Thursday, 12 February 2026

 [03/02, 12:50] Mallapragada Ramakrishna: *శతపత్ర -1*

రచన:

లండన్! ఒకప్పుడు సూర్యుడస్తమించని బ్రిటీష్ మహా సామ్రాజ్యానికి రాజధానీ నగరం. యూరప్ లోని పురాతన నగరాల్లో లండన్ ఒకటి. ప్రస్తుతం వలస రాజ్యపాలన అంతమయ్యాక బ్రిటన్ కి మాత్రమే రాజధానిగా పరిమితమైపోయిందీ నగరం. రెండుసార్లు తగలబడిపోగా పునర్నిర్మించ బడిన నగరం లండన్. యూరప్ లో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు లండన్ లో వేలాది మంది ఆ మహమ్మారిబారిన పడి చనిపోయారు.

చరిత్ర ప్రసిద్ధమైన ఎందరో వీరుల్ని, ఎన్నో యుద్ధాల్ని, మరెన్నో ఘోరాల్ని చూసిన నగరం. ఎన్నో ఖండాలు, ఎన్నో దేశాల చరిత్రల్ని, సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని, ప్రపంచ అద్భుతాల్ని, వింతల్ని గుప్పిటపట్టి దాచిన నగరం.

వలస రాజ్యాల నుంచి అంతులేని సంపదే కాదు. అమూల్యమైన, అలభ్యమైన గ్రంథాలు కూడా బ్రిటన్ కి తరలించబడ్డాయి. అందుకే ప్రపంచంలో అనేక భాషలకు చెందిన సాహిత్య, చారిత్రక గ్రంధాలు కూడా ఇప్పటికీ లండన్ లైబ్రరీలో కన్పిస్తాయి. మనలో చాలామంది మన నమ్మకాల్ని మూఢనమ్మకాలనుకుంటారు. పాశ్చాత్యులు అవి అధునాతన భావాలని, వారిలో మూఢ నమ్మకాలుగాని, భయాలుగాని అస్సలు కనిపించవని అనుకుంటారు. నిజానికి మనకన్నా పాశ్చాత్యులకే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయని చాలామందికి తెలియదు.

దయ్యాలు, భూతాలు, భయాలు మనదేశం లో కన్నా అమెరికా, ఆఫ్రికా, యూరప్ దేశాలవారికే ఎక్కువ.

దయ్యాలు, భూతాలు వణికించే వింత జీవుల కథలతో హాలీవుడ్ నిర్మాతలు నిర్మించినన్ని దయ్యాల సినిమాలు మరే దేశంలోనూ నిర్మించబడలేదు.

📖

మనం బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తాం. కొన్ని దేశాల్లో పిల్లి ఎదురైతే శుభశకునంగా భావిస్తారు. పదమూడు సంఖ్య గురించి మనకి ఎలాంటి సెంటిమెంట్లూ లేవు. పదమూడు కాని ఆ సంఖ్యను చూస్తేనే వణికిపోయేవారున్నారు అక్కడ. వాళ్ళు పదమూడు సైతాన్ సంఖ్యగా భావిస్తారు. ఎంత భయమంటే హోటల్లో ఆ సంఖ్యతో గది ఉండదు. పదమూడు వదిలేసి పధ్నాలుగుతో కంటిన్యూ చేస్తారు.

అలాగే ఇంటి నెంబరు కూడా 13 ఉంచరు. ఆ సంఖ్యని అరిష్టంగా భావిస్తారు.

అయితే ఇదే పదమూడు సంఖ్యను మయన్ నాగరికతకు చెందినవారు చాలా పవిత్రంగా భావిస్తారు. భూమి నుంచి స్వర్గానికి మధ్య పదమూడు లోకాలున్నాయని, ఆ సంఖ్య దేవతల సంఖ్య అని భావించేవారు. మనకి కూడా ఏడు ఏడు పధ్నాలుగు లోకాలున్నా యంటారు. పైన స్వర్గానికి, భూమికి మధ్యన గాంధర్వ, కిన్నెర, కింపురుష, విద్యాధర, యక్ష మొదలైన దైవలోకాలున్నాయని, కింద అతల, వితల, సుతల, పాతాళ, తలాతల మొదలైన ఏడు లోకాలున్నాయని, అవి రాక్షస లోకాలని అంటారు. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన పురాణ గాధ మనకు తెలిసిందే.

నమ్మకాలు, మూఢనమ్మకాలు, భ్రమలు, నిజాలు ఆయా దేశ కాల పరిస్థితులనుబట్టి వేరువేరుగా ఉంటాయి. ఒకచోట మంచి అనుకునే విషయం మరోచోట చెడుకావచ్చు. అయితే దయ్యాలు, భూతాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి.

అమెరికాలోని మెక్సికో ప్రాంతపు అడవుల్లో ను, ఆఫ్రికా అడవుల్లోను, మనదేశంలో కేరళ, అస్సాం ప్రాంతాల్లోనూ ఇప్పటికీ గొప్ప గొప్ప మంత్రగాళ్ళున్నారు.

లండన్ నగరం వరకే చూస్తే- అక్కడి హీత్రూ విమానాశ్రయంలో దయ్యాల గురించి అనేక కథలు ప్రచారంలో వున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా షేక్ ష్పియర్ నాటకాల్ని ప్రదర్శిస్తున్న గొప్ప ధియేటర్ ఒకటి లండన్ లో ఉంది. ఆ ధియేటర్ లో ఇప్పటికీ దయ్యాలున్నాయని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

అసలు ఈ దయ్యాలు, భూతాలు ఏమిటి? ఆత్మ ఏమిటి? మనిషి మరణించిన తర్వాత ఆత్మ దయ్యమవుతుందా? మరణానంతరం కూడా ఆత్మకు జీవితం ఉందా? ఉంటే అది ఎలాంటి జీవితం?

ఆత్మ చావు లేనిది. అగ్నితో కాల్చబడదు. కత్తితో చీల్చబడదు. చావు శరీరానికేగాని, ఆత్మకు లేదు అని గీతాచార్యుడు బోధించాడు.

శరీరాన్ని పోగొట్టుకున్న ఆత్మ మరో శరీరం ధరించాలి. అంటే ఆత్మ మరణానంతరం మనిషి కావచ్చు. కుక్క కావచ్చు, నక్క కావచ్చు. మరో జీవి గర్భాన్ని వెదుక్కుని పోవాలి. ఆత్మ గర్భస్థశిశువుగా మారి పునర్జన్మించాలి కాని మధ్యలో మరో జన్మకు పోకుండా దయ్యాలు, భూతాలుగా మారటం ఏమిటి? అసలు మరణానంతరం ఆత్మ ఏమవుతోంది?

📖

ఈ ఆత్మశోధన ఈనాటిది కాదు. ఏనాటికీ మనిషి మేథస్సుకు అంతుచిక్కని దైవరహస్యమిది.

మనిషి అంతరిక్షంలో ఎన్నో అద్భుతాల్ని ఆవిష్కరించగలుగుతున్నాడు. శోధించి ఎన్నో కొత్త కొత్త విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. కాని మన భూమిపైనే అంతు చిక్కని, విచిత్రమైన ఎన్నో మిస్టరీలు దాగి వున్నాయి. వాటిని మాత్రం అస్సలు ఛేదించలేకపోతున్నాడు.

మంగోలియా మహావీరుడు చెంఘిజ్ ఖాన్ చనిపోయి శతాబ్దాలు గడిచాయి. అయినా ఇంతవరకు అతని సమాధిని కనిపెట్టలేక పోయారు. ఆ సమాధిని కనిపెట్టి అందులో దాచిన బంగారాన్ని, వజ్రవైఢూర్యాల్ని కొల్లగొట్టాలని ఇప్పటికీ అన్వేషణ సాగిస్తూనే వున్నారు.

ప్రస్తుతం చెంఘిజ్ ఖాన్ సమాధిగా చెప్పబడుతున్న చోట ఆ నిధి లేదు. ఇక్కడో విచిత్రం ఉంది. ఆ సమాధి ముందు ఒక శిలా అశ్వం వుంది.

చెంఘిజ్ ఖాన్ పునర్జన్మించినప్పుడు గుర్తుగా ఆ అశ్వం ముందు కాళ్ళు లేపి బిగ్గరగా సకిలిస్తుందట.

"ఈ సూచన ఇంతవరకూ జరగలేదు. కాబట్టి చెంఘిజ్ ఖాన్ ఇంకా పుట్టలేదనే అనుకోవాలి.

ఇలాంటిదే వీరబ్రహ్మేంద్రస్వామి- యాగంటి లో బసవడు లేచి రంకె వేస్తాడని కాలజ్ఞానంలో రాయటం.

శ్రీకృష్ణుడి ద్వారకానగరం నీటమునిగిన గాథ లాంటిదే, ఒకప్పుడు అట్లాంటిక్ సముద్రంలో అట్లాంటిస్ అనే నగరం కూడా నీట మునిగిపోయింది. ఆ నగరాన్ని కనిపెట్టి బంగారం తీయాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు.

బెర్ముడా ట్రయాంగిల్ అనే సముద్రదీవి వైపు వెళ్ళిన ఏ నౌకా వెనక్కి తిరిగిరాలేదు. దీవి మీదుగా ఎగిరిన ఏ విమానం కూడా తిరిగి ల్యాండ్ కాలేదు. దీని మిస్టరీ ఏమిటో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఫ్లయింగ్ సాసర్స్ ఇంకా అంతుచిక్కని మిస్టరీగానే వుంది.

లోకంలో ఘనకార్యలు చేయటంకోసమే కొందరు పుడతారు. అనుభవంలోకి వస్తేగాని తనలో ఉండే ప్రత్యేకత ఏమిటో కొందరికి అర్థంకాదు.

ఏదో సాహసం చేయాలి, ఏదో సాధించాలని పట్టుదలైతే ఉందిగాని, ఏం సాధించాలో తెలీని స్థితిలో ఒక యువతి అన్వేషణ సాగిస్తోంది.

ప్రపంచంలోని మిస్టరీలను స్టడీ చేస్తూ ప్రస్తుతం లండన్లోనే వుంది. ఆ యువతి పేరు శతపత్ర.

📖

అదేపనిగా కాలింగ్ బెల్ మోగుతుంటే బిరబిరా వచ్చి తలుపుతీసింది విశ్వదా.

ఎదురుగా శతపత్ర. లేతాకుపచ్చ చక్కటి డిజైన్ లోని చుడీదార్ లో చిరునవ్వులు చిందిస్తూ అరవిరిసిన ముద్ద మందారంలా నిలబడి వుంది.

నడుమ్మీద చేతులుంచుకుని కించిత్తు కోపంగా చూసింది విశ్వదా.

“అనుకున్నాను. వీకెండ్ వస్తేగాని ముఖం చూపించవనుకున్నాను. ఇవాళ లైబ్రరీ సెలవుగాబట్టి నేను గుర్తొచ్చాను. అంతేగా?” అనడిగింది సీరియస్ గా విశ్వదా.

“అంతేగా అంటే... అంతే మరి. నేనేం చెప్పినా నువ్వు నమ్మవుగా...” అంది శతపత్ర.

"నన్ను నమ్మించాలని చూడకు. నీమీద నాకు ఎంత కోపంగా వుందో తెలుసా?" అంది విశ్వదా.

"అది తెలిసే నీకోపం పోగొట్టాలని వచ్చాను. అయినా ఏమిటే ఇది. డోర్ లో నిలబెట్టే మాట్లాడతావా? లోపలికి రానీయవా?” అంది నవ్వుతూ శతపత్ర.

తల ఊపి చిన్నగా నిట్టూర్చింది విశ్వదా. “రా తల్లీ. లోపలికి రా” అంటూ పక్కకు తప్పుకుంది.

"అంత మర్యాద అక్కర్లేదులే” అంటూ లోపలికి వచ్చింది శతపత్ర. తలుపుమూసి వెనుతిరిగింది విశ్వదా.

"నాకొస్తున్న కోపానికి నిన్నేం చేయాలో తెలీటంలేదే. పదిరోజులైంది నిన్ను చూసి. ప్లాట్ కొస్తేనేమో ఉండవు. ఎప్పుడు చూసినా లైబ్రరీ... లైబ్రరీ. పోనీ లైబ్రరీ కొద్దామంటే అక్కడంతా సైలెన్స్. మాట్లాడుకోడం అసలు కుదరదు. ఈమధ్య మరీ పుస్తకాల పురుగు వైపోతున్నావ్. కూచో, కాఫీ తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది విశ్వదా.

శతపత్ర వయసు పాతికేళ్ళు. అయిదున్నర అడుగుల ఎత్తు. ఆ ఎత్తుకు తగిన అంగసౌష్ఠవం. అందానికి నిర్వచనం ఈ అమ్మాయేనా అన్పిస్తుంది ఆమెనిచూడగానే. అంతటి సౌందర్యవతి. అందం ఒక్కటే కాదు. ఒక విధమైన ఠీవి, దర్పం ఆమెలో కొట్టొచ్చినట్టు కన్పిస్తాయి. ఆచితూచి మాట్లాడటం, ఏ పని చేసినా హుందాగా చేయటం శతపత్ర ప్రత్యేకత.

పద్మదళాయతాక్షి. అంటే తామరపూవు రేకువంటి కనులు కలిగినది అనర్ధం.

ఆకర్ణాయతనేత్రి. అంటే చెవులవరకు వ్యాపించిన కనులు కలది అని అర్ధం. ఈ రెండు పోలికలు స్త్రీయొక్క విశాలనేత్రాలని తెలియజేస్తాయి.

అటువంటి విశాల నేత్రాలు, విశాలమైన ఫాలభాగం, కోటేరులా తీర్చిదిద్దినట్టుండే చక్కటి ముక్కు పగడాల వంటి పెదవులు, శంఖంలాంటి మెడ, స్వచ్ఛమైన బంగారంలా మెరిసే మేనిఛాయ... ఇవన్నీ అరుదుగా రాజవంశ స్త్రీలలో మాత్రమే కన్పించే సోయగం లక్షణాలు. శతపత్రను చూస్తే ఆమె ఏ రాజవంశానికో చెందిన యువతి అని అపోహపడతారు. అంతగా విలక్షణమైన, అందమైన యువతి శతపత్ర.

ఆమె లండన్ వచ్చి ఆరేళ్ళయింది. చదువు అయిపోయింది. అయినా ఇక్కడే ఉంది. ఇండియా తిరిగివెళ్ళలేదు. ఎప్పుడు వెళ్తుందో కూడా తెలీదు. స్నేహితురాలైన విశ్వదాకి కూడా ఆ వివరాలు తెలీదు.

విశ్వదా వయసు కూడా పాతికేళ్ళు. ఆమె అయిదేళ్ళుగా లండన్ లో ఉంటోంది. ఆమె చదువు ఇంకా పూర్తికాలేదు. చదువుతో పాటు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తోంది. గొప్ప అందం అని చెప్పలేం. తన అందాన్ని ఇనుమడింపచేసుకోడానికి మిడ్డీస్, స్కర్టు- ఇలా అక్కడి యువతుల్లాగే డ్రస్ చేసుకుంటుంది. తన అందాల ప్రదర్శనకి ప్రాధాన్యత నిస్తుంది. అలాగని చెడ్డది కాదు. బాయ్ ఫ్రెండ్స్ లేరు.

డ్రెస్ విషయం విశ్వదాకి పూర్తి వ్యతిరేకి శతపత్ర. ఆమెకు మన సాంప్రదాయ దుస్తులంటేనే ఇష్టం. చీర జాకెట్ ధరించటం మరీ ఇష్టం. సందర్భాన్నిబట్టి చుడీదార్లు, జీన్స్ ప్యాంట్స్ షర్టులు ధరిస్తుంది. ఒళ్ళు కనబడే దుస్తులు ఆమెకు దూరంగా వుండాల్సిందే.

ఇద్దరూ హైదరాబాదీ యువతులే కావటంతో వారి స్నేహం మరింత గట్టిపడింది. అయితే యిద్దరూ ఎవరి ఫ్లాట్ లో వాళ్ళుంటున్నారు.

శతపత్ర ఉంటున్న ఫ్లాట్ అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో వుంది. తన బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటోంది. విశ్వదా మాత్రం ఒంటరిగానే ఉంటోంది తన ప్లాట్ లో.

🍁

*సశేషం*

[03/02, 19:21] Mallapragada Ramakrishna: *శతపత్ర -2*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

కిచెన్ లో నుండి రెండు కాఫీ కలిపి తెచ్చి ఒకటి శతపత్రకి ఇస్తూ- "వంద ఆకుల ఒయ్యారీ... తీసుకోవమ్మా కాఫీ” అంది కొంటెగా!

"ఇదిగో... అలా తెలుగులో పిలిస్తే కోపం వస్తుంది. తెలుసుగదా” కాఫీ అందుకుంటూ ఉడుక్కుంది శతపత్ర. 

“ఎందుకే కోపం. శతపత్ర అంటే వంద ఆకులనేగా అర్ధం. నీ మూడ్స్ కూడా వంద రకాలుగా ఉంటాయి. అందుకే నేను అలా అన్నాను" అని అంది ఆమె ఎదురుగా కూచుంటూ విశ్వదా.

“సర్లే... అయినా వచ్చీరాగానే నామీద విరుచుకుపడుతున్నావ్! ఏమైంది నీకు?” కాఫీ సిప్ చేస్తూ మధ్యలో అడిగింది.

“నాకేమీ కాలేదు. నీకే ఏదో అయింది. మరీ పుస్తకాల పురుగువైపోతున్నావ్. ఆ లైబ్రరీ తప్ప మరే లోకం అస్సలు కనిపించటం లేదు నీకు” అంది.

“నువ్వు కన్పించావ్ చాలదా? ఈ రోజంతా నీతోనే. భోజనం కూడా ఇక్కడే."

"సంతోషం. ఆ మధ్య ఇండియా నుంచి అమ్మ పంపిన ఆవకాయపచ్చడి ఉంది. ముద్దపప్పు, నెయ్యి, గడ్డ పెరుగు, అప్పడాలు. ఇవి చాలా? నాన్ వెజ్ ఏమన్నా చెయ్యాలా, గుడ్లు ఉన్నాయి. ఆమ్లెట్స్ వేసుకోవచ్చు...”

"ఇవి చాలుగాని... ఏమిటే... వంట అయిపోయినట్టు మాట్లాడుతున్నావ్" అంది శతపత్ర.

"అయిపోయినట్టు కాదు. అయిపోయింది. మనిద్దరికీ వండి స్నానానికి వెళ్ళొచ్చాను. నువ్వొచ్చావు.”

"అంటే నేనొస్తానని ముందే తెలుసా?”

"తెలుసు.. నీ ఫ్లాట్ కి ఫోన్ చేస్తే నో రెస్పాన్స్. నీ పక్క ఫ్లాట్ లో అనంతయ్యగారి కూతురుందిగా సుబ్బలక్ష్మి. ఫోన్ చేసి నీ గురించి అడిగితే చెప్పింది. నా వద్దకే నువ్వు బయలుదేరి వస్తున్నావని.”

"సో... నీ కోసం నేను వస్తున్నానని తెలిసి కూడా.... నామీద కోపమన్నమాట.”

"కోపం ఉండదా?” అంటూ ఖాళీ కప్పులతో కిచెన్లోకి వెళ్ళి మూడు నిముషాల తర్వాత తిరిగివచ్చింది విశ్వదా.

"ఇంతకీ నువ్వు ఇండియా ఎప్పుడు వెళ్తున్నావ్?” పక్కన కూచుంటూ అడిగింది.

“తెలీదు” అంది శతపత్ర.

"నేను మాత్రం వచ్చే జూన్ లో ఇండియా వెళ్ళిపోవాలి. అప్పటికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. నీలాగే కొద్దిరోజులు ఉందామనుకున్నాను. బట్ డాడీ ఆర్డర్. తప్పదు.”

"ఎందుకింత తొందర?”

"నాకు పెళ్ళి చేయాలని ఇంట్లోవాళ్ళు తొందరపడుతున్నారు.”

"నీకా... అప్పుడే పెళ్ళా?"

"హలో... అల్రెడీ పాతికేళ్లు వచ్చేశాయమ్మా. ఇంకెప్పుడు పెళ్ళి? వయసైపోయాకా? నువ్వు కూడా లైన్లోనే ఉన్నావు. ఆ సంగతి మర్చిపోకు.”

“మర్చిపోలేదుగాని, వయసొచ్చింది గాబట్టి పెళ్ళిచేసుకోవాలి. అంతేనా? ఇంకేమీ లేదా?”

“ఇంకేముంటుంది?”

"అబ్బాయి నచ్చాలి. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవాలి. అన్నిటికీ మించి ప్రేమగా చూసుకోవాలి...." అంది శతపత్ర.

“నువ్వు చెప్పే విషయాలు లవ్ మేరేజస్ కి వర్తిస్తాయి తప్ప, అరేంజ్డ్ మేరేజస్ కి వర్తించవు.”

“ఎందుకు వర్తించవు? మైనారిటీతీరిన యువతి తనకు నచ్చినవాడ్ని పెళ్ళి చేసుకోవచ్చని చట్టం వుంది...”

"హలో మేడమ్... కొన్ని విషయాల్ని చట్టాలతో ముడిపెట్టి ఆలోచించలేం. నా వరకే తీసుకో. నా ఉడ్బి అమెరికాలో ఇంజనీర్. మొదటిసారి నేను మా వూరు - వెళ్లినప్పుడు అనుకోకుండా మా పెళ్ళి చూపులు జరిగిపోయాయి. మా డాడీ ఒక్కటే చెప్పారు. నీకు కుర్రాడు నచ్చితేనే సంబంధం ఓకే చేస్తాను. ఛాయిస్ నీది అన్నారు. అతని పేరు మోహన్. నాకు నచ్చాడు. నేనూ తనకు నచ్చాను. ఇద్దరం మాట్లాడుకున్నాం. మా అభిప్రాయాలతో మనసులు కలిశాయి. ఓకే చెప్పేశాను. పూర్వంలా కాదు, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకే స్వేచ్ఛనిస్తున్నారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తేనే ప్రమాదం” అంది

విశ్వదా.

“సో... యూ ఆర్ లక్కీ.. విష్ యు బెస్టాఫ్ లక్. పెళ్ళి తర్వాత అమెరికా, ఇక ఆపైన నేను గుర్తుండను.”

“గుర్తుండవా? నీలా అనుకున్నావా నేను. మా పెళ్ళి అయిన తర్వాత అమెరికా వెళ్ళేప్పుడు లండన్ లో నీకోసం ఆగుతాం. నా ఉడ్బి ని నీకు చూపిస్తాను. నీ ప్లాట్లోనే రెండురోజులు స్టే చేస్తాం. అయినా ఏం చెప్పగలం. ఈలోపలే నాకన్నా నువ్వే ముందు ఇండియా వెళ్ళిపోతావేమో...” అంది.

"లేదు. లేదు. ఇంకొంతకాలం ఇక్కడే వుండాలి”

“ఎందుకు? నాకసలు తెలీక అడుగుతాను. అంత చదువుకోవాలంటే మనదేశంలో లైబ్రరీలు లేవా?”

ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఒక్క నిముషం మౌనంగా ఉండిపోయింది శతపత్ర

ఆమె మౌనాన్ని మరోలా అర్ధంచేసుకుంది విశ్వదా. చిన్నగా నవ్వింది. "సో... నీ ప్రాబ్లం నాకు తెలిసిపోయింది. ఇప్పట్లో పెళ్ళి చేసుకోవటం నీకిష్టంలేదు. హైదరాబాద్ వెళ్తే మీ వాళ్ళు నీకు పెళ్ళి చేసేస్తారని భయపడు తున్నావ్. అందుకే ఆగిపోయావ్” అంది.

“నో... నో... అలాంటిదేమీ లేదు. నువ్వనుకున్న కారణమైతే నేను లైబ్రరీలో గంటలకొద్దీ సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఏముంది?”

“మరెందుకు లైబ్రరీకి వెళ్తున్నావ్?”

“అన్వేషణ”

"వాట్? దేనికోసం అన్వేషణ?”

"చూడు విశ్వదా? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నేటికీ అంతుచిక్కని ఎన్నో మిస్టరీలున్నాయి. విచిత్రమైనవి, భయానక మైనవి, దారుణమైనవి ఎన్నో... అలాంటి మిస్టరీలకు సంబంధించిన సమాచారం కోసం అన్వేషిస్తున్నాను.”

“ఓ షిట్...” అంటూ నుదురు రుద్దుకుంది విశ్వదా.

"అసలు ఇలాంటి ఆలోచన నీకెందుకొచ్చిందే. తెల్సుకుని ఏంచేస్తావ్. ఆ మిస్టరీలను ఛేదించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆశపడు తున్నావా?”

“లేదు” అంది నవ్వుతూ శతపత్ర.

"మరెందుకు? అలాంటి వింతమిస్టరీల గురించి తెలుసుకుని ఏం చేస్తావ్. పూర్తిగా కాకున్నా నాకూ కొన్నిటి గురించి తెలుసు. బెర్ముడా ట్రయాంగిల్... అదో అంతు చిక్కని మిస్టరీ. దాని రహస్యం ఇప్పటికీ మహా మహులకే అంతు చిక్కలేదు. నీవల్ల అవుతుందా?

అట్లాంటిక్ సముద్రం లోతుల్లో గొప్ప బిలం వుంది. అది ఎక్కడికి పోతుందో, అది అసలు ఎలా ఏర్పడిందో నేటీకీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.

ఫ్లయింగ్ సాసర్స్ గురించి అనేక కథనాలు ఉన్నాయి. వాటి సంగతి కూడా మిస్టరీగానే ఉండిపోయింది. అంతదేనికి? మనదేశం లోనే ఉత్తర భారతంలో ఓ గ్రామం వద్ద ఏటా ఒక మాసంలో పక్షులు సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అవి అలా ఎందుకు మరణిస్తున్నాయన్న ప్రశ్నకు నేటికీ బదులు దొరకలేదు."

"విశ్వదా! ప్లీజ్. చాలు ఇక ఆపవే. ఇవన్నీ నాకు తెలుసు" అంది శతపత్ర.

"తెలిసినవాటి కోసం అన్వేషణ దేనికే?"

"తెలియని వాటికోసం.”

"అర్థం కాలేదు..."

"క్వీన్ విక్టోరియా లైబ్రరీలో ఉన్నంత సాహిత్య సంపద ప్రపంచంలో మరే లైబ్రరీలోనూ లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలు, అనేక దేశాలకు చెందిన గ్రంథాలు అక్కడ ఉన్నాయి. మన దేశానికి చెందిన ఎంతో విలువైన ప్రాచీన తాళపత్ర గ్రంథాలూ ఉన్నాయి.

నాకో మిస్టరీ గురించి తెలుసు. అది ఎక్కడ వుందో తెలీదు. దాని జాడ ఖచ్చితంగా ఈ లైబ్రరీలో తెలుస్తుందని నా నమ్మకం. అందుకే మహాసముద్రంలాంటి ఆ గ్రంథాల మధ్య నా అన్వేషణ సాగిస్తున్నాను. ఏదో రోజు నాక్కావలసిన సమాచారం అక్కడ ఖచ్చితంగా దొరుకుతుందని నా నమ్మకం."

"ఓకే... ఐ అగ్రీ విత్ యు... బట్... నీకు తెలిసిన మిస్టరీ ఏమిటి?" అడిగింది విశ్వదా.

శతపత్ర కాస్సేపు మౌనంగా వుండిపోయింది. బహుశా విశ్వదాకు తన అనుభవాన్ని చెప్పాలా వద్దాని ఆలోచనలో పడినట్టుంది. ఏం చెప్పేదోగాని, ఇంతలోనే ఒక సంఘటన జరిగింది... 

బయటనుంచి ఏవో వస్తువులు కిందపడి భళ్ళున పగిలిన అలికిడి, ఆ వెనకే ఏవో అరుపులు, కేకలు, పెద్దగా ఒక్కసారిగా వినవచ్చాయి. ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ గొడవ అంతకంతకూ పెరుగుతోందేగాని తరగటం లేదు.

"ఏమిటే ఆ గోల, పద చూద్దాం” అంది లేచి నిలబడుతూ శతపత్ర.

"ఆ గోల మనకెందుకులేవే. కూచో” అంది విశ్వదా.

"అరె. అంత గొడవ జరుగుతుంటే మనకెందుకులే అంటావేమిటి?” అంది శతపత్ర.

“నీకు కొత్త కావచ్చు. అప్పుడప్పుడూ ఇలా జరగడం మాకు మామూలే. దయ్యంగోల.”

"మైగాడ్. దయ్యమా!" అంటూ ఆశ్చర్యంగా విచిత్రంగా చూసింది శతపత్ర.

"అవును. చివరి ప్లాట్ లో వున్న సుఖదేవ్ సింగ్ భార్య అంజలి ఒంటిమీదికి ఇలా అప్పుడప్పుడు దయ్యం వచ్చి గోల చేస్తూంటుంది” చెప్పింది విశ్వదా.

“ఎవరా దయ్యం?" అడిగింది శతపత్ర.

"సుఖదేవ్ సింగ్  మొదటి భార్య పూర్ణిమ.” ఆలోచనల్లో కూరుకుపోయింది శతపత్ర.

“నిజం కాదనుకుంటున్నావా? చూస్తే నీకే తెలుస్తుంది. ఒకసారి చూశాను. కళ్ళు పెద్దవి చేసి చక్రాల్లా తిప్పుతూ ఉగ్రంగా చూసింది. ఆ చూపులు చాలా భయం గొల్పుతాయి. పూర్ణిమ దెయ్యం ఒంటిమీద ఉన్నప్పుడు అంజలిని పట్టుకోవడం చాలా కష్టం. బలమైన మనుషులు నలుగురు పట్టుకున్నా ఆ సమయంలో తోసిపారేస్తుంది. ఆ అరుపుల బీభత్సం మనకు దడ పుట్టిస్తుంది.

"ఏం జరిగిందసలు. ఆ పూర్ణిమ ఎలా చనిపోయింది?” కుతూహలంగా అడిగింది శతపత్ర.

🍁

*సశేషం*

[03/02, 19:24] Mallapragada Ramakrishna: *శతపత్ర -3*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

విశ్వదా చెప్పసాగింది..

"సుఖదేవ్ సింగ్ వాళ్ళది చాలాకాలంగా బ్రిటన్ లోనే సెటిలైన కుటుంబం.

అతడి తండ్రి హయాంలో పంజాబ్ నుంచి ఇక్కడికి వలస వచ్చేశారు. వ్యాపారాల్లో బాగా సంపాదించారు. పూర్ణిమా వాళ్ళదీ అలాంటి కుటుంబమే. పైగా దగ్గర బంధుత్వం కూడా వుంది. నాలుగేళ్ళ క్రితం మాట. నేనప్పుడే ఈ ప్లాట్లోకి కొత్తగా వచ్చాను.

సుఖదేవ్ సింగ్, పూర్ణిమలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల ఆశీస్సులతో పెళ్ళి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వారి పెళ్ళయిన రెండో సంవత్సరంలో ఇక్కడికి సమీపంలోనే జరిగిన రోడ్ ప్రమాదంలో పూర్ణిమ చనిపోయింది. ఆ విషాదం నుంచి బైటపడిన తర్వాత పంజాబ్ లోని తమ బంధువుల అమ్మాయి అంజలిని పెళ్ళి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ ఫ్లాట్లో సుఖదేవ్, అంజలితోపాటు అతని తల్లి కళాంజలి ఉంటుంది.

పెళ్ళి చేసుకుని ఇక్కడికి వచ్చిన వారం రోజుల తర్వాత మొదటిసారిగా పూర్ణిమ ప్రేతాత్మ అంజలిని ఆవహించి నానా బీభత్సం చేసింది. తను చనిపోయిందన్న బాధలేకుండా అతడు మళ్ళీ పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటున్నందుకు తిట్టిపోసింది. తనకులేని సుఖం అతడికి దక్కకూడదంటూ అంజలిని చంపాలని చూసింది.

అప్పటినుండి అప్పుడప్పుడు అంజలిని ఆవహించి ఇలా నానా యాగీ చేస్తూంటుంది పూర్ణిమ ఆత్మ. అది ఆత్మ కావచ్చు, దయ్యం కావచ్చు, భూతం కావచ్చు. అంజలి ఒంటి మీదికి వచ్చినప్పుడే దాని ఉనికి తెలుస్తుంది. ఇప్పుడా ఫ్లాట్లో జరుగుతున్న గోల ఇదే. పూర్ణిమ దెయ్యం అంజలి ఒంటిమీదికి వచ్చినట్టుంది" వివరించింది విశ్వదా.

నమ్మలేనట్టు. చాలా ఆసక్తిగా ఆ మాటలు వింది శతపత్ర. తనకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. అదేమిటో స్వయంగా చూడాలనిపించింది. అంజలి అనే ఆ యువతి దయ్యం పట్టినట్టు కావాలనే గొడవచేస్తోందేమోనని డౌటు కూడా ఏర్పడింది.

"విశ్వదా... నిజంగా దయ్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావా?” అనడిగింది. 

"వై నాట్? నేను నమ్ముతున్నాను. అనుభవం లోకి వస్తే నువ్వూ నమ్ముతావ్?" అంది నమ్మకంగా విశ్వదా.

"ఎందరో వైద్యులు, మానసిక శాస్త్రవేత్తలు కేవలం భ్రమ మాత్రమే. దయ్యాలు, భూతాలు లేవని చెప్తున్నారు. దయ్యం పట్టినట్టు నటించటం కూడా పిచ్చిలో ఒక భాగం అంటున్నారు" వాదించింది. శతపత్ర.

“అంటున్నారని ఏదీ ఆగిపోవడం లేదుగా? జనం నమ్ముతున్నారు. నీకు ఉదాహరణకి రెండు సంఘటనలు చెప్తాను. ఇక్కడ ఇంగ్లాండ్ లోనే మాంచెస్టర్ లో ఒకాయనకు పాతబంగళా ఒకటుంది. అది ఫస్ట్ ఫ్లోర్ లో రెండు మూడుచోట్ల గోడలు పగుళ్లు వచ్చాయి. దాన్ని బాగు చేయించి అమ్మేయాలనుకున్నాడాయన.

తను జర్మనీ వెళ్తూ కాస్త ఆ పని చూడమని తన ఫ్రెండ్ కి ఆ పని అప్పగించాడు.

మన ఇండియాలో అయితే పగుళ్ళు తీసిన చోట సిమెంట్ పూయించి రంగులు వేసేస్తారు. కానీ ఇక్కడ ఏ పనిచేసినా సిస్టమేటిక్ గా ఉంటుంది. పగుళ్ళని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసి, వాటిని అధ్యయనం చేసి అవసరమైనంత మేర గోడకూల్చి తిరిగి రీబిల్ట్ చేస్తారు.

అదే ప్రకారం ఆ ఫ్రెండ్ తనకు తెలిసిన ఒక కాంట్రాక్టర్ని పిలిపించాడు. ఫోటోగ్రాఫర్ తో సహా వచ్చాడాయన. ఎక్కడెక్కడ గోడలకు పగుళ్ళు ఉన్నాయో అవన్నీ ఫోటోలు తీసుకున్నారు. ప్రింట్లు వచ్చిన తర్వాత చూసి అక్కడ అందరూ షాక్ తిన్నారు.

వాళ్ళు ఫోటోలు తీసినప్పుడు తాము ముగ్గురూ తప్ప ఆ ఇంట్లో ఎవరూ లేరు. కాని ఫోటోల్లో ఒక వృద్ధురాలు కన్పించింది. ఒక ఫోటోలో గోడ పక్కన వాలుకుర్చీలో పడుకుని వుంటే, మరో ఫోటోలో నిలబడి, ఇంకో ఫోటోలో మెట్లెక్కుతూ. అది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు వాళ్ళు:

తెల్లటి గౌనులో స్పష్టతలేని విధంగా గాజు బొమ్మలా ఉందామె ఫోటోల్లో. ఆ ఫ్రెండు, కాంట్రాక్టరు భయపడిపోయి ఇక రిపేరు ఆరంభించలేదు. జర్మనీ వెళ్ళిన ఇంటి ఓనరు తిరిగొచ్చాక ఆ ఫోటోలు చూసి కన్నీరు పెట్టుకున్నాట్ట. ఫోటోల్లో వున్న వృద్ధురాలు అతడి నాయనమ్మ. ఆ ఇంట్లోనే పదేళ్ళక్రితం మరణించింది.

ఆమె పోయినా, ఆమె ఆత్మ అక్కడే ఇంకా తిరుగుతోందని అర్ధంగావటంతో ఆ ఇంటిని రిపేరు చేయించకుండా అలాగే ఉంచేశాడా యన. కొంతకాలం కిందట ఫోటోలతో సహా ఈ వ్యవహారం అనేక పత్రికల్లో ప్రచురితమైంది.

న్యూయార్క్ సిటీలో పీటర్ అనే వ్యక్తి చాలా ధనవంతుడు. అతను వ్యాపార లావాదేవీ లన్నీ చూసుకుని రాత్రి పన్నెండు గంటలకి గాని నిద్రపోయేవాడు కాదు.

ఒకరాత్రి తమ ఆవరణలో మొక్కల మధ్య ఎవరో తిరుగుతున్నట్టు గుర్తించాడు. కిటికీ పక్కకొచ్చి చూస్తే ఒక పొడుగాటి మనిషి స్పోటకం మచ్చలతో కూడిన వికారమైన ముఖంతో నిశ్శబ్దంగా తిరగటం కన్పించింది.

ఎవడో దొంగ అనుకుని రివాల్వర్ తో బయటి కొచ్చి 'ఎవరది?' అనరిచాడు. ఆ వ్యక్తి మౌనంగా వెళ్ళిపోనారంభించాడు. అతన్ని పట్టుకోవాలని ఎంత వేగంగా వెళ్ళినా సాధ్యం కాలేదు. అతడు గేటుదాటి రోడ్డు మీదకుపోయాడు. అతన్ని ఆపాలని తనూ రోడ్ ఎక్కబోతూ అనుమానంతో ఆగిపోయాడు పీటర్. ఆ ఆగంతకుడు రోడ్ ఎక్కడం చూశాడుగాని, తర్వాత అతను కన్పించలేదు.

పీటర్ వెనుతిరిగి లోనికొస్తుండగా రోడ్డుమీద పెద్ద శబ్దం... తిరిగి చూస్తే దారుణ దృశ్యం...

రోడ్డుపై వస్తున్న ట్రక్కు ఒకటి అదుపుతప్పి పక్కన చెట్టును గుద్దుకుంది. డ్రయివర్, క్లీనరు స్పాట్ డెడ్.

పీటర్ కి వణుకు పుట్టింది. పొరపాటున తను రోడ్డు మీదకు వెళ్ళుంటే యాక్సిడెంట్ స్పాట్ లో తనుండేవాడని అర్థమైంది. ఆ తర్వాత కూడా తమ ఆవరణలో ఎవరో తిరుగుతున్నట్టు గమనించినా ఎప్పుడూ తలుపులు తెరిచి బయటికి రాలేదు. ఎవరినీ రానిచ్చేవాడుకాదు.

వారంరోజులు గడిచాయి. ఓ రోజు షాపింగ్ కాంప్లెక్సికి వెళ్ళాడు పీటర్. పధ్నాలుగు అంతస్తుల భవనం అది. లిఫ్ట్ లో పైకి వెళ్ళాలి. లిఫ్ట్ లో పదిమంది ఎక్కారు. చివరిగా పీటర్ వస్తూ లిఫ్ట్ బాయ్ ని చూసి అదిరిపడ్డాడు. అదే ముఖం... స్పోటకం మచ్చలతో కూడిన వికారమైన ముఖం. తమ ఆవరణలో తిరుగుతున్న వ్యక్తిముఖం. అనుమానం వచ్చి లిఫ్ట్ ఎక్కకుండా బయటే ఆగిపోయాడు.

లిఫ్ట్ బాయ్ అతడ్నే చూస్తున్నాడు.

లిఫ్ట్ బయలుదేరింది. పీటర్ కి గుండెలు దడదడలాడాయి. ఏదో జరగబోతోందని భయం. మూడు నిముషాల తర్వాత అతడి భయం నిజమైంది. పదో అంతస్తు నుంచి రోప్ తెగి లిఫ్ట్ వేగంగా వచ్చి కిందపడింది. లిఫ్ట్ లో ఉన్నవాళ్ళలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు.

విచిత్రం ఏమిటంటే- మరణించినవాళ్ళలో లిఫ్ట్ బాయ్ లేడు. యధార్ధంగా జరిగిన పీటర్ అనుభవాలు కూడా న్యూస్ పేపర్స్ లో వచ్చాయి. ఇలాంటివి చాలా వున్నాయి.” శతపత్రకు వివరంగా చెప్పింది విశ్వదా.

కాని ఆమె విశ్వదా మాటల్ని కొట్టిపారేసింది. "నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఎనీవే. కమాన్. నువ్వు చెప్తూన్న సిక్కు ఫ్యామిలీ లోని దయ్యం సంగతేమిటో చూద్దాం.” అంటూ ఆతృతగా బయలుదేరింది శతపత్ర. తన ప్లాట్ కి తాళంపెట్టి శతపత్రను తీసుకుని కారిడార్ చివర వున్న సిక్కు ఫ్యామిలీ ప్లాట్ వైపుకి దారితీసింది విశ్వదా.

🍁

*సశేషం*

*శతపత్ర - 4*

🍁

తన ప్లాట్ కి తాళంపెట్టి శతపత్రను తీసుకుని కారిడార్ చివర వున్న సిక్కు ఫ్యామిలీ ప్లాట్ వైపుకి దారితీసింది విశ్వదా.

📖

"బతికున్నంతకాలం ఎంతో మంచిగా పేరు తెచ్చుకున్నావు.  మరి ఎందుకు ఇప్పుడు చచ్చి సాధిస్తున్నావ్? నీకేం లోటు చేశామని? నీకిది న్యాయంగా ఉందా పూర్ణిమా?" కన్నీళ్ళతో అడుగుతోంది అత్త కళాంజలి.

ఆ మాటలకి కళ్ళు ఎర్రజేసి- మరింత క్రూరంగా చూసింది అంజలిని ఆవహించిన పూర్ణిమ దయ్యం.

"ఏయ్ అత్తా... నీ కొడుక్కి ఇంకో పెళ్ళి చేశావ్. నీకు న్యాయంగా ఉందా?" అంటూ పెద్ద స్వరంతో ఎదురు ప్రశ్నించింది. 

“నాకు న్యాయమేనే... నువ్వు చచ్చావని సన్నాసుల్లో కలిసిపోతాడా? వాడికి తోడు కావాలని పెళ్ళి చేశాం. చచ్చిన నీకు ఆత్మశాంతి కోసం కర్మకాండలు చేసినట్టే నా కొడుకు బతికున్నాడు గాబట్టి మళ్ళీ పెళ్ళి చేశాను. తప్పా?” అంది కళాంజలి.

“తప్పే... ముమ్మాటికీ తప్పే. నాకు కోపం రాదా? ఊరుకుంటానా? నా స్థానం ఎప్పటికీ నాదే. ఇంకొకర్తిని రానివ్వను..." భయంకరం గా అరుస్తోంది దయ్యం. పూనకంతో ఊగిపోతోంది. కళ్ళు పెద్దవిచేసి అరుస్తోంది. ఎర్రటి కుంకుమబొట్టు, జుట్టు విరబోసుకుని ఆమెచూసే చూపులు, చేసే ఆగడాలు వెన్నులో దడ పుట్టిస్తున్నాయి.

నలుగురు బలమైన స్త్రీలు ధైర్యంగా నిలబడి అంజలిని ఒడిసి పట్టుకున్నారు. ఐనా ఆగటంలేదామె. విదిలించేస్తోంది. ఎగిరి దూకుతోంది. అవసరమయితే ఆపటానికి సిద్ధంగా నలుగురు మగాళ్ళు కూడా రెడీగా వున్నారు. వాళ్ళలో ఆమె భర్త సుఖదేవ్ సింగ్ కూడా ఉన్నాడు. తప్పించుకుందంటే కిటికీలోంచి బయటకు దూకి అంజలిని చంపేస్తుందని భయపడుతున్నారంతా. ఎందుకైనా మంచిదని కిటికీ తలుపులు మూసేసి వుంచారు.

ఆ ఫ్లాట్ ముందు చాలామంది గుమిగూడి పోయారు. కింద, పైన, పక్క ఫ్లాట్లో ఉండే చాలామంది బయటే నిలబడి లోపలి తంతును భయం భయంగా చూస్తున్నారు. వాళ్ళలో ఇండియన్స్ మాత్రమే కాదు. జర్మనీ, ఫ్రెంచ్ ఫ్యామిలీసి కి చెందినవాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు జడుసు కుంటారని వెనక్కి లాక్కుపోతున్నారు కొందరు.

"ఒసే పూర్ణిమా! నువ్వు చచ్చావని నా కొడుకు ఇక జీవితాంతం ఎటువంటి సుఖం లేకుండా ఒంటరిగా బతకాలా? ఎందుకే ఇలా మమ్మల్ని పీడిస్తున్నావ్?" విసుగ్గా అరిచింది అత్త కళాంజలి.

"బతకాలి...” అంటూ పళ్ళు పటపట కొరుకుతూ రక్తవర్ణం దాల్చిన కళ్ళతో మొగుడు సుఖదేవ్ వంక చూసింది పూర్ణిమ దయ్యం. ఎగిరెగిరి తుళ్ళుతూ తప్పించు కోడానికి గింజుకుంటోంది.

ఆమె ఉగ్రరూపం చూస్తున్నవాళ్ళకి గుండెలు పీచుపీచుమంటున్నాయి. కాళ్ళలో వణుకు పుడుతోంది. ఎక్కడ వచ్చి మీద పడుతుందో నని భయంగా చూస్తున్నారు.

ఆ దృశ్యం భయానకం... బీభత్సం... గింజుకుంటూనే అరిచింది దయ్యం. "ఏయ్ అత్తా... అడగవే నీ కొడుకు నడగవే... నాతో ప్రేమగా ఉన్నాడా లేదా అడుగు. నువ్వే నా లోకం అన్నాడు. చావులోనూ, బతుకు లోనూ కలిసుందాం అన్నాడు. మరి నాతో వాడు ఎందుకు చావలేదు? పైగా నన్ను  మర్చిపోయి ఇంకోదాన్ని పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటాడా.... ఉండనివ్వనే... మీ అందర్నీ నాశనం చేస్తా...” భయానకంగా నవ్వుతోంది.

సరిగ్గా శతపత్ర, విశ్వదాలు ఆ ఫ్లాట్ ముందుకు వస్తుండగా లోపల జరుగుతున్న సంఘటన అది.

"ఏమిటే విశ్వదా... బయటే ఉండి అంతా చోద్యం చూస్తున్నారు" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది శతపత్ర.

"చూడక... లోనికి పోతారనుకున్నావా? అలా వెళ్ళాలంటే ధైర్యం ఉండాలమ్మా. అదిగో విను... ఆ దయ్యం అరుపులు ఎలా ఉన్నాయో, మనకెందుగ్గాని రావే వెనక్కి వెళ్ళిపోదాం" అంది ఒకింత గాభరాపడుతూ విశ్వదా.

"ఏయ్... ఏమిటే అంత భయం. లోనికి పోతే చంపుతుందా? రా చూద్దాం" అంది శతపత్ర.

"చంపుతుంటే చూద్దామా...”

“విశ్వదా... అది ఇంతవరకు ఎవరినైనా చంపిందా?”

“లేదు”

"మరి భయమెందుకు? ఇప్పుడు కూడా చంపదు. కమాన్” అంటూ విశ్వదాని పిలిచింది శతపత్ర.

"ఏమిటే... నీకు భయం వేయదా?"

“రాచబిడ్డనే... భయమంటే ఏమిటో నాకు తెలీదు”

మాట్లాడుకుంటూనే ఇద్దరూ గుంపును చేరుకున్నారు. గుంపును దాటి గుమ్మంలోకి పోబోతూంటే ఉన్నట్టుండి లోపలి పూర్ణిమ దెయ్యంగా పెద్దగా అరిచింది.

"వద్దు... రావద్దు... దాన్ని రావద్దని చెప్పండి.... నా ఒళ్ళు భగ్గు మంటోంది. దాన్ని ఆపండి" అంటూ, ఆ అరుపులు విని లోపలివాళ్ళే కాదు, బయటివాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరిని ఉద్దేశించి అలా అరుస్తోందో అర్థంకాలేదు. ఈలోపల డోర్ సమీపంలోకి వచ్చేశారిద్దరూ.

"వద్దు... రావద్దు... ఒసే శతపత్రా ఆగిపోవే” ఒక్కసారిగా తన పేరు పెట్టి దయ్యం పిలవటంతో శతపత్ర షాకయింది. విశ్వదా ఆశ్చర్యానికి అంతులేదు. లోపలి పరిస్థితి చాలా బీభత్సంగా వుంది.

అటో ఇద్దరు, ఇటో ఇద్దరు మహిళలు అంజలిని బలంగా ఒడిసి పట్టుకుని ఆపుతున్నారు.

విరబోసిన జుట్టులోంచి, ఎర్రబడ్డ కళ్ళతో క్రూరంగా చూస్తోంది. అంజలిని ఆవహించిన పూర్ణిమా దయ్యం.

ఆమె ఉగ్రరూపాన్ని చూళ్ళేకపోయింది విశ్వదా. భయంతో శతపత్ర వెనక ఒదిగి నిలబడింది.

"ఆ దెయ్యం నిన్ను రావద్దంటోంది. ఏం చేస్తుందో ఏమిటో... మనకెందుకొచ్చిందిగాని వెళ్ళిపోదాంరావే..." అంది విశ్వదా భయంతో.

“నా పేరు తనకెలా తెలుసు?" ఆశ్చర్యం నుంచి తేరుకోలేక అడిగింది శతపత్ర.

"అదేకదా... దయ్యాలకు అన్నీ తెలిసిపోతాయ్. వెనక్కి వెళ్ళిపోదాం రావే..." అంది విశ్వదా.

“ఇక్కడ ఇంతమంది ఉండగా దెయ్యం నన్ను మాత్రమే ఎందుకు రావద్దంటోంది? తెలియాలి" అంటూ ముందుకు ధైర్యంగా అడుగులేసింది శతపత్ర.

విశ్వదా ఫ్లాట్ కి తను వచ్చి పోతూ వుంటుంది. అంజలిని రెండు మూడుసార్లు తను చూసింది. ఆమె కూడా తనను చూసింది కాని, తన పేరు తెలిసే అవకాశం లేదు.... ఏమో తెలుసుకుందేమో.

ఒకవేళ తన పేరు తెలుసుకుంది అనుకున్నా కూడా గదిలో ఉన్న అంజలికి కారిడార్లో తను వస్తున్నట్టు ఎలా తెలిసింది? ఒకవేళ నిజంగా అది పూర్ణిమా దయ్యమేనా... ఇదేదో తెలుసుకోవాలి.

📖

గడప దాటబోయింది శతపత్ర.

"రావద్దని చెప్పాగా... లోనికి రావద్దు” క్రూరంగా చూస్తూ మరోమారు హెచ్చరించింది దయ్యం.

"వస్తే ఏమవుతుంది?" చేతులు కట్టుకుని గుమ్మం ముందే నిలబడి లోపలికి చూస్తూ అడిగింది శతపత్ర.

"నేను భరించలేను... తట్టుకోలేను. వెళ్ళిపోవే..." ఇల్లెగిరిపోయేలా అరుస్తూ గింజుకుంటోంది దయ్యం.

"నేనేం చేశానని? ఎందుకు తట్టుకోలేవ్? ఇదిగో అంజలీ.. నీ భర్త బాధపడుతున్నాడు. నీ అత్త ఏడుస్తోంది. ఇంక నువ్వు ఆడుతున్న నాటకం చాలు. ఇంతటితో ఆపేసెయ్" ధైర్యంగా చెప్పింది శతపత్ర.

“నాది నాటకమా! నన్నెవరనుకుంటున్నావే.. నేను అంజలినికాదు... పూర్ణిమను" హుంకరించింది ఆత్మ.

"ఓ.కె. నువ్వు పూర్ణిమవని ఒప్పుకుంటున్నా ను. నువ్వు ఎవ్వరినైనా కాని, మీ మధ్య అంజలి నలిగిపోతోంది. ఆమెను పీడించకు. తక్షణం వదిలి వెళ్ళిపో."

"వెళ్ళను... దీన్ని వదలను.”

"అయితే నేను లోపలికి వస్తున్నా.”

“వద్దు. నువ్వు రానేవద్దు.”

“అయితే వెళ్ళిపో.”

“వెళ్ళను..." దయ్యంతోపాటు తనూ పెద్దగా అరుస్తోంది శతపత్ర. ఈ సరికొత్త మలుపేమిటో అర్ధంగాక అంతా చేష్టలుడిగి చూస్తున్నారు.

శతపత్ర గడప దాటింది. నెమ్మదిగా అయిదడుగులు ముందుకేసింది. విశ్వదా మాత్రం వణికిపోతూ బయటే ఆగిపోయింది. శతపత్ర తనను సమీపించటం చూసి గగ్గోలుగా అరవటం ఆరంభించింది పూర్ణిమ దయ్యం. అరుపుల మధ్య తిట్టిపోస్తోంది–

"రావద్దని చెప్పాగదా! ఎందుకొచ్చావే... నా ఒళ్ళు కాలిపోతున్నట్టుంది. వేడి మంటలు... అమ్మో... భరించలేను" అంటూ పెద్దగా గింజుకుంటోంది.

అంతలోనే అంజలి శరీరాన్ని వదిలి బయటికొస్తోంది. తిరిగి శరీరాన్ని ఆవహిస్తోంది.

దయ్యం వదలగానే పట్టుకున్నవాళ్ళ చేతుల్లో తోటకూర కాడలా వేలాడబడి పోతోంది అంజలి. తిరిగి ఆవహించగానే తుపానుగాలి ఒక్కపెట్టున వీచినట్టు చివ్వున లేచి కేకలు వేస్తూ గంతులేస్తోంది.

భీతావహంగా మారిపోయింది పరిస్థితి. అంజలి శరీరాన్ని వదలగానే ఏదో రివ్వు రివ్వున గదిలో పైన తిరుగుతున్న శబ్దాన్ని స్పష్టంగా వింటున్నారంతా. బంతిలా గోడల్ని తాకి వెనక్కి వస్తుంటే ఖరీదైన వస్తువులు భళ్ళున పగిలి కిందపడుతున్నాయి.

"నావల్ల కావటంలేదే... నీకు దండం పెడతాను. వెళ్ళిపోవే శతపత్రా...” తిరిగి అంజలిని ఆవహించి బాధాపూరితంగా అరుస్తోంది పూర్ణిమ దయ్యం.

అంత బీభత్సంలో కూడా కించిత్తు కూడా భయపడకుండా ఎదురుగా నిలబడివుంది శతపత్ర. గుమ్మం వద్ద గుమిగూడిన వాళ్ళలో చాలామంది భయంతో దూరంగా పారిపోయారు. లోపలున్న వాళ్ళకి చెమటలు పట్టేస్తు న్నాయి. 

"నువ్వు నీజంగా దయ్యానివైతే నా గురించి ఎందుకు భయపడుతున్నావ్?" చాలా స్థిరంగా అడిగింది శతపత్ర. 

"నన్ను కాల్చి బూడిద చేద్దామనా... నీ గురించి నీకే తెలీదు.” అంది దయ్యం.

“అయితే నువ్వీ అమ్మాయిని వదిలివెళ్ళిపో" అంది శతపత్ర.

“వెళ్ళనంటున్నాగా...”

"అయితే నేనే నిన్ను పట్టుకుంటా”

అంజలిని పట్టుకోవాలని అడుగు ముందుకేసింది శతపత్ర.

భయంతో పెద్దగా అరుస్తూ తనని పట్టుకున్న వాళ్ళని విదిలిస్తూ నాలుగడుగులు వెనక్కి దూకింది దయ్యం. "వద్దు. నన్ను తాకొద్దూ" అనరిచింది.

"ఏమవుతుందో తాకిచూస్తాను.”

"వద్దు వద్దు. నువ్వు చెప్పినట్టు వింటాను. నన్నేమీ చేయకు.” 

"అయితే అంజలిని వదిలి వెళ్ళిపోతావా?" అని అడిగింది శతపత్ర.

“పోతాను”

“మళ్ళీ రాకూడదు.”

"రాను"

"రానని నమ్మకం ఏమిటి?”

"రాను... రాను... నా మొగుడిచేత్తో పసుపు నీరు తాగించమని చెప్పు. వెళ్ళిపోతాను" అంది దయ్యం.

"నువ్వు వెళ్ళిపోతున్నట్టు రుజువు చూపించాలి" అంది శతపత్ర. 

“చూపిస్తాను. అదిగో... ఆ కిటికీ అద్దం పగలగొట్టుకుని వెళ్ళిపోతాను" 

ఆ సంభాషణంతా మొత్తం ఆశ్చర్యంగా వింటున్నారంతా. శతపత్ర ప్రత్యేకించి చెప్పక్కర్లేకుండానే సుఖదేవ్ సింగ్ గ్లాసు మంచినీటిలో చిటికెడు పసుపు కలిపి తెచ్చాడు.

అంజలిని ఆవహించిన పూర్ణిమ దయ్యం మొగుడ్ని ప్రేమగా చూస్తూ పసుపునీరు తాగింది. తాగుతూ హృదయవిదారకంగా ఏడుస్తోంది. 

"నాకు చాల్లేదు... బిందెడు కావాలి" అంది తక్షణం బిందెడు పసుపు నీళ్ళు తెచ్చాడు సుఖదేవ్ సింగ్.

అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బిందెలో సగం నీరు తాగేసింది" మిగిలిన నీటిని తలమీద పోసుకుంది. అంతే- అంజలి శరీరం నుంచి దయ్యం తప్పుకుంది. గదిలో రివ్వురివ్వున ఏదో అదృశ్యశక్తి తిరుగుతున్న శబ్దం విన్పించింది.

పది సెకన్ల తర్వాత అంత ఎత్తులో ఉన్న కిటికీ అద్దం విచిత్రంగా భళ్ళున పగిలింది. అంతే- గదిలో నిశ్శబ్దం అలముకుంది.

📖

స్పృహలేని అంజలిని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు. ఆమెను స్పృహలోకి తెచ్చే ప్రయత్నాలు ఆరంభించారు.

అంజలి అత్తగారు కళాంజలి అయితే ఆనందంతో శతపత్ర రెండు చేతులూ పట్టుకుని వదల్లేదు-

"పెద్దపెద్ద మంత్రగాళ్ళని తీసుకొచ్చాం. ఎవరూ పూర్ణిమ దయ్యాన్ని వదిలించలేక పోయారు. ఆ మొండి దయ్యాన్ని వదిలించి, నా కోడల్ని, మా కుటుంబాన్ని కాపాడావ్. కాళ్ళకు మొక్కాలని వుంది తల్లీ. వయసులో చిన్నదానివి అని ఆ పనిచేయలేక పోతున్నాను” అంది కన్నీటితో.

"మాకెంతో ఉపకారం చేసిన నిన్ను ఉత్త చేతులతో పంపించలేము. మేమిచ్చే కానుకలు తీసుకెళ్ళాలి" అంటూ ఆనందంతో అర్థించాడు సుఖదేవ్ సింగ్.

సున్నితంగా వారిని తిరస్కరించింది శతపత్ర "మీరు నాకేవో శక్తులున్నాయని పొరపాటు పడుతున్నట్టున్నారు. అలాంటిదేమీ లేదు. అందరిలాగే నేను కూడా ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను. కారణం తెలీదుగాని పూర్ణిమ నన్ను చూసి భయపడింది. దాన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళిపొమ్మని చెప్పాను. అంతే... నాకు ఈ కానుకలు అవసరం లేదు. మీ అభిమానం చాలు" అంటూ అంజలిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి విశ్వదాతో కలిసి ఆమె ప్లాట్ కి వచ్చేసింది శతపత్ర.

🍁

*సశేషం*

Saturday, 7 February 2026

 

*సండే స్టోరీ*

*మెడికల్ రిపోర్ట్స్*
📝

రచన: నండూరి సుబ్బారావు

అదే అమ్మడూ. ఇక నీ మాంగల్యాన్ని ఎలా కాపాడుకుంటావో. పైన భగవంతుడున్నాడు. క్రింద నీవున్నావు. మధ్య బావున్నాడు" అని హైడ్రోజన్ బాంబు లాంటిది చెల్లెలు నళిని చెవిలో వేసి లేచి నిలబడ్డాడు వీర వెంకట వరప్రసాదు... వెళ్తూ వెళ్తూ ఒక క్వార్టరు బాటిల్ జేబులో పెట్టుకుని రెండు క్వార్టర్సు చేతి సంచిలో వేసుకుని తూలుతూ తూలుతూ తన ఊరు వెళ్ళిపోయాడు.

వార్త విన్న నళిని కరెంటు షాకు తిన్నట్టు నవనాడులూ బిగదీసుకుపోయి ఎలాగోలా లోపలికి పోయి గంగానమ్మకు చద్ది నైవేద్యం పెడతానని మొక్కుకుంది. నిగనిగలాడు తున్న తన కురులలో నుంచి రెండు వెంట్రుకలు కత్తిరించి తీసి వెంకటేశ్వరస్వామి కి ఎడ్వాన్సుగా యిచ్చి భర్త ఆరోగ్యం సరిగా ఉంటే మిగతా జుట్టు కొండకొచ్చి సమర్పించు కుంటానని ప్రామిస్ చేసింది.

ఈ రోజు తన భర్త సుబ్బారావు బర్త్ డే కూడాను. "హాపీ బర్త్ డే టు యూ" అని స్వాగతం చెపుతుందని పాపం కలలుగన్న సుబ్బారావుకు నిరాశే ఎదురయింది. 'ఏమోలే పిండివంటలు చేయటంలో మరచి పోయి ఉంటుం'దని సరిపుచ్చుకున్నాడు సుబ్బారావు. ఆఫీసు పని ఎక్కువయి మధ్యాహ్నం ఒంటిగంట దాటి నీరసంగా అడుగులో అడుగువేసుకుంటూ, చెమటలు కక్కుకుంటూ యింటికి వచ్చాడు. బర్త్ డే స్పెషల్సు - పిండి వంటలను తలచుకుంటూ లోలోపల గుటకలు మింగుతున్నాడు, నళిని వంట ఇంట్లోనే ఉంది.

“ఏమోయి ఇవాళ శాకపాకాలేమిటి?" అంటూ కూనిరాగంలా, ఉత్సాహంగా అడిగాడు, ఏమేం పిండివంటలు చేసిందో తెలుసుకునేందుకు. నళిని పమిట చెంగుతో ముక్కుతుడుచుకుని “గోధుమఅన్నం-కాకర కాయ కూర” అని చెబుతూ "ముందు ఇది తాగండి" అంటూ గిన్నెలో ఉన్నవి ముందుకు పెట్టింది.

“ఏమిటివి? కొబ్బరి నీళ్లా”?

"కాదు. మెంతుల కషాయం" అని చెప్తూనే ముఖం చాటు చేసుకుంది. సుబ్బారావు నవ్వుకుని “ఏమిటిది పుట్టినరోజు సరసమా?" అన్నాడు.

"ఇక నా బతుక్కి సరసాలే మిగిలాయి. భగవంతుడు దయ తలచి మీ ఆరోగ్యం కుదుటపడితే ముందు ముందు మీక్కావల సినవన్నీ చేసిపెడతా, అంతవరకూ మీకు గోధుమ అన్నం కాకరకాయ కూడా తప్పదు" అంది విచార వదనంతో.

"అదేమిటే ఇవాళ ఇలా తలపెట్టావూ? నాకు కాకరకాయ అసలు సహించదని నీకు తెలుసు. దానికి తోడు మెంతి కషాయం అనుపానమా? గోధుమ అన్నం ఏమిటి రోగిష్టి వాడికి పెట్టినట్లు? ఎంచక్కా బంగాళ దుంపల వేపుడు, గడ్డపెరుగు, ఆవకాయ, మామిడి పండు వేసి అన్నం పెడతావని నేనొస్తే" అన్నాడు అర్ధోక్తిగా.

"ఇక ఆ పప్పులేం ఉడకవు. నా మంగళ సూత్రం బాగుండాలంటే ఇక నుంచీ నేను పెట్టినట్లే తినాలి. మామిడి పళ్లూ, అరటి పళ్లూ, స్వీట్లూ అసలు ముట్టుకోకూడదు. గడ్డపెరుగులూ, మీగడలు కలలో కూడా తలపెట్టకూడదుట".

"ఎందుకని? ఎవరు చెప్పారు నీకు"? డీలా ముఖంతో అడిగాడు సుబ్బారావు.

“ఎవరు చెపితే ఏం? డాక్టరుగారే చెప్పారు. సరేనా. మధుమేహం - అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఇవేవీ దగ్గరకు రానీకూడదట. షుగర్ ఎక్కువయి గుండె ఆగిపోతుందిట. పక్షవాతం వస్తుందట. అవునూ, మీ ఆఫీసు లో ఎవరికో షుగర్ ఎక్కువై కాళ్లు మోకాళ్ల వరకూ కత్తిరించేశారట నిజమేనా?" భయం భయంగా అడిగింది.

సుబ్బారావు కుప్పకూలిపోయాడు. పెళ్లాం పనులు మొదట 'సరసం' అనుకున్నాడు కాని ఇప్పుడు ఇదంతా 'విరస' మే అని నిర్ధారణ చేసుకున్నాడు.

"ఎవడు చెప్పాడే ఈ సపోటా కబుర్లు, అంతా అబద్ధం, నాకేమిటి షుగర్ వ్యాధి ఏమిటి? పిడిరాయిలా నేనుంటే... చాలు చాలు గాని పుట్టిన రోజునాడు ఏడిపించక అన్నీ వడ్డించు" అని ఆజ్ఞలు జారీ చేశాడు.

నళినికి మళ్లీ అన్నగారి మాటలు జ్ఞాపకం వచ్చాయి.

"అతను ఎంత గింజుకుని పెట్టమన్నా పెట్టకు. మంగళ సూత్రం జాగ్రత్త" అన్న మాటలు.

ఒక్కసారి మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుని "మీరు నన్ను చంపినా సరే నేను పెట్టను గాక పెట్టను. అంతేకాదు ఇకపై దుంపకూరలు, వంకాయకూర, బెండకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ, పనసకాయ లాంటివి కూడా ఏమీ ఇంటికి తీసుకురావద్దు” అని గట్టిగా చెప్పింది.

ఈ చెప్పిన వన్నీ సుబ్బారావుకు చాలా ఇష్టమయినవే. పులుసులో చిలగడదుంప ముక్కలంటే ప్రాణం లేచొస్తుంది. అన్నిటికీ బ్యాన్ పెడితే ఇక తను తిని చచ్చేదేముంది. సుబ్బారావు హతాశుడైపోయాడు.

"అవునూ. నెయ్యి, పెరుగు మీగడ నాకిష్టమని నీకు తెలుసు కదా” ఇంకా వాక్యం పూర్తి కాలేదు. నళిని అడ్డుపడి "అవన్నీ వద్దని చెప్పానా? అవి కొలస్ట్రాల్ పెంచుతాయట. ఆవకాయ, మాగాయ, ఉప్పుకారం బి.పి. పెంచుతాయట. ఇవేమీ వద్దుట. కావాలంటే తోటకూర ఉడకపెట్టి ఉప్పు వేయకుండా పెట్టమన్నారు. పెడతాను తినండి" అని చెప్పేసింది మంగళసూత్రాన్ని మనసులో పెట్టుకుని.

సుబ్బారావుకు ఒళ్లు మండిపోయింది. "అయితే - ఒక పని చెయ్యి. చిటికెడు విషం ఉంటే అందులో వెయ్యి. నా పీడా నీ పీడా వదిలిపోతుంది" అంటూ బొబ్బలుపెట్టాడు. ఏమయినా సరే నళిని మెట్టు కూడా దిగకుండా, ఇంకో మెట్టు కూడా పైకెక్కి ఆర్డర్లు జారీ చేసింది" ఇవేవీ ఇంకతను పెట్ట"నని.
📖

వారం రోజులు గడిచాయి. దబ్బపండులా ఉండే సుబ్బారావు పాపం నిమ్మపిందె లాగా అయిపోయాడు. ఎంత బతిమిలాడినా నళిని వినడం లేదు. రోజూ భోజనం దగ్గర రామరావణ యుద్ధమయిపోతోంది. “పోనీ ఆ చిక్కుడు కాయ గింజలు లేకుండా పై తొక్కలన్నా వెయ్యవే" అని బతిమిలాడుకున్నాడు.

"అమ్మో! వాతం చేస్తుంది. నా వల్ల కాదు. అయినా అన్నిటికీ అంత జిహ్వచాపల్యం ఏమిటి?.. లేకితనం చూస్తే నలుగురూ నవ్వుతారు. ఏదో తిన్నన్ని రోజులు తిన్నారు. ఇక ఈ జన్మలో వాటికి నీళ్లొదులుకోండి. ఏదోలా బ్రతకడం అలవాటు చేసుకోండి" అని వేదాంత ధోరణిలో మందలించింది.

సుబ్బారావుకి ఒకపక్క కోపం ఎక్కువయింది "బతికినన్నాళ్లు బ్రతికాగా ఇక ఇప్పుడు చంపెయ్యరాదూ ... ఈ దిక్కుమాలిన బ్రతుకు బతక్కపోతే ఎవడేడిచాడు. ఛస్తేనే మంచిది” అని విసుక్కున్నాడు నిరాశతో.

మరి నాలుగు రోజులు గడిచాయి. సుబ్బారావు కాకరకూరను కళ్లు మూసుకుని నోట్లో వేసుకుని చెంబెడు నీళ్లు గుటుక్కున తాగుతున్నాడు. నడిచే ఓపిక లేక కర్ర చేతికి వచ్చింది. ఏమయితేనేం తన మంగళ సూత్రం బాగుంటోందని నళిని సంతోషపడి పోతోంది. అనకూడదు గాని పిల్లికి చెలగాటం - ఎలక్కి ప్రాణసంకటంలా ఉంది పాపం సుబ్బారావు పరిస్థితి.

మరో వారం గడిచింది. ఒక రోజున సుబ్బారావు పడక కుర్చీలో కళ్లుమూసుకుని పడుకుంటే మెట్ల దగ్గర ఏదో పెద్ద మూలుగు వినిపించింది. క్రమంగా మూలుగు తనకు దగ్గరవుతోంది. ఏ పందికొక్కో, లేచి కొడదామనుకుంటే అతనికి 'లేచే ఓపిక లేదు. ఆ మూలుగు క్రమంగా దగ్గిరయి దగ్గిరయి హాల్లోకి చేరుకుంది. తీరా చూస్తే తన మామగారు పరంధామయ్య గారు జంపకానా పరుపు చుట్ట భుజాన వేసుకుని, చంకలో సంచీతో (సిమెంటు సంచీలో బట్టలు కుక్కి) మరో చంకలో గొడుగుతో మూలుగుతూ ప్రత్యక్షమయ్యారు. సుబ్బారావు ఓపిక తెచ్చుకుని కుర్చీలోంచి లేచి మామగారి చేతిలో లగేజీ అందుకుని "ఏమేవ్ ఎవరొచ్చారో చూడు"అని దొడ్లో ఉన్న భార్య నుద్దేశించి నీరసంగా కేకేశాడు.

నళిని అతిధి మర్యాదలన్నీ చేసి " నీవంట్లో ఎలా ఉంది నాన్నా? అంతా బాగున్నారా" అని కుశల ప్రశ్నలు వేసింది.

పరంధామయ్య తాత్కాలికంగా మూలుగు ఆపి "ఏం కులాసా తల్లీ. నా ఆరోగ్యమే ఏమీ బాగుండటం లేదు. ఇక్కడ డాక్టరుకు చూపిద్దామని వచ్చా ... బలానికి డాక్టరు పళ్లూ పాలూ, తినమంటే రోజూ చక్రకేళీలూ, పంచదార బాగా వేసి బాగా పాలూ, ఆరగా ఆరగా తింటూనే ఉన్నా. ఏమీ తగ్గి చావటం లేదు. అది సరే గాని అమ్మా! నీ ఆరోగ్యం బాగుంటోందా. 'నీకున్న షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వచ్చిందా?" అని అడిగాడు.

నళిని తెల్లబోయి "అదేమిటి నాన్నా? నాకు షుగర్ వ్యాదేమిటి? ఆ షుగర్ మీ అల్లుడు గారికి” అని చెప్పింది.

దాంతో పరంధామయ్య చివ్వున లేచి "నీ బొందా నా బొందాను. అల్లుడి గారికి కాదు, నీకే! డాక్టరు రిపోర్టు తారుమారు చేయకు" అన్నాడు బల్ల గుద్ది మరీ చెపుతూ.

కుర్చీలో కూర్చున సుబ్బారావుకు ఎక్కడ లేని ఓపికా వచ్చి చివాల్న లేచి “చూశారా చూశారా తనకి షుగర్ వ్యాధి పెట్టుకుని నా ప్రాణం తీసి, నన్ను నిలువునా కాల్చుకు తింటోంది" అని ఎగిరిపడ్డాడు.

“లేదు నాయనా. ఇన్నేళ్లొచ్చి నీతో ఇలా అబద్దమాడతానా. షుగర్ వ్యాధి దానికే ఉందనీ, గోధుమ అన్నం, కాకరకాయ కూరా బాగా తినమనీ దానికే, నీరసానికి పళ్లూ పాలూ బాగా వాడమనీ నాకు డాక్టర్ స్వయంగా చెప్తేనే' అని గట్టిగా అనేసరికి సుబ్బారావు సంతోషం పట్టలేక కెవ్వున  అరిచాడు. నళిని అరిచింది కెవ్వున, కానీ సంతోషంతో కాదు భయంతో విచారంలో.

ఆరోజు నుంచీ పరిస్థితులు మారిపోయాయి. గోధుమ అన్నం, కాకరకాయ కూర నళినికి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. సుబ్బారావు మాత్రం అన్నీ తింటున్నాడు. ఆ తర్వాత వారం రోజులయ్యేసరికి సుబ్బారావు బాగా కోలుకున్నాడు గాని, నళిని మాత్రం మంచం దిగలేకపోతోంది. బాగా నీరసించిపోయింది. మామగారికి పూట వారీ పళ్లూ, పాలూ, జీడిపప్పు, కిస్మిస్, బలానికి మందులూ తేలేక సుబ్బారావు అవస్థపడిపోతున్నాడు.
📖

ఇలా కొద్ది రోజులు గడిచాయి. రాను రాను సుబ్బారావుకు ఈ ఇల్లు నరకప్రాయమైంది. ఇంట్లో హమేశా రెండు మంచాలు విడవ కుండా నట్టింట వున్నాయి. ఒక మంచం మీద కాళ్లూ, చేతులూ లేపే శక్తి లేక వెల్లికిలా, శవాకారంలా పడివున్న నళిని, రెండో మంచం మీద అంపశయ్య మీద పడుకున్న భీష్ముల వారిలా మామగారూ. వీళ్లకు వండి పెట్టలేక, మందులు తీసుకు రాలేక తన చావు దగ్గరకొస్తోంది. ఇంతకంటే గోధుమ అన్నం, కాకరకూరే నయమేమో అనుకున్నాడు సుబ్బారావు.

"ఏవండీ. ఒక్కసారి నన్ను బాత్రూమ్ కి
తీసుకెళ్తారూ?" అని నళిని.

"అల్లుడూ, నన్ను కొంచెం వత్తికించి పడుకోబెట్టు. పడుకొని పడుకుని పక్కలు పీక్కుపోతున్నాయి" అని  మామగారు. ఇలా ఇద్దరూ వంతుల వారీగా పిలిచి ప్రాణాలు కొరుక్కుతింటున్నారు సుబ్బారావుని.

"ఈ ముసిలాడు ఇక్కడికెందుకొచ్చినట్టు నా ప్రాణం తీయడానికి కాకపోతే. డబ్బుకు డబ్బు బోలెడయిపోతోంది. నా ప్రాణానికి సుఖం లేకుండాపోతోంది. చాకిరీ చెయ్యలేక" అంటూ సుబ్బారావు గుడ్ల నీళ్లు గుడ్డను కుక్కుకుంటున్నాడు.

శనివారం. దుర్ముహూర్తం. నళిని, పరంధామయ్య ఇద్దరూ పంతం పట్టినట్లు ఒకళ్లు విడచి ఒకళ్లు ఆర్తనాదాలు మొదలు పెట్టారు.

నళిని మంచానికి అతుక్కుపోయింది. పరంధామయ్య గుడ్లు తేలవేస్తున్నాడు. సుబ్బారావుకి భయమేసింది. మాసిపోయిన పాంటు షర్టు అని ఆలోచించకుండా ఫామిలీ డాక్టర్ దగ్గరకి పరిగెట్టాడు. పాపం డాక్టరు గారు ఏకళనున్నాడో, జపం కూడా చేసుకో కుండా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలా పరిగెత్తుకొచ్చాడు. తీరా వచ్చి చూస్తే ఏముంది?! ప్రాణాలు పోయినంత పనయి తండ్రీ కూతుళ్లు చెరో మంచం మీదా పడున్నారు.

డాక్టరుగారికి తను ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ జ్ఞాపకం వచ్చినాయి. ఎందుకాయినా మంచిదని ఆ రిపోర్టులు మళ్ళీ ఒకసారి ఇవ్వమన్నారు. పరంధామయ్య తన సిమెంటు సంచీ లోంచి వాటిని బయటికి తీసి ఇచ్చాడు. వాటిని చూచి డాక్టర్ ఒక్కగావు కేక పెట్టి "ఆవిడకు షుగర్ వ్యాధనీ, మిమ్మల్ని పళ్లూ, పంచదారా తినమని ఎవరు చెప్పారు?" అని అరిచాడు.

"మా అబ్బాయి వీర వెంకట వరప్రసాదు" అని పరంధామయ్య చెప్పాడు.

"చంపారు పొండి. చక్కెర వ్యాధి ఆవిడకు కాదు మహానుభావా, ఈ పరంధామయ్య గారికి, అందుకని గోధుమ అన్నం, కాకర కాయ ఈయన తినాలి. మిస్టర్ సుబ్బారావ్! నళినికి ఇప్పుడు నాలుగో మాసం. మీరు తండ్రి కాబోతున్నారు. అందుకని పళ్లూ పాలూ వంటి బలకరమైన ఆహారం తినమని చెప్తే, ఈయన పళ్లూ పాలూ మెక్కి, ఆవిడకు గోధుమ అన్నం, కాకరకాయ కూర పెట్టి ఆవిడ ప్రాణం తీయబోయాడు. మెడికల్ రిపోర్ట్స్ తారుమారయ్యాయి. ఇలా ఇంకో రోజుంటే ఇద్దరి ప్రాణాలు దక్కేవి కావు. ఏమైతేనేం. అదృష్టవంతులు' అన్నాడు.

“మరి మావాడు అలా చెప్పి చచ్చాడే!" అన్నాడు పరంధామయ్య.

"తాగుబోతు వెధవ. వాడి మాటలకు విలువేమిటి? అది సరే ఇప్పుడేం చేద్దాం" అన్నాడు సుబ్బారావు.

“ఏముందీ? ముందావిడకి పళ్లూ పాలూ ఇవ్వండి. ఇంతవరకూ పళ్లూ, పాలూ ఆరగించిన మీ మామగారిని ఒక లాగుడు బండి మీద వేసి హాస్పిటల్ కి పంపండి. తిన్నవన్నీ ముందు కక్కించాలి" అన్నారు డాక్టర్ గారు.

సుబ్బారావుకు ఆలోచన వచ్చింది. 'పోనీ మావగారిని శీర్షాసనం వేయించి వీపు మీద బాదితే.. తిన్నవన్నీ బయటకి వస్తాయేమో కదా' అనుకున్నాడు వచ్చే కోపాన్ని బలవంతాన అణగదొక్కుతూ. కాని పాపం పైకి మాత్రం అనలేకపోయాడు.

Tuesday, 20 January 2026

 _*🚩మాఘ పురాణం - 1 వ అధ్యాయము🚩*_

*మాఘ మాస మహిమ*

☘☘☘☘☘☘☘☘☘

*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*

*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*

*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*

           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.

పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ , పావనమూ , సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట , ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని , విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.

ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.

సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.

అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను ,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.

రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా , తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.

మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనొందుదురు సుమా , దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.

ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.

పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.

దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే యింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 

పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.సుబ్బారెడ్డి

ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.

భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘమాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును  యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును , తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కెగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.

******

_*🚩మాఘ పురాణం - 2 వ అధ్యాయము🚩*_

*శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమలు చెప్పుట*

☘☘☘☘☘☘☘☘☘

వశిష్ఠులవారు  మార్కండేయ వృత్తాంతమును , శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత , యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను. *" మహాముని ! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని"* ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును , నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ , నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి , *'స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని , కానీ , ప్రయాగక్షేత్ర మహత్యమును , మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన , ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని'* వేడుకొనగా , పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను , దేవి ! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.

సూర్యుడు మకరరాశియందువుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక , జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా , ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను , లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని , తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతఃకాల స్నానము గొప్పఫలము నిచ్చుటయేగాక సమస్తపాపములను విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన విష్ణులోకమునకు పోవును. మూడవనాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసము నందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని , చెరువు కాని , నుయ్యి కాని , కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి , సూర్యభగవానునకు నమస్కరించి , తనకు తోచిన దానధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.

ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక , కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక , మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలో స్నానముచేసి , శ్రీమన్నారాయణుని పూజించి , సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి , విష్ణు మందిరమునగాని , శివాలయమున గాని దీపము వెలిగించి , ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక , పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక , స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోరపాపములుచేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె , తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీస్నానము చేసి , దానధర్మాది పుణ్యముల  నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరముగదా ! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ !   యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.

నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీస్నానముగాని , జపముగాని , విష్ణుపూజగాని , యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును , ఱంపములచేత , ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి , కాలకృత్యములను తీర్చుకొని , నదికిపోయి స్నానము చేసి , సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి , అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యేస్త్రీ అటులచేయదో , అట్టి స్త్రీముఖము చూచినంతనే సకలదోషములూ కలుగుటయేగాక ఆమె పంది , కుక్క జన్మలనెత్తి హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు వయఃపరిమితిలేదు , బాలుడైనను , యువకుడైనను , వృద్ధుడైనను , స్త్రీయైనను , బాలికయైననూ , జవ్వనియైననూ , ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.

పార్వతీ ! దుష్ట సహవాసము చేసేవారు , బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు , సువర్ణమును దొంగలించినవారు , గురు భార్యతో సుఖించినవారు , మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు , జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్తపాపములు నశించుటయేగాక , జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయనివాడునూ , యితరులను వంచించె వారివద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును , మిత్రద్రోహియు , హత్యలు చేయువాడును , బ్రాహ్మణులను హింసించువాడును , సదావ్యభిచార గృహములలో తిరిగి , తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి , గురుద్రోహి , దైవభక్తి లేనివాడును , దైవభక్తులను యెగతాళిచేయువాడును , గర్వముకలవాడై తానే గొప్పవాడినని

అహంభావముతో దైవకార్యములనూ ధర్మకార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును , ఇండ్లను తగలబెట్టువాడును , చెడుపనులకు ప్రేరేపించువాడును యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవీ ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు , క్రూరకర్మములు ఆచరించువారు , సిగ్గువిడిచి తిరుగువాడు , బ్రాహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును.   యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో , అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి , యెటువంటి దోషములూలేక పరిశుద్ధుడగును , అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు , అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత ఆ మాసమంతా ఆచరించెడి   యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు , జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలో స్నానము చేయలేరు. కాన , అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించినయెడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారినిదర్శించిన పిదప అగ్నిదేవునికి , సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును.

ఈ విధముగా ఆచరించెడి వారినిజూచి , యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని , తల్లిని , భార్యను లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస  స్నానమాచరించునటుల   యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని , వైశ్యునికికాని , క్షత్రియునికి కాని , శూద్రునికికాని మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని , చేయలేని వారినికాని , ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక , ఆయుఃక్షీణము , వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు , ముఖము కడుగుకొని ,  తలపై నీళ్ళుజల్లుకొని , సూర్యనమస్కారములు చేసి , మాఘపురాణమును చదువుటగాని , వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము , దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా , వంద అశ్వ మేధయాగములు చేసి , బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగును. బ్రాహ్మణ హత్య , పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన , నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.

🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏

మాఘ పురాణం - 2 వ అధ్యాయము

*శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమలు చెప్పుట*

వశిష్ఠులవారు  మార్కండేయ వృత్తాంతమును , శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత , యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను. *" మహాముని ! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని"* ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును , నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ , నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి , *'స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని , కానీ , ప్రయాగక్షేత్ర మహత్యమును , మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన , ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని'* వేడుకొనగా , పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను , దేవి ! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.

సూర్యుడు మకరరాశియందువుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక , జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా , ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను , లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని , తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతఃకాల స్నానము గొప్పఫలము నిచ్చుటయేగాక సమస్తపాపములను విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన విష్ణులోకమునకు పోవును. మూడవనాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసము నందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని , చెరువు కాని , నుయ్యి కాని , కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి , సూర్యభగవానునకు నమస్కరించి , తనకు తోచిన దానధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.

ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక , కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక , మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలో స్నానముచేసి , శ్రీమన్నారాయణుని పూజించి , సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి , విష్ణు మందిరమునగాని , శివాలయమున గాని దీపము వెలిగించి , ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక , పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక , స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోరపాపములుచేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె , తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీస్నానము చేసి , దానధర్మాది పుణ్యముల  నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరముగదా ! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ !   యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.

నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీస్నానముగాని , జపముగాని , విష్ణుపూజగాని , యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును , ఱంపములచేత , ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి , కాలకృత్యములను తీర్చుకొని , నదికిపోయి స్నానము చేసి , సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి , అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యేస్త్రీ అటులచేయదో , అట్టి స్త్రీముఖము చూచినంతనే సకలదోషములూ కలుగుటయేగాక ఆమె పంది , కుక్క జన్మలనెత్తి హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు వయఃపరిమితిలేదు , బాలుడైనను , యువకుడైనను , వృద్ధుడైనను , స్త్రీయైనను , బాలికయైననూ , జవ్వనియైననూ , ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.

పార్వతీ ! దుష్ట సహవాసము చేసేవారు , బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు , సువర్ణమును దొంగలించినవారు , గురు భార్యతో సుఖించినవారు , మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు , జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్తపాపములు నశించుటయేగాక , జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయనివాడునూ , యితరులను వంచించె వారివద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును , మిత్రద్రోహియు , హత్యలు చేయువాడును , బ్రాహ్మణులను హింసించువాడును , సదావ్యభిచార గృహములలో తిరిగి , తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి , గురుద్రోహి , దైవభక్తి లేనివాడును , దైవభక్తులను యెగతాళిచేయువాడును , గర్వముకలవాడై తానే గొప్పవాడినని

అహంభావముతో దైవకార్యములనూ ధర్మకార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును , ఇండ్లను తగలబెట్టువాడును , చెడుపనులకు ప్రేరేపించువాడును యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవీ ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు , క్రూరకర్మములు ఆచరించువారు , సిగ్గువిడిచి తిరుగువాడు , బ్రాహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును.   యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో , అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి , యెటువంటి దోషములూలేక పరిశుద్ధుడగును , అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు , అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత ఆ మాసమంతా ఆచరించెడి   యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు , జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలో స్నానము చేయలేరు. కాన , అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించినయెడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారినిదర్శించిన పిదప అగ్నిదేవునికి , సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును.


ఈ విధముగా ఆచరించెడి వారినిజూచి , యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని , తల్లిని , భార్యను లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస  స్నానమాచరించునటుల   యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని , వైశ్యునికికాని , క్షత్రియునికి కాని , శూద్రునికికాని మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని , చేయలేని వారినికాని , ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక , ఆయుఃక్షీణము , వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు , ముఖము కడుగుకొని ,  తలపై నీళ్ళుజల్లుకొని , సూర్యనమస్కారములు చేసి , మాఘపురాణమును చదువుటగాని , వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము , దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా , వంద అశ్వ మేధయాగములు చేసి , బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగును. బ్రాహ్మణ హత్య , పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన , నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.

******

_*మాఘ పురాణం - 3 వ అధ్యాయము*_

*గురుపుత్రికాకథ*

మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘస్నానమున పాపవిముక్తి నందిన విధానమేమి?  వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లుపలికెను. దేవి వినుము, పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.

ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రికకూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలాదూరముపోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదలరొద, అనేకవర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలుగుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంతమందిరములా వుంది.

గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖప్రదమగును ఆలసించకనావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మనిపిలిచెను. సుమిత్రుడు మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు మనము సోదరీసోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదమురమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.

గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యాదేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయనిలోనికెగెను.

                తండ్రియామెను కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మ్ణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవునిరోదనధ్వనిని విని వాని వద్దకు వచ్చి 'జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖకారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నందియిట్లు పలికెను. ఓయీ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషమువలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీతీరమున గౌరీవ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందునుస్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!

సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి 'తండ్రీ! నా కుమార్తే చేసిన పాపముయేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరివిధముల ప్రార్థించెను.' అప్పుడా యోగి 'ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములుపోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయముకలదు. శ్రద్ధగావినుము మాఘమాసమున ప్రాతఃస్నానముచేసి ఆ నదీతీరమునగాని సరస్సు తీరమున  యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ నీమచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ద తదియనాడు రెండు క్రొత్తచెటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపుకుంకుమ మున్నగు సువాసిని అలంకారములనుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీపూజచేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతఃకాలస్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచైంచిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుహ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములుపోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.

Monday, 19 January 2026

 భగవంతుడు మానవ జన్మ ఆనందం,ఆహ్లాదం,సంతోషం కోసం ఇచ్చాడంటా......

💥మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు.

 💥వృధ్యాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బుని పోగొట్టుకుంటారు.

 💥ఆరోగ్యం ఆస్తికన్నా మిన్న, ఆరోగ్యం లేని ఆస్తి సున్నా.

 💥ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి.

 💥ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి.

 💥వ్యాయామం చేసేదానికి సమయం లేదనే వాళ్ళు, భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించవలసి వస్తుంది.

 💥తిండి విషయంలో నాలుకను అదుపులో ఉంచుకునే వాడు యోగి, నాలుకను అనుసరించేవాడు భోగి, నాలుకకు బానిసైనవాడు రోగి.

 💥డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్ర సంపాదించలేము.

 💥పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేము.

 💥మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము.

 💥పగను సంపాదించవచ్చు కానీ స్నేహాన్ని కొనలేము.

 💥ఆయుధాన్ని కొనవచ్చు. కానీ ధైర్యాన్ని కొనలేము.

 💥భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు.

 💥మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యం పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో.

 💥ధనముతో పరుపుని కొనవచ్చు కానీ నిద్రను కాదు.

 💥ధనముతో విలాసవంతమైన వస్తువులను కొనవచ్చు కానీ సంతోషాన్ని కాదు.

 💥ధనముతో దేవాలయాలని కొనవచ్చు, కానీ దేవుణ్ణి కాదు.

 💥దాచిపెట్టి ఏమి చేస్తావు, శవం మీద గుడ్డకు జేబు అయినా ఉండదు.

 💥ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద.

 💥ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పనులు చేశామన్నది ముఖ్యం.

 💥ఇతరులకి కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం.

 💥జీవితంలో ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి:

 1)నీకు విలువ ఇవ్వని వారిని

 2)నిన్ను చూసి ఈర్ష్య పడేవారిని

 3)మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని.

****



           ధర్మో రక్షతి రక్షితః

* జగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహత్కార్యం మరొకటి లేదు.

* మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం. 

* మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదీ ధర్మమే.

* ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది.

* ధర్మాన్ని కాపాడటమంటే- అన్నివేళలా ధర్మాన్నే ఆచరించాలి.

* ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుందని, అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి చెబుతోంది.

* శ్రీమద్రామాయణాన్ని రచించిన వాల్మీకి శ్రీరాముడి గుణగణాలు వర్ణిస్తూ ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటాడు.

* అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. సమస్త ధర్మాలూ ఆయనలోనే ఉన్నాయి.

* అందుకే ఆయన అందరికీ ఆరాధ్యదైవమయ్యాడు.

* మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏయే ధర్మాలు పాటించాలో విపులంగా వివరించి చెప్పింది మహాభారతం.

* ఏ కర్మలైతే మనోవాక్కాయాలకు బాధ కలిగిస్తాయో ఆ విపరీత కర్మలను ఇతరుల విషయంలో ఆచరించకూడదు.

* అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా భారతాన్ని భావిస్తారని నన్నయ చెబుతాడు.

* వ్యాసమహర్షి కోటిగ్రంథాల్లో చెప్పినవాటిని అర్ధశ్లోకంలో వివరిస్తున్నానని ఈ విధంగా ఉపదేశిస్తారు.

* ఇతరులకు మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది. చెడు చేస్తే పాపం కలుగుతుంది. ఇదే అసలైన ధర్మసూక్ష్మం.

* ధర్మాచరణమే పరమధర్మమని, సచ్ఛీలమే తపస్సని, సచ్ఛరిత్రమే పరమ జ్ఞానమని బోధిస్తారు మహాత్ములు.

* బ్రహ్మచారి అయిన శ్రవణ కుమారుడు సంధ్యావందనాది విహిత కర్మలు చేస్తూ, వృద్ధులు, అంధులు అయిన తల్లిదండ్రుల సేవచేస్తూ ఆత్మశక్తిని పెంపొందించుకున్నాడు.

* ధర్మవ్యాధుడు స్వధర్మ ఆచరణతోపాటు తల్లిదండ్రులకు, అతిథులకు సేవచేస్తూ వేదవిహిత కర్మలతో తపోశక్తిని సాధించిన కౌశికుడనే బ్రాహ్మణుడికి తత్వోపదేశం చేశాడు.

*  కుక్కుటముని తనకు సమీపంలో ఉన్న గంగను, కాశిని సేవించక తల్లిదండ్రుల సేవలోనే పరమార్థాన్ని గ్రహించాడు.

* అందుకే మనిషి తాను చేసే ప్రతి పనినీ పరమాత్మ పూజగా భావించాలి.

* ధర్మాచరణతో అందరికీ తోడ్పడాలి.

* భోగాలను విడిచి త్యాగగుణం పెంచుకొమ్మంటుంది ధర్మం.

* అహంకారం వదిలి ఆత్మతత్వం గ్రహించమని చెబుతుంది.

* యుద్ధానికి సిద్ధమైన దుర్యోధనుడు తల్లిదీవెన కోసం గాంధారి దగ్గరికి వెళ్ళి తనకు జయం కలిగేలా దీవించమంటాడు.

* అప్పుడు గాంధారి, ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుందని దీవిస్తుంది.

* ఆమె దీవించినట్లుగానే ధర్మపరులైన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు.

* ధర్మ ప్రాశస్త్యాన్ని గురించి చాణక్యుడు తాను రాసిన చాణక్య నీతిలో ఇలా వివరిస్తాడు. ..

* మానవుడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని భూమిపైన, గోసంపదను పశువుల శాలలో విడిచి మరణిస్తున్నాడు. భార్య ఇంటి ముంగిట్లోనే ఆగిపోతుంది. మిత్రులు శ్మశానం వరకు వచ్చిపోతారు. ఎంతో ప్రేమగా పోషించుకున్న శరీరం చితిమంటల్లో భస్మమైపోతుంది. జీవుడితో వెళ్లగలిగేది ధర్మం ఒక్కటే.

* తన శ్రేయం కోరకుండా అందరి అభ్యుదయం కోరడం ఉత్తమధర్మం. నిస్సహాయులకు, వృద్ధులకు సహాయం అందించడం మానవతా ధర్మం.

* ఇతరుల నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని నీవు ఇతరులకు చేయడం నిజమైన ధర్మం.

* ధర్మాన్ని అనుసరించినవారిని ఆ ధర్మమే రక్షిస్తుంది.

* ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ ఉంటుంది.

* ఎంతటి క్లిష్ఠపరిస్థితుల్లోనూ ధర్మం విడవకూడదని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.

      *లోకాసమస్థాః సుఖినోభవంతు*

కధకాని కథలు. (01to 07) ********

 



కథ గాని కథ( ఏడు )

విత్తనం మొక్కగా, చెట్టుగా, పువ్వుగా, పండుగా, వివిధ రూపాలను మళ్లీ విత్తనం గా మారటం, శృష్టికారకమైన చైతన్యం జగత్తునంత మోస్తూ దైవ సంకల్పo ప్రకారంగా సృష్టి ధర్మం వల్ల చీకటి వెలుగుల సమాజంలో, సుఖ దుఃఖాల జీవితం నలిగి వెలుగులుగా. అవగాహన మొదటి మెట్టుగా అర్థం చేసుకొని నడుచుకునే ఆకలి మెట్టవడం, విశ్రాంతి ధర్మబద్ధమైన నడకతో సాగిపోతూ, అప్రమత్తులై, నిరంతర ఎరుకతో, జీవన గమనమై, పరిశీలిస్తూ, అంతా పరిశోధనలాగా సాగుతూ, సంతృప్తిగా,  ద్రవించే జ్ఞాన స్వరంగా, పరంగా, కళలు  మార్చుకుంటూ, నిండుగా, పండుగల జీవిస్తూ సమస్త లోకానికి భారం కాకుండా, పంచభూతాలకు అడ్డం రాకుండా సాగించడమే మానవ జీవితం. 

మరి దెబ్బలకు వచ్చిన రాయికి దొరుకు గౌరవం. ఆటుపోట్లు ధరించిన జీవికి కడవరకు పయనం. మనిషి దిగులు లేని సత్యాన్ని అనుకరించి, ధర్మాన్ని నిర్వహించి నిర్మలంబుగా, కాలయాపన చేస్తూ, మనసు కోరుకుంటూ, జీవన కళ ఉట్టిబడుతూ, బతుకు ఉత్సవాల్లో, అనుభవాలతో, జీవన గమనం సర్వస్వయోదాయకం.

 తీగల నుండి తెగిన దోస పండ్లుగా,ఎండిన ఆకు రాలినట్లుగా, ఉప్పొంగుతున్న సముద్రం ఉప్పెనగ ఊరికి వెనక తగ్గినట్లుగా,  కర్మ పరిపక్వత పొంది కర్మానుసారం అనుభవించి, అంతిమంగా శివోహంగా మారి "ఆత్మకు మరణం లేదు కనుక" మరో జీవనంగా మారటం జీవన ప్రక్రియ.

*****

కథ కాని కథ (06)

బ్రహ్మణ ముహూర్తం విలువ లేందే మనసుకు తృప్తి చేరదు, కాలంతో ఎదురీదాలంటే మన సంస్కృతి సంప్రదాయలు, వంశగౌరవాలు తప్పవు, అలాగే మంచి సంసారానికి అన్యోన్యత ముఖ్యం!

అభివృద్ధి అంతా విజ్ఞానంతోనే అంటే మనిషి అలవాట్లు తరతరాలుగా వస్తున్నాయి, ఎవరు ఎన్ని చూపిన మనసు బట్టే పోవుట నిజమైన విజ్ఞానం. అందుబాటులో ఉన్న అజ్ఞానం తొలగించ గల బుద్ధి ఉంటే చాలు, ప్రపంచ విజ్ఞానం అవసరమా...

తెల్లారి లేస్తే  అన్నీ అబద్ధాలే చెప్పేవారున్నారు,

అలాంటప్పుడు ఎందుకు నీతుల ఉపయోగం ఏమిటనే వారున్నారు, కాని గత్యంతరం లేని స్థితిలో పలుకు మాయకు చిక్కుతారు కదా కాని సరిదిద్దుకొనే తెలివి, బుద్ధి మామవులకు ఉన్నాయికదా....

ఆర్ధికలోపాలు వ్యవస్థాగతం, అలాంటప్పుడు వ్యవస్థను మార్చ దళచినా అందరూ దొరకని దొంగలేగా తల్లి తండ్రి గురువు ఎంతచెప్పిన పిల్లల చేష్టలు మారవు యిదీ యంతే కదా...

భారతీయులకు గుళ్ళే ముఖ్యం అలాంటప్పుడు దేశమేమైతేనేమి అంటున్నావు? అసలు నీదర్మం నీవు నిర్వహిస్తున్నావా, గుడి యనేది హృదయం పదిలంగా ఉంటే జీవనం పదిలం.

ఆధ్యాత్మికమే,రాజకీయచైతన్యం పిడికెడు మెతుకులు చాలవా నీకు చెప్పి చేయించు కోలేని మూర్ఖ వాదన దేనికి.

భూమి దద్దరిల్లేలా - ఆకాశం అదిరిపోయేలా ఆర్భాటాలు వద్దు!ఆపదలో ఉన్నవాడ్ని - అవసరంలో ఉన్నవాడ్ని ఆదుకోవడం ముద్దు!

*****

కధకానికధ. (05)

మల్లెతోటలో గులాబికోసం వెతుకుతావెందుకు, తీరని ఆశకు కొత్తరెక్కలను తొడుగుతు ఎగరాలని పరిగెడతా వెందుకు దూరంజరుగుతున్న దరిచేరి ఫలములబుట్ట పరుగుల చూపులందుకు, తీపివ్యాధులకు చేదు మందులను మింగుతు ఒకవైపు, కక్కుర్తి యాటలు ఎందుకు, స్వచ్ఛత యనేది అందరికీ ఉంది, దాన్ని దక్కించుకొని సద్వినియోగం చేసుకోవాలి ఎవరాయినాసరే కాదా?.

పాటనుపాడే పశువులకాపరి సంతసాన్ని చూడు కల్మషము లేని తనము, విధిరాతంటూ వ్యథల సంద్రమే ఈదుతూ కర్తవ్యం, కాకరకాయ కాదు, ఏ సమయాన, ఏఋతువుకు తగ్గ అలవాట్లు ఉంటే చాలుగా మనలో.

కాకికోకిలగ పాడాలంటే కుదిరే పనియేనా నీకు, నాకు, పట్టువదలక మీకర్మంటూ పాడుతూ, నన్ను వేధిస్తూ, ఉండుట ఎవ్వరి కొరకు?

తప్పులు ఎంచే నీగుణమే నని ఒంటరి చేస్తుందే, మరి అట్లామాటాడుకు, ఆగని నోటికి తాళం వేయకె సాగుతు ఉండుట దేనికి. రమణి అలుకలను తీర్చగ సాగే ప్రియుని దెంత మురిపెంబూ కలువ మెచ్చని చందమామగా కదులుతు కాలక్షేపం చేద్దామా మనము.

సంతోషంతో పొంగే మనసుకె విజయంచేరువలే ఉందని తెలుసుగా, రగిలేగుండెకు శ్రీచందనమై తాకుతు మనసు కలవరం తగ్గించుకొనుట అందరి కర్తవ్యం కదా

బలే చెప్పారే.... మీరు

****

** కథకాని కథ(04)

సాహిత్యం అంటే సహనం నుండి వచ్చే, అనుభవాల అక్షర సత్యాలను తెలిపేది కవి హృదయం అర్ధం చేసుకోవటం నుంచి వచ్చె, పదానికి అర్ధాలు ఎన్నో, అర్ధం కానివారికి ఎం చెప్పెది ఇక నుంచ్చె?

వనంలోకి ప్రేమికులు రావద్దంటే ఆగుతారా, ఇది జంతు సాహిత్యం చదవద్దంటే ఆగుతారా, మనుష్యులకంటే జంతువులే మేలని తెలియదా, భావాన్ని అర్ధం చేసుకోలేనివారికి బూతు అంటే ఎలా ఈ దుస్థితి నేటి పరిస్థితి మనిషి జన్మ అన్ని జన్మలలో ఉకృష్టమైనది, సమాజానికి మాయని మచ్చగా ఆర్థిక అవసరాలు దేనికి?

ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించటం అందరి కర్తవ్యంమనో నిగ్రహశక్తి పెంచేది, ఆలోచిన్పచేసేది కవిత్వంసరస్వతీ పుత్రులను విమర్సించటం అవివేకంమనలోలేనిది ఇతరుల్లో ఉన్నది గ్రహించటమే వివేకం కాదా?

*_జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేవి మత్తు మందు లాంటివి! ఇవి అలవాటు అవ్వాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం తోడవ్వాలి. ఆ పుణ్యఫలంను నేటి సాధనకు సహాయంగా చేసుకుని మరింత సాధకులు కావడానికి ప్రయత్నం చేయాలి. వీటిని వదిలేసి కేవలం భోగ భాగ్యాలను అనుభవిస్తూ కూర్చుంటాం అంటే జన్మకు సార్థకత చేకూరదు!..*

--((*))

కథ కాని కథ(3)

*భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి...*

*సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది. పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది... అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు...*

*పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు... భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది...*

*దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది... క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది... చివరగా భగవన్నామం ఉచ్చరించడం అంటే భగవంతునికి ప్రీతికరం, భగవంతుని కృపకు పాత్రులవుతాం*

*****

మనిషికి మోక్షం - అర్థం -పరమార్ధం(కధకాని కథ. (02)

నువ్వెవరో తెలుసుకో ముందు, ఈ విశ్వం ఎంత పెద్దదైనా,  నీ జ్ఞానం ముందు  అది చాలా చిన్నదే. 

పక్షులకు రెక్కలే సాధనాలు; నీకు నీ ఊహలే రెక్కలు.  అవే నీ అమృత వాక్కుల ణే రెక్కలతో విశ్వాన్నే దాటేస్తావు;  అదే నీకు వరం.  నువ్వు బాధ్యత బంధము భారము కాకుండా వెతుకు; ప్రకృతి ప్రభావము తోడు నీడగా, నీ వెంటే ఉండు, అప్పుడే మోక్షం లభిస్తుంది.  

 స్నేహాన్ని, ధర్మాన్ని,సత్యాన్ని మార్గంగా ఎంచుకో;  అప్పుడే భగవంతుడ్ని చేరుకోగలవ్.  నిన్ను ద్వేషించేవాళ్ళ నిన్నేమీ చేయలేరు,నిన్ను ప్రేమించేవాళ్ళని దగ్గరకి తీసుకో; అప్పుడు నువ్వే ఒక వెలుగు.  అంబర దీపంగా వెలిగి పోతావు 

నువ్వే ఆకాశమైనప్పుడు,  నిన్ను గాలి ఏం చేస్తుంది?  

నువ్వే సముద్రమైనప్పుడు,  నీరు నిన్ను ఏం చేస్తుంది?  

నువ్వే స్వర్గమైనప్పుడు,  దుఃఖం నిన్ను ఏం చేస్తుంది?  

నువ్వే దేవుడవైనప్పుడు మృత్యువు మాత్రం ఏం చేస్తుంది?  

ఎడారిలో ఉన్నప్పుడు నువ్వే ఒయాసిస్సువు;  

అడవిలో ఉన్నప్పుడు నువ్వే మృగరాజువి;  సమాజంలో ఉన్నప్పుడు నువ్వే ఒక సమూహానివి.  నీ ఆలోచనలని బట్టే నీ జీవితం;  నీ మానవత్వాన్ని బట్టే నీ వ్యక్తిత్వం.  

మాట్లాడుతున్నప్పుడు  నువ్వు మౌనంగా,  అందరూ మౌనంగా ఉన్నప్పుడు  నువ్వు గొంతెత్తి మాట్లాడు.  

ఈ జీవితం నాటకం కాదు;  ఇదొక పరీక్ష.  ఇందులో నువ్వు గెలవాలి;  దాని కోసం రోజూ నువ్వు సాధన చేయాలి.  

గులాబీలు నిన్ను చూసి నవ్వు తుంటే  నువ్వు దిగాలు ముఖం వేసుకుని కూర్చోకు. సాయంత్రానికి వాడిపోయే  ఆ గులాబీలను చూసి  సంతోషంగా ఉండడం నేర్చుకో.  

నీ చుట్టూ ఉన్న చీకటికి భయ పడకు;  నీలో ఉన్న చీకటికి భయపడు.  నువ్వు వెలుగులో జీవించాలంటే  నువ్వే వెలుగువి కావాలి.  

మృత్యువు గురించి భయపడకు;  దానితో ఆఖరి శ్వాస వరకు పోరాడు.  అదే జీవిత చరదరంగం.  

అదేమనిషికి మోక్షం  అర్థం పరమార్ధం

*****

ప్రణాళిక! (కధకాని కథ. (01)

********

వివక్షలేని దానకర్ణులుగా, దయాదులుగా చూపు తో, ఆంక్షలు లేని ధాన్యము పండించే రీతిగా, దార (భార్య) దాపరికము లేకుండా కాపు' కస్తూ, జ్ఞానమణి గా ధార్మికుడుగా, దాతగా, దాశరధిగా, దామోదరుడుగా జీవితమై, అందరికి దారములా, దారులుగా, దావనలము కాని 'పని' గా,సంపదంతా దాత (బ్రహ్మ) దాతువులు ధార (నీరు) పంచభూతాల సహాయం 'సమాజపరం' గా, దేశాలకు కత్తిధార, దాగుడుమూతలు, దానవులు,' సరిహద్దులను దాటి పోవగా,  దోపిడీ లేని ధారాపాతంగా, దారి తెన్ను, తెలిపే ఆనందం' పొందగా,'వ్యక్తిగత' వివక్ష, దాస్య ప్రవృత్తి, దాచుకొను, దోచుకొను, ఆస్తి పోగా, లంచాలు లేని, దాసీ పుత్రులు లేని,  ఎలపట దాపట లేని, దాహము తీర్చు వ్యవస్థ' రాగ'పనిని' అందరూ, దాస్యమనక, ధర్మమని తలంచి గౌరవించాలి!

ప్రజాశ్రేయస్సే ప్రతి ఒక్కరి లక్ష్యమురాజకీయం' కాగా, ద్వేషం, ద్రోహం, అమిత దాహం, అహంభావం నశించి ప్రేమ' మిగలగా, చిటపటలు కాదు అందరిలో అన్నీ సమయాల్లో చిరునవ్వులతో ఏదీ నీది కాదనే'వేదాంతం' గా, పనులన్నీ మౌనంగా' జరగా,బానిసత్వంలేని బ్రతుకు' గా మాయ పోయి 'హాయి' గా మనిషి క్రమంగా 'దేవుడు గా 

మానవత్వమే నీ 'ప్రణాళిక' గా కావాలి!

      *******

Saturday, 22 November 2025

 రమణ మహర్షి..భగవాన్ స్మృతులు - *5

🪷

అధికారులు, బిచ్చగాళ్ళు, ధనవంతులు, సన్యాసులు, భక్తులు, రూపవంతులైన స్త్రీలు ఎవ్వరూ ఆయన దృష్టిని తీసుకోలేక పోయేవారు. కొందరు ఎన్నో ప్రశ్నలతో వచ్చి, అడగడం ప్రారంభిస్తే ఎంతకీ పలికే వారు కారు, ఒకర్ని పిలిచి పలకరించి, ఎన్నో విషయాలు చెప్పేవారు. కొందరిని ఏ కారణం లేకుండా, తనని పలకరించగానే కసిరి కొట్టేవారు. కొందర్ని గట్టిగా తిట్టేవారు హాస్యం పట్టించి, వెక్కిరించి, అందరూ నవ్వేటట్లు చేసేవారు.

సీసపద్యం

కసిరి కొట్టి కనులు కథలుగా తిప్పియు

 నవ్వించి నవ్వుతూ నటన జూప

కలలోన కనిపించ కలవరించి పిలవ

కొందర్ని చూడక కోప భావ

భక్తుని యాకృతి బంధము నో ర్పుగా

భావభవపలుకు భయము తొలగ

వచ్చి వేచిన కోప వాక్కులు తీరుగు

నమ్మిన వారికి నమ్మ పలుకు

గీత


విషము కన్న మూర్ఖ చెలిమి విషము యగుట 

తెలిసి నడవ గలుగు తీరు తెలప గోరు 

సూరి జనుల సుస్నేహము సూత్ర మగుట 

అమృత తుల్యమౌను పలుకు నవిని లోన 


🌼 సీస పద్యం – సరళ భావం

**

కొంతమంది చిన్న చిన్న మాటలతో, కనులతో సంకేతాలతో

నవ్వులు రేపుతూ, నటిస్తూ ప్రవర్తిస్తారు.

కొందరు మనసులో, కలల్లో కనిపించి

మనలను కలవరపరిచే వారు ఉంటారు;

కొందరిని మాత్రం చూడాలని అనిపించదు—పరిచయం కోపమే తెస్తుంది.

భక్తుడు ఈ బంధాలన్నిటినీ సహనంతో భరిస్తాడు;

భగవద్భావం అతని హృదయంలో నిలిచితే

అన్నిటి భయాలు తొలగిపోతాయి.

ఎవరైనా కోపంతో వస్తే,

భక్తుని సమక్షంలో ఆ కోప పెల్లుబికిన మాటలు కూడా తగ్గిపోతాయి.

సత్యంగా నమ్మిన వారికి మాత్రమే

అతను నిజమైన మాట చెప్పుతాడు.


🌼 గీత – సరళ భావం


మూర్ఖుడితో స్నేహం —

విషం కంటే ప్రమాదం.

జీవితంలో ఎవరి వెంట నడవాలో,

ఎవరి నుండి దూరంగా ఉండాలో తెలుసుకొని ఉండాలి —

కొందరికి అది నేర్పాలి.

పండితులు, జ్ఞానులు, మంచివారి స్నేహం

ప్రాణాధారం లాంటి గొప్ప సూత్రం.

వారి మాటలు —

అమృతంలా మనసులో తేలికగా, శాంతిగా ప్రవహిస్తాయి.


కొందరు భక్తులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తరువాత భగవాన్ కలల్లో కనపడి రమ్మంటారు. లేదా, ఆ  భక్తుడికే యెంతో నిలువ లేని ఆతృత కలుగుతుంది, భగవాన్ని యెప్పుడు చూస్తానా అని, దూరాల నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఏదీ లక్ష్యం చేయక యెప్పుడు యెప్పుడు అంటూ వస్తాడు ఆశ్రమానికి. అతను వచ్చేప్పటికి భగవాన్ తల రెండో వైపు తిరిగి ఉంటుంది, అటు చూడరు, పలకరించరు. చిరునవ్వు నవ్వరు కొన్ని రోజులు. ఈలోపల యెందర్ని పలుకరిస్తారో ప్రేమగా పిలచి, మాట్లాడి, కుశల ప్రశ్నలు వేస్తారో!

కొందరు వుండేవారు. వారికి అందరి ముందూ భగవాన్ తో మాట్లాడడం గొప్ప. అందరి వంకా చూస్తూ, ఏవో కాయితాలో పుస్తకమో పట్టుకుని, ఏదో సందేహాన్ని కల్పించుకుని వెళ్ళి భగవాన్ని పలకరించి మాట్లాడతారు- మధ్య మధ్య చుట్టూ వున్న వారి వంక గర్వంగా చూస్తూ అంత స్వల్పమైన విషయాన్ని యెంతోసేపు మాట్లాడతారు, వాళ్ళతో భగవాన్, దూరం నుంచి వచ్చి; త్వరలో వెళ్ళవలసిన ఇంకోరు తమ సందేహాలతో రోజులకి రోజులు వుండిపోవలసిందే. యెవ్వరికేది అవసరమో, ఏది వారిని తనకి కట్టి వేస్తుందో, ఏది వారి అహాన్ని అణుస్తుందో ఆ విధంగా జరిగిపోయేది భగవాన్ ద్వారా.

సశేషం..

 *006

ఆశ్రమంలో తనకి ఇష్టంలేని పని కాని, తను వద్దన్న పని కాని జరుగుతూ వుంటే, పిలిచి చీవాట్లు వేసేవారు. కాని, అప్పటికి వినకపోతే మాట్లాడకుండా వూరుకొనే వారు. చాలాసార్లు భగవాన్ మీదే ఆంక్షలూ అజ్ఞలూ పెట్టేవారు ఆశ్రమాధికార్లు.


మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా భగవాన్ని ఎవరూ చూడకూడదని టైమ్ నిర్ణయించి, భగవాన్ని అడగకుండానే హాలు తలుపులు వేయించి వేశారు.


భగవాన్ “ఇదేమిటి?" అని అడిగితే, "మీ ఆరోగ్యము కోసం” అన్నారు. తలుపులు ముయ్యడానికి వీల్లేదనీ, 24 గంటలూ తలుపులు తెరిచి వుండాలనీ భగవాన్ అన్నా కూడా వినిపించుకోలేదు అధికార్లు. అందుకని ఆయనే హాల్లోంచి బైటికి వచ్చి కూర్చున్నారు. కాని, అప్పటికీ ఆశ్రమం వారు ఆయన మాట వినలేదు. ఒకటే బతిమాలారు, చివరికి అట్లాగే కానీ అని హాల్లోనే వుండిపోయినారు భగవాన్.


*****

ఏదో జరుగుతోంది  ప్రపంచమంతా

కారుమేఘాలుకమ్మి మూసుకు పోతోంది! లోకం తీరు ఇదేనా?

 

సముద్రాలు పొంగి మంచుకొండలు కరిగి అగ్నిపర్వతాలు పగిలి ఏదో విలయం! కనవస్తున్నది ఇందుకు కారణమేమి?


కల్లోల స్వప్నాలు వికృత రూపాలు భూత నృత్యాలు ఏమిటిదంతా? నాకేనా లేదా అందరికా..?


ఇది యుగాంతమా? కొత్త యుగానికి ప్రారంభమా?

అంతమే ఆరంభమా? ఎం చెప్పలేను శివా?***


అనేకమంది భగవాన్ కి ఫలహారాలు తెచ్చి పెట్టేవారు, వేళగాని వేళల కూడా ఆయనకి అవి జీర్ణమవుతాయా, లేదా అనే ఆలోచన కూడా లేకుండా. చాలాసార్లు అవి తిని బాధపడేవారు భగవాన్. ఒకరు యెంత తెచ్చిపెట్టినా తినేవారు. ఇంకోరు యెంతో భక్తితో విలువైన ఫలహారాలు తెచ్చిపెట్టి తినమంటే అటు తల త్రిప్పి కూడా చూసే వారుకారు. కొందరు ఆయన ముందు ఫలహారం పెట్టి, ఆయన పలక్కపోతే, అట్టానే చేతులు కట్టుకుని నించుని నించుని, ఇంక గతిలేక వెళ్లిపోయేవారు. ఒకరి చేతినుంచి ఇవాళ తిని ఇంకోసారి వాళ్లు తెస్తే, వాళ్ల వంక చూడనే చూడరు.


సశేషమ్.. చలం.. సాహిత్యం మల్లాప్రhగడ

[23/11, 06:58] Mallapragada Ramakrishna: 007


భగవాన్ ప్రవర్తన ఎప్పటికప్పుడు మారేది. ఆయన ఏ అనంద నిబిడీకృతమైన తేజోశూన్యంలోకో కిటికీలోంచి దిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నప్పుడు, ఆయన ధ్యానముద్రలో కూచున్న సాక్షాత్ దక్షిణా మూర్తి  అనిపించేవారు. పోజు లేని ఆ శాంభవీ ముద్ర ఎంతో ఆర్టిస్టిక్ గా వుండేది! ఆ అందంనించి కళ్లు తిప్పుకోలేకపోయే వాళ్లం, కదలని మారని సూర్యోదయాన్ని చూసినట్లుండేది. ఆయన ' ముఖంకాని, ఆయన దేహంకాని, మామూలుగా అందాలు అలవాటైన నా కళ్ళకి, అందంగా కనపడేవి కావు. కాని, ఆయన నిశ్చలంగా, గంభీరంగా కూచున్నారా-(ఆయన దేహం అట్లాగే వుండేది,) కాని, మరి ఏమిటో యింత అందం, ఇంత లావణ్యం! అవేంకాదు; ఏదో మనకు అలవాటైన సౌందర్యాలకి art కూడా అందుకోలేని దేదో ఆయన్ని వెలిగిస్తున్నట్టుండేది. ఒక్క కౌపీనం పెట్టుకున్న ఆయన, చక్రవర్తి దుకూలాలు కట్టుకుని, రాజలాంఛనాలతో, నవరత్న సింహాసనంపై కూచున్నట్లుగా వుండి దిగ్భ్రాము చెందేవాళ్లం, ఆ స్థితిలో నైనాసరే, ఎవరన్నా "భగవాన్!" అన్నాడూ -ఎక్కడనించి దిగివచ్చేదో ఆయనకి ఈ లోకస్మృతి. కాని సర్వాంతర్యామి అయిన ఆయన దృష్టి దిగిరావడమేముంది!


*****

జరిగే యుద్ధాలు 

భీకర దాడులు 

ఉల్కా పాతాలు 

ఒక ప్రళయం! అని యెంచ లేకున్నాను ఎందుకు?


ఆకాశవాణి పలుకులు 

భయపడకండి!

అంతమే ఆరంభం!

ఇది కొనసాగింపు! కొత్త పోకడలు ఏల?


అసత్యం వీడి సత్యానికి 

చీకటితొలగివెలుగులోకి వచ్చునా

మృత్యు కోరల నుండి 

అమృతమయజీవనానికి మార్గమా


ప్రతి యుగాంతము 

మరోయుగ ఆరంభం! మూలమా

బానిసయుగంనుండి

భూస్వామ్య యుగానికి! తప్పదా


భూస్వామ్యం నుండి

పెట్టుబడి దారీకి వత్తాసే

అంతాప్రజాచైతన్యం

సమతా యుగానికి! మార్పులే


ఇన్నాళ్లు పీక్కతిన్న

నరరూప రక్కసులు మారరా

రక్త దాహం తీరక

చేస్తున్న వైకృతం! ఇంకా పోదా


సానుకూల మౌతుంది

ఇది అంతమూకాదు

ఆరంభమూకాదు

పాతనీరు పోతోంది! అంతే అనుకోనా


కొత్తనీటి జల కళ

ఇది ఆనంద హేల

కొత్తప్రపంచం లోకి

ఒకఅంతం!ఒకఆరంభం! నావంతు కృషి ఎంతవరకు****  

భగవాన్ని పలకరించడమంటేనే యెంతో భయం. ఏ అధికారమూ, పరివారమూ లేని, బలంలేని స్వరూపం ముందు, గొప్ప పదవుల్లో, అధికారాలలో వుండేవారు, అతి గర్విష్టులు, సైన్యాధికారులు నమస్కరించడానికి వణికిపోయినారు.

మల్లాప్రగడ

***

008.భగవాన్ స్మృతులు


రోజుకి మూడు నాలుగుసార్లు, ఆశ్రమం నించి కొండ మీదికి వెళ్ళేవారు భగవాన్. ఆయన ముందు నడుస్తూ, వెనక కమండలం పట్టుకుని శిష్యుడూ, ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వుండేవారు. 


అప్పుడప్పుడు కొండని ఇటూ అటూ చూసి, వెనక్కి తిరిగి శిష్యుడితో చల్లగా మాట్లాడుతూ వుండేవారు.కింద నుంచున్న నాబోటివారు తదేక దృష్టితో ఆయనవంకే చూస్తూ నుంచునేవారు, వారు కనుమరు గయిందాకా. ఏమనిపించేదంటే- అట్లా ఒక్కొక్క మెట్టే యెక్కుతూ కొండ చివరికి వెళ్లి, అక్కడనించి అట్లా ఆకాశంలోకి మాయమై ఇంక తిరిగి రారేమోననిపించేది ప్రతిసారీ.


***అందరం బిజీ బిజీ!

కులమతాలతో 

తన్నుకు చావటానికి 

టైం లేనంత బిజీ శివా అనలేని బిజీ.


మీరు ఏ'రంగం'లో 

నిష్ణాతులో-అందులో 

బిజీ గా ఉండండి!

కులమతాలొద్దుమనకు! అన్నా కులం, మతం అంటూ తిరగటం దేనికి విగ్రహం శక్తి ఇచ్చే విధానం తెలుసుకోక 


అందరం కష్టపడదాం!

అందరం అనుభవిద్దాం!

అదీ వ్యవస్థ అంటే 

వాళ్లు మనుషులంటే! తెలుసుకోలేని మూఢ జనాన్ని ఎలా మార్చాలి 


మనకష్టాన్నంతా 

రిజర్వుబ్యాంకులో 

కుప్పపోద్దాం-కావాల్సింది 

తీసుకు తిందాం! అది చాలదా


మధ్యలోరాజ్యంఎందుకు

దళారీ గాళ్లెందుకు?

ఓటు కొనేవాళ్లెందుకు?

వీళ్ళతోవిసుగొచ్చేస్తోంది! అని నేనంటే ఎవరైనా నమ్ముతారా 


ఒకరి కష్టాన్ని మరొకరు

దోచుకోవటం ఏంటి?

పాపమంతా ఇక్కడే!

పైకిమాత్రంఎన్నినీతులో! చెప్పే వారి ఎక్కువ ఆచరించే వారు తక్కువ ఏమనాలి 


అంతా వంచనాశిల్పులు!

ఇలాంటి బతుకు వద్దు!

ఆలోచించండి-ఒక

ప్రత్యామ్నాయంచూద్దాం! అని అనుకున్న వారు ఎవరు అర్థం తెలుసుకోకుండా అర్థం చేట్లు తిరిగేవారే 


మీకైతే ఎలా ఉందోకాని

నాకైతేమనశ్శాంతిలేదు! ఇది అంతా ఆ శివా కల్పనలే మాయలే 

ఎటుచూస్తే అటు దగా

ఎన్నాళ్లీదోపిడీసమాజం? ఈ సమాజాన్ని గెలిచేది మౌనం అర్థం చేసుకున్న వాడికి గ్రహణం అదే మూల శివ తత్వం 


*****

0009


భగవాన్ చివరి రోజుల్లో కురుపులేచి ఆపరేషన్లు అయి, శరీరం బలహీనమైన తరువాత ఆయన సోఫామీద నించి లేవడానికి చేసే ప్రయత్నం చూస్తే చుట్టూ కూచున్న వారికి ఆ బాధ తమ దేహాలలో పలుకుతున్నట్లుండేది. అట్లా బాధ పలకడా నికే ఆయన ఆ నెప్పిని పోగొట్టుకునేవారు కారేమో! ఆయన పొందిన మహోన్నత స్థితీ, అనిర్వచనీయమైన ఆనందమూ, అవేకాదు, ఆయన శరీరానికి తటస్థించిన బాధలు కూడా ఈ ప్రజలకోసమే గావును! కొన్ని ఏళ్ళు ఆయనకు మోకాళ్లు నెప్పులు వుండేవి. ఎవరో ఒకరు పంపిన మందు తైలాన్ని మర్ధన చేస్తూనే వున్నారు, పిసికే వారు. సోఫామీదనించి లేస్తూ భగవాన్ తన మోకాళ్లని పిసుక్కునేవారు. ఎవరన్నా పిసకబోతే "వుండవయ్యా! అంత పుణ్యమూ మీకేనా, ఈ మోకాళ్లని పిసికి నన్ను కొంచెం పుణ్యం సంపాయించుకోనీ” అనేవారు. 


ధర్మోరక్షతి రక్షితః 

వినటానికి బాగుంది!

వేలసంవత్సరాలుగా 

వింటున్న నీతిసూత్రం!


ధర్మాన్నిఎవరురక్షించాలి?

ఎవరు రక్షించటం లేదు?

రక్షించేవాళ్ళు బాగున్నారా?

రక్షించనివాళ్ళుబాగున్నారా?


అసలు ఏది ధర్మం?

చాతుర్వర్ణ ధర్మాలు!

ఆ కాలంలో చెప్పారు!

కాలం మారిపోయింది!


బ్రాహ్మణ క్షత్రియ వైశ్య 

త్రైవర్ణ ధర్మాలు ఏవి?

సూద్ర ధర్మాలు ఏవి?

ఇవి రక్షించబడాలి!


బ్రాహ్మణ ధర్మం ఏది?

వాళ్ళు 'గుడి'నినమ్మారు!

నేటికీ'గుడి'తోనే ఉన్నారు!

ధర్మ రక్షణ జరుగుతోంది!


క్షత్రియధర్మం ఏది?

రాజ్యభారం! సుజనరక్షణ!

ఇపుడుపాలించేవాళ్లెవరు?

ధర్మమే మారిపోయింది!


వైస్యులధర్మం ఏది?

వ్యవసాయం చెయ్యటం!

అదీ ఆనాటి వాళ్ళ ధర్మం!

ఇప్పుడు ధర్మం మారింది!


సూద్ర ధర్మం ఏది?

త్రైవర్ణాలను సేవించటం!

ఇప్పుడు సాధ్యమౌతుందా?

ఇక్కడా ధర్మం మారింది!


మారుతుంది కాబట్టే

ధర్మం 'చర' అన్నారు!

చాతుర్వర్ణ ధర్మం కాదు

నేడు ప్రజాస్వామ్య ధర్మం!


ఆ పాత నీతి సూత్రం

నేడు పనికిరాదు!

ప్రజాస్వామ్య సూత్రాలతో

కొత్తగారాసిందే రాజ్యాంగం!


రాజ్యాంగ ఉల్లంఘనచేసి

మనువాద ఫాశిస్టులు

వీరంగమాడుతున్నారు!

ధర్మాన్ని చెడగొట్టారు!


కంచే చేను మేస్తోంది!

మనువాద ఫాశిస్ట్ కార్పొరేట్

అధర్మపాలననుంచి

దేశాన్నికాపాడదాం రండి!


వాళ్ళు చెప్పినధర్మాన్ని

వాళ్ళే తుంగలో తొక్కారు!

ధర్మం కాలాను గుణం!

ధర్మో రక్షతి రక్షితః! అంటూ

       

ఆయన లేచి నుంచుని కర్ర నానుకుని ఒక్కొక్క అడుగు వేస్తూవుంటే, భక్తుల్లో ప్రతివారి వూపిరీ యెగిరిపోతూ వుండేది ఆయన వేసే ప్రతి అడుగుకీ.

🪷

సశేషం


[26/11, 11:46] Mallapragada Ramakrishna: *భగవాన్ స్మృతులు -10

🪷


ఆశ్రమాధికార్లు కట్టించిన కొత్త హాలు రాతి గుమ్మం దాటడం అతి ప్రయాస అయ్యేది భగవాన్ కి. చూసేవారికి, చిన్న పిల్లలకి కూడా యెట్లానన్నా ఆయన్ని పట్టుకుని దాటించాలనిపించేది. కాని, తమ బుజాల్ని వూతగా ఇవ్వాలని వెళ్ళే పరిచారకుల్ని విదిలించి పంపించేవారు భగవాన్. ఒక్కొక్కసారి ఆయన పడిపోయేవారు కూడా, కాని, సహాయం మాత్రం తీసుకునే వారు కారు.


మానవోద్ధరణకై ఈశ్వరుడు ఏ రూపంలోనో భూమిపై అవతరించి, తాను అనేకమందిని శిష్యులుగా తీసుకొని, వారిని సాధనలో పెట్టి పునీతుల్ని చేస్తారు. ప్రతి గురువు పద్ధతీ, తక్కినవారి నుంచి ప్రత్యేకంగా వుంటుంది. కాని, ప్రతి గురువు కూడా తనను విశ్వసించి, తాను నియమించిన ప్రకారం ప్రశ్న లేకుండా నడవమనే ఆజ్ఞ ముఖ్యమైనది. వారు యే ప్రజలమధ్య అవతరిస్తారో వారి మతాలకీ, ఆచారాలకీ, పురాతన ధర్మాలకీ, కరుడు కట్టిన నీతులకీ కూడా చాలాసార్లు వారి బోధ విరోధంగా, విపరీతంగా వుండవచ్చును. తాము నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడచు కునే గురువుని భరించలేక చాలామంది వదిలిపోతారు. కొందరు ఆ గురువుని వదలలేక, ఆయన మాట వినలేక “ఆయన అంతేలే” అని తప్పుకు తిరుగుతూ వుంటారు.

*****

మార్చేవాళ్లెవరు? అంతా శివ ప్రక్రియలే


సామాన్యులు కష్ట జీవులు కూలినాలి జనం పుత్తు పూసలేని వాళ్లు ఏది చెపితే 

అదినమ్మేవాళ్ళు మూఢ విశ్వాసాలతో నిండినవాళ్లు 

దేవుని విలువ తెలియని వాళ్లు  వెయ్యి రూకలకు 

అమ్ముకునేవాళ్ళు తమకష్టాన్ని

ముడుపులు కట్టి హుండీల్లో వేసేవాళ్ళు ప్రతి కొండకెళ్లి

గుండుకొట్టించే వాళ్ళు మహిమలనినమ్మేవాళ్ళు

బ్రమ్మోత్సవాలు రథ యాత్రలు

పుష్కరాలు కుంభమేళాలు

తెలియనివాళ్ళు

వీళ్లంతా తరతరాల వంచితులు పీడితులు! వీళ్ళను మార్చాలి!

వీళ్ళ అజ్ఞానం మీద

బ్రతికేవాళ్లంతా వంచకులు పీడకులు దోపిడీ సమాజం!

మార్చేవాళ్లెవరు?  అంతా ఆశివుడే చేస్తాడు, శివుడే మారుస్తాడు, జీవుడు నిమిత్తమాతృడు. స్వార్ధ, మురికి కూపంలో చిక్కి నలిగే ఈగలబతుకే యగు తీరుగాను

****


భగవాన్ ఏ ఆచారాలూ పాటించేవారు కారు. తన దగ్గర చేరిన ఆచారవంతుల్ని,  ఆ ఆచార బంధనాల నుంచి తప్పించాలని చాలా ప్రయత్నించారు. అంతటి గురువుని యెదురుగా పెట్టుకొని; ఆయన్ని సాక్షాత్ ఈశ్వరావతారమని స్తుతిస్తూ గర్వపడు తూనే వారి దేవతార్చనలు, వ్రతాలు, మొక్కుబళ్ళు, తీర్థయాత్రలు - సమస్తమూ చేస్తూనే వుండేవారు భక్తులు. భగవాన్ని అడిగితే, "ఏదీ వద్దు, నిశ్చలంగా కూచో, అది ఉత్తమమైన యాత్ర... కాశీకిపోతావా? ఇది కాశీకాదా? అరుణాచలం కన్నా గొప్ప పుణ్యక్షేత్రం యెక్కడ వుంది? ఇదే హిమాచలం. ఇదే కైలాసం" అంటూన్నా సరే పోతూనే వుండేవారు.

📖

[27/11, 07:01] Mallapragada Ramakrishna: 0011.భగవాన్ స్మృతులు


ఆయనకి గొప్ప భక్తురాలు, ఎచ్చెమ్మ. ఒక సారి లక్ష తులసీ పత్రి వ్రతం చేసి, అలా చేశానని భగవాన్ తో గొప్పగా చెప్పుకుంది. "ఆ చెట్టుని అన్నిసార్లు గిల్లడంకన్న, నువ్వే లక్షసార్లు నిన్ను నువ్వు గిల్లుకోకపోయి నావా!?” అన్నారట.


చిన చేపను పెదచేప పెదచేపను తిమింగలం మింగటమేమన కాల రీతిగా ను మాత్రమే


దోపిడీ కాలము లో, ప్రేమకాలములో

సృజన శక్తులు కూడా

నశించిపోతాయి, కారణం వెతుకుంటే అంతా నిశ్శబ్దం


ఎక్కువతక్కువలతో

మనో వికారాలు పెరిగి

అంతా అంధకారమే అది ఎవరి వసరమో తెలియదు కదా


భౌతికమూ లేదు, ఆధ్యాత్మికమూ లేదు,

నిర్వీర్యము నిస్తేజమే, మనసు అర్భాటాలకు ఆజ్యం లాగ మారుట ఎంతవరకు సమంజసం


ఉపన్యాసాలు ప్రవచనాలు

కన్నీటితుడుపులు, కాలయాపన అనుకున్నా తప్పే, మనసు శాంతికి మరో మార్గం యది కాదా


నీ వల్ల ఎవ్వరికీ  హాని జరగకూడదు అదే సత్యం

అదీ నిత్యం


'ఆనాడే'మానవులంతా

ద్విగుణీకృత శక్తులై 

సమాజం సుసంపన్నం జేసే కార్యకర్తలుగా, శివగాణాలుగా తయారవుతారు మనలో కావాల్సినది ధైర్యం స్థాయి యనేది ఏదీ లేదు, ఓర్పు, ఓపిక మనుగడ కూ ప్రశాంతి కదా అని భావామృతం తెలియపర్చారు.

            ****


ఏది ఏమైనా, ఏది ఎటుపోయినా పట్టించుకోని భగవాన్, హాల్లో అద్దాల బీరువాకి ఆనుకునే పిల్లవాడితో అతి ఆత్రతగా "అద్దం, అద్దం పగులుతుంది” అని హెచ్చరించేవారు, తల్లి చచ్చిపోయిన ఉడత పిల్లని పెంచి; క్రిందపడి బీటలుపడ్డ పిచిక గుడ్డును తాను స్వయంగా జాగ్రత్త చేసి, పిల్ల ఐతే అందరికి చూపి ఆనందించే వారు భగవాన్, కాని, ఆయనకి చాలా ఆత్మీయులని అందరూ అనుకునేవారు చచ్చిపోతే “అట్లాగా!” అని వూరుకునే వారు. పుస్తకాలు బైన్డు చేస్తూ వుంటే, అలమారు చేస్తూ వుంటే, ఆ చేసేవారిని విసిగించి బలవంతం చేసి, పావు అంగుళం లో పదోవంతు కొలతలను కూడా సరి చేయించేవారు. వంటలూ అంతే, ఎట్లా వుండాలో, ఎన్నో వివరాలు చెప్పి చేయించి సరిగా చేస్తున్నారో లేదో లేచి వెళ్లి చూస్తూ వుండేవారు. మళ్ళీ యెంత విలువైనవి కనపడలేదన్నా, పాడైనా సరే ఆయన వినుపించుకోనన్నా వినుపించుకోరు.


ఆయన ముందే హాల్లో స్త్రీలను గడకర్రలు పెట్టి నెట్టేవారు సేవకులు; స్థానం కోసం పోట్లాడుకునేవారు ఘరానా పెద్దలు; భోజనం దగ్గర కూచున్న కొత్తవాళ్లని బైటికి గెంటేవారు. అయినా అట్లా చూస్తూ వుండేవారు భగవాన్. కాని, ఒక పిట్టకు, ఒక చెట్టుకు ఏ హాని కలిగినా జాగ్రత్తగా నయం చేసేవారు; హాని చేసేవారిని చూసి ఉగ్రులయ్యేవారు.

📖

[27/11, 18:19] Mallapragada Ramakrishna: 012..భగవాన్ స్మృతులు


ఆశ్రమానికి డబ్బు కూడిన మొదటి రోజుల్లో, ముందు 'వాకిట్లో ' కాచుకొని వున్న బీదలకి, ఆవులకి, తక్కిన ప్రాణులకి భోజనం పెడితేనేకాని భగవాన్ భోజనానికి లేచేవారు కారు, ఆశ్రమంవారు బీదలకి వేరే పల్చని సాంబారు వండితే, వారితోపోట్లాడి తను ఆ పల్చని సాంబారు వేసుకొని, వారికి మంచి సాంబారు పోయించేవారు. తను తినే యిడ్లీలు ఆవులకు పెట్టించేవారు ఆశ్రమం వారికి ఆ పనులు చాల కష్టంగా వుండి, ఎట్లాగన్నా ఆయన కన్ను కప్పాలని చూసేవారు. విసుగుపుట్టి ఆయన ఆ విషయమై కల్పించుకోవడం మానేసారు. తన భక్తులకి భిన్నంగా తనకేమి అధికంగా పెట్టినా ఉగ్రులయ్యేవారు. తనకి జబ్బుగా వున్నా తన కోసం తెచ్చిన పళ్ళు పాలు అందరికీ పంచాల్సిందే. ఆ విధంగా తనకు ప్రత్యేకత చూపినందుకు కోపించి - కాఫీ, పాలు మానేశారు భగవాన్, చాలకాలం.


రమణ మహర్షి ఆవేదనతో భాధతెలపకుండా నాకు ఏమీ భాదలేదు అంటూ


మీ ఆరోగ్యం మీ చేతిలో, మీ నడకలో, మీ పడకలో,  మీ నిద్రలో, మీతిండి లో 


మీ ఆరోగ్యం మీ ఉప్పులో,  మీ నూనె లో, మీ నీటి లో, మీ ధ్యానంలో, మీ ఆసనాల్లో 

మీ ఆరోగ్యం ఎండపొడ లో 


మీ ఆరోగ్యం విటమిన్స్ లో, ప్రోటీన్స్ లో, పండ్ల లో, ఆకు కూరల్లో, కోడిగుడ్లలో తెల్ల సొనలో,ఇప్పుడు పచ్చసొన లో,మీ ఆరోగ్యం మీ నవ్వులో 

అ హ హ హ ఆహా హా హా 

నవ్వండి నవ్వండి నవ్వండి 

లోపలఏడుస్తూనేఉంటారు

సమస్యలెక్కడికి పోతాయి!


ఎందరో మహానుభావులు 

వారిచ్చిన 'ఉవాచ'లు 

మనకు శిరోధార్యాలు!

నా'ఉవాచ'కూడా వినండి

మీ ఆరోగ్యం మీ 'బుద్ధి' లో!


బుద్దులు మంచివి కాకపోతే 

మీ సుద్దులు మారిపోతాయి 

మీ చేతలు మారిపోతాయి!

బుద్ధి అన్నిటికి మూలం!

దాన్ని సరిజేసు కోండి -మీకు 

నూరేళ్లు ఆరోగ్యం ఖాయం!!


మన బుద్ధులనిండా కులాలు 

మతాలు  ఎక్కువతక్కువలు

ప్రక్క వాళ్ళమీద ఈర్ష్య లు 

అరిషడ్వర్గాలతో నిండిపోతే 

నువ్వెన్నిచేసినా ఏమీలేదు!


ప్రేమ కరుణ దయ సహకారం

సమభావం సౌభ్రాత్రంవీటితో 

నీ హృదయం నిండి పోవాలి

రోగాన్ని రమ్మను చూద్దాం!

రాదు!మీరంటే దానికి భయం


ఇవన్నీ కుళ్లబెట్టుకుంటే 

మీరు ఏం చేసినా ఆరోగ్యం 

శ్రీమతేరామానుజాయన్నమః 

మీ చేతిలో మాత్రం ఉందా?

ఏంజరిగినా 'దైవేచ్ఛ'కదూ! 

అని అందరితో చెప్పేవారు

       

భగవాన్ కి ఎప్పుడూ ఏదో జబ్బు చేస్తునే వుండేది. మందు లిప్పించ చూసేవారు. ఎప్పుడూ భగవాన్ మందులు వద్దనేవారు. కాని, వత్తిడిచేస్తే మీ ఇష్టం కానిమ్మనేవారు. తరువాత ఏ మందులు యెంత కాలం పోసినా మింగేవారు. చివరదశలో ఆయన దేహాన్ని అంతంచేసిన కురుపు లేచినపుడు ఏ మందూ, ఏ కోతా వద్దన్నారు. ఎట్లా వచ్చిందో అట్లానే పోతుందన్నారు. కాని, రెండు మూడేళ్లు దానికోసం పోసిన మందల్లా తాగారు, కొ'సిన కొతల్లా కోయించుకున్నారు.

ఏది ఏమైనా ఈ జ్ఞానులందరూ ప్రేమమయులు, వారు ఏది చేసినా – యెట్లా చేసినా అది వారి నాశ్రయించిన వారి పురోభివృద్ధికే జరిగేది.


*___చలం*

🪷

సశేషం

[29/11, 21:07] Mallapragada Ramakrishna: *భగవాన్ రమణ మహర్షి స్మృతులు - 4*/13

🪷


*సాధుని శాంతమ్మ అనుభవాలు -1*


నా అన్న అల్లుడికి రామనాధపురం నుంచి దగ్గర వున్న పల్లెటూరికి బదిలీ అయింది. భార్య పుట్టింట్లో ఉండడంవల్ల అతను వొక్కడే వెళ్లి వంట చేసుకోలేక, నాకు కబురంపాడు. నాకప్పుడు నలభై యేళ్లు.  సామాన్లన్నీ వెంటతీసుకుని వెళ్లాను. బియ్యం పొయ్యిమీద పెట్టి కూర్చున్నానో లేదో, ఏ కారణం లేకుండానే నాలోంచి పెద్ద ప్రశ్న బయలుదేరింది.


"ఏమిటి? నువ్వు చేస్తున్న పని! ముగ్గురు కొడుకులూ పోయినారు, భర్త పోయినాడు. కుతురికి పెండ్లిచేసి, ఆ కుతుర్నీ అల్లుణ్ని అమితంగా ప్రేమించి నీకున్నదంతా వాళ్ళ కోసం ఖర్చు చేశావు. ప్రసవించి పిల్లతో సహా కూతురు చచ్చింది. కూతురు పోయి ఆరు మాసాలయిందో లేదో, ఈ లోపలనే అన్న కూతుర్నీ అల్లుణ్నీ తెచ్చుకొని రామనాధపురం రాజుగారిని యాచించి, అతనికి ఉదోగ్యం ఇప్పించి, నేడు మిగిలిన దేదో వాళ్లిద్దరికీ ఖర్చు చేస్తూ వాళ్ళకి వండి పెడుతున్నావు. ఇందుకేనా నువ్వు పుట్టింది? ఎవరిమీదో ఒకరిమీద మమ కారం తగిలించుకోకుండా నిలవలేవా? ఇతనెవరు? నువ్వెవరు? ఈ చాకిరీకి, ఈ ఖర్చుకి అర్థమేమిటి? ఇట్లాగే నీ కాలం

గడిస్తే, చివరికి నీ గతేం కాబోతుంది?" అని అడిగారు నాలోని ఎవరో...


ఒక్కసారిగా నా కళ్లు వాస్తవానికి గట్టిగా తెరుచుకున్నాయి.


నేను వెంటనే నా అన్న అల్లుడి దగ్గరకు వెళ్లి “నేను రామేశ్వరం బయలుదేరు తున్నాను” అన్నాను.


"ఎప్పుడు?”


“ఇప్పుడే.”


"అదేమిటి?”


"అది అంతే, నేను వెడుతున్నాను.”


అతను ఆశ్చర్యంతో, అయిష్టంతో "నాకు తిండి ఎట్లా?" అని సణుగుతున్నాడు.


"అదంతా నాకు తెలీదు, నేను రామేశ్వరం వెళుతున్నాను. పొయ్యిమీద అన్నం వుంది, చూసుకో” అని ఖచ్చితముగా చెప్పి, రైలెక్కాను.


ఆ ముందు రోజు అతను, అతని భార్య నా లోకం. వాళ్ళు తిన్నారా, లేదా? వాళ్లకి యిష్టమయ్యేట్టు వంట చేశానా? ఇంకా ఏం పెట్టను వాళ్లకి? ఇదే నా బతుకు. అసలు అలోచించితే వాళ్లెవరో, నే నెవరో!

📖


రామేశ్వరం వెళ్లాను. ఒకటే వేదన, నాకు మోక్షమార్గం యెవరు చూపుతారు?


అక్కడ పురాణం చదివే ఒకామె వుంటే ఆమెకి సేవచేస్తూ వారింట్లో వున్నాను 'మొదట్లో. ఆమెనడిగాను. పరమార్థం అర్థం కావాలంటే ఏం చదవమంటావని, 

'కైవల్యం' అనే పుస్తకం చదవమంది ఆమె. అది ఎక్కడ దొరుకుతుందంటే నాగస్వామి గారని ఒక స్వామి వున్నారు, ఆయన్నడగ మంది. నాగస్వామిగారిని చిన్నతనంనుండి యెరుగుదును, వెళ్లి ఆయన్ని అడిగాను.


"ఎందుకు 'కైవల్యం' నీకు?”


"అది చదివితే మోక్షమార్గం స్పష్టమౌతుందన్నారు.”


"పుస్తకం చదివినంత మాత్రాన నీకు మోక్షమార్గం తెలుస్తుందా?”


"అంతకన్న ఏం చెయ్యను స్వామి?”


“నీకా మార్గం తెలుసుకోవాలని గట్టికోర్కె వుందా?"


“అవును.”


"మోక్షం తప్ప ఇంక దేనిపైనా ఆశలేదా? అది సత్యమేనా?”


"అవును.”


ఆయన నన్ను పరీక్షిస్తూ చూచారు. 


“సరే. రేపు పౌర్ణమినాడు రా” అన్నారు.


పౌర్ణమినాడు నాకు మహామంత్రం ఉపదేశం చేశారు. ఉపదేశం పొందుతూ వుంటేనే, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడి లా కన్పించారు. ఆ మంత్రం ఉచ్చరించటం తోనే ఒళ్లు తెలీక, తన్మయురాలనై, యెంతో సేపు అట్లానే కూర్చుండిపోయినాను. నాకు యింత సులభంగా సద్గురువు దొరికారే అని చాలా సంతోషమయింది. ఆనాటి  నుంచి ఒక సంవత్సరం కైవల్యం చదవడ మయ్యేవరకు ఆ దంపతుల్ని సేవించుకుని వుండిపోయినాను


తరవాత రామనాధపురానికి వెళ్ళి లోక వ్యవహార సంబంధాలు వదిలి నేను తెలుసుకున్న వేదాంత గ్రంథాలు చదివి వినేవారికి చెబుతూ ఆ మంత్రం జపించు కుంటూ కాలం గడుపుతున్నాను.

ఇంకా వుంది

📖


*

[02/12, 06:34] Mallapragada Ramakrishna: భగవాన్ రమణ మహర్షి స్మృతులు - 4*/14

అట్లా తొమ్మిది సంవత్సరాలు గడిచాయి. 

నాకు యాభై ఏండ్లు నిండాయి. రామనాధ పురవాసులైన మురుగనార్ (భగవాన్ శిష్యుడు) నా పఠన కాలక్షేపానికి వస్తూ వుండేవారు. వారి దగ్గర భగవాన్ శ్రీ రమణ 

మహర్షుల వారి చిత్ర పఠాన్ని ఒకనాడు చూచాను. 


అప్పటి నుంచి ఎలాగైనా భగవాన్ దర్శనం చేసుకోవాలని గట్టి కోర్కె కలిగింది. మురుగ నార్ అప్పటికే అన్నీ వదలి భగవాన్ పాదాల్ని ఆశ్రయించుకొని అరుణాచలంలో ఉంటున్నారు, నేను ఎప్పుడూ బాగా బీద దాన్ని కావడంవల్ల అనుకున్న వెంటనే దూరప్రయాణం చెయ్యగల సామర్థ్యం నాకులేదు. కొంత డబ్బు సమకూర్చుకోడా నికి సంవత్సరంపట్టింది. నేను మురుగనార్ గారి అక్క, మరి ఇంకా ముగ్గురు స్త్రీలు కలిసి అరుణాచలానికి బయలుదేరాము గంపెడాశతో... 

📖


అది 1927 కార్తీక మాసం.


అప్పటికే భగవాన్ కొండ దిగి వచ్చి పాలి తీర్థం ప్రక్కన తల్లి సమాధిపైన వేసిన ఒక పాకలో ఉంటున్నాడు. అక్కడ ఆ పాక తప్ప ఇంకేమీ లేదు. చుట్టూ అడవి. మేము ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అందులో స్థిరపడ్డాము. 


మర్నాడు భగవాన్ దర్శనానికివెళ్లినప్పుడు వారు ఆ పాకలో ఓ నులక మంచం పైన కూర్చుండి ఉన్నారు. ప్రక్కన మురుగనార్. వారిని చూడగనే తెలిసింది, వారు గురు రూపంలో ఉన్న ఈశ్వరుడని. నేను తెచ్చిన పళ్లు వారి ముందుపెట్టి నమస్కరించి, "ఎన్నాళ్ళ నుంచో తమ దర్శనం చేసుకోవా లనే నాకోర్కె ఈనాటికి తీరింది. ధన్యురాల నైనాను” అని చెప్పి, "స్వామి, నాకు ఈ మనసు అనేది లేకుండా చేసి నన్ను కటాక్షించండి" అని అడిగినాను.


దానికి స్వామి మురుగనార్ తో "ఆమెను కనుక్కోండి మనసు అనేది ఒకటుందంటే, ఆ మనసు ఆకారమెటువంటిదో, ఆ మనసుగారికి మీసాలూ, గడ్డాలూ వున్నా యేమో చూడమనండి” అన్నారు.


ఆ మాటకి ఏమి సమాధానం చెప్పాలో తెలీలేదు నాకు. మురుగనార్ నన్ను చూచి “నీకు దీక్ష అయింది" అన్నారు.


రమణ స్తుతి పంచకం నుంచి నేను ఒక పద్యం చదివాను అరవంలో. “నీవు స్వర్ణజోతి స్వరూపం. నీవు సర్వ పరి పూర్ణుడవు. నీవు పొందిన ఆత్మానుభూతి పరిమళమై సర్వజగత్తును ఆవరించింది. రసాన్ని ఆస్వాదించి అందరూ నీ దగ్గిరకే పరుగెత్తుకొని వస్తున్నారు. నేను ఆ పరిమళాన్ని రుచి చూచి నిలువలేక 'ఎక్కడ? నువ్వెక్కడ?' అని వెతుక్కుంటూ వచ్చాను” అనే అర్ధంతో పాడాను.


అది విని "ఈ పద్యం ఈ అమ్మకి యెట్లా తెలిసింది?” అని అడిగారు భగవాన్.


దానికి మురుగనార్ నన్ను రామనాధ్ లో తాను యెరుగుదునని, రమణ స్తుతి పంచకం కాపీ నాకు తాను ఇచ్చిన సంగతీ చెప్పారు.


ఆ విధముగా మేము ఐదుగురము నలభై రోజులు వున్నాము అరుణాచలంలో.  ఊళ్ళో వండుకొని భోజనం చేసి మాలో మేము చందాలు వేసుకుని మధ్యాహ్నం పన్నెండింటికి రోజూ ఏదో ఫలహారం తయారు చేసుకొని ఆశ్రమానికి చేరుకొనే వాళ్లము. మూడు గంటలకు స్వామికీ, అక్కడ ఉన్న భక్తులకీ మేము తెచ్చిన ఫలహారాన్ని పంచి పెట్టేవాళ్లము. అందరికి ఎంత ఇస్తామో అంతమాత్రమే స్వామివారి కీ ఇవ్వాలి. అంతకన్న యెక్కున తీసుకోరు. కనుక అందరికి సరిపోయేట్టు తయారు చేసేవాళ్లం. ఆ రోజుల్లో ఆశ్రమంలో చిన్న స్వామే వంట. గోపాలరావు అనే భక్తుడు ఊళ్ళో దొరికిన బియ్యం-అవీ ఆశ్రమానికి పంపేవారు. భక్తురాలు ఎచ్చమ్మ కూడా ఏదో ఒకటి పంపేవారు. ఆ వచ్చినవాటిని వంటచేసేవారు చిన్నస్వామి. నెయ్యిగాని, కూరలుగాని సరిగా ఉండేవి కావు. స్వామి వారికి చారు అన్నమే చాలారోజుల పాటు వడ్డించారు. చారు కూడా లేకుండా ఉత్త ఊరగాయ ముక్కతో తిన్న రోజులు కూడా చాలా వున్నాయి.

🪷

*సశేషం*

*భగవాన్ రమణ మహర్షి స్మృతులు-5*/15



*​సాధుని శాంతమ్మ అనుభవాలు -2*


​ఇంతలో కార్తీకదీప ఉత్సవం దగ్గరకు వచ్చింది. ఆ రోజుల్లో కూడా దీపానికి వచ్చిన ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేవారు, భగవానుని చూడడానికి. అందుకని తెల్లవారగట్ట మూడింటికే ఫలహారం తీసుకుని కూర్చునేవారు.

​తెల్లవారిందా —లేవడానికీ, కదలడానికీ వీలు వుండేది కాదు భగవాన్ కి. ఆయన చుట్టూ కర్రలు కట్టేవారు, గుంపు తోసుకుని మీదపడకుండా. దాంట్లో స్వామి, మురుగ నార్, తక్కిన భక్తులు కూర్చునేవారు. అందుకని స్వామి నాతో "ఈ దీపం పది రోజులు నువ్వేమీ ఫలహారం చేసి తీసుకొని రావద్దు, గుంపువల్ల ప్రయోజనం ఉండదు" అన్నారు. నేను ఏ పళ్ళో తెచ్చి గుంపులో చొరబడి కర్రల సందు నుంచి స్వామివైపు ఆ పళ్లుపెట్టి వెళ్లిపోయేదాన్ని.


​కార్తీకదీప ఉత్సవం ఐనాక నాతో వచ్చిన వారు చిదంబరం వెళ్ళాలనుకుంటున్నారు. నాకేమో భగవాన్' జయంతి (పుట్టినరోజు) వరకు అరుణాచలంలోనే ఉండాలనిఉంది. కాని వాళ్లు వెళ్ళిపోతున్నారు కదా, నేను వెళ్ళాలని సెలవు తీసుకుందామని భగవాన్ దగ్గరకు వెళ్లాను. ఆయన నన్ను ఇంకొ రోజు ఆగమన్నారు. భగవాన్ రచించిన 'ఉపదేశ సారం' అనే పుస్తకాలు అచ్చై మర్నాడు వస్తాయనీ, నన్ను ఓ కాపీ తీసుకొని వెళ్ళమని అన్నారు. మర్నాడు శలవు తీసుకోడానికి వెళ్ళినపుడు 'ఉపదేశ సారం' కాపీ ఇచ్చి శలవిచ్చారు భగవాన్.

​నేను ఆయనను వదిలి కదలలేక ఏడ్చాను, భగవాన్ చాలా దయగా, నాతోపాటు ఆయనా దిగులు పడుతున్నట్లుగా "నువ్వు రామనాధ్ వెళ్ళడంలేదు. ఎక్కడికీ వెళ్ళడం లేదు. అరుణాచలం వెళుచున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తిరిగి వెళ్ళడం అంటే కష్టంగానే ఉంటుంది. దిగులుపడకు వెళ్ళిరా” అన్నారు. ఆ మాటలతో నాకు ఓదార్పు కలిగింది. ఆ రోజే చిదంబరం వెళ్లి, అక్కన్నించి రామనాధపురం చేరుకున్నా.


ఇంకా వుంది

****

*భగవాన్ రమణ మహర్షి స్మృతులు-5*/16


*సర్వేశ్వరుడి కృప*


​నేను రామనాధ పురంలో తిరిగి అమ్మవారి పూజలు చేసుకుంటూ గ్రంధపఠనం చేస్తూ వున్నాను. ఏడాది గడిచింది. తిరిగి భగవాన్ జయంతి వస్తోంది. 'పోయిన జయంతికి వుండలేకపోతినే. ఈ జయంతి కైనా వెళ్లగలనా' అనే చింతలో వున్నాను. బీదదాన్ని, రైలుచార్జి కూడా లేదు నా దగ్గర. ఎక్కడన్నా అప్పుచేసి ఐనాసరే శనివారం బయలుదేరి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. శుక్రువారంనాడు టపాలో నాకు జయంతికి ఆహ్వానం వచ్చింది, భగవాన్ ఫోటోతో సహా. నాకెంతో ఆనందమయింది. కరుణామయులు, ఈ క్షుద్రురాలిని జ్ఞాపకముంచుకొని ఆహ్వానం పంపించారు. అరుణాచలం వెళ్ళింతర్వాత తెల్సింది భగవాన్ స్వయంగా గోపాలరావు తో "శాంతమ్మకి ఒక ఆహ్వానపత్రిక పంపు” అని చెప్పి పంపించారని.


​నేను సద్గ్రంథాలు చదివి వినిపిస్తున్న సంగతి విని రామనాథపురం రాజావారి అంతఃపుర స్త్రీలు నాకు కబురంపి, వేదాంత గ్రంధాలు చదివించుకునేవారు. ఆ నాడు నేను నా కందిన ఆహ్వానం తీసుకొని ఆ రాణులకు చూపాను. భగవాన్ ఫొటో చూచి అందరూ ఆనందించారు. నాకు జయంతికి వెళ్లాలని ఉందని చెప్పాను. వాళ్ళలో వాళ్లు చందాలు వేసికొని 30 రూపాయలు ఇచ్చారు. భగవాన్ నన్ను రప్పించుకోడానికి సమయానికి డబ్బు కూడా సమకూర్చారు. అనుకున్న నాటికి బయలుదేరి అరుణాచలం చేరుకోగలిగాను.


*​ఆశ్రమంలో స్థిరపడడం*


​నేను ఆశ్రమానికి వెళ్ళేటప్పటికి ఒక హాలు కట్టారు. దాంట్లో భగవాన్ మామూలు మంచం ఓ మూల వేశారు. దానిపైన దిళ్లు వేసుకొని భగవాన్ కూర్చుని వున్నారు. దండపాణి స్వామి "ఉల్లత్ నార్పత్" 

(భగవాన్ వ్రాసిన నలభై శ్లోకాలు) చదువుతూ ఉంటే భగవాన్ వాటికి వ్యాఖ్యానం చేసి చెబుతున్నారు.

​భగవాన్ నన్ను చూడగానే "ఉల్లత్ నార్పల్ (పుస్తకం) నీకు రాలేదా! మురుగ నారును నీకు పంపమన్నానే” అన్నారు. జయంతికి ఆహ్వానం కూడా స్వామి నా పేరు చెప్పి పంపమని జ్ఞాపకం చేశారట. సర్వేశ్వరుడే నాపైన అంత శ్రద్ధవహించి నాకు సందేశాలు పంపుతే వారిని విడవడం ఎట్లా సాధ్యమౌ తుంది? నే నెంత? ఆడదాన్ని, అంత కృప నాపై కలగడానికి నేను చేసిందేమున్నది?


​అట్లాగే ఆశ్రమములో భగవాన్ తో భోజనం చేసి ఆశ్రమంలో ఉండిపోయాను, నా స్వంత ఇల్లులాగ, రాత్రులు మాత్రం ఊళ్ళో కి పోయి భగవాన్ భక్తులు మొదలియార్ గారి ఇంట్లోనో, ఎచ్చమ్మపాటి ఇంట్లోనో నిద్రపోయేదాన్ని, కార్తీక ఉత్సవమూ, జయంతీ గడిచాయి. "ఇంక ఎంతకాల ముండగలను వీరిమీద భారమై? వెళ్లాలి గదా!?” అని దిగులుపడుతూ ఓరోజు భగవాన్ సమక్షాన నిలిచి "ఇక్కడ ఉన్నంత కాలమూ శాంతంగా, తృప్తిగా, ఇంకేమీ ఆక్కర్లేకుండా ఉంటుంది. ఇంటికి వెళ్లానా, శాంతి ఉండదు. నేనేం చెయ్యను? భగవాన్ ని వదిలి కదలలేకుండా ఉన్నాను" అన్నాను.


​"నీ మనస్సు స్థిరపడ్డదాకా ఇక్కడ వుండు. తరువాత నువ్వు ఎక్కడికి వెళ్లినా శాంతి నీతోనే ఉంటుంది" అన్నారు. కానీ, ఎక్కడ ఉండను? బైట ఉందామంటే బీదదాన్ని. జయంతి కాగానే ఆశ్రమానికి వచ్చిన అతిధులు వెళ్ళిపోతున్నారు. నేనూ వెళ్లాలి కదా? ఐనా, ఆశ్రమం వారికే తిండి పుష్కలముగా 'లేదే! నేను భారము కదా వీరికి? ఏమైనా నేను కదలలేను. ఏవిధంగా నో నేను ఆశ్రమములో ఉండగలిగితే?అనుకుంటూ భోజనానికి వెళ్లాను.


​వంటింట్లో చిన్నస్వామి, రామకృష్ణస్వామి మాట్లాడుకుంటున్నారు. చిన్నస్వామికి ఒళ్లు బాగాలేదు. వైద్యానికి మద్రాసు వెళ్ళుచున్నారు, ఓ రెండు నెలలపాటు. ఈ లోపల శాంతమ్మ వంటచేస్తూ ఆశ్రమంలో ఉంటుందా అని ఆలోచించుకుంటున్నారు. నన్ను చూడగానే అడిగారు, నాకంతకన్నా ఏం కావాలి? కరుణామూర్తి, నా కోర్కెని ఎంత సులభంగా వెంటనే తీర్చారో స్వామి! అంతే, అప్పటి నుంచి ఆశ్రమంలో స్థిరపడి పోయినాను. నేనట్లా ఉండటం భగవానుని ఆజ్ఞగా, ఆయన ఇచ్చగా, ఆయన వరంగా భావించాను.

🪷

*సశేషం*

****