Wednesday 17 January 2024

 



101."పాపపుణ్యాలు సుఖదుఃఖాలుగా ఎలా పరిణమిస్తున్నాయి !?"


మనం చేసిన మంచిచెడులే మనకు సుఖదుఃఖాలుగా వస్తాయి. ఈ సత్యాన్ని గుర్తిస్తే మంచి చేయటం, చెడును మానటం అనేవి ఎవరూ చెప్పకుండానే ఆచరిస్తాం. బాణాసురుడు అనే రాక్షసుడు తపస్సుచేసి పుణ్యం సంపాదించాడు. ఆ పుణ్యఫలంతో శివుడినే తన ఇంటికి కాపలాగా ఉంచుకున్నాడు. కానీ బాణాసురుడు చేసిన పాపం కృష్ణుడి రూపంలో అతన్ని వధించడానికి వచ్చింది. ఒకే పరమాత్మ పుణ్యఫలంగా రక్షణకోసం కాపలా ఉంటే, పాపఫలంగా శిక్షించడానికి కూడా వచ్చాడు. పుణ్యఫలం తరిగిపోగానే శివుడు అదృశ్యమయ్యాడు. పాపఫలం అతన్ని సంహరించేలా చేసింది. ధర్మజీవనంలో మనిషికి పాపస్పర్శ ఉండదు. కనుక ఎప్పుడూ దైవానుకూలతే ఉంటుంది. దాన్నే 'ధర్మోరక్షతిరక్షితః' అనే సూత్రంగా చెప్పారు !

***

102.."దుఃఖాలను దూరంచేసే శాంతిమంత్రం 'నేనెవరు' అనే ప్రశ్నగా చెప్పిన భగవాన్ శ్రీరమణమహర్షి బోధను ఎలా అర్థం చేసుకోవాలి !?"

సత్ప్రవర్తనతో మంచి వ్యక్తిత్వాన్ని, మంచి వ్యక్తిత్వంతో నిరహంకార స్థితిని, నిరహంకారంతో శాంతిని, శాంతిద్వారా ఆత్మస్థితిని తెలుసుకోటానికి భగవాన్ చూపించిన సులభోపాయమే "నేనెవరు?" అన్న ప్రశ్న. అందుకే అది మనకు ప్రశ్నకాదు. దుఃఖాలను దూరంచేసే శాంతిమంత్రం. ఏమతంలోనైనా, మార్గంలోనైనా నైతికత లేకుండా దైవాన్ని చేరిన ఉదాహరణగాని, దుఃఖాన్ని దూరంచేసుకునే అవకాశం గాని లేదు. ఇపుడున్న మనోబుద్ధులతో దైవం కనిపించటం అనటంలో అంతర్యం ఏమిటంటే నేను సాధన చేస్తున్నాను అన్న కర్తృత్వభావంతో చేసినంతకాలం దైవం తెలియదు. ఈ సృష్టిలో తన ప్రమేయంలేదనే నిరహంకారస్థితి వల్ల కలిగే శాంతివల్ల దైవం తెలుస్తుంది. తన ప్రమేయం లేదని తెలిపే శాంతిగుణమే అప్రమేయమైన దైవాన్ని సాక్షాత్కరించేలా చేస్తుంది. మనం నైతికతతో శాంతిని సాధిస్తే, శాంతి దైవాన్ని మన హృదయంలోకి తెస్తుంది. అది నిద్ర ఆవహించిన సహజంగా మన ప్రమేయం లేకుండా ఉంటుంది. అత్యాశతో పది చాక్లెట్లు కావాలని మారాంచేసే చిన్న పిల్లవాడికి మంచి మాటలు బోధించేది వాడి ప్రవర్తనలో మార్పుకోసమే. అది వాడికి అర్థమై పద్ధతి మార్చుకుంటే వాడు శాంతిగా ఉంటాడు, ఎదుటివారిని శాంతిగా ఉంచుతాడు. ప్రతి విషయంలో మన నైతిక ప్రవర్తన కూడా మనని, ఎదుటి వారిని శాంతిగా ఉంచుతుంది !

***

103.."నిద్రలో ఏ బాధలు ఉండటం లేదు కదా అలా మెలకువలో ఉండటం ఎందుకు సాధ్యం కావట్లేదు !?"

మనని తీవ్రంగా బాధించే శారీరక వ్యాధులు, మానసిక వేదనలు, చుట్టూ ఉన్న సామాజిక సమస్యలు, కుటుంబ కలతలు అన్నీ నిద్రలో మటుమాయం అవుతున్నాయి. నిజానికి అవి పోవటం లేదు. మనకు తెలియకుండా పోతున్నాయి అంతే ! తెలియకుండా పోవటం అంటే అనిపించకుండా ఉండటమే. ఇలా అనిపించకుండా ఉండే స్థితిని సంపాదిస్తే జీవనం కూడా నిద్రలాగా హాయిగా గడిచిపోతుంది. నిద్రాలాగా అంటే జీవనం లేకుండా కాదు. ఎవరో మనని అవమానించారు. ఆ విషయం మనకి అనిపించకపోతే అది నిద్రే !

***

104.."అనుకోవటాలు, భావాలు లేకుండా జీవనం కొనసాగలేదుకదా !?"

నేను అబ్బాయిని-అమ్మాయిని, నేను ఉద్యోగిని-నిరుద్యోగిని, నేను భక్తుడిని-నాస్తికుడిని ఇలా అనుకునేవాన్నీ భావాలే. అనుకోకపోతే జీవనం ఎట్లా అనేది సంశయం. పసివయసులో పిల్లలకు తాము ఆడ, మగ అనే భావం ఉండదు. అయినా వాడికి జీవనం ఉంటుంది. మల్లె చెట్టు వద్దకు వెళ్ళి ఇది మల్లెపూల చెట్టు అనుకుంటేనే అది గుబాళిస్తుందా ? అలా అనుకోకపోతే మనకు ఆ పరిమళం అందకుండా ఉంటుందా ! సినిమా చూస్తున్నంతసేపు మనసు అనేక ఆలోచనలతో సాగుతుంది కానీ దానికి భావం ఉండదు. ఒక్క సినిమా విషయంలోనే కాదు ఏ అనుభవంలోనైనా అనుభవ సమయంలో భావం ఉండదు. భావం వచ్చిన తర్వాత అనుభవం ఉండదు. శాంతి మన శాశ్వతమైన ఆస్థి. కానీ మనలో ఏర్పడుతున్న భావాలే దానిని భంగపరుస్తున్నాయి !

***

105.."అసంకల్పితంగా వచ్చే భావాలను సంకల్పంతో అడ్డుకునే వీలు ఉన్నదా ? అలాచేసి శాంతిని పొందవచ్చా !?"

నిద్రలో మనకు ఏ భావాలు ఉండవు. మెలకువ రాగానే భావాలు వస్తున్నాయి. భావం రాగానే అది సంతోష, దుఃఖాలుగా, కష్టసుఖాలుగా పరిణమిస్తున్నాయి. ఆ ద్వంద్వములేని స్థితే శాంతి. భావంలేని స్థితిలో మనసు శాంతిగా ఉంటుంది. వివేకవంతులు ఎవరైనా ఎక్కువ కాలం కొనసాగేదాన్నే కోరుకుంటారు. మనం ప్రపంచంలోని ఏ వస్తువు, విషయంలనుండైనా సంతోషం, సుఖం కోరుకుంటాం. కానీ ఏ సుఖసంతోషాలు శాశ్వతంగా నిలిచి ఉండవు. భావాలు మనలోని కోరికలవల్ల ఏర్పడుతున్నాయి. వస్తువులను అనుభవించటం కోరికకాదు. సుఖసంతోషాల కోసం ఆరాటపడటం కోరిక. ఆ కోరికే పరిణమించి భావాలకు కారణం అవుతుంది. దీన్ని అర్థం చేసుకుంటే శాంతి సులభం అవుతుంది !

***

106.."కోరికలు నశింపజేసుకునే ఉపాయం, సాధన ఏమిటి !?"

ప్రపంచంలో అందుబాటులో ఉన్నది అనుభవిస్తూ, దానిపై ఆధారపడని స్థితిని సంపాదిస్తే కోరికలు నశిస్తాయి. కోరికలు లేని మనసు భావాతీత స్థితిలో సుఖదుఃఖాలను సమంగా స్వీకరిస్తూ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అదే మనం చేయాల్సిన సాధన, సాధించాల్సిన స్థితి. ప్రపంచంపై ఆధారపడటానికి కారణం మనకు దాని స్వరూపం తెలియకపోవటమే. యాపిల్ పండులో దాని తీయదనంతో పాటు నశించిపోయే గుణం కూడా ఉంది. అదే దాని స్వరూపం. అది అర్థమైతే తీయదనంతో సంతోషిస్తాం గానీ అది శాశ్వతంగా ఉంచుకోవడం కుదరదని అర్థం చేసుకుంటాం. మనం చీకట్లో దేన్నో చూసి భయపడతాం. తీరా అది నీడేనని తెలుసుకున్న తర్వాత ఆ భయం పోతుంది. అలాగే సంతోషదుఃఖాలు, కష్టసుఖాలు కేవలం మన భావంవల్ల ఏర్పడుతున్నాయని తెలిస్తే వాటిని ఆ క్షణానికి అనుభవిస్తాం కానీ పొంగిపోవడం, కృంగిపోవడం చేయం. అదే భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పిన సమస్థితి, స్ధితప్రజ్ఞత యోగం. ఆ స్థితిని పొందినవాడు భగవంతుడితో సమానం. ఆ స్థితిని పొందటానికి మనకు అవరోధంగా ఉన్నది మన భావాలే అనేది గుర్తించాలి !

***

107 ..ప్రశ్న : ప్రయత్నమే అక్కరలేకుండా మనశూన్యతను ప్రచూరమూ, ..అవిరళము చేయగలిగితే అది ఆత్మస్థితి అనవచ్చునా ?"

శ్రీరమణమహర్షి : మనసున్నంతకాలం యత్నముండవలె. అన్ని వేదంతాల్లోనూ ఈ శూన్యస్థితిని గురించిన వివాదం కావాల్సినంత ఉన్నది !

"ప్రశ్న : ఆత్మానుభవదశలో ప్రత్యక్షభావమొకటి ఉందా ? అది అనుభవమేనా, కాక కేవలం ఆత్మస్థితియేనా !?"

శ్రీరమణమహర్షి : ప్రత్యక్షం పరమస్థితి. అది భావనామాత్రం కాదు !


108.." ఎన్నో రకాలుగా వస్తున్న దుఃఖం దూరం కావాలంటే ఏం చేయాలి !?"


దీన్ని తెలుసుకునేందుకు భగవాన్ శ్రీరమణమహర్షి మనకు అవసరమైన మౌలిక గుణమేదో బోధించారు. అందుకు సులువైన మార్గంగా "నేనెవరో" తెలుసుకోమన్నారు. ఒక పక్షి పైకి ఎగరాలంటే రెక్కలు కావాలి. ఒక వ్యక్తి వ్యాపారం చేయాలంటే ధనం కావాలి. ఒక యువకుడు ఉద్యోగం చేయాలంటే చదువు కావాలి. ఇలా ఏది చేయాలన్నా అందుకు ప్రాథమిక అవసరమైన మౌలిక గుణం ఒకటి ఉంటుంది. సమాజంలో అతి కొద్దిమందికి ఆధ్యాత్మికంగా ఏదో సాధించాలనే తపన ఉంటుంది. దైవాన్ని చూడాలని కొందరు, మోక్షాన్ని పొందాలని మరికొందరు, ఆత్మ దర్శనం కోసం ఇంకొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. తాము కోరుకున్నది లభించే వరకు దుఃఖ పడుతూ ఉంటారు. ఇదంతా సాధకులు ఎదుర్కొనే సమస్య. ఇక ఇతర ఆస్తికులైనా, నాస్తికులైనా నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బరువులకు తాము దూరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అది సాధ్యం కాక వీరంతా దుఃఖ పడుతూ ఉంటారు. ఇది ఏ సాధన లేని సామాన్యులు ఎదుర్కొనే సమస్య. మాన్యులైనా, సామాన్యులైనా అందరికీ దుఃఖం ఉంటుంది. దైవ సమానులైన మహానుభావులకు సాధకులు, సామాన్యులు అనే బేధం ఉండదు. అందుకే శ్రీరమణమహర్షి ముందుగా "నేనెవరో" తెలుసుకోమన్నారు !

***

109 .."నారు పోసినవాడు నీరు పోయకపోతాడా అన్నట్లు సృష్టిలో జీవనప్రక్రియ అంతా చైతన్య ఏర్పాటుగానే తలపోయాలేమో !?"


సృష్టిలో ఏది భౌతిక రూపాలు తయారుచేసిందో అదే వాటి జీవనానికి అవసరమైన తెలివిని కూడా తయారు చేసింది. ఆ రెండిటి మిశ్రమమే చైతన్యం ఏర్పాటు చేసే సృష్టికార్యం. ఒక విద్యార్థి మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ చదవాలంటే ఆయా శాస్త్రాల్లో చిన్ననాటి నుండే ఆసక్తి, నైపుణ్యం ఉండాలి. తదనుగుణంగా తలిదండ్రులు తగిన తోడ్పాటునందించి, ప్రతిభను గమనించి మురిసిపోతారు. విద్యార్థిలోని సామర్ధ్యం అతనిలో సహజంగా ఏర్పడివున్న తెలివికి సానపడితే వచ్చిందా ? లేక కేవలం తన కృషితో మాత్రమే వచ్చిందా ? ఎవరైనా రాయిని శిల్పంగా చెక్కగలరు గానీ మట్టి ముద్దను చెక్కలేరు. శిల్పాన్ని మలిచిన శిల్పిలోనూ, ఆ శిల్పానికి అవసరమైన కాఠిన్యాన్ని మాత్రమే కలిగివున్న రాయిలోనూ, ఆ చైతన్యమే తగిన నైపుణ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. కోడి, బాతు గ్రుడ్లను ఒకేచోట పొదిగించినా, అవి పిల్లలుగా మారగానే వేటి సహజ ప్రవృత్తిని అవే ప్రదర్శిస్తాయి. బాతు పిల్లలు నీటి గుంటలోకి, కోడి పిల్లలు చెత్తకుప్పలోకి వెళతాయి. అదంతా వాటిలోని చైతన్య ఏర్పాటే !


110 ..మోహం పోతే మనసుకు స్వేచ్ఛ వస్తుంది !!


నిఘంటువులో సర్పం అంటే పాము అని ఉంటుంది. అది చదువుకున్నప్పుడు లేదా విన్నప్పుడు భాషాపరమైన భావం తెలుస్తుంది. అయితే అది నిజంగా పామును చూసినప్పుడు కలిగే అనుభవాన్ని ఇవ్వదు. కానీ ఆధ్యాత్మిక విషయంలో  అలాకాదు. మనం చదవడం లేదా వినటంద్వారా కలిగే జ్ఞానమే విశ్వాసం, పరిపక్వతలచేత అనుభవంగా పరిణమిస్తుంది. ఆధ్యాత్మికతలో అర్థం కావడానికి, అనుభవం రావడానికి పెద్దగా తేడా, దూరం ఉండదు. సత్యం అర్థమయ్యే కొద్దీ వాస్తవికత అర్థం అవుతుంది. ప్రపంచం  వాస్తవికత తెలిసే కొద్దీ దానిపై మోహం పోయి మనసుకు స్వేచ్ఛ వస్తుంది !


111 .. కలవరము 🥀

7, 8.మన బలమున పెద్దవారిని కూడా పేర్కొనుచున్నాను. భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మున్నగు పరాక్రమవంతులు మన పక్షము నలంకరించియున్నారు.

9. యుద్ధమునందు ఆరితేరినవారు, అనేక శాస్త్రములు తెలిసినవారు, లెక్కకు మిక్కిలిగా నాకొరకు మమకారమున జీవితాశను కోల్పోయి యుద్ధమునకు సిద్ధమైనారు.

10. భీష్మునిచే రక్షింపబడుచున్న‌ నాబలము లెక్కకు మిక్కిలియై పర్యవేక్షణకు లొంగకున్నది. పాండవుల బలము పరిమిత సంఖ్యమై హద్దుల్లో నిమిడియున్నది. దానిని భీముడు రక్షించుచున్నాడు.

11. ఎట్లైనను మీరందరు తమతమ స్థానములనుండి భీష్ముని కాపాడుకొనుడు.

12. ఇట్లు పలుకుతున్న దుర్యోధనుని మాటలలో గురువగు ద్రోణుని నెత్తిపొడుచుట, కొంత అధైర్యము గోచరించినవి. ఇట్టి భావములనుండి మరలించి,  దుర్యోధనునకు హర్షము పుట్టించుచు భీష్ముడు సింహనాదముగా తన మహా శంఖమును పూరించెను. అతడు వయస్సుతో నిమిత్తం లేని ప్రతాపవంతుడని ఆ శంఖధ్వని చాటినది.

13. వెంటనే అనేక శంఖములు, భేరులు మున్నగు వాద్యముల ధ్వనులు కురు సైన్యముల నుండి ఏవెలువడి భూనభోంతరాళములు నిండినవి.

14. అదే సమయమునకు నరనారాయణులు తెల్లని గుర్రములు పూన్చిన మహారధమున రంగము నడుమన కనిపించిరి. దివ్యశంఖములను పూరించిరి.

--(())--

112..ఆచార్య సద్భోదన

ఉన్నతము, శాశ్వతమూ, అవినాశమూ అయిన ఒక ఆధ్యాత్మికాదర్శం కోసం మనం గట్టిగా ప్రయత్నించాలి.

కానీ మనం కోరికోరి ఈ మాయా కల్పితమైన మమతానురాగాలను, భౌతికమైన  భోగాలను అంటిపెట్టుకుని, అజ్ఞానపు పంథాను ఎంతో ఇష్టంగా అవలంబిస్తాం. ఈ రోజు కాకపోతే రేపైనా వాటిని విడువక తప్పదు కదా. మనంతట మనంగా పట్టువిడవకపోతే, మన చేతిలోని ఆటబొమ్మ ఏదో ఒకనాటికి బలవంతంగా లాగివేయబడుతుంది. ఇది అమితమైన దుఃఖానికి దారి తీస్తుంది.

ఇలా జరిగిన తర్వాత, భగ్న హృదయులైనప్పుడు మాత్రమే చాలా మంది ఈ జీవితం నేర్పే పాఠాలను నేర్చుకుంటారు.

కానీ ఈ విధంగా నేర్చుకోవడం ఎంతో బాధాకరంగా ఉండడమే కాక, దానికి ఎన్నో జన్మలు పడుతుంది కూడా. అలా చెయ్యడానికి బదులు, ఆధ్యాత్మిక జీవనన్ని బుద్ధిపూర్వకంగా, చక్కగా యోచించి, స్పష్టమైన ఎరుకతో, దృఢమైన సంకల్పశక్తితో, భగవర్పిత ఏకనిష్టతో జీవించాలి.

నిజానికి, ఈ సంకల్పశక్తి ద్వారా మన జీవితాన్ని ఉన్నత శిఖరాలకూ చేర్చవచ్చు లేదా అధోగతులకు దిగజార్చవచ్చు.

అంతా మన చేతుల్లోనే ఉంది. 

***

113..సనత్కుమారుని బోధలు

మనము కళ్ళు మూసుకొని కూర్చుంటే మన మనస్సు స్పందనము లోకి చేరి, లోపల ఒక వెలుగును దర్శనము చేయిస్తూ ఉంటుంది. ఆ వెలుగును దర్శనము చేయడానికే తపన చెందాలి.

మనస్సు అంతర్ముఖమవ్వడము చేత బుద్ధిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుద్ధిలోనికి ప్రవేశించిన వాడే ఆత్మసామ్రాజ్యము పొలిమేరలలోకి వెడతాడు. అటుపైన ఆత్మతత్త్వము అర్ధమైన పిమ్మట, పరమాత్మ తత్త్వమును అనుభూతి చెందుతూ క్రిందివన్నీ వదిలివేస్తాడు.

***

114..ఆచార్య సద్భోదన

మన ఉనికిని మనం విస్మరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేనిచో ప్రాపంచికత్వం మనలో జొరబడి మనల్ని ముంచివేయగలదు. మనపై మన ఆలోచనలు నిమగ్నమైనప్పుడు దృష్టిని అన్యధా మళ్ళించగలగాలి. మనకు దివ్యకృప యొక్క ఆవశ్యకత ఎంతాగానో ఉన్నది. మన ఆదర్శం పట్ల మనకు అంకితభావం ఉండాలి. మనలను మనం అందుచేత సురక్షితంగా ఉంచుకోవాలి. జీవితం ఎత్తుపల్లాలను కూడుకుని ఉంటుంది. అందువలన మనం సదా భగవంతుని రక్షణలో ఉండేలా చూసుకోవాలి. ఆధ్యాత్మిక జీవనం నిస్వార్థత మీద ఆధారపడి ఉన్నది. అది కేవలం సంకుచితపు "నేను" కాకుండా ఉన్నది. ఒక ఆదర్శం పట్ల భక్తి విశ్వాసాలతో మెలగడం వలన మనలో నిస్వార్థత కలుగుతుంది. అంతేకాక అది పవిత్రతను చేకూరుస్తుంది.

"సర్వేజనా స్సుఖినోభవంతు."

***

115.."అంతరంగ జీవనంలో వ్యక్తిత్వం వలన అహంకారం పెరుగుతుంది అంటారేమిటి 🤔!?"


సామాజిక జీవనంలో అందరికీ ఆమోదయోగ్యమైనదాన్ని మంచి వ్యక్తిత్వం అంటారు. జీవనంలో అలా ఒక వ్యక్తిత్వంతో ఉండటం వల్ల గౌరవం పెరుగుతుంది 🤴. కానీ అంతరంగ జీవనంలో [ఆలోచనల్లో ] వ్యక్తిత్వం వలన అహంభావన అధికమై సత్యదృష్టి తగ్గుతుంది 😔. భగవాన్ శ్రీరమణమహర్షి బోధించిన విచారణమార్గం మన అంతరంగ జీవనాన్ని సంస్కరించుకోవటం ద్వారా సత్యదృష్టిని పెంచుకునేందుకు ఉపకరిస్తుంది 😋. మనసు పోకడలను విచారించడం ద్వారా ఆలోచనలో ఉన్నదంతా నేనేనని, నా మనసేనని గుర్తించేలా చేస్తుంది. చివరికి దైవం విషయంలో కూడా మనకు ఈ సూత్రమే వర్తిస్తుంది 😯. మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థించేటప్పుడు ఏం జరుగుతుందో పరిశీలిస్తే మనకు మనసు చేస్తున్న నాటకం అర్థమవుతుంది 👍!

***


No comments:

Post a Comment