడు గిరిప్రసాద్.

“ఇవన్నీ తను చేయాలా?” అనుకుంటూ హడిలి పోయాడు గిరిప్రసాద్.

“ఆఖరికి ఈ విధంగా డబ్బు సంపాదించడం కూడా కష్టమే!" అనిపించింది అతనికి. అయినా దిగాక లోతుని గురించి ఆలోచించడం అనవసరం తను ఏ విధంగా ఎలా సంపాదించాలనుకున్నాడో అలాగే సంపాదించాలి. ఇక దానికి తిరుగులేదు.

పూజలు ముగిశాయి. రాణా దంపతులు విడిగా కుర్చీల్లో ఆసీనులయ్యారు. అంతా అక్కడే పరివేష్టించారు…

రాణా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు దేవదత్తశాస్త్రి.

"సామాన్యంగా వామాచారం నిషిద్ధం. ఎవరో శక్ష పూనినవాళ్ళు, శత్రుమరణాన్ని కాంక్షించేవారు అలాంటివి తలపెడతారు. చేతబడి వగైరాలీ కోవలోకి వస్తాయి. వీరి నివాసం స్మశానం. మద్యం, మాంసం పుర్రెలలో నైవేద్యం పెడతారు. అదే తింటారు. స్త్రీల మృతదేహాలతో సంభో గిస్తారు. అవన్నీ చేస్తే కొన్ని పైశాచిక శక్తులు అలవడుతూ వుంటాయి” అంటూ చెప్పుకుపో సాగాడు దేవదత్తశాస్త్రి.

"దేనికైనా కాళీ దయ వుండాలి. నరబలి, శిశుబలి ఇవ్వడానికి కూడా వెనుకాడకూడదు" అన్నాడు చివరగా.

గిరిప్రసాద్ కి వళ్ళు జలదరించింది.

"డబ్బు దస్కం లేకపోతే పీడాపోయింది ఇంటికి తిరిగిపోదాం" అని అనుకున్నాడు కూడా. అయినా ఎందుకో వెనక్కి తిరగలేకపోయాడు.

"కానీ మనం ఏది నేర్చుకున్నా దుర్వినియోగం చేస్తే గదా భయం? నేను ఎవరూ చావాలని కోరుకోను. ఎవరికీ చేతబడిలాంటివి చేయను, మంచికే వినియోగిస్తాను” అనుకున్నాడు మనసులో.

“నాకున్నది ధనకాంక్ష, వ్యాపారాలు చేయడానికి డబ్బులేదు, ఏ ధర్మాత్ముడూ అప్పివ్వడు, ఏ బ్యాంకీ వారు తన మొర ఆలకించలేదు. అడిగేవాడు ఇచ్చేవాడికి లోకువ అని ప్రతిదానికీ సెక్యురిటీలుండాలి. అదేదో సామెత అదే వుంటే ఇంత దూరం దేనికి రావడం!"

దేవదత్తశాస్త్రికి శుశ్రూష చేస్తూ అక్కడే వుండి పోయాడు గిరిప్రసాద్. అతను చెప్పేదంతా చేస్తూ, నేర్చుకుంటూ, తంత్ర శాస్త్రంలోని మెళకువలు, పద్ధతులు అన్నీ కూలంకషంగా నేర్చుకోసాగాడు.

అతనికి అప్పుడప్పుడూ విజయ్ గుర్తువచ్చినా “ఎక్కడో ఏదో నేర్చుకుంటున్నాడులే పాపం" అని అనుకునేవాడు.

అతని గత చరిత్రగాని, అతని విషయంగాని ఏమీ అడిగి తెలుసుకోలేదు గిరిప్రసాద్. అందుకే విజయ్ ని వెంటాడే అబ్రహం కాని విలియమ్ కాని అతనికి తెలియలేదు.

విలియమ్ చైనీస్ ఎంబసీకి వెళ్ళి లాసాలో వున్న విజయ్ పోలికలు వర్ణించి, ఆ వ్యక్తి గూఢచారి కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాడని చెప్పాడు.

📖

దోండ్యూగ్ లామా దగ్గర శిష్యత్వం ప్రారంభించిన విజయ్ మరోలా మా దగ్గర పాక్రతం, పాళీభాషలు నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ లామాను దొండ్యూగ్ లామాయే కుదిర్చిపెట్టాడు. తను చిన్న చిన్న విషయాలు చెబుతున్నాడు.

తంత్రశాస్త్రం అతను నేర్చుకోబోయే ముందు విజయ్ ని ఆ లామాలిద్దరూ శ్మశానవాటికకు తీసుకుపోయారు. అక్కడ సమాధుల మధ్య వున్న తిన్నె మీద పడుకోమని కొన్ని మంత్రాలు చదివారు. విజయ్ కి వెంటనే నిద్ర ముంచుకు వచ్చింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.

అర్ధరాత్రి ఏవో శబ్దాలు, పిశాచాల నృత్యాలు, ఇవన్నీ అతని చుట్టూ వున్నట్టు గమనించాడు. అలాగే మూడు రోజులు గడిపాడు. నాలుగవ రోజున దోడ్యూంగ్ తన మిత్రుడైన లామాతో కలిసి ఆ శ్మశానానికి వచ్చాడు విజయ్ ని లేపాడు.

“సెభాష్! నువ్వు నిజంగానే ధైర్యవంతుడివి.

మాకు ఆ విషయం ఋజువు అయింది. అందుకోసమే నిన్ను మూడు రోజులు ఈ సమాధుల మధ్య వుంచాము. మరో ప్రయోగం రేపు చేస్తాం" అన్నాడు దోడ్యూంగ్ లామా.

విజయ్ మెల్లగా వారి వెనుకే వచ్చాడు.

ఆ మర్నాడు మళ్ళీ ఇద్దరూ వచ్చారు. ఒక ఇంట్లో చీకటి గదిలో వుంచారు. ఒక వెండి వూచ తెచ్చారు. దాని కొన సూదిలా వుంది. ఆ ఊచకు ఏదో పసరు పూశారు. ఆ వూచను రెండు కనుల మధ్య గట్టిగా పొడిచారు. అది సరాసరి పుర్రెలోకి దిగింది. విజయ్ బాధగా అరిచాడు.

ఏదో మందు రాసారు- “వూచను అలా వుంచి 

పదిహేను రోజులు ఇదే గదిలో వుండాలి- నీకు కావలసిన సదుపాయాలన్నీ మేము చేస్తుంటాము.” అన్నారు.

"ఇక్కడ నీకు ఒక నౌకరుని పెడతాము- ఏది కావా లంటే అదే అమర్చి పెడతాడు" అంటూ చెప్పారు.

సరేనన్నాడు విజయ్.

ఈ విధంగా చీకటి గదిలో బందీ అవడం ఒకవిధంగా అదృష్టం అతనిది.

లాసాలోని చైనీస్ కార్యాలయానికి విజయ్ రూపు రేఖలు వర్ణిస్తూ అలాంటి వ్యక్తి కనిపిస్తే తక్షణం పట్టుకోమన్న వార్తలు అందినాయి.

“మనిషి ఇండియన్. భాష తెలుగు. ఇంగ్లీషు 

ధారాళంగా మాట్లాడుతాడు” అంటూ మరోకొద్ది వివరాలు కూడా అందించారు. ఆ ప్రయత్నంమీద పడ్డారు అక్కడి గూఢచారులు.

అవేమీ తెలియని విజయ్ మటుకు చీకటి గదిలో అలాగే వుండిపోయాడు పదిహేను రోజులు.

📖

“ఈ ప్రపంచానికి మూలమైన శక్తి ఒకటి వుంది. ఆ శక్తిని తెలుసుకుంటేనే సృష్టి రహస్యం తెలుస్తుంది. మన సందేహాలు బంధనాలు పటాపంచలవుతా యి. ఆ పరాత్పర మూర్తిని దర్శిస్తే హృదయపు ముడి విడిపోతుంది - సర్వ సందేహాలు నివృత్తి అవుతాయి. సర్వకర్మలు క్షయమైపోతాయి. ఇది ముండకోపనిషత్తు చెబుతుంది.

అలాంటి శక్తిని తెలుసుకోవాలంటే మనస్సుతోనే 

సాధ్యపడుతుంది…ఆ మనసు దేనికీ లొంగక తనకు తానుగా వుండి అఖండ జ్యోతిలా వెలుగుతూ కార్యాలు నిర్వహించే మార్గం కావాలి. అదే యోగం.

సాధ్యమయినంత త్వరగా కైవల్యం సాధించి ముక్తి పొందాలనుకునేవారు దేహాన్ని, మనస్సుని శ్రమపెట్టి లొంగదీసుకుంటారు- దీనికి హఠయోగం అని పేరు.

ఈ హఠయోగంతో కడుపు క్రింద మూలాధారంలో నిద్రించే కుండలిని శక్తి పైకి లేస్తుంది. అది సుషుమ్న అనే నాడి మూలంగా దేహఁలోని మూలాధారం మొదలు, బ్రహ్మరంధ్రం వరకు గల షట్చక్రాలను క్రమంగా ఛేదించి చివరదైన సహస్రాల చక్రం చేరగా అక్కడ బ్రహ్మ సాక్షాత్కారం కలిగి అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది.

ఇదే రాజయోగం. సాధారణంగా సాధన చేసేవారు హఠయోగ ఫలసిద్ధులగు ఆకాశ సంచార, కామరూప, పరకాయ ప్రవేశాలను ఆకాంక్షించి ఆ సమాధిని వదులుకుంటారు.”

పదిహేను రోజులకు ఆ లామాలిద్దరూ తిరిగి

వచ్చారు. ఆ వెండి వూచను తీసేసారు. అది అతని త్రినేత్రం. అప్పుడు మెల్లమెల్లగా విజయ్ తన మూడవకన్ను తెరిచాడు.

🏺

*సశేషం*

*రుద్రవీణ -20*

అప్పుడు మెల్లమెల్లగా విజయ్ తన మూడవకన్ను తెరిచాడు.

ఎదురుగా టిబెటియన్ ప్రజలు అగ్నిజ్వాలల మధ్య దహించుకుపోతున్నట్టు కనిపించి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు విజయ్.

అదే పైకి అన్నాడు కూడా-

అతని మాట విని ఒకరి ముఖాలు ఒకరు చూసు కున్నారు ఆ యిద్దగు లామాలు.

"శభాష్ - ఇప్పుడు నువ్వు కుండలిలోని ఆరవ చక్రం తెరిచావు. కన్నుమూసుకో, కుండలిని సర్పాకారంలో వెన్నెముక పొడవునా వుంటుంది. ఇప్పుడు నీకు దివ్యదృష్టి లభించింది, అది సూక్ష్మ నేత్రమన్నమాట. ఏ వస్తువు ఎక్కడ వున్నా నీకు కనిపిస్తుంది- మళ్ళీ అయిదు రోజులు ఇలాగే వుండు" అన్నాడు లామా.

“అవును. అయిదురోజులిలాగే వుంటే అప్పుడు నువ్వు బయటకు రావచ్చు" అన్నాడు దోడ్యూఁగ్ లామా.

మళ్ళీ మందు రాశారు. నౌకరుకి టిబెటన్ భాషలో ఏదో చెప్పారు.  అంతా కలిసి వెళ్ళిపోయారు.

వాళ్ళు చెప్పినట్టే ఐదు రోజులకి వచ్చారు.

"మిస్టర్ విజయ్! ఇప్పుడు నువ్విక బయటకి రావచ్చు. కాని ఒక్క విషయం మరిచిపోకు. నీకు అలవడిన ఈ మూడవ కన్ను సంగతి, దివ్యదృష్టి దుర్వినియోగం చేయకు. ఇంక నీకేం కావాలి?” అని అడిగాడు దోడ్యూంగ్ లామా.

విజయ్ నవ్వాడు.

ఆ తర్వాత- “మహాతాంత్రికుడు భేట్సేరిపోను పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన దగ్గర భేచరీ విద్యను, ప్రకృతిని అదుపు లో పెట్టగల శక్తిని సంపాదించుకోవాలని అనుకుంటున్నాను" అన్నాడు విజయ్.

దోడ్యూంగ్ లామా అలాగేనన్నట్టు తల వూపాడు.

పదివేల అడుగుల ఎత్తున ఒక కొండపైన విహారం నిర్మించుకుని అందులో వుంటున్నాడు భేట్సేరిపో.
అతని దగ్గరకి తీసుకువెళ్ళి విజయ్ ని పరిచయం చేసి వచ్చిన పని తెలియచేశాడు.

భేట్సేరిపోకి 90 ఏళ్ళు. అయినా 50 ఏళ్ళవాడిలా దృఢంగా వున్నాడు. అందరికీ టీ ఇచ్చాడు.

“నువ్వు నా దగ్గర పదిహేను రోజులు వుంటే ఆ మంత్రం చెప్పడం - ఎలా చేయాలో వగైరాలన్నీ క్షుణ్ణంగా నేర్పుతాను, ఆ తర్వాత నువ్వు దాన్ననుసరించి సిద్ధి పొందవచ్చు” అన్నాడు భేట్సేరిపో.

అందుకు అంగీకరించాడు విజయ్. అతనికి కావలసింది సాధించేవరకు ఎక్కడ ఎన్నాళ్ళు వుండమన్నా వుంటాడు ఏం చేయమన్నా చేస్తాడు.
📖

లాసాలో పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతివారినీ ఎంక్వయిరీ చేస్తున్నారు. వాళ్ళకి విజయ్ పోలికలు గల వ్యక్తి అంతవరకూ తారసపడలేదు. అతను గదిలో బంధింపబడి ఇరవై రోజుల దాకా బయటకే రాలేదు.

అదే విషయం ఫోను చేశారు ఖాట్మండుకు. విలియమ్ అది విని "అతను బహుశ ఏ లామా దగ్గరయినా వున్నాడేమో, లామా లనందర్నీ పిలిపించి ఎంక్వయిరీ చేయండి” అన్నాడు.

అబ్రహం మళ్ళీ బెనారస్ వెళ్ళాడు. విశ్వప్రసాద్ ఇంట్లోకి రహస్యంగా చొరబడే మార్గాలను గురించి క్షుణ్ణంగా పరిశీలించసాగాడు.

"ఎలాగైనాసరే! ఈ రాత్రికి ఈ యింట్లో ప్రతి గది, ప్రతి చోటా వెతకాలి. వెతికితీరాలి” అన్న నిర్ణయానికి వచ్చాడు.
📖

విహారయాత్రలకంటూ వెళ్ళిన భర్త నెలదాటి రెండు నెలలు కావస్తున్నా ఇంకా రాలేదేమిటా అనుకుంది పశ్యంతి.

రెండు నెలలు కూడా పూర్తికావస్తుంటే "ఆయన గారు ఇంటి దగ్గర ఒక్కరే వచ్చి వుంటున్నారేమో కాలేజీకి శెలవు లేదని, నేను వెడతాను” అంది పశ్యంతి.

తాళాలన్నీ యధాప్రకారం వున్నాయి ఆమె ఇంటికి వచ్చేసరికి. “ఏమిటీ ఆయన అప్పటినుంచి ఇంటికి రాలేదా?” అని అనుకుంది.

“మీకోసం వాళ్ళ కాలేజీవాళ్ళు రెండు మూడుసార్లు వచ్చారు” అంటూ చెప్పారు పక్కవాళ్ళు.

ఆ మాటకు ఆశ్చర్యపడింది పశ్యంతి.

"తనకోసం వాళ్ళెందుకు రావాలి? ఏమయ్యారీ యన అంతూపంతు లేకుండా" అనుకుంటూ మళ్ళీ పుట్టింటికి లెటరు రాసింది. వెంటనే తమ్ముడ్ని పంపమని. ఆమె ఉత్తరం అందగానే వచ్చాడు పశ్యంతి తమ్ముడు ప్రసేన్.

“మీ బావగారి కాలేజీకి వెళ్ళి కనుక్కోరా ఆయన
కాలేజీ వాళ్ళు ఎందుకో రెండు మూడుసార్లు వచ్చారట” అని అంది పశ్యంతి.

వెంటనే కాలేజీకి వెళ్ళాడు ప్రసేన్. అతనికి ముందు అరుణ్ కుమారే కనిపించాడు.

“నేను విజయ్ గారి బావమరిదిని సార్. మా అక్కయ్య మొన్ననే ఇక్కడికి వచ్చారు. మీరు రెండు మూడుసార్లు వచ్చారట. ఏమిటో విషయం కనుక్కుందామని వచ్చాను. మా బావగారు అట్నించి ఏదన్నా వూరు వెళ్ళారా?" అని అడిగాడు ప్రసేన్.

ఆ మాటతో ఇంక పూర్తిగా విజయ్ రాకని గురించి అనుమానం వదిలేసుకుని “మీ అక్కయ్య గారిని ఇంటిదగ్గర వుండమను, మేము వచ్చి చెబుతాం" అని అన్నాడు అరుణ్.

అలాగేనన్నట్టు తల పంకించి వెళ్ళిపోయాడు సైకిల్ మీద. వెళ్ళి అక్కగారికి ఆ మాట చెప్పాడు ప్రసేన్.

పశ్యంతి కాస్త గాభరాపడింది. “వచ్చి చెబుతాం అంటున్నారు ఏమన్నా గొడవ జరిగిందా - అసలే తలతిక్క మనిషి" అని అనుకుంది కొంచెం చిరాకును కూడా మేళవించుకుని.

మరో అరగంటకి అరుణకుమార్, సుధీర్, హరీంద్ర నాథ్ ముగ్గురూ పశ్యంతి ఇంటికి వచ్చారు.
🏺
*సశేషం*

Monday, 15 June 2026

 


పేరు ప్రాంజలి అష్టకం 

ప్రాంజలి.. అది 


నేటి చందస్సు పై పద్యం 


UIIU- IUIU- IUUU -UUUU


మానధనంబు శోభగన్ మనో నేత్రంబున్ మౌనార్ధంబున్ 

జ్ఞానశుభంబు జ్ఞప్తిగన్ జ్ఞానార్ధంబున్ సంభావ్యంబున్ 

ప్రాణవినోద మార్గమున్ ప్రభావార్ధంబున్ భోగంబున్ 

వీణనినాద సంతసమ్ నిజాధ్యానమ్ విశ్వాసంబున్ 


సరళ భావం

మానం అనే ధనం మనిషికి శోభను తెస్తుంది. మనోనేత్రం (అంతర్దృష్టి) మౌనంలోని అర్థాన్ని గ్రహించగలదు. జ్ఞానం శుభప్రదమై, స్మృతికి ఆధారమై, జీవనార్థాన్ని తెలియజేస్తుంది. ప్రాణానికి ఆనందాన్నిచ్చే మార్గం ప్రభావవంతమైన జీవనానుభూతిని ప్రసాదిస్తుంది. వీణానాదం కలిగించే సంతోషంలా, నిజమైన ధ్యానం విశ్వాసాన్ని పెంపొందించి మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.

****

ధర్మగుణంబు దారిగన్ దయాదీపంబున్ సౌఖ్యంబున్

కర్మఫలంబు జ్ఞాపిగన్ సకా లంబున్  సత్యార్ధంబున్

నిర్మలచిత్త హారమున్ నిజానందంబున్ యోగంబున్

మర్మమెరిoగి ధర్మమై మనోమార్గమ్ సామాన్యంబున్


సరళ భావం:

ధర్మగుణం జీవితానికి దారిచూపుతుంది. దయ అనే దీపం సుఖశాంతులను ప్రసాదిస్తుంది. మనిషి చేసిన కర్మల ఫలితాలు కాలక్రమంలో సత్యార్థాన్ని తెలియజేస్తాయి. నిర్మలమైన మనస్సు హారంలా అలంకరించి నిజమైన ఆనందాన్ని, యోగాన్ని అందిస్తుంది. జీవన మర్మాన్ని గ్రహించి ధర్మమార్గంలో నడిచినవానికి మనోమార్గం సులభమై, సామాన్య జనులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది.

*****

చల్లగనౌను సఖ్యతా సమానంబున్ హృద్యా

నందమ్

మెల్లగనౌను శోభగన్ మనోమాయల్ మాధుర్యంబున్

పల్లమునీరు వేగమున్ ప్రభావంబుల్ ప్రా వీణ్యంబున్

తల్లిగనౌను నిత్యమున్ తపో ధ్యానమ్ సేవార్ధంబుల్


సరళ భావం:

స్నేహం సమానత్వంతో ఉంటే అది చల్లని అనుభూతిని కలిగించి హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది. మెల్లగా పెరిగే శోభ, మనస్సులోని మాధుర్యాన్ని వెలికితీస్తుంది. పల్లంలోకి నీరు వేగంగా చేరినట్లే, నేర్పు మరియు ప్రావీణ్యం సాధనతో అభివృద్ధి చెందుతాయి. తల్లి ఎల్లప్పుడూ ప్రేమతో సేవ చేసినట్లే, తపస్సు మరియు ధ్యానం కూడా సేవాభావాన్ని పెంపొందిస్తాయి.

*****

నేటి చందస్సు పై పద్యం 

ప్రాంజలి ప్రభ అష్టకం.. ద్వితీయం  - IUIU- IUUU -UUUU-UIIU


సహాయమే సమానత్వమ్ సాహిత్యంబున్ గీత నిధీ 

సహాసినీ సుధాతత్త్వమ్ సామర్ధ్యంబున్ కాల విదీ 

ప్రహాసమున్ ప్రభావంబున్ ప్రాదాన్యంబున్ జ్వాల మదీ 

విహారమున్ విధానంబున్ విశ్వాసంబున్ ధార గతీ 


సరళ భావం:

సహాయం చేయడం సమానత్వ భావానికి నిదర్శనం. అది సాహిత్యంలా, గీతంలా జీవితానికి నిధిగా నిలుస్తుంది. చిరునవ్వుతో కూడిన సుధాతత్వం సామర్థ్యాన్ని పెంపొందించి కాలాన్ని సద్వినియోగం చేయడం నేర్పుతుంది.

ప్రహాసం (ఆనందభావం) వ్యక్తి ప్రభావాన్ని పెంచి ప్రాధాన్యాన్ని కలిగిస్తుంది. విహారం, విధానం, విశ్వాసం కలిసినప్పుడు జీవనప్రవాహం సరైన ధారలో సాగుతుంది.

******

సదాశయంబు సౌఖ్యంబున్ సార్థక్యంబున్ జీవనమున్

విధానవిద్య మార్గంబున్ విజ్ఞానంబున్ మానసమున్

ప్రధానమున్ సమానంబున్ విశ్వాసంబున్ లోకమునన్

మదీదయంబు శాంత్యంబున్ శోభంబేనున్ కాలమున్ ॥


సరళ భావం:

మంచి ఆశయాలు జీవితానికి సౌఖ్యాన్ని, సార్థకతను ప్రసాదిస్తాయి. విధానపూర్వకమైన విద్య, విజ్ఞానం మనస్సును సరైన మార్గంలో నడిపిస్తాయి. ఈ లోకంలో సమానత్వం, విశ్వాసం ఎంతో ముఖ్యమైనవి. నా దయ, శాంతి భావాలు కాలానుగుణంగా జీవితానికి శోభను చేకూరుస్తాయి.

********

కళామయంబు కావ్యార్ధమ్ కామ్యార్ధంబున్ కనులుగా 

శిలామయంబు సంభావ్యమ్ శ్రీమాన్తత్త్వం బేగమనా 

స్వలాభమౌను సఖ్యార్ధం సౌజన్యంబున్ కాలముగా 

నిలోత్పలా సమాధానమ్ నిర్వాహంబున్ సౌమ్యముగా 


సరళ భావం 🌹

కళలతో నిండిన కావ్యం మనకు ఇష్టమైన భావాలను కళ్లముందు నిలుపుతుంది. శిలవలె స్థిరమైన ఆలోచన, గౌరవనీయమైన తత్త్వాన్ని త్వరగా గ్రహించేందుకు సహాయపడుతుంది. స్నేహబంధాల అసలైన ప్రయోజనం పరస్పర లాభం కాదు; సౌజన్యంతో కాలాన్ని సార్థకం చేయడమే. నీలకమలంవలె ప్రశాంతమైన సమాధానం, జీవిత నిర్వహణను సౌమ్యంగా చేస్తుంది.

******

Wednesday, 10 June 2026

 



అంత కోపం ఎందుకయ్యా. అప్పుడు నా వయసు ఐదయ్యా !

.......................................

అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసు ఐదయ్యా ! అనే పాట ఇల్లు ఇల్లాలు చిత్రంలోనిది.


మన తాత్త్విక శాస్త్రాల ప్రకారం కోపం (క్రోధం) మానవుని అంతఃశత్రువులలో ఒకటి. అరిషడ్వర్గాలలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ప్రధానమైనవి. వీటిలో క్రోధమనేది వ్యక్తి వివేకాన్ని కప్పివేసి వ్యక్తిగత జీవితాన్నే కాక సామాజిక సంబంధాలను కూడా దెబ్బతీసే శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల ధర్మశాస్త్రాలు ఆయుర్వేదం యోగశాస్త్రం నాట్యశాస్త్రం వంటి భారతీయ జ్ఞాన సంప్రదాయాలు కోపాన్ని వివిధ కోణాలలో విశ్లేషించాయి.


ధర్మశాస్త్రాల ప్రకారం కోపాన్ని దాని మూలకారణాల ఆధారంగా ఆరు రకాలుగా వర్గీకరించారు. 

(1) ధర్మరక్షణ సమాజహితం కోసం ఉద్భవించే కోపాన్ని సాత్త్విక లేదా ధార్మిక కోపంగా భావించారు. అన్యాయాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించేందుకు ఉపయోగపడే ఈ కోపానికి శ్రీకృష్ణుడు కంసునిపై ప్రదర్శించిన ఆగ్రహం ఉదాహరణగా చెప్పబడుతుంది. (2) వ్యక్తిగత కోరికలు ఆశలు నెరవేరనప్పుడు కలిగే కోపాన్ని స్వార్థకోపంగా పేర్కొన్నారు. 

(3) గర్వం అధికార దర్పం లేదా అహంకారానికి భంగం కలిగినప్పుడు పుట్టే కోపాన్ని మదకోపం అంటారు. దక్షుడు శివునిపై ప్రదర్శించిన ఆగ్రహం దీనికి ఉదాహరణగా చెప్పబడుతుంది. (4) ఇతరుల అభివృద్ధిని చూసి కలిగే ఈర్ష్యా కోపం, (5) సంపద లేదా అధికారాన్ని కోల్పోతామనే భయంతో కలిగే లోభకోపం కూడా ఈ వర్గీకరణలో భాగమే. (6) చివరగా సరైన కారణం లేకుండానే అలవాటుగా వ్యక్తమయ్యే మూఢకోపాన్ని తామసిక కోపంగా పేర్కొన్నారు.


ఈ ఆరు రకాల కోపాలు అరిషడ్వర్గాలతో కూడా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి. కామం నెరవేరనప్పుడు స్వార్థకోపం మదం వల్ల మదకోపం మాత్సర్యం వల్ల ఈర్ష్యా కోపం లోభం వల్ల లోభకోపం ఉద్భవిస్తాయి. అందువల్ల క్రోధం మిగిలిన అంతఃశత్రువులతో పరస్పర సంబంధం కలిగి ఉంటుందని భారతీయ తత్వశాస్త్రం వివరిస్తుంది.


ఆయుర్వేదం యోగశాస్త్రం కోపాన్ని త్రిగుణాలైన సత్త్వ రజస్ తమస్ ఆధారంగా మూడు రకాలుగా వివరిస్తాయి. 


అన్యాయం జరిగినప్పుడు ఉద్భవించి నియంత్రణలో ఉండి త్వరగా శాంతించే కోపం సాత్త్విక క్రోధం. 


అహంకారం దెబ్బతిన్నప్పుడు ఉద్భవించి ప్రతీకార భావనను పెంచేది రాజస క్రోధం. 


కారణం లేకుండానే మనసులో దీర్ఘకాలం నిలిచి వ్యక్తిని లోపల నుంచి దహించివేసేది తామస క్రోధం. 

ఈ మూడింటిలో తామసిక కోపమే అత్యంత హానికరమైనదిగా భావించబడింది.


ఆయుర్వేద దృష్టిలో క్రోధం పిత్తదోషాన్ని పెంచి అనేక శారీరక మానసిక వ్యాధులకు కారణమవుతుంది. యోగశాస్త్రం దీనిని చిత్తవృత్తులను కలుషితం చేసే క్లేశాలలో ఒకటిగా పరిగణిస్తుంది. భగవద్గీతలో కూడా క్రోధం మోహం బుద్ధినాశానికి దారితీస్తుందని వివరించబడింది.

భరతముని నాట్యశాస్త్రంలో కోపానికి ప్రత్యేక ఉపవిభాగాలు లేకపోయినా దానిని స్థాయీభావంగా గుర్తించారు. ఈ క్రోధభావం కళాత్మక వ్యక్తీకరణలో ఉత్సాహంతో కలిసినప్పుడు రౌద్రరసంగా పరిణమిస్తుంది. అసూయ అహంకారం ఉగ్రత క్రూరత్వం వంటి భావాలు రౌద్రరసానికి మూలకారణాలుగా చెప్పబడ్డాయి.


కోపం కేవలం మానసిక స్థితి మాత్రమే కాదు.అది శరీరంలోనూ గణనీయమైన మార్పులను కలిగిస్తుంది.కోపం వచ్చినప్పుడు మెదడు వెంటనే స్పందించి అడ్రినలిన్ కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది.ఫలితంగా గుండె వేగం పెరుగుతుంది. రక్తపోటు అధికమవుతుంది. శ్వాస వేగంగా సాగుతుంది. ముఖం ఎర్రబడటం చెమటలు పట్టడం దవడలు మరియు కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ తగ్గిపోవడంతో అసిడిటీ అజీర్తి వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.


కోపం ప్రభావం వ్యక్తి ఆరోగ్యానికే పరిమితం కాదు. తరచూ కోపానికి లోనయ్యే వ్యక్తుల పట్ల సమాజంలో నమ్మకం తగ్గుతుంది. స్నేహితులు బంధువులు సహచరులు లాంటి వారితో మెలగడానికి సంకోచిస్తారు. ఎంతటి విద్యావంతుడైనా ధనవంతుడైనా కోపాన్ని నియంత్రించలేకపోతే గౌరవం కోల్పోతాడు. ఒక్క క్షణం ఆవేశంలో పలికిన మాటలు జీవితకాల బంధాలను విచ్ఛిన్నం చేయగలవు.


అందువల్ల భారతీయ జీవన విధానం కోపాన్ని పూర్తిగా నిర్మూలించమని కాకుండా దానిని సాత్త్వికదిశగా మలచుకోవాలని ఉపదేశిస్తుంది. ధర్మరక్షణకు న్యాయస్థాపనకు ఉపయోగపడే కోపం సమంజసమైనదే అయినప్పటికీ స్వార్థం అహంకారం ఈర్ష్య లోభం నుండి పుట్టే కోపం వ్యక్తిని నాశనం చేస్తుంది. ఉపనిషత్తులు గీత ధర్మగ్రంథాలు క్రోధాన్ని జయించడం ద్వారా మాత్రమే ఆత్మోన్నతి సాధ్యమని బోధిస్తాయి.


ఈ సత్యాన్నే సుమతీ శతకకారుడు ఎంతో సరళంగా హృద్యంగా ఇలా చెప్పాడు


తనకోపమె తనశత్రువు

తనశాంతమే తనకురక్ష దయ చుట్టంబౌ

తనసంతోషమె స్వర్గము

తనదుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!


//సేకరణ//

.................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

షితాబ్ ఖాన్ అనబడే సీతారామరాజు.

.............................................


1323లో కాకతీయ సామ్రాజ్యం పతనంతో తెలుగునేల రాజకీయంగా విచ్ఛిన్నమైంది. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వల్ల సామాజిక సాంస్కృతిక ధార్మిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ సంక్షోభ సమయంలో ముసునూరి ప్రోలయనాయకుడు ఆయన మేనల్లుడు కాపయనాయకుడు  సుమారు డెబ్బై ఐదుమంది తెలుగు సామంతులను ఏకతాటిపైకి తెచ్చి విదేశీపాలనకు వ్యతిరేకంగాఉద్యమించి ఓరుగల్లును తిరిగి స్వాధీనం చేసుకొని తెలుగు ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారు. వారి అనంతరం తెలంగాణ ప్రాంతంలో తెలుగు రాజకీయ సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించేందుకు కృషి చేసిన ప్రముఖ పాలకులలో చితాబ్ ఖాన్ లేదా సీతాపతిరాజు ఒకరు.


చితాబ్ ఖాన్ అసలు పేరు సీతాపతిరాజు. శాసనాలలో ఆయనను సీతారామరాజని కూడా పేర్కొన్నారు. సాధారణ సైనికుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన బహమనీ సుల్తాన్ హుమాయూన్ షా సేవలో చేరి తన అసాధారణ యుద్ధనైపుణ్యం పరిపాలనా దక్షత రాజకీయ చతురతతో ఉన్నత స్థానాలకు ఎదిగాడు.ఆయన ప్రతిభను గుర్తించిన సుల్తాన్ “చితాబ్ ఖాన్” అనే గౌరవ బిరుదును ప్రదానం చేశాడు.ఆ కాలంలో ఖాన్ అనే పదం తప్పనిసరిగా మతపరమైనది కాదు వీరత్వం విశ్వాసపాత్రత అధికార ప్రతిష్ఠలకు సూచకంగా కూడా ఖాన్ ఉపయోగించబడేది. క్రమంగా ఈ బిరుదే ఆయన పేరుగా ప్రసిద్ధి చెందింది.


కాలక్రమంలో కొందరు చరిత్రకారులు చితాబ్ ఖాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించాడని పేర్కొన్నప్పటికీ,

 అందుబాటులో ఉన్న శాసనాధారాలు ఆ అభిప్రాయాన్ని సమర్థించవు. వరంగల్లు ప్రాంతంలో లభించిన శాసనాలలో ఆయన తనను సీతారామరాజుగా పేర్కొనడమే కాక ధ్వంసమైన హిందూ దేవాలయాలను పునరుద్ధరించిన విషయాన్ని కూడా నమోదు చేశాడు. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు తన “షితాబ్ ఖాన్ అనబడే సీతారామరాజు” అనే గ్రంథంలో శాసనాలు వంశావళులు, సమకాలీన ఆధారాలను విశ్లేషించి సీతాపతిరాజు హిందూ సంప్రదాయాలను విడిచిపెట్టలేదని నిర్ధారించారు గిట్టని వారు అతను మతం మారాడని ప్రచారం చేశారని పేర్కొనాడు.


1503 ACE లో సీతాపతిరాజు వరంగల్లు రాచకొండ ఖమ్మం వంటి వ్యూహాత్మక కోటల పాలకుడిగా ఎదిగాడు.తురుష్క దండయాత్రల వల్ల శిథిలమైన అనేక దేవాలయాలను పునరుద్ధరించడం చెరువులు కట్టలు కాలువలను బాగుచేయడం వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకోవడం వంటి పనులను సీతారామరాజు చేపట్టాడు. ముఖ్యంగా కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పాకాల చెరువు మరమ్మతులకు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయం & గ్రామీణ ఆర్థికవ్యవస్థకు ఊతం లభించింది.


ఓరుగల్లులో ఆయన నిర్మించిన ఖుష్ మహల్ నేటికీ ఆయన కాలపు నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలిచివుంది.ఈ భవనం కాకతీయ, బహమనీ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. పరిపాలనా కార్యకలాపాలకు ఉపయోగించిన ఈ నిర్మాణం తెలంగాణ మధ్యయుగ చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించింది. 


చితాబ్ ఖాన్ పరిపాలనలో తెలుగు సాహిత్యానికి కూడా ప్రోత్సాహం లభించింది.ఆయన మంత్రి ఎనుములపల్లి పెద్దన్న సాహిత్యాభిమాని. ఆయన ఆదరణలో చరిగొండ ధర్మన్న చిత్రభారతమనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు.ఇది తెలుగు చిత్రకవిత్వ సంప్రదాయానికి ఆద్యగ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.


సీతాపతిరాజు జీవితంలో రాజకీయ సవాళ్లు కూడా తక్కువేమికాదు.. గోల్కొండలో కుతుబ్షాహీ శక్తి పెరుగుతున్న సమయంలో తెలంగాణపై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటాలలో ఆయన కీలకపాత్ర పోషించాడు.1512 ACE లో కుతుబ్షాహీ సేనలు రాచకొండపై దాడి చేసినప్పుడు ఆయన వీరోచితంగా ప్రతిఘటించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక కోటను కోల్పోయాడు. అనంతరం కళింగాధిపతి ప్రతాపరుద్ర గజపతి ఆశ్రయాన్ని పొందాడు. తరువాత విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కళింగంపై దండయాత్ర చేసినప్పుడు గజపతి పక్షాన యుద్ధంలో పాల్గొన్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అయితే విజయనగర సైనిక శక్తి ముందు ఆయన ప్రభావం క్రమంగా తగ్గిపోయింది.


చితాబ్ ఖాన్ పాలనను పరిశీలిస్తే ఆయన కేవలం యోధుడే కాక పరిపాలకుడు నిర్మాణకర్త ధర్మరక్షకుడు కళాసాహిత్య పోషకుడని స్పష్టమవుతుంది. కాకతీయుల పతనం తరువాత తెలంగాణలో తెలుగు సంప్రదాయాలను నిలబెట్టేందుకు కృషి చేసిన పాలకులలో ఆయన ఒక ముఖ్యమైన కడియంగా నిలిచాడు.విదేశీ ప్రభావాలు పెరుగుతున్న కాలంలో స్థానిక సంస్కృతి దేవాలయాలు సాగునీటి వనరులు సాహిత్య సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విశేషమైనవి.


తెలుగుచరిత్రలో ముసునూరి నాయకుల తరువాత తెలంగాణ ప్రాంతంలో స్థానిక రాజకీయ స్వాతంత్ర్య భావనను కొనసాగించిన నాయకులలో చితాబ్ ఖాన్ ఒక ప్రముఖవ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆయన జీవితం తెలుగువారి ఆత్మగౌరవం ధైర్యసాహసాలు పరిపాలనా ప్రతిభ ధర్మనిష్ఠలకు ప్రతీకగా నిలిచింది. నేడు వరంగల్లు ప్రాంతంలోని ఖుష్ మహల్ శాసనాధారాలు సాహిత్య కృతులు ఆయన వారసత్వాన్ని సజీవంగా నిలుపుతున్నాయి. చితాబ్ ఖాన్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయదలచిన వారికి ఆదిరాజు వీరభద్రరావు రచించిన “షితాబ్ ఖాన్ అనబడే సీతారామరాజు” గ్రంథం విలువైన ప్రామాణిక ఆధారంగా నిలుస్తుంది..


//సేకరణ//

................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

ఎంతమందికి గుర్తుంది !

........................................

ఇది కేవలం ఒక పాత ఫోటో మాత్రమే కాదు బాల్యస్మృతులను గ్రామీణజీవనాన్ని మన కళ్ళెదుట సాక్షాత్కరింప చేస్తోంది. ఇది1908 నాటి చిత్రం.గ్రామీణ ప్రాంతాల్లో వినోద సాధనాలు చాలా తక్కువగా ఉండే ఆ రోజుల్లో ఎలుగుబంట్లతో వచ్చే సంచార కళాకారులు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు.వారు డోలు లేదా డోలక్ ను మోగిస్తూ చిలకపింజలు అంటే నాలుగైతు ఇనుప రింగులు ఎడమ చేతికి తొడుక్కోని ఆ రింగులపై లయబద్ధంగా ఇనుప కర్రతో కొడుతూ వీధులలోకి వచ్చేవారు. ఎలుగుబంటి రాగానే పిల్లలందరు వారి వెంట పరుగులు తీసేవారు. ఎలుగును చూచి కుక్కలు  బాగా మోరిగేవి. గ్రామంలోని రావిచెట్టు కిందనో లేదా రచ్చబండ దగ్గరో ప్రదర్శన మొదలయ్యేది. ఎలుగుబంటి రెండు కాళ్లపై నిలబడి నృత్యం చేయడం డోలు (డోలక్)  వాయిద్యానికి రింగుల శబ్దానికి తలఊపడం, కర్ర మీద నిలబడటం వంటి విన్యాసాలు చేస్తుంటే అశ్ఛర్యంగా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండేవాళ్లం.ప్రదర్శన ముగిశాక పెద్దలు కొందరు పైసలు మరికొందరు బియ్యం జొన్నలు రాగులు ఇచ్చి వారిని ఆదరించేవారు. కోతులాట పాములాటతో పాటు ఈ ఎలుంగ్గొడ్డు ప్రదర్శన నాటి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేవి.పిల్లలలో భయం పోగొడుతుందని చెప్పి ప్రదర్శకులు ఎలుగుబంటి బొచ్చులో ఒక వెంట్రుకను పీకి ఇచ్చి 2,3,5 పైసలు వసూలు చేసుకొనేవారు.ఆ వెంట్రుకను పిల్లల మొలతాడుకు కట్టేవారు.


అప్పట్లో కేవలం ఈ ఆట వినోదం మాత్రమే.ఆ ఎలుగుబంటికి ఎలా శిక్షణ ఇస్తారు దాని వెనుక ఎంతటి క్రూరత్వం బాధ దాగి ఉన్నాయనే విషయం గురించి ఎవరూ ఆలోచించేవారు కాదు. భారతదేశంలో  ఎలుగుబంట్లను పట్టుకుని నాట్యం నేర్పే సంప్రదాయం శతాబ్దాల నాటిది.ఇది బ్రిటిష్ పాలనలో మరింత వృద్ధి చెందింది.1908 నాటి ఈ జైపూర్ ఛాయాచిత్రం అటువంటి సంస్కృతి దృశ్యానికి రేఖామాత్రమే.అప్పట్లో సంచార తెగలు అడవుల నుంచి ఎలుగుబంటి పిల్లలను తెచ్చి వాటి మూతిని కుట్టి చిన్నప్పటి నుంచే కొరడా దెబ్బలతో కొట్టి ఆకలి బాధతో హింసించి వీధి నృత్యాలకు క్రూరంగా శిక్షణ ఇచ్చేవారు.

నేడు ఈ ఫోటోను చూస్తుంటే ఒకవైపు ఆ మన అమాయక బాల్యం గుర్తొస్తుంది.మరోవైపు జంతువుల పట్ల సమాజంలో వచ్చిన సానుకూల మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.1972 నాటి భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఎలుగుబంట్లను ప్రదర్శనలకు ఉపయోగించడాన్ని ప్రభుత్వం పూర్తిగా నేరంగా మార్చింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్ (Wildlife SOS) వంటి అనేక స్వచ్ఛంద సంస్థలు వేలాది నృత్యం చేసే ఎలుగుబంట్లను రక్షించి వాటిని అభయారణ్యాలలో పునరావాసం కల్పించాయి.నేటికీ తెలంగాణా ఆగ్రా మధ్యప్రదేశ్ కర్ణాటకలలో ఎలుగుబంట్ల ప్రత్యేక అభయారణ్యాలు ఉన్నాయి.ఆ విధంగా ఒకప్పుడు సాధారణ దృశ్యంగా ఉన్న ఈ ప్రదర్శనలు ఇప్పుడు పూర్తిగా చరిత్రలో భాగమయ్యాయి. ఈ ఛాయాచిత్రంలోని జనసమూహం ముఖాల్లో కనిపించే ఆశ్చర్యం ఆసక్తి మన తరపు చిన్నతనాన్ని తలపిస్తాయి.కాలం మారింది.మనుషుల ఆలోచనలూ మారాయి. నాటి వినోదం వెనుక ఉన్న బాధను నేడు సమాజం గుర్తించి ఆ మూగజీవులకు విముక్తి కల్పించడం నిజంగా ఒక గొప్ప సానుకూల పరిణామం.

1998లో నేను చివరి సారిగా మా గోరంట్ల గ్రామంలో ఎలుగుబంటి ప్రదర్శన చూశాను. K జగన్ మోహన్ అనే కుర్రాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ఎలుగుబంటిని అటవీశాఖవారు స్వాధీనం చేసుకొన్నారు.


//సేకరణ//

....................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

హమారా బజాజ్ - సువేగా - చల్ మేరీ లూనా

.........................................


భారతదేశ రవాణా రంగ చరిత్రనేది ఎన్నో మైలురాళ్ళతో ఆసక్తికరమైన మలుపులతో వున్న ఒక  గాథ.కార్లప్రవేశం బ్రిటీష్ పాలనలోనే మొదలైంది. 1897లో క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీ యజమాని ఫాస్టర్ అనేవాడు. భారతదేశానికి మొదటికారును తీసుకువచ్చాడు.ఆ వెంటనే 1898లో జెంషెడ్‌జీ టాటా ముంబాయికి మొదటికారును తెచ్చిన స్వదేశీయుడిగా ఘనత వహించాడు.దేశీయ వాహనచరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని టాటా ప్రారంభించారు.అదే సంవత్సరంలో మరికొన్ని కార్లు కూడా ముంబాయి తీరానికి చేరుకోవడంతో మనదేశంలో వాహన సంస్కృతికి పునాది పడింది.  


మలిదశలో కార్ల దిగుమతి & అసెంబ్లింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 1928 డిసెంబరులో జనరల్ మోటార్స్ హిందూస్థాన్ లిమిటెడ్ వారు యూరప్ నుండి విడిభాగాలను దిగుమతి చేసుకొని ముంబాయిలో అసెంబ్లింగ్ చేసి భారత రహదారులపైకి కారును తీసుకువచ్చారు. అయితేసంపూర్ణంగా భారతదేశంలో తయారైన మొదటి కారు అంబాసిడర్. కోల్‌కతాలో 1948లో  మోరిస్ ఆక్స్‌ఫర్డ్ వారు ఈ కార్లను ఉత్పత్తి చేసి ఆ తరువాత హిందూస్థాన్ మోటార్స్ పేరుతో కార్ల ఉత్పత్తి చేశారు.

ఈ అంబాసిడర్ సుమారు 4 దశాబ్దాల పాటు భారతీయ రోడ్లను ఏలింది.హిందుస్థాన్ కంపెనీ వారు ప్రవేశపెట్టిన అంబాసిడర్ కారు కొత్త సాంకేతికతతో ఆధునిక సౌకర్యాలతో నవీన రూపంలో  మరలా మార్కెట్టులోనికి వచ్చే అవకాశముంది.


కార్ల సాంకేతికతలో మరింత అభివృద్ధి చెందిన తర్వాత 1984లో మధ్యతరగతి ప్రజల కలల వాహనంగా మారుతి–800 విడుదలైంది.ఇదే భారతదేశంలో మొదటి ఎయిర్ కండీషన్డ్ (AC) కారుగా వాహనరంగంలో ఒక కొత్తయుగానికి నాంది పలికింది.  


కార్లచరిత్రలో ఒక విచిత్రమైన సంఘటన 1920లో చోటుచేసుకుంది. అల్వార్ మహారాజా జై సింగ్ ఇంగ్లాండ్‌లో రోల్స్ రాయిస్ షోరూమ్‌కి సాధారణ దుస్తుల్లో వెళ్ళగా సేల్స్ ప్రతినిధులు ఆయనను సామాన్యుడిగా భావించి అవమానించారు. ప్రతికారంగా ఆ రాజాగారు ఒకేసారి ఏడు రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి భారతదేశానికి తెచ్చి వాటిని మునిసిపాలిటీకి అప్పగించి చెత్త సేకరణకు ఉపయోగించారు. ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లు చెత్తబండ్లుగా వాడటంతో ఆ కార్ల బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతింది.చివరికి రోల్స్ రాయిస్ యాజమాన్యం రాజుగారికి క్షమాపణలు చెప్పి కొత్తకార్లను ఉచితంగా అందించింది.  


ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే 1950లో భారతదేశంలో మొదటగా ప్రవేశించిన స్కూటర్ లాంబ్రెట్టా.ఆ తర్వాత 1972లో బజాజ్ స్కూటర్ హమారా బజాజ్ అంటూ మనఇంటిలో భాగమై 2009 వరకు కొనసాగింది.బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడిన చిన్నవాహనమైన సువేగా మోపెడ్. మంచి వేగంతో నడిచే మోపెడ్ అనే అర్థం వచ్చేలా భారతీయ మార్కెట్లో ప్రవేశించింది. కోయంబత్తూరుకు చెందిన కెఎల్ వి ఫౌండర్స్ సంస్థ 1962లో తిరుపతిలో ఈ సువేగా కర్మాగారాన్ని స్థాపించి 1988 వరకు విజయవంతంగా ఉత్పత్తి చేసింది.  


ఇక 1972లో మార్కెట్లోకి వచ్చిన లూనా మోపెడ్ కూడా ఇరవైఏళ్ళ క్రితంవరకు మధ్యతరగతి ప్రజల ప్రియమైన వాహనంగా నిలిచింది. చల్ మేరీ లూనా అనే ప్రకటన గురించి ఇప్పటికీ పాతతరం వారికి గుర్తుండే వుంటుంది.  


మరోవైపు పటిష్టమైన ప్రయాణానికి మారుపేరైన జీపు (Jeep) అనే పదం General Purpose నుండి పుట్టింది.రెండవ ప్రపంచ యుద్ధసమయంలో 1941లో ఐరోపా సైనికుల అత్యవసర ప్రయాణాల కోసం వీటిని రూపొందించారు. భారతదేశంలో 1954లో మహీంద్రా అండ్ మహీంద్రా వారు మొదటిసారిగా జీపును నిర్మించారు. అంతవరకు అమెరికన్ విల్లీస్ (Willys) జీపు మనదేశంలో వుండగా మహీంద్రా జీపుల రాకతో భారతీయ రహదారులపై కొత్తశకం ప్రారంభమైంది.  


ఈ విధంగా భారతీయ వాహనరంగం బ్రిటీష్ కాలం నుండి స్వాతంత్ర్యం తర్వాతి దశవరకు ఎన్నో మలుపులు తిరిగి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ నేటి ఆధునిక ఆటోమొబైల్ పరిశ్రమకు పునాది వేసింది.  


//సేకరణ//

..................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

అవినీతి నిరోధక శాఖ - అక్రమార్జనలు.

..........................................

అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించినప్పుడు పట్టుబడే అక్రమాస్తుల జప్తు అపై వాటి వేలం ప్రక్రియ అంతా ఒక క్రమపద్ధతిలో చట్ట ప్రకారం జరుగుతుంది.ఈ మొత్తం వ్యవహారం ప్రధానంగా అవినీతి నిరోధక చట్టం - 1988 (Prevention of Corruption Act) తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) -1973 లోని నిబంధనల ప్రకారం సాగుతుంది.

మొదటి దశలో 

అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేసినప్పుడు లభించే నగదు బంగారం ఆస్తి పత్రాలు బ్యాంక్ ఖాతాలను తదితరాలను ప్రాథమికంగా స్వాధీనం చేసుకుని జప్తు (సీజ్ ) చేస్తారు.అనంతరం సదరు ప్రభుత్వఅధికారికి నోటీసు ఇచ్చి ఆ ఆస్తులకు గల చట్టబద్ధమైన ఆదాయ వనరులను నిరూపించుకోవాలని కోరతారు. నిందితుడు అందించే వివరణ సంతృప్తికరంగా లేనప్పుడు అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసును పి.సి చట్టం సెక్షన్ 13(1)(e) కింద నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేస్తారు.అయితే ఈ దశలోనే నిందితుడు తన ఆస్తులను ఇతరులకు బదిలీ చేయకుండా లేదా అమ్ముకోకుండా అడ్డుకోవడానికి క్రిమినల్ లా అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్ 1944 (Criminal Law Amendment Ordinance) కింద కోర్టు ద్వారా ఆస్తుల తాత్కాలిక అటాచ్‌మెంట్ (Ad-interim Attachment) ఉత్తర్వులను కూడా 

అవినీతి నిరోధక శాఖ పొందుతుంది.

కేసు విచారణ పూర్తై కోర్టులో నేరం నిరూపితమైన తర్వాత అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ న్యాయస్థానం ఆస్తుల స్వభావాన్ని బట్టి రెండు రకాలుగా ఆదేశాలు ఇస్తుంది.లంచంగా తీసుకున్న ప్రత్యక్ష సొమ్ము లేదా లంచం డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులను నేరార్జిత ఆస్తులు (Proceeds of Crime) గా పరిగణించి Prevention  of Corruption చట్టం సెక్షన్ 13(2) ప్రకారం నేరుగా ప్రభుత్వానికి అప్పగించాలని గౌ॥కోర్టు స్పష్టం చేస్తుంది.ఇక మిగిలిన అక్రమాస్తుల (Disproportionate Assets) విషయంలో నిందితుడికి జైలు శిక్ష జరిమానాతో పాటు ఆ ఆస్తులన్నింటినీ శాశ్వతంగా జప్తు (Confiscation) చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తుంది.


ఇలా కోర్టు ఆదేశాల ద్వారా ప్రభుత్వ పరమైన ఆస్తులను చట్టప్రకారం ద్రవ్యంగా మారుస్తారు.ఇళ్లు స్థలాలు ఫ్లాట్ల వంటి స్థిరాస్తులను ప్రభుత్వయంత్రాంగం ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వ ఆస్తుల రిజిస్టర్‌లో నమోదు చేస్తుంది. ఆ తర్వాత వాటిని పారదర్శకంగా బహిరంగ వేలం (Public Auction) వేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు (Consolidated Fund) జమ చేస్తారు. చరాస్తుల విషయానికి వస్తే లభించిన నగదును నేరుగా ఖజానాకు పంపుతారు.బంగారం వాహనాలను ప్రభుత్వగుర్తింపు పొందిన ధరలనిర్ణాయాధికారులు ( వాల్యూయర్స్). ద్వారా విలువ కట్టించి వేలం వేస్తారు. షేర్లు మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కోర్టు ఉత్తర్వుల ప్రతిని సమర్పించి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల ద్వారా క్లోజ్ చేయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయిస్తారు.ఒకవేళ ఆ అక్రమాస్తులు భూ కబ్జాలు లేదా చెరువులు ప్రభుత్వ భూములైతే ప్రత్యేక చట్టం ద్వారా ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుని తిరిగి  ప్రభుత్వ శాఖలకు అప్పగించే వీలుంటుంది.

అయితే ఈ జప్తు విక్రయ ప్రక్రియ అంతా తుది తీర్పునకు లోబడి ఉంటుంది.విచారణ గౌరవకోర్టు (Special ACB Court) శిక్ష విధించినప్పటికీ నిందితుడు పైకోర్టులలో (గౌ॥హైకోర్టు లేదా గౌ॥ సుప్రీంకోర్టు) అప్పీల్ చేసుకునే హక్కు కలిగి ఉంటాడు. అప్పీల్ పెండింగ్‌లో ఉన్నంత కాలం లేదా పైకోర్టు స్టే విధించినప్పుడు సదరు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనంలో ఉంచుకుంటుందే తప్ప తక్షణమే వేలం వేయదు. అప్పీళ్లన్నీ పూర్తిగా ముగిసి విచారణ కోర్టు ఇచ్చిన జప్తు ఆదేశాలను పైకోర్టులు కూడా సమర్థించిన తర్వాతే తుది వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సుదీర్ఘ వ్యవహారమంతా చట్టపరమైన పర్యవేక్షణలోనే సాగుతుంది.


(సమాచారం అందించిన డి.చక్రపాణికి కృతజ్ఞతలు)


//సేకరణ//

................ 

150 మందిని అటునుండి నరక్కురా !

............................................

అటునుండి నరక్కురా అనే పలుకుబడి ఒకటి. నిత్యజీవితంలో ఏదైనా పనిని ఒక చివర నుండి కాకుండా మరో చివరనుండి మొదలుపెట్టమని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతుంటాం. అయితే ఈ మాట వెనుక 150 మంది చెంచుల ప్రాణాలు బలిగొన్న ఒక ఘోర కలియుగ వృత్తాంతం అమరావతిని పాలించిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి జీవితవిశేషాలతో ముడిపడి ఉన్నాయి.వాసిరెడ్డి వంశానికి మూలపురుషుడు వాసిరెడ్డి వీరప్పనాయుడు (కొందరి కథనం ప్రకారం పద్మనాభ నాయుడు). గోల్కొండ నవాబులు మొఘలుల కాలంలో నందిగామ పరగణాకు జమీందారుగా సేవలందించిన వీరప్పనాయుడికి రామన్న జగ్గన్న, వెంకటాద్రి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు.ఆయన తన మరణానికి ముందే సంస్థానాన్ని ముగ్గురు కొడుకులకు పంచి ఇవ్వగా అందులో చింతపల్లి సంస్థానం జగ్గన్న (జగ్గభూపతి) వశమైంది. జగ్గభూపతి పరాక్రమవంతుడైన పాలకుడు. ఆయనకు 1761 ఏప్రిల్ 17న వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జన్మించాడు.ఆ తర్వాత జరిగిన ఒక యుద్ధంలో జగ్గభూపతి మరణించగా ఆయన భార్య  సతీసహగమనం చేసింది.కోస్తా తీర ప్రాంతంలో జరిగిన చివరి సతీసహగమనం ఇదేనని చరిత్రకారులు చెబుతారు.

తల్లిదండ్రులు లేని రెండేళ్ల వెంకటాద్రిని సంతానంలేని పెదనాన్న రామన్న చేరదీసి పెంచాడు. నాయుడికి 17 ఏళ్ల వయసున్నప్పుడు రామన్న మరణించడంతో నందిగామ చింతపల్లి సంస్థానాలు రెండూ వెంకటాద్రినాయుడి చేతికి వచ్చాయి. ఆయన ప్రజాసంక్షేమం కోరే పాలకుడే కాక సాహితీప్రియుడు కూడా. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వలె తన ఆస్థానంలో తొమ్మిది మంది కవులైన నవనందులు పోషించాడు. వారిలో ప్రముఖ పండితుడైన ములుగు పాపయారాధ్యులు. ఈయనకు ప్రధానమంత్రిగా కాడా వ్యవహరించారు.

వెంకటాద్రినాయుడు ఎంతటి ప్రజాపాలకుడో అంతటి రోషగాడు కొన్నిసార్లు దుందుడుకు స్వభావం కలవాడు. సర్కారుజిల్లాల పాలన బ్రిటిష్ వారి వశమయ్యాక జమీందారు ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఆంగ్లేయులు చింతపల్లికోటలో తమ సైన్యాన్ని ఉంచారు.ఈ అవమానాన్ని భరించలేక తన రాజధానిని చింతపల్లి నుండి కృష్ణానదీ తీరాన గల అమరావతికి మార్చాడు.అయితే దీనికి మరోకారణం కూడా ప్రచారంలో ఉంది. ఆయన ఏకైక కుమార్తె రాజ్యలక్ష్మి చింతపల్లి కోట గోడపై నుండి కాలుజారి పడి మరణించడం ఆ తర్వాత భార్య వెర్రాంబ కూడా కన్నుమూయడంతో ఆ చేదుజ్ఞాపకాలను భరించలేక ఆయన అమరావతికి తరలివచ్చాడని అంటారు. అమరావతికి వచ్చిన తర్వాత కూడా ఆయన పిండారీదళాల దోపిడీలను దాడులను తిప్పికొట్టి ప్రజలను రక్షించాడు.


అమరావతి పరిసర అటవీ ప్రాంతాలలో నివసించే చెంచులు ఆ రోజుల్లో దారిదోపిడీ దొంగలుగా మారి నిరంతరం గ్రామాలపై పడుతూ ప్రజలను హతమారుస్తూ ఉండేవారు. అడవుల్లో తిరిగే వారిని కత్తితో గానీ సంప్రదింపులతో గానీ లొంగదీసుకోవడం సాధ్యం కాదని గ్రహించిన వెంకటాద్రినాయుడు ఒక కపటోపాయం ఆలోచించాడు. వారితో సంధి చేసుకుంటానని నమ్మించి దాదాపు 150 మంది చెంచు నాయకులను దొంగలను అమరావతి కోటకు విందుకు ఆహ్వానించాడు.

మృష్టాన్న భోజనాల అనంతరం వారంతా ప్రమత్తంగా వున్న సమయంలో నాయుడి సైనికులు చెంచులందరినీ బంధించి వరసగా నిలబెట్టారు. వారందరి తలలు నరకాల్సిందిగా వెంకటాద్రినాయుడు తలారులను ఆజ్ఞాపించాడు. చావుఖాయమని తెలిసిన ఆ చెంచులుప్రాణభయంతో గింజుకున్నారు. తలారులు ఒక చివర నుండి నరకడం ప్రారంభించగా ఆ వరుసలో నిలబడిన వారు భయంతో "అటునుండి నరక్కురా... ఇటునుండి నరక్కురా..." అని ప్రాధేయపడటం మొదలుపెట్టారు. ఒకవేళ అటునుండి నరుక్కుంటూ వస్తే, ఈలోపు జమీందారు మనసు కరిగి శిక్ష ఆపుతాడేమో కనీసం కొందరైనా బతుకుతామనేది వారి ఆశ.కానీ నాయుడి ఆజ్ఞ కఠినమైనది కావడం వల్ల ఆ 150 మంది తలలు తెగిపడ్డాయి. ఆ రోజు చెంచులు ప్రాణభయంతో అరచిన ఆ ఆర్తనాదమే కాలక్రమేణా తెలుగునాట "అటునుండి నరక్కురా" అనే జాతీయంగా స్థిరపడిపోయింది.

 

ఆనాడు 150 మంది చెంచుల తలలు నరికిన ఘోర కలియుగ ప్రదేశమే తర్వాతి కాలంలో నరకుళ్ళపాడుగా మారింది. ఇది ప్రస్తుత గుంటూరు జిల్లాలో వుంది. ఈ సామూహిక నరమేధం తర్వాత వెంకటాద్రినాయుడికి తీవ్రమైన పాపభీతి, పశ్చాత్తాపం పట్టుకున్నాయి. ఆయనకు రాత్రి పూట నిద్ర కరువైంది. అన్నం తినబోతే ముద్దలన్నీ పురుగులుగా కనిపించేవని స్థానిక కథనాలు చెబుతాయి.ఈ నరహత్యా పాతకాల నుండి విముక్తి పొందడానికి పండితుల సలహా మేరకు ఆయన అనేక భూదానాలు, గోదానాలు సువర్ణదానాలు చేశాడు. అమరావతి చేబ్రోలు మంగళగిరి పొన్నూరు వంటి అనేక పుణ్యక్షేత్రాలలో ఎత్తైన గాలిగోపురాలు ఆలయాలు నిర్మించాడు. చివరకు కాశీయాత్ర కూడా చేసి పాపపరిహారం కోరుకున్నాడు.తన జీవిత చరమాంకంలో దైవచింతనలోనే గడిపిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు 1817 ఆగస్టు 17న అమరావతిలోని అమరేశ్వరుని పాదాల చెంత శివైక్యం చెందాడు.


//సేకరణ//

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాల పునఃపరిశీలన (Re-verification) మరియు ఓటర్ల వివరాల ధృవీకరణకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న సందేశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం, ఎన్నికల సంఘం విధానాలు మరియు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియలను పరిశీలించినప్పుడు, ఆ సందేశాల్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కొన్ని అంశాలు అపార్థాలకు దారితీసే విధంగా ప్రచారం అవుతున్నట్లు కనిపిస్తోంది.


ప్రచారంలో ఉన్న సందేశాలలో "SIR" అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే భారత ఎన్నికల సంఘం అధికారికంగా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సాధారణంగా "SSR" (Summary Revision of Electoral Rolls) అని పిలుస్తారు. "SIR" అనే పదం కొన్ని ప్రాంతాలలో అంతర్గత డేటా ధృవీకరణ లేదా డిజిటల్ రికార్డు సమన్వయ ప్రక్రియలకు సంబంధించి ఉపయోగించబడవచ్చు గానీ, ఓటర్ల నమోదు లేదా తొలగింపుకు సంబంధించిన అధికారిక ఎన్నికల సంఘం పరిభాష కాదు. అందువల్ల సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రతి పదాన్ని అధికారిక ప్రక్రియగా భావించడం సరైంది కాదు.


ఓటర్ల వివరాల పరిశీలనలో పాత ఓటర్ల జాబితాలకు, ముఖ్యంగా 2002 కాలం నాటి రికార్డులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం కొంతవరకు వాస్తవమే. కుటుంబ సంబంధాలు, స్థానిక నివాస చరిత్ర, వారసత్వ ఆధారిత గుర్తింపులు, అలాగే ఒకే వ్యక్తి పేరు రెండు వేర్వేరు ప్రాంతాలలో నమోదై ఉందేమో గుర్తించడానికి పాత రికార్డులు సహాయకరంగా ఉంటాయి. బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ డేటాతో పాటు పాత ఓటర్ల జాబితాలను కూడా సరిపోల్చి పరిశీలించే అవకాశం ఉంటుంది. అయితే 2002 జాబితాలో పేరు లేకపోతే ఓటు హక్కు రద్దవుతుందనే ప్రచారం పూర్తిగా నిరాధారమైనది. భారత రాజ్యాంగం ప్రకారం అర్హత కలిగిన ప్రతి పౌరుడు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఓటరుగా నమోదు కావడానికి హక్కు కలిగి ఉంటాడు.


పెళ్లయిన మహిళల విషయంలో కూడా కొన్ని అపోహలు వ్యాపిస్తున్నాయి. వివాహం అనంతరం కొత్త నివాస ప్రాంతానికి మారిన మహిళలు తమ పుట్టింటి ప్రాంతంలోని పాత ఓటర్ల జాబితా వివరాలు లేదా తల్లిదండ్రుల ఓటరు వివరాలను అందించడం ద్వారా కుటుంబ అనుసంధానం (Family Linkage) సులభం కావచ్చు. అయితే అలాంటి వివరాలు సమర్పించడం మాత్రమే సరిపోదు. ఓటును ఒక నియోజకవర్గం లేదా గ్రామం నుండి మరొక ప్రాంతానికి మార్చుకోవాలంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన అధికారిక ప్రక్రియను అనుసరించాల్సిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫారమ్-8 ద్వారా చిరునామా మార్పు, వివరాల సవరణ లేదా నియోజకవర్గ మార్పు వంటి అంశాలను అధికారికంగా నమోదు చేయాలి. కేవలం కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వడం ద్వారా ఓటు బదిలీ స్వయంచాలకంగా జరిగిపోదు.


సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్న Self Mapping, Add Progeny, Self Progeny వంటి పదాలు కూడా సాధారణంగా ఓటర్లకు సంబంధించిన అధికారిక చట్టపరమైన వర్గీకరణలు కావు. ఇవి క్షేత్రస్థాయిలో డేటా సమన్వయం, కుటుంబ అనుసంధానం మరియు పాత-కొత్త రికార్డుల సరిపోలిక కోసం ఉపయోగించే సాంకేతిక లేదా సాఫ్ట్‌వేర్ ఆధారిత వర్గీకరణలుగా భావించవచ్చు. ఒకే వ్యక్తి పాత మరియు ప్రస్తుత రికార్డులను అనుసంధానించడం, 2002 తరువాత ఓటు హక్కు పొందిన కుటుంబ సభ్యులను నమోదు చేయడం, లేదా కుటుంబ ఆధారిత ధృవీకరణ నిర్వహించడం వంటి పనుల కోసం ఈ తరహా విభజనలు ఉపయోగపడవచ్చు. అయితే ఇవి ఓటరుకు ప్రత్యేక హక్కులు కల్పించే లేదా ఓటు హక్కును నిరాకరించే వర్గాలు కావు.


ప్రస్తుతం జరుగుతున్న ధృవీకరణ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం బోగస్ నమోదులను గుర్తించడం, మరణించిన వ్యక్తుల పేర్లను తొలగించడం, ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదై ఉంటే వాటిని సరిచేయడం, కొత్త అర్హులైన ఓటర్లను చేర్చడం మరియు ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా తయారుచేయడం. ఇది ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను పెంచేందుకు చేపట్టే సాధారణ పరిపాలనా ప్రక్రియగా చూడాలి.


అందువల్ల ఓటర్లు సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను మాత్రమే నమ్మకుండా, తమ పేరు ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉందో లేదో అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవడం ఉత్తమం. పేరు నమోదు, సవరణ, చిరునామా మార్పు లేదా ఇతర సమస్యల విషయంలో నేరుగా బూత్ లెవెల్ అధికారిని (BLO) సంప్రదించడం, లేదా ఎన్నికల సంఘం అధికారిక సేవలను వినియోగించడం అత్యంత విశ్వసనీయమైన మార్గం. ఓటు హక్కుకు సంబంధించిన విషయాల్లో పుకార్ల కంటే అధికారిక సమాచారం మరియు నిర్దేశిత ప్రక్రియలకే ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి ఓటరి బాధ్యత.


ప్రాచీన నలంద వైభవం: చైనీస్ చిత్రంలో సంస్కృత సంభాషణ

ప్రాచీన భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించిందో చెప్పడానికి నలందా విశ్వవిద్యాలయం ఒక సజీవ సాక్ష్యం. 


ఆ కాలంలో ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని సముపార్జించేవారు. ఆధునిక కాలంలో అమెరికా వంటి దేశాల్లో ఉన్నత చదువుల కోసం 'TOEFL' లేదా 'IELTS' వంటి ఆంగ్ల భాషా పరీక్షలు రాయడం ఎంత అవసరమో, ఆ కాలంలో నలంద వంటి భారతీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందడానికి విదేశీ విద్యార్థులు (ముఖ్యంగా చైనా బౌద్ధ విద్యార్థులు) సంస్కృతం నేర్చుకోవడం అంతకంటే అత్యవసరంగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో నలందలో బోధనా మాధ్యమం సంస్కృతమే.


ఒక చైనీస్ చిత్రంలోని సన్నివేశం ఆధారంగా, హుయాన్ త్సాంగ్ నలందా విశ్వవిద్యాలయానికి చేరుకున్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణ  ఇక్కడ చూద్దాం:


ఆచార్య శీలభద్ర మరియు హుయాన్ త్సాంగ్ సంభాషణ

ఆచార్యుడు: వత్స! కుతః ఆయా తః?

(నాయనా! నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?)


హుయాన్ త్సాంగ్: ఆచార్య చరణేభ్యో నమః... హుయాన్ త్సాంగ్ అహం. మహా చీన దేశతః ఆగతో అహం.

(ఆచార్యుల పాదాలకు నమస్కారం... నా పేరు హుయాన్ త్సాంగ్. నేను మహా చైనా దేశం నుండి వచ్చాను.)


ఆచార్యుడు: అత్ర ఆగమనం కిమర్థం? కథయ...

(ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు...)


హుయాన్ త్సాంగ్: ఆచార్య భవతః చరణ నలందాయాం... ఉపవిశ్య యోగశాస్త్రం పఠితుం ఆగతో అహం.

(ఆచార్యా! మీ పర్యవేక్షణలో ఈ నలందా విశ్వవిద్యాలయంలో ఉంటూ యోగశాస్త్రాన్ని అభ్యసించడానికి నేను వచ్చాను.)


ఆచార్యుడు: సాధు! ఉత్తమ కల్ప!

(చాలా మంచిది! ఉత్తమమైన ఆలోచన!)


ఆచార్యుని స్వప్న వృత్తాంతం

ఆ తర్వాత ఆచార్య శీలభద్రుడు అక్కడ ఉన్న మిగిలిన బౌద్ధ భిక్షువులను ఉద్దేశించి హుయాన్ త్సాంగ్ రాక గురించి ఒక అద్భుతమైన విషయాన్ని సంస్కృతంలో వివరిస్తారు:


"వర్ష త్రయ పూర్వం... అత్ర భవంతః అవలోకితేశ్వర బోధిసత్వ, మైత్రేయ బోధిసత్వ, తథా చ మంజుశ్రీ బోధిసత్వ... ఏతే సర్వే మమ స్వప్నమ్ ఆగత్య కథితవంతః..."


(మూడేళ్ల క్రితం... బోధిసత్వులైన అవలోకితేశ్వరుడు, మైత్రేయుడు మరియు మంజుశ్రీ నా కలలోకి వచ్చి ఒక మాట చెప్పారు...)


"యత్... మహా చీన దేశతః ఏకః బౌద్ధ భిక్షుః ధర్మశాస్త్రం పఠితుం తవ సమీపమ్ ఆగమిష్యతి ఇతి!"


( మహా చీనా దేశం నుండి ఒక బౌద్ధ భిక్షువు ధర్మశాస్త్రాన్ని, బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేయడానికి నీ వద్దకు వస్తాడు అని!)


ఈ మాటలు విన్న తర్వాత హుయాన్ త్సాంగ్ అమితానందంతో ఆచార్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ "అమితాభ... అమితాభ..." అంటూ బుద్ధుడిని స్మరిస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తాడు.


ఈ సన్నివేశం ప్రాచీన భారతదేశపు విద్యా వైభవాన్ని, సంస్కృత భాషకు అంతర్జాతీయంగా ఉన్న ఆదరణను స్పష్టం చేస్తుంది. 


చైనా లాంటి సుదూర దేశం నుండి కేవలం జ్ఞానార్జన కోసం, నలందలో చదువుకోవడం కోసం హుయాన్ త్సాంగ్ వంటి యాత్రికులు ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి సంస్కృతాన్ని నేర్చుకుని భారతదేశానికి వచ్చేవారనే నిజం మన సంస్కృతి పట్ల గర్వపడేలా చేస్తుంది..


గర్వపడండి..ఆత్మవిస్మృతి కి లోనూ కాకండి..

ప్రపంచంలోనే అత్యుత్తమ జాతి మనది..


.................జిబి విశ్వనాథ

9441245857 అనంతపురం.

Thursday, 12 February 2026

 [03/02, 12:50] Mallapragada Ramakrishna: *శతపత్ర -1*

రచన:

లండన్! ఒకప్పుడు సూర్యుడస్తమించని బ్రిటీష్ మహా సామ్రాజ్యానికి రాజధానీ నగరం. యూరప్ లోని పురాతన నగరాల్లో లండన్ ఒకటి. ప్రస్తుతం వలస రాజ్యపాలన అంతమయ్యాక బ్రిటన్ కి మాత్రమే రాజధానిగా పరిమితమైపోయిందీ నగరం. రెండుసార్లు తగలబడిపోగా పునర్నిర్మించ బడిన నగరం లండన్. యూరప్ లో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు లండన్ లో వేలాది మంది ఆ మహమ్మారిబారిన పడి చనిపోయారు.

చరిత్ర ప్రసిద్ధమైన ఎందరో వీరుల్ని, ఎన్నో యుద్ధాల్ని, మరెన్నో ఘోరాల్ని చూసిన నగరం. ఎన్నో ఖండాలు, ఎన్నో దేశాల చరిత్రల్ని, సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని, ప్రపంచ అద్భుతాల్ని, వింతల్ని గుప్పిటపట్టి దాచిన నగరం.

వలస రాజ్యాల నుంచి అంతులేని సంపదే కాదు. అమూల్యమైన, అలభ్యమైన గ్రంథాలు కూడా బ్రిటన్ కి తరలించబడ్డాయి. అందుకే ప్రపంచంలో అనేక భాషలకు చెందిన సాహిత్య, చారిత్రక గ్రంధాలు కూడా ఇప్పటికీ లండన్ లైబ్రరీలో కన్పిస్తాయి. మనలో చాలామంది మన నమ్మకాల్ని మూఢనమ్మకాలనుకుంటారు. పాశ్చాత్యులు అవి అధునాతన భావాలని, వారిలో మూఢ నమ్మకాలుగాని, భయాలుగాని అస్సలు కనిపించవని అనుకుంటారు. నిజానికి మనకన్నా పాశ్చాత్యులకే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయని చాలామందికి తెలియదు.

దయ్యాలు, భూతాలు, భయాలు మనదేశం లో కన్నా అమెరికా, ఆఫ్రికా, యూరప్ దేశాలవారికే ఎక్కువ.

దయ్యాలు, భూతాలు వణికించే వింత జీవుల కథలతో హాలీవుడ్ నిర్మాతలు నిర్మించినన్ని దయ్యాల సినిమాలు మరే దేశంలోనూ నిర్మించబడలేదు.

📖

మనం బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తాం. కొన్ని దేశాల్లో పిల్లి ఎదురైతే శుభశకునంగా భావిస్తారు. పదమూడు సంఖ్య గురించి మనకి ఎలాంటి సెంటిమెంట్లూ లేవు. పదమూడు కాని ఆ సంఖ్యను చూస్తేనే వణికిపోయేవారున్నారు అక్కడ. వాళ్ళు పదమూడు సైతాన్ సంఖ్యగా భావిస్తారు. ఎంత భయమంటే హోటల్లో ఆ సంఖ్యతో గది ఉండదు. పదమూడు వదిలేసి పధ్నాలుగుతో కంటిన్యూ చేస్తారు.

అలాగే ఇంటి నెంబరు కూడా 13 ఉంచరు. ఆ సంఖ్యని అరిష్టంగా భావిస్తారు.

అయితే ఇదే పదమూడు సంఖ్యను మయన్ నాగరికతకు చెందినవారు చాలా పవిత్రంగా భావిస్తారు. భూమి నుంచి స్వర్గానికి మధ్య పదమూడు లోకాలున్నాయని, ఆ సంఖ్య దేవతల సంఖ్య అని భావించేవారు. మనకి కూడా ఏడు ఏడు పధ్నాలుగు లోకాలున్నా యంటారు. పైన స్వర్గానికి, భూమికి మధ్యన గాంధర్వ, కిన్నెర, కింపురుష, విద్యాధర, యక్ష మొదలైన దైవలోకాలున్నాయని, కింద అతల, వితల, సుతల, పాతాళ, తలాతల మొదలైన ఏడు లోకాలున్నాయని, అవి రాక్షస లోకాలని అంటారు. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన పురాణ గాధ మనకు తెలిసిందే.

నమ్మకాలు, మూఢనమ్మకాలు, భ్రమలు, నిజాలు ఆయా దేశ కాల పరిస్థితులనుబట్టి వేరువేరుగా ఉంటాయి. ఒకచోట మంచి అనుకునే విషయం మరోచోట చెడుకావచ్చు. అయితే దయ్యాలు, భూతాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి.

అమెరికాలోని మెక్సికో ప్రాంతపు అడవుల్లో ను, ఆఫ్రికా అడవుల్లోను, మనదేశంలో కేరళ, అస్సాం ప్రాంతాల్లోనూ ఇప్పటికీ గొప్ప గొప్ప మంత్రగాళ్ళున్నారు.

లండన్ నగరం వరకే చూస్తే- అక్కడి హీత్రూ విమానాశ్రయంలో దయ్యాల గురించి అనేక కథలు ప్రచారంలో వున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా షేక్ ష్పియర్ నాటకాల్ని ప్రదర్శిస్తున్న గొప్ప ధియేటర్ ఒకటి లండన్ లో ఉంది. ఆ ధియేటర్ లో ఇప్పటికీ దయ్యాలున్నాయని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

అసలు ఈ దయ్యాలు, భూతాలు ఏమిటి? ఆత్మ ఏమిటి? మనిషి మరణించిన తర్వాత ఆత్మ దయ్యమవుతుందా? మరణానంతరం కూడా ఆత్మకు జీవితం ఉందా? ఉంటే అది ఎలాంటి జీవితం?

ఆత్మ చావు లేనిది. అగ్నితో కాల్చబడదు. కత్తితో చీల్చబడదు. చావు శరీరానికేగాని, ఆత్మకు లేదు అని గీతాచార్యుడు బోధించాడు.

శరీరాన్ని పోగొట్టుకున్న ఆత్మ మరో శరీరం ధరించాలి. అంటే ఆత్మ మరణానంతరం మనిషి కావచ్చు. కుక్క కావచ్చు, నక్క కావచ్చు. మరో జీవి గర్భాన్ని వెదుక్కుని పోవాలి. ఆత్మ గర్భస్థశిశువుగా మారి పునర్జన్మించాలి కాని మధ్యలో మరో జన్మకు పోకుండా దయ్యాలు, భూతాలుగా మారటం ఏమిటి? అసలు మరణానంతరం ఆత్మ ఏమవుతోంది?

📖

ఈ ఆత్మశోధన ఈనాటిది కాదు. ఏనాటికీ మనిషి మేథస్సుకు అంతుచిక్కని దైవరహస్యమిది.

మనిషి అంతరిక్షంలో ఎన్నో అద్భుతాల్ని ఆవిష్కరించగలుగుతున్నాడు. శోధించి ఎన్నో కొత్త కొత్త విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. కాని మన భూమిపైనే అంతు చిక్కని, విచిత్రమైన ఎన్నో మిస్టరీలు దాగి వున్నాయి. వాటిని మాత్రం అస్సలు ఛేదించలేకపోతున్నాడు.

మంగోలియా మహావీరుడు చెంఘిజ్ ఖాన్ చనిపోయి శతాబ్దాలు గడిచాయి. అయినా ఇంతవరకు అతని సమాధిని కనిపెట్టలేక పోయారు. ఆ సమాధిని కనిపెట్టి అందులో దాచిన బంగారాన్ని, వజ్రవైఢూర్యాల్ని కొల్లగొట్టాలని ఇప్పటికీ అన్వేషణ సాగిస్తూనే వున్నారు.

ప్రస్తుతం చెంఘిజ్ ఖాన్ సమాధిగా చెప్పబడుతున్న చోట ఆ నిధి లేదు. ఇక్కడో విచిత్రం ఉంది. ఆ సమాధి ముందు ఒక శిలా అశ్వం వుంది.

చెంఘిజ్ ఖాన్ పునర్జన్మించినప్పుడు గుర్తుగా ఆ అశ్వం ముందు కాళ్ళు లేపి బిగ్గరగా సకిలిస్తుందట.

"ఈ సూచన ఇంతవరకూ జరగలేదు. కాబట్టి చెంఘిజ్ ఖాన్ ఇంకా పుట్టలేదనే అనుకోవాలి.

ఇలాంటిదే వీరబ్రహ్మేంద్రస్వామి- యాగంటి లో బసవడు లేచి రంకె వేస్తాడని కాలజ్ఞానంలో రాయటం.

శ్రీకృష్ణుడి ద్వారకానగరం నీటమునిగిన గాథ లాంటిదే, ఒకప్పుడు అట్లాంటిక్ సముద్రంలో అట్లాంటిస్ అనే నగరం కూడా నీట మునిగిపోయింది. ఆ నగరాన్ని కనిపెట్టి బంగారం తీయాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు.

బెర్ముడా ట్రయాంగిల్ అనే సముద్రదీవి వైపు వెళ్ళిన ఏ నౌకా వెనక్కి తిరిగిరాలేదు. దీవి మీదుగా ఎగిరిన ఏ విమానం కూడా తిరిగి ల్యాండ్ కాలేదు. దీని మిస్టరీ ఏమిటో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఫ్లయింగ్ సాసర్స్ ఇంకా అంతుచిక్కని మిస్టరీగానే వుంది.

లోకంలో ఘనకార్యలు చేయటంకోసమే కొందరు పుడతారు. అనుభవంలోకి వస్తేగాని తనలో ఉండే ప్రత్యేకత ఏమిటో కొందరికి అర్థంకాదు.

ఏదో సాహసం చేయాలి, ఏదో సాధించాలని పట్టుదలైతే ఉందిగాని, ఏం సాధించాలో తెలీని స్థితిలో ఒక యువతి అన్వేషణ సాగిస్తోంది.

ప్రపంచంలోని మిస్టరీలను స్టడీ చేస్తూ ప్రస్తుతం లండన్లోనే వుంది. ఆ యువతి పేరు శతపత్ర.

📖

అదేపనిగా కాలింగ్ బెల్ మోగుతుంటే బిరబిరా వచ్చి తలుపుతీసింది విశ్వదా.

ఎదురుగా శతపత్ర. లేతాకుపచ్చ చక్కటి డిజైన్ లోని చుడీదార్ లో చిరునవ్వులు చిందిస్తూ అరవిరిసిన ముద్ద మందారంలా నిలబడి వుంది.

నడుమ్మీద చేతులుంచుకుని కించిత్తు కోపంగా చూసింది విశ్వదా.

“అనుకున్నాను. వీకెండ్ వస్తేగాని ముఖం చూపించవనుకున్నాను. ఇవాళ లైబ్రరీ సెలవుగాబట్టి నేను గుర్తొచ్చాను. అంతేగా?” అనడిగింది సీరియస్ గా విశ్వదా.

“అంతేగా అంటే... అంతే మరి. నేనేం చెప్పినా నువ్వు నమ్మవుగా...” అంది శతపత్ర.

"నన్ను నమ్మించాలని చూడకు. నీమీద నాకు ఎంత కోపంగా వుందో తెలుసా?" అంది విశ్వదా.

"అది తెలిసే నీకోపం పోగొట్టాలని వచ్చాను. అయినా ఏమిటే ఇది. డోర్ లో నిలబెట్టే మాట్లాడతావా? లోపలికి రానీయవా?” అంది నవ్వుతూ శతపత్ర.

తల ఊపి చిన్నగా నిట్టూర్చింది విశ్వదా. “రా తల్లీ. లోపలికి రా” అంటూ పక్కకు తప్పుకుంది.

"అంత మర్యాద అక్కర్లేదులే” అంటూ లోపలికి వచ్చింది శతపత్ర. తలుపుమూసి వెనుతిరిగింది విశ్వదా.

"నాకొస్తున్న కోపానికి నిన్నేం చేయాలో తెలీటంలేదే. పదిరోజులైంది నిన్ను చూసి. ప్లాట్ కొస్తేనేమో ఉండవు. ఎప్పుడు చూసినా లైబ్రరీ... లైబ్రరీ. పోనీ లైబ్రరీ కొద్దామంటే అక్కడంతా సైలెన్స్. మాట్లాడుకోడం అసలు కుదరదు. ఈమధ్య మరీ పుస్తకాల పురుగు వైపోతున్నావ్. కూచో, కాఫీ తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది విశ్వదా.

శతపత్ర వయసు పాతికేళ్ళు. అయిదున్నర అడుగుల ఎత్తు. ఆ ఎత్తుకు తగిన అంగసౌష్ఠవం. అందానికి నిర్వచనం ఈ అమ్మాయేనా అన్పిస్తుంది ఆమెనిచూడగానే. అంతటి సౌందర్యవతి. అందం ఒక్కటే కాదు. ఒక విధమైన ఠీవి, దర్పం ఆమెలో కొట్టొచ్చినట్టు కన్పిస్తాయి. ఆచితూచి మాట్లాడటం, ఏ పని చేసినా హుందాగా చేయటం శతపత్ర ప్రత్యేకత.

పద్మదళాయతాక్షి. అంటే తామరపూవు రేకువంటి కనులు కలిగినది అనర్ధం.

ఆకర్ణాయతనేత్రి. అంటే చెవులవరకు వ్యాపించిన కనులు కలది అని అర్ధం. ఈ రెండు పోలికలు స్త్రీయొక్క విశాలనేత్రాలని తెలియజేస్తాయి.

అటువంటి విశాల నేత్రాలు, విశాలమైన ఫాలభాగం, కోటేరులా తీర్చిదిద్దినట్టుండే చక్కటి ముక్కు పగడాల వంటి పెదవులు, శంఖంలాంటి మెడ, స్వచ్ఛమైన బంగారంలా మెరిసే మేనిఛాయ... ఇవన్నీ అరుదుగా రాజవంశ స్త్రీలలో మాత్రమే కన్పించే సోయగం లక్షణాలు. శతపత్రను చూస్తే ఆమె ఏ రాజవంశానికో చెందిన యువతి అని అపోహపడతారు. అంతగా విలక్షణమైన, అందమైన యువతి శతపత్ర.

ఆమె లండన్ వచ్చి ఆరేళ్ళయింది. చదువు అయిపోయింది. అయినా ఇక్కడే ఉంది. ఇండియా తిరిగివెళ్ళలేదు. ఎప్పుడు వెళ్తుందో కూడా తెలీదు. స్నేహితురాలైన విశ్వదాకి కూడా ఆ వివరాలు తెలీదు.

విశ్వదా వయసు కూడా పాతికేళ్ళు. ఆమె అయిదేళ్ళుగా లండన్ లో ఉంటోంది. ఆమె చదువు ఇంకా పూర్తికాలేదు. చదువుతో పాటు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తోంది. గొప్ప అందం అని చెప్పలేం. తన అందాన్ని ఇనుమడింపచేసుకోడానికి మిడ్డీస్, స్కర్టు- ఇలా అక్కడి యువతుల్లాగే డ్రస్ చేసుకుంటుంది. తన అందాల ప్రదర్శనకి ప్రాధాన్యత నిస్తుంది. అలాగని చెడ్డది కాదు. బాయ్ ఫ్రెండ్స్ లేరు.

డ్రెస్ విషయం విశ్వదాకి పూర్తి వ్యతిరేకి శతపత్ర. ఆమెకు మన సాంప్రదాయ దుస్తులంటేనే ఇష్టం. చీర జాకెట్ ధరించటం మరీ ఇష్టం. సందర్భాన్నిబట్టి చుడీదార్లు, జీన్స్ ప్యాంట్స్ షర్టులు ధరిస్తుంది. ఒళ్ళు కనబడే దుస్తులు ఆమెకు దూరంగా వుండాల్సిందే.

ఇద్దరూ హైదరాబాదీ యువతులే కావటంతో వారి స్నేహం మరింత గట్టిపడింది. అయితే యిద్దరూ ఎవరి ఫ్లాట్ లో వాళ్ళుంటున్నారు.

శతపత్ర ఉంటున్న ఫ్లాట్ అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో వుంది. తన బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటోంది. విశ్వదా మాత్రం ఒంటరిగానే ఉంటోంది తన ప్లాట్ లో.

🍁

*సశేషం*

[03/02, 19:21] Mallapragada Ramakrishna: *శతపత్ర -2*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

కిచెన్ లో నుండి రెండు కాఫీ కలిపి తెచ్చి ఒకటి శతపత్రకి ఇస్తూ- "వంద ఆకుల ఒయ్యారీ... తీసుకోవమ్మా కాఫీ” అంది కొంటెగా!

"ఇదిగో... అలా తెలుగులో పిలిస్తే కోపం వస్తుంది. తెలుసుగదా” కాఫీ అందుకుంటూ ఉడుక్కుంది శతపత్ర. 

“ఎందుకే కోపం. శతపత్ర అంటే వంద ఆకులనేగా అర్ధం. నీ మూడ్స్ కూడా వంద రకాలుగా ఉంటాయి. అందుకే నేను అలా అన్నాను" అని అంది ఆమె ఎదురుగా కూచుంటూ విశ్వదా.

“సర్లే... అయినా వచ్చీరాగానే నామీద విరుచుకుపడుతున్నావ్! ఏమైంది నీకు?” కాఫీ సిప్ చేస్తూ మధ్యలో అడిగింది.

“నాకేమీ కాలేదు. నీకే ఏదో అయింది. మరీ పుస్తకాల పురుగువైపోతున్నావ్. ఆ లైబ్రరీ తప్ప మరే లోకం అస్సలు కనిపించటం లేదు నీకు” అంది.

“నువ్వు కన్పించావ్ చాలదా? ఈ రోజంతా నీతోనే. భోజనం కూడా ఇక్కడే."

"సంతోషం. ఆ మధ్య ఇండియా నుంచి అమ్మ పంపిన ఆవకాయపచ్చడి ఉంది. ముద్దపప్పు, నెయ్యి, గడ్డ పెరుగు, అప్పడాలు. ఇవి చాలా? నాన్ వెజ్ ఏమన్నా చెయ్యాలా, గుడ్లు ఉన్నాయి. ఆమ్లెట్స్ వేసుకోవచ్చు...”

"ఇవి చాలుగాని... ఏమిటే... వంట అయిపోయినట్టు మాట్లాడుతున్నావ్" అంది శతపత్ర.

"అయిపోయినట్టు కాదు. అయిపోయింది. మనిద్దరికీ వండి స్నానానికి వెళ్ళొచ్చాను. నువ్వొచ్చావు.”

"అంటే నేనొస్తానని ముందే తెలుసా?”

"తెలుసు.. నీ ఫ్లాట్ కి ఫోన్ చేస్తే నో రెస్పాన్స్. నీ పక్క ఫ్లాట్ లో అనంతయ్యగారి కూతురుందిగా సుబ్బలక్ష్మి. ఫోన్ చేసి నీ గురించి అడిగితే చెప్పింది. నా వద్దకే నువ్వు బయలుదేరి వస్తున్నావని.”

"సో... నీ కోసం నేను వస్తున్నానని తెలిసి కూడా.... నామీద కోపమన్నమాట.”

"కోపం ఉండదా?” అంటూ ఖాళీ కప్పులతో కిచెన్లోకి వెళ్ళి మూడు నిముషాల తర్వాత తిరిగివచ్చింది విశ్వదా.

"ఇంతకీ నువ్వు ఇండియా ఎప్పుడు వెళ్తున్నావ్?” పక్కన కూచుంటూ అడిగింది.

“తెలీదు” అంది శతపత్ర.

"నేను మాత్రం వచ్చే జూన్ లో ఇండియా వెళ్ళిపోవాలి. అప్పటికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. నీలాగే కొద్దిరోజులు ఉందామనుకున్నాను. బట్ డాడీ ఆర్డర్. తప్పదు.”

"ఎందుకింత తొందర?”

"నాకు పెళ్ళి చేయాలని ఇంట్లోవాళ్ళు తొందరపడుతున్నారు.”

"నీకా... అప్పుడే పెళ్ళా?"

"హలో... అల్రెడీ పాతికేళ్లు వచ్చేశాయమ్మా. ఇంకెప్పుడు పెళ్ళి? వయసైపోయాకా? నువ్వు కూడా లైన్లోనే ఉన్నావు. ఆ సంగతి మర్చిపోకు.”

“మర్చిపోలేదుగాని, వయసొచ్చింది గాబట్టి పెళ్ళిచేసుకోవాలి. అంతేనా? ఇంకేమీ లేదా?”

“ఇంకేముంటుంది?”

"అబ్బాయి నచ్చాలి. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవాలి. అన్నిటికీ మించి ప్రేమగా చూసుకోవాలి...." అంది శతపత్ర.

“నువ్వు చెప్పే విషయాలు లవ్ మేరేజస్ కి వర్తిస్తాయి తప్ప, అరేంజ్డ్ మేరేజస్ కి వర్తించవు.”

“ఎందుకు వర్తించవు? మైనారిటీతీరిన యువతి తనకు నచ్చినవాడ్ని పెళ్ళి చేసుకోవచ్చని చట్టం వుంది...”

"హలో మేడమ్... కొన్ని విషయాల్ని చట్టాలతో ముడిపెట్టి ఆలోచించలేం. నా వరకే తీసుకో. నా ఉడ్బి అమెరికాలో ఇంజనీర్. మొదటిసారి నేను మా వూరు - వెళ్లినప్పుడు అనుకోకుండా మా పెళ్ళి చూపులు జరిగిపోయాయి. మా డాడీ ఒక్కటే చెప్పారు. నీకు కుర్రాడు నచ్చితేనే సంబంధం ఓకే చేస్తాను. ఛాయిస్ నీది అన్నారు. అతని పేరు మోహన్. నాకు నచ్చాడు. నేనూ తనకు నచ్చాను. ఇద్దరం మాట్లాడుకున్నాం. మా అభిప్రాయాలతో మనసులు కలిశాయి. ఓకే చెప్పేశాను. పూర్వంలా కాదు, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకే స్వేచ్ఛనిస్తున్నారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తేనే ప్రమాదం” అంది

విశ్వదా.

“సో... యూ ఆర్ లక్కీ.. విష్ యు బెస్టాఫ్ లక్. పెళ్ళి తర్వాత అమెరికా, ఇక ఆపైన నేను గుర్తుండను.”

“గుర్తుండవా? నీలా అనుకున్నావా నేను. మా పెళ్ళి అయిన తర్వాత అమెరికా వెళ్ళేప్పుడు లండన్ లో నీకోసం ఆగుతాం. నా ఉడ్బి ని నీకు చూపిస్తాను. నీ ప్లాట్లోనే రెండురోజులు స్టే చేస్తాం. అయినా ఏం చెప్పగలం. ఈలోపలే నాకన్నా నువ్వే ముందు ఇండియా వెళ్ళిపోతావేమో...” అంది.

"లేదు. లేదు. ఇంకొంతకాలం ఇక్కడే వుండాలి”

“ఎందుకు? నాకసలు తెలీక అడుగుతాను. అంత చదువుకోవాలంటే మనదేశంలో లైబ్రరీలు లేవా?”

ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఒక్క నిముషం మౌనంగా ఉండిపోయింది శతపత్ర

ఆమె మౌనాన్ని మరోలా అర్ధంచేసుకుంది విశ్వదా. చిన్నగా నవ్వింది. "సో... నీ ప్రాబ్లం నాకు తెలిసిపోయింది. ఇప్పట్లో పెళ్ళి చేసుకోవటం నీకిష్టంలేదు. హైదరాబాద్ వెళ్తే మీ వాళ్ళు నీకు పెళ్ళి చేసేస్తారని భయపడు తున్నావ్. అందుకే ఆగిపోయావ్” అంది.

“నో... నో... అలాంటిదేమీ లేదు. నువ్వనుకున్న కారణమైతే నేను లైబ్రరీలో గంటలకొద్దీ సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఏముంది?”

“మరెందుకు లైబ్రరీకి వెళ్తున్నావ్?”

“అన్వేషణ”

"వాట్? దేనికోసం అన్వేషణ?”

"చూడు విశ్వదా? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నేటికీ అంతుచిక్కని ఎన్నో మిస్టరీలున్నాయి. విచిత్రమైనవి, భయానక మైనవి, దారుణమైనవి ఎన్నో... అలాంటి మిస్టరీలకు సంబంధించిన సమాచారం కోసం అన్వేషిస్తున్నాను.”

“ఓ షిట్...” అంటూ నుదురు రుద్దుకుంది విశ్వదా.

"అసలు ఇలాంటి ఆలోచన నీకెందుకొచ్చిందే. తెల్సుకుని ఏంచేస్తావ్. ఆ మిస్టరీలను ఛేదించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆశపడు తున్నావా?”

“లేదు” అంది నవ్వుతూ శతపత్ర.

"మరెందుకు? అలాంటి వింతమిస్టరీల గురించి తెలుసుకుని ఏం చేస్తావ్. పూర్తిగా కాకున్నా నాకూ కొన్నిటి గురించి తెలుసు. బెర్ముడా ట్రయాంగిల్... అదో అంతు చిక్కని మిస్టరీ. దాని రహస్యం ఇప్పటికీ మహా మహులకే అంతు చిక్కలేదు. నీవల్ల అవుతుందా?

అట్లాంటిక్ సముద్రం లోతుల్లో గొప్ప బిలం వుంది. అది ఎక్కడికి పోతుందో, అది అసలు ఎలా ఏర్పడిందో నేటీకీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.

ఫ్లయింగ్ సాసర్స్ గురించి అనేక కథనాలు ఉన్నాయి. వాటి సంగతి కూడా మిస్టరీగానే ఉండిపోయింది. అంతదేనికి? మనదేశం లోనే ఉత్తర భారతంలో ఓ గ్రామం వద్ద ఏటా ఒక మాసంలో పక్షులు సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అవి అలా ఎందుకు మరణిస్తున్నాయన్న ప్రశ్నకు నేటికీ బదులు దొరకలేదు."

"విశ్వదా! ప్లీజ్. చాలు ఇక ఆపవే. ఇవన్నీ నాకు తెలుసు" అంది శతపత్ర.

"తెలిసినవాటి కోసం అన్వేషణ దేనికే?"

"తెలియని వాటికోసం.”

"అర్థం కాలేదు..."

"క్వీన్ విక్టోరియా లైబ్రరీలో ఉన్నంత సాహిత్య సంపద ప్రపంచంలో మరే లైబ్రరీలోనూ లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలు, అనేక దేశాలకు చెందిన గ్రంథాలు అక్కడ ఉన్నాయి. మన దేశానికి చెందిన ఎంతో విలువైన ప్రాచీన తాళపత్ర గ్రంథాలూ ఉన్నాయి.

నాకో మిస్టరీ గురించి తెలుసు. అది ఎక్కడ వుందో తెలీదు. దాని జాడ ఖచ్చితంగా ఈ లైబ్రరీలో తెలుస్తుందని నా నమ్మకం. అందుకే మహాసముద్రంలాంటి ఆ గ్రంథాల మధ్య నా అన్వేషణ సాగిస్తున్నాను. ఏదో రోజు నాక్కావలసిన సమాచారం అక్కడ ఖచ్చితంగా దొరుకుతుందని నా నమ్మకం."

"ఓకే... ఐ అగ్రీ విత్ యు... బట్... నీకు తెలిసిన మిస్టరీ ఏమిటి?" అడిగింది విశ్వదా.

శతపత్ర కాస్సేపు మౌనంగా వుండిపోయింది. బహుశా విశ్వదాకు తన అనుభవాన్ని చెప్పాలా వద్దాని ఆలోచనలో పడినట్టుంది. ఏం చెప్పేదోగాని, ఇంతలోనే ఒక సంఘటన జరిగింది... 

బయటనుంచి ఏవో వస్తువులు కిందపడి భళ్ళున పగిలిన అలికిడి, ఆ వెనకే ఏవో అరుపులు, కేకలు, పెద్దగా ఒక్కసారిగా వినవచ్చాయి. ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ గొడవ అంతకంతకూ పెరుగుతోందేగాని తరగటం లేదు.

"ఏమిటే ఆ గోల, పద చూద్దాం” అంది లేచి నిలబడుతూ శతపత్ర.

"ఆ గోల మనకెందుకులేవే. కూచో” అంది విశ్వదా.

"అరె. అంత గొడవ జరుగుతుంటే మనకెందుకులే అంటావేమిటి?” అంది శతపత్ర.

“నీకు కొత్త కావచ్చు. అప్పుడప్పుడూ ఇలా జరగడం మాకు మామూలే. దయ్యంగోల.”

"మైగాడ్. దయ్యమా!" అంటూ ఆశ్చర్యంగా విచిత్రంగా చూసింది శతపత్ర.

"అవును. చివరి ప్లాట్ లో వున్న సుఖదేవ్ సింగ్ భార్య అంజలి ఒంటిమీదికి ఇలా అప్పుడప్పుడు దయ్యం వచ్చి గోల చేస్తూంటుంది” చెప్పింది విశ్వదా.

“ఎవరా దయ్యం?" అడిగింది శతపత్ర.

"సుఖదేవ్ సింగ్  మొదటి భార్య పూర్ణిమ.” ఆలోచనల్లో కూరుకుపోయింది శతపత్ర.

“నిజం కాదనుకుంటున్నావా? చూస్తే నీకే తెలుస్తుంది. ఒకసారి చూశాను. కళ్ళు పెద్దవి చేసి చక్రాల్లా తిప్పుతూ ఉగ్రంగా చూసింది. ఆ చూపులు చాలా భయం గొల్పుతాయి. పూర్ణిమ దెయ్యం ఒంటిమీద ఉన్నప్పుడు అంజలిని పట్టుకోవడం చాలా కష్టం. బలమైన మనుషులు నలుగురు పట్టుకున్నా ఆ సమయంలో తోసిపారేస్తుంది. ఆ అరుపుల బీభత్సం మనకు దడ పుట్టిస్తుంది.

"ఏం జరిగిందసలు. ఆ పూర్ణిమ ఎలా చనిపోయింది?” కుతూహలంగా అడిగింది శతపత్ర.

🍁

*సశేషం*

[03/02, 19:24] Mallapragada Ramakrishna: *శతపత్ర -3*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

విశ్వదా చెప్పసాగింది..

"సుఖదేవ్ సింగ్ వాళ్ళది చాలాకాలంగా బ్రిటన్ లోనే సెటిలైన కుటుంబం.

అతడి తండ్రి హయాంలో పంజాబ్ నుంచి ఇక్కడికి వలస వచ్చేశారు. వ్యాపారాల్లో బాగా సంపాదించారు. పూర్ణిమా వాళ్ళదీ అలాంటి కుటుంబమే. పైగా దగ్గర బంధుత్వం కూడా వుంది. నాలుగేళ్ళ క్రితం మాట. నేనప్పుడే ఈ ప్లాట్లోకి కొత్తగా వచ్చాను.

సుఖదేవ్ సింగ్, పూర్ణిమలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల ఆశీస్సులతో పెళ్ళి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వారి పెళ్ళయిన రెండో సంవత్సరంలో ఇక్కడికి సమీపంలోనే జరిగిన రోడ్ ప్రమాదంలో పూర్ణిమ చనిపోయింది. ఆ విషాదం నుంచి బైటపడిన తర్వాత పంజాబ్ లోని తమ బంధువుల అమ్మాయి అంజలిని పెళ్ళి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ ఫ్లాట్లో సుఖదేవ్, అంజలితోపాటు అతని తల్లి కళాంజలి ఉంటుంది.

పెళ్ళి చేసుకుని ఇక్కడికి వచ్చిన వారం రోజుల తర్వాత మొదటిసారిగా పూర్ణిమ ప్రేతాత్మ అంజలిని ఆవహించి నానా బీభత్సం చేసింది. తను చనిపోయిందన్న బాధలేకుండా అతడు మళ్ళీ పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటున్నందుకు తిట్టిపోసింది. తనకులేని సుఖం అతడికి దక్కకూడదంటూ అంజలిని చంపాలని చూసింది.

అప్పటినుండి అప్పుడప్పుడు అంజలిని ఆవహించి ఇలా నానా యాగీ చేస్తూంటుంది పూర్ణిమ ఆత్మ. అది ఆత్మ కావచ్చు, దయ్యం కావచ్చు, భూతం కావచ్చు. అంజలి ఒంటి మీదికి వచ్చినప్పుడే దాని ఉనికి తెలుస్తుంది. ఇప్పుడా ఫ్లాట్లో జరుగుతున్న గోల ఇదే. పూర్ణిమ దెయ్యం అంజలి ఒంటిమీదికి వచ్చినట్టుంది" వివరించింది విశ్వదా.

నమ్మలేనట్టు. చాలా ఆసక్తిగా ఆ మాటలు వింది శతపత్ర. తనకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. అదేమిటో స్వయంగా చూడాలనిపించింది. అంజలి అనే ఆ యువతి దయ్యం పట్టినట్టు కావాలనే గొడవచేస్తోందేమోనని డౌటు కూడా ఏర్పడింది.

"విశ్వదా... నిజంగా దయ్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావా?” అనడిగింది. 

"వై నాట్? నేను నమ్ముతున్నాను. అనుభవం లోకి వస్తే నువ్వూ నమ్ముతావ్?" అంది నమ్మకంగా విశ్వదా.

"ఎందరో వైద్యులు, మానసిక శాస్త్రవేత్తలు కేవలం భ్రమ మాత్రమే. దయ్యాలు, భూతాలు లేవని చెప్తున్నారు. దయ్యం పట్టినట్టు నటించటం కూడా పిచ్చిలో ఒక భాగం అంటున్నారు" వాదించింది. శతపత్ర.

“అంటున్నారని ఏదీ ఆగిపోవడం లేదుగా? జనం నమ్ముతున్నారు. నీకు ఉదాహరణకి రెండు సంఘటనలు చెప్తాను. ఇక్కడ ఇంగ్లాండ్ లోనే మాంచెస్టర్ లో ఒకాయనకు పాతబంగళా ఒకటుంది. అది ఫస్ట్ ఫ్లోర్ లో రెండు మూడుచోట్ల గోడలు పగుళ్లు వచ్చాయి. దాన్ని బాగు చేయించి అమ్మేయాలనుకున్నాడాయన.

తను జర్మనీ వెళ్తూ కాస్త ఆ పని చూడమని తన ఫ్రెండ్ కి ఆ పని అప్పగించాడు.

మన ఇండియాలో అయితే పగుళ్ళు తీసిన చోట సిమెంట్ పూయించి రంగులు వేసేస్తారు. కానీ ఇక్కడ ఏ పనిచేసినా సిస్టమేటిక్ గా ఉంటుంది. పగుళ్ళని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసి, వాటిని అధ్యయనం చేసి అవసరమైనంత మేర గోడకూల్చి తిరిగి రీబిల్ట్ చేస్తారు.

అదే ప్రకారం ఆ ఫ్రెండ్ తనకు తెలిసిన ఒక కాంట్రాక్టర్ని పిలిపించాడు. ఫోటోగ్రాఫర్ తో సహా వచ్చాడాయన. ఎక్కడెక్కడ గోడలకు పగుళ్ళు ఉన్నాయో అవన్నీ ఫోటోలు తీసుకున్నారు. ప్రింట్లు వచ్చిన తర్వాత చూసి అక్కడ అందరూ షాక్ తిన్నారు.

వాళ్ళు ఫోటోలు తీసినప్పుడు తాము ముగ్గురూ తప్ప ఆ ఇంట్లో ఎవరూ లేరు. కాని ఫోటోల్లో ఒక వృద్ధురాలు కన్పించింది. ఒక ఫోటోలో గోడ పక్కన వాలుకుర్చీలో పడుకుని వుంటే, మరో ఫోటోలో నిలబడి, ఇంకో ఫోటోలో మెట్లెక్కుతూ. అది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు వాళ్ళు:

తెల్లటి గౌనులో స్పష్టతలేని విధంగా గాజు బొమ్మలా ఉందామె ఫోటోల్లో. ఆ ఫ్రెండు, కాంట్రాక్టరు భయపడిపోయి ఇక రిపేరు ఆరంభించలేదు. జర్మనీ వెళ్ళిన ఇంటి ఓనరు తిరిగొచ్చాక ఆ ఫోటోలు చూసి కన్నీరు పెట్టుకున్నాట్ట. ఫోటోల్లో వున్న వృద్ధురాలు అతడి నాయనమ్మ. ఆ ఇంట్లోనే పదేళ్ళక్రితం మరణించింది.

ఆమె పోయినా, ఆమె ఆత్మ అక్కడే ఇంకా తిరుగుతోందని అర్ధంగావటంతో ఆ ఇంటిని రిపేరు చేయించకుండా అలాగే ఉంచేశాడా యన. కొంతకాలం కిందట ఫోటోలతో సహా ఈ వ్యవహారం అనేక పత్రికల్లో ప్రచురితమైంది.

న్యూయార్క్ సిటీలో పీటర్ అనే వ్యక్తి చాలా ధనవంతుడు. అతను వ్యాపార లావాదేవీ లన్నీ చూసుకుని రాత్రి పన్నెండు గంటలకి గాని నిద్రపోయేవాడు కాదు.

ఒకరాత్రి తమ ఆవరణలో మొక్కల మధ్య ఎవరో తిరుగుతున్నట్టు గుర్తించాడు. కిటికీ పక్కకొచ్చి చూస్తే ఒక పొడుగాటి మనిషి స్పోటకం మచ్చలతో కూడిన వికారమైన ముఖంతో నిశ్శబ్దంగా తిరగటం కన్పించింది.

ఎవడో దొంగ అనుకుని రివాల్వర్ తో బయటి కొచ్చి 'ఎవరది?' అనరిచాడు. ఆ వ్యక్తి మౌనంగా వెళ్ళిపోనారంభించాడు. అతన్ని పట్టుకోవాలని ఎంత వేగంగా వెళ్ళినా సాధ్యం కాలేదు. అతడు గేటుదాటి రోడ్డు మీదకుపోయాడు. అతన్ని ఆపాలని తనూ రోడ్ ఎక్కబోతూ అనుమానంతో ఆగిపోయాడు పీటర్. ఆ ఆగంతకుడు రోడ్ ఎక్కడం చూశాడుగాని, తర్వాత అతను కన్పించలేదు.

పీటర్ వెనుతిరిగి లోనికొస్తుండగా రోడ్డుమీద పెద్ద శబ్దం... తిరిగి చూస్తే దారుణ దృశ్యం...

రోడ్డుపై వస్తున్న ట్రక్కు ఒకటి అదుపుతప్పి పక్కన చెట్టును గుద్దుకుంది. డ్రయివర్, క్లీనరు స్పాట్ డెడ్.

పీటర్ కి వణుకు పుట్టింది. పొరపాటున తను రోడ్డు మీదకు వెళ్ళుంటే యాక్సిడెంట్ స్పాట్ లో తనుండేవాడని అర్థమైంది. ఆ తర్వాత కూడా తమ ఆవరణలో ఎవరో తిరుగుతున్నట్టు గమనించినా ఎప్పుడూ తలుపులు తెరిచి బయటికి రాలేదు. ఎవరినీ రానిచ్చేవాడుకాదు.

వారంరోజులు గడిచాయి. ఓ రోజు షాపింగ్ కాంప్లెక్సికి వెళ్ళాడు పీటర్. పధ్నాలుగు అంతస్తుల భవనం అది. లిఫ్ట్ లో పైకి వెళ్ళాలి. లిఫ్ట్ లో పదిమంది ఎక్కారు. చివరిగా పీటర్ వస్తూ లిఫ్ట్ బాయ్ ని చూసి అదిరిపడ్డాడు. అదే ముఖం... స్పోటకం మచ్చలతో కూడిన వికారమైన ముఖం. తమ ఆవరణలో తిరుగుతున్న వ్యక్తిముఖం. అనుమానం వచ్చి లిఫ్ట్ ఎక్కకుండా బయటే ఆగిపోయాడు.

లిఫ్ట్ బాయ్ అతడ్నే చూస్తున్నాడు.

లిఫ్ట్ బయలుదేరింది. పీటర్ కి గుండెలు దడదడలాడాయి. ఏదో జరగబోతోందని భయం. మూడు నిముషాల తర్వాత అతడి భయం నిజమైంది. పదో అంతస్తు నుంచి రోప్ తెగి లిఫ్ట్ వేగంగా వచ్చి కిందపడింది. లిఫ్ట్ లో ఉన్నవాళ్ళలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు.

విచిత్రం ఏమిటంటే- మరణించినవాళ్ళలో లిఫ్ట్ బాయ్ లేడు. యధార్ధంగా జరిగిన పీటర్ అనుభవాలు కూడా న్యూస్ పేపర్స్ లో వచ్చాయి. ఇలాంటివి చాలా వున్నాయి.” శతపత్రకు వివరంగా చెప్పింది విశ్వదా.

కాని ఆమె విశ్వదా మాటల్ని కొట్టిపారేసింది. "నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఎనీవే. కమాన్. నువ్వు చెప్తూన్న సిక్కు ఫ్యామిలీ లోని దయ్యం సంగతేమిటో చూద్దాం.” అంటూ ఆతృతగా బయలుదేరింది శతపత్ర. తన ప్లాట్ కి తాళంపెట్టి శతపత్రను తీసుకుని కారిడార్ చివర వున్న సిక్కు ఫ్యామిలీ ప్లాట్ వైపుకి దారితీసింది విశ్వదా.

🍁

*సశేషం*

*శతపత్ర - 4*

🍁

తన ప్లాట్ కి తాళంపెట్టి శతపత్రను తీసుకుని కారిడార్ చివర వున్న సిక్కు ఫ్యామిలీ ప్లాట్ వైపుకి దారితీసింది విశ్వదా.

📖

"బతికున్నంతకాలం ఎంతో మంచిగా పేరు తెచ్చుకున్నావు.  మరి ఎందుకు ఇప్పుడు చచ్చి సాధిస్తున్నావ్? నీకేం లోటు చేశామని? నీకిది న్యాయంగా ఉందా పూర్ణిమా?" కన్నీళ్ళతో అడుగుతోంది అత్త కళాంజలి.

ఆ మాటలకి కళ్ళు ఎర్రజేసి- మరింత క్రూరంగా చూసింది అంజలిని ఆవహించిన పూర్ణిమ దయ్యం.

"ఏయ్ అత్తా... నీ కొడుక్కి ఇంకో పెళ్ళి చేశావ్. నీకు న్యాయంగా ఉందా?" అంటూ పెద్ద స్వరంతో ఎదురు ప్రశ్నించింది. 

“నాకు న్యాయమేనే... నువ్వు చచ్చావని సన్నాసుల్లో కలిసిపోతాడా? వాడికి తోడు కావాలని పెళ్ళి చేశాం. చచ్చిన నీకు ఆత్మశాంతి కోసం కర్మకాండలు చేసినట్టే నా కొడుకు బతికున్నాడు గాబట్టి మళ్ళీ పెళ్ళి చేశాను. తప్పా?” అంది కళాంజలి.

“తప్పే... ముమ్మాటికీ తప్పే. నాకు కోపం రాదా? ఊరుకుంటానా? నా స్థానం ఎప్పటికీ నాదే. ఇంకొకర్తిని రానివ్వను..." భయంకరం గా అరుస్తోంది దయ్యం. పూనకంతో ఊగిపోతోంది. కళ్ళు పెద్దవిచేసి అరుస్తోంది. ఎర్రటి కుంకుమబొట్టు, జుట్టు విరబోసుకుని ఆమెచూసే చూపులు, చేసే ఆగడాలు వెన్నులో దడ పుట్టిస్తున్నాయి.

నలుగురు బలమైన స్త్రీలు ధైర్యంగా నిలబడి అంజలిని ఒడిసి పట్టుకున్నారు. ఐనా ఆగటంలేదామె. విదిలించేస్తోంది. ఎగిరి దూకుతోంది. అవసరమయితే ఆపటానికి సిద్ధంగా నలుగురు మగాళ్ళు కూడా రెడీగా వున్నారు. వాళ్ళలో ఆమె భర్త సుఖదేవ్ సింగ్ కూడా ఉన్నాడు. తప్పించుకుందంటే కిటికీలోంచి బయటకు దూకి అంజలిని చంపేస్తుందని భయపడుతున్నారంతా. ఎందుకైనా మంచిదని కిటికీ తలుపులు మూసేసి వుంచారు.

ఆ ఫ్లాట్ ముందు చాలామంది గుమిగూడి పోయారు. కింద, పైన, పక్క ఫ్లాట్లో ఉండే చాలామంది బయటే నిలబడి లోపలి తంతును భయం భయంగా చూస్తున్నారు. వాళ్ళలో ఇండియన్స్ మాత్రమే కాదు. జర్మనీ, ఫ్రెంచ్ ఫ్యామిలీసి కి చెందినవాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు జడుసు కుంటారని వెనక్కి లాక్కుపోతున్నారు కొందరు.

"ఒసే పూర్ణిమా! నువ్వు చచ్చావని నా కొడుకు ఇక జీవితాంతం ఎటువంటి సుఖం లేకుండా ఒంటరిగా బతకాలా? ఎందుకే ఇలా మమ్మల్ని పీడిస్తున్నావ్?" విసుగ్గా అరిచింది అత్త కళాంజలి.

"బతకాలి...” అంటూ పళ్ళు పటపట కొరుకుతూ రక్తవర్ణం దాల్చిన కళ్ళతో మొగుడు సుఖదేవ్ వంక చూసింది పూర్ణిమ దయ్యం. ఎగిరెగిరి తుళ్ళుతూ తప్పించు కోడానికి గింజుకుంటోంది.

ఆమె ఉగ్రరూపం చూస్తున్నవాళ్ళకి గుండెలు పీచుపీచుమంటున్నాయి. కాళ్ళలో వణుకు పుడుతోంది. ఎక్కడ వచ్చి మీద పడుతుందో నని భయంగా చూస్తున్నారు.

ఆ దృశ్యం భయానకం... బీభత్సం... గింజుకుంటూనే అరిచింది దయ్యం. "ఏయ్ అత్తా... అడగవే నీ కొడుకు నడగవే... నాతో ప్రేమగా ఉన్నాడా లేదా అడుగు. నువ్వే నా లోకం అన్నాడు. చావులోనూ, బతుకు లోనూ కలిసుందాం అన్నాడు. మరి నాతో వాడు ఎందుకు చావలేదు? పైగా నన్ను  మర్చిపోయి ఇంకోదాన్ని పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటాడా.... ఉండనివ్వనే... మీ అందర్నీ నాశనం చేస్తా...” భయానకంగా నవ్వుతోంది.

సరిగ్గా శతపత్ర, విశ్వదాలు ఆ ఫ్లాట్ ముందుకు వస్తుండగా లోపల జరుగుతున్న సంఘటన అది.

"ఏమిటే విశ్వదా... బయటే ఉండి అంతా చోద్యం చూస్తున్నారు" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది శతపత్ర.

"చూడక... లోనికి పోతారనుకున్నావా? అలా వెళ్ళాలంటే ధైర్యం ఉండాలమ్మా. అదిగో విను... ఆ దయ్యం అరుపులు ఎలా ఉన్నాయో, మనకెందుగ్గాని రావే వెనక్కి వెళ్ళిపోదాం" అంది ఒకింత గాభరాపడుతూ విశ్వదా.

"ఏయ్... ఏమిటే అంత భయం. లోనికి పోతే చంపుతుందా? రా చూద్దాం" అంది శతపత్ర.

"చంపుతుంటే చూద్దామా...”

“విశ్వదా... అది ఇంతవరకు ఎవరినైనా చంపిందా?”

“లేదు”

"మరి భయమెందుకు? ఇప్పుడు కూడా చంపదు. కమాన్” అంటూ విశ్వదాని పిలిచింది శతపత్ర.

"ఏమిటే... నీకు భయం వేయదా?"

“రాచబిడ్డనే... భయమంటే ఏమిటో నాకు తెలీదు”

మాట్లాడుకుంటూనే ఇద్దరూ గుంపును చేరుకున్నారు. గుంపును దాటి గుమ్మంలోకి పోబోతూంటే ఉన్నట్టుండి లోపలి పూర్ణిమ దెయ్యంగా పెద్దగా అరిచింది.

"వద్దు... రావద్దు... దాన్ని రావద్దని చెప్పండి.... నా ఒళ్ళు భగ్గు మంటోంది. దాన్ని ఆపండి" అంటూ, ఆ అరుపులు విని లోపలివాళ్ళే కాదు, బయటివాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరిని ఉద్దేశించి అలా అరుస్తోందో అర్థంకాలేదు. ఈలోపల డోర్ సమీపంలోకి వచ్చేశారిద్దరూ.

"వద్దు... రావద్దు... ఒసే శతపత్రా ఆగిపోవే” ఒక్కసారిగా తన పేరు పెట్టి దయ్యం పిలవటంతో శతపత్ర షాకయింది. విశ్వదా ఆశ్చర్యానికి అంతులేదు. లోపలి పరిస్థితి చాలా బీభత్సంగా వుంది.

అటో ఇద్దరు, ఇటో ఇద్దరు మహిళలు అంజలిని బలంగా ఒడిసి పట్టుకుని ఆపుతున్నారు.

విరబోసిన జుట్టులోంచి, ఎర్రబడ్డ కళ్ళతో క్రూరంగా చూస్తోంది. అంజలిని ఆవహించిన పూర్ణిమా దయ్యం.

ఆమె ఉగ్రరూపాన్ని చూళ్ళేకపోయింది విశ్వదా. భయంతో శతపత్ర వెనక ఒదిగి నిలబడింది.

"ఆ దెయ్యం నిన్ను రావద్దంటోంది. ఏం చేస్తుందో ఏమిటో... మనకెందుకొచ్చిందిగాని వెళ్ళిపోదాంరావే..." అంది విశ్వదా భయంతో.

“నా పేరు తనకెలా తెలుసు?" ఆశ్చర్యం నుంచి తేరుకోలేక అడిగింది శతపత్ర.

"అదేకదా... దయ్యాలకు అన్నీ తెలిసిపోతాయ్. వెనక్కి వెళ్ళిపోదాం రావే..." అంది విశ్వదా.

“ఇక్కడ ఇంతమంది ఉండగా దెయ్యం నన్ను మాత్రమే ఎందుకు రావద్దంటోంది? తెలియాలి" అంటూ ముందుకు ధైర్యంగా అడుగులేసింది శతపత్ర.

విశ్వదా ఫ్లాట్ కి తను వచ్చి పోతూ వుంటుంది. అంజలిని రెండు మూడుసార్లు తను చూసింది. ఆమె కూడా తనను చూసింది కాని, తన పేరు తెలిసే అవకాశం లేదు.... ఏమో తెలుసుకుందేమో.

ఒకవేళ తన పేరు తెలుసుకుంది అనుకున్నా కూడా గదిలో ఉన్న అంజలికి కారిడార్లో తను వస్తున్నట్టు ఎలా తెలిసింది? ఒకవేళ నిజంగా అది పూర్ణిమా దయ్యమేనా... ఇదేదో తెలుసుకోవాలి.

📖

గడప దాటబోయింది శతపత్ర.

"రావద్దని చెప్పాగా... లోనికి రావద్దు” క్రూరంగా చూస్తూ మరోమారు హెచ్చరించింది దయ్యం.

"వస్తే ఏమవుతుంది?" చేతులు కట్టుకుని గుమ్మం ముందే నిలబడి లోపలికి చూస్తూ అడిగింది శతపత్ర.

"నేను భరించలేను... తట్టుకోలేను. వెళ్ళిపోవే..." ఇల్లెగిరిపోయేలా అరుస్తూ గింజుకుంటోంది దయ్యం.

"నేనేం చేశానని? ఎందుకు తట్టుకోలేవ్? ఇదిగో అంజలీ.. నీ భర్త బాధపడుతున్నాడు. నీ అత్త ఏడుస్తోంది. ఇంక నువ్వు ఆడుతున్న నాటకం చాలు. ఇంతటితో ఆపేసెయ్" ధైర్యంగా చెప్పింది శతపత్ర.

“నాది నాటకమా! నన్నెవరనుకుంటున్నావే.. నేను అంజలినికాదు... పూర్ణిమను" హుంకరించింది ఆత్మ.

"ఓ.కె. నువ్వు పూర్ణిమవని ఒప్పుకుంటున్నా ను. నువ్వు ఎవ్వరినైనా కాని, మీ మధ్య అంజలి నలిగిపోతోంది. ఆమెను పీడించకు. తక్షణం వదిలి వెళ్ళిపో."

"వెళ్ళను... దీన్ని వదలను.”

"అయితే నేను లోపలికి వస్తున్నా.”

“వద్దు. నువ్వు రానేవద్దు.”

“అయితే వెళ్ళిపో.”

“వెళ్ళను..." దయ్యంతోపాటు తనూ పెద్దగా అరుస్తోంది శతపత్ర. ఈ సరికొత్త మలుపేమిటో అర్ధంగాక అంతా చేష్టలుడిగి చూస్తున్నారు.

శతపత్ర గడప దాటింది. నెమ్మదిగా అయిదడుగులు ముందుకేసింది. విశ్వదా మాత్రం వణికిపోతూ బయటే ఆగిపోయింది. శతపత్ర తనను సమీపించటం చూసి గగ్గోలుగా అరవటం ఆరంభించింది పూర్ణిమ దయ్యం. అరుపుల మధ్య తిట్టిపోస్తోంది–

"రావద్దని చెప్పాగదా! ఎందుకొచ్చావే... నా ఒళ్ళు కాలిపోతున్నట్టుంది. వేడి మంటలు... అమ్మో... భరించలేను" అంటూ పెద్దగా గింజుకుంటోంది.

అంతలోనే అంజలి శరీరాన్ని వదిలి బయటికొస్తోంది. తిరిగి శరీరాన్ని ఆవహిస్తోంది.

దయ్యం వదలగానే పట్టుకున్నవాళ్ళ చేతుల్లో తోటకూర కాడలా వేలాడబడి పోతోంది అంజలి. తిరిగి ఆవహించగానే తుపానుగాలి ఒక్కపెట్టున వీచినట్టు చివ్వున లేచి కేకలు వేస్తూ గంతులేస్తోంది.

భీతావహంగా మారిపోయింది పరిస్థితి. అంజలి శరీరాన్ని వదలగానే ఏదో రివ్వు రివ్వున గదిలో పైన తిరుగుతున్న శబ్దాన్ని స్పష్టంగా వింటున్నారంతా. బంతిలా గోడల్ని తాకి వెనక్కి వస్తుంటే ఖరీదైన వస్తువులు భళ్ళున పగిలి కిందపడుతున్నాయి.

"నావల్ల కావటంలేదే... నీకు దండం పెడతాను. వెళ్ళిపోవే శతపత్రా...” తిరిగి అంజలిని ఆవహించి బాధాపూరితంగా అరుస్తోంది పూర్ణిమ దయ్యం.

అంత బీభత్సంలో కూడా కించిత్తు కూడా భయపడకుండా ఎదురుగా నిలబడివుంది శతపత్ర. గుమ్మం వద్ద గుమిగూడిన వాళ్ళలో చాలామంది భయంతో దూరంగా పారిపోయారు. లోపలున్న వాళ్ళకి చెమటలు పట్టేస్తు న్నాయి. 

"నువ్వు నీజంగా దయ్యానివైతే నా గురించి ఎందుకు భయపడుతున్నావ్?" చాలా స్థిరంగా అడిగింది శతపత్ర. 

"నన్ను కాల్చి బూడిద చేద్దామనా... నీ గురించి నీకే తెలీదు.” అంది దయ్యం.

“అయితే నువ్వీ అమ్మాయిని వదిలివెళ్ళిపో" అంది శతపత్ర.

“వెళ్ళనంటున్నాగా...”

"అయితే నేనే నిన్ను పట్టుకుంటా”

అంజలిని పట్టుకోవాలని అడుగు ముందుకేసింది శతపత్ర.

భయంతో పెద్దగా అరుస్తూ తనని పట్టుకున్న వాళ్ళని విదిలిస్తూ నాలుగడుగులు వెనక్కి దూకింది దయ్యం. "వద్దు. నన్ను తాకొద్దూ" అనరిచింది.

"ఏమవుతుందో తాకిచూస్తాను.”

"వద్దు వద్దు. నువ్వు చెప్పినట్టు వింటాను. నన్నేమీ చేయకు.” 

"అయితే అంజలిని వదిలి వెళ్ళిపోతావా?" అని అడిగింది శతపత్ర.

“పోతాను”

“మళ్ళీ రాకూడదు.”

"రాను"

"రానని నమ్మకం ఏమిటి?”

"రాను... రాను... నా మొగుడిచేత్తో పసుపు నీరు తాగించమని చెప్పు. వెళ్ళిపోతాను" అంది దయ్యం.

"నువ్వు వెళ్ళిపోతున్నట్టు రుజువు చూపించాలి" అంది శతపత్ర. 

“చూపిస్తాను. అదిగో... ఆ కిటికీ అద్దం పగలగొట్టుకుని వెళ్ళిపోతాను" 

ఆ సంభాషణంతా మొత్తం ఆశ్చర్యంగా వింటున్నారంతా. శతపత్ర ప్రత్యేకించి చెప్పక్కర్లేకుండానే సుఖదేవ్ సింగ్ గ్లాసు మంచినీటిలో చిటికెడు పసుపు కలిపి తెచ్చాడు.

అంజలిని ఆవహించిన పూర్ణిమ దయ్యం మొగుడ్ని ప్రేమగా చూస్తూ పసుపునీరు తాగింది. తాగుతూ హృదయవిదారకంగా ఏడుస్తోంది. 

"నాకు చాల్లేదు... బిందెడు కావాలి" అంది తక్షణం బిందెడు పసుపు నీళ్ళు తెచ్చాడు సుఖదేవ్ సింగ్.

అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బిందెలో సగం నీరు తాగేసింది" మిగిలిన నీటిని తలమీద పోసుకుంది. అంతే- అంజలి శరీరం నుంచి దయ్యం తప్పుకుంది. గదిలో రివ్వురివ్వున ఏదో అదృశ్యశక్తి తిరుగుతున్న శబ్దం విన్పించింది.

పది సెకన్ల తర్వాత అంత ఎత్తులో ఉన్న కిటికీ అద్దం విచిత్రంగా భళ్ళున పగిలింది. అంతే- గదిలో నిశ్శబ్దం అలముకుంది.

📖

స్పృహలేని అంజలిని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు. ఆమెను స్పృహలోకి తెచ్చే ప్రయత్నాలు ఆరంభించారు.

అంజలి అత్తగారు కళాంజలి అయితే ఆనందంతో శతపత్ర రెండు చేతులూ పట్టుకుని వదల్లేదు-

"పెద్దపెద్ద మంత్రగాళ్ళని తీసుకొచ్చాం. ఎవరూ పూర్ణిమ దయ్యాన్ని వదిలించలేక పోయారు. ఆ మొండి దయ్యాన్ని వదిలించి, నా కోడల్ని, మా కుటుంబాన్ని కాపాడావ్. కాళ్ళకు మొక్కాలని వుంది తల్లీ. వయసులో చిన్నదానివి అని ఆ పనిచేయలేక పోతున్నాను” అంది కన్నీటితో.

"మాకెంతో ఉపకారం చేసిన నిన్ను ఉత్త చేతులతో పంపించలేము. మేమిచ్చే కానుకలు తీసుకెళ్ళాలి" అంటూ ఆనందంతో అర్థించాడు సుఖదేవ్ సింగ్.

సున్నితంగా వారిని తిరస్కరించింది శతపత్ర "మీరు నాకేవో శక్తులున్నాయని పొరపాటు పడుతున్నట్టున్నారు. అలాంటిదేమీ లేదు. అందరిలాగే నేను కూడా ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను. కారణం తెలీదుగాని పూర్ణిమ నన్ను చూసి భయపడింది. దాన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళిపొమ్మని చెప్పాను. అంతే... నాకు ఈ కానుకలు అవసరం లేదు. మీ అభిమానం చాలు" అంటూ అంజలిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి విశ్వదాతో కలిసి ఆమె ప్లాట్ కి వచ్చేసింది శతపత్ర.

🍁

*సశేషం*

Saturday, 7 February 2026

 *సండే స్టోరీ*

*పొట్టభద్రుడు!*

రచన: యాసీన్

మా రాంబాబు పరమ రెటమతస్తుడని తెలుసు. అయితే... వాడిలోని పిడివాది మరీ ఇంత ఉద్ధృతంగా ఉంటాడన్న విషయం, వాడికి ఓ సలహా ఇచ్చేదాకా నాకూ తెలియదు.

"ఒరే రాంబాబూ... పొట్ట కాస్త ముందుకొస్తు న్నట్టుంది. కాస్త ఏ వాకింగో, ఎక్సర్సైజో చెయ్యి బాబూ" అన్నా. అంతే... వాడు నన్ను క్యాంటిన్ కి తీసుకెళ్లి, అక్కడ చూపించాడు తన విశ్వరూపం.

"అన్నానికి, దేహానికి జరిగిన ఓ సమరంలో/ అరగడానికీ పెరగడానికీ మధ్యన సంగ్రామం లో/బెల్టు కట్టుకీ కట్టుబడనిదీ పొట్ట/బస్కీలకూ మెల్టుకానిదీ పొట్ట/ఇది ఆ దైవమే ఇచ్చిన పొట్టా... అది పెరిగితే తప్పా... తప్పా... తప్పా... నో... నెవర్ " అంటూ సాక్షాత్తూ గ్యాస్ట్రిక్ చౌదరి అవతారం
ఎత్తేశాడు.

"ఒరే... ఒరే... ఏదో తెలీక సలహా ఇచ్చా. వదిలెయ్" అని ప్రాధేయపడితే ఉగ్రావతారం విరమించినా శాంతావతారంలోకి వచ్చే ముందు మరికాసేపు ఆవేశపడ్డాడు. ఆ టైమ్ లో పొట్ట గురించి వాడి అభిప్రాయాలు వింటే నాకు మతిపోయింది.

"ఒరేయ్... పొట్ట కాస్త పెరగ్గానే ప్రతివాడూ సలహాలిచ్చేవాడే. అసలు పొట్టా... దాని మహత్యమేమితో తెల్సా" అంటూ ఆవేశంగా అడిగాడు.

"తెలియదురా... తర్వాత చెబుదువుగానీ" అంటూ కాస్త తప్పించుకోడానికి చూశాగానీ.. నా అంతట నేనే తెచ్చుకున్న తంటా కాబట్టి వీలుకాలేదు.

"పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు అనే వాడుక మాట ఎప్పుడైనా విన్నావా? పోనీ వాడికి డొక్కశుద్ధి ఉందండీ అనే నానుడి? దీన్ని బట్టి తెలిసేదేమిటి? మన పూర్వపు రోజుల్లో పొట్ట అనేది మన విజ్ఞానానికి చిహ్నంగా ఉండేదని తెలియడం లేదూ! క్రమంగా అక్షరాలూ, విజ్ఞానం మెదడులో ఉంటాయని ఆధునిక విజ్ఞానశాస్త్రం తేల్చింది కాబట్టి క్రమంగా జ్ఞానానికి పొట్టే కేంద్రమన్న పాత సిద్ధాంతం కొట్టుకుపోయి బ్రెయిన్ సెంట్రిక్ సిద్ధాంతం వచ్చింది. అయినా సరే... ఇప్పటికీ భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లలా నేనూ ఇప్పటికీ పొట్టే జ్ఞానానికి కేంద్రమనీ, దాన్ని ఎప్పుడూ నింపుకోవడం వల్లనే జ్ఞానం వృద్ధి అవుతుందని నమ్ముతున్నా. పెరిగిన పొట్ట వాడిలో పెరిగిన జ్ఞానానికీ ఒక ప్రతీకరా” అన్నాడు.

“సరే సరే... ఇకపై నేనూ నమ్మడానికి ప్రయత్నిస్తాన్లే" అంటూ వాడి ఆవేశాన్ని శాంతపరచడానికి మళ్లీ ఒకసారి విఫలయత్నం చేశా.

“పెరిగిన పొట్ట ఒక విజ్ఞానభాండాగారమే కాదు... అది ఒక కళారూపం”

"పొట్ట కళారూపం ఏమిట్రా? నీకు మతిగానీ పోయిందా?" అంటూ అడిగా.

“పొట్ట పెరిగిన వాణ్ణి ఎప్పుడైనా చూశావా? అంతకుముందు వాడెప్పుడూ తన పొట్టను తానే గమనించడు. కానీ పొట్టంటూ పెరిగాక వాడిలోని ఘటవాద్యకారుడు బయటికి వచ్చేస్తాడు. వేళ్లతో, చేతులతో దానిపై దరువేస్తూ అప్పటివరకూ తనలో నిశ్శబ్దంగా నిబిడీకృతమై ఉన్న అంతర్గత కళాకారుణ్ణి అంటే ఓ ఘటవాద్యకారుణ్ణి బయటకు తీస్తాడు. అలాంటి పొట్ట మీద అనవసరంగా కామెంట్లు చేసి కళాకారుడు పుట్టకముందే వాడిలోని ప్రతిభను దయచేసి మీరు తొక్కేయకండ్రా. ప్లీజ్" అన్నాడు.

"పొట్టకూ ఘటవాద్యానికీ ఏమైనా సంబంధం ఉందట్రా. నీ పొట్టలాగే నీకు మరీ జ్ఞానం కూడా పెరిగి అది వెర్రితలలు వేస్తోంది" అంటూ కాస్త కేకలేయబోయా.

"డొక్క చించి డోలు కట్టడం అన్న వాడుక ఎప్పుడైనా విన్నావా, లేదా? అంటే ఏమిటీ? డొక్కలో ఘటవాద్యం, డోలూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డొక్కకూ, డోలుకూ సంబంధం ఉంది కాబట్టే ఆ సామెతపుట్టింది. ఇన్ని తార్కాణాలూ, దృష్టాంతాలూ ఉన్నా నీలాంటి అజ్ఞానులు ఒక పట్టాన నమ్మర్రా. అంతెందుకు ఎవడైనా బాగుపడటానికి కారణం వాడి పొట్టే"

"బాగుపడటానికీ పొట్టకూ సంబంధం ఏమిట్రా రాంబాబూ?"

“ఎవడైనా బాగుపడాలనుకుంటే వాడు పొట్టచేతపట్టుకుని పోయి, పొట్ట తిప్పలు పడి పొట్టపోసుకుంటాడు. ఎవడైనా పొట్ట పోసుకుంటూ ఉంటే మీలాంటి ఓర్వలేని వాళ్లు కళ్లలో నిప్పులు పోసుకుంటారు. ఇలా కష్టపడి పొట్టపోసుకునేవాడేరా జీవితంలో పైకొస్తాడు. బాగుపడేవాళ్లను మీరు పొట్ట పేరు చెప్పి వాళ్ల పొట్ట కొట్టకండ్రా ప్లీజ్" అన్నాడు మళ్లీ ఆవేశం పెంచుకుంటూ.

“ఒరే నువ్వొక్కడివే పొట్టను ఇలా వెనకేసు కొస్తున్నావ్. ఆరోగ్యానికి పొట్ట అంత మంచిది కాదు తెల్సా?”

"నాకు చెప్పకు. పొట్ట ఉంటే టక్కు బాగా కుదుర్తుందని చిరుపొట్టకోసం చాలామంది యూత్ ఏవేవో ప్రయాసలు పడతారు. నువ్వెప్పుడైనా పొట్టగలవాడు మోటార్ సైకిల్ నడుపుతుంటే చూశావా? బండి పెట్రోల్ ట్యాంకు మీద ఓ కుండను జాగ్రత్తగా పెట్టుకుని, కాళ్లూ చేతుల మధ్య దాన్ని దొర్లిపోకుండా ఉంచుకున్నట్లుగా వెళ్తుంటారా పొట్టగలవాళ్లూ! బండినడుపుతున్నవాడు ఒక్క పొట్టనే ఇంత అపురూపంగా ఎందుకు చూసుకుంటాడంటావ్. వాడికి నీపాటి జ్ఞానం లేకనా? అదే అపురూపమైందని వాడికి తెలుసు గాబట్టి. అంతెందుకు వయసు పెరుగున్నకొద్దీ ఏ చదువూ, ఏ డిగ్రీలూ లేకుండానే లోకమనే ఈ విశ్వవిద్యాలయం లో ఒక పరిణతి చెందిన డిగ్రీ ఇచ్చి ఒకణ్ణి పొట్టభద్రుణ్ణి చేస్తుందిరా ఈ జీవితం. కాబట్టి దాన్ని కించపరచకు. వాకింగులంటూ, వ్యాయామాలంటూ సలహాలిచ్చి ఎవ్వడి పొట్టనూ పొట్టనబెట్టుకోకు” అంటూ వార్నింగిచ్చాడు మా రాంబాబుగాడు.

రాంబాబు ధోరణేమిటి ఇలా పెడసరంగా ఉంది చెప్మా అంటూ కాస్త వాకబు చేశాక విషయం తెలిసింది. పాపం అన్ని రకాల ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గలేదట వాడికి. అందుకే ఇలా సమర్థింపుల్లో దిగాడట. కొంతమంది అంతే.. ఏదైనా వదిలించుకో వడం కుదరకపోతే అదే ఎస్సెట్టంటూ ఎనకేసుకొస్తూ ఎదురుదాడికి దిగుతారు. బట్టతల తప్పదని తెలిశాక దాన్ని సమర్థిస్తూ మాట్లాడినట్టు. వాడూ ఇదే బాపతు. ఏం చేస్తాం. ఎంతైనా మా ఫ్రెండు కదా. వాడి గురించి ఎవడికైనా చెబుదామని కాస్త అనిపించినా... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని సైలెంటయిపోయా.

*వ్యక్తిత్వ వికాస పాఠాలు!*

రచన: యాసీన్

ఈమధ్య మా రాంబాబుగాడు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చాలా ఎక్కువగా చదువుతున్నాడు. 'విజయానికి ఆరు మెట్లు' అనే పుస్తకాన్ని వాడు చదివాడట. అయితే ఆ పుస్తకంలో పేర్కొన్న మెట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనీ, ఇంకా మరింత షార్ట్ కట్ లో ఎవరైనా విజయానికి దారులు సూచిస్తే బాగుండేదని వెతుకుతున్నాడు. 'విజయానికి రెండు మెట్లు' అనో లేదా 'విజయానికి మెట్లు లేవ్!'... డైరెక్టుగా జంప్ చేసి విక్టరీని అందుకోవడమే అంటూ ఇంకెవరైనా రాశారేమో అని లైబ్రరీలు వెతికి కనుక్కుంటున్నాడు కానీ... ఇప్పటివరకు ఉన్న మెట్ల సంఖ్యలో ఇప్పటికి అదే లీస్టు అని తెలిశాక బాగా నిరాశ-నిస్పృహలకు లోనయ్యాడు మనవాడు.

"ఓరేయ్... పుస్తకాలు చదివితే వ్యక్తిత్వం వికసించదు. అదే జరిగితే ఒక లక్షమంది ఒకే పుస్తకాన్ని చదివి, తమ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటే... అందరి తత్వం ఒకేలా మారిపోయేది కదా. కానీ అసలు అలా కుదురుతుందా? ఆలోచించు. ఎంత చదివినా, ఏం చేసినా ఎవడి వ్యక్తిత్వం వాడిదే. సొంత ఆలోచనతో ఆయా సందర్భాల్లో ఏది మంచిదో నీ కామన్ సెన్స్ తో నీకు నువ్వే నిర్ణయించుకోవాల్సిందే తప్ప... నీకు జీవితంలో ఎదురు కాబోయే సంఘటలను ఎవరో ఊహించి ముందుగానే రాయలేరు. సో... వికాసాన్ని చదువుతో సాధించడం కాబట్టి విచక్షణతో మసలుకో. వివేచనతో బతుకుపో" అని చెప్పి చూశా. కానీ మొదట్లో మా 'రాంబాబు అస్సలు ఒప్పుకోలేదు. అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్న గురజాడ వారి సూక్తిని అనుసరించి ప్రస్తుతానికి వాడి పైత్యానికి వాణ్ణే వదిలేశా.

వ్యక్తిత్వ వికాస పాఠాలు తలకెక్కిన నేపథ్యంలో ఓ రాత్రి మా రాంబాబుగాడికి ఒక కల వచ్చిందట. కలలో విషయాల్ని నాతో షేర్ చేసుకున్నాడు వాడు.

అనగనగా ఓ సింహం వ్యక్తిత్వ వికాస పుస్తకాలను బాగా ఒంటబట్టించుకుందట. అది తన జూలును క్లీన్ గా షేవ్ చేయించు కునీ తన గోళ్లను నీట్ గా ట్రిమ్ చేయించుకు నీ 'తరతరాలుగా, యుగయుగాలుగా నేను నీ కుంభస్థలాన్ని బద్దలుకొట్టడమే చేస్తున్నా. ఇకపై అలాంటి దుర్మార్గాలు చేయనబో' నంటూ ఓ ఏనుగును స్నేహపూర్వకంగా పలకరిస్తూ దాని తల పెకైక్కి... "మన స్నేహానికి గుర్తుగా నీకు పంజా మసాజ్' చేస్తానందట. ఒళ్లు మండిన ఏనుగు ఆ సింహాన్ని పట్టి, తొండంతో చుట్టి... దూరంగా విసిరిపారేసిందట. దాంతో కుయ్యోమంటూ ఆ సింహం "స్టీఫెన్ పాలకోవా రచించిన 'ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ యానిమల్స్' లాంటి పుస్తకాలు నేనొక్కదాన్నే చదివితే కుదరదు. సదరు వ్యక్తిత్వ వికాస పాఠాలను ఏనుగు కూడా చదివినప్పుడే వాటికి సార్థకత" అని విచారిస్తూ కుయ్యో మంటూ నిట్టూర్చిందట.

సింహం గర్జించాలి, పులి గాండ్రించాలి. అప్పుడే వాటి వ్యక్తిత్వం వాటిది లాగే ఉంటుంది. అంతేగానీ... గర్జించాల్సిన, గాండ్రించాల్సిన జంతువులు కుయ్యో మొర్రో మంటూ మూల్గితే అడవిలో ఆర్డర్ తప్పుతుందని వివరించా. 'అలా అడవిలో అరాచకం ఏర్పడితే ఇటు మానవుల మనుగడకూ ముప్పు' అని చెప్పా. దాంతో వాడిపై నా మాటల ప్రభావం కొద్దిగా పడినట్టే అనిపించింది.
📖

ఓరోజు మా రాంబాబు గాడింట్లో దొంగ దూరాడు. అర్ధరాత్రి ఆ టైముకు వ్యక్తిత్వ వికాస పుస్తకం చదువుకుంటున్న మనవాడు దొంగను సాదరంగా ఆహ్వానించాడు. దొంగతనం ఎంత తప్పో మన రాంబాబు సోదాహరణంగా వివరించబోయాడు కానీ... అందంతా సోదిలా అనిపించడంతో సదరు దొంగ మన రాంబాబు బుర్రపై రామకీర్తనలతో సహా అనేక పాటలను ఏకకాలంలో పలికించి చేతికందిన వస్తువుల్ని చక్కా పట్టుకు పారి పోయాడు. "దొంగను చూడగానే పోలీసులకు ఫోన్ చేయాలి, లేదా అరుస్తూ, ఇరుగు పొరిగింటిని పిలుస్తూ హడావుడి చేసి వాణ్ణి పట్టుకునే మార్గం చూడాలిగానీ... ఎవడైనా దొంగకు వ్యక్తిత్వవికాస పాఠాలుచెబుతారా?” అని నేను కోప్పడబోతే... సదరు దొంగ సరిగా ప్రవర్తించకపోవడానికి కారణం వాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చదవకపోవడమే ననీ, అదేగానీ వాడు పర్సనాలిటీ డెవలప్ మెంట్ గురించి చదివి ఉంటే తప్పక తన మాటలూ, ఉపదేశాలూ విని బాగుపడే వాడని బాధపడ్డాడు మా రాంబాబు.
📖

ఓరోజున మా రాంబాబు 'హౌ టు విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ఫ్లుయెన్స్ 'పీపుల్' అనే డేల్ కార్నెగీ అనే మహానుభావుడి పుస్తకాన్ని తదేకదీక్షతో చదువుతూ ఉండగా నేను వాడింటికి వెళ్లా. వాడి వ్యక్తిత్వ వికాసం ఎలా ఉన్నా... వాడు చేసుకుంటున్న టైం వేస్ట్ గురించి బెంగ ఎక్కువై ఒక రెండు మాటలు చెప్పా.

“ఒరేయ్ రాంబాబూ! ఫ్రెండ్ ని గెలవడం ఏమిట్రా? స్నేహితుడంటే వాడేమైనా నీ ప్రత్యర్థా, పగవాడా, పొరుగింటి తగాదా కోరా? వాడికీ, నీకూ ఏముంటుంది గట్టు తగాదా? నీ ఫ్రెండ్ అంటే నీలోని బలహీనత లనూ, బలాలనూ సమానంగా స్వీకరించి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నింటినీ స్వీకరించేవాడు. నీకు మానసికమైన తోడు. అలాంటి నీ స్నేహితులను ఓడించాల్సిన లేదా గెలవాల్సిన అవసరం ఎందుకొస్తుంది. కాస్త ఆలోచించు" అంటూ వాడికి కౌన్సెలింగ్ చేశా. అలాగే పతంజలి రాసిన "గెలుపుసరే బతకడం ఎలా?" పుస్తకాన్నీ, మరికొన్ని రావిశాస్త్రిగారి పుస్తకాల్నీ ఇచ్చా. అంతే... అవి చదివాక వ్యక్తిత్వ వికాసం అంటే లోకజ్ఞానం కలిగి ఉండటమనీ, అసలు లోకజ్ఞానం ఏమిటో తెలిసి ఇప్పుడు తన సొంత వ్యక్తిగత వ్యక్తిత్వంతో బతికేస్తున్నాడు వాడు.

కనీసం ఈ విషయంలోనైనా రాంబాబుగాడి రెట'మత మార్పిడి' కొద్దిగానైనా సాధ్యమై నందుకు నేను ఇతోధికంగా ఆనందించా. శతాధికంగా వాణ్ణి అభినందించా.

*సమాప్తం*

*సండే స్టోరీ*

*మెడికల్ రిపోర్ట్స్*
📝

రచన: నండూరి సుబ్బారావు

అదే అమ్మడూ. ఇక నీ మాంగల్యాన్ని ఎలా కాపాడుకుంటావో. పైన భగవంతుడున్నాడు. క్రింద నీవున్నావు. మధ్య బావున్నాడు" అని హైడ్రోజన్ బాంబు లాంటిది చెల్లెలు నళిని చెవిలో వేసి లేచి నిలబడ్డాడు వీర వెంకట వరప్రసాదు... వెళ్తూ వెళ్తూ ఒక క్వార్టరు బాటిల్ జేబులో పెట్టుకుని రెండు క్వార్టర్సు చేతి సంచిలో వేసుకుని తూలుతూ తూలుతూ తన ఊరు వెళ్ళిపోయాడు.

వార్త విన్న నళిని కరెంటు షాకు తిన్నట్టు నవనాడులూ బిగదీసుకుపోయి ఎలాగోలా లోపలికి పోయి గంగానమ్మకు చద్ది నైవేద్యం పెడతానని మొక్కుకుంది. నిగనిగలాడు తున్న తన కురులలో నుంచి రెండు వెంట్రుకలు కత్తిరించి తీసి వెంకటేశ్వరస్వామి కి ఎడ్వాన్సుగా యిచ్చి భర్త ఆరోగ్యం సరిగా ఉంటే మిగతా జుట్టు కొండకొచ్చి సమర్పించు కుంటానని ప్రామిస్ చేసింది.

ఈ రోజు తన భర్త సుబ్బారావు బర్త్ డే కూడాను. "హాపీ బర్త్ డే టు యూ" అని స్వాగతం చెపుతుందని పాపం కలలుగన్న సుబ్బారావుకు నిరాశే ఎదురయింది. 'ఏమోలే పిండివంటలు చేయటంలో మరచి పోయి ఉంటుం'దని సరిపుచ్చుకున్నాడు సుబ్బారావు. ఆఫీసు పని ఎక్కువయి మధ్యాహ్నం ఒంటిగంట దాటి నీరసంగా అడుగులో అడుగువేసుకుంటూ, చెమటలు కక్కుకుంటూ యింటికి వచ్చాడు. బర్త్ డే స్పెషల్సు - పిండి వంటలను తలచుకుంటూ లోలోపల గుటకలు మింగుతున్నాడు, నళిని వంట ఇంట్లోనే ఉంది.

“ఏమోయి ఇవాళ శాకపాకాలేమిటి?" అంటూ కూనిరాగంలా, ఉత్సాహంగా అడిగాడు, ఏమేం పిండివంటలు చేసిందో తెలుసుకునేందుకు. నళిని పమిట చెంగుతో ముక్కుతుడుచుకుని “గోధుమఅన్నం-కాకర కాయ కూర” అని చెబుతూ "ముందు ఇది తాగండి" అంటూ గిన్నెలో ఉన్నవి ముందుకు పెట్టింది.

“ఏమిటివి? కొబ్బరి నీళ్లా”?

"కాదు. మెంతుల కషాయం" అని చెప్తూనే ముఖం చాటు చేసుకుంది. సుబ్బారావు నవ్వుకుని “ఏమిటిది పుట్టినరోజు సరసమా?" అన్నాడు.

"ఇక నా బతుక్కి సరసాలే మిగిలాయి. భగవంతుడు దయ తలచి మీ ఆరోగ్యం కుదుటపడితే ముందు ముందు మీక్కావల సినవన్నీ చేసిపెడతా, అంతవరకూ మీకు గోధుమ అన్నం కాకరకాయ కూడా తప్పదు" అంది విచార వదనంతో.

"అదేమిటే ఇవాళ ఇలా తలపెట్టావూ? నాకు కాకరకాయ అసలు సహించదని నీకు తెలుసు. దానికి తోడు మెంతి కషాయం అనుపానమా? గోధుమ అన్నం ఏమిటి రోగిష్టి వాడికి పెట్టినట్లు? ఎంచక్కా బంగాళ దుంపల వేపుడు, గడ్డపెరుగు, ఆవకాయ, మామిడి పండు వేసి అన్నం పెడతావని నేనొస్తే" అన్నాడు అర్ధోక్తిగా.

"ఇక ఆ పప్పులేం ఉడకవు. నా మంగళ సూత్రం బాగుండాలంటే ఇక నుంచీ నేను పెట్టినట్లే తినాలి. మామిడి పళ్లూ, అరటి పళ్లూ, స్వీట్లూ అసలు ముట్టుకోకూడదు. గడ్డపెరుగులూ, మీగడలు కలలో కూడా తలపెట్టకూడదుట".

"ఎందుకని? ఎవరు చెప్పారు నీకు"? డీలా ముఖంతో అడిగాడు సుబ్బారావు.

“ఎవరు చెపితే ఏం? డాక్టరుగారే చెప్పారు. సరేనా. మధుమేహం - అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఇవేవీ దగ్గరకు రానీకూడదట. షుగర్ ఎక్కువయి గుండె ఆగిపోతుందిట. పక్షవాతం వస్తుందట. అవునూ, మీ ఆఫీసు లో ఎవరికో షుగర్ ఎక్కువై కాళ్లు మోకాళ్ల వరకూ కత్తిరించేశారట నిజమేనా?" భయం భయంగా అడిగింది.

సుబ్బారావు కుప్పకూలిపోయాడు. పెళ్లాం పనులు మొదట 'సరసం' అనుకున్నాడు కాని ఇప్పుడు ఇదంతా 'విరస' మే అని నిర్ధారణ చేసుకున్నాడు.

"ఎవడు చెప్పాడే ఈ సపోటా కబుర్లు, అంతా అబద్ధం, నాకేమిటి షుగర్ వ్యాధి ఏమిటి? పిడిరాయిలా నేనుంటే... చాలు చాలు గాని పుట్టిన రోజునాడు ఏడిపించక అన్నీ వడ్డించు" అని ఆజ్ఞలు జారీ చేశాడు.

నళినికి మళ్లీ అన్నగారి మాటలు జ్ఞాపకం వచ్చాయి.

"అతను ఎంత గింజుకుని పెట్టమన్నా పెట్టకు. మంగళ సూత్రం జాగ్రత్త" అన్న మాటలు.

ఒక్కసారి మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుని "మీరు నన్ను చంపినా సరే నేను పెట్టను గాక పెట్టను. అంతేకాదు ఇకపై దుంపకూరలు, వంకాయకూర, బెండకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ, పనసకాయ లాంటివి కూడా ఏమీ ఇంటికి తీసుకురావద్దు” అని గట్టిగా చెప్పింది.

ఈ చెప్పిన వన్నీ సుబ్బారావుకు చాలా ఇష్టమయినవే. పులుసులో చిలగడదుంప ముక్కలంటే ప్రాణం లేచొస్తుంది. అన్నిటికీ బ్యాన్ పెడితే ఇక తను తిని చచ్చేదేముంది. సుబ్బారావు హతాశుడైపోయాడు.

"అవునూ. నెయ్యి, పెరుగు మీగడ నాకిష్టమని నీకు తెలుసు కదా” ఇంకా వాక్యం పూర్తి కాలేదు. నళిని అడ్డుపడి "అవన్నీ వద్దని చెప్పానా? అవి కొలస్ట్రాల్ పెంచుతాయట. ఆవకాయ, మాగాయ, ఉప్పుకారం బి.పి. పెంచుతాయట. ఇవేమీ వద్దుట. కావాలంటే తోటకూర ఉడకపెట్టి ఉప్పు వేయకుండా పెట్టమన్నారు. పెడతాను తినండి" అని చెప్పేసింది మంగళసూత్రాన్ని మనసులో పెట్టుకుని.

సుబ్బారావుకు ఒళ్లు మండిపోయింది. "అయితే - ఒక పని చెయ్యి. చిటికెడు విషం ఉంటే అందులో వెయ్యి. నా పీడా నీ పీడా వదిలిపోతుంది" అంటూ బొబ్బలుపెట్టాడు. ఏమయినా సరే నళిని మెట్టు కూడా దిగకుండా, ఇంకో మెట్టు కూడా పైకెక్కి ఆర్డర్లు జారీ చేసింది" ఇవేవీ ఇంకతను పెట్ట"నని.
📖

వారం రోజులు గడిచాయి. దబ్బపండులా ఉండే సుబ్బారావు పాపం నిమ్మపిందె లాగా అయిపోయాడు. ఎంత బతిమిలాడినా నళిని వినడం లేదు. రోజూ భోజనం దగ్గర రామరావణ యుద్ధమయిపోతోంది. “పోనీ ఆ చిక్కుడు కాయ గింజలు లేకుండా పై తొక్కలన్నా వెయ్యవే" అని బతిమిలాడుకున్నాడు.

"అమ్మో! వాతం చేస్తుంది. నా వల్ల కాదు. అయినా అన్నిటికీ అంత జిహ్వచాపల్యం ఏమిటి?.. లేకితనం చూస్తే నలుగురూ నవ్వుతారు. ఏదో తిన్నన్ని రోజులు తిన్నారు. ఇక ఈ జన్మలో వాటికి నీళ్లొదులుకోండి. ఏదోలా బ్రతకడం అలవాటు చేసుకోండి" అని వేదాంత ధోరణిలో మందలించింది.

సుబ్బారావుకి ఒకపక్క కోపం ఎక్కువయింది "బతికినన్నాళ్లు బ్రతికాగా ఇక ఇప్పుడు చంపెయ్యరాదూ ... ఈ దిక్కుమాలిన బ్రతుకు బతక్కపోతే ఎవడేడిచాడు. ఛస్తేనే మంచిది” అని విసుక్కున్నాడు నిరాశతో.

మరి నాలుగు రోజులు గడిచాయి. సుబ్బారావు కాకరకూరను కళ్లు మూసుకుని నోట్లో వేసుకుని చెంబెడు నీళ్లు గుటుక్కున తాగుతున్నాడు. నడిచే ఓపిక లేక కర్ర చేతికి వచ్చింది. ఏమయితేనేం తన మంగళ సూత్రం బాగుంటోందని నళిని సంతోషపడి పోతోంది. అనకూడదు గాని పిల్లికి చెలగాటం - ఎలక్కి ప్రాణసంకటంలా ఉంది పాపం సుబ్బారావు పరిస్థితి.

మరో వారం గడిచింది. ఒక రోజున సుబ్బారావు పడక కుర్చీలో కళ్లుమూసుకుని పడుకుంటే మెట్ల దగ్గర ఏదో పెద్ద మూలుగు వినిపించింది. క్రమంగా మూలుగు తనకు దగ్గరవుతోంది. ఏ పందికొక్కో, లేచి కొడదామనుకుంటే అతనికి 'లేచే ఓపిక లేదు. ఆ మూలుగు క్రమంగా దగ్గిరయి దగ్గిరయి హాల్లోకి చేరుకుంది. తీరా చూస్తే తన మామగారు పరంధామయ్య గారు జంపకానా పరుపు చుట్ట భుజాన వేసుకుని, చంకలో సంచీతో (సిమెంటు సంచీలో బట్టలు కుక్కి) మరో చంకలో గొడుగుతో మూలుగుతూ ప్రత్యక్షమయ్యారు. సుబ్బారావు ఓపిక తెచ్చుకుని కుర్చీలోంచి లేచి మామగారి చేతిలో లగేజీ అందుకుని "ఏమేవ్ ఎవరొచ్చారో చూడు"అని దొడ్లో ఉన్న భార్య నుద్దేశించి నీరసంగా కేకేశాడు.

నళిని అతిధి మర్యాదలన్నీ చేసి " నీవంట్లో ఎలా ఉంది నాన్నా? అంతా బాగున్నారా" అని కుశల ప్రశ్నలు వేసింది.

పరంధామయ్య తాత్కాలికంగా మూలుగు ఆపి "ఏం కులాసా తల్లీ. నా ఆరోగ్యమే ఏమీ బాగుండటం లేదు. ఇక్కడ డాక్టరుకు చూపిద్దామని వచ్చా ... బలానికి డాక్టరు పళ్లూ పాలూ, తినమంటే రోజూ చక్రకేళీలూ, పంచదార బాగా వేసి బాగా పాలూ, ఆరగా ఆరగా తింటూనే ఉన్నా. ఏమీ తగ్గి చావటం లేదు. అది సరే గాని అమ్మా! నీ ఆరోగ్యం బాగుంటోందా. 'నీకున్న షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వచ్చిందా?" అని అడిగాడు.

నళిని తెల్లబోయి "అదేమిటి నాన్నా? నాకు షుగర్ వ్యాదేమిటి? ఆ షుగర్ మీ అల్లుడు గారికి” అని చెప్పింది.

దాంతో పరంధామయ్య చివ్వున లేచి "నీ బొందా నా బొందాను. అల్లుడి గారికి కాదు, నీకే! డాక్టరు రిపోర్టు తారుమారు చేయకు" అన్నాడు బల్ల గుద్ది మరీ చెపుతూ.

కుర్చీలో కూర్చున సుబ్బారావుకు ఎక్కడ లేని ఓపికా వచ్చి చివాల్న లేచి “చూశారా చూశారా తనకి షుగర్ వ్యాధి పెట్టుకుని నా ప్రాణం తీసి, నన్ను నిలువునా కాల్చుకు తింటోంది" అని ఎగిరిపడ్డాడు.

“లేదు నాయనా. ఇన్నేళ్లొచ్చి నీతో ఇలా అబద్దమాడతానా. షుగర్ వ్యాధి దానికే ఉందనీ, గోధుమ అన్నం, కాకరకాయ కూరా బాగా తినమనీ దానికే, నీరసానికి పళ్లూ పాలూ బాగా వాడమనీ నాకు డాక్టర్ స్వయంగా చెప్తేనే' అని గట్టిగా అనేసరికి సుబ్బారావు సంతోషం పట్టలేక కెవ్వున  అరిచాడు. నళిని అరిచింది కెవ్వున, కానీ సంతోషంతో కాదు భయంతో విచారంలో.

ఆరోజు నుంచీ పరిస్థితులు మారిపోయాయి. గోధుమ అన్నం, కాకరకాయ కూర నళినికి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. సుబ్బారావు మాత్రం అన్నీ తింటున్నాడు. ఆ తర్వాత వారం రోజులయ్యేసరికి సుబ్బారావు బాగా కోలుకున్నాడు గాని, నళిని మాత్రం మంచం దిగలేకపోతోంది. బాగా నీరసించిపోయింది. మామగారికి పూట వారీ పళ్లూ, పాలూ, జీడిపప్పు, కిస్మిస్, బలానికి మందులూ తేలేక సుబ్బారావు అవస్థపడిపోతున్నాడు.
📖

ఇలా కొద్ది రోజులు గడిచాయి. రాను రాను సుబ్బారావుకు ఈ ఇల్లు నరకప్రాయమైంది. ఇంట్లో హమేశా రెండు మంచాలు విడవ కుండా నట్టింట వున్నాయి. ఒక మంచం మీద కాళ్లూ, చేతులూ లేపే శక్తి లేక వెల్లికిలా, శవాకారంలా పడివున్న నళిని, రెండో మంచం మీద అంపశయ్య మీద పడుకున్న భీష్ముల వారిలా మామగారూ. వీళ్లకు వండి పెట్టలేక, మందులు తీసుకు రాలేక తన చావు దగ్గరకొస్తోంది. ఇంతకంటే గోధుమ అన్నం, కాకరకూరే నయమేమో అనుకున్నాడు సుబ్బారావు.

"ఏవండీ. ఒక్కసారి నన్ను బాత్రూమ్ కి
తీసుకెళ్తారూ?" అని నళిని.

"అల్లుడూ, నన్ను కొంచెం వత్తికించి పడుకోబెట్టు. పడుకొని పడుకుని పక్కలు పీక్కుపోతున్నాయి" అని  మామగారు. ఇలా ఇద్దరూ వంతుల వారీగా పిలిచి ప్రాణాలు కొరుక్కుతింటున్నారు సుబ్బారావుని.

"ఈ ముసిలాడు ఇక్కడికెందుకొచ్చినట్టు నా ప్రాణం తీయడానికి కాకపోతే. డబ్బుకు డబ్బు బోలెడయిపోతోంది. నా ప్రాణానికి సుఖం లేకుండాపోతోంది. చాకిరీ చెయ్యలేక" అంటూ సుబ్బారావు గుడ్ల నీళ్లు గుడ్డను కుక్కుకుంటున్నాడు.

శనివారం. దుర్ముహూర్తం. నళిని, పరంధామయ్య ఇద్దరూ పంతం పట్టినట్లు ఒకళ్లు విడచి ఒకళ్లు ఆర్తనాదాలు మొదలు పెట్టారు.

నళిని మంచానికి అతుక్కుపోయింది. పరంధామయ్య గుడ్లు తేలవేస్తున్నాడు. సుబ్బారావుకి భయమేసింది. మాసిపోయిన పాంటు షర్టు అని ఆలోచించకుండా ఫామిలీ డాక్టర్ దగ్గరకి పరిగెట్టాడు. పాపం డాక్టరు గారు ఏకళనున్నాడో, జపం కూడా చేసుకో కుండా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలా పరిగెత్తుకొచ్చాడు. తీరా వచ్చి చూస్తే ఏముంది?! ప్రాణాలు పోయినంత పనయి తండ్రీ కూతుళ్లు చెరో మంచం మీదా పడున్నారు.

డాక్టరుగారికి తను ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ జ్ఞాపకం వచ్చినాయి. ఎందుకాయినా మంచిదని ఆ రిపోర్టులు మళ్ళీ ఒకసారి ఇవ్వమన్నారు. పరంధామయ్య తన సిమెంటు సంచీ లోంచి వాటిని బయటికి తీసి ఇచ్చాడు. వాటిని చూచి డాక్టర్ ఒక్కగావు కేక పెట్టి "ఆవిడకు షుగర్ వ్యాధనీ, మిమ్మల్ని పళ్లూ, పంచదారా తినమని ఎవరు చెప్పారు?" అని అరిచాడు.

"మా అబ్బాయి వీర వెంకట వరప్రసాదు" అని పరంధామయ్య చెప్పాడు.

"చంపారు పొండి. చక్కెర వ్యాధి ఆవిడకు కాదు మహానుభావా, ఈ పరంధామయ్య గారికి, అందుకని గోధుమ అన్నం, కాకర కాయ ఈయన తినాలి. మిస్టర్ సుబ్బారావ్! నళినికి ఇప్పుడు నాలుగో మాసం. మీరు తండ్రి కాబోతున్నారు. అందుకని పళ్లూ పాలూ వంటి బలకరమైన ఆహారం తినమని చెప్తే, ఈయన పళ్లూ పాలూ మెక్కి, ఆవిడకు గోధుమ అన్నం, కాకరకాయ కూర పెట్టి ఆవిడ ప్రాణం తీయబోయాడు. మెడికల్ రిపోర్ట్స్ తారుమారయ్యాయి. ఇలా ఇంకో రోజుంటే ఇద్దరి ప్రాణాలు దక్కేవి కావు. ఏమైతేనేం. అదృష్టవంతులు' అన్నాడు.

“మరి మావాడు అలా చెప్పి చచ్చాడే!" అన్నాడు పరంధామయ్య.

"తాగుబోతు వెధవ. వాడి మాటలకు విలువేమిటి? అది సరే ఇప్పుడేం చేద్దాం" అన్నాడు సుబ్బారావు.

“ఏముందీ? ముందావిడకి పళ్లూ పాలూ ఇవ్వండి. ఇంతవరకూ పళ్లూ, పాలూ ఆరగించిన మీ మామగారిని ఒక లాగుడు బండి మీద వేసి హాస్పిటల్ కి పంపండి. తిన్నవన్నీ ముందు కక్కించాలి" అన్నారు డాక్టర్ గారు.

సుబ్బారావుకు ఆలోచన వచ్చింది. 'పోనీ మావగారిని శీర్షాసనం వేయించి వీపు మీద బాదితే.. తిన్నవన్నీ బయటకి వస్తాయేమో కదా' అనుకున్నాడు వచ్చే కోపాన్ని బలవంతాన అణగదొక్కుతూ. కాని పాపం పైకి మాత్రం అనలేకపోయాడు.