Monday 1 February 2016

పుట్టు మచ్చలు ఫలితాలు

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక ప్రభ
సర్వేజనా సుఖినోభవంతు



సేకరణ


కవితా చమత్కారం !
-----------------------------
ఉన్నదున్నట్లు చెబితే కవిత్వం యెందుకవుతుంది? యేదో కొత్తదనం ఆమాటలలో జొప్పించాలి. అప్పుడది చమత్కార భాసురమై కవిత్వం అవుతుంది. :" చమత్కార మంజరి "- అనేగ్రంథంలో రెండవ అధ్యాయంలో ఒక చక్కని పద్యం ఉంది. ఒకా నొక చక్రవర్తి గారి చెలికత్తె సౌందర్యాన్ని చూచి ముగ్ధుడై ఓకవి యిలా వర్ణించాడు.
.
మ: " బిగువుం జన్నులు గాంచి , మాను నల జంబీరంబు బీరంబు! క్రొం
జిగి మోముంగని , సిగ్గునన్ వదలు రాజీవంబు జీవంబు ! విం
తగు భ్రూరేఖలు గాంచి , భీతినిడు కోదండంబు దండంబు ! త
జ్జగతీ నాధుని మ్రోలనున్న చెలులం జర్చింపగా పాడియే ? "
జంబీరాది పదాలలో మొదటి యక్షరం లోపించటం ఈపద్యం లోని చమత్కారం!
.
కథానాయిక బిగువగు వక్షోజములను జూచి,
జంబీరములు ( గజ నిమ్మ పండ్లు -వానికి స్తనములతో పోలిక కవిసమయము ) బీరమును వదలుచున్నవి .బీరమనగా గర్వము. అందమైన ఆమెముఖాన్ని జూచి రాజీవము (పద్మము) ిగ్గుపడి జీవాన్ని వదలు తున్నది.
( నాయిక ముఖం సహజంగానే గులాబి రంగులోనున్నది. దానిని చూడగానే పద్మం వెలవెలృ బోతోన్నదని ఒక అర్ధం, ప్రాణాన్ని విడుస్తోందని మరోఅర్ధం ) సొగసైన కనుబొమల తీరు జూచి కోదండము (విల్లు )
దండం పెడుతున్నదట. కోదండమంటే విల్లు దండం అంటే నమస్కారం .( అందమైన ఆడపిల్లల కనుబొమలను ధనుస్సుతో పోల్చటం కవి సమయం)
.
అబ్బో! ఇంతటి సుందరాంగు లామహారాజు చెలికత్తెలు. వారి యందాన్ని నే పొగడ గలనా? అని ఆశ్చర్యం ప్రకటిస్సున్నారు కవిగారు.
అజ్ఙాత కర్తృక మైన యీపద్యం ఆకవిగారి కల్పనా చమత్కారానికి నిదర్శన మనటంలో
సందేహం యెంతమాత్రం లేదు గదూ !!


    

దైవం చేసే పని....బామ్మ చెప్పిన కధ.!
పూర్వం ఓ దేశంలో ఒక రాజుగారికో సందేహం వచ్చింది. వెంటనే తన మంత్రిని పిలిచి "అమాత్యా! నా సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు. మీరు మంత్రులుగా నాకు సలహాలు ఇస్తున్నారు. వర్తకులు వర్తకం చేస్తున్నారు. అధ్యాపకులు పాఠాలు చెపుతున్నారు. ఇలా ప్రతివ్యక్తి తనకి కేటాయించిన పనిని చేస్తున్నాడు. నా సందేహం ఏమిటంటే, "సృష్టికర్త అయిన ఈ దైవం చేసే ప్రధానమైనపని ఏమిటి?" అని.
రాజుగారికి వచ్చిన సందేహాన్ని తీర్చటానికి మంత్రివర్యులు "రాజగురువు"ను పిలిపించి రాజుగారి సందేహము తీర్చమని అడిగాడు. రాజగురువు వెంటనే సమాధానము చెప్పక ఓ వారము రోజులు గడువు తీసుకుని బయటపడ్డాడు. కాని, ఆరురోజులయినా రాజుగారి సందేహానికి సరైన సమాధానము స్పురించక, ఆలోచిస్తూ, నగరము బయట అశాంతిగా తిరుగుతున్నాడు. అక్కడ రాజగురువును ఓ ఆవులు కాచుకునే కుర్రవాడు చూచి " స్వామీ! మీరు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. కారణం తెలుసుకోవచ్చా?" అని నమస్కారము చేసి మరీ అడిగాడు. ఆ కుర్రవాడు వినయము చూసి ముగ్ధుడయి, ఆ రాజగురువు తన సమస్యకు అతనివల్ల సమాధానము బహుశ: భగవంతుడు పంపించి వుంటాడని తలంచి, తన సమస్యని వివరించాడు. అప్పుడాకుర్రవాడు " స్వామీ! ఈ ప్రశ్నకు సమాధానము నాకు బాగా తెలుసు. రాజుగారిని నన్ను రాజసభకు పిలిపించే ఏర్పాటు చూడండి" అని చెప్పాడు. రాజగురువు ఆ కుర్రవానియందు విశ్వాసముతో రాజుగారిని దర్శించి, "రాజా! మీ ప్రశ్నకు సమాధానము ఆ ఆవులు కాచే కుర్రవాడు చెపుతాడు. మీరు అతనిని సభకు అహ్వానించండి" అని తెలిపాడు. రాజు భటులని పంపి ఆ కుర్రవానిని రాజసభకు అహ్వానించాడు. రాజసభలో ఆ కుర్రవాడు " రాజా! మీ ప్రశ్నకు సమాధానము నేను చెపుతాను. కాని అడిగేవారు మీరు కాబట్టి, మీరు శిష్యుని స్థానంలో వున్నారు. చెప్పేవాడిని నేను కాబట్టి నాది గురుస్థానము. గురువు అగ్రస్థానములో కుర్చోవాలి కదా!" అన్నాడు. రాజు అతని మాటలు గ్రహించి, తన ప్రశ్నకు సమాధానము తెలుసుకోగోరి, తన సింహాసనము మీద అతని అధిష్టింప చేశాడు. రాజసింహాసనము మీద అధిష్టించి ఆ కుర్రవాడు ఇలా చెప్పాడు.
"రాజా! దైవము చేసే ప్రధానమైన పని ఇదే! అహంకారులను క్రింద కూర్చోపెట్టడము, అణకువతో ఉండేవారిని ఉన్నతస్థానములకు చేర్చటము." అని చెప్పి తనదారిని తాను వెళ్ళిపోయాడు
 



1 comment: