Friday 30 October 2015

(19-02-2020) ప్రాంజలి ప్రభ - యుగధర్మం - వ్యక్తిత్వాలు సాంప్రదాయ సంస్కారాలు


ఓం శ్రీ రాం               ఓం శ్రీ రాం                      ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -మనోధైర్య్యానికి మార్గాలు

సర్వేజానాసుఖినోభవంతు
షోడశ సంస్కారాలు
భారతీయ సంస్కృతిలో చెప్పబడినవన్నీ సమాజహితం కోసమే ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు మానవ వికాసానికై ఋషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి. 

మనుస్మౄతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది.
 1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 
10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం. అయితే మరికొంతమంది సాంస్కృతికాకురులు ఈ సంస్కారలను షోడశ (16) సంస్కారాలుగా పేర్కొన్నారు. కర్ణభేధం, విద్యారంభం, వేదారంభం, అంత్యేష్టి అంటూ మనువు చెప్పిన 12 సంస్కారాలకు, ఈ నాలుగు సంస్కారాలను జోడించి షొడశ సంస్కారాలుగా గుర్తించారు.

ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. అవి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), మరియు జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత). మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.


మనిషి పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది.
 
షోడశ సంస్కారాలు అంటే పదహారు సంస్కారాలు . అవి ఏమనగా 

అధానము ,
పుంసవనము ,
సీమంతము ,
జాతకర్మము ,
నామకరణము ,
అన్న ప్రాసనము ,
చౌలము ,
ఉపనయనము ,
ప్రాజాపత్యము ,
సౌమ్యము ,
ఆగ్నేయము,
వైశ్వదేవము ,
గోదానము ,
సమావర్తనము ,
వివాహము ,
అంత్యకర్మ ,
పుంసవనం
ఈ పుంసవనము వలన లోపల గర్భములో వున్నటువంటి గర్భస్థ శిశువునకు శుద్ధి జరుగుతుంది. ఈ పుంసవము చేస్తే మగ పిల్లవాడు పుడతాడని అనుకుంటూ వుంటారు. ఇది కేవలం గర్భస్థ శిశువుకు శుద్ధి జరుగుతుంది. 

సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుప బడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.


గర్భాదానం
స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భములో మంచి పుత్రుని ఆశించి జరిపే కార్యక్రమము ఇది. ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్సంతానాన్ని (పురుష) ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి.
పుంసవనం

స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.

ఇది మరియు సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున ఈ రెండు గర్భా కాలమునందే చేయవలెను. పుంసవనము గర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పదిరోజులలో చేయవలెను. ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడినది.
 
సీమంతం
ప్రధాన వ్యాసం: సీమంతం

తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం). సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.
జాతకర్మ

బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలు. దీంట్లో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయి:
మేథాజనన: బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలనుఒక సన్నని బంగారుదారంతో శిశువు నోటికందిస్తారు. దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తారు. హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో దీని ద్వారా మనకు తెలుస్తుంది.

ఆయుష్య: దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువుముందు చదువుతారు.
శక్తి: తండ్రి బిడ్డ చెవిలో "త్వం...శతమానం భవతి:" అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుతాడు కోసి, శిశువును శుభ్రం చేసి, చనుబాలు పట్టిస్తారు.
నామకరణం

ప్రధాన వ్యాసం: నామకరణము
నామకరణం అనగా పేరు పెట్టడం. ఆడ, మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్యసూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్యసూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్యసూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాలుండి పేరు చివర అ ఉండాలి.

పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి:
మొదటిది జన్మనక్షత్రాన్ని బట్టి;
రెండవది పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి;
మూడవది ఇలవేలుపును బట్టి;
నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి.

చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. ఐతే లేకలేక కలిగిన సంతానానికి, కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టినవారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచడం కోసం విడ్డూరంగా ఉందే పేర్లను పెడతారు.


నిష్క్రమణ
బిడ్డను మొదటిసారిగా ఇంట్లోనుంచి బయటికి తీసుకురావడం. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగుపెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు (అధిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

అన్నప్రాశన

మొదటిసారిగా ఘనాహారం తినిపించడం (సాధారణంగా ఆరో నెలలో) అన్నప్రాసన. పెరుగుతున్న బిడ్డ భౌతికావసరాలను తీర్చడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ. సుశ్రుతుడు కూడా ఆరవనెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించి ఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇందుకవసరమైన ఆహారాన్ని కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు. ఒక్కో రకమైన గుణాన్ని పెంపొందించడానికి ఒక్కో రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంస్కారం జరపడం వల్ల వయసుకు తగిన ఆహారం అందడమే గాక ఆహారం పట్ల పవిత్రభావన ఏర్పడుతుంది.
చూడాకరణ

పుట్టు వెండ్రుకలు తీయించడం.
పుట్టువెండ్రుకలు తీయించడం. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడొ ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు.

కర్ణవేధ
చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు. చెవులు కుట్టడానికి వాడే సూది:


క్షత్రియులకు బంగారంతో,
బ్రాహ్మణ, వైశ్యులకు వెండితో,

దేవలుడనే స్మృతికర్త "చెవిరంధ్రాలగుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటివరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది." అని పేర్కొన్నాడు.


అక్షరాభ్యాసం
బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని ఏడొ ఏటివరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ ఐన వెంటనే చేయాలని నిర్దేశించారు.

ఉపనయనం
 

 అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెందవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.

ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది. తగిన వయస్సు:

బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;
క్షత్రియుడికి పదకొండు సంవత్సరాలు;
వైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు;
గరిష్ఠ వయోపరిమితి:
బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు;
క్షత్రియుడికి ఇరవైరెండు సంవత్సరాలు;
వైశ్యుడికి ఇరవైనాలుగు సంవత్సరాలు;

కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం(జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు.

వేదారంభం అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీ, దీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది:

రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేది,
మూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేది,
నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది.
కేశాంత

పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి(గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణ ను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.

సమావర్తన చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ, యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.

సమావర్తనతో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావడం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం. స్నాతకుడు పెళ్ళి చేసుకుని గృహస్థ జీవితం గడపడానికైనా, తాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడు. మొదటిమార్గం పాటించేవాళ్ళను ఉపకుర్వనులని, రెండవ వర్గం వారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి. అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్థోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.

వివాహం హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి (సవర్ణ), భిన్న గోత్రాలకు, భిన్నపిండాలకు చెందినవారిని ఎంచుకోవడమనే ఆనవాయితీ కొనసాగుతోంది. సపిండకుల(రక్తసంబంధీకుల) మధ్య వివాహాలను అన్నికాలాల్లో నైతికంగానూ, శాస్త్రపరంగానూ పూర్తిగా నిషేధించడం జరిగింది.
వివాహాల్లోని రకాలను గురించి తెలుసుకోవడానికి అష్టవిధవివాహాలు చూడండి.
వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:

వాగ్ధానం: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)
వర-వరణం: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం
కన్యాదానం: కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం
వివాహ-హోమం: పెళ్ళిలో చేసే హోమం
పాణిగ్రహణం: వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం
హృదయస్పర్శ:హృదయాన్ని తాకడం
సప్తపది: సౌభాగ్యానికి, దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు
అశ్మారోహణ: సన్నికల్లు తొక్కడం
సూర్యావలోకనం: జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం
ధృవదర్శనం: స్థిరత్వానికి సూచిక ఐన ధృవనక్షత్రాన్ని చూడడం
త్రిరాత్ర-వ్రతం: మూడురాత్రులు విడిగా ఉండడం
చతుర్ధి-కర్మ: లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం
 
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.

అంత్యేష్టి

 హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వార పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.

మరణానికి ముందు: మరణమాసన్నమైన వ్యక్తి తన కుటుంబసభ్యులను, బంధువులను, ఆత్మీయులను పిలిపించుకుని కన్నుమూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకుని, వారికి, ప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. వారు తృప్తిగా కన్నుమూయడానికి, మరణానంతరం వారు సంతోషంగా ఉండడానికి వీలుగా వారిపేరుమీద, వీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతాయి.

అంతిమయాత్రకు ముందు: వారు జీవితపర్యంతం రగిలించిన పవిత్రాగ్నిలోకి ఆహుతులు సమర్పిస్తారు. దగ్గరివారు చనిపోతున్నవారి నోట్లో తులసితీర్థం, గంగాజలం వదులుతారు.

పాడె: శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి నిర్మాణం. శవాన్ని దానిమీదికి చేరుస్తారు.

అంతిమయాత్ర: మరణించినవారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి శ్మశానస్థలిని చేరుకుంటారు.

అనుస్తరణి: జీవితసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించినవ్యక్తి తరపున దానంగా ఇస్తారు.
దింపుడుకళ్ళెం: భగవదనుగ్రం వల్లో, చనిపోయినవారి ఆయుస్సు ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపెయ్యడం వల్లో చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతో, బ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్ని నిమిషాలసేపు ఆలస్యం చేయడానికి పాడెను శ్మశానానికి తీసుకువెళ్ళే దారి మధ్యలో దించి శవం చెవిలో మూడసార్లు పేరుపెట్టి పిలుస్తారు. ఒక్కోసారి మరణించారని పొరబాటుగా భావించినవారు తర్వాత తిరిగి లేవడం వల్ల ఈ ఆచారం పుట్టి ఉంటుంది.

దహనం: శరీరాన్ని దహనం చెయ్యడానికి చితిపై ఉంచేముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించడంతోబాటు అంత్యక్రియల్లో భాగంగా వేసే కర్మ కొంత ఉంటుంది. అది పూర్తయాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు.

ఉదకకర్మ: చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం (నీళ్ళు) సమర్పిస్తారు.
ఓదార్పుఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలను, జీవితసత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.

అశౌచం: చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు (సూతకం రెండురకాలు: జాతాశౌచం, మృతాశౌచం).

అస్థిసంచయనం: శరీరం కాలి బూడదైనా ఎముకలు పూర్తిగా కాలిపోవు. ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవడం అస్థిసంచయనం.

శాంతికర్మ
స్మారకం
శ్రాద్ధం
సపిండాకరణ


భక్తి కవితా చతురానన బమ్మెర పోతన
- డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు.
.
"పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ
పలికిన భవహర మగునట;
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?"
నాలుగు పలుకులను ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ "సహజ పాండిత్యు"నికి అది తెలియదా? అదీ విన్నవించుకొన్నాడు.

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు
శూలికైనఁ దమ్మి చూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు."
భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ. భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ. భాగవతం స్థూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్యమధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంతగ్రంథులున్న మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికీ, విరించికీ దుష్కరమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాసభాగవతవ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచినాడు ఈ వినయశీలుడు. ఈ తేటపరచటం ఏ తెలుగులో? నన్నయ ప్రారంభించిన తత్సమపద బహుళమైన తెలుగులోనా? లేక పాల్కురికి సోమన్న ప్రఘోషించిన జానుతెనుగులోనా? పోతన్న సాత్వికత అహంతలకూ వింతవింత పుంతలకూ అతీతమైనది.

"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ;
గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌
గొందఱికి గుణములగు; నే
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌." 


కొందరికి తెనుగు గుణమట. ఇందులో పరోక్షంగా పాలకురికి, ప్రత్యక్షంగా తిక్కన్న కనిపిస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట. ఇందులో సుదూరంగా నన్నయ, సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నారు. ఆయాకవులే కాదు, వారి అనుయాయులు కూడా స్ఫురిస్తున్నారు. 'ప్రౌఢంగా పలికితే సంస్కృతభాష అంటారు. నుడికారం చిలికితే తెలుగుబాస అంటారు. ఎవరేమనుకున్నా నాకు తరిగిందేముంది? నా కవిత్వం నిజంగా కర్ణాటభాష' అని ఎదుటివాళ్లను ఈసడించి తోసుకుపోయే రాజసంగాని, తామసంగాని పోతన్నకు అలవడలేదు. అది శ్రీనాధుని సొత్తు. ఈ పద్యమే పోతన్న సత్త్వమూర్తికి అద్దం పట్టింది. 'ఆయా సందర్భాలనుబట్టి అందరినీ మెప్పిస్తాను' అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో, విశ్వాసం అంత వొత్తుగా ఉంది. భాగవతం చదివితే తెలుస్తుంది అతని సంస్కృతగుణం; అచ్చతెనుగుతనం.


--((*))--



కల భాషిణి యంద చందాలు! 


ప్రబంధయుగంలో కవులు ఒకరినిమించినవారు మరొకరు.హేమాహేమీలు. వారిలో పింగళిసూరనయొకడు. 

.కలభాషిణి సూరన సృష్టించిన యొక యందారభరణి! 
విటజనహృదయమనోహారిణి. ద్వారకా నగరమునందలి యొకవేశ్య! 
ఆపాత్రను కళాపూర్ణోదయంలో పరిచయంచేస్తూ,కవియీపద్యంవ్రాశాడు. 
దీన్ని చదువుకొని తరువాత తీరికగా ఆమెయందం యెంతమనోహరమైనదో ఊహించుకోండి అంటాడుకవిగారు. 
మరిమీరు వింటారా ఆపద్యం? యిదిగో- 
  
ఉ: కూకటి వేణితో కురులు కూడకమున్నె, కుచ ప్రరోహముల్ 
పోకల తోటి సామ్యమును పొందకమున్నె, నితంబ సీమకున్ 
వ్రేకఁ దనంబొకింత ప్రభవింపక మున్నె, బ్రసూనబాణు డ 
ర్రాకల బెట్టె, దా నరవ నామెత బాలికకై విటావళిన్; 

బాల్యం గడచి యవ్వనంలో అడుగు మోపక మున్నే విటజనాన్ని 
ఆకలభాషిణీ సౌందర్యం కలవర పరుస్తోన్నదట! వెలయాలుగదా యెవరికి వారు ముందుగా నామెపొందుకోసం తపన పడుతున్నారట. యింతకీ ఆమెపరిస్థితి యేమిటీ? అనేప్రశ్నకు కవి చెప్పే సమాధానమే యీపద్యం! 
" ఆమెశిరోజములు సిగను చుట్టుకొనుటకు తగినరీతిగాలేవట. చూచుకములా(చనుమొనలు) పోకలయమతైనాలేవట! స్తనములేపుగా పెరుగ లేదని చెప్పుట. పిరుదులు విశాలముగా నెదుగలేదట! సామాన్యముగా వయస్సువస్తోన్న ఆడపిల్లకు కచ, కుచ,, జఘన, విజృంభణం సహజం. కానీ యీమెవిషయంలో అవేనీలేకపోయినా, మన్మధుడు విటజనహృదయాన్ని కొల్లగొడుతున్నాడంటే, మరి యామె యెంత అందంగా ఉన్నదో మీరేఊహించుకోండి!!!


సుగ్రీవవిజయము యక్షగానము ...
( పీఠిక- శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి)
.

పరమకల్యాణి! యోభాగీరథీగంగ! వార్థిభామిని! పోయివత్తునమ్మ!
అమరేంద్రులార! లోలార్క కేశవులార! వనజసంభవ! పోయివత్తునయ్య!
శ్రీవిశాలాక్షి! దాక్షిణ్య పుణ్యకటాక్ష! వాసవార్చిత! పోయివత్తునమ్మ!
శ్రీపూర్ణభద్ర పారిషద నాయకులార! వటుకభైరవ! పోయివత్తునయ్య!

తీర్థ సంవాసులార! కృతార్థులార!
పాశుపతులార! భాగ్యసంపన్నులార!
మందిరోద్యాన వాటికా మఠములార!
పోయివచ్చెద మీకాశిపురము విడిచి||

కలహంసి! రారాదె కదలి నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
కదళికాకాంతార! కదలి రాననుగూఁడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
శ్రీవిశాలాక్షి! విచ్చేయు నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
నాతోడఁ గూడి యంతర్గేహ! యేతెమ్ము, నీవేల వత్తమ్మ నెమ్మినుండి

రండు ననుఁగూడి యోపరివ్రాట్టులార!
వత్సలత గల్గి మీరేల వత్తురయ్య!
పరమ నిర్భాగ్యుఁడైన నాపజ్జఁబట్టి
కటకటా! సౌఖ్యజలరాశిఁ గాశిఁబాసి.

ఆగస్త్యముని కాశీనగరాన్నివదలి వెళ్ళేసందర్భంలో
శ్రీనాధుని "కాశీఖండము" నుండి
శ్రీమద్రామాయణమునఁ గల కథాఖండములలో సుగ్రీవవిజయకథ యొక కండపట్టు. అత్యల్ప కాలమున వడివడిగా గంటలలో నడచిన యీకథపట్టు రామలక్ష్మణులు, హనుమంతుఁడు, సుగ్రీవుఁడు, వాలి, అంగదుఁడు, తార అను కథాపాత్రముల శీలపు మేలిమినొఱసి మెఱుఁగు తఱుగులు చూపిన యొఱగల్లనఁ దగినది.

తెలుగున గుత్తెనదీవిరామాయణాదు లగు రామాయణ గేయకృతులలో నీసుగ్రీవవిజయపుఁ గథపట్టు చాలహృద్య రచనములతో నున్నది.

"ఎంతపనిచేసితివి రామా! నిన్ను
నేమనందును సార్వభౌమా!
చెంతకిటు రాలేక చెట్లనో దాగుండి
వింతమృగమునుగొట్టు విధమాయెనాబ్రదుకు!"

ఇత్యాది గేయములను పలువురు పాడుచుందురు.

ఈ రుద్రకవి సుగ్రీవవిజయమునుగూడ స్త్రీ వృద్ధ పామరాదులు పలువురు పాడుచుందురట! ఆయా పాత్రముల పాటలు తత్తద్వేషధారులు వచ్చి పాడునట్లును తక్కిన సంధివచనాదులు ఒక్కరిద్దఱు సూత్రధార ప్రాయులు పఠించునట్లును, నీసుగ్రీవవిజయము వీథియాటగా నాడబడుచుండెడిది. ప్రాచీన సంస్కృతనాటకరచయితలు భాసభవభూత్యాదు లీ సుగ్రీవ విజయౌచిత్యమును దమ నాటకములలో విమర్శించిరి. శ్రీరాముని శీలమును శ్రీవాల్మీకి రామాయణ పద్ధతిని సమర్ధించిరి.

భవభూతి "యద్వా కౌశల మింద్రసూనుదమనే తత్రాప్యభిజ్ఞో జనః" యని దీని యౌచిత్యము నించుక చెనకెను. మనరుద్రకవి సంస్కృతాంధ్ర రామాయణకవులు త్రొక్కిన త్రోవనే త్రొక్కెనుగాని, యపూర్వకల్పనాంశము నేమాత్రము నిందు జేర్పలేదు.

ఆయాపాత్రములు ప్రసిద్ధ రామాయణములలో నెట్టి యుక్తి ప్రత్యుక్తులు గలవిగా చిత్రములయ్యెనో ఇందు నదేతీరు గలదు. కాని యిది దేశిరచనముతో గేయరూపమున నుండుట విశేషము. ఇం దీక్రింది గేయరచనలు ప్రశస్తము లయినవి!

"హా సతీమణి! ధర్మచారిణి! హా గుణోన్నత! జనకసుత! నను
బాసిపోయితి వింతలోనె పద్మనయన!"

"లేఁటి మాయలు మదిని దెలియగ లేక పాపపు రక్కసునిచే
బోటి! నిను గోల్పడితిని నిఁక నాకేటిబ్రతుకు"

"లలన! నినుఁ గలనైనఁ బాయఁగఁగలన, నీవిటలేక యుండినఁ
జలనమొందెను నాదు హృదయము జలజనయనా!"

"తరణి కులమున బుట్టి శరచాపములు బట్టి
తరుణిఁ గోల్పడు కంటె మరణమే మేలు!
నను శౌర్యవంతుఁడని తనపుత్రి నిడినట్టి
జనకవిభుఁ డీవార్త విని వగవకున్నె!"

"నాయమెఱుఁగక చంపితివి నరనాథ! పాపముఁ గట్టుకొంటివి
బోయ వింతియె గాక నీవొక భూమిపతివా?"

"శ్రీరామ! నీరామఁ జెఱఁగొన్న రావణుని
వారధుల ముంచితిని వాలమునఁజుట్టి
ఒకమాట నాకుఁ జెప్పకపోయితివి గాక
సకలదైత్యుల దున్మి జానకిని దేనె."

"ఆలి చెఱఁగొని పోయినట్టి దశాస్యుఁడుండగ నిర్నిమిత్తము
వాలినేటికిఁ జంపితివి రఘువంశ తిలకా!
ఇట్టి సాహస కర్మ మెచటికి నేఁగె భరతుఁడు సీమవెడలఁగఁ
గొట్టి రాజ్యము పుచ్చుకొన్నెడఁ గువలయేశా!
నాయమేటికిఁ దప్పితివి రఘునాథ! జానకితోడనే చెఱఁ
బోయెనే నీ రాజనీతియు భూరిమతియున్‌?"

శ్రీరామచంద్రమూర్తి చెట్టుచాటుననుండి వాలిమేనఁ గాఁడనేసిన వాఁడిములుకుల కంటె, నిక్కడ తార ప్రత్యక్షమై నిలుచుండి శ్రీరాముని యంతరంగము నుచ్చిపోవునట్టు ప్రయోగించిన పలుకుములుకులు క్రొవ్వాఁడి గలవి.

ఈలఘుకృతి వీరకరుణరస భరిత
ము. నీతిహృద్యము. స్త్రీ బాల పామరాదులు గూడ పఠింపఁ దగినది.

--((*))--


యుగధర్మం - వ్యక్తిత్వాలు

మన సనాతన ధర్మము కాలమును చతుర్యుగాలుగా, సత్యయుగము (కృతయుగము), త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము గా విభజించి చెపుతున్నది.

సత్యయుగము లో సురాసురుల మధ్య ( దేవ, దానవుల మధ్య) యుద్ధాలు జరిగేవి. అంటే యుద్ధాలు లోకాల మధ్య జరిగాయి.

త్రేతాయుగములో రామ రావణ సంగ్రామము జరిగినది. అంటే యుద్ధాలు రెండు దేశాల మధ్య జరిగాయి.

ద్వాపర యుగములో పాండవుల, కౌరవుల మధ్య కురుక్షేత్రములో యుద్ధము జరిగింది. అంటే రెండు కుటుంబాల మధ్య ఈ యుద్ధము జరిగింది.

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటుంది. అదే మంచి చెడుల మధ్య సంఘర్షణ.
శిష్టులకు, దుష్టులకు మధ్య సంఘర్షణ. అది సత్యయుగములో లోకాల మధ్య జరిగింది. త్రేతాయుగములో రెండు దేశాల మధ్య జరిగింది. ద్వాపరములో రెండు కుటుంబాల మధ్యకు దిగజారింది. అంటే గమనించారా ! చెడు నెమ్మదిగా దగ్గరకు వస్తోంది. లోకాలనుండి రెండు దేశాలకు, రెండు దేశాల నుండి రెండు కుటుంబాలకు జారి దగ్గరకు వచ్చేసింది.

మరి కలియుగములో ఏం జరుగుతోంది. ఆ మంచి చెడుల మధ్య సంఘర్షణ వ్యక్తి లోపల జరుగుతోంది. యుద్ధము నిత్యము జరుగుతోంది. మంచి అలోచనలు పెంచుకుని, చెడు అలోచనల మీద జయం సాధించాలి.

అదే మిత్రులంతా గమనించి, యుద్దానికి దిగండి. మంచిని పెంచి, చెడుని శిక్షించి సన్మార్గులమవుదాం. జై శ్రీమన్నారాయణ.





 --((*))--


కిన్నెరసాని.అంటే ఒక వాగు గోదావరి నదికి పాయ... 

కాని కవులు ఒక అందం అయిన అమ్మాయి గా వర్ణిస్తారు! 

నిజమేనంటారా.... 

విశ్వనాథ గారి ..కిన్నెరసాని.! 
. కిన్నెర నడకలు 
కరిగింది కరిగింది 
కరిగింది కరిగింది 
కరిగి కిన్నెరసాని వరదలై పారింది 
తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది 
పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది 
కదిలింది కదిలింది 
కదిలింది కదిదింది 
కదిలి కిన్నెరసాని వొదుగుల్లుపోయింది 
సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది 
ముదిత కిన్నెరసాని నురుసుల్లు గ్రక్కింది 
నడచింది కడరాళ్ళు 
గడచింది పచ్చికల్‌ 
తడసి కిన్నెరసాని సుడులలో మొరసింది 
జడిసి కిన్నెరసాని కడలందు వొరిసింది 
సుడిసి కిన్నెరసాని జడలుగా కట్టింది 
కరగగా కరగగా 
కాంత కిన్నెరసాని 
తరగచాలుల మధ్య తళతళా మెరిసింది 
నురుసుపిండులతోడ బిరబిరా నడిచింది 
ఇసుక నేలలపైన బుసబుసా పొంగింది 
కదలగా కదలగా 
కాంత కిన్నెరసాని 
పదువుకట్టిన లేళ్ళకదుపులా తోచింది 
కదలు తెల్లని పూలనదివోలె కదిలింది 
వదలు తెల్లనిత్రాచు పడగలా విరిసింది 
నడవగా నడవగా 
నాతి కిన్నెరసాని 
తొడిమ యూడిన పూవు పడతిగా తోచింది 
కడుసిగ్గుపడు రాచకన్నెలా తోచింది 
బెడగుబోయిన రత్న పేటిలా తోచింది 
పతి రాయివలె మారి 
పడియున్న చోటునే 
పడతి కిన్నెరసాని విడలేక తిరిగింది 
ముగుద కిన్నెరసాని వగచెంది తిరిగింది 
వెలది కిన్నెరసాని గలగలా తిరిగింది 
తాను నదిగా నేల 
నైనా ననుచు లోన 
పూని కిన్నెరసాని పొగిలింది పొగిలింది 
ముక్త గీతికవోలె మ్రోగింది మ్రోగింది 
ఒకచోట నిలువలే కురికింది వురికింది 
ఏ వుపాయము చేత 
నైన మళ్ళీ తాను 
మనిసి కిన్నెరసాని నగుదామ యనిపించి 
ఆపలేనంత కోరికచేత విలపించి 
ముగుద కిన్నెరసాని మొరసింది మొరసింది



No comments:

Post a Comment