Thursday 23 May 2024

03-06-2024

 

.....
*019..>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*

*నందికి ఎందుకంత ప్రత్యేకత.....!!*

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. 

కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు.

నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా? కాదంటోంది ఆయన చరిత్ర! 

పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా… పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. 

ఎలాగైనా సరే తనకు సంతానభాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్లూ ఊళ్లూ గడిచిపోయాయి,

ఎండావానా వచ్చిపోయాయి… కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. ఆతని ఒంటినిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేళకు శిలాదుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు పరమశివుడు. 

 "నాకు అయోనిజుడయిన ఒక కుమారుడిని కలుగచేయి" అని కోరుకున్నాడు శిలాదుడు. 

అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తథాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా,

ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. 

నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం!  బాలుని జననంలాగానే అతని మేథ కూడా అసాధారణంగా ఉండేది.

పసివాడకుండానే సకలవేదాలన్నీ ఔపోసన పట్టేశాడు. 
ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. 

ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు.

వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్భవ అని అశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు! నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు.

ఎంతగానో ప్రాథేయపడిన తరువాత నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు.

కానీ నంది మాత్రం తొణకలేదు, బెణకలేదు. "శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి, దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు" అంటూ

శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకి మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు.

శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు.

అందుకే తన ఆయుష్షు గురించో, ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా "అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ" అని శివుని వేడుకున్నాడు నంది. 

అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా! అందుకే నందిని వృషభరూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు. 

ఆనాటి నుంచీ శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ, ఆయన ప్రమథగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది.

శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామిభక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. 

ఉదా॥ క్షీరసాగరమథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు, దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. 

ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్నీ ఆరగించేశాడు.

మహామహా దేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా, నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు. 

నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే, ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్యభక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు.

తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగినవానిగా, జ్ఞానిగా, ప్రథమ గురువులో ఒకనిగా భావిస్తారు. 

శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి, మైసూర్‌ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి. 

ఇక తెలుగునాట కూడా లేపాక్షి (అనంతపురం), మహానంది (కర్నూలు) వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది.

శివుడు ఉన్నంతకాలమూ, ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటూ ఉండదు....నమస్తే.. నందీశ్వరా..
🙏🙏🙏

20..*ఒకనాటి  జీవన శైలి...

ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించేవారు. 
వీటినే "పందొం పుల్లలు" అని కూడా అనేవారు.
కొంతమంది "కచ్చిక" (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళపొడితో పళ్ళు తోముకునేవారు. తాటాకులు చిన్నచిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచుకోవడానికి ఉపయోగించేవారు.
మగవాళ్ళు చాలామంది నూతి దగ్గరే, నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనేవారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయినిచ్చేది. చలికాలంలో మాత్రం వేడినీళ్ళు ఉండేవి.
ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రలపొయ్యి, లేదా పొట్టుపొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్రమైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండిమీద పట్టుకొచ్చి ఇంటిదగ్గర అమ్మేవారు.
కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీపొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరులెక్కన అమ్మే వారు.
బొగ్గుల కుంపటిమీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ,  పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలుది.
అదే విధంగా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం (పావు వీశ) గా తూచేవారు.
ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించేవారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెలతోనే. అందరి ఇళ్లలోనూ  రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు,  ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచేవారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బు రోట్లోనే.
అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.
అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.
బియ్యంలో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్యరకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.
సీతా రామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథివార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లిపోయేవారు. వెళ్లిపోయేలోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసేవారు. ఒకవేళ రాలేకపోతే, అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.
రాత్రిపూట7, 8 గంటలకు మాదాకవళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్నపిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళం అబ్బాయికి ఇచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.
టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్రనూక ఉప్మాలాంటివి ఉండేవి.
పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినేవారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేలమీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.
ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.
డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితిమంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండేవారు. గదులు కూడా చాలా పెద్దవి.
3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బుకి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.
వైద్యంకి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గేవరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్  భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది. అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు.
ఇంకా, పిల్లల చదువులమీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసేవారు కాదు.
పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం ధరకే టెక్స్ట్ బుక్స్ కొనేవారు. నోట్స్ అన్నీ తెల్లకాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్సులో. మిగిలిన తెల్లకాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త పుస్తకంలా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.
రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం. అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర. వేసవికాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసన కర్రే."*
ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది.  రెండు రూపాయలు పెట్టి  ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.
అదీ ఆరోజుల్లో జీవనశైలి.
ఎవరికీ ఏ చీకూచింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు  నిర్వహించేవారు.
అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి. 
వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు… మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు.  ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు.
కక్షలూ, కార్పణ్యాలు.  కోప తాపాలు, కుళ్ళూ కపటం.   ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునేవారే లేరు.   అహంకారం, ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి.
వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఇప్పుడున్నన్ని సౌకర్యాలు, విలాసాలు లేకపోయినా, ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యంగా గడచిన రోజులు.
-


021
జీవితం లో కస్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం.
హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి 

1.ఎవరిని / దేనిని ఆశ్రయించావు?
ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు.అపారమైన శివ భక్తుడు. అయినా పరకాంతల యందు..పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు. చివరకు రాముని ఒక్క బాణం తో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మ మూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి….ఆయన బాట యందు నడిచిన “స్వామి హనుమ” చిరంజీవి గా మిగిలిపోయారు. చరిత్రలో నిలిచిపోయారు.

“జీవితం లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో ….దేన్ని విడిచిపెట్టలో తెలియాలి. సరైన మార్గాన్ని తెలుసుకోవాలి. తెలియడం కాదు…పాటించే దమ్ము కూడా ఉండాలి.”

2. మైత్రి యొక్క విలువ!
వంచన తో..బలం తో..భార్యను, భూమిని, బలగాన్ని తనవైపు తిప్పుకున్న వాలి కి మంత్రిగా హనుమ ఒక్క నాటికి లేరు.తన దారి తానూ చూసుకోలేదు. న్యాయం వైపు గా..సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి… ఉన్నారు.

“జీవితం లో కస్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం. నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు… వాళ్ళని ఎన్ని కాష్టాలొచ్చినా విడిచిపెట్టకండి.”

3. అహం బ్రహ్మాస్మి
నేనే గొప్ప అని అనకు!
నాదేం లేదు…అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి!

లంకకు వెళ్ళే ముందు…హనుమ ఇలా అంటారు..!
నేను తలచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకో గలను…అంత బలం ఉంది…

కాని నేను ఎలా వెళ్తానో తెలుసా?
“నా స్వామి రామ చంద్రమూర్తి యొక్క కుడిచేత్తో తన భుజం వెనుకనున్న అక్షయ బాణ తూనీరం లో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలోనున్న బంగారు వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళుతుందో ” అలా దూసుకెళతాను…

అది నా శక్తి కాదు…!రాముడి చే విడవబడితే… రాముడి శక్తి ఆ బాణం లో కెళ్ళి బాణం వెళుతుంది! అటువంటి రామ బాణం లా వెళతాను!”

- నేను… నా వల్ల, నా బలం..ఇదంతా నేనె చేసాను.. అని హనుమ ఒక్క సారి కూడా అనలేదు!

4. నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు!
కొన్ని లక్షల వానర సేన! నూరు యోజనముల సముద్రం! జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు! తలచుకుంటే కాని పని కాదు! కాని రాముడు నమ్మింది …అందరూ సూచించింది “హనుమనే”!

“నిన్ను నమ్మి పని అప్పగించి ….గుండెల పై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతుకు!”

5. మోసం చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు మోసపోకు…ఆగిపోకు..ముందుకు మరో అడుగేసి సాగిపో!
హనుమ సముద్రం దాటుతూ ఉండగా….ఒక అందమైన బంగారు పర్వతం…పైకి లేచింది!“స్వామి…మీరు చాలా దూరం ప్రయాణం చేసి అలసి ఉన్నట్టు కనబడుతున్నారు..!కాసేపు నా ఈ పర్వతం పై కూర్చుని….విస్రాంతి తీసుకుని, ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తినివెళ్ళండి “అని అంటుంది.

హనుమ…”సముద్రం లో బంగారు పర్వతమా? మాయ లా ఉంది? ఇది నాకు విఘ్నమని” ఆలోచించి…ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి, లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు.

“చేసే పనిలో ….గమ్యాన్ని చేరుకోడం లో..ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ చేసుకున్న ప్రమాణం.”

6. లక్ష్యం తప్ప మరేదీ కనబడకూడదు.
హనుమ,లంకలో సీతమ్మకోసం వెతుక్కుంటూ రావణ అసురుని అంత: మందిరం లోనికి ప్రవేశించగా కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలు గా, సురా పానం చేసి…మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా…పడి ఉన్నారు… లెక్కలేనన్ని పళ్ళు…మధుర…పానియాలు నేలపై పది పారుతూ ఉన్నాయి. వారి ఒంటి మీద బంగారు నగలు…నేలంతా పడి ఉన్నాయి…ఇవన్నీ చూస్తున్నా….. హనుమ ఒక్కింత కూడా చలించలేదు…ఆతని మనసులో ఉన్నది ఒక్కటే!నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందొ? ఎన్ని కస్టాలు పడుతోందో అని…!

మురుగు కాలువ దాటినట్టు ఆ స్థలాన్ని దాటి సీతమ్మ ను వెతుక్కుంటూ వెళ్లారూ హనుమ.

“లక్ష్యం సాధించడం లో గురి… చేసే పని లో పట్టుదల.. పడే శ్రమలో తపన ఉంటె….మన చుట్టూ ఏమున్నా కనపడవు.”

7. పెద్దరికాన్ని గౌరవించు
రావణుడు హనుమను బంధించి తీసుకు రమ్మన్నపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించిచివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. నిజానికి బ్రహ్మాస్త్రం హనుమను ఆపలేదు.హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడ్డారు!
రావణ సభలో అంతే సులువు గా ఆ తాళ్లను విడిపించుకున్నారు.

“పెద్దలకి…నువ్విచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్నే పెంచుతుంది”
****

022..*_బంధమైన, బంధుత్వాలయినా, స్నేహమైనా... మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, ఈ జన్మలోనే వాటిని కాపాడుకోవాలి._*

*_ఎందుకంటే, దూరమైతే దగ్గరవడం చాలా కష్టం, దూరం కాకుండా ప్రతి బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది._*

*_బంధం నిలవాలంటే భాద్యతగా ఉండండి. విచ్చలివిడితనం మీ బ్రతుకు అదోగతి పాలుచేస్తుంది._*

*_స్నేహం,... బంధం పదిలంగా ఉండాలంటే... మన మాట తీరే ముఖ్యం. ఎదుటివారి మనసు గాయపడేట్టు మాట్లాడితే. స్నేహితులైనా, బంధువులైనా విరోధులవుతారు. మంచి మనస్సుకు, మంచి మాటకు మాత్రమే విలువ ఉంటుంది._*

*_నేటి బంధాలన్నీ ఆర్థిక సంబంధలే... కొంతమంది బంధువులు అన్నీ ఉన్ననాడే కలిసి వస్తారు, మీ దగ్గర ఏమీ లేనప్పుడు దూరంగా వెళ్తారు. అలాంటి వారిని దూరంగానే ఉంచండి._*

*_మీ దగ్గర ఏమీలేనినాడు ఎవరూ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారో వారే అసలైన ఆత్మ బంధువులు._*

*_మన అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టానికి ఎదురెళ్లి మీరే నిలబడాలి. అప్పుడే మీది నిజమైన బంధం, స్నేహం అని అర్థం._*

*_బంధువులకు, స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆ బాధలన్నీ తీర్చక్కర్లేదు, కానీ ఆ బాధల్లో వారికి తోడుగా ఉంటే చాలు. మీరు విలువైన వ్యక్తిగా ఎదుగుతారు. వారి మనస్సులో సుస్థిరస్థానం నిలబెట్టుకున్న వారవుతారు.☝️_*

           *_మీ శ్రేయోభిలాషి..._*
మల్లాప్రగాడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ

****

023..మామిడి పండు మాయాసారం*

రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే  *"వ్యామోహం"* అని అంటారు.

మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే  *"వాత్సల్యం"* అని విశదీకరించారు.

చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే  *"ఆప్యాయత"* అని చాటి చెప్పారు.

పండంతా ఆబగా తినిన తరువాయి కూడా , టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే *"లోభం"* అని అన్నారు.

మన పండంతా తిని  ఆస్వాదించాక, టెంక విసిరేసి , చేతులు నాక్కుంటూ, పక్క వాడు తింటున్న మామిడిపండు ఇంకా అవ్వటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే దానినే  *"అసూయ"* అని వివరించారు.

మామిడిపండు చేతికి చిక్కాక , ఆబగా  చివర్లలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో , గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచీ జారి పడిపోయి నప్పుడు , మనం వేసే చిందులతో కూడిన తాండవమునే, *"క్రోధం"* అని వివరంగా తెలిపారు.

మామిడి పండు తిని తొక్కను ఆవులకు, మేకలకు విసిరి, పండంతా పెట్టినట్టు  దీర్ఘ శ్వాస వదలి బిగుసుకు పోతామే, ఇదిగో దీనినే  *"అహంకారం"* అని చాటారు.

మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలికతో అందుకుంటూ, టెంకను మురిపెంగా చూచుకుని , దానిని శుభ్రంగా కడిగి, మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే, దానినే  *"మమకారం"* అని తెలిపారు.

అతిగా మామిడి పళ్ళు తిని , జడివానలా వచ్చే వమనములుకై చెరువు గట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీనినే ముఖ్యంగా *"ఆత్రం"* అని విశదీకరించారు.

*ఒక  పండు ఆరగింపు ముద్దు,*
*రెండు కద్దు*
 *మూడు అసలే వద్దు,*
 *ఉండాలి దేనికయినా సరిహద్దు.*
 దీనినే   *స్వీయ నియంత్రణ* అని విపులీకరించారు మన పెద్దలు.

🥭😛🥭

024..సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


కొన్ని భోజ కాళిదాస కథలలో మహాకవిని స్త్రీ లోలుడిగా చిత్రీకరించారు.కవిగా,లలిత శృంగార రస పోషణ లో ఆయన అందే వేసిన చెయ్యి కావటం వల్ల ఇలాంటి అపోహ కలిగిందా?లేక కాళీ వుపాసనతో పాటు కేళీ పిపాసకూడా ఆయన జీవితం లో భాగంగా చెప్తే ఈ కథలు మరీ ఆసక్తి కరంగా వుంటాయని యిది ఈ కథలకు జోడించబడిందా?లేక 'ఎంత వారలయినా కాంత దాసులే' అన్న లోకోక్తి ని కాళిదాసు కూడా పూర్తిగా అనువర్తించాడా?
చెప్పడం కష్టం.

ధారానగరం లో రమణీ మణి అనే రాజ నర్తకి వుండేది. ఆమె సౌందర్యానికి నాట్య ప్రతిభకీ దాసుడై రాజు ఆమెను తన ఉంపుడు కత్తెగా వుంచుకున్నాడు.ఆమెకు కాళిదాసు కవిత్వమంటే చాలా అభిమానం.ఆయనతోనూ ఆమెకు సంబంధాలుండేవి.ఈ రహస్యం ఆమె రాజుకు తెలియకుండా జాగ్రత్త పడింది.అయినా కొన్నాళ్ళకు రాజుకు అనుమానం వచ్చింది. ఆయన దాన్ని తెలుసుకునేందుకు ఒక ఉపాయం చేశాడురాజు ఆమె భవనానికి వచ్చినప్పుడు గోడ మీద శ్లోక పాదం వ్రాశాడు. 

'కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే'

అర్థము:-ఒక పువ్వులో నుంచి మరో పువ్వు పుట్టటం వినటమే గానీ ఎక్కడా కనబడదు.
ఈ శ్లోకం పూర్తీ చేసిన వారికి అక్షర లక్షలు యిస్తానని భోజుడు రమణి తో చెప్పాడు.ఒక వేల కాళిదాసు ఇక్కడికి వచ్చినట్టయితే తప్పక పూర్తీ చేస్తాడు,అప్పుడు రహస్యం బట్ట బయలవుతుందని ఆయన ఉద్దేశ్యం.
ఇంత పెద్ద బహుమతి అంటే రమణికి ఆశ పుట్టింది.

ఈసారి కాళిదాసు వచ్చినప్పుడు ఆమె గోడమీది శ్లోక పాదం చూపించి నా కోసం దీనిని పూర్తీ చేయండి అని కోరింది.ఇదేమీ తెలియని కాళిదాసు చెప్తాను రాసుకో అని 

'బాలే, తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం'

అర్థము:-- కానీ ఓ ముద్దరాలా యిప్పుడు నిన్ను చూడగా,నీ ముఖ మనే తామరపువ్వులో నీ కన్నులనే నీలి కలువలు పుట్టినట్టు కనిపిస్తున్నాయి సుమా!అన్నాడు మహా కవి.
అంత చక్కని పూరణ వినగానే రమణికి మతి పోయింది.ఈ పూరణ రాజుకు చూపిస్తే తనకు అక్షర లక్షలు ఖాయం.అనుకోని దురాశ తో కాళిదాసు నిద్రిస్తుండగా ఆయన తల నరికేసి శవాన్ని దాచేసింది. 

రాజుగారు వ్రాసిన దానికిందే తన చేత్తో కాళిదాసు పూరణను కొంచెం మార్చి 'బాలే' అనే పదం కాక రాజును వుబ్బేద్దామని 'రాజే!'అని వ్రాసింది
కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే
రాజే,తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం

అర్థము:-- ఒక పువ్వులోనుంచి యింకొక పువ్వు పుట్టటం వినడమే గానీ ఎక్కడా కనబడదు.కానీ యిప్పుడు నిన్ను చూస్తె రాజా!నే ముఖమనే కమలం లో కన్నులనే నల్ల కలువల జంట కనబడుతున్నది.
రాజు రానే వచ్చాడు పూరణ చూసి ఎవరు పూరించారు?అని అడిగాడు యింకెవరు నేనే అని బొంకింది.

రాజు ఆమె చెంప చెళ్ళు మని పించాడు.దుర్మార్గురాలా నీ అబద్దం నమ్మటానికి నేను మూర్ఖుడ ననుకున్నావా?.ఇది కాళిదాసు పూరించినదని స్పష్టంగా తెలుస్తూంది.ఎటొచ్చీ నీ బుద్ధి హీనత వల్ల 'బాలే'అన్న మాటను మార్చి 'రాజే' అని వ్రాశావు.ఆ మాత్రం తో నేను బుట్టలో పడిపోతాననుకున్నావు.కానీ 'రాజన్'అనే సరయిన సంబోధనకు బదులు నీ సొంత తెలివి నుపయోగించి 'రాజే' అని తప్పు రాసి నీ దొంగ బుద్ధి ని నువ్వే ప్రకటించు కున్నావు.చెప్పు యింతకూ కాళిదాసు ఎక్కడ?అని నిలదీశాడు.
రమణి భయపడిపోయి తప్ప్పు ఒప్ప్పుకొని జరిగిన దంతా చెప్పింది.కాళిదాసు మరణించాడన్న వార్త రాజు నమ్మలేక పోయాడు.రమణి కాళిదాసు శవాన్ని చూపగానే రాజు మూర్ఛ పోయాడు.కాసేపటికి తేరుకొని తన యిష్ట దేవత భువనేశ్వరీ దేవిని ప్రార్థించాడు.నా జీవితం లో మిగిలి వున్న ఆయువు లో సగం ఈ కవీశ్వ రుడికి ధార పోస్తాను.ఈయనను బ్రతికించు తల్లీ అని ప్రార్థించాడు.దేవి కరుణతో కాళిదాసు లేచి వచ్చాడు.రాజా నీ ఆయువు లో సగం ధారపోసి నన్ను బ్రతికించావు.నా శేష జీవితం నీకే అంకితం చేసి నీ ఋణం తీర్చుకుంటాను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు. అన్నాడు కవిరాజు.కవీశ్వరా నువ్వు లేకుండా నేను జీవించ లేను,జీవించినా అటువంటి నిస్సార మైన జీవితం నాకు వద్దు.మనం జంటగా ఒక కావ్య రాద్దాం
నీ పేరూ,నాపేరూ శాశ్వతంగా చరిత్ర లో నిలిచి పోతుంది.అన్నాడు రాజు.
తర్వాత యిద్దరూ కలిసి 'చంపూ రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు.(చంపూ కావ్య మంటే శ్లోకాలూ,గద్యాలూ రెండింటి తో చెప్పబడ కావ్యం) సరళంగా సాగే ఈ చక్కని గ్రంథం 'భోజ చంపువు'గా ప్రచారం పొందింది.దీన్ని ఈనాటికీ సంస్కృత విద్యార్థులు తమ తొలి అధ్యయన గ్రంథాలలో ఒకటిగా చదువుకుంటారు. అయితే ఈ రామాయణం 'సుందరకాండ వరకే భోజ,కాళిదాసుల రచన.అక్కడిదాకా వ్రాసి యిద్దరూ ఒకే సారి మరణించారు. మిగిలిపోయిన యుద్ధ కాండను ఆ తర్వాత 16వ శతాబ్దం లో లక్ష్మణ సూరి అనే ఆంధ్ర దేశ పండితుడు పూర్తి చేశాడట..

సేకరించబడింది ఆనందమె జీవిత మకరందం*

#రచన - #వేదార్థం జ్యోతి

--((***))--

_*25🚩 నేడు నారదుడు జయంతి🚩*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఆదర్శ పాత్రికేయుడు నారదుడు*

నారదుడు దేవర్షి , సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత , త్రేతా , ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు.

నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుకుంటున్నది.

*ముల్లోకసంచారి*

నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. అయితే కొంతమంది మేధావులు , రచయితలు మాత్రం ఆయన్ను *“కలహా భోజనుడు” గా “కలహా ప్రియుడు” గా* అభివర్ణించారు.

ఈ లోకం తీరే ఇంత. నిజం మాట్లాడే వాడికి ఎప్పుడు కష్టాలే. అందుకే అన్నారు *‘యదార్ధవాది లోక విరోధి’*. ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళంటే అదో చిన్నచూపు. వారిని లోక విరోధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ , మానవ , దానవులకు  సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం. ధర్మం గెలవాలి.

*‘నార’* అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని , *‘ద’* అనగా ఇచ్చే వాడని అర్ధం ఉంది. మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి , వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు , నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు.

*జన్మ వృత్తాతం*

ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి , అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.

*ధర్మ రక్షణలో నారదుడి పాత్ర*

*రామాయణ రచనలో*

రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది. వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో *“ఎన్ని కష్టాలు వచ్చినా , ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఋజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ?”* అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.

*మహర్షికి మార్గదర్శనం*

ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్ , యజుర్ , సామ , అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలియుగంలో ప్రజలకు దైవభక్తి , సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు.

ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం , మహాభారతం , భాగవతాలను గ్రంధస్థం చేయడంలో , వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.

అలాగే వాల్మీకి , ధ్రువుడు , చిత్రకేతు , ప్రహ్లాదుడు  సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.

*ధ్రువుడు*

ఉత్తానపాద మహారాజుకి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు సునీత. ఆమె కుమారుడు ధ్రువుడు. రెండవ భార్య సురుచి. ఆమె కుమారుడు ఉత్తముడు. ఒకరోజు సురుచి *“నువ్వు రాజు కావడానికి అనర్హుడివి” అని ధ్రువుడిని నిందిస్తుంది. దానితో విష్ణువుని మెప్పించి రాజార్హత సంపాదిస్తానని ఐదేళ్ళ వయసులోనే అడవి బాట పడతాడు ధ్రువుడు. ధ్రువుని శపథం విన్న నారదుడు వెంటనే అతని వద్దకు వచ్చి తపస్సు చేసే పద్ధతి వివరిస్తాడు. “ఓం నమో భగవతే వాసుదేవాయ”* అన్న మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. నారదుని ఉపదేశం ప్రకారం ధ్రువుడు తన తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువుని మెప్పిస్తాడు.

*చిత్రకేతు*

శూరసేన రాజ్యానికి సంబంధించిన కథలోనూ నారదుడి పాత్ర మనకు కనిపిస్తుంది. ఈ రాజ్యానికి రాజు చిత్రకేతు. ఆయనకు ఎన్నో ఏళ్ల తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే చిత్రకేతు మిగిలిన భార్యలు ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. లేక లేక పుట్టిన కుమారడు మృతి చెందడంతో చిత్రకేతు చాలా దుఃఖిస్తాడు. నారదుడు వచ్చి అతనిని ఎంత అనునయించినా ఫలితం లేకపోవడంతో , తన యోగ శక్తితో చనిపోయిన చిత్రకేతు కుమారుని బ్రతికిస్తాడు. తిరిగి ప్రాణం పోసుకొన్న అ బాలుడు *“నేను ఎన్నో జన్మలను ఎత్తాను. ఎంతోమంది తల్లితండ్రులను చూశాను. ఒకరి చేతిలోనుంచి ఇంకొకరి చేతిలోకి మారే నాణెం లాగా మానవుడు తన కర్మానుసారం ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు. నేను ఈ జన్మ చక్రం నుంచి బయటపడలనుకుంటున్నాను”* అని దేహ త్యాగం చేశాడు. దీంతో చిత్రకేతుకు జ్ఞానోదయమవుతుంది. అతని మనస్సు నిర్మలమవుతుంది. చిత్రకేతుకి మంత్రోపదేశం చేసి మోక్షమార్గాన్ని చూపాడు నారదుడు.

*భక్త ప్రహ్లాద*

భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన వృత్తాంతం లోనూ మనకు నారదుడు దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడు దేవతలకు శత్రువు. ఒకసారి అతడు మంధర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా , ఇంద్రుడు అతని భార్యని చెరపడతాడు. వెంటనే అక్కడకు వచ్చిన నారదుడు ఇంద్రుడిని వారిస్తాడు. ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావని హెచ్చరిస్తాడు. హిరణ్యకశిపుని భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆమెకు ధర్మానికి సంబంధించిన విషయాలతో పాటు శ్రీమన్నారాయణుని లీలను బోధించేవారు. వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో వినేవాడు. నారదుడి బోధనలు విన్న ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడయ్యాడు.

*సతీ సావిత్రి*

సావిత్రి కథలోనూ మహర్షి నారదుడు కనిపిస్తారు. మద్ర రాజు ఆశ్వపతి కుమార్తె సావిత్రికి సత్యవంతునితో వివాహం జరుగుతుంది. నారదుడు వచ్చి సత్యవంతుడు చాలా బుద్ధిమంతుడని , అయితే ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే జీవిస్తాడని చెబుతాడు. అయినా అంతా శుభమే జరుగుతుందని నారదుడు సావిత్రికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత నారదుడి ఉపదేశానుసారం సావిత్రి తన పతిభక్తితో యమధర్మ రాజు ను మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకుంటుంది.

శ్రీ కృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. ఇటు ధర్మరాజుకి రాజధర్మం , ప్రజలకోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి  కూడా నారదుడు వివరిస్తాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు , ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారివద్దకు పంపిస్తారు.

ఇంకా వేదాలు , ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ , సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. వేదాలలో చెప్పిన విషయాలను దేశ , కాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని , ఎలా పాటించాలో చెప్పేవే స్మృతులు. నారదుడు కూడా అటువంటి స్మృతిని రచించాడు. దానిని `నారద స్మృతి’ అంటారు.  నారదుని *“నారద శిక్ష”* అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము , దాని విశిష్టత , దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే `బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి. నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది.  ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు.

*మొదటి పాత్రికేయుడు నారదుడు*

ఇలా చెప్పుకొంటూ పోతే నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్నీ కావు. మానవాళి శ్రేయస్సు కొసం ఎన్నో మంచిపనులు చేశారు. అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించాడు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ అయన ధ్యేయం ధర్మ రక్షణే. శిష్ట రక్షణ , దుష్ట శిక్షణే. అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు. చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైన ఉపెక్షించే వాడు కాదు నారదుడు. తప్పు చేసినవాడు ఎంతటి వాడైన అతనికి శిక్ష పడేటట్లు చేయటమే నారదుని లక్ష్యం. మానవాళి శ్రేయస్సు కోసం , ధర్మ రక్షణ కోసం నారదుడు ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడేవారిని ఋషులనే అంటారు.

నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పత్రికేయులందరికి మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం.

*నారద జయంతి –  ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం*

వైశాఖ బహుళ విదియ మహర్షి నారదుని జన్మ తిధి. మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చే కొంతమంది పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరుగుతాయి. ఆ రోజున మహర్షి నారదుని స్మరించుకొని నిజమైన పాత్రికేయ వృత్తిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టలెక్కడి నుండి వస్తాయి ? ధర్మ మార్గంలో  నడిచే సమ సమాజం వెల్లివిరిస్తుంది.
*****

26..
అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు?

మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఝానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు, మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది ‘ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోనని వానికి ఏ కోరికలు ఉండవు' అని చెబుతుంది భగవద్గీత.
ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చెయ్యడం’ అన్నాడట వెనకటికెవడో. ఎంత విడ్డూరమైన సామెతో కదా! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే సతికి అన్నం పెట్టడమే కాదు తను తినటం కూడా ఊరికి ఉపకారమే. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అన్నాడు మహాకవి కాళిదాసు. ధర్మసాధనకు అత్యవసరమైంది శరీరం. దేహమే కాదు ఈ సృష్టి అంతా ధర్మసాధన నిమిత్తమే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశ సమన్వితమైన శరీరంలో అన్నమయకోశానికి మొదటి స్థానం ఇవ్వటం ఆహార ప్రాధాన్యతనే తెలియజేస్తుంది. అన్నపూర్ణ ఆత్మసఖుణ్ణి ఆదిభిక్షువుగాచేసి అన్నాన్ని అందించడం వెనుక ఆంతర్యమూ ఇదే. మనుగడకు మూలాధారమైన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని విడదీసి చూడలేం.
‘అన్నాద్భవంతి భూతాని’ అంటుంది భగవద్గీత. సకల ప్రాణులకూ మూలాధారం అన్నం. అన్నమంటే ఆహారం. దాని నుంచే సకల ప్రాణులూ ఉద్భవించాయని కృష్ణపరమాత్ముడి సందేశం. ఇదే విషయాన్ని ‘ఆత్మనః ఆకాశః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఔషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్‌ పురుషః’ అంటుంది తైత్తరీయోపనిషత్తు. అన్నిటికీ మూలమైన ఆత్మ, ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి పృథివీ, నేల నుంచి ఔషధాలు, వాటినుంచి అన్నం, దాన్నుంచి ప్రాణులు- ఇదీ క్రమం. ఈ గొలుసును (శృంఖల) పట్టుకుని వెనక్కి వెళ్తే దానికి మూలమైన ఆత్మ, ఆత్మకు మూలమైన పరమాత్మ కనిపిస్తాయి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. శరీరంలోని ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన రూపాల్లో ఉండే పంచప్రాణాలకు పంచభూతాల్లోని శక్తిని అందించడానికి పరమాత్మ తత్వమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ఆహారం ఎలా తినాలి?
పృథ్వి, జలం, అగ్ని, వాయువు- ఆకాశ తత్వాలు కలిగిన, బొటనవేలు చూపుడువేలు మధ్యవేలు ఉంగరంవేలు చిటికినవేళ్లతో కలిపి చేతితో ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే పంచభూతాలు ఉత్తేజితమౌతాయి. ఆ ఆహారాన్ని వైశ్వానరాగ్ని రూపంలో ఉండే పరమాత్మ పచనం చేసి ధర్మసాధనకు కావలసిన శక్తిని ప్రసాదిస్తాడు.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
అంటూ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుంది భగవద్గీత. శక్తిని ప్రసాదించే ఈ ఆహారాన్ని భగవంతుడికి సమర్పిస్తూ, ప్రశాంత వాతావరణంలో, శుచిగా, మౌనంగా, ఆకులో లేదా బంగారు, వెండి లాంటి ఉత్తమ లోహ పాత్రల్లో తీసుకున్నప్పుడు అది ప్రసాదమౌతుంది. భోజనానికి ముందు శాస్త్రం తెలిసినవారు మంత్రయుక్తంగా ఆచమనం చేసి, ఆ పరిజ్ఞానం లేనివారు భగవంతుని స్మరిస్తూ కొన్ని నీళ్లు తాగి, అప్పుడు తినడం మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
ఏం తినాలి?
పరమేష్ఠి దేవతలకు అమృతం, మనుషులకు అన్నం, పశువులకు ఆకులలములు, దైత్య రాక్షస పిశాచ జాతులకు మద్య మాంసాలు ఆహారంగా ఏర్పరచారు. ప్రకృతిసిద్ధమైన సహజ ఆహారం సాత్వికాహారం. రుచి కోసం వండి తినడం రాజసాహారం, మసాలాలు, మాంసాహారాలు తామసాహారం. మనం తినే ఆహారాన్ని బట్టే శారీరక, మానసికతత్వాలు ఆధారపడి ఉంటాయి. రాక్షసాదులు తామసిక ఆహారం తీసుకుంటారని కాకుండా, అలాంటివి తినేవారు ఆ ప్రవృత్తి కలిగుంటారని అర్థం చేసుకోవాలి.
ఎప్పుడు తినాలి?
‘న సంధ్యయోర్న మధ్యాహ్నే నార్థరాత్రే కదాచన’ అన్నారు. అంటే ప్రాతఃసంధ్య, సాయంసంధ్య, అర్ధరాత్రి సమయాల్లో భోజనం చెయ్యకూడదంటుంది శాస్త్రం. సాధు, సన్యాసులకు మధ్యాహ్న సమయాన్ని కూడా నిషేధించింది. సంధ్యాసమయాలు సత్ఫలితాన్నిచ్చే ఉపాసనా సమయాలు. అలానే అర్ధరాత్రి ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి జాడ శరీరానికి అందని కారణంగా జీర్ణక్రియ మందగించి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కనుక అది కూడా భోజనానికి నిషిద్ధసమయం.
అన్నం తినడానికి అర్హత ఏమిటంటే జిల్లెళ్లమూడి అమ్మ చెప్పినట్లు ‘ఆకలే అర్హత’. ఆయుర్వేదం ప్రకారం అన్నమంటే ఔషధమే. మనిషి రుతు చర్యను పాటించాలి. అంటే ఆయా రుతువుల్లో, ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహారాన్ని, శరీరతత్వాల అనుకూలతను బట్టి తినాలి. ఆహార, జల, విహారాదుల్ని పాటించని ప్రాణిలో వాతపిత్తకఫాలనే త్రిదోషాలు విజృంభించి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లాంటి అవయవాలు దెబ్బతిని ప్రాణం దేహాన్ని వదిలి వెళ్లిపోతుంది.
ఎక్కడ తినాలి?
ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, ప్రసాదంగా భావించి మౌనంగా స్వీకరించాలి. ఎక్కడబడితే అక్కడ తింటే అధ్వాన్నం అంటారు. అధ్వ అంటే దారి, అన్నం అంటే ఆహారం. రోడ్ల పక్కన శుచీ శుభ్రత లేకుండా దొరికే ఆహారమన్నమాట. అది అనారోగ్య హేతువు.  దేహం దేవాలయం, అందులో ఉన్న జీవుడు దేవుడన్న భావన ఉన్నప్పుడు ఆహారవిషయంలో జాగ్రత్తపడతాం. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నది ఆధ్యాత్మికతకే కాదు, ఆరోగ్యానికీ సంబంధించింది.
ఎలాంటి ఆహారం తినాలి?
అసలే తినకపోవడం, అతిగా తినడం రెండూ ప్రమాదమే. సగం ఉడికిన, అతిగా వేగిన, ఎప్పుడో వండిన, విరుద్ధ పదార్థాలు, దుమ్మూధూళీ కలిసిన దోషపూరిత ఆహారం, చలికాలంలో చలువచేసేవి, వేసవిలో వేడిచేసేవి- లాంటివన్నీ అనారోగ్య హేతువులే. అలాంటివన్నీ పరిహరించి పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని ఔషధంగా స్వీకరించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి.
ఇంట్లోని పిల్లలు భోజనం సరిగా తినకుండా వెదజల్లితే పెద్దలు వారిని మందలిస్తారు. అంతే కాకుండా దాన్ని అలా పారవేయరాదని అన్నం పరబ్రహ్మస్వరూపం అని వారితో అంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు అని పిల్లలు అడితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పరు, చెప్పలేరు కూడా.
ప్రతి జీవికి కావాల్సిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టే ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దలు చెబుతుంటారు. అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్లని నిర్ణయిస్తాడు. గత జన్మలో చేసిన పాప పుణ్యాలను లెక్కించి వాటిని అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరికి కడుపు పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట. ఆయన సమకూర్చిన ఆన్న, పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని, తాగే నీటిని వృథా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందట. అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష్షు కలుగుతుందట. అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృథాచేస్తే నీ ఆయువు క్షీణించి పోతుందట.
ఏ తల్లి అయినా తన బిడ్డల ఆయు: క్షీణాన్ని తట్టుకోలేదు. అందుకే అన్నంపారబోయవద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది కూడా. ఇదంతా వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం అని మాత్రమే చెబుతారు. అందుకే అన్ని దానాలో కన్నా అన్నదానం మిన్న. ఎవరికైనా కోట్లు ఇచ్చినా సంతృప్తి చెందరు కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు.
మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు.  మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?'' అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ''పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?'' అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ''అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను'' అని. నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో'' అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది...
****

27..ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా కనుగొనలేని, వివరించలేని ఆ అనంతశక్తి లేదా ఆత్మ ఒక మహా ఆశ్చర్యకరమైన వస్తువనీ, ఇంద్రియానుభవ రహితమైనదని, మానసికానుభవమని నాటి ఋషులుగా చెప్పబడే ఆధ్యాత్మిక పరిశోధకులు వేల ఏళ్లక్రితం ఉపనిషత్తుల్లో ఘోషించడం ఎంతో ఆశ్చర్యకరం. ఉపనిషత్తులు ఆ ఆత్మ గురించి పరిపరి విధాల వర్ణిస్తూ, ప్రతి ఒక్కరినీ మానవత్వం నిండిన విశ్వనరునిగా జీవించమంటూ, బతికినంతకాలం జ్ఞానపీఠికపై కర్మయోగిగా, చిత్జడ గ్రంథిని చిదిమివేసి మోక్షాన్ని అనుభవించాలని ఉపదేశిస్తాయి. ప్రాణసహితంగా ఉన్నా, ప్రాణరహితంగా ఉన్నా ‘నీవే ఆ అనంతశక్తిగా అనుభూతి చెందాలి’ అని చెప్తాయి.

అనుభూతి అనేది మనసు చేసే మథనం. ఇదే విషయాన్ని ‘ముండకోపనిషత్తు’ ‘ఆ ఆత్మ కళ్ళతోనో, ఇతర ఇంద్రియాలతోనో తెలుసుకోబడదు. తపస్సు వలననో, కర్మలచేతనో లభించదు. సాధకుని మనస్సు విశుద్ధమైనదై ఉండి, నిరంతరం ఆ ఆత్మతో తాదాత్మ్యత పొందడం వలననే దాని సాక్షాత్కారం పొందడం సాధ్యమౌతుంద‘ని తెలుపుతోంది. అంతేకాకుండా నయమాత్మా’ బలహీనేన లభ్యో...’ అంటూ ‘ఆత్మను బలహీనులైన వారు పొందలేరు. అజాగ్రత్త వలన, నిర్దిష్టమైన తపస్సు లేని యెడల ఆత్మసాక్షాత్కారం జరుగదు. శారీరక, మానసిక దృఢత్వం వలన వచ్చే మనోస్థైర్యం కలిగిన సాధకులు మాత్రమే బ్రహ్మస్థితిని అనగా ఆత్మసాక్షాత్కారం పొందగలర‘ని నిర్ధారిస్తోంది.

మనసుకున్న గొప్పలక్షణాల వల్ల ఆత్మ అటువంటి శక్తిని గ్రహించగలుగుతుంది. మనసు ఎంతో బలమైనదై, నిశ్చలమైనదై ఉండాలి. దృఢమైనది ఎందుకంటే ఆత్మతో ఏకత్వాన్ని అనుభవించినపుడు కలిగే ఆనందాన్ని భరించగలిగినదై ఉండాలి. నిశ్చలమైనదై ఎందుకుండాలంటే, మనసు నిశ్చలంగా ఉంటేనే పదార్థ లక్షణాలేవీ లేని శక్తిపట్ల తాదాత్మ్యత పొందగలుగుతుంది. నీటి ప్రవాహంలో గాలి బుడగలు ఉద్భవించి, కొంతదూరం ప్రయాణించి, పగిలిన తర్వాత తిరిగి నీటిలో కలిసి పోయినట్లే ఈ చరాచర ప్రపంచం ఆ అనంతశక్తిలో ప్రవర్తిస్తుంది. ఈ విషయాన్ని ఏకాగ్రచిత్తంతో గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ విధమైన ఏకాగ్రత మనలో ఎనలేని మార్పును తీసుకొస్తుంది. ఏ పదార్థంపైనా, జీవిపైనా వ్యామోహంగానీ, విరక్తి గానీ కలుగదు. మంచి–చెడు,సుఖం–దుఃఖం లాంటి ద్వైదీభావనలు కలుగవు. కామ, క్రోధాది అరిషడ్వర్గాలకు అసలు స్థానమే ఉండదు.

నిర్వికార, నిశ్చలమనస్సు ఏర్పడి ప్రతిపనిలో, ప్రతివాక్కులో, ప్రతిరూపంలో, సర్వత్రా ఏకాత్మను గ్రహిస్తూ ఉంటుంది. అదో అద్భుత ఆనందానుభూతి. ఈ దృశ్యమాన ప్రపంచాన్ని, దానికి హేతువైన ఆత్మను గెలిచి, ఒడిసిపట్టుకున్న ఆనందం. అంతకుమించిన విజయమేముంటుంది మనిషికి? జీవరాశుల్లో అన్నిట్లో మేధావి ఐన మనిషికి భౌతిక ప్రపంచంలో తాను ఆశించిందాన్ని గెలుపొందడమే గొప్ప విజయంగా భావిస్తాడు. అలాంటిది ఈ సృష్టి మొత్తానికి హేతువైన అనంతశక్తిని మన మనసులో ఒడిసి పట్టుకోవడం ఎంతటి విజయమో మనం ఊహించలేం. ఆ విజయానందం అనిర్వచనీయం. సాధకుడు ఆ జీవితాన్ని అనుభవించాల్సిందే. అప్పుడు సాధకుని మనస్సు అనిర్వచనీయమైన, అవధుల్లేని ఆనందడోలికల్లో తేలిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచం, దాని పరిణామాలన్నీ ఆల్పమైపోతాయి. అసలు వీటిమీద ఏ చింతా కలగదు.

 భగవంతుని చూడాలనుకునే ప్రతి ఒక్కరూ భగవంతుడు అని చెప్పబడే ఆ ఆత్మను సాకారం చేసుకోలేరు. మనసులో ఆత్మను నిరంతర సంయోగం చేయగలవారే ఆత్మ లేక భగవత్సాక్షాత్కారం పొందగలరు. అలా పొందిన వారు అద్వైతచిత్తులై, కుల, మత, లింగ, భాష, ప్రాంత, జైవికాది భేదాలకు అతీతులై, ఉన్నత మానసిక స్థితిలో ఓలలాడుతూ ఉంటారు. అదే స్వర్గం. అదే మోక్షం.

No comments:

Post a Comment