Friday 9 February 2024

slokas

 

6.  కదలికలుగా సఖ్యతే    

     మదన కళగా రమ్యతే  

శ్లో॥సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్!

ద్వయమేతద్ధి జన్తూనామలంఘ్యం దినరాత్రివత్!!


సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం తప్పకుండా వస్తుంటాయి. ఏ ప్రాణీ కూడా వీటినుండి తప్పించుకోలేదు. ఇవి దివారాత్రాలంత సహజంగా వరుసక్రమంలో వస్తూనే ఉంటాయి. విచారంనుండి తప్పించుకోవాలంటే సంతోషంలోకి వచ్చితీరాలి. సంతోషం వద్దనుకుంటే విచారం వచ్చి తీరుతుంది. ఈ ద్వంద్వాలలో దేనిని కోరినా నిరాకరించినా రెండవది తప్పకుండా ఉండనే ఉంటుంది. సముద్రంలో తిన్నగా వెళుతున్న కొద్దీ తరంగాలను తప్పించుకోలేం.


శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర నక్షత్రాణ్యను మండలం

దృశ్యతే భాసురా రాత్రా దేవీ త్రిపధగా తుసా..


ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు దేవికా నదీతీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన.హిమాలయాలు వారి నిత్యవిహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు..


శ్లో॥ అస్త్యుత్తరాస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః

పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ:


తూర్పు పడమర సముద్రాల మధ్య భూమిని కొలిచే మానదండం (కొలబద్ద వలె ఉన్నది హిమాలయం. ఆది దేవతలకు ఆత్మస్థానం. అందులోనిది మానస సరస్సు. భారతంలో ఈ సరస్సుకు బిందు సరస్సని పేరుంది.


శ్లో𝕝𝕝 నాస్తి మేఘసమం తోయం నాస్తి చాత్మసమం బలమ్‌|

నాస్తి చక్షుఃసమం తేజో నాస్తి ధాన్యసమం ప్రియమ్‌||


తా𝕝𝕝 మేఘ జలముతో సమానమైన శుద్ధజలము లేదు.....ఆత్మ బలముతో సమానమైన బలము శరీరములో కాని పృథివిలో కాని రెండవది లేదు....కన్నుతో సమానమైన తేజస్సు గల యింద్రియము శరీరములో మఱొకటి లేదు..... ధాన్యముతో (అన్నముతో) సమానమైన వస్తువు మఱొకటి లేదు.


శ్లో॥ పద్మసంభవారాధితం ప్రభుం మర్మయోగినాం మంత్రసిద్ధిదం

వ్యాఘ్రవాహనం మృత్యువారణం వజ్రభైరవం దేవమాశ్రయే.


వజ్రయాన తాంత్రిక సాధనలలో వజ్రభైరవునకు, వజ్రయోగిని లేక వజ్రవారాహికి ప్రాధాన్యం ఎక్కువ.


వజ్రభైరవుని వలెనే మరో యిద్దరు భైరవ మూర్తులకు హిమాలయాలలో ప్రాముఖ్యo.పశుపతినాధుడు , మానస సరోవ ఆదిదేవుడు అమరభైరవుడని పేరు.


శ్లో𝕝𝕝 కిమప్యస్తి స్వభావేన సున్దరం వాప్యసున్దరమ్|

యదేవ రోచతే యస్మై భవేత్ తత్తస్య సున్దరమ్||


తా𝕝𝕝 ఈ లోకంలో ఏదైనా స్వభావరీత్యా అందంగా ఉన్ననూ లేకున్ననూ, ఎవరికైతే ఏదైతే నచ్చుతుందో  అది అందంగా లేకున్ననూ అదే వారికి అందంగా తోస్తుంది.


శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర

నక్షత్రాణ్యను మండలం
దృశ్యతే భాసురా రాత్రా
దేవీ త్రిపధగా తుసా..

ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు దేవికా నదీతీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన.హిమాలయాలు వారి నిత్యవిహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు..

శ్లో॥ అస్త్యుత్తరాస్యాం దిశి దేవతాత్మా
హిమాలయో నామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య
స్థితః పృథివ్యా ఇవ మానదండ:

తూర్పు పడమర సముద్రాల మధ్య భూమిని కొలిచే మానదండం (కొలబద్ద వలె ఉన్నది హిమాలయం. ఆది దేవతలకు ఆత్మస్థానం. అందులోనిది మానస సరస్సు. భారతంలో ఈ సరస్సుకు బిందు సరస్సని పేరుంది.

యథా వ్యాలగలస్థో౬పి భేకో దంశానపేక్షతే!

తథా కాలాహినా గ్రస్తో లోకో భోగానశాశ్వతాన్!!

పాము నోట చిక్కిన కప్ప, తన మృత్యువును తెలియక ఈగలను తినుటకు కోరినట్లుగా, జనులు కాలరూపము అగు సర్పము నోట చిక్కిననూ తమ అస్థిరతను తెలియక అనిత్యమైన భోగములకై ప్రాకులాడుచుందురు.


*శ్లో𝕝𝕝 ఆదౌ చిత్తే తతః కాయే* *సతాం సంపద్యతే జరా|*

*అసతాం తు పునః కాయే*  *నైవ చిత్తే కదాచన||*

           *తా𝕝𝕝|| సజ్జనులకు ముందుగా మనస్సులోను, ఆ తరువాత శరీరమునందును వార్ధక్యం వస్తుంది.... దుర్జనులకు మాత్రం శరీరంలో వార్ధక్యం వస్తుందేగానీ మనస్సుకు ఎన్నడూ వార్ధక్యం రాదు... {పెద్దరికం రాదు}.*

*తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్ మధు క్షరంతీవ సతాం! 

ఫలాని ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే నామాని నారాయణ గోచరాణి!!*  

*భావం:-*

*ఓ జిహ్వా! దోసిలి యొగ్గి ప్రార్థించుచున్నాను. పరతత్వమగు నారాయణుని ప్రతిపాదించుచు, సత్పురుషులకు అమృతమును స్రవించు ఫలముల వంటివైన నామములను మరల మరల ఉచ్చరింపుము.*

*మనిషి పరిపూర్ణ విజయం, ఆనందం వెనుకవున్న గొప్ప రహస్యం: పూర్తి నిస్వార్ధత, ప్రతిఫలాన్ని ఆశించకపోవడమే.*

*తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడు.*

*నా చైతన్య విమానంలో పైన, క్రింద, కుడి, ఎడమ, లోపల, బయట అంతటా విహరించి, నా అంతరిక్ష గృహంలో, మూలమూలనా ఎల్లప్పుడూ, నా పరమపిత పబిత్ర సన్నిధిలోనే ఉన్నానని కనుగొన్నాను.*

*న యుజ్యమానయా భక్త్యా భగవత్య ఖిలాత్మని ।*

 *సదృశోఽస్తి శివః పన్థా యోగినాం బ్రహ్మసిద్ధయే  9 *

*టీకా:-*

న = లేదు; అఖిల ఆత్మని భగవతి = అన్ని ప్రాణులలో ఆత్మగా యున్న భగవంతుని; 

యుజ్యమానాయ భక్త్యా = భక్తి కలిసినట్లుగా; సదృశ్యః అస్తి = సమానముగా ఉండు; శివః పంథాః = పవిత్రమైన మార్గము; యోగినాం = ఆధ్యాత్మిక సాధకులకు; బ్రహ్మసిద్ధయే = భగవంతుని పొందుటకొరకు.

*భావం:-*

ఆధ్యాత్మిక సాధకులకు భగవంతుని పొందుటకు భక్తిని మించిన పవిత్రమైన మార్గము మరియొకటి లేదు. అన్ని ప్రాణులలో ఆత్మగా యున్న పరమాత్ముని చేర్చునది భక్తియే.

శ్లో|| వాసనా ఏవ సంసార ఇతి సర్వా విముంచ తాః |

తత్త్యాగో వాసనా త్యాగాత్ స్థితిరద్య యథా తథా | 8.

*టీకా*

వాసనా ఏవ = వాసనలే, సంసారః = సంసారము, ఇతి = ఇట్లని, జ్ఞాత్వా = తెలిసికొని, తాః సర్వాః = ఆ వాసనలన్నింటినీ, విముంచ = విడువుము, వాసనా త్యాగాత్ = వాసనాత్యాగమువలన, తత్త్యాగః = ఆ సంసార త్యాగము గూడా అగుచున్నది, అద్య = ఇట్లయిన పిదప, యథా = ప్రారబ్ధ మెట్లున్నదో, తథా = తదనుసారమే, స్థితిః = శరీరస్థితి యగుచున్నది. 

*వివరణ:-*

కోరికల చేతనే ఈ ప్రపంచమంతా నిర్మింపబడి నడుపబడుతుంది. కాబట్టి కోరికలను త్యజించు, కోరికలను విడివగలిగితే ప్రపంచాన్ని విడచినట్లే. ఈ స్థితిలో నీవు ఎక్కడ నివసించినా ఒకటే, సమానమే.

బన్ధోహి వాసనా బన్ధో మోక్షః స్యాద్ వాసనాక్షయః

వాసనాస్త్వం పరిత్యజ్య మోక్షార్థిత్వమపిత్యజ. (యోగవాశిష్టం) 

బధం అంటూ ఉంటే అది మన వాసనలే. ఈ వాసనలు లేకపోవడమే ముక్తి. ముందుగా వాసనలన్నిటినీ క్షయింపజేసుకుని తరువాత ముక్తి కావాలనే కోరికను కూడా విడచి పెట్టు, నీ లక్ష్యాన్ని సాధించి గమ్యాన్ని చేరినట్టే.

***

***

పద్యం యద్యపి విద్యతే బహు      సతాం హృద్యం విగద్యం నతత్

గద్యం చ ప్రతిపద్యతే న విజహత్పద్యం     బుధాస్వాద్యతాం ౹

ఆదత్తే హి తయోః ప్రయోగ     ఉభయోరామోద భూమోదయం

సంగ: కస్య హి న స్వదేశ మనసే     మాధ్వికమృద్వికయోః ౹౹


పద్యం చాలా గొప్పగా ఉంటుంది,కావాల్సినంత రసం ఉంది.రసికులకు గద్యము లేక పద్యం అంతగా సౌందర్యమనిపించదు.గద్యము కూడా పద్యం లేకుండా పండితులకు ఇష్టంగా అనిపించదు.ఈ రెండూ కలుస్తేనే ఎక్కువ ఆనందమవుతుంది.తేనె మరియు ద్రాక్ష కలిసిన రుచి ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా?

***

భోగేషు ప్రసరో యస్యా మనోవృత్తేశ్చ దీయతే 

సాప్యాదావేవ హన్తవ్యా విషస్యేవాఙ్కురోద్గతిః। 


(భోగతృష్ణవలన) ఏ మనోవృత్తికి భోగములందు ప్రవేశ మివ్వబడుచున్నదో, దానిని విషాంకురముయొక్క గతినివలె మొదటనే ఛేదించి వేయవలెను। 


పూర్ణస్తు ప్రాకృతోఽ ప్యన్యత్పునరప్యభివాఞ్ఛతే 

జగత్పూరణ యోగ్యామ్బుర్గృహ్ణాత్యేవార్ణవో జలమ్‌ 


జగత్తును కూడ నింపుటకు యోగ్య మైనప్పటికిని సముద్రము నద్యాదుల జలమును గ్రహించుచునే యుండునట్లు నిగ్రహింపబడని పామరమనస్సు పదార్థములచే పూర్ణమై యున్నప్పటికిని ఆశవలన ఇంకను కోరుచునే యుండును।


హస్తం హస్తేన సంపీడ్య దన్తైర్దన్తాన్విచూర్ణ్య చ 

అఙ్గాన్యఙ్గైరివాక్రమ్య జయేచ్చేన్ద్రియశాత్రవాన్‌। 


చేతిని చేతితో నలిపి, పండ్లను పండ్లచే కొఱికి అవయవములను అవయవములచే నాక్రమించి ఏ విధముగ నైనను (సర్వప్రయత్నములచే) ఇంద్రియములను శత్రువులను జయించవలెను।


***


గౌర్గౌః కామదుఘా సమ్యక్ప్రయుక్తా స్మర్యతే బుధైః!

దుః ప్రయుక్తా పునర్గోత్వం ప్రయోక్తుః సై వ శంసతి!!


వాక్కు గోవు వంటిది. దానిని సదుపయోగము చేసినచో కామధేనువు వలె అభీష్టములనీడేర్చును. కానీ, దురుపయోగము చేసినచో, అట్లు చేసినవానికి గోత్వమును (పశుత్వమును) కలిగించును.

***

ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకా నిశా

రాజశ్రీ సఖ మైన మోమున పటాగ్రం బొత్తి యెల్గెత్తి యా

రాజీవానన యేడ్చె గిన్నెర రాజత్కారాంభోజ కాం

భోజీ మేళ విపంచికా రవ సుధా పూరంబు తోరంబు గాన్


ఆ జాబిల్లి వెలుగుతో కలిగిన విరహాన్ని భరించలేక తన చంద్రుని లాంటి ముఖము పై చీర చెరగు యొత్తుకొని ఆ తామరపువ్వు వంటి ముఖముగల ఆమె కిన్నెరలు వీణ పై కాంభోజీ రాగమాలపించి నారో యన్నట్టుగా అమృతము చిందు నట్టుగా ఎలుగెత్తి యేడ్చేను.

ఈ ఏడుపునే రామకృష్ణుడు భట్టుమూర్తి బావురుమని యేడ్చె యని వ్యాఖ్యానించాడు.


స్నానేన సంగమేశం చ స్మృత్యం గౌరీశ్వరంశివం

పిండ ప్రదానం కర్తవ్యమ్ పితృ ణాం మోక్ష దాయకం.


అర్థము:--నదీ సంగమం లో పుష్కర స్నానం చేసి శంకరుడిని తలుచుకొనడం,పిండ ప్రదానం చేయడం పితరులకు మోక్ష దాయకము.యిది విధి.  ఈ ఉదాత్త ఆశయాన్ని అపహాస్యం చేయకుండా శ్రద్ద గా నిర్వర్తించండి. ఈ స్నానఘట్టం లోనే స్నానం చెయ్యాలి అని మూఢ నమ్మకాలు పెట్టుకోకుండా పుష్కరుడు ప్రవేశించిన నది ఎక్కడవున్నా అక్కడ స్నానం చెయ్యవచ్చు.12 దినాలలో ఏరోజైనా స్నానం చేయవచ్చు.


ఈ పద్యం ఎటువైపునుండీ చదివినా అదే వస్తుంది..

రాధా నాధా తరళిత

సాధక రధ తా వరసుత సరస నిధానా

నాధాని సరసత సురవ

తాధర కధ సా తళిరత ధానా ధారా!!


***

కోకిలానాం స్వరో రూపం  పాతివ్రత్యంతు యోషితాం

విద్యారూపం విరూపాణాం క్షమా రూపం తపస్వినాం


అర్థము: కోకిలకు స్వరమే అందము.మహిళలకు పా తివ్రత్యమే అందము.

కురూపులకు విద్యయే అందము.యతులకు(మునులకు) క్షమ,శాంతము లే అందము.(సూక్తిముక్తావళి)


విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి: పరేషాం పర పీడనాయ

ఖలస్య సాధో ర్విపరీత మేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయః


అర్థము: దుర్మార్గునికి విద్య వితండ వాదము చేయుటకును, ధనము గర్వ పడుట కును, శక్తి పరులను బాధించుటకును,ఉపయోగ పడును. అదే సజ్జనులకు విద్య జ్ఞానమునకు, ధనము దానము చేయుటకును, శక్తీ పరులను రక్షించుటకును ఉపయోగపడును


***

క్రోధో మూల మనర్థానాం ; క్రోధః సంసార బంధనం

ధర్మ క్షయకరః క్రోధః ; తస్మాత్ క్రోధం విసర్జయేత్


అర్థము:--- అనర్థము లన్నింటికి కోపమే మూల కారణము. కోపమే సర్వ బంధనములకు హేతువు. అది ధర్మమును నాశనం చేస్తుంది. కనుక ముందుగా అందరూ కోపమును విడిచి పెట్టిన సుఖపడ గలరు

.

క్రోధో వైవస్వతో రాజా ; ఆశా వైతరణీ నదీ

విద్యాం కామ దుఘా ధేను: సంతుస్టో నందనం వనం


అర్థము:-- క్రోధము యమధర్మ రాజు వంటిది (అంటే మనుష్యున్ని చంపేది)ఆశ యనునది వైతరణీ నది వంటిది(దాటడానికి సాధ్యము కానిది) విద్య అన్ని కోరికలను తీర్చు కామధేనువు వంటిది. సంతోషమే నందనవనము వంటిది (మనసుకు ఆహ్లాదము కలిగించునది)

***

ఇది ఒకచమత్కార శ్లోకం.

కేశవం పతితం దృష్ట్వా,పాండవా హర్ష మాప్నుయు:

రుదంతి కౌరవాస్సర్వే,హా,హా కేశవ కేశవ


అర్థము:-కేశవుడు (కృష్ణుడు) యుద్ధము లో పడిపోయినాడట.దాన్ని చూసి పాండవులు సంతోషం తో ఎగిరారట.కౌరవులందరూ కేశవా కేశవా అని ఏడుస్తున్నారట.ఇది అసంబద్ధంగా వుంది. పదాలు కొన్నింటికి అర్థాలు మార్చుకోవాలి.కొన్ని విడదియ్యాలి.శవం=ఒక శవమును,కే=నీటియందు, పతితం=పడిపోయి వుంటే, దృష్ట్వా=చూసి, పాండవాః=గ్రద్దలు,హర్షం=ఆనందమును, ఆప్నుయు:= పొందినవి. హా హా కేశవ =నీటిలో శవము, నీటిలో శవము అని సర్వే కౌరవాః=నక్కలన్నీ ,రుదంతి=ఏడ్చుచున్నవి


.యుద్ధసమయం లో ఒక శవము నీటిలో పడి కొట్టుకువచ్చింది. గ్రద్దలు శవాన్ని ఎక్కడ వున్నా తినగలవు కనుక అవి ఆనందించినవి,నక్కలు నీటిలోకి వెళ్లి శవాన్ని తినలేవు కాబట్టి అవి ఏడుస్తూ వున్నాయి.పాండవాః =గ్రద్దలు,కౌరవా అంటే నక్కలు అని అర్థము తీసుకుంటే సరిపోతుంది.

***

ఒకసారి విద్వాన్.కావ్యతీర్థ .మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారు యిలా అనుకున్నారు

'నీతో' 'నాతో' తనతో', మనతో అనే తెనుగు విభక్తి తో గూడిన తెనుగు పదముల నిమిడ్చి సంస్కృత శ్లోకం వ్రాయ వీలగునా యనుకొని ఇట్లు శ్లోకం వ్రాసినారు.


నీతో గురు సన్నిధి మక్షరాప్తై

నాతో ధికం వస్తు తవాస్తి కించిత్

కారుణ్య దృక్పాతనతో గురూణా

మధీహి భో రామ! నతోఖిలం త్వం


తా:--రామునితో దశరథుడు అన్నట్లు ఓ రామా!త్వం=నీవు , అక్షరాప్తై=అక్షరాప్రాప్తి కొరకు (చదువు కొరకు) గురో సన్నిధిం =గురువుగారి యొద్దకు, నీతః =చేర్పబడినావు., తవ=నీకు, అతః =యింతకంటే అధికం=అధిక మైన, వస్తు=వస్తువు, కించిత్=కొంచెము కూడా, నాస్తి=లేదు, గురూణాం= గురువులయొక్క కారుణ్య దృక్పాత నతః = వాత్సల్య పూరితమైన చూపులప్రసారము వలన నతః=నమ్రత గాల వాడవై అఖిలం =సమస్త విద్యలను,అధీహి= చదువుము


***


***

వెలయాలు శిశువ ల్లుడు

నిలయేలిక యాచకుండు నేగురు ధరలో

గలిమియు లేమియు దలపరు

కలియుగమునం గీర్తికామ! కాటయవేమా!


అతిథి ర్బాలక శ్చైవ స్త్రీ జనో నృపతి స్తధా

ఏతే విత్తం న జానంతే జామాతా చైవ పంచమః


అర్థము:--అతిథి, పిల్లలు స్త్రీలు, ప్రభువు (రాజుపన్నులు విధిస్తాడు) వీరంతా గృహస్తు దగ్గర తగిన ధనం ఉందా లేదా అని ఆలోచించరట. కోరికలు తీర్చమని

అడుగు తుంటారట. వీరిలో అల్లుడు ఐదవ వాడుగా చెప్పబడినాడు. ఇది ఎప్పుడో మనువు చెప్పినది. అయినా అందరూ అలా వుంటారని కాదు. లోక రీతి ఇలా వుంటుందని, "జామాతా దశమ గ్రహః" అనే నానుడి కూడా వుంది కదా!


***

దూష కశ్చ క్రియా శూన్యో నికృ స్టో దీర్ఘ కోపనః

చత్వారః కర్మ చండాలా జాతి చండాల ఉత్తమః


అర్థము: ఇతరులను దూషించువాడు ఏ పని చేయక సోమరిగా ఉండెడి వాడు లోభము గలవాడు దీర్ఘ క్రోధము (అంటే కోపము చాల రోజుల వరకు మనసులో పెట్టుకోనువాడు)గల వాడు వీరు నలుగురు కర్మ చండాలురు . వీరికంటే జాతి చండాలుడు ఉత్తముడు.


ఉత్తమే క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికా ద్వయం

అధమేస్యాత్ దహోరాత్రం పాపిస్టే మరణాంతకం


అర్థము:ఎవరి మీదైనా కోపము వచ్చినప్పుడు ఉత్తమునియందు ఒక క్షణ కాలము మాత్రమే ఉండును మధ్యముని యందు రెండు ఘడియలు మాత్రమే యుండును

అధముని యందు యొక ఆహోరత్రముండును (ఒక రాత్రి ఒక పగలు)

చచ్చేంత వరకు కోపము మనసులో పెట్టుకొని యుండు వాడు

పాపి స్టుడు అని అనబడుతాడు (అధమాధముడు)


ఉమాదేవి జంధ్యాల 9-8-16

అమ్మ! మీఁగడపాలు తెమ్ము లే లెమ్మని, పాణిపంకజమునఁ బైఁటఁబట్టి

తిగిచినమోము నొద్దికచూచి ముద్దాడి, గిలిగింతలిడుచుఁ గౌఁగిటను జేర్చి

ఔనుర కృష్ణ! నీ వాఁకలి గొన్నావు, బువ్వపెట్టెద నని యవ్వధూటి

మీఁగడపాలతో మేళగించినయోగి, రముఁ దవనీయపాత్రముననునిచి


చేతి కందీయ మెసఁగినకౌతుకంబుఁ

దలఁచి వర్ణింప నెవ్వరి కలవియగునె

సురుచిరాకార ఉన్నవపురవిహార

రాజగోపాల రాధామనోజఖేల


ఏమిరా కృష్ణ! మ న్నేఁటికిఁ దిన్నావు?, అమ్మ! నేఁ దినలేదు అయ్యతోడు

చిన్నవాండ్రందఱు చెప్పిరి గదవోయి, నీవు వారలమాట నిజము జేసి

విందువా నేనంతవెఱ్ఱినా శిశువునా!, ఆఁకొంటినా! చూడవమ్మ నోటి

వాసన యనుచును వక్త్రంబుఁ దెఱచి లో, నా యశోదకును బ్రహ్మాండభాండ


పంక్తులెల్లను దొంతులపగిదిగాను

బెంపుచేసిననిన్ను వర్ణింప దరమె?

సురుచిరాకార ఉన్నవపురవిహార

రాజగోపాల రాధామనోజఖేల


No comments:

Post a Comment